Wednesday, April 27, 2016

చావడానికి ఎందుకురా తొందర?!- చావుమీద ఓ సరదా వ్యాఖ్య

చావనేది లేకుండా ఉండేందుకు పూర్వకాలంలో రాక్షసులు తపస్సులు చేస్తుండేవాళ్ళుట. అమృతంకోసమే గదా అంత ఘోరమైన వైరాన్నికూడా పక్కన పెట్టి దేవదానవులు క్షీరసాగర మధనానికి పూనుకున్నదీ! కోరుకొంటే మినహా మృత్యుదేవత మహాత్ములను ఆవహించేది కాదని మనకో నమ్మకం. మహాభారతంలోని భీష్మాచార్యులవారు స్వఛ్చంద మరణం వరంగా పొందివున్నా  తన కర్తవ్యపాలన పూర్తి అయేవరకు అంపశయ్య వదిలి  పారిపోలేదుబ్రహ్మంగారివంటి సిద్ధులు సైతం తమ పాత్రపోషణ సంపూర్ణమయిన తరువాతే  సజీవసమాధికి సిద్ధమయింది. మృత్యుపాశంనుంచి తప్పించుకునేందుకు భక్త మార్కండేయుడు పడ్డ అవస్థలు తెలిసీ నేటి యువతరం ప్రాణాలు తీసుకొనేందుకు ఎందుకంతలా ఆరాటపడుతున్నారో అంతుపట్టకుండా ఉంది! కాటికి కాలు చాచుకుని కూర్చున ముసలీ ముతకా సైతం.. మనుమలు.. మనవరాళ్ళందరికీ పెళ్ళీ పేరంటాలయి పిల్లా పాపా పుట్టుకొస్తేగాని చూసి హరీమనేది లేదని మొండికేసే రోజుల్లో.. పసిమొగ్గలు అలా ఉత్తిపుణ్యానికి ఉసురు తీసుకోడం ఉసూరుమనిపించే విషయమే గదా!
యాండీ రూనే అనే ఆంగ్లరచయిత చావును గురించి ఓ చక్కని వ్యాసం ప్రచురించాడు. 'ఫలానా రోజున పైకి పోబోతున్నావన్న సమాచారం తెలిపే  కవరుగాని వస్తే దాన్ని తెరిచి చూసేందుకుకైనా ఎవరూ సాహసం చేయలేరు'అని యాండీ థియరీ! తప్పని పరిస్థితుల్లో గనక తెరిచి చూడవలసివస్తే.. చావు ఘడియలు దగ్గర పడ్డాయన్న దుఃఖవార్త తెలిసిన ఆ అభాగ్యుడు ఆఖరిక్షణాల్లో ఎలా ప్రవర్తిస్తాడన్న అంశంమీద యాండీ రాసిన ఆ వ్యాసం చాలా అసక్తిదాయకంగా ఉంటుంది. నవ్వు పుట్టిస్తుంది. నిజమేగానీ ఎవరి  ప్రాణాలైనా  అలా ఆర్థాంతరంగా గాల్లో కలిసిపోవడం నవ్వులాట వ్యవహారం కాదు గదా!
చావు దగ్గర పడ్డవాడు- ఆలుబిడ్డల్ని గురించి.. కన్నవారిని గురించి ఆలోచించకుండా ఉండగలడా? తన తదనంతరంకూడా తనవారి  బతుకులు కుదుపులేవీ లేకుండా సాగాలని కోరుకోకుండా ఉండగలడా! డబ్బున్నవాడైతే వీలునామాలాంటిదేదో రాసి పడేసి వివాదాలకు తావులేకుండా    చూసుకుంటాడు.
ఏ ఏ ఆస్తిపాస్తులకు సంబంధించిన పత్రాలు ఏ బ్యాంకులాకర్లలో మూలుగుతున్నాయో.. అంత బాధలో కూడా ముక్కుతూ మూలుగుతూ అయినా నమ్మదగ్గవాళ్ళ దగ్గర చెప్పుకొంటాడు. పిల్లల చదువులు.. పెళ్ళి పేరంటాలు.. వాళ్ళ పిల్లలకు పెట్టవలసిన పేర్లతో సహా తాను ఏమేం కోరుకొంటున్నాడో  అంత గుబుల్లోనూ ఓ టైంటేబులు వేసి మరీ అప్పగించడం మర్చిపోడు. కుటుంబ యావ బొత్తిగా లేకపోతేనేమి.. చావు క్షణాలు దగ్గర పడ్డాయన్న విషయం తెలిసిన మరుక్షణంనుంచి పడమటి దేశాల పౌరుడైనా సరే.. ఉన్న క్రెడిట్ కార్డుల లిమిట్లన్నీ  గుట్టుగా వాడేసుకొనే గుటుక్కుమనాలని చూస్తాడని యాండీ ఆలోచన.
ఎలాగూ పోతున్నాం గదా.. అని ఇంత కాలం ఉగ్గపటుకొన్న  మందు.. పొగల్లాంటి పాడు అలవాట్లు మళ్ళీ మొదలెట్టే మహానుభావులూ లేకపోలేదని ఆయనగారి  మరో ఎద్దేవా. జుత్తు కత్తిరించుకొనే ఖర్చు మాత్రం అందరికీ ఒకే విధంగా వృథా  అనిపిస్తుందని హాస్యంకూడా ఒలకపోసాడా యాండీ తన వ్యాసంలో. ఇష్టమైన పబ్బులు..  మసాలా మూవీలు ఎంత దూరంలో ఉన్నాసరే వెళ్ళి చూసి తరించాలని ఉవ్విళ్లూరే  విలాసవంతుల లీలలయితే ఇహ వేరే చెప్పల్సిన అగత్యమే లేదుట. తిండియావ ఉన్నవాళ్లయితే ముప్పూటలా మేతమీదనుంచి ధ్యాస మళ్ళించరని  యాండీ చమత్కారం. ఏది ఏమైనా ఫ్వూనరల్ ఏర్పాట్లు స్వీయాభిరుచుల ప్రకారం  దగ్గరుండి మరీ చేసుకొనే సౌకర్యంమాత్రం ఆ దురదృష్టవంతులకు ఒక్కళ్లకే సొంతం కదా! ఆహా! ఎంత అదృష్టంహఠాత్తుగా ప్రాణాలు తీసుకొనే ఆవేశపరులకు కనీసం ఆ వెసులుబాటైన దొరకదు! ప్చఁ.. దురదృష్టం!
నిజానికి ప్రాణాలు తీసుకోవడం ప్రాణాలు పోయేటంత బాధాకరంగా ఉంటుంది. ఇంతకాలం ఎంతో శ్రద్దాసక్తులతో పెంచి పోషించుకొన్న కుక్కా,, మొక్కా వదిలి పోవడం ఎంత బాధాకరం! ఏ సంసార ఝంఝాటం వద్దనుకొని ..బైరాగిలా బతుకు వెళ్లదీసే బాపతు సన్నసైనా తెల్లారితే బతుకు తెల్లారిపోతుందని తెలిస్తే తెల్లవార్లూ కుమిలి పోకుండా ఉండగలడా! చేతిలో చిల్లిగవ్వ లేకపోతేనేమి.. అన్నీ పక్కమీదనే  జరిపించుకొనే  రోగిష్టిమారి జీవి అయితేనేమి.. ప్రాణాలు పోతున్నాయని తెలిస్తే సంతోషంతో గంతులేస్తాడంటే నమ్మలేం. అవుట్ రైట్ గా 'అసలే జన్మా వద్దు .. పొమ్మ'ని సన్యాసులు అనే మాటలన్నీ  మాట వరసకనే మాటలుగానే తీసుకోవాలి. న్నో బాధలు పడే అభాగ్యుడికైనా సరే.. వచ్చే జన్మలో ఏ బిల్గేటు కొడుగ్గానో.. మోదీలాంటి పిడుగ్గానో.. మహేష్ బాబుకి మోడలుగానో పుడితే బాగుణ్నన్న బలీయమైన వాంఛ మనసు అట్టడుగు  పొరల్లో ఎక్కడో దాగి ఉంటుంది. మరలాంటప్పుడు చేతిలో ఉన్న విలువైన మానవజన్మను చూస్తూ చూస్తూ వదులుకోవడం ఏమంత తెలివైన ఆలోచన!.. విడ్డూరం కాకపోతే!
ఈ మద్య ఏ వార్తాపత్రిక తిరగేన్తున్నా.. ఏ టీ.వీ చానెల్ తిప్పి చూస్తున్నా.. చావు వార్త కళ్లబడకుండా ఒక్క పూటైనా చల్లంగా గడుస్తున్నదా! ఓపికున్న వాళ్ళెవరైనా ఈ దిక్కుమాలిన చావువార్తలు  లెక్కలు తీసి చూడండి! భూమి పుట్టినప్పట్నుంచీ పోయినవాళ్లే ఉన్నవాళ్ళకన్నా ఎన్నో రెట్లు అధికమన్న చేదునిజం  బైటపడుతుంది. బాధ పుడుతుంది.
అంతుబట్టని రోగాలతో..  ఆహారపరమైన లోపాలతో.. గర్భస్రావాలతో.. పురిటి బాధలతో.. ఫ్యాక్షనిస్టుల కక్షలతో..  వాతావరణ కాలుష్యాలతో.. . వడదెబ్బలతో.. పరువు హత్యలతో.. మందుతో.. కల్తీ మందులతో.. హరి హరీ.. ఇదీ అదీ అనేమిటి.. చివరికి  చిటికెన వేలంత లేని దోమలతో.. దూకుడుగా తిరిగే వాహనాలతో  సైతం  'హరీ' అనే వారి సంఖ్య రోజు రోజుకూ మరీ మరీ ఎక్కువవుతున్నాయి!అగ్నిప్రాఅదాలు.. భూకంపాలు.. వరదలు..కరువులు వ్హాలకు  ఇప్పుడు అదనంగా సొంతంగా వింత వింత కారణాలతో ఎవరి గొంతులు వాళ్ళే నులుముకోవడాలు ఒకటి..  మితిమీరిపోతున్నాయి.. కలవరం కలిగిస్తున్నాయి! ప్రకృతి సమతుల్యం దీని మూలకంగా దెబ్బతింటే బతికి ఉన్నవాళ్ళకీ చచ్చే చావే!
రైతు పురుగుమందు మింగితే బీడువారిని పొలం మళ్లీ చిగురిస్తుందా? ఆకలికి తట్టుకోలేక నేతపనివాడు చెట్టుకు ఉరి వేసుకొంటే బతికి ఉన్న అతని కుటుంబానికి మేత దొరుకుతందా? ముక్కు మూసుకున్నంత మాత్రాన అప్పుల తిప్పలు ఎవరికీ తప్పిపోవు. మిగిలున్న అతగాడి వారసులను చుట్టుముటి ముప్పతిప్పలు పెడతాయి! ఉన్న ఉద్యోగం ఉద్వాసన పలికిందనో.. వైద్యానికందని రోగం వంటిమీదకొచ్చి వదలడం లేదనో.. చేస్తున్న కంచిగరుడ సేవకు పెద్దల గుర్తింపు కరువయిందనో.. వ్యాపారం ఎక్కిరాక అప్పులపాలు చేసి తిప్పలుపెడుతున్నదనో.. పరీక్షల్లో, ప్రేమలో విఫలమయ్యామనో.. సీనియర్ల ర్యాగింగుల్లో మానవీయకోణం కూడా బొత్తిగా కరువయిందనో.. ఉపాధ్యాయులో.. ఇంటిపెద్దలో విపరీతంగా  మందలించారనో.... అభిమాన తారకు/తారడుకి వేరే వారితో పెళ్లయి పోయందనో.. ఆరాధ్యనేతలు అవినీతి కేసుల్లో చిక్కి చెరసాల పాలయ్యారనో.. కోరుకొన్న రాష్ట్రం ఎంత పోరినా వచ్చి ఓళ్ళో వాలడం  లేదనో.. సెల్ టావర్లు క్కి.. టాంకుబండునుంచి దూకి.. వంటిమీద గ్యాసునూనె ఒలకబోసుకొని... పురుగులమందు మింగి.. ఫ్యానురెక్కలకు ఉరి వేసుకొని.. కన్నవారికి కడుపుకోత మిగల్చడం.. తాము కన్నవారిని అనాథులు చేయడం.. ఎంత తెలివిమాలినతనం! చావడానికిలా తొందరపడడం ఎంత చిచారకరం!
రాజుల ఆట కట్టించేందుకు బంటులు చావడం చదరంగం రూలు. నిజ జీవన రంగంలో  ఎన్ని కోట్లబంటులు ఆత్మార్పణ చేసుకొన్నా రాజుల ఆట కట్టదు. ఆగదు.. చచ్చేందుకు సవాలక్ష దారులు. చావుఘడియ ముంచుకొస్తే.. ఏ మున్సిపాలిటీ చెత్తకుప్పయినా  చాలు.. మీద పడేందుకు! నోరు మూయని బోరుబావో.. మ్యాన్ హోలో చాలు.. లోపలికి లాక్కునేందుకు! ఫలానా రోజున మరణం ఖాయమన్న వర్తమానం అందినా సరే.. ఆఖరి క్షణం వరకు మనిషిగా మెలగడమే మనిషి చేయతగిన పని. బతికేందుకున్నది ఒక్కటే దోవ. గుండె దిటవు.  బతికి తీరాల్సిందేనన్న పంతం ఉంటే చాలు.. అర్థాంతరంగా చావడం ఎంత తొందరపాటో అర్థమవుతుంది. చావడానికి ఎందుకు తొందర?   
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- 'చుట్టు పక్కల చూడరా' కాలమ్ లో ప్ర
చురితం)



