Showing posts with label Magazines. Show all posts
Showing posts with label Magazines. Show all posts

Sunday, December 12, 2021

ఆ'పరేషాన్ ' - చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 

 

మా కొలీగ్ సుబ్బారావు తనకు వంట్లో బావోలేదని ఆసుపత్రికి వెళుతుంటే నేనూ తోడు వెళ్ళా.

బైట బోలెడంత క్యూ. గంటకయినా లోపలికి పోవడం అనుమానమే. ఆఫీసుకి టైమయిపోతుందని నేను కంగారు పడుతుంటే కారిడార్లలో గుర్నాథం కనిపించాడు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు.

గుర్నాథం హైస్కూల్లో నా క్లాస్ మేట్. చాలా ఏళ్ళతరువాత అనుకోకుండా ఇక్కడ కలిసాడు. నేను వచ్చిన పని కనుక్కొని చనువుగా 'డాక్టరుగారు నాకు బాగా తెలుసులేరా! నువ్వెళ్ళు! మీ ఫ్రెండు పని నేను చూస్తాలే!' అన్నాడు.

 

ఆ సాయంత్రం సుబ్బారావు గుర్నాథాన్ని ఒహటే పొగడటం! 'మీ ఫ్రెండుకి మా చెడ్డ ఇన్ఫ్లుయన్సుందండీ! చకప్పులూ అవీ చకచకా చేయించేసాడు. రిపోర్టులు తీసుకొని తనే వస్తానన్నాడు' అన్నాడు సంబరంగా.

గుర్నాథం స్కూలురోజుల్లో యావరేజి. వెనుక బెంచీలో కూర్చోని ఎప్పుడూ ఏవేవో పెన్నులు రిపేరు చేస్తుండేవాడు. వాడి సంచీలో పుస్తకాలు అన్నీ ఉన్నా లేకపోయినా.. రకరకాల కలం కేపులు, పాళీలు, నిబ్బులు, సిరాబుడ్డి, చెత్తగుడ్డపీలికలు మాత్రం నిండుగా ఉండేవి. మూడుపైసలకు కేపు, రెండు పైసలకు నిబ్బు, పైసాకి పాళీ.. పెన్నుమొత్తమయితే అణా.. అలా అమ్మేవాడు పాత కలాలని. అణాలు, పైసలు చలామణిలో ఉండే జమానాలేండి అది. అప్పట్లో ఇప్పట్లా బాల్ పెన్నులు కాకుండా సిరా నింపుకొని రాసుకొనే రకం కలాలు వాడకంలో ఉండేవి. మా మాస్టార్లుకూడా ఈ గుర్నాథం బుట్టలో పడుతుండేవాళ్ళు! అవసరం వచ్చినప్పుడు వాడు వాళ్ళకీ పేనాలు ఉచితంగా తయారు చేసిస్తుండేవాడు.  అందుకని ఏమనేవాళ్ళు కాదు.

పదో తరగతి పరీక్షలు రాసే రోజుల్లో సమాధాన పత్రాలు తారుమారు చేసాడని డిబారు చేసారు వాణ్ణి. ఆ తరువాత ఇదిగో ఇప్పుడే.. మళ్ళీ దర్శనం!

గుర్నాథం తెచ్చిన రిపోర్టులు చూసి గుండె ఆగిపోయినంత పనయింది  సుబ్బారావుకి. కిడ్నీలో ప్రాబ్లమున్నట్లు తేలింది. 'ఆపరేషన్ అవసరమంటున్నాడు డాక్టర్' అన్నాడు గుర్నాథం తాపీగా.

కిడ్నీ ట్రాన్సప్లాంటేషనంటే మాటలా? దానికి ముందు డయాలసిస్. డయాలసిస్ అంటే లక్షల్లో వ్యవహారం. ముందు డోనర్ దొరకడమే గగనం. కిడ్నీదాత బంధువు కాకపోతే ఆథరైజేషన్ కమిటీ అప్రూవల్ అవసరం. అదంత తేలికగా తెమిలే వ్యవహారం కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్లు రిస్కు తీసుకోవడానికి బాగా జంకుతున్నారు. మరీ ఈ మధ్య ఈ కిడ్నీ కేసుల చుట్టూతా గవర్నమెంటు నిఘా  పెరిగిన తరువాత.

'కేసులవుతాయేమోనని భయం. అవన్నీ నేను చూసుకొంటాగాని.. మనీ సంగతిమాత్రం మీరు చూసుకోండి' అని అభయమిచ్చాడు గుర్నాథం.

'ఎంతవుతుందేమిటీ?'  సుబ్బారావు సందేహం.

'సుమారు నాలుగయిదు లక్షలు'

'అమ్మో! గవర్నమెంటు ఉద్యోగినికూడా కాదు. ఎక్కణ్ణుంచి తవ్వి తేవాలీ అంత డబ్బు?' అంటూ సుబ్బారావు గుండెలు బాదుకొన్నాడు. '

'ఇదింకా చీపండీ! లివరయితే ఏడు లక్షలు. హార్టు, లంగ్సు ఆపరేషనయితే అంతకు రెట్టింపు. కంటిగుడ్డుకు వాడే కార్నియానే ఐదు లక్షలు పోస్తేగాని దొరకడంలేదు మార్కెట్లో'

రైతుబజారులో కూరగాయల దరవరల్లాగా ఏకరువు పెడుతున్నాడు గుర్నాథం.

'చూస్తూ చూస్తూ వంట్లోని పార్టుల్ని ఎవరమ్ముకొంటార్రా? ఏదో సినిమాల్లో అలా చూపిస్తుంటారుగానీ' అన్నాను నేను అక్కడికీ నమ్మకం కుదరక.

'పేదరికం ఎంత పనయినా చేయిస్తుంది బాబూ! మెదడు చచ్చిపోయినా గుండె కొట్టుకొంటుంటే చాలు.. ఇలా చాలా అవయవాలని తీసి హాయిగా వాడుకోవచ్చు. ఇవాళా రేపూ ఆ వ్యాపారం బాగా ఊపందుకొందికూడా మిత్రమా! పేపర్లలో వచ్చేవే వార్తలు కావురా బాబూ! వాటికి వెనకాల సమాంతరంగా అంతకుమించిన ప్రపంచం పరుగెడుతోంది' అన్నాడు గుర్నాథం.

'ఎంత అన్యాయం!' గుండెలమీద చెయ్యివేసుకొన్నాడు సుబ్బారావు తబ్బుబ్బయిపోతూ.

'ఇందులో అన్యాయం ప్రసక్తేముంది?అవసరం అలాంటిది. ఇంద్రుడు వజ్రాయుధంకోసం దధీచి పక్కటెముకలు లాగేసుకోలా? కవచకుండాలలనికూడా దానం చేసిన కర్ణుడికథ మనకు కొత్తా? డబ్బు పడేస్తే లివర్లయినా ఫ్లవర్లలో పెట్టి ఇస్తున్నారు సార్ ఈ కాలంలో! గుండెకాయలు బెండకాయల్లా, కంటిగుడ్లు కోడిగుడ్లలా మారకం జరిగిపోతున్నాయి. యూరప్ లాంటి డెవలప్డ్ కంట్రీసులో అయితే ఏకంగా 'యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గాన్స్ సేల్' అని భారీ నెట్ వర్కే నడుస్తోంది బ్రహ్మాండంగా’.

'చట్టం చూస్తూ వూరుకొంటుందా?!’

'ఎందుకూరుకొంటుంది సార్? తనపని తాను చేసుకు పోతుంటుంది. నెట్ వర్కూ తనపని తాను చేసుకు పోతుంటుంది. ఇక్కడిలాగానేఒకరి పనిలో ఇంకోరు జోక్యం చేసుకోకుండా డబ్బుమూట చూసుకొంటుంది'

గుర్నాథం చెప్పిందాంట్లో అతిశయోక్తేమీ లేదనే అనిపిస్తోంది. డబ్బుకు చట్టం చుట్టం కానిది ఎక్కడలేండి?! ప్రాణంతీపిముందు ఎన్ని ధర్మపన్నాలైనా చేదుగానే ఉంటాయికదా!

'మీరు ఆలోచించుకొని కబురు చేయండి!.. వస్తా!' అని విజిటింగ్ కార్డొకటి ఇచ్చి కాఫీతాగి వెళ్ళిపోయాడు గుర్నాథం.

 

సుబ్బారావుగారింట్లో రెండు రోజులు ఒహటే మల్లగుల్లాలు. పాపం! సుబ్బారావు గవర్నమెంటు ఉద్యోగైనా కాదు.. కనీసం ఖర్చులైన్నా రాబట్టుకోడానికి. ఇంట్లోని బంగారం, ఊరి బైట అప్పుడెప్పుడో కొనుక్కున్నస్థలం అమ్మైనా సరే .. ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనని పట్టుపటుకు కూర్చొంది సుబ్బారావుభార్య. 

గుర్నథాన్ని పిలిపించి పరిస్థితి వివరించాం. ‘ఉన్నంతే ఇవ్వండి. మిగతా సర్దుబాట్లేవన్నా ఉంటే చూసుకోడానికి నేనున్నాగా!’ అంటూ అభయహస్తం ఇచ్చాడు.  

డోనర్ని చూపించమన్నాడు సుబ్బారావు. అన్నంరాజు అనే అతన్ని కలవమని అదేదో అనాథ శరణాలయం చిరునామా ఇచ్చాడు గుర్నాథం.

గుర్నాథం మనుషులమని నమ్మకం కుదిరాక  సగం రేటుకే బేరం కుదురుస్తానని ఉత్సాహం చూపించాడా అన్నంరాజు.

డోనర్ని మాత్రం ఇప్పుడే చూపించకూడదంట! 'లోపాయికారీ వ్యవహారాలు  కదండీ ఇవన్నీ! పదేళ్ళబట్టీ ఈ వ్యాపారంలో ఉన్నాను. నన్ను మీరు నమ్మాలి' అన్నాడు అన్నంరాజు. నమ్మకమాత్రం చేసేదేముంది గనక?

