Saturday, September 26, 2020

చేతిరాత జాతకం మారేదెప్పుడు? -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ప్రచురణ

 


 

గౌరవనీయులైన ఓ మేజిస్ట్రేట్ గారిని  చదివే తీరులొ చేతితో తీర్పులు రాయాలని కేరళ హైకోర్టు మొన్నీ మధ్యన మందలించిన ఘటన  చదివినప్పుడు చేతిరాతను గురించిన కొన్ని  చిత్రమయిన సంగతులు గుర్తుకొచ్చాయి. బ్రహ్మరాత పద్ధతిలో మందుల చీటీ రాసిచ్చినందుకు ముగ్గురు వైద్యశిఖామణుల శిఖలు పట్టుకు ఝాడించిన అలహాబాద్ కోర్టు ఉదంతం అందులో ఒకటి.

 

చిన్నతనంలో కాపీ బుక్కులు ఎన్ని నింపినా, ఎదిగొచ్చి సెల్ఫోన్ చిక్కిన తరువాత చేతితో రాసేందుకు చిన్నబుచ్చుకునే నడమంత్రపు నాగరీకం ప్రస్తుతం నడుస్తున్నది! కంప్యూటర్లు,  సెల్ఫోనులు వంటి ఐ-సరంజామా చేతి కొచ్చి  అక్షరమాల, అనూ-లంటూ ఫాంటుల  మోహజాలంలో పడ్డప్పుడు, మనిషికి  చేతిరాత మీద కొంత రోత మొదలవుతుంది! కొత్త శతాబ్దిలోకి కాలం అడుగు పెట్టినప్పటి బట్టి పుట్టుకొచ్చిన సజ్జుకంతా కీ-బోర్డుల మీద వేళ్లు టకటకలాడించటం ఒక్కటే  తెలుస్తున్న రాతవిద్య! నేటి ఉపాధులకు  కీ-బోర్డు విద్యలు కీలకమే. అలాగని, ఓపిగ్గా ఓ సారి పెన్ను కేప్ ఓపెన్ చేసి నింపాదిగ కలానికి పని చెప్పనంత నిరాసక్తతే వింత!

 

కార్డు ముక్క గిలికే రోజుల్లో   చేతిరాతే  మహారాజు!  ఫాస్ట్ కాలానికి అనుగుణంగా ఈ-మెయిళ్లు దూసుకురావడం,  పోస్ట్‍ కార్డు కనుమరగువడం.. చేతిరాతకు ఎదురయిన పెనుగండం!  ఇసుక-అక్షరం నుంచి ఈ-అక్షరం దాకా చేతిరాత కథ మహాభారతమంత. ఇవాళ ఇంగ్లీషు బడి పిల్లగాడికి  వందేళ్ల కిందటి బుడతడికి మల్లే నేల అంటకుండా వేలుతో అక్షరాలు దిద్దవలసిన అగత్యం లేదు. ఐదేళ్ల కిందట ఫిన్లాండ్ దేశం చిన్నబడి పిల్లలక్కూడా కీ-బోర్డు వాడకం తప్పనిసరి చేసింది. ఆ తరహా అదుపాజ్ఞలేవీ మనకు లేకపోవచ్చు. కానీ చేతిరాత తలరాతకు మన సమాజంలో మాత్రం ఏమంత సానుకూలత ఉండడం లేదిప్పుడు. సంతకం ఒక్కటే  చేతిరాత వంతులా ఉంది  తంతంతా.

 

రాయించెడివాడు ఏ రామభద్రుడయినా రాసెడివాడి రాతలో తేడా ఉండటం లేదిప్పుడు. అంతా కంప్యూటరమ్మ రాత మహిమ! అక్షరాలను బట్టి రాసే మనిషి అంతరంగాన్ని విశ్లేషించే శాస్త్రానికి నిన్న మొన్నటి దాకా యమ డిమాండ్! అదీ అప్రస్తుతం అయిపోతోంది ప్రస్తుతం. కనీసం నేరాంగీకార పత్రం మీద అయినా నేరుగా దోషి  స్వహస్తాలతో తప్పు ఒప్పుకునే పద్ధతి తగ్గుతున్నదిప్పుడు. చదువుకొన్నవాడికీ చదువురాని వాడికీ కీబోర్డు మీటలే సర్వం సిద్ధం చేసిపెడుతున్నప్పుడు  చేతిరాతకు ఇక సాయం పట్టే సిద్ధివినాయకుడెవడు?!

 

చిన్నతనంలో  కాపీ బుక్కుల మీదాట్టే ధ్యాస పెట్టనందుకు బాపూజీ అయిన పిదప గాంధీజీ గిల్టీ ఫీలయ్యారు. కంప్యూటర్ల కాలంలో పుట్టలేదు కాబట్టే నోబెల్ గ్రహీత  ఠాగోర్ రంగు కాగితాల మీద   అక్షరాలు పూల తీగెల్లాగా ఎలా అల్లేవారో  తెలుసుకునే వీలుకలిగింది. జాతుల తలరాతలు మార్చిన నేతల  చేరాతలు ఎక్కువగా  గజిబిజిగానే ఉంటాయి. ఎందుకో? అదో  చిత్రం!  వనితల చేరాతలు వారి అంతరంగ అద్దాలకు మల్లే కళకళలాడతాయి. అదీ విచిత్రమే! తాతల కాలంలో పెద్దల రాతలు గొలుసుకట్టు తీరులో కలం దింపకుండా ఒకే ఊపులో సాగేవి.  పద్దుపుస్తకాలలో వ్యాపారస్తులు    మెలిక రాతల్లో వివరాలు తమాషాగా దాస్తుండేవాళ్ళు. బాపు  వంటి గీతకారులయితే ఏకంగా చేతిరాతల జాతకాలే మార్చేశారు.

 

అచ్చు యంత్రం ముందు నాటి మహద్గ్రంథాలన్నీ గతకాలపు మహాకవుల చేరాతలే కదా! చేతితో చెక్కే అద్భుత విద్య మనిషికి అబ్బకపోయి ఉండుంటే? ఉండవల్లి,  అజంతా, ఎల్లోరా వంటి గుహా కుద్యాల మీదిప్పుడు కనిపించే శాసనసంపద మన దాకా వచ్చేదే కాదు. రోజుకోటి చొప్పున తాళపత్రాల పైన తాళ్లపాక అన్నమయ్య  దేవుడికర్పించిన కీర్తనలన్నింటికీ చేతిరాతే కదా ఆలంబన! త్యాగరాజయ్యరు గాలికి పాడి వదిలేసిన రాగాలను శిష్యులు చేఅక్షరాలుగ మార్చి తాటాకు దొన్నెలకు పట్ట బట్టే దక్షిణాదికి ఒక కొత్త సంగీత సంప్రదాయం పట్టుబడింది! ఆ చేతిరాత వైభవమంతా చెల్లిపోయేలా చేతులెత్తేయడం తాతలిచ్చిన సంప్రదాయానికి జెల్లకొట్టడమే! భారత రాజ్యాంగ చట్టం ముచ్చటైన చేతిరాతల్లోనే    శాశ్వతత్వం సాధించుకొందన్న సత్యం.. భారతీయులమై ఉండీ మనం మర్చిపోతున్నాం! మహా దురదృష్టం.

