Showing posts with label Food. Show all posts
Showing posts with label Food. Show all posts

Wednesday, December 29, 2021

వ్యాసం ప్రబంధాలలో పండుగ భోజనాలు - ఉత్పల సత్యనారాయణాచార్యులు ( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

 వ్యాసం 


ప్రబంధాలలో పండుగ భోజనాలు 

- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 



తెలుగు సాహిత్యమున ఏదో యొక విందునో భోజనమునో పురస్కరించుకొని తెలుగువారి వంటకాలను విస్తరించి వర్ణించిన కవులలో ప్రముఖులు   శ్రీనాథుడు, శ్రీకృష్ణ రాయలు, పింగళి సూరన్న, తంజావూరు నేలిన విజయ  నాయకుడు. 


ఆయా కవులు తమ కులాచారములకును, అభిరుచులకును దగిన భోజన సదా ర్థములను వర్ణించియుండిరి. రాయలుమాత్రము  బ్రాహ్మణ..  బ్రాహ్మణేతర భోజనముల రెంటిని లెస్సగా నెఱిగినవా డగుట శాకాహార మాంసాహార భోజనముల జక్కగా వర్ణించి సమకాలపు సాంఘిక జీవనమును మనకు సాక్షాత్కరింప జేసి యున్నాడు. 


విస్సనమంత్రి పంక్తిని గూర్చుండి శ్రీనాథుడు హేమ పాత్రాన్న మారగించెడివాడు. అతని భోజనము సాధారణ మైన దైయుండదు. ఒకప్పుడు పల్నాడులో నొకరింట జొన్న న్నము పెట్టి, చింతచిగురు, బచ్చలాకు కలిపిన యుడుకు కూర వడ్డించిరట. కప్పురభోగి వంటకమున కలవాబుపడిన కవిసార్వ భౌమున కది యెట్లు రుచించును?


ఫుల్లసరోజనేత్ర ! యల పూతన చన్నుల చేదు ద్రావి నా 

సల్ల దవాగ్ని మ్రింగితి న టంచును నిక్కెద వేమొ తింత్రిణీ

పల్లవయు క్తమౌ యుడుకు బచ్చలి శాకము జొన్నకూటీతో 

మెల్లగ నొక్క ముద్ద మ్రింగుము నీ పస కాననయ్యెడిన్


అని పరిహాసము చేసినాడు. సన్నన్నము సున్నయైన పల్నాటి సీమను హేళన చేసి 'రసికుడు పోపడు పల్నాడు' అచట 'కుసు మాస్త్రుండైన జొన్నకూడే కుడువవలసి వచ్చు' సని యెఱుక పఱిచినాడు. ఆ కాలమున పూటకూలి ఇండ్లలో ముఖ్యముగా  లక్ష్మణవజ్ఝల నొక్క రూకకు చక్కని భోజనము లవారింట లభించెడిదట.


కప్పురభోగి  వంటకము కమ్మని గోధుమ పిండివంటయున్ 

గుప్పెడు పంచదారయునుక్రొత్తగ గాచిన యాలనే పెస 

ర్పప్పును గొమ్మున ల్లనటి పండ్లను నాలుగు నైదు నంజులున్ లప్పలతోడ త్రొంబెరుగు లక్ష్మణవజ్ఝల యింట రూకకున్.


తెలుగువారికి ముఖ్యముగా గుంటూరు మండల వాసులకు గోంగూర తగనియిష్టమను వాడుక యున్నది. ఆ ప్రాంతము వాడేయయిన శ్రీనాథు డేలనో గోంగూరను గొనియాడిన వాడు కాడు. ఇది చింతింపదగిన విషయమే మఱి ! ఆ కాలమున భోజనపరాక్రమము గల ఏ రామయమంత్రియో 'గోంగూర వంటి కూరయు గాంగేయునివంటి ధన్వి, నభూతోన భవిష్యతి' యని ప్రస్తుతించియుండవచ్చును. 'మా రామయమంత్రి భోజన పరాక్రమ మే మని చెప్పవచ్చు ఆ స్వామి యెఱుంగు తత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్ ' శ్రీనాథుడు, గోంగూరను గొనియాడకపోయినప్పటికి అరవవారి విండ్లను నిరసించియుండుట చేత నాంధ్రత్వమును నిల్పినవాడై నాడు. 


తొలుతనే ఒడ్డింత్రు  దొడ్డ మిర్యపుజారు చెవులలో పొగవెళ్లి చిమ్మి రేగ

బ్రహ్మరంధ్రము దాకా  బాఱు నావ పచ్చళ్లు మున్నగు అరవ పచ్చళ్లత నికి నచ్చవు. ఈ కవి సార్వభౌముడు కన్నడదేశమున కరిగియచ్చట 'రుచులు దోసంబంచు పోనాడి' నిస్పృహచెందిన వాడు. కావ్యపా కాలలో శ్రీనాథుడు నేటికాలపు రమ్యతయు రుచియు తెలిసిన రసికుడు ఇడైనలకు తన కావ్యమున చో టిచ్చిన యీ కవి నేటి నవనాగరిక యుగమున నుండదగినవాడు.


రాయలు ఋతుపర్ణనలో నాయా కాలములకు దగిన పంటక ములను బేర్కొనియున్నాడు. బ్రాహ్మణభోజనమును గూర్చి చెప్పుచు రాయలు పొరివిళం గాయలను బేర్కొ నెను. వేపుడు బియ్యపు పిండి బెల్లపు పాకముతో జేసిన యుండ లవి. పెరుగువడియములు, పచ్చివరుగులు - వాన కాలమున గలమాన్నము ఒల్చిన పప్పు, నాలుగైదు పొగపిన కూరలు - వేసవి కాలమున నులివెచ్చని యన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని యంబలి, చెఱకుపాలు, ఎడనీళ్లు, వడపిందెలు, ఊర గాయలు, నీరుచల్ల – ఇక చలికాలమున మిరియపు పొళ్లతో గూడిన వెచ్చవెచ్చని కూరలు, అవపచ్చళ్లు, చేయి చురుక్కను నేయి, ఇవురగాచిన పాలు బ్రాహ్మణు లారగించెడివారట.


తారుణ్యాతిగ చూతనూత్న ఫల యుక్తాలాభిఘార స్వన 

ద్ధారాధూపిత శుష్యదంబు హృత మాత్స్యచ్ఛేద పాకోద్దతో ద్గారంపుంగనరార్చు భోగులకు సంధ్యావేళలం గోళికాం 

తారాభ్యంతర వాలుకాస్థిత హి మాంతర్నారికేళాంబువుల్


మాంసాహారులైన ధనికులు వేసవి కాలమున చేపల తునకలలో మామిడి కాయముక్కలు వేసి తాళింపు పెట్టి మధ్యాహ్న వేళలం దల్పాహారముగా బుచ్చుకొనెడివారట. ఆ పిమ్మట స్నాన శాల దాపున దడియిసుకలో బూడ్చి పెట్టిన కొబ్బరిబొండములు దీసి ఎడనీరు త్రాగి చేపల కనరును పోగొట్టుకొనెడివా రట. శాకాహారపు అల్పాహారముగూడ నిండకు దక్కువైనది కాదు. పనసతొనలు, దోసబద్దలు, తియ్యదానిమ్మలు, గసదాడి అరటి పండ్లు పానకములు బ్రాహ్మణులు సాపడుచుండెడివారట.


శ్రావణ మాసమున ఆకుకూర అధికము. ఆకాలమున సామాన్యులైన రెడ్లు చెంచలి, తుమ్మి, లేత తిగిరిసాకు తఱగి చింతచిగురు కలిపి నూనెలో వేయించి పొడికూర చేసికొనెడి వారు.


