Showing posts with label Essays Surya Politics criticism. Show all posts
Showing posts with label Essays Surya Politics criticism. Show all posts

Saturday, July 11, 2020

మేధస్సు రాజకీయం వెంట ‘పడి’పోకూడదు! -కర్లపాలెం హనుమంతరావు - సూర్య సంపాదకీయ వ్యాసం





పశ్చిమ జర్మనీ పురాప్రాణి విజ్ఞానవేత్తలలో ప్రముఖుడైన మానసిక విజ్ఞానశాస్త్రవేత్త ప్రొఫెసర్ రూడోల్ఫ్ బిల్జ్ మనిషి చిత్త ప్రవృత్తి మీద అనేక పరిశోధనలు చేసిన అనంతరం తేల్చి చెప్పిన సారాంశం – మనిషి మనసు ఇట్లా ఉంటుంది.. అట్లా ఉంటుంది’ అని గట్టిగా స్థిరపరిచి చెప్పడానికి  ఏ మాత్రం వీలులేని బ్రహ్మపదార్థం- అని. పరిస్థితిని బట్టి ప్రవృత్తి మార్చుకోవడం మనసు బలం. అధునాతమైన ఏ విజిజ్ఞాసాపథప్రమేయ విజ్ఞానమైనా ఈ తరహాలో ఉన్నప్పుడు ఇవాళ జరిగే సంఘటనకు మనిషి రేపు ఎలా స్పందిస్తాడో అన్న ఊహ ఊసుబోకకు మాత్రమే పరిమితమవుతుంది. సాహసించి ఏ కొద్ది మంది బుద్ధిబద్ధ మేదావుల కొంత కల్పన చేసినా ఆ ఊహపోహలు వేటికీ గతకాలపు అనుభవాలను దాటి ముందు వచ్చే పాటి శక్తి చాలదు. ఆ మేధోవర్గ ప్రవచనాలను ఆధారం చేసుకుని తతిమ్మా సామాన్య జనం పడే గుంజాటనల ఫలితాంశమే  లోకంలో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్న రాజకీయ  గందరగోళ వాతావరణం.
మేధోవర్గంగా మన్ననలు పొందిన బుద్ధిజీవులు ఈ రోజు తమకు తాముగా అస్వతంత్రులవుతున్నారు.  ప్రయోజిత  ఆలోచనాధారకు తమదైన శైలిలో ముద్రలు వేస్తూ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.  మద్దతు  లభించని పక్షంలో  ఆకృతి లేని మాటలకు, నిరాకార భావాలకు ఏలుబడికి వచ్చే అవకాశం ఉండదని తెలిసే ఈ ప్రక్రియ కొనసాగడం ఆందోళన కలిగించే అంశమే కదా?
సమూహాలను మించి వ్యక్తులను అభ్యుదయ శక్తులుగా చూడడమూ, సముదాయాల మీద  వ్యక్తుల ఆధిపత్య ధోరణికి హారతులు పట్టడమూ.. రెండూ వాంఛనీయం కాదు. ప్రజాస్వామ్య పంథా ఏలుబడి మార్గంగా ఎంచుకోబడిన చోట అది మరీ ప్రమాదకరం.  నిబద్ధ రాజకీయాలు (కమిటెడ్ పాలిటిక్స్) అన్న అభాసాలంకారమే అసలు పుట్టేందుకు ఆస్కారం ఉండకూడని జనస్వామ్య వ్యవస్థలో ‘నిబద్ధ మేధోవర్గం’ కూడా ఒకటి పుట్టుకురావడం విషాదకర పరిణామం.
కాలగమనాన్ని, సాంకేతిక విజ్ఞాన ప్రగతిని, విజ్ఞానశాస్త్రపు మనోవేగ ప్రసరణ తీవ్రతను గమనించనివారు మాత్రమే నిబద్ధ రాజకీయం’ అనే ఆలోచన చేసి ఆనక దాని చూట్టూతా సమాజాన్ని సైతం తిప్పించాలని తాపత్రయం చూపించేది. అది వృథా ప్రయాసగా మారిందని గ్రహించే వేళకు వారి పొద్దు ఎటూ వాటారిపోతుంది. దానితో కొంత మంది స్తబ్దుగా  తెర వెనకకు మలిగిపోతారు. మరి కొద్దిమంది బుద్ధిజీవులు ఆగలేక ఆఖరి నిశ్వాసలో నిట్టూర్పు ధ్వని వినిపిస్తారు. విన్యాసం ఏదైనా కావచ్చు కానీ.. రెండు చర్యల సారాంశం మాత్రం ఒక్కటే.. ‘ఏకబద్ధ మేధోసిద్ధాంతం’ అనే ఆలోచనకు ఎప్పుడైనా చివరకు దక్కేది  వైఫల్యమేనని.
 రాజకీయాలలో మాత్రమే ఈ తరహా నాటకీయ ప్రవృత్తులు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. రాజకీయవేత్తలకు ఉండే ప్రత్యేక లాభం కూడా అదే. పరార్థాన్ని స్వార్థం ఆక్రమిస్తుందో, స్వార్థం స్థానే పరార్థం రూపు దిద్దుకుంటుందో.. ఒక పట్టాన అర్థం కాని మయసభ మాదిరిది ఈ ఊసరవెల్లి క్షేత్రం. రాజకీయాలలో వ్యక్తిగతప్రయోజనం పార్టీ ప్రయోజనంగా విలసిల్లడమూ, పార్టీ ప్రయోజనం ప్రజాభీష్టంగా  ప్రదర్శించే ప్రయత్నాలు సందర్భాన్ని బట్టి ముమ్మరించడమూ మనం చూస్తుంటాం.  అందులో ఏది ఏదో చెప్పడం బ్రహ్మకైనా సాధ్యంకాదు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఉండే విశాలమైన అర్థం పరిమిత ప్రయోజనాలకు కుచించుకునిపోయే సందర్భాలు అవే. ఈ వైపరీత్యానికి కారణమేంటని గాని ఆలోచించగలిగితే రాజకీయవేత్తలలో నిరంతరం గూడుకట్టుకుని ఉండే సంకోచం.. భయం అని నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. బహుత్వంలో ఏకత్వం దర్శించలేక తమ అస్తిత్వం పట్ల గూడుకట్టుకునే అభద్రతాభావన అది. ఆ భావన ప్రసరణ వివిధ రూపాలే రాజకీయాలలో క్షణక్షణం సాగే రసవత్తర నాటక ప్రదర్శనలకు మాతృక.
ద్వంద్వాలను చూస్తూ, వాటికి అతీతంగా ఉంటూ,  ప్రకృతిని, దాని సృష్టిని జడం నుంచి స్థావరం వరకు, స్థావరం నుంచి జంగమం వరకు సూక్ష్మ అనుశీలన చేసి లోకానికి స్థూలం నుంచి విపులంగాను, విపులం నుంచి స్థూలం వరకు వివరించి చెప్పవలసిన బాధ్యత  మేధోసంపన్నులది. ఆ మేధోవర్గమూ రాజకీయవేత్తల పాత్రల్లో ఇమిడే ఇప్పటి ప్రయత్నాలు విచారం కలిగించే వైపరీత్య విపరిణామం.  
రాజకీయవేత్తల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి, మేధావుల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి విధిగా తేడా ఉంటుంది. ఉండాలి కూడా. ఆ అంతరం గుర్తెరుగకుండా మేధావిత్వం వెలగబెడుతున్నామనే మెజారిటీ  ఆలోచనాశీలులు తమ్ము తాము వంచించుకుంటున్నారు; తమను నమ్మిన  సామాన్య లోకాన్ని సైతం వంచించాలని చూస్తున్నారు.
రాజకీయవేత్త ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపు ఎల్లలు దాటి బైటికి చూడవు. మేదావికి ఆ అడ్డమాకులతో ఏం పని నిజానికి? అతని మనసు ఆకాశంలో స్వేఛ్చావిహారం చేసే విహంగంతో సమానమని కదా లోకం మన్నన! నిస్సీమమర్యాదగా సంచరించే ఆ మనసుకు హద్దులెక్కడివి? కేవలం సంకెల బద్ధం కాని బుద్ధిబలం ఒక్కటే మేధావిని కాని, రచయితను కాని, కళాకారుడిని కాని రాజకీయవేత్త నుంచి వేరు చేసి చూపించే గొప్ప లక్షణం. మేధావికీ   కమిట్ మెంటులు, కట్టుబడులు, బిగింపులు, అదుపాజ్ఞలకు లొంగుబాట్లు ఉన్న పక్షంలొ అతని ఆలోచనాధార, ప్రవాహఝరులకు అడ్డుకట్టలు డుతున్నట్లే లెక్క!
 ఇప్పుడు ఈ దేశపు మేధోలోకంలో గోచరించే ఈ సీమాయితబుద్ధిమత్వమే భయపెడుతోంది. రాజకీయవేత్తలోని రాజకీయ పదజాలాన్ని అరువు తెచ్చుకుని తమ ఆలోచనలకు తామే బందీలవుతూ.. లోకాన్ని సైతం తమ పరిమిత భావధారతో బంధించాలని చూస్తున్నారు మేధావులు! మనిషిని విశ్వరూపుణ్ణిగా మార్చవలసిన మేధావి పరిమితుణ్ని చేయాలన్న ప్రయత్నం విచారం కలిగిస్తోంది.
భూమి బంధాలను  సైతం విజ్ఞానశాస్త్ర సాధనతో ఒక వంక తెంచివేస్తోనే మరో వంక నుంచి తనలోని పెరగలేనితనం వెర్రిపిలకలు వేస్తున్నా నిర్లిప్తత పాటించడం నిజంగా ఒక వైపరీత్యమే! ఉత్తమోత్తమమైన  ఉత్ఠానమే సిద్ధాంతంగా అమలు కావాలన్న పంతంలేమి ప్రధానంగా ముందుకు రావడం.. అంటే మేదావులు తమ పాత్ర నిర్వహణలో విఫలమవుతున్నట్లే లెక్క. సంకోచం లేకుండా మేధావులు రాజకీయాలలో పడిపోతున్నారన్న మాటే.. అనుమానం లేదు!

