Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

Thursday, December 23, 2021

పాతబంగారం – కథ అనువాదం నేను ఎవరినైతేనేం! 'వేంకటేశ్ ' ( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


పాతబంగారం 

అనువాదం 

నేను ఎవరినైతేనేం! 


'వేంకటేశ్ ' 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ



'నే నెందుకు నవ్వుతున్నానో మీ కందరకూ తెలుసుకోవాలని ఉందన్న మాట? చచ్చిపోయేముందు ఎవడన్నా ఎందుకు నవ్వుతా డనేకదూ మీరనుకొనేది. అవునా? నాగురించి మీరేమీ ఆదుర్దా పడబోకండి


డాక్టరుగారు! అనవసరంగా శ్రమపడక మీ పనేదో మీరు చేసుకోండి! మీరు ఏవిధంగానూ నన్ను  బతికించలేరు. అసలు ఎవ్వరూ కూడ నా చావు తప్పించలేరు. ఈ పరిస్థితిలో ఎవరూ బతికించలేరు. 


ఎందుకంటే, నాకు ఒకటి కాదు రెండు బలమైన కత్తిపోట్లు తగిలాయి. ఒకటి వీపుమీద రెండోది డొక్కలోను. కండలు, నరాలు బయటకు రావటం మీకు కనిపిస్తునాదనే అమకుంటున్నాను. 


'మీరంతా నే నెందుకు నవ్వు తున్నానో వినాలని కుతూహలపడుతున్నా రన్నమాట. చచ్చిపోయే వ్యక్తికి నవ్వు తెప్పించే విషయం ఏమిటా అని ఆశ్చర్య పడిపో తున్నారుకదూ. నేను చెబుతాను. మీరేమీ ఆదుర్దా పడనవసరం లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం జ్ఞాపక స్తోంది. అసలు నే నెవరినో...


 'మీ రేమిటో గుసగుసలాడుతున్నారే. ఏమిటది? ఎందుకో నవ్వుతున్నారే? నేను చెప్పే దంతా  పూర్తిగా విని అప్పుడు గ్రహించండి..  చచ్చిపోయేముందు కూడ నాకు నవ్వు తెప్పించిన కారణ మేమిటో...


'ఇప్పటికి రెండు నెలలనుండి ప్రయత్నిస్తున్నా నేనెవరినో తెలుసుకొంటానికి.  ముసల్మానునా, హిందువునా లేక సిక్కు నా, బ్రాహ్మడినా లేక అస్పృశ్యుడినా, భాగ్యవంతుడినా లేక పేదవాడినా, నాది తూర్పుపంజాబా లేక పశ్చిమపంజాబా, నా నివాసస్థలం లాహోరా లేక అమృతసరా, రావల్పిండా లేక జలంధరా? 


నే నెవరినో నిర్ధారణ చెయ్యటానికి నేనే కాకుండా యింకా అనేకమంది శాయశక్తులా ప్రయత్నించారు. . నా కుల వేమిటో, నా మత మేమిటో అసలు నా పేరేమిటో తెలుసుకొందామని.  కాని ఫలితం మాత్రం కనుపించలా. ఇప్పుడు కొద్దికొద్దిగా నా పూర్వవిషయాలు గుర్తుకొస్తున్నాయి... యిప్పుడు... చచ్చిపోయే ముందు!...


అనేక ప్రయత్నాలు చేశారు. ఒక్కరికీ సాధ్యం కాలా. అసలు నే నెవరో నిశ్చయించు కొందామని.  నేను కూడ చాల శ్రమపడ్డాను. 


డాక్టరుగారు! మీరు నా వంక చూడకండి. మీరు ఆ విధంగా చూస్తుంటే నాకు మరీ నవ్వు వస్తోంది. ఉహుఁ మీరేకాదు, ఈ పరిస్థితిలో నన్ను ఏ డాక్టరూ బతికించలేడు... మీరు ఎందుకు అంత దీక్షగా ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నారో నాకు తెలుసు. నా గాయాలను ఎట్లా మాన్పుదామని అలోచిస్తున్నారు కదూ! 


ఈ రెండు గాయాల్లో ఏ గాయానికి ముందు కట్టు కడతారు. ఒక గాయానికి కట్టు కట్టటానికి ప్రయత్నిస్తుంటే ఒంట్లో ఉన్న నెత్తురు, కండలు, - రెండో గాయం గుండా బయటకు పోతాయి. ముందు రెండో గాయాన్ని కట్టటానికి ప్రయఅనిస్తే మొదటి గాయం గుండా పోతాయి. కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమించి కథను, కాదు, నా పూర్వచరిత్రను కొంచెం నిదానంగా  వినండి....


శ్రద్ధగా రెండు మాసాలపాటు ఢిల్లీ ఆస్పత్రిలో ఉన్న తర్వాత నాకు తెలివొచ్చింది! 'నీ పేరు?” అన డాక్టరు.


“నేను చాల ప్రయత్నం చేశాను. కాని గుర్తు లేదు అని చెప్పవలసి వచ్చింది. 


' హిందువుడివా లేక ముసల్మానువా?' వెంటనే డాక్టరు అడిగారు . 


యీ రెండో తికమక ప్రశ్న కు కూడా  'గుర్తులేదు' అని చెప్పవలసి  వచ్చింది.


' నా పూర్వచరిత్ర ఏమిటో గుర్తులేకుండా పోయింది. నా కులం, నా మతం, నా యిల్లు, సంసారం అన్నీ పూర్తిగా మర్చిపోయా. అసలు నాకు పెళ్లయిందో లేదో, బ్రహ్మచారినో మరి ఎవరినో నాకే అర్థం కాకుండా పోయింది. చివరికి పేరన్నా

' తెలుసుకొందామని శాయశక్తులా ప్రయత్నించా. 


పేరు లేకపోతే ప్రపంచంలో నేను ఫలానా వ్యక్తి నని నిరూపించేందుకు ఆధార మెక్క డుంటుందో మీరే చెప్పండి. 


విచారించగా విచారించగా కొంత కాలానికి తెలిసింది నే నెట్లా యీ ఆస్పత్రిలోకి వచ్చానో. పంజాబునుండి వస్తున్న కాందిశీకులతోబాటు నన్ను కూడ ఆ స్పత్రికి రు ట. అట్లా వచ్చినవారిలో చాలమంది ఆస్పత్రిలోనే మరణించారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమతస్థులని నేను అడగ్గా హిందువులు, ముస్లింలు, సిక్కులూ — అన్ని మతాలవాళ్ళూ ఉన్నారని ఆస్పత్రి వాళ్లు చెప్పారు. 


అసలు జరిగిం దేమిటంటే లాహోరు అమృతసర్ల మధ్య మోసుకు పోతున్న రెండు రైలుబళ్ళు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి. ఒక రైలుబండి పశ్చిమ పంజాబునుండి అమృతసరుకు హిందూ కాందిశీకులను మోసుకొస్తోంది. రెండో బండి తూర్పు పంజాబునుండి లాహోరుకు ముస్లిం కాందిశీకులను మోసుకుపోతోంది. 


దాదాపు రాత్రి 11 గం. సమయాన రైలు ఒకవంతెనమీద ఉండగా పట్టాలకింద ఒక బాంబు పేలింది. వెంటనే రైలుబండి అంతా పేలింది. 


చాలమంది అప్పుడే మరణించారు. చాలమందికి గాయాలు తగిలాయి. గాయాలు తగలకుండా తప్పించుకొన్న వారిని చుట్టుపక్క ల పొంచిఉన్న గూండాలు కాల్చి చంపారు. గాయాలు తగిలిన వాళ్ళు గుడ్డితనంగా తలొక దారి వెంటా పరిగెత్తుకు పోయారు. 


ఎదురుగుండా వస్తున్న బండికికూడ గంట తర్వాత యిటువంటి ప్రమాదమే సంభవించింది. ఆ రైలుబండిలో గాయాలు తగిలిన వాళ్ళుకూడ తలదాచుకొంటానికి దొరికిన దారి వెంబడి పారిపోయారు.


'మరురోజు ఉదయం భారతప్రభుత్వ సేనలు, పాకిస్థాన్ ప్రభుత్వ సేనలు సరిహద్దు  గస్తీ తిరగటానికివచ్చి అనేక శవాలను, గాయపడి కదలలేకుండా పడిఉన్న వాళ్ళనూ చూశారు. వాళ్లల్లో ఎవరు హిందువో, ఎవరు ముస్లిమో నిర్ణ యించటం బహుకష్టమైపోయింది. 


నేనుకూడా ఆ విధంగా గాయపడిన వాళ్ళల్లో ఒకణ్ణి. నన్ను స్ట్రెచర్ మీద అంబులెన్సువద్దకు మోసుకొని పోయినవాడు చెప్పాడు .. నే నెక్కడ ఎట్లా పడిఉన్నానో వివరాలన్నీ! 


 గుడ్డలన్నీ నెత్తురుతో తడిసిపోయాయి. నా చుట్టూ ఒక రక్తపు మడుగు తయారైంది. కొత్త సరిహద్దు ప్రకారం 'నా కాళ్ళు పాకి స్టాక్ భాగంలోను, తల  భారత దేశంలోను పడిఉన్నాయి. ఈ కొత్త సరిహద్దు వెంట అనేకమతాల, జాతులవారి రక్తం ప్రవ హించింది.


'చూడు! మౌలానా! దయ్యాన్ని  పట్టించే వాడిమాదిరిగా నా వంక అట్లా చూస్తావేం? నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. నేను యిప్పుడో యింకాసేపటికో చచ్చిపోతాను. చచ్చిపోయేముందు ప్రతిక్యక్తికీ అన్ని విషయాలు - తెలుస్తాయి. నేను ముసల్మాను నని చెప్పినట్లయితే యిస్లాం మతమును అనుసరించి నా అంత్య క్రియలు జరుపుదా మని ఆలోచిస్తున్నావుకదూ! 


ఏమండీ! మహషాయ్ ! నాకు తెలుసు. నేను హిందువునని చెప్పి నట్లయితే మీ ధర్మసేవక్  సంఘాన్నను సరించి నా అంత్యక్రియలు జరుపుదామని ఆలోచిస్తున్నారు కదూ! 


బొంబాయిలో పార్శీవాళ్లు - శవాల్ని బయట పారేస్తారని విన్నాను. వాటిని బ్రతికుండగానే  పీక్కు తింటానికి పక్షులు తయారవుతారన్న విషయం నా కింతవరకు తెలియదు... 


'ఇక నా చరిత్ర కొనసాగిస్తా. ఎందుకంటే, నేను మీతో మాట్లాడేకాలం చాలకొద్ది మాత్రమే ! 


నాకు తగిలిన గాయాలు ఏమంత పెద్దవి  కావు. బలమైన గాయాలు రెండువారాలు కట్టు కడితే నయ మౌతాయి. కాని నా బుర్రకు గట్టి దెబ్బ తగిలి, మనస్సు చెడిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాని మూలంగా జ్ఞాపకశక్తి పోయింది. దాంతో నేను ఒక అనామకుడిగా తయా రయాను . 


నా పేరు నేను మర్చిపోయా. నాలాంటి అభాగ్య కాందిశీకులు చాలమంది ఆస్పత్రి కొచ్చారు. ఆస్పత్రి వాళ్లు నన్ను బయటకు వెళ్లమన్నారు. తలదాచు కొనేందుకు చోటైనా దొరక్క పోతుందా అని అన్వేషణ ప్రారంభించా.


'జుమ్మా  మసీదుదగ్గర ఒక శరణాలయం ఉంటే అక్కడకు వెళ్లి కాస్త చోటు యివ్వవలసిందని శరణాలయాధికారిని ఆశ్రయించా. 


' నువ్వు హిందువుడివా, ముసల్మానువా? అని అడిగాడు ఆ అధికారి. '

' నాకు గుర్తులేదు' అని చెప్పా. నాకు గుర్తు లేని మాట వాస్తవమే . నేను అబద్ధం ఎందుకు చెప్పాలి?


'ఈ శరణాలయం ముసల్మానులకోసం' అని ఆ అధికారి నన్ను బయటకు గెంటాడు. అక్కడి ఆశ నిరాశ చేసుకొని ఎట్లాగొకట్లా ఢిల్లీకి చేరుకున్నా. 