గురుగుం జెంచలి దుమ్మి లేదగిరి సాకుం దింత్రిణీ పల్లవో 

త్కరముం గూడ దొరంటి సూనియలతో గట్టావి కుట్టారు

గిరముల్ మెక్కి తమిన్ బసుల్ పొలము వో గ్రేపుల్ మెయుల్నాక మే 

కరువు గుంపటి మంచ మెక్కిరి ప్రభు త్వైకాప్తి రెడ్లజ్జడిన్.


పెద్ద నార్యుడు శ్రీనాథుని వంటి అనుభవ రసికు డయ్యును నారని కేలతో వంటకములపై బుద్ధిపోలేదు. ఆయనకు 'ఆత్మ కింపయిన భోజన' మున్న జాలు. కప్పురభోగి పంటకముకన్న పెద్దన్నకు కప్పురపు ఏడెమే ముఖ్యము. 


పారిజాతాపహరణప్రబంధమున నంది తిమ్మన్న 'శాక పాకంబుల చవులు వక్కా ణించుచు' శ్రీకృష్ణుడు భుజించినట్లు వర్ణించి యుండెనే కాని, ఆ శాక పాకములను మనదాక రానిచ్చిన వాడు కాదు.


కమ్మనై కారమై నేతను పండంబొల్చి, త దుమురై పాఱుటల్ లేక సద్యోజనితంబుల్ వోలెఁ జాలు జపులోదవునవి కండచక్కెర పాకమున దయారయినవియు సగు అప్పాలను తెనాలి రామకృష్ణుడు వర్ణించెను. ఇచ్చట కార మనగా ఘాటని అర్థము. పింగళి సూరనార్యుడు తన కథానాయకుడై న క ళాపూర్ణునకు బ్రాహ్మణ భోజనమే పెట్టించెను.


పట్లు మండిగలు బొబ్బట్లు వడలు కుడుములు సుకియలు గడియంపుటట్లు వె

కల వంటకములు బూరెలు తేనె తొలలు చా న్నప్పాలు వడియంబు లప్పడాలు బొంగరములు సొజ్జెబూరె కాగుల సేవె లుక్కెర లరిసెలు చక్కిలములు.


తంజాపు రాంధ్ర నాయక రాజైన రఘునాథ భూపాలుడు శ్రీనాథుని కప్పురభోగి పంటకములను చవిచూచినవా డగుటచే గాబోలు తన కాలపు దొరల భోజనములను గూర్చి రఘునాథ రామాయణమం దిట్లు వర్ణించెను.


కప్పురభోగి పంటకము కమ్మగనే పడియున్ భుజించి మేల్

దుప్పటులట్లు మూరగల తోరవు పచ్చడముల్..

కప్పుకొచెడి వారట! ఈ రఘునాథ భూపాలుని కుమారుడైన విజయ రాఘవ నాయకుని రఘునాథాభ్యుదయ ద్విపద కావ్యమం దానాటి వంటకములలోని విశేషము లెన్నేనియు గ్రహింప వచ్చును. ఈ కవిరాజు భోజన మిషతో నాటి మహారాజుల మహానసమున ఘుమఘుమలాడు వంటకములను బెక్కింటిని పేర్కొని యున్నాడు.


ఒక వేదండయాన కై దండ యుసగ దిగి బంగరు పీటమీద గూర్చుండిన పట్టపు రాజు పళ్లెరమున దొలుతగా “గిలుకు టం దెలు మ్రోయ గీరసల్లాప కులుకుచు పచ్చడులు గొని వచ్చినదట ! వడ్డన మొదలుకొని స్వీయ సంప్రదాయమునే వర్ణించి నాడు విజయ రాఘవుడు.


"అప్పడాల్ నువు పొడి హవణించినట్టి 

కప్పురపుకోడి యొక్క లతాంగి తెచ్చె

 తురిమిన టెంకాయ తునియలు గూర్చి కరివేప పొడిచల్లి కమ్మని నేత

పొంకంబుగా దాల్చి పొదిగినయట్టి కుంకుమకోడి గై కొనివచ్చె నొకతి"


ఈ వంటకములలోని పదార్థములనుబట్టి ఇవి శాక సంబం ధములే యనియు, నేటి పకోడీలవంటివే కప్పురపుకోడి మున్నగు నవి యనియు, నాటి బ్రాహ్మణులుగూడ నిట్టివి చేయుచుండెడివా రనియును జెప్పవచ్చును. కాని బ్రాహ్మణులు దీనిని కప్పురపు కోడి, కుంకుమకోడి, కస్తూరికోడి, పాలకోడి, కట్టుకోడి అని పేర్కొనకపోవచ్చును. పదార్థ మొక్కటియయ్యును వ్యవహారమునందును, పేర్లలోను కొద్దిపాటి భేద ముండవచ్చును. కో ళ్లన్నియు బోయి పకోడీలు మాత్రము నిలిచినవి. 


నీరుమజ్జిగయనగ మనము సాధారణముగా మజ్జిగ తేట యని భ్రమపడుదుము. అది కాదు.


"సారమౌ జంబీర సారంపు రుచుల 

మీఱంగ లవణంబు మితముగా గూర్చి 

మేలైన సొంటితో మిళిత మైనట్టి 

ఏలకి పొడివైచి యింపు దీసింప 

దగు వట్టివేళ్లచే తావులు గట్టి 

మగువ యొక్క తె నీరుమజ్జిగ దెచ్చె"


ఇవి కాక మనము మఱచిపోయిన సారసత్తులు, పేణీలు మున్నగు ఈ కవి తన ప్రబంధమున నిబంధించి మనకు రుచి చూపించుచున్నాడు.



- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 

Sunday, December 12, 2021

అన్నప్రసాదం! - కర్లపాలెం హనుమంతరావు - ఈనాడు సంపాదకీయం

అన్నప్రసాదం!
- కర్లపాలెం హనుమంతరావు 

కుబేరుడికైనా కుచేలుడికైనా క్షుద్బాధ ఒక్కటే. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని పెద్దలన్నదీ అందుకే. లోకంలో బాధలు అనేకమున్నా, కవిహృదయం ఏనాడో తేటతెల్లం చేసినట్లు 'దురంత దుఃఖకర ఆకలిబాధ భరింప అశక్య'మన్నది ప్రత్యక్షర సత్యం. మనిషికే కాదు, సృష్టిలో ప్రతిప్రాణికీ ఆకలిదప్పులూ తిండితిప్పలూ తప్పవు. 'ఆకలి కష్టము మిక్కిలి ఎక్కువ' అని చిలకమర్తి చెప్పినా, 'ఆకొన్న కూడె అమృతము' అంటూ సుమతీ శతకకర్త చాటినా- సారాంశమొకటే, అన్నం ప్రాధాన్యం లెక్కకట్టలేనిది. 'అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను/మృగజాతికెవ్వడు మేతబెట్టె/వన చరాదులకు భోజనమెవ్వడిప్పించె?' అని కవిగళం గుప్పించే ప్రశ్నలకొచ్చే జవాబుల్లో ఆస్తిక నాస్తిక తేడాలుండొచ్చు. మనిషి ఆకలి తీర్చే నాథుడెవరన్నప్పుడు వచ్చే సమాధానం- సాటి మనిషే! 'తల్లి పెట్టు తియ్య తాయిలములన్నియు తోటి బాలకులకు పంచిపెట్టిన' ఆర్ద్రహృదయుడు బాల గౌతముడు. 'ఉపకారము తలచని కఠినాత్ముడు ఉండి వ్యర్థము, మదిలో/ చపలత వీడక వ్రతములు తపములు జేయుట వ్యర్థము' అన్న హితోక్తి అర్థపరమార్థాలు గ్రహించి వ్యవహరించే మానవుడే మాధవుడన్నది సర్వజన సమ్మతం. అరణ్యవాసకాలంలో ధర్మజుడు తనవెంట ఉన్నవారి భోజనార్థం సూర్యభగవానుణ్ని ప్రార్థించి అక్షయపాత్ర సంపాదించాడు. ఎంత వడ్డించినా ఇంకా నిండుకుండలా ఉన్నందునే, అది ఎందరెందరి ఆకలినో రోజూ తీర్చగలిగేది. అక్షయగుణ సంపన్నత ఆ పాత్రలో ఉందా, లేక ధర్మరాజు ధర్మబుద్ధిలోనే అది ఉందా అన్నదొక్కటే కీలకం. 'ఖ్యాతి చేకూరు, దీనులకు అన్నదానమిడు పుణ్యప్రాణికిన్‌' అని పలికిన ప్రౌఢకవి మల్లన మాటనే బాటగా మలచుకుంటే, మానవజన్మకు అంతకుమించిన సార్థకత వేరొకటి ఉండదు! ఉపకారబుద్ధికి ప్రకృతే ప్రతీక. 'తరువులతి రస భార గురుత గాంచు/ నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు/ డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము' అన్నట్లు ప్రకృతిమాతే సమర్పణశీలతకు నిదర్శనం. పండ్ల బరువుతో వంగే చెట్ల కొమ్మలకు చేతికి అందుబాటులో ఉండటం తెలుసు. గగనసీమలో షికారుచేసే మేఘాలకు వర్షించటమే తెలుసు. తోటివారికి ఇవ్వటంలోని సంతృప్తి, సంతోషం మనసునిండా ఉన్నప్పుడు మానవుడూ అంతే. పోషక సమృద్ధమైన గంజిని దారిపక్క కాలువపాలు చేయటంలో మానవత లేదు. ఆ వృథాను అరికట్టడంతో పాటు, అన్నమూ జతచేర్చి ఆర్తులకింత అందించటంలోని ధన్యతా అంతా ఇంతా కాదు. జాషువా కవినేత్రం తిలకించిన భారతంలో 'ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు' వారెందరో ఉన్నారు. 'దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్‌ మెతుకు విదల్పని'వారి తత్వమే భాగ్యవిహీనత్వమన్న ఆయన వాదం సంపూర్ణ హేతుబద్ధం. కాస్తంత తిండి దొరక్క అల్లాడిపోయిన దుర్భర అనుభవం నాడు గుణనిధికి ఎదురైంది. చేతికందిన ఆహారం నోటిదాకా చేరని వైనాన్ని తలచుకుని కుమిలిపోయిన దీనదశ అతడిది. 'అన్నం అమృత రూప'మని శ్రుతులు, 'పరమాత్మ స్వరూప'మని స్మృతులు చాటాయి. అన్నపూర్ణగా ఆరాధించి, 'సుఖీభవ'గా ఆశీర్వదించి భారతీయతను వేనోళ్ల కీర్తించిన ఘనచరితా మనకుంది. 'దానమునకు అధికమైన ధర్మము కలదే' అని హరిభట్టు, 'కరమున నిత్యాన్నదానము సురుచిర భూషణము' అంటూ భర్తృహరి ప్రస్తుతించిందీ దానగుణశీలతనే. దానమివ్వనివాడు ధన్యుడు కాడని, కాలేడని స్పష్టీకరించిన సుద్దులూ చాలా ఉన్నాయి మనకు. అన్నీ ఉన్నా ఎన్నో తెలిసినా, ఎక్కడో ఏ మూలనో- ఇవ్వటానికి చేతులురాని వైనం, ఉన్నదాన్ని తెలిసో తెలియకో వృథాచేసే నైజం దాపురించింది. స్థానికమో ప్రాంతీయమో జాతీయమో కాదు... ఈ పెనుజాడ్యం ప్రపంచవ్యాప్తం! 
'వృథా చేయబోకు, జన్మము సదా రాదు నీకు' అని తెలిసినవారున్నా అన్నార్తులకు లభిస్తున్న ఉపశమనం కొంతే. మాటలూ చేతలకు అంతరాలున్నచోట 'కాగితమ్ము లిచట కరిపించువారు శి/క్షింపబడుదు' రని లిఖించి పెద్ద/కాగితమ్ము గోడకంటించె దొరగారు' తరహా వ్యవహార సరళీ ప్రమాదమే. చెప్పింది చేయటం, చేసిందే చెప్పటం సమర్థ శక్తివనరుగా ఉత్తమ ఫలితాలనిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న భావన, బాధ్యతాయుత వర్తన ఇళ్లు, భోజనశాలలు, విందులు, ఉత్సవాల్లో వెల్లివిరియాల్సి ఉంది. 'ఎంత తింటావో అంతే వడ్డించుకో... తిన్నంత తిని, మిగిలిందంతా పారేసే అలవాటు మానుకో' అంటూ అవ్వలూ తాతయ్యలూ, అమ్మానాన్నలు చెప్పే మాట ఇప్పుడు ఎంతమందికి చెవికెక్కుతుంది? భోజనవేళ విధివిధానాలు, నియమనిబంధనలు ఉన్నట్టే వృథాను పరిహరించాలన్నదీ ఓ విధానం, నిబంధన. 'కాంతి శాంతి సుఖమ్ము భాగ్యమ్ము నొసగు/ బహువిధారిష్టముల భస్మీపటలమొనర్చు' జీవితమే జీవితం. అది సకల వృథాల నివారణ, సర్వవనరుల సద్వినియోగంతోనే పరిపూర్ణమవుతుంది. విశ్వమంతటా అనునిత్యమూ లక్షల టన్నుల ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయి. దేశదేశానా ఒకవంక ఆకలికేకలు మిన్నంటుతుంటే, మరోవైపున వ్యధార్తుల కంట రక్తాశ్రువులు చిందిస్తూ అన్నపానీయాల వృథా విచ్చలవిడిగా సాగుతోంది. తగినన్ని రవాణావసతులు లేక కొంత, గోదాముల్లో అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా మరికొంత- దాపురించిన దుస్థితి ఇది. ఎక్కువగా వడ్డించుకొని చివరికి కుప్పతొట్లలో పారేసే పంచభక్ష్య పరమాన్నాల తీరు మరింత బాధాకరం. పొలం నుంచి పళ్లెంలోకి, అక్కడినుంచి నోటికి చేరేలోగా ఎంతెంత వృథా! వీటన్నింటితో కోట్లమంది నిరుపేదల కడుపు నింపవచ్చని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ఈమధ్యే వెల్లడించింది. ఐరోపా సంఘం ప్రకటించిన 'ఆహార వృథా వ్యతిరేక సంవత్సరం' ముగింపు దశకు చేరుకుంది. నేటికీ దురవస్థ మారటం లేదంటే- 'నరుడి నెత్తిమీద రుద్దిన దరిద్రం/ అది ఎప్పుడో కట్ట తెగే సముద్రం' అన్న కవి హెచ్చరికకు రూపం వస్తున్నట్లేగా!
(ఈనాడు, 15:12:2013 ప్రచురితం  )