 

మానవ సమాజం మీద పడ్డ అక్షరం ముద్ర మామూలుది కాదు, ఈనాటిదీ కాదు. ఇండియన్ యాంటిక్వరీ (Indian  Antiquery) రాసిన డాక్టర్ బూలర్  భారతీయులకు ఈ అక్షరాలు చేతితో రాసే అపూర్వ విద్య  క్రీస్తు పుట్టుకకు ఎనిమిదొందల ఏళ్లకు పూర్వమే తెలుసన్నాడు. పండిత్ గౌరీశంకర్ హీరాచంద్ర ఓఝా క్రీస్తుకు పూర్వం పదహారు, పన్నెండు శతాబ్దాల మధ్యకే ఉత్తరాలు రాసే కళ ఉత్కృష్ట దశకు భరతజాతి చేరుకుందని నిరూపించాడు. 'షణ్మాసికే తు సంప్రాప్రే భ్రాంతిస్సంజాయతే యతః, ధాత్రాక్షరాణి సృష్టాని పత్రారూఢాన్యతః పురా'- ఏ విషయం తెలిసినా ఎంత ఏనుగు జ్ఞాపకశక్తి కలిగి ఉన్నా ఆరు నెలలు గడిస్తే మనిషికి కొంత మతిమరుపు సహజమని జీవశాస్త్రవేత్తల భావిస్తారు. మనిషి మతిమరుపు కతలు ముందుగా తెలిసే అతగాడి ఆ ముదురుజబ్బుకు మందుగా  బ్రహ్మదేవుడు వర్ణమాల వరంగా ప్రసాదించాడని బృహస్పతి స్మృతి! రజస్వల అయి రాసినమ్మకు బట్టతలతో బిడ్డ పుడుతుంద'ని కృష్ణయజుర్వేద సంహిత ద్వితీయ కాండ చెబుతుంది. 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అన్న ఆ సూక్తిని బట్టి చూస్తే అక్షరాలను గురించి, వాటిని చేతితో రాయడాలను గురించి యుగాల కిందటే భరత ఖండంలో బ్రహ్మాండమైన చర్చ జరిగిందని బోధపడటంలేదా! 

 

వ్యాసుడు చెప్పుకుపోతుంటే విఘ్ననాయకుడు రాసుకుపోయాడంటారు పంచమవేదం. వ్యాస మహర్షి కాలం సుమారు 5 వేల సంవత్సరాల కిందటిదని ఒక వాదం. చేతిరాత సహస్రాబ్దాల  బట్టి ఆర్షభూమిలో పరంపరగా  కొనసాగుతోన్న హస్తకళ అనేందుకు  వందల కొద్దీ ఉదాహరణలు చరిత్రగని తవ్వే  కొద్దీ బైటపడతాయి. చక్రవర్తి కుమారుడైనా సరే, చౌలమైన(పుట్టెంట్రుకలు తీసే సంస్కారం) తరువాత అక్షరాలు నేర్చుకు తీరాల్సిందే అన్న 'వృత్త చౌల కర్మా లిపిం సంఖ్యానం చోపయుంజీత' అనే కౌటిల్యుడి అర్థశాస్త్ర విధి అందులో ఒకటి.   వాల్మీకి మహర్షి ఆ విధంగానే చౌలసంస్కారం చేయించి మరీ లవకుశులకు అక్షరాలు దిద్దించినట్లు భవభూతి కథనం. కాళిదాసు కూడా రఘువంశంలో అజుడు లిపి పరిజ్ఞాత అయిన తరువాతనే సంస్కృత సాహిత్య సముద్ర ప్రవేశం చేసినట్లు రాసుకొచ్చాడు. బాణుడు చంద్రాపీడ మహారాజు విద్యామందిరంలో అరో ఏట అడుగుపెట్టింది మొదలు ఏ విధంగా విద్యను అభ్యసించాడో వివరించాడు. విశ్వామిత్రుడి మతం ప్రకారం పిల్లలు అయిదో ఏట పడగానే  అక్షరాల గుంట ముందు కూలబడాలి.  పండిత భీమసేన్ వర్మ కృత 'షోడశ సంస్కార విధి' గ్రంథానుసారం అజ్ఞాతుడైన రచయిత రాసిన స్మృతిని బట్టి 5, 7 వయసుల్లో అక్షరాలు నేర్చుకోవడం వటువులకు తప్పనిసరి సంస్కారవిధి. వడుగుకు ముందే మనిషి  గంటం చేతబట్టాలని  బృహస్పతి స్మృతి విధి. మార్గశిరం నుంచి జ్యేష్ఠం వరకు అక్షరజ్ఞానానికి అనుకూలమైన కాలం. ఆషాఢం నుంచి కార్తీకం వరకు అక్షరాభ్యాసం నిషిద్ధమని విశ్వామిత్ర నీతి.  సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నప్పుడే అక్షరాల అవపోసన ఆరంభించడం వశిష్ఠ వాక్కు ప్రకారం శ్రేయస్కరం.  స్మృతి చంద్రిక కర్త మార్కెండేయ పురాణోక్తులను పేర్కొంటో అపరార్కుడు ఐదవ ఏట  కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపల అమావాస్య, పౌర్ణమి లాంటి తిధులు; చవితి, నవమి, చతుర్దశులు; శని, మంగళ వారాలు- చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించకూడని కాలాలని హెచ్చరించాడు. కుంభరాశిలో రవి ఉన్నా, లగ్నాతు అష్టమంలో గ్రహాలు తిష్ఠ వేసినా అక్షరాల జోలికి పోరాదన్న విధీ  ఒకప్పుడు భరతభూమిలో కథ. ఓనమాలు రానివాడు ఆనవాలు లేకుండా పోతాడన్న భయం అనాదికాలం నుండి మనిషి గుండెల్లో మారుమోగుతుండబట్టే ఇన్నేసి పురాణేతిహాసాలలో, స్మృతి స్ముతుల విధివిధానాలలో అక్షరాల గురించి వాటి అభ్యాసాదుల గురించి రుషుల మధ్య అంతంతలేసి చర్చోపచర్చలు సాగింది. కంప్యూటర్ మాయలో పడి ఆ సంప్రదాయం ఛాయామత్రంగానైనా  మిగిల్చుకునేందుకు ప్రస్తుతం మనం పస్తాయిస్తున్నాం. అది కదా విచారం!

 

చాలా మంది ఇళ్ళల్లో పాతలేఖలు నాటి తీపి గుర్తుల కింద దాచుకుంటారు. ఆ  ఉత్తరాల కోసం రోజులు, వారాల తరబడి ఎదురుచూసిన  పాతకాలం మధురానుభూతులను ఒక్కసారి నెమరువేసుకోవాలి.  కంప్యూటర్  కొత్తవింతలో పడి..  చేతిరాత రోతగా మారకుండా అప్రమత్తమవాల్సిన అగత్యం అప్పుడు తప్పకుండా స్పృహకొస్తుంది. ఇదే అంశం మీద పీడియాట్రిక్ థెరపిస్ట్ సాలీ పెయిన్  గార్డియన్ వార్తాపత్రికకు ఇంటార్వ్యూ ఇస్తూ 'బళ్లకు వెళ్లే పిల్లలకు పెన్సిళ్లు ఇస్తే  సరయిన పద్ధతిలో పట్టుకోలేకపోతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రోజులో అధిక భాగం చేసే స్నేహం పిల్లల  ప్రాథమిక చలన నైపుణ్యాలను బాగా దెబ్బతీస్తుంది' అని అన్నారు. అధ్యయన, అభ్యాస రంగాలలో చేతిరాత పాత్ర రాను రాను ఎంతలా దిగనాసిల్లుతున్నదో   ప్రచారం చేసే బాధ్యత స్వచ్ఛందంగా  పుచ్చుకున్న డాక్టర్ జేన్ మెడ్వెల్, ఇళ్లలో పెరుగుతోన్న గ్యాడ్జెట్ల వల్లనే  పిల్లల్లో చాలా మందికి పెన్సిల్ మీద పట్టు కుదరడంలేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. నేషనల్ హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తోన్న డాక్టర్ మెలీసా ప్రూంటీ, ప్రాథమిక స్థాయి నుంచే పాఠశాలల్లో బాలలకు ఐ-పరికరాల స్థానే అచ్చు పుస్తకాలు, పలకా బలపాలు, పెన్నూ పెన్సిళ్లను పోలే ఆటవస్తువులు అలవాటు చేయడం-  బుద్ధివికాసం జీవనసమరానికి దగ్గరయే మేలైన అనుసంధాన చమత్కారం అని చెప్పుకొచ్చారు. 2014 నాటి  ఒహాయో యూనివర్శిటీ పరిశోధనల్లో అమెరికాలో ప్రతి ముగ్గురు పెద్దవాళ్లలో ఒకరు ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు చేతితో ఏమీ రాయడం లేదని తేలింది. ఇక్కడ ఇండియాలో కూడా దరిదాపులుగా అదే దుస్థితి. కానీ, అదృష్టం కొద్దీ చేతిరాత  పట్టు ఎంతో కొంత మేర చదువు సంధ్యల్లో, బతుకు తెరువులో ఇంకా మిగిలే ఉందని నమ్ముతున్నాం మనం.  కాబట్టే పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో చేతిరాత వైభవం పునరుద్ధరణార్థం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. 2005లో ఎయిక్స్-మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరోసైన్స్ లేబరేటరీ మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయసు పిల్లలను రెండు బృందాలుగా విడగొట్టి ఒక బృందానికి చేతిరాత, మరో బృందానికి కంప్యూటర్ రాత పని అప్పగించింది. చేతిరాత పిల్లలు, కంప్యూటరు సాయంతో రాసే పిల్లల కన్నా  అక్షర జ్ఞానంలో చురుకుగా ఉన్నట్లు  తేలింది.  అక్షరాలు దిద్దే క్రమంలో  క్లిష్టమైన కండరాల కదలికలను మాలిమి చేసుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అన్న ఆత్మవిశ్వాసం సాధకు బలపడుతుంది. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోనే సందర్భంలో ఈ ఆత్మవిశ్వాసమే విజయసాధనకు తోడ్పడేది అంటారు  డాక్టర్ మెడ్వెల్. మూడేళ్ల కిందట అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఇల్లినాయిస్  రాష్ట్రంలో చిన్నబళ్ళల్లో చేతిరాత తరగతులు  తిరిగి తప్పనిసరి పాఠ్యాంశాలలో ఒక్కటిగా మార్చడానికి ఈ తరహా కొన్ని అధిక ప్రయోజనాలే ప్రముఖ కారణం.

