Showing posts with label Life. Show all posts
Showing posts with label Life. Show all posts

Saturday, April 24, 2021

గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్లు -కర్లపాలెం హనుమంతరావు

 


భావికాలజ్ఞానాన్ని ఇంగ్లీషులో చెబితే వీజీగా అర్థమవుతుందనుకుంటే ‘విజన్’  అనుకోండి.. సర్దుకుపోవచ్చు. ఇదివరకు  జరిగిన సంగతులను ఇప్పటికీ గుర్తుంచుకుని  వాటి అనుభవాలు పాఠాలుగా భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు ఇప్పటి నడత మార్చుకునే పద్ధతి. బుద్ధిమంతులు చేసే దిద్దుబాటు చర్య.

టు ఎర్ ఈజ్ హ్యూమన్– అన్నారు కదా అని పద్దాకా తప్పులు జరిగినా ఇబ్బందే. సరిదిద్ద రాని పొరపాట్లు జరిగితే చరిత్ర  చెడుగా గుర్తుంచుకుంటుంది. కాలానికి ఎవరి మీదా ప్రత్యేకంగా  గౌరవం ఉండదు.

 

జరగబోయే ఘటనల గురించి అందరికీ ఒకే తీరున సంకేతాలందడం రివాజు. అర్థమయిన బుద్ధిజీవులు పద్ధతి మార్చుకుని కాలం మీద తమ ముద్ర వేస్తారు. అర్థంకాని బుద్ధిహీనులు అట్లాగే అనామకంగా కాలగర్భంలో కలిసిపోతారు. 

 

భావికాల జ్ఞానలేమి కలిగించే నష్టం ఏ రేంజిలో ఉంటుందో చెప్పేందుకు  అడాల్ఫ్ హిట్లర్ చరిత్ర ఓ పాఠం. తమను తాము స్థాయి మించి  ప్రేమించుకునే ఆ నియంత వంటి వాళ్లకు హితవు చెప్పేవాళ్ళు ఎంత సన్నిహితులైనా సరే  శత్రువులయిపోతారు. గిట్టనివాళ్ల మీద కక్షతో కొంతమంది దుష్ప్రర్తనకు తెగబడితే, సంభవం కాని లక్ష్యాలు పెట్టుకుని సమకాలీన పరిణామాల పట్ల శ్రద్ధ పెట్టనితనం వల్ల మరికొంత మంది అల్లరిపాలవుతారు.   ఈ రెండు రకాల పాలకులనూ మనం సమకాలీన వ్యవస్థలోనే గమనించవచ్చు.

 

హిట్లరు మనసులో నిరంతరం ఒకటే ఊహ తిరుగుతుండేది.  ప్రపంచం ఓ ముద్దయితే.. అది తన అంగిట్లో మాత్రమే పడవలసిన ఖాద్యపదార్థమని. అతగాడి భావిజ్ఞాన  లేమి ప్రపంచానికి తెచ్చిపెట్టిన మొదటి ప్రపంచ యుద్ధ వినాశనం అందరికీ తెసిసిందే. అసంభవమైన ఆ లక్ష్యం సాధించే ప్రక్రియలో సమకాలీన సమాజం ప్రదర్శించే  పరిణామాల పట్ల  అలక్ష్యమే హిట్లర్ సర్వనాశనానికి ప్రధాన కారణం. మనిషి నైజంలోని ఈ తరహా కనిపించని గుడ్డితనం (inattentional blindness)  కొత్త శతాబ్దం మొదటి ఏడాదిలో ఒకానొక అమెరికన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచానికి ప్రదర్శించి చూపించారు. 

 

ఓ బాస్కెట్ బాల్ మ్యాచ్ ను  తెరపై చూపిస్తూ బంతి ఎన్ని సార్లు చేతులు మారిందో కచ్చితమైన లెక్క చెప్పాలని విద్యార్థులకు పోటీ పెట్టి,  ఆట మధ్యలో అప్పుడప్పుడూ ఓ గొరిల్లా  కన్రెప్పపాటు సమయంలో  గుండెలు బాదుకునే దృశ్యం కూడా ప్రదర్శించారు. బంతి చేతులు మారడం మీద మాత్రమే ధ్యాస పెట్టిన చాలా మంది  విద్యార్థులకు గొరిల్లా గుండెలు బాదుకునే దృశ్యమే దృష్టిపథంలోకి రాలేదు. 

 

వాస్తవ ప్రపంచంలో ఈ తరహా పొరపాటు చేసినందు వల్లనే మోటరోలా సెల్ ఫోన్స్ కంపెనీ ఖాతాదారుల మార్కెట్ ని చేజేతులా నోకియాకు  జారవిడుచుకుంది.  ధ్యాసంతా అప్పటికి ఉన్న ఖాతాదారులను సంతృప్తి పరచడం మీద మాత్రమే  లగ్నం చేయడంతో ఖాతాదారుల్లోని 'గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్ళు' గమనించే అవకాశం లేకుండాపోయింది. నోకియాదీ అదే మిస్టేక్.  సాంకేతిక నైపుణ్యాల పరంగా కూడా భావి కాలంలో జరగబోయే పెనుమార్పులను  ఊహించాలన్న జ్ఞానం లేకపోవడంతో మార్కెట్ ఆనేక చిన్న ధారాదత్తం చేసింది.

 

ఇక చరిత్రలోకి తొంగి చూస్తే ఇట్లాంటి ఉదాహరణలు  ఎన్నైనా చెప్పుకోవచ్చు. క్రీ.శ 1217 ప్రాంతంలో సమర్ఖండ్ లోని ప్రాంతాలెన్నింటినో కైవసం చేసుకున్న అల్లావుద్దీన్-2 ప్రపంచం తనని 'బాద్ షా'గా గుర్తించాలని ఆశపడ్డాడు. బాగ్దాద్ అధినేత ఖలీఫా ససేమిరా అనేసరికి అల్లావుద్దీన్ అహం దెబ్బ తినేసింది. ఆ కక్ష కడుపులో పెట్టుకుని వాణిజ్య సంబంధాల కోసం పదే పదే ప్రయత్నించిన చెంగిజ్ ఖాన్ ను ఎన్నో సార్లు అవమానించాడు అల్లావుద్దీన్. అక్కడికీ డిప్లొమసీ బాగా వంటబట్టిన  చెంగిజ్ ఖాన్ అవమానలన్నిటినీ దిగమింగుకుని రాయబేరానికో ముగ్గురు మధ్యవర్తులను పంపిస్తే, భవిష్యత్తులో ఏం జరగనుందో ఊహించలేని అల్లావుద్దీన్  ఆ ముగ్గురినీ రాజనీతికి విరుద్ధంగా ఉరితీయించాడు. సహనం కోల్పోయిన చెంగిజ్ ఖాన్ అల్లావుద్దీన్ స్వాధీనంలోని నగరాలెన్నిటినో నేల మట్టం చేసిందాకా నిద్రపోనేలేదు. 

 

పాలకుల వ్యక్తిగత అహంకారానికి లక్షలాది మంది అమాయకుల ప్రాణాలు ఆ విధంగా బలికావడం చూసిన తరువాతా  భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించకుండా పగ, ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధానమనుకుంటే పాలకులకు ఏ గతి పడుతుందో పాఠాల్లా నేర్పేటందుకు బోలెడన్ని సంఘటనలు ఇట్లాంటివే చరిత్ర నిండా కనిపిస్తాయ్!

 

కనిపించని గుడ్డితనం (భావికాలజ్ఞాన లేమి)తో బాధపడే పాలకులు.. ఎవరూ ఏమీ చేయలేరు అనే అహంకారం పెంచుకోవడం పొరపాటు. మారిన కాలంలో ప్రజాస్వామ్యం వ్యవస్థ అధికార మార్పిడి అంతిమ శక్తి సామాన్యుడి చేతిలో పెట్టిన తరువాతా రాజరికాలలో మాదిరి ఇష్టారాజ్యంగా పాలకులు ప్రవర్తిస్తే హిట్లర్ కు,    అల్లావుద్దీన్-2 లకు పట్టిన గతే పట్టడం ఖాయం.

 

పాలకుడు అనేవాడు ప్రజలలో కనిపించకుండా నిరంతరం సాగే

'గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్లు' తప్పకుండా వింటుండాల్సిందే!

-కర్లపాలెం హనుమంతరావు

-24 -04 -2021

 


Tuesday, April 20, 2021

ప్రమదల పునరుత్పత్తి హక్కులు- కోవిడ్ మహమ్మారి ప్రవేశంతో మరింత అధ్యాన్నం! --కర్లపాలెం హనుమంతరావు

 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా మహిళల్లో హింస, నిరుద్యోగమే కాదు..  లైంగిక పరమైన ఆరోగ్య సంరక్షణా కొరవడింది. ఫలితం.. పునరుత్పత్తి నాణ్యత దిగజారడం. 

మనదేశం వరకే చూసుకుందాం.  లభిస్తున్న గణాంకాలను బట్టి ప్రభుత్వ సేవల అసమానతలు, సమన్వయలోపాలు సుస్పష్టం. 

 

స్వీయ హక్కుల పట్ల ఆట్టే అవగాహన లేని సమూహాలలో స్త్రీలది ప్రథమ స్థానం. విద్య, రవాణా వంటి  ప్రాథమిక  సౌకర్యాల కల్పనలోనే సమన్వయ లోపాలు ఇంత స్పష్టమవుతున్నప్పుడు ఇక   ఆరోగ్య పరిరక్షణ పరంగా ప్రస్తుతముండే దైన్య పరిస్థితిపై కథనాలు రాసుకోడం  వృథా కాలయాపన. ఎబోలా, జికాల వంటి మహమ్మారులు విజృంభించిన తరుణంలో దెబ్బతిన్న మాతాశిశువుల ఆరోగ్య పరిస్థితులేవీ పాలకులకు కోవిడ్-19  సంక్షోభంలో పాఠాలు నేర్పించినట్లే  లేవు! మహిళల ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఆరోగ్య సంరక్షణ అత్యయిక పరిస్థితినీ ఎప్పటికి  గుర్తిస్తారో  మన  ప్రభువులు! 

 

కోవిడ్ అనంతర ప్రపంచంలో మహిళలను మళ్లా వారి మానానికి వారిని విడిచిపెడితే మానవజాతి మనుగడకే మొత్తంగా ప్రమాదం. స్త్రీల పునరుత్పత్తి సమస్యలు స్త్రీలకు మాత్రమే  పరిమితం కాదు. 

  అంశం చుట్టూతా అనేక సమస్యలు మూగున్నాయి; వాటిలో చట్ట సంబంధమైనవే కాదు, నైతికపరమైనవి కూడా ఉన్నాయి. వాటిని గురించే ఈ క్షోభంతా!

 

జనాభాలో సగంగా ఉన్న స్త్రీ జాతికి నేటికీ తన కుటుంబ పరిణామాన్ని   నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు!   సహజ న్యాయాన్నీ ఒక  హక్కుగా  స్త్రీలు  దేబిరించే దశకు తెచ్చిన ఈ మగ ప్రపంచాన్ని ఏం చేసినా తప్పులేదు!

 

కనే బాధ్యత మాత్రమే అప్పగించేసి .. ఎంత మందిని, ఏ సమయంలో ప్రసవించాలో,  సంతానాన్ని ఏ   తీరున పెంచాలో అన్న  కీలకమైన నిర్ణయాలను ఇంటి పెద్దలు తామే  పుచ్చేసుకున్నారు!   గుడ్లప్పగించి చూసే దైన్యమే  ఆధునిక స్త్రీ దైనా!

 

కరోనా మహమ్మారి కారణంగా ఉనికిలోకి వచ్చిన లాక్ డౌన్ వాతావరణంలో మహిళ పరిస్థితి మరింత దయనీయం.  ముఖ్యంగా పునరుత్పత్తి పరంగా!

 

జాతీయ మహిళా కమీషన్ దగ్గర నమోదయిన గృహహింస ఫిర్యాదుల పెరుగుదల చూస్తే గుండెలు అవిసిపోతాయి. తక్షణ సహాయం అందే పరిస్థితులు కరువైన లాక్-డౌన్ వాతావరణంలో మెజారిటీ స్త్రీల వ్యథలు పడకటింటి నుంచే మొదలు!  జాతీయ మహిళా కమీషన్ లో గృహహింస    బాధితుల సౌకర్యార్థం   వాట్సప్ విభాగం ఓటి  ప్రత్యేకంగా ఏర్పడటమే  దిగజారిన పరిస్థితులకు దర్పణం.  

 

గృహహింస అంటే కేవలం దేహం మీద జరిగే బౌతిక దాడి ఒక్కటే కాదుగా! ఆంక్షలు, ఆరోగ్య రక్షణకు ఆటంకాలు, మానసిక పరంగా  వేధింపులు.. ఏ తరహా ఒత్తిళ్లయినా సరే  గృహహింస కిందకే వస్తాయి.  సన్నిహితంగా మసిలే జీవిత భాగస్వామి చేసేదయితే  ఆ హింస ప్రభావం మహిళ పునరుత్పత్తి  నాణ్యతను మరంత  తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణుల హెచ్చరిక కూడా  . 

కరోనా- 19 లాక్ డౌన్ వాతావరణం పునరుత్పత్తి ఆరోగ్య పరిస్థితులపై మహిళల  నియంత్రణ శక్తిని  మరంతగా  బలహీనపర్చినట్లు ఐక్యరాజ్య సమితి స్వయంగా నిర్ధారించడం  ఆందోళన కలిగిస్తుంది . సుమారు 12 మిలియన్ల మంది మహిళల గర్భనిరోధక వినియోగ చర్యలకు అంతరాయం ఏర్పడ్డట్లు  ఓ అంచనా. దీని ఫలితంగా 2020 అనంతరం కాలంలో సుమారు 1.4 మిలియన్ల అనాలోచిత గర్భధారణాలకు అవకాశం కలిగినట్లని ఆ నివేదికే తేటతెల్లం చేస్తోంది!

 

సమయానికి అందని కుటుంబ నియంత్రణ సేవలు, లాక్ డౌన్ కారణంగా విధించిన పరిమిత ప్రయాణాలు.. నిషేధాలు,  అవసరానికి అందుబాటుకు రాని  అనేక ఇతరేతర ఆరోగ్యసౌకర్యాల చలవ .. ఈ గందరగోళమంతా! 