 మహాప్రళయంలో కూడా నిర్భయుడు, నిరాసక్తుడు అయివుండవలసినవాడు, భయభ్రాంతులుగా, మమతాచిత్తులుగా మారిపోవడం దేనికి సంకేతం? అనుశీలన పరిశీలన కన్నా దిగువ స్థాయికి దిగజారిపోవడం ఏ ప్రమాదానికి ఆహ్వానం? ఏకదేశసిద్ధాంతాలకు తమను తాము బిగించుకున్న ఫలితంగా మేధావులలో వ్యుత్పన్నత పలచబారిపోతోన్నది. 'నాతనం' నావారు అనుకున్నవారి చేతకానితనాన్ని  వేలెత్తి చూపించడానికి నామోషీ పెడుతోన్న సందర్భం దశ కూడా దాటిపోయింది. ఇప్పుడు మేధావులూ బరితెగింపు మార్గం పట్టేసారని లోకం బాహాటంగానే విమర్శిస్తున్నది. ఎవరు నొచ్చుకున్నా చెప్పక తప్పని  చేదు నిజం ఇది.
గిట్టని వర్గాల చేవకు చెయ్యెత్తి జైకొట్టడం జైళ్లకు చేర్చే సాకుగా  మారడం స్వార్థరాజకీయాలకు అతుకుతుందేమో! ఆ తరహా  కుతిల(బాధామయ) స్థితులకూ ఒక అంతస్తు కల్పించే ప్రయాస మేధోలోకం నుంచీ ఔత్సాహికంగా రావడమంటే.. నిస్సందేహంగా జనస్వామ్యవ్యవస్థ సర్వవినాశనానికి నాందీ వచనం ఆరంభం అయినట్లే! చీకటిలో తచ్చాడే మనుషులకు  ఏ ఒక్క మేధోజీవీ అనధికార దీపంగా అయినా  వెలిగి రహదారికి ఎక్కే  దోవ చూపించేందుకు సిద్ధంగా లేని  దుస్థితులు మళ్లీ దాపురించాయని నిస్సందేహంగా చెప్పేయవచ్చు. 
ఇక్కడ ఇప్పుడు ఏది లేదో దాని వల్లనే అంతటా చీకటి. ఆ చీకటి పారదోలడమే పనిగా ఉండవలసిన మేధోవర్గమే జనం చీకటిపాలబడేందుకు మొదటి కారణమవుతున్నది. దో విచిత్ర పరిస్థితి.
మేస్సుకు ఎవరో భాష్యం మార్చేసినట్లుగా ప్రస్తుతం ఏ ప్రచార మాధ్యమం గమనించినా ఆలోచనాపరుడంటే ఏకదేశ రాజకీయభావవిన్యాసకుడుగా మాత్రమే దర్శనమిస్తున్నాడు!


సమాజం మహాసముద్రం. గభీరం, గంభీరమైన అగాధమొకటి ఎదు ఉండగా, దానిని వివిధ నత్తల్లో అనుశీలన చేసి వడగట్టిన ఫలితాంశాలను సమాజశ్రేయస్సుకు అంకితమిచ్చే పని మేధావిది. ఆ విధి దిక్కులేనిది అయిపోయింది.
అభివృద్ధికి అర్థం నాలుగు రాళ్లు చేతుల్లో ఆడడం కాదు. సామాజికుణ్ణి ఎంత వరకు స్వతంత్రుణ్ణి, సమగ్రుణ్ణి, సర్వతోముఖుణ్ణిగా తీర్చిదిద్దుతుందన్న దాని మీదనే దాని  ప్రకాస్తి నిలుస్తుంది. ఎటూ రాజకీయవేత్త వల్ల కాని పని ఇది. మనిషిని బంధించేందుకు మాత్రమే ఎత్తులు  వేసేది రాజకీయం. జన బంధ విముక్తి తన ఉనికికి ఇబ్బందని దానికి తెలుసు. కనుక విడిచే పరిస్థితి ఉండదు. సామాజికుడి విముక్తి, జీవన విస్త్రృతులే లక్ష్యంగా పనిచేసే మేధావి  పనివిధానం అందుకు విభిన్నం.
ప్రపంచ దేశాల  వర్తమాన పరిస్థితులతో దేశీయుడి జీవన స్థితిగతులను ఎప్పటికప్పుడు తుల్యమాన పద్ధతిలో బేరీజు వేసుకుంటూ మంచి చెడులను చర్చకు పెట్టడం, క్రియాశీలులు  తమ ఉద్యమాలకు ఉత్తమ లక్ష్యాలు సిద్దంచేసుకునేందుకు వీలుగా వేదికల కల్పనలో తమ వంతు అంకితభావంతో నిర్వహించడం  మేధోజీవి పాత్ర. మేధావి  ఎట్టి సంకటంలో కూడా ప్రతినివిష్ఠ బుద్ధి కాకూడదు.  మనసుకు సంకెళ్లను పడనీయకూడదు. బంధం ఒకరు వేసినా, తనకు తానుగా వేసుకున్నా.. ఆ క్షణం నుంచి   అతని వాణి స్తబ్దము, దభ్రమూ కాకతప్పదు.

రాజకీయం, మేధస్సుకుకానొక అంగం మాత్రమే! ఎల్లవేళలా ఒకే ఆకారంలో ఉండని రాజకీయ వ్యవహారాలను తన సర్వస్వంగా భావించిన మేధావి మేధోమధనను నమ్మలేం. కారణం, అతడూ రాజకీయవేత్తతోనే తన బాణి, వాణి మార్చుకునే వర్గంలోకి దిగజారుతాడు కనక.

రాజకీయాన్ని, దానిలోని వైవిధ్యాన్ని మేధావి ద్రష్ట బుద్ధితో అనుశీలన చేసి అందులోని ఋతానికి, ధర్మానికి మాత్రమే ఆవిష్కర్తృత్వం వహించే బాధ్యత భుజాన వేసుకోవాలి. అట్లా వేసుకోగలిగిన మేధావులే నామవాచ్యులయినట్లు చరిత్ర రుజువులు చూపిస్తోంది. ఆ విధంగా చేయలేనివారు విపరీతపు సిద్ధాంతాలను బుర్రలోకి చొప్పించుకుని మేధోమార్గాన్నే మొత్తంగా పర్యాప్తమూ, పరిమితమూ చేసుకుంటున్నారని చెప్పాలి. పరిమిత సూత్రాలకు అపరిమతమైన ధార్మికతను అంటకట్టి కోరి కోరి తమకు తామే భావనాపంజరాలలో చిలకలుగా మార్చుకుంటున్నారు తాజా మేధావులు! ఎవరి పలుకులో అస్తమానం  చిలుకల్లా వల్లించడంతో మేధస్సుకు దక్కవలసిన న్యాయమైన గౌరవం దూరమవడానికి  కారకులవుతున్నారు.
లోకంలో ఏ సిద్ధాంతమూ, ధర్మమూ సమగ్రంగా ఉండవు. ఎల్లాకాలం ఒకే రూపంలో  చెల్లుబాటవాలనుకోవడం ధర్మం కూడా కాదు.  నిన్నటి ధర్మం ఈ రోజు చద్దివాసన వేయక తప్పదు. కారణం ఏ సిద్ధాంతమైనా ఏదో ఒక  వర్గ  ప్రయోజనానికి పరిమితమయి స్థిరపరచిందవడమే! అప్పటి కాలానికి అది ఉత్తమమని తోచినా.. కాలగమనంలో అవసరాల నిమిత్తం రంగప్రవేశం చేసే నూతన సిద్ధాంతాలు దానిని నిర్వీర్యం చేయడం తప్పనిసరి. అప్పుడు రాజకీయవేత్త కన్నా ముందు దాన్ని నిర్ద్వందంగా సమర్థిస్తూ వచ్చిన మేధావి సమాజం ముందు బోనులో నిలబడే  దుస్థితి వస్తుంది. 
 మానవ చరిత్రలో ఇంత వరకు ఎన్ని రాజకీయ సూత్రాలు అవతరించలేదు! అవధులులేని అధికారాలు అనుభవించీ కాలానుగతంగా అంతరించిపోలేదు! సిద్ధాంతం ఏదైనప్పటికి, ప్రతిదీ మంచి చెడుగుల కలగలుపు నేతే. తానులోని ఏ పోగులు శాశ్వత, సర్వహిత ధర్మ  సమ్మత లక్షణ సమన్వితమైనవో అనుశీలన చేసి ప్రపంచానికి  విడదీసి చూపించడంతో మేధావి బాధ్యత సంపూర్ణమయినట్లే!
కాలం అచంచలం, పృథివి పరిమితం -అన్నట్లుగా నిత్యం ప్రజాజీవితాలతో స్వీయప్రయోజనార్థం రాజకీయవేత్తలు రూపకాలు ప్రదర్శిస్తుంటారు. మేధావులు  వాటికి సూత్రధారుల వేషం కట్టకూడదు. పాత్రధారణనయితే బొత్తిగా దూరం పెట్టడం ఉత్తమం.
బంధాలు లేని  విచారధార వల్లనే కదా విజ్ఞానశాస్త్రం మానవపురోగతికి శక్తి మేరకు సమిధలు సమర్పించ గలుగుతున్నది! ఈ ఒక్క సూత్రం పట్టుకుని మేధోవర్గమూ ముందుకు పోగలిగినప్పుడే ప్రకృతి జనిత సర్వ పదార్థాల క్రమావిష్కార రహస్యాలను   అనుశీలించ గలిగే తన ప్రత్యేక శక్తిసామర్థ్యాలను   నిలుపుకునేది. మనిషిని సర్వతోముఖమైన సర్వజన సంక్షేమంకరమైన కళ్యాణమార్గం వైపుకు మళ్లించే సంకల్పం నిలుపుకోదలుచుకుంటే .. ఇప్పటిలా  ఏదో ఓ రాజకీయ పక్షాన్నో, పంథానో అదే శాశ్వతమని నెత్తిన పెట్టుకు వూరేగే మూఢత్వం ప్రదర్శించకూడదు. ఎంత లావు మన్నన పొందిన మహామేధావికయినా ఈ నియమంలో మినహాయింపులేదు.
 ఏకసిద్ధాంతబద్ధతకు లొంగని నిబద్ధత నిలుపుకున్నంత వరకే మేధావిలోని అసలు మేధస్సుకు జవం, జీవం.. మన్ననా, మర్యాదా. మాన్యత సాధించిన మేధోవర్గం ద్వారానే సామాన్య జనానికి ఎప్పటికప్పుడు వర్తమాన సమాజంలోని రాజకీయ స్థితిగతులు, మంచి చెడ్డలు వడగట్టినట్లు బోధపడేది.
***
(11 -07 -2020 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)



