Showing posts with label celebretaries fiction. Show all posts
Showing posts with label celebretaries fiction. Show all posts

Monday, September 14, 2020

దీపక రాగం - మేఘమల్లార్ రాగం - సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 



దీపక రాగం ఆలపిస్తే దీపాలు వెలుగుతాయంటారు! మేఘమల్లార్ రాగం ఆలపిస్తే మేఘాలు వర్షిస్తాయని నమ్మిక!  మొదటి రాగం వేడిని రగిలిస్తే, రెండో రాగం చల్లదనం కలిగిస్తుందన్న అర్థంలో ఈ హిందూస్తానీ రాగాలను గురించి  అతిశయోక్తి అలంకారంలో జనం చెప్పుకునే మాటలు. సామాన్యులలో ఆసక్తి రేకెత్తించేందుకు సాధారణమైన విషయాలని అసాధరణ రీతిలో చెప్పడం 'కథనం' ప్రక్రియలో ప్రత్యేక విశిష్టిత. ప్రధానమైన అంశాన్ని ఒక కథగా మలచి వినిపిస్తే విన్నంత సేపూ విసుగు పుట్టదు. తరువాత మననం చేసుకునేందుకు కథా విధానం ఒక మంచి పద్ధతి. ఈ దీపకరాగం, మేఘమల్లార్ రాగాల చుట్టూ కూడా ఇలాగే ఎవరో ఒక కాల్పనిక జీవి సృజనాత్మకమైన చక్కని కథ అల్లాడుః


అక్బర్ పాదుషాను గొప్ప కళాభిమాని, కళాపోషకుడుగా చెప్పుకుంటారు కదా! ఆయన కొలువులో అన్ని రకాల కళలకు చెందిన నిష్టాతులకు గౌరవం దక్కేదని వినికిడి. తాన్ సేన్ ఆ బాపతు హిందూస్తానీ సంగీత కళాకారుడు.

అక్బర్ దగ్గర చనువుగా ఉండే బీర్బల్ ఒకరోజు దీపకరాగం గురించి పాదుషాలో కథలు కథలుగా చెప్పి ఆసక్తి రేకెత్తించాడు. అక్బర్ తాన్ సేన్ ను నిండు సభలో తనకు ఆ దీపకరాగం ఆలపించి వినపించమని ఆదేశించాడు. అప్పటి దాకా సుఖంగా గడిచిపోయే తాన్ సేన్ సంగీత జీవితానికి ముప్పు  ఏర్పడిందన్న మాట. దీపకరాగం తాన్ సేన్ కు రాక కాదు. అది ఆలపించి ఇంచక్కా దీపాలు వెలిగించి చూపరులకు ఆనందం కలిగించవచ్చు. కానీ గానం చేసిన గాయకుడు కొద్ది రోజులలోనే అనారోగ్యం పాలవుతాడని, చికిత్సలేని రుగ్మత వల్ల దుర్మరణం సంభవిస్తుందన్న ఒక  నమ్మకం  ప్రచారంలో ఉంది. పాదుషా ఆజ్ఞాపించిన మీదట కాదనేందుకు లేదు కదా! కనక, దీపకరాగం ఆలపించి నిండుసభలో పాదుషా ప్ర్రశంసలు పొందినా, తాన్ సేన్ తొందర్లోనే అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స చేసిన రాజవైద్యులు పెదవి విరిచి 'దీపకరాగం వల్ల వచ్చిన పీడకు మేఘమల్లార్ రాగం ఒక్కటే మందు. అది పాడినా, విన్నా క్రమంగా తగ్గుముఖం పట్టాల్సిందే తప్ప ఈ గుండెల్లో మంట రోగానికి మరో  ఉపశమనం లేదు.' అని తేల్చిచెప్పారు. తాన్ సేన్ కు ఆ రాగం రాదు. అది వచ్చినవారు ఎక్కడ ఉంటారో .. ఆ వివరాలు కూడా తెలీవు.  వెదుకులాట మొదలయింది. 'పాడేవారు దొరికేదాకా  గుండెల్లో ఆరని ఆ మంటకు ఉపశమనంగా ఉండేందుకు వీలుగా తాన్ సేన్ ను ఏదైనా చల్లని నదీ తీరానికి పంపించండి' అని సలహా  ఇచ్చారు వైద్యులు.

అక్బర్ అనుమతితో  గుజరాత్ లోని శబర్మతీ నదీ తీరాన ఒక కుటీరం వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు తాన్ సేన్.