 

 పునరుత్పత్తికి సంబంధించిన  హక్కులు, కుటుంబ నియంత్రణ.. గర్భస్రావం వంటి  సేవలను పొందే విషయమై  చట్టపరంగా ఉండే  హక్కులు  అన్నీ నామ్ కే వాస్తేనే!  వాస్తవ          లభ్యత విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన్నన.

 

 మనదేశం    వంటి  అభివృద్ది చెందుతున్న దేశాలలో సహజంగానే ప్రజలకు అందే ప్రభుత్వ సేవలు అరకొరగా ఉంటాయి  . అందులోనూ  తరాల తరబడి అణచివేతకు  గురవుతోన్న    స్త్రీజాతికి ..  ఆరోగ్య పరమైన లైంగిక  హక్కుల పట్ల               అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఈ క్రమంలోనే పునరుత్పత్తికి సంబంధించిన హక్కుల పరిజ్ఞాన లేమి అతివల అవాంఛిత గర్భధారణలకు  ముఖ్య కారణమవడం!

 

మొత్తం భారతీయ మహిళల్లో దాదాపు సగం మందికి గర్భనిరోధానికి  పాటించే  ఉపాయాలు తెలియవు; తెలిసినవారికేమో  వివిధ కారణాల వల్ల  ఆయా  సౌకర్యాలు బహుదూరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుటుంబాల నియంత్రణ   ప్రణాళికల్లో స్త్రీ భాగస్వామ్యం దాదాపు శూన్యం .. అదీ విడ్డూరం!

 

గర్భనిరోధ వినియోగం చుట్టూతా ఉన్న డేటానే  ఈ స్త్రీ స్వయంప్రతిపత్తి లోపానికి ఓ కీలక ఉదాహరణ. 'ఏ అపాయమూ లేకపోయినా వాసెక్టమీలకు కేవలం 0.3% మంది పురుషులు మాత్రమే సంసిద్ధమవుతున్న నేపథ్యంలో    వివాహిత మహిళల్లో హానికరమైనప్పటికీ నూటికి 36  మంది  స్టెరిలైజేషన్ ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారు!  

 

సంస్కృతీ సంప్రదాయాల పరంగా ఈ తరహా అంశాల మీద  బాహాటమైన చర్చలకు ఆస్కారం ఉండటంలేదు. అవివాహితులైన స్త్రీలకు ఏ విధమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించే అవసరం లేదనే ఒక నైతిక  భావన కద్దు,

 

కానీ  మారుతున్న కాలం ప్రభావం!   ఈ దేశంలో లైంగికపరంగా ప్రస్తుతం  చైతన్యం కలిగివున్న గ్రామీణ అవివాహితులే  27% ఉన్నట్లు అనధికార గణాంకాలు నిగ్గు తేలుస్తోన్న  నేపథ్యం! ఎంత సమర్థవంతమైన ఆరోగ్య సేవా కార్యకర్తలు ఉన్నప్పటికీ,  ఈ తరహా వర్గాలను  ఏ గణనలోకీ తీసుకోలేని   పక్షంలో, చర్చల ద్వారా  సాధించే సానుకూల ఫలితాంశాలు ప్రశ్నార్థకమే అవుతాయి కదా?

 

2020 లో దేశవ్యాప్తంగా కొనసాగిన లాక్ డౌన్ సమయంలో కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి ఆరోగ్య సేవా క్షేత్రాలు  తీవ్రంగా దెబ్బతిన్న మాటయితే  వాస్తవం. గృహ నిర్బంధ పరిస్థితుల  కారణంగా,  దేశంలో 25 మిలియన్ల జంటలకు గర్భనిరోధక సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. నిజం చెప్పాలంటే రాబోయే ఏడాదిన్నర కాలంలో భారతదేశం    జననాల విషయంలో రికార్డు నమోదుచేసుకునే అవకాశం దండిగా ఉందంటున్నారు ఆరోగ్య శాస్త్ర నిపుణులు!  

 

'అన్ని వర్గాలకు సమాన హక్కులు'  అని సర్వత్రా వినవస్తున్న   సామాజిక వ్యవస్థ నినాదమే మూహిళల    పునరుత్పత్తి హక్కుల అంశంలోనూఉంది. పునరుత్పత్తి  అతివ  జీవితాన్ని అత్యంత అధికంగా ప్రభావితం చేసే ప్రధాన అంశం. అందులో స్త్రీ   పురుషునితో సమానంగా స్వతంత్ర ప్రతిపత్తికై డిమాండ్ చేయడంలో  అసమంజసమేమీ లేదు.

పునరుత్పత్తికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం యావత్తూ ఆమెకు సకాలంలో అందుబాటులో ఉంచడం.. ఆ చైతన్యం ద్వారా ఆమె తీసుకునే పునరుత్పత్తి సంబంధమైన నిర్ణయాలను మన్నించగలగడం పురుష ప్రపంచం..  ముందు అహం చంపుకొనైనా అభ్యసించడం అవసరం. ఇది నేరుగా ఆర్థిక, సామాజిక పరంగా స్త్రీని  పురుషునితో సమానంగా ఎదిగే అవకాశం

కల్పించడమే!  స్త్రీల జీవితాల మీద స్తీలకు, స్త్రీ దేహం మీద స్త్రీకి మాత్రమే సర్వహక్కులు కల్పించినప్పుడే ఇది సాధ్యమయే సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం సాకారం అయ్యే ఆశ కనుచూపు మేరలో ఉండగానే కోవిడ్ - మహమ్మారి స్త్రీ జీవితాన్ని మరింత ఛిద్రం చేయడమే విషాదకరం!

-కర్లపాలెం హనుమంతరావు

18 04 -2020

Sunday, April 11, 2021

శతమానం భవతి… ( అభయ్) -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 



నిజానికి వరల్డ్ వార్స్ నుంచి స్టార్ వార్స్ వరకు  కాలంతో కలసి ఉత్సాహంగా కాలు కదిపితే  చాలు..  ఆ కాలాతీత జివిని  చిరంజీవి కింద జమకట్టేయవచ్చు! ఆయాచితంగా దక్కిన వరం మానవ జీవితం. అధిగమించలేని   ప్రకృతి  శక్తుల ప్రభావం గురించి ఎంత చింతించీ ప్రయోజనం శూన్యం. వీలైనంత కాలం ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్తమ సంస్కారంతో సాటి సమాజానికి ఆదర్శప్రాయంగా జీవిస్తే ఛాలు.. అదే   వాస్తవానికి వెయ్యేళ్లు మించి ఘనంగా జీవించినట్లు!  

 కానీ గరిష్ట  జీవితకాలం ఇంత అని ఒక మొద్దు అంకె రూపంలో స్పష్టంగా కనిపించాలి. పరిశోధనలకు, తుల్యమాన పద్ధతుల్లో జరిగే  పరిశీలనలకుఅధ్యయనాలకు అది ఒక ప్రమాణం (యూనిట్)గా స్థిరపడాలి.  ‘శతమానం’ మనిషి నిండు జీవితానికి ఒక ప్రామాణిక  కొలమానంగా భావించడానికి  అదే కారణం. హైందవ సంప్రదాయంలో తరచూ వినిపించే  ‘ ఓం శతమానం భవతి శతాయుః పురుష/ శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ!’ అనే ఆశీర్వాద మంత్రం వెనుక ఉన్న ఉద్దేశం నిర్దేశించిన ఈ జీవితకాల లక్ష్యాన్ని నిరాటంకంగా చేర్రుకోవాలనే అభిలాష.  కానీ మీకు ఎన్నాళ్ళు జీవించాలని ఉంది? అని అడిగితే చాలామంది అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు అంటో అలవోకగా ఏదో  బుద్ధికి తోచిన  సమాధానం ఇచ్చేస్తారు. ఏ ఒక్కరికి నిండు నూరేళ్లూ జీవితం పండువులా  గడపాలని ఉండదా?! 

భూగోళం పైన రష్యా, దాని పరిసర దేశాల కొన్ని మారుమూల ప్రాంతాలలో గుట్టుగా జీవించే మానవ సమూహాలకు - వందేళ్లు మించి  జీవించడం కూడా   చాలా సాధారణమైన విషయం. 'మీకు ఎన్నాళ్ళు బతకాలనిs ఉంది?' లాంటి ప్రశ్నలు వాళ్లకు నవ్వు తెప్పిసుంద'ని  పరిశోధన నిమిత్తమై వెళ్లిన ఓ జర్మన్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం ‘లైవ్ సైన్స్’ -జూన్’2019 నాటి  సంచికలో ఓ వ్యాసం సందర్భంగా పేర్కొంది!  

వంద మీద మరో 13  ఏళ్ళకు  పైగా జీవించిన వంద మంది   జాబితా - గిన్నీస్  వరల్డ్  రికార్డు  వాళ్ళు  తయారు చేస్తే అందులో సింహభాగం సివంగులవంటి  ఆడంగులది.. అందులో అగ్రతాంబూలం అమెరికన్  దొరసానులది! బడాయిలే తప్పింఛి భారతీయుల తాలూకు ఒక్క శాల్తీ పేరూ ఆ జాబితాలో కనిపించదు! బాధాకరం. పక్క చైనా నుంచి నుంచైనా  ఒక్కరూ లేని మాట  నిజమే కావచ్చు కానీ అదీ కొంత ఉపశమనం  కలిగించే అంశంగా భావించడం  తగదు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు   వందేళ్లకు పైగా బతికున్నట్లు  కనిపిస్తున్నా కొన్ని   ప్రాంతాల ప్రభుత్వ పత్రాల సాధికారత పట్ల  గిన్నీస్ బుక్కు సంస్థకు అభ్యంతరాలు ఉన్నట్లు వినికిడి!  నిజానిజాలు నిర్ధారణ తరువాత కానీ తేలవు. 

వందేళ్ల బతుకు ఒక్కటే కాదు… 'చల్ మోహన రంగా' పంథాలో ఉత్సాహంగా బతకడం కూడా ప్రధానమే! 'పక్క దిగేందుక్కూడా ఎవరెక్కరున్నారా సాయానికని  దిక్కులు చూస్తూ దినాలు గడిపే కన్నా.. కాలు కింది బక్కెటను ఠక్కున తన్నేయడం మెరుగు' అంటాడు ఛార్లీ చాప్లిన్ ‘ది గార్డియన్’ పత్రిక పక్షాన రిచర్డ్ మేరీమ్యాన్ కు ఇచ్చిన ఆఖరు ఇష్టాగోష్టిలో. మైఖేల్ జాక్సన్ లా ఆడుతూ, లతా.. ఉషా మంగేష్కర్ల మాదిరి హుషారుగా పాడుతూ ఖతమయితేనే ఏ బతుకు ఖేల్ అయినా  గెలుపుకు కావాల్సిన గోల్స్ కొట్టి  పతకం సాధించినట్లు! సర్కారు పింఛన్లు పుచ్చుకుంటున్నా  కానీ ..అణా.. కాణీ కైనా కొరగాకుండా పడున్నాడ'ని  అయినోళ్లందరి నోటా 'ఛీఁ .. పోఁఅనిపించుకుంటూ ఎంత ఎక్కువ కాలం  తుక్కు బండి లాగించినా  వృథా.మన్నిక -కట్టే బట్టకే కాదు.. బతికే బతుక్కూ అవసరమే’ అంటారు స్వామి వివేకానంద! చిన్ననాటి పెద్దల గారాబం, పెద్దతనంలో పిల్లల గౌరవంగా తర్జుమా అయినప్పుడే తర్జన భర్జనలేవీ లేకుండా వందేళ్లకు మించైనా  దర్జాగా బతకాలనిపించేది! మధ్య ప్రాచ్య దేశాలలో  పది పదుల దాటినా నిశ్చింతగా బతికేయడం, ప్రాచ్యులంగా  గొప్పలు పోయే మనకు మాత్రం ఆరు పదులైనా నిండక మునుపే బతుకు ‘తెల్లారిపోవడం’! ఎందుకు ఈ తేడా?'

మనసుంటే మార్గం ఉంటుంద'న్నది మనమే మానుషులంగా కనిపెట్టుకున్న జీవనసూత్రం.  వందేళ్ల బతుకు మీద మరి  మన భారతీయ సంతతికి  అణు మాత్రమైనా మోజెందుకు లేనట్లో?! 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీర్వాదం గతం మాదిరి కాకుండా ఇప్పుడు ప్రతీ ఇంటా వృద్ధుల పాలిట శాపంగా మారడమెందుకు?! నేటి భారతీయ సమాజంలోని స్థితి గతులన్నీ నానాటికీ ఏళ్ళు పైబడే వృద్ధుల పాలిటి   వరద పోటుకు ఎదురీతలుగా ఎందుకు మారుతున్నట్లు?! ప్రభుత్వాల ధ్యాస పెద్దలపై ఒక్క ఓట్ల జాతర్లప్పుడు మాత్రమేనా?! నిన్నటి  దాకా దేశాన్ని బాధ్యతగా  నడిపించి భద్రంగా తాజా తరాలకు అప్పగించిన అనుభవజ్ఞులు   పెద్దలు. కృతజ్ఞత కోసమైనా ఆ మాతాపితర సమానుల గౌరవప్రద జీవన పరిస్థితుల   పట్ల ప్రజాప్రభువులు సంతాన భావనతో  ప్ర్రత్యేక శ్రద్ధ వహించవలసిన అగత్యం స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. 

