Showing posts with label Anecdotes. collections. Show all posts
Showing posts with label Anecdotes. collections. Show all posts

Thursday, December 16, 2021

చందమామ కథ పరీక్షా ఫలితం రచన - బి. లక్ష్మణాచారి ( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

చందమామ కథ 


పరీక్షా ఫలితం 

రచన - బి. లక్ష్మణాచారి 

( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

              

సింధుదేశాన్ని మలయకేతు మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఏకైక పుత్రిక వనజముఖి పరమ సుందరిగా కీర్తికెక్కింది. ఆమెను పెళ్ళాడాలని అనేక మంది రాజ కుమారులు వచ్చారు గాని, రాజకుమారి పెట్టిన పరీక్షలో నెగ్గలేకపోయారు. ఈ పరీక్ష గురించి వాడవాడలా తెలిసిపోయింది.


తనను పెళ్ళాడేవాడు ధైర్యవంతుడూ, వీరుడూ, యుక్తిపరుడూ అయి ఉండాలనే ఉద్దేశంతో రాజకుమారి ఈ పరీక్ష ఏర్పాటు చేసింది. ఆమె వచ్చిన వారి నందరినీ పరీక్షకు పెట్టలేదు; వారి వయసూ, అంద చందాలూ తనకు నచ్చిన మీదటనే ఆమె వారికి పరీక్ష ఇచ్చింది.


ఆ పరీక్ష ఈవిధంగా ఉన్నది: రాజభవనానికి ఉత్తరాన ఒక తోటా, దానికి ఉత్తరాన చిన్న అరణ్యమూ ఉన్నాయి. ఆమెను పెళ్ళాడ గోరినవాడు ఆ అరణ్యంలో ప్రవేశించి, అందులో దారి తప్పకుండా  తిరిగి రాజభవనానికి రావాలి. అరణ్యంలో ఒక పులి ఉన్నది. దాన్ని నిరాయుధుడై జయించి రాజ ముందుకు వచ్చి, తోటలో ప్రవేశించాలి. ఆ  తోటలో ఒక భయంకరమైన పక్షి ఉన్నది;  అది ఎవరినన్నా చూడగానే మీదికి వచ్చి కళ్ళు రెండూ పొడిచేస్తుంది. దాన్ని కూడా తప్పించుకుని రాజభవనం కేసి వస్తే తోటకూ, రాజభవనం ఆవరణకూ మధ్యగా ఒక బురద కందకం ఉన్నది. అందులో  గొంతు లోతు బురద ఉంటుంది. ఆ కందకంలోకి దిగి రాజభవనం చేరుకోగానే, రాజ మె కుమార్తె తన స్వహస్తాలతో లోటాడు నీళ్ళి స్తుంది. ఆ లోటాడు నీళ్ళతోనే బురద అంతా పోయేలాగు కడుక్కోవాలి. ఈ పరీ క్షలో నెగ్గినవాణ్ణి ఆమె పెళ్ళాడుతుంది. 


ఆమెను పెళ్ళాడ వచ్చిన వారిలో కొందరు పులి చేత చచ్చారు. మరి కొందరు పులి బారి నుండి తప్పించుకుని, భయంకర పక్షి మూలాన కళ్ళు పోగొట్టుకున్నారు. పులినీ, పక్షిని జయించి బురదలో దిగి వచ్చినా, లోటాడు నీటితో ఒళ్ళంతా కడుక్కోవటం ఎలా సాధ్యమవుతుంది?


ఈ అసాధ్యమైన పరీక్ష గురించి నాగావళి  రాజకుమారుడు ప్రతాపుడనేవాడు విన్నాడు. అతను సింధుదేశపు రాజధానికి వచ్చి, రాజ భవనానికి ఉత్తరాన ఉన్న అరణ్యాన్ని ఒక సారి చుట్టి వచ్చాడు. అరణ్యం చుట్టూ బలమైన కంచె వేసి ఉన్నది. ఆ కంచెలోనే ఉత్తర భాగంలో ఒక ద్వారమున్నది. చుట్టూ కంచె ఉండటమే గాక, రాజభవనానికి దగ్గిరిగా కూడా ఉన్నందున, ఆ అరణ్యం సహజమైనది కాదనీ, కృత్రిమ మైనదనీ, అందులో ఉండే పులి కూడా మనుషులు పెంచేదే అయి ఉంటుందనీ అతను ఊహించాడు.