Saturday, March 14, 2020

సరదాకేఃr ఇదో.. ఓ.. ఆదాయ మార్గం! -కర్లపాలెం హనుమంత రావు -సూర్య దిన పత్రిక



రకరకాల  ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా! ఓ మూలట్లా  మన్మోహన్ సింగులా
మూలుగుతూ కూర్చుంటే ఎట్లా? ఎంచక్కా  పోయి ఓ సారరి ఆ ముసలయ్యగారిని కలిసి

రారాదా!’ అని మా ఆవిడ  నస. వెళ్ళి కలిసాను ముసలయ్యగారిని. మనసులోని మాట
పెదాల మీదకు రానే లేదు,  పెద్దాయన చప్పట్లు కొట్టి పి.య్యేని పిలిచి
నన్నప్పగించేశాడు. ‘అయ్యగారికి ఇవాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ
ముఖ్యమైతే తప్ప  రిసీవరూ బైటికి తియ్యరు. ఏమిటీ విషయం?’ అనడిగాడా
పి.య్యే.
‘మా వార్దు నెంబరు పదమూడుకి నిలబడదామనీ! ముసలయ్యగారి పార్టీ సహకారం

కావాలి’ అన్నా టూకీగా. ‘మరైతే వట్టి చేతులతో వచ్చారేంటండీ బాబూ! మీ జాతక
చక్రం.. సూర్యమానం ప్రకారం వేసిందొకటి, చంద్రమానంతో కలిపిందొకటి తీసుకు
రావాలి. గ్రహాలు, రాశులు.. వాటిని బట్టే అయ్యగారి అనుగ్రహం!’ అన్నాడా
పి.య్యే.
‘తమిళనాడు దివంగత జయలలితమ్మాళ్ గారికీ ఇట్లాగే జ్యోతిష్కం,
సంఖ్యాశాస్త్రాలంటే తగని పిచ్చ. జాతక యోగం ఉచ్ఛస్థితిలో
ఉందనుకున్నవాళ్ళకు మాత్రమే టిక్కెట్లిచ్చారు ఒకసారి ఎన్నికల్లో.
ముఫ్ఫైతొమ్మిది స్థానాలగ్గాను ముష్టి తొమ్మిదంటే తొమ్మిది మంది మాత్రమే
గెలిచారంతా కలిపి. గెలుపుకీ గ్రహాల వలపుకీ లింకేంటండీ బాబూ?

ప్రజాస్వామ్యంలో ఘనవిజయానికి కావాల్సింది ప్రజల అభిమానం కాదుటండీ!’
అన్నాను కసిబట్టలేక.
‘టయానికి గుర్తు చేసారు!  ఆ జయమ్మగారి కన్నా మా ముసలయ్యగారు మరో
రెండాకులు ఎక్కువ.  ఇట్లాంటి పరాశాస్త్రాల పైన విపరీతమైన నమ్మకం. మీ

ఇంటికో సారి మా వాస్తుశాస్త్రులు వస్తారు. అన్నీ సవ్యంగా ఉంటేనే మీ మొర
మా పెద్దాయన ఆలకించడం! మొన్నీ మధ్యన ఇట్లాగే ఒక బొజ్జాయన ఇంటికి
ఈశాన్యంలో పూజామందిరం పెట్టుకుని  అవకాశం చేజేతులా జారవిడుచుకున్నాడు.’
 ‘ఇంటికి ఈశాన్యంలో మందిరముంటే దోషమా!’’

‘మందిరముంటే కాదు మహాప్రభో! అందులో వినాయకుడు, ఆంజనేయుడు లాంటి
బాహుబలులుంటేనే మోసం. ఈశాన్యంలో బరువులుంటేనే కదటండీ ఊహించని

ఉత్పాతాలొచ్చిపడేదీ! ఆ మాత్రం వాస్తుజ్ఞానం కూడా లేకుండానే వార్డు
మెంబర్లై పోదామనే!’ పి.య్యే మాటల్లో వెటకారం.
ఇండియాని ఈ కరోనా తరహా మాయదారి రోగాలు  ఎందుకిలా నలిపేస్తున్నాయో ఇప్పుడు
బుర్రకెక్కింది స్వామీ! ఈశాన్యం దాకా పాకిన అంత  లావు హిమాలయాలు.. వాటి
వెనకమాల్న చైనా కొరియా గట్రా దేశాలాయ! వాటి మాయ! అవి పట్టించుకోకుండా

కుంభకోణాలనీ, ద్రవ్యోల్బణాలనీ, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందికర
సంబంధాలనీ.. పాపం మనం మోదీ, షా మామయ్యలను హమేషా ఆడిపోసుకుంటున్నాం

నిష్కారణంగా'

నా ఆలోచనల్లో నేనుండగానే భుజం గోకి మరీ అడిగాడా  పి.య్యే ‘కొంపదీసి మీ
ఇంటిగ్గానీ సింహద్వారం దక్షిణం వారగా  ఉందా ఏంటీ? ముందే చెప్పండి బాబూ..
ఆనక నన్నెన్ని దెప్పీ నో యూజ్’

‘అమెరికా శ్వేత సౌధం తలవాకిలే దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది తమ్ముడూ!
మరా దేశం ఇన్నేళ్ళబట్టి అగ్రరాజ్యంగా  ఎట్లా నిప్పులు చెరుగుతుందో?’

‘వాదనలొద్దిక్కడ. ఆ ముచ్చట్లన్నీ టీవీ పెట్టెల్లో! ముసలయ్యగారు
పరాశాస్త్రాలన్నీ నమ్ముతారు. ఆయన ముక్కు చూసారా? దూలం భారీ. తిన్నగా కూడా
ఉండదు. అయ్యగారి ముక్కువాస్తు ముందే తెలుసుకుని వచ్చుండాల్సుందయ్యా
తమరు!’

బిక్క మొహమేయడం నా వంతయింది. పోయిన ఏడాదే మా అడ్డగాడిదకు ఎక్కడా ముడిపడే
యోగం కుదర్డంలేదని ఇట్లాగే ఏదో దిక్కుమాలిన శాస్త్రం  ఘోషిస్తోందంటూ నా

ఘోష లెక్కచెయ్యకుండా వీధి ముఖ ద్వారాలు రెండూ సగం మూయించేసింది మా
మహాతల్లి. ఇప్పుడీ ముసలయ్యగారి వాస్తు ఇంకేం మూయిస్తుందో.. ద్యావుడా!’

 ‘ముందొక  సారిట్లా వచ్చి ఈ నీళ్ళ తొట్లో మీ కిష్టమైన రంగు ముక్క ఏదన్నా
తగలేయండి బాబూ! మీ అసలు రంగేంటో బైట పడేందుగ్గాను ఇదో చిన్న స్లిప్
టెస్ట్ అన్నమాట!’ అంటో గారపళ్ళు చూపించాడా  పియ్యేగారు.
రంగులు మారుతున్న  నామొహం వంక చూసి ‘మీ సందేహం అర్థమైందిలేండి! ఈ తొట్లో
ఉన్నది  సీదా సాదా జలగ కాదండీ బాబూ! ఆఫ్రికా ఖండం యవుండే దేశం నుండి

తెప్పించిందండీ! ప్రపంచ ఫుట్ బాల్ పోటీలల్లో ఫలితాలు ముందే చెప్పిన
ఆక్టోపస్ 'పాల్' లేదూ.. దానితో క్రాస్ చేయించి పుట్టించిందండీ ఈ
బుజ్జిముండను! తండ్రి తాలూకు జోస్యం చెప్పే లక్షణాలు ఎక్కడకండీ పొయ్యేదీ?
ఒక్క పాలిటిక్సులోనే కాదు వంశపారంపర్యాలూ గట్రా! మోదీ వద్దని దులపరిస్తే
మాత్రం  మాయమై పోడానికి ఇదేమన్నా గుడిసెకు పట్టిన ఆర్డినరీ బూజా? వాస్తు
బూజు బాబూ.. వాస్తు మోజు’
 ‘ఆటల  మీద రంధి పెంచి బెట్టింగ్ సొమ్ము  రెట్టింపు గుంజేందుకు మాస్
మీడియాతో మాఫియా ఆడించిన నాటకాల్రా బాబూ ఆ ఆక్టోపస్సుల యాక్టింగులు!
యుద్ధ రంగంలోకి దిగే ముందే శత్రువర్గం మానసికంగా కుంగేటందుకు వాడుకునే
గూఢచర్యానికి నకలు.'
నా ఊహల్లో నేనుండగానే పెడబొబ్బలు పెట్టేసాడా పి.య్యేసామి. నా చేతులు
పట్టుకు తెగ ఊపేస్తూ ‘కంగ్రాట్సండీ కామాయ్ సారో! మీరీ పరీక్షలో కూడా
నెగ్గేశారోచ్! ఇహా కోయంబట్టూరు నాడీ జోస్యం కూడా తెప్పించేసుకుని రడీగా
ఉంచుకుంటే సరి.. మీ పని ఫినిషయిపోయినట్లే! ఆఁ.. అన్నట్లు.. ఈ లోపల్నే
నామనక్షత్రం ప్రకారం తమ పేరును ఎట్లా మారిస్తే దిగ్విజయం సిద్ధిస్తుందో
డాక్టర్ దైవజ్ఞానం  కూడా ఓ  నివేదిక తయారుచేసిస్తారు. ఓ.కే నా?’
‘పేరు మార్చుకుంటే అపజయలక్ష్మి ఆనవాలు పట్టకుండా వదిలేస్తుందనా?
దేవుళ్లను కూడా తప్పుదారి పట్టించే కొత్త  రకం గుంటనక్క ట్రిక్కా!’
‘మీరున్నారు చూసారూ.. భలే చిలిపి సార్! మనసులో ఏదున్నా అస్సలు దాచుకోరు!
ఐ ఎప్రిషియేట్! ఇది వరకో చిన్నారావును.. ఇట్లాగే 'చీ..అన్నా..రావు'గా
సాగదీసిం తరువాతనేనండీ అతగాడి జాతకం మొత్తం తిరగడ్డం మొదలెట్టిందీ!