గతంలో ఒక్క నయం కాని రోగాలూ రొప్పులు, వేళకు అందని తగిన వైద్యసాయాలు  పెద్దల పాలిటి ముప్పులుగా ఉండే పరిస్థితి. మారుతున్న సమాజంలో ముసలితనానికి  మానసిక ఒంటరితనం కొత్త యమగండంగా మెడకు చుట్టుకుంటున్నట్లు  వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల  నివేదికల  గణాంకాలు నిలదీస్తున్నాయిప్పుడు! బతకడాన్ని మించి సుఖంగా బతకాలనే వాంచ మనిషిది. అందుకు సరిపడని సామాజిక పరిస్థితులు  కుటుంబ వ్యవస్థలలో కూడా క్రమంగా చొరబడడమూ  ముదుసలుల మరణాలను మరింత ముందుకు తోసే  ముదనష్టపు కారణమని ఓ అంచనా, సుఖమయజీవితం పైన క్రమంగా సడలుతున్న నమ్మకమే ముందుకు తోసుకొచ్చే ముదిమికీ ఓ ముఖ్య కారణమని భారత ఆహార సంస్థ 2017 నాటి తన వార్షిక నివేదికలో హెచ్చరించింది కూడా. 'మనవారు' అనుకునేవారు తరుగుతున్న కొద్ది యములాడితో  మనిషి చేసే సమరంలో దార్డ్యం, దైర్యం రెండూ సన్నగిల్లడం సహజ విపరిణామం. పొద్దు వాటారే మాట  తాత్కాలికంగా పక్కన ఉంచి, పడుచువారిని మించి  కొంత కాలం  మనస్ఫూర్తిగా జల్సాలలో ఉత్సాహంగా మునిగి తేలితేనో

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్ టన్  ఈ దిశగా గతంలో చేసిన ఓ పరిశోధన తాలూకు  ఫలితాలు పోయిన ఏడాది జులై నెల ‘అమెరికన్ సైన్స్’ జర్నల్ లో విడుదలయాయి. మనోవాంఛితం మనిషి శర్రీరం పైన ఎంతటి వింత ప్రభావం చూపిస్తుందో తెలిపే ఆ పరిశోధనల ఆధారంగా మన దేశంలో ముసలివారి శాతం ఎందుకింత శరవేగంగా దూసుకువస్తుందో అర్థమవుతుంది. అనుక్షణం అద్భుతంగా సాగిన ఆ  యౌవ్వనోత్సాహ జీవితోత్సవ అనుభూతుల కారణానే   గ్రీష్మాంతంలో వసంతం ప్రకృతి కై కల్పించే కైపు ముదుసలుల మనసులలోనూ  చొప్పించినట్లు ఆ పరిశోధన తేల్చింది.  మూడు పదుల నాటి మునుపటి శారీరక పటిమ ముసలివారిలో తిరిగి పుంజుకొన్నట్లు ప్రయోగ ఫలితాల సారాంశం! మనసు చేత శరీరాన్ని నొప్పించడం కాక శరీరం చేత మనసును శతాయుష్షువుగా జీవించడానికి  ఒప్పించాలన్నది ప్రయోగం నేర్పించే నీతి పాఠం.. 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీస్సులు నిజం కావాలంటే 'నిండు నూరేళ్లూ ఆరోగ్యం గుండులా ఉండాల’నే సంకల్పం ముందుగా ఎవరికి వారు తమ మనసులకు చెప్పుకోవాలి.     

జీవిత లక్ష్యం ఏ   ‘షష్టిపూర్తి’  పూర్తికో  పరిమితమైతే  పొద్దు ఆ వేళకే వాటారే అవకాశం ఎక్కువని  మనస్తత్త్వవేత్తలూ మత్తుకునే మాట.  అస్తమానం చేసే భూతకాల జపం   భవిష్యత్తు పాలిట శాపంగా మారుతుందని మానసిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనుగడ అనే భావన కూడా చేటే. గాలివాటానికి కాస్త చలాకీతనం మందగించినా మరేదో ముందు ముందు ముంచుకురానున్నదనే బెంగ  ఆయుర్దాయం మీద కనిపించని  దెబ్బ వేసే ప్రమాదం కద్దు.  'నూరేళ్లు నేను మాత్రం మా మనవళ్ళు, మనవరాళ్లలా ఎందుకు హుషారుగా ఉండకూడదూ?' అనుకుంటే చాలు. అందుకు తగ్గట్లు తీసుకునే జాగ్రత్తలతో   మునిమనుమలతో కూడా  కలసి హాయిగా ఆడిపాడుకోవచ్చు.

అందుకు అనుగుణమైన  సగుణాత్మక  సంస్కరణల దిశగా దేశంలోని అన్ని ప్రజాప్రభుత్వాలు సత్వరమే స్పందించడమే ముసలివారి పట్ల ప్రజాసేవకులు చూపించే మంచీ.. మర్యాదా!  

'మీకు ఎన్నాళ్లు బతకాలని ఉంది?' అనడిగితే  రష్యా  పరిసర  ప్రాంతాల మనుషులకు మల్లేనే అప్పుడు  మన దేశం నడిబొడ్డులోనూ ముసలితరం  పెదాలపై   ముసి ముసి నవ్వులు వెల్లివిరిసేది!  

*** 

తాతయ్యలు, నానమ్మలు/అమ్మమ్మలు  అయితేనేం?

డేమ్ జూలియా జూలీ ఎలిజెబెత్ ఏండ్రూస్ ఎనభైలు దాటినా గాయనిగా, నటిగా, నర్తకిగా, కవయిత్రిగా, దర్శకరాలుగా అటు హాలివుడ్, ఇటు రంగస్థలం రెండింటి పైనా తన ప్రభ  అప్రతిహతంగా సాగించారు. 

జేమ్స్ ఎర్ల్ జోన్స్ తన తొంభైలకు రెండేళ్లు ముందు వరకు .. మన బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ తరహాలో రకరకాల  పాత్రలతో ఆరు దశాబ్దాల పాటు అలుపూ సొలుపూ లేకుండా అమెరికన్ ఖండాలని అలరించారు. 53 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ కు తన తొంభై రెండో ఏట సారథ్యం వహించడమే కాదు, ఇంగ్లాండ్ చర్చ్ వ్యవస్థకు సుప్రీమ్ గా వ్యవహరించారు ఇంగ్లాండ్ రాణి ఎలిజెబెత్-2. బెట్టీ వైట్  వందేళ్లకు ఇంకా మూడేళ్లు ఉన్న వయసులో సైతం మనుమారాళ్ల వయసు నటీమణులను మించి చాలాకీగా బుల్లితెరపై కనిపిస్తూ గోల్డెన్ గర్ల్ గా జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. తెలుగు చిత్రసీమలో అక్కినేనివారు తన తొంభైల వరకూ చేసిన వయసు ఇంద్రజాలం ప్రపంచ సినీ రికార్డులకు సరితూగేది.  హెన్రీ కిసెంజెర్ (96), జిమ్మీ కార్టర్ (94). బోట్సీ రేవిస్(91), బెండిక్ట్ XVI (92), సిడ్నీ పోయిట్లర్ (92).. అంతా తొంభయ్యో పడి దాటినా ప్రభ ఏమీ మసకబారని టాప్ సిక్స్ ప్రముఖ వ్యక్తులు.  యమధర్మరాజు  నియంతలా వచ్చి  ‘చప్పున రండు' అంటూ  పాశం బైటకు తీసినా.. ' శతాయుష్మాన్ భవ అని కదా మీ  దేవతల దీవెన మానవుల పైన! నిండు నూరేళ్లూ పండనివ్వండి స్వామీ!' అనేపాటి గుండె దిటవు చూపగల గండర గండళ్ళ జాబితాలో  ముందు నుంచి లోకానికి సుపరిచితులైన  గోర్బొచేవ్ (92) నుంచి ఇప్పటి దలైలామా దాకా(84), విల్లీ మేస్(88), క్లింట్ ఈస్ట్ వుడ్ (89), యోకో వోనో (86), హ్యాంక్ అరోన్(85).. వంటి ఎందరో కాలాంతకులు కాలు మీద కాలు వేసి విలాసంగా జీవితం గడిపినవారున్నారు.  ఏ వత్తిళ్లూ లేని సాధారణ ప్రాణులం మనం మాత్రమే మరి ఎందుకు ముందే ఏదో పుట్టి మునుగుతున్నట్లు పెట్టే బేడా సర్దుకుని ప్రస్థానానికి సిద్ధమవడం?!

***

చిరంజీవులు ఉండరు!

  'భారతం రామాయణాలలో కూడా సమానంగా కనిపించే ఆంజనేయుడికి చిరంజీవిగా వరమున్నట్లు మనం పురానాలలో చదువుకునివున్నాం, వానరులకు వారసులమని చెప్పుకునే మనం మరెందుకు కనీసం వందేళ్లైనా జీవించలేక ముందే చాప చుట్టేయడం?' అంటూ ఓ జిజ్ఞాసి శిష్యుడు సంధించిన ప్రశ్నకు వైజ్ఞానికానందులవారు సెలవిచ్చిన  వివరణ వింటే 'మహోన్నతమైన మానవ జన్మ  వరం   శాపంగా మారడంలో  ఎవరి లోపం ఎక్కడ ఎంత పాలో  ఇట్టే అవగాహన అయిపోతుంది.  

చలనమున్న ప్రతిదీ క్రమేణా నిశ్చలంగా మారడమన్నది   ప్రకృతి నిక్కచ్చిగా పాటించే జీవనసూత్రం. పుట్టుట గిట్టుటకే అనేది పుట్టలోని చెదల నుంచి చెట్టు మీది పిట్ట వరకు అన్ని జీవులకూ  సమానంగా వర్తించే కాలనియమం.  విశాల విశ్వంలో నిజానికి ఎక్కడా చిరంజీవుల  ఉండేందుకు బొత్తిగా ఆస్కారం లేదు.  ఒక వంక 'జాతస్య మరణం ధృవం' అంటూ మరో వంక ‘చిరంతన’ భావనపై విశ్వాసం ఉంచడం  తర్క బుద్ధిని వెక్కిరించడమే! మరణం అంటే ఏమిటో అవగాహన లేకనే మనుషులలో ఈ తడబాటు.

 

 

జీవజాతుల మరణానికి విశ్వంలోని అంతరంగిక నియమాలూ ప్రధాన ప్రేరణలే. సృష్టిలో మారనిదంటూ ఏదీ లేదంటున్నప్పుడు జీవానికి మాత్రం ఆ సూత్రం నుంచి మినహాయింపు ఎట్లా  సాధ్యం?  

జీవులని, నిర్జీవులని పదార్దానికి రెండు రూపాలు.  నిర్జీవ పదార్థాలతో తయారయే జీవపదార్థం ప్రాణం. ఊపిరితో ప్రాణం ప్రయాణం కొనసాగుతుంది. ఉసురు అండ ఉన్నంత  వరకు నిర్జీవ పదార్థాలు తమ ధర్మాలకు భిన్నంగా ప్రకృతి నియమాలను అనుసరిస్తూనే ప్రకృతి నియమాలను ధిక్కరించి నిలిచే సామర్థ్యం ప్రదర్శిస్తాయి. ఆ సామర్థ్యం శాశ్వతంగా కోల్పోయే స్థితి పేరే ‘మృతి’. చావు అంటే జీవం చేసిన దోషంలాగా భావించడమే దురవగాహన. 

ప్రతీ ప్రాణికీ  నిశ్చేష్టత ఎప్పటికైనా తప్పని అంతిమ స్థితి.  భూమికి ఆకర్షంచే శక్తి ఉంది. ఆ బలంతో అందుబాటులో ఉండే ప్రతీ పదార్థాన్నీ తన కేంద్రకం దిక్కుగా లాక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటుంది. ప్రకృతి నియమాలలో అదీ ఒకటి, ఆ నియమాన్ని ధిక్కరించే శక్తి అదే ప్రకృతి జీవపదార్థానికి ఇవ్వడమే సృష్టి కొనసాగింపులోని అసలు రహస్యం.  జీవులు కిందికి లాగే  భూమి  ఆకర్షణ దిశగా వ్యరిరేకంగా పైకి పైకి   ఎదగడం ప్రకృతి ఇచ్చిన అండ చూసుకునే!  జీవం అట్లా పైకి ఎదగడానికి బలం కావాలి కదా! ఆ శక్తిని జీవం ప్రకృతి తన సూత్రాలకు లోబడే వాడుకోనిస్తుంది. శరీరంలోని అవయవాలు వేటికవే ప్రకృతి ఇచ్చే శక్తి(చెట్లు, ఇతర జీవులు నుంచి వచ్చే ఆహారం)ని అందుకునే ఒక రూపం దాలుస్తాయి. ఎదుగుతాయి. ఇది జీవం ప్రకృతి సూత్రాలకు లోబడి ప్రవర్తించడంగా భావించుకోవచ్చు.  కానీ విచిత్రంగా అట్లా రూపుదిద్దుకున్న అవయవాలు(కొమ్ములురెక్కలు, తోకలు వంటివి) అన్నీ ఒక చట్రం(శరీరం)లోకి కుదురుకున్న తరువాత ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. అదే శరీరం మొత్తంగా ఊర్థ్వ దిశగా ఎదగడం.  అట్లా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పైకి ఎదగడానికి శరీరాన్ని ఎక్కబెట్టేది శరీరంలోని జెన్యు సంకేత స్మృతి. జెనెటికి కోడ్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది.  ఈ జెన్యు సంకేతాలు శరీరంలోని డి.ఎన్.ఏ రచించి పెట్టుంచే పటం నుంచి వచ్చే ఆదేశాలే. ఈ డి.ఎన్.ఏ నిజానికి ప్రకృతికి వ్యతిరేకంగా ఏర్పడ్డ  ఒక  క్రమబద్ధమైన తిరుగుబాటు వ్యవస్థ. 

డి.ఎన్.ఏ వ్యవస్థ అటు ప్రకృతిపై తిరగబడుతూనే  ఇటు తను ఏర్పాటు చేసిన జీవ వ్యవస్థ తనపై తిరుగుబాటు చేయకుండా తన అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం తంటాలు పడుతుంటుంది.  (తమ వృత్తి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వంతో పోరాడే ఉపాధ్యాయుడు తన అధీనంలో ఉన్న తరగతి పిల్లలను క్రమశిక్షణ తప్పకుండా అదుపులో పెట్టుకోవడానికి సరితూగే చర్యగా భావించాలి డి ఎన్ ఏ తంటాలు సులభంగా అర్థమవాలంటే). పరస్పరం వ్యతిరేకంగా సాగే ఈ సంఘర్షణలు తనలో కొనసాగుతున్నంత కాలం బౌతికంగా కనిపించే శరీరంలో డి.ఎన్.ఏ తాలూకు జీవ వ్యవస్థ చురుకుగా ఉన్నట్లు లెక్క. గతితార్కిక భౌతికవాదన ప్రకారం ఇదే 'వ్యతిరేక శక్తుల మధ్య జర్రిగే సంఘర్షణ(కాంట్రాడిక్షన్ ఆఫ్ అపోజిట్స్). ప్రత్యేకంగా  కనిపించే జీవచైతన్యం(స్పెషాలిటీ), ప్రకృతి సాధారణత (జెనరాలిటీ) నడుమ జరిగే  తగాదాలో సాధారణతది ఎప్పుడు పైచెయ్యి అయితే ఆ క్షణం నుంచే శరీరంలోని జీవం స్థిభించిపోయినట్లు. ఆ బొంది తాలూకు వ్యక్తి కీర్తి శేషుడు అయినట్లు! 