Tuesday, April 26, 2016

తెలుగు వెలుగులు- ఈనాడు సంపాదకీయం

తెలుగువారికోసం తెనిగించిన ప్రమ సంపూర్ణ వైష్ణవ ప్రధాన తత్వకావ్యం నన్నయ మహాభారతం. ఆదికవిగా నన్నయను ఆదరించింది తెలుగుతల్లి. నన్నెచోడునివంటి శైవ ప్రజాకవినీ అంతే ప్రేమగా చేరదీసింది. హరిహరులకు అబేధం చాటుతూ గొప్ప నాటకీయతతో పదిహేను పర్వాల భారతాన్ని అపూర్వంగా పూరించిన తిక్కననూ అక్కున చేర్చుకుని ధర్మ నిష్పక్షపాతాన్ని నిరూపించుకుంది. ఎర్రనవంటి ప్రతిభా ప్రబంధ పరమేశ్వరులు ఎందరో తెలుగుతల్లి కడుపున  జన్మించారు. ప్రౌఢశైలి, శబ్దగుంభన, పదమాధుర్యం, చమత్కృతులతో ‘చమక్ మనిపించే మనుచరిత్ర, వసుచరిత్ర, కళాపూర్ణోదయం, విజయవిలాసం,
పారిజాతాపహరణంవంటి ఆభరణాలు తెలుగుతల్లి గళంనిండా కనులపండువుగాఎన్నెన్నో! శ్రీనాథుని కాశీఖండం, పోతనామాత్యుని మహాభాగవతం, మొల్లతల్లి రామాయణం, కదిరీపతి శుకసప్తతి, అన్నమయ్య పదకవితలు, త్యాగయ్య పంచరత్నాలు, క్షేత్రయ్య మువ్వగోపాలపదాలు, రంగాజమ్మ యక్షగానం.. వేమన ధూర్జటి కుమార కుమారి సుమతీ నీతిశతకాలూ... మన్నికైనవి ఇవీ అని- ఎన్నెన్ని ఎంచి చూపించాలి! రాయలవారి నుంచి రామదాసులవారి వరకు- ఒకరినిమించి ఒకరు అమ్మకు సమకూర్చిపెట్టిన సొమ్ము సమ్మంధాల వివరాలను.. వాటి తళుకు బెళుకులను వర్ణించుకుంటూపోయేందుకు ఒక జన్మ చాలదు. తూర్పు చాళుక్యుల పాలనంతటి పురాతనమైన తరువోజ అలంకారాలు, శతాబ్దాలకిందటి కందుకూరి శాసనమంతటి సౌందర్య 'సీస'లు, ద్విపదలు. తుమ్మెదపాటలు, గొబ్బిపదాలు, వెన్నెలపాటలు, ఊయలగీతాలు, గౌడుగేయాలు, అభినయంతో కూడిన అలతులు.. పెట్టెనిండా పట్టకుండా పొంగిపొర్లే అలంకారాలు- తెలుగుతల్లికి న్నెన్నో!

'చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో/ మెక్కిన భంగి.. మక్కువ పళ్ళెరంబున స/ మాహిత దాస్యమనేటి దోయిటన్/ దక్కెనటంచు' రామదాసు జుర్రుకొన్నది రామయ్య రూపంలో ఉన్న సుధారసమా? తెలుగుభాష సౌందర్య రూప విశేషమా? ఒక్క రామదాసువంటి భక్తశిఖామణులని ఏముంది.. సాక్షాత్ ఆ భగవంతుడినే అలరించిన సుమధుర భాషాక్షరాలు ..లు. ఆంధ్ర మహావిష్ణువు.. శ్రీ కృష్ణదేవరాయలకి కలలో కనిపించి గోదాదేవి కల్యాణ గాను తెలుగులోనే రాయాలన్న పురమాయింపుకు కారణం  శ్రీవారే స్వయంగా సెలవిచ్చారు కదా! 'తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ' నడమేనా! 'యెల్ల నృపులు గొలువ నెఱుగవే బాసాడి!' అని చురక కూడా అంటించారు. రాయలవారిది  ప్రారంభంనుంచీ పెను ఆంధ్రభాషాభిమానమేనని. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని మనస్ఫూర్తిగా నమ్మిన భాషాపోషకులని చరిత్ర చెపుతూనే ఉంది. స్వయంగా 'తుళువు' అయినా తమిళ గోదాదేవి గాను తెలుగులోనే రాయ సంకల్పించేందుకు  కారణం ఆంధ్ర భాషమీదున్న గాఢాభిమానమే. 'అక్షరం కొసను అచ్చుతో ముగించగల అజంత సౌలభ్యం ప్రపంచభాషలన్నింటిలో ఇటాలియనుకిలాగా ఉన్నందు వల్లనే  తెలుగ పలుకుకీ కలకండ పలుకు తియ్యదనం' అని ముందు గుర్తించిన మహానుభావుడు హాల్డెన్ దొర. 'వ్రాసిన- పద్య మాంధ్రమున వ్రాయవలెన్' అని దాశరథి అన్నారంటే ఆశ్చర్యపోవలసింది ఏముంది! అప్పయ్య దీక్షితులవంటి ఉద్దండ తమిళపిండమే 'తెలుగు నేలపై పుట్టుక పూర్వజన్మ సుకృతఫలం' ని పొగడ్తలకు దిగిన తరువాత- ఆంధ్రభాష ఘనతకు మరో ధ్రువపత్రం అవసరమా! మధ్యమధ్యలో స్వరం, స్వరూపం మారుతూ వచ్చినా శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంనాటి తెలుగక్షర సౌందర్యం, మాధుర్యం ఈ నాటికీ అమరావతీ స్థూపమంత స్థిరంగానే ఉంది. సరే! తెలుగువారి గుండెలమీదా అంతే స్థిరంగా ఉందా? గిడుగు, గురజాడ, కందుకూరి, విశ్వనాథ, శ్రీ శ్రీ, జాషువావంటి మహామహులు తెలుగుతల్లి గుమ్మంలో వెలిగిస్తున్నా.. ఆ గుమ్మటాల వెలుగులు వెలా తెలా తేలిపోతున్నాయే! ఆ తెగులేనయ్యా  ఇప్పటి మన దిగులు.

తిరుపతి వేంకటశాస్త్రిగారు ఒకానొక శతావధాన ప్రదర్శన సందర్భంలో 'రెండు బాసలకు మేమే కవీంద్రులమంచు'  రోషంతో మీసం మెలివేశారని వినికిడి. దేవభాషలో దిట్టయివుండీ తన మాతృభాషాభిమానాన్ని  దానికి ఈటుగా చాటుకున్న శ్రీనాథుడి వారసత్వాన్ని గూర్చి చెప్పుకోవాలి. 'అత్యంత సుకుమారి ఆంధ్రభాషా యోష/ ఆత్మీయ ముద్దుచెల్లి నాకు' అన్న అన్నప్రేమ ఎంతలా పొంగిపొర్లకుంటే శృంగారనైషధంమీది శ్రద్ధ చాటువుల్లోనూ చాటుకుంటాడు! వామనభట్టువంటి దిట్టలున్న వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడికి విద్యాశాఖాధికారి పట్టం కట్టబెట్టింది ఈ తెలుగు భాషమీది దిట్టతనమే! అచ్చుకు తగినట్లు వర్ణక్రమాన్ని సంస్కరించి, ఎన్నో విస్తృత ఉద్గ్రంథాలను పండితుల సాయంతో పరిష్కరించేందుకు బ్రౌనుదొరను పురిగొల్పిందీ తెలుగు పలుకుబడిలోని తళుకు బెళుకులే! తరిగొండ వేంగమాంబ చేత- జనం నాలికలమీద నేటికీ నాట్యమాడే సరళ తత్వాలను రాయించింది తెలుగుభాషలోని అజరామరమైన  సౌందర్య లక్షణమే! కాలంతోపాటు వేగం పెరిగింది. వినిమయ విస్తృతికున్న ఎల్లలు చెదిరిపోయి ఇల్లే వైకుంఠమనుకునే కాలం చెల్లిపోయింది. అంతర్జాతీయ సాంకేతికావసరాలకు సరితూగటంలేదన్న వంకతో తల్లిభాషను చిన్నచూపు చూసే పెడధోరణి ప్రమాదకర స్థాయికి పెరిగింది! మాతృభాష కన్ను వంటిది. పరాయిభాష ఎంత ఘనమైనదైనా కళ్లజోడుకన్నా ఎక్కువ ఉపయోగానికి రానిది. తల్లిపేగు ప్రాణధార, తల్లిభాష జ్ఞానధార. తల్లికి ప్రత్యామ్నాయం లేనట్లే తల్లిభాషకూ ప్రత్యామ్నాయం ఉండదు.  కోట్లాదిమంది బిడ్డలుండీ తల్లికి చీకటి కొట్టే గతి కావడం జాతికి శుభం కాదు. కంప్యూటరీకరణకు అచ్చుగుద్దినట్లు అమరే ఏకైక భారతీయ భాష తెలుగు లిపే. భావవేగాన్ని అత్యంత సమర్థవంతంగా అందిపుచ్చుకునే  పరుగు పందెంలో  రోమనువంటి యూరోపియను భాషలతోనే కాదు..  మన దేవనాగరి లిపితోనూ ముందంజలో ఉంది  తేనెలొలుకే మన తీయని తెలుగుభాషే అని సైన్స్‌ టుడే’ లో  ఎన్నడో వచ్చిన  వ్యాసం ప్రస్తుతించింది. ప్రస్తుతం కొరతపడిందల్లా తెలుగు వారి గుండెల్లో కాస్తంత ఆత్మగౌరవం.. మాతృభాషమీది అభిమానం.. మన తెలుగు కదా.. ఎలాగైనా మళ్లీ  నిలబెట్టుకోవాలన్న ధృఢ సంకల్పం
-సేకరణః
కర్లపాలెంహనుమంతరావు
(ఈనాడు, సంపాదకీయం, 08-01-2012 లో ప్రచురితం) 
(ఈనాడు సంపాదకులకు .. యాజమాన్యానికి ధన్యవాదాలు.. కృతజ్ఞతలు)


