Wednesday, August 1, 2018

సొంత ముద్ర- పోతన- ఓ ఉదాహరణ- తెలుగు వెలుగు ప్రచురణ



 'ఏ వలరాజు భార్యను, నుపేంద్రుని కోడల శంభుచేత నా
దేవరఁ గోలుపోయి కడు దీనత నొందుచున్నదానఁ రం
డో వనవీథి నున్న ఖచరోత్తములార! దిగీంద్రులార రం
డో వనవాసులార వినరో మునులార! యనాథవాక్యముల్!'
(నేను మన్మథుడిభార్యను. విష్ణుమూర్తి కోడలును. శివుడి మూలకంగా నా భర్తను పోగొట్టుకొని మిక్కిలి దుఃఖంలో ఉన్నదానిని. అడవుల్లో, ఆకాశంలో ఉండేవాళ్లు, మునులు .. అంతా రండి! ఈ అనాథ మాటలు వినండి!- అని ఈ పద్యానికి అర్థం.
వీరభద్ర విజయము లోని రెండో ఆశ్వాసం 124వ పద్యం)
***

కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికని భర్తను చేర్పించిందో మధ్యతరగతి గృహిణి. ఆ పరీక్షలు ఈ పరీక్షలంటూ లక్షలు మింగి చివరకు చేతులెత్తేసారు ఆ ఐదునక్షత్రాల ఆసుపత్రి దొరలు. మృతదేహాన్ని వరండాలో పడేసి ఒక అరగంటలో స్థలం ఖాళీ చేసెయ్యాలని కూడా హెచ్చరించారు. బతికుంటే బలుసాకైనా తినచ్చన్న గంపెడాశతో వంటి మీది బంగారాన్ని కూడా భర్తవైద్యానికని వెచ్చించిందా పిచ్చితల్లి. ఇల్లూ .. వాకిలీ లేవిప్పుడు. అయిన వాళ్లెవరూ లేరు ఆదుకునేందుకు.  ఎక్కడో ఏదో జరిగింది. ఆసుపత్రి వర్గాలు ఏదో చేసాయి! ఇదీ అని ఇతమిత్థంగా చెప్పలేక పోవచ్చు కానీ.. ఖచ్చితంగా మోసమయితే ఏదో జరిగింది. అంత పెద్ద ఆసుపత్రి నిర్వాహకులని నిలదీయడమెట్లా? ఎదురు తిరిగి నిలబడేందుకైనా ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా ఇలాంటి విషాదఘటనలు జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా! అలాంటి సందర్భాలలో బలహీనులు, దిక్కూ దివాణంలేని అభాగ్యులు ఏ విధంగా స్పందిస్తారో రోజూ మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ముఖపరిచయం లేక పోయినా దారేపోయే దానయ్యలందర్నీ పేరు పేరునా పిల్చి తనకు జరిగిన అన్యాయాన్ని ఏడుస్తూనే ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు బక్కజీవులు. ఆ పనే చేసున్నది ఇక్కడ రతీదేవి కూడా!
ఇంద్రుడు పంపించాడని బండశివయ్య గుండెల్లో బొండుమల్లెల పరిమళాలు పూయించాలని పూలబాణాలతో సహా మహా ఆర్భాటంగా ఊరేగుతూ వచ్చాడు భర్త వలరాజు(ఆహాఁ! ఎంత చల్లని తెలుగు పలుకు). దేవయ్య మీద దాడికని  బైలుదేరే ముందు అక్కడికీ ఒక ధర్మపత్ని బాధ్యతగా ముందొచ్చే ముప్పును గూర్చి హెచ్చరించింది రతీదేవి. అతివిశ్వాసంతో శివయ్య మీద ప్రణయసైన్యాన్ని వెంటేసుకొని మరీ దాడి చేసి చివరకు ఆ ముక్కంటి మూడోకంటి నిప్పురవ్వలకు కాలి బూడిదపోగయ్యాడు! శివయ్య చేసింది అన్యాయం. కానీ ఆయనేమో దేవతలకు దేవుడు. ఎవరయ్యా ధైర్యంగా ఎదురు నిలబడి అడగగలరు? అట్లాగని మనసారా ప్రేమించి పెళ్లాడి కడదాకా జీవితాన్ని పంచుకొందామన్న గంపెడంతాశతో గృహస్థధర్మం స్వీకరించిన స్త్రీమూర్తి చూస్తూ వూరుకుంటుందా? ఏదేమైనా సరే.. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఎదురునిలబడాలనే అందరు ఇల్లాళ్ల మాదిరి రతీదేవి పంతం పట్టింది. అందుకే ఆ దుర్ఘటన జరిగిన వనంలోనే బూడిదకుప్ప ముందు  కూలబడి అక్కడి వనవాసులను, ఆకాశజీవులను, ఆఖరికి ఆ శివయ్యే సర్వస్వమనుకొనే మునిగణాలను కూడా తన మొర ఆలకించమని వేడుకొంటున్నది పరమ దయనీయంగా! మామూలు మానవులకే కాదు దివ్యశక్తులున్నాయని మనం నమ్మే దేవుళ్లు కూడా కష్టసుఖాలు ఎదురైనప్పుడు మనలాగే భావోద్వేగాలకు లొంగిపోతారా? అని ప్రశ్న వేసుకొంటే కొన్ని కొత్త విషయాలు కొన్ని బైటికి వస్తాయి. అవి కావ్యరచనకు సంబంధించిన రహస్యాలు.