ఇంత కథా కమామిషు  ఉన్న ‘మరణం’ వివిధ జీవ జాతులలో వివిధ పరిమితులలో ఉంటే, మనిషి జీవితకాలం విశేషాలేమిటి? అనే ఆసక్తికరమైన అంశం భారతదేశ వృద్ధుల జీవనపరిస్థితుల నేపథ్యంగా పరిశీలించడమే ఈ చిన్న వ్యాసం ఉద్దేశం!***

(కర్లపాలెం హనుమంతరావు)

(సూర్య దినపత్రిక  4, నవంబర్, 2019 ప్రచురితం)


Sunday, March 7, 2021

గీత ఓ అందే ద్రాక్ష పండు! -కర్లపాలెం హనుమంతరావు -

 



 కార్పణ్య దోషోప హత స్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః

యచ్ర్ఛెయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే౨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్

భారతీయులు ఆరాధనాభావంతో పఠించే భగవద్గీతలో ఈ సాంఖ్యయోగం - ఏడో శ్లోకంలో పెద్దలు ఎప్పుడూ గుర్తుంచుకుని అనుసరించదగ్గ ఓ గొప్ప  సూక్తి ఉంది

అభిమానం పరిమితులకు మించి పెరిగిపోయినప్పుడు సహజ స్వభావానికి విరుద్ధమైన ప్రవర్తన సంభవిస్తుంది. ధర్మసంబంధ విచక్షణ  పక్కనుంచి సామాజికపరంగా అయినా ఆమోదనీయం కాని సమతౌల్యతను మనసు కోల్పోవడమే ఇందుకు కారణం. సమాజంలోని  ప్రతీ వ్యక్తికీ ఈ సంకట స్థితి ఏదో ఓ సందర్భంలో తప్పదు. అయితే,  జీవితం నేర్పిన పాఠాల సారం వంటబట్టిన కొందరు గుంభనగా ఈ  స్వ స్వరూప సంభంధమైన వైవిధ్యం స్వయంగానే గ్రహింపుకు తెచ్చుకుని  ఆ  వైపరీత్యం నుంచి బయటపడే ప్రయాసలు ఆరంభిస్తారు! ఆ పైన జీవ సంస్కారాన్ని బట్టి జయాపజయాలు!


కానీ, జీవితమనే మల్ల యుద్ధం గోదాలోకి అప్పుడే  పాదం మోపిన పిన్న వయస్కులు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసిన  సందర్భం తటస్తించినప్పుడు నరుడు నారాయణుణ్ణి ఉచిత మార్గ దర్శనార్థం  ఎట్లా దేబిరిస్తాడో అట్లా దేబిరించడం నామర్ధాగా భావిస్తారు.  అన్నీ తమకే తెలుసనుకుని దుందుడుకుగా ముందుకు దూసుకుపోతారు. కలసిరాని సందర్భంలో చతికిలపడే దుస్థితి దాపురించినప్పుడు బేలతనంతో ఆ పిన్నలు తమ సహాయ సహకారాలు, సముచితమైన సలహాలు యాచించే స్థితికి వచ్చే వరకు కన్నవారు ఓపికతో వేచ్చిడాలి.. అదే పెద్దరికం.. అని ఈ శ్లోకం సారాంశం.

మహాభారతంలో అర్జునుడు  యుద్ధరంగం మధ్య ప్రేమానురాగ బద్ధుడై కర్తవ్య విమూఢత్వం ఆవరించిన సందర్భం ఒకటుంది. తన వైరాగ్యానికి కారణం బంధుప్రీతి అనో, పెద్దలు.. గురువుల మీద భయభక్తులనో, విజయసాధనానంతరం అనుభవంలో కొచ్చే రాజభోగాల మీది కాంక్ష ధర్మసంబద్ధం కాదనో.. ఇలా రకరకాల కారణాలు వెతికే దుస్సాహసానికి సర్వలోకసంరక్షకుడి ముందు  దిగే దుస్సాహసానికి పూనుకుంటాడు. కానీ ఈ శ్లోకం దగ్గరకొచ్చేసరికి విజయుడికి తన పరిమితులు తెలిసివచ్చాయి.  తన సహజ రాజస్వభావానికి విరుద్ధమైన కరుణ, జాలి వంటి గుణాలే ఈ సంక్లిషతకు కారణమని  అవగాహన ఏర్పడింది. ఆ భావన కలిగించింది అప్పటి వరకు తాను కేవలం మిత్రుడిగా భావించిన యదువంశ సంజాతుడు శ్రీకృష్ణుడే. ఎదుట ఉన్న ఆ వ్యక్తి తన బాంధవుడిగా మాత్రమే భావించి తన మనోభావాలని యధేచ్ఛగా పంచుకున్నావాడల్లా జగద్గురువన్న ఎరుక కలిగిన మరుక్షణమే అతనని తన మార్గదర్శుగా ఎంచుకున్నాడు. తగిన కార్యాచరణ సూచించమనే స్థాయి వరకు  దిగివచ్చాడు.  తనను శాసించే సర్వాధికారాలు సమర్పించే దాసస్థితికి ఆ నరుడు చేరువ అయినప్పుడుగాని ఆచార్యుడు కర్తవ్యబోధకు పూనుకోలేదు. 

నరుడికి ఓపిక లేకపోవచ్చును గాని.. నారాయణుడిలోని పెద్దరికనికి  ఎందుకుండదు! పెద్దలూ, పిన్నలతో గీతలోని ఆచార్యుని ర్తీలోనే  సాగాలని  ఈ శ్లోక సారం. 

పండు పిందె దశలో ఎలా వగరుగా ఉండి రుచికి హితవుగా ఉండదో.. పిల్లల ప్రవర్తనా ప్రాథమిక దశల్లో సమాజపోకడలకు విభిన్నంగా సాగుతూ సబబనిపించదు. పిందె పచనానికి పనికి రాని విధంగానే పిల్లలూ బాల్యదశలో పెద్దల మార్గానికి భిన్నమైన దారుల్లో పడిపోతూ ఇబ్బందులు కలిగిస్తారు.  తమ శక్తి సామర్థ్యాల, శక్తియుక్తుల పరిమితులు గ్రహణకొచ్చిన తరువాత తప్పక పెద్దలను ఆశ్రయిస్తారు. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం భారతంలోని కృష్ణపరమాత్మునికి మల్లే సద్వినియోగం చేసుకోవడమే పెద్దల కర్తవ్యం- అని ఈ శ్లోకం ప్రబోధిస్తుంది.


గీత కేవలం భగవానుని ఉవాచ మాత్రమే కాదు. ఆ ఆధ్యాత్మిక కోణంతో పాటు అదనంగా వ్యక్తిత్వ వికాస సంబంధమైనదని కూడా ప్రపంచం క్రమంగా గుర్తిస్తున్నదిప్పుడు. నిత్య జీవితానికి అక్కరకొచ్చే సూక్తులని గ్రహించి ఆచరణలో పెట్టే వారందరికీ 'గీత' ఎప్పుడూ అందే  ద్రాక్షాపండే!

 -కర్లపాలెం హనుమంతరావు

బోథన్, యూఎస్ఎ

07 -03 -2021

Monday, March 1, 2021

రుణానుబంధాలు - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

కథానిక : 

రుణానుబంధాలు 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)


పెరట్లో గిలక బావి దగ్గర స్నానం  చేస్తున్నాను. . శారదమ్మ తత్తరపడుతూ పరుగెత్తుకొచ్చింది 'రాధాకృష్ణయ్యగారు పోయార్టండీ!' అంటూ.


గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చినట్లయింది. 'ఛ! ,, ఊరుకో!' అని కసిరాను. 


'నిజమేనండీ! రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నార్ట. శాస్తుర్లుగారు వాళ్ళింటి కెళ్ళి ముహూర్తాలు కూడా విచారించుకుని వెళ్లార్ట! ఇంతలోనే ఏం ముంచుకొచ్చిందో ఏమో.. ఇట్లాగయింది'


ఆ ఇంటి వైపు పరుగులు తీయబోతున్న శారదమ్మను ఆపి 'నీ కెవరు చెప్పారివన్నీ? ఏట్లా విన్నావో .. ఏమో?' 


'బజారంతా వాళ్లింట్లోనే ఉంది. ఎంత ఎతిమతం దాన్నైతే మాత్రం ఇట్లాంటి విషయాల్లో పొరపాటు పడతానా! నే పోతున్నా.. మీరు తాళం వేసుకు రండి!' అంటూ మళ్లీ మాట కందకుండా మాయమయిపోయింది మా శారదమ్మ.


స్నానం ఎట్లాగో అయిందనిపించి, బట్టలు మార్చుకుని మళ్లీ వాకిట్లోకొచ్చాను. 


చాలా మంది అటే పోతున్నారు. ఇంటికి తాళం వేస్తుంటే ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. ఇక కదల్లేక అక్కడే గుమ్మం ముందున్న అరుగు మీద కూలబడిపోయాను. వారం రోజుల కిందట జరిగిన విషయం వద్దనుకున్నా కళ్ల ముందు కదులుతోంది.


రాధాకృష్ణయ్యా నేనూ బాల్య స్నేహితులం. వాడు జడ్.పి లో టీచర్ గా చేసి రిటైరయ్యాడు. నేనో బ్యాంకులో పనిచేస్తూ రిటైరవడానికి సిద్ధంగా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య వయసులో నా కన్నా మూడేళ్లు పెద్ద. సర్వీసులో ఉండగానే ఎట్లాగో పెద్దపిల్లకు పెళ్లిచేశాడు. రెండో పిల్ల పెళ్లే వాడికి పెద్ద సమస్యయి కూర్చుంది. 


పిల్లా ఆట్టే చదువుకోలేదు. మరీ సంసారపక్షంగా పెంచింది వాళ్లమ్మ. అన్నిహంగులూ ఉన్నవాళ్ళకే పెళ్లిళ్ళు అవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రెండు మూడు లక్షలన్నా పెట్టలేని వీడికి మంచి సంబంధాలు రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. 


ఎట్లాగయితేనేం పెళ్లి సంబంధం ఒకటి ఖాయమయిందని వాడొచ్చి చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇట్లా అయిందేమిటి?


పెన్షన్ డబ్బులు పూర్తిగా అందలేదు. పెళ్లికని దాచిన డబ్బులో కొంత తీసి కొడుక్కి పంచాయితీ బోర్డులో ఉద్యోగం వేయించాడు. ఇప్పుడు అర్జంటుగా ఓ లక్ష సర్దమని వచ్చి కూర్చున్నాడో రోజు. 


సమయానికి నా దగ్గరా అంత డబ్బు లేకపోయింది. డాబా మీద పోర్షన్ వేయడం వల్ల చేతిలో డబ్బాడటం లేదు. 


' పోనీ.. తెల్సినవాళ్లెవరి దగ్గర నుంచైనా ఇప్పించరా! పెన్షన్ డబ్బు అందగానే సర్దేద్దాం' అని బతిమాలుతుంటే బాధేసింది. 


'ఛఁ! చిన్ననాటి స్నేహితుడి అవసరానికి ఓ లక్ష రూపాయలు సర్దలేకపోతున్నానే!' అని మనసు పీకింది.


ఆ సమయంలోనే తటస్థపడ్డాడు శివయ్య. 


శివయ్య రైల్వే గార్డుగా చేసి రిటైరయ్యడు. అతనికి పెన్షన్ మా బ్యాంక్ ద్వారానే వస్తుంది. మొదట్లో కమ్యూటేషన్, గ్రాట్యుటీ అంతా వచ్చింది కరెక్టేనా కాదా అని లెక్కలు కట్టి చూపించింది నేనే. 


మూడు లక్షలు దాకా వస్తే కొంత ఫిక్సడ్ డిపాజిట్ చేయించాను మా బ్యాంకులోనే. 


నెల నెలా బ్యాంకుకు వచ్చిపోయే మనిషవడం వల్ల పరిచయం కాస్త ఎక్కువే అన్నట్లుండేది పరిస్థితి. 


ఎందుకో, అతనికి నా మీద అదో రకమైన గురి కూడా. డిపాజిట్లు రిన్యూవల్ చేయించుకోడానికి వచ్చినప్పుడెల్లా ఎక్కడెక్కడ ఎంత వడ్డీలు ఇస్తున్నారో విచారించుకుని పోతుండేవాడు. 


ఎప్పటిలా ఆ రోజూ శివయ్య నా దగ్గరికొచ్చి కూర్చున్నాడు. 


'పంతులుగారూ! డిపాజిట్లలో వడ్డీ మరీ తక్కువ వస్తున్నది సార్! ఇంకా మంచిది ఏమైనా ఉంటే చెప్పండి సార్!' అని అడిగాడతను.


అప్పుడు మెదిలింది మనసులో ఆ ఆలోచన. శివయ్య ఏమనుకుంటాడో అన్న తటాయింపు ఉన్నా స్నేహితుడికి సాయం చెయ్యాలన్న తపన నన్నట్లా అడగనిచ్చింది. 


'శివయ్యా! నా కర్జంటుగా ఒక లక్ష కావాల్సొచ్చింది. బ్యాంకు వడ్డీ కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాలే! నెల నెలా ఇస్తాను. రెండు నెలల్లో తీర్చేస్తాను. వీలయితే ఈ లోపే ఇస్తాలే!' అన్నాను.


శివయ్య కాదనలేదు, 'బ్యాంకు వడ్డీ ఇవ్వండిలే సార్! చాలు!' అంటూ ఆ రోజే లక్ష రుపాయలూ డ్రా చేసి ఇచ్చాడు. 


'నోటు రాసిస్తాను' అన్నాను. 'మీ నోటి మాట కన్నా విలువైనదా నోటు? వద్దు' అంటూ కొట్టిపారేశాడు శివయ్య. 


ఒక కాగితం ముక్క మీద మాత్రం రాయించుకున్నాడు. 


'శివయ్య నా మీదుంచుకున్న నమ్మకాన్ని వమ్ము చెయకూడదు' అనుకున్నానా రోజు. అదే మాట రాధాకృష్ణయ్యతోనూ అన్నాను డబ్బిస్తూ. 