సగం పైకం ముందే గుంజుకొన్నాడు అన్నంరాజు.

'డాక్టరుగారు ఆపరేషన్ డేట్ ఇచ్చిందాకా కిడ్నీకి రెంట్ కడుతుండాలి. నెలకు నాలుగువేలు. డోనరు కిడ్నీని వేరేవారికి అమ్ముకోకుండా ఆపటానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. ఆ మాత్రం భరించక తప్పదు. ఆఫ్ట్రాల్ ఆపరేషన్ అయిన తరువాత  ఆ కిడ్నీ మనదే అవుతుంది కదండీ చివరికి?' అని ఆ పెద్దమనిషి లా పాయింటూ!

డాక్టరుగారి డేట్ మూడు నెలలకుగాని దొరకలేదు. అంత బిజీట ఆయన! ఈ మూడు నెలలు క్రమం తప్పకుండా డయాలసిస్ తప్పటంలేదు సుబ్బారావుకి.

 

సుబ్బారావీ మధ్య చిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 'ప్రతీ మనిషికి కనీసం నాలుగు కిడ్నీలైనా ఉండాలి. అలాగే ఆరేడు జతల చేతులు, పది జతల కాళ్ళు, నాలుగైదు జోళ్ళ చెవులు, కళ్ళు, రెండు మూడు ముక్కులు, వందనాలికలు, నాలుగయిదు  గుండెలుకూడా ఉంటే బావుంటుంది.' ఇలా సాగుతోంది సుబ్బారావు ధోరణి.

రెండు చేతులుంటేనే మనిషిచేసే ఆగం తట్టుకోలేక పోతోంది లోకం. ఇహ పదులు.. ఇరవైలు మొలుచుకొస్తే జరిగే ఆగడాలని ఊహించగలమా?!

'ఒక్క తలకే  ఇంత లావున తిరుగుతోంది మీకు! పదేసుంటే ఇహ పట్టుకోగలమా తమర్నీ.. తమ తి.క్కనీ! ' అని శాపనార్థాలకు దిగింది సుబ్బారావుగారి శ్రీమతి. భర్త పిచ్చిమాటలు  విని విని పాపం ఎంతగా విసిగిపోయిందో ఆ ఇల్లాలు!

'ఇందులో తిక్కేముందే పిచ్చిదానా! శివుడికి మూడు కళ్ళు లేవూ? విష్ణుమూర్తికి నాలుగు చేతులు, బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు, రావణాసురుడికి పది తలకాయలు, కార్తవీర్యుడికి వెయ్యి చేతులు, దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు!  దేవుళ్లందరికీ అన్నేసి అవయవాలుండగా లేనిది మానవులకు అందులో కనీసం సగమైనా ఉండాలని కోరుకోవడం తిక్కా?!'

ఒక అవయవం పాడైనా మరోటి పనికొస్తుందని కాబోలు సుబ్బారావు ఆశ. 'ఈసారి దేముడు కనబడితేమాత్రం రకానికో జత స్పేరుగా ఇవ్వమని పట్టుబట్టడం ఖాయం' అంటో సుబ్బారావు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మనసంతా దేవినట్లయిపోయింది.

 

ఎలాగైతేనేం.. సుబ్బారావుకి ఆపరేషన్ అయిపోయింది.

మూడో రోజు గుర్నాథం పేరు వార్తాపత్రికల్లో వచ్చింది ప్రముఖంగా ఫొటోలతో సహా. ఏ టీవీ ఛానల్లో చూసినా ఆ రోజంతా ఆ మహానుభావుణ్ణి గురించిన సమాచారమే!

మానవ శరీరావయవావలను అమ్మే వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఓ ప్రముఖ వార్తాపత్రిక వివరాలతోసహా వరుస కథనాలను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ గోల్ మాల్ మొత్తంలో గుర్నాథానిదీ ఓ ప్రధాన పాత్ర!

అరెస్టు చేయడానికని వెళ్ళిన పోలీసులు అతగాడు గుండెనొప్పి వచ్చిందన్నాడని కోర్టు ఆదేశాలమీద నిమ్సు ఆసుపత్రిలో చేర్చి బైట పహరా కాస్తున్నారు.

నేర పరిశోధక బృందం అన్నంరాజు అనాథ శరణాలయంమీద ఆకస్మిక దాడి చేసినప్పుడు బోలెడన్ని అవయవాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి బైటపడ్డాయని వార్త! కిడ్నీలు, లివర్లు, కళ్ళు.. వంట్లో అమ్ముకోవడానికి వీలున్న ఏ అవయవాన్నైనా సరే చెట్టుమీదనుంచి కాయలు కోసిచ్చినట్లు కోసిచ్చే ఏర్పాట్లు ఆ అనాథ శరణాలయంలో  జరుగుతున్నాయిట! అందుకు అనుగుణంగా అక్కడ  పెరుగుతున్న అనాథ బాలబాలికలను చూసి  నోరు వెళ్లబెట్టడం నేర పరిశోధక బృందం వంతయిందట!

కూరగాయలే సరిగ్గా దొరకని ఈ కరువురోజుల్లో అంతంత మందని  సేకరించి పెంచడమంటే మాటలా?!

ఆ ముక్కే ఎవరో పనిలేని చానెల్ వాళ్ళడిగితే ఆసుపత్రి శయ్యమీద విలాసంగా శయనించిన గుర్నాథంగారు చిద్విలాసంగా నవ్వి వినయపూర్వకంగా ఇచ్చిన సమాదానం

'అంతా ఆ పై వాడి దయ. ఆపైన సర్కారు పెద్దల సహకారం'

అన్నంరాజు అనాథశరణాలయంలోని పసిపిల్లలు తరుచుగా చనిపోతున్నారన్న విషయం అప్పుడు బైటపడింది! అనుమాన నివృత్తికోసం ముందురోజు పోయిన పిల్లలిద్దరి బాడీలను రీపోస్టుమార్టమ్ చేయిస్తే.. వచ్చిన రిజల్టు ‘షాకింగ్’!

 

బాడీల్లో చాలా పార్టులు మిస్సింగు!

ఉదయంబట్టీ వరసబెట్టి వస్తున్న ఆ వార్తల్ని చూసి చూసి సుబ్బారావు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయాడు! మళ్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సొచ్చింది మాకు అర్జంటుగా!

ఎందుకైనా మంచిదని సుబ్బారావుబాడీని ఫుల్ స్కానింగు చేయించాం.  మా అనుమానం నిజమే అయింది. సుబ్బారావు వంట్లోని కిడ్నీలు మాయం!

గుర్నాథం రికమెండ్ చేసిన డాక్టరు  ఆపరేషన్ చేసింది- సుబ్బారావు కిడ్నీజబ్బు మాయం చేయడానికి కాదు. మంచి కిడ్నీని మాయం చేయడానికని ఆలస్యంగా తెలిసింది!

కిడ్నీధర కనీసం నాలుగయిదు లక్షలకు తక్కువ  పలికని రోజుల్లో .. నాలుగో వంతుకే ఆపరేషన్ చేయిస్తానని గుర్నాథం ఆఫరిచ్చినప్పుడే  అన్నిరకాలుగా ఆలోచించుకొని ఉండాల్సింది మేం!

'ఎలాగూ పోయే శాల్తీనేగదా అని ఆయన మంచి కిడ్నీని మా ఆపరేషన్ ఖర్చులకింద రాబట్టుకొన్నాం.. వ్యాపార ధర్మంగా! అదీ తప్పే?!' అంటూ బుకాయింపులకి దిగాడు బైలునుంచి  L బైటికొచ్చిన పిదప అతికష్టంమీద సెల్లో దొరికినప్పుడు గుర్నాథం!


( సూర్య  -దిన పత్రిక ప్రచురణ ) 

***

-కర్లపాలెం హనుమంతరావు

14 మార్చి 2021 

బోథెల్ ; యూ ఎస్ ఎ 





Thursday, December 9, 2021

వ్యాసం- బాల భాష- భలే భాష రచన- కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక)

వ్యాసం- 





బాల భాష- భలే భాష 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక) 



ఊహలను, కష్టసుఖాలను తోటివారితో పంచుకునే సాధనం- భాష. గుంపులుగా సంచరించే జీవులకు భాష అవసరం మరీ జాస్తి. వంటరిగా మసిలే కాకికి పది పన్నెండు అరుపులు వస్తే గుంపులుగా తిరిగే కోతికి వందదాకా శబ్దాలు చేయడం వచ్చు. మనిషి సంఘజీవి కనక భాషా తదనుగుణంగానే ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందింది. ఆ క్రమమే శిశువుల్లోనూ ప్రతిఫలిస్తుంటుందని జీవపరిణామవాదం. బాలభాషను స్థాలీపులాక న్యాయంగా పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.


