Showing posts with label Eenadu. Show all posts
Showing posts with label Eenadu. Show all posts

Tuesday, February 8, 2022

ఈనాడు- సంపాదకీయం కృషీవలుని విలాపం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- సంక్రాంతి పథం పేరుతో - ప్రచురితం - 18 -01 - 2015 )

 ఈనాడు- సంపాదకీయం 

 కృషీవలుని విలాపం 

 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- సంక్రాంతి పథం పేరుతో  - ప్రచురితం - 18 -01 - 2015 ) 

 

'తిండి  లేకుండా జీవించే మానవ వంగడాన్ని ఎవరూ సృష్టించ లేరు' అంటారు ప్రఖ్యాత చారిత్రక తత్వవేత్త డి.డి. కోశాంబి. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచి మా/ గాణములన్‌  సృజించి, ఎము/ కల్ నుసిజేసి పొలాలు దున్ని' ఇంత అన్నం పెడుతున్నది రైతే.  ఏ జాతికైనా అతడే వెన్నెముక. వరదల అనంతరం పేరుకుపోయిన బురద ఒండ్రుమట్టిలో విత్తులు చల్లి ధాన్యం పండించిన తొలి అనుభవం మొదలు ప్రపం చవ్యాప్తంగా కాలానుగుణంగా వస్తున్న మార్పులకు దీటుగా నిలదొ క్కుకునే నేటి యోచనలదాకా రైతుకథ ఒక మహాభారతమంత. తొలిదశ కథలను, జాతక కథలను చెబితే... జానపదుల గాథలు ప్రతీ అడుగును తడుముతుంటాయి. 'ఏరువాకమ్మకు ఏం కావాలి?' అని అడిగి 'ఎర్రెర్రని పూలమాలలు, ఎరుపు తెలుపులు మబ్బుటెండలు, పొలంగట్టున టెంకాయ వడపప్పులు' అంటూ ఆరుబైటి హారతి పరిమళాలుగా పల్లెపట్టులు సాగుసంబంధాలను కొనసాగించడం ఒక్క భరత ఖండానికే చెల్లుతుందేమో! సప్తసముద్ర ముద్రితమైన భూమండలాన్ని పరశురాముడు సంతర్పణ చేసే. సందర్భంలో యాచించి బతకడం తలవంపుగా ఉంది.. చిన్న మడిచెక్కనైనా దానం పట్టమని ఆదిభిక్షువు చెవిలో పోరుపెడుతుందట పార్వతీదేవి. మిత్రుడు కుబేరుడిని అడిగి  విత్తులు, బలరాముడినడిగి నాగలి, యమధర్మరాజునుంచి దున్నలు తెచ్చి త్రిహలం సాయంతో వ్యవసాయం చేసి గౌరవంగా బతుకుదామని ఆ గౌరమ్మతల్లి ఆశ. 'అడిగిన జీతంబివ్వని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటే/ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుక బ్రతక వచ్చు' అన్నది మహిలోని సుమతుల భావన. 'ఉండి తిన్నను లేక పస్తున్న  గాని/ యాస చేయవు పరుల కష్టార్జితంబు' అని కదా కృషీవలుడి గురించి దువ్వూరివారి ప్రస్తుతి.

 

కళ్ళంలో పైరు నూర్చి ఏడాదంతా నమ్ముకుని పనిచేసిన సాటి పనివాళ్లందరికి నియమానుసారం పొల్లుపోకుండా పాళ్లు పంచిన పదప మాత్రమే  మిగులు ధాన్యాన్ని బళ్లకెత్తించి ఇళ్లకు మళ్ళించే రైతన్నను మించిన  ప్రజాపోషకుడు జగాన ఎంత గాలించినా ఏ యుగానా కనిపించడు. 'దొరలు ఇచ్చిన పాలు కంటే ధరణి పుత్రుడిచ్చిన పాలు మేలు' అన్న నానుడి ఊరకే పుట్టిందా! కానీ, 'కొర్రు గుచ్చిన దేశమందు కరవులుంటాయా? దుక్కి దున్నిన దేశమందు దుఃఖ ముంటుందా? కావు నడచిన భూమి మీద ఏపు తగ్గిందా?'  అన్న పాట మోట నాగలి దున్నుకుంటూ పాటలేవో పాడుకుంటూ పాటుపడే రైతుకు ఊరట ఇచ్చే రోజులు వెళ్ళిపోయాయేమో! సమకాలీన మాయాజాలంలో రైతు చిక్కిన దుస్థితిని ఒక ఆధునిక కవి వ్యంగ్య వైభవంగా వెలిబుచ్చిన వైనమే ఈ పరిస్థితికి అద్దంపడుతుంది. గొప్ప నాయకులు కొద్దిమంది కుప్పగా  వచ్చి 'ఎద్దుల జత మాకు జమ్ము సుమ్మి/ నిన్ను ఉద్ధరించి మిన్నగా జేతుము' అని హామీ ఇచ్చి పశువులను తోలుకెళ్ళారట. 'నీదు కొడవలిమ్ము లేదు అనకు/ నీకు సేవ చేయ నేలపై పుట్టినాము' అని మాట  ఇచ్చి  కొడవలితో మాయమయిందట మరో మాయదారి గుంపు. 'అవుదూడల నిమ్ము అన్ని విధముల నీకు/ సేవ చేయగలము' అని గోపు సాక్షిగా మాయచేసిన మూక మరొకటి. బక్కరైతును అప్పుడైనా వదిలారా! 'నిన్ను చేరదీయ   వచ్చినాము సుమ్మి భగవాను సాక్షిగా/ వేగ తెమ్ము నీదు నాగలి 'కొని' ' అని తీపిమాటలు చెప్పి అదీ తీసుకుని పోతే- చివరికేమీ లేక రైతు దీనుడైన వైనం ఇప్పటి రైతన్న దైన్యాన్ని   అద్దంలో చూపించే చేదు విషాదమే! 

 

సామాజికంగా వ్యవసాయదారుడు  ఎన్నో వ్యవస్థల పీడితుడు. పన్నులు, జరిమానాలు, హింసలు, దౌర్జన్యాలు రాజుల కాలంనుంచే రైతును సలుపుతున్న పీడలు. ఫ్యూడల్ వ్యవస్థ నాటి  భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, గ్రామాధికారులు బహుముఖాలతో సతాయించిన సైతానులు. కరవులు, వరదలు- ప్రకృతిపరమైన శాపాలు నిరక్షరాస్యత, నిరుపేదరికం- విజ్ఞానాన్ని, అభివృద్ధిని మింగేస్తున్న భూతాలు. రైతు జీవితంలో మెరుగుదల ఉంటేనే అధిక ఆహారో త్పత్తి... మరేదైనా' అంటుంది ఆరు దశాబ్దాల కిందటి 'గ్రోమోర్ ఫుడ్ కమిటీ.  ప్రపంచీకరణం ప్రతికూల ప్రభావంలో, ఆధునిక విలాస ఇంద్రజాలంలో చిక్కింది యువ రైతాంగం. వలసలు, మానవ వనరుల కరవు, అరకొర నీటి సదుపాయం, సేంద్రియ విధానాలకు దూరం, మితిమీరిన ఎరువుల వాడకం, నాణ్యతలో నాసిరకం, తడిసి మోపెడవుతున్న వ్యయభారం, ఎడాపెడా వాయించే రుణాల రణగొణ ధ్వనులు. అందని మద్దతుధర, దళారుల మాయాబజారులో చిక్కి చేతికందిన పంటకు నిప్పు పెట్టుకోవడమో చేయి కాలిందని చివరికి 'పురుగు మందు' తాగడమో... ఇదీ నడుస్తున్న రైతుకథలోని ప్రస్తుత విషాదాంకం. 'బురదమళ్లను సుధా- వరదల ఉంది/ వరద వెన్నుల వీజె సరిగల్మీటి/ నాగేటి చాలులో- రాగరసాలు/ పారకచ్చులలోన సారస్వతంబు' సృష్టించిన సైరికుడికా ఈ  విలాపం? 'కృషితో నాస్తి దుర్భిక్షం' సూత్రం నేతిబీర చందంగా  మారడానికి  కారణాలు అనేకం. దాశరథి అన్నట్లు 'ఈ ధరా భూమి మధురాధరాన/ అమృతమొలికిస్తున్న హాలికుడికి ఇదమిత్థంగా  దక్కుతున్నదేమిటి? రామపాదం లాంటి రైతుపాదం తాకిన భీళ్లన్నీ శాపవిమోచనం పొందుతున్నా అన్నదాత ఇంట కరవు ఛాయలుండటమేమిటి? తెలుగు గడ్డమీద రైతు శిరసెత్తుకు నిలిచి నడిచిన నాడే  కదా అసలు సిసలు సంక్రాంతి!

 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈ నాడు - ప్రచురితం - 18 -01 - 2015 ) 

 

 

 

 

Wednesday, February 2, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం పావలా కాలధర్మం రచన- కర్లపాలెం హనుమంతరావు


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

పావలా కాలధర్మం 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 06-07-2011 ) 

 

చిల్లర రాజకీయాలు పెరుగుతున్న కొద్దీ చిల్లర నాణాలు క్రమంగా కనుమరుగైపో తున్నాయి. పైసా, అయిదు పైసలు, పది పైసలు, ఇరవై పైసలు... ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఇరవై అయిదు పైసలవంతు. త్వరలో అర్ధ రూపాయి గతీ అంతే కావచ్చు  


భిక్షగాడికి కూడా అక్కర్లేని డొక్కు నాణెంగా తయారైంది పావలా  వంద పావలా బిళ్ళల తయారీ కే నూట అరవై రూపాయలు ఖర్చవుతున్నాయని కేంద్ర అమాత్యులు వాపోతున్నారు. ఈ కరవు కాలంలో వాటిని తయారుచేయడం తమవల్ల కాదని ఓ దండం పెట్టేస్తున్నారు. జులై ఒకటినుంచి పావలా 'మరణం' అధికారికంగా నిర్ధారణయింది!


దమ్మిడీకి కొరగాని నేతల్ని ఎన్నుకోవడానికి ఎన్నికల్లో కోట్లు  రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అలాగని ఎన్నికలనే రద్దు చేయాలని ఎవరన్నా అంటున్నారా! బడుగు జీవి బతుకులాగా పావలా నాణెం అందరికీ అలుసయి పోయిందనేదే బెంగ . నెత్తిమీద రూపాయి ఉంచినా పావలాకు అమ్ముడుకాని నేతలను మనం భరించాలి  గానీ, పర్సులో పావలాని మాత్రం బరువని చెప్పి గిరాటేస్తున్నాం. 


కారు డిక్కీలో, బస్సు టాపులమీద పత్తిబేళ్ల మాదిరిగా కట్టలు కట్టలు వెయ్యి నోట్లు రవాణా అయే  కాలంలో- ఇంకా ఈ పావలా, అర్ధ రూపాయల గురించి పలవరింతలు ఎందుకని నవ్వుకొంటున్నారా! అయినవాడికి పదవి కట్టబెట్టడానికి గిట్టనివాడిని చట్టసభనుంచి వెళ్ళగొట్టినట్లు... అయిదు, రెండు, ఒక రూపాయినోట్లకు నాణాల స్థాయి కల్పించారు. పేద వాడి నాణెం పావలా, అర్ధరూపాయలను మాయం చేస్తామంటున్నారిప్పుడు . చిల్లర మహాలక్ష్మి అంటే ఎంత చుల కన? 


గుళ్ళో దేవుడి హారతి పళ్ళెంలో వేయడానికి ఇక రూపాయి, అర్ధరూపాయలే సమర్పించుకోవాలి కాబోలు. పిల్లాడు కిడ్డిబ్యాంకులో వేసుకోవడానికి ఇక రూపాయలే ఇచ్చుకోవాలి. పాపాయిల భోగిపళ్లలో కలపడానికైనా పావలా బిళ్లలు చలామణీలో ఉంటే నిండుగా ఉండును పండువు . శవయా త్రలో వెనక్కు విసురుకుంటూ పోయే చిల్లరలో పావలాలు కాక రూపాయి బిళ్లలు కలపాలంటే- బతికున్న వాడి బంధువులు భరించలేక చచ్చూరుకోవాల్సిందే. అసలైన ఆర్థికమాంద్యం దెబ్బ అప్పుడు  తెలిసొస్తోంది.


బడుగు జీవికి జనాభాలో ఏ పాటి విలువుందో పావలాల్లాంటి చిల్లర బిళ్లలకూ కరెన్సీ లోకంలో అంతే విలువుందిప్పుడు. కూడికలూ తీసివేతల లెక్కల వరకేగానీ, ఇంద... తీసుకో అంటూ ఇవ్వడానికి పావలాలు ఎక్కడున్నాయి? టీవీల్లో తెలుగులా, నేతల్లో నిజాయతీలా, దుకాణాల్లో నికార్సయిన సరకులా, చేత్తో రాసే ఉత్తరాల్లా... పావలాలూ పది పైసల బిళ్లలూ మాయమైపోయాయి. 