'పెన్షన్ రాగానే ముందు ఈ బాకీనే తీరుద్దాం. నీ పరువోటీ,, నా పరువోటీనా? అందాకా నోటు రాసిస్తాను తీసుకో!' అన్నాడు  రాధాకృష్ణయ్య. 


'మిత్రుల మధ్య పత్రాలేమిటి?' అంటూ నేనూ ఆ రోజు కొట్టిపారేశాను. 


ఇప్పుడు విధి రాధాకృష్ణయ్యను కొట్టిపారేసింది. 


ఎంత వద్దనుకున్నా లక్ష రూపాయల విషయం మర్చిపోలేకుండా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య ఇంట్లో ఈ బాకీ సంగతి చెప్పాడో లేదో? చెబితే మాత్రం నోటులేని బాకీని చెల్లుబెట్టాలని రూలేముంది? తన స్నేహం రాధాకృష్ణయ్యతోనే కానీ, వాడి కొడుకుతో కాదుగా!


శాస్త్ర్రులగారబ్బాయి వచ్చి అరుగు మీద కూర్చునున్న నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. 


'ఇంకా మీరిక్కడే కూర్చుని ఉన్నారేంటంకుల్? అవతల వాళ్లంతా మీ కోసం ఎదురుచూస్తుంటేనూ? పదండి పోదాం' అంటూ నన్ను లేవదీసి వాళ్ళింటి వేపుకు తీసుకెళ్లిపోయాడు.


వరండాలో చాపేసి దాని మీద పడుకోబెట్టున్నారు రాధాకృష్ణయ్యను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది వాడి ముఖం. 


'నా బాకీ సంగతేం చేశావురా?' అని ఆడగాలనిపించింది అంత దు:ఖంలోనూ. 


ఆడవాళ్ళు కొందరు ఏడుస్తున్నారు లో గొంతుకతో. 

అప్పటికే బంధువులంతా పోగయివున్నారు. 


రాధాకృష్ణయ్య కొడుకు దుఃఖాన్ని దిగమింగుకొని ఏర్పాట్లు చూస్తున్నాడు. 


నన్ను చూడగానే దగ్గరికొచ్చి కంట తడిపెట్టుకున్నాడు. ఓదార్పుగా వాడి భుజం మీద చెయ్యేసి తట్టేనే గాని నా కళ్లలో మాత్రం నీరు ఊరవా! వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను. 


'ఎట్లా జరిగిందిరా ఈ ఘారం?' 


'రాత్రి వరకు బాగానే ఉన్నారంకుల్! మధ్య రాత్రి  నిద్రలో లేచి అమ్మతో 'గుండెలు బరువుగా ఉన్నాయ'న్నారుట. 


చెల్లెలి పెళ్లి గురించే అలోచించడం వల్లనుకున్నాం. 'అంతా సజావుగా సాగుతుందిలే నాన్నా!' అన్నా ఏదో గుండె ధైర్యం చెప్పడానికి. 


'అంతేనంటావా!' అని మళ్లీ పడుకుండిపోయారు. మళ్లీ ఇక లేవలేదు. తెల్లవారుఝామున గుండెల్లో నొప్పితే మెలికలు  తిరిగిపోతుంటే అర్థమయింది రాత్రొచ్చింది గుండె పోటు ముందు సూచన అని. 


అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఉంటే..' మాట పూర్తవక ముందే గొంతు పూడుకుపోయింది ఆ పిల్లాడికి. 


'పోయే ముందు నీ కేమీ చెప్పలేదుట్రా?' అని అడిగాను ఆశగా. 

తల అడ్డంగా ఊపేడు. 'ఆ అవకాశమే లేకుండా పోయిందంకుల్. అదే బాధ..'


ప్రసాద్ నుంచి వచ్చిన ఆ జవాబుతో ఉన్న ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది.


ఇక్కడ చేరినవాళ్లలో కొంత మంది కూతురు పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోతుందన్న విచారం వ్యక్తపరిచారు. 


విచిత్రంగా నా బాధ మాత్రం వేరేగా ఉంది. నా సొమ్ము సంగతి ఏమిటి? అనేదే నా ఆలోచన. 


వాడూ నేనూ ఇంతప్పటి నుంచి ఒకటిగా తిరిగాం. కాలేజీలు వేరు వేరు అయినా సెలవులకు ఇళ్లకు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఒకళ్లను ఒకళ్లం వదలకుండా లవకుశలకు మల్లే కలిసే తిరిగాం.  ఉద్యోగాల మూలకంగా విడిపోయినా ఇద్దరి మధ్య ఎన్నడూ  ఎడం పెరగలేదు. 


రిటైరయిన వాడు సొంత ఊళ్లో ఉంటే, రిటైర్ మెంటుకు దగ్గరగా ఉన్నందున నేనూ సొంత ఊళ్లోనే పనిచేస్తున్నా. 


ఇప్పుడు విధి మాత్రం మమ్మల్నిద్దర్నీ ఈ విధంగా విడదీసింది. 


పాడె మీద పార్థివ  దేహాన్నుంచి అంత్యక్రియలు ఆరంభించారు. 


ఇంకో పది నిముషాలలో నా ప్రాణస్నేహితుడి రూపం కూడా కంటి కందనంత దూరంగా కనుమరుగయిపోతుంది. 


పచ్చనోట్ల వ్యవహారాన్ని ఎట్లాగైనా మర్చిపోవాలి. 


అందుకు ఒక్కటే మార్గం. వాడిని భుజం మీద మోసుకుంటూ అంతిమస్థలి దాకా అందరితో కలసి నడవడమే! 


వాడు చితిలో కరిగిపోయే దృశ్యం కళ్లారా  కనిపించినప్పుడు కానీ చేదు వాస్తవం మనసు పూర్తిగా జీర్ణించుకోలేదు. 


పై చొక్కా విప్పేసి, కండువా భుజం మీద వేసుకుని తయారవుతున్న నన్ను చూసి శారదమ్మ దగ్గరకొచ్చింది. 'మీ కసలే బాగుండటం లేదు. అంత దూరం మోయగలరా?'


'వాడు నా మీద మోపిన రుణభారం కన్నా ఇది గొప్పదా?' అని అందామనుకున్నా కానీ, అతికష్టం మీద తమాయించుకున్నా.


కట్టుకున్నదానికైనా చెప్పుకోలేని గడ్డు నిజం. శారదమ్మకు ఈ అప్పుగొడవలేమీ అప్పట్లో తెలియనివ్వలేదు. 


అంతిమ యాత్రలో అందరితో కలిసి నడుస్తున్నా ఆగడమే లేదీ పాడాలోచనలు. 


నేనే వృథాగా వర్రీ అవుతున్నానేమో! అంత పెద్ద మొత్తం! తన దగ్గర రుణంగా తీసుకున్న విషయ రాధాకృష్ణయ్య కొడుక్కు చెప్పకుండా ఉంటాడా? పెన్షన్ డబ్బు అందగానే ప్రసాద్ తన బాకీ తీరుస్తాడేమో! 


అట్లా తీర్చని పక్షంలో తానేం చెయ్యాలి? ఒకటా రెండా! వడ్డీతో కూడా కలుపుకుంటే పెద్ద మొత్తమే అవుతుంది. తీర్చాలని ఉన్నా అంతా తీర్చలేడేమో! వాడు అసలు నేనెందుకు తీర్చాలని  అడ్డానికి తిరిగితేనో? 


మిత్రుడి కొడుకు మీద కోర్టుకెళ్లే ఆలోచనే జుగుప్సా అనిపించింది నాకు. 


ఆస్తులు పంచుకున్నట్లే, అప్పులూ పంచుకోవడం కన్నబిడ్డల్లా కొడుకుల బాధ్యత.ప్రసాద్ కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకునే రకం కాదు.. ఇట్లా సాగుతున్నాయి దారిపొడుగూతా నా ఆలోచనలు . 


కర్మకాండల తతంగం ముగిసి బంధుమిత్రులు వెళ్లిపోయి ఇల్లంతా మెల్లిగా  ఆ విషాదానికి సర్దుకునే సమయంలొ .. అదను చూసి అడిగాను ప్రసాదును అక్కడికీ ఆశ చావక 'ప్రసాదు! నాన్న ఇంటి సంగరులెప్పుడూ నీతో చెప్పలేదా?' అని.


'మాట్లాడుతూనే ఉంటారంకుల్! ఇదిగో.. ఈ పెళ్లి తలపెట్టినప్పటి నుంచే మూడీగా మారిపోయారు. సొమ్ము సమకూరదనేమన్నా దిగులేమో! చేసిన అప్పులు తీర్చడ మెట్లాగన్న ఆలోచనా నాన్నగారిని బాగా కుంగదీసింది. సగం ఆ దిగులుతోనే కన్నుముశారేమోనని నా అనుమానం' అన్నాడు ప్రసాద్.


నాకు కొద్దిగా ఉత్సాహం వచ్చింది 'తాను చేసే అప్పుల గురించి ఎప్పుడైనా నీతో చర్చించేవాడా?' అనడిగాను ఆశగా. 


'నోటితో చెప్పలేదు కానీ.. ఇదిగో ఈ డైరీలో రాసి పెట్టుకున్నారు. కొద్ది మందికి అప్పుపత్రాలు రాసినట్లున్నారు. అంతా కలసి ఒక అయిదారు లక్షలు అయినట్లుంది' 


'మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావ్?'


'ముందు చెల్లెలి పెళ్లి పూర్తి చెయ్యాలి. అప్పుడే నాన్నగారికి కన్యాదాన ఫలం దక్కేది. ఆ తరువాత కూడా పెన్షన్ డబ్బులేమన్నా మిగిలుంటే  వీలయినంత వరకు పత్రాలకు సర్దుదామనుకుంటున్నా. మీరేమంటారంకుల్?' 


'మంచి ఆలోచనరా! బాకీలు తీర్చి తండ్రిని రుణవిముక్టుణ్ణి చెయ్యడం కొడుకుగా నీ బాధ్యత కూడానూ! అందరూ  నోట్లే రాసివ్వలేదేమో! చే బదుళ్లూ..'


'మధ్యలోనే తుంచేశాడు ప్రసాద్ 'నోట్లు విడిపించుకోవడమే తలకు మించిన పని. నోటి మాట  బదుళ్లూఎలా తీర్చగలం? అందులోనూ అందమా  నిజమే చెబుతారని గ్యారంటీ ఏంటంకుల్?చనిపోయినవాళ్ల పేరు చెప్పుకుని డబ్బులు దండుకునేవాళ్ళు కోకొల్లలు ఈ కాలంలో! అవన్నీ తీర్చడమంటే నా వల్లయ్యే పనేనా?..


'ప్రసాద్ సమాధానంతో నా నవనాడులూ కుంగిపోయాయి. 


'పోనీ.. ఆ డైరీలోనే నా పేరేమైనా రాసేడేమో! డైరీ చూపించమని ఓ సారి అడిగితే!' నా ఆలోచన నాకే సిగ్గనిపించింది. కానీ, లోపలి మధనను ఆపుకోలేని బలహీనత. 


ప్రసాద్ స్నానాల గదికి వెళ్లిన సందు చూసి అక్కడే టేబుల్ మీదున్న డైరీ తీసి ఆత్రుతగా తిరగేశా. 


ఊహూఁ! ఏ పేజీలోనూ నా పేరే కనిపించ లేదు! 


నాకుగా  నేను  ఆ చేబదులు ఊసెత్తితే ప్రసాద్ నన్ను ఏ కేటగిరీలో చేరుస్తాడో తెలుసు! పరువే ప్రధానంగా గడిపే మధ్య తరగతి జీవిని నేను. 


'లక్ష రూపాయలకు నీళ్లొదులుకోక తప్పదు' అని ఆ క్షణంలోనే ఒక నిశ్చయానికి వచ్చేశాను. 


రాధాకృష్ణయ్య నన్ను తప్పింకుని పోగలిగాడు కానీ, శివయ్య నుంచి నేనెలా తప్పించుకోగలను!


అప్పటికీ సాధ్యమైనంత వరకు శివయ్య కంటబడకుండా ఉండేందుకు ప్రయత్నించాను. 


ప్రసాద్ తండ్రి పింఛన్ సొమ్ము అందుకున్నాడు.  కిందా మీదా పడి చెల్లెలి పెళ్లి అయిందనిపించాడు. పెళ్ళిలో నా భార్య బాగా పూసుకు తిరిగింది. నేనే, మనసు పెట్టి మిత్రుడి కూతురి కళ్యాణ శుభవేళంతా కలవరంతో గడిపేసింది! 


రాధాకృష్ణయ్య పేరు చెవిన పడగానే ముందు లక్ష రుపాయల రుణం కళ్ల ముందు కదలడం నా దురదృష్టం. 


ఆబ్దికాలకు హాజరయి వచ్చిన తరువాత .. వీలయినంత వరకు వాడిని ఊహల్లోకి రానీయకపోవడమే మిత్రుడిగా నేను వాడికి చేయదగ్గ న్యాయం అనిపించింది.


శివయ్య పెట్టిన గడువు రానే వచ్చింది. ఆ రోజు అతను బ్యాంకుకు వచ్చాడు కూడా. కానీ, బాకీ సంగతి హెచ్చరించలేదు! నేనూ నాకై నేను ఆ ఊసు జోలికి పొదలుచుకోలేదు. కానీ, ఎంత కాలమని ఇట్లా?!


నా మీద నమ్మకంతో ఏ నోటూ లేకుండానే  అతి తక్కువ వడ్డీతో అంత పెద్ద మొత్తం అప్పుగా ఇచ్చిన పెద్దమనిషి నుంచి మొహం చాటేసే దౌర్భాగ్య పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నానే! 


'మిత్రుడయితే ఏంటి? అంత పెద్ద మొత్తం అప్పుగా ఇస్తున్నప్పుడు రాధాకృష్ణయ్య దగ్గర నోటు రాయించుకుని ఉండాల్సింది. నా పొరపాటే నా నేటి దౌర్భాగ్య పరిస్థితికి నూటికి నూరు పాళ్లు కారణం' అని అనుకోని క్షణం ఉండటంలేదు ఈ మధ్య కాలంలో!


బ్యాంకు కొచ్చిన మూడో సారి కూడా తన బాకీ  ఊసెత్తని నన్ను అదోలా చూశాడు శివయ్య. 'సారీ శివయ్యా! అనుకున్న టైముకు డబ్బందలేదు. వడ్డీ ఇస్తాను. అసలుకు నోటు రాసిస్తాను.. కాదనకుండా తీసుకో!' అన్నాను.