దివ్యజ్ఞానం గారి విజ్ఞానాన్ని సందేహించకండి! అరవై ఏళ్ళ అనుభవసారం.
వాజిపేయి, సోనియాజీ, కరుణానిధీ, నెల్సన్ మండేలా, జార్జ్ బుష్, ఒబామా,

సద్దాం హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద జాతీయ, అంతర్జాతీయ శాల్తీల నాడులే
పట్టి మరీ జోస్యం రాబట్టిన ఘనాపాటి ఇతగాడు! మీ డౌట్లన్నీ తీరిపోతాయ్..
ముందీ బౌండు బుక్కు  చదవండి’ కవిలకట్టొకటి నా మొహాన ఠకీమని  కొట్టి
లోపలికి తారుకున్నాడా పియ్యే.

బౌండా అది? వందలాది ఏళ్ళ కిందటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెప్పే నాడీ
జోస్యంట ఆ దిండు! నోస్ట్రస్ డేమ్ జోస్యం కన్నా డేమ్ ష్యూర్ గా డాక్టర్
దివ్యజ్ఞానం జోస్యముంటుందని డబ్బాలు! ఇరాక్ యుద్ధం, ఇందిరమ్మ మరణం, రజనీ
బాషా హిట్టూ..బాబా ఫట్టూ, బందిపోటు వీరప్పన్ చావు, వెస్ట్ బెంగాల్
లెఫ్టిస్టుల ఫేటు, దక్షిణాది సునామీలు, ఆమ్ ఆద్మీ కేజ్రీవాలు  రైజు,
పెద్దనోట్ల రద్దు, ముంబై దాడులు.. ఆఖరికి  ఆర్జీవీ మూడ్స్ తో సహా హిస్టరీ

దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అనింపార్టెంట్ స్టోరీస్ ఆల్మోస్ట్
అన్నీ నేటివ్ టు ఇంటర్నేషనల్ లెవెల్లోవి సర్వం .. అవి   జరక్కముందే..
విఘడియల వివరాల్తో సహా పర్ఫెక్టుగా లెక్కగట్టి మరీ తేల్చినట్టి

రిజల్ట్సని కోతలు! ఆ దస్త్రాలన్నీ చదవడం సంగతట్లా పక్కనుంచి..
మొయ్యడానికే ముందు కోడి రామ్మూర్తిగారి  కండబలం కావాలి!
కరుణానిధిగారు శుద్ధ చార్వాకవాది. హస్తసాముద్రికాలు.. నాడీ జోస్యాల వంటి
అపరశాస్త్రాలు ఆయన వంటికి పడవు. అంత పెద్దల వ్యక్తిగత జీవితాల లోతుల్లో
కెట్లా చొచ్చుకెళ్ళగలిగాడబ్బా ఈ డాక్టర్ దైవజ్ఞానం! ఈ లెక్కన చూసుకుంటే..
కొరియా- ట్రంపుల ఒప్పందం, ఇరాన్ సులేమానీ మరణం లాంటి వాటిని గురించి
చెప్పుకునేవీ  డబ్బాలేగా!


ఇంకాస్సేపు గానీ ఇక్కడే పడుంటే.. ఈ ముసలయ్యగారి నస పి.య్యే బల్లిశాస్త్ర
పరీక్ష కూడా బలవంతంగా  చేయిస్తాడు. గ్రహణం బాలేదు. వచ్చింది గ్రహణం పూట
కాబట్టి  నైటు దాకా వెయిటింగులో పెట్టి తలవాకిట్లో పళ్ళె పెట్టి రోకలిబండ

నిలబెట్టమనే టెస్టూ తలపెట్టచ్చు.

ఎన్నికలల్లో ఎదుటి పక్షం అభ్యర్థి  నామినేషనెయ్యడానికే కురుక్షేత్ర
యుద్ధంలో తలబడ్డంత  ఘోరంగా ఉందే ఇప్పటి పరిస్థితి! గెలుపు మాట ఆనక, ముందు

మన వేలైనా ఓటు మిషను  మీట మీద పడనిస్తుందో లేదో.. పాడు రాజకీయం!
ప్రచారాలు మాత్రం?  ఓటెయ్యమని అడిగేందుకు పంచ ముందు కెళ్లడం ఆలస్యం.

పింఛన్లు పెంచు, కోకలు పంచు, పంచెలు ఇప్పించంటూ ఒహటే దంచుళ్లు! ఓటర్లతో
ఓ మంచీ చెడూ చెప్పుకోడాలిప్పుడు మరీ ఓల్డ్ ఫ్యాషన్సయిపొయ్యాయ్! ఓట్ మేటర్

అంటే ఓన్లీ మనీ మేటర్!

అసలే కరోనా రోజులు కూడా! కనబడ్డ కుంకెవరైనా కరచాలనం వంకన కక్ష కొద్దీ ఏ
మాయదారి రోగమో  వంటికి అంటించిపోతే! నిలబడ్డం మాట అటుంచి ఓటేయడానికైనా
వచ్చే ఎన్నికల దాకా శాల్తీ మిగిలే ఛాన్సుంటుందో ఉండదో.. డౌటే! ఎన్నికల్లో

నిలబట్టానికి ఎన్ని తిప్పలురా ద్యావుడా?

ముందు ముందు జరగబోయేది ముందుగానే తెలిస్తే ‘యెస్’ బ్యాంకు తుస్సు
మంటుందని ముందే ఎందుకయ్యా ఏ జ్యోతిష్కుడూ  నోరు పెగిలింది కాదూ? సి.యం
పదవి హుళక్కేనని ముందే ఏ న్యూమరాలజిస్టయినా సింధియా చెవిన చేరేసుంటే
అంత లావున ఎం.పీ లో కాంగీల గుంపు  గెలుపుకని కిందా మీదా పడుండునా? నిజంగా
జరిగేది నిఖార్సుగా చెప్పేదుంటే నిర్భయ నిందితులందరికి ఉరిశిక్షలు

ఎప్పుడో  నిర్భయంగా ఇప్పుడైనా చెప్పమనండి.. చూతాం! గీత దాటిన శాసనసభ్యుల
పైన వేటు పడే సుముహూర్తం ఎప్పుడో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఆ గుట్టేదో
విప్పమనండి.. విందాం!


పండించిన పంటకు మంచి రేటు పలికేది ఎన్నడో ముందే తెలిస్తే కష్టపడైనా
సరుకును దాచుకుని నష్టపోడుగా పాపం రైతన్న! నైరుతీ రుతు పవనాల రాక ఇదీ అని

నిక్కచ్చిగా తేలితే ముందుగానే దుక్కి దున్ని విత్తులు జల్లి నెత్తికి
చేతులు తెచ్చుకునే దుస్థితి తప్పునుగా అన్నదాతకు! వాయుగుండాలు తీరం దాటే

తీరు అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాతావరణ
శాస్త్రవేత్తలు. సదరు నిపుణులందరికీ జ్యోతిషంలో గానీ  గట్టిగా
తర్ఫీదిప్పిస్తే  దేశాన్నీ, జనాన్నీ వరదల బెడద నుంచీ
తప్పించిన్నట్లవుతుంది కదా!  ఏ సర్కారీ చాకిరీ ముఖాన ఎప్పుడు రాసుందో
ముందే ముఖం మీది రాతలు చదివే పండిత ప్రకాండులెవరైనా  చదివి చెప్పగలిగితే

ఇన్నేసి సెట్లతో విద్యార్థులకు కుస్తీపట్లు తప్పును కదా! సూపర్ సక్సెస్
ఫార్ములా ముందే ఫిక్సైపోయుంటే చిన్న నిర్మాతలిలా తలలు తాకట్టు పెట్టుకుని
మరీ చెత్త చిత్రాలు పోగేసే రొష్టు తప్పును కదా? పసిడి ధర ఇదిగిదిగో

పడిపోయింది, గ్యాసు ధర అదిగదిగో అంతర్జాతీయంగా ఎక్కడికో ఎగిరిపోతోందంటో
పచ్చడి మెతుకుల కూటిక్కూడా తడుముకునే బడుగుజీవిని కంగారు
పెట్టేస్తున్నాయ్ బంగారం కొట్లు, బండి చవురు బంకులు! బంగారంలాంటి

జీవితాలు వాటి చుట్టూతా గిరిటీలు కొట్టకుండా కాపాడవచ్చు కదా కాలజ్ఞానం
పైన అంత అపారమైన అవగాహనవుండే నవీన బ్రహ్మంగారులు నోరు తెరిచి బోధించి! ఏ

అపరాల ధర ఎప్పుడు ఎంత వరకు పెరుగుతుందో.. స్టాకు బజార్లలో ఏ షేరు ధర ఏ
క్షణంలో ఎంత లోతుల్లోకెళ్లి పడిపోతుందో .. ముందే కనిపెట్టేసి ఓ ఉగాది

పంచాంగం లాంటిది రిలీజు చేసేస్తే.. కన్రెప్ప కొట్టే లోపలిట్లా లక్షలూ
కోట్లూ ఆవిరయిపోడాలు.. ఏడుపులు ఉండవు కదా! దాంతాడు తెగా.. ఒక్క నోస్టర్

డ్యామూ నోరూ అడ్వాన్సుగా పెగలదు! సరి కదా.. తీరా తాడు తెగి బక్కెట బావిలో
పడిం తరువాతనా.. ఇదిగిదిగో.. ఇలా జరుగుతుందనేగా మేం ముందే కనిపెట్టి

ఘోషెట్టింది!’ అంటూ టీవీల ముందు చిందులు!
లావు లావు ‘లా’ పుస్తకాలు.. అవీ ఇవీ.. చదివి ఐయ్యేయస్సులు ఐపీయెస్సులూ
ఐపొయ్యే సార్లు, దొరసాన్లు ఇంకాస్త మనసు పెట్టి ఆ కూస్త బల్లిశాస్త్రమో,

పాదసాముద్రికమో కూడా ఔపోసన పట్టేయరా నిఖార్సైన  ప్రభావమంటూ నిజంగా
పరాశాస్త్రలకే   ఉండుంటే!