ఇక్కడ యిదివరకటి శరణాలయం కంటే పెద్దదాన్ని చూశా. తలదాచు కొనేందుకు కాస్త చోటు యివ్వమని వాలం టీర్లను ప్రార్ధించా.


'హిందువుడివా, ముసల్మానువా' అంటూ అదే ప్రశ్న వేశారు. యిక్కడా  'నాకు గుర్తులేదు' అని నేను మళ్లీ ఆమాటే చెప్పా. '


' నీ పేరు?అని అడిగారు. 


‘అదికూడ నాకు గుర్తులేదు. అసలు నా కేదీ గుర్తులేదు.' 


'ఇం కెక్కడి కన్నా వెళ్లు. ఈ శరణాలయం హిందువుల కోసం . 


ఈ విధంగా ఒక చోటునుంచి యింకో చోటికి తిరిగా, హిందువులకోసం శరణాలయా లున్నాయి. మహమ్మదీయులకోసం శరణాలయాలున్నాయి. కాని  మానవులకోసం మాత్రం లేవు. 


'ఆ రాత్రి శరీరం బాగా  అలిసి ఉండటం చేత  నడవ టానికి ఓపిక లేక ఒక సిక్కు సర్దారు బంగళా ముందు స్పృహతప్పి పడిపోయా. అతడు సెక్ర టేరియట్ లో ఒక చిన్న ఆఫీసరు. అతడు నన్ను లోపలకు తీసుకుపోయి రొట్టె, పాలు యిచ్చాడు. నాకు కొంచెం స్పృహ వచ్చిన తర్వాతగూడ నేను హిందువునో, ముసల్మానునో సిక్కునా  నన్ను అడగలా. 


' కులాసాగా ఉందా బాబూ? ' అని మాత్రం అడిగాడు.


‘అతని బంగళాలో నేను చాల రోజులు గడిపా. 


నేను నా కథను ఉన్నది ఉన్నట్లు చెప్పినా నాకు తెలిసినంత వరకు . అప్పటికిగూడ అతని కుటుంబం  నన్ను చాల ఆప్యాయంగా చూసింది. కొన్ని రోజులతర్వాత వారి చుట్టాలు కొంతమంది రావల్పిండినుండిపారిపో యెచ్చారు. ముస్లిం గూండాలచేతిలో వాళ్ళు చాల కష్టా లనుభవించారు. వాళ్ల కళ్ల ఎదటే  వాళ్ళ బంధు వులను నానాహింసలు పెట్టి అవమానాలపాలు చేశారు. వాళ్ల హృదయాలు ముస్లిములంటే అసహ్యంతో నిండిపోయాయి. ఈ కథంతా - విన్న తర్వాత నాకు తెలియకుండా నేనుకూడ ముస్లిములను అసహ్యించుకోవటం మొదలం పెట్టా..


'సర్దార్ గారు నా కథంతా చెప్పి  , నా కే విధంగా మతి పోయిందీ, ఏ విధంగా నేను కష్టాలుపడ్డదీ వివరాలన్నీ వచ్చిన బంధువులకు చెప్పారు. పెద్దవాళ్ళు నన్ను అనునయించి నా పూర్వ స్మృతిని తెప్పించటానికి చాల ప్రయత్నం చేశారు. కాని పిల్లలుమాత్రం నన్ను అనుమానం గానే చూశారు. 


అందులో ఒకడు యింకొక డితో యీ విధంగా చెప్పటం విన్నా: 'వాడు చెప్పిందంతా అబద్ద మనుకో. మతి తప్పిపోయిం దని బొంకుతున్నాడనుకో, వాడు నిజంగా ముస్లిం అయివుంటాడు ' 


నాకు భయం పుట్టింది.


'ఆ ఆలోచనే నన్ను కూడ వేధించుకు తింది. నేను నిజంగా ముస్లిమునేమో. ఏమో ఎవరికి తెలుసు. నేనుకూడ యిప్పుడు ముస్లిములు చేస్తున్న మాదిరిగా ఘోరాలు చేసిన తర్వాత నాకు మతి తప్పిందేమో. నా ఘోర కార్యాలకి భగవంతుడు న న్నీ విధంగా శిక్షించా డేమో.' 

ఆ రోజు రాత్రే సర్దార్ యింటి నుండి పారి పోయా. తిరిగి వీధులవెంట తిరుగుతున్నా. మళ్లా ఉపవాసాలు, 


' ఈ శరణాలయం ముస్లిములకోసం నీ వెవరు ?' 

నీ పే రేమిటి ? నీ మత మేమిటి?నువ్వు ఎక్కడనుండి వస్తున్నావ్?.. ప్రశ్నలు ! ప్రశ్నలు ! ! ప్రశ్నలు!!! -అన్నీ ప్రశ్నలు, .


ఎక్కడచూచినా ప్రశ్నలు. నేను అందులో ఒక్క దానికీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే నే నెవరినో నాకే గుర్తు లేదు. ఇక నడవలేక ఆకలి మండుకుపోతుంటే తిరిగి జుమ్మా మసీదు  దగ్గరకు పోయి అక్కడే కూచున్నా. ఆకలితో చచ్చిపోవటం, నిశ్చయ మనుకొన్నా. స్పృహతప్పి పడిపోయా. 


అట్లా ఎంతసేపు పడిఉన్నానో! ఎప్పుడో ఒక్క సారి మాత్రం కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా ఎనిమిదేళ్ల పిల్లాడు నుంచొని ‘లే! లే!!” అని అంటున్నాడు. 


'ఇదిగో! యివ్వి తిను. మా అమ్మ నీకోసం పంపింది'. తిండి అన్న మాట వినంగానే లేవాలని బుద్ధి పుట్టిం దను కొంటా, కాని లేవటానికి శక్తి ఎక్కడనుండి వస్తుంది .  లేవలేకపొయాన.  ఆ పిల్లాడి సహాయంతోనే అతిప్రయాసతో లేచి కూచొని చపాతీలు తింటం ప్రారంభించా. 


ఎంత రుచిగా ఉన్నాయి ఆ చపాతీలు! భగవంతుడే నాకోసం అమృతాన్ని యీ రూపంలో పంపించినట్లుగా ఉంది. కల కాలం జీవించునాయనా! ' అని దీవించా. 


కాస్తముక్క కూడ విదలకుండా అన్నీ తినివేశా. కృతజ్ఞత తెలియజేద్దామని అతని చెయ్యి తాకగానే 'నీకు బాగా జ్వరంగా ఉందే ! మా యింటికి పోదాం. మా నాన్న యునాని వైద్యుడు. మందు వేస్తాడు. తగ్గిపోతుంది.' అని ఆ పిల్లాడు నన్ను వాళ్లయింటికి లాక్కుపోయాడు. 


ఆ యునానీ వైద్యు డొక ముసల్మాన్. రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తాడు. బీద, బిక్కికి ఉచితంగా మందులిస్తాడు. అతనికి హిందువులు, ముస్లింలు, సిక్కులు అన్న వివక్షత లేదు. జబ్బులు తో వస్తే వారందరికీ మందులిస్తాడు. 


హకీంసాహెబు మందుల వల్ల నా జ్వరము తగ్గింది . కాని అంత పెద్ద వైద్యుడివద్దకూడ పూర్వ స్మృతిని తెప్పించే మందు లేకపోయింది. 


నా కథంతా ఆయనతో చెప్పి 'ఒక వేళ నేను హిందువునేమో. నేను మీ యిల్లు వదలి ఇంకో చోటికి పోవాలి' అని అన్నా. కాని హకీం సాహెబు నన్ను అక్కడే ఉండమని బలవంతం చేశాడు. 'నీవు హిందువయితే మాత్రం  ఏ మొచ్చింది? హిందువులు మాత్రం మనుష్యులు కారూ?`


నే నక్కడే కొంత కాలమున్నా. ఒక రోజున హకీం సాహెబు కొడుకు నా మాదిరి దురదృష్ట వంతులకు రొట్టెలు యివ్వ టానికి వెళ్లి తిరిగి యింటికిరాలా. నేను, హకీం సాహెబు అతనికోసం ఆ రోజల్లా వెతికాం. కాని అతని జాడ తెలియలా! 


జుమ్మా  మసీదు దగ్గర హిందువులు చంపారని రాత్రి తెలిసింది. ఈ వార్త వినంగానే హకీం సాహెబు కుటుంబ మంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆ పిల్లాడి భూతం నన్ను రాత్రి, పగలూ వెంటా డుతూ తన మృదుమధుర వచనాలతో 'నువ్వు చచ్చిపోతున్నప్పుడు నీవు తిండి పెట్టా. కాని నువ్వు నన్ను చంపేశావు. గుర్తుంచుకో ! అంటోంది. నేను చంపలేదని నాకు తెలుసు. కాని నేను హిందువునేమో. మతి దప్పక పూర్వం నేను కూడ అనేకమంది ముస్లిం పిల్లలను చంపానేమో, ఈ ఆలోచన నన్ను అక్కడ నిలవనియ్యలా! 


ఆ రోజు తెల్లవారు ఝామున ఇంట్లో ఎవరు  లేవకముందే బయటకుపారిపోయా. 


అవి, ఢిల్లీలో మృత్యుదేవత తన సహస్ర బాహువుల్నీ జాపుతూ కరాళనృత్యం చేస్తున్న రోజులు. పట్టపగలే సామాన్య ప్రజానీకం మృత్యువువాత పడుతోంది. అగ్ని హోత్రుడిపాలవుతున్నది . 


ఏదో ఒక విధంగా గూండాలను తప్పించుకొని రైలుస్టేషనుకి చేరు కొన్నా. ఇక్కడికన్న బొంబాయిలో కొంచెం ప్రశాంతంగా ఉంటుందని బయలుదేరా . నా మాట విని అక్కడ పక్కన పంజాబునుండి వస్తున్న ఒక కాందిశీకుడు చిన్నబోయిన వదనంతో కూచున్నాడు. 


రైలు కదిలినప్పటికి  'ఎవరు నీవు?' అని అడిగాడు. 'నాకు తెలి యదు. హిందువునైనా కావచ్చు. ముస్లిమునైనా కావచ్చు.'


' ఈ మార్గంగుండా ముస్లింలు ప్రయాణం చేస్తే ఘోర ప్రమాదాలకు గురి అవుతారని విన్నా. నీకు గడ్డం ఉంది. అందుకని అడిగా!' 


నేను నా కథ అంతా అతనికి వినిపించా. అతడు నా గడ్డాన్ని దీక్షగా పరిశీలిస్తూ నావంక అనుమానంగా చూస్తున్నాడు.


'వారం రోజులనుండి గడ్డానికి  కత్తి తగలక పోవటంచేత గడ్డం కొంచెం పెరిగింది. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ భరత పురం వచ్చాం. అక్కడ రైలు ఆపివేయబడింది. 


ముసల్మానులు అని అనుమానం వేసినవారి నందర్నీ రైలులోనుండి బయటకు లాగి కాల్చి చంపే స్తున్నారు.


‘ఆ విషయాన్ని తలుచుకొంటుంటే నాకిప్పు టికీ నవ్వు వస్తోంది. ఎందుకు నవ్వు వస్తోందో మీకు తెలుసుకోవాలని ఉందా ? ఆ విధంగా ముసల్మానులను బయటకు లాగి కాల్చి చంపే వాళ్ళంతా 'మహాత్మా గాంధికి జైయ్' అని అర స్తున్నారు. అది చాలు చచ్చిపోయేముందు ఎవడైనా నవ్వటానికి.


వాళ్లు  మా బోగీదగ్గరకు రాగానే నాకూ  చావు తప్ప దనుకొన్నా. నేను ముస్లిము అవునో కాదో నాకు మాత్రం తెలియదు. కానీ నాకు గడ్డం ఉంది. అది చాలు నన్ను చంపటానికి. 