తరువాత ప్రతాపుడు రాజకుమార్తెను సందర్శించాడు. అతను పరీక్షకు నిలబడ టానికి ఆమె సమ్మతించింది. ఎందుకంటే అతను యువకుడూ, అందగాడూనూ. అతను మనిషి ముఖాన్ని పోలి ఉండేటట్టుగా ఒక ముఖ కవచం చేయించుకున్నాడు. అది ధరించినట్టయితే, కళ్ళూ, ముక్కూ, గడ్డమూ, నుదురూ మొదలైన వాటితో కూడి, అచ్చగా మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది, కాని అది లోహంతో చేయబడినది. ఈ కవచాన్ని చంకన పెట్టు కుని, చేతిలో మాంసం మూటగట్టి పట్టు కుని, ప్రతాపుడు ఉత్తర ద్వారం కుండా అరణ్యంలో ప్రవేశించాడు.


అరణ్యంలో అతను కొద్ది దూరం వెళ్ళే సరికి గాండ్రిస్తూ పులి ఎదురయింది. అతను మాంసం మూట విప్పి పులిముందు పడేసి తన ముఖానికి కవచం ధరించుకుని ముందుకు సాగాడు. పులి మాంసం తినటంలో నిమగ్నమై పోయి అతని గొడవే పట్టించుకోలేదు.


ప్రతాపుడు అరణ్యం దాటి తోటలో ప్రవేశించగానే భయంకర పక్షి వచ్చి, అతని ముఖ కవచంలోని కళ్ళను పొడిచి తన దారిన తాను పోయింది. అతను ముఖ కవచాన్ని తీసి దూరంగా పారేసి, తోటకూ రాజభవనం ఆవరణకూ మధ్య ఉండే బురద కందకంలోకి దిగి, పైకి వచ్చి, రాజ భవనాన్ని చేరుకున్నాడు.


రాజకుమారి లోటాడు నీళ్ళతో సిద్ధంగా ఉన్నది. ప్రతాపు డామెతో, "ఈ పరీక్షలో రెండు అంశాలలో నెగ్గాను. ఈ మూడవ దానిలో నెగ్గించే బాధ్యత అంతా నీ పైన ఉన్నది," అన్నాడు.


"ఈ లోటాడు నీటితో ఒంటి బురద అంతా కడుక్కోవలిసినవాడవు నీవేగదా?” అన్నది రాజకుమారి.


" అలాగే కడుక్కుంటాను. కాని ఆ నీరు పొయ్యవలిసిన పని నీది. జాగ్రత్త, ఒక్క చుక్క కూడా నేలపై పడకూడదు. అలా పడిన ప్రతి చుక్కకూ ఒక్కొక్క బిందెడు నీరివ్వవలిసి ఉంటుంది,” అన్నాడు ప్రతాపుడు.


"పరీక్షలో నెగ్గాపులే. స్నానం చేతువుగాని పద!" అన్నది రాజకుమారి. తరవాత వారిద్దరికీ వైభవంగా పెళ్ళి జరిగింది.


- బి. లక్ష్మణాచారి 

( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 

సేకరణ : 

కర్లపాలెం హనుమంతరావు 

16 - 11-2021

బోథెల్ ; యూఎస్ఎ 

Monday, December 23, 2019

ఎలుకలు. ఎలుకలు. ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు!


                                                                     నెవిల్ మాస్కెలిన్

1903
లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లెక్చర్ హాల్
భౌతిక శాస్త్రవేత్త జాన్ అంబ్రోస్ ఫ్లెమింగ్ 20వ శతాబ్దపు ఒకానొక వింతను ప్రజానీకం ముందు ప్రదర్శించేందుకు అన్నీ సిద్ధం చేసుకుని ప్రకటించిన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ వేరెవరో కాదు సుమండీ! వైర్ లెస్ టెలిగ్రాఫ్ ప్రసార సృష్టికర్త మార్కొనిగారి శిష్య పరమాణవు.
గురువుగారి తరుఫున ప్రదర్శనకు పూనుకొని వూరుకుంటే సమస్యే  ఉండేది  కాదు.ఏదో పూనకం వచ్చిన గణాచారికి మల్లే తీగల సాయం లేకుండా సాగే ఆ సమాచార ప్రవాహ వ్యవస్థ  రెండు అనుమతించిన మాధ్యమ యంత్రాల మధ్య ఎవరూ తస్కరించలేనంత పకడ్బందీగా రూపొందించింది అంటూ రెచ్చిపోయి మరీ ప్రకటనలకు తెగబడ్డాడు.