భోజనోత్సవం- ఈనాడు సంపాదకీయం – కర్లపాలెం హనుమంతరావు

ఆహారం జీవులకు ప్రాణావసరం. దాన్ని ఒక భోగకళగా మలచుకోవడం మనిషి ప్రత్యేకత. ఆత్మకు ఇంపైన భోజనాన్ని సత్కృతులకందే ప్రేరణగా అల్లసాని పెద్దన భావించాడు. దేవదారు వనంలో యాయవారానికని బయలుదేరిన శివబైరాగి భిక్షాపాత్రలో రంభ, ఊర్వశి లాంటి అందగత్తెల చేతులమీదుగా నేతి వంటకాలు వడ్డించిన భోజన ప్రియుడు శ్రీనాధ కవిసార్వభౌముడు! విందుభోజనాదులకు సందర్భశుద్ధి కూడా చూసుకోడన్న విమర్శా ఉంది. హర విలాసంలో ముక్కంటి మూడోకంటి మంటకు ఎర అయిన మన్మథునితోపాటు రతీదేవి సతీ సహగమనం చేసే సందర్భం ఒకటుంది. తామరపూల తేనెలతో ధర్మోదకాలు, తియ్యమామిడి పండ్లతో పిండప్రదానాలు చేయాల్సిందిగా అంత పతీవియోగ దుఃఖంలోనూ పరివారానికి రతీదేవి పురమాయించడం, ఆ మహాకవి ఆహార ప్రియత్వానికి నిదర్శనం. ప్రజాబాహుళ్యం అభిలాషలు, ఆరాటాలు, విలువలకు సంస్కృతి ఒక ప్రతిబింబమైతే- ముందు తరాలకు దాన్ని అందించే బాధ్యత సాహిత్యానిదే. ఏనాటి సమాజ స్వరూప స్వభావమైనా సమ్యక్ దర్శనా భాగ్యానికి నోచుకోవాలంటే... ఆనాటి వివాహ కుటుంబాది సంబంధ బాంధవ్యాలు, ఆచార వ్యవహారాలతోపాటు ఆహార పద్ధతులూ తెలిసి ఉండటం తప్పనిసరి- అంటారు మల్లంపల్లివారు. మన ప్రాచీన కవులు ఈ బాధ్యత గుర్తెరిగారు కనుకనే సందర్భం ఉన్నా లేకపోయినా సందుచూసుకుని మరీ విందు భోజనాలందించారు!

శిష్యసమేతంగా వ్యాస మహామునికి కాశీవిశాలాక్షి చేసిన విందులో వడ్డించిన చాలా పదార్థాలకు శబ్దరత్నాకరంలోనే అర్థాలు దొరకవు- అంటారు కాశీఖండానికి మణికర్ణికా వ్యాఖ్యానాన్ని కూర్చిన శరభేశ్వర శర్మ. పాండురంగ మాహాత్మ్యంలో కపట బ్రహ్మచారై వచ్చిన పరంధామునికి సుశీల అనే పతివ్రతా శిరోమణి ఆతిథ్య మిస్తుంది. ఆ సందర్భంలో తెనాలి రామకృష్ణకవి వర్ణించిన ఖాద్య విశేషాలతో ఒక పరిశోధనా గ్రంథాన్నే వెలువరించదగినంత సమాచారం ఉంది. ఎన్నో వ్యంజనాలు పిండివంటలతో భరద్వాజుడు భరతుడికి, పరివారానికి ఇచ్చిన విందు జగత్ప్రసిద్ధం. భారతీయుల అరవైనాలుగు కళల్లో పాకశాస్త్రమూ ఒకటి. నలభీములు ఆ శాస్త్రంలో అసమాన ప్రతిభాశాలురు. ఆహార పదార్థాలు, వాటి తీరుతెన్నులు, ప్రత్యేక లక్షణాలు, ఇమిడి ఉన్న ఆరోగ్య సిద్ధాంతాలు, వంటశాలలు, వడ్డన విధానాలు... రుగ్వేద కాలంనుంచీ భరతఖండంలో అధ్యయన విశేషాలే! వెల్లుల్లి, తిలపిష్ఠం అనడమే తప్పుగా భావించే శుద్ధ శాకాహారి శ్రీనాథుడు. సిరియాలును తరిగి తిరువెంగనాంచి నానావిధ పాకాలు చేయించిన వైనాన్ని అంత తీరుగా ఆ కవి వర్ణించడానికి కారణం- వాటి ఆహారపు తీరుతెన్నులను అక్షరబద్ధం చేయాలన్నతపనే. కాశీఖండం- కుమారాగస్త్య సంవాదంలో సదాచార విధి చర్చ సందర్భంగా భోజనాలవేళ విధిగా పాటించాల్సిన నియమాల వివరణ ఉంది. తరతరాల తెలుగువారి ఆహార రుచులమీద పరిశోధనలు సాగించి డాక్టర్ జి.వి.పూర్ణచంద్ గ్రంథమే రూపొందించారు. చిత్రవిచిత్రమైన చిత్రాన్నాల నుంచి, రెండు భోజనాల నడుమ నమిలే అటుకులు అరిసెలవంటి వాటిదాకా- వట్టి వివరాలే కాదు... వాటి వైద్య విలువల్నీ ఆ గ్రంథం విపులీకరించింది.

ఆహారం కేవలం జిహ్వ సంతృప్తి కోసమే కాదు, ఒంటికి పట్టి ఆరోగ్య వృద్ధికి దోహదపడాలి. శుచి, రుచితోపాటు తుష్టి, పుష్టి కారకాలు పుష్కలంగా కలిగిన పోషకాహారమే సంపూర్ణాహారం. అది లభించడమే మహాభాగ్యం. షడ్రుచులు, అష్టాదశ రసాలు, చతుర్విధాలుగా త్రికాలాల్లోనూ సేవించి హరాయించుకోగల జీర్ణశక్తి కలిగి ఉండటమే ఆరోగ్యం- అని వస్తుగుణ ప్రకాశిక వాదం. ఆహారాన్నిబట్టి స్వభావం అంటుంది తైత్తరీయం. అందుబాటులో ఉన్న భోగమేదైనా ధర్మబద్ధంగా ఆరోగ్యభంగం కానంతవరకూ అనుభవించడం దోషంకాదు. నాగరికత మోజులో స్థానిక వాతావరణానికి అననుకూలమైన విదేశీ ఆహారపు అలవాట్లకు బానిసలమైతే నష్టపోయేది మన ఆయుష్షే. వింధ్య పర్వత గర్వభంగానికని బయలుదేరాల్సిన అగస్త్యుడు కాశీని వదిలిపోవడానికి బాధపడింది నిత్యం తాను పరమ ప్రీతిగా సేవించే 'శ్రీ విశాలాక్షి కెంజేతి భిక్ష'కు దూరమవ్వాల్సి వస్తుందనే! కాశీఖండంలో గుణనిధి, శివరాత్రి మాహాత్మ్యంలో సుకుమారుడు- తిండికి మొహం వాచిపోయి ఉన్న దీనదశలో కన్నతల్లి తమకు ఆరగింపులకు పెట్టిన 'గిన్నెలోని పెరుగును, వంటకంబు వడపిందియలను' పదేపదే తలచుకొని కుమిలిపోతారు. కరవులు ముంచుకొచ్చీ, వరదలతో పంటలు ముంపుకొచ్చీ, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు కొంతకాలంగా అనుకూలించని సాగు- రైతన్న మెడమీద పుండుచేసే కాడిగా మారిపోయింది. ఫలితంగా, 2010-11 ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఏడుకోట్ల ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోయారు. కూటిలోకి కూరాకు కూడా దొరకని దారుణ ఆహార సంక్షోభం మున్ముందు ముంచుకు రానుందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మనిషి జీవితానికి, తిండి ప్రధాన అవసరం. అది మనిషి ప్రాథమిక హక్కు కూడా! నిరుపేదలకు నిజమైన భోజనోత్సవం ఇంకెంత దూరంలో ఉందో కదా!