Wednesday, April 13, 2016

పుస్తకం ఓ రెక్కల గుర్రం- ఈనాడు సంపాదకీయం

తెలుగు లోగిళ్లలో తొట్టతొలిగా చిట్టిబాలలచేత పుస్తకం పట్టించినప్పుడు ఒప్పజెప్పించే పద్యం, 'తల్లీ! నిన్ను దలంచి'. బుద్ధి, మనసు కలిసి ఉండే హృదయపీఠంమీద కొలువై ఉన్న చదువులమ్మను- దోషరహితమైన సుస్పష్ట శబ్దసౌందర్యం, సుదూర కాలతీరాల వరకు జగన్మోహనకరంగా వ్యాపింపచేసే శక్తియుక్తులు ప్రసాదించమని చేసే ప్రార్థన అది. వాగీశ్వరి హస్తభూషణం పుస్తకం. 'తలవాకిటను మెలగు ఆ చెలువ'ను విద్యాధిదేవతగా ఆరాధించే సంస్కృతి భారతీయులది. పుస్తకం, విత్తం, కన్య  ధర్మార్థకామాల ప్రతీకలు భారతీయులకు. కన్య..విత్తం  కొంతమందికే సొంతం. గ్రంథజ్ఞానం అందరికీ చెందే ఆస్తి. చర్మచక్షువులతో చూడసాధ్యంకాని మహితాత్ముల మనోభావాలను, జీవితానుభవాలను ముందుతరాలకు అందజేసే ఉత్తమ సాధనం పుస్తకమే. వ్యాసపీఠంమీద రామాయణం ఉన్నదంటే వాల్మీకి మహర్షి ఆత్మ మనముందు కూర్చుని ధర్మప్రబోధం చేస్తున్నట్లే లెక్క. గీతాపఠనం కొనసాగుతున్నప్పుడు సాక్షాత్ ఆ జగద్గురువు ప్రత్యక్షమై జీవితంమీద మన విశ్వాసాలను పెంచుతున్నట్లే గణన. కరుణశ్రీ భావన గుర్తు తెచ్చుకుంటే సరి. 'కలువలు పూచినట్లు/ చిరుగాలులు వీచినట్లు/ తీవలు తలలూచినట్లు/ పసిపాపలు చేతులూచినట్లు/ ఆత్మలు పెనవేసినట్లు' కవిత్వం సృజించే కాళిదాసునుంచి కృష్ణశాస్త్రుల వరకు  ఆ గ్రంధబంధాలవల్లే  ముందు తరాలందరికీ  ఆత్మబంధువులుగా మారింది.  గుంటూరు శేషేంద్రశర్మ అన్నదీ అదే. పుస్తకంలో మునిగిన మనిషి పుట్టలో మునిగిన ముని అని ఆరుద్ర చమత్కారం. మనసును సానబెట్టుకొనే చందనపు చెక్క గ్రంథం. 'గ్రంథ నిలయంబు శారద కనకపీఠి/ గ్రంథ నిలయంబు కవుల శృంగారవీటి/ గ్రంథ నిలయంబు మోక్ష సద్గతికి చీటి' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తి నూటికి నూరుపాళ్లు సూటి అయిన మాట.

విశాల విశ్వాన్ని ఓ పుస్తకాల గదిగా కుదించాలన్నా.. పుస్తకాల గదిలోనే ఓ విశాల విశ్వాన్ని సృష్టించాలన్నా అక్షరానికే సాధ్యం. అక్షరం  త్రేతాయుగంనాటి రాముడిని కలియుగంనాటి దేవుడిగా మారుస్తుంది. తెలుగు త్యాగయ్యను తమిళులకు ఆరాధ్యుడిగా మారుస్తుంది. కంచెర్ల గోపన్న చెర చీకటి శోకాలాపనలను రామదాసు కీర్తనలుగా వెలిగించినా, హాలుని గాథా సప్తశతిని గొప్పకథలుగా మనకు ఇప్పుడు వినిపించినా..  ఆ ఘనతంతా అక్షరానిదే. గ్రంథస్థ వ్యవస్థే లేకపోతే వేమన వేదాంతం బ్రౌనుదొర వరకూ పాకేదా! అన్నమయ్య పదసంపద ఈ మాత్రమైనా జాతికి దక్కేదా! పరదార కామన, అధికార లాలస, సాధుజన పీడన సర్వనాశనానికి మూలకారణాలవుతాయన్న  ధర్మసూక్ష్మం- రామాయణ, భారత, భాగవతాదులుగా రాయబట్టే నీతులుగా నేటికీ  నిలబడి ఉంది.. హరిశ్చంద్రుడి చరిత్ర గాంధీజీని సత్యాగ్రహిగా మార్చింది. మోహన్ దాసు సత్యప్రయోగాలే మార్టిన్ లూథర్  పోరుకు ప్రేరణ. చదువుసాముల ప్రాధాన్యతేమిటో హిరణ్యకశిపుడి నోట చెప్పించాడు భాగవతకవి పోతన. విద్యాగంధం లేక జనుషాంధులవలె కాలాన్ని వృథాచేసే కొడుకులను విష్ణుశర్మ అనే విద్వాంసుడి హస్తగతం చేస్తాడు  'నీతిచంద్రిక' కథలో సుదర్శన మహారాజు. సద్గ్రథం  'పలు సందియముల దొలచును/ వెలయించు నగోచరార్థ విజ్ఞానము, లో/కులకు అక్షి' అన్న పరవస్తు చిన్నయసూరి పలుకుల్లోని వాస్తవాన్ని  ఇసుమంతైనా సందేహించవలసిన అవసరం లేదు. ఒకానొకప్పుడు విద్యావంతుల నట్టింట ఓ పుస్తకాల గదీ తప్పనిసరి అలంకారమే. వివాహాది శుభసందర్భాల్లో పుస్తకాల చదివింపులు  సదాచారంగా వస్తుండేది. గతంలో గ్రంథపఠనం ఒక ఉత్తమ  సంస్కార చిహ్నం.

ఒక తరంవరకూ విద్యాలయాల్లో బాల విజేతలకు పుస్తకాలే బహుమతులుగా దక్కేవి. వాటి స్థానాన్ని ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా 'ఎలక్ట్రానిక్ నోట్‌బుక్కు' ల్లాంటి ఆధునిక పరికరాలు ఆక్రమిస్తున్నాయి. సాంకేతికంగా మనిషి ఎంత పురోభివృద్ధి సాధిస్తున్నా..  పుస్తకం స్థానం ఏ ఈ-పరికరం పూడ్చలేదు. టీవీ, చలనచిత్ర మాధ్యమాలు ఎంత శక్తివంతమయినవయినా- పుస్తకంలా ఎన్నటికీ 'వ్యక్తిగతం' కాలేవు. అమ్మలా బిడ్డకు మంచి మాటలు నేర్పించేది, బొమ్మల పుస్తకమే! తండ్రినుంచి దండన భయం ఉండచ్చు. ఏ దండనోపాయం  లేకుండానే బిడ్డని అడ్డదారినుంచి తప్పించగలిగేదీ పుస్తకమే! రోమన్ సేనాపతి మార్కస్  అరీలియసుకి యుద్ధ ఆందోళనల మధ్యసైతం  సాంత్వన కోసం శిబిరంలో పుస్తకం పట్టుకుని కూర్చోడం అలవాటు. ఎన్ని రాచకార్యాల వత్తిడిమీదున్నా రాయలవారు  విద్వద్గోష్ఠులు విధిగా నిర్వహించేవారు. తాళపత్ర గ్రంథాలను తులసిదళాలంత పవిత్రంగా భావించిన తరాలు మన తాతలవి. ఇప్పుడా 'పుస్తకాల పిచ్చి' పిచ్చి పుస్తకాలస్థాయికి దిగజారటమే దిగులు పుట్టించే  అంశం. అమెరికన్ రచయిత ఎమిలీ డికెన్సన్ శ్లాఘించినట్లు, పుస్తకం- 'మానవాత్మను మనోవేగంతో స్వప్నలోకాలన్నీ తిప్పి తీసుకురాగల రెక్కల గుర్రం'. ఆ అపూర్వ అనుభవాన్ని పసిపిల్లలనుంచి దూరం చేస్తున్న కంప్యూటర్ సంస్కృతి మీద గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంవారు పరిశోధనలు సాగిస్తున్నారు. ఆధునిక పరికరాల వినియోగం అతిగా ఉన్న అమెరికా, స్వీడన్ దేశాల బాలలు మేధోపరిజ్ఞాన రంగంలో బాగా వెనకబడిపోతున్నారన్నది వారి తాజా పరిశోధనల ఫలితం. పుస్తక పఠనంమీద అధికంగా ఆధారపడిన ఇటలీ, హంగరీ దేశాల పిల్లల ప్రజ్ఞ- అభివృద్ధి చెందిన దేశాల బాలబాలికల ప్రతిభాపాటవాలకన్నా చాలా ముందంజలో ఉందని పరిశోధక బృంద నాయకురాలు ప్రొఫెసర్ మోనికా రోజెన్ నిర్ధారించారు. మితిమీరిన సాంకేతిక వినియోగ వ్యసన సంస్కృతినుంచి అచ్చు అక్షరాల సంస్కృతిని తిరిగి అందిపుచ్చుకోవాల్సిన అవసరం  ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కన్యాశుల్కం గిరీశంలాగా 'బయింగ్ బుక్స్... బార్బేరియస్!' అని ఈసడించుకుంటే- మనిషి కథ అడ్డం తిరగడం ఖాయం!
-సేకరణః కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు, ఆదివారం సంపాదకీయం, 18-12-2011లో ప్రచురితం)
(ఈనాడు యాజమాన్యానికి కృతజ్ఞతలతో)