వాస్తవేమిటంటే..
వాస్తు వసతి కోసమని ఎన్నడో ఏర్పాటైన ఓ  చిన్న నిర్మాణశాస్త్రం. గుహల
నుంచి కాంక్రీటు గృహాల దాకా ఎదిగిన మనం  ఇంకా ఆ ఆకు కుటీరం నాటి అవసరాలను
తీర్చిన పాత నియమ నిబంధల చూరులు పట్టుకు వేళ్లాడుతు ఉంటే మానవ వికాస
నిర్మాణం ముందు ముందు మరంత విస్తరించడం ఎప్పుడు?

వరాహ మిహిరుడి వాస్తు ప్రకారం  మహానగరాలల్లో కాని  నిర్మాణాలు సాగిస్తే
ఇరుగింటి మురుగు పారేది పొరుగు పడక గది కిందనే!  మయామాతా, మానసారా.. ఎవరి
వాస్తు ఘోష వాళ్లది. వాటిలో వాటికే ఏకీభావం లేని పరాశాస్త్రాలతో  నేటి
నాగరిక మానవుడు ఏకీభవించడం పరాచికం కాదా?

వీరేశలింగంపంతులుగారు అమావాస్యనాడు ఉద్యోగంలో చేరి మహోపాధ్యాయుడిగా
కీర్తి గడించారు. సురవరం సుధాకరరెడ్డిసారు  రెండువేల నాలుగు  నాటి
ఎన్నికల్లో రాహుకాలంలో నామినేషన్ వేసి  మరీ ఎం.పీగా గెలుపు సాధించారు!


నాడీ జ్యోతిషం వేదవిజ్ఞానం కాదు. నాలుగో శతాబ్దం దాకా వేదాలలో వాస్తు
ప్రస్తావనే లేదు. ఎన్ని వేద సంహితలలో భూతద్దం పెట్టి వెతికినా
సంఖ్యాశాస్త్రం కనిపించదు. మనిషి వస్త్రలాభం, వాహన యోగం గోడ మీద పాకే

బల్లా నిగ్గుతేల్చేది? సిల్లీ! కుళ్లు బుద్ధులతో మనం అనుక్షణం కొట్టుకు
చస్తూ ఆ కలహాలకి కారణాన్ని పురుగులేరుకు తినే  బల్లి మీదకా తోసెయ్యడమా..

దారుణం!

ఈ సారి ఇంకేదో మూడు కాళ్ళ కప్ప బొమ్మ పట్టుకుని నవ్వుతో బైటికొచ్చాడు
పి.య్యేసారు. చైనా వాస్తు ఫెంగ్-షూయి ప్రకారం మూడు కాళ్ల కప్ప గుమ్మం
ముందు కూర్చున్నట్లుంటేనే ఇంటి యజమానికి మనోసిద్ధి ప్రాప్తిరస్తట!
ఇట్లాగే ఇంకా ఏవేవో చాలా శాస్త్ర మర్మాలు విప్పచెప్పే ఉత్సాహంలో ఉన్నాడు
ముసలయ్యగారి పర్శనల్ సహాయకుడు! కానీ నా మానసికస్థితి అప్పటికే ఒక గట్టి

స్థితప్రజ్ఞతను సాధించింది.  మూడు కాళ్ల కప్పతో సహా గిరుక్కున వెనక్కి
తిరిగి వచ్చేసా.

‘అష్టమి, మంగళవారం, ఆ పైన గ్రహణం. బయల్దేరిందేమో రాహుకాలం. అదీ వర్జ్యం
వదలక ముందు! ఎదురుగా వచ్చిందేమో నల్ల పిల్లి! కాస్తంత సేపు ‘కూర్చుని
నెత్తి మీదిన్ని నీళ్ళు జల్లుకుని పోవయ్యా మగడా!’ అన్నా! వింటేనా?

పరగడుపున బల్లి భుజం  మీద పడ్డప్పుడే అనుకున్నాలే, ఇవాళేదో ముదనష్టం
ముహాన రాసిపెట్టుందని..’ ఇట్లా  సాగుతుంది ఇంట్లో మా ఆవిడ పురాణం. రక
రకాల శాస్త్రపరీక్షలకూ,  ఎన్నో రకాల నివేదికలకూ, ఇదిగో ఈ మూడుకాళ్ళ కప్ప

బాపతు  దిష్టిబొమ్మలు గట్రాలు మరికొన్నింటికి.. అంతా కలసి ముసలయ్యగారి
పి.య్యేమనిషి  నా మూతి పళ్లు రాలగొట్టి   రాల్చుకున్నవి   అక్షరాలా అర్థ

పదివేల నూటపదహార్లు! వాటి  గురించే ఆవిడ షష్ఠాష్టకాలు!
 ‘సొమ్ము పోతే పోయిందిలేవయ్యా! ఆ వార్డు మెంబరూ వద్దు.. పాడూ వద్దు! ఎవరం
ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇంచక్కా నువ్వూ ఆ చైనావాళ్ల వాస్తు
బొమ్మలు అమ్మే కొట్టు వెంటనే మొదలెట్టు’ అనేసింది ఆవిడే మర్నాడు

వాతావరణం చల్లబడి మెదడు మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాత!
నిజమేగా! ఎవరం ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇదీ ఓ ఆదాయ మార్గమేగా!
***

Monday, January 13, 2020

పత్రికలు- బడుగు జీవుల బతుకు చిత్రికలు -కర్లపాలెం హనుమంతరావు-సూర్య దినపత్రిక పరచురణ


 వార్త- ప్రాధాన్యతః
పదిహేడో శతాబ్దానికి పూర్వం  సామ్రాజ్య వ్యవస్థలు వర్ధిల్లే  కాలంలో  అధికార వర్గాలు   జారీచేసే 'బులెటన్' ల తరువాతి రూపం ఫ్రెంచ్ భాషలో పుట్టిన 'new' పదం. దాని బహువచనం  'news' కు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్- అనే నాలుగు దిక్కుల నుంచి అందే సమాచారం అని చెప్పుకునే నిర్వచనంలో  చమత్కారమే తప్ప వాస్తవం పాలు తక్కువ.   అనేక భారతీయ భాషలలో
న్యూస్ కు సమానార్థకంగా  వినిపించే  'వార్త' విలువ కనకం మాదిరో కరెన్సీ మాదిరో   వెలగట్ట లేనిది. ఎంత నియంతల వ్యవస్థలోనైనా ఈ 'వార్త'కు ఉండే విలువ తిరుగులేనిది. పాలితుల మనోభావాలను పాలకులకు చేరవేసినట్లే, పాలకుల అంతరంగాల వైనం పాలితుల వరకు చేరవేసే చేవ సత్యకాలం బట్టి ఒక్క 'వార్త'కే సొంతం.  ఛాందసుడని మనం  ఈసడించే భారత కవిత్రయంలోని నన్నయకవి కొన్ని వేల ఏళ్ల కిందటే వార్త ప్రాధాన్యతను  ఒక్క చిన్న ముక్కలో తేల్చేసాడు. 'వార్త యందు జగతి వర్థిల్లుచుండు' అన్న  నన్నయగారి ఆ పద్యపాదం ఈ ఇరవై ఒకటో  శతాబ్దపు ఈ-కాలంలో కూడా ప్రముఖ పత్రికల 'హెడర్స్'  దగ్గర తచ్చాడక తప్పడంలేదు.

వార్త-ఆవశ్యకతః
జగతి ప్రగతి మార్గంలో  సాగాలంటే భూతకాల అనుభవాల ఆధారంగా భద్రమైన భవిత కోసం  సర్వే సర్వత్రా సంభవించే వర్తమాన సమాజాల తీరూ తెన్నూ అన్ని  వర్గాలకు అనుక్షణం  అందుబాటులో ఉండక తప్పదు.   ప్రజాతంత్ర పాలనా వ్యవస్థ సాఫల్యానికి పాలకులు- పాలితులు మధ్య సమవ్యయం అవసరం.  ఇరుపక్షాలకు  మధ్యన  బాధ్యతాయుతమైన ఒక  అనుసంధాన ఉపకరణం క్రియాశీలకంగా పనిచేయడం తప్పనిసరి.   సమాచార లోపం వల్లనే చాలా సందర్భాలలో  సంక్షోభాలు తలెత్తినట్లు ప్రపంచ చరిత్ర చెబుతున్నది.  నిక్కచ్చి సమాచారం అధికారికంగా అసలు మూలాల నుంచి సమయానికి సరైన వారికి అందితే అపోహలకు ఆస్కారం ఉండదు.  సంక్షోభాలు తలెత్తవు. మొలక దశ నుంచే ఆవలి వైపు ఆలోచనలను క్రమ పద్ధతిలో  తెలియచేసే చేవ ఉంటుంది కాబట్టే నేటికీ వార్తకు ప్రపంచంలో ఇంతటి ప్రాముఖ్యం. 