జనంలో అసక్తి కలిగించేoదక ఈ  తరహా కిటుకులు  బాగానే పనిచేస్తాయిగా! వింతను చూసేందుకు జనమూ  తండోప తండాలుగా  పొగయ్యారు! సరిగ్గా అప్పుడే మార్కొనీ నిస్తంత్రీ సమాచార ప్రసార వ్యవస్థ చరిత్ర సృష్టించడానికి ముందే చరిత్రలో మరో వింత నమోదు అయింది.  ఆ వింత పేరే 'హ్యాకింగ్ ' !

ఆంబ్రోస్ ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందే, టెలిగ్రాఫ్ యంత్రం దానంతట అదే  ప్రాణం పోసేసు కుంది. తనకు తానే బోలెడంత సేపు టక్ టక్‌ మంటూ  ' రాట్స్ .. రాట్స్  .. రాట్స్ .. రాట్స్  ... రాట్స్  ( ఎలుకలు.  ఎలుకలు.  ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు) అంటూ కొట్టిందే కొట్టుకుంటూ  షేక్స్పియర్ సాహిత్యం నుంచి కూడా మంచి మంచి పదాలను ఎంచుకుని మరీ  మార్కొనీమహాశయుడు  ప్రభుత్వానికీ, ప్రజానీకానికి చెప్పే మాటల్లోని నిజాన్ని సందేహాస్పదం కింద మార్చేసింది !

ఆ బూటకాలను ఎండగట్టిన మొదటి హ్యాకర్‌   నెవిల్ మాస్కెలిన్! అతగాడు వేసిన బాటలోనే తదనంతరం హ్యాకింగ్ చరిత్రలో చాలా పెద్ద ఘటనలు జరగడం ప్రపంచ చరిత్ర పరిశీలించే ఆసక్తిపరులందరికీ తెలిసిన విషయమే ! అసాంజే మార్క్ స్విస్ బ్యాంకుల ఖాతాల నుంచి పనామా  పత్రాల లీకేజీ  దాకా హ్యాకింగ్ మూలకంగా జరిగిన పరిణామాలలో  మంచివీ ఉన్నాయి .. పాకిస్తాన్ మాజీ ప్రధాని  వంటి వారి  కొంపలు  మంచినవీ ఉన్నాయి! అది వేరే కథ!
ఎలుకల వల్ల ఎల్లప్పుడూ చెడే కాదు సుమండీ . మంచీ జరగుతుందని తెలుసుకోవడమే ఈ మొదటి హ్యాకర్    నెవిల్ మాస్కెలిన్ గారి  కథ సారాంశం! .. కదా !

వైజ్ఞానిక వింతలు : 1 ఎలుకలు.  ఎలుకలు.  ఎలుకలు.. ఎలుకలు.. ఎలుకలు!  - కర్లపాలెం హనుమంతరావు

😾😹

Tuesday, February 19, 2019

భార్య.. ఏమండీ అన్నదంటే ..! సరదా వ్యాఖ్య -సేకరణ




బాత్రూమ్ లో నుండి " ఏమండి"
అని పిలిచిందంటే
బొద్దింకని కొట్టాలని అర్ధం..


రెస్టారెంట్ లో తిన్నాక " ఏమండీ"
అని పిలిచిందంటే
బిల్లు కట్టమని అర్ధం


కళ్యాణమండపంలో " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలిసినవారొచ్చారని అర్ధం


బట్టల షాపులో " ఏమండీ"
అని పిలిచిందంటే
వెతుకుతున్న చీర లభించిందని అర్ధం..


బండిలో వెళ్ళేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
పూలు కొనాలని అర్ధం..