ప్రాపంచిక వ్యవహారాల్లో భాష అవసరాన్ని కనిపెట్టి మనిషి ఎలా దాన్ని వశంలోకి తెచ్చుకున్నాడో.. శిశువూ అదే క్రమంలో వస్తువులు, వాటి సౌకర్యాలు, వాటిని సమకూర్చుకునే పద్ధతులను గురించి నేర్చుకుంటుంది. ఒక మూల కొన్ని వస్తువుల కుప్ప ఉందనుకోండి. అందులో తనకు కావాల్సిన వస్తువు ఉంది. మూగ సైగలద్వారా స్పష్టంగా చెప్పడం కుదరదు కదా! పెద్దవాళ్ళెవరైనా ఒక్కొక్క వస్తువును చూపిస్తుంటే .. అది అవునో కాదో చెప్పాలి. అనుకున్నది దొరికేదాకా ఓపిక కావాలి. శిశువుకు అంత సహనం ఉండదు. కోరినది వెంటనే అందాలంటే స్పష్టమైన పదంతో సూచించడం అవసరం. మాటలు నేర్చుకోవడం అందుకే శిశువుకైనా ఒక తప్పనిసరి అవసరంగా మారింది. మాటలు రాని ఇద్దరు శిశువులను ఒకే చోట కూర్చో పెట్టిచూడండి. వాళ్ళిద్దరూ ఏవో విచిత్రమైన శబ్దాలతో పరస్పరం సంభాషించుకునే ప్రయత్నం చేస్తారు. అదే మాటలు నేరిస్తే కావాల్సిన వస్తువు పేరు వత్తి చెప్పో, ముఖకవళికలద్వారా సూచించో, అవయవాలను యథాశక్తి కదిలించో సాధించుకోవచ్చు. కానీ ఈ అభ్యాసమంతా ఎన్నో తప్పుల తడకలో తమాషాగా సాగుతుంది. ఆ కోణంనుంచే ఈ రచన సాగుతుంది. బిడ్డకు వస్తువు పేరు తెలిసినా దాని లక్షణం సంపూర్ణంగా తెలియదు చాలాసార్లు. ఆ వస్తువును గురించి తనకు తట్టిన భావంతో గుర్తించడం బిడ్డకు అలవాటు. బెల్లం రుచి నచ్చి బెల్లం పేరు పలకటం వచ్చిన పిల్లలు.. రుచి నచ్చిన మరే తినుభండారం చేతికిచ్చినా 'బెల్లం' అనే అంటారు. బెల్లం రుచి పేరు 'తీపి' అని తెలిసిన తరువాత ఆ 'తీపి' ఇష్టం కనక ఇష్టమైన ఏ రుచినైనా వాళ్ళు తీపి అనే అంటారు. పండగనాడు పిండివంటలు చేస్తారు. కాబట్టి అప్పచ్చులు చేసిన ఏరోజైనా పిల్లల దృష్టిలో పండుగైనట్లన్నమాట.

ఒక వస్తువు ప్రత్యేక లక్షణాలను గుర్తించి ఆ లక్షణాలుగల వస్తువును ఆ పేరుతోనే పిలిచే శక్తి కొన్ని నెలలు గడిస్తేనేకాని బిడ్డకు పట్టుబడదు. పెద్దవాళ్లు పక్కనుండి సరిదిద్దే వరకూ చిన్నాన్నను నాన్ననీ, పక్కింటి పిన్నిని అమ్మనీ చేసేసి కంగారు పెట్టేస్తుంటారు. మీసాలు..గడ్డాలు కలగలిసిపోయిన ఆసామినెవరినన్నా చూపించి పెద్దాళ్ళు 'బూచాడు' అని భయపెడితే.. మీసాలు గడ్డాలున్న ప్రతి మగవాడూ ఆ బిడ్డ దృషిలో బూచాడే. ఆఖరికి టీవీలో రోజూ కనిపించే చంద్రబాబునాయుడునుంచి.. యోగా గురువు రాందేవ్ బాబాదాకా. వ్యక్తుల ప్రత్యేకలక్షణాలను గ్రహించి ప్రత్యేకమైన పేర్లతో గుర్తించడం శిశువుకి అలవాటు అయిందాకా ప్రతిరోజూ ఇంట్లో ఇలాంటి ఏదో తమాషా జరుగుతుండాల్సిందే. ఒక వస్తువు ప్రత్యేక లక్షణాన్ని గుర్తించే సామర్థ్యం అలవడ్డ తరువాత ఆ లక్షణాలున్న అన్ని వస్తువులను ఒక సముదాయంగా భావిస్తారు బిడ్డలు. గులాబి రంగు నచ్చింది కనక మల్లె, మందారం, గన్నేరు, చివరికి గడ్డిపూవైనా సరే- గులాబీలే బాలలకు. పెద్దవాళ్ళు ఒకొక్క పువ్వు లక్షణాన్ని వివరించి పేర్లు చెప్పించాల్సిన సమయమిదే. మొగైనా..పువ్వైనా, రెక్కైనా.. తొడిమైనా ఒక దశలొ పిల్లలకు అన్నీ పూల కిందే లెక్క. వివిధ దశలను ప్రత్యేకమైన పేర్లతొ గుర్తించి పిలిచే పదసంపద సొంతమయేదాకా పిల్లలతో ఇదో రకమైన తారుమారు సరదా.


పిల్లల దగ్గర సభ్యపద ప్రయోగాలు మాత్రమే చేయడం చాలా అవసరం. అర్థం తెలియకపోయినా పెద్దవాళ్ళ మాటలను గుడ్డిగా అనుకరించడం పసిబిడ్డల లక్షణం. భాషను చురుకుగా నేర్చుకోవడానికి బిడ్డకు ఉపకరించేదీ అనుకరణ గుణమే. అనుకరణ బిడ్డకు అంత సులభమేమీ కాదు. ఎన్నో పాట్లు. కొన్నిసార్లు నవ్వు పుట్టించే సందర్భాలూ కద్దు. పిల్లలకు తెలిసే వస్తువులు కొన్నే. ఆ వస్తువుల లక్షణాలు కనిపిస్తే తెలీని వాటినీ వాటి పేర్లతోనే పిలుస్తుంటారు. ఇంట్లో ఉండే తువ్వాయికి నాలుగు కాళ్ళు కనక నాలుగు కాళ్ళున్న గాడిదైనా సరే వాళ్ళకళ్ళకి తువ్వాయే. పండక్కి తను కొత్తగౌను కట్టుకుంది కనక ఇంట్లో వాళ్ళందరూ గౌన్లే కట్టుకుంటారని ఓ పాపాయి ఊహ. నిన్న, రేపు, కొనడం, అమ్మడం, రావడం, పోవడం.. లాంటి పదాల మధ్య తేడాలు అంతుబట్టక ఒకదానికి బదులు ఒకటి వాడి నవ్వు తెప్పిస్తుంటారు ప్రతి ఇంట్లోనూ పిల్లలు. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఆటలాడుకుంటూ కల్పించుకునే సొంతపదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వస్తువులకు వాళ్ళు పెట్టే పేర్లు ఒక్కోసారి చాలా సృజనాత్మకంగా కూడా ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. 'పడవ'ను ఒక పాపాయికి 'కాలవ ఇల్లు' అంది. వానబడితే కప్పలు బెకబెకలాడతాయి కనక వర్షాన్ని మరో చిన్నారి 'బెకబెక'గా సంబోధిస్తుంది. మానవసంబంధాలను అచేతన పదార్థాలకూ ఆపాదించే కావ్యలక్షణం పసివాళ్లకు ఎలా అబ్బుతుందో..అదో అబ్బురం. ఒక పాపకు వంకాయి పేరు మాత్రమే తెలుసు. సంత నుంచి


తండ్రి తెచ్చిన సొరకాయను, పొట్లకాయను .. వరసగాబెట్టి వంకాయ అమ్మమ్మ, వంకాయ తాతయ్య అంటూ వంకాయభాషలోనే పిలుస్తుంది. ఇంకో పాపకు పక్కింటి పడుచుపిల్లదగ్గర బాగా చనువు. అస్తమానం 'అక్క' అంటో ఆ పిల్ల వెంటే తిరుగుతుంటుంది. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ ఆ పాపకు అక్క అమ్మ, అక్కఅన్న, అక్కనాన్న.. అని లెక్కన్న మాట. మరో బాబు దృష్టిలో పోషణ చేసేవాళ్ళందరూ అమ్మల కిందే జమ. అందుచేత


నీళ్ళుచేదుకునే బావి - బావమ్మ, అప్పచ్చి ఇచ్చే పక్కింటి ఆమె 'అప్పచ్చమ్మ'. చుట్టరికాలతో సొంతంగా పాటలు కట్టుకుని పాడుకోవడం పిల్లలకు ఎంతో సంతోషం కలిగించే సరదా. 'కప్ప నీ అప్ప, బల్లి నీ బావ, బొమ్మ నీ అమ్మ, చీమ నీ చెల్లెలు'- ఇలా సాగే పిల్లల పాటలు ఆంగ్లంలో 'నాన్సెన్స్ రైమ్స్' పేరిట చాలా ప్రసిద్ధి. పిల్లల ఈ అభిరుచి వల్లే బాలలకథల్లో కాకిబావ, నక్కమామ లాంటి చిత్రమైన పాత్రలు పుట్టుకొచ్చింది. తల, గొంతు, తత్సంబంధమైన తదితర కండరాల కదలికలను బట్టి ధ్వని ఉచ్చారణ ఉంటుందని మనందరికి తెలుసు. కండరాల స్వాధీనత వెసులుబాటు శిశువు ఉచ్చారణను నిర్దేశిస్తుంది. ఆ స్వాధీనానికి బిడ్డకు కొంత వ్యవధానం అవసరం. అయినా ఈ లోపే శిశువుకి వస్తువుమీద ఒక అవగాహన ఏర్పడి వుంటుంది. కండరాలను సులభంగా కదిలించగలిగిన అక్షరాలనే బిడ్డ ముందుగా పలుకుతుంది. ర, డ లాంటి అక్షరాలు అంత సులభంగా లొంగవు. త, ప లాంటి అక్షరాలూ ఆరంభంలో పలకడం కొంచెం కష్టమే. కష్టమని ప్రయత్నం శిశువుల లక్షణం కాదు. ఒక అక్షరాన్ని పలకడంలోని ఇబ్బంది.. దాని పక్క అక్షరాన్నిబట్టి ఉంటుంది. త, ప.. లు లాంటివి ఒంటిగా పలికే ఇబ్బందిని 'అత్త.. అప్ప' అని 'అ' ముందు చేర్చడంద్వారా పరిష్కరించుకోవడం ఇలాంటి ఒక పద్దతి. అక్షరాలను మార్చడం, కొన్ని అక్షరాలను వదిలేయడం, కష్టమైన అక్షరాలకు బదులుగా తేలిక అక్షరాలు పలకడం ఇంకొన్ని పద్ధతులు. కొత్తపదం దొరికినప్పుడు పరిచయమున్న పాతపదానికి దాన్ని అనుసంధానించుకోవడంద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. శిశువు. రోకలి- లోకలి, తమలపాకు-తాంపాకు, పటికబెల్లం- కటికబెల్లం, పులుసు- పుస్సు, పెనసలు- పెస్సలు, పుస్తకం- పుత్తకం.. ఇలా ఎన్ని పదాలనైనా గుర్తించవచ్చు. రెండేళ్ళు నిండేవరకు శిశువుకు 20, 30 పదాలకు మించి రావు. మూడు నాలుగు ఏళ్ళకు అత్యద్భుతమైన వేగంతో నాలుగైదు వందల పదాలదాకా సాధిస్తారు పిల్లలు. ఒంటరిగా వుండే పిల్లలకు పదాలు ఎక్కువ రావు. ఈడుకు మించినవాళ్ళతో జోడుకట్టే బాలల భాషాజ్ఞానం అసాధరణంగా ఉంటుంది. పరిస్థితులు, ఆరోగ్యం, ఆసక్తి, పరిశీలనా శక్తి.. ఇలా భాషాభ్యాసానికి దోహదం చేసే ఉపకరణాల చిట్టా పెద్దదే.