వార్తామధ్యమాల సమర్థతః
సంక్షోభాలు సృష్టించడం,  నివారించడం   సమాచార మాధ్యమాల ప్రత్యేక సామర్థ్యం. చాటు మాటు మాటల కన్నా సూటిగా  ప్రశ్నించే ప్రెస్ (వార్తా మాధ్యమం) ద్వారా  ప్రెస్ చేసి అడిగినప్పుడే సమస్యలకు  సత్వర పరిష్కారాలు లభ్యమయే అవకాశం ఎక్కువ.  వార్తల ప్రభావం అర్థమయే కొద్దీ అందుకే వార్తామాధ్యమాల ప్రాధాన్యత అన్ని వ్యవస్థలలో క్రమంగా పెరుగుతూ వస్తున్నది. సాంకేతిక నైపుణ్యాల పుణ్యమా అని సమాచార రంగంలో ఈరోజు దృశ్యశ్రవణ విభాగాలు వీరంగం వేస్తున్నాయి!    సర్వే సర్వత్రా సంభవించే సంఘటనలను కంటి రెప్ప పాటులో అవి అరచేతిలో పెట్టేస్తున్నాయి. అయినా సమాచార స్రవంతిని ఓ ధర్మ క్ర్రతువులా  భావించి ఆరంభించిన తొలినాటి యాజుల పాత్ర  ఈ నాటికీ కొంతలో కొంతైనా పోషిస్తున్నవి వార్తాపత్రికలే!

వార్తాపత్రికలు- విశిష్టతః
అక్షర రూపంలో కట్టెదుట కనిపించే వార్తకు ఉండే విశ్వసనీయతపవిత్రత సాటి లేనివి. చదువు సంధ్యలు లేకున్నా పవిత్ర గ్రంథాల  సామాన్యుడికుండే భక్తివిశ్వాసాలే అందుకు ఉదాహరణ. అచ్చు అక్షరం పట్ల  మనిషి చూపించే అపార విశ్వాసమే ఫ్రెంచ్బ్రిటన్ ల వంటి జాతీయ ప్రభుత్వాల చేత తొలినాళ్లల్లో అధికారిక బులెటన్ లుగెజిట్ లు అచ్చులో రావడానికి   కారణమయింది.  కొత్తగా ఎన్ని ప్రసార ప్రకియలకు రోజూ ఆవిష్కరణలు జరుగుతున్నా అచ్చులో కనిపించే వార్తాపత్రికలకు ఉన్న ఆ  ఆదరణ చెక్కుచెదరలేదు.. నిన్న మొన్నటి వరకు.    విషయం కాక వినోదమే ప్రధానమనే కోణంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రెజెంట్ అయే వార్తల్లో సత్యాసత్యాల నిర్ధారణ జగం మిధ్యపలాయనం మిధ్య సామెత! మార్ఫింగులుఎడిటింగులు వంటి  యాప్స్ సామాన్యుడు సైతం సులభంగా వాడే సౌలభ్యాలు  పెచ్చు మీరి ప్రధాన మంత్రిప్రతిపక్ష అదినేత.. ఒకే పబ్బులో కలసి  కేరింతలు కొట్టేస్తున్నట్లు నమ్మించే  వీడియోలు సైతం  సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసేయడం సులువవుతున్న వాతావరణం! అంతర్జాలంలో తాజా  వార్త వంకతో తయారయ్యే సంచలన వార్త వాస్తవానికి ఏ దశాబ్దం కిందటి లైబ్రరీ షాటో.. ఫోరెన్సిక్ లేబ్  తప్ప తేలే వ్యవహారంలా లేదిప్పుడు.  ఎన్నేసి రకాలుగా అన్ని వైపుల నుంచి వార్తా మాధ్యమాలు విచిత్రమైన భంగిమలలో  ప్రసారాలు గుప్పిస్తున్నా   ఇప్పటికీ జనం చివరగా చూసి నిజమని నిర్ధారించుకుంటున్నది మాత్రం   వార్తాపత్రికలో  కనిపించినప్పుడే!  ఎలక్ట్రానిక్ మీడియా ఆవిష్కరణ తొలి దశలో  కొంత తడబడ్డ మాట నిజమే కానీ  తమవైన ప్రత్యేక బలాల పునః సమీకరణ వల్ల  వార్తా పత్రికలు   తిరిగి పుంజుకున్నాయి.  సర్క్యులేషన్ పరంగా కొంత బలిమి  తగ్గినా మేలిమి వార్తకు ఈనాడూ వార్తాపత్రికలే కేరాఫ్ అడ్రస్!

వార్తాపత్రికలు- లక్ష్యం..నేపథ్యం
వార్తాపత్రికల ఆరంభ దశలో 'గెజిట్ మీద 'మాది ఒక రాజకీయవ్యాపార పత్రిక. అన్ని రాజకీయ పార్టీలకు స్థానం ఉంటుంది. కాని ఏ రాజకీయ పార్టీకి లోబడి ఉండదుఅన్న అర్థం వచ్చే మోటో ఒకటి కనిపించేది.  ఆ తొలి నాటి  లక్ష్యంలో ఇప్పుడు గణనీయమైన మార్పు కనిపిస్తున్న మాట కాదనలేం.  సమాచార మాధ్యమంగా వార్తాపత్రికలు  అత్యున్నత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించే లక్ష్యంతో  1966 లో 'ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాఆవిర్భవించింది.  నేషనల్‌ ప్రెస్‌ డే (జాతీయ పత్రికా దినోత్సవం) గా స్మరించుకునే  నవంబర్ 16 నాడైనా పత్రికలు తమ పాత్రపై  పునస్సమీక్షలు జరుపుకోడం మేలు. ఏ కొసన ఏం జరిగినా ప్రపంచానికంతటికీ వాస్తవాలు మాత్రమే తెలిసేలా  క్షేత్రస్థాయి పరిస్థితులు యధాతధంగా ప్రచురించడం  చాలా వార్తాపత్రికలకు ప్రధాన ధ్యేయం.  రెండు దశాబ్దాల కిందటి వరకు విభిన్న వర్గాలు నమ్మదగ్గ   అత్యుత్తమ అనుసంధాన పాత్ర   వార్తాపత్రికలదే. జాతి హితం దృష్ట్యా  చేసే సమయానుకూలమైన   మేల్కొల్పులుహెచ్చరికల నుండి,  హక్కులుబాధ్యతల పట్ల  సమూహాలను అప్రమత్తం  చేసే వరకు..   సమ సమ్మాన  సమాజ  నిర్మాణ సౌధానికి  అవసరమయే కార్యకలాపాలన్నింటికి  బహిరంగ వేదికలుగా చొరవ చూపించేవి వార్తాపత్రికలే.   న్యాయంచట్టంశాంతి భద్రతల సంరక్షణ అనే మూడు మూల స్తంభాలతో పాటు ప్రజాస్వామ్య సౌధ పటిష్టత కోసం నాలుగో  స్తంభంగా 'ప్రెస్గుర్తింపు పొందటానికి అదే కారణం.   ఎలక్ట్రానిక్ మీడియా ఆవిష్కరణ తొలి దశలో  ఆ 'ఫోర్త్ ఎస్టేట్ కొంత తడబడ్డప్పటికీ   తమవైన ప్రత్యేక బలాల పునః సమీకరణ వల్ల  పూర్వ ప్రభావంతో   తిరిగి పుంజుకున్నాయి.   సర్క్యులేషన్ పరంగా కొంత బలిమి  తగ్గినా మేలిమి వార్తకు ఇప్పటికీ వార్తాపత్రికలే కేరాఫ్ అడ్రస్!  వట్టి కాగితాల బొత్తే అయితే వార్తాపత్రికలు ఈ దేశంలో  ఇన్ని శతాబ్దాల  పాటు ఎన్నో ఆటుపోటులను తట్టుకుని  నిలబడి ఉండేవే కాదు.   అక్షరాస్యత,  ఇంగ్లీషు జ్ఞానం పరిమితంగా ఉన్న కాలంలోనూ   గొప్ప గుర్తింపు పొందడం వార్తాపత్రిక వ్యవస్థ విశిష్టత. స్వాతంత్ర్య  భావజాల ప్రచారాల నిమిత్తం 1851 లో దాదాభాయ్ నౌరోజి  రాజకీయ పత్రిక  ప్రారంభించినదాది    వార్తాపత్రికల  ప్రచురణ వివిధ లక్ష్య సాధనలార్థం పాశుపతాస్త్రాలకు మించి ఉపయోగిస్తున్నాయీ దేశంలో.
పత్రికల ప్రభావం   గుర్తెరగబట్టే స్వాతంత్ర్య పోరాటపు తొలి నాళ్లల్లో   అటు   ప్రాంతీయ భాషల్లోనూఇటు ఇంగ్లీషు భాషలోనూ వార్తాపత్రికలు పోటెత్తింది.  సంస్కరణల కాలంలోసంక్షోభాల సమయంలోసామాజిక పరంగా మార్పు సంభవించే ఏ సంధి కాలంలో అయినా పత్రికలు పో్షించే పాత్ర నిస్సందేహంగా అమోఘమైనది. సామాజిక సంస్కరణల నిమిత్తం రాజా  రామ్మోహన్  రాయ్ వంటి విద్యావంతులు ఎందరో ప్రజాభిప్రాయం మలిచే  అచ్చుపత్రికలనే ప్రధానంగా నమ్ముకొన్నది. 

తెలుగులో వార్తాపత్రికలుః
తెలుగు వరకు.. తొలి పత్రిక  మత భావజాల  విస్తరణ నిమిత్తం క్రైస్తవులు 1835లో బళ్ళారి కేంద్రంగా  వెలువరించిన  సత్యదూత. కాకినాడ నుంచి కెనడియన్ బాప్టిస్టు మిషన్ ప్రచురించిన 'రావిమత పత్రికలో సామాజిక  వార్తలూ  కనిపించడం విశేషం.   భాషా ఉద్యమాలు ఉధృతంగా సాగిన దశలో విశ్వనాధ వంటి ఉద్దండులూ 'జనతాతరహా పత్రికలు నడపక తప్పింది కాదు.  కందుకూరి వీరేశలింగంగారు  'వివేకవర్ధనినడిపితే..   కొక్కండ పంతులుగారు  'ఆంధ్ర భాషా సంజీవిని'  పత్రికతో పోటీ పడ్డ రోజులున్నాయి. జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాల సమర్థన నిమిత్తం ఎ.పి. పార్థసారధి  పత్రిక  ప్రారంబించిన బాటలోనే కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు    1908లో గాంధీజీ మార్క్ జీవన విలువలను ప్రమోట్ చేస్తో ఆంధ్రపత్రిక స్థాపించారు.   'భారతిఅనే సాహిత్య పాత్రికనూ స్థాపించి దశాబ్దాల పాటు  ఆ రెండింటినీ నిర్విఘ్నంగా నిబద్ధతతో నిర్వహించారు. ఆ పత్రికకు దీటైన మరో వార్తాపత్రిక .. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థల ఆధ్వర్యాన ఖాసా సుబ్బారావు నిర్వహణలో నార్లవెంకటేశ్వర్రావు సంపాదకులుగా 1938లో స్థాపించిన 'ఆంధ్రప్రభ'.  