Friday, April 8, 2016

కాలజ్ఞానం- దుర్ముఖి ఉగాది సందర్భంగా


('ఉగాది' కాలానికి సంబంధించిన పర్వదినం. 'దుర్ముఖి' సందర్భంగా ఈనాడు దినపత్రిక 06-02-2009 నాటి ఆదివారం సంపాదకీయంఈనాడు యాజమాన్యం.. కృతజ్ఞతలతో)
'కన్ను తెరిస్తే జననం- కన్నుమూస్తే మరణం- రెప్పపాటేగదా ఈ ప్రయాణం!' అన్నాడొక కవి. నిజానికి కంటిరెప్ప కొట్టుకోవడానికి జీవితకాలం అక్కర్లేదు. 'కాలపత్రంమీద కాలాతీత సిరాతో రాసినప్పుడు ఏర్పడిన చిత్రం పేరు మనిషి' అని ఆచార్య గోపి ఎంత గొప్పగా చెప్పినా అసలు చిత్రమంతా ఉన్నది అనంతంనుంచి అనంతంలోకి నిరంతరంగా సాగే కాల జీవప్రవాహంలోనే! మనిషి అందులోని ఓ అల... అతని జీవితకాలం ఆ అల లేచిపడినంత. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం రానంతవరకూ కాలం ఓ అంతుబట్టని వింత! మహాభారతంలో యక్షుడు 'సూర్యుడిని నడిపించేదెవరు?' అని అడిగినప్పుడు ధర్మరాజు సమాధానంగా చెప్పిన 'బ్రహ్మం' అంటే ఈ 'కాలం' అనే భావం. పెను విస్ఫోటన (బిగ్‌బ్యాంగ్‌) సిద్ధాంతం ప్రకారం- కాలం విశ్వంతోసహా పుట్టినది, విశ్వమున్నంత వరకూ ఉండేది. 'కాలం అతిక్రమించలేనిది' అంటుంది వాల్మీకి రామాయణం. కురుక్షేత్ర యుద్ధసమయంలో సాక్షాత్‌ శ్రీకృష్ణపరమాత్ముడంతటివాడూ, అస్తమించే సూర్యుడిని ఆపలేక సుదర్శనచక్రాన్ని అడ్డుపెట్టాడు! కాలం మనిషికి అయాచితంగా దక్కిన వరం. కోరకుండానే దొరికిన పెన్నిధి. 'టైమ్‌ ఈజ్‌ మనీ' అనటం సరికాదు. సమయమనేది నిధి మాదిరి పోగేయలేనిది. బదిలీకి కుదరనిది. తిరిగిరానిది. గడియారాన్ని కొనగలంగానీ, దానిలోని కాలాన్ని కొనగలమా? జ్ఞానార్జనకోసం తననాశ్రయించిన చంద్రునితో బృహస్పతి 'నిజానికి నాకన్నా నీవే జ్ఞానివి నాయనా!' అంటాడు. తనవద్దలేని యౌవన విజ్ఞానం చంద్రుని వద్ద ఉందని రుషి భావం.

'కాలమనేది లేకపోతే అన్ని పనులూ ఒకేసారి చేయాల్సి వచ్చేది. ఎంత ఇబ్బంది!' అని చమత్కరించాడు బెర్నార్డ్‌ షా. కాలం విలువ ఒక్కొక్కరికి ఒక్కోవేళ ఒక్కోరకంగా ఉంటుంది. ఏడాది విలువ పరీక్ష పోయినవాడికి తెలుస్తుంది. నెల విలువ నెలతక్కువ బిడ్డను కన్నతల్లికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది! 'వారం' వారపత్రికలకు సర్వం. రోజు అనేది రోజుకూలీకి ఉపాధి. గంట అంటే పరీక్ష రాసే విద్యార్థికి, నిమిషమంటే ఆంబులెన్సులోని రోగికి ఎంత విలువైనవో బాగా తెలుసు. ఒలింపిక్స్‌ పరుగుపందేల్లో సెకండులో వెయ్యోవంతు తేడాతో ఓడిపోయిన క్రీడాకారులు కోకొల్లలు! రునుంచి రికి పోతూ దారిలో కారులోనే వీలున్నంతవరకు ఓ కునుకు లాగించే గాంధీగారి అలవాటు వెనక ఎంతో 'కాల ప్రణాళిక' ఉండేది. పరీక్ష ముందు పెట్టి పాఠం, తరవాత నేర్పే వింత గురువు- కాలం. మామూలు మనిషికి కాలం సాపేక్షికత ఓ పట్టాన అర్థం కాదు. వివరంగా చెప్పమని వేధించేవారికి ఐన్‌స్టీన్‌ 'ఇష్టమైన వారికోసం ఎదురు చూసే వేళ క్షణమొక యుగం... వారు ఎదురుగా ఉన్నవేళ యుగమొక క్షణంగా గడవటమే సాపేక్షికత' అని సరదాగా


ఉదహరించేవాడు. ఇరవై ఏళ్ల వయసులో రోజుకు ఇరవైనాలుగు గంటలున్నా చాలని కాలం, అరవైల్లో గంటకు అరవై నిమిషాలున్నా గడవటం భారంగా తోచటమే సాపేక్షికత అంటారు 'థియరీ ఆఫ్‌ ఎవ్విరీ థింగ్‌' నిర్మాత స్టీఫెన్‌ హాకింగ్‌.

'జారిపోయే ప్రతీ క్షణాన్నీ మాలిమి చేసుకోవడంలోనే మనిషి నిజమైన ప్రజ్ఞ దాగి ఉంది' అంటున్నారు వ్యక్తిత్వ వికాసవేత్తలు. ఓ గంటపాటు హాయి కావాలంటే కునుకు తీయి! రోజంతా సుఖంగా గడపాలంటే కొత్త ప్రదేశానికి వెళ్లు! ఏడాదంతా ఏ దిగులూ దరి చేరకూడదనుకుంటే  ఏదైనా బ్యాంకులో నీ సంపాదన దాచుకో! అదే జీవితాంతం ఆనందంగా గడిచిపోవాలంటే ఇరుగుపొరుగుతో కలివిడిగా మసులు!’ అని చైనా సూక్తి. 'ఆపన్నులను ఆదుకుంటే ఆ దేవుడి విలువైన సగం సమయాన్ని ఆదా చేసినట్లు' అంటారు మదర్‌ థెరెసా. 'చేద్దాంలే... చూద్దాంలే అనుకోవద్దు. 'మనిషి జీవితకాలం 60 ఏళ్లేగాని వాస్తవంగా చూస్తే 13 ఏళ్లే' అంటున్నారు 'ది రోడ్‌లెస్‌ ట్రావెల్‌' రచయిత స్కాట్‌ పెక్‌. చదువు సంధ్యలకు పాతికేళ్ళు, పని పాటలకు రోజుకు ఎనిమిది గంటల చొప్పున పన్నెండేళ్ళు; స్నానపానాలు, ఆహారవిహారాలు, ఒంట్లో బాగోలేకపోవడం వంటివాటికి మరో పదేళ్ళు పోగా- మిగిలేది 13 ఏళ్లే! మనం చేసే పనిలో ప్రతి ఎనిమిదేసి నిమిషాలకు, ఐదు నిమిషాలకు తక్కువ లేకుండా రోజుకు కనీసం ఏడుసార్లు ఆటంకాలు ఏర్పడతాయని టైం మేనేజ్‌మెంట్‌ నిపుణులు అంటున్నారు. రోజూ ప్రయాణానికి అరగంట, సెల్‌ఫోన్‌లో పనికిరాని మెసేజ్‌లు చదివి తొలగించటానికి పావుగంట, టీవీ రిమోట్‌ వాడకానికి పావుగంట. అన్నింటికన్నా ముఖ్యం- అయినదానికీ కానిదానికీ అనవసరంగా వాదించి ఓడిపోవటానికో, ఓడించి ఎదుటివాడి సమయాన్ని పాడుచేయటానికో 37 నిమిషాలు మనిషి వృథాగా వాడుతున్నాడని వాళ్ళు వాపోతున్నారు. ఆవులింతకు ఆరుసెకన్లు పడుతుందని ఆపుకోలేంగానీ, ఈ అనవసరమైన కాలయాపనను అదుపు చేసుకోలేమా! 'సమయాన్ని సమయానుకూలంగా, తనకిష్టమైన రీతిలో ప్రతిభావంతంగా వాడుకునే సాధనలో సాధించే విజయమే మనిషి నిజమైన సంపద' అంటున్నారు 'రిచ్‌ డాడ్‌-పూర్‌ డాడ్‌' రచయిత కియోసాకి.
'నిన్న' చెల్లని చెక్కు, 'రేపు' చేతికిరాని సొత్తు. నేడు అనేదే మనం నిజంగా వాడుకునే చిల్లర! చిల్లరమల్లరగా దీన్ని వాడుకోరాదనే దానికి మించిన కాలజ్ఞానం మనిషికి మరేముంటుంది.
-సేకరణః కర్లపాలెం హనుమంతరావు