మన దేశంలో మొన్న మొన్నటి దాకా న్యాయస్థానాల దస్తావేజుల్లో చేతిరాతే ముఖ్యమైన స్థానంలో ఉండేది.  భాష సరే, కరక్కాయ సిరాతో రాసే ఆ  అక్షరమూ  ఎంత చూడ ముచ్చటగా ఉండేదో ఈ తరానికి తెలిసే దారేదీ? చిన్న దావాలలో న్యాయాధీశులు కంప్యూటరు గట్రాలు గట్టున పెట్టేసి స్వంత దస్తూరితో స్పష్టంగా  రాసిన  తీర్పులు వెల్లడించాలని ఈ మధ్య కేరళరాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఓ  సలహా ఇచ్చింది. కంప్యూటర్ రొట్టకొట్టుడు భాష తెచ్చే అనర్థాలను  వివరిస్తూ సాక్షుల వాజ్ఞ్మూలాలు సైతం వీలయినంత మేరకు ఆ అధికారం కలవారు స్వదస్తూరితో నమోదు చేస్తే, చేతిరాత   సాధికారత పునరుద్ధరించనట్లు అవుతుందన్నది ఉన్నత న్యాయస్థానం అభిప్రాయం. చేతిరాత ఘనతను ఇకనైనా చరిత్రలో కలవకుండా విజ్ఞతతో  వ్యవహరిద్దామా?

 

పొందికైన జీవితానికి అందమైన చేతిరాత ముంజేతిన మెరిసే బంగారు కంకణం. ఆ అందమైన చేతిరాతకు అదనంగా మార్కులేసి ప్రోత్సహించే   సంప్రదాయం గతంలో బడి పిల్లల పరీక్షల్లో కనిపించేది. మార్కుల కోసమేనా? జీవితంలో మంచి రిమార్కులు సాధించడానికీ చేతిరాత మీద పాతకాలంలో మాదిరి  శ్రద్ధ మరంత పెంచడం అవసరం. జాతీయ చేతిరాత దినం' అని ప్రతి ఏటా జనవరి 23 ను  ఓ ప్రత్యేక దినోత్సవంగా గుర్తిస్తున్నాం మనం. దస్తూరీ ఆవశ్యకత అవిస్మరణీయమని చెప్పడానికి ప్రత్యేకమైన ఉత్సవాలు జరపనవసరం లేని ప్రోత్సాహ వాతావరణం  తిరిగి చేతిరాతకు రావాలని కోరుకుందాం!

-కర్లపాలెం హనుమంతరావు

***

(సూర్య దినపత్రికలో ప్రచురితం) 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

చేతిరాత

-కర్లపాలెం హనుమంతరావు

 

Monday, September 21, 2020

హాస్య కథః అరకొర ఇంగ్లీషు -కర్లపాలెం హనుమంతరావు

                                                (కార్ట్యూనిస్ట్ మల్లిక్ గారికి కృతజ్ఞతలతో)

సుబ్బాయమ్మ చాలా ఆశబోతు. విలాసవంతమైన జీవితం మీద తగని మోజు.  తన భర్త తన  నాలుగు కోట్లకు బీమా చేశాడన్న విషయం తెలిసినప్పటి బట్టి అప్పటి వరకు ఆమె లోపల దాగి ఉన్న కోరికలన్నీ ఒక్కసారి పడగ విప్పి ఆడటం మొదలుపెట్టాయి. తన స్వర్గసుఖాలన్ని భర్త చావుతో తప్ప మొదలు కావు- అన్న విషయం సుబ్బాయమ్మకు అర్థమయింది. అందుచేత విలాసవంతమైన జీవితం గడపడానికి ఆమె తాళి కట్టిన భర్తను చంపాలని నిర్ణయించుకుంది.  అందుకోసమై ఆమెకు ఒక కిరాయి హంతకుడి తోడు కావాలి. బోలెడన్ని సి.ఐ.డి ఎపిసోడ్లు  వచ్చీ రాని హిందీ నాలెడ్జ్ తోనే చూసి ఒక అవగాహన తెచ్చుకుంది. కొన్ని రోజుల పాటు అత్యంత గోప్యంగా అక్కడా ఇక్కడా విషయ సేకరణ కూడా చేసి చివరకు ఒక పర్ ఫెక్ట్  మర్డర్ ప్లాన్ కు బ్లూ ప్రింట్ తయారు చేసుకుంది. ఆ స్కీమ్ ను ఆచరణలో పెట్టడానికి ఇప్పుడు ఆమెకు ఒక కిరాయి షూటర్ సాయం పట్టాలి.  

సినిమాలలో తప్ప నిజమైన జీవితంలో డబ్బులకు కాల్చే తుంటరి కుంకలు ఎక్కడ ఉంటారో, ఎట్లా ఉంటారో ఆ ఇల్లాలుకు పాపం ఇప్పటి వరకు తెలిసే అవకాశం లేదు. అత్తగారి తలరాత బాగుండి పెందరాళే తన దారిన తాను ప్రశాంతంగా పైకెళ్లిపోవడంతో ఇలాంటి కిరాయి గూండాలతో ఇప్పటి వరకు పనిపడలేదు.  అతి కష్టం మీద వచ్చీ రాని ఇంగ్లీషు నాలెడ్జ్ తోనే ఇంటర్నెట్ అంతా గాలించి గాలించి చివరికి ఒక కిరాయి హంతకుడి అడ్రస్ పట్టుకోగలిగింది సుబ్బాయమ్మగారు.

ఆ కిరాయి గూండాని తన కారులో తిప్పుతూ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా గుట్టు చప్పుడు కాకుండా తన భర్త పని పట్టాలో పూసుగుచ్చినట్లు పదే పదే వివరించింది. ‘ఎన్నో నెలల పాటు ఎంతో శ్రమకు ఓర్చి ఉన్న తెలివితేటలన్నీ ఉపయోగించి తయారుచేసుకున్న స్కీమ్. ఒక్క చిన్నపొరపాటు జరిగినా మొత్తం వ్యవహారం తలకిందులయిపోవడం ఖాయం. ఫర్ఫెక్ట్ షూటర్ వన్న  ట్రాక్ రికార్డ్ చూసే కాస్త రేట్ ఎక్కువైనా నిన్ను కష్టపడి గాలించి పట్టుకున్నది. అన్నీ అనుకున్నట్లు గాని సజావగా జరిగిపోతే నీకు మరో ఒక అరశాతం అదనం బోనస్ కింద చెల్లించడానికైనా సిద్ధం. కానీ ఎక్కడా  నా జోక్యం ఉన్నట్లు చిన్న క్లూ అయినా వదిలిపెట్టి పోవద్దు. రేపు ఉదయానికల్లా నేను నా భర్త చావు వార్త  చల్లంగా పోలీస్ స్టేషన్నుంచి వినితీరాలి’ అంటూ పది రకాలుగా జాగ్రత్తలు చెప్పి తను సీనులో నుంచి తప్పుకుంది.

