Showing posts with label Stories. Show all posts
Showing posts with label Stories. Show all posts

Thursday, December 30, 2021

కథ బొమ్మల పెళ్లిళ్లు కొడపటిగంటి కుటుంబరావు. ( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 


కథ 

బొమ్మల పెళ్లిళ్లు 

కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 

బోధెల్ - యూఎస్ఎ



ఆరోజు సరోజినికి పర్వదినం. ఆపిల్లకళ్లకు సమస్తం ఆనందమయంగా తోచింది. 


వాళ్ల బావ భైరవమూర్తి గారి మేడ టాజిమహల్లాగుంది. ఇంటిపక్క తోట నందనవనంలాగుంది. తనతో తోటలో పికారు చెయ్య టానికి వచ్చిన సావిత్రి సాక్షాత్తూ దేవకన్యకలాగుంది. 


ఆరోజున సరోజినికి సావిత్రినిచూస్తే అనురాగంపొంగి పొర్లటం మొదలు పెట్టింది. ఈ ప్రేమావేశం తాత్కా లిక మేఫనీ, పూర్వం ఉన్నదికాదనీ, ముందుండబోదనీ ఆ ఉత్సాహంమీద సరోజినికి తోచటం అసంభవం. దీనికంతా కారణం అప్పుడే ప్రవేశిస్తున్న వసంతరుతువు కాదు, ఆనాడు భైరవమూర్తిగారి శిశువు అన్నప్రాశన.


మీరు సావిత్రినికాని సరోజినిని కాని ఇద్దరినీ కాని బాగా ఎరిగుండకపోతే ఇద్దరూ కవలపిల్లలని చెప్పినా నమ్ముతారు. 


నిజానికిమటుకు సరోజిని సావిత్రికి పిన తల్లి. సావిత్రి సరోజినికన్న ఏమాత్రమో పెద్దదీ, సరోజినికన్న మితభాషి కూడా కావటంచేత చూడగానే ఇద్దరిలో కనపడే భేద మేమిటంటే సావిత్రి పినతల్లికంటె గంభీరంగా ఉండేది. అంతకుమించి ఇద్దరిలోనూ ఎక్కువ తారతమ్యం లేదు.


సరోజిని సావిత్రిని తోటంతా తిప్పి ఆఖరుకు  తన ప్రాణానికి మంచి పాదరిల్లంటిది కనపడ్డ చోటు  చూపి ఇక్కడ కాస్సేపు కూర్చుందామన్నది. 


ఇద్దరూ ఆకుల కింద కూర్చున్నారు. కొంతసేపు ఆకబుర్లూ ఈకబు ర్లూ చెప్పి సరోజిని అసలు సంగతి కొచ్చింది.


“అయితే, సావిత్రీ బావ నీ పెళ్లి చేస్తాడుట నిజవేనా ? " 


సావిత్రి సమాధానంగా పినతల్లిని చూసి నవ్వింది.


"అంతా నిశ్చయమయిందా?" 


" అదే నిశ్చయం. ఇంకా తాంబూలా లిచ్చుకో లేదు.”


2


“నీ కాబొయ్యే మొగుడెవరు ?  "


సావిత్రి చాలా నేర్పరి. ఎటువంటి ప్రశ్న కటువంటి సమాధానం చెప్పాలో ఎరుగును .


“ఎరగవు టే? మామయ్య ఇక్కడ చదువుకునేట ప్పుడు వస్తూండేవాడే—రాధాకృష్ణ మూర్తని !” 


" నాకు బాగా జ్ఞాపకంలేదు... అయితే నీకీ  సంబంధం ఇష్టమేనా?" 


" ఎందు కిష్టంకాదు?”,


సరోజిని తనావిషయం మాట్లాడదలుచుకున్నది అ యిపోయినట్టు నన్న గొంతుతో ఏదో మంగళహారతి ఎత్తిచప్పున ఆపి “ఇప్పు డీసంబంధం కాకుండాపోతే?” అన్నది.


" ఏమిటి?"


“నిన్ను ఆ అబ్బాయికిచ్చి -ఆయన పేరేమిటి? —ఆయనకిచ్చి చెయ్యరనుకో..”. 


" పోనీ!...అయినా ఎందుకు చెయ్యరు?”.


"ఇంకొకరి కిచ్చిచే స్తే!" 


" ఇంకో రెవరు?"


“అన్నయ్యకి స్తే!”


సావిత్రి నవ్వి “తాతయ్య కిష్టంలేదుగా?" అంది. 


"తాతయ్య సంగతి కాదిప్పుడు! నీ సంగతి చెప్పు!"


" ఏమో! నా కంత యిష్టంలేదు సుమా. మామయ్య ఎప్పుడూ మేనకోడలిని చేసుకోటం నీతి కాదఁటుంటాడు. అయినా ఇప్పుడెందు కాఆలోచన?”


సరోజిని సావిత్రి చెయ్యి తీసుకుని వేళ్లు సాగ దీస్తూ “ఇవాళ మా నాన్న మీ నాన్న నడగబోతున్నాడు. నిన్ను అన్నయ్య కియ్యమని. నీకింకా తెలీదేమో?” అని సావిత్రి మొహం వంక చూసింది. 


సరోజిని అనుకున్నట్టు సావిత్రి మొహాన  ఏభావం కనపళ్ళేదు. 


ఇంత రహస్యం చెప్పినా సావిత్రి చలించకపోవటంచూసి సరోజినికి ఉత్సాహభంగమైంది. ఇద్దరూ కొంతకాలం మౌనంగా కూర్చున్నతరువాత సరోజిని పోదామంటూ లేచింది.


“కాస్సేపు కూర్చోవే అబ్బ! ఇంట్లో ఏముంది?"


"ఇంకా అడుగూ బొడుగూ కాఫీ ఉందేమో తౌగి ఇప్పుడేవస్తా. లేకపోతే మంచినీళ్లైనా తాగుతా: ఏం చేస్తాం!" అంటూ చెయ్యి వదలించుకుని సరోజిని ఇంటి వైపు పరిగెత్తింది.


సరోజినటువెళ్లింది, సుందరం ఇటొచ్చాడు. అతను వెనకనించి సావిత్రిని సమీపించి “ఇక్కడున్నావుటే అమ్మాయి? అమ్మ నీకోసం వెతుకుతూంటేను,,, ఓసి!" అంటూ సావిత్రి పక్కనేకూలబడి ఒక చేత్తో సావిత్రిని దగ్గరికి తీసుకున్నాడు.


“నీపెళ్లెప్పుడే, పెళ్లికూతురా ? రాధాయి కంట గడు 

తున్నారూ నిన్ను! మంచివెధవ నీకు మంచి మొగుడవుతాడు. ఆలుసుమాత్రం ఇచ్చేవు సుమా! ఒక చెంపనించి తొక్కి పెడితే కాని మాటవినడు. జాగ్రత్త."


" ఏమ్మాటలు, మామయ్యా!"


"ఓసి! నీకెంతసిగ్గు ! ఒక్కత్తెవు కూర్చుని మొగుడి విషయం ఆలోచిస్తున్నావేమోనని మంచి  చెప్పబోతే తప్పా? నే పోతున్నా లే!”


" ఉండు! ఉండు! అట్లా అయితే నేనూ పెళ్లి విష యమే మాట్లాడతాను. ఒకటి చెప్పు. మేనమామను పెళ్లి చేసుకోవచ్చునా?”


"తప్పు!"


" నేను మరి నిన్ను చేసుకోబోతున్నా నే!"


సుందరం సావిత్రి చెంపమీద ఒక్కటి పెట్టి “ఈసారి  ఆమాటంటే నీతో మాట్లాడను," అన్నాడు. 


సావిత్రి చెంపరుద్దుకుంటూ నవ్వి, “ఈ మాట మీ నాన్న అన్నా ఇదేనా శిక్ష!” అన్నది. 


సుందరం ఆశ్చర్యంతో మేనకోడలి వంకచూసి, “నాకింకా తెలీదే! నీతో ఎవరన్నారు?" అని అడి గాడు.


"సరోజిని.”


“దాని కన్నీ తెలుసు!... హూఁ! ఆ అయిదు వేల కట్నం నాన్న గారి మతిచెడగొడుతున్నది. సంవత్సరం కిందట ఈ విషయం వచ్చినప్పుడు అయినవాళ్లలో కట్నంరాదని చాతనాయిన  వంకలన్నీ చెప్పి మనిద్దరికీ ముడిపడకుండా చేశాడు. ఈసారి బావ ఎట్లా తప్పించుకుంటాడు? ఇంకో వెయ్యి ఇస్తామంటే సగోత్రీకుల పిల్లనైనా చేసుకుంటారు నాన్న గారు. ఒక్కపాఠం నేర్చుకో, పిల్లా! నీ కెప్పటికైనా పిల్లలు పుడితే విశ్వ ప్రయత్నంచేసి వాళ్లకు పెద్దవాళ్ళ నెదిరించటం నేర్పు. నాకిన్నేళ్లు  వచ్చినై, ఇంత చదువు చదివాను! నాన్న గారు రేపు కొండముచ్చును పెళ్ళిచేసుకోమంటే కాదనేటం దుకు నాకు ధైర్యంలేదు... మీ నాన్న నీకు చనువిచ్చా డుగా! రాధాయినే చేసుకుంటానని పోట్లాడు.”


"నేను పోట్లాడను. నాన్న పెళ్ళివిషయం నన్నడగడు, నేను సిగ్గుపడతానని ఆయన నమ్మకం, నేను సిగ్గు లేనట్టు ఆయన కెట్లా తెలియచెయ్యటం?" 