హాస్పిటల్ కి వెళ్ళినపుడు " ఏమండీ "
అని పిలిచిందంటే
డాక్టర్ తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్ధం


వాకిట్లోకి వచ్చి బయట చూసి " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలియనివారెవరో వచ్చారని అర్ధం..


బీరువా ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
డబ్బు కావాలని అర్ధం..


డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి " ఏమండీ "
అని పిలిచిందంటే
భోజనానికి రమ్మని అర్ధం..


భోజనం చేసేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
భోజనం టేస్ట్ గురించి అడిగిందని అర్ధం


అద్ధం ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
చీరలో తనెలా ఉందో చెప్పమని అర్ధం..


నడిచేటపుడు " ఏమండి "
అని పిలిచిందంటే
వేలు పట్టుకుని నడవమని అర్ధం


అను నిత్యం తనతో చెప్పినా
నీవు చివరి శ్వాస తీసుకునేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అని అర్ధం...


# అను నిత్యం " ఏమండీ " అంటూ చంపేస్తుందని అపార్ధం చేసుకోవడం కాదు అర్ధం చేసుకుని మసులుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే జీవితం సంతోషమయం అవుతుంది.
(సేకరణ .. )

Monday, June 18, 2018

పనికిమాలినవాడు- ఆంధ్రప్రభలోని ఒకనాటి నా కథ



అనుకోకుండా ఆన్ లైన్లో దొరికిందీ నా కథ. పేరు 'పనికిరావివాడు'- ఆంధ్రప్రభ వారపత్రిక 03-07-1985 సంచికలో ప్రచురితం. అప్పట్లో రోజుకో కథ రాస్తుడేవాడిని.. ఎడా.. పెడా! కనపడిన పత్రికకు పంపించేవాడిని. తిరుగు స్టాంపులు గట్రాలు పెట్టడాలు ఉండేవి కావు. అచ్చేసే వాళ్లు వేసే వాళ్లు. పత్రిక కాంప్లమెంటరీ ఇంటికి వస్తేనో.. దయ తలచి ఎవరైనా పారితోషికం పంపిస్తేనో తప్ప కథ అచ్చయిన విషయం తెలిసేది కాదు. ఆట్టే పట్టించుకొనేవాడిని కాను. అదో చాదస్తం అప్పట్లో! 32 ఏళ్ల కిందట కదా! ఎక్కువ కథలు ఆంధ్రప్రభలోనె వచ్చినట్లు గుర్తు. అయితే అప్పట్లో ప్రాంప్టుగా పారితోషికం పంపే  మంచి పత్రికల్లో ఆంధ్రప్రభ ముందుండేది. అది ఆంధ్రప్రభ ఒక వెలుగు వెలిగిన రోజులు.  ఆంధ్రప్రభకు ఆంధ్రపత్రికకు మధ్య మంచి పోటీ ఉండేది. అందులో కథలు రాసే వాళ్లకు ఇందులో,, ఇందులో కథలు రాసే వాళ్లకి అందులో సాధారణంగా అవకాశం ఇచ్చేవాళ్లు కాదు. నా కథలు అధిక భాగం ఆంధ్రప్రభలోనో.. ఆంధ్రజ్యోతిలోనో వస్తుండేవి. ఆంధ్రజ్యోతికి వనితాజ్యోతి అని మరో మహిళా పత్రిక కూడా ఉంటుండేది. దానిలోనూ మా శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి పేరుతో చాలా కథలే ప్రచురితం అయేవి. ఏవీ కాపీలు తీసి పెట్టుకొనే అలవాటు లేనందు వల్ల ఏవేవి ఎక్కడ ఎందులో పడేవో.. ఏవి చెత్త బుట్టలో పడేవో.. అప్పుడే తెలీనప్పుడు ఇహ ఇప్పుడు ఏం తెలుస్తుంది? 'కొండయ్యగారి గుండు జాడీ' పేరుతో విజయవాడ ప్రయివేటు బస్సుల ఆగం మీద అప్పట్లో రాసిన హాస్యకథకు మంచి స్పందన వచ్చినట్లు గుర్తు. అలాగే హాలివుడ్ యాసలో  మాట్లాడే  ఇంగ్లీ షు సినిమాలకు  క్రమం తప్పకుండా వెళుతుండే వాళ్లం. బొమ్మల్ని బట్టి కథ ఫాలో అవడమే కాని.. సంభాషణలు అర్థమయేవి కావు... ఇంగ్లీషు చదవడం రాయడం వచ్చేదే కాని.. అమెరికన్ ఎక్సెంట్ ఫాలో అయేటంత పట్టు అప్పటికి ఇంకా ఏర్పడలేదు.  సినిమా ఎప్పుడు ఐ పోయిందో అర్థమవక ఒక్కో సారి ఇంటర్వెల్ బెల్లుకే బైటికి రావడమ్.. మరో సారి సినిమా ఐ పోయినా ఇంకా ఉందని కుర్చీలోనుంచి లేవకుండా కూర్చోడం. మేమే కాదు.. మాలాగాఎందరో ప్రేక్షకులు అప్పట్లో అలా! ఆ తరహా సన్నివేశాల మీద సిట్యుయేషనల్ కామెడీ దట్టించి రాసిన 'సినిమా.. సినిమా' అనే మరో కథకూ మంచి స్పందనే వచ్చింది. ఇలాగా ప్రత్యేక సంచికలకు కథలు పంపమని అడిగి రాయించుకున్న రోజులూ ఉన్నాయి. విజయ బాపినీడు విజయ అనే మాస పత్రిక కొత్త పంథాలో