యిందాకటినుండి కూచున్న పంజాబీ నామీద దుప్పటి వేసి నన్ను పూర్తిగా కప్పేశాడు. వాళ్లు అడగంగానే 'ఆయన మా అన్నండి. లాహో రులో బాగా గాయాలు తగిలాయి. ఇప్పుడు మాటాడే పరిస్థితిలో లేడు' అని స్నేహితుడు చెప్పాడు. నా పంజాబీ 'ఏదో ఒకవిధంగా చివరకు బొంబాయి చేరు కొన్నా. ఇక్కడకూడ అదే ప్రశ్న ఎదుర్కొంది.


నువ్వు హిందువుడివా, ముస్లిమువా ?


'ఎవరు హిందువు ? ఎవరు ముస్లిము? అన్న ఆలోచన నాకు యిప్పుడు తట్టింది. నేను ముస్లిముగా కనుపించినప్పటికీ పంజాబీ నన్ను కాపాడా డు. హకీం సా అతను హిందువా? సాహెబు కొడుకును చంపిన కిరాతకులు హిందువులా? ఎవరు ము స్లిములు? 


హకీం సాహెబు కుటుంబం ముస్లిము కుటుంబమా, లేక రావల్పిండిలో సిక్కులను నానా బాధలు పెట్టిన రాక్షసులు ముస్లిములా ? ఎవరు సిక్కులు? సర్దార్ సాహెబు కుటుంబమా  లేక ఢిల్లీలో వీరవిహారం చేస్తున్న నీచులా ? ఎవరు  ముస్లిం? ఎవరు హిందువు? ఎవరు సిక్కు ? ఈ పవిత్రస్థలములో కూడ నువ్వు హిందువువా, ముస్లిమా, 'సిక్కా అన్న ప్రశ్నే !


' నే నెవర్ని? హిందువునా? ముస్లిమునా? రాత్రింబగళ్లు ప్రశ్న నన్ను బాధిం చింది. నిద్రపోతున్నప్పుడుకూడ యీ ప్రశ్నలు భూతాల రూపందాల్చి బల్లాలు పుచ్చుకొని జవాబు పొందటానికి ప్రయత్నించాయి. నేను కలవరింతగా యీ మాట అన్నానేమో. 'నన్ను వదలి వెయ్యండి. నేను ముసల్మానును కాదు. హిందువునూ కాదు. సిక్కు నూకాదు. ఒక మాన వుణ్ణి మాత్రమే!' 


బొంబాయిలో కాందిశీకులకు శిబిరాలున్నాయి . సి క్కులకు ఖాత్యా కళాశాల దగ్గర ఒక శిబిరం ఉంది. హిందువులు రామకృష్ణ ఆశ్రమంలో తలదాచుకోవచ్చును. ముస్లింలు అంజుమన్ ఇస్లాం హైస్కూలుకు పోవచ్చును. కాని నేను ఎక్కడకు వెళ్లను? నాకు తలదాచుకొనేందుకు ఎక్కడా చోటులేదు. 


ముష్టి  నా కెవళ్లూ వేసేవాళ్లు కాదు. ముష్టి వేసేందుకు గూడ ఏ మతంవాడినో అడిగేవాళ్లు. నేనేం చెప్పేది? నేను ఏ మతానికీ సంబంధించిన వాడిని కాదు. అయితే నేను చచ్చిపోవాలన్న మాట. 


ఉహుఁ. ఆవిధంగా చావ లేను. నేనెవరినో తెలుసుకోవాలి. లేకపోతే నేను బతకటానికి అవకాశం లేదు.


డాక్టరు 'సమాని' నా స్మృతిని తెప్పిస్తాడని విని అక్కడకు వెళ్లా. అతడు మందులు, మాకులు వేసి రోగం తగ్గించడు. ఊరికే మాట్లాడి కుదు రుస్తాడు. నీ మనస్సును కష్ట బెట్టుకోకు. నీబుర్ర లో ఏమనిపిస్తే అది అంతా చెప్పు. సంబంధమున్నా సరే లేకపోయినా సరే అని చెప్పి తను ఒక కలంపుచ్చుకొని నా ముందు కూచున్నాడు. 


నేను కళ్ళు మూసుకొని నానోటి కొచ్చిందల్లా మాట్లాడా. 'నీలపు ఆకాశం, పచ్చని చేలు'


‘బాగుంది, ఆపబోకు' '


' నీలపు ఆకాశం, పచ్చని చేలు, ఒక నదీ ప్రవాహం. నదిలో పడవలున్నాయి. ఒక కాలవ, కాలవలో పిల్లలు యీదుతున్నారు. ఒకళ్ల మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారు.' 


' ఎవరీ పిల్లలు ? హిందువులా, ముస్లిములా, - సిక్కులా'


'ఏమో, ఎవరో, కానివాళ్ళుమాత్రం పిల్లలు' '


' సరే, కానీ .. పంటపొలం, పండగ. ! డోలక్ వాయిద్యం విను.. ఆహాఁ. ఎంత బావుందో ! ఆహాఁ! ఏంపాట !!! ఎవరు పాడుతున్నారా పాట??


' స్త్రీలు ' 


'సరే. ఎవరా స్త్రీలు. హిందువులా, ముస్లిములా, సిక్కులా.' '


' పంజాబు స్త్రీలు. హిందువులు, ముస్లిములు - సిక్కులు' 


' ఇక ఏమీ చెప్పలేను. ఏమీ కనిపించడం లేదు. ' 


'ఊ' అని నిట్టూరాడు డాక్టరు . . యికలాభం లేదన్నట్లు.


' ఏం? ఎందుకని? ఏ మొచ్చింది ?'


“ నాతల తిరిగిపోతోంది. చీకటిగా ఉంది. ప్రపంచమంతా భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయి. ' 

 

'గట్టిగా ప్రయత్నించు  . ఇప్పుడేం కనిపిస్తున్నాయి? ' 


' ఆకాశాన్నం టే మంటలు. ఇళ్లన్నీ తగలబడి పోతున్నాయి. ఏడుపు స్వరాలు వినిపిస్తున్నాయి.' 


 'సరే, గూండాలు వచ్చారన్న మాట. వీళ్ళే బంధువుల్ని చంపేశారు. వీళ్ళే నీ ఆస్తి అంతా దోచేశారు. వీళ్ళే నీ పెళ్లాం పిల్లల్ని చంపేశారు. నీ మతి పోగొట్టారు...వా ళ్ళేం చెబుతున్నారు? 


; నా కేమీ వినిపించటంలా, అంతా గోలగా ఉంది. ఒక్క మాటమాత్రం చెవులో గుద్దినట్లు వినిపిస్తోంది. ' చంపుచంపు చంపు. ' 


'వీళ్ళే నిన్ను సర్వనాశనం  చేశారు. వీళ్ల మీద నువ్వు పగతీర్చుకోవాలి. ' 


' నేను హిందువునో, ముసల్మానునో డాక్టరు తెలుసుకో బోతున్నాడు! నేను ముస్లిముని! సర్దార్ సాహెబు బంధువుల్ని చంపా. అనేకమంది హిందువుల సిక్కుల ప్రాణాలు తీసి వేశా. నేను హిందువుని!  హకీం సాహెబు కొడ కుని చంపా. ఇంకా అనేకమంది ముస్లిములను చంపా. ' 


' వద్దు. అక్కర్లేదు. నేనెవరినో నేను తెలు సుకోనక్కర్లా. నేను హిందువుగాని, ముస్లిం గాని, సిక్కు గాని అవదల్చుకోలా• మానవుడిగా మాత్రమే ఉంటా. అంతే! అంతే!!' అని అరుస్తూ డాక్టరు దగ్గరనుండి పారిపోయా! 


నేను హిందువుని. నేను ముస్లిముని

నేను ముస్లిముని'  హిందువుని' ‘


' నే నెవర్నయితే మాత్రం నాకేం పనీ? ' 


' నే నెవర్ని కాదు. నాకేం పని లేదు' “

' నేను హిందువుని . నేను ముస్లిముని'


ప్లేగు నుండి  పారిపోయినట్టు డాక్టరు దగ్గర నుండి పారిపోయా. 


కాని యీ మాటలు మాత్రం నన్ను వదలి పెట్టలా ! 

నేను ఏ వీధికుండా పరు గెత్తుతున్నా నో నాకు తెలియదు. భయంకరమైన  వ్యక్తి ఒకడు నన్ను పట్టుకు ఆపాడు. ' ఆరే సాలా ! ఎవర్రా నువ్వు? ఎక్కడికి పోతున్నావ్ ?' 


అతడొక ముస్లిం అవాలి . అతని చేతిలో కత్తి ఉంది. 

 ' నేను హిందువుని. నేను ముస్లి ..' '


' ముస్లిము' అన్నమాట పూర్తి చేయక ముందే నా వీపులో బాకు దిగిపోయింది. అదే ఈ వీపులో ఉన్న బాకు పోటు!


'కాఫిర్ కా బచ్చా' అని అంటున్నాడు. నేను పూర్తిగా పడిపోకుండా పారిపోతున్న ప్పుడు. నా వెనుక రక్తం కారుతోంది. మీరు నమ్మరు. అయితే నమ్మబోకండి. 


చచ్చిపోయే ముందు నేను నిజం మాట్లాడుతున్నా నని నాకు మీరేమీ సర్టిఫికేట్ యివ్వనక్కర్ల.......


 “నేను ముస్లిముని. నేను హిందువుని' అని అనుకుంటూ నేను పోతున్నా. 


ఈసారి 'హిందువు' అంటానికి పూర్వం నా డొక్కలో ఒక బాకు

దిగింది.


'ఇప్పుడు మీరు గ్రహించా రనుకొంటా, నాకీ రెండు గాయాలు ఎట్లా తగిలాయో! 


నన్ను హిందువులు, ముస్లిములు యిద్దరూ బాకుతో  పొడిచారు. అందుకనే మీరు నన్ను బతికించ లేదని చెప్పింది డాక్టరుగారు! 


ఇక్కడ యింత ఆదుర్దాగా చూస్తున్న మీలో ఒక్కడు కూడ  నన్ను బతికించలేడు . పగతీర్చుకొంటానికి మాత్రం నా చావును ఆధారంగా తీసుకొంటారు. ఇప్పుడు గనక నేను హిందువునని చెప్పినట్లయితే వెంటనే హిందువులు నాలుగు అమాయకముస్లిం పిల్లల ప్రాణాల్ని ఆహుతి గొంటారు. ముస్లిము నని చెబితే ముస్లిములంతా హిందూ మతాన్ని రూపుమాపేస్తారు. 


' నేను నవ్వుతున్న దెందుకంటే, యిప్పుడే తెలిసింది నే నెవరినో ? ఇంత కాలాని యిప్పుడు తెలిసింది పూర్వచరిత్రంతా! 


నా బిడ్డల  చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి . ఇద్దరు కూడ నా కళ్ల ఎదటే చంపబడ్డారు. ఆ విధంగా నా మతి చెప్పింది. ఆఁ! అవును! అంతా నా కిప్పుడు గుర్తు కొస్తోంది. మా పొలాలు, మా గ్రామం, నా స్నేహితులు, నా యిరుగు పొరుగువాళ్ళు - అంతా యిప్పుడు జ్ఞాపక మొస్తున్నారు. చచ్చి పోయేముందు..  నిజం .. అన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి .


'మీరు నేనేమి చెబుతానో అనియింకా నిరీ క్షిస్తున్నారు. కాని లాభం లేదు. నేను చెప్పను.  నేను హిందువునో, ముసల్మానునో చెప్పను.  చెప్ప దలచుకోలేదు. 


నాకు యీ రెండు -గాయాలు తగిలించిన హిందువుగాని, ముస్లింగాని నేను తన జాతివాడినని తెలుసుకోకూడదు. ఆరే పొరబాటున పొడిచానే అని పశ్చాత్తాపం పొందకూడదు. ఇదే నా పగ. వీ ళ్లిద్దరిమీదే కాదు. నాలాంటి అమాయక ప్రాణాలను బలి గొంటున్న వేలకొలది హిందువులమీద, ముస్లి ములమీద, సిక్కులమీద . 


మతోన్మాదులు పుట్టటం మూలంగా, బతకటం మూలంగా ఆత్మీయమైన నా పంజాబుకు తీరని కళంకం వచ్చింది.


' నేను హిందువునా, ముస్లిమునా ?' 