" ఆహా ఏం లోకం ! ఎవరి పిల్లల మనసు వాళ్ళకు తెలీదు!"


ఆసాయంకాలం సుందరం, రాధాకృష్ణమూర్తి కృష్ణ ఒడ్డున ఇసకలో కూర్చున్నారు.


ఆ మర్నాడు సావిత్రి పెళ్ళికి ముహూర్తం ఏర్పాటు చేశారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. ముహూర్తం ఇరవైరోజుల్లో ఉంది. 


" రాధా! నా పెళ్ళికి తప్పక రావాలిసుమా , చెల్లెలిని చేసుకుంటున్న వాడి పెళ్ళి నీకెక్కడ తటస్తపడుతుంది?" అన్నాడు సుందరం దీనంగా.


‘‘అర్ధంలేకుండా మాట్లాడతావేంరా, సుందరంగా !  అప్పకూతుర్ని చేసుకుంటున్న వాడివి నువ్వే నేం లోకం లో! నీకు మళ్ళీ అటువంటి పిల్లవస్తుందీ?”


"అటువంటి పిల్ల మాసరోజా ఒకతె ఉందిగా!" 


" ఛీ! అప్రాచ్యుడా! వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారను కుంటున్నావుకాని, నక్కకూ —ఇద్దరికీ ఎంతో భేదం ఉంది. నాకు సంబంధమే కనపడదు.” 


“ఇంకేం? నాకు భేదమే కనపడదు. నిన్నా ఇవాళ లోపల   వందసార్లు సావిత్రిని సరోజిని పేరు పెట్టి పిలిచాను. అది పలకదు!" 


" నీ మొహం! దానిక్కోపం, వళ్ళుమంట, ఎందుకుండదు ? చిత్రంచూడు. ప్రకృతి మనల్ని వెక్కిరించటాని కిట్లాచేసిందికాని వాళ్ళిద్దరిలో నీకు కనపడ్డభేదం నాకు  కనపడి నీ కాభేదం కనపడకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను సావిత్రిని కొంతవరకు నిశ్చింతగా - పెళ్ళిచేసుకునేవాణ్ణి. సరోజానీకు కుదిరేది.” 


ఇక్కడ రాధాకృష్ణమూర్తి ఈడుకుమించిన మాటన్నాడు.


"ఎందుకు దిగులుపడతావురా? పెళ్ళయిన మరుక్షణం నుంచీ  ప్రయత్నంచేసినా ఇద్దరికీ సంబంధం కనపడదు.” 


" నీదయవల్ల  అట్లా అయినా బాగుండును."


" నాన్నక్కోపం వచ్చింది మీ బావగారిమీద.”


" పెద్దకట్నం పోయిందే అని.” 


" సామెత చెప్పినట్టుంది.”


పూర్తిగా పొద్దుకూకకుండానే ఇద్దరూ ఇంటిదారి పట్టారు. భైరవమూర్తి గారి మేడముందు రాధాకృష్ణ మూర్తి గుడ్ నైటన్నాడు.


సుందరం  రాధాకృష్ణమూర్తి చెయ్యిపట్టుకున్నాడు. "ఒక కప్ కాఫీ తాగిన తరువాత. " 

" కాఫీ! అవశ్యం ”


ఇద్దరూ మూలగదిలో చేశారు. సుందరం లోపలికి వెళ్లాడు, సరోజినితో రెండు  కప్పులు కాఫీ తయారు చెయ్యమన్నాడు. అందుకని సరోజిని మూడు కప్పుల కాఫీచేసి తనకోకప్పు దాచుకుని మిగిలిన కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. తరవాత కొంచెం ఎడంగా నుంచుని రాధాకృష్ణమూర్తిని పరీక్ష చెయ్యటం మొదలు పెట్టింది. 


రాధాకృష్ణ మూర్తి కాఫీ కాస్త రుచి చూచి కప్పుబల్ల మీద పెట్టి "ఫైన్ ” అన్నాడు.


సుందరంకూడా కొంచెం తాగి మొహం చిట్లించి, “నాకు కాఫీ రుని తెలీదురా ఖర్మం!" అన్నాడు


" సావిత్రికీ అంతే, అన్నయ్యా దానివన్నీ నీగుణా లే" అన్నది సరోజిని నవ్వుతూ. 


రాధాకృష్ణమూర్తి కొంచెంసేపు సరోజిని వంకచూసి, తలగోక్కుని కాఫీతాగటం సాగించాడు.


ఈ కాఫీ మాత్రం ధుమాగా ఉందిరా. యమాగా ఉందనుకో! అద్భుతంగా ఉందంటేనమ్ము . ఎందుకూ? నెంగరం అయ్యరు కాఫీకి నకలు. అసలుకు సరియయిననకలు" 

 సరోజిని తల ఒక పక్కకు  ఒరగేసి  రాధాకృష్ణమూర్తి  వంక చూస్తూ "పాపం, సావిత్రికి సుందరమే మొగుడయే వాడు?" అనుకుంది.


" నేను పోతున్నాను. మీకింకేమన్నా కావాలా? " 


"నీళ్ళు” సుందరం.


" తాగటానికేనా?"…రాధాకృష్ణ మూర్తి. “


" తప్పకుండా! లేకపోతే ఈ చేదుఇట్లాగే ఉండనీమంటావా ఏమిటి?”


సరోజిని  బిగ్గరగా నవ్వుతూ పరిగెత్తిపోయింది.


రొండు నిమిషాలపాటు స్నేహితులిద్దరూ మౌనంగా  కూర్చున్నారు. చివరకు రాధాకృష్ణమూర్తికి మాట్లాడబుద్ధయింది. "మీ చెల్లెలికీ మీ మేనకోడలికి భేదం లేదంటావేంరా? " 


“ఆఁ?" అన్నాడు సుందరం పరధ్యానంగా,


" ఇద్దరికీ లక్షభేదం ఉంది.” 


" ఎవరు?"


" మీ చెల్లెలికీ- మీ సావిత్రికీ "


"ఏమిటి?"


భేదం —లక్ష భేదం—”


"ఏంభేదం?"


" ఉంది " 


"ఎందుకుంది. "


"ఎందుకు లేదు.”


ఇప్పుడు సుందరం దోవకొచ్చాడు.


‘నాఆలోచనంతా పాడు చేశావు! ఏమిటా మనం మాట్లాడుతున్నది?”


రాధాకృష్ణమూర్తి మళ్ళీ వెనక్కి రాదలుచుకోలేదు. "సావిత్రి ఇంత ఉత్సాహంగా ఉండదు.”


స్నేహితు డేంమాట్లాడుతున్నాడో తెలీక సుందరం " ఆఁ?" అన్నాడు. ‘


" ఇంక మాట్లాడదు.".


" ఎవరు?" 


'' సావిత్రి.” 


" సావిత్రంటే  . ఓహో సావిత్రా? ఇంకాసావిత్రేమో ననుకున్నా!"


" ఇంక నవ్వ దసలు .”


"ఎవరు? సావిత్రేనా?"


" ఆ! అంటే సావిత్రికాదు? సావిత్రి!"


"సావిత్రి నవ్వదా ?”


"నవ్వదు. ఎందుకు నవ్వాలి? నవ్వు నాలుగందాల చేటు  " 


రాధాకృష్ణమూర్తి తలగోక్కుని అకస్మాత్తుగా " గుడ్ నైట్" అని వెళ్లిపోయినాడు.




జరిగిన సంగతి  ఏమిటంటే రాధాకృష్ణమూర్తి మొదట సావిత్రికోసం ఉబలాటపడ్డప్పుడు తనమనస్సును ఆపిల్ల కర్పించుకున్నాడు. ఒకపిల్ల తన అనుజ్ఞ లేకుండా తన మనసును ఎత్తుకుపోయినట్లు   అతనికి కొత్త అనుభవం. అనుభవంలేనివాడు కనకనే పని పెట్టుకొచ్చి సరోజిని తన మనస్సును   ఆకర్షిస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. దానికి అతనికివ్వబడ్డ విశేషేమిటంటే సరోజిని !


రాధాకృష్ణమూర్తి మాట్లాడుతున్నది వినిపించుకో కుండా సుందరం ఆలోచిస్తున్న దేమిటంటే తన చెల్లెలికీ సావిత్రికీ ఏం సంబంధం ఉందా  అని. దానిక్కారణం ఉంది. 


అతను సావిత్రిని సరిగా చూసింది కిందటిరోజు ఉదయం. చెల్లెలిని సరిగా చూసిందంతకు పూర్వమే! మగ వాడికి పెళ్లియావ లేనంత కాలం ఆడపిల్లలంతా ఒకటి గానే ఉంటారు. వాళ్ళిద్దరికీ కొంతపోలికకూడా ఉండే చెప్పేదేమిటి?


అన్నిటికన్న ముఖ్యమైనవిషయం మొదటినించీ సావిత్రికి దిగులు తన్ను తనమామ కియ్యరనే .


—కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 ; బోధెల్ ; యూఎస్ఎ


Tuesday, December 28, 2021

కథ తలవంచని పూవులు రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


కథ 

తలవంచని పూవులు 

రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి 

సేకరణ  - కర్లపాలెం  హనుమంతరావు

28 -12-2021

బోథెల్ ; యూఎస్ ఎ  

                  

( భారతి - అక్టోబర్, 1957 సంచిక ) 


విక్రమ ధనంజయా ! వీరనారాయణా! జయీభవ ! విజయీభవ! విద్యాభోజ ! విదర్భ రాజా ! విజయీభవ ! దిగ్విజయీభవ !