-


Thursday, April 7, 2016

హైకూ- చంద్రుడిని చూపించే వేలు.- హైకూ పరిచయ వ్యాసం



"Because the poem is tiny does not mean that it is simple. A good haiku is apt to be not only subtle but complex with inner meanings"
జపాన్ దేశ కవితా ప్రక్రియ హైకూ. పండితులను, పామరులను సమానంగా అలరించే హైకూ వయసు దాదాపు ౩౦౦ ఏళ్ళు. 20వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలకు పాకిన తరువాత ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. గత శతాబ్ద చివరి దశకంలోఆంగ్ల భాషా మద్యమంద్వారా హైకూ తెలుగులొకి దిగుమతి అయింది.
తాదాత్మ్యస్థితిలో కవికి ఆశ్చర్యాన్నో, ఆనందాన్నో, విషాదాన్నో, సంవేదననో కలిగించే దృశ్యశకలానికి యథాతథ రూపాన్నిచ్చే ప్రక్రియగా హైకూని నిర్వచించుకోవచ్చు. తాదాత్న్యత వల్ల ఉక్తి వైచిత్రి. క్లుప్తత, గుప్తత హైకూ రెండు కళ్ళు.
వచనకవిత లాగానే హైకూకి పాద విభజనలో హేతుబధ్ధత లేదు.పట్టుదలతో అక్షరనియమాన్ని పాటించినందువల్ల హైకూ మౌలిక సౌందర్యానికే ముప్పు.17 అక్షరాలలో మాత్రమే ఉండితీరాలన్న నియమం వల్ల అవసరమైన చోట భావలోపం, అనవసరంగా అక్షరాల సాగతీత. హైకూను భిన్నమయిన కవితాప్రక్రియగా నిలిపేది విలక్షణమయిన భావ వ్యక్తీకరణే. కవి విశిష్ట దృక్కోణం మాత్రమే హైకూని ప్రత్యేకంగా నిలబెట్టగలిగేది.
హైకూలో పరిమితులు ఎక్కువ. దృశ్యాన్ని మాత్రమే చెప్పాల్సివుంటుంది. అందరితో పాటు..ఎప్పుడూ చూసేదే ఐనా…ఒకానొక తాదాత్మ్య స్థితిలో ఆశ్చర్యంగానో…సంభ్రమంగానో వాచ్యం చేయడం మరో ప్రధాన లక్షణం.స్వానుభూతే తప్ప సహానుభూతికి అవకాశం లేని ప్రక్రియ హైకూ. ముందుగా వస్తునిర్దేశం కుదరదు. జ్ఞానాన్నో సందేశాన్నో ఇచ్చే ప్రయత్నం చేయ కూడదు. హైకూ కవిత ప్రసరించే పరోక్ష జ్ఞానాన్నిస్వానుభవానికి సమన్వయం చెసుకోవాలంటే …పాఠకుడిలో కూడా కవి అంత పరిణతి అవసరం. ఇది ప్రధానమైన పరిమితి. భావపరంగా…భాషాపరంగా ఎలాంటి అలంకరణలకు అవకాశం లేదు కనుక…భాషాపాండిత్యానికి…శబ్దాలంకారాలకు తావు లేదు. హైకూకు శీర్షిక సైతం ఉండరాదనేది మరో పరిమితి. వర్తమానాంశాలే తప్ప భూత,భవిష్యత్తులకు సంబధించిన అంశాలు, స్వప్నాలు, ఊహలు హైకూలకు ఇమడవు.
ఈ పరిమితులను అధిగమించిన కవితలేవి హైకూలు అనిపించుకోవు.
స్థూల దృష్టికి అభివ్యక్తి, ప్రయోజనాల దృష్ట్యా హైకూలు నాలుగు రకాలు.
సుందర దృశ్యం…సార్వత్రిక సత్యం ప్రతిఫలించే హైకూలు మొదటి రకం.
పచ్చిక మొలిచింది
బాటని కప్పేసింది, మళ్ళీ
ఎన్ని వందల కాళ్ళు అవసరమో(ఇస్మాయిల్-కప్పల నిశ్శబ్దం)
హైకూ ధ్వని ప్రధానం. చెప్పిన దాని కన్నా చెప్పనిది అధికంగా ఉండే'చంద్రుని చూపించే వేలు'
ఖాళీ పాత్ర
శూన్యానికి
ఆకారమిస్తూ -(లలితానంద్-ఆకాశ దీపాలు)
ఉపమానం ఉన్నా ఉపమేయం ఉండదు.హైకూ అందుకే ఎంత సర్వ సమగ్రంగా అనిపిస్తుందో..అంత అసంపూర్ణమూ అనిపిస్తుంది. పరిపూర్ణత అందుకోవాల్సింది పాఠకుడి మనసులోనే!
సుందరమైన, విలక్షణమైన దృశ్యాన్ని ప్రదర్శించే హైకూలు రెండవ రకం.
బోటుని
దాని నీడకి కట్టేసి
సరంగు ఎటో వెళ్ళిపోయాడు- ఇదీ ఇస్మాయిల్ గాఅరి హైకూనే-కప్పల నిశ్శబ్దం నుంచి)
ఉత్ప్రేక్షకాలంకారం. గాఢానుభూతికి గీటురాయి.
నిరాడంబరంగా వ్యక్తీకరింపబడే దృశ్యాలు హైకూ మూడో రకం.
Outside the pub
The sailor
Faces the wind- చక్ బ్రిక్ లీ
పరస్పర భిన్న స్థితిగతులకు చెందిన రెండు విషయాలను సమన్వయం చెసే విధానం ఇందులో ఉంటుంది.
కొన్ని రకాల ఉద్వేగాలను కలిగిమ్చేవి..ఒక రకమైన మూడ్ ని సృష్టించేవి నాలుగో రకం.
On a bare branch
A rook roosts:
Autumn dusk-(The penguin Book of Japanese verse)
హైకూలను ఇలాగే అర్థం చేసుకోవలని నియమమ్ ఏమీ లెదు. పాథకుని మానసిక స్థితి, వైఖరి, సంస్కారాన్నిబట్టి బహుళార్థక బోధనకు అవకాశం ఉండే ప్రక్రియ హైకూ.
'క్లుప్తత ప్రధానమైన హైకూ విస్తృతమైన వివరణలను అపేక్షించే సంక్లిష్తమైన అంశాలను, అసాధారణమైన అనుభవాలను చెప్పడానికి అనువైమ్ది కాదు' అంటున్నారు -అంటూ హైకూ ప్రక్రియలోని బలాన్నీ, బలహీనతలనీ సవివరంగా చర్చించారు పెన్నా శివరామకృష్ణ.
సూచనః
ఈ వ్యాసానికి మూలం కూడా పెన్నా ప్రచురించిన "దేశదేశాల హైకు"లోని 'కవితాప్రక్రియగా 'హైకూ' స్వరూప స్వభావాలు. మరింత అవగాహనకు ఆసక్తి గలవారు-పాలపిట్ట బుక్స్ వారు ప్రచురించిన "దేశదేశాల హైకు" పరిశీలించ వచ్చు.ప్రాథమిక అవగాహన కోసమే ఈ ప్రయాస.
పెన్నా అనువదించిన కొన్ని విదేశీ హైకూలుః
గాలిలొ గర్వంగా విహరిస్తూ
పెద్ద గడ్డిపరక
ఓహ్! తూనీగ!
-మత్సువొ బషోఃజపాను కవిత