' నేను ముస్లిమునా హిందువునా?' 


ఈ ప్రశ్నే వాళ్లకు కావాల్సింది. ఈ ప్రశ్న వాళ్లను రాత్రింబగళ్లు వేధించుకు తినేది. పట్టణంలోను, పల్లెలోను, రైళ్లలోను , బస్సులోను, ట్రాములోను -ఫ్యాక్టరీలోను, ఎక్కడబడితే అక్కడ యిదే ప్రశ్న. 'వాడు హిందువా, ముస్లినూ?' 


వాళ్లకుగాని వాళ్ల పిల్లలు ఉంటే ఆ  పిల్లలకుగాని, వాళ్ల పిల్లల పిల్లలకు గాని శాంతి ఏమిటో తెలియదు. 


అంత భయంకరం, ఘోర భయంకరం నా పగ. 


ఇంకా మీకు తెలుసుకోవా లని ఉందా, నే నెందుకు నవ్వుతున్నానో?'

- రచన - వెంకటేశ్ 


(మూలం - అబ్బాస్ కథ) 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


- సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ





Saturday, December 11, 2021

విదేశీయాత్రిక చరిత్ర ; కుటుంబసమేతంగా వచ్చిన నికోలో కోంటీ

విదేశీయాత్రిక చరిత్ర ; 

కుటుంబసమేతంగా వచ్చిన నికోలో కోంటీ


15వ శతాబ్దంలో ఇండియాలో పర్యటించిన పాశ్చాత్యులందరిలో నికోలోకోంటి ప్రముఖుడు. ఆనాటి ఇండియా గురించి ముఖ్యమైన సమాచారం విస్తారంగా  గ్రంథస్తం చేసిన విదేశీయాత్రికుడు నికోలో  కోంటీ. 


కొంటీ ఇటలీకి చెందిన వెనీస్ నగరపు ధనిక వ్యాపారి. వెనీస్ నగరం ఆనాటికే  గొప్ప వర్తక కేంద్రం. సముద్ర వ్యాపారాల కేంద్ర స్థానం కూడా. సముద్రాంతర యాత్రలకు ప్రొత్సాహం కలిపించింది ఈ కేంద్రమే.  


నికోలోకోంటి సాహసయాత్ర సకుటుంబంగా సాగింది. తన భార్యా పిల్లలతో కలిసి 1419న  యాత్ర ప్రారంభించాడు. డెమోస్కస్ నుండి తూర్పు దిక్కుకు ప్రయాణం. 600 మంది వర్తకులతో  కలసి అరేబియన్  యడారుల గుండా  ప్రయాణించిన సాహసికుడు నికోలో కోంటీ. 


బాగ్దాద్ చేరిన తరువాత తూర్పు దిక్కుకు ప్రయాణించి  అరబ్బుల ఓడరేవు ఓర్ముజ్ను చేరి  కొంత కాలం పర్షియన్ భాష నేర్చుకునే నిమిత్తం అక్కడే ఉండిపోయాడు.  


అక్కడి నుంచి అరేబియా సముద్రంలో నౌకాయానం ద్యారా ఇండియా పశ్చిమ తీరంలో ఉన్న  కాంబేనగరంలో అడుగుపెట్టాడు.


అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేసి 300 మైళ్ల దూరంలో ఉన్న  విజయనగరం సందర్శించాడు.  విజయనగర రాజ్యం గురించి పాశ్చాత్యులకు సమాచారం అందించిన మొదటి విదేశీయాత్రికుడు నికోలో కోంటీ.


తరువాత ఇంకా దక్షిణానికి - మలియాపూర్ వెళ్ళి సెయింట్ థామస్ సమాధిని చూశాడు. తరువాత శ్రీలంకను, సుమత్రాను, బెంగాల్ను చూసి మరలా తూర్పుగా బయలుదేరి ఆరకాన్, ఇర్రావదీ, ఆద, పెగూ, జావా, సుంచావాలు వరకు వెళ్లి తిరుగు పయనం చేసి మరల సిలోన్ మీదుగా ఇండియా పశ్చిమ తీరానికి వచ్చి క్విలన్, కొచ్చిన్, కాలికట్లను దర్శించాడు.


కాంబే ప్రాంతంలో సతీసహగమనం ప్రబలంగా వుందనీ, కాలికట్ ప్రాంతంలో బహుభర్రుత్వం వుందనీ గమనించాడు.


కాంబే నుండి తిరుగు పయనం చేసి ఈజిప్టు గుండా వెళ్లాడు. కానీ వారి స్వదేశానికి దగ్గరలో వుండగానే అతని భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. కోంటి 1444లో తన వూరు వెనిస్ చేరాడు.


అప్పటి వరకూ తన పర్యటనను గురించి ఏమీ వ్రాసుకోలేదు. సముద్రయాత్రలో వుండగా ఒకసారి తన భార్యాబిడ్డల్ని రక్షించుకోవడానికి క్రిస్టియన్ మతాన్ని విడనాడాల్సి


చ్చిందట. ఆ తప్పదం అతన్ని వెంటాడుతూనే వుంది. ఆ పాపం నుండి బయటపడాలని ఈనాటి పోప్ యుజిని వద్దకు వెళ్లి వివరం అంతా చెప్పి పశ్చాత్తాపబడి తనకు పాపవిముక్తి చేయమని విన్నవించుకున్నా.


ఆ సందర్భంగా ఈయన యాత్ర విశేషాలు విన్న పోప్ గారు తన సెక్రటరీ సాయో బ్రాచ్చిమోలిని"ని వ్రాతకుడుగా నియమించి కోంటి చెప్పే విశేషాలన్నింటినీ _వ్రాయమన్నాడట. వారిద్దరి కృషి ఫలితంగా ఆ యాత్రా విశేషాలన్నీ గ్రంథస్తం అయ్యాయి. చరిత్రకొక మేలు జరిగింది. కోంటి నిశిత పరిశీలనా, పొగ్గియో మేలయిన రచనా శైలీ కలిపి లాటిన్ భాషలో “డి వెరైటేటి ఫార్చ్యునే” అనే గ్రంథం రూపొందింది.


కొండల మధ్యలో వున్న విజయనగరం చుట్టుకొలత 60 మైళ్లుంటుందని అందులో నివశిస్తున్న సైనికులే 90 వేల మంది వుంటారనీ వ్రాశాడు. ఇది ఎప్పుడు సంగతి? శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన నాటి కంటే వంద సంవత్సరాల పూర్వం సంగతి. అప్పటికే ఆ నగరం వందేళ్లయింది. క్రీ.శ 1336లో విజయనగరం ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. వందేళ్లలోనే ఆ నగరం అంత అభివృద్ధి చెందిందన్నమాట!


ఆయన ఆనాటి (1420) బెంగాల్ గురించి యేమీ రాయలేదు గానీ గంగానదీ గట్టమీద అందమైన తోటలతో నగరాలున్నాయని వ్రాశాడు. గంగానదిపై ప్రయాణం చేసి సంపదలతో తులతూగుతున్న 'మారజియా' అనబడే నగరాన్ని చేరాడట.


పేపర్ మనీ వాడుకలో వుందనీ కుతూహలమైన విషయాన్ని కోంటి వ్రాశాడు. వెనీస్ నగరపు బంగారు నాణాలైన డుకౌంటులు కూడా చలామణి అవుతున్నాయట. అవిగాక ఇనుప నాణాలు కూడా వాడుకలో వున్నాయట.


ఇక్కడ హిందువులు పరిపాలిస్తున్న రాజ్యాలలో నేరవిచారణ తతంగాలలో ప్రమాణాలు వాడుకలో వుండటం చూసి విస్తుబోయాడు.


"ఇండియాలో చనిపోయినవారిని దహనం చేస్తారు. బ్రతికి వున్న అతని భార్యల్ని కూడా ఆ మంటలోనే దహనం చేస్తారు. అది చాలా గౌరవంగా భావిస్తారు...” అంటూ ఆ సతీసహగమన తతంగం ఎలా జరుగుతుందో అంతా వర్ణించాడు.


హిందూవులలో ఆత్మార్పణం చేసుకునే భక్తులు కూడా వుంటారనీ విజయ నగరంలో అలాంటి ఆచారం వాడుకలో వుందనీ వివరించాడు కోంటి. ఆ భక్తులు


తమకు తామే తమ శిరసుల్ని నరుక్కుంటారని వర్ణించాడు. దేవుడి రధ చక్రాల క్రిందపడి కూడా చనిపోతుంటారనీ వ్రాశాడు.


మలబారు తీరంలో కాలికట్లో కొంతమంది ప్రజల్లో బహు భర్రుత్వం అమలులో


వుందని వ్రాశాడు.


విజయనగర సామ్రాజ్యం గురించి మరికొంత వివరిస్తూ ఇక్కడి మగవారు ఎంతమంది భార్యలనైనా చేసుకుంటారనీ, వీరి రాజుకు 12 వేల మంది భార్యలున్నారనీ, రాజుగారు ఎక్కడికి వెళ్లినా అతనితో పాటు 4000 మంది భార్యలు కదిలి వెళ్తారనీ, వాళ్లుగాక వంటపనులకూ, సాయుధులైన అశ్వికులు గానూ అనేకమంది మహిళలున్నారని వ్రాశాడు.


విజయనగర సామ్రాజ్యంలోని పండుగల్ని కూడా వర్ణించాడు. అన్ని వయస్సుల జలూ నదులలో స్నానం చేసి, మంచి మంచి దుస్తులు ధరించి మూడురోజులపాటు త్యాలతోనూ, ఆట పాటలతోను గడుపుతారనీ, దేవాలయాల్ని దర్శిస్తారనీ, మరో డుగలో ఇళ్ళన్నీ దీపాల వరుసలతో అలంకరిస్తారనీ, ఇంకో పండుగ రోజున ందంగా రంగులు జల్లుకుంటారనీ వ్రాశాడు.


విజయనగరానికి ఉత్తరంగా 15 రోజుల నడక దూరంలో వజ్రాలు లభించే డ వుందనీ వ్రాశాడు. ఈ గోల్కొండ వజ్రాల గనుల గురించీ, కృష్ణానదీ వుత్తర లో వజ్రాలు లభిస్తాయనీ చాలామంది యాత్రీకులు వ్రాసినదే ఆయన కూడా శాడు.


గుజరాతుకు చెందిన కాంబే నగరం వారు మాత్రమే కాగితాన్ని వుపయోగిస్తున్నారనీ, మిగిలిన వారంతా వ్రాతకు చెట్ల ఆకుల్ని (తాటి ఆకులు) వుపయోగిస్తున్నారని వ్రాశాడు.


ఈదేశాలలో ప్రజలు ఎక్కువనీ, సైన్యాలు కూడా లక్షల సంఖ్యలో వుంటాయనీ వ్రాశాడు. నికోలో కోంటి దక్షిణ ఇండియాలో 1420-21లలో పర్యటించాడని చరిత్రకారులంటారు.


15వ శతాబ్దంలో అనేకమంది విదేశీయులు పర్యటనలు చేశారు. వారంతా మగవాళ్లే ఇండియాకు వచ్చిపోయారు. కుటుంబంతో సహా వచ్చిన సాహసి ఈయనే. కానీ ఆయన కుటుంబానికి ఇండియాలో హిందువుల వలనగానీ, ముస్లింలవలన గానీ ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదని ఆయన రచన వలన తెలుస్తున్నది. అలాంటి శాంతి భద్రతలు, నీతి నియమాలూ ఇండియాలో ఆ రోజులలోనే అమలులో వున్నాయనేది నికోలో కోంటీ యాత్ర వలన మనకు అవగతమవుతోంది.

సేకరణ : కర్లపాలిం హనుమంతరావు 

( విదేశీయాత్రికులు అందించిన మనదేశ చరిత్ర - డి.వెంకట్రావ్ ) 

Thursday, October 7, 2021

అనువాద కవిత: అనేకుల కది! - రవీంద్రనాథ్ ఠాగోర్-తెనుగు సేత : శ్రీ విద్వాన్ విశ్వం సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో  


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో 

ని వ్విరి సరమునకు 

బదులు నే నేమిత్తున్ ? 