(ఈనాడు సంపాదకీయం, ౧౬:౧౦:౨౦౧౧

Friday, February 14, 2020

భోజన యోగం-ఈనాడు ఆదివారం సంపాదకీయం- కర్లపాలెం హనుమంతరావు






ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. ఉదర నిమిత్తం బహుకృత వేషం. పశుపక్ష్యాదులది దొరికింది తిని కడుపు నింపుకొనే నైజం. మనిషికే బహురుచుల మోజు. 'అన్నము తిను వేళ నాత్మ రుచులు గోరు/ మదియు నాల్క జెప్ప నడగుచుండు' అన్నాడు యోగి వేమన.  వేదాల్లోను పురాణాల్లోను భోజనం భోగట్టానే ఉందని గురుజాడవారి శ్రీమాన్ గిరీశంగారు సెలవిచ్చారు కదా! 'అన్నం వ్యజానాత్.. అన్నవే బ్రహ్మ అని తెలుసుకోవోయి వెధవాయా అంది' అని దబాయింపు కూడాను! 'చమకంలో శ్యామాకాశ్చమే- చామల అన్నం మా మజాగా ఉంటుంది.. మాక్కావాలి దేవుడా!' అని ఉందని ఆ గురువు ప్రబోధించడం.. 'గేదె పెరుగు చమే.. చేగోడీ చమే!' అంటూ అతగాడి శిష్యపరమాణువు వెంకటేశం  చమకపారాయణం అందుకోవడం! 'తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్!' అంటూ  ఆ మహాకవే మరో చోట  నొక్కి చెప్పిన వాక్కుకి  ఈ  పచన పురాణం యావత్తూ  ఓ చక్కెర పూత. ఉదరానందమే హృదయానందానికి నాందీ. ఈ కిటుకు పసిగట్టింది కాబట్టే బసవరాజుగారి వెర్రిపిల్ల సైతం మనసైన బావగారిని గుత్తొంకాయ కూరతో పడగొట్టింది. కొనకళ్లవారి కోడలు పిల్ల 'అందముగా తీపందుకునేలా' అరిసెలు  వరసైన మావనోటికి అందించింది. చారడేసిన కళ్లను చక్కిలాలతో పోల్చడం మన  తెలుగువారికి ఆనవాయితీ. 'వంకాయవంటి కూరయు/పంకజముఖి సీత వంటి బామామణియున్/శంకరుని వంటి దైవము' లేరు' అని తెలుగువారికి గట్టినమ్మకం.   ఎంత కళాభివేశంలో సైతం కవుల కుక్షింభరత్వాన్ని నిర్లక్ష్యం చేయలేదు! 'వైశ్వానర జఠరాగ్ని రూపంలో దైవమే  జీవి శరీరంనుంచి  ఆహారం నాలుగువిధాల   జీర్ణించుకుంటుంద'ని గీతే(15-14) ప్రవచిస్తోంది.  తెలుగువారి బువ్వంపు బంతులమధ్య ప్రతిద్వనించే గోవిందనామాల అంతరార్థం తవ్వినవారికి తవ్వుకున్నంత!

'వేవురు వచ్చినా వండ నలయని'  గృహిణిని అద్భుతంగా వర్ణించాడు పెద్దన కవీంద్రుడు 'మనుచరిత్ర'లో. వండేందుకు సమయానికి సంబరాలేమీ అందుబాటులో లేనిపక్షంలో సైతం నాటి గేస్తులు ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారో  అయ్యలరాజు నారాయణామాత్యుడు 'హంస వింశతి'లో విశదీకరిస్తాడు. మామిడికాయనుంచి మారేడుకాయ వరకు, కొండముక్కిడికాయ మొదలు కొమ్ముకాయ, కరగు కాయ, వెల్గకాయ దాకా గృహస్థుల ఇంట సదా సిద్ధంగా ఉండే ఊరుగాయల జాబితా (4-135) ఏకరవు పెడతాడు ఒక పద్యంలో. తిండి తిప్పలంటే వండుకొని ఇంత కడుపుకు వేసుకోవడంగా మన పెద్దలెప్పుడూ భావించలేదు. 'తలం జీర సుట్టియును జె/ ప్పులు దొడిగియు చేసినట్టి భోజనము ఫలం/ బలఘ చరిత బద్మజు/ డసురుల బోగంబని విధించె బ్రకట ఫణితులన్' (3-17) అంటోంది మహా భారతం. 'తడబడి తద్ప్రసాదంబు  గుడుచుచో../ రయమున గూలు నరక వార్ధి ననుచు' (41)అంటూ  పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్రం’ అంటుతిండి చేటును గూర్చి 15వ శతాబ్దిలోనే హెచ్చరించింది! 'ఉదరం సగభాగం అన్నంతోను,  ఒక భాగం మంచితీర్థంతోను నింపినప్పుడే మిగతా భాగంలో గాలి ఆడి జీర్ణక్రియ సులభతరం అవుతుంద'ని(41) మంత్రి అప్పన్న ‘చారుచర్య’ హితవు చెబుతోంది. వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణం 'మునుపు మధురాన్నములు చవిగొనియనేని/ నడుమ లవణామ్ల తిక్తముల్ నంజెనేని/ పిదప కటుకార్ద్ర భోజనం బొదవెనేని/ బలము నారోగ్యము జాల గలిగియుండు' అంటూ పచన క్రమాన్ని నిర్దేశిస్తోంది. లోకహితంకోసం తపించి  అభిభాషించిన  ఆరోగ్యసూత్రాలనైనా ఆలకించికపోతే  చివరికి నష్టపోయేది ఎవరు? మనమే!

'వండడం కాదమ్మా ప్రధానం. తినాలి. తినడమూ కాదు. ఏది ఏమిటో తెలియాలి' అంటుంది శ్రీపాదవారు సృష్టించిన  'పాకశాస్త్రం'లోని ఓ పాత్ర. ‘ఓ రామ! నీ నామ మెంతో రుచిరా!' అని పరవశంతో పాడుతున్న ఓ భక్తుణ్ని 'నామం రుచి చూసానయ్యా! చప్పగా ఉంది' అని దెప్పిపోఛాడో  తిండిపోతు.  తినేవి ఏవో.. తినకూడనివి ఏవో విచక్షణ మరిస్తే కుడిచిన విస్తరే పంచకూళ్ల విషమౌతుంది- అంటున్నారు ఆహార శాస్త్రవేత్తలు. మిరియం పొడి చల్లిన తినుబండారాలనుండి, ఆవపిండిలో ఊరేసిన వడలు, ఇంగువ తాళింపులతో ఘుమాయించే  కరకర సరుకులు, చింతపండు, నిమ్మ రసాలు  పిసికి పోసిన పులుసులు, తొలిచూలు గోవుల పొదుగులనుంచి సేకరించి మధించిన వెన్నలను కాచి తీసిన నేతులలో ముంచి తేల్చిన  మధుర పాకాలు, భక్ష్య భోజ్య, లేహ్య, పానకాలలో ఏ ఒక్కటీ బీరుపోకుండా  తెలుగువాడి నిండువిస్తరి వైభోగాన్ని శ్రీనాధ కవిసార్వభౌముడు పలు సందర్బాలలో పూసగుచ్చినట్లు వర్ణించాడు. పాకశాస్త్రం భారతీయుల చతుష్షష్ఠి కళల్లో ఒకటి. సీతమ్మ సీమంతంనుంచి శ్రీకృష్ణుని చల్దులదాకా ఆడంగులు పాడుకొనే అన్ని పాటలనిండా ఎన్ని తినుబండార వైభోగాలో! సంతోషానికి సంతృప్తి దగ్గరి దారంటారు పెద్దలు. సంతృప్త అంతరంగానికి  ఆత్మారాముడి ఆశీర్వచనం తప్పని సరి. ఆరోగ్యకరమైన ఆహారం సంతృప్త భావతరంగ వ్యవస్థను తట్టి లేపుతుందని.. ఇష్టమైన పదార్థం రుచికరంగా జిహ్వకు తగలగానే కోరికను రేకెత్తించే 'డొపమైన్' ఉత్పత్తి అధికమవుతుందని, ఆ స్థితిలో జీర్ణమయే ఆహారం ఆనందకారక రసాయనాలు ఒపియేట్స్ (opiates) కెన్నబినాయిడ్స్ (cannaabinoids)  మెదడు విడుదల చేసేందుకు దోహదపడతాయని  తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కార్డిఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన యాండ్రూ స్మిత్   అనే మానసిక శాస్త్రవేత్త నిర్వహించిన పరిశోధనల్లో అనారోగ్యకరమైన ఆహారాన్ని అపరిమితంగా స్వీకరించడం వల్ల  ‘ప్రతిఫల వ్యవస్థ’ ((reward system) అస్తవ్యస్తమై  భోక్త  విపరీత భాగోద్వేగాలకు బానిసవుతాడని తేలింది.   ఉదయ అల్పాహారంగా  నిలవ ఆహారం సేవిస్తున్న వారిలో అలసట.. అహననం, ఆందోళన , కుంగుబాటు తాజా ఫలాలు సేకరించే వారిలోకన్నా మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు  తాజా పరిశోధనలు నిగ్గు తేలుస్తున్నాయి. తిండి తిప్పలు ఎన్ని రకాలో! తిండికోసం పడే తిప్పలు సరే!  తిన్న తరువాత వచ్చిపడే తిప్పల్ని  తప్పించుకోవాలంటే తినేటప్పుడే  అప్రమత్తంగా ఉండటం తప్పని సరి- అంటున్నారు ఆహారశాస్త్ర నిపుణులు. ‘భోజనం యోగంగా భావించినంత కాలమే మనిషికి భోజనం ఓ భోగం’ అన్న ‘లోలంబ రాజీయం’ సూక్తే చివరికి  శిరోధార్యమయింది. శుభం.
***
- కర్లపాలెం హనుమంతరావు 
( ఈనాడు ఆదివారం సంపాదకీయం ) 