అన్ని భాషాభాగాల్లోనూ నామవాచకాలను పిల్లలు ముందు గ్రహిస్తారని ఒక సాధారణ అభిప్రాయం. అభ్యాసం నామవాచకాలతోనే ప్రారంభమైనా శిశువుకి క్రియావాచకాలమీద

ధ్యాస జాస్తి. పని చేయడం మీదే శిశువుకు సహజంగా ఉండే ఆసక్తి దీనికి కారణం. ఇతర భాషాపదాలనూ క్రియాపదాలుగా మార్చి పలకడం.. అదో విచిత్ర పద విన్యాసం. ప్రతి పదానికి ఒక క్రియని జోడించే అలవాటువల్ల ఆ పదాన్ని ఆ క్రియకు పర్యాపదంగా ఉపయోగిస్తుంది శిశువు. మేడమీదకు తీసుకు వెళ్ళడానికి 'మీద.. మీద' అని సూచించడం దీనికి ఒక ఉదాహరణ. విరుద్ధపదాలను సైతం ఒకే వాక్యంలో సమర్ధవంతంగా కూరి వినోదం అందించడం పిల్లల మరో తమాషా విద్వత్ లక్షణం. ఆడవాళ్ళతో చాలాకాలం మెలిగిన బిడ్డ మొగవాళ్ళతోనూ 'ఇది ఇయ్యవే..ఇలా రావే' అని మాట్లాడుతుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది?


పొడుగు పొడుగు వాక్యాలతో గాని పెద్దలు స్పష్టపరచలేని భావాన్ని ఒక చిన్న పదంతో స్పంష్టంగా వెలిబుచ్చగల చిచ్చర పిడుగులు చిన్నారులు. అసలు సిసలు మినీకవులన్నా తప్పు లేదు. ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపమనడానికి 'జో..జో.." అని రెండక్షరాలతో సూచిస్తుందో బాలమేధావి. రెండు మూడు సంబధంలేని విడి పదాలను జోడించి విచిత్రమైన వాక్యం తయారు చేయగలరు బాలలు. 'నాన్న.. తియ్య.. లే' అంటో చేతులు తిప్పుకుంటో పిల్లాడు చెబుతున్నాడంటే 'నాన్న మిఠాయి తీసుకురాలేదు' అని ఫిర్యాదు చేస్తున్నాడన్న మాట.


అభినయం తగ్గి మాటలు పెరగడం శిశువు వికాసదశ పరిణామం. వస్తువు, దాని ప్రత్యేక లక్షణం గుర్తు పట్టే విచక్షణ పెరిగే కొద్దీ పదాలను పొందిక చేసి వాక్యాలుగా ఉచ్చరించడం బిడ్డకు అలవాటవుతుంది.


పసిపిల్లలకు 'నేను' అన్న భావం ఒక పట్టాన బుర్రకెక్కదు. అందరూ తనను ఎలా పిలుస్తారో తననూ తానూ అలాగే సంబోధించుకుంటుంది ఓ చిట్టి. 'చిట్టికి పప్పులు కావాలి' అంటే 'నాకు పప్పులు కావాలి' అని అర్థం అన్నమాట. 'చిట్టి ఏడుస్తుంది.. చూడూ' అని అరుస్తుందంటే 'నన్ను ఏడ్పించద్దు' అని అర్థించడమన్న మాట.


'వర్షం వెలిసింది' అనడానికి 'వర్షం పోయింది' అని, 'నూనె ఒలికింది' అనడానికి 'నూనె పారిపోయింది' అని .. ఇలా ఒక పదార్థ లక్షణాన్ని వేరొక పదార్థ లక్షణానికి అన్వయించేసి చిత్రమైన పదబంధాలను తయారుచేసే శక్తి పసిపిల్లలది. ఎంతకూ తన మాట వినిపించుకోని తల్లిమీద 'నీకు చెవులు కనిపించవా?' అని గయ్యిమంటో లేచిందో పిల్లరాక్షసి. ఎంత అదిమి పట్టుకున్నా ఆ తల్లిపెదాలు నవ్వుతూ విచ్చుకోకుండా ఉంటాయా? 'అయ్యో.. బంగారంలాంటి బలపం పారేసావే' అని తండ్రి గద్దించడం గుర్తుంచుకున్న బాబు .. బళ్లో ఉపాధ్యాయుడు 'బంగారం చూసావా?' అని అడిగినప్పుడు 'చూసాను.. బలపం లాగుంటుంది' అనేస్తాడు ఠకీమని. ఎంత కోపిష్టి గురువుకైనా

ఫక్కుమని నవ్వు రాకుండా ఉంటుందా? 'అల్లరి చేసే బిడ్డ ఒళ్ళో ఇన్ని పప్పులు పోసి 'ఈ పప్పులు తీసికెళ్ళి వీటితో ఆడుకో' అని తల్లి గద్దిస్తే.. బిడ్డా అంతే చురుగ్గా ' 'పప్పుల్తో ఆడుకోం! పప్పులు పెట్టి చిన్ని తోటీ చింటూతోటీ ఆడుకుంటాం' అని తల్లి భాషను పెద్దఆరిందలా సరిదిద్దబోతే పెద్దవాళ్ళం మనం ఎంతసేపని పెదాలు బిగపట్టుకోగలం?! ఇట్లాంటి మెట్లెన్నో ఎక్కిన తరువాతే ఏ బాలైనా రేపటి ఉద్దండపిండంగా తయారయేది. భాషాభ్యాసంలోపదకవిపితామహుడు నన్నయకైనా దాటక తప్పని పసిదనపు చిలిపి దశలివన్నీ.***


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక) 