నే గట్టిన తో మాలను 

నీ కొక్కర్తుక కె 

యొసగ నెట్లు పొసగు? 

నో రాకా  హిమకర వదన! 

అనేకుల కిది

వారి నెల్ల నెటు వర్జింతున్ ? 


ఉన్నారు భావుకులు : 

మన కన్నుల కగపడని 

చోట్ల గలవారెవరో 

ఉన్నారు; కవుల పాట 

సన్నిహితులు ఉన్నవారు 

చాలమందియె

ఇందరికై ఈ మాలిక 

నందమ్ములు జిలుక కట్టినాడ

గావునన్‌; 

కుందరసమదన ! 

నీకే చెందించుట 

నెట్లు పడును? 

చెప్పుము నీవే. 


నీ యడదకు   

నా  యడద నుపాయనముగ 

నడుగు  సమయ మది 

గతియించెన్; 

తోయజ నయనా 

ఎపుడో పోయిన దా   

కాలమెల్ల  గతియించెన్ 

పూర్వగాథయై.


పరిమళమంతయు 

లోపలి యరలోనె 

దాచు కొన్నయట్టి

మొగ్గతో సరియై , 

నా జీవిత - 

మొక పరియై యుండెను-  

పోయె నట్టి ప్రాప్తము 

పడతీ!  


ఉండిన తావిని 

దిక్కుల నిండా 

వెదజల్లి వేసి

నే  నుంటిని; 

ఏ పండితు డెరుగును 

పోయినదండి వలపు 

మరల చేర్చి, దాచు 

మంత్రమున్ . 

సారస నయనా 

నీ హృన్నీ రేజాతమ్ము 

నొకరి నెయ్యమునుకే

ధారాదత్తము సేయగ నేర! 

ననేకులకు 

దాని నియ్యగ వలయున్ . 

- బెంగాలీ - రవీంద్రుడు 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

07 - 10 - 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ

Sunday, April 25, 2021

మహమ్మారి కరోనా విస్తరణకు - మన లెక్కలేనితనమే కారణమా! -కర్లపాలెం హనుమంతరావు

 

 



రష్యా అధినేత కృశ్చేవ్ ఓసారి ఇండియా వచ్చినప్పుడు స్వాగత వచనాలు పలికి తోడుకుని తెస్తున్నాడుట అప్పటి మన దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. మార్గమధ్యంలో  ఓ పౌరుడు తన ట్రేడ్ మార్క్ చెంబుతో పొదల్లో దూరడం చూసి కృశ్చేవ్ ఆసక్తి కొద్దీ అతగాడు అంత పరగడుపునే పొదల చాటుకెళ్లి చేసే మహాకార్యమేంట’ని అడిగితే, వివరాలు కనుక్కొచ్చిన మనిషి తెచ్చిన సమాచారం దేశం శుచి శుభ్రతలకు సంబంధించిందవడంతో చెప్పలేక చెప్పి చాచాజీ తలొంచుకున్నాడుట. మరి కొంతకాలం తరువాత అదే సన్నివేశం మాస్కోలో కాకతాళీయంగా జరిగటంతో  చాచాజీకీ బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. 'చెంబు చేత పట్టుకుని పొదల చాటుకు జనం పరుగెత్తే దృశ్యాలకు తమ దేశమూ కొదవేంపోలేదూ!' అన్నట్లు నవ్వితే తలతీసినట్లనిపించిందీ సారి  కృశ్చేవ్ కి. ఆ అనాగరికుడిని పట్టి తెమ్మని ఆయనిచ్చిన ఆదేశం మేరకు.. వెళ్లి వచ్చిన మనిషి 'ఆతగాడి పలుకును బట్టి ఇండియనని చెప్పడంతో చాచాజీకీ మరో మారు తలవంచుకునే పరిస్థితి తప్పింది కాదు'అని కుశ్వంత్ సింగ్ ఓ సందర్బంలో చెప్పిన పిట్టకథ ఇప్పుడు గుర్తుకొస్తోంది. భారతీయులను అవమానించే ఈ తరహా చెత్త కథలు  కట్టుకథలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  కానీ.. అలవాట్ల వరకు భారతీయుల వెకిలి చేష్టలను చక్కగా వెలిబుచ్చేవని మాత్రం ఒప్పుకోక తప్పదు.

మారుతున్న కాలంలో ఇప్పుడు ఏ భారతీయుడూ విదేశీ గడ్డ మీద ఆ విధంగా ప్రవర్తించడంలేదు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము' అన్నట్లు మాతృభూమి వళ్ళు పులకరించేలా ఎంతో ఒద్దికైన ప్రవర్తనతో పదిమంది మధ్యనా ఆదర్శవంతంగా నడుచుకుంటున్నాడు. కానీ.. చిత్రంగా ఆ బుద్ధిమంతుడే కన్నభూమి పై కాలు పెట్టిన తొలిక్షణం నుంచి  మళ్లా లోపలున్న ఒరిజనల్ని బైటికి తీసేస్తున్నాడు! పాత దురలవాట్లను శాయశక్తులా పాటిస్తున్నాడు! రోడ్లను  యధా తధంగా ఉమ్ముతో పావనం  చేయడం నుంచి కుండీ ఎదుటే ఉండినా  చెత్త అందులో పడకుండా శాయశక్తులా శ్రద్ధవహించడం వగైరా.. వగైరా వరకు.. ఏది చట్టమో అంతా తెలిసినట్లే.. పంతంగా వాటిని ఉల్లంఘించే పాత అలవాట్లనే సాధన చేస్తున్నాడు! అందువల్లనే పై తరహా చిల్లర కథలకు అంత  విస్తృతమైన   ప్రచారం!

క్రమశిక్షణారాహిత్య కార్యకలాపాలలో సుశిక్షణేదో పొందినట్లు మనం మరీ అంత విపరీతంగా ప్రవర్తించడం ఎందుకు! ప్రస్తుతం దేశంలో జరిగే కరోనా విలయ తాండవంలో  ఈ అపరిశుభ్రతే కదా ముఖ్య కారణం!

మొదటి దశలో ఎంతో శ్రద్ధగా ధరించిన మొహం తొడుగులు రెండో దశలో ఎందుకు నామర్దాగా మారినట్లు! ప్రారంభంలో వైద్యులు చెప్పుకొచ్చిన సామాజిక దూరం వంటి జాగ్రత్తలన్నీ నియమబద్ధంగా పాటించిన మనమే తదనంతర దశలో  ఏం ఘనకార్యం సాధించామని  పూర్తిగా గాలికి వదిలేసినట్లు! పెళ్లిళ్లు, ఉత్సవాలు వంటి సామూహిక కార్యక్రమాలకూ సై అనేందుకు ఏ వైద్యం మనల్ని కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి చేసేసిందని! ఇంటికొకరు పిట్టల్లా రాలుతున్న కరోనా దేశంలో   హరిద్వారా కుంభమేళా, అయిదు రాష్ట్రాల ఎన్నికల మేళా చూసి ప్రపంచం నోరెళ్లబెట్టేస్తోంది. కనిపించే రోగగ్రస్తులకు ఎన్నో రెట్లు కనిపించని రోగవాహకులుగా ఉన్న  దుర్భర పరిస్థితులకు కారణాలేమిటో కనుక్కునే ప్రయత్నాలు ఏ కోశానా కనిపించడం లేదు ఇప్పటికీ! మన అపరిశుభ్రతే మనకు తీరని శాపం అని  సామాన్యుల నచ్చచెప్పేందుకు ఇంకే బ్రహ్మదేవుడు దిగిరావాలో!

పరిశుభ్రతకు సంబంధించిన చట్టాలు లేక కాదు. ఉన్నవాటినైనా కఠినంగా అమలుచేసే చింతన లేదనే ఈ చింతంతా! అపరాథ  రుసుం పైసల్లోఉండటంతో ‘ఆఁ! చెల్లించేస్తే పోలా!’ అన్న తుస్కార ధోరణే తప్ప సంస్కార కోణంలో ఆలోచించే గుణం తరతరానికి తరిగిపోతూ రావడమే కరోనా తరహా మహమ్మారులకు మన మీది ప్రేమ దినదినాభివృద్ధి చెందడం.

నిజం నిష్ఠురంగానే ఉంటుంది. ద్విచక్రవాహన చోదకులు ఎంత మంది శిరస్త్రాణాలు ధరిస్తున్నది? ధరించనివాళ్ళ మీదయినా నమోదయ్యే కేసులు ఎన్ని? ఎరుపంటే ఏదో జడుపున్నట్లు  ఆ రంగు లైట్ కంటపడగానే ఆగాల్సింది పోయి  వాయువేగంతో పారిపోయే వాహనాలే జాస్తీ మన దేశంలో ఎంత  బిజీ రోడ్ల మీదయినా! ‘ఒన్ వే’ అంటూ  నియమం ఓటి  ఉన్నా ‘జానే దేవ్’ అనే సజ్జే గజ గజానికీ ఈ దేశంలో! మూగజంతువు మీద నుంచి బండి నడుపుతూ పట్టుపడితే అపరాధ రుసుం కేవలం 50 రూపాయలా! కబేళాకు గొడ్డును అమ్మేందుకు ఆరోగ్యంగా ఉండే కాలును పుటిక్కున  విరిచేస్తున్నాడు త్రాష్టుడు! జబ్బు పడ్డ గొడ్డును పోషించడం ఖర్చుతో కూడిన వ్యవహారమయితే.. అదే కబేళాకు అమ్మేస్తే ఝంఝాటం వదలడంతో పాటు అదనంగా అంతో ఇంతో ధన లక్ష్మీదేవి సుప్రసన్నం!

సింగపూర్ లో ట్రాఫిక్ ఉల్లంఘనకు శిక్ష వెయ్యి డాలర్లు. చెల్లించలేని పక్షంలో జైలు శిక్షలు. అదే ఇండియాలోనో! గుప్పెడు రూకలతో చూపిస్తే అంతా గుప్.. చుప్! అవినీతిని గురించీ, న్యాయ విచారణల తీరును గురించి ఎంత తక్కువ చెబితే అంత మన్నన.

రోడ్డు నిబంధనలు తెలుసుకుని, నేర్చుకుని కష్టపడి  పరీక్ష ఉత్తీర్ణమవకుండానే  కొంత సొమ్ము మనది కాదనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికే బెంజి కారులో వచ్చేసే వ్యవస్థలో మనం బతుకుతున్నది. మందు కొట్టి బండి నడిపినంత మాత్రాన గ్యారంటీగా పోలీసు కేసు బుక్కవాలనుందా ఇక్కడ? కేరాఫ్ ఫుట్ పాత్ గాడి  పీకల మీద నుంచి గాడీ నడిపేసుకెళ్ళిన బేఫర్వా  హీరోగాడే సేఫ్ గా మూవీలు చేసుకునే దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఎవడికి తోచిన అర్థం చెప్పుకుంటున్నాడు మరి.  సాంకేతిక కారణాలనేవి సైంధవుడి సోదరుడికి మల్లే   అడ్డుపడకుంటే  ఈ దేశపు  చట్టసభలను నింపే శాల్తీల పడకలన్నీ నిజానికి సెంట్రల్ జైళ్లలో ఉంటాయి. పగటి కలలో అయినా ఆ మాత్రం  సంస్కరణలను ఊహించుకుంటే పిచ్చాసుపత్రిలో బెడ్ సిద్ధం చేసే దుస్థితి. తోటకూర నాటి నుంచే విచ్చలవిడితనం ఇచ్చే సుఖాలు మరిగిన సంతు ఎదిగొచ్చే కొద్దీ ఎంత అసాంఘిక జంతువుగా మారుతుందో చెప్పాలంటే మరో  థగ్గుల చరిత్ర తిరగరాసినంత తంతవుతుంది.  

'ఇచ్చట మల మూత్రములు విసర్జించ రాదు' అన్న హెచ్చరికలు ఇక్కడ దర్శనమిచ్చినన్ని బహుశా ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ కనిపించవు. నడిరోడ్డు పక్కన మగవాళ్లు ప్యాంటు జిప్పులు నిస్సిగ్గుగా తీసే జగుప్సాకరమైన సన్నివేశాలకూ ఈ పవిత్ర దేశమే ప్రథమ స్థానం.  