Saturday, October 22, 2016

వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు- వానికి భుక్తి లేదు


'పొలాలనన్నీ/హలాల దున్నీ/ ఇలాతలంలో హేమం పిండే' విరామ మెరుగని శ్రామికుడు- కర్షకవీరుడు. 'ఎవరు నాటిరో, ఎవరు పెంచిరో/ వివిధ సుందర తరువుల/ మివుల చల్లని దయాధారల/తవిలి కురిపించి?' అని కృష్ణశాస్త్రి సందేహం. సందేహమెందుకు? ఆ దయామూర్తి నిశ్చయంగా కర్షక చక్రవర్తే! సర్వజీవుల హృదయపూర్వక వందనాలందుకోగల అర్హత అన్నదాతకుగాక మరెవరికుంది? తెలతెలవారకముందే పల్లెకన్నా ముందు లేచిన రైతుకు నులివెచ్చని చలి మంటలు హారతులు పడుతుంటే, చెట్టూచేమా వింజామరలు వీస్తాయి. నాగులేటి వాగునీళ్లు కాళ్లు కడుగుతుంటే,
జామకొమ్మ చిలకమ్మ యోగక్షేమాలు విచారిస్తుంది. పువ్వునూ కాయనూ పేరుపేరునా పలకరిస్తో పొలం పనుల్లోకి దిగే హలంధరుణ్ని సాక్షాత్ బలరాముడి వారసుడిగా ప్రస్తుతిస్తాడొక ఆధునిక భావుకుడు. పాల కంకులను పసిపాపలకుమల్లే సాకే ఆ సాగుదొరను 'ఆకుపచ్చని చందమామ'గా పిలుచుకుని మురిసిపోతాడు ఇంకో గేయకవి- సుద్దాల. 'మట్టి దాహంతోటి నోరు తెరవంగా/ మబ్బు కమ్మీ నింగి జల్లు కురవంగా' వీలు తెలిసి వాలుగా విత్తులు జల్లితేనేగదా పాతరలోని పాతగింజకైనా పోయిన ప్రాణం లేచివచ్చేది! పుడమితల్లి పురిటి సలుపులకు రైతన్న మంత్రసానితనం వల్లనేకదా చల్లంగా సాంత్వన చేకూరేది! కలుపు పెరగకుండ ఒడుపుగా ఏరి అవతల పారవేయడం, బలుపు తరగకుండ తగు ఎరువు తగిన మోతాదులో అందించడం, తెగులంటకుండ ఆకుమళ్లపై పురుగుమందులు చల్లడం, పురుగు  తగిలిన  ఆకులు గిల్లి పారబోయడం, పశువుకు  కంచెలా.. పక్షికి వడిసెల రాయిలా మారి అహర్నిశలు  కాపుకాయడం!  పంట చేతికి దక్కడమంటే చంక బిడ్డను మీసకట్టు దాకా పెంచడంకన్నా కష్టం. కృషీవలుడు అందుకే రుషితుల్యుడు.
అరచేతి గీతలు అరిగిపోయేదాకా అరక తిప్పడం తప్ప మరో లోకం పట్టని ఆ నిష్కాముకత్వం అమాయకత్వం కాదు. నమ్ముకున్న వాళ్లందరికీ ఇంత బువ్వ పెట్టాలన్న అమ్మతనం అదంతా! ఆరు గాలాలూ శ్రమించి పుడమితల్లిని సేవించినా ఫలం అందనప్పుడు తల్లడిల్లేది తానొక్కడికోసమేనా? బిడ్డ ఆకలి తీర్చలేనితల్లి పడే ఆవేదన అది! మట్టితో సాగుబడి బంధం పేగుముడికన్నా బలమైనది. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచిమా/గాణములన్ సృజించి, ఎము/కల్ నుసి జేసి పొలాలు దున్ని/ భోషాణముల్' జాతికి నింపిపెడుతున్నా సొంతానికి చారెడు నూకలైనా చేటలో మిగలని రైతు దుస్థితికి కలవరపడిన కవులెందరో! 'వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు/వానికి భుక్తి లేదు' అని కవిజాషువాలాగా ఆర్తిచెందిన భావుకులు తెలుగు నేలమీద ఏటుకూరి వేంకట నర్సయ్యనుంచి దర్భశయనం శ్రీనివాసాచార్యదాకా కో కొల్లలు. సింగమనేని నారాయణ అన్నట్లు  నిజానికి 'ఎర్రటి నేలలో నాగలి మొనదించి యుగాలుగా విత్తనాన్ని మొలకెత్తిస్తున్న ప్రతీ అన్నదాతా కవులకు స్ఫూర్తిప్రదాతే. ఆ కర్షకుడి హృదిలోకి జొరబడి, కనుకొనుకుల్లో నిలబడి, కన్నీటికీ పన్నీటికీ కినిసి, మురిసిన దువ్వూరివారైతే ఏకంగా 'కృషీవలుడు' అనే కర్షకకావ్యాన్నేసృజించారు. శాస్త్రవిజ్ఞానం ఎంత శరవేగంగా దూసుకుపోతున్నా సాగుదారుడు లేకపోతే బతుకు బండి ముందుకు సాగదు. ఏడు నక్షత్రాల హోటలు పాయసాల పాలనుంచి.. ఏడడుగులు నడిచే వధూవరులమీద జల్లే తలంబ్రాలదాకా..  అన్నీ అన్నదాత స్వేదయాగ ఫలాలే! ఆకలి తీర్చాల్సిన నేలతల్లి రైతు బతుకుల్ని మింగే రాక్షసబల్లిగా మారుతుండటమే సాగుభారతంలో నేడు నడుస్తున్న విషాదపర్వం.