వడ్డీ పైకం తీసుకుని నోటు తయారుచేయించి తెచ్చాడు. సంతకం చేసి ఇచ్చేటప్పుడు 'వచ్చేనెలలో నా బిడ్డ పెళ్లి  పెట్టుకున్నాను సార్! ఎట్లాగైనా సొమ్ము సర్దాలి' అంటున్నప్పుదు శివయ్య ముఖం చూడలేక నేను  సిగ్గుతో చచ్చిపోయిన మాట నిజం.


శివయ్య ఇప్పుడు బ్యాంకుకొచ్చినా నన్ను కలవడం లేదు. నేను పలకరించినా ముభావమే సమాధానం.


ఓ శుక్రవారం  బ్యాంకు కొచ్చి ఉన్న డబ్బంతా విత్ డ్రా చేసుకున్నాడు శివయ్య. 


నా దగ్గరికొచ్చి 'సోమవారం నోటు తీసుకువస్తాను. ఎట్లాగైనా సొమ్ము చెల్లించాలి. వడ్డీ అక్కర్లేదు. అసలు ఇస్తే అదే పదిలక్షలు!' అని తాఖీదు  ఇచ్చిపోయాడు. 


శివయ్య దృష్టిలో నేను అంతలా పడిపోవడానికి కారణమెవరు? 


రాధాకృష్ణయ్యా? రాబోయే మరణాన్ని వాడేమైనా కలగనలడా? ఆ మృత్యుదేవత రాధాను కాకుండా తననైనా ఎంచుకుని ఉండొచ్చుగా! అప్పుడీ శివయ్య ఏం చేసివుండేవాడు? 


శివయ్యను మాత్రం తప్పెలా పట్టగలను?అంత పెద్ద మొత్తాన్ని స్వల్ప వడ్డీకి ఏ ఆధారం లేకుండా తనకు ధారపోసిన గొప్పవ్యక్తిని ఎట్లా తప్పుపట్టడం? 


ఏ వత్తిడుల కారణంగానో తానిప్పుడు వైఖరి మార్చుకున్నాడో? 


సమయానికి తాను చెసిన సాయాన్ని గురించి సమాచారం లేనందువల్లనే కదా మిత్రుడి కొడుకు ప్రసాదైనా తన చే బదులును లెక్కలోకి తీసుకోనిది? ఇన్ని పాత రుణాలను చెల్లిస్తోన్న అతని మంచి గుణం కేవలం నోటు లేదనే ఒకే ఒక సాకుతో ఎగవేసేందుకు  ఒప్పుకుంటుందా? 


పరిమితికి మించిన నమ్మకాలు, సమాచార లోపాలు.. విధి ఆడించిన నాటకాల కారణంగానే  వ్యక్తిత్వాలు ఇక్కడ ప్రశ్నార్థకాలు అయ్యాయే తప్పించి.. ఆర్థిక బంధాలు మానవీయ సంబంధాలకు మించిన బలమైనవిగా భావించడం సరయిన దిశలో సాగే అవగాహన కాదేమో!  


ఏదేమైనా శివయ్య బాకీ తీరిస్తే గాని, నా మనశ్శాంతి నాకు తిరిగి రాదు. 


ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీతభత్యాల ఎరియర్స్  తాలూకు మధ్యంతర చెల్లింపులకు ఆదేశాలు ఆ శనివారమే వెలువడ్డంతో ఆదివారం అంతా బ్యాంకులో కూర్చుని సిబ్బంది మొత్తం ఉత్సాహంగా ఆ పని చూసుకున్నాం. 


సొమవారం ఉదయానికల్లా అందరి ఖాతాలలో సొమ్ము జమ. 


ఈ సారి ఎరియర్స్ సొమ్ముతో వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకోవాలని శారదమ్మ ఎంతో కాలంగా ఆశతో ఎదురుచూస్తోంది. 


సోమవారం శివయ్య బ్యాంకు వైపుకు వస్తాడనుకున్నాను. రాలేదు! 


మరో రెండు రోజులు చూసి నేనే సొమ్ముతో సహా శివయ్య చిరునామా వెతుక్కుంటూ వెళ్లాను. 


ఇల్లు కనుక్కోవడం చాలా కష్టమయింది. అది  ఒక మురికిపేటలో ఉంది. శివయ్య ఇల్లు చాలా అధ్వాన్నంగా ఉంది. 


తలుపు కొట్టాను. ఒక నడివయసు ఆడమనిషి గడియ తీసింది. 

నన్ను ఎగాదిగా చుసి 'ఎవురు కావాల?' అంది. 


చెప్పాను. 


నిర్లక్ష్యంగా పక్కగది చూపించి వెళ్లిపోయింది.


శివయ్య మంచం మీదున్నాడు. మంచం చాలా మురికిగా ఉంది. 


శివయ్య మొహంలో కళ లేదు. నెలరోజులు లంఖణాలు చేసిన రోగిష్టిమారిలా కనిపించాడు. 


నా పలకరింపులు అయినంత సేపూ డోర్ కర్టెన్ వెనక ఏవో కదలికలు. 


డబ్బు ఇవ్వడానికి బేగులో చెయ్యి పెట్టాను. 


అతను బలహీనమైన చేతితో ఆ పని ఆపుచేయించాడు 'మీ ఫ్రెండు గారి అబ్బాయే వచ్చి ఇచ్చి వెళ్లాడు. నోటు మీకు ఇద్దామనుకునే లోపలే అడ్దంపడ్డాను.' అంటూ పరుపు కింది  దాచుకున్న పత్రాలలో నుంచి ఒక పత్రం ఏరి తీసిచ్చి 'ఇక మీరు వెళ్లవచ్చు' దండం పెట్టేశాడు. 


 ఏదో అడగబోయేటంతలో ఇందాకటి ఆడమనిషి లోపలి కొచ్చింది అనుమానంగా చూస్తూ. 


శివయ్య అటు తిరిగి పడుకుండిపోయాడు. 


అంటే ఇక నేను 'బైటికి దయచేయచ్చు'  అని అర్హ్తమనుకుంటా. 


సవాలక్ష అనుమానాలతో నేను తిరిగివచ్చేశాను. 


ప్రసాదుకు ఈ బాకీ సంగతి తెలుసన్నమాట! 


రాధాకృష్ణయ్య చూచాయగా కూడా చెప్పినటట్లు  లేదే! 


ప్రసాదుతో మాట్లాడితే గాని విషయాలు తేలవు. 


చికాకు కారణంగా నేను ఆ దిక్కుకు పోవడమే మానేశాను. 


పాడు డబ్బు పితలాటకం మూలకంగా ప్రాణస్నేహితుడి కుటుంబానిక్కూడా దూరమయిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. 


వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో  నేను ఆ కుటుంబానికి రాధాకృష్ణయ్యలాంటి వాడిని. ప్రసాద్ ఎన్నో సార్లు సలహా కోసరంగాను తన దగ్గరి కొస్తుండేవాడు. 


తన ముభావం  కారణంగా రాకలు తగ్గించేశాడు. 


నేను ప్రసాద్ ను కలవడానికి బైలుదేరుతుంటే శారదమ్మ అన్నది నిష్ఠురంగా 'ఆ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ లేడుగా! కొత్త బావగారు తనకు దుబాయ్ లో కొలువిప్పించాడు. ఆ సంగతి చెప్పడానికని ఎన్ని సార్లు వచ్చినా మీరు  మొహం చాటేశారు.. మహగొప్పగా!'  


నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. 


అయిందేదో అయింది. ముందీ డబ్బు మిస్టరీ తేలాలి. 


శారదమ్మ ద్వారా ప్రసాద్ దుబాయ్ చిరునామా సేకరించి ఇంత పెద్ద ఈ మెయిల్ పంపించాను. 


ఫోనులో నేరుగా మాట్లాడవచ్చు. కానీ, అత్మాభిమానం.. అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడనీయదు: 


చే బదులు విషయంలో ముందు  నుంచి జరిగిందీ.. తరువాత నా ప్రవర్తనా..  అందుకు కారణాలు గట్రా అంతా ఓ సోదిలా వివరించి.. చివరగా శివయ్య బాకీ తీర్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియచేశా. 


తెల్లారే సరికల్లా ప్రసాద్ నుంచి తిరిగు మెయిల్! 


'ఆ శివయ్య ఎవరో నాకు తెలీదు  అంకుల్! నేను అతనికి డబ్బిచ్చిందేమీ లేదు! నాన్నగారు అలా మీ ద్వారా అతని దగ్గర్నుంచి అప్పు తీసుకున్నట్లు నాకు ఎప్పుడూ చెప్పను కూడా చెప్పలేదు. ఆ సంగతి ఇదిగో ఇప్పుడు మీ ఉత్తరం అందిన తర్వాతనే తలిసింది. అందరి అప్పులూ తీర్చేశాను. ఈ ఒక్కటి మాత్రం ఎందుకు? ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. తండ్రిని రుణశేషుణ్ణిగా మిగల్చడం కన్నబిడ్డకు భావ్యం కాదని మీరే అంటారుగా! అమౌంట్ పంపుతున్నా! దయచేసి అతని బాకీ అణా పైసల్తో సహా తీర్చేయండి!'


ప్రసాద్ పంపిన డబ్బు అందిన తరువాత బలవంతంగానైనా శివయ్యకు ఆ డబ్బిచ్చెయ్యాల్సిందేనని వెళితే .. అంతకు మూడు రోజుల కిందటే పోయినట్లు తెలిసింది. 


కొడుకు జులాయిట. ఎక్కడి డబ్బు పేకాటకు పోస్తుంటే .. అడ్డొస్తున్నందుకు దుడ్డు కర్రతో బుర్ర రాంకీర్తన పాడించాడుట! 


అప్పటికి తిరిగొచ్చినా శివయ్య సొమ్ము నా దగ్గరుంచుకో బుద్ధేయలేదు. 

అతని కష్టార్జితాన్ని సద్వినియోగం చేయడమెట్లాగా అని మధన పడుతుంటే.. మాటల సందర్భంలో బాకీ అడిగిన రోజు శివయ్య చేసిన పెద్దల వెల్ ఫేర్ సెంటర్ల ప్రస్తావన గుర్తుకొచ్చింది.


నాకు తెలిసిన ఓల్డేజ్ హోమ్   కు శివయ్య పేరున ఆ పెద్ద మొత్తం శాశ్వత విరాళం కింద ఇచ్చిన తరువాత గాని మనసుకు శాంతి లభించింది కాదు. 

***

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)







'








 

 

 

'

 

 

'

Sunday, February 28, 2021

జీవితం విలువ – పెద్ద కథ -రచనః కర్లపాలెం హనుమంతరావు


కథ 

జీవితం విలువ 

రచన: కర్లపాలెం హనుమంతరావు 


'క్లిక్' మంటూ ఇన్ కమింగ్ కాల్ సౌండొచ్చింది . తీసి చూశాడు సుందరం. 'ఇంకో గంటలో నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోబోతున్నాను. నా చావుకు అనితే బాధ్యురాలు- సురేష్ ' అని మెసేజ్ . 


సుందరం షాక్!


'ఎవరీ సురేశ్? ఫ్రెండ్సులో  ఎవరూ లేరే!’


ఆఫీసు చేరి సీట్లో సర్దుకోక ముందే  బాస్ నుంచి పిలుపు! తిరిగి  సీట్లో కొచ్చి పడే వేళకు గోడ మీది గడియారం పదకొండు గంటలు  బాదింది.


మళ్లీ సెల్ బైటికి తీశాడు సుందరం. మెసేజ్ వచ్చి మూడు గంటలు దాటింది. ఈ పాటికి ఆ సురేష్ అనే అభాగ్యుడెవడో ..! 


' ఇప్పుడేం చేసీ లాభంలేదు.. జరగాల్సిందేదో జరిగిపోయుంటుంది ' .  మెసేజ్ డిలెట్ చేసి.. పనిలో  పడిపోయాడు సుందరం.

***


నర్మదా నర్శింగ్ హోం.


సెకండ్ ఫ్లోర్ లేబర్ రూము నుంచి మూలుగులు. లోపల సర్జరీ జరుగుతోంది కూతురికి .  ఆ టెన్షన్లో ఉన్న పురుషోత్తమరావుగారి . 

సెల్ కి మెసేజ్ వచ్చింది.


'ఇంకో గంటలో నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోబోతున్నాను. నా చావుకు అనితే బాధ్యురాలు- సురేష్ '.. అని  మెసేజ్!


పెద్దాయన గుండె గతుక్కుమంది. ' ఎవడీ సురేష్? అనిత అంటే వాడి పెళ్లామా? ఇప్పుడేం చెయ్యడం?' అన్న ఆలోచనలో ఉండగానే 

' మగబిడ్డ! తల్లీ.. బిడ్డా సేఫ్' అని కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోయింది డాక్టర్ .


'అంటే.. మనింట్లో ఇంకో సురేష్ పుట్టాడన్న మాటే' అంటూ  సంబరపడిపోతున్న భార్య వంక ఉలిక్కిపడి చూశారు పురుషోత్తమరావుగారు. అల్లుడుగారు చనిపోయిన తన తండ్రిగారి పేరు మీద పెట్టుకోవాలని ముచ్చట పడిన పేరూ కాకతాళీయంగా ' సురేష్ ' . 


సెల్  వంక చూసి 'సురేషా ? వద్దొద్దు! ఆ పేరొద్దు!'అంటూ వచ్చిన మెసేజ్ ని డిలెట్ చేసారాయన ..సెంటిమెంటల్ గా  .   

***


బైట బైక్ స్టార్టయిన చప్పుడు. పిల్లలిద్దర్నీ బళ్లలో డ్రాప్ చేసేందుకని  వెళ్లే భర్త గంగరాజు వంక  మురిపెంగా చూసి స్నానాల గదిలోకి దూరింది సుమతి. 


గంగరాజుది పోలీస్ డిపార్ట్ మెంట్. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ . పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాన్ని  తరలించాడు కాదు .     గంగరాజే వీలున్నప్పుడల్లా ఇటు వైపు వచ్చిపోవడం.

భర్త వచ్చిన  ప్రతిసారీ ఏదో కొత్త అనుభవమే సుమతికి !


స్నానం కానించి గదిలో బట్టలు మార్చుకునే టైములో సుమతి  సెల్ ఫోన్ 'క్లిక్' మంది. చూస్తే అదే సందేశం! 'ఇంకో గంటలో నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోబోతున్నాను. నా చావుకు అనితే బాధ్యురాలు- సురేష్'! 