కిరాయి హంతకుడు అనుకున్న ప్లాన్ ప్రకారమే పర్ఫెక్ట్ గా ఆపరేషన్ సక్సెస్ జేసినట్లు తెల్లారుఝామున పోలీసుల నుండి వచ్చిన భర్త మర్డరైన వివరాలన్నీ విన్నాక సుబ్బాయమ్మకు నిర్ధారణయింది. మనసులోనే కిరాయి హంతకుడి అంకితభావానికి ముగ్ధురాలైంది. బైటికి మాత్రం విషాద వదనంతో పోలీసు స్టేషనుకు పరుగెత్తింది. పోలీసు జీపులోనే భర్తను షూట్ చేసిన స్పాట్ కు వెళ్లి చూసింది సుబ్బాయమ్మగారు. పోలీసులు చూపించిన స్థలమంతా రక్తంతో చెల్లాచెదరుగా ఎర్రబడి భీభత్సంగా ఉంది. భర్త ఉదయంపూట వ్యాహ్యాళికని వెళుతూ ధరించిన దుస్తులు పోలీసులు ఇప్పుడు చూపించినవే. ‘మీ హజ్బండ్ ఫేస్ కూడా చూపిద్దామని అనుకున్న మాట నిజమే కాని.. పోస్ట్ మార్టం చేసే వైద్యుడు ఊరికి వెళ్లే తొందరలో ఉండడం వల్ల మీరు రాకముందే డెడ్ బాడీని తరలించ వలసి వచ్చింది. సారీ! ఇంకా మీకు మీ భర్త బతికే ఉన్నాడన్న నమ్మకం ఉంటే చెప్పండి.  బాధితుల డౌట్సన్నీ క్లియర్  చేసే బాధ్యత పోలీసు డిపార్ట్ మెంట్ గా మాకు చాలా ముఖ్యమైనది’ అన్నాడు స్టేషన్ ఆఫీసర్.

‘ఇన్ని ఆధారాలు చూపించారు. ఇంకా అనుమానం ఎందుకు సార్? కానీ,  నా భర్త వట్టి అమాయకుడు. చీమకైనా   అపకారం జరిగితే విలవిలలాడే సౌమ్యుడు. ఎవరికి ఏం ద్రోహం చేసాడని.. పాపాత్ములు బంగారం లాంటి మా ఆయన్నిలా పొట్టనపెట్టుకున్నట్లు? ఆ దుర్మార్గులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుని ఉరికంబం ఎక్కించండి సార్! అప్పుడే చచ్చి స్వర్గంలో ఉన్న మా శ్రీవారి ఆత్మకు శాంతి’ అంటూ వెక్కిళ్ల మధ్యనే పెద్ద పెద్ద సినిమా డైలాగులు గుప్పించేస్తోన్న  సుబ్బాయమ్మగారి చెవుల్లో  ‘ఎప్పటి దాకానో ఎందుకు డియర్ సుబ్బాయ్! హంతకుల్ని ఇప్పుడే పట్టేస్తే పోలే! ముందు నువ్వు  కళ్లు శుబ్బరంగా తుడుచుకో!  ఒక్కసారి తేరిపారా చనిపోయిన నీ మొగుణ్ని చూసుకుందువు గాని’ అన్న గొంతు వినిపించింది. ఆ గొంతు తన భర్త కామేష్ దే! కొయ్యబారి పోయిన సుబ్బాయమ్మగారు గాభరాగా ఎదుటనే నిలబడున్న భర్తను చూసి’ కామేష్! నివ్వింకా బతికే ఉన్నావా? మరి నా దగ్గర పది లక్షలు నొక్కేసిన ఆ చచ్చినోడు..!’

‘ఇక్కడే ఉన్నాను మేడమ్ గారూ! మీరు ప్లానంతా మా పోలీసోళ్లకు మించి మహా పకడ్బందీగా తయారుచేశారు. మెచ్చుకోక తప్పదు. కానీ.. కిరాయి హంతకుడు విషయంలోనే  చిన్న మిస్టేక్ జరిగిపోయింది.   ‘అండర్ కవర్’ అన్న మాట సరిగ్గా అండర్ స్టాండ్ అయినట్లు లేదు.. ప్రొఫెషనల్ పోలీస్ కు  ఫ్రొఫెషనల్ కిల్లర్ అన్న అర్థం చెప్పుకుని  నా అడ్రస్ దొరకపుచ్చుకుని  వెంటబడ్డారు.. సారీ!’ అంటూ సుబ్బాయమ్మగారి బంగారు గాజు చేతులకు ఇనుప గాజుల్లాంటి  బేడీలు తగిలించేసి  చిలిపిగా నవ్వాడు ప్రొఫెషనల్ పోలీసాఫీసర్. అతగాడే తాను ప్రొఫెషనల్ కిల్లర్ అనుకొని ప్రాణం మీదకు తెచ్చుకున్న పోలీసు మనిష’ని అప్పుడు గాని అర్థమయింది కాదు, పాపం, సుబ్బాయమ్మ గారికి.   

‘అందుకే ఇంగ్లీషు కోచింగ్ క్లాసుల్లో  చేరినప్పుడు మార్నింగ్  షోల కోసమని సగంలో క్లాసులు ఎగ్గొట్ట కూడదు. ఫలితం ఇప్పుడనుభవిస్తున్నా.. ఛీఁ’ అంటూ  చేతికున్న ఇనప బేడీలతోనే తల తటా తటా మొత్తేసుకుంది పాపం మేడమ్ సుబ్బాయమ్మ గారు!’

-కర్లపాలెం హనుమంతరావు

21 -09 -2020

***

Saturday, September 19, 2020

అంతరాత్మే అసలు శత్రువు.. ! - కర్లపాలెం హనుమంతరావు -పెన్ పవర్ దినపత్రిక ఆదివారం ప్రచురితం

 


'ఏం చేస్తున్నావు?' - అడిగింది అంతరాత్మ.

పెన్‌ పవర్  పత్రిక ప్రకాశం ఎడిషన్ కోసం వ్యాసం రాసే పనిలో ఉన్నాను. ఏ అంశం మీద రాద్దామా అని ఆలోచిసున్నా. తెగడంలేదు'

'ఈ మధ్య నీ రాతల్లో కాస్త సీరియస్ నెస్ ఎక్కువయింది. బ్రేకింగ్ గా ఉంటుంది .. ఏదైనా, లైటర్ వీన్ ట్రై  చెయ్యరాదూ ?' అని గొణిగింది అంతరాత్మ.

'ఆ సణుగుళ్లెందుకు. మనసులో ఉన్న మధనేదో బైటికే అనవచ్చుగా!'

చిరాకు పడ్డా. 

ఫక్కుమని నవ్వి అంది అంతరాత్మ 'బాబూ! నేను నీ అంతరాత్మను. అంతరాత్మలక్కూడా మనసులుంటాయా? అక్కడికి మీ మనుషులు అవి చెప్పే మాటలే వింటున్నట్లు.. మహా! నేను జంతువులాంటి దాన్ని. నాకూ వాటికి మల్లే మనసులూ పాడూ ఉండవు.. ముందా సంగతి తెలుసుకోవయ్యా మహానుభావా! రచయితవి ఉండి నీకే తెలీకపోతే ఇహ పాఠకులకు నువ్వేంటి కొత్తగా చెప్పుకొచ్చేది?' 