 ఆకర్షణీయంగా నడుపుతుండేవారు మద్రాసు నుంచి. వాళ్ళు అడిగి మరీ ప్రచురించేవారు నా కథలు.. హాస్య వ్యాసాలు. చాలా వచ్చాయి వాటిలో. స్వాతి అప్పటికి మాస పత్రిక మాత్రమే. మా పక్క బజారులో చిన్న ఇంట్లో ఉండేది. రాసిన కథలు స్వయంగా వెళ్ళి చేత్తో ఇచ్చి వస్తుండే వాళ్లం. కొమ్మూరి వేణుగోపాలరావు గారి వీధిలో ఉండేవాళ్లం మేం. ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ రెండతస్తుల మేడను ఆనుకొన్న వాటాల్లోనే మా చిన్న కాపురం. వాళ్ల ఇంట్లోని టీవీని కిటికీ గుండా వింతగా చూస్తుండేవాళ్లం. అప్పటికి ఇంకా టి వి పెద్దవాళ్ల లక్జరీగానే ఉండేది. మా సంబంధాలన్నీ ఎక్కువగా ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రంతోనే. మూడు నెలలకు ఓ సారి కచ్చితంగా ఓ అరగంట హాస్య నాటిక నాది ప్రసారం అవుతుండేది. ప్రమోషన్ వచ్చి నాగపూర్ వెళ్లినదాకా ఇలా రచనా కార్యక్రమాలతో చాలా బిజీ బిజీగ్గా సరదాగా సాగింది మధ్య తరగతి జీవితం అప్పట్లో రాసినట్లున్నాను ఈ కథ! ఇవాళ ఉదయం ఏదో ఉబుసుపోకకు సర్ఫ్ చేస్తుంటే అప్పటి ఈ నా పాత కథ ఎవరి బ్లాగులోనో పి.డి.ఎఫ్ రూపంలో కనిపించింది. ఆ కాపీ డౌన్ లోడ్ చేసుకొని ఇలా షేర్ చేస్తున్నానన్న మాట. ఇదేమీ అంత గొప్ప కథ కాదు. ఒక చదువుకున్న చాదస్తుడు చేతి కొచ్చిన పాత నోటును ఎలా మార్చుకోవాలో తెలీక తలకిందులు అవుతుంటే..  చదువు సంధ్యలు లేని బడుద్ధాయ్ ఒకడు తనకు అబ్బిన లోకజ్ఞానంతో ఆ నోటును ఎంత చులాగ్గా చలామణి చేస్తాడో.. దాన్నుంచి లాభం ఎలా పొందుతాడో చెప్పే చిన్న కథ. అప్పట్లో ఇలాంటి కథలే ఎక్కువగా కమర్షియల్ పత్రికలు ప్రచురిస్తుండేవి. వాటికే పాఠకుల ఆదరణ కూడా! ఇప్పుడు చదువుతుంటే.. నాకే నవ్వొచ్చింది నేనేనా.. ఈ 'చిల్లర' కథ రాసిందీ అని! ఓపిక ఉంటే మిత్రులు కూడా ఒక సారి చదవవచ్చు. ఈ కథ మిషతో ఏదో పాత సంగతులు కొన్ని మళ్లీ నెమరు వేసుకోవడానికి కుదిరింది.
-కర్లపాలెం హనుమంతరావు
19 -06 -2018

Saturday, June 16, 2018

కొమఱ్రాజుగారి ‘వియోగ గీతి’ కత!