వండియాగధులు వెండిదుడ్లతో ప్రవేశించి పక్కకు తిప్పుకొన్నారు. మాలవ మహారాజులుంగారు రత్నఖచిత  సువర్ణ సింహాసవంమీద ఆసీనులు ఆయి సామంత, దండనాథాదులూ, యావత్ప్రజానీకమూ ఆ వెనుక యథాస్థానాల్లో కూర్చున్నారు. ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారుజనం..


ఏటేటా జరిగే శారదా ఉత్సవాల్లో ఆరోజు చివరిది.  దేశదేశాగత నట, విట, కవి, గాయక , వైతాళికులతో ఆనగరం తొమ్మిదిరోజులనుంచీ నిండిపోయింది. అన్ని రోజుల ఉత్సవ సారమూ ఆరోజున మూర్తికట్టి అక్కడికి చేరినట్టుంది.


సూర్యకాంతి ప్రాసాదంలో ఆనాడు వినోద ప్రదర్శనం. ముందు ఆస్థాన వైణికుడు వీణ మీద పట్టు బురఖాతీసి శ్రుతి సవరిస్తున్నాడు. జనం సుకుమార వీణాగానానికి ఎదురుచూస్తున్నటులేదు. విచ్చుకత్తుల రాజభటులు ఎర్రని చూపులతో ఎంత అదలిస్తున్నా కోలాహలం అణగటం లేదు.


దాక్షిణాత్య శిల్పి చంద్రమౌళి ఒక ప్రక్క నిల్చున్నాడు. అతడెప్పుడూ రాజసభలు చూడలేదు. నాగరికుల తళుకు  బెళుకులకు ఆతని  అమాయక హృదయం అలవాటుపడలేదు. హృదయాలను సైతం కరిగించి అమృత మూర్తులుగా మలచగల అతనికి పాటి మానవులను పలకరించి ప్రసన్నులను చేసుకోవడం ఎట్లాగో తెలియలేదు. ప్రాసాదం చివర ఒక స్తంభాన్ని ఆనుకొని తెల్లబోయి చూస్తున్నాడు. 


నగర జనుల నిష్కారణ భంగిమలను, ఒయ్యారాలను చూచి  సహజంగా ఉండవలసిన మానవులు ఎందుకిట్లా బిగువులు పోతారో అతనికి అర్థం కాలేదు.


వీణ ప్రారంభం అయింది. ఆ సిద్ధహస్తుడు అమృత వాహిని పలికిస్తున్నాడు. శ్రోతలు ఇంకెందుకో చూస్తున్నట్టుంది. మంత్రి హస్తసంజ్ఞతో వీణ ఆగి పోయింది.


ఇక ఇంద్రజాలం అన్నారు. ఒక పొట్టివాడు ముందుకువచ్చి మహారాజు ఎదుట భూమికి మూడు సారులు సమస్కరించి నిలుచున్నాడు. శుద్ధ శ్రోత్రియంగావున్న ముఖంలో చంద్రవంకలా గంధపుచారలుంచి దానిమీద ఎర్రని కుంకుమబొట్టు పెట్టాడు. చేతిలోని నెమలీకుంచె ఆకాశం మీద మూడుసార్లు తిప్పాడు. జలజల పువ్వులు రాలాయి. 'గగన కుసు మాలు ప్రభూ చిత్తగించండి' అన్నాడు. ప్రజలు విరగబడి నవ్వారు. 


నెమలిపింఛం గాలిలో సున్నా లుగా చుట్టాడు. అందులో కన్నులు మిరుమిట్లు గొలుపుతూ బలిష్టమైన రెండు వానరవిగ్రహాలు బయలు దేరి యుద్ధం చెయ్యడం ప్రారంభించాయి. “వాలి సుగ్రీ వులు" భూలోక దేవేంద్రా!' అన్నాడు. ప్రధాని చూపుతో ఆగి, పక్కకు తొలగిపోయాడు. వీణకన్న దీనితో కొంచం ప్రజలముఖాలు కలకలలాడాయి.


ఒక మహాకాయుడు  నడిచే నల్ల రాతి విగ్రహంలా సభామధ్యానికి వచ్చాడు . ప్రజల్లో కలకలం బయలు దేరింది. ఉన్న చోటునుంచి ముందుకు త్రోసుకువస్తున్నారు. రాజోద్యోగులు సర్దలేక  తొక్కిడిపడుతున్నారు. '



' అడుగో బ్రహ్మదేశపు బలశాలీ' అనేమాటలు సభలో గుప్పుమన్నాయి. అతనికి కావలసిన యేర్పా ట్లన్నీ చరచర చేయించారు. మహారాజు సింహాసనం మీద సుఖస్థితిలో సర్దుకుని కళ్ళల్లో కుతూహలం కనపరచారు. మహాకాయుడు మెడలు తిరగని బింకంతో మహారాజువై పు తలవూపి సమస్కారం అభినయించాడు. ఇద్దరు భృత్యులు రెండుబాహువుల పొడవూ, రెండంగుళాల మందమూగల ఒక ఇనుప చువ్వను తెచ్చి అతని ముందుంచారు. అతడు అవలీలగా ఏనుగు తామర  తూడును అందుకున్నట్టు దాన్నందుకుని కుడిచేతి వేళ్ళ మధ్య రెండు నిమిషాలు గిరగిర తిప్పి భూమిపై నిల బెట్టాడు. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అతడు దానిని పొట్లకు ఆనించి కండరాలు పూరించి ఇటు ఊగి అటు ఊగి కొంతసేపటికి పూర్ణానుస్వారంగా వంచి  ఆ వలయాన్ని నిర్లక్ష్యంగా ఎదుటికి పడవే శాడు. ప్రజలు చప్పటవర్షం కురిపించారు. ప్రభువు ముఖంలో చిరునవ్వు వెలిగింది. ప్రధాని ఆజ్ఞ రాజ భృత్యులు వేయిదీనా రాలు వెండిపళ్లెరంలో పోసి అతనికి బహూకరించారు. మహారాజులుం గారు లేచారు . అతన్ని చూడడానికి జనం విరగబడి వెంటబడ్డారు . 


రాజమార్గంలో జనప్రవాహం పొంగిపోయింది. చంద్రమౌళి  జనుల ఒత్తిడికి ఆగలేక తూలి ఘంటాపసంమీద పడ్డాడు. అతని పెదవిమీద, వాడి లేకులూడిన పువ్వులా చిరునవ్వుపుట్టి చెదరి అదృశ్యమయింది.



సాయంకాలం చంద్రకాంత సౌధంలో మహా సభ అన్నారు. మధ్యాహ్నం నుంచి సభాభవనం ఆలంకరిస్తున్నారు. సభాస్థలి భూలోక స్వర్గంలో ఉంది. మాలవసుహారాజు  వైభవానికి అది ప్రదర్శనశాల గాబోలు • రంగురంగుల తలపాగాలతో సకల సామంత రాజులూ సభలోకి వేంచేస్తున్నారు.


చంద్రమౌళి  ఒక పట్టుసంచీ చేతితో పట్టుకొని చంద్రకాంత సౌధం చలువరాతి మెట్లమీద నిలుచున్నాడు. నేటి సభలో ప్రవేశం ఎట్లాగా అని తెల్లని అమాయకపు కళ్ళతో ఆలోచిస్తున్నాడు. 


ఎక్కడి దక్షిణదేశం? ఎక్కడి విదర్భనగరం? రెండు దూర దూర దేశాలను రెండు దూరదూర మానవ హృదయాలను దగ్గరగా చేర్చి స్నేహపూరితం చేసే శక్తి లోకోత్తరమైన తన శిల్పకళకు లేదా? అనుకున్నాడు.


మహాకవిగారు సపరివారంగా వస్తున్నారు. ఆయన తెల్లని బట్టతల, చుట్టూ రెల్లుపూలు పూచిన గోదావరిలంకలా ఉంది. చెవులకు బంగారు కుండలాలు, చేతులకు సింహతలాటం మురుగులు. పెద్దరకం కుంకుమ రంగు కాశ్మీరు కాలువ భుజాలను కప్పింది. వెంటవచ్చే ఆశ్రితకవుల కైవారాలతో ఆయన హృదయం మత్తెక్కి ఉంది. ఆయన చూపునకు మరింత ఒదిగి, తన అల్పత్వం ఒప్పుకొన్న బట్టుమూర్తికి ఆకోటలో కనకాభిషేకం - కాదని తలయెత్తినవాడికి దేవిడీనున్నా. ఆ కోట బురుజులు ఆయనకోసం కట్టినవి. వాటి మధ్యకు తనకు తెలిసి సంతవరకూ ఏ ప్రతిభాశాలినీ రానివ్వలేదు. వచ్చినా ఆ - పరిధి దాటి ఎక్కడికీపోడు. తన పద్యాల అర్థం తానే - చెప్పాలి. మహారాజే ఆనందించాలి. తక్కిన కవీశ్వరు లకు మహారాజుకూ ఆయన ఆనకట్టు.


చంద్రమౌళికి సరిగా నమస్కరించడం చాతకాలేదు. అయినా చేతులు జోడించి మెట్టుమీద నిలుచున్నాడు. మహాకవిగారు నిర్లక్ష్యంగా నిలువునా చూసి 'ఎవరయ్యా నువ్వు' అన్నట్టు కళ్లను ఎగర వేశారు. 