నవ్వొచ్చింది నాకు.. నా అంతరాత్మ పెట్టే నస చెవినపడగానే. 'మా పాతకాలం తెలుగు సినిమాలలో అంతరాత్మలు శుభ్రంగా ఏ టినోపాలుతో ఉతికిన  ఇట్లాగే ఏ తెల్ల వస్త్రాలో ధరించి అద్దంలో నుంచో, స్తంభంలో నుంచో అడగా పెట్టకుండా వద్దనకుండా ఊరికే తెగ నసపెడుతుండేవి. చాలా సమయాలల్లో ఒకటి కాదు, రెండు  కూడా చెరో పక్కనా చేరి చెండుకు తినడం అదో సరదా వాటికి. పాత్ర  ఎస్వీ రంగారావు సైయిల్లో చేతిలో ఉన్న మందు సీసా విసిరి గొట్టినా అద్దం ముక్కలయి చచ్చేదే కాని అద్దాని నస అన్ని గాజు ముక్కల్నుంచి వెయ్యింతలుగా మారుమోగేది. మళ్లీ ఏ కమలాకర కామేశ్వర్రావు సారో కల్పించుకుంటే తప్ప ఆ అంతరాత్మల ఘోష అంతమయ్యేదే కాదు. కొంపదీసి నువ్వూ ఇప్పుడు ఆ తరహా ప్రోగ్రామేమన్నాపెట్టుకుని రాలేదు కదా! కరోనా రోజులు .. ఎటూ బైటికి పోయే ఛాన్సు నాకుండదీని  గాని పసిగట్టావా ఏందీ!'

'ఆపవయ్యా సామీ ఆ పైత్యకారీ కూతలు. నువ్వేమీ ఎస్వే ఆర్వీ, ఎంటీఆర్వీ కాదులే! వట్టి ఓ మామూలు కెహెచ్చార్ గాడివి . గంతకు తగ్గ బొంత సైజులో నీ స్టేటస్సుకు తగ్గ  మోతాదులోనే నా ఆర్భాటం ఉంటుంది, అసలు  చెప్పాల్సిన మాట డైవర్టయి పోయింది నీ  డర్టీ డైలాగుల డప్పు చప్పుళ్ల మధ్య. మరోలా అనుకోక పోతే ఒక సలహా బాబూ! ఈ కరోనా రాతలు కాస్సేపు పక్కన పెట్టు. పాలిటిక్సు పోట్లు పద్దాకా ఏం పొడుస్తావులే కాని,, ఇంచక్కా ఈ లోకంలో నీకులాగే సమ హోదాతో జీవించే జంతుజాలం గురించి ఏమన్నా ఓ నాలుగు ముక్కలు గిలికిపారెయ్ రాదూ ఈ దఫాకు! సరదాగా అందరు చదువుకుంటారు!'

'జంతువుల గురించా? రాయడానికేమంత ఇంపార్టెంట్ మేటరుంటుందని మహానుభావా  కొత్తగా మన పాఠకులు చదివి ఎంజాయ్ చేసేందుకు?  జిత్తులు, నత్త నడక, సాలెగూడు, కాకి గోల, కోడి నిద్ర, కుక్క బుద్ధి, క్రూర మృగం, హంస నడక, మొసలి కన్నీరు, కోతి చేష్టలు, పిల్లి మొగ్గలు, పాము పగ, ఉడుం పట్టు, గాడిద చాకిరీ గట్రా జంతు సంబధమైన సజ్జెక్టులన్నీ నీ లాంటి అంతరాత్మలు నసలు పెట్టించి మరీ గిలికించేసాయి కదా! ఇహ నాకు కొత్తగా రాసేందుకు ఏం మిగిల్చారు గనక ‘

 

'ఆపవయ్యా రైటర్ ఆ అపవాదులు! అక్కడికి భాషలు, భావాలు మనుషులకే పరిమితయినట్లు ఏమిటా కోతలు! మీ మనుషులున్నారే చూడు .. వాళ్లే  అసలైన జంతువులు. ఏ సాధుశీలి లోపల ఏ మేకవన్నె పులి నిద్రోతుందో, ఏ అరి వీర భీకర మహా విజేత గుండెల్లో 'ఉస్సో ‘  అంటేనే  ఉలిక్కి పడి చచ్చే పిల్లుంటుందో.. అంతరాత్మలకు మాకానువ్వు  కొత్తగా సినిమా కతలు చెప్పి నమ్మించేదీ! ఆ  రొటీన్ టాపిక్కుల గోల మళ్లా ఇప్పుడెందు గ్గానీ, ఊపు కోసం నేనీ మధ్య  వాట్సప్ లో చదివిన వెరైటీ జంతువుల కహానీ ఒకటి చెబుతా.. ముందు విను! ఆనక నీకు యానిమల్స్ జాతి మీదుండే యనిమిటీ, గినిమిటీ మొత్తం వదిలిపోవాలి.’ 

  జంతువులు అసలేవీ  ఆలోచనల్లాంటి సృజనాత్మకమైన పనులు చేయలేవని కదూ  మీ మనుషుల బడాయి ఊహలు!  ఆహారం,  నిద్రా మైథునాల్లాంటి సహజాతాలకు మాత్రమే మొగ్గుచూపే బుద్ధి వాటిదని కదూ మీ మేధావుల వెధవాలోచనలు!  జంతుజాలం భాష నువ్వు డీ-కోడ్ చెయ్యలేవు. కనక కాకి కూతల వెనకుండే రంపపు కోత నీ బుర్రకెక్కదు.  వాటికి అసలు మాట్లాడటమే రాదనుకుంటే .. అది నీ మూఢత్వంరా బేటా!  వాటి మాటల సారం నీకు అర్థమయితేనా! మనిషిగా పుట్టించినందుకు నువ్వా బ్రహ్మయ్య మీదనే నేరుగా దాడికి దిగిపోతావు!’

ఈ సారి ఏ  హిమాలమాల సైడుకో టూరుకని వెళ్ళి నప్పుడు హరిద్వారం , ఋషీకేశం కూడా టచ్ చేసి చూడు! టీ నీళ్ల కోసం నిన్ను వేధించాడని విసుక్కోడమొక్కటే నీకు తెలుసు గాని,   రక రకాల పక్షి కూతలకు, జంతు భాషలకు ఆ గడ్డం బుచోళ్లే అచ్చుపడని పదనిఘంటువులని నీకు తెలియదు.  పక్షులూ, జంతువులతో మాట్లాడ గలగడం వాస్తవానికి ఓ గడసరి విద్య.  మేక కనపడితే గట్టిగా పట్టుకుని మన ఏప్రియల్ మాసం తరువాత వచ్చే నెల పేరేంటో చెప్పమని అడుగు!

'మే' అనకపోతే వాడి పారేసిన నీ చెప్పుల జోడు తెచ్చి  నా మెడకు వేలాడ కట్టు!’ 

'అంతరాత్మలకు మెడలు ఎక్కడేడ్చాయన్న డౌటొచ్చే లోపలే 

'సర్కార్ల పథకాలేవన్నా ప్రజలకు మేలు చేసేవే నంటావా ?' అని కాకి మూకల నడిగి చూడు!  'కావు.. కావు' మనకుండా నోరు మూసుకు నుండిపోదు .. గ్యారంటీ ‘ అంయీ    సోది కహానీలు మొదలుపెట్టేసిందీ వెధవ సూక్ష్మగ్రాహి  అంతరాత్మ! 