బమ్మెర పోతనకూ ఈ దైవికశక్తుల మీద సామాన్య పాఠకులకు  మల్లేనే విపరితమైన విశ్వాసం ఉంది. చాలా సందర్భాలలో ఆ కవే స్వయంగా శ్రీరామచంద్రుడు తన వెనక ఉండి మహాభాగవత రచన చేయించాడని చెప్పుకొన్నాడు. అయినా పోతన ఇక్కడ దివ్యజీవి రతీదేవిని అన్యాయానికి గురైన ఒక సాధారణ అనాథ స్త్రీ మూర్తిగానే ఎందుకు చిత్రించినట్లు? సృజన రహస్యమంతా అక్కడే ఉంది.
కవి కావ్యరచన చేసే సందర్బంలో తన కృతి పదిమంది చదివి తాదాత్మ్యం చెందాలని కోరుకొంటాడు. ఆ విధంగా తన్మయత్వం చెందాలంటే రచనలోని పాత్రలు దేవుళ్లైనా, దానవులైనా మానవుల మాదిరే భావోద్వేగాలు ప్రదర్శించక తప్పదు. అప్పుడే చదివే పాఠకుడు తన స్వభావంతో.. తన పరిసరాల నైజంతో ఆ పాత్రలను 'ఐడెంటిఫై' చేసుకునేది. తన రచన చదివే పాఠకులు ఎవరో ముందే నిశ్చయించుకొనే కవి/ రచయిత ఆ రచనను తన సొంత స్థాయికి కాకుండా పాఠకుడి మేధోస్థాయికి తీసుకువెళతాడు.  కథాకాలం ఏదైనప్పటికీ, కథన కాలానికి పాఠకుల భావోద్వేగస్థాయికి తగినట్లు సాగే రచనే పదికాలాల పాటు కాలానికి ఎదురీది నిలబడేది.
పై పద్య కర్త బమ్మెర పోతన అని ప్రత్యేకంగా చెప్పపనిలేదు. ఆ  అచ్చు తెలుగు పదాల పొహళింపు, ద్రాక్షాపాకరస ధార, చెవులకు ఇంపనిపించే శబ్దాలు పొదిగి  చేసే పదప్రయోగాలు, సందర్భానికి తగ్గట్లు ఛందో వృత్తాల వాడకం.. ఇత్యాదులన్నీ బమ్మెర పోతన 'ముద్ర' ను పట్టిచ్చేస్తాయ్.
రచన చదివినప్పుడే ఫలానా కవిది/రచయితది ఈ కర్తృత్వం అని పాఠకుడు గుర్తు పట్టే విధంగా రచన సాగితే.. అదే ఆ కవి ముద్ర.
ప్రతీ కవి, రచయిత, కళాకారుడు తనదైన  సొంత 'ముద్ర' స్థాపించుకున్నప్పుడే  సాహిత్యంలో అతని పేరు చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉండేది.
కొత్తరచయితలు పాత రచయితల నుంచి నేర్చుకొనే అనేకమైన  సృజన లక్షణాలలో 'ముద్ర' కూడా ఒక  ముఖ్యమైన సుగుణం.
-కర్లపాలెం హనుమంతరావు
(తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో ప్రచురితం)

Monday, July 30, 2018

జానపద కతలలోని అసలు పరమార్థం


వేదకాలంలోనే  మానవ సమాజాన చాతుర్వర్ణ విభజన(నాలుగు కులాలుగా విడిపోవడం) జరిగినట్లు రుగ్వేదం పురుష సూక్తం బట్టి అర్థమవుతోంది.
బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌ బాహూ రాజన్యః కృతః
ఊరూ త న్య యద్వైశ్యః పద్బ్యాం శూద్రో అజాయత
రుగ్వేదం(10-90-12)
బ్రాహ్మణులు భగవంతుడి ముఖం నుంచి జన్మిస్తే భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు జీవం పోసుకొన్నారని.. కడజాతివాళ్ళు మాత్రం దేవుడి కాళ్ల నుంచి పుట్టుకొచ్చారని .. కళ్లతో చూసినట్లే అల్లిన కట్టుకథల ప్రచారం చాలా కట్టుదిట్టంగానే జరిగింది. ఆ తరహా ప్రచారాలకు పూనుకొన్నదీ సర్వోన్నత వర్గమే. దానికి కింది ఇద్దరు ఉన్నతవర్గాల మద్దతు! ఇందులో ఏదో మతలబుందని అప్పట్లో ఆలోచన రాకపోయింది కడజాతులకు. కాలంతో పాటు బుధ్ధి వికసిస్తున్నదిప్పుడు. కాబట్టే బోలెడన్ని అనుమానాలు పెద్దల బుధ్దుల మీద! తప్పేముంది?!
వర్ణవ్యవస్థ నిర్మాణం ఎప్పుడు సామాజికంగా స్థిరపడిందో.. అప్పటి నుంచే ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు.. ఉన్నవారు, లేనివారు- అంటూ  గుంపుల మధ్య గోడలు లేచాయి. వివాదాలూ మొదలయ్యాయి.  వేదాల్లోనే ఇందుకు రుజువులున్నాయి, అంతా కలసి మెలిసి అన్నదమ్ముల్లా సహృద్భావంతో జీవిస్తుంటే 'సంవనీ రుషి' నోటి నుంచి 'సమన్వయంతో జీవించండి!' లాంటి హితోక్తులు వెలువడాల్సిన అగత్యమేముంది? 
'కలసి ఉండండి! కలసి తినండి!  మనసులు కలుపుకొని  మాట్లాడుకోండి! పురాతన దేవతలకు మల్లే  కలసే ఉపాసనలు చేసుకోండి!’అంటూ బ్రహ్మాండ పురాణంలో సూక్తులు వినిపించే అవసరం కలగదు కదా!
వేదపన్నాలు నాగరికంగా, బుధ్దిపరంగా అభివృధ్ధి చెందిన మేధోవర్గాలకు మాత్రమే బుర్రకెక్కే వాఙ్మయం. ఆ దేవనాగరీక భాషాప్రవచనాలు, శిష్టోచ్చారణలు  సబ్బండజాతుల  మతులకు ఓ పట్టాన ఎక్కేవి కావు. అతి తక్కువ శ్రమతో  అపార,మైన ఉమ్మడి సామాజిక సంపదలు సొంతానికి  పోగేసుకు అనుభవించే సౌకర్యం వర్ణవ్యవస్థ ద్వారా ఉన్నత వర్గాలవారికి సంక్రమించింది. చెమటోడ్చి సమాజానికి ఇంత కూడూ గుడ్డా నీడా కల్పించే  నిజమైన  కింది శ్రామిక జీవుల నుంచి ప్రశ్నలు ఎదురైతే ఉత్పాతాలు తప్పవన్న స్పృహ ఉన్నత వర్గాలవారికి ఉంది. సమాజ రథాన్ని తమ శక్తికి మించి ఈడుస్తోన్న కింది వృత్తులవారిని ఎప్పుడూ చెప్పుచేతల్లో పెట్టుకొనేందుకు అందుకే ఒక ఉపాయం అవసరమయింది. ఆ అవసరంలో నుంచి పుట్టుకొచ్చినదే జానపద వాఙ్మయం. జానపదులకు బోధపడే సాహిత్య రూపంలో కట్టుదిట్టంగా కథలు, కబుర్లూ దిట్టంగా పుట్టించి ముమ్మరంగా  ప్రచారంలో పెట్టబట్టే  నిమ్నజాతులు తాము గీచిన గీటుకు కట్టుబడి ఉన్నాయి.
శిష్ట సమాజానికి వేదాలు ఎంత ప్రామాణికమో. పామరులకు ఈ జానపద వాఙ్మయం  అంతే ప్రామాణికం,   శిష్టులకు  పురాణాలకు మల్లే  కులపురాణాలు జానపదులకు శిరోధార్యాలు.