రాష్టం మీద మొగలాయీల కన్ను పడిందన్న అనుమానంతో ఉన్న  గుజరాతీ సమాజంలో దానికి తగ్గ విధంగా ఆడవారు తమ నడవడికను మార్చుకున్నారు. పగలు బయట మొహాలూ చూపించడం దాదాపుగా తగ్గించేశారు. ఇంటి అవసరాలకు కావలసిన నీళ్లు తెల్లవారు ఝామున చీకట్లలోనే నదీ తీరానికి గుంపులుగా వెళ్లి తెచ్చుకునేవాళ్లు.  ఆవిధంగా నీరు తెచ్చుకునేందుకు నదీ తీరానికి వచ్చిన అక్కచెల్లెళ్ళు నది ఒడ్డున కుటీరం బైట గుండెలోని ఆవేదన ఆగక బాధపడే తాన్ సేన్ ను చూశారు. 'అక్కడెవరో దీపకరాగం ఆలపించి పాపం అనారోగ్యం పాలయినట్లున్నారే!' అంది ఒక ఆడగొంతు. రెండో గొంతు 'ష్.. ష్.. మనకెందుకు? పోదాం పద!' అంది. ఆడవాళ్ళిద్దరూ గబగబా బిందెలో నీరు నింపుకొని గట్టు ఎక్కి పైకి రాసాగారు. గట్టు మీద నిలబడి ఉన్న తాన్ సేన్ వాళ్లను చూశాడు. ఆ ఆడవాళ్లిద్దరు పడుచువయసులో, అందంగా, పొందికగా ఉన్నారు. 'నేను దీపకరాగం ఆలపించినట్లు మీకు ఎలా తెలుసు తల్లులూ?' అని అడగాలని తాన్ సేన్ ఉద్దేశం. ఆయన పెదవి విప్పి అడిగే లోపలే  ఆ ఆడవాళ్లు ఇద్దరూ ఎవరో తరుముతున్నట్లు వెళ్లిపోయారు!

మర్నాడు అదే చోట వాళ్ళ కోసం కాపు కాసి కష్టపడి ఎట్లాగైతేనేం ఆడపిల్లలు ఇద్దరిని నిలబెట్టాడు తాన్ సేన్. తన పేరు ఫలానా అని, అక్బర్ పాదుషా కొలువులో పాటలు పాడే ఉద్యోగిన'ని చెప్పుకోగానే ఇద్దరిలో పెద్దపిల్ల 'అమ్మో! అక్బరు పాదుషానే! ' అంటూ కంగారుపడుతూ చెల్లెలు చెయ్యి పట్టుకుని  లాక్కెళ్లిపోయింది. విచారణ  మీదట తాన్ సేన్ కు ఊరిలో మొగలాయీల మీద ఉన్న బెదురు అర్థమైంది

మర్నాడు తెల్లారుఝాము చీకట్లలో మళ్లీ ఆ అప్పచెల్లెళ్లను కలుసుకుని 'చెల్లెమ్మల్లారా! నన్ను చూసి భయపడనక్కర్లేదు! మీరు చూస్తే  సంగీతజ్ఞులకు మల్లే కనిపిస్తున్నారు. మేఘమల్లార్ రాగం మీకు గాని తెలిస్తే పాడి నాకు సాయం చేయండమ్మా! లేదా ఆ రాగం తెలిసినవాళ్ల వివరాలు చెప్పినా మీ పుణ్యం వృథా పోదు తల్లులూ!' అంటూ  పరిపరి విధాల ప్రాథేయపడ్డాడు


అమ్మాయిలు ఇద్దరకూ జాలి కలిగింది. చిన్నపిల్ల అన్నది' మాకూ కొద్దిగా సంగీతం వచ్చు. మేఘమల్లారం పాడి వినిపిస్తామురేపు పౌర్ణమి కదా! తెల్లారుఝామున చీకట్లు విడకముందే ఈ నదీ తీరానికి వచ్చేయండి. ఇట్లా వస్తున్నట్లు ఎవరికీ చెప్పకండి!' అన్ని వెళ్లిపోయారు