గలగల, వలవల, గడగడల్లాంటి  జంటపదాలు మన తెలుగురచయితలకు మల్లే చెత్తచెత్తగా వాడే శక్తి  పద్దస్తమానం 'కిచకిచ'లాడే  పిచ్చుకమ్మకుందని దాని   కోతలు! 'భ' అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుందో బోలెడంత డబ్బుపోసి కార్పొరేట్ బళ్లో చదివే మీ బదుద్ధాయికి తెలీకపోవచ్చునేమో కానీ.. ఏ వీధి కుక్క వీపు మీద ఓ రాయి బెడ్డ వేసినా  'బౌ.. బౌ' అవుతుందని బోలెడన్ని సార్లు చెప్పేస్తుందిట!  కప్పల్ని మింగడం తప్ప ఇంకేమీ తెలిదనుకునే పన్నగాలకు అమెరికా అధ్యక్షుల్లో  'బుష్' నామధేయులు ఒకడు కాదు.. ఇద్దరున్నారన్న ఇంగితం బుసలు కొట్టి మరీ బైటపెడుతుందని ఈ అంతరాత్మ ప్రబోధం!  పార్వతీదేవికున్న పర్యాయపదాలల్లో 'అంబ' ఒకటని ఆవు తెలుసును. ఆ జ్ఞానం మనిషి జన్మ మహోదాత్తమైనదని  అనుక్షణం ఉబ్బెత్తు ఛాతీలు తిప్పుకుంటూ తిరిగే మీ మనుషులకే ముందు తెలియాల్సి వుంది. ఏనుగుకి ఆంగ్లంలో నెయ్యిని ఏమంటారో ఏ  క్రాష్ కోర్సులో చేరకముందే ఈజీగా తెలిసిపోయింది.  చెప్పుకుంటు పోతే ఈ జంతు విజ్ఞానానికి ఆదీ.. అంతూ దొరకదు. కానీ ఆఖరుగా ఈ ఒక్క ముక్క చెప్పి ముగించకపొతే  పశుపక్ష్య జాతులకు పూర్తి న్యాయం జరిపించినట్లు కాదు. నెమలీ ! నెమలీ ! ఈ మనిషిని గురించి జంతుజాలం ఏమనుకుంటున్నదో ఒక్క ముక్కలో చెప్పి ముగించమంటే 

'క్రాక్' అంటూ ఇంచక్కా తోకూపుకుంటూ నిలబడుతుంది.' అని ముక్తాయించేసింది నా అంతరాత్మ. 

నెమలిని అడ్డమేసుకుని తన మనసులోని ముక్కని అంతరాత్మ అట్లా బైటకు నెట్టేసిందన్న గుట్టు అర్థమముతూనే  ఉంది.

మనిషికి  తొలి శత్రువు ఎక్కడో లేడు. మన  మనసులోనే ఓ మూల నక్కి  ఉండి   మనతోనే ప్రతిక్షణం దొంగ  తిళ్లు తింటూ మనం కాక్స్ లా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రం  గమ్మునుండి పోతున్నాడు. దెబ్బతిని కిందపడితే మాత్రం ఇట్లా బైటికొచ్చి కుక్క మీదా నెమలి మీదా పెట్టి దెప్పుతుంటాడు. ఈ అంతరాత్మ కన్నా  ఏ శత్రువు మాత్రం మనిషికి చేసే చెరుపేముందిక? 

నిజమైన మిత్రుడే అయిఉంటే తప్పు చెయ్యక ముందే నచ్చ చెప్పి తిప్పలు తప్పించాలి కదా అంతరాత్మ! అందుకే పాలిటిక్సులో పైకి రావాలనుకునే మొండి నేతలు గుండెల్లోనే ఉండి పద్దస్తమానం ఘోష పెడుతుండే ఈ వెధవ అంతరాత్మలను అప్పోజిషన్ పార్టీ శాల్తీల కన్నా హీనంగా  లెక్క గట్టి పురుగుల్లా చీదరించుకునేది*

- కర్లపాలెం హనుమంతరావు 

( పెన్ పవర్ దినపత్రిక ప్రకాశం ఆదివారం  సంచికలో ప్రచురణ ) 

వయోవృద్ధుల ఊత కర్ర- సాంకేతిక పరిజ్ఞానం -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ఆదివారం ప్రచురణ

 



వినడానికి విడ్డూరంగానే ఉన్నా.. వయో వృద్ధుల జీవన ప్రమాణాలను పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానం  మెరుగుపరుస్తుందన్న మాట నిజం. ఆరంభంలో అలవాటు లేని అవుపాసనలా అనిపిస్తుంది; మాలిమి చేసుకున్న కొద్దీ వయసు వాటారే వృద్ధులకు  అదే ఊతకర్రకు మించి మంచి తోడు అవుతుంది.

గడచిన ఒకటిన్నర శతాబ్ద కాలంగా మానవ జీవనస్థితిగతుల్లో కనిపించే గణనీఉయమైన మెరుగుదల హర్షణీయం. అందుకు కారణం  పారిశుధ్యం పైన మునపటి కన్నా పెరిగిన శ్రద్ధ; అదనంగా నాణ్యమైన వైద్య సంరక్షణ.  మానవ  ఆయుర్దాయం  క్రమంగా పెరగడం ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలలో కూడా ప్రస్ఫుటంగా కనిస్తుందిప్పుడు.

విశ్వవ్యాప్తంగా మనిషి సగటు జీవితకాలంలో  చెప్పుకోదగ్గ పెరుగుదల కొత్త శతాబ్దం నుండి ఆరంభయింది. 2016 మధ్య వరకు దొరుకుతున్న లెక్కల ప్రకారం ఈ పెరుగుదల ఐదు సంవత్సరాల ఐదు నెలలు. గత శతాబ్ది ’60 ల తరువాత నమోదైన  అత్యంత వేగవంతమైన పెరుగుదలలో ఇదే గరిష్టం. దేశ జాతీయ గణాంకాలు ఇంతకు మించి ఘనంగా మోతెక్కడం మరో విశేషం.  నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 రికార్డులు చూసుకుంటే, భారతదేశంలో ఆయుష్షు  ప్రమాణం ‘70-‘75లలో 49 సంవత్సరాల ఏడు నెలలుగా ఉంటే, అదే జీవితకాలం 2012-2016ల మధ్యలో  ఏకంగా 68.7 సంవత్సరాలకు ఎగబాకింది. ఇంత పెరుగుదల వల్ల  తేలిన పరిణామం ఏమిటంటే,    జాతీయ జనాభా మొత్తంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య గణనీయంగా పెరగడం! ఇవాళ దేశ జనాభాలో వయోవృద్ధుల వాటా ఒక బలమైన స్వతంత్ర వర్గంగా తయారయింది.  సమాజంలోని ముఖ్యాంగాలలో ఒకటిగా లెక్కించక తప్పని పరిస్థితి కల్పించింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానమూ  అనూహ్యమైన వేగంతో అభివృద్ధి పథంలో  దూసుకురావడం..  అదృష్టం.

 

ఆధునిక సాంకేతిక జ్ఞానం సాయం లేకుండా  రోజువారీ దినచర్య క్షణం ముందుకు సాగని పరిస్థితులు ఇప్పడున్నవి. అంతర్జాల పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చేసే ఉపకరణలు(యాప్స్)  ఉనికిలో లేనట్లయితే ప్రపంచానికి ఏ గతి పట్టి ఉండేదో ఊహించడం కష్టమే! సాంకేతికత సాయం వినా  కోవిడ్- 19 వంటి  మహమ్మారులు ఇప్పుడు సృష్టించే  లాక్-డౌన్లు, ఐసొలేషన్  ఉపద్రవాలను  ఏ విధంగా తట్టుకోవడం?

 

ఉత్పాతాలు ఒక్కటనే కాదు, మహమ్మారులు జడలు విదల్చని ముందు కాలంలో కూడా మనిషి జీవితంలో సాంకేతిక అనివార్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం ఆధారంగా మెరుగయ్యే  జీవనశైలి పైన మారుమూల పల్లెజీవి కూడా మోజుపడే తరుణం ఒకటుంది. అయినా సాంకేతిక రంగ సంబంధిత మార్కెట్  అన్ని రిస్కులు ఎందుకు ఎందుర్కొంటున్నట్లు? క్షణక్షణం మారే ఆ సాంకేతిక పరిజ్ఞానం సృష్టించే అనిశ్చిత వాతావరణమే అందుకు ప్రధాన కారణం.  రైడ్‌-ఆన్-కాల్  సౌకర్యం అందించే ఉపకరణలు ముమ్మరం అయిన తరువాత మధ్యతరగతివారి కార్ల కొనుగోళ్ల వాటా అథఃపాతాళానికి అణగిపోవడమే అందుకు ఉదాహరణ! వంటిఆరోగ్యం నుంచి ఇంటిపనుల వరకు అన్నింటా టెక్నాలజీ నీళ్లలో పాలలా కలగలసిపోయి ఉన్న నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం వయసు మళ్లినవాళ్లకు వాస్తవంగా ఒక గొప్ప వరం కావాలి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అందుకు విభిన్నంగా ఉన్నాయి. అదీ విచిత్రం!