కులాల పుట్టుక, కుల మూలవిరాట్టుల జన్మవృత్తాంతాలు, కులవృత్తుల ఆవిర్భావం, వాటి స్వరూప స్వభావాలు అత్యంత సూక్ష్మంగా, శక్తివంతంగా,  నిజమైనవే అన్నంత పకడ్బందీగా అనేక గ్రామీణ కళా రూపాలలో దిగువ జాతుల వారి మెదడుల్లోకి చొప్పించబడ్డాయి. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ తరహా మందిసాహిత్యంలో కడజాతులవారు పాటించి తీరవలసిన  నియమ నిబంధనలు ఎన్నో ఉంటాయి. సమాజ సౌధ నిర్వహణ భారం మొత్తం తమ  తమ వృత్తిధర్మాల  నిబద్ధత పునాదుల మీదే నిలబడి ఉన్నదన్న భ్రమ    కడజాతులవారి నరనరాలలో కాలక్రమాన జీర్ణించుకుపోయింది. నాటుమనిషి ఎదురు ప్రశ్నలు అడిగినా, ఎదురుగా నిలబడి ఏ మాత్రం పొగరుగా తల ఎగరేసినా సమాజం మొత్తానికి  చేటు తప్పదన్న  భయం పామర లోకంలో యుగాల బట్టి చాలా బలంగా నాటుకుపోయింది.  పెను ఉత్పాతాలు తప్పించవలసిన విధి జానపద సాహిత్యం మాధ్యమంగా ఆ విధంగా   బడుగువర్గాల భుజస్కంధాల మీద మాత్రమే మోపి  తమ తమ భద్రజీవితాలకు ఎప్పటికీ ముప్పు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొన్నాయి చాతుర్వర్ణ వ్యవస్థలోని పై రెండు మూడు అంచెలు! అర్థం పర్థం లేనివి జానపదులు చెప్పుకొనే కథలు అనుకోవడం తప్పు. లోతుగా ఆలోచిస్తే అసలు పరమార్థం బైటపడుతుంది,
-కర్లపాలెం హనుమంతరావు
29 -07 -2018

Saturday, June 23, 2018

నన్నయగారి ననీన భాషావాదం



మహాభారతం కవిత్రయంలో నన్నయ మొదటివాడు. ఆయనకు 'వాగనుశాసనుడు' అని బిరుదు. 'వాక్' అంటే మాట. మాటను శాసించేవాడు వాగనుశాసనుడు. అంతలా నన్నయ భాషను ఏం శాసించాడు? ‘వాగనుశాసనుడు’ అన్న బిరుదుకు  ఆయన అసలు అర్హుడేనా? ఔను, కాదు.. అని ఏ నిర్ణయానికైనా వచ్చే ముందు ఈ చిన్ని వివరణ ఒకసారి చూస్తే మంచిది.
నన్నయకాలం క్రీ.శ 11వ శతాబ్దం. ఆ కాలం నాటికి తెలుగు మరీ అంత ముదరలేదు. పలుకుబడులన్నీ దేశీఛందస్సులోవే. అంటే జనం మాట్లాడుకునే భాషా యాసా కు సంబంధించినవన్న  మాట. ఆ యాసభాషల్లోనే  రాజులూ శాసనాలు వేయించేవాళ్లు.

నన్నయను పోషించిన చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుడికి ఈ దేశీయ పలుకుబడుల మీద  బాగా మోజు.  'మును మార్గకవిత లోకంబున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం/ గు నిలిపి రంధ్ర విషయమున జన చాళుక్యరాజు మొదలగు పల్వుర్' అని నన్నెచోడుడు తన కుమారసంభవం అవతారికలో ఆ  చాళుక్య ప్రభువుకు ధృవపత్రం కూడా ఇచ్చివున్నాడు.
రాజుగారికి జనంభాష పైన ఎంత ప్రేమున్నా అప్పటి వరకు తెలుగులో ఒక్క స్వతంత్రమైన, సవ్యమైన కావ్యం రాలేదన్న బెంగా ఉండేది. అప్పటి దాకా ఉన్నవన్నీ సంస్కృతానువాదాలే. కనీసం తన హయాములోనైనా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టించాలన్న ఉద్దేశంతో నన్నయని వ్యాస విరచిత సంసృత మహాభారతం తెలుగు చేయమని పురమాయించాడు. నన్నయనే ఎంచుకోవడానికి కారణం.. ఆ కవిగారికి సంస్కృతాంధ్రాల మీద ఉన్న అమోఘమైన పట్టు.