అమలుకాని వాటిని ఇప్పుడు పావలా వడ్డీ పథకాలనే పిలుస్తున్నారు. బంగారం కొట్లో ధర్మకాటాలో వేసి తూచడానికితప్ప, ఇతర సమయాల్లో పావలాలు, అర్ధలూ పనికిరాని పదా ' ర్థాలు ' . 


ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎంత సవ్యంగా ఏడ్చిందో  - డబ్బు లెక్కల్లో పావలాలకు, అర్ధరూపాయలకు అంతే విలు వుందిప్పుడు . పేదోడిని పట్టించుకుంటున్నారు కనకనా, పావలాను ఎవరైనా లెక్క పెట్టడానికి! 


కుంభకోణాల విలువా వేలకోట్ల రూపాయల స్థాయికి చేరిపోయింది. రాష్ట్రప్రభుత్వాల బడ్జెట్లూ లక్షల కోట్లు మించుతున్నాయి. పావలాలను, పైసలను సర్దుబాటు చేసే తీరిక, ఓపిక ఇప్పుడెక్కడున్నాయి? 


పావలాలను, రూపా యల్ని కాదని, కోట్ల రూపాయల్ని ఆరగించినవారు వాటిని సర్దుబాటు చేయలేకే ఇప్పుడు తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. 


ఒకప్పుడు పావలా బిళ్ళ అంటే ఎంత విలువ? కప్పు చాయ్ తాగాలంటే పావలా

చాలు. ఇంకా వెనక్కు వెళితే- మానెడు బియ్యం కొలిచేవారు. ఓ పావలాబిళ్ళ గనక జేబులో ఉంటే- ఆ రోజుకు అతను పెద్ద దివానే. పిల్లాడిచేతిలో పావలా పెడితే- ఐస్ సోడా , సోంపాపిడి, మామిడితాండ్ర, రబ్బరు పెన్సిలు, రంగు బెలూన్లు రెండో మూడో కొనుక్కున్నా- ఇంకా పైసో .. రెండు పైసలో మిగిలుండేవి. ఇప్పుడు పీచు మిఠాయినుంచి పాప్ కార్న్ పాకెట్ దాకా ఏది కొనాలన్నా రూపాయలు  అచ్చుకోవాలి . 


దీపా వళి పండుగకు పావలాకు సగం బుట్టెడు టపాసుల చ్చేవి. పెద్దపండగ నాడు హరిదాసు అక్షయపాత్రలో అరసోల బియ్యం ఓ పావలాబిళ్ళతో పాటు కలిపి పోస్తే ఇంటిల్లపాదీ అప్లైశ్వర్యాలతో చల్లగా ఉండమని మనసారా దీవలనందించేవాడు . 


పావలా రైలు టికెట్ తో  పాతిక మైళ్ళు సుఖంగా ప్రయాణం చేసేవాళ్లం. సైకిలు అద్దె గంటకు పావలా.  శివరాత్రి పండక్కు పావలా ఇచ్చి మూడు సినిమాలు వరసగా చూసి మురిసిపోయేవాళ్లం. అందాకా ఎందుకు, అప్పట్లో ఆలిండియా కాంగ్రెసులో ప్రాథమిక సభ్యత్వం ఖరీదు- కేమం ఒక్క పావలా!


నాణెమా అంటే నాలుక్కాలాలపాటు నిలబడుం డేదీ... విలువగలదీ అని నిఘంటువు అర్ధం. నాణేల చరిత్ర రెండువేల ఏడొందల నాటిది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాల తయారీకి లోహాలకు కరవొస్తే ఆదుకున్నది అప్పటి నాణేలే! శాసనాలకు మాదిరిగానే నాణేలూ చారిత్రక పరిశోధనకు చక్కని సాధనాలు,


అలాంటి నాణేలకు ఇప్పుడు మూడింది. పిల్లకాయ లకు పావలా బిళ్లల్ని ఇంక ఏ మ్యూజియాలలోనో,  నాణేల సేకరణ పుస్తకాలలోనో  చూపించుకోవాలి.


వెయ్యి నోటు ఇస్తే, వెనక్కూ ముందుకూ వెయ్యి సార్లు తిప్పిచూసుకుని తీసుకునే ఈ కాలంలో- పావలా బిళ్ళ గురించి విలపించడం వృథా అంటారా?


ఆర్ధిక సమరంలో బడుగువాడి పక్కన నిలబడి పోరాడే పావలా యోధుడికి ఇలాగైనా ఆశ్రునివాళి సమర్పించడం మన కనీస ధర్మం.




రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 06-07-2011 )   

Tuesday, February 1, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం- గల్పిక ఎందరో మేతగాళ్లు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 )

 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం- గల్పిక 

ఎందరో మేతగాళ్లు 

రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 ) 



రోజూ ఉండే రాజకీయాలకేంగానీ, ఇవాళ నీకు మహాభారతంలోని ఓ మంచికథ చెప్పాలనుందిరా? 


చెప్పు బాబాయ్! కహానీలు చెప్పడంలో నిన్ను మించిన మొనగాడు లేడులే, కానీయ్! 


సృంజయుడనే ఓ మహారాజు, సంతానం లేదు. నారదులవారు ఓసారి చూడ్డానికొచ్చి- గుణవంతుడు, రూప వంతుడు అయిన కొడుకు పుడతాడని ఆశీర్వదించాడట. 'గుణాన్ని ఏమన్నా కోసుకు తింటానా? రూపంతో పనేమి లేదు... రూకలు సృష్టించే పుత్రుణ్ని ప్రసాదించండి స్వామి! వాడి చెమట, కన్నీళ్లు, లాలాజలం కూడా బంగారంలా మారిపోవాలి మరి ' అని కోరుకొన్నాడట మహారాజు . అట్లా పుట్టినవాడే సువర్ణష్ఠీవి.


వాడే గనక ఇంకా జీవించి ఉంటే మన ఆదాయప్పన్ను వాళ్ళకి నిండా బోలెడంత పని


హుష్ ! ముందు కథ విను! వాడినొకసారి దొంగలు ఎత్తుకెళ్ళారు. ఆశకొద్దీ బంగారంకోసం కడుపుకోసి చూస్తే నెత్తురు, మాంసం, పేగులూ తప్ప ఏమీ లేవు. చచ్చిన కొడుకును చూసి రాజుగారు ఏడుస్తుంటే నారదుడొచ్చి ఓదార్చాడు. ' శ్రీరామచంద్రుడి లాంటి మహానుభావుల్ని కోరుకోవాలి గానీ, బంగారం కోసం యావపడితే ఇట్లాగే ... చివరికి బూడిదే మిగిలేది ' అని బుద్ధిచెప్పి ఆ కొడుకును మళ్ళీ బతికించి పోయాడు నారదుడు.


బాగుంది. ఇంతకూ ఇవాళ నీకెందుకీ హరికథ హఠాత్తుగా గుర్తుకొచ్చింది!


పత్రిక చూస్తుంటే లంచాలను గురించి ఓ కథనం కంటబడిందిరా! కూరగాయలు, పెట్రోలు రేట్లు పెరిగి పోతున్నట్లు లంచాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయట! అవినీతి నిరోధకశాఖ పట్టిక ప్రకారమే పట్టుబడ్డ ఉద్యో గుల అక్రమార్జన నిరుడు సగం మెట్రోరైలు ప్రాజెక్టు ఖర్చంత ఉందిట! ఏసీబీవాళ్లు దాడిచెయ్యని, చెయ్యలేని సొమ్మంతా పోగేస్తే- ఏకంగా పోలవరం ప్రాజెక్టునే పూర్తి చెయ్యొచ్చునేమో! సమాచార హక్కు చట్టాలు, అన్నా హజా రేలు, అవినీతి నిరోధక శాఖలు, అడుగడుగునా విజిలెన్సు కమిషన్లు, కొరడాలు ఝళిపించే న్యాయస్థానాలు, జనాల చీదరింపులు.. ఎన్నున్నా... ఇదేందిరా పచ్చిగడ్డే పరమాన్న 'మనుకునే లంచాల పిచ్చి మనవాళ్లకు వదలకుండా పట్టుకుంది?


'లంచం- ఏంటి బాబాయ్... మరీ అంత మొరటుగా పిలుస్తావ్! ముడుపులు, నైవేద్యాలు, మామూళ్లు, చాయ్  పానీలు, విరాళాలు, నజరానాలు, ప్రసాదాలు అంటూ ఎన్నేసి నాజూకు పేర్లున్నాయ్! అయినా, ఇవాళే ఈ పద్ధతి కొత్తగా ప్రవేశించినట్లు తెగ ఇదైపోతున్నావ్! రోజూ నువ్వు నాకిది కావాలి.. అది కావాలి అంటూ చెంపలేసుకొనే ముందు దేవుడికి కొట్టే టెంకాయను ఏమంటారేంటి ? దేవుడే దేవేరి  అనుగ్రహం కోసం పారిజాతాన్ని అపహరించి మరీ సమర్పించుకోక తప్పింది కాదు . రాజులిచ్చే అగ్రహాలకోసం కాదూ కవులు ప్రబంధాలను అంకితాలిచ్చింది! భూమి పుట్టినప్పుడే బహుమానాలు పుట్టాయి బాబాయ్! ఆదాము అవ్వలచేత సంసారం చేయించటానిక్కూడా పాము ఆపిల్ పండును లంచంగా ఇచ్చుకోవాల్చొచ్చింది. 


అది వేరురా... చాకిరీ చేయడానికి నెలనెలా జీతాలు అందుకునే నౌకరీల్లోనూ రోజూ చెయ్యాల్సిన పనికి చాయ్ పానీలు  ఆశించడమేంటి?


నూలు పోగు అందించకపోతే చందమామ ఏమన్నా వెన్నెల తగ్గిస్తాడా ! చందమామకు ఆ పోగు అందం ఎట్లాగో .. కొన్ని సర్కారు పోస్టులకు బల్లకింది చేతులు ఆదో అందం. నువ్వు ఇందాక చెప్పావే హరికథ... సర్కారు పనివాళ్ళ బుర్రకథ ముందు ఎవరికీ వినపడదు. పిల్లాడిని బడికిపోరా అంటే నువ్వు జీడి కొనుక్కోవడానికి డబ్బులిస్తేనే పోతానంటాడు. నోరులేని గేదె నోటికి పచ్చగడ్డి అందించకపోతే పాల పొదుగుమీద చెయ్యి వెయ్యనివ్వదు. నోరున్న మనిషి మరి కట్టేసుకుంటాడా! ఇన్ని చెబుతున్నావు... నీ నాలిక మీద తేనెబొట్టు పడితే చప్పరించకుండా ఉండగలవా? డబ్బు వ్యవహారాల్లో మునిగి తేలేవాడు డబ్బునెట్లా  ఆశించకుండా బిగపట్టుకుంటాడు  బాబాయ్! 


గడ్డి తినడం మహా ఘనమైన లక్షణమని మరి చంకలు గుద్దుకోమంటావా నువ్వు! 


మేయడం కూడా  గొప్ప సృజనాత్మక కళే! ఇన్నేసి వేల మంది సర్కారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క సరసాదేవి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ లాంటివాళ్లే మనకు ఎందుకు గుర్తుం డిపోతున్నారంటావ్? జీతంమీదగాక మరీ గీతంమీదే మరలు బిగిస్తే సర్కారులో దస్త్రాల బళ్లు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలవు.. గుర్తుంచుకో! అమెరికాలాంటి అగ్రరాజ్యాలు కూడా చతికిలపడ్డ రోజుల్లో  మనా దేశార్థికం ఇంత చురుగ్గా ఉందంటే దానికి కారణం కార్యాలయాల్లో చేతులు కింద

పెట్టుకునే బల్లలు ఇంకా ఉన్నాయి కాబట్టే 


ఇంతకీ నువ్వనేది ఏందిరా! లంచాలు ఇలాగే పదికాలా లపాటు వర్ధిల్లాలంటావ్! 


అంతేకాదు... అక్రమార్జనను ఉద్యోగుల హక్కుగా పరిగణించాలి. సిటిజన్ ఛార్జుల మాదిరిగా ఆఫీసుల్లో ఈ పనికి ఇంత అని పబ్లిగ్గా రేట్లు నిర్ణయించాలి. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారిని గుర్తించి ప్రోత్సాహించాలి. ఆదాయపన్ను పత్రాల్లో జీతంతో పాటు గీతాన్ని ప్రకటించుకునే సంస్కరణలు అమలు చేయాలి. గీతాలమీద తగినన్ని రాయితీలు ఇవ్వాలి. అవినీతి నిరోధకశాఖ విజిలెన్సు కమిషన్లు వంటివాటిని వెంటనే రద్దుచేసి ఆ సిబ్బందిని నీతి నిరోధక కార్యక్రమాల నిర్వహణవైపు మళ్ళించాలి. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించిన పద్ధతిలోనే అక్రమార్జనను క్రమబద్ధీకరించే చట్టాలు వెంటనే అమలుచేయాలి . నేతలు నానా గడ్డ కరిచి సంపాదించుకొన్న మొత్తాలను దాచుకునేందుకు  తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాలు వంటివాటి నిధులను మళ్లించి వెంటనే తగినన్ని నేలమాళిగలను ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వ గిడ్డంగులను ఖాళీ చేయించి నల్లధనాన్ని దాచుకునే సౌకర్యం కలిగించాలి. లంచగొండులకు తగిన రక్షణ కల్పించగలిగితే విదేశాల్లోని మన నల్లధనం మొత్తం మనదేశంలోకే ధారాళంగా ప్రవహిస్తుంది. అప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతులున్న దేశం మనదే అయితీరుతుంది. ఏమంటావ్! 