 

గడప దాటి  కాలు బైటపెట్టలేని వయోవృద్ధులకు  కుటుంబ సభ్యుల నిరంతర సేవలు ఎల్లవేళలా  లభ్యమయ్యే కాలం కాదు ఇప్పటిది.  ఇంటి పట్టున ఒంటిగా మిగిలుండే వృద్ధులకు అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ నిజానికి ఎంతో అండగా ఉండాలి.  కానీ,  పాతకాలపు ఆలోచనలు ఒక పట్టాన  వదలుకోలేని ముసలివాళ్ల సంశయాత్మక మానసిక బలహీనత సాంకేతిక పరిజ్ఞాన పరిపూర్ణ  వినియోగానికి అవరోధంగా మారుతున్నది.   మొబైల్ అంటే కేవలం టెక్స్టింగ్ మాత్రం చేసుకునే ఓ చేతిఫోన్ సౌకర్యం.. అనుకునే తాతా అవ్వలే జాస్తిగా కనిపిస్తున్న పరిస్థితి ఇప్పటికీ. యాప్ లంటే కుర్రకారు ఆడుకుందుకు తయారయ్యే ఏదో ఫోన్ సరదాలని గట్టిగా నమ్మినంత కాలం టెక్ ఆధారిత  వేదికలను నమ్మి ఆమ్మమ్మలు, తాతయ్యలు గాడ్గెట్లను నిత్యజీవితావసరాలకు ధీమాగా వాడటం  కల్ల. వయసు పైబడినవారిలో  టెక్నాలజీ మీద ఉండే అపనమ్మకం ఎట్లా తొలగించాలన్నదే ఈనాటి టెక్ మార్కెట్లను తొలిచేస్తున్న ప్రధాన సమస్య. 

 

కాలిఫోర్నియా శాన్డియాగో విశ్వవిద్యాలయం ల్యాబ్ డిజైనర్  షెంగ్జీ వాంగ్ ఇటీవల వయసు వాటారిన వాళ్ల మీద సాంకేతిక పరిజ్ఞానం చూపించే ప్రభావాన్ని గురించి ఓ పరిశోధన పత్రం వెలువరించాడు.  పదే పదే ఎదురయ్యే పలు సందేహాలకు సులభంగా సమాధానాలు రాబట్టే సౌలభ్యం తెలీకనే సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొత్త టెక్ అంటే చిరాకుపడతారన్నది  షెంగ్జీ వాంగ్  థియరీ. ఇటు ఉత్సుకత ఉన్న ముసలివాళ్లనైనా  ప్రోత్సహించనీయని చిక్కుముళ్లు అనేకం  పోగుపడటమే వృద్ధజనం ఆధునిక సాంకేతికత వాడకానికి ప్రధానమైన అడ్డంకి అని కూడా అతగాడు తేల్చేశాడు.

 

తరచుగా మారిపోయే అప్ డేట్స్, తత్సంబంధమైన మార్పులు చేర్పులు పెద్దవయసువారికి ఒక పట్టాన అర్థం కావు.    ఉదాహరణకు,  ‘బటన్స్’ ఒక క్రమంలో నొక్కి కోరుకున్న సేవలు పొందటం అలవాటు పడ్డ తరువాత, అవే సేవల  కోసం ఆవిష్కరించిన మరో కొత్త ‘బటన్ లెస్’ విధానం మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవడం వృద్ధుల దృష్టిలో  విసుగు పుట్టించే వృథా ప్రయాస. ఒక వయసు దాటినవారి మానసిక ఏకాగ్రతలో వచ్చే సహజ మార్పులను పరిగణనలోకి తీసుకోని పక్షంలో అధునాతన  విజ్ఞానం ఎంత ఘనంగా పురులు విప్పి ఆడినా పెద్దలకు ఆ భంగిమల వల్ల ఒనగూడే లాభాలు ఒట్టిపోయిన గోవు పొదుగు పిండిన చందమే.  గొప్ప సాంకేతిక విజయంగా నేటి తరం భావిస్తున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పెద్దలను ఇప్పటికీ జయించలేని ఒక మాహా మాయామృగంగానే భయపెట్టేస్తోంది. కృష్ణారామా అనుకుంటూ ప్రశాంతంగా కాలం గడపే   వయసులో మొరటు మృగాలతో పోరాటాలంటే ఏ ముసలిమనిషికైనా ఉబలాటం  ఎందుకుంటుంది?!

 

పొద్దస్తమానం కొత్త కొత్త పాస్ వర్డ్స్ ఎన్నో పరిమితులకు లోబడి నిర్మిస్తేనే తప్ప  సేవలు అందించని యాప్ లు వయసు మళ్లినవాళ్ల దృష్టిలో ఉన్నా లేనట్లే లెక్క.  జ్ఞాపకశక్తి, నిర్మించే నైపుణ్యం సహజంగానే తరిగిపోయే ముసలివగ్గులకు ఈ తరహా పాస్ వర్డ్ ‘ఇంపోజిషన్స్’ శిక్ష దాటరాని ఆడ్డంకిగా తయారవుతున్నది. లాగిన్ కాకుండా ఏ సేవా లభించని నేపథ్యంలో అన్ని వెబ్ కాతాలకు ఒకే తరహా లాగిన్ ఉంటే  వృద్ధజనాలకు ఎక్కువ సౌలభ్యంగా ఉంటుంది. ఆ తరహా వెసులుబాటుకు గూగుల్ వంటి పోర్టల్సు ఒప్పుకుంటున్నా, సెక్యూరిటీ కారణాలు అవీ ఇవీ చెప్పి   చుక్కలు చూపించే అప్రమత్తత వాటిది. దిక్కులు చూస్తూ కూర్చునే దానికా    వేలు పోసి  స్మార్ట్ ఫోనులు పెద్దలు కొని ఒళ్లో పెట్టుకొనేదీ! ఎన్నో రకాల అంతర్జాల వేదికలు(ఇంటార్నెట్ ఫ్లాట్ ఫారమ్స్)! అంతకు వంద రెట్లు అయోమయ ఉపకరణలు(యాప్స్)! ఒక్కో  అంతర్జాల కాతా కు ఒక్కో తరహా నియమ నిబంధనలు! సాంకేతిక సంక్లిష్టత   కురుక్షేత్ర యుద్ధం నాటి అభిమన్యుడి సంకట స్థితి తెచ్చిపెడుతుంటే, తాజా టెక్నాలజీ వల్ల వృద్ధజనాలకు ఒనగూడే  ప్రయోజనం ఏమిటన్నది జవాబు దొరకని ప్రశ్నయింది. 

 

కొత్త టెక్నాలజీ హంగూ ఆర్భాటంగా రంగ ప్రవేశం చేసేది  ముసలితరంగా తమను  మరంత వంటరి చేసేందుకే అని పెద్దలు భావించడం మొదలయితే  నూతన సాంకేతిక పరిజ్ఞాన వికాసం మౌలిక లక్ష్యమే సమూలంగా దెబ్బతిన్నట్లు లెక్క.  కనీసం డబ్బు చింత లేని పెద్దవారికైనా..  ఆధునిక   సాధనాలతో   ఆ దివి  సదుపాయాలన్నీ భువి మీదకు  దింపుతామనే హామీ  అత్యాధునికమని చెప్పుకునే లేటెస్ట్ టెక్ నిలుపుకుంటుందా?  మనవళ్ల, మనవరాళ్ళ తరం మాదిరి యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే కదా ఏ ఆధునిక  పరిజ్ఞానం వాడకం వైపుకైనా అవ్వాతాతల ఆసక్తులు రవ్వంతైనా మళ్లేది!  అట్లాగని సైబర్ నేరాలతో  రాజీపడిపొమ్మని కాదూ.. అర్థం.