కానీ అప్పటికి ప్రచారంలో ఉన్న తెలుగు  పదజాలంతో కావ్యం రాయడం కుదరదు. అందునా రాసే కావ్యానికి పంచమవేదం మాతృక! అసలే సంస్కృత భాష అత్యంత గహ్యమైనది. ఆ భాషకు సరిపడా తెలుగు పదజాలం జనం నుంచి సేకరించడం నిజంగా పెద్ద సవాలే! అందునా ఇప్పటి మాదిరి సాంకేతిక సాధనాలేమన్నా అప్పట్లో అందుబాటులో ఉన్నాయా? అదనంగా అప్పటికి ఇంకా తెలుగులో వాక్యనిర్మాణమే పటిష్టంగా లేని స్థితి. తనకోసం గాను తాను ఒక వాక్యనిర్మాణ క్రమం.. అదీ తానే అంతకు ముందు నిబద్ధీకరించిన వ్యాకరణ  సూత్రాలకు లోబడి ఉండడం అవసరం.  ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటో సమర్థవంతంగా రచన ఆరంబించాడు నన్నయ!
వాక్యానికే కాదు అసలు అప్పటి తెలుగు పదానికి కూడా ఒక ప్రామాణిక  రూపం లేదు. ఒకే పదాన్ని ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు, ఎవరి ఇష్టం వచ్చిన రూపంలో వాళ్లు రాసేసుకునేవాళ్ళు. ఆ తరహా భాషే రాజులు వేయించిన శాసనాల మీద  కనిపించేది. ఇలాంటి పదాలు కొన్ని ఆచార్య గంటి సోమయాజిగారి 'ఆంధ్రభాషా చరిత్రము'లో, ఆచార్య ఖండవల్లి  నిరంజనంగారి  'ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము'లో కనిపిస్తాయి.
'దేవుడు' అనే పదానికి దేవడు అని ఒకళ్ళు, దేవండు అని ఒకళ్లు, దేవణ్డు అని ఒకళ్లు రాసేవాళ్లు. 'తూర్పు' అనే పదాన్ని 'తూఱ్పు' అని, 'తూఱ్గు' అని, 'తూఱ్వు' అనే రూపాలుగా రాయడం ఉంది. రెడ్ది కి ‘రట్టగుడి’, ఎనిమిది కి ‘ఎణం బొది’.. ఇట్లా ఒక స్థిరమైన రూపం అంటూ లేకుండా సాగే  పదాలకు  ఒక కుదురైన ఆకారం కల్పించడం నిజంగా పెద్ద సవాలే కదా! హ్రస్వాలుండే చోట దీర్ఘాలు, సాధురేఫాలు రాయాల్సినప్పుడు శకటరేఫాలు వాడేవాళ్లు. బిందువుకు బదులు వర్ణమాలలోని వర్గం చివరి అక్షరాలు ఙ్, ణ్ లాంటివి యధేఛ్చగా వాడేస్తూ గందరగోళం చేసిన తెలుగు మాటలకు ఒక స్థిరమైన రూపం కల్పించడం  మాటలా? ఆ సమస్యా అధిగమించాడు నన్నయ.
అప్పటికి తెలుగులో కొద్ది దేశీయ వృత్తాలు, అదనంగా చంపకమాల. ఉత్పలమాల మాత్రమే వాడుకలో ఉండేవి. అవసరానికి అనుగుణంగా వృత్తాల సంఖ్యను పెంచుకుంటూ అత్యంత గాఢమైన, గూఢమైన వ్యాసభారతం ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలో కొంత భాగం అపూర్వంగా పూర్తిచేసి మరీ రాజరాజనరేంద్రుడి చేత ‘శహ్ భాష్’ అనిపించుకొన్నాడు నన్నయ భట్టారకుడు. 'వాగనుశాసనుడు' అని ప్రశంసలు అందుకున్నాడు.
ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా అప్పటికి తెలుగులో ఇంకా చిక్కబడని కవితా ప్రక్రియకు అప్పటికే సంపూర్ణ వికాసం పొందిన కన్నడ కవితా స్వరూపాన్ని అద్దడం అద్భుతమైన విన్యాసం. అందుకే తోటి కవులు నోటితో సైతం ‘ఔను.. నన్నయ నిజంగా వాగనుశాసనుడే’ అని మెప్పించుకొన్నాడు ఆ మహాభరత ఆరంభ రచయిత.