"చాలా దూర దేశంనుంచి వచ్చానండి” 


" మం... చి పనిచే... శావు"


"మాలవ ప్రభువు మిక్కిలి రసజ్ఞులనీ, కళా సౌందర్య వేత్తలనీ మా వైపు గొప్పవాడుక”


"ఎవరు కాదన్నారు?” 


" ఆ రసిక ప్రభువు దర్శనం చేస్తేనే నా కళ చరితార్థం; ఆ నే నమ్మకంతో ఎన్ని కష్టాలైనా లెక్క చెయ్యకుండా వచ్చాను..." 


"అబ్బా!”


" కళాజీవి  బాధా, రసజ్ఞ సందర్శనం కోసం పడే తహతహా  మహాకవీంద్రులు తమకు తెలియనిది కాదు. " 


ఈ చివరిమాటతో కవిగారి వికారం కొంత ఉపశమించినా ఆయన అహంకారానికి తగిన ఆహారం పడలేదు. “


" నా కళను ప్రభువులవద్ద ప్రదర్శించే అవకాశం.. " 


"ఇంతకీ... ఏమంటావు?"


" .. కలిగించ వలసిందని కోరుతున్నాను.." 


“మధ్యను నేనెవరు? నువ్వేమో మహాకళావేత్తవు , ఆయనేమో  మహా రసజ్ఞులాయె! ఆలస్యం ఎందుకు ప్రభువులు సభకు వేంచేసే వేళ అయింది. వెళ్ళి దర్శనం చెయ్యి.”


"ఒక దేశాంతం ఆగంతకుడికి ఈ మాత్రం సహాయము చెయ్యలేరా? మీ ప్రభువు కళాప్రియత్వానికి ఈమాత్రం వన్నె పెట్టలేరా ?”


" ఈ మధ్య కొత్తమాటలు నేర్చారు. చిన్నప్పటి నుంచీ వేల  పద్యాలు రాసి పోశాను. మహాకవి అనిపించుకున్నాను. అంతేగాని ఈ కళ యేమిటి? కళాయి యేమిటి?...కవిత్వం ఏమైనా చేసి తెచ్చావా?" 


" లేదండి."


"అయితే...ఈ ఉపన్యాసమంతా ఏమిటి? మాకు చాలా తొందరపని ఉంది. ఇప్పుడు కవుల సభ. నువ్వేమో కనివి కావు. ఇంక నీ కళా ఏమిటి?


“మనవి చేస్తున్నాను. కవిత్వం అంటే నాకు తెలియదు. నేనేమీ మాటాడలేను. కాని నేను తెచ్చిన ఆపూర్వ వస్తువు పలుకుతుంది. మాటాడుతుంది. రసజ్ఞుల  మనస్సును లాలించగలరు. ఒక్క త్రుటి ... ప్రభువు ఎదుట నిలుప గలిగి తే... " 


“అబ్బో!... ఏదీ ఆ వస్తువు?"


"క్షమించండి. ప్రభు సమక్షంలో తప్ప పైకి తియ్యను. అది నా కళామర్యాద. ఆయన కానుకను ఆయనే తొలిసారి చూడాలని నా కాంక్ష . ఈ ప్రభు గౌరవాన్ని మీరు కూడా ఆమోదిస్తారనే నమ్ముతున్నాను.” 


మహాకవి గారి కుండలాలు ఊగాయి. అవమానం జరిగింది. కళ్ళల్లో మంటలు రేగాయి. తన ప్రాముఖ్యం కోసం  ఇంతవరకూ  చేతులు జోడించుకు తిరిగేవాడేగాని ఎదిరించి మాటాడిన వాడు లేకపోయాడు. శిల్పివైపు చురచుర చూసి జారే కాశ్మీరు శాలువాను మరింత పైకి లాగి  చరచర పరివారంతో నడిచి వెళ్ళిపోయారు. 


చంద్రమౌళి తన తప్పేమో  తెలియక తెల్లబోయాడు. కర్తవ్యం ఏమిటి?


లోపల సభ ప్రారంభమయింది. మహాకవి గారి శుష్క సమాసాలు సాగిసాగి వినిపిస్తున్నాయి. ఇటు నుంచి చదివితే రాజు పేరు, అటునుంచి విదివితే తన పేరూ ఇందులో ఉందని ఒత్తి ఒత్తి చెబుతున్నారు . 


చంద్రమౌళి ఇంత దూరం వచ్చి రాజ దర్శనం చెయ్యకుండా వెళ్ళకూడదనుకున్నాడు. చర్రున  సభలోకి దూసుకువెళ్లాడు.  సభాస్థలి చేరకుండా రాజభటు లడ్డగించారు. 


"ప్రభుదర్శనం చెయ్యాలి! " 


" అనుజ్ఞ నుండి తీరాలి" 


"ఇది మీ ప్రభువారికి కానుక. పాదపీఠం దగ్గర ఉంచివస్తాను. వెళ్ళి నివ్వండి.”


"అడుగు కదిలితే .. మెడ  మీద తల ఉండదు"


"మీ ప్రభువు సరసతా, మీ యోగ్యతాఇంతటి వేనా ? " 


ఒక రాజభటుడు చటుక్కున  వచ్చి ఆ మహాశిల్పి మెడమీద చెయ్యి వేసి ఒక్క ఊపున గెంటివేశాడు. 

అతడు చలువరాతి  మెట్లమీదనుంచి దొర్లి   నేలమీద పడ్డాడు. చేతిలోని  పట్టు సంచీ  దూరంగా పడ్డది. 


చంద్రమౌళి నెమ్మదిగా లేచి సంచీ  తీసుకుని నీరునిండిన కళ్ళతో ఒక్కసారి రాజభవనంకేసి చూసి చరచర కోట వెలుపలికి నడిచాడు. 


రాజవీధి నిర్మానుష్యంగా ఉంది. తన లోకోత్తర శిల్పాన్ని పైకి తీసి తినివితీరా  చూసుకున్నాడు. దాని వెనక ఉన్న కథ అతని తడికళ్ళల్లో తిరిగింది.


3


ఒక నాడు తన పల్లె కుటీరంలో చంద్రమౌళి ఉలిని ఒక మంచిగందపుముక్క మీద నడుపుతున్నాడు. 


అతని తీయని  ఊహలు సున్నితమైన ఉలి నుంచి  జారి  చందన ఖండంలో సుందర రేఖలుగా విడుతున్నాయి. శిల్ప సౌందర్యమో, చందన  హృదయమో  ఆ రేఖల్లో పరిమళాలు నింపుతున్నాయి. 


సుందరేశ్వరుని ముందు కృశాంగి హైమవతి, ఆయన కళ్ళల్లో ప్రేమ భిక్ష . ఆ కులపాలిక అరమోడ్పు కన్నుల్లో చిక్కని సిగ్గులు.   ఉలి కన్నా వేగంగా మనసు పరిగెత్తుతున్నది . ఆ శిల్పంలో కలిసిపోయి తానున్నట్టే  మరచిపోయాడు ఆకళా తపస్వి. 


తన కుటీరం వాకిట్లో ఏదో అలజడి. అయినా  అతను తలయెత్తలేదు. ఇంకా   కర్రగుండెలో నుంచి కళను పిండుతూ నే ఉన్నాడు.  


భార్య 'ఆశ' ఆలజడిగావచ్చి ఎదుట నుంచుంది. ఐదేళ్ళబిడ్డ కళ వెక్కి వెక్కి యేడుస్తూ ఉండగా  చంద్రమౌళి ఆలయెత్తి చూచాడు.


తపబిడ్డకంటినుంచి జారే నీలాలు చూచిన అతని చేతిలోని ఉలి జారిపోయింది. తపోభంగంలా శిల్పం ఆగిపోయింది. 'ఏమిటి సంగతి' అన్నాడు విధిలేక. 


ఆశ ఎర్రబముఖంలో చెప్పడం పెట్టింది.—“పాపం, 'కళ? యేమీ చెయ్యలేదు సుమండీ —మన పొగడ చెట్ల క్రింద పువ్వులేరుకుంటూ ఆడుకుంటున్నది. ఆ ధనవంతుల బిడ్డలేదూ శేషగుణి, ఆ పిల్ల, కళను పిలిచి తీసుకువెళ్ళింది. ఇద్దరూ చాలా సేపు ఆడుకున్నారు. ఆ పిల్ల మెడలోని  రత్నాలహారం దీని మెడలో వేసి 'నీకిచ్చేశాను తీసుకో'  అందిట. కళ నిజమనుకుని ఇంటికి పరుగెత్తుకువస్తూఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ కళ హారం ఎత్తుకు పోతున్న తాన  తల్లితో చెప్పింది. వెంటనే ఆవిడ పరుగెత్తుకువచ్చి 'దొంగబుద్ధులు, దొంగపిల్లలు . లేనివాళ్లతో స్నేహాలు వద్దంటే మా పిల్ల వినదు ' అని ఈ పిల్లను గుంజి హారం తీసుకుని వెళ్ళిపోయింది. 


" ఇదేనా  మర్యాద ? చూడండి. కూటికి పేదలమైతే గుణానికీనా?" అని ఆమె బరువుగా నిట్టూర్చింది, చురచురము నే కళ్ల తో. 