 

తప్పేమన్నా జరిగిపోతుందేమోనన్న భయం  పెద్దవయస్కుల్లో  ఎక్కువ మందిని  స్మార్ట్ ఫోన్  రిస్క్ తీసుకోనివ్వడంలేదు. ఈ కాలంలో పసిపిల్లలు సైతం అతి సులువుగా  ఆడేస్తున్న  విసిఆర్ రిమోట్..  ముందు తరాన్ని విధంగానే మహా బెదరగొట్టింది. వాస్తవానికి టచ్,  వాయిస్ వంటి సదుపాయాలతో సీనియర్ సిటిజన్లు అద్భుతమైన సేవలు అందుకునే సౌలభ్యం మెండు. హై- టెక్’ అద్భుత దీపంతో  పని చేయించుకునే సులువు సూత్రం ముందు ముసలితరం అల్లావుద్దీన్ తరహాలో స్వాధీనపరుచుకోవాలి.  మొబైళ్లూ, యాప్ ల నిర్మాతలే, టి.వి అమ్మకాల పద్ధతిలో డోర్ స్టెప్ డెమో సర్వీసులు అందించైనా అందుకు పాతతరాన్ని  సిద్ధం చేసుకోవాలి. ఒకే రకం సేవలకు పది రకాల పరికరాలతో ముసలి మనసులను మయసభలుగా మార్చకుండా సీనియర్లే  తమ  అవసరాలు, అభిరుచులకు  తగ్గట్లుగా ప్రత్యేక ఉపకరణాలు  స్వంతంగా ఎంచుకునే తీరులో ఈ శిక్షణా పరంపరలు కొనసాగాలి. పాతతరానికి  కొత్త నైపుణ్యాలు నేర్పించడంలోనే ఆధునిక టెక్నాలజీ విజయ రహస్యమంతా ఇమిడి వుందన్నముఖ్య సూత్రం మరుగున పడటం వల్లే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధుల విషయంలో పేరుకు మాత్రమే కాళ్లున్నా కదలలేని కుర్చీలా కేవలం అలంకారప్రాయంగా ఆర్భాటం చేస్తున్నది.

ఖర్చులకు రొక్కం కావాలన్నా కాళ్లు పీకేటట్లు బ్యాంకుల ముందు పడిగాపులు తప్పని కాలం ఒకప్పడిది. తపాలా కార్యాలయానికి వెళ్లి కార్డు ముక్క గిలకనిదే   అయినవాళ్ల సమాచారం అందే  పరిస్థితి లేదు అప్పట్లో! మరి ఈ తరహా  తిప్పలన్నిటినీ తప్పించేటందుకే  నెట్ బ్యాంకింగొచ్చిందన్నారు; ఈ మెయిలింగొచ్చి గొప్ప మార్పులు తెచ్చిందన్నారు!   ఇంటి  కిరాణా సరుకు నుంచి బైటకు వెళ్ల దలిస్తే  కావలసిన రవాణా సౌకర్యం వరకు,  సమస్త సర్వీసులు దబాయించి నొక్కే బటన్ కిందనే దాగి ఉండే స్మార్ట్ ఫోన్ సీజన్లో లోకం ఊగిపోతుందంటున్నారు! ఏమేమి సేవలు వచ్చాయో, ఎవరిని మెప్పించే ఏ మహా గొప్ప మార్పులు తెచ్చి ఊపేస్తున్నాయో!?  చురుకుపాలు తగ్గిన పెద్దవాళ్ల అవసరాల గొంగడి మాత్రం ఎక్కడ వేసింది అక్కదే పడి ఉందన్న అపవాదు మాత్రం తాజా టెక్నాలజీ మూటకట్టుకుంటున్న మాట  నిజం. ‘అయ్యో! ఐ-ఫోనుతో పనా ?  అయ్యేదా పొయ్యేదా నాయనా?’ అన్నముసిలివాళ్ల పాత  నసుగుడే  సర్వత్రా ఇప్పటికీ వినవస్తున్నదంటే.. లోపం ఎక్కడుందో లోతుగా తరచిచూసుకొనే తరుణం తన్నుకొచ్చిందనే అర్థం!   

వయసు మీద పడే కొద్దీ పంచేద్రియాల పటుత్వం  తగ్గడం సహజం. సౌలభ్యం ఒక్కటే  కాదు, పనిసులువూ పెద్దల దృష్టిలో అందుకే ప్రధానంగా ఉంటుంది! రవాణా, ఆరోగ్య సంరక్షణల వంటి ముఖ్యమైన రోజువారీ కార్యకలాపాలలో పెద్దవయస్కులకు మద్దతు ఇచ్చే తేలికపాటి డిజైన్ల పైన దృష్టి పెట్టాలి. టచ్ బటన్ టెక్నాలజీలో గొప్ప సేవాభావం ఉంటే ఉండవచ్చు. కానీ, ముందుతరం అతి కష్టం మీద అలవాటు పడ్డబటన్సిస్టమ్  పూర్తిగా తొలగిస్తే ఎంతస్మార్ట్అయివుండీ పెద్దలకు వనగూడే ప్రయోజనం మళ్లీ ప్రశ్నార్థకమే అవుతుంది కదా! విసిగించకుండా, కంటిని, వంటిని అతిగా  శ్రమపెట్టకుండా సేవలు  అందించే ఉపకరణాలు  ఉపయోగంలోకి  తెచ్చినప్పుడే సీనియర్లకు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ మీద మోజు మొదలయేది. వాడకం  పెరిగేది. కోరకుండానే సాయానికి రావడం, ఆపరేషన్ పరంగా తప్పు జరిగినా ఆంతర్యం గ్రహించి సేవలు చేయడం, వేళకు మందులు మాకులు, తిండి తిప్పల వంటి విషయాలలో అప్రమత్తంగా ఉండి ఆత్మీయంగా సేవలు అందించడం వంటి సామాజిక కార్యకర్తల బాధ్యతలన్నీ కుటుంబ సభ్యులను మించి శ్రద్ధగా నిర్వహించే  సాంకేతిక పరిజ్ఞానం సాకారమయిన రోజే  సినియర్ సిటిజన్ల మార్కెట్టూ స్మార్ట్ టెక్నాలజీ రంగం బ్యాలెన్స్ షీటులో క్రెడిట్ సైడుకు వచ్చిపడేది.    వయసు వాటారిన వారి స్మార్ట్ టెక్నాలజీ వాటా  మార్కెట్లో మరంత పుంజుకున్నప్పుడే అటు సీనియర్ సిటిజన్ల సంక్షేమం, ఇటు ఆర్థిక రంగ పునరుజ్జీవం  సమాంతరంగా ముందుకుసాగేది.

వృద్ధాప్యానికి మద్దతు ఇచ్చే బాధ్యత సమాజం మొత్తానిది. మొబైల్ కంపెనీలు ముసలివారి ప్రత్యేక అవసరాల కోసం ఉపకరణలు తయారు చేయడమే కాదు, అదనంగా ధరవరలలోనూ ప్రత్యేక రాయితీలు కల్పించాలి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా  నిర్దిష్ట ప్రచారాలను ముమ్మరం చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి.  సరసమైన ధరకు నాణ్యమైన వైఫై అంతరాయం లేకుండా అందుబాటులో ఉన్నప్పుడే  పెద్దవయసువారి అడుగులు ప్రధాన సాంకేతిక స్రవంతి వైపుకు నిమ్మళంగా పడే అవకాశం.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు దాదాపు విచ్ఛిన్న దశకు చేరి దశాబ్ద కాలం దాటిపోయిన మన దేశంలో పెద్దవయస్కుల  పట్ల పిన్నవారి ప్రేమానురాగాల ప్రదర్శనల్లోనూ పెనుమార్పులు తప్పటంలేదు. కాలం తెచ్చే మార్పులను మనస్ఫూర్తిగా అంగీకరించడం మినహా మరో ఐచ్ఛికం లేని నేపథ్యంలో.. సమాజం తీరును   వేలెత్తి చూపే కన్నా    వేలు కింది బటన్ నొక్కడం ద్వారా  కుటుంబానికి మించి  సమాజం అందించే సేవా సౌకర్యాలు అనుభవించడమే కుటుంబాలలోని పెద్దలకూ మేలు. వృత్తి వత్తిళ్ల మధ్యనే  వీలయినంత శ్రద్ధ తీసుకుని కన్నబిడ్డలు, దగ్గరి బంధువులే ఇంటిపెద్దలను నవీన టెక్నాలజీకి దగ్గర చేయడం తక్షణావసరం.

***

--కర్లపాలెం హనుమంతరావు






 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...