ఆనాటికి ఉన్న పూర్వ భాషాప్రమాణాల ప్రకారం నన్నయ మహాభారతం మొదటి రెండున్నర పర్వాలలో  పోయిన భాషాపోకడలు అత్యంత నవీనం.. అపూర్వం. ఆ రకంగా చూసినా నన్నయ భట్టారకుడు వట్టి వాగనుశాసనుడే కాదు.. గట్టి నవీనభాషావాది కూడా!
-కర్లపాలెం హనుమంతరావు
24 -06 -2018



Thursday, June 21, 2018

సినిమా మాటలంటే 'మాటలు కాదు'!- సరదా వ్యాసం




'సావధానం బలదేవా.. సావధానం! ఇదిగో నా పాచికల మీద ఒట్టుపెట్టుకుని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. ఆలకించండి! మోసం చేసి కపట ద్యూతం చేసి పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్లు వనవాసానికి వెళ్లారు. అ దుర్వార్త విని నువ్వు మమ్ములను దండించడానికి వచ్చావు. నువ్వొక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానికి, అతిముఖస్తుతికి లోబడతావని నాకు తెలుసు. మా జాతివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసాననంతరం మళ్లీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముని సహాయం లేకుండా చేయడానికి. కానీ.. యతోధర్మ స్తతోజయః అన్నట్లు మాకు తగిన శాస్తే జరిగింది'
సినిమా ఇంకో పావుగంటలో అయిపోతుందనంగా శకుని వేషంలో సియస్ఆర్ పలికిన ఈ నిమిషం డైలాగు మాయాబజారు సినిమా మొత్తానికీ పెద్ద డైలాగ్. తెలుగులో సియస్ఆర్ సింగిల్ టేక్ లో ఓకే చేయిస్తే.. తమిళంలో నంబియార్ నాలుగైదు టేకులు తిని బావురుమన్నాడని.. గుమ్మడి వెంకటేశ్వర్రావుగారు తన 'తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు'లో రాసుకున్నారు. ఒక నిమిషం డైలాగులో సినిమా కథ సారాన్నంతా సరళమైన భాషలో పామరుడికి కూడా అర్థమయే పద్ధతిలో ఇలా రాయడానికి ఎంతో పాండిత్యంతో పాటు సినిమా ప్రక్రియ మీద అంతులేని అవగాహన ఉండితీరాలి. అవి పింగళివారికి పుష్కలంగా ఉన్నాయి. కనుకనే మాయాబజార్ సంభాషణా శైలికి అత్యుత్తమ  మైన తార్కాణంగా ఈనాటికి ఫిలిం స్కూళ్ళ నుండి సినిమా సభల వేదికల మీద వరకు అన్నింటా ఉధహరించుకుంటున్నాం మనం.
సినిమా సంభాషణ అంటే క్లుప్తంగా, సరళంగా, సహజంగా, పాత్రోచితంగా, స్పష్టంగా భావం పలికేలా, జీవం ఉట్టిపడేలా, జనంభాషలో అందంగా, కథాప్రయోజనానికి దోహదపదే విధంగా ఉండాలని సినీపండితుల నిశ్చితాభిప్రాయం.
పాత్రలకు బదులు రచయితలు మాట్లాడడం పాతపద్ధతి. అంటే అన్ని పాత్రలూ ఒకే మూసలో పలికే మొనోటోనీ విధానమన్న మాట.
ఫిలిం ప్రక్రియ ఖరీదైన వ్యవహారం. కనుక వృధా సంభాషణలకు ప్రోత్సాహముండదు. టీవీ ధారావాహికాలకి ఈ సాగతీత ఉంటుంది! అక్కడ 'డై'లాగ్ అంటే చచ్చిందాకా సాగదీయడమనే అర్థం సరిపోతుందేమో కానీ.. సినిమాలో ప్రతీ సెకనూ ఖరీదైన వ్యవహారమే. కాబట్టి అవసరమైనంత మేరకే పాత్ర పెదాలు కదిలించాలి. అదీ సినీ సంభాషణలకు సంబంధించినంత వరకు ప్రథమ ప్రధాన సూత్రం.