చంద్రమౌళి అన్నాడు నెమ్మదిగా — "పిచ్చిదానా నీకూ ధనవంతులం టే వ్యామోహం. వారి తళతళలాడే   నగలూ, మిలమిల లాడే చీరలూ దూచి ఎంత ఆకర్షణ నీకు! వారిలాగే మెరిసి పోవాలని ఎంత ఆరాటపడతావు ! ఆ కోరిక ఎప్పుడో మనల్ని శాపమై మొత్తుకుంది. ఈ సడిస్తుంది. అని నీకు తెలియ లేదు. ఇంక ఊరుకో " అని మళ్లా శిల్పాన్ని అందుకున్నాడు. 


ఆశ ఊరుకోలేదు.


" ఆపండి ఆ పని. ఆలుబిడ్డలు సుఖించని ఈ చెక్క డాలు శిల్పాలూ ఎందుకూ? చేతులో ఇంత నేర్పుండి ఏం లాభం? తలుచుకుంటే అట్లాంటి రత్నహారాలు పది సంపాదించగలరు. నన్నూ  బిడ్డనూ అలరించి అలంక రించగలరు. కళను చూచి మెచ్చి ఇచ్చే ప్రభువులు దేశంలో లేకపోలేదు. వచ్చేవి కారణోత్సవాలు. మీ చెయ్యిసోకి తే

రాళ్ళుమాటాడతాయి. ఒక్క శిల్పంతో ఆ మాలవరాజును సంతోష పెట్టలేరా? కాంక్షతో  తీవ్రంగా వెలిగే  ఆశ కళ్ళకు అతడు లొంగిపోయాడు.


ఆనాడే దీక్ష వహించాడు. ప్రశస్తమైన ఏనుగు దంతం సంపాదించారు. చంద్రవంకలా ఉన్న ఆ దంత  ఖండాన్ని నిలువునా పూలదండగా  మార్పివెయ్యా లను కున్నాడు . ఉలి ఆమోఘంగా పని చెయ్యడం ప్రారంభించింది. 


ప్రతీ రాత్రి ఎదురుగా కూర్చునేది. ఆమె కళ్ళ అందం ఆతని  శిల్పానికి దీపం అయింది. ఆమె ఎర్రని పెదవుల చిరునవ్వు అతని కల్పనకు జీవంపోసింది. ఆమె ఒక్కొక సుందర భంగిమ అతని చేతిని పరుగులెత్తించింది. ముప్పది రోజులు అహోరాత్రాలు పని చేశాడు.


ముక్కలు చెయ్యలేదు. అతుకు లేదు. ఏనుగు దంతం హఠాత్తుగా మల్లెపూలదండగా  మారిపోయింది. రేకురేకునా సహజమైన మధురిమలు. ముడత ముడతలో  అచ్చమైన నొక్కుల సొగసులు. కొన్ని పూర్తిగా విడిన మల్లెలు, కొన్ని అరవిచ్చినవి . చివర ఒక బొడ్డు మల్లె కొలికి  పూస. 


ఒక్కొక్క పువ్వుకూ ఒక్కొక్క నెత్తురుబొట్టు ఖర్చు పెట్టాడు.


చిక్కిపోయిన చెక్కిళ్ళతో తృప్తిగా నవ్వి అతిని గుండె  పూచిన పూలమాలను ఆశ ఎదుట  సగర్వంగా ఎత్తి పట్టుకున్నాడు. ఆశ కళ్ళల్లో ఆనందజలం చిమ్మింది. 


ఒక ముహూర్తాన ప్రభు సందర్శనంకోసం మూటకట్టుకు బయలుదేరాడు.



చంద్రమౌళి రాజవీధిలో వేడిగా నిట్టూర్చి తన  శిల్పం వైపు ఇంకొక సారి చూశాడు. ఆ తెల్లని పువ్వులు తనని  చూసి పకపక నవ్వినట్లనిపించింది. ప్రతి పువ్వూ తీసకోసం దీనంగా ఎదురు చూసే  ఆశ ముఖం జ్ఞాపకం చేసింది. అమాయకపు కళ్ళల్లో నీరు కార్చి తన బిడ్డ కళ పరుగెత్తుకొనివచ్చి కాళ్లు  చుట్టు వేసుకున్న ట్టనిపించింది.


పొంగివచ్చే కన్నీళ్లను ఆపుకుని నగరం వెలుపలి శూన్యంలోకి వచ్చి ఒక రావి చెట్టుకింద నిలుచున్నాడు. అమోఘమైన తవ శిల్పాన్ని ఊచిపుచ్చుకుని చెట్టు మొదటికి విసిరి వేశాడు. అది పోయి ఒక రాతికి తగిలిన చప్పుడయింది.


నివ్వెరపోయి చెట్టు మొదట పరిశీలించాడు. ఆశ్వయుజమాసపు వెన్నెల వెలుగుల్లో స్పష్టంగా కనబడుతున్నది. 


ఆ పుష్పమాల ధ్యానముద్రలో ఉన్న బుద్ధదేవుని పాదాల ముందు పడింది.


అతనికి నవ్వు వచ్చింది.


“సింహాసనంమీది విగ్రహానికి సమర్పించదలచిన ఆపూర్వ పుష్పమాల ఈ జీమా దయామూర్తి పాదాలను పూజించిందా? ఎంత ధన్యుణ్ణి! 


చంద్రమౌళి నిమీలిత నేత్రాలతో బుద్ధదేవుని పాదాలముందు నిలువునా మోకరిల్లాడు. 


బుద్ధ జీవుని ఒక శీతల హస్తం అతని వెన్నుపై నిమిరినట్లయింది !



రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి

 ( భారతి - అక్టోబర్, 1957 సంచిక ) 


సేకరణ  - కర్లపాలెం  హనుమంతరావు

28 -12-2021

బోథెల్ ; యూఎస్ ఎ  

                  


Monday, December 27, 2021

కథ ఆప్తబంధువు - ఏల్చూరి విజయరాఘవరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 కథ 

ఆప్తబంధువు 

- ఏల్చూరి విజయరాఘవరావు 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


“ధన్ ధనా- టక్ టకా - ధన్ ధనా- ట౯కా- తక తకిట తకతకిట--- తకతకిట తకతకిట 

ఖండజాతి లయలో..  శరవేగంతో పరిగెత్తుతోంది రైలు బండి. 

బెజవాడ రావడానికింకా ఎనిమిది గంటలన్నా పట్టచ్చు. పానకాల్రావుకు నిద్ర రావడంలా. 


అమావాస్య చీకటి రాత్రుల్లో చెట్లూ, చేమలూ, గుళ్ళూ- గోపురాలూ, పల్లెలూ- పట్నాలూ, గతంలోకి మాటుమణిగి పోతుంటే, ముందు రాబోయే స్టేషన్లన్నీ భవిష్యత్తులో పొంచి కూర్చున్న ఆశల్లా వువ్విల్పూరిస్తూ పానకాల్రావు మనస్సును పదే పదే పీకుతున్నాయి. .  గమ్యం దగ్గర కొస్తున్న కొద్దీ! 


అతని తొండర వాటికేం తెలుసు మరీ! ఇవ్వాళన్నా యీ మాయదారి రైలును మరికాస్త తొందరగా పరిగెత్తించే నాధుడే  లేడా? 


తెలుసు. అల్లా జరగడం అసంభవమని. అయినా బాణం తగిలిన జింకలా కొట్టుకుంటున్న పానకాల్రావు గుండెల్లో తర్కశక్తి నెప్పుడో మింగేసింది ఆవేశం!


' మదర్ సీరియస్... కమ్ సూన్' మామయ్యిచ్చిన టెలిగ్రామిది... 


ఇదమిదం తెలియడంలో అలాంటి పరిస్థితిలో పానకాల్రావేమిటి , పాపారావైనా, పార్వతమ్మయినా ఆ సందిగ్ధావస్థలో .. ఎవరైతేనేం తడబడక తప్పుడు గదా! 


ప్రాణాలతో తల్లిని చూసి తీరాలి. "నాన్నా! ఎల్లా వున్నావురా? ఎన్నాళ్లయిందో నిన్ను చూచి!..." అంటూ ఆప్యాయంగా తల్లి బుజ్జగిస్తూ పలికితే, తను గంగా యమునా సరస్వతు లీదుకుంటూ వొడ్డు చేరుకుని, స్వర్గానికి నిచ్చెనకట్టి , గంధర్వగానంతో అప్సరసలు నృత్యం చేస్తున్న ఇంద్రసభలో జారిబడ్డట్టు మురిసిపోడూ మరి! 


ఏమిటో!


రాత్రింబవళ్ళూ కవిత్వం రాసే పిచ్చితో ఇలాంటి వూహలే. రైల్లో కూర్చున్నా! 


తెల్లగా 'ధగ' 'ధగ'లాడే గడ్డం, లాల్చీ, ధోవతీ- 'ఫట్టు 'మని పరాయి వాళ్ళు చూస్తే, విశ్వకవి టాగూరు గారి వేలువిడిచిన తమ్ముడిలా కనిపిస్తాడు పానకాల్రావ్! 


పత్రికలో పని చేస్తున్నాడు. సబ్ ఎడిటర్. "క్షణం తీరిక లేదు. దమ్మిడీ ఆదాయం లేదు" అంటుంటాడు పదే పదే . అయినా చేసే పనిలో మామిడికాయ రసం తాగుతున్నట్లు సంతృప్తి కనబడడంతో, “మనసు గుర్రం' కళ్ళాలింకా చేజారి పోలేదు! 