మర్నాడు అనుకున్న సమయానికే అక్కచెల్లెళ్లిద్దరూ ఆ నది తీరంలొ ఎదురుచూస్తూ కూర్చునివున్న  తాన్ సేన్ ను కలుసుకున్నారు. చిన్న అమ్మాయి కుటీరంలోకి వెళ్ళి తాన్ సేన్ సితారా తీసుకువచ్చింది. అక్కచెల్లెళ్ళిద్దరూ ఆ పండు వెన్నెలలో ప్రశాంత వాతావరణంలో నదీ తీరాన అత్యంత మధుర స్వరాలతో మేఘమల్లార్ రాగం అలపిస్తుంటే వింటూ తన్మయుడయిపోయాడు స్వయంగా  సంగీత విద్వాంసుడు అయిన తాన్ సేన్. మేఘమల్లార్ ఆలాపన  వింటుంటే తాన్ సేన్ కంటి వెంట నీరు ఆగలేదు. గానం పూర్తవగానే 'మీరు మానవులు కాదు తల్లులూ! దివి నుంచి దిగివచ్చిన గంధర్వులు. మీ స్వరాలకు చిక్కి సంగీతలక్ష్మి స్వయంగా తానే పునీతమయింది తల్లుల్లారా' అన్నాడు  కంటి వెంట కారే బాష్పధారలను తుడుచుకోకుండానే. మరంత విచారించిన మీదత తమ పేర్లు 'తానా.. నానా' అని మాత్రం చెప్పుకొచ్చారు ఆడపిల్లలు


తానా నానాలు మూడు రాత్రులు మొదటి ఘడియల్లో అట్లా మేఘమల్లార్ రాగం ఆలపించగానే తాన్ సేన్ గుండెల్లోని జ్వాల చల్లారింది. మనుషుల్లో పడ్డ  తాన్ సేన్ తిరిగి వెళ్లిపోయే సమయంలో తానా నానాలకు బహుమానాలు ఇవ్వబోతే  తీసుకోలేదు 'మా గురించి మూడో కంటికి తెలియనీయకండి! అదే మీరు మాకు ఇచ్చే అతి పెద్ద బహుమానం అన్నయ్యగారూ!' అని మాత్రం మాట తీసుకున్నారు.

కోలుకొని తిరిగివచ్చిన తాన్ సేన్ ను చూసి అక్బర్ పాదుషా అమితంగా ఆనందించాడు.  కానీ సాటి సంగీత కళాకారులలో ఈసు రగిలింది. 'మేఘమల్లార్ రాగం పాడి వినిపించమని మీరే స్వయంగా అడిగినా  రాదని తాన్ సేన్ తమకు చెప్పాడు. ఆ మాట అబద్ధం అని ఇప్పుడు తేలింది కదా హుజూర్ఆ తప్పుకు దండన ఉండద్దా?' అన్నది వాళ్ల ప్రశ్న.

 అక్బరు కూడా  ఇదే ప్రశ్న వేసినప్పుడు  సమాధానం ఏం చెప్పాలో తెలీక బిక్కమొగమేశాడు తాన్ సేన్. అక్కచెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం వారి గురించి ఎవరికీ చెప్పకూడదు కదా! ఎంత అడిగినా మేఘమల్లార్ రాగాలాపన చెయ్యడానికి గాని, అందుకు సంబంధించిన వివారాలు చెప్పడానికి గాని మొరాయించే తాన్ సేన్ మీద అక్బర్ పాదుషాకు పీకల దాకా కోపం ముంచుకొచ్చింది. 'వారం రోజులు గడువు ఇస్తున్నాను. ఈ లోగా పాడి తీరాలి. లేదా ఆ పాట ఎవరి ద్వారా విన్నావో  ఆ వివరాలైనా చెప్పి తీరాలి. కాదంటే ఉరిశిక్ష ఖాయం. చక్రవర్తితో అబద్ధాలాడిన నేరానికి ఇంత కంతే మరో పెద్ద శిక్షలేదు మరి' అని  హుకూం జారీ చేశాడు అక్బర్ మహారాజు.

ప్రాణాల మీద తీపితో 'తానా నానా' ల   గురించి బైటపెట్టేశాడు తాన్ సేన్అక్కచెల్లెళ్ల నోట ఆ మేఘమల్లార్ రాగం వినాలని ఉవ్విళ్ళూరాడు అక్బర్. ఉన్నపళంగా దండు  శబర్మతీ నదీ తీరానికి తరలింది. ముదే తాన్ సేన్ తానా నానాలను కలసి తన వల్ల జరిగిన తప్పును కాయమని, 'ఒక్కసారి వచ్చి పాదుషా సమ్ముఖంలో మేఘమల్లార్ రాగం ఆలపించకపోతే తన ప్రాణాలు  పోవడం ఖామయ'ని దుఃఖిస్తూ చెప్పాడు. అక్కచెళ్లెళ్లిద్దరూ విన్నారు ఓపిగ్గా. తాన్ సేన్ స్థానం హిందూస్తానీ సంగీతంలో ఎంత ఉన్నతమైనదో వాళ్లకి తెలుసు. పాదుషా సమ్ముఖంలో రాగం ఆలపించడానికి సమ్మతించారు.