' ఎవరీ సురేష్ ? తనకెందుకీ మెసేజ్ వచ్చినట్లు ?! ' 

సుమతి కళ్లు  గిర్రున తిరగాయి. తూలిపడబోయి తమాయించుకుంది.


బైట బైక్ ఆగిన చప్పుడు! డోర్ తీసుకుని ఎప్పుడు గదిలో కొచ్చాడో.. అమాంతం వెనక నుంచి సుమతిని  గాఢంగా కౌగలించుకున్నాడు గంగరాజు. భార్య మూడీగా ఉండటం చూసి అనుమానంగా అడిగాడు ' ఎనీ ప్రాబ్లమ్ ? ' 


'ఏం  లేదండీ!' అని మాత్రం అనగలిగింది సుమతి అతి కష్టం మీద. 


గోడ మీది గడియారం పన్నెండు గంటలు బాదిందాకా గంగరాజు హుషారును తట్టుకోడంతోనే సరిపోయింది  సుమతికి . భర్తతో ప్రేమగా  గడపడం  ఓ వంక ఆనందంగానే  ఉన్నా.. మరో వంక ఆ మెసేజ్ వల్ల గిల్టీగా కూడా ఉందామెకు.


గోడ మీది గడయారంలోని పెండ్యులంలా అమె మనసూ అటూ ఇటూ ఊగిసలాడులోంది  అదే పనిగా..

***


సుమతి , పురుషోత్తమరావుగారు, సుందరం .. వీళ్లెవ్వరూ ఎరగని ఆ సురేష్.. వయసు ఇరవై రెండు. చదువు బి.కాం.. సెకండ్ క్లాస్. ప్రస్తుతం వోడాఫోన్  సేల్స్ మార్కెటింగ్ లో పని. ఊరు కోదాడ. పుట్టి పెరిగిన ఊళ్లను వదిలి బతుకుతెరువు కోసం భాగ్యనగరం రోడ్లను పట్టుకు వేలాడే వేలాది మంది యువకుల్లో అతగాడూ ఒకానొకడు.


'మంచి రోజులసలొస్తాయా ?' అనుకుంటో కృష్ణానగర్ సందుల్లో పందుల కొష్టాల్లాంటి టెన్ బై ట్వల్వ్ రూములు పదింటి  మధ్య తనూ  ఓ దానిలో పడి ఏడుస్తో పాడు రోజుల్నీడ్చే రోజుల్లో.. 


ఓ రోజు ఆదివారం సాయంత్రం .... కృష్ణకాంత్ పార్క్ బైట మెట్ల మీద చేరి దారే పోయే అమ్మాయిల వంక అరాధనగా చూసుకుంటూ సౌందర్యోపాసనచేసే  వేళ..


దడ.. దడ.. దడ.. మేఘాలకు పిచ్చ మూడ్ వచ్చినట్లు ధారాపాతంగా ఒకటే కుండపోత!


వాన వెలిసింది మరో పది నిముషాలల్లో!


పార్క్ గేటు ముందు వర్షానికి తడిసిన స్కూటీ  ఎంతకూ  స్టార్టవక తంటాలు పడుతున్న ఓ అమ్మాయి .. సాయం కోసం చుట్టూతా చూసి చేయెత్తి దగ్గరకు రమ్మంటూ పిలిచింది సురేష్ ని!  గాలిలో తేలుకుంటూ వెళ్లాడు.. సురేష్!


‘సైలెన్సర్లో నీళ్ళు నిండాయి. అందుకే  బండి ఒక పట్టాన స్టార్టవడంలేదం’టూ.. చెక్ పోస్ట్ దాకా నెట్టుకుంటూ తీసుకు వెళ్ళాడామె బండిని సురేష్  ఆమె ఎంత  ‘వద్దు.. వద్ద’ని మొత్తుకుంటున్నా. 


ఈ దారిలోనే మాటలు కలిశాయి ఇద్దరికీ . 


ఆమె పేరు అనిత  . తను ప్రతీ సండే అలాగే పార్కుల్లో తిరుగుతూ . . ప్లాస్టిక్ బ్యాగుల వల్ల ఎంత ప్రమాదమో జనాలకు  వివరంగా చెప్పి వాటికి బదులుగా వాడమని పేపర్ బ్యాగులు ఉచితంగా పంచిపెట్టే టైపు  ప్రజాసేవ గట్రా చేస్తుంటానని తనే చెప్పకొచ్చింది .. ఏమీ అడక్కుండానే. 


'ఎందుకిదంతా?' అయోమయంగా అడిగాడు సురేష్.


'ప్లాస్టిక్ వస్తువులలో ఎన్నటికీ నశించిపోని ఒక రకమైన దుర్గుణం ఉంది. ఆ పదార్థాల తయారీని మనం అలాగే పెంచుకుంటూ పోతే భూమ్మీదొక నిర్జీవమైన పొర ఏర్పడి జీవులన్నీ క్రమంగా నశించిపోడం ఖాయం' అందామె.


'ఎన్నాళ్లకూ?'


'దాదాపు ఇంకో రెండు మూడు వందల ఏళ్లకు'


నవ్వొచ్చింది సురేష్ కు. 'ఓహ్! అప్పటి దాకా మనం బతిగుండం కదా? ఆ భయంతోనా మీరిప్పుడు ఇట్లా వానలో స్టార్ట్ కాని బండిని తిప్పుకుంటూ తిప్పలు పడుతున్నదీ?' అన్నాడు జాలిగా.


'ఒన్ మినిట్ ప్లీజ్! యాక్చువల్ గా వానలో పూర్తిగా తడిసింది మీరు. బండిని నెట్టుకుంటూ తిప్పలు పడుతున్నది కూడా మీరే!' అని గలగలా తిరిగి నవ్విందా అమ్మాయి.


ఐనా వెంటనే సీరియస్ అయిపోయి క్లాస్ పీకింది 'మన మంచి కోసం మాత్రమే మనం చేసుకోవాలని రూలెక్కడైనా రాసుందా చెప్పండి ?మీ లెక్కన .. ఇదిగో ఈ కొబ్బరి చెట్టు ఉంది కదా ఇక్కడ! దీని మట్టల్ని మాత్రమే మీరు బట్టల మాదిరి చుట్టుకుని తిరుగుతుండేవాళ్లు ఇప్పటిక్కూడా. టెర్లిన్సు, జీన్సు, గుడ్డూ గూసూ అంటూ కొత్త కొత్త గూడ్సు  కనిపెట్టుకు ఎంజాయ్ చెయ్యడమెందుకు? మన జీవితం మరింత సౌకర్యవంతంగా ఉండాలన్న యావతోనే కదా! ఎప్పటికప్పుడు ఏవేవో కొత్తవి  కనిపెట్టాలని కోరికే లేకపోతే కోతులకూ మనకూ తేడా ఏముంది?' అంది మళ్లీ గలగలా నవ్వుముత్యాలు  నడిరోడ్డు మీదనే  వెదజల్లేస్తూ! ఆ నవ్వులు  ఆ కోదాడ కుర్రాడికి భలే నచ్చాయి. ఆమె  మాటల్లోని అంతరార్థం కన్నా ఆమె తనతో అంత చొరవగా మాట్లాడడం మరీ నచ్చింది. 


ఇద్దరి మధ్యా అట్లా మొదలయిన  పరిచయం క్రమంగా స్నేహంగా ముదిరి పాకాన పడింది. 


 అనిత ఎక్కడుంటే అక్కడే సురేష్ ఇప్పుడు  ! అనితకు నచ్చదని సిగిరెట్లు తాగడం మానేశాడు. సెకండ్ షోలకని, క్రికెట్ మ్యాచ్ ల కని సమయాన్ని వృథా చెయ్యడం తగ్గించి, బ్యాంకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం శ్రద్ధగా ప్రిపేరవుతున్నాడు. కోదాడలో కామర్స్ టీచరు కొట్టి కొరతేసినా  చెయ్యనిది, సెలవులకని ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి తల బాదుకున్నా  లొంగనిది , ఇప్పుడు అనిత నోటితో చెప్పకపోయినా చేసేస్తున్నాడు. 


రెండు బ్యాంకు పరీక్షలు ఇప్పటికే ఇచ్చేశాడు. ఒకటి ఇంటర్వ్యూ దాకా వచ్చి..  పోయింది. ఇంకోటి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. రిజల్ట్స్ కోసం వెయిటింగ్!


మంచి జాబ్ చేతిలో ఉంటే 'మనం పెళ్లి చేసుకుందాం' అని అనితను ధైర్యంగా అడగవచ్చన్నది సురేష్ ధీమా. 


 'అంతకన్నా ముందు అసలు ఆమె నిన్ను ఇష్ట పడుతుందో లేదో తెలుసుకోరా! అదీ  ముఖ్యం!' అని  సలహా ఇచ్చాడు రమేష్.


రమేష్ సురేష్ కు వరసకు మేనబావ. అనిత జీవితంలోకి రాక మునుపు అనిత కన్నా ఎక్కువ క్లోజ్.


రెండు రోజుల తంటాలతో  తయారుచేసిన    తన లవ్ లెటర్స్ రెండు మూడు అందుకున్న తరువాత ఆమె నుంచి వచ్చిన రెస్పాన్స్ చచ్చే ఆశ్చర్యం కలిగించింది   సురేష్ కి. 


లేత వయసులో ఏ ఆడపిల్లయినా మరీ ఇంత పచ్చిగా మాట్లాడేస్తుందా! ‘ఈ లవ్ లెటర్లు.. రక్తాలతో రాయడాలు ఇవన్నీ..  ఐ డోంట్ లైక్ సురేష్! ఏదైనా మనసులో ఉంటే ఒకళ్లతో ఒకళ్లం పంచుకోడానికి సంకోచమెందుకు! ఇదేమైనా ఇంకా సెన్సారు కాని బ్లూ ఫిలిం తాలుకు రీలు ముక్కా? చాటు మాటుగా ఇట్లా పేపర్ల మీద రాసుకోడాలేంటీ? ఇవాళ మన ఈడు అబ్బాయిలు, అమ్మాయిలు  ప్రేమ పేరుతో ఖరాబు చేసే కాగితాలను గాని సక్రమంగా వినియోగిస్తే, వనరులు లేక మధ్యలో చదువులు ఆపేసిన  వెనకబడి ఉండే ప్రాంతాల్లోని పిల్లలు  ఎంతో మందికి ఉచితంగా టెక్శ్ట్ బుక్కులు, నోట్ బుక్కులూ తయారవుతాయి ..  తెలుసా' అనేసింది. అవాక్కయిపోవడం సురేష్ వంతయింది.


సామాజిక పరంగా   ఆలోచించడం    సమంజసమే కావచ్చు  కానీ మరీ పీల్చే గాలికీ దాన్ని   ఆపాదించటం   వెర్రితనం అనిపించుకుంటుంది.  సురేష్  మనసులో అలా ఈసడించుకొన్న క్షణాలు లేకపోలేదు .


 'ఆఁ! అదంతా వయసు వేడిలో పడే  ఆవేశమే కాని,   పెళ్లయి ఓ సంసారమంటూ ఏర్పడ్డ తరువాత  మొగుడూ పిల్లలే లోకంగా తయారవుతారీ   ఆడపిల్లలంతా! ముందా బ్యాంక్ ఉద్యోగమేదో ఖాయం కానీ, నేరుగా పెద్దాళ్ల చేతనే వాళ్ల పెద్దాళ్లతో మాట్లాడిస్తా!’ అని సర్దిచెప్పుకొంటాడప్పుడు సురేష్ . 


ఉద్యోగం రావడమూ అయింది; తన  దూరపు చుట్టాన్నెవర్నో వెంటబెట్టుకొనెళ్లి అనిత నాన్నగారిని అడగటమూ  అయింది.


'పిల్లదాని ఇష్టం ముఖ్యం . అమ్మాయిని అడిగి చెప్తా .. ఓపిక పట్టండి' అని అడ్రస్ తీసుకున్నాడా పెద్దాయన.


ఆవెంటనే  కథ క్లైమాక్సుకి వచ్చేసింది. సురేష్ ఉండే గదికి భద్రకాళిలా వచ్చిపడింది   అనిత. 


ఆటైంలో  టీ.వీలో ట్వంటీ ట్వంటీ  మ్యాచ్ నడుస్తోంది. వంటరిగా ఉన్న సురేష్ ను తగులుకుంది అనిత 'నన్నే పెళ్లి చేసుకోవాలని  ఎందుకురా అంత కుతి? నీతో క్లోజ్ గా మూవయ్యాననా? ఆ లెక్కన నాకు రోజుకో పెళ్లవాలిరా బేవకూఫ్! అసలు మన మధ్య మాటి మటికీ ఈ పెళ్లి ప్రస్తావనలు ఎందుకొస్తున్నాయో.. ఐ కేంట్ జస్ట్ అండర్ స్టాండ్! మన ఫ్రెండ్షిప్పులోనే ఏదో లోపమున్నట్లుంది  . నిన్నెప్పుడైనా నేనా విధంగా రెచ్చగొట్టానా? నెవ్వర్ !  మరి నువ్వట్లా  పిచ్చిగా ఎందుకు ఊహించుకొన్నావ్ ?  .. సారీ! నీతో మ్యారేజ్ పేరుతో  నాకింత పెద్ద నరకం చూపించాలనుకోవద్దు! ప్లీజ్!'


'పెళ్లి.. నరకమా?!'


'మల్లె తీగను ముళ్ల డొంకలో పొర్లిస్తే బతుకుతుందనేనా! నీకూ నాకూ  మ్యారేజంటే అట్లాగే ఉంటుంది లైఫ్. నీకెందుకర్థం కావడం లేదో నాకర్థం కావడంలేదు'


'ఎందుకట్లా  అనుకుంటున్నావు అనితా?'