ఇంకేమంటాను. నా మనసులోని మాట చెప్పాలంటే నువ్వు నాకు ఒక అయిదొందలు ఆమ్యామ్యాగా అచ్చుకోవాలి. 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 ) 





Thursday, January 13, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక మాయలోళ్లు రచన కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 21-01-2014 )


 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


మాయలోళ్లు 


రచన కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 21-01-2014 ) 


కంటికి కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని మొత్తానికి ప్రస్తుతానికి నడుస్తున్నదంతా టోపీ రాజకీయమే.


'పదమూడు నెలలు తిరక్కుండానే ఆమ్ ఆద్మీకి అధికారం కట్టబెట్టింది హస్తిన ప్రజ. అప్పటి బట్టి  బడానేతలందరి దృష్టి హ్యాట్ ట్రిక్ పైకే మళ్లింది. ఇప్పటిదాకా అమాయకుల నెత్తికి మాత్రమే టోపీలు . ఇప్పుడు పోటీ అంతా తమ నెత్తిన తామే పెట్టుకునేందుకు .  తిరగడానికి . జనాల టైపు  టోపీలు  కనిపించవు . సొంతానివి మాత్రం తళతళా మెరుపులు ! 


ప్రారంభంలో మనవి తలపాగాలే. టోపీ పరిచయం తెల్లవాడితో. ఓడ దిగీదిగగానే బుర్ర మీది  'టోపీ' ఎత్తి భారతీయులను బుట్టలో పడేశాడు. సరకులు అమ్ముకుంటామని వచ్చి దేశం ఆసాంతం  మురుకుల్లా నమిలేశాడు. తెల్లవాడి పీడా  వదిలినా, వాడి 'టోపీ' మాయ మాత్రం మన నెత్తిమీదనుంచి దిగటంలా! 


బాపూతో  పాటు దక్షి ణాఫ్రికానుంచి దిగుమతయిన  టోపీ? పాపం, బాపూజీ ఆ టోపీ వాడకం  నిరాడంబరానికి గుర్తు.  ఆయన గుర్తుకు అని చెప్పుకొనే శిష్యుల వాడకానికి రకరకాల కోణాలు.  మాత్రం . . ' టోపీ పార్టీ ఇక వద్ద' ని మొత్తుకున్న పెద్దాయనకే చివరికి ' టోపీ ' పెట్టిందాయన శిష్యగణం ! 


పురానా జమానాలో పనామా కాలువ తవ్వే జనాలకు ఎండపొడకు రక్షణగా పుట్టిందీ టోపీ . టోపీ పెట్టుకు తిరిగే  చరిత్ర క్రీస్తుపుట్టక పూర్వానిది. మెక్సికోలో పురాతన కట్టడాలు  తవ్వేటపపుడే ఓ శవం  నెత్తి పై టోపీ ప్రత్యక్షమయిందని చరిత్ర. చచ్చినా వదలని టోపీ గురించి  ఎంత చెప్పినా తక్కువే! 


  ప్రతి బడుగుజీవికి నెత్తిన ఓ టోపీ  పాలసీ మన దగ్గర. నూట ఇరవై రెండు కోట్లకు పైబడిన జనాభా ! ఎన్ని రకాల టోపీలిక తయారు కావాలి! కాబట్టే  మన దగ్గర  కనిపించేటన్ని  టర్కీ టు ఇటలీ మార్కు మొత్తం కూడినా  తక్కువే! టోపీలకు బ్రిటన్ అమెరికాలు  మహా ప్రసిద్ధి.   మన దగ్గర మాత్రం ' ఇటలీ' మేడ్ కి మహా రద్దీ! 

టోపీలూ  హ్యాట్లూ మన టైపు సంస్కృతీ సంప్రదాయాలకు సూటు కాదు, కానీ టోపీలు పెట్టడం .. పెట్టించుకోడంలో మన రేంకే టాపు . 


విష్ణుమూర్తి సుదర్శనం  ప్రయోగించిన చివరి క్షణంలో గాని ప్రత్యక్ష మయేది కాదు. మన నేతలు పెట్టే టాపీలు అలాకాదు. దెబ్బై పోయిన తరువాతనే నెత్తికి పెట్టారని తెలిసేది!


 ఇంద్రజాలికుడు పి.సి.సర్కారు పిల్లపిప్పర మెంటు బిళ్లల నుంచి, ఆడపిల్లలకు  బొట్టుబిళ్లల దాకా ఏది కావాలన్నా  టోపీ నుంచే తీసిచ్చేది! మనా సర్కారు ముందు  పి.సి సర్కారు మాయ బలాదూర్ .  సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు, ఉపాధి హామీలు, ఆహార భద్రతలు, అవినీతిని అడ్డుకునే చట్టాలు, అర్హులకంటూ   ప్రదానం చేసే భూ   పట్టాలు... గట్రా గట్రాలు అడక్క  ముందే టక్కున టోపీ నుంచే  తీసిచ్చేస్తారు ! 


కళ్యాణకట్టల దగ్గర  అట్టముక్కల  పైన గుండుకు ఓ నామం ఉచితం, నామానికి ఓా టోపీ ఉచితం అని రాసుంటే చూసి నవ్వుకుంటాం . సర్కారు చేసే మాయలను  మాత్రం  మా బాగా నమ్ముకుంటాం . 'ఓటు' పత్రాన్ని  భక్తిగా బ్యాలట్ పళ్లింలో  పెట్టి మరీ  నేతలకే దేవుల్లాకు సమర్పించు కుంటాం. గుప్తుల బ్రాండ్ స్వర్ణయుగం కోసం కళ్లు  రెండు కాయలు కాసేలా ఎదురుతెన్నులు  చూస్తుంటాం . గుప్తులకాలంలో  కనిపించని టోపీలపై  మన పాలకులకు మహమోజని ఆలస్యంగా గుర్తిస్తాం . గుడ్లు అప్పుడు వెళ్ల బెట్టేస్తాం!  


రామాయణ కాలంలో భరతుడు అంత "మీద పెట్టి అమాయకంగా అడవులు పట్టిన అన్నగారి పాదుక లను పట్టుకొచ్చి సింహాసనం పాలన సాగించాడు. అదే కథ ఈ కలికాలంలో కనక పునరావృతమై ఉంటే పాదుకులకు బదులు 'టోపీ' కూర్చుని ఉండేదేమో సింహాసనంమీద. జటోపీ లేకుండా రామాయణమైనా, మహాభారతమైనా సరే రక్తికట్టే కాలం కాదిది. కమలనాథులూ కాషాయం టోపీల మీద పడ్డారంటే కథ ఎండాకా ముదిరిందో అర్థమవుతుంది.


సొంత నెత్తికి గొప్పగా కనిపించేటట్లు హ్యాట్లు తగిలించు కుని ఊరేగడం, ఓటేసేవాడి నెత్తికి ఏమాత్రం నొప్పి తెలీ కుండా కుచ్చుటోపీ తగిలించడమేగా పటాటోపం' అంటే జనం సొమ్ము లక్షల కోట్లు కుమ్మేసి ఆ కేసుల నుంచి నిక్షేపంగా బయటపడటానికి దేశాలు పట్టుకు తిరిగే యువనేత ఓదార్పు పేరుతో మంది నెత్తికి పెడుతున్నవి టోపీలు కావూ? పొద్దస్తమానం నిజాయతీ గురించి ఉపన్యాసాలు దంచే ఆ పెద్దమనిషి నిజానికి ఎన్నికల గుర్తుగా ఎంచుకోవాల్సింది 'టోపీనే


మోరెత్తి కాస్త అటు హస్తినవైపు ఓపిక చేసుకుని చూస్తే తెలుస్తుంది- 'టోపీ' రాజకీయాలెంత పటాటో పంగా నడుస్తున్నాయో!


'అమ్మ' ఏడుపు' సెంటిమెంటు పనిచెయ్యలేదు. ఇక లాభం లేదని యువరాజు కిరీటం ఇంట్లో దాచేశాడు. విరాటపర్వంలో, ఉత్తర కుమారుడి మాదిరిగా నవ్వూ కోపం కలగలిసిన కొత్త మొహంతో, కొత్త ఆమాద్మీ రకం టోపీతో జనంలోకి రాబోతున్నాడు. సహచట్టం, ఆధార్కార్డు, విద్యాహక్కు ఆహార భద్రత టోపీలు: నప్పలేదని, వంటగ్యాసు బండలు అవినీతి నిరోధక


చట్టాలు అంటూ కొత్తరకం టోపీలు బుట్టలో పెట్టు కుని ఓట్లకోసం బయలు దేరుతున్నాడు. బట్టతలకు దువ్వెనలు అమ్మేవాడికి పోటీగా బట్టతలకు టోపీ పెట్టడా నికి వస్తున్నాడు.


కనిపించే టోపీలు ఏవి పెట్టుకున్నా పరవాలేదు. కని పించని టోపీలతోనే సామాన్యుడు భద్రంగా ఉండాలి. ఎన్నికలు దూసుకొస్తున్నాయి. 'టోపీ'లొస్తున్నాయి.


కర్లపాలెం హనుమంతరావు




 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 


పదండి ముందుకు.. పదండి తోసుకు! 


-కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-04-2003 ) 


ఆఫీసుకు పోగానే, 'ఆలస్యమయిందే' అనడి గాడు కామేశం . 


' బండిమొండికేసింది. పాద యాత్ర చేసొచ్చా' అన్నా. 


అలాంటి మాటలే. అన్నందుకు బాసు చేత చచ్చే చివాట్లూ తిన్నా. 


'ఎప్పుడూ విమానాల్లో ఎగిరేవాడు ఎప్పు డైనా రెండడుగులు నడిస్తే జాలి పడతారు. క్రీస్తు పుట్టక ముందెప్పుడో అయిదొందలేళ్ల కిందట సిద్ధార్థుడు మహారాజు కొడుకై ఉండీ రథం దిగి నడిచాడని మనమిప్పటికీ గొప్పగా చెప్పుకుంటాం . పల్లెల్లో ఆడవాళ్లు  నీళ్ళ కోసం మైళ్లకొద్దీ నడుస్తారు.... ఎవడికి పట్టింది? డొక్కుబండి మీద తిరిగే నీబోటివాడు.. బోడి.. నడిస్తే ఎవడిక్కావాలి. పాకితే ఎందుకు జాలి? నువ్వేమన్నా వై. యస్.వా.. ఎమ్మెస్ బాసువీ  నీ వెంటబడి మరీ పొగట్టానికి' అన్నాడు కామేశం.


యస్. వై.యస్.. అంటే గుర్తొచ్చింది. పేపర్లలో వారం పది రోజుల్నుండీ ఆయన్దే  ఊసంతా. 


ఊసుపోక కాంటీన్లో ఆ విషయమే కదిపా.  చర్చ అంటే కామేశం రెచ్చిపోతాడు. పైపెచ్చు హస్తం అభిమాని.


''అందుకే 'దేశం' ఉసూరుమంటుంది. హనుమంతుడు. కుప్పిగంతులేస్తుంది. మంత్రదండముందా అని మంత్రులు దండె త్తుతుంది. వై .. ఎప్పుడనాలో... యస్.. ఎప్పు డనాలో తెలిసిన గడుసువాడు నాయకుడైతే విపక్షం, స్వపక్షంలోని విపక్షం కూడా పక్ష పాతం లేకుండా ఏకపక్షంగా ఇలాగే పక్ష వాతం పాలబడుతుంది. మొత్తానికి గురు వును ముంచిన శిష్యుడు మా'వాడు' ' అన్నాడు కామేశం కులాసాగా. 


'గురువెవరు గురూ? '


' పేరెందుకులే.. బాధపడతావు. పైసా ఖర్చుపెట్టి పది రూపాయలు ప్రచారం చేసు కొనే విద్యకు మెరుగు పెట్టి అసలు ఏ పెట్టు బడీ లేకుండానే కీర్తిని రాబట్టే కొత్త టెక్నిక్  కనిపెట్టాడే ఆయనే శిష్యుడు. నడక తనది. తిమ్మిరి 

సీ యమ్ ది.  పాదాలు తనవి . బొబ్బలు తనవాళ్లవి.  పెడబొబ్బలు పెడుతున్నారుగా.. వినపట్టంలా? ' ముసిముసి నవ్వులు నవ్వాడు. 


' అవును హస్తం పాదయాత్ర వట్టి సర్కస్ ఫీట్' అంటున్నారు చాలమంది' 

అన్నా అక్కసుకొద్దీ. 