ఎన్నాళ్ళ నుంచో " అమ్మ"ను చూడాలనుకుంటూ, ఢిల్లీ నుంచి బెజవాడకు పోయే విమానాలవీ, రైళ్ళ "టైమ్ టేబుల్స్" రోజూ తన పత్రికలో అచ్చవుతుంటే బట్టీ పెట్టడం తప్ప. పని కల్పించుకుని టిక్కెట్టుకొని బెబవాడ వైపు ప్రస్థానం  చేసే ఘడియలిల్లా తల్లి అనారోగ్యంతో తన్ను పీక్కుతినబోతున్నాయని అతను కలగన లేదెప్పుడూ...


"ధన్ ధనాటకకా.." 


రెండవ తరగతి పెట్టె కిక్కిరిసి, నిండు  చూలాల్లా కదలలేక కదులుతున్నట్టు తూలుతోంది. అర్థ నిద్రతో వున్మీలితమైన కొందరు ప్రయాణీకుల కళ్ళల్లో రైలు....


ఈ మధ్య టీ. పీ. జోరుకదా! ఆదివార మొస్తే "మహాభారతం” తప్పదందులో కొందరు ప్రయాణీక ప్రేక్షకులకు! కానీ రైల్లో ఎల్లా?! 


సొంత జీవితపు "భారతం"లోని వొడుదుడుకులు మరిచిపోవడానికి "మహా భారతం" పుస్తకం చదువు కుంటున్నాడు పానకాల్రావు... 


అనుకోకుండా వచ్చిన ప్రయాణం గనక "అన్ రిజర్వుడు" పెట్టెలో ఎలాగో కాళ్ళు ముడుచుకుని కాలక్షేపం చేస్తున్నాడు. 


బెజవాడ రావాలి. స్టేషన్లో మామయ్య కనపడి "అమ్మకేం ప్రమాదం

లేదులే, భయపడకు పానకాలూ" అనాలి.... "


నజాయతే మ్రియతేవా కదా చిన్నాయంభూత్వా

భవితా వాసభూ యా ః..." 


భగవద్గీత" పేజీలు తిరుగుతున్నాయి.....


"వాట్ ఎ రాటెన్ రష్?” సూటూ బూటూ, 'ఫెదర్' హ్యాటూ, చేతిలో ఎ.ఐ.పి. ఫాన్సీ బ్యాగూ, అర్థరాత్రయినా 'ఆరంజీ కలర్' కూలింగ్ గ్లాసులూ.... మిగలక మిగలక మిగిలిన అర ఇంచీ ఖాళీ స్థలం వైపు పానకాల్రావును "జరగమ"ని "ఫారిన్ జంటిల్మన్" ఠీవితో సంజ్ఞ చేస్తూ, ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునే లోపలే బిత్తర చూపులు చూస్తున్న పానకాల్రావు పక్కన "దఢీలున" కూర్చుండి పోయాడొక   ఆగంతకుడు!! 


సంగీత సాహిత్యా లెవరినైనా మనస్కుల్ని శాంతింప  చేస్తాయేమో! హఠాత్తుగా జరిగిన అన్యాయానికి బాధపడుతూ కూడా నెమ్మదస్థుడైన పానకాల్రావు "ఏమనాలో" తెలీకుండానే"నమస్తే" అనేసి. ఇంకొంచెం జరిగి కూర్చున్నాడా పెద్ద మనిషి “వసతి" కోసం!


"అతిథి దేవో భవా!"


ఇది మన భారతీయుల నిండుతనం! 


" ఎందాకా?" తన పై వుద్యోగస్తుడిలా ప్రశ్నించాడా పెద్దమనిషి!


"బెజవాడ."


"ఇంకేం. నేను బెజవాడే. ఎప్పుడూ విమానంలో తప్ప ప్రయాణం చేయలేదు. అమెరికా నుంచి మేం దిగి నాల్గు రోజులైనా కాలా. అబ్బ! ఇలాంటి చెత్త రైళ్ళల్లో మీరెలా ప్రయాణం చేస్తారర్రా! ఇట్ ఈజ్ ఎ షేమ్! మా వూళ్ళో ఇంట్లో కన్నా రైల్లోనే కమ్మటి  నిద్దరొస్తుంది! వాషింగ్టన్ లో  పడుకుంటే న్యూయార్క్ లో బెహరా వొచ్చి కాఫీ యిచ్చి లేపిందాకా మూసిన కన్ను తెరవపన్లా ! .... అది సరేగాని, ఏమిటా పుస్తకం?"


" మహా భారతం."


పానకాలావు కయోమయంగా వుంది. అయినా ఈయన లెక్చర్లు వింటూ ఎలాగోలా రాత్రి గడిచి కొంప జేరుకొంటే కొంత ఆదుర్దా తగ్గుతుందేమో! మరి వేరే గత్యంతరం?


"మీకు థ్రిల్స్ కావాలంటే “మహా భారతం" చదివేం లాభమండీ! ఇదిగో "గాన్ విత్ ది విండ్" నేను ముఫ్ఫయ్యొకటో సారి చదువుతున్నా. మనం బెజవాడ చేరే లోపల మళ్ళీ చదువడం పూర్తయితే మీకిస్తా లేండి... అయినా యీ రైళ్ళల్లో ఫ్యాన్లు బాగు చేసే నాథుడే లేడాండీ! ఇక్కడ గాలిరాదు.  కిటికీ తెరవాలంటే సుత్తితో కొట్టినా బిగుసుకు పోయి కదలదు ! చూశారా ఆ "బల్బు"లన్నీ ఎలా పగిలి పోయాయో! వెనక పెట్టెలో బాత్రూమ్లో నీళ్ళబొట్టు లేదు. అందుకే ఇక్కడి కొచ్చా. మిమ్మల్ని ఇబ్బందిపెడుతూ - పాపం! మీ ఇండియా ఇంకా, స్టోన్

ఏజ్ కాలంలోనే నిద్రపోతున్నట్టుంది! ఇప్పుడు తెలుసా మీకు?" చంద్రలోక మేంటి "- "సూర్యలోక మేంటి " "అంగారక లోకమేంటే"- చివరకు "బ్రహ్మలోకం"లో కూడా చక్కర్లు కొట్టి , పొద్దున భూమి మీద "టీ" త్రాగి వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ భార్యాబిడ్డల్తో  బాతాఖానీ కొట్టడానికి రాత్రి భోజనాల వేళ కిల్లు చేరుకోగలం!! గణితమండీ! అంతా శుద్ధ గణితం మహిమంటే నమ్మండి! అదీ అమెరికా అంటే! అలాంటి లెక్కలు  తెలిసిన మహానుభావు డొక్కడైనా మీ వూళ్ళో పుట్టాడా చెప్పండి?


వొళ్ళు మండుకొస్తోంది ఆవేశంతో పానకాల్రావుకు. ఒక్కుమ్మడిగా లేచి "రామానుజం రామానుజం" అంటూ మన మేథమేటిక్స్ మేధావి పేరు తలుచుకుంటూ, పక్కవాడి పళ్ళు రాలేట్టు చంప చరుద్దామనుకున్నాడు... కానీ...


తనలో నివురుగప్పిన నిప్పులా. .   భూమిగర్భంలో బంగారంలో దాక్కున్న సాహిత్య సంస్కారమలా చేయనిస్తుందా! 


 వీడెవడు? మన భారతీయుడేనా? చూడ్డానికి మాత్రం అలాగే వున్నాడే! అదేమి ? పచ్చి తెలుగు మాట్లాడుతుంటే! ఎరువుకు తెచ్చుకున్న సూటూ బూట లాగేస్తే..  కళ్ళూ, కాళ్ళూ.. ముక్కూ. నోరూ- అన్నీ, మనలాగే వున్నాయి మరి! అయితే ఇంత "దర్జా వాగుతున్న పెద్దమనిషి తనతో  "రెండో తరగతి" (అదీ. అన్‌ రిజర్వ్ డ్‌!)లో దేని కిరుక్కున్నట్టు?!! 


పోనీ తనకెందుకీ గొడవంతా? తనకున్న దిగుళ్ళు చాలకనా! ఇలాంటి "బేవార్సు" వాళ్ళని పదిమంది వెతుక్కుపోతుంటే... 


అయినా, అతన్ని "బేవార్సు" వాడనుకోవడం తన పొరపాటే అయితే?!! 


తను మాత్రం విమానంలోనో, ఫస్ట్ క్లాస్ రైలు పెట్టెలోనో

ప్రయాణం చేయగల అర్హత లేనివాడా మరి! అనుకోకుండా తనూ యీ "గరీబీ " పెట్టి "గలీజు" లో కళ్ళు మూసుకుని కాలక్షేపం చెయ్యాల్సిరాలా?! 


అతనికీ, అలాంటి అవసర ప్రయాణం కాకతాళీయ న్యాయంగా తటస్పంచిందేమో .. పాపం!


నెమ్మదిగా అడిగాడు పానకాల్రావు " మీదసలే వూరండీ?"


" కొన్నాళ్ళు జపాన్లో వుండే వాళ్ళం. మా ఫ్యామిలీలో సగం మంది కెనడాలో పెద్ద పెద్ద పుద్యోగాల్లో హేమాహేమీల్లా  పని చేస్తున్నారు. నాకో రెండేళ్ళ క్రితం అమెరికాలో వరల్డ్ బ్యాంకులో కి ట్రాన్స్ఫర్ అయింది. మీ ఆంధ్రా గవర్నమెంటు వాళ్ళు "బీదల కోసం ఇళ్ళు కట్టించే పథకం" కింద మా దగ్గర నాలుగు మిలియన్ల డాలర్ల అప్పు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సందర్భంలోనే, మీటింగ్ కోసం బెజవాడ వెళ్తున్నా. "సీదా ప్లేన్ లేదు. రైలే తొందరగా చేరుతుందని ఎవరో చెప్పారు. అందుకూ యీ రభస!"