Friday, May 8, 2020

చక్కని తెలుగుకు బాటలు మూయకు- ఎలనాగ



తెలుగు భాషాప్రయోగంలో అత్యంత ప్రవీణులం, నిష్ణాతులం అయితే తప్ప మనం రాసే, మాట్లాడే భాష పూర్తి దోషరహితంగా ఉండే అవకాశం లేదు. అయితే భాష బాగా తెలిసినవాళ్లు రాసేదాంట్లో, మాట్లాడే దాంట్లో స్ఖాలిత్యాలు (తప్పులు) చాలా తక్కువగా ఉండి, భాష సరిగ్గా రానివాళ్లు రాసేదాంట్లో ఎక్కువ తప్పులుండటం మనం సాధారణంగా గమనించ గలిగే విషయం. పాఠకులు తమ తెలుగు భాషను మెరుగు పరచుకోవటానికి ఉపయుక్తంగా ఉండేలా నెలనెలా కొన్ని ఉదాహరణల సహాయంతో విశదపరచటమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం. మనం ఉపయోగించే భాష సాధారణ సందర్భాల్లో శిష్టముగా ఉండటం అవసరం. దీన్నే శిష్ట వ్యావహారికం/శిష్ట వ్యవహారికం అంటున్నాము. అది గ్రాంథికమై ఉండాలన్న నియమం లేదు. అయితే ఏవి భాషాపరమైన దోషాలో తెలిసి ఉండటం మంచిది.
హాస్యాన్ని చేర్చి వినోదాన్ని కలిగించాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని చమత్కార భరితమైన వాక్యాలను రాసాను. అవి కేవలం సరదా కోసమే తప్ప ఎవరినీ చిన్నబుచ్చటం కోసం కాదు. దయచేసి పాఠకులు సహృదయతతో అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను. మరొక్క విషయం. ఒక ప్రయోగం భాషాసవ్యత దృష్ట్యా తప్పు అని చెప్పినంత మాత్రాన దాన్ని నేటి ఆధునిక యుగంలోని రచనా సందర్భంలో అసలే వాడకూడదని కాదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అటువంటి ఎన్నో పదాలను ఉపయోగించటం పరిపాటిగా వస్తున్న విషయమే. అయితే స్ట్రిక్టుగా (కచ్చితంగా) చూస్తే అది తప్పు అనే విషయం తెలిసి ఉండాలి.
ప్రాథమిక స్థాయి దోషాలను మొదట పరీక్షించి, అరుదుగా తటస్థించే తప్పులను తర్వాత పరిశీలిద్దాం.
అవసరం లేకపోయినా ఒక అక్షరాన్ని ఒత్తి పలకటం (అక్షరం అడుగు భాగాన ఒక చిన్న నిలువు గీత ఉన్నట్టు వ్యవహరించటం – దీన్ని జట అంటారు) లేక ఆ విధంగా రాయడం మనం సాధారణంగా గమనించే స్ఖాలిత్యం.
“వివిధ మతాల, జాతుల, వర్గాల మధ్య సమైఖ్యతను సాధించటం ఈనాడు మన దేశానికెంతో అవసరం” అనే వాక్యంలో సమైఖ్యత అన్న పదం తప్పు. సమైక్యత అనేది సరైన పదం. సమ + ఐక్యత = సమైక్యత (వృద్ధి సంధి). అదే విధంగా ‘మల్లిఖార్జున స్వామి దేవాలయం’ అని రాసివున్న బోర్డులు కనపడతాయి మనకు అక్కడక్కడ. మల్లికార్జునుడు అనేదే సరైన పదం. మల్లిక + అర్జునుడు = మల్లికార్జునుడు (సవర్ణ దీర్ఘ సంధి). “నేను ప్రయోగించే భాష చాలా ఖచ్చితంగా ఉంటుంది సుమండీ” అన్నాడట ఓ పండితుడు. నిజానికి కచ్చితం అనే మాటకు బదులు ఖచ్చితం అని రాయటం వలన తన భాషలో కచ్చితత్వం లోపించిందన్న విషయాన్ని ఎరుగడాయన! ఏదైనా ఒక రంగంలో గొప్పవాడైన వ్యక్తిని సూచించటానికి ఉద్దండుడు అనే పదం ఉంది. కాని ఉద్ధండుడు అని రాస్తారు లేక పలుకుతారు కొంత మంది. గొప్పవాణ్ని సూచిస్తున్నాం కనుక ఒత్తు లేకుండా రాస్తే చప్పగా (సాదాగా) ఉండి అపచారం జరిగిపోతుందని భయం కాబోలు! ఉద్దండము అంటే పొడవైనది లేక ఎక్కువైనది అని అర్థం.
విష్ణువుకు ఉన్న అనేక నామాలలో (పేర్లలో) జనార్దనుడు అనేది ఒకటి. కాని జనార్ధనుడు అని తప్పుగా రాసేవాళ్లు లేకపోలేదు. అదే విధంగా మధుసూదనుడుకు బదులు మధుసూధనుడు అని కొందరు రాయటం, పలకటం అరుదైన విషయమేం కాదు. సూదనము అంటే చంపుట. మధు అనే రాక్షసుణ్ని చంపినవాడు కనుక మధుసూదనుడు అయినాడు శ్రీహరి.
“గులాబీ పువ్వులు గుభాళించినట్టు” అని వచన కవితలో ఒక కవి రాసుకోవచ్చు గాక, అంత మాత్రాన గుభాళించు అనే పద ప్రయోగం తప్పు కాకుండా పోతుందా? గుబాళించుట అంటే వాసన కొట్టుట.
“నావి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావండీ. ఇవి ఆనంద భాష్పాలు” అన్నదట ఒక యిల్లాలు తన భర్తతో. ఆ భర్త ఒకవేళ తెలుగు భాషను అమితంగా ప్రేమించే వాడైతే ఆ పద ప్రయోగాన్ని విని ఎంతగా విచారపడి దుఃఖ బాష్పాలను రాలుస్తాడో కదా! బాష్పాలు అనేదే సరైన పదం. అట్లా దుఃఖం ముంచుకొచ్చినప్పుడు మనను మనం ‘సంభాళించుకోవాలి’ అనకండి. ఎందుకంటే సంబాళించుకొనుట అన్నదే సరైన పదం.
“ఫలానా శ్రీమంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వజ్ర వైఢూర్యాలను కానుకలుగా సమర్పించుకున్నాడు” అని అచ్చులో చదివి అది దోషరహితమైన వాక్యం అనుకోకండి పాఠకులారా! ఎందుకంటే వైఢూర్యము అనటం తప్పు. వైడూర్యము అనేదే సరైన పదం. పురాణంలో శంబూకుడు అనే ఒకాయన తటస్థిస్తాడు మనకు. శంబూకము అంటే ముత్యపు చిప్ప లేక ఆల్చిప్ప. అయితే శంభూకుడు అని ఎవరైనా వాడితే ఆ పదం తప్పు అని గ్రహించాలి.
“నీ కోసం నా ప్రాణాలను ఫణంగా పెడతాను” అని ఎవరైనా అన్నారనుకోండి. చస్తే నమ్మొద్దు. ఎందుకంటే ఆ ఫణం వల్లనే చచ్చిపోతాము మనం! ఫణము అంటే పాము పడగ. పణము = పందెము కనుక ఇదే రైటు. ‘మాంసాహార & శాఖాహార హోటల్’ అనే బోర్డులు మనకు కనిపించటం సర్వసాధారణమైన విషయం. శాఖ అంటే చెట్టు కొమ్మ కనుక, కొమ్మలతో వండిన కూరను తెచ్చిపెడతారేమోనని భయం కలుగవచ్చు తెలుగు భాషా పండితులకు! శాఖాహారము అనేది తప్పు. శాకాహారము అనాలి. శాకము = కూర (ఆంగ్లంలో కరీ).
‘రాయబారము’కు బదులు ‘రాయభారము’ అని తప్పుగా ప్రయోగం చేస్తారు కొందరు. అట్టివారికి సవ్యముగా ‘రాయ’ భారమా?! కొన్ని కుటుంబాల వాళ్లు ‘భ’ గుణింతం ఎక్కువగా వాడుతారు రోజువారీ భాషలో. “భావగారూ, భావి దగ్గర స్నానం చేసి ధోవతి కట్టుకోండి” అంటారు. ఈ వాక్యంలో మూడు భాషాదోషాలు దొర్లినయ్. బావ, బావి, దోవతి అనేవే సరైన పదాలు. భావి అంటే భవిష్యత్తు అనే మరో అర్థం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. భ్రాహ్మ(ణు)లు అనే పదాన్ని వాడటం కూడా తప్పే. బ్రాహ్మణులు అనేదే రైటు. అదే విధంగా భీభత్సము, భీబత్సము, బీబత్సము – ఈ మూడు పదాలూ తప్పుతో కూడుకున్నవే. బీభత్సము అన్న పదమే సరైనది. “ఆర్థిక స్థోమత లేని బీదవాడు పాపం” అనే వాక్యంలో భాషాదోషం ఉంది. ఎందుకంటే స్థోమత అనే పదం తప్పు. స్తోమత అన్నది సరైన పదం. “ఎందుకలా అదేపనిగా కదుల్తావ్? స్థిమితంగా కూర్చోలేవూ?” అంటూ చిన్న పిల్లవాణ్ని పెద్దాయనెవరైనా మందలిస్తే, స్తిమితం అనే పదాన్ని స్థిమితంగా మార్చి ‘దోషం’ ఆ పెద్దాయనదే అనిపిస్తుంది కదా!
స్తంభము అనే పదాన్ని స్థంభము అని రాస్తారు కొంత మంది. స్తంభము అనేదే రైటు. స్థంభము తప్పు. ‘స్తంభించుట’ స్తంభము నుండి వచ్చిందే. ఇంకొక భాషాదోషాన్ని ప్రస్తావిస్తాను. అదేమిటంటే ప్రస్థావన అనే తప్పు పదాన్ని వాడటం. ప్రస్తావించుట అంటే చెప్పుట. ప్రస్తావము అన్నా కూడా ప్రస్తావన అనే అర్థం. ప్రస్థావన తప్పు. “ఆస్థీ, అంతస్థూ చూసుకోకుండా ఏ సంబంధాన్నీ చేసుకోవద్దు” అన్నామనుకోండి. అప్పుడు మనం సరిగ్గా చూసుకోకుండా రెండు భాషాదోషాలను దొర్లించిన వాళ్లమవుతాము. ఆస్తి, అంతస్తు అనేవే సరైన పదాలు. అదేవిధంగా అస్థిత్వము అన్న పదాన్ని వాడినామనుకోండి. అప్పుడు మనం పప్పులో కాలు వేసినట్టటే. ఎందుకంటే అస్తిత్వము అన్నదే సరైన పదం. అస్థిత్వము తప్పు.
మీరు రాంచి వెళ్లారట కదా. అక్కడి స్థూపాల్ని చూసారా? అని అడిగామనుకోండి. అప్పుడు కూడా రెండు తప్పులు చేసినవాళ్లం అవుతాము. ఒకటి భాషాపరమైనది, మరొకటి సామాన్య విజ్ఞానం (General Knowledge) కు సంబంధించినది. స్తూపము అనేదే సరైన పదం కావటం భాషకు సంబంధించినదైతే, రాంచిలో కాక సాంచిలో స్తూపం ఉండటం G.K. కు సంబంధించినది! కొందరు స్తనాలు అనటానికి బదులు స్థనాలు అంటారు. అది కూడా తప్పే. దీనికి విరుద్ధంగా ‘థ’ వత్తుకు బదులు ‘త’ వత్తు రాస్తారు కొంత మంది. ఉదా: అస్తిక, నేరస్తులు, గ్రామస్తులు. అలా రాయటం తప్పు. అస్థిక, నేరస్థులు, గ్రామస్థులు అని రాయాలి. అయితే రోగగ్రస్థులు అని రాయకూడదు. రోగగ్రస్తులు అనే రాయాలి. ఎందుకంటే గ్రస్తము అనే పదానికి తినబడినది లేక మింగబడినది అని అర్థం.
‘ట’ వత్తుకు బదులు ‘ఠ’ వత్తును రాయటం మరొక రకమైన భాషా స్ఖాలిత్యం. తెలుగు భాష ఎంతో విశిష్ఠమైనది అంటూ పొగిడామా తుస్సుమన్నట్టే! ఎందుకంటే విశిష్ఠము అనేది తప్పు పదం. విశిష్టము అని రాయాలి. అదే విధంగా ఉత్కృష్ఠము తప్పు. ఉత్కృష్టము సరైన పదం. ముష్ఠి , పుష్ఠి అని రాస్తారు చాలా మంది. కాని అవి తప్పులు. ముష్టి , పుష్టి అనేవి సరైన పదాలు. “చిత్రగుప్తుని చిఠ్ఠాలో మన పాపాలన్నీ రాయబడి ఉంటాయి” అని చదువుతాం మనం. అలాగే “ఏంటా వెకిలి చేష్ఠలూ” అంటూ చివాట్లు పెట్టడం కూడా వింటుంటాం. ఇక్కడ చిఠ్ఠాకు బదులు చిట్టా, చేష్ఠకు బదులు చేష్ట సరైన పదాలు అని తెలుసుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నవాణ్ని కోపధారి అనటం వింటుంటాం. కాని అది తప్పు. కోపిష్ఠి అనాలి (కోపిష్టి కాదు). అదేవిధంగా పాపిష్టి , పాపిష్ఠిలలో రెండవది రైటు. నిజానికి పాపిష్ఠి అని కాక పాపిష్ఠుడు అనాలట. కిరీటధారి, మకుటధారి, గిరిధారి, వస్త్రధారి అనవచ్చు కాని కోపధారి అనకూడదు.
తనకు అరవై సంవత్సరాల వయస్సు విండిన సందర్భంగా ఒకాయన అట్టహాసంగా ఉత్సవం జరుపుకోవాలనుకున్నాడు. ఆహ్వాన పత్రికల్లో షష్ఠిపూర్తి ఉత్సవం అని అచ్చయింది. అయితే మరి అతనికి ఆరేళ్ల వయసే ఉన్నట్టు భావించాలా? ఎందుకంటే ఆరవ తిథి (పంచమి తర్వాత వచ్చేది) షష్ఠి . అరవై సంవత్సరాల ఉత్సవాన్ని షష్టిపూర్తి లేక షష్ట్యబ్ద పూర్తి అనాలి. ఇలా కేవలం ఒక వత్తు వచ్చి చేరినందుకే అర్థం పూర్తిగా మారే ప్రమాదాలు తెలుగు భాషలో మరి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ప్రదానం, ప్రధానం. ప్రదాన సభ అంటే ఇచ్చివేసే సభ కాగా (బహుమతి ప్రదానం), ప్రధాన సభ అంటే ముఖ్యమైన సభ అవుతుంది. అదేవిధంగా అర్థము = భావము, అర్ధము = సగము. అర్థ సౌందర్యం అంస్టేకర Beauty of meaning. అర్ధ సౌందర్యం అంటే Half beauty. ఇక ధార అంటే వరుస, దార అంటే భార్య. ‘బాలరసాల సాల……’ అనే పద్యంలో పోతన ‘నిజదార సుతోద్ధర పోషణార్థమై’ అన్నాడు. పంచదార అంటే ద్రౌపది (ఐదుగురికి భార్య అయినది) కూడా అవుతుంది.
-ఎలనాగ

(భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 1(వాకిలి- అంతర్జాల పత్రిక )

-సేకరణః కర్లపాలెం హనుమంతరావు)

Sunday, May 3, 2020

అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు-





తెలంగాణలో ఆయా కులాలకు కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాల వ్యవస్థ ఉన్నది. పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాలు నియమంగా తమకంటూ ఒక విశిష్టమైన సాంస్కృతిక పరంపరను అనుసరిస్తూ తమను పోషించే కులాల మౌఖిక సాహిత్యాన్ని పరిరక్షిస్తున్నాయి. వీరి మౌఖిక సాహిత్యమంతా పోషక కులాల (దాతృ కులాల) సాహిత్యమే అవుతుంది. ఇందులో పోషక కులం యొక్క పుట్టుక, కులం మూలపురుషుని ఆవిర్భావం, దేవతలకు కుల మూలపురుషునికి ఉన్న సంబంధం, వృత్తి ఆవిర్భావం, వృత్తి పరికరాల పుట్టుక, నియమాలు, నమ్మకాలు మొదలైన వృత్తి ధర్మాన్ని తెలియజేసే అంశాలు. వారి కుల దైవం ప్రస్తావనతో పాటు కులం సామాజికంగా మనుగడకు కావలసిన అనేకాంశాలు పురాణాల్లో కనిపిస్తాయి. ఆశ్రిత జానపద కళలు పటం కథలు, హరి కథలు, నాటకాలు మొదలైన ప్రక్రియలతో కుల పురాణాలను ప్రదర్శిస్తూ మనుగడ సాగిస్తున్నాయి. రకంగా కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాలు ఆయా కులాలకు ఒకటికి మించి ఎక్కువగా ఉన్నాయి. ఇవి కులాన్ని అయితే ఆశ్రయించి కుల పురాణం కథా గానం చేస్తుందో, కులం దగ్గర మిరాశి కలిగి ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వేరే కులాన్ని ఆశ్రయించకుండా తమకు నియమింపబడిన కులాన్ని ఆశ్రయించటం వీటి ప్రత్యేకత. అయితే రజకుల కుల పురాణమైన మడేలు పురాణాన్ని కథాగానం చేసే గంజి కూటి, మాసయ్యలు అనే రెండు ఆశ్రిత కళారూపాలు ఉన్నాయి. ఇందులో గంజి కూటి వారు హరికథ రూపంలో మడేలు పురాణం కథా గానం చేయగా, మాసయ్యలు పటం ఆధారంగా మడేలు పురాణాన్ని కథాగానం చేస్తారు. మాసయ్యలను పటమోళ్లని, పటం చాకళ్లని కూడా పిలుస్తారు. కళాకారులు చెప్పే మడేలు పురాణంలో వీరి పుట్టుకకు చెందిన ప్రస్తావన కనిపిస్తుంది.
మడేలు పురాణం:
మడేలు పురాణం కూడా సృష్టి పుట్టుకతోనే మొదలవుతుంది. త్రిమూర్తుల జననం అనంతరం పార్వతీ కల్యాణం జరుగుతుంది. పురాణం లో భాగంగా దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి శివపార్వతులను పిలవ కుండానే యజ్ఞాన్ని తల పెడతాడు. అయితే పార్వతీ దేవి పిలువని యజ్ఞానికి వెళ్లగా దక్షుడు ఆమెను అవమానిస్తాడు. అవమానం తట్టుకోలేక యజ్ఞగుండంలో నే పార్వతీదేవి ఆహుతి అవుతుంది. ఇందుకు కోపించిన శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి అతన్ని సంహరించి రమ్మంటాడు. ప్రకారంగా వీరభద్రుడు కార్యం ముగించుకొని త్రిమూర్తుల వద్దకు వెళ్లి విషయం చెప్తాడు. అందుకు త్రిమూర్తులు కోపంతో నువ్వు మూడు తప్పులు చేశావని, అందులో ఒకటి బాలకీ దేవుని సంహరించడం, రెండు శిశు హత్య, మూడు బ్రహ్మ హత్య చేశావని కాబట్టి నీ నీడ మాపై పడకూడదని పాల గుండంలో స్నానం చేసి పాప పరిహారంగా మడివేలయ్య అవతారం ఎత్తమంటారు. వీరభద్రుడు సరేనని పాల గుండంలో దూకేేసరికి అందులో నుండి మడివేలయ్య, మాసయ్య ఇద్దరూ పుడతారు.
వీరభద్రుని అంశతో పుట్టిన మడేలయ్య లింగాన్ని ఆరాధిస్తూ మెడలో 32 లింగాలు చేతిలో నల్లని వీర గంటతో మైల ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మాసయ్య నిత్యం శివున్ని పూజిస్తూ ఎప్పుడూ శివధ్యానం లోనే ఉండేవాడు. ఆకలిదప్పులు అనేది ఆయనకు ఉండేది కాదు. ఎవరైనా వచ్చి అన్నం పెడితేనే తినేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకలితో ఉన్న మాసయ్య, మడేలయ్య అడుక్కొని తెచ్చుకున్న అన్నా న్ని అతనికి చెప్పకుండా తింటాడు. అందుకు మడేలయ్య కు కోపం వస్తుంది. నేను తెచ్చుకున్న అన్నాన్ని నువ్వు తిన్నావు కాబట్టి త్రిమూర్తుల దగ్గరకి కోపంతో విషయమై వెళ్తారు. అక్కడ వారికి విషయం చెప్పగాత్రిమూర్తులు 33 కోట్ల దేవతల ముందర మడేలుతో నీ అన్నం తిన్న వాడు కాబట్టి నీకు అర్థివాడై ఏడాదికి ఒకసారి మీ ఇంటికి వస్తే మీ ఇంట పుడితే పురుడు కట్నం, చస్తే చావు కట్నం, పెరిగితే పెళ్లి కట్నంమివ్వాలని నీ తమ్ముడు కాబట్టి కంచం పొత్తు ఉంటుందని, అందుకు ప్రతిఫలంగా నీ వంశాన్ని కీర్తిస్తాడనిఒప్పందం చేస్తాడు.
తర్వాత మడేలయ్య తన యొక్క పాపపరిహారం తీర్చుకోవటానికి సుర ముప్పది మూడు కోట్ల దేవతలు మునులు విడిచిన వస్త్రాలను 12 సంవత్సరాలు శుద్ధి చేస్తాడు. ఒక రోజున శివుడు మడేలయ్య వృత్తిని పరీక్షించదలచి తన పులి చర్మంతోపాటు తాను కప్పుకునే బొంతను పిండ మని కోరుతాడు. బొంత 33 గజాల పొడవుతో అందులో చీర పేన్లు, నల్లులు 101 జంతువులు ఉన్నాయని వాటిని చావకుండా పిండటం నీ తరం కాదని చెప్తాడు. అయినప్పటికీ మడేలయ్య పిండు తానని బయలుదేరుతాడు. అప్పుడు మడేలయ్య ఏనుగు మీద బొంతను వేసుకొని నీటి కోసం లోకాలన్నీ తిరిగినా కనిపించవు. ఎందుకంటే అప్పటికే పరమ శివుడు నీటిని మాయం చేస్తాడు. అప్పుడు శీతలాదేవి పరమశివుడు పెట్టిన పరీక్షను ఎలాగైనా నెగ్గాలని మన వృత్తి ధర్మాన్ని పాటించాలని మడేలయ్యతో నన్ను సంహరించి నా అవయవాలతో బొంతను పిండి పరమశివుని కోరిక తీర్చాలని కోరుతుంది. అప్పుడు మడేలయ్య శీతలా దేవి కన్నీరు పోకుండా కట్టకట్టి నీరుగాను, కనుగుడ్లు తీసి ఉడకబెట్టే కడువలుగాను, చనుబాలను పొయ్యి రాళ్ల గాను, ఆమె ఇరవై వేళ్లు కొట్టి వంటచెరకు గాను, నరములు తీసి గాలి తాళ్లుగాను,చర్మాన్ని వడ కోక గాను, రక్తం తీసి చౌడు గాను, శీతలాదేవి డొక్కను బానగాను, కడుపుల అన్నం సున్నంగాను చేసి శివుని బొంత పిండుతాడు. అలాగే అప్పుడే ఆమె పేగులను తీసి చెరువు మీద వేయగా తూటికూరగా మొలుస్తాయి. రజకులు ఇప్పటికీ తూటికూర తినకపోవడాని కి కారణంగా ఇదే చెబుతారు. మడేలయ్య శివుని బొంత పిండిన తర్వాత శివుని కొరకు వెతుకుతుండగా ఎక్కడ శివుడు