1936 ప్రాంతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషనంటూ ఓటి ఏర్పడి  గాంధీజీ అప్పటి అవసరాలకని ఇచ్చిన 'పౌరుల సహాయ నిరాకరణ' ఉద్యమానికి ఊతంగా విద్యార్థులను బళ్ల నుంచి బయటికి వచ్చేయమంది. గురువుల బోధనలను ధిక్కరించినవాడే అప్పట్లో గొప్ప దేశభక్తుడుగా గుర్తిస్తానంది! బ్రిటిష్ ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించేలా సమాచార, రవాణా, పాలనా సౌకర్యాలు సర్వస్వానికి ఆటంకాలు కల్పించడాలవంటివి ఏళ్ల పర్యంతం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించిన సంస్కృతి ఈ దేశానిది.  స్వాతంత్ర్యం వచ్చినా తుచ్ఛ రాజకీయాలలో అదే నీచ సహాయ నిరాకరణ ధోరణులు! పుట్టుకొస్తున్న కొత్త తరాలకు  నియమ నిబంధనల పట్ల  ఉండవలసిన స్థాయిలో బాధ్యతాయుతమైన భయభక్తుల కొదవ అందుకేనేమో అనిపిస్తున్నదిప్పుడు! రాజకీయ పక్షాలే స్వలాభాపేక్ష నిమిత్తం విద్యుత్ వగైరా బిల్లులు చల్లించవద్దని, బ్యాంకు రుణాలను నిర్భయంగా  ఎగవేయమని,  పాఠశాలలకు వెళ్లి ఫలానా విద్యలు చదవరాదని,  రాస్తాలను దిగ్బంధనం  చేసెయ్యాలని, బస్సులు పై రాళ్లు రువ్వాలని, రైలు పట్టాలు పీకెయ్యాలని, ప్ర్రభుత్వ అస్తులు ధ్వంసం చేసి మరీ ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శించాలని ప్రోత్సహిస్తున్నప్పుడు సామాన్య పౌరుడికి ఏది ఎప్పుడు ఎవరి మాట ఏ మోతాదులో ఆచరించవలసిన అగత్యం ఉందో ఎట్లా అవగాహనకొచ్చేది?

భారతీయులు అమితంగా ఆరాధించే ఆరాధ్య గ్రంథం భగవద్గీత కర్మయోగమే విశిష్ఠమైన వ్యక్తులు ఏమి చేస్తారో చూసి తతిమ్మా ప్రపంచం దాన్నే అనుసరిస్తుందని   'యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః ।స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే' శ్లోకంలో చెప్పింది కదా! మన నేతాశ్రీలకు గీతలు, రామాయణాలు చదివే పాటి తీరిక ఉండదు.  కాబట్టే  చట్టాలు చేసిన తమ చేతులతోనే ఆ చట్టాలను నిర్భయంగా చట్టుబండలు చేసేస్తున్నారు! భారీ సభలు రోడ్డు కడ్డంగా పెట్టి చెవులు దిబ్బళ్లుపడేలా నినాదాలు చేయించే నాయకులను నుంచి సామాన్యుడేం నేర్చుకోవచ్చు? డ్యూటీలో ఉండే ఉద్యోగులను తిట్టడం, కొట్టడం మాత్రమే నాయకత్వానికి ముఖ్య ల్క్షణంగా భావించే నేతలున్న దేశంలో  పౌరుడు మంచి మార్గాన్ని ఏ మూల నుంచి ఎంచుకోవాలి?

పర్యవసానం ఏదైనా కానీ, చివరికి ఇవాళ మొత్తంగా పడకేసింది సామాజిక ఆరోగ్యం.. దానికి ఏ ఆసుపత్రుల్లో పడక దొరకని దుస్థితి. ఊపిరాడని పరిశుభ్రత.. దానికీ ఆక్సిజన్ కరువంటున్న అస్తవ్యస్త వ్యవస్థ పరిస్థితి!  

 

-కర్లపాలెం హనుమతరావు

25 -04 -2021

Sunday, March 7, 2021

గీత ఓ అందే ద్రాక్ష పండు! -కర్లపాలెం హనుమంతరావు -

 



 కార్పణ్య దోషోప హత స్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః

యచ్ర్ఛెయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే౨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్

భారతీయులు ఆరాధనాభావంతో పఠించే భగవద్గీతలో ఈ సాంఖ్యయోగం - ఏడో శ్లోకంలో పెద్దలు ఎప్పుడూ గుర్తుంచుకుని అనుసరించదగ్గ ఓ గొప్ప  సూక్తి ఉంది

అభిమానం పరిమితులకు మించి పెరిగిపోయినప్పుడు సహజ స్వభావానికి విరుద్ధమైన ప్రవర్తన సంభవిస్తుంది. ధర్మసంబంధ విచక్షణ  పక్కనుంచి సామాజికపరంగా అయినా ఆమోదనీయం కాని సమతౌల్యతను మనసు కోల్పోవడమే ఇందుకు కారణం. సమాజంలోని  ప్రతీ వ్యక్తికీ ఈ సంకట స్థితి ఏదో ఓ సందర్భంలో తప్పదు. అయితే,  జీవితం నేర్పిన పాఠాల సారం వంటబట్టిన కొందరు గుంభనగా ఈ  స్వ స్వరూప సంభంధమైన వైవిధ్యం స్వయంగానే గ్రహింపుకు తెచ్చుకుని  ఆ  వైపరీత్యం నుంచి బయటపడే ప్రయాసలు ఆరంభిస్తారు! ఆ పైన జీవ సంస్కారాన్ని బట్టి జయాపజయాలు!


కానీ, జీవితమనే మల్ల యుద్ధం గోదాలోకి అప్పుడే  పాదం మోపిన పిన్న వయస్కులు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసిన  సందర్భం తటస్తించినప్పుడు నరుడు నారాయణుణ్ణి ఉచిత మార్గ దర్శనార్థం  ఎట్లా దేబిరిస్తాడో అట్లా దేబిరించడం నామర్ధాగా భావిస్తారు.  అన్నీ తమకే తెలుసనుకుని దుందుడుకుగా ముందుకు దూసుకుపోతారు. కలసిరాని సందర్భంలో చతికిలపడే దుస్థితి దాపురించినప్పుడు బేలతనంతో ఆ పిన్నలు తమ సహాయ సహకారాలు, సముచితమైన సలహాలు యాచించే స్థితికి వచ్చే వరకు కన్నవారు ఓపికతో వేచ్చిడాలి.. అదే పెద్దరికం.. అని ఈ శ్లోకం సారాంశం.

మహాభారతంలో అర్జునుడు  యుద్ధరంగం మధ్య ప్రేమానురాగ బద్ధుడై కర్తవ్య విమూఢత్వం ఆవరించిన సందర్భం ఒకటుంది. తన వైరాగ్యానికి కారణం బంధుప్రీతి అనో, పెద్దలు.. గురువుల మీద భయభక్తులనో, విజయసాధనానంతరం అనుభవంలో కొచ్చే రాజభోగాల మీది కాంక్ష ధర్మసంబద్ధం కాదనో.. ఇలా రకరకాల కారణాలు వెతికే దుస్సాహసానికి సర్వలోకసంరక్షకుడి ముందు  దిగే దుస్సాహసానికి పూనుకుంటాడు. కానీ ఈ శ్లోకం దగ్గరకొచ్చేసరికి విజయుడికి తన పరిమితులు తెలిసివచ్చాయి.  తన సహజ రాజస్వభావానికి విరుద్ధమైన కరుణ, జాలి వంటి గుణాలే ఈ సంక్లిషతకు కారణమని  అవగాహన ఏర్పడింది. ఆ భావన కలిగించింది అప్పటి వరకు తాను కేవలం మిత్రుడిగా భావించిన యదువంశ సంజాతుడు శ్రీకృష్ణుడే. ఎదుట ఉన్న ఆ వ్యక్తి తన బాంధవుడిగా మాత్రమే భావించి తన మనోభావాలని యధేచ్ఛగా పంచుకున్నావాడల్లా జగద్గురువన్న ఎరుక కలిగిన మరుక్షణమే అతనని తన మార్గదర్శుగా ఎంచుకున్నాడు. తగిన కార్యాచరణ సూచించమనే స్థాయి వరకు  దిగివచ్చాడు.  తనను శాసించే సర్వాధికారాలు సమర్పించే దాసస్థితికి ఆ నరుడు చేరువ అయినప్పుడుగాని ఆచార్యుడు కర్తవ్యబోధకు పూనుకోలేదు. 

నరుడికి ఓపిక లేకపోవచ్చును గాని.. నారాయణుడిలోని పెద్దరికనికి  ఎందుకుండదు! పెద్దలూ, పిన్నలతో గీతలోని ఆచార్యుని ర్తీలోనే  సాగాలని  ఈ శ్లోక సారం. 

పండు పిందె దశలో ఎలా వగరుగా ఉండి రుచికి హితవుగా ఉండదో.. పిల్లల ప్రవర్తనా ప్రాథమిక దశల్లో సమాజపోకడలకు విభిన్నంగా సాగుతూ సబబనిపించదు. పిందె పచనానికి పనికి రాని విధంగానే పిల్లలూ బాల్యదశలో పెద్దల మార్గానికి భిన్నమైన దారుల్లో పడిపోతూ ఇబ్బందులు కలిగిస్తారు.  తమ శక్తి సామర్థ్యాల, శక్తియుక్తుల పరిమితులు గ్రహణకొచ్చిన తరువాత తప్పక పెద్దలను ఆశ్రయిస్తారు. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం భారతంలోని కృష్ణపరమాత్మునికి మల్లే సద్వినియోగం చేసుకోవడమే పెద్దల కర్తవ్యం- అని ఈ శ్లోకం ప్రబోధిస్తుంది.


గీత కేవలం భగవానుని ఉవాచ మాత్రమే కాదు. ఆ ఆధ్యాత్మిక కోణంతో పాటు అదనంగా వ్యక్తిత్వ వికాస సంబంధమైనదని కూడా ప్రపంచం క్రమంగా గుర్తిస్తున్నదిప్పుడు. నిత్య జీవితానికి అక్కరకొచ్చే సూక్తులని గ్రహించి ఆచరణలో పెట్టే వారందరికీ 'గీత' ఎప్పుడూ అందే  ద్రాక్షాపండే!

 -కర్లపాలెం హనుమంతరావు

బోథన్, యూఎస్ఎ

07 -03 -2021

Tuesday, March 2, 2021

ఆటలు- సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 

తాటికాయలకు పుల్లగుచ్చి దర్జాగా దొర్లించుకుంటూ వెళ్లే రెండు చక్రాల బండి, ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని క్షణాల్లో సృష్టించే పొగలేని రైలుబండి, ఒకటి నుంచి వంద ఒంట్లు లెక్కబెట్టిన బుజ్జి దొంగ కళ్లు తెరిచి చేసే భీకర వెతుకులాట, ఝుమ్మని తిరిగే బొంగరం, కూత ఆపకుండా గోదాలో నిలిచే ఆటగాడి పనితనం, పెచ్చులుగా పగిలే గోళీలు, పెరటి కొమ్మలకు ఊగే ఊయలలు, వరండాల్లో అష్టాచెమ్మా, వీ«థుల్లోన కుందుడుగుమ్మా... మన ఆటలు నిజంగా బంగారం. మన పిల్లల కోసం సంప్రదాయం సృష్టించిన తెలుగుదనపు సింగారం.

బొద్దుగా ముద్దుగా ఉండే కుమారరత్నం పొద్దున లేస్తే టీవీకి అతుక్కుపోతాడు. నోరు తెరిస్తే పవర్‌ రేంజర్స్, పొకెమాన్‌ మాట్లాడతాడు. అవసరమైతే బేబ్లేడ్‌లు అడుగుతాడు. కాదంటే చాక్లెట్‌ ఫ్యాక్టరీ చదువుతానంటాడు. అమ్మాయికి ఎస్‌ఎంఎస్‌ల పిచ్చి. చాటింగ్‌లో తప్ప క్లోజ్‌ ఫ్రెండ్‌ ఎదురుగా నిల్చున్నా మాట్లాడదు. టైముంటే ట్వంటీ ట్వంటీ, నో అంటే టామ్‌ అండ్‌ జెర్రీ.