జీవనదులెన్ని ఉన్నా మాయదారి కరువు పీడిస్తోంది. ఉత్తరానివి ఉత్తుత్తి ఉరుములు, దక్షిణానివి దాక్షిణ్య మెరుగని మెరుపులు. పడిన చినుకులకు ఎడతెరిపి తోచదు. పాలుతాగే చంటిపిల్ల నీటమునిగితే తల్లి కెంత కడుపు కోతో, పంట మునిగిన రైతు కంత గుండెకోత. చేతులారా పెంచుకున్న పంటకు చేజేతులా నిప్పంటించుకున్నా ప్రభుత్వాలకు పట్టటం లేదు.   గోడలేని పొలాలకు గొళ్లేలు బిగించుకున్నా గోడు వినేందుకు ఏ నాథుడూ రాడు. కళ్ళాల దగ్గరేకాదు.. అంగళ్లలో సైతం ఆసరా దొరకదు. నిల్వలకు నీడలేక నడి బజారులో నిండు జీవితాన్ని పొర్లబోసుకుంటున్నాడు నేడు రైతు. ఓటమని తెలిసీ కడవరకూ పోరాడవలసిన కర్ణుడవుతున్నాడు కర్షకుడు. పొలంగుండెలు  తొలుచుకుంటూ పొగగొట్టాలు లేస్తున్నాయి.
పంటచేల కంఠాలకు ఆర్థిక మండళ్ల ఉరితాళ్ల ముళ్లు బిగుస్తున్నాయి. ఉరి రద్దుకు పరితపించే పెద్దలకైనా పట్టదా ప్రాణదాత ఉసురుకు ముంచుకొచ్చే ఆపద?! రైతు చావుదెబ్బ జాతికి శాపం కాదా! వట్టొట్టి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతుపవనాలు. వేదికలమీది వాదనలు రైతు లావేదనలు  ఆరుస్తాయా.. తీరుస్తాయా? అన్నదాత కన్నీటికి కావాల్సింది ఇప్పుడు చిత్తశుద్ధితో వేసే ఆనకట్ట. ఆ పని వెంటనే ప్రారంభం కాకపోతే ఆ ప్రవాహంలో జాతి మొత్తం కొట్టుకొనిపోయే ప్రమాదం ఆట్టే దూరంలో లేదు. కాడి ఇంతదాకా పడేయక పోవడం సేద్యగాడి చేతకానితనం కాదు. 'కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై/ చెక్కిళ్లమీద జాలిగా జారుతున్నా/ ఒక్క వాన చుక్కయినా చాలు/ వచ్చే 'కాఱు'కి 'చాలు'లో విత్తేందుకు చారెడు గింజలైనా దక్కేందుకు' అన్నది అన్నదాత ఆశావాదం. ఏ అమాత్యుల వారయినా సభల సాక్షిగా వల్లెవేసే  మన వ్యవసాయ సంస్కృతిలోని విలక్షణత వాస్తవానికి అదే. 'మూలావర్షం ముంచినా జ్యేష్ఠజల్లు తేలుస్తుంది' అన్న ఆశే అన్నదాతను ఇంకా కాడి కింద జార్చకుండా బతుకీడవనిస్త్తోంది. నూకలు కతికి బతికే జీవులకు బతుకులు మిగులుస్తోంది.
-కర్లపాలెం హనుమంతరావు
***




Thursday, October 15, 2015

అన్నమో రామచంద్రా!- ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా వ్యాసం


వానా కాలంలో అందరి బాధలు ఒక రకంగా వుంటే ఇంటి ఇల్లాలు బాధలు ఇంకో రకంగా  వుంటాయంట! ఇల్లిల్లు తిరిగి ఎలాగో ఇంత నిప్పు కణిక తెచ్చినా అది రాజు కునేందుకు ఎండుగడ్డి , రగులుకునేందుకు ఇంటి వాసాలు కావాలి . అన్నం ఒక పట్టాన వుడికి చావదు. ఉడికినా  ఇల్లంతా అలుముకున్న పొగతో సుఖంగా   భోజనం చేయడం కుదరదు. వేళ కాని వేళ వచ్చిన అతిధి దేవుళ్ళకే తొలి బంతి బొటా  బొటిగా  సరిపోతుంది. చివరగా  తినే ఆడంగులు మళ్ళి పాపం  వండుకోవాల్సిందే ! ఆ క్షణంలో నెయ్యి గుడ్డలు, కొయ్య సమానులు కూడా వంట చెరుకు క్రిందే చెల్లి పోతుంటాయాంట! అర్ధాకలితో లేచి అంట్లు, ఎంగిలి గిన్నెలు ఎత్తు కోవటాలు! కాస్త  నడుం వాలుద్దామనుకోగానే కట్టుకున్న వాడు వచ్చి మర్నాటి అనుపాకాలను గూర్చి ఆరాలు మొదలు పెడతాడు-ఇదంతా ఈ కాలం లో ఏదో మారు మూల పల్లెలో జరిగే తిండి తంతు అనుకొనేరు. .

ఐదొందల ఏళ్ల క్రిందటే దక్షిణా పథాన్నంతా  ఏక చ్చత్రంక్రిందకి తెచ్చి రామరాజ్యం సాగించాడని మనమందరం మొన్నీ మధ్య దాకా  పట్టాభిషేకోత్సవాలు పెట్టుకుని మరీ మురిసిపోయిన రాయలు వారి కాలం నాటి భోజన విశేషాలే! రాయలు వారే  స్వయంగా కళ్ళతో చూసి ఒప్పుకుంటున్నట్లు ఇదంతా తన ఆముక్త మాల్యద మహా కావ్యంలో రాసుకున్నారు . ఉన్న స్వాతంత్ర్యం పోయి మళ్ళా  వచ్చి ఆరు దశాబ్దాలు దాటిపోతున్నా జనం భోజన కష్టాలు తీరలేదని చెప్పటానికే ఇంతలా  చెప్పుకొచ్చింది. కష్టాలు తీరలేదు కదా ..ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయాయి. రెండు వేళ్ళు మూడు పూటలా  నోట్లోకి పోవాలంటే ఏదో సామెత చెప్ప్పినట్లు పెట్టి పుట్టాలి . రాను రాను పరిస్థితులు అంత  దుర్బరంగా తయారవుతున్నాయి .

రాజ్యాంగం పందొమ్మిదో అధికరణం ప్రసాదిస్తున్న స్వేచ్చ, వాక్సభా స్వాతంత్ర్యాలు  వగైరా వగైరా అనుభవించాలంటే ముందుగా పౌరుడనే జీవుడు ఇంత కడుపుకు నిండుగా  తిని బ్రతికుండాలి కదా !అందుకే పందికొక్కులు పెత్తనం చేసే ఈ రాజ్యం లో మనుషులకు కూడా ఆహార హక్కు వుండి  తీరాలని ప్రజల హక్కుల కోసం నిత్య పోరాటం చేసే ఓ ప్రజా సంఘం సర్వోన్నత న్యాయస్థానం దాక పోయి పదేళ్లుగా పోరాడింది.
ఈ పోరాట నేపథ్యం తెలిస్తే బుద్ధి వున్నవాడెవడికైనా  మైండ్ బ్లాకవడం ఖాయం.
జైపూర్ నగర శివార్లలోని  భారత ఆహార సంస్థ మూసివున్న గిడ్డంగుల బయట ఆరుబయలులో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ టార్పాలిన్ కవర్ల క్రింద మొక్క మొలిచిన కోట్లాది ధాన్యపు రాసులోక వైపు....
గోదాములకు అయిదారు  కిలో మీటర్ల దూరంలోని గ్రామాలలో తినడానికి చాలినన్ని తిండిగింజలు లేక వంతుల వారీగా తినడమనే  వింత పద్ధతిని కనిపెట్టి అమలుచేస్తున్న దరిద్ర నారాయణుల గుంపింకో వైపు!
ఉన్న తిండిగింజలు  అందరికి  అందుబాటులో ఉండాలంటే కుటుంబంలోని ప్రతి వారూ వారానికి మూడు రోజులు... రోజుకి రెండువందల గ్రాములకు మించి తినరాదన్న విషాద తీర్మానం  చేసుకున్నాయా గ్రామాలు!
జన సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వ పక్షం , ప్రజల పక్షాన నిల్చి పోరాడవలసిన ప్రతిపక్షాలు పార్లమెంటులో ఇలాంటి దారుణ పరిస్థితులకి  కారణం మీరంటే మీరని జనంఅన్నం ముద్దలతో బంతులాట ఆడుకున్నాయి!
సర్వోన్నత న్యాయస్థానమే పూనుకుని విచారణ జరుగుతున్న ఈ పదేళ్లలో జన హితాన్ని దృష్టిలో ఉంచుకొని  మధ్య మధ్య ఉపాధి హామీ పథకాలనీ, ప్రజాపంపిణి వ్యవస్థ లోపాలనీ, బడిపిల్లలకు మధ్యాహ్నభోజన సదుపాయాలనీ, సమగ్ర శిశుపథకమనీ, అంగన్వాడి వ్యవస్థ పటిష్టతలంటూ తలంటుతూ ఉండకబోతే సామాన్యుడికి ఈ మాత్రమయినా కబళం దొరికే దారి వుండేదా? అనుమానమే!
 గోదాములలో ముక్కిపోతున్న బియ్యాన్ని అలా పందికొక్కుల పాలు చేసే బదులు బీదాబిక్కీకి ఉదారంగా పంచి పెట్టవచ్చు గదా! అంటూ ఆదేశంలాంటి సూచనను  అంత లావు సర్వోన్నత న్యాయస్థానం చేసినా.. ముక్కుతూ మూలుగుతూ ఏదో ముక్కి పోయిన బియ్యాన్ని చౌకధరలదుకాణంలో దిగువాదాయ వర్గాలవారికిచ్చే  ధరకి తప్ప ఇవ్వటానికీ.. ఠాట్.. లేదు పొమ్మని మొండికేసిన   మన్మోహన్ సింగు గారిసర్కారుని నమ్మేదెలా !    