వార్తాపత్రికలు- సామాజిక బాధ్యతః
ప్రత్రికలతో ప్రయోజనం ఎంతో   ప్రమాదమూ అంతకు మించి. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సాగే ప్రభుత్వాలకు  గిట్టని వార్తా పత్రికలపై  ఉక్కుపాదం మోపాలన్నంత కసి సహజం. ఇందిరా గాంధి అత్యయిక పరిస్థితి ఇందుకో ఉదాహరణ. కానీ  ప్రజల పక్షాన మాత్రమే  నిలబడాలని భావించే పత్రికలు ఏనాడూ   నిర్బంధాలకూ తలొగ్గిన దాఖలాలు లేవు!   తెల్లదొరల   సెన్సార్ (1878) నిబంధనల మధ్యనే  ఎఫ్.సి.మెహతా  కైసర్-ఎ-హింద్ (1882)పత్రికను ప్రారంభించిన స్వేచ్ఛాప్రియుల దేశమిది! స్వాతంత్ర్యానికి ముందు  ప్రభావశీలంగా పనిచేసిన బ్రిటిష్ వారి పది పన్నెండు ఆంగ్ల దినపత్రికల మధ్యనా    చెన్నపట్నం -ది హిందూముంబై-ఇండియన్‌ ఎక్ష్ప్ ప్రెస్దిల్లీ- హిందుస్తాన్‌ టైమ్స్కలకత్తా -అమృత బజార్ ఉత్తర భారతం- నేషనల్ హెరాల్డ్మధ్య భారతం- హితవాద  వంటి పత్రికలు కొన్ని గొప్ప జాతీయభావజాలంతో జాతి ఏకీకరణ  కోసం  ఉడుతా భక్తి సేవించినవే.  దాదాపు అవే లక్ష్యాలతో ప్రజాహితం దృష్ట్యా  మారిన కాలానికి అనుగుణంగా నేటికీ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి ఆ పత్రికలన్నీ. కనకనే కాలానికి ఎదురు నిలిచి తమ ఉనికి నిలుపుకుంటున్నాయి! 

సమాజిక విభజన- వార్తాపత్రికల ఎదురీతః
విశ్వవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ఏదో ఒక రూపంలో సామాజిక విభజన తప్పడంలేదు. ఆఫ్రికాలో తెగల ఆధారంగాయూరప్‌లో జాతుల ఆధారంగా  అయితే భారతీయ సమాజంలో కులాల ఆధారంగా! సమాజం ఖండ ఖండలుగా విడివడే ప్రక్రియలో  సామాజిక స్థిరీకరణ మిషతో ఉన్నత వర్ణాలవారే అన్ని రకాలుగా  ఆధిపత్యాలను గుప్పెట బిగించారు.     ఆధునిక యుగం ప్రసాదించిన స్వేచ్ఛజ్ఞానాల పుణ్యమా అని యుగాల బట్టి అధికార పంపకాలలో సాగుతున్న ఈ అసమన్యాయం అణగారిన  వర్గాలవారి ఇంగితానికి ఇప్పుడిప్పుడే రావడం! బ్రహ్మణాధిపత్యంఅగ్రకులాల  దోపిడికులాలు ప్రాతిపదికగా లేని జనాభా లెక్కలుదోషపూరితమైన కుల చరిత్రల రచనసామాజికఆర్థిక అసమానతలు.. వెరసి 
 వెనుకబడిన కులాల  ఆత్మగౌరవ ఉద్యమాల (Self Respect movement) కు కారణాలవుతున్నాయి.

ఆత్మగౌరవ ఉద్యమాలుః
19వ శతాబ్దం చివరి భాగంలో దక్షిణపశ్చిమ భారతంలో  అగ్రకులాల వ్యతిరేక ఉద్యమాలు అనేకం పురుడుపోసుకున్నాయి. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకం నాటికి శైశవ అవస్థలు దాటి  అవే  కుల సంఘాలుసంస్థలుగా పుంజుకున్నాయి.    పరిణతి గడించే క్రమంలో ఆ  సంఘాలుసంస్థలే నిమ్న,  వెనుకబడిన తరగతుల ఆత్మసమ్మానానికి ప్రతీకలుగా గుర్తింపుపొందింది. బడుగుల  బతుకుల్లో కొంత మేలైన మార్పు సాధించినా    జనాభా దామాషాలో రాజకీయ అధికారం చేజిక్కించుకున్నప్పుడే  సంపూర్ణ న్యాయం జరిగినట్లుగా  అణగారిన వర్గాలిప్పుడు భావించేది. జనాభా దామాషాలో ఎక్కువగా ఉన్న ఎజువా కులం కేరళ హిందూ సవర్ణుల చేత వెలికి గురయింది వ శతాబ్దిలో! అదే కులంలో పుట్టిన నారాయణ గురు  అణగారిన వర్గాల అభ్యున్నతికి ముందుగా  వారి దృక్పథంలో మార్పు రావలసిన అగత్యం గుర్తించి  1903లో శ్రీ నారాయణ ధర్మపరిపాలన సంస్థను (SNDP) సంస్థను స్థాపించారు. అణగారిన వర్గాలకు వేదాలుశాస్ర్తాలు బోధించి  శిక్షణ ఇవ్వడం అపూర్వం. కులమతభాషా భేదాలువంటి అనేక  మానవ కల్పిత  సాంఘిక వ్యత్యాసాల పట్ల సదవగాహన కల్పిస్తూనే
ఏకోపాసన పట్ల నారాయణ గురు  సంస్థ సాగించిన ఉద్యమాలతో కేరళలో వెనుకబడిననిమ్న కులాల సామాజిక జీవనంలో విశేషమైన మార్పులొచ్చాయి.
సామాజిక విప్లవవాది రామస్వామి నాయకర్ (పెరియార్) అణగారిన వర్గాల  ఆత్మ విశ్వాస పునరుద్ధరణే  లక్ష్యంగా ఆరంభించిన ఆత్మగౌరవ ఉద్యమం..  సంఘ సంస్కరణల దిశగా సాగి ఆఖరుకి రాజకీయా పోరాటాల రూపం తీసుకున్నది. ఆత్మగౌరవ భావజాల ప్రచారం నిమిత్తం కుడి అరసు అనే వారపత్రిక ఆరంభించి ఆ దిశగా ఎందరికో ఆదర్శనీయుడయింది పెరియారే! దేవాలయ ప్రవేశాలుదైవజ్ఞుల ప్రమేయం లేని కళ్యాణాలుపూజా విగ్రహాల నిషేధాలు వంటి వైదిక ప్రాముఖ్యత లేని సంప్రదాయాల ఆచరణకు వ్యతిరేకంగా మనుస్మృతిని తగలబెట్టడం వంటు  నిరసన రూపాలకు శ్రీకారం చుట్టింది ఈ ఆత్మగౌరవ ఉద్యమం.  దైవకార్యాల పౌరోహిత్యంఉమ్మడి నీటి వనరుల వినియోగం వంటి  నిత్య జీవితావసరాలలో బ్రాహ్మణేతరులకూ భాగస్వామ్యం కల్పించడం వంటి ఆత్మగౌరవ సాధన మార్గాలు పెరియార్ తొలినాటి జస్టిస్ పార్టీ నుంచి ప్రేరణ పొందినవి.  జాతీయ అనుసంధాన భాష మిషతో ఆర్య సంస్కృతికి అచ్చమైన ప్రచార మాధ్యమంగా భావించే హిందీని వ్యతిరేకించడం నుంచి  ప్రత్యేక ద్రవిడస్థాన్ కోసం పోరాటం చేసే వరకు తమిళనాట  ద్రవిడ కజగమ్ (డి.కె),  ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డి.ఎం.కె),  అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగమ్ వంటివి ఎన్నో రాజకీయంగా వెనుకబడిన తరగతుల ఉద్యమం సాఫల్యం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్నాయి. తమిళ విల్లాలుముదలియార్లుచెట్టియార్లుతెలుగురెడ్లుకమ్మబలిజ నాయకులు వంటి వెనుకబడిన మధ్య తరగతి కులాలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి.  కల్లుగీత కార్మికులుగాపామరులుగావ్యవసాయ కూలీలుగా జీవించే  అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక అంతస్తు పెంచుకునే నిమిత్తం విద్య,  సాంఘిక సంక్షేమ కార్యకలాపాలలో ఎక్కువ ప్రభుత్వ నిధుల కెటాయింపుల కోసం నాడార్లు  నాడార్ ఉద్యమం  నడిపించారు.   ఉత్తర తమిళనాడు వెనుకబడిన కులం పత్లీ. షవాన్ల మాదిరిగా 1871 నుంచి తమకు తాము వన్నీయ కుల క్షత్రియులని ప్రకటించుకున్న ఆత్మగౌరవ ఉద్యమం పత్లీల ఉద్యమం.
మహారాష్ట్రలో అణగారినవెనుకబడిననిమ్నకులాల అభ్యున్నతి కోసం 18వ శతాబ్దిలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం  ఉధృతంగా కొనసాగింది. శూద్రులకై సలహాలు,  విద్యావ్యాప్తిహక్కుల స్పృహే లక్ష్యంగా మహాత్మ జోతిరావ్‌ గోవిందరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్  సమాజ్‌ కూడా ఆత్మగౌరవ ఉద్యమ చరిత్రలో ప్రధాన ఘట్టమే! కృషీవలులకార్మికుల సమస్యల  నివారణార్థం 1871లో ఫూలే ప్రచురించిన వారపత్రిక ‘దీనబంధు’! సమాజం  నుంచి కోరుకొనే మంచి మార్పు ముందు సొంత ఇంటి నుంచే మొదలుకావాలంటూ..  ఆచరించినిరూపించిన ాఅ ఆదర్శమూర్తి అడుగుజాడల్లో నడిచే అచ్చమైన సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడున్నది ఎంత మంది?! స్త్రీ విద్య పట్ల అనురాగంబాల్య వివాహాల పట్ల వ్యతిరేకత వట్టి మాటలతోనే ప్రకటించుకోడంతో సరిపెట్టుకోక స్వయంగా 'బాలహత్య ప్రధిబంధక్ గృహను స్థాపించిగర్భిణీ వితంతువులకు   అండగా నిలిచిన సంఘసంస్కర్త ఫూలే!   వేదాలనువిగ్రహారాధనను వ్యతిరేకిస్తూ 1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’  అనే పుస్తకాన్ని ప్రచురించిన కార్యశీలి ఫూలే మహాత్ముడు. మరో నాలుగేళ్లకు బ్రాహ్మణుల వైఖరిని నిరసిస్తూ ‘గులాంగిరి’ అనే పుస్తకం ప్రచురించారు.