కనిపించడు. దారిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎదురుపడి మడేలయ్యనుఎవరి కోసం వెతుకుతున్నావనిఅడుగుతాడు. అతను శివుని గురించి అని చెప్పగా అయితేనన్ను నీ భుజాలమీద ఎక్కించుకొని తీసుకుపోతే, నేను శివున్ని చూపిస్తాఅంటాడు. అతన్ని భుజాలపై ఎక్కించుకొని బయల్దేరి తిరుగుతుండగా ఉన్నట్టుండి అతను బరువు పెరిగి పోతాడు. బరువు మోయలేక అతన్ని క్రిందికి దింపుతాడు. వెంటనే అతను మాయమైపోయి, అతని ఎదురుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమై నువ్వు పోయేటప్పుడు నీ భార్య నువ్వు ఇద్దరు వెళ్లారు కదా మరి ఇప్పుడు ఒక్కడివే వస్తున్నావు కారణమేమని అడుగుతాడు. అప్పుడు మడేలయ్య జరిగిన విషయమంతా వ్యక్తి కి వివరిస్తాడు. విషయం విన్న వ్యక్తి ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూడమన్నాడు. అతను వెనక్కి తిరిగి చూడగానే శీతలా దేవి కనిపిస్తుంది. ఆవ్యక్తియే శివుని రూపంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మడేలయ్యనాకు చాకలి వృత్తి కావాలని, వండని కూడు, వడ కని బట్ట, పిండని పాడి, ఇంటిముందు తడి వస్త్రాలు పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎవరి కోకలు అయినా కట్టుకున్నా నన్ను ఏమీ అనకూడదనికోరుకుంటాడు. అందుకు శివుడు దీవించి నీకు అన్నం పెట్టని వారు నరకం పోతారని అభయమిస్తాడు. అలాగే పురాణంలో చాకలి వృత్తిలోని నమ్మకాలు, వివిధ కులాల ప్రస్తావన కనిపిస్తుంది.
గంజి కూటి ప్రస్తావన:
మాసయ్యలు పటం ఆధారంగా కథా గానం చేసే మడివేలు పురాణంలో గంజికూటి ప్రస్తావన కూడా కన్పిస్తుంది. మడేలయ్య వృత్తి ధర్మంలో భాగంగా నుదుటన బొట్టు మెడలో లింగం ధరించిన శంకు ద్వారాజి రాజ్యానికి చెందిన బసవన్న రాజుల బట్టలు ఉతికే వాడు. అయితే కనగాంగిరి పట్టణాన్ని పరిపాలించే బొట్టు, లింగం ధరించని బైరాగి రాజుల బట్టలు మడేలయ్య ఉతకక పోవడంతో వారి మంత్రి అయినా రాజులబంటుకు సైన్యాన్ని , మాసిన కోకల మూటలను మరియు వరహాల మూటలను ఇచ్చి పంపుతాడు. ఒకవేళ మడేలయ్య కోకలు పిండితే వరహాల మూటలు అప్ప చెప్పమని లేకుంటే యుద్ధం చేయమని చెబుతాడు. ఇది గమనించిన మడేలయ్య తన దగ్గర ఉన్నవిభూదితో కోకలన్నింటినీ దగ్ధం చేసి, సైన్యాన్ని ఎదురించి నిలుస్తాడు .ఇదంతా స్వయంగా చూసిన రాజుల బంటు భయపడి మడేలయ్య బట్టలు పిండే బండ కింద దాక్కుంటాడు. అతన్ని చూసిన మడేలయ్య ఎవరని ప్రశ్నించగా నేను బండ కింద దాక్కున్న పురుగునని చెప్తాడు. ముందు బయటకి రా యుద్ధం చేస్తామనగా, ఎంతకీ రాకపోయేసరికి మడేలయ్య విభూతి మంత్రించి బండమీద వేయగా రెండుగా విడిపోతుంది. అందులో నుండి బయటకు రాగానే మీ తల్లిదండ్రులు నీకు ఏం పేరు పెట్టారు అని అడుగగా నేను మరచిపోయానని అంటాడు. వీడేదో మాట తప్పి మాట్లాడుతున్నాడని బసవన్న బట్టలు పిండటం కోసం తెచ్చిన గంజిలో నుండి మూడు ముద్దుల అన్నం తీసిపెట్టగా తింటాడు. తర్వాత గంజి పోయగా తాగుతాడు. ఇప్పుడు చెప్పురా నీ పేరేంటి అని అడుగగా, నా పేరు ధాతి, కోటి, కితాభ్ అంటాడు. ధాతి అంటే దాయి గుడ్డ, కోటి అంటే తోడి గోలపుల్ల, కితాబ్ అంటే ఇస్త్రీ పెట్టె. అప్పుడు మడేలయ్య మా ఇసరల పేర్లు చెప్పినావని, మా గంజిలో అన్నం పెడితే తిన్నావని, గంజి పోస్తే తాగినావు కాబట్టి కలియుగంలో గంజి కూటి వారిగా జన్మించి మా మధ్యన, పటమోళ్ల మధ్యన ఆశ్రితునిగా ఉండమని వరమిస్తాడు. కానీ గంజి కూటి వారు చెప్పే పురాణం లో కథనం వేరే కనిపిస్తుంది.
గంజి కూటి వారు మాసయ్యలు ఇరువురూ చెప్పే మడేలు పురాణాల మధ్య కొంత భేద సాదృశ్యాలు కనిపిస్తాయి. పురాణాల్లో మాసయ్యలు మరియు గంజి కూటి వారి పుట్టుక విభిన్నంగా కనిపిస్తుంది. మాసయ్యలు చెప్పే పురాణంలో వీరభద్రుని అంశతోనే మడేలయ్య మాసయ్య జన్మించినట్లు కనిపిస్తుంది .అట్లాగే బైరాగి రాజుల బంటు బండ కింద దాక్కున్న వాడే గంజి కూటి వారిగా చెప్పబడుతుంది. ఇక గంజికూటి పురాణంలో శివుని బొంతను మడేలయ్య గంజి లో పిండుతుండగా అతని చెమట నుండి పుట్టిన వాడే గంజి కూటి వారని తెలుస్తుంది. అంతేగాక వీరి పురాణంలో జైన రాజుల మంత్రులలో ఒకరైన కొండేల మాసయ్య మడేలయ్యకు భయపడి బండ కింద దాక్కున్న వాడే మాసయ్యలని తెలుస్తుంది. ఈరకంగా వీరిరువురు తమ కులం పట్ల అత్యున్నత స్థానాన్ని పురాణంలో చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది.
పురాణంలో రజకుల మూలపురుషుడైన మడేలయ్య పరమ వీరశైవ భక్తుడిగా కనిపిస్తాడు. ఇతను శివుని కోరిక తీర్చడం కోసం వృత్తి ధర్మాన్ని పాటించడం కోసం సాక్షాత్తు పరమశివుడే పరీక్షించదలచిన కార్యాన్ని సైతం సాధించడానికి తన భార్యను సంహరించి కార్యాన్ని నిర్వర్తించడం శివుని మీద ఉన్న భక్తి, వృత్తి ధర్మం పురాణంలో కనిపిస్తుంది. అంతేగాక మడేలయ్య శివ భక్తుల మైల బట్టలనే ఉతుకు తానని, ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకు ఎదురు వచ్చిన వారితో యుద్ధం చేయడం శివుని మీద, అతని భక్తుల మీద ఉన్న భక్తి భావన, ఆసక్తి కనిపిస్తుంది. తమకు రజక వృత్తిని దేవతలే ప్రసాదించినట్లుగా కనిపించే సన్నివేశాలు, కులం పట్ల ఆత్మనూన్యతా భావాన్ని తొలగించడానికి దోహదం చేసి, వృత్తి మీద గౌరవాన్ని కలిగిస్తుంది. పురాణంలో వృత్తి మనుగడకు కావలసిన మానసిక ధైర్యాన్ని కలిగించే అంశాలు అనేకం ఉండటం విశేషం.
చారిత్రకంగా 12 శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం( 4 ఆశ్వాసం )లో మడేలయ్య కథ కనిపిస్తుంది. ఇందులో ఆనాటి కాలంలో శైవాన్ని ఆచరిస్తూ కీర్తిప్రతిష్టలు పొందిన శైవ భక్తులలో ఒకరిగా మడేలయ్యను కీర్తించబడుతుంది. ప్రాచీనమైన చరిత్ర కలిగిన మడేలయ్యను పురాణ పురుషునిగా పాల్కురికి సోమనాథుడే ఆవిష్కరించాడు. పురాణ పురుషుని వృత్తాంతాన్ని మాసయ్యలు నకాశి కళాకారులతో 33 మూరల పొడుగు, గజంనర వెడల్పు ఉండే నూలు గుడ్డ మీద చిత్రించుకొని పటం ఆధారంగా మూడు రోజులు కథా గానం చేస్తారు