వీళ్ల ఇష్టాలు వీళ్లవే. వీళ్ల కోసం పిజ్జాలు బర్గర్‌లు కాదనక్కర్లేదు... కాకపోతే అప్పుడప్పుడన్నా మన సద్దిబువ్వ సంగతి తెలియాలి. వాటర్‌ పార్కులు, హారర్‌ హౌస్‌లు ఎంజాయ్‌ చేయాల్సిందే... కానీ ఏడాదికోమారన్నా వరిచేల మీద నుంచి వీచే చల్ల గాలి వీళ్ల ఒంటికి తగలాలి. అమ్మమ్మ కలిపే ఆవకాయ ముద్ద నోటికి అందాలి. మట్టివాసన తెలియని వాళ్లకి మరే పరిమళం అంటదంటారు. మన సంస్కృతి తెలియనివారికి మరే సంస్కృతైనా అర్థం అవుతుందా? తెలుగు భాష తీయదనం పిల్లల నాలుకకు తగలాలని ఉద్యమిస్తున్నట్టే తెలుగు ఆటల రుచి వారికి చేరువ కావాలని ఎందుకు ఉద్యమించకూడదు?

ప్రతిదీ ఒక ముచ్చట...

పిల్లలంతా గోలగా మూగుతారు. జట్లు జట్లుగా పంటలు వేస్తారు. ఒక్కొక్కరూ ‘పండు’గా మారి చివరకు ఒకరిని దొంగ చేస్తారు. ఆ దొంగతో దాగుడుమూతలు ఆడతారు. ఆ దొంగతో కోతి కొమ్మచ్చి ఆడుతారు. ఆ దొంగను కుంటుకుంటూ వచ్చి కుందుడుగుమ్మలో అందరినీ పట్టుకోమంటారు. ఆ దొంగ మెడలు వంచి ‘ఒంగుళ్లూ దూకుళ్లూ’ వినోదిస్తారు. ప్రతిదీ ఒక ముచ్చట. జీవితంలో గెలుపోటములను నేర్పే కళ. అందని వాటిని అందుకోవడం, దొరకనివాటిని వెతుకులాడటం, అనువుకాని చోట తలను వంచడం, అడ్డంకులు ఉన్న చోట ఒంటికాలితోనైనా సరే గమ్యాన్ని చేరుకోవడం... మన ఆటల్లో నిగూడార్థాలు... నిబ్బరాన్ని నింపే రహస్య సూచనలు.

ఖర్చు లేని వినోదం...

ఒక క్రికెట్‌ కిట్‌ కొనాలంటే ఎంతవుతుంది? ఒక టెన్నిస్‌ రాకెట్‌కు ఎంత వెచ్చించాలి. ఒక సాయంత్రానికి షటిల్‌కాక్‌లు ఎన్ని సమర్పించాలి? వీడియో గేమ్స్‌ వెల ఎంత? కానీ మన ఆటల్లో ఎంత ఖర్చవుతుంది? చింతపిక్కలు, ఇటుక ముక్కలు, వెదురుకర్రలు, రూపాయికి ఇన్నేసి వచ్చే గోళీలు... అందుబాటులో వున్న వస్తువులనే క్రీడాసామాగ్రిగా చేసుకొని ఖర్చులేకుండా వినోదించడం మన గ్రామీణులు నేర్చిన విద్య. బాదం ఆకులు కుట్టుకోవడం తెలిసినవాడు పేపర్‌ప్లేటు వచ్చేదాకా తలగీరుకుంటూ నిలుచోడు. గమనించి చూడండి... మన ఆటలన్నీ ఇలాంటి నేటివ్‌ ఇంటెలిజెన్స్‌ను పెంచేవేన్మళ్లీ చిగురించాలి...

సమిష్టి తత్వాన్ని, సామూహిక జీవితాన్ని, అనుబంధాలను, పరస్పర ప్రేమానురాగాలను పెంచేవే గ్రామీణ క్రీడలు. నేడు గంటల తరబడి టీవిల ముందు కూర్చొని సీరియల్స్ చూడడం, ఆట ఆడడం కన్నా ప్రేక్షకుల్లా, శరీరం కదలకుండా చూడడమే మనకు ఆటపాట అవుతుంది. ఇది చాలదన్నట్లు యువత వీడియోగేమ్స్ రూపంలో తీరిక లేకుండా ఉంది. గత కాలంతో పోల్చిచూస్తే గ్రామీణ క్రీడలకు ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ క్రీడల్లో చాలావరకు మాయమై ఒకటి, రెండు మాత్రమే మిగిలాయి. వస్తువులు మాయమైనట్లే, మనుషులతోపాటు మమతలు దూరమైనట్లే ఆటలు కూడా వాటిని అనుసరించాయి. గ్రామీణ క్రీడలు మన శరీరానికి, మానసిక వికాసానికే కాక వినోదానికి కూడా ప్రాధాన్యత ఇస్తాయి. తార్కిక బుద్దికి ఎత్తుకు పైఎత్తులు ‘పుంజీతం’ నేర్పితే, ముందువాడిని వెనక్కునెట్టి రాజు కావడం ఎలానో ‘పచ్చీసు’ వివరిస్తుంది. ఇటువంటి ఆటలు గ్రామీణ క్రీడలుగా చెబుతున్నప్పటికీ ప్రతి ఆటలోని మనవాళ్లు ఐక్యతకు పెద్ద పీట వేశారు. ఈ క్రీడలు ఆటకైనా, బ్రతుకు ఆటకైనా నిబంధనలుంటాయని తెలుపుతాయి. సృజన వ్యక్తిగత ప్రతిభ నుండి పుట్టి సమాజగతమవుతుందని ఈ క్రీడలు నిరూపిస్తాయి. చిన్నారులు ఆడే గోలీల ఆటతో వారిలో చక్కని స్నేహబంధాన్ని చూడవచ్చు. మనిషి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న తరుణంలో పిల్లలు గోళీల ఆట ఆడి అధికంగా గోళీలు సంపాదిస్తే వారు పొందిన ఆనందానికి అవధులుండవు. ఐదువేళ్లు కలిపి ఆడే అచ్చనగిల్ల చేతివేళ్లకు వ్యాయమంతోపాటు బాలికలలో దాగి ఉండే సృజనాత్మక శక్తిని వెలికి తీసేదిలా ఉంటుంది. శరీర వ్యాయామానికి తొక్కుడుబిళ్ల ఆట దోహదపడుతుంది. గతంతో తీరిక సమయాల్లో గ్రామాల్లోని కూడలి వద్ద అష్టచమ్మ, దాడి, వామనగుంటలు లాంటి ఆటలు గ్రామస్తులు అధికంగా ఆడేవారు. చిన్నచిన్న పందాలు కాస్తూ ఆటకు రక్తికట్టించేలా వారు క్రీడల్లో పాల్గొనేవారు. గ్రామీణ క్రీడలు ఎటువంటి ఘర్షణ వాతావరణానికి తావివ్వకుండా ఐక్యత వాతావారణంలో కొనసాగేవి. ఇంతేకాకుండా గోడిబిళ్ల, చెడుగుడు, కబడ్డీ క్రీడలు దేహధారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా మనిషిలోని సహజస్థితి, కలసికట్టు తనానికి నిదర్శనంగా ఉంటాయి. ప్రస్తుత సెల్‌యుగంలో ఈ గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్నాయి. గ్రామాల్లో ఐక్యత వాతావరణం దెబ్బతిని కక్షపూరిత వాతావరణం పెరుగుతుంది. ప్రశాంతతకు భంగం వాటిల్లిన పల్లెలు సౌభాగ్యాన్ని పూర్తిగా కోల్పోతున్నాయి. కబడ్డీ మోటయింది. గోలీలు మూలనపడ్డాయి. దాగుడుమూతలు దగాకోరు ఆటగా ఎదిగింది. గ్రామీణ క్రీడల స్థానంలో క్రొత్త క్రీడలు వచ్చాయి. క్రికెట్, టేబుల్‌టెన్నిస్, గోల్ఫ్, స్నూకర్ తదితర పాశ్చాత్య ఆటలను ప్రస్తుతం అనుకరిస్తున్నారు. ప్రశాంత గ్రామీణ వాతావరణంలో ఆడాల్సిన క్రీడలను మరచిపోయి పాశ్చాత్య ఆటలను కొనసాగిస్తున్న గ్రామీణ ప్రజలు ఒకరినొకరి మధ్య ఎటువంటి ఐక్యత లేకుండా గడపాల్సిన దుస్థితి రోజురోజుకీ పెరుగుతుంది. ప్రభుత్వం గ్రామీణ క్రీడలు ప్రోత్సహించేందుకు గ్రామాల్లో క్రీడలు నిర్వహిస్తున్నప్పటీకి వాటికి గురించి ప్రజలను చైతన్య పరచడంలో విఫలమవుతుంది. ప్రతి పాఠశాలలో గ్రామీణ క్రీడలు విద్యార్ధులకు నేర్పించే విధంగా చర్యలు తీసుకొని, ఐకత్య వాతావారణం చోటు చేసుకునేలా ప్రయత్నించాలని క్రీడకారులు కోరుతున్నారు.

కోటీశ్వరుడైనా మంచి ఆరోగ్యం లేకపోతే గరీబే అన్నది నానుడి. ఆరోగ్యంతోనే జీవితం ముడిపడి ఉంది. చిన్ననాటి నుంచి క్రీడలు, వ్యాయామం, యోగా వంటివి అనుసరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేటి రాకెట్‌ యుగంలో విద్యార్థులకు చదువులో పోటీ పడుతూ ఆరోగ్యాన్ని పెంచే ఆటలను విస్మరిస్తున్నారు. తరాలు మారాయి, అంతరాలు పెరిగాయి.. పల్లెటూళ్లు పట్నం వైపు పరుగులు ఆగడం లేదు.. ఆధునికతను సంతరించుకోవాడానికి చేస్తున్న ప్రయత్నంలో కంప్యూటర్లు, ఇంటర్‌నెట్లు, ముఖ పుస్తకం (ఫేస్‌బుక్‌), వాట్సాప్‌, టీవీలు చిన్నారుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాయి. తాతయ్య, నానమ్మలు చెప్పిన నీతి కథలు, అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకున్న సంప్రదాయ ఆటలు క్రమంగా దూరమయ్యే పరిస్థితులు వచ్చాయి. మేధస్సును పెంచుతూ సత్ప్రవర్తనను పెంచే అలవాట్లను వదిలి సాంకేతిక సామగ్రితో కుస్తీ పడుతూ తెలియని ఒత్తిడికి గురవుతోంది నేటి బాల్యం.

**చరవాణుల్లో ఆటలు, రోజంతా పుస్తకాలతో కుస్తీ పడుతూ చిన్నారులు సృజనకు దూరమవుతున్నారు. అయితే ఇవన్నీ ఒకవైపు మాత్రమే. నాటి సంప్రదాయాలకు పల్లెలూ, పట్టణాల్లో కొంత ఆదరణ కనబడుతోంది. పల్లె నుంచి పట్నం వెళ్లి ఆధునికతకు అలవాటు పడినా సంస్కృతిని ప్రతిబింబించే ఆటలపై ఆసక్తి పెరుగుతోంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో ప్రతి వీధిలో క్రికెట్‌ బంతికి బదులు కర్రా బిళ్లా కనిపిస్తుంది. చెట్ల కిందకు చేరి కోతి కొమ్మచ్చి, ఇంట్లోనే కూర్చుని బొమ్మలతో ఆడే అష్టాచమ్మా, మేధస్సును పెంచే చదరంగం, గోళీలాట, దుకుడు, బాలికలు ఆడే తొక్కుడు బిళ్ల వంటి ఆటలు నేటికీ దర్శనమిస్తున్నాయి. పాఠశాలల్లో ఆరోగ్య విద్యను నేర్చుకున్న చిన్నారులు వేసవి, విశ్రాంతి సమయాల్లో ఆటలు ఆడటం వల్ల నాయకత్వ లక్షణాలు పెంచుకుంటున్నారు.