ఆయన నడక పడక అలా అంటున్నారు. గానీ, పాదయాత్ర సూపర్ హిట్. దిగ్విజ "యంగా నడుస్తున్నది మూడో వారం... ఓవర్ టేక్ చెయ్యాలంటే ఒహటే దారి. పరిగెత్తే యాత్ర పెట్టుకోవటమే! 


' వైయస్ కీ  వయసులో నడవాలని మనసెందుకైంది బాస్? 


సిటీలో నీళ్ళు లేవు. కరెంటు లేదు. పొల్యూషన్. ఎండలు మండిపోతున్నాయి. రైలెక్కుదామంటే పట్టాలు తప్పుతాయని

భయం. బన్సెక్కుదామంటే లగేజ్ ప్రాబ్లమ్. కార్లలో షికారు చేసే రోజులా..  కావు. అసెంబ్లీ సీజన్ అయిపోయింది. కరవుకు తప్ప మీడియాలోదేనికీ కవరేజీ లేని రోజులు. ఏవరేజిగా ఆలోచించగల ఏ నాయకుడికి అయినా  వచ్చే ఐడియానే ఈ అనంత ఆక్రందన! ... చూశావుగా ఎంత స్పందనో! దటీజ్ అవర్ బాస్' 


'అవునవును ఇది చూసే సీమ అవేదన.. కోస్తా అవస్త... గట్రాలు బైలుదేరాయని  జైలుదేరాయని నా థీరీ.  కరవు రోజుల్లో ఎవరు  పల కరించినా జనం బావురుమనటానికి సిద్ధంగా ఉంటారనేదే వీటి వెనక సిద్ధాంతం  . అవునా?' 


' దేవుడు బుట్టలో ఉన్నాడనే యమునా నది వసుదేవుడికి దారిచ్చింది. ప్రతిపక్షం బుట్టలో పవరుందని పసిగట్టింది కనకనే 'వార్ '  అయినా.. తె.రా.స. వారయినా... ఎవరైనా దానికి దారిస్తున్నది. బుష్ కా  మాత్రం పుష్ ఉండుంటే దండయాత్రకు బదులు ఇరాకులో పాదయాత్ర చేస్తుండే వాడు. ఏ చిరాకు లేకుండా చవురు బావులు చులాగ్గా దక్కుండేవి. మీ ముఖ్య

మంత్రిగారిరవైనాలుగ్గంటలూ నిద్రపోకుండా... నిద్రపోనీయకుండా 'జన్మభూమో అని వెంటబడుతుంటే జనంలో చైతన్యం మరీ ఎక్కువైనట్లుంది... ప్రతిపక్షం వెంట బడి పోతున్నారు.' 


'అవును స్పూర్తి సి.యమ్ ది. కీర్తి వై.యస్ ది . ప్రజల వద్దకు పాలన చివరి సీనులో ప్రజల వద్దకు ఆలనగా ఎలా మలుపు తిరిగిందో చూడు. దటీజ్ పొలిటిక్స్.. ' 


' కరవులో రాజకీయం సబబా గురూ !' 


' పడనివాళ్ళు అలా అంటుంటారుగానీ నడక పవరు నీకేం తెలుసు? పదవులు పోయిన పాండవులకి పాదయాత్ర చేస్తేగాని మళ్ళీ రాజ్యం

దక్కలేదు. ఉన్న ఊళ్ళో ఉప్పు దొరక్కటండీ  గాంధీగారు ' పదండి దండిగా! 

ఉప్పు చేద్దా' మని దండియాత్రకని బైలుదేరిందీ! ప్రజల్లో స్థానం కోసం అప్పుడప్పుడూ ఇలాంటి డప్పు ప్రస్థానాలు, ప్రజాప్రస్థానాలు..

పుట్టుకొస్తుంటాయి మహాశయా! మావో  మహాశయుడు  కూడా డెబైయేళ్ల కిందట ఎన్నో వేలకిలోమీటర్లిలాగే నడిచాడయ్యా మహానుభావా...! ' 


' పొద్దుపొడిచింది మొదలు పొద్దు గడిచిందాకా ఇళ్ళల్లో ఇల్లాళ్లు తిరిగేదానికి మీటరేస్తే ఇంతకన్నా ఎన్నో వేల రెట్లు తిరిగుంటారు బాస్: ఇదో పెద్ద మేటర్ కాదు. శాసనసభల్లో ముక్కలు ముక్కలుగా చేస్తారే మన నాయ కులు... వాకౌట్లు..., వాటినన్నింటినీ కలిపి కూడితే మావో ప్రస్థానానికన్నా మరో మీటర న్నా పొడుగుండుంటుంది. ' 


' పాదయాత్రలెన్ని యోజనాలున్నాయన్నది కాదు ప్రశ్న.. జనా

లకెన్ని ప్రయోజనాలున్నాయన్నది పాయింట్. ' 


' రాముడు నడిచిన బాటలో రాయిక్కూడా ప్రాణం వస్తుంది. మా పెద్దాయన నడుస్తున్న బాటలో ఊళ్లకి ఊపిరి వస్తుంది. అన్న నడిచే బాటలోని ముళ్లని లక్ష్మణస్వామి ముందే ఏరి ' పారేసినట్లు... మా నాయకుడు నడుస్తున్న దారిలోని పెండింగ్ పన్లన్నింటినీ ప్రభుత్వం ముందే పూర్తిచేస్తున్నదా లేదా?  అదే పెద్ద ప్రయోజనం. పేపరు చూట్టంలా? '  అన్నాడు ఎద్దేవాగా. 


' అది చూసే మా దిబ్బపాలెం మామయ్య ఆ పెత్తనం మీదేసుకుని నెత్తి మీదకు తెచ్చుకున్నాడు' అన్నా చివరికి. 


' ఎవరా దిబ్బపాలెం మామయ్య? ఏమిటా కథ? ఎప్పుడూ చెప్పలేదే? ' అనడిగాడు కామేశం. 


' ఇప్పుడు చెబుతున్నా. విను. మా మామయ్య దిబ్బపాలెం ఉప సర్పంచి.  నీకులాగే పెద్దాయనకు పెద్ద అభిమాని.  రూట్ లేకపోయినా పాలెం మీద నుంచి పాద యాత్ర ఏర్పాటు చేసుకున్నాడెలాగో తంటాలు పడి . ఉప్పందిన అధికారులు ఏం చేశారో తెలుసా? రాత్రికిరాత్రి ఆత్రంగా ఊరి బైటి  చెత్తనంతా ఊళ్ళోకెత్తిపోసి... పెద్దా యన దారి మాత్రం ఫినాయిల్ పెట్టి కడి గేసి కూర్చున్నారు. ' 


' నమ్మేదేనా? .... ఏ పేపర్లో రాలేదే? ' 


' అన్నీ పేపర్లో రావు. అడుగో.... మా మామయ్య ఊళ్ళో వాళ్లు తంతారని మా ఇంట్లో దాక్కున్నాడు. అడుగు! ' అన్నా  అప్పుడే మా ఆఫీసుకొచ్చిన మా మామయ్యని చూపించి . 


'నిజమేరా అబ్బాయ్..' అని అడక్కుం డానే అన్నీ ఆయనే చెప్పుకొచ్చాడు 'సర్ పంచి పదవికి తాడేస్తే.. ఉన్న ఉప సర్ పంచి పదవి ఊడినట్లయింది. నా పని. ఎన్నికలయితేగాని అన్ని విషయాలూ తేలవు' అన్నాడు దిగులుగా.


' పోనీలే అంకుల్... ఓడితే మాత్రమేం.. ఒలింపిక్స్లో మారథాన్ రేసని ఉందొకటి దానికి పనికొస్తుంది మన కాంగిరేసు' అన్నాడు కామేశం ఓదార్పుగా.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-04-2003 ) 


Friday, December 31, 2021

ఈనాడు- సంపాదకీయం ఆనందాక్షరి రచన-కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )

 

ఈనాడు- సంపాదకీయం 


ఆనందాక్షరి

రచన-కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )


'ఏ వాణి వేదశాస్త్రేతిహాస మహాబ్ది మందారవల్లియై కందళించే/ ..అయ్యమరవాణి హంసవాహనుని రాణి' ని  ఆవాహన చేసుకుంటూ గాని కరుణశ్రీ ఏ కావ్య రచనకూ శ్రీకారం చుట్టేవారు కాదు. వాణీ కటాక్షం లేకపోయుంటే వాల్మీకి మహర్షి వట్టి కిరాతకుడిగానే మిగిలే వాడు. 'మాణిక్య వీణాం ముపలాలయన్తి/ మదాలసాం మంజుల వాగ్విలాసాం' అంటూ మనసారా స్మరించిన మాతంగ కన్య అను గ్రహం వల్లనే మేకలు కాసుకునే కాళిదాసు మహాకవిగా చిరంజీవి అయ్యాడని ఓ కథ. ఆకాశాన్ని గుప్పిట పట్టేటంత విజ్ఞానఖని వ్యాస ముని. ఆ మహర్షి మేధస్సూ భారతమ్మ ఆశీస్సు ఫలమే! దైత్యనా థుడు హిరణ్యకశిపుడికి బిడ్డ ప్రహ్లాదుడి విష్ణుభక్తిపై దిగులు, 'లభ్యంబైన  సురాధిరాజ పదమున్ లక్షింపడ' ని  విచారం. 'విద్యాభ్యాసంబున గాని తీవ్ర మతిగాడని చండామార్కులవారికి చదువుసంధ్యలు అబ్బించే పని అప్పగిస్తాడు. ఆ సందర్భంలో చదువులు చేసే చలువ గురించి ఆ అసురప్రభువు చేసిన ప్రకటన ఇన్ని యుగాలు గడచినా వన్నెతగ్గని ఆభరణం. 'చదవని వాడజ్ఞుండగు/ జదివిన సద సద్వి వేక చతురత గలుగుం/ జదువగ వలయును జనులకు-  కృతయుగానికే కాదు అన్నింటా కృతకతపాలు పెచ్చు మీరుతున్న  ఈ కలియుగానికీ  అతికినట్లు సరిపోయే సూక్తి ఇది. జగత్తుకు గురువై ఉండీ మానవజన్మ ఎత్తినందుకుగాను శ్రీమన్నారాయణుడికే సాందీపని గురుకులాన జ్ఞానార్జన చేసేపని  తప్పిందికాదు. 'వానలు పస పైరులు కభి/ మానము పస వనితలకును మరి యోగులకున్/ ధ్యానము పస యా మీదట/ జ్ఞానము పస సుప్రసన్ను'లకు అన్న పరమానం దయతి 'సంపంగిమన్నా' శతకపద్యం నొక్కిచెప్పే సత్యమూ ఇదే. శేషము వేంకటపతి శశాంకవిజయంలో చెప్పినట్లు 'చెరకునకు పండు, పసిడికి పరిమళమును, చిత్రమునకు ప్రాణంబును, తా/ నరుదగ గల్గిన రీతిని' నరునికి విద్య అదనపు శోభాభరణం. ' లేశమేని సద్విద్య లేనివాడు/ శోభగాంచడు నిర్గంధ సుమము వోలె ' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తిలో కాదని కొట్టిపారేసే అతిశయోక్తి రవంతైనా లేదు. 


కోటి విద్యలు కూటి కొరకేనని సామెత.  మేదిన గల విద్యలన్నీ మెతుకుల కొరకేననడం సగం సత్యమే! అందరూ 'కూరగాయల' కోసమే చదువులు సాగిస్తే మనకు సౌందర్యలహరులు, కుమారసంభవాలు సంభవించేవా! 'తత్తరపడి యా ఉత్త చదువులు చదివితే తత్వ విచారంబయ్యేనా? / యుత్తమమైన నూరేండ్లు దాటినా ఉత్తమ పురుషుండ య్యేనా? ' అని ఏనాడో వీరబ్రహ్మేంద్రస్వామి డంబాల చదువును నిలదీశాడు. 'అసమాన దానవిద్యా రసికత లేనట్టి నరుని బ్రతుకేటికి సీ కసవేరు కతికి బ్రదుకదె/ పసరము తన కడుపునిండ' అని పర్వత కొండా శతకంలోని ఎత్తిపొడుపు. నార్లవారు అన్నట్లు- విజ్ఞతలేని విద్య ఎంత ఆర్జించినా ఏం లాభం? పేరు చూసి పిండినంత మాత్రాన నేతి బీరలోనుంచి నేయి కారుతుందా! 'పండితుండు' అని ప్రగల్భాలు పలి కినంత మాత్రాన నోటినుంచి రాలేవన్నీ ఆణిముత్యాలేననుకోవడం భ్రమ. మనిషిని మనిషి తినే కరవుకాలం విరుచుకుపడి ఒక పేద ద్విజుడు బతుకుతెరువు కోసం ఊరు విడిచిపోయే పనిలో పడ్డాడు. శివుడు కరుణించి అరవబాసలో స్వయంగా ఒక పద్యం చేసి పురాన్నేలే  రాజుకు సమర్పించి వెచ్చం తెచ్చుకొమ్మని ఆ పురోహితుడిని పురమాయించిన కథ ధూర్జటి విరచిత శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో ఉంది. 'సింధురరాజ గమనా ధమ్మిల్ల బంధంబు సహజగంధం' అనే ప్రయోగ ఔచిత్యాన్ని రాజాస్థానకవి నత్కీరుడు ఆక్షేపిస్తే యాయవారం అయ్య వారి దగ్గర తిరుగు సమాధానమేది? చివరికి దక్కింది నిండుసభలో ఘోరపరాభవమే. శరీరపాటవం, మంచివాక్కు, పరిశుభ్రమైన దుస్తులు సంపదలు కలిగి ఉంటేనే లోకం గౌరవించేది. బంగారానికి సువాసన లాగా సింగారానికి నిజంగా మన్నన దక్కేది స్వయంగా సాధించుకున్న విద్యాసుగంధంవల్లనే. 'విజ్ఞానం మహాభాగ్యం' అన్న అబ్దుల్ కలాం సూక్తి ఎన్ని యుగాలకైనా వర్తించే సుభాషితం.