కథకులుప్రదర్శనా విధానం :
మాసయ్యలకు వంశపారంపర్యంగా సంక్రమించిన హక్కు గ్రామాలు లేదా మిరాశి గ్రామాలుంటాయి. ఆయా గ్రామాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రదర్శన నిమిత్తం వెళతారు .ప్రతి సంవత్సరం కళాకారులు మిరాశి గ్రామాలకు దసరా పండుగ లేదా దీపావళి పండుగ తర్వాత సంచారానికి బయలుదేరుతారు. రకంగా బయల్దేరేముందు ఏకాదశమి లేదా దశమి రోజున కళాకారులు పెట్టె పూజ చేసుకుంటారు. ఇందులో భాగంగా వేర్వేరు గ్రామాల్లో ఉన్న కళాకారులను ఏకం చేసుకుని మేళం అంటే బృందంగా ఏర్పడతారు. తర్వాత అందరూ కలిసి పటం, రాగి శాసనం, వీర పలకలు, మద్దెల హార్మోనియం, గజ్జెలను పూజించుకొని ఒక మేక పోతును బలి ఇచ్చి తమ మిరాశి గ్రామాల్లో త్యాగం సమృద్ధిగా లభించాలని కోరుకుంటారు. అంతేగాక ఇదే రోజున హక్కు గ్రామాల్లో వచ్చిన ప్రతిఫలం బృందంలోని కళాకారులు రకంగా పంచుకోవాలో నిర్ణయించుకుంటారు.
ప్రదర్శనలో కళాకారులు ఇప్పటికీ తమ పూర్వ పద్ధతినే అవలంభిస్తూ రావడం విశేషం. తమ హక్కు గ్రామాలకు వెళ్లినప్పుడు కళాకారులు తప్పనిసరిగా పటం ,రాగి శాసనం వీర పలకలు తీసుకొని బయలుదేరుతారు. గ్రామంలో మొదట రజకుల కుల పెద్దలను కలిసి రాగి శాసనం మరియు వీర పలకలను చూపించి త్యాగం లేదా సంభావన చెప్పాలని కోరుతారు. కళాకారుల దగ్గర ఉండే రాగి శాసనం మీద మడేలయ్య వృత్తాంతం తో పాటు మాసయ్యలకు రజకులు ఇచ్చే ప్రతిఫలం లిఖించి ఉండటమేగాక వారికి ఏయే గ్రామాలు మిరాశి గా సంక్రమించాయో వాటి పేర్లు రాయ బడి ఉంటాయి .
వీర పలకలు:
వీర పలకలు అనేవి టేకు కర్రతో తయారు చేయబడి సుమారుగా ఫీట్ నర వెడల్పు, పొడవుతో ఉంటాయి. పలకలమీద వీరభద్ర స్వామికి జన్మించిన మడేలయ్య మాసయ్యల సన్నివేశం మరియు శివుని బొంతను ఉతికే సన్నివేశాలను రంగులతో చిత్రించికొని సన్నివేశాలను చూపి కథా గానం చేస్తారు. తర్వాత రజకులను వీర పలకలను ముట్టుకొమ్మని చెప్పి, పలకల మీద సంభావన పెట్టమంటారు. తర్వాత మాసయ్యలు రజకులకు విభూది అలంకరించి, దివనార్తి పెడతారు.
ప్రదర్శన నిమిత్తం గ్రామంలో త్యాగం కుదుర్చుకున్న తర్వాత రజకుల వీధిలోనే వేదిక నిర్మించుకొని రాత్రి గాని ఉదయం గాని వారి వీలునుబట్టి పటాన్ని తూర్పుదిశగా వేలాడదీసి కథా గానం చేస్తారు. రకంగా వేలాడదీస్తే నే కథ సుఖాంతమవుతుందని విశ్వసిస్తారు . ప్రదర్శనలో కళాకారులు ఐదుగురు ఉంటారు . ఇందులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతను నడుముకు దట్టీ కట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, చేతిలో బెత్తం బరిగే తో పటం మీద బొమ్మలను చూపుతూ కథా గానం చేస్తాడు. ఇతనికి ఇద్దరు సహాయంగా తాళాలు వాయిస్తూ వంత పాడతారు. మరొక ఇద్దరిలో ఒకరు తబలా హార్మోనియమ్ వాయిస్తారు.
ప్రధాన కథకుడు కొన్ని సందర్భాల్లో విశ్రాంతి తీసుకుంటే వంతల్లో ఒకరు ప్రధాన కథకుని పాత్ర పోషిస్తాడు. కథలో వచనం, పద్యం, పాటలతో పురాణాన్ని ప్రేక్షకులకు రసవత్తరంగా సందర్భాన్నిబట్టి కథలో వచ్చే పాత్రల హావభావాలను ప్రకటిస్తూ కథను రక్తి కట్టిస్తూ ప్రదర్శిస్తారు. అంతేగాక కథపట్ల, ప్రదర్శన పట్ల ప్రేక్షకుల్లో భక్తి మరియు గౌరవాన్ని పెంపొందించే విధంగా కథలో వచ్చే ముఖ్యమైన సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత అనుష్ఠానాలు, చదివింపులు చేయిస్తూ ఉంటారు. ప్రదర్శన పట్ల ఆకర్షితులైన భక్తులు కళాకారులకు చదివింపులు చేస్తే వారికి ఘనంగా దివనార్తి పెడతారు. కళాకారులు ప్రదర్శన మధ్యలో తమకు సహాయం చేసిన కుల పెద్ద మనుషులను స్మరిస్తూ, కీర్తిస్తూ ఇదంతా కళాకారులు తమ నైపుణ్యంతో సందర్భాను గుణంగా ప్రదర్శిస్తారు. అంతేగాక కళాకారులు కథలో భాగంగా వచ్చే రౌద్రం ,శోకం, యుద్ధం భయానకం వంటి సన్నివేశంలో అంతే ప్రతిభతో ప్రదర్శిస్తూ అడుగులు వేస్తూ ప్రేక్షకులు సన్నివేశాల్లో లీనమయ్యే టట్టు ప్రదర్శించటం వీరి ప్రత్యేకత.
నేటి స్థితి:
బహుళ చారిత్రక నేపథ్యం ఉన్న మాసయ్య లు తమ సంస్కృతిని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ, తమ సాంస్కృతిక మనుగడ ను కొనసాగిస్తూ మరుగున పడి పోయే దశకు చేరుకున్నారు . పూర్వం కళాకారులు రజకుల దగ్గర గౌరవమైన స్థానంలో ఆదరణ పొంది జీవించారు. కానీ నేటి ఆధునిక సమాజంలో గౌరవం లేకుండా పోయింది. కోవలో తమ మూల సంస్కృతిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కళాకారులు రాగి శాసనం మరియు వీర పలకలు చూపిస్తూ కథా గానం చేసేవారు. సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయింది. మిరాశీ గ్రామాల్లో రాగి శాసనాలు వీర పలకలు అడగడం లేదని వాటిని తీసుకు వెళ్లడం మానేశారు. అయితే ఇదే సందర్భంలో ఒక దళారీ వ్యవస్థ కళాకారులనే మధ్యవర్తులుగా చేసుకొని కళాకారుల దగ్గర అరకొర డబ్బులకు వాటిని సేకరించి వాటిని అధిక ధరలకు అమ్ముకున్నారని భోనగిరి సంగయ్య మాటల్లో తెలుస్తున్నది. అంతేగాక వీరి పటాలను కూడా సేకరించి లక్షల్లో అమ్ముకున్నట్లు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మడేలు పురాణం కథాగానం చేసే కళాకారులు కూడా ఒకటి లేదా రెండు కళాబృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఒకవేళ కళాకారులు ప్రదర్శించాలనుకున్నా వీరి తాతలు తండ్రులు పటాలను, రాగి శాసనాలను, వీర పలకలను అమ్ముకోవడం వల్ల మా మూల సంస్కృతి తెలియకుండా పోయిందని, మాకు బతుకునిచ్చే పటాలు అమ్ముకొని, మాకు బతుకుదెరువు లేకుండా చేశారని కళాకారులు వాపోతున్నారు. గంజి కూటి వారి సంస్కృతి కూడా రకంగానే కాలగర్భంలో కలిసిపోయి, చివరికి వారు కులం కిందికి వస్తారో తెలియకుండా పోయింది .అలాగే మాసయ్య లు తమ కళా సంస్కృతిని పరిరక్షిస్తూ వస్తున్నప్పటికీ పోషక కులం దగ్గర ఆదరణ లేక అంతరించే దశలో ఉన్నది. అంతేగాక వీరిని పోషించే రజకులు ప్రభుత్వపరంగా బీసీ – ‘కేటగిరిలో ఉండగా ఇదే కేటగిరీలో మాసయ్య లను గుర్తిస్తూ కులం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అప్పుడు మరియు తమ పిల్లల చదువుల విషయంలో వీరికి ప్రత్యేక కులం లేకపోవడంతో సామాజికంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాసయ్యలను ప్రత్యేక కులంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు .అంతే గాక రజకుల ఆశ్రితులు అయిన గంజి కూటి వారికి, మాసయ్యల వారికి ఒకరి మధ్య ఒకరికి కంచం పొత్తు మాత్రమే ఉంటుంది. వియ్యం పొత్తు ఉండదు. అలాగే గంజి కూటి వారికి మాసయ్యలకు కూడా కంచం పొత్తు మాత్రమే ఉంటుంది. వీరి జనాభా అతి తక్కువగా ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాకారులు తమ మూల సంస్కృతిని పోషించుకుంటూ వస్తున్న సమయంలో ప్రభుత్వం మాసయ్యలను ప్రత్యేక కులంగా గుర్తించాలని, తమ కళా రూపం మనుగడకు కావలసిన ఆర్థిక వనరులను చేకూర్చాలని కోరుకుంటున్నారు. తద్వారా తమ మౌఖిక సాహిత్యం, సంస్కృతి భవిష్యత్ తరాలకు అందుతుందని ఆర్థికంగా తమ జీవనం కూడా కొనసాగుతుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కళాకారులు

పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

May 1, 2020
(కొలిమికి సౌజన్యంతో - రచయిత  డా. బాసని సురేష్ గారికి ధన్యవాదాలతో)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...