**‘దూకుడు’ ఆట

ఒకరిని ఒంగొని ఉంటే పరిగెత్తుకుని వచ్చి పైనుంచి దూకే ఆట ఇది. కోతి కొమ్మచ్చి-పల్లెల్లో ఈ ఆటను కాలు కింద కర్ర అని  పిలుస్తుంటారు. చెట్టు నీడన దీనిని ఆడటంతో పిల్లలు త్వరగా అలసిపోకుండా ఉంటారు. భళారే గోళీకాయలు

పల్లెల్లో నేటికీ ఎక్కువగా చిన్నారులు ఆడే ఆట గోళీలాట. పిల్లల నుంచి యువకుల వరకు ఈ ఆట అంటే ఇష్టపడతారు. గోళీని విసిరి గురి చూసి కొట్టి మరలా జాన దూరంలో గోళిని వేయాలి. లక్ష్యం మేరకు గురి చూసి కొట్టి విజేతగా నిలవడం ఈ ఆటలో ప్రత్యేకత. ఆనందాల అష్టాచెమ్మా..

ఇది 25 అడుగుల చతురస్రాకారపు  నలుగురు వ్యక్తులు  నాలుగు కాయలు పెట్టుకుంటారు. చింతగింజలు, గవ్వలతో గాని పందేలు వేస్తారు. ఒకటి నుంచి ఎనిమిది వరకు లెక్కిస్తారు. అష్ట పడితే 8, చెమ్మ పడితే నాలుగుగా గుర్తించి ఆడతారు. పడిన పందెం ప్రకారం కాయలను తామున్న గడి నుంచి ముందుకు కదుపుతారు. ఎవరి కాయలు ముందుగా మధ్య గడిలోకి చేరితే వారు గెలిచినట్లు. గిల్లీ దండా (గూటీబిళ్ల) ఓడిపోతే దండనే..

పాశ్చాత్య క్రీడ అయిన క్రికెట్‌ రాకముందే అనాదిగా గిల్లీ దండా (గూటీబిళ్ల) అందరికీ సుపరిచితమే. క్రికెట్‌ మాదిరిగా ఉండే ఈ ఆటలో కూడా పలు రకాలున్నాయి. ఎంతమందైనా ఆడే అవకాశం ఉంటుంది. ఒక జట్టు వారు కర్రను గోతిలో పెట్టి కొడతారు. కర్రను అలా కొడుతూ ప్రత్యర్థులను దొరక్కుండా కొనసాగిస్తారు. ఎక్కడైతే బిళ్లను కొట్టలేకపోతారో అపుడు వారు ఓడిపోయినట్లు గుర్తిస్తారు. అపుడు అవకాశం రెండో జట్టుకు వస్తుంది. మేధస్సును పెంచే చదరంగం

ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మన సృజనాత్మకతను పెంపొందించే ఆట చదరంగం. కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మేధస్సుతో ఆడే ఈ ఆట అంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారు. చదరంగా బాగా ఆడేవాళ్లు చదువులోనూ ముందుంటారని పలువురు నిరూపిస్తున్నారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం ఇందులో ప్రధానంగా ఉంటుంది. ఏనుగు, గుర్రం, శకుని, మంత్రి, రాజు, భటులు ఉంటారు. పావులు కదుపుతూ రాజుకు చెక్‌ చెప్పకుండా ఆడటమే ప్రధానం.

- సేకరణ ; కర్లపాలెం హనుమంతరావు

Saturday, February 20, 2021

తియ్యండిరా బళ్లు- సరదా వ్యాఖ్య -కర్లపాలెం హనుమంతరావు

 


'తియ్యండిరా బళ్లు' అని అరవందే  విలన్ పాత్రకు   న్యాయం జరిగినట్లు కాదు తెలుగు యాక్షన్ సినిమాలో!ఇవాళ ఆ బళ్లు బైటికి తియ్యడం నిన్నటి కన్నా ఖరీదైన వ్యవహారం. తొమ్మిది రోజుల కిందట కాని ఈ బళ్ల సన్నివేశం జరిగివుండుంటే పాపం, ప్రతినాయకుడి కాతాలో ఒక్కో బండికి లీటరు పెట్రోలు  ఐదు రూపాయలు,  డీజిల్ నాలుగు రూపాయల ఎనభైఏడు పైసలు ఆదా అయేది. విలన్ అంటే నలుగుర్ని తన్నో, బెదిరించో వసూలు చేసేది కాబట్టి అతగాడి సొమ్మేం పోయేది కాదు.  సగటు పౌరుడికయితే నడ్డి  విరగుడు ఖాయం. గతుకుల రోడ్ల మీద ప్రయాణాలతోనే కాదు సుమా, మన దేశంలో సామాన్యుడి నడ్డి విరగడంలో అసాధారణమైన పాత్ర చమురు ధరలకే ఎక్కువ.'పెరుగుట విరుగుట కొరకే' అనే మెట్ట సిద్ధాంతం మెరక మీద  మెత్తటి బెంజి బళ్లలో  నిత్యం ప్రయాణం చేసే సౌకర్యం ఉన్న దొడ్డప్రబువులకే! గంజి తాగే జీవైనా సరే ప్రయాణాలకు బస్సులు, షేర్ ఆటోలూ వాడక తప్పదు కనక ధరల పెనుభారంలో వాడి వాటా కూడా ఉన్నట్లే!కోవిద్ పంథొమ్మిది వ్యాప్తి కోసం కృషిచేసే కరోనా వైరస్ కథలానే మన దేశంలో చమురు ధరల పెరుగుదల మూల రూపమూ ఒక పట్టాన అంతుపట్టదు. ముడి సరుకు ధరలని ఒకసారి, శుద్ధి చేసే ఖర్చులకని మరోసారి, అమ్మకంలో కంపెనీల వాటాలు ఆటి రావడం లేదని ఇంకోసారి.. ఇట్లా ఏదో ఒక పాము వైకుంఠపాళి ఆటలో  సగటు మనిషి బతుకుతో పేకాడుతూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా తాళాలేసేసాం.. ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండండి అన్నాయా ప్రభుత్వాలన్నీ! పోనీలే పెట్రోలు ఖర్చన్నా కలిసొస్తుందన్న మురుసుకున్నంత సేపు పట్టలేదు! అట్లా గొళ్లాలు తీసీ తియ్యంగానే ఇట్లా పెట్రోలు, డీజిళ్ల బాదుళ్లు మొదలైపొయ్యాయ్! వేతనాలకు కోత పెట్టండని తాకీదులు పంపించిన పెద్దలది చమురు ధరల జిడ్డు దగ్గర.. అంతర్జాతీయం.. అనుసంధానం అంటూ ఎప్పుటి రోటిపాటే! ఉద్యోగాలు పీకేయడంలో కనిపించిన ఉత్సాహం, ఉద్దీపనలప్పుడు ఎట్లాగూ చప్పడిపోయింది. కష్టకాలం కదా..  పోనీ తమ ఎక్సైజ్, వ్యాట్ పన్నుల వాటాలైనా ఉదారంగా కాస్తింత వదులుకున్నాయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు? 

మందు తాగబోయండని ఆందోళన చేసినప్పుడు లేని డబ్బు వృథా మేటర్ ..  బళ్లకు చమురు పోసే వేళనే  గుర్తుకొస్తుందా? అని వేళాకోళానికి దిగితే మొహం వేళాడేయాల్సిందే పౌరసమాజం. యథా ప్రజా తథా రాజా! ముఖ్యంగా వృథా ఖర్చుల్లో!

ముడి చమురు ధర పడిపోయినా, పన్నులు ధాటిగా నిలబడే ఉండటం మన దేశం ప్రత్యేకత. జనవరిలో బారెల్ ధర దారుణంగా దిగివచ్చిందన్నారు. అయినా పన్నులు మొండిబుద్ధే చూపించాయ్! ఇప్పుడు పెట్రోలు మూల ధర మీద  పన్ను శాతం దాదాపు 254- అని కేర్ రేటింగ్స్ పరిశోధనలు  హెచ్చరిస్తున్నాయ్! అయినా 'డోంట్ కేర్' మూడ్ లోనే ఉన్నాయ్ ప్రజలెన్నుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు!  ధరల పెరుగుదలలో పన్నులదే సింహభాగం పాపం. 

పాపం ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయ్! ఇంధనం పన్నులు పెంచినందు వల్ల  ధరలు తగ్గినప్పుడు జనాలు చేసే వృథా ఖర్చులకు కళ్లెమేసే బాధ్యత దేవుడి కొదిలేయలేవు  కదా!లాక్ డౌన్ మూలకంగా లాభం కుదేలయిన వర్గాలలో ప్రభుత్వాలదే పెద్దపీట. ఎనభై రెండు రోజులు ఉగ్గబట్టుకునుండటమే పన్నుల శాఖలో పెద్ద రికార్డు.  ఇంధనం మీద పన్నుల రూపంలో వచ్చే ధనమే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం. ఘరానాగా చెప్పుకునే ఖజానా లెక్కల్లో చమురు పన్ను లెక్కలు కోసేస్తే ప్రభుత్వాలకు మిగిలేది జానా బెత్తెడు ఆదాయం.

బార్ లో  మందంటే వీజీగా బుర్రకెక్కుతుంది. కానీ ఈ బారెల్స్.. డాలర్స్, ప్రపంచ ధరల సూచిక, వినియోగదారుల ధరల సూచిక, ద్రవ్యోల్బణంలాంటి తకరాలు  జనాల తలలకేమెక్కేను? అదీ ధీమా!  మందు బాబులతో పోటికి దిగినట్లు బళ్లువాడేవాళ్లూ  చమురు ధర క్రతువులో మూడొంతులు పన్నుల రూపంలో సమిధలు సమర్పించుకుంటున్నారు.  డాలరు కన్నా రూపాయి కండపడితే తప్ప ఈ చిల్లర ధరలతో సామాన్యుడు కుస్తీపట్టలేడు. 

పెట్రోలు నీళ్లలా వాడే దేశాలలో మనం ముందున్నట్లు ఒబామా హయాం నుంచి ఓ అభియోగం ఎటూ  ఉంది. పోనీ ఆ పరిస్థితుల్లో అయినా మార్పు తెచ్చే ప్రయాస కనిపిస్తుందా? ప్రొటోకాల్ పేరుతో గల్లీ నేతగారి   ముందూ వెనకా సాగే కార్ల దండు రిపబ్లిక్ పెరేడ్ వందన సమర్పణ గుర్తుకుతెస్తుంది! పన్ను దెబ్బ సామాన్యుడి మీద ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగా అంతకు మించి ఎన్నో రెట్లు. రావాణా ఛార్జీల నిర్వహణ వంకతో శవాలు తరలించే మహాప్రస్థానం సైతం పన్నులు వసూలు చేసే రోజులు ఆట్టే దూరంలో లేవేమో కూడాను. 

ఆదాయం రాబట్టటమా,  ద్రవ్యోల్బణం పెరుగుతుంటే గుడ్లప్పగించి చూడడమా?  నింద పడితే పడ్డది లెమ్మని అందుకే ప్రభుత్వాలెప్పుడు పన్నులు బాదే బాధాకరమైన బాధ్యత దేవుడి కొదిలేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోనిది.  

***

Thursday, February 18, 2021

మహాత్ముడూ మామూలు మనిషే! కానీ మన కళ్లాకు కాదు! వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

 


 

గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా ఓవర్ భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.

కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది. 

అటెన్ బరో 'గాంధీచిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద,వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటేనిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట  గ్యారంటీ!

వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగా మొదలై .. బాపూజీగామహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని పెళ్లి చేసుకునిఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగాను  అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశానికి తిరుగుముఖం పట్టింది. 

దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా  వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటాను'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక పూట ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుందిఅంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు. 

మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల్ ఉద్దేశం. 

బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలుఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?! 

ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడుసీత,ఆంజనేయుడు వంటి ఎన్నో పౌరాణిక  పాత్రలకూ తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!

-కర్లపాలెం హనుమంతరావు

19 -02 -2020

(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...