హెలెన్ కెల్లర్ ఈ వాస్తవానికి వర్తమాన ఉత్తమ ఉదాహరణ. మాట వినలేని, లోకాన్ని చూడలేని అనేకమంది అభాగ్యుల్లో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది అంతులేని విద్యార్జన  అనే తపనే! 'వేడినీరు' స్వభావ స్వరూపాలను స్వయంగా అనుభవంలోకి తెచ్చుకునేందుకు మసిలే నీటిని ఒంటిమీద వంపించుకుంటూ ఒక్కో అక్షర ఉచ్ఛారణ సాధన చేసిన తెగువ ఆ మగువది. నిరామయ నిశ్శబ్ద నీరవ నిశ్చల నిబిడాంధకార మస్తిష్కంనుంచి నిబద్ధతతో మేధను సానబట్టింది కాబట్టే 'ది స్టోరీ ఆఫ్ లైఫ్' అనే ఉత్కృష్ట గ్రంథకర్తగా ఆమె చరిత్రలో మిగిలిపోయింది. ఏళ్లతరబడి ఏకాంతవాసంలో గడపాల్సిన దురదృష్ట దుర్దినాలలో  సైతం నెల్సన్ మండేలా నమ్ముకున్నది బుద్ధిమాంద్యపు ఉపద్రవానికి నిరంతర పఠనం అనే మంచిమందు. గోడలను కాగితాలుగా కొనగోళ్లను కలం పుల్లలుగా మలచి కారాగారంలోనే గణితాభ్యాసం చేసిన జ్ఞాని కథ ' కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో' ది . అధ్యయనం చేయాలన్న ఆసక్తి ఉండాలేగాని ఆర్కిమెడిస్ సూత్రంనుంచి ఆవకాయ పాళ్ల దాకా అన్నీ ఆనందం కలిగించే అంశాలే! 'పెక్కులు చదివిన బెనగు దోడనే/తెక్కుల పలు సందేహముల'  అన్న అన్నమయ్యవారి సందేహానికి చిన్నయసూరి ' పంచతంత్రం' లోని  ' విద్య పలు సందియములు దొలచును/వెలయించు నగోచరార్థ విజ్ఞానము' అన్న సూక్తే చక్కని సమాధానం. విజ్ఞానంతోపాటు విద్య ఆనందాన్ని అందిస్తుందని బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం తాజా సర్వేలో తేలిందంటున్నారు నిర్వాహ కులు, అధిక విద్యార్హతలు కలిగిన వారిలో 81శాతం, అల్పవిద్యావంతులలో  74శాతం, నిరక్షర కుక్షులలో  64శాతం ఆనందకరమైన  జీవితాలు గడుపుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ' అవ్యక్త నిధిని తూచేందుకు మనిషి దగ్గరున్న పడికట్టు రాయి అక్షరం ఒక్కటే'  అంటారు ఖలీల్ జిబ్రాన్. ఆ అక్షరానికి ఆనందం అనే విలువ జోడించాలి. అప్పుడది మనిషి విలువను మరింతగా పెంచుతుంది!


రచన-కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )

Thursday, December 30, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక చట్టం నిజమైన చుట్టం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


చట్టం నిజమైన చుట్టం 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 ) 



" వినియోగదారుడు అంటే ఎవరండీ" అని అడిగా మా వారిని ఇవాళ పొద్దున. 


 అటునుంచి సమాధానం లేదు. 


ఒకటి అడిగితే పొంతనలేకుండా పది జవాబులు చెప్పే మన రాహుల్ బాబు  జబ్బు కొద్దిగా మా వారికీ కద్దు . అయినా ఏ బదులూ లేకపోయేసరికి కంగారని పించింది. దాంతో లోపల గదిలోకి తొంగి చూశా. ఆయన యోగాలో  ఉన్నారు. 'శవాసనం' వేస్తుండబట్టి మన ప్రశ్న చెవిలోకి వెళ్లినట్లు లేదు. సమాధానం తెలియక అలా శవాసనం నటిస్తున్నారా.. చెప్మా ? 


ఎంతైనా మగవాడు.. మొగుడుగారు.  చట్టసభల్లో ప్రతిపక్షాలు నిలదీసి అడిగినట్లు అడిగితే భర్తగారి అహం దెబ్బతీసినట్లు అవుతుందేమోనన్న సందేహం నాది. అందుకే నా ప్రశ్నకు నేనే సమాధానాలు వెదుక్కునే పనిలో పడ్డా... పేపరు చూస్తూ:


' వినియోగదారుడు' అంటే మరీ బరువైన పదంలా ఉంటుంది. నాలాంటి మధ్యతరగతి ఇల్లాలికి అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ' వాడేవాడు' అనుకోవచ్చేమో . వాడే .. వీడు' అని ఇదివరకో అపరాధ పరిశోధన నవల చదివా. దానికి ఈ శీర్షికకు పోలికేమన్నా ఉందా?


అదేదో పతివ్రతల ప్రతంచేసి నారదులవారికి కృష్ణమూర్తిని దానం చేస్తుంది గదా శ్రీకృష్ణ తులాభారంలో సత్య భామ! మళ్ళీ మొగుణ్ని కొనుక్కోవడానికి ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ తక్కెట్లో  పోసినా బరువు తూగదు . మా వారికి మల్లే ఆ నల్లనయ్యకూ ఉదయం పూట వ్యాయామం అంటే మహాబద్ధకం అనుకుంటా. మరి, రుక్మిణీభామ  వచ్చి ఇల్లా మొక్కి అల్లా ఒక్క తులసాకు వేసీ వెయ్యగానే ఎలా తూగినట్లు? అంతా కృష్ణలీల' అను కుంటాంగానీ, మరీ లోతుగా ఆలోచిస్తే ఇందులోనూ ఎక్కడో 'మాయ' కొట్టడం లేదూ!


తూకాలూ కొలతలూ ఉన్నచోట ఈ మాయా మర్మం తప్పనిసరేమో! పెట్రోలు బంకుల్లో ఈమధ్య ఇట్లాంటి మాయలేగా బయటపడి పెద్ద రభస జరిగింది ! 


మా వారితో కలిసి బండిమీద బయటకు వెళ్లినప్పుడు నేను ఈ బంకుల్లో పెట్రోలు పోసేటప్పుడు చూస్తుండేదాన్ని. ఈయనగారు  కనీసం మీటరు వంక చూసి ' ఇదేమిట' ని గట్టిగా గదమాయించడానికీ   మహా మొహమాటం! అక్కడికీ  నాకు అనుమానం వచ్చి అడగబోయినా, నా నోరు మూయించడానికి మాత్రం గట్టిగా దబాయించేస్తారు . కొనే వాళ్లం మంచి సరకు కోరడం మన హక్కు కాదూ!


వారానికోసారి నేనే రైతుబజారు దాకా పోయి కూరగాయలు అవీ తెచ్చుకుంటా.  ఉన్నంతలో మంచివి ఏరుకుని, బేరమాడి కొనాలంటే ఈయనగారివల్ల కాదన్న సంగతి మా పెళ్లయిన కొత్తలోనే తేలిపోయిందిలేండి. 


నట్టింట్లో సోఫాకు చేరగిలబడి టీవీ చూస్తూనో, పేపరు తిర

గేస్తూనో, చట్టసభలో ప్రతిపక్షనాయకుడి మోడల్లో  తెగ రెచ్చిపోతే- మంచి సరకు మనింటికి వస్తుందా? 


నోటీసూ పాడూ ఇవ్వకుండానే అప్పటికప్పుడు ఇంటి అద్దె హఠాత్తుగా వంద పెంచినా సరే పళ్లికిలించుకుంటూ ఇచ్చుకుంటారేగానీ ' ఇదేంటీ అన్యాయం. ఇలా మూణ్లెల్ల కోసారి చొప్పున పెంచుకుంటూ పోవడానికి మీకేం హక్కుంది' అని కనీసం మాట వరసకైనా అనరే! 


 నాకైతే కడుపు మండుతూనే ఉంటుంది. నాలుగు దులు

పుదామనే ఉంటుంది. కాని, ఇద్దరు మగాళ్ల మధ్య

మనం నోరు చేసుకోవడం మర్యాద కాదని మౌనం

వహిస్తా.  మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్

అవస్థే నాదీనూ! 


ఇలాంటి వ్యవహారాల్లో మగవాళ్లకన్నా మన ఆడంగులే ఎంతో మెరుగు. బేరాల విషయాల్లో ఒక పట్టాన రాజీపడనే పడం. మా

ఫ్లాట్స్ మహిళాబృందం మొత్తం దుకాణాలకు వెళ్లినప్పుడు

చూడాలి తమాషా!  పక్కపిన్నుల్నైనా సరే పదిసార్లు అటూ

ఇటూ వంచి చూడందే ఎంచుకోం. ఇక చీరెల బేరమైతే సరే

సరి ! ఉచిత కానుకలు, భారీ డిస్కౌంట్ల విషయంలో

మహా బలహీనులమైపోతుంటాం. ఆ విషయంలో మాత్రం మనం అబలలం! మరేం చెయ్యాలి చెప్పండి! లోకం చూస్తే విజయావారి ' మాయాబజారు' మార్కు, విపణి వీధి అంత కంగాళీగా ఉందని నిన్న ఎక్కడో చదివా. తాను సుఖంగా బతకడం కోసం లోకంలోని ఏ వస్తువునైనా తెగనమ్మడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు.  మరి అందుకే ఉచితమనే మాట

ఎంతగా వినిపిస్తే- కొనే విషయంలో అంత ఎక్కువ

జాగ్రత్త తీసుకోవాలి మనం.


ఈ ఎన్నికల్లో చూస్తున్నాంగా ! అమూల్యమైన ఓటును,

సొంతం చేసుకునేందుకు  ఎంత ధరైనా  పెట్టే దొరలు

ఊళ్ల మీదపడి తెగ తిరిగేస్తున్నారు. ప్రజాస్వామ్య

మంటే ఒక పెద్ద బజారులాగుంది. ఎన్నికలు వచ్చినప్పు ఎన్నో పార్టీల దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో

అభ్యర్థులు అమ్మకానికి పెట్టిన సరకు కొనే ఓటర్లం

ఎంత అప్రమత్తంగా ఉండాలి?


అందమైన రంగుల కాగితాల్లో చుట్టి ఆకర్షణీయంగా

తయారుచేసిన ప్యాకెట్లు గదండీ ఈ పార్టీల మేనిఫె

స్టోలు! 


ఒక పార్టీ ఉచిత విద్యుత్ ,సగం ధరకే నీళ్లు, ఖర్చు లేని చదువులు, కూర్చోపెట్టి మేపే ఆహార పథకాలు.. గట్రా గట్రా  ఇస్తామంటుంది. ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఘడియ నుంచే వరస పెట్టి ఉపకార వేతనాలు, పసివయసు నుంచే పింఛన్లు, ఉచితంగా గుండె ఆపరేషన్లు, సాగు చేసుకునేందుకు  వ్యవసాయ భూములు .. లాంటివి సవాలక్ష ఇచ్చే దస్త్రాల మీద సంతకాలు చేసుకుంటూ పోతామంటుంది. ఇంకో పార్టీ ఇదివరకు చేసిన అప్పులు కొట్టిపారేస్తాం. ముందు ముందు కొట్టిపారేసే అప్పులు కొత్తగా ఇప్పిస్తాం. పొరుగు రాష్ట్రాలలో  పారే నదులకు గండ్లు  కొట్టిస్తాం .. అంటూ హామీలు గుప్పిస్తుంది. మావారు దినం తప్పకుండా పారాయణం చేసే ' శ్రీశ్రీ సంధ్యాసమస్యలు' లాంటి సందిగ్ధంలో పడిపోతున్నాడు సామాన్య ఓటరు. 


బెర్లిన్ గోడముక్కలు కూడా మన వాడ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాయి. మరిక సందిగ్ధంలో పడిపోవడం వినియోగదారుడి ముఖ్య లక్షణం లాగుంది. 