పాత సినిమాలలో పాత్రలు పూర్తిగా పుస్తకాల భాష మాట్లాడేవి. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక సందేశమో, పోలికో తెచ్చి చప్పట్లు కొట్టించుకొనేవి. రంగస్థలం వాసనలు పూర్తిగా తొలగిపోని తొలినాటి దశ అది. ఇప్పుడు సినిమాలకు సంభాషణలు రాసేవాళ్లకు నాటకాలతో ప్రత్యక్షంగా అనుబంధం లేదు. నేరుగా జీవితాలనుంచి సినిమాలలోకి దిగబడిన సరుకే ఎక్కువ.  సినీ సంభాషణలు పక్కింట్లో  నుంచి వినిపించే తరహాలో ఉండటానికి అదే కారణం. ఇది మంచి మార్పే! కానీ.. కత్తెర వేసేవాళ్ల చెవుల్లో డబ్బు చెట్లు మొలవడం వల్ల  పదిమంది ముందు వినడానికి ఇబ్బంది కలిగించే పదాలు కూడా విచ్చలవిడిగా వెండితెర మీద వినిస్తున్నాయి! కథానాయకులు సైతం ప్రతినాయకులను మించి బూతు పురాణాలు విప్పడం పసిపిల్లల మీదా, మాస్ మనస్తత్వం ఉన్నవాళ్ల మీదా విపరీతమైన చెడుప్రభావం చూపిస్తోంది.
పాత సినిమాలలో పాత్రలు సందర్భోచితంగా చక్కని తెలుగు  నుడికారంతో  మాట్లాడేవి. సంభాషణలు రాసేవాళ్లు సంస్కృతాంధ్రాలలో ఉద్దండులైనా, సినిమా ప్రక్రియ ప్రధానంగా పామరజనరంజకం అనే  భావన ఉంది కనుక సరళమైన, సజీవమైన భాషను ఎన్నుకొనేవాళ్లు. పౌరాణిక చిత్రమైనా మాయబజారులోని పాత్రలు నేలబారు ప్రేక్షకులకు అర్థమయే పదాలనే వాడాయి. ‘మోడర్నిజం’ మిషతో ఇప్పుడు వచ్చిపోయే మెజారిటీ చిత్రాలు కనీసం టైటిళ్లలో అయినా తెలుగుదనం ఉండకూడదని ఒట్టు పెట్టుకున్నట్లున్నాయి! వీలైనన్ని సన్నివేశాల్లో బట్లరింగ్లీష్ దంచేస్తున్నారు. రాసేవాడికీ, రాయించుకొనేవాడికీ కనీసం ఇంటర్మీడియేట్ స్థాయి ఇంగితమైనా లేని కారణంగా సినిమాల ద్వారా వీళ్లు వినిపిస్తున్న బూతుపదాలే జనసామాన్యంలో ఊతపదాలుగా స్థిరపడుతున్నాయి!
సినిమా ప్రధానంగా దృశ్యమాధ్యమంగా వినోదపరిచే కళ. దృశ్యపరంగా చెప్పలేని సందర్భాలప్పుడే మాటల ద్వారా భావప్రకటన జరగాలన్నది  మూలసూత్రం. 'మాతృదేవోభవ' చిత్రంలోని ఒక సన్నివేశం ఇప్పటికీ కళ్లముందు కనిపించి కంటతడి పెట్టిస్తుంటుంది. భర్త తాగుబోతు. భార్యకు కేన్సర్. పిల్లలు అనాధలైపోతారని ఆ తల్లి దిగులు. ఒక్కొక్కరినే దత్తత కిచ్చేస్తుంటుంది. కవల పిల్లల్లో ఒకడు దివ్యాంగుడు. ముందు వాడినే దత్తు తీసుకుందామని వచ్చిన డబ్బున్న దంపతుల ఆలోచన. కానీ వాడికి తోబుట్టువులను విడిచి వెళ్ళాలని ఉండదు. అయినా వెళ్లకుండా ఉండలేని పరిస్థితి.  చివరికి  దివ్యాంగుడికి బదులు మంచి బిడ్డను దత్తు తీసుకొని దంపతులు వెళ్ళిపోతున్నప్పుడు 'అవిటి కాలుతో పుట్టడమే నా అదృష్టం' అంటూ ఆ దివ్యాంగుడు సంబరపడుతుంటే ఆ సంభాషణ రాసిన రచయిత సత్యమూర్తికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించ బుధ్దేస్తుంది.
కామెడీ ఎన్టర్టైన్మెంట్ వంకతో ఇప్పుడొచ్చే సినిమాల్లో మూడొంతుల భాగాన్ని కథతో ఏమాత్రం సంబంధం లేని కుళ్ళు స్కిట్లతో నింపేస్తున్నారు. కాబట్టే జాతీయస్థాయిలో తెలుగు సినిమా రూపాయి విలువలా రోజు రోజుకూ దిగజారుతోంది.