న్యాయంగానే వుందతని వుదంతం! కానీ తన అసలు ప్రశ్నకు జవాబు రాలేదింకా. "ఇతను స్వతః తెలుగువాడా, కాదా" అని. ఈ ధర్మసందేహం తీర్చుకుని తీరాలి... అనుకున్నాడు పానకాల్రావు .


"అవునండీ! రైల్లోనే  నయం. ఈ రోజుల్లో విమానాలైనా మనల్ని "టైమ్"కు అందించి చస్తాయి గనకనా... ఒక్క మాట .. మీరు తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళేనా?"


ఇంగ్లీషులో సమాధానమిచ్చాడాయన.


"యస్. బేసికల్తీ వుయ్ ఆర్ ఆంధ్రాస్, బట్ నౌ వుయ్ ఆర్ అమెరికన్ సిటిజన్స్".


ఏమైనా, అతనికీ విషయం మీద చర్చ రుచించినట్లు లేదని, అతని ముఖ కవళికలే చెబుతున్నాయ్! 


"ధనాధనా టక్ టకా ”


మేం మేం మాట్లాడుకుంటున్నా రైలుకేం బట్టింది! శరవేగంతో 'కాలం'లా పరుగెడూనే వుంటుందది! 


బెజవాడ సమీపిస్తున్న కొద్దీ  పానకాల్రావు  పక్క మనిపి దౌర్జన్యంగా  తన సగం సీటు లాక్కుని, వారి వింతలన్నీ ఏకరువు పెడుతూ, సోది కబుర్లు చెబుతున్న మాటే మరిచిపోయి తన కోసం పంచప్రాణాలు ధారబోసె  మాతృదేవతను గురించే "వదే పదే" ఆలోచిస్తూ, ఆమె ఆయురారోగ్యాల కోసం భగవంతుణ్ణి ప్రాధేయపడుతూ, మళ్లీ ప్రయాణ బడలికలో మగత నిద్ర ముంచెత్తుకొచ్చే లోపల, "మహాబారతం" లోంచి "భగవద్గీత" పేజీలు తిప్పడం మొదలెట్టాడు అటు కన్నతల్లి అనారోగ్యపు అశాంతికీ ఇటు యీ ఆగంతకుడి "మాతృదేశ విమర్శ "దాడికీ", "కృష్ణార్జున సంవాద' మే శరణ్యమని నమ్మిన పానకాల్రావు. 


ఇంతలో ఆయనన్నాడు "అవర్ డెస్టినేషన్ ఈజ్ నియరింగ్ . ఇంతలో బాత్రూమ్ కెళ్లొస్తా ; నా బ్యాగ్ లో  ఫారిన్ ఎక్చేంజి కొల్లలుగా వుంది. కాస్త జాగ్రత్తగా చూస్తుండండేం'' 


పానకాల్రావు కాశ్చర్యమేసింది. తలా తోకా తెలియని తన మీద ఎంత “భరోసా" ఈయనకు! " ఆ డబ్బు బ్యాగ్ లోపలికే తీసుకు పోదురూ" అందామనుకుంటున్న తన సమాదానం వినకుండానే జనాన్ని తోసుకుని బాత్రూంలో కెళ్లి పోయాడా

" పారెన్ రిటరన్ !"


నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః I

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 


ఇలా చదువుతూ, చదువుతూ ఎంత సేపైందో! 


మైమరచి బాహ్య ప్రపంచంతో సంబంధమే లేనట్టు గాఢమైన సుషుప్తిలోకి చొచ్చుకు పోయింది పానకాల్రావు మనస్సు . 


మధ్య మద్య ఎక్కేవాళ్లూ. దిగేవాళ్లూ "నీడ నీడ"గా కనబడుతున్నారంటే ఒకసారి టికెట్ కలెక్టరొచ్చి చెక్ చేసి పోతూ పోతూ టాగూర్ అందమైన గడ్డంతో, అపురూపమైన వదనారవిందంతో "మాంచి". పెద్దమనిషిలా  కనబడుతున్న పానకాలావు నడిగాడు కూడా " ఇక్కడెవరన్నా టిక్కెట్టు లేకుండా ఎక్కి మిమ్మల్ని అవస్థ పెట్టలేదు కదా సార్? అన్ రిజర్వుడు కంపార్టుమెంట్లలో  మాకు రోజూ ఇదే గొడవ కదా! అందుకే అడుగుతున్నా"


"ఎబ్బె! ఏం లేదండీ!" మాట వరసకనేశాడు పానకాల్రావు టిక్కెట్ కలెక్టర్ కు  ' థాంక్స్'  చెప్పి


 "ధన్ ధనా- టక్ టకా.." 


తెల్లవారుతోంది. ఈ స్టేషను గాక, ఇంకొక్కటి దాటితే బెజవాడ! 


 "ఇడ్లీ..  కాఫీ అరుపులు ! " ప్లాట్ ఫోరమ్ నిండా మోగుతున్నాయి.


తన ఎలాగో  వూగుతూ వూగుతూ, వోరబడి కాస్తో కూస్తో  నిద్రకు దిగి  లేచాడు పానకాల్రావు.  బాత్రూమ్ లో  గంటకు పైగా గడిపి, ముస్తాబై వచ్చిన పారిన్" పెద్దమనిషి' " బెజవాడ వచ్చేస్తోంది.  మీరూ బాత్రూమ్ వగైరా వెళ్లొచ్చి ప్రెష్ గా కూర్చోరాదూ?" 


ఆప్యాయంగా సొంత చుట్టంలా ఆయన అలా అంటే “వద్ద”న బుద్ధేయలేదు .  పయనమైనాడు పానకాల్రావు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. 


ఖండలయలోంచి ఆదితాళంలోకి దిగి, చివరకు తాళం తప్పినట్లు రైలు రొద ఆగింది నెమ్మది నెమ్మదిగా. 


"బెజవాడ వచ్చింది’' 


అమ్మను చూడాలి! మామయ్య నాకోసం వెతుకుతున్నాడేమో!" 


అసలు రైలాగినా ఆదుర్దాతో  పానకాల్రావ్ గుండెల్లో కొత్త కొత్త రైళ్లు పరుగెడుతున్నాయి! 


బాత్రూమ్ తలుపు తీసుకుని, దిగే జనాన్ని తోసుకుంటూ సొంత సీటు దగ్గర చేరేడు. 


తన పెట్టే, బెడ్డింగూ కూచున్న చోట శూన్యం! 


ఆ పారిన్ పెద్దమనిషి లేడక్కడ! 


పరిగెడుతున్న గుండెకాయ, ఒక్కసారిగా  కొట్టుకోడమే మానేసి నట్టయింది. 


సామాను పోతే పోయింది అమ్మకు తెచ్చిన మందులన్నీ, అందులో నే వున్నాయి! 


ఏం చేయడమో ఆలోచించే లోపల మామయ్య గొంతు వినిపించింది.


“పానకాలూ- పానకాలు-"


ఇద్దరూ. కొత్తగా పెళ్లయిన  భార్యాభర్తలు పడగ్గదిలో కౌగలించుకున్నట్లు  కౌగలించుకున్నారొక్కసారి! 


" మామా” అమ్మెలా వుంది? " 


"గండం తప్పిందోయ్! నీ కోసమే కలవరిస్తోంది .. పద ! కూలీని పిలుస్తా..  సామానేదీ?"


చావు కబురు చల్లగా చెప్పమంటారు. అయినా తల్లిని ప్రాణాలతో చూడగలుగుతున్నానన్న ఆశలో పానకాల్రావుకు సామాను పోయిన దుఃఖం కించిత్తు కూడా బాధపెట్టలేదా క్షణంలో . 


గొంతులోంచి చేదు కాకరకాయ కక్కేసినట్టు "దబా" "దబా" సామాను పోయిన వ్యవహారమంతా మామయ్యతో చెప్పేశాడు.


"ఆరి నీ తస్సదియ్యా!  పట్నాల్లో కాపురం జేస్తూ ఆమాత్రం జాగ్రత్త లేకపోతే యెల్లాగోయ్! రైలు కదిలే లోపల త్వరగా .. పదమరి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ మనవాడే. గోపాలంగారు.... నడూ ! చెప్పిచూదాం! " ఇంకాయేమేమిటో అంటున్నాడు మామయ్య. 


ఈ లోపల కిందటె  స్టేషన్లో అవతరించిన “టక్కెట్ కలెక్ట"రే, మన "ఫారిన్ గెస్టు" నొక పోలీసు బంట్రోతుతో సహా నెట్టించుకొస్తూ, వీళ్ళ పెట్టి దగ్గరికి చేరుకున్నాడు!


"ఏమండీ! ఈయన టిక్కెట్టు మీ దగ్గరుందా? " 


"అదేమిటీ? ఆయన టిక్కెట్టు నా  దగ్గరెందుకుంటుందండీ?!


"అయితే ఆయన మీ "బావమరిది" కాడా మరి?" .


మామయ్య, పానకాల్రావు దిగాలుపడి చూస్తున్నారు! 


వరల్డ్ బ్యాంకు మెంబరు గారి ముఖాన కత్తి వేస్తే నెత్తురు చుక్క లేదు. 