పెళ్లికొడుకుల విషయంలో ఆడపిల్లలు ఇలాగే అయోమయంలో పడిపోతుంటారు. పెళ్లిచూపులకొ చ్చిన వాళ్ల  లోపలంతా  ఎంత లొటారంగా ఉందో కనిపెట్టకుండా పైన పటారం చూసి పడిపోతే జీవితాంతం చెత్త సరకుతో సర్దుకుపోవాలి సుమా! 


పటాటోపం చూసే పిల్లల్ని ఈ సోకాల్డ్  ఈ - స్కూళ్లల్లో పడేస్తే, బీటెక్కులు పూర్తిచేసినా బిడ్డలకు బయోడాటాకు స్పెల్లింగైనా రాదు.


పట్టాలు, భూమి పట్టాలు, బిరుదులు, బాబాల దగ్గర బంగారం, శివలింగాలు, రాజధాని వంకతో రాళ్ల దిబ్బలు, సర్వేల పేరుతో అనుకూల ఫలితాలు, విశ్లేషణల నెపంతో విపక్షాల  మీద చిమ్మేందుకు విషపు వార్తలు, చివరికి బిడ్డల్ని  కని పెట్టేందుకు అమ్మ కడుపులు కూడా అమ్మ కానికి దొరుకుతున్న వ్యాపార యుగమిది. అందుకే ' వాడే'  వాడు, అదేనండీ ' వినియోగదారుడు ' ఎంతో వివేకంతో విచక్షణను ఉపయోగించాలిప్పుడు. 


అందరూ మా వారంత అమాయకంగా ఉంటే, అనక మా సంసారమంత సంబడంగా  తయారవుతుంది వ్యవహారం.  బజారులో వినియో గదారుడే నిజమైన రాజు. ఆ రాజాధి రాజు  వినియోగదారుడికి ఎన్నో హక్కులుంటాయిట. 


ఏది మేలైన సరకో తెలుసుకునే హక్కు, కొన్న సరుకు  మన్నికైందనీ, ముందు ముందు మన మెడకు గుదిబండగా మారదని అమ్మేవాడి నుంచి భరోసా పొందే హక్కు, 'ఐఎస్ఐ' ' ఆగమార్క్' ప్రమాణా లకు తగ్గలేదని నిర్ధారించుకునే హక్కు, ఎన్నో రకాల నుంచి మేలురకాన్ని మాత్రమే కోరుకునే హక్కు. ఇట్లా!  నోరు నొక్కుకుని కూర్చుంటే ఎన్ని హక్కులుంటే మాత్రం.

ఏం ఉపయోగం? 


 ఉచితంగా వస్తుందని, సగం ధరకే దొరుకుతుందని, కంటికి నదురుగా ఉందని, పక్కింటి పిన్నిగారు కొన్నదనీ మనమూ తొందరపడి అమ్మేవాడి మాయలో పడిపోతే  కష్టమేసుమండీ!  


 మా వారస్తమానం అలా కాయితాల మీద వూరికే గీకినట్లు    'వినియోగదారుడికి హక్కుల చట్టం '  వూరికే రాలేదు.  ఆ చట్టం..  ' వాడే ' వాడికి నిజమైన చుట్టం సుమండీ! 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 ) 

ఈనాడు- హాస్యం - వ్యంగ్యం - గల్పిక ఎన్నో దృష్టాంతాలు - రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 200


 




ఈనాడు-  హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

ఎన్నో దృష్టాంతాలు 


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 2009 ) 


పరమాత్ముడైనా ఆ పరంధాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అతని పాదుకలు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండానే  దర్జాగా అయోధ్యా సింహాసనాన్నెక్కి కూర్చు న్నాయి! అదృష్టమంటే అదే! 


లక్కుంటే  ఎడారిలో ఉన్నా ఏనుగు వెదుక్కుంటూ వచ్చి గజమాల మెళ్లో వేసేస్తుంది. దీన్నే 'తంతే బూరెల బుట్టలో పడటం' అంటారు. అలా పడాలని బుట్ట ముందు నిలబడి తన్నించుకున్నా తలరాత బాలేక పోతే  పక్కనున్న బురదలో  పడొచ్చు.


' అదృష్టం అదృశ్యం అప్పాచెల్లెళ్లు . రెండూ కంటికి కనిపించేవికావు . దీనికి దృష్టాంతాలేగానీ సిద్ధాంతాలుండవు. 


అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలం మీద దిగేముందు ఇరవై నిమిషాలకు సరిపడే  ఇంధనం మాత్రమే మిగిలుందట. అదృష్టం అట్లా కలిసిరావాలి. అది కలిసి రావాలని   నిర్బంధంగా పెట్టుకునే  పచ్చలరాయి తినే పచ్చడన్నంలో కలిసిపోయి గొంతుకు అడ్డంపడి చచ్చినా చావచ్చు. 


ప్రారబ్దానికి  ఏ శబ్దార్ధకౌముదీ అసలైన అర్థం చెప్పలేదు. ఖర్మానికి ధర్మాధర్మ విచక్షణలుండవు.  'గీత ' చెబుతూనే ఉంది గదా.. పూర్వజన్మ సుకృతమ నేది ఉందే... అది ఏ నిర్వచనానికీ అందనిదని .


టైమ్ బాగా లేకపోతే భోలకప్పూర్ నల్లా నీరే కాదు.... మినరల్ వాటరూ కాలకూటమైపోతుందట! ఏదేమైనా రాజకీయాలు పత్తి మార్కెట్ల మాదిరిగా తయారయ్యాయనేది నూటికి నూరుపాళ్ళు నిజం.  జనాలని నమ్ముకోవాల్సిందిపోయి, అభ్యర్థుల జాతక చక్రాలను నమ్ముకుంది మొన్నటి ఎన్నికల్లో జయలలితమ్మాళ్: మన దగ్గర ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తం పార్టీ చీట్లు తీసినట్లు!  గోడదూకే వాళ్లెక్కువైపోతున్నారని గోడను మరింత ఎత్తుగా కట్టుకుంది  ఓ జనం పార్టీ.  ఓటమికి గుర్తు కలిసి రావటంలేదనుకుంటోందేగానీ , జనంలో గుర్తింపులేదని ఇంకా గుర్తించలేకుండా ఉంది ఇంకో కొత్తపార్టీ! 


నేతల తలరాతలను తేల్చేది నిజానికి అయిదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ, ఎత్తులూ తాయెత్తులూ కానేకాదని ఇన్నేళ్లకైనా  ప్రజాప్రతి నాయకులనుకునేవాళ్ళ కళ్లు తెరిపిడి పడకపోవడమేమిటి! 


రోజులూ అట్లాగే ఏడ్చాయి. ఎన్నికల్లో గెల్చినోడు సరిగ్గా  ప్రమాణస్వీకారం చేసే రోజే ప్రాణాల మీదకు తెచ్చుకుంటే , యావజ్జీవం పడినవాడు దర్జాగా బయటకొచ్చి పచ్చి చీకటి  వ్యాపారం  చేసుకుంటాడు. రాసిపెట్టుంటే చర్లపల్లిలో ఉన్నా బిర్యానీ పొట్లాలు, సిమ్ కార్డులు సరఫరా ఆగవు ! నూకలు చెల్లిపోతే  గోకులాచాట్ కెళ్ళినా ప్రాణాలు పోతాయిమరి ! దేవుడు దయతలచి ' ఊ ' అన్నా పూజారి పుణ్యముంటేనేగాని ప్రసాదమైనా దక్కని ఈ కాలంలో ముందు పూజారిగారి మనసు మనవైపు మళ్లటమే  అసలు అదృష్టానికి సిసలు దృష్టాంతం.  


కాలం కలిసిరాదనుకో !  పెట్టుకున్న  'నానో' కారు ఫ్యాక్టరీకీ  రెక్కలొచ్చి ఎటెటో ఎగిరిపోతుంది! చేటుకాలం తోసుకొస్తే జైకొట్టిన చేతులే చెప్పులు విసిరేస్తే చేటు కాలం  దాపురించింది వేరే చెప్పాలా? అందుకే అదృష్టం మీదందరికీ కన్ను . అదృష్టమేమన్నా మన గర్ల్ ఫ్రెండా, చప్పట్లు కొట్టి పిలిస్తే 'హాయ్|  అంటూ చప్పునొచ్చేసి వచ్చి ఒళ్ళో వాలిపోవటానికి!


సోనియాజీ 2004లో ప్రధాని పదవికి మన్మోహన్ సింగు గారిని సూచించింది. అప్పటికి  ఆయన లోక సభ  సభ్యుడు కూడా కాదు. దేశానికి సేవ చేయాలని రాసిపెట్టి ఉంది. అంచేతనే ఆయన అంత పెద్ద నేతయారు. 


రాసిపెట్టి ఉంటే ఎక్కడున్నా దక్కుతుందనే సిద్ధాంతం నమ్మకముంటే రాద్ధాంతాలు చేయనక్కర్లే!


దేనికోసమూ దేబిరించకుండా  దేవుడిచ్చిన  పాత్రను సక్రమంగా పోషించడమే స్థితప్రజ్ఞుడి విజ్ఞత.  


జీవితం ఒక పాత్రఅనుకో! కింది సగం కృషి, పై సగం అదృష్టం. అదృష్టం నోటిదాకా రావాలంటే  కృషి చేయక తప్పదు.


దుర్యోధనుడు ధర్మరాజుతో  జూదమాడి గెలిచింది అదృష్టం వల్లకాదు... శకుని పాచికలవల్ల.  గురు త్వాకర్షణశక్తి సూత్రం తట్టినప్పుడే  న్యూటన్ ఆ ఆపిల్ చెట్టు కింద చేరడమూ  అదృష్టంవల్ల కాదు... ఆపిల్ పండు నేల రాలిపడ్డంతో సహా అంతా కాకతాళీయం. సముద్ర తీరం దాటేముందు వాయుగుండం ఏ సిద్ధాంత గ్రంథమూ తిరగేయదు. వాటాన్ని బట్టి జరిగే ఆ పకృతి చర్యను ఏ యాగమూ యజ్ఞమూ ఆపలేదు. 


తలరాతలు మనచేత్తో మనమే రాసుకునేవి: ఆ సత్యం  సత్యంరాజు ఉదంతం సుస్పష్టంగా తెలియచేస్తోంది . అయినా ఇంకా అదృష్టం చూరు  పట్టుకు  వేలాట్టం  కార్యశూరులు  చేయవలసిన  చర్యేనా? !


అదృష్టలక్ష్మి వద్దన్నా వచ్చి మన ఇంటి తలుపు ఎప్పుడో ఓరోజు తట్టి తీరుతుంది . ఆ టైమ్ మన బెడ్ టైం కాకపోవడమే అదృష్టం . 


ఇప్పుడైనా మన అదృష్టానికేం లోటు?! స్వైన్ ఫ్లూ   సీజన్లో జల్లీ ఫ్లూ రావడమే అదృష్టం.  వానల్లేని  కార్తెల్లోను బలవంతంగా బ్యాంకు లోన్లు అంటకట్టడం లేదు. అదీ అదృష్టమే.  అమెరికాలోనూ మాంద్యమున్న రోజుల్లో మన దగ్గర ఉద్యోగాలాట్టే ఉడటంలేదు. అదీ అదృష్టమే.  కందిపప్పుకి బదులు పెసర పప్పు, సన్నబియ్యం ప్లేసులో  దొడ్డుబియ్య బలవంతంగా సంచుల్లో  పొయ్యడం  లే.. లక్కు! లేటయితేనేమిగాని బైటకెళ్లిన ఆడపిల్లల ఏ యాసిడ్ దాడుల్లేకుండా  ఇళ్లు చేరుతున్నారు. అదెంత అదృష్టం! 


ఇట్లా నాలుగైదు ముక్కలయినా అదృష్టానికి దృష్టాంతాలుగా రాయడానికి మిగలడం రచయితగా  నా అదృష్టం . 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 2009 ) 



ఈనాడు- సంపాదకీయం పాటే మంత్రమూ... రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 )

   ఈనాడు- సంపాదకీయం 


పాటే మంత్రమూ... 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 ) 


దివ్యభావాలతో అమూర్తిని భగవంతుడిగా భావించి ఆరాధించడమే భక్తి. అది తొమ్మిది విధాలు. అందులో సంకీర్తనం ఒకటి. అది సంగీత సంబంధి. రామామాత్యుని స్వరమేళ కళానిధి- స్వర ప్రకరణం ప్రకారం, సంగీతం సామవేద సంగ్రహం. బ్రహ్మ సంగ్రహకర్త. సర్వజ్ఞుడైన శంకరుడు గానసంతుష్టుడు. అనంతుడు సంగీత స్వాధీనుడు. యక్షగంధర్వ దేవదానవ మానవాదులే కాదు... పశుపక్ష్యాదులూ నాదప్రియులు. గాంధర్వం, గానం అని సంగీతం రెండువిధాలు. గంధర్వులు గానంచేసే అనాది స్వరసంప్రదాయం గాంధర్వం. వాగ్గేయకారులు లక్షణయుక్తంగా రచించి దేశీరాగాలతో జనరంజకంగా పాడేది గానం. సంకీర్తనం గానప్రధానం. ఖట్వాంగుడు అనే రాజు ఇంద్రాది దేవతల వరప్రసాదం వల్ల తన ఆయష్షుకాలం ఒక్క ముహూర్తం మాత్రమే అని తెలుసుకుంటాడు. ' గిరులు బోలెడి కరులను/ హరులం దన ప్రాణ దయితలై మనియెడి సుం/ దరులను, హితవరులను, బంధ/ వరులను అందరిని వర్ణించి'  చివరకు గాఢ వైరాగ్యంతో మోక్షం పొందే ముందు నిరంతరాయంగా కొనసాగించింది గోవిందనామ సంకీర్తనమే ! 'ఈ మేను కలిగినందుకు సీతారామ నామమే పల్కవలెను' అని త్యాగరాజస్వామివారి కృతి. ' సకల సంగ్రహము సకల సంచ యము/ అకృత సుకృతమిది హరినామం' అని అన్నమాచార్యులు వారి సంకీర్తనం. 'రాతిరనే ఏనుగునెక్కి- రాకా చంద్రుడు గొడుగు గాను/ లేత తుమ్మెద మొదలైన బలముల చేత గెలిచెదనం టివా?' అంటూ మువ్వగోపాల పదకర్త క్షేత్రయ్య పదం. విరహం, వైరాగ్యం, శృంగారం, వేడుకోలు , అలక, సందేశం, సంతాపం, నుతి, ఎత్తిపొడుపు, బెంగ, పాగల్భ్యం  , బేలతనం- భావన ఏదైతేనేం... పొదిగే పనితనం ఉండాలేగానీ అన్నీ- సంకీర్తనాభరణంలో అందంగా అమిరే మణులూ మాణిక్యాలే!