మాయాబజారులో మాయాశశిరేఖ పెళ్లిసందడి సన్నివేశం  గుర్తుందా?  వధువు రూపంలో ఉన్న ఘటోత్కచుడు వరుడి పాదం మహారాక్షసంగా తొక్కేస్తాడు. లక్ష్మణకుమారుడు గగ్గోలు పెట్టేస్తుంటే శశిరేఖ నంగనాచిలా 'ఆర్యపుత్రులు నా కాలు తొక్కచ్చునేం?' అంటూ ఒక్క వాక్యంతో వగలాడితనమంతా ప్రదర్శిస్తుంది.   ఆ ఘట్టంలో రచయిత వాడిన ఆ చిన్న వాక్యంలోనే సావిత్రి ఎన్నో రకాల హావభావాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. చలనచిత్రం ప్రధానంగా పాత్రల హావభావాల ద్వారా నడిచే దృశ్యమాలికేగా!
సన్నివేశం పండేందుకు చాంతాడంత  సంభాషణలు దండగ. డైలాగ్ ఎంత చిన్నదైతే ప్రేక్షకుడి మెదడు అంత పదునుగా పనిచేస్తుంది. నాటి మిస్సమ్మ నుంచి నేటి 'అతడు' వరకు విజయవంతమైన చిత్రాలన్నింటిలో పదునైన స్వల్ప సంభాషణలే  ప్రధానపాత్ర పోషించాయి. సినిమా సంభాషణలు రాసే రచయితలు సూక్ష్మంగా గ్రహించాల్సింది  ఏ సన్నివేశానికి  ఏ మోతాదులో పాత్రల నోట సందర్భోచితమైన డైలాగులు సాధ్యమైనంత సంక్షిప్తంగా పలికించాలన్నది.
మాయాబజారు చిత్రం ఈనాటికీ మూవీ రచయితలకు మంచి గైడ్. సమర్థత  ఉంటే తల్పాలకు బదులు గిల్పాలు, కంబళ్లకు బదులు గింబళ్ళు కూడా సృష్టించేయచ్చు. ఆ చిత్రంలోనే పింగళివారు అన్నట్లు 'ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది?'
దుషట చతుషటయం, అసమదీయులు, తసమదీయులు వంటి సందర్భోచితమైన పదాలు ఎప్పుడు ప్రయోగించాలో వర్ధమాన రచయితలు ముందు అధ్యయనం చేయాలి.  'బోర్' అనే ఆంగ్లపదానికి 'సుత్తి' ని తిరుగులేని ప్రత్యామ్నాయంగా మార్చేసిన జంధ్యాల సామర్థ్యం ఒక్క రోజుల్లో అలవడే రసవిద్య కాదు. పట్టుదలగా పదాల మీద పట్టు సాధించాలి. ఒక తరంలో ముళ్లపూడి ప్రదర్శించిన విలక్షణ పూలశైలి, అనంతరం జంధ్యాల ప్రవేశపెట్టిన గిలిగింతల స్టైల్, సమాంతరంగా పరుచూరి సోదరులు  కదను తొక్కించిన జవనాశ్వపు వరవడి, నవరసాలను సైతం ఒకే లైనులో ప్రకటించే త్రివిక్రమ్ మాటల మంత్రం.. అబ్బో.. అలా.. చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి వాలం సైతం చిన్నదనిపించే జాబితా మన ఒకనాటి తెలుగు సినీ సంభాషణా రచయితలది. 'సినిమాకి మాటలు రాయడమంటే మాటలు కాదు'  అన్న మాట ముందు ప్రవర్థనమాన సినీరచయితలు మనసులో పెట్టుకుంటే చాలు.. శ్రధ్ద దానంతటే పుట్టుకొచ్చేస్తుంది.
పామర జనానికి ఈనాటికీ సినిమాలే పరమ ప్రామాణికం. శారదమ్మ తన మీద ప్రసరించిన అక్షర కటాక్షాన్ని ప్రజాహితానికి మాత్రమే వినియోగించడం ప్రతీ సినీరచయిత సామాజిక బాధ్యత. సినిమాకు వినోదం ప్రధానమే.. కానీ మనోవికాసాన్నీ అది తోడుతెచ్చుకోవాలి.   
-కర్లపాలెం హనుమంతరావు
20 -06 -2018
(ఆంధ్రభూమి దినపత్రిక -09, జూలై, 2009, వెన్నెల పుటలో ప్రచురితం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...