నిండు సభలో ఆ బంగారు బొమ్మలు ఎత్తైన వేదిక మీద మేలి ముసుగుల వెనుక నుంచి చెవులు రిక్కించి ఆలపించిన మేఘమల్లార్ రాగం సభ్యులను అవాక్కయేలా చేసింది. ఆగకుండా కరతాళధ్వనులు! అక్బర్ పాదుషా ఆనందానికయితే హద్దే లేదు. మెడలోని ముత్యాల సరం తెంపి తానా నానాల మీదకు విసిరిపేసాడు. అయినా ఆ అభిమానవతులు వాటి వంక తేరిపారయినా చూసింది లేదు.

తమ కోసం గాను ఏర్పాటు చేసిన సభామధ్యమం లోని ఎత్తైన ఆ వేదిక నుంచి కిందికి దిగి ఒకరి వంక ఒకరు సాభిప్రాయంగా చూసుకుంటూ కౌగలించుకున్నారు. ఉత్తర క్షణంలో అలంకరించిన అందమైన పందిళ్లు హఠాత్తుగా నేలకూలినట్లు  కుప్పకూలిపోయారు. వారి డొక్కల్లోని బాకులు రక్తసిక్తమై ఆ ఘనకార్యం చేసింది తామే అన్నట్లు ఎర్రగా నవ్వుతున్నాయి!

అదే క్షణంలో సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు యువకులు ఘొల్లుమన్నారు. వాళ్ళిద్దరు తానా నానా భర్తలు. సభకు బైలుదేరే ముందు భర్తలను క్షమించమని వేడుకుంటూ  రాసిన ఉత్తరాలు అప్పుడు గాని అందరి కంటపడ్డాయి కాదు. 'మహా సంగీత విద్వాంసుడు తాన్ సేన్ విలువైన ప్రాణాలు కాపాడవలసిన అవసరం గుర్తించాము. అందుకని నిండు సభలో అక్బర్ పాదుషా ముందు మేఘమల్లార్ రాగం ఆలపించవలసి వచ్చింది. ముందుగా భర్తలైన  మీ అనుమతి తీసుకోలేదు. మా వల్ల తప్పు జరిగింది అని తెలుసు. మన జాతి నీతి ప్రకారం భర్తల సమ్మతి లేకుండా భార్యలు పరపురుషుల కంటబడకూడదు. ఆ రివాజును తప్పినందుకు మేము నిస్సందేహంగా శిక్షకు అర్హులమే. మీకు మా మీద ఉన్న ప్రేమ తెలుసు. మీరు మమ్ములను శిక్షించలేరు. కాబట్టి మమ్మల్ని మేమే ఇలా శిక్షించుకుంటున్నాము. మిమ్ములను మనసారా ప్రేమిస్తున్న భార్యలుగా మమ్ములను క్షమించమని ఆఖరి విన్నపం'. 

ఉత్తరం బిగ్గరగా చదివి భర్తలిద్దరూ 'మా తానా నానాలను తిరిగి ఎవరైనా తెచ్చివ్వగలరా?' అని హృదయవిదారకంగా రోదిస్తుంటే అక్బర్ తన తొందరపాటుకు తలదించుకోవలసి వచ్చింది.

తాన్ సేన్ యువకులు ఇద్దరిని పైకి లేపి పరితాపంతో అన్నాడు 'చెల్లెళ్లు ఇద్దరిని నేను తిరిగి తెచ్చి ఇస్తానని హామీ ఇస్తున్నా. భౌతికంగా నాకు సాధ్యమవని ఆ పనిని కళాకారుడుగా సాధించి చూపిస్తాను. ఇక నుంచి నేను ఆలపించే సంగీత స్వరాలలో ఇప్పటి వరకు  ధ్వనించిన 'ఓం' అనే స్థానంలో 'తోమ్ తానా నానా' అంటూ ఆలపిస్తాను.  ఆ రకంగా మీ తానా నానాలను కాలానికి అతీతంగా శాశ్వతం చేస్తాను ' అని వాగ్దానం చేసాడు.

 తానా, నానాల పేరున శబర్మతీ నదీ తీరాన ఒక స్వరాలయాన్ని నిర్మించాడు తాన్ సేన్.

తరువాతి కాలంలో కాలగర్భంలో ఆ సంగీతాలయం కలిసిపోయింది. మహా పాదుషా అక్బర్ చక్రవర్తి  ఉనికీ మలిగిపోయింది. చివరికి శాశ్వతంగా మిగిలింది మాత్రం  హిందుస్తానీ మహా సంగీతవిద్వాంసుడు తాన్ సేన్ గొంతులో తారట్లాడే 'తోమ్ తానా నానాలలోని  ఆ తానా నానా' లు మాత్రమే!

***

సేకరణః

-కర్లపాలెం హనుమంతరావు

14 -09 -2020

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...