జానపదం, యక్షగానం, జావళులవలె సంకీర్తనా ఒకానొక కాలంలో ముమ్మరంగా వెలిగిన దాఖలాలు కద్దు . సంకీర్తన ప్రక్రి యకు లక్షణాలు నిర్దేశించి, వేలకొద్ది గేయాలను సృజించిన పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. అన్నమయ్య వంశంలోని పన్నెండుమంది కవులు స్వయంగా సంకీర్తన కర్తలు, ప్రచార నిర్వాహకులు. పెద తిరుమలయ్య తండ్రి సంకీర్తన కర్తృత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తే, ' సంప్రదాయాగత జ్ఞానసహితుడైన మనుజు సత్కవితయు వేదమంత సమము'  (తెలుగు సంకీర్తన లక్షణం-23) అంటూ సంకీర్తనాక్రియకు వేదప్రామాణికతను ప్రసాదించినవాడు చినతిరుమలాచార్యుడు. భక్తి అంటే రాతి విగ్రహం ముందు మోకరిల్లి మనసులోని కోరికలన్నీ ఏకరువు పెట్టడం ఒక్కటే కాదు. డాక్టర్ శ్రీపాద పినాకపాణివారన్నట్లు హృదయానుభవ భావమాధుర్యాన్ని బాహాటమైన పదాలతో ప్రకటించుకోవడమూ ఒక రకమైన భక్తిమార్గమే. భక్త మీరాబాయి కృష్ణప్రే మలో మునిగి భజనలు చేసినా, తుకారాం పాండురంగడిమీది అపరిమిత ప్రేమతో అభంగాలు గానం చేసినా, పురందరదాసు సుందరీమణుల ముందువెనకలనున్న శ్యామసుందరుడి అందచం దాలను పదాలుగా పలికినా- సంకీర్తనార్చనలోని అంతర్భాగాలే అవన్నీ. గీతాంజలి - ఈశ్వరుడికి టాగోర్ పట్టిన కీర్తనల హారతి. 'సానుతాప గానముతో సానురాగ గీతముతో/ మేనుమరచి నిన్నె వలచి/ వెదుకుచుంటి... వేచియుంటి' అంటూ బ్రహ్మసమాజం కోసం కృష్ణశాస్త్రి కలంనుంచి జాలువారిన సంకీర్తనలు ఎన్నెన్నో! తూము నరసింహదాసునుంచి ఎడ్ల రామదాసుదాకా తెలుగు సంకీ ర్తన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులు ఎందరో! 'చింతలేదిక యేసు పుట్టెను/ వింతగను బెత్లహేమందున' అంటూ అతిలోకదైవం మితిలేని ప్రేమను ప్రతి పదంలో ప్రతిధ్వనిస్తూ యేసుభక్తులు చేసే కీర్తనలు, ఉర్దూ భాషామయ గీతికలను వచ్చిన లిపిలో రాసుకుని ఖురాను సమీపభావంతో అల్లా దయను కీర్తించే మొహరం గీతాలు- సంకీర్తనారాధనకు మతాలు ఎల్లలు లేవనేదానికి సంకేతాలు. 


వాంఛితార్థాలు తీరడం ఎలా ఉన్నా... పారవశ్యంతో సంకీ ర్తన గానం సాగించే నాదోపాసకులు మానసికంగా పొందే సాంత్వన అనిర్వచనీయం. 'పాట దైవసన్నిధికి బాట' అని పరమ భాగవతుల విశ్వాసం. ఇష్టమూర్తుల సద్గుణాలను పదపదంలో ప్రశంసిస్తూ ప్రతి పదానికి మానసికంగా అర్థాన్ని అనుభవించే సంకీర్తనా ప్రక్రియలో చైతన్యం వలయాలుగా ప్రసారమవుతూ మనసును ఆనందలోకాల విహారానికి మోసుకెళుతుంది. భక్తితత్వం అంటే కేవలం దైవసంబంధమనే భావన సగమే సత్యం. సామాజిక రుగ్మతలమీద విముఖతతో కూడుకున్న వైరాగ్య భావాలనుంచీ తత్వాల రూపంలో వెలువడ్డ సంకీర్తన సాహిత్యం తెలుగులో బోలెడంత. మేలుకొలుపులు, జోలపాటలు, పవ్వళింపులు, మంగళహార తులు, నీతిబోధనలు, బైరాగి గీతాలు, దేశభక్తి గీతాలు... సంకీర్తన ప్రక్రియకు బహుముఖ రూపాలు. కీర్తనల ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలిందిప్పుడు. మతిమరుపు వ్యాధిపీడితులు వందమందిమీద కీర్తన క్రియాత్మక ధ్యాన పద్ధతులను ప్రయోగించగా అందరి జన్యువుల్లో సానుకూల స్పందనలు నమోదయ్యాయని పరిశోధక బృందం తేల్చి చెప్పింది. ఆత్మాశ్రయం, అనుభూతి, ఆవే దనలనుంచి సాంత్వనను కలిగించే కీర్తనల ప్రక్రియ- మతిమరుపు రుగ్మత నిదానానికి ఔషధంగా ఉపయోగపడుతుందని తేలటం సంతోషించదగ్గ పరిణామమేగా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 ) 

Wednesday, December 29, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక బెక బెక రాజకీయం రచన - కర్లపాలెంహనుమంతరావు ( ప్రచురితం - 12 - 03-2014 )


 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

బెక బెక రాజకీయం 

రచన - కర్లపాలెంహనుమంతరావు

( ప్రచురితం - 12 - 03-2014 ) 


'కప్పుల బెకబెకలు మరీ ఎక్కువైపోతున్నాయి. రాత్రుళ్లే కాదు. పగలూ నిద్రపట్టడం లేదు ఈ కప్పుల గోలకు' '


అకాల వర్షాలు కదన్నా! కప్పల సందడి ఆ మాత్రమన్నా ఉండదా? 


ఆ కప్పులు కాదురా వెంగళప్పా నా గోల ! ఈ రాజకీయ గోదురు కప్పుల గురించిరా బాబూ!  ఇప్పటిదాకా ఏ రాళ్ల కడుపుల్లో వెచ్చగా బబ్బున్నాయోగానీ, నాలుగు చినుకులు పడేసరికి బొబ్బలు మొదలు పెడుతున్నాయి.


వానలన్నాక కప్పలు, ఎన్నికలన్నాక రాజకీయ కప్పలు సహజమే కదన్నా! కాకపోతే లోపల ' కాక ' మరీ ఎక్కువైనట్లుంది . ఈసారి ఎప్పటికన్నా కాస్త ఎక్కువగా బయటపడుతున్నాయి.


కొత్త కప్పలు  కూడా ఎక్కడెక్కడినుంచో పుట్టుకొస్తున్నాయప్పా !  అంతంత గొంతులేసుకుని గంతులేస్తున్నాయి. గోకప్పల్ని మించి ముదిరిపోతున్నాయి. దురు


ఇప్పట్నుంచే కప్పల్ని తిట్టుకుంటూ కూర్చుంటే లాభమేముం చెప్పన్నా! కప్పల్ని కన్నా ఆకాల వర్షాల్ని అనాలి గాని! నిన్నమొన్నటి దాకా ఎక్కడా ఒక్క వాన చుక్క కనిపించలేదు. గంగానమ్మ జాతర్ల నుంచి గాడిదల జంటలకు పెళ్ళిళ్ల దాకా దేన్నీ వదిలిపెట్టింది లేదు కాదా మనవాళ్లు!  అందుకేనేమో చాలా కాలం తరువాత వానలు దంచి  కొడుతున్నాయి .


వట్టి వానలైతే ఫర్వాలేదురా అబ్బీ ఒకవంక ప్రాణాలు తీసే వడగళ్లతోపాటు కప్పుల గోలా  మాలావుగా ఉంది . మరోవంక ఎన్నికల మీద ఎన్ని కలు జనాలు నెత్తిన పిడుగుల్లా వచ్చి పడి కష్టం రెట్టింపైంది. ఎన్నికలనేవి అసలు లేకుండా పోయుంటే, ఈ రాజకీయ కప్పుల వంగుళ్లు దూకుళ్ల గోలన్నా తప్పిఉండేది కదా!


ఉగ్రవాదుల మాదిరిగా వాదిస్తున్నావేందన్నా! ఎన్నికలు ఉండబట్టే గదా మనలాంటి ఓడమల్లయ్యలున్నా రని పెద్దమనుషులకు తెలిసొచ్చేది! .నియంతృత్వం మీదకానీ మోజు పెరుగుతోందా ఏంది నీకు! 


అక్కడికి ఇప్పుడు నడుస్తున్నదంతా పెద్ద ప్రజాస్వా మ్యమే అయినట్లు!  నాకు తెలీక అడుగుతా, రెండింటికీ తేడా ఎక్కడుందిరా? ఓట్టేసి అనక నోర్మూసుకుని ఉంటాం. నియంతృత్వంలో.  నియంతల పాలనలో  ఆ ఓట్ల పాట్లూ  ఉండవు అంతే! 


సే భాషలో నువ్వేం చెప్పినా, ఎన్నికలనేవి ఉండబట్టే మనకు ఈ మాత్రమైనా మంచి జరుగుతోంది. నగదు బదిలీ రోగం వదిలిందా ! వంటగ్యాస్ సిలిండర్లు మళ్ళీ గతంలోలా పన్నెండు వరకూ దిగిందా! చిల్లర వ్యాపా రాలు చేసుకునేవాళ్లకు పోలీసు మార్కు  సత్కారాలు తప్పుతు

న్నాయా! కోరలున్నా లేకపోయినా లోక్ పాలు  బిల్లంటూ ఓటి ముందుకు కదిలిందా! ఎన్నికలే  లేకుంటే ఈ మాత్రమైనా జనం గురించి ఆలోచించేవాళ్లీ  గద్దెల మీది  పెద్ద ప్రభువులు? 


ఎన్నికలపై నాకూ తప్పుడు అభిప్రాయమేమీ లేదురా అబ్బీ!  జరుగుతున్న తంతు గురించే నా దిగులంతా ! ఎన్నికలనేసరికి ఎక్కడలేని హడావుడి .. హంగామా!  వేడివేడి పెసరట్టులాగా ఉదయాన్నే వార్తలొచ్చేస్తాయి. ఈ అల్పాహారం రుచికి అలవాటు ఓటరు పౌష్టికాహారం పూర్తిగా పక్కన పెట్టేస్తాడన్నదే నా బాధ. అభివృద్ధి గురించి గానీ, నిలబెట్టుకోవాల్సిన సంపద గురించి గానీ  ఎక్కడైనా ఒక్క చక్కని చర్చ జరుగుతోందా? ఎన్నికలకు వందరోజుల ముందు మాత్రం విరుగుడు మంత్రంగా మందులేస్తే ఈ దేశానికి పట్టిన పెద్దరోగం నయమవుతుందా? మాయదారి రాజకీయాల మూలంగా కాదూ, మనం వద్దని  ఎంత మొత్తుకున్నా విదేశాల తుక్కు అణుపరిశ్రమలు మన నెత్తిమీదకు వచ్చి పడింది! మనదగ్గరే వీధికొక చిల్లర దుకాణం చల్లగా వ్యాపారం చేసుకుంటున్నా ఏం ఉద్ధరించాలని బలవంతంగా పరాయిగడ్డ దుకాణాలను రుద్దబోయింది। వద్దన్న చోట సెజ్జులు! కావాలన్నా ఇవ్వరు పరిశ్రమలు ! జనం మాట నిదానంగా ఆలకించి ఆచరించిన పాపాన పోయారా మనం ఓట్లేసి గెలిపించిన నేతలు?  