వెనుకబడిన కులాలు- ప్రస్తుత పరిస్థితులుః
జనాభాలో అధిక శాతంగా ఉన్నా  వెనుకబడిన కులాలుగా ముద్రబడి భారతీయ హిందూ సామాజిక వ్యవస్థలో నాలుగో స్థానంలోకి నెట్టివేయబడడాన్ని బుద్ధి ఉన్న ఏ సామాజికహితుడైనా ఎట్లా సహించడం ?  ఆర్థిక పరంగా బలంగా ఉండిసమాజం దృష్టిలో  సమ్మాన స్థానంలో ఉన్నా .. వెనుకబడ్డ తరగతులలోకి జొరబడి బలహీన వర్గాల పిసరంత రాజ్యాంగ బద్ధ లాభాలనూ గుంజేసుకోవాలనే దుర్భుద్ధి కొత్తగా కొన్ని అగ్రవర్ణాలలో పుట్టుకొస్తున్నదిప్పుడు.  రాజస్థాన్‌ రాష్ట్ర జాట్లను కేంద్ర వాజపేయి ప్రభుత్వం ఒబిసి జాబితాలో చేర్చడాన్ని ఎట్లా సహించడం?   మహారాష్ట్రలో అన్ని విధాలా బలమైన కులం మరాఠాల కులం.  అదీ ఆందోళన చేసి ఒబిసిల్లోకి చేరిపోతే నిజంగా వెనుకబడ్డ తరగతులవారి వాటా కుచించుకుపోదా?  అన్ని కులాల్లో నిరుపేదలు ఉంటారు. బలహీనులు అందరికీ  ప్రభుత్వ సాయం గత్తర తప్పదు. కాని భారత సమాజాన్ని సహస్రాబ్దాలుగా పట్టిపీడిస్తున్న  కుల వ్యవస్థ  కారణంగా   ఏర్పడ్డ  అణగారిన వర్గాలవారి హక్కుల నేపథ్యం వేరు.  విద్యాఉద్యోగాలకు దూరమయిన ఈ బడుగుల కోసం  బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వాస్తవంగా వెనుకబడిన కులాల ఆధారంగా ఏర్పాటు చేసినది రిజర్వేషన్ వ్యవస్థ. ఈ ప్రత్యేక సదుపాయాలలో కూడా అభివృద్ధి చెందిన జాతులు వాటా కోరడమే అభ్యంతరకరం. గుజరాత్‌లో తాజాగా పటేల్‌ కులస్థులు తమ కులాన్ని ఓబిసి కేటగిరీలో చేర్చాలంటూ సాగించే హింసాత్మక ఆందోళనపట్ల సంయమనం ఎట్లా?   హిందూ మితవాదులు  పటేళ్ల ఆందోళనపై చేసే అనుకూల వ్యాఖ్యలు  రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోగయ్యే ప్రమాదాలను సూచిస్తునాయి.   ఉదారవాద ఆర్ధిక విధానాల అమలు వల్ల ప్రభుత్వ రంగ ఉద్యోగాలుఉపాధులు పెరుగుతాయని బుకాయించాయి బడా వ్యాపార వర్గాలు.  అందుకు విరుద్ధంగా  తగ్గుతున్న ఈ అవకాశాల్లో 'ఎవరికి.. ఎంతఅన్న తంపులు పెట్టి   ప్రజల అసంతృప్తిని ప్రణాళికాబద్ధంగా వెనుకబడిన వర్గాల వైపుకి మళ్లించే  కుట్ర ప్రస్తుతం నడుస్తున్నది. 'అందరికీ విద్య- అందరికీ ఉపాధిఅన్న ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగే రిజర్వేషన్ ప్రక్ర్రియ పైన కొందరికి కొత్తగా  సందేహాలు తలెత్తే పరిస్థితులు నిత్యం జరుగుతున్నాయిప్పుడు. ఈ నేపథ్యంలో ప్రజాహితం ఏకమొత్తంగా అభిలషించే ప్రజాస్వామ్యవర్గాలనూ కలుపుకుపోయే అవసరం ఆత్మగౌరవ ఉద్యమం గుర్తించాలి. 

బచుగుల కోసమే వార్తాపత్రికలుః
బడుగు బలహీన వర్గాలు తమ ఉనికిని నిలుపుకునేందుకు వివిధ మార్గలను అన్వేషిస్తున్న సందర్భం ఇది. అందులో ఒక ప్రధానమైన కార్యాచరణ   బడుగుల గొంతుక వినిపించే నిమిత్తం  పత్రికల నిర్వహణ. విస్తృతమైన సమాజంలో పరిమిత లక్ష్యాల నిమిత్తం  మితమైన వనరుల సాయంతో  చిన్న పత్రికలు మనుగుడ సాగించడం  కొండకు ఎదురు దేకడం మించి కష్టం. కార్మికపేదమధ్య తరగతులు తమ జీవిక నిలిపే  సంజీవనిగా   బడుగుల కోసం నడిచే పత్రికలు  నిర్వహించబడాలి. ప్రజల భాగస్వామ్యం అభిలషించే ఉద్దేశం ఉంటే బలహీనవర్గాల పత్రికలోనే  అన్ని వర్గాలకు సంబంధించినవి కొన్నైనా విలువలతో కూడిన కథనాలు ప్రచురించడం అవసరం!    

సూర్య దినపత్రిక సామాజిక సాహసం
బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజాశక్తి,  విశాలాంధ్ర,  నవ తెలంగాణా వంటి దినపత్రికలు ఎంతో కాలంగా తెలుగునాట క్రియాశీలకంగా నిస్వార్థమైన సేవలు అందిస్తున్నాయి. మూడు దశాబ్దాలు పై బట్టి  సమాజాన్ని  తమ లక్ష్యాల వైపుకు మళ్లించాలనే మంచి దృక్పధంతో ముందుకు సాగే ఆ తరహా వార్తాపత్రికల సరసన చోటు  కోసం పన్నెండు ఏళ్ల కిందట  2007, అక్టోబర్, 21  బ్రాడ్ షీట్ ఫార్మాట్ లో నూకారపు సూర్యప్రకాష్ రావుగారి సంపాదకత్వంలో 'సూర్యదినపత్రికగా ఉద్యమబాటలో తొలి అడుగువేయడం సాహసమే! కానీ నిస్సందేహంగా అభినందనీయం కూడా!  శ్రీ నారాయణ్ దత్ తివారీ చేతుల మీదుగా ఆరంభమయిన ఈ దినపత్రికకు తెలుగు దినపత్రికలలో మొదటగా ప్రామాణికమైన  యూనీకోడ్ లో    వెలువడ్డ  అంతర్జాల పత్రిక అనే రికార్డ్ ఉంది.  ఈ పత్రికజాలస్థలి సమాచారానికి 2010 సెప్టెంబరు, నుండి శాశ్వత లింకులు ఉండడం మరో అరుదైన విశేషం.   పక్షపాతం లేకుండా సమాచారం అందించే పత్రికల అవసరం ప్రస్తుత వ్యాపార సంస్కృతిలో ఎంతో అవసరం.  బలహీన వర్గాల   గొంతుకకు ఈ తరహా చిన్నపత్రికలే  అండ.  అభివృద్ధి అంతా ఒకే చోటకొన్ని వర్గాల వద్దనే పోగుపడడం మిగిలిన ప్రాంతాలువర్గాలు నిర్లక్ష్యానికి గురయేందుకు కారణం. సమాజం పట్ల నిబద్ధతబడుగు వర్గాల హక్కుల పట్ల  బాధ్యతల ప్రమాణంగా మాత్రమే చిన్నపత్రికలకు ఆదరాభిమానాలు.  పాలక వర్గాలు అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను నిర్భయంగా ఎప్పటికప్పుడు  వెలుగులోకి తెచ్చే సత్తా ఉన్నప్పుడే చిన్నపత్రికలకు పెద్ద అభిమానవర్గం లభ్యమయేది. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సిబ్బంది  యాజమాన్యం సహకారంతో   పత్రికను సంరక్షించుకొంటూ దినదిన ప్రవర్థమానవుతున్న సూర్య దినపత్రికకు పదమూడో జన్మదిన సందర్భగా హృదయపూర్వక అభినందనలు! బడుగు జనుల వ్యతిరేఖ విధనాల పట్ల ఆకర్షణ అధికమయే  నేటి కాలంలో అసలైన బలహీన ప్రజల పక్షాన నిలబడి నిర్భీతితో గళమెత్తి నినదించే మరెన్నో పత్రికలకు సూర్య దినదినాభివృద్ధి  ప్రేరణ కావాలని మనసారా ఆకాంక్ష
పత్రికలు- బడుగు జీవుల బతుకు చిత్రికలు
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినోత్సవ  సందర్భంగా రాసిన వ్యాసం)





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...