మంచు కురిసే వేళ
తెల్లగా మారే వరకూ
చాచిన చేతులతో పిల్లవాడు
-రిచర్డ్ రైట్(ఆఫ్రికన్ అమెరికన్ కవిత)

అతడికి వాన ఇష్టంః
ఆమె అతడి జీవితంలో ప్రవేశించి
గొడుగును ఇచ్చింది
-అలెక్జీ ఆన్ ద్రెయేవ్(రష్యన్ కవిత)

మా నాన్న సమాధి వద్ద
నల్లటి నున్నటి
మార్బుల్స్ లో నా ముఖం
-ఇవాన్ నాదిలో(క్రొయేషియన్ హైకూ)

నేను పక్షిగా మారగలను-
నువ్వు క్రూర జంతువుగా మారనని 
ప్రమాణం చేస్తే
-రీటా ఓడె (పాలస్తీనియన్ కవయిత్రి కవిత)

రాతి నుంచి మొలిచిన
పుట్టగొడుగు-దానికి తెలుసుః
బెరమాడే కళ (కార్పొరేట్ హైకూ)

నదులు లేని చోట
వంతెనలు నిర్మిస్తూ
రాజకీయ నాయకులు
-ప్రొ.ఆర్.కె.సింగ్ (భారతీయ ఆంగ్ల కవిత)

తల్లి తిడుతుంటే
కొడుకు మౌనం తల్లి
తానే రోదించింది
-పురుషోత్తమ్ దీవాన్(హిందీ కవిత)

అకస్మాత్తుగా వర్షం-
కొలను నిండా
ఆశ్చర్యార్థకాలు!!
-మిత్రా(తమిళ్ కవిత)

ఆమెను చేరడానికి
దారినయ్యా
ఎవరో నడిచి వెళ్ళారు...
(కన్నడ హైకూ)

మన యువకవులకు మరిన్ని మంచి హైకూలు రాయాలన్న ఆసక్తి కలిగితే
ఈ వ్యాసం  సార్థకమయినట్లే!.
(పెన్నా శివరామకృష్ణ గారికి ధన్యవాదలతో…పాలపిట్ట బుక్స్ వారికి కృతజ్ఞతలతో)

* దృశ్యాదృశ్యం-బి.వి.వి.ప్రసాద్.'చంద్రుడిని చూపించే వేలు'ముందు మాట
-కర్లపాలెం హనుమంతరావు