వడ్డాది  సుబ్బారాయుడిగారు ‘సతీ స్నృతి’ తెలుగులో వచ్చిన ఒక ప్రముఖ సంతాప కావ్యం (ఎలజీ). సుబ్బారాయుడిగారి వైవాహిక జీవితం చాలా పరితాపకరమైనది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. నలుగురు కాదు.. ఏకంగా ఐదుగురు సాథ్వీమణులు ఆయన చేత మెడలో తాళి కట్టించుకున్నా ఒక్కరికైనా కలకాలం కలసి జీవనయానం సాగించే యోగం లేకపోయింది. మొదటి కళత్రం పోయిన 1881 ప్రాంతంలో సుబ్బారాయుదుగారు ఇందాక చెప్పుకున్న కళత్ర వియోగానికి సంబంధిచిన కవితా సంపుటి రాసారు. కవిగారు రాసారు కానీ.. ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు రాని దుర్గతి. కొక్కొండ వెంకటరత్నం పంతులుగారే తన ఆంధ్రభాషా సంజీవని పత్రికలో మొదటి సారి దాన్ని అచ్చువేసారు. దరిమిలా అది ఒక సంపుటిగా వెలువరించడం.. అశేషమైన  ప్రచారం సంపాదించుకోవడం.. అదో విశేషం. అక్కడితో అయిపోతే ఇక్కడ ఈ కథ చెప్పుకునే అవసరమే ఉండేది కాదు.
సుబ్బారాయుడిగారి ‘సతీ స్మృతి’ చదివి విశేషంగా ఉత్తేజం పొందిన వారు అసంఖ్యాకులు, అందులో కొమఱ్రాజు లక్ష్మణరావుగారూ ఒకరు. ఆ కావ్యం చదివిన ప్రభావంతో ఆయనా ‘వియోగ గీతి’ ఒకటి మరాఠీలో వెలువరించారు. యథాప్రకారం దానికీ అశేషంగా పాఠకులు స్పందించారు. కవిగారికి ఇంత చిన్నవయసులోనే కలిగిన కళత్ర వియోగానికి చింతించని వాడు లేడు. ఉత్తరాల ద్వారా ఊరడించే వాళ్ళు కొందరైతే.. వీలు కల్పించుకొని మరీ  కొంతమంది శోకతప్తులు ఏకంగా పూలదండలు పుచ్చుకొని మరి పరామర్శల కొచ్చేసారుట!
కొసమెరుపేమిటంటే.. కొమఱ్రాజు వారికి అప్పుడు నూనూగు మీసాల వయసే. భార్య సంగతి పక్కనుంచి.. అప్పటి మన సంప్రదాయాల ప్రకారం ఇంకా మగపిల్లవాడి ముందు  పెళ్లి ప్రస్తావనలు సైతం తీసుకురాకూడని తరుణం!
ఈ అనుభవంతో జడిసిన కొమఱ్రాజువారు కవిత్వం రాయడం బంద్! ఆ తరువాత ఆయన రాసినవనీ కవిత్వానికి ఆమడ దూరం ఉండటం గమనార్హం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం 4వ సంపుటి- పుట 235)

కొమఱ్రాజు లక్ష్మణరావుగారి వివరాలు కొన్ని
(సోర్స్ః వికీపీడియా) 
జననం మే 18, 1877
పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా
మరణం జూలై 12, 1923
మద్రాసు
మరణ కారణము    అనారోగ్యం
వృత్తి    దివాన్, రచయిత
ప్రసిద్ధి   చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్త
భార్యః   కోటమాంబ
పిల్లల:  వినాయకరావు
తండ్రిః   వెంకటప్పయ్య
తల్లిః     గంగమ్మ


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...