'అడిగావు కాబట్టి చెబుతాన్రా! విని అర్థం చేసుకో జ్ఞానముంటే ! మన నారాయణగూడ చెరువు పక్కనే  పదేళ్ల నాటి మామిడి చెట్టొకటుంది  నీకు తెలుసో లేదో.. మీ వోడాఫోనాఫీసు  పై నుంచి చూసినా క్లియర్ గా కనిపిస్తుంది. ఎలక్ట్రిసిటీ  డిపార్టువాళ్ళిప్పుడు దాన్ని  కుదుళ్లతో సహా పడకొట్టాలనే ఆలోచనలో ఉన్నారు  ..   వాళ్ల వైర్లకు  అడ్డమొస్తుందని. పచ్చని చెట్టు! ఏ జీవమైనా  నిస్సహాయంగా  చావడానికి లేదనే కదా మా పోరాటం! కోర్టు కేసైంది. చెట్టును  అక్కణ్ణుంచి తరలించే కండిషన్ మీద కోర్టు రెండు వారాలకు  స్టే ఇచ్చింది.'   


'అంత పెద్ద చెట్టును అట్లా కూకటి వేళ్లతో  సహా పెకిలించెయ్యడం ఎలా సాధ్యం? కష్టపడి ఆ పని చేసినా చెట్టు మళ్లా బతుకుతుందా ?' 


సురేష్ ఆ ఆలోచనలో ఉండగానే 'నువ్వే మాలోచిస్తున్నావో నాకు తెలుసు ! నీ లాంటి మనిషికి అంతకు మించి గొప్ప ఆలోచనలేమొ స్తాయ్  గాని,  ముందు.. విను! భూమి నుంచి విడిపోయిన గంట లోపలే  వేరుకు మరో అనువైన నేల పొర దొరికితే చెట్టు బతికే అవకాశముందని ,  సైంటిఫిక్ గా ఎప్పుడో ప్రూఫ్ అయింది. ఆ  భారీ కార్యక్రమానికి  ముంబయ్ నుంచి ఎక్స్ పర్ట్స్ ఎలాగూ వస్తున్నారు . అయినా .. వాలంటీర్ల  సాయం అవసరం. టైమాట్టే లేక.. అంత మంది వాలంటీర్లను   ఇంత షార్ట్ పీరియడ్లో   మొబిలైజ్ చేసుకొనే టెన్షన్ లో మేముంటే ..  ఆ ట్రైంలో తమరేం చేస్తున్నారు ..  మై డియర్ ది బెస్ట్ ఫ్రెండ్ సురేష్ గారూ?'


సురేష్ షాక్! తేరుకొని 'ఇదంతా నాకు తెలీదు అనితా!' 

అతగాని సంజాయిషీ ఇవ్వబోతే పడనిచ్చింది కాదామె. 


 'కానీ నాకంతా తెలుసులేరా  నీ గురించి. ఎగ్జాట్లీ అదే రోజు  తమరిదే గదిలో  నా కోసం రక్తంతో లవ్ లెటర్స్ ప్రాక్టీస్  చేస్తోన్నారు. తమరి  కోసం పంపించిన మనుషులు ఇంకా చాలా చాలా చెప్పారు నీ  తింగరి వేషాల గురించి!' 


గతంలో రమేష్ రాసి పడేసిన లవ్ లెటర్స్ బొత్తి పర్శు నుంచి తీసి అతని మొహాన కొట్టింది అనిత. 


సురేష్ మొహం ఎర్రబారింది. 'నిన్నుప్రేమించి నీ కోసం లవ్ లెటర్స్ రాయడం కూడా నేరమే? నాకు తెలిస్తే నేనూ నీ ఫ్రెండ్స్ లా వెంట రానా?' 


'వస్తావులే. నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి నువ్వేమైనా చేసేందుకు రడీ !  నాక్కావల్సింది అదా మిస్టర్? 'చీఁ! నీకు ప్రాణం విలువేంటో  తెలీదు. వేరే జీవి దాకా ఎందుకు..అసలు నీ జీవితం విలువే  నీకు తెలీదు.   ఆ బ్లడీ  లెటర్స్ అందిన  రోజునే గట్టిగా చెప్పాలనుకున్నా   ఈమాట! మీ అమ్మ సంగతి తెలిసి.. నీ చెల్లెలి జబ్బు సంగతి తెలిసి.. సైలెంటయిపోయా! ఓ నోరు లేని చెట్టునే ఎవరో  కొట్టేసుకుని పోతుంటే విలవిలలాడే మెంటాలిటీ నాది. సొంత చెల్లెలు చావు బతుకుల మధ్యుండే రోగంతో  ఏళ్ల తరబడి తీసుకుంటున్నా  సంపాదించే స్తోమతుండీ  తల్లి కన్నీళ్లనైనా పట్టించుకోని   పచ్చి  స్వార్థం నీది. నీ కుటుంబం కథంతా ముందే తెలుసు కాబట్టి  ఇంత కాలం నువ్వెంత  వెకిలివేషా లేసినా పళ్ల బిగువున భరించా! పోనీలే .. నా మూలకంగా అయినా ఒక కుటుంబం నిలబడుతుందేమోనన్న ఆశతోనే నిన్నా బ్యాంక్ టెస్టులు రాయమని ప్రోత్సహించింది . ఇంత చేసినా నువ్విప్పుడేం  చేస్తున్నావ్? గట్టి సంపాదన వచ్చే సూచన కనిపించగానే  మీ పెద్దాళ్ల ద్వారా నన్ను మళ్లీ నీతో పెళ్లి ఊబిలోకి దింపాలని  చూస్తున్నావ్! నువ్వు నాకు ఓ మామూలు ఫ్రెండువి  మాత్రమే అనుకున్నానిప్పటి దాకా! ఆ గౌరవం కూడా పోగొట్టుకునేలా బిహేవ్ చేస్తున్నావ్!..' 


'నువ్వు లేకుండా నేను బతకలేను అనితా!' బావురుమన్నాడు సురేష్.


'షటప్! ఈ బతకడాలు, చావడాలు, బెదిరించడాలు, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడాలు.. జస్ట్ ఐ హేట్ దెమ్ టోటల్లీ! నేను లేకపోతే నువ్వు బతకలేవా? హౌ సిల్లీ ఇట్ సౌండ్స్?! ఇదిగో.. ఇప్పుడు నువ్వు చూస్తున్నావే ఈ డొక్కు మ్యాచ్.. ఇదీ  ఇంకో రెండు గంటల్లో ఫినిషైపోతుంది. ఇప్పుడు నువ్వు పడే టెన్షన్ .. ఐ మీన్ .. మీ కుర్రాళ్ల భాషల్లో థ్రిల్లంటారు  కాబోలు.. అంతటితో  ఫేడవుటయిపోతుందిరా. నువ్వు లవ్వు  అనుకుంటున్నావే .. అదీ ఇలాంటిదే ! డోంట్ వేస్ట్ యువర్ ప్రిషియస్ టైం ఇన్ దీజ్ సిల్లీ రబిష్ థింగ్స్!' అని విసురుగా లేచింది అనిత.


'ఇదే నీ ఆఖరి మాటా?' తనూ రోషంగా లేచి నిలబడ్డాడు సురేష్. అతగాడి కళ్ల నిండా నీళ్లు.


షూస్ వేసుకుని బైటికి వెళ్లబోయే ఆమె దారికి అడ్డంగా నిలబడి బిగ్గరగా అరిచాడు పిచ్చెత్తినట్లు. 'ఈ మ్యాచ్ అయ్యేలోపు నువ్వు తిరిగొచ్చి నాకు సారీ చెప్పాలి. 'ఐ విల్ మేరీ యూ!' అని చెప్పాలి. అదర్ వైజ్.. అదర్వైజ్ .. నేను సూయిసైడ్ చేసుకోడం ఖాయం'


'బెదిరింపా? అదీ చూద్దాం. రోజూ మీడియాలో ఎన్ని ఆత్మహత్యలు చూడ్డంలే! ఉద్యోగం ఊడిందనో, పరీక్ష పోయిందనో, మంచి ర్యాంక్ మిస్సయిందనో, మొగుడి మీద అలిగో, పెళ్లాం మీద డౌటుతోనో..   సిల్లీగా ఎంతెంత మంది గొంతులకు ఉరేసుకోడంలా! వంటి మీద గ్యాసు నూనె పోసుకుని అంటించేసుకుంటే ఏమవుతుందంట? మరో వార్త దొరికిందాకా సంచలనం కింద వాడుకోడానికి మీడియాకు పనికొస్తుంది.. దట్సాల్! నీకు నేనిచ్చే లాస్ట్ అడ్వైజ్  ఇదొక్కటే యాజ్ ఏన్ ఓల్డ్  వెల్ విషర్ గా .. డోంట్ థింక్ సచ్ నేస్టీ థింగ్స్ ! గుడ్ బై ఫరెవర్.. ఎవర్ అండ్  ఎవర్!' విసురుగా వెళ్లిపోయింది అనిత.


ఎప్పుడొచ్చాడో రమేష్.. ఓ మూల రాతి బొమ్మలా నిలబడి ఉన్నాడు.


మ్యాచ్ అయిపోయింది. యువీ డబుల్ సెంచరీ బాదినా అనుకున్న టీం గెలవలేకపోయింది.  


అనిత తిరిగి  రాలేదు.

---


సాయంత్రమనగా బైటికి వెళ్లినవాడు అర్థరాత్రి గానీ రూముకు  రాలేదు  సురేష్ . వస్తూ వస్తూ రెండు ఫుల్  మందు బాటిల్స్, ఇంకేదో ప్యాకెట్ వెంట తెచ్చుకున్నాడు. 


రమేశ్ రాత్రంతా ఎంత సముదాయించినా ఆ  మనిషి వినే మూడ్ లో లేడు.

---


తెల్లారి ఎనిమిది దాటింది. అయినా సురేష్ పక్క మీద నుంచి లేవనేలేదు. 


రమేష్ ఒక్క నిమిషం ఆలోచించాడు. సురేష్ సెల్ అందుకుని టక టకా మెసేజ్ టైప్ చేశాడు 'ఇంకో గంటలో నేను ఈ లోకం నుంచి  శాశ్వతంగా సెలవు తీసుకోబోతున్నాను. నా చావుకు అనితే బాధ్యురాలు- సురేష్ 'అంటూ ఇంగ్లీషు లిపిలో! 'ఎల్లో పేజెస్'   సైట్ లోకి వెళ్లి రేండమ్ గా  కొన్ని నెంబర్లు  టిక్ పెట్టి 'సెండ్' బటన్ నొక్కాడు. అన్నిటికీ 'మెసేజ్ సెంట్' అని వచ్చిందాకా వెయిట్ చేసి బైక్  బైటకు తీసి డ్యూటీకని  వెళ్లిపోయాడు రమేష్  .


టైమ్ అప్పటికి ఉదయం  ఎనిమిది ముప్పావు!

---

 

సురేష్ సూయిసైడ్ సమాచారం  పోలీసులకు అందించి వాడిని   ప్రాణగండం నుంచి కాపాడొచ్చు . జీవితం విలువ అర్థం కాని ఎవరినైనా ఎన్ని సార్లని ఎవరు దగ్గరుండి రక్షించగలరు? పోలీసుల నిర్దాక్షిణ్య  విచారణ, మీడియా అత్యుత్సాహపు  ' రేటింగుల పోటీల' కారణంగా  అన్యాయంగా  అనిత పేరు అల్లరిపాలవడం  తనకు బొత్తిగా ఇష్టం లేదు. సమాజానికి సేవలు ఎప్పుడెప్పుడు అందిద్దామా అని అనుక్షణం అవకాశాలకై పరితపించే మంచి వ్యక్తులు క్రమేపీ తరిగిపోతోన్న ప్రస్తుత సంక్షోభ తరుణంలో అనిత వంటి అరుదైన వ్యక్తుల జీవితాల విలువ  తనకు తెలుసు. 


సాటి వ్యక్తి నిండు ప్రాణం తీసుకునే సమాచారం ముందుగా అందినా  సమాజంలోని సాధారణ పౌరులు సామాన్యంగా  స్పందించరు. ఎవరి  బతుకు పోరాటంలో వారుంటారు . ఆ సంగతి తనకు తెలుసు . సురేష్ వంటి దుందుడుకు యువతకే  తెలీటం లేదు. అట్లాంటి వాళ్లకి తెలియాల్సుంది . అప్పుడే వారి దృక్పథం జీవితం పట్ల సానుకూలంగా మారే అవకాశం. 


ఆ సదుద్దేశంతోనే తను చివరి అవకాశంగా సురేష్  సెల్నుంచి ఆ  'సూయిసైడ్ ప్రయత్నాన్ని '  సూచిస్తూ  అంతమందికి మెసేజ్ పెట్టింది. ' అనుకున్నాడు బైక్ మీద పోయే రమేష్! 


***


రమేష్ అనుకున్నట్లే  సుందరం, పురుషోత్తమరావుగారు వంటి ఇంకెందరో  తమతమ  కారణాల వల్ల సమయానికి స్పందించనే లేదు. 


కానీ, ఒక్కోసారి అసాధ్యమనుకొనే సంఘటనలే తెలియని ఏ కారణాల వల్లనో సుసాధ్యమవుతాయి. ప్రస్తుతం  అట్లాంటి అద్భుతమే జరిగింది. కాబట్టే సురేష్ జీవితం   విషాదంతో ముగిసి పోకుండా అనూహ్యమైన మలుపు తిరిగింది  . 


తన  లోపల నుంచి తన్నుకొచ్చే అపరాధ భావనకి  ఎదురు నిలబడలేక పోయింది సుమతి.  తన సెల్ కు వచ్చిన సురేష్ సూయిసైట్ మెసేజి విషయం భర్త గంగరాజుకు  తెగించి చెప్పేసింది . సమయానికి అందిన ఆ సమాచారంతో  స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని ఎలర్ట్ చేశాడు వృత్తి  బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించే ఎస్సై గంగరాజు . అందుకే .. మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినా .. ఆసుపత్రిలో అవన్నీ కక్కేసేయడంతో   ప్రాణాలతో బైటపడ్డాడు సురేష్ .  


సురేష్ ఇప్పటికైనా జీవితానికి సరిపడా పాఠం నేర్చుకున్నాడా? ఇప్పటికిప్పుడు  సమాధానం చెప్పడం కష్టం. కాలం నిగ్గుతేల్చాల్సిన మానసిక పరిణామం అది .


కొసమెరుపు ఏమిటంటే - సాటి జీవుల జీవితాల పై తనకు మల్లేనే  'కన్ సర్న్' చూపించే  రమేష్ పట్ల గౌరవం కలిగింది  అనితకు. ఆ గౌరవం ప్రేమగా మారడంతో  రమేష్   జీవితంలోకి  ఆమె అర్థాంగిగా  అడుగుపెట్టింది . 

*****


 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...