Monday, April 4, 2016

ఎన్నో అదృష్టాంతాలు- ఓ రాజకీయ సరదా వ్యాఖ్య

పరమాత్ముడైనా ఆ పరంధాముడు పథ్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అదే అతగాడి పాదుకలు! ఏ ప్రయత్నం చేయకుండానే దర్జాగా అయోధ్య సింహాసనం అధిష్టించాయి! అదృష్టమంటే అదే!
అదృష్టం ఉంటే ఎడారిలో పడున్నాసరే ఏనుగు  వెదుక్కంటూ వచ్చి వరమాలను మెడలో వేస్తుంది. 'తంతే బూరెల బుట్టలో పడ్డం' అంటాంగదా.. అలాంటిదే ఇదీనూ! అలాగని బూరెల బుట్టముందు నిలబడి తన్నించుకున్నా.. ప్రారబ్దం బాగోలేకపోతే పక్కనున్న పేడతక్కెట్లో పడవచ్చు! ప్రారభ్దానికి ఏ శబ్దార్థ కౌముదీ సరిగ్గా నిర్వచనం చెప్పలేదు. చెప్పలేదుకూడా!
'ఖర్మానికి ధర్మాధర్మాలుండవని గీతకూడా బోధిస్తూనే ఉందిగదా! 'దృష్టం' అంటేనే  కంటికి కనిపించనిదిదృష్టాంతాలేగాని.. సిద్ధాంతాలండనిది. అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలంమీద దిగేముందు సరిగ్గా ఇరవై నిమిషాలకు సరిపడ్డ ఇంధనం మాత్రమే మిగిలి ఉందటఅదీ  అదృష్టం అంటే! కలసి రావాలి.. అంతే! కలసిరాని వేళ అలంకారంకోసం వేలికి పెట్టుకున్న పచ్చల ఉంగరంకూడా పచ్చడి మెతుకులతో పాటు గొంతులోకి జారి బతుకులు 'హరీ' అనవచ్చు!
'పూర్వజన్మసుకృతం' అని ఏదో పేరు తగిలించుకొని  సంతృప్తికోసం  సమర్ధించుకొంటామేగానీ ఏ అపూర్వ శబ్దచింతామణీ అదృష్టానికి సంపూర్ణ న్యాయం చెయ్యనేలేదు. చెయ్యలేదుకూడా!
టైమ్ బాగోలేకపోతే భోలక్ పూర్ నల్లానీళ్ళే కాదు.. బోలెడంత డబ్బుపోసి కొన్న మినరల్ వాటరుకూడా కాలకూట విషమౌతుంది! అన్నీ తెలుసు రాజకీయవేత్తలకు. అయినా రాజకీయాలు పత్తి మార్కెట్ల(కాటన్ మార్కెట్లు) మాదిరి సందడి చేస్తూనే ఉన్నాయి!
జనాలని నమ్ముకోవాల్సింది పోయి జాతకచక్రాలను నమ్ముకొన్న జయలలితమ్మ గతి ఏమవబోయిందో అందరికీ తెలిసిందే! మన దగ్గరా ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తంపార్టీ చీట్లు తీసింది!
గోడదూకుడుగాళ్ళు ఎక్కువైపోతున్నారని  వాపోయే ఓ పార్టీ  తన కార్యాలయం గోడలు మరింత ఎత్తుకు పెంచిందొకసారిఏమయిందీ?   గోడలకు కన్నాలేసి మరీ కోరుకొన్న పార్టీల్లోకి దూకేసారు జంపు జిలానీలు! నీతిమంతులుండే అదృష్టం ప్రధానంగానీ..  ఎత్తులూ.. జిత్తులూ ఎవరి సొత్తుల్నీ శాశ్వతంగా కాపాడలేవు!
గెలుపుకి 'గుర్తు' కలసిరావడం లేదని కుములుకుంటోందిగాని.. జనంలో గుర్తింపు తగ్గిందని గుర్తుపట్టలేకపోతుందింకో  మడమ తిప్పని పార్టీ! నేతల తలరాతలను తేల్చేది నిజానికి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ.. గుర్తులూ.. తాయెత్తులూ కానేకాదని ఎన్నేళ్ళు ఓడినా మన ప్రజాప్రతినిధులకు జ్ఞానోదయం కలగడంలేదు! ప్చ్! జనం దురదృష్టం!
రోజులూ అలాగే  ఉంటున్నాయిలేండి! ఎన్నికల్లో విజయఢంకా మోగించినవాడు ప్రమాణ స్వీకారం రోజునే ప్రాణాలు పోగొట్టుకొంటుంటే.. యావజ్జీవ కారాగారశిక్ష పడ్డవాడు దర్జాగా బైటకొచ్చి రాజకీయ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నాడు! రాసిపెట్టుంటే చర్లపల్లి జైల్లో ఉన్నా వేడివేడి బిర్యాని పొట్లాలు వేళకు అందుతాయి! సిమ్ కార్డు తాయిలాలు  క్రమం తప్పకుండా అందుతుంటాయి! నూకలు చెల్లితే గోకుల్ చాటుకు పోయి మరీ  ప్రాణాలు పోగొట్టుకోవడం  ఈ కళ్లతో ఎన్నేసి సార్లు చూసి తరించ లేదూ!
దేవుడు దయతలచి 'పోనీలే 'పాప'మని 'ఉఁ' అన్నాసరే.. పూజారన్నగారు తలాడిస్తేనే ప్రసాదం ప్రాప్తించేది. పూజారయ్య మనసు ముందు మనవైపు మళ్లడటమే ప్రస్తుతం అదృష్టాల్లోకెల్లా పెద్ద అదృష్టం! రాజకీయాలనుంచి.. రాసలీలలవరకు.. అన్నింటా పూజారులే రాజ్యాలు చలాయిస్తున్నా 'మాది రామరాజ్యం' అని ప్రభుత్వాలు బుకాయించడం  ప్రజల దురదృష్టం.
కాలం కలసిరాకపోతే కోట్లుపోసి పెట్టిన వోక్సువేగను కార్లఫ్యాక్టరీకూడా ఇంచక్కా రెక్కలొచ్చి ఎక్కడెక్కడికో ఎగిరిపోవడం చూడ్డంలే! చేటుకాలం తోసుకొచ్చినప్పుడు 'జై' కొట్టిన చేతులే పాతచెప్పులు విసరడం చూడ్డంలే! అదృష్టానికి దురదృష్టానికీ మధ్య అడ్డుగీత ఎక్కడున్నట్లు
అదృష్టదేవతేమన్నా మన గర్ల్ ఫ్రెండా! పిలిచీ పిలవంగానే 'హాయ్' అంటూ వచ్చి వళ్లోవాలి 'హాయి'నిచ్చిపోవడానికి! ఆడవారి మనసులు నిజంగా ఎంత చంచలమో తెలీదుగానీ.. అదృష్టదేవతదిమాత్రం మహా 'ఫికిల్ మైండ్'! అమ్మగారి చపలచిత్తానికి ఎన్ని వందల ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు!
సోనియమ్మ  ప్రధాని పదవికి ఎన్నుకునే సమయంలో  మన్మోహన్ జీ  కనీసం రాజ్యసభకు హాజరయ్యే సభ్యుడైనా కాదుదేశం అమెరివాడికి  ఊడిగం చెయ్యాలని రాసిపెట్టి ఉన్నప్పుడు సోనియమ్మ ముసుగులోనైనా సరే వచ్చి  శనిలా ఆడించేస్తుంది మరి అదృష్టదేవత!
'రాసిపెట్టి ఉన్నప్పుడు రాళ్లగుట్టకింద దాచిపెట్టి ఉన్నా  అధికారం దానంతట అదే నెత్తిమీదకొచ్చి నృత్యమాడి తీరుతుంద'న్న సిద్ధాంతం కొంజేటి రోశయ్యగారిని చూసి కొంచెమైనా వంటబట్టించుకొని ఉంటే  రాజకీయాల్లో ఇన్నేని రాద్ధాంతాలకు  తావుండదు. జగన్ బాబుకా సూత్రం వంటబట్టకే ఉప్పుడిన్ని  మంటలు
'రాజధాని ఆహ్వానపత్రం' ఇవ్వనే ఇవ్వద్దని.. ఇచ్చినా తాను చచ్చినా వచ్చేది  లేద'ని మొండికేసి వంటరివాడయిపోయింది అదృష్టదేవత తత్త్వం రోజా మాదిరి ఎంత మొండిదో అర్థం కాకపోబట్టే
దేనికోసమూ దేబిరించకుండా దేవుడు మనకిచ్చిన 'పాత్ర'ను   వీలయినంత అద్భుతంగా నటించుకుంటూ పోతుండడమే విజ్ఞుడైన రాజకీయవేత్త పాటించదగ్గ ప్రాప్తకాలజ్ఞత. ఆ పాఠం ఇద్దరు చంద్రులను చూసైనా నేర్చుకోవద్దూ!
జీవితంపాత్రలో  అదృష్టం ఉండేది కింది సగంలో. పైన సగభాగం కృషి. రాజకీయలవరకు అదే నటనా కౌశలం! అదృష్ట దేవత ఆశీర్వాదం అందాలంటే కృషి(అదే.. నటన)ని నమ్ముకోవడం తప్పని సరి.
దుర్యోధనుడి పాచికలాట విజయం   కేవలం శకునిమామ 'పని'తనంవల్ల మాత్రమే వచ్చిపడ్డది కాదు. అదృష్టదేవత ముద్దుమురిపాలుమితిమించడం వల్లకూడా! 
గురుత్వాకర్షణశక్తిని గుర్తుపట్టిన రోజు న్యూటన్ మహాశయుడు ఆపిల్ చెట్టుకింద కూర్చోనుండడం- కాదు అదృష్టం. పండు కిందపడ్డం కంటబడ్డప్పుడు   న్యూటన్ మెదడ్లో 'బల్బు' వెలగడం అదృష్టం. రాజకీయాల్లో నాయకుల  'బల్బు'లు ఎప్పుడు వెలుగుతాయో.. ఎందుకు వెలుగుతాయో! దానిమీదే ప్రజల అదృష్ట దురదృష్టాలు  ఆధారపడి ఉండేది!
సముద్రంమీద లేచిన అల్పపీడనం= వాయుగుండంగా మారి  ఏ దిశకు తిరగాలో ఏ సిద్ధాంతగ్రంథం  చూసి నిర్ణయిస్తుందీ? వాటాన్నిబట్టి జరిగే   సంక్షేమచర్యలకు ఏ యాగమూ.. యజ్ఞమూ దిశానిర్దేశాలు  చెయ్యవు. అయినా యాగాలూ.. యజ్ఞాలూ.. చేయడం చంద్రుళ్లమార్కు రాజకీయం! 'చేయను గాక చెయ్యను' అంటూ భీష్మించుక్కూర్చోడం జగన్ బాబు మార్కు మూర్ఖత్వం!
'ఎవరి తలరాతలు వారే స్వయంగా రాసుకొనవచ్చు' అన్న సత్యం సత్యంరామలింగరాజువంటివారి ఏ కొద్దిమంది మేథావులకే   పరిమితం.  
ప్రజాస్వామ్యంలో జనం తలరాతలు రాసేది ప్రజానేతలు! వాళ్ళ తలలు ఎలా పనిచేస్తున్నాయన్న  దాన్నిబట్టే జనతా  అదృష్ట దురదృష్టాలు!
ఇప్పుడు మాత్రం మన అదృష్టాలకేం తక్కువ.. చెప్పండి! స్వైన్ ఫ్లూ వచ్చే సీజన్లో సాధారణ ఫ్లూ వచ్చిపోవడం అదృష్టం కాదా! వానలు కురవని రోజుల్లో బ్యాంకురుణాలు దొరక్కపోవడం రైతన్నల అదృష్టం.. అవునా కాదా! మాంద్యం ముదిరిన వేళ  ఉద్యోగాలూడకుండా వేళ్ళాడుతూ అయినా  ఉండటం ఎంత పెద్ద అదృష్టం! ఫ్లాపు పిక్చరు తీసినా ఫస్టువీకే ప్రపంచ మొత్తం  ఒకేసారి విడుదల చేసి  వీలైనంత సొమ్ము రాబట్టేసుకోడం మెగా అదృష్టమేనా కాదా! కందిపప్పుకు కరువున్నా  కనీసం పెసరపప్పైనా నా పిసరంత దొరుకుతున్నది అదేమైనా   మామూలు అదృష్టదేవత విలాసమా! ఆలస్యంగానైనా ఆడపిల్ల క్షేమంగా ఇల్లుచేరడం ఎంత పెద్ద అదృష్టమో ఈ పాడురోజుల్లో! ఏసిడ్ దాడులు పెరిగిన రోజుల్లో ఎవరూ మన పిల్లల్ని ప్రేమిస్తున్నారని వెంటాడకపోవడాన్ని మించిన అదృష్టమాత వరం  కన్నవారికి ఇంకెక్కడ దొరుకుతుంది!
మన చేతుల్లో లేని అదృష్టాన్ని గురించి వాపోవడంకన్నా ఉన్న స్వల్ప అదృష్టాలని తలుచుకొంటో మురిసిపోయే  మనసుండటం మించిన అదృష్టం మరింకేముంటుందం!  ఏమంటారు?

-కర్లపాలెం హనుమంతరావు


( 05-10-2009 నాటి ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...