"తిండిగింజలను పేదలకు పంచే బదులు కుళ్ల బెడుతున్న భారత దేశం" అంటూ తాటికాయంత అక్షరాలు పెట్టి మరీ ఓ ప్రముఖ వార్తా పత్రిక వెలుగులోకి తెచ్చిన పచ్చినిజాలను వింటే నిజంగా మన ప్రజాప్రభుత్వాలు ఎంత ఘనంగా వెలిగిపోతున్నాయో అర్ధమవుతుంది .
కొన్ని కోట్ల, లక్షల టన్నుల తిండిగింజలు ప్రభుత్వ ఆహార గిడ్డంగుల ముందు బాహాటంగా  ఏ రక్షణా లేకుండా నెలల తరబడి  ఎండా వానలకు మగ్గి పోతున్నాయి. న్న ధాన్యం కుళ్ళి, కంపు కొడుతున్నా ఆహార సంస్థ బియ్యం సేకరణ మాత్రం నిరాటంకంగా అలా కొనసాగుతూనే ఉంటుంది! ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్న ఆ కుళ్ళు ధాన్యం అప్పటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకున్నా 17, 000 వేల కోట్ల రూపాయలకు తగ్గదని ఒక అంచనా. ఈ చెత్తను సేకరించే దానికి ఎఫ్.సి.ఐ ఏడాదికి రూ15,000 కోట్లు ఖర్చు చేస్తున్నది! విన్నవారికి తుగ్లక్ రాజ్యం తిరిగి మళ్ళా వచ్చిందా అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది! ప్రతి ఏటా ప్రళికాసంఘం గోదాముల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు నిధుల రూపంలో విడుదల చేస్తున్నా సేకరించిన బియ్యం ఇలా వీధులలో టార్పాలిన్ కవర్లకింద ముక్కిపోవటాన్ని అప్పట్లో  పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎండగట్టినా.. ఈ పిచ్చిపుల్లయ్యల  పనులకు ది ఎండ్ పడే దారి కనబడటం లేదు !
అలా గోదాములలో ముక్కిపోతున్న బియ్యంతో ఫ్రాన్స్ లాంటి ఒక పెద్ద దేశాన్ని  ఏడాది పాటు ఉచితంగా పోషించవచ్చని ... మరీ మనకంత మనసొప్పకపోతే మన దేశంలోనే 15 కోట్ల మందికి రోజుకో పూట  కడుపు నింపచ్చని ఓ పెద్దమనిషి పాపం వాపోయాడు.
చిన్నారులలో సగం మంది పౌష్టికాహార లోపాలతో బాధ పడుతున్న దేశం మనది. దుర్భర దారిద్ర్యంలో  సహారా ఎడారి దేశాలకన్నా వెనకబడి వున్న ఘనమైన
అభివృద్ధి మనది. అగ్ర రాజ్యంగా ఎదగటానికి , అణుశక్తి సామర్థ్యం లో  సూపర్ పవర్ దేశాలనన్నింటిని దడదడ దాటి ముందుకెళ్ళాలని, వేగవంతమయిన అభివృద్ధి సాధనలో అమెరికా చైనాలకే పాఠాలు చెప్పాలని వ్విళ్లూరే మనం.. ఐక్యరాజ్య సమితి భద్రతాసమితిలో సభ్యత్వం కోసం ఆరాటపడే ముందు గొప్పలకు పోయి అన్నేసి కోట్లుపోసి కామన్ వెల్త్ గేములు ఆడించేందుకు చూపించిన అత్యుత్సాహం లో ఒక్కశాతమన్నా దేశపౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఆహార హక్కును ఆచరణలో సుసాధ్యం చేసేటందుకు చూపిస్తే ఎంత బాగుణ్ణు!
అప్పుడే గదా ఏటేటా మన జరుపుకొనే ప్రపంచ ఆహార దినోత్సవాలకి ఒక పరమార్ధం సృష్టించినట్లయేది!
అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనాసంస్థ ప్రతి ఏడూ తయారుచేసే అన్నార్తుల సూచిక ప్రకారం "అన్నమో రామచంద్రా!" అని ఒక్క ముద్దకోసం అల్లల్లాడే 88 దేశాల జాబితా లో  అన్నింటి కన్నా అట్టడుగున పడివున్నది ఘనమయిన మన 'అన్న గర్భే' నన్న సంగతి మర్చిపోకుండా ఉంటే మంచిది.
ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయనో, పత్రికలు వార్తలు రాసి ఎండగడుతున్నాయనో, సుప్రీంకోర్ట్ మొట్టికాయలు వేసిందనో,  వ్యవసాయమంత్రిగారు సెలవిచ్చారానో, పి యమ సలహా ఇచ్చారనో, మోదీ  గారు మెచ్చుకున్నరానో కాదు ... సర్కారు ఆహారహక్కు కల్పించ వలసింది. ఈ సహజ ధాన్యాగారంలో పుట్టిన పుణ్యానికి ప్రతిపౌరుడికి కనీసం రోజుకొక్క పూటయినా రెండువేళ్ళు నోటికందే విధంగా చర్యలు తీసుకోనంత కాలం ఎన్ని ప్రపంచ ఆహార దినోత్సవాలు ఎంత ఆర్భాటంగా జరుపుకున్నా మామూలు జనానికి జరిగే మేలు సున్నా !
గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి వుంటుందని హిందీ లో సామెత. మరి  ఆ ధాన్యపు గిడ్డంగుల ముంగిలిలో ముక్కిపోయి తినడానికి పనికి రాకుండా పోతున్న గింజలమీద తిండి దొరకక ప్రాణాలు పోయే ఎంతమంది  నిర్భాగ్యుల పేర్లు రాసి  వున్నాయో!  మానవత్వం  న్న వారందరూ వెంటనే స్పందించ వలసిన అవసరాన్ని  ఈ ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భమయినా  గుర్తు చేస్తే బాగుణ్ణు .
-కర్లపాలెం హనుమంత రావు
(15-10-2010నాటి ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా  ఐదేళ్ళ కిందట నేను రాసిన వ్యాసం.. కొన్ని తాజా సవరణలతో)





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...