ప్రజాస్వామ్యం అంటే అదేదో పచ్చి కాకరకాయ చేదు అన్నంత వితండంగా వాదిస్తున్నావేందన్నా?  ఎప్పుడో ఒకప్పుడన్నా ఎన్నికలొచ్చి పోయే  సదుపాయం చిన్నదా.. చిత కదా ? ఉత్తప్పుడు ఎంత చెల, రాజకీయాలకు పాల్పడ్డా  , కనీసం ఎన్నికల ముందైనా అంత రాత్మ అంటూ ఒకటి ఏడ్చిందని, , దానికీ అంతో ఇంతో ఆత్మాభిమానం ఉంటుందని, తగిన గుర్తింపు ఇవ్వకుంటే  మొత్తం రాజకీయాలని  తారుమారు చేసేస్తుందని  తెలుస్తుంది గదా! ప్రభుత్వాలని  నడపటం ఎలా, సామాన్యుడి జీవితాన్ని గాడిలో పెట్టడం ఎలా అని ఊరికే ఇంట్లో ఓ మూల కూర్చుని కాగితాలు నలుపు చేసుకునే మేధావులకూ చిన్నదో చితకదో ఒక పార్టీ అంటూ పెట్టుకునే గొప్ప తరుణం ఎన్నికలంటూ ఉండబట్టేగదా వచ్చేదీ! 


అవును . నిజమే పాత పార్టీల్లోంచి కొత్త పార్టీలు పుటుకొస్తున్నాయి.  ఆ కొత్త పార్టీల్లో కొన్ని చీలి, మళ్ళీ పాత పార్టీలో కలుస్తున్నాయి. అవి ఇవి కలకలిసిపోయి, చివరకు కొత్తపార్టీ ఏదో, పాత పార్టీ ఏదో అర్ధమవకుండా పోతుంది . ఇందులోనివారు అందులోకి..  . అందు లోనివారు ఇందులోకి దూకుతున్నారు. వారూ వీరూ ఉమ్మడిగా  ఇంకెందులోకో గెంతుతున్నారు. ఈ దూకపళ్ళు చూసి, కప్పరే తమ స్పెప్పులు  మరచిపోయేట్టున్నాయి. 


ఆగన్నా ఆగు... నాకు తల తిరిగిపోతోంది.


ఈ ఒక్క నాలుగు ముక్కలకే నీకు ఇలా తలా మొలా తిరిగిపోతుంటే, మరి మామూలు మనిషికి ఇంకెంతలా తిరిగిపోవాల్రా... ఆలోచించు!  ధరల పెరుగుదల జోరు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పెట్రోలు బంకుల్లో, బ్యాంకుల్లో బయటపడుతున్న మోసాలు ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవైతే కావు. ఇవాల్టి కివాళ ఆగిపోయేవీ కావు.. విద్యుత్ కోతల సమయం రెట్టింపైంది. ఉద్యోగాలు ఉపాధులు ప్రకటనలకే పరిమితం.  వాస్తవంగా ఒక్కటన్నా వచ్చి ఒరగబెట్టిందేమీ లేదు. చదువులు సాగటం లేదు . సరిగ్గా ప్రైవేటు బస్సులు, బళ్లు జనాల మీదపడి చేసే నిలువుదోపిడికి అడ్డూ ఆపూ లేదు. సైనికుల వాహనాల నుంచి జనతాకు పంచే చిల్లర సరకుల సంచుల దాకా కుంభకోణాలు.  అయినా, ఆ అక్రమార్కులే మళ్ళీ జనం మధ్యకు వచ్చి వాహనాలపై నిలబడి నిజాయతీ గురించి ఉపన్యాసాలు దంచేస్తారు. . జనాలు చప్పట్లు బాదేస్తారు . ఓట్లు రాబట్టుకోవడానికేనా ఎన్నికలు? 


కప్పదాట్లన్నీ  ఓట్లకు సీట్లకు కాకపోతే.. మరెందుకన్నా! 


రచన - కర్లపాలెంహనుమంతరావు

( ప్రచురితం - 12 - 03-2014 ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం పదకొండో అవతారం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

పదకొండో అవతారం 


రచన- కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 ) 


' దేవుడు భక్తులకు వరాలివ్వటం రివాజు. దేవుడిమీదే వరాల జల్లు కురిపిస్తున్నారు మీ భక్తులు ఈ రోజు'  అంది పతిదేవుడి పాదాలు నొక్కుతూ లక్ష్మీదేవి.


దేవుడు ముడుపులకు పడిపోతాడా?' అనడిగాడు శ్రీమన్నారాయణుడు చిద్విలాసంగా అరమోడ్పు కన్నులతో నిద్రను అభినయిస్తూ.


'ద్వాపరంలో తమరు మణిమాణిక్యాలను కూడా కాదని వట్టి తులసిదళానికే దాసులైపోలేదా స్వామీ! అందుకే ఈ కలికాలంలో కూడా ఏ టీవీ పెట్టో, వందనోట్లు పెట్టో దాసోహం చేసుకోవాలని చూస్తున్నారు తమ భక్తులు' అంది లక్ష్మి దెప్పుతున్నట్లు.


దేవుడి నాడి పట్టుకోవడం అంత సులభమా దేవీ! పక్క పార్టీవాళ్ళ రెక్కపుచ్చుకుని లాక్కొచ్చుకున్నంత తేలికని భ్రమ! 


పోయినసారి పదవీ స్వీకారమప్పుడు తమమీదే ప్రమాణం చేశారు గదా దేవా మన భక్తులు.... ఏమైంది? రామవారధి శ్రీరాములవారే కట్టలేదంటున్నారు ఇప్పుడు। అయోధ్యలో ఆలయం కడతామన్న మాటలు టమాటాలంత విలువైనా చేయటం లేదు. 


నిజమే దేవీ ! బెజవాడ దుర్గ విగ్రహానికే నకిలీ బెడద తప్పలేదు. మాటామంతీ నేర్పిన మన విధాతా సతీమణి వాణినే మాతృభాష అని చులకన మంత్రులూ... నాయకులూ' చేస్తున్నారు.


ఆడదానిమీద మీ మగాడికెప్పుడూ శీతకన్నేగా స్వామీ! తమరు కూడా మినహాయింపు కాదు. ఎన్ని యుగాలబట్టి మీ పాదాల దగ్గర ఇలా పడున్నాను... గజేంద్ర మోక్షం నాడు గభాలున అలా చెప్పా పెట్టకుండా లేచెళ్ళిపోయారు। వరాలిచ్చే వేళైనా ఒక్కసారైనా నా సలహా తమరు తీసుకున్నారా? యథా 'దేవా తదా భక్తా! ' . మనిషి మాత్రం మరోలాగా ఎందుకుంటాడు !  అందుకే ' ఆకాశంలో సగానికి పైగా మేము ఉన్నా చట్టసభల్లో మాత్రం అవకాశాలు సున్నా' అంది లక్ష్మి శ్రీవారి పాదాలను మరింత కసిగా మర్ధిస్తూ,


చట్టసభల్లో మాదిరి ఈ కొట్టుకోవటాలేమిటి తల్లీ! అక్కడ మీ గుళ్ళనూ, గుడిలో లింగాలనూ మింగే రాక్ష సులు మళ్ళా పదవుల్లోకి రావాలని యజ్ఞాలు  చేస్తు న్నారు. యాగాలు మీకు.. భోగాలు వాళ్ళకు.  మీ ఆల యాలు అవినీతికి నిలయాలుగా మారాయి నారాయణా! మీ భూమినీ సొమ్మునూ పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రసాదాల్లా పంచుకుంటున్నారు. విడిది గృహాలను విచ్చలవి డిగా వాడుకుంటున్నారు. మీరిలాగే కళ్ళు మూసుకుని తన్మయత్వం నటిస్తుంటే గర్భగుళ్ళలోనూ  తమ పిత్నదేవుళ్ల  విగ్రహాలు ప్రతిష్టించుకునేట్లున్నారు'  అన్నాడు. . అప్పుడే వచ్చిన నారదుడు హడావుడి పడిపోతూ.


నారదుడు చెప్పింది నిజం స్వామీ! తిరుమలలో మనం పవళించే వేళనీ చూడకుండా పైవాళ్ళకు ప్రత్యేక దర్శనాలి వ్వమని వేధించే నాయకులు ఎక్కువైపోతున్నారు. ఏవేవో కల్యాణాల పేర్లు చెప్పి రెండు పట్టుచీరెలు, పంచలూ మన మొహాన కొట్టి ఇన్ని ముత్యాల తలంబ్రాలు తలమీద పోసి పోతే తమ తప్పులకు తలాడిస్తామనుకుంటున్నారు. పండగల వంకలో పేపర్ల నిండా మాది దేవుడి పాలన అని రెండేసి పేజీల ప్రకటనలిచ్చి బ్రహ్మాండంగా ప్రచా రాలు చేసుకుంటున్నారు' అంది లక్ష్మి ఆవేదనగా,


అంతేనా! వేళకు వానలు పడితే వరుణదేవుడు వాళ్ళ పార్టీలోకి మారాడనీ, రెహమానుకి ఆస్కారవార్డు వస్తే అదంతా వాళ్ళ మహిమేననీ, అణు ఒప్పందానికి మీ ఆమోదముద్ర ఎప్పుడో పడి పోయిందనీ, గాంధీగారి కళ్ళజోళ్ళూ.. కాలిజోళ్ళు వాళ్ళు చెబితేనే మీరు వాళ్ళ దేశానికి ఇప్పించారనీ, క్రికెట్లో ఓవరుకు ముఫ్ఫైయారు పరుగులు వాళ్ళ మాటమీదే మీరు యువరాజ్ చేత చేయించారని తెగ డప్పులు కొట్టేసుకుంటున్నారు మహాత్మా! సర్వసాక్షివి నీ పేరునే వాళ్ళు పత్రికలకీ, టీవీలకి వాడుకొంటూ సర్వం నాశనం చేస్తున్నారు. 'అభయహస్తం' అంటేనే జనం భయపడుతున్నారు. దొరకని బియ్యం కిలో రెండు .. దొరికితే ఉల్లి కిలో ఇరవై ! నీళ్ళు లేకుండానే డాములు కడతామంటున్నారు. నకిలీ పైపులు  పగిలి జలయజ్ఞానికన్నా ముందు జలప్రళయం ముంచుకొస్తుందేమోనని జనం వణికి చస్తున్నారు. గుండెనొప్పి వస్తే ఆసుపత్రివైద్యం... ఆకలినొప్పికి మాత్రం కల్తీ మద్యమే వైద్యమట... చోద్యం! ఆణా వడ్డీ నారాయణమంత్రంలాగా అదేపనిగా పదేపదే జపిస్తున్నారు. క్షమాభిక్షలతో రాక్షసులు బైటికొచ్చారు. అక్రమార్కుల మీద సర్కారు జీఓల మంత్రజలం చల్లి విక్రమార్కులుగా మార్చి దేశంమీదకు వదిలేశారు. ధరలు దిగిరాకపోయినా, ఉద్యో గాలు ఊడిపోతున్నా, ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నా ఆడవాళ్ళమీద అఘాయిత్యాలను ఆపలేకపోతున్నా, ఆపద్బాంధవుడిలాంటి తమ నామధేయాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. మహాత్మా! రెండువేల పన్నెండులో ప్రపంచానికి ప్రళయం వస్తుందంటున్నారు. ఈ వరస చూస్తే ఈ దేశానికి మూడేళ్ళు ముందుగానే ముంచుకొచ్చేటట్లుంది గోవిందా?


అన్నీ వింటున్న శేషశయనుడు కనులు తెరిచి అడిగాడు ఆఖరికి


'వేదాల కోసం మత్స్యావతారం, భూదేవికోసం వరాహావతారం, అమృతం కోసం కూర్మావతారం, ధర్మాల కోసం నరసింహావతారం, దానాలకోసం వామనావతారం, మర్యాదకోసం రామావతారం, విజయాలకోసం పరశురామావతారం, మంచి రాజకీయా లకోసం కృష్ణావతారం, బుద్ధికోసం బుద్ధావతారం... ఆఖరికి ఆకలికోసం కలికి అవతారం కూడా ఎత్తేశాను గదా నారదా! పది అవతారాలూ వృథాయేనా? అన్ని అవలక్ష ణాలతో మళ్ళీ జన్మ ఎత్తిన ఈ దుష్టరాజకీయాన్ని శిక్షిం చటానికిప్పుడు మళ్ళీ ఏమి చేయాలి?


పదకొండో అవతారం ఎత్తాలి పరంధామా! ఓటరు జన్మ ఎత్తి 'బ్యాలెట్' ఆయుధాన్ని అందుకోవాలి నారా యణా! అప్పుడే సర్వజనావళికి సంక్షేమం- అన్నాడు నారదుడు రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ. 


'నిజమే నాథా! ముందు లేవండి!' అంది లక్ష్మి నారదుడి మాటలకు  మద్దతుగా పాదసేవ అప్పటికి ఆపి. 


కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...