"ఈ కొత్త బావమరి దెక్కడ దాపరించాడో" అని మామయ్య నిర్ఘాంతపోతున్నాడు! .


అప్పుడు అన్నాడు పోలీసు బంట్రోతు "మరి అతని చేతిలోని యీ పెట్టి మీది మీ చిరునామా.. మీ వుద్యోగ వివరాలూ, పేరూ వూరూ, అన్నీ అతనికి ఎంతో పరిచయంలా, గోపాలంగార్ని నమ్మించేశాడండీ! ఆ వొక్క  టిక్కెట్ట ముక్క చేతిలో లేకపోబట్టి గోపాలంగారి కనుమాన మొచ్చి. . సరిగ్గా యీయన గేటు దాటేసుకుంటున్న సమయానికి లంకించుకుని, వాకబు చెయ్యమని మమ్మల్నిలా పంపారండీ!"


"ఓరి భగవంతుడా నా పెట్టా, బేడా పాకుండా రక్షించడమే కాకుండా నాకొక కొత్త ' ఆప్తబంధువు ' ను  కూడా సృష్టించావు గదరా! ప్యాన్ లు పని చేయని, బల్పులు పగిలి, కిటికీలు

బిగుసుకుపోయిన భారతదేశపు రైళ్లల్లో హిమాలయాల నుంచి కన్యాకుమారి ప్రతిక్షణం వేలాది భారతీయులు దైనందిన కృత్యాల్లో ముగ్ధులై ప్రయాణం చేస్తూనే వుంటారు.  అవి మన కోసం- మనం వాటి కోసం జీవిస్తూనే కాలం గడుస్తుంది. 


అయితే వాటిల్లోనే, "అమెరికా, ఇంగ్లండు" వగైరాలూ, "అంగారక గ్రహం"- "బ్రహ్మలోకం" వగైరాలూ, చక్కర్లు కొట్టి ఎప్పుడోప్పుడు  తిరిగొచ్చే సమయానికి టికెట్ లెస్  ట్రావెల్ కోసం శ్రీకృష్ణ జన్మసానం పోబోతూ, మన మన "బావమరుదు" లయ్యే సదవకాశం, ఎంత మందికి దక్కుతుందో మరి! '' అనుకుంటూ “దేశపు అమ్మనూ", "కడుపున కన్నతల్లినీ"- ఇద్దర్నీ తలుచుకుంటూ, మధ్య మధ్య తన విచిత్ర ప్రయాణపు కబుర్లతో సతమత మవుతూ, మామయ్యతో సహా గుర్రబ్బండెక్కాడు పానకాల్రావ్. 

***

- ఏల్చూరి విజయరాఘవరావు 


( ఆంధ్రసచిత్రవారపత్రిక - 31-8-1990 ) 

సేకరణ : 

కర్లపాలెం హనుమంతరావు 

27-12-2021 

బోథెల్; యూఎస్ ఎ 






Thursday, December 23, 2021

పాతబంగారం – కథ అనువాదం నేను ఎవరినైతేనేం! 'వేంకటేశ్ ' ( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


పాతబంగారం 

అనువాదం 

నేను ఎవరినైతేనేం! 


'వేంకటేశ్ ' 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ



'నే నెందుకు నవ్వుతున్నానో మీ కందరకూ తెలుసుకోవాలని ఉందన్న మాట? చచ్చిపోయేముందు ఎవడన్నా ఎందుకు నవ్వుతా డనేకదూ మీరనుకొనేది. అవునా? నాగురించి మీరేమీ ఆదుర్దా పడబోకండి


డాక్టరుగారు! అనవసరంగా శ్రమపడక మీ పనేదో మీరు చేసుకోండి! మీరు ఏవిధంగానూ నన్ను  బతికించలేరు. అసలు ఎవ్వరూ కూడ నా చావు తప్పించలేరు. ఈ పరిస్థితిలో ఎవరూ బతికించలేరు. 


ఎందుకంటే, నాకు ఒకటి కాదు రెండు బలమైన కత్తిపోట్లు తగిలాయి. ఒకటి వీపుమీద రెండోది డొక్కలోను. కండలు, నరాలు బయటకు రావటం మీకు కనిపిస్తునాదనే అమకుంటున్నాను. 


'మీరంతా నే నెందుకు నవ్వు తున్నానో వినాలని కుతూహలపడుతున్నా రన్నమాట. చచ్చిపోయే వ్యక్తికి నవ్వు తెప్పించే విషయం ఏమిటా అని ఆశ్చర్య పడిపో తున్నారుకదూ. నేను చెబుతాను. మీరేమీ ఆదుర్దా పడనవసరం లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం జ్ఞాపక స్తోంది. అసలు నే నెవరినో...


 'మీ రేమిటో గుసగుసలాడుతున్నారే. ఏమిటది? ఎందుకో నవ్వుతున్నారే? నేను చెప్పే దంతా  పూర్తిగా విని అప్పుడు గ్రహించండి..  చచ్చిపోయేముందు కూడ నాకు నవ్వు తెప్పించిన కారణ మేమిటో...


'ఇప్పటికి రెండు నెలలనుండి ప్రయత్నిస్తున్నా నేనెవరినో తెలుసుకొంటానికి.  ముసల్మానునా, హిందువునా లేక సిక్కు నా, బ్రాహ్మడినా లేక అస్పృశ్యుడినా, భాగ్యవంతుడినా లేక పేదవాడినా, నాది తూర్పుపంజాబా లేక పశ్చిమపంజాబా, నా నివాసస్థలం లాహోరా లేక అమృతసరా, రావల్పిండా లేక జలంధరా? 


నే నెవరినో నిర్ధారణ చెయ్యటానికి నేనే కాకుండా యింకా అనేకమంది శాయశక్తులా ప్రయత్నించారు. . నా కుల వేమిటో, నా మత మేమిటో అసలు నా పేరేమిటో తెలుసుకొందామని.  కాని ఫలితం మాత్రం కనుపించలా. ఇప్పుడు కొద్దికొద్దిగా నా పూర్వవిషయాలు గుర్తుకొస్తున్నాయి... యిప్పుడు... చచ్చిపోయే ముందు!...


అనేక ప్రయత్నాలు చేశారు. ఒక్కరికీ సాధ్యం కాలా. అసలు నే నెవరో నిశ్చయించు కొందామని.  నేను కూడ చాల శ్రమపడ్డాను. 


డాక్టరుగారు! మీరు నా వంక చూడకండి. మీరు ఆ విధంగా చూస్తుంటే నాకు మరీ నవ్వు వస్తోంది. ఉహుఁ మీరేకాదు, ఈ పరిస్థితిలో నన్ను ఏ డాక్టరూ బతికించలేడు... మీరు ఎందుకు అంత దీక్షగా ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నారో నాకు తెలుసు. నా గాయాలను ఎట్లా మాన్పుదామని అలోచిస్తున్నారు కదూ! 


ఈ రెండు గాయాల్లో ఏ గాయానికి ముందు కట్టు కడతారు. ఒక గాయానికి కట్టు కట్టటానికి ప్రయత్నిస్తుంటే ఒంట్లో ఉన్న నెత్తురు, కండలు, - రెండో గాయం గుండా బయటకు పోతాయి. ముందు రెండో గాయాన్ని కట్టటానికి ప్రయఅనిస్తే మొదటి గాయం గుండా పోతాయి. కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమించి కథను, కాదు, నా పూర్వచరిత్రను కొంచెం నిదానంగా  వినండి....


శ్రద్ధగా రెండు మాసాలపాటు ఢిల్లీ ఆస్పత్రిలో ఉన్న తర్వాత నాకు తెలివొచ్చింది! 'నీ పేరు?” అన డాక్టరు.


“నేను చాల ప్రయత్నం చేశాను. కాని గుర్తు లేదు అని చెప్పవలసి వచ్చింది. 


' హిందువుడివా లేక ముసల్మానువా?' వెంటనే డాక్టరు అడిగారు . 


యీ రెండో తికమక ప్రశ్న కు కూడా  'గుర్తులేదు' అని చెప్పవలసి  వచ్చింది.


' నా పూర్వచరిత్ర ఏమిటో గుర్తులేకుండా పోయింది. నా కులం, నా మతం, నా యిల్లు, సంసారం అన్నీ పూర్తిగా మర్చిపోయా. అసలు నాకు పెళ్లయిందో లేదో, బ్రహ్మచారినో మరి ఎవరినో నాకే అర్థం కాకుండా పోయింది. చివరికి పేరన్నా

' తెలుసుకొందామని శాయశక్తులా ప్రయత్నించా. 


పేరు లేకపోతే ప్రపంచంలో నేను ఫలానా వ్యక్తి నని నిరూపించేందుకు ఆధార మెక్క డుంటుందో మీరే చెప్పండి. 


విచారించగా విచారించగా కొంత కాలానికి తెలిసింది నే నెట్లా యీ ఆస్పత్రిలోకి వచ్చానో. పంజాబునుండి వస్తున్న కాందిశీకులతోబాటు నన్ను కూడ ఆ స్పత్రికి రు ట. అట్లా వచ్చినవారిలో చాలమంది ఆస్పత్రిలోనే మరణించారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమతస్థులని నేను అడగ్గా హిందువులు, ముస్లింలు, సిక్కులూ — అన్ని మతాలవాళ్ళూ ఉన్నారని ఆస్పత్రి వాళ్లు చెప్పారు. 


అసలు జరిగిం దేమిటంటే లాహోరు అమృతసర్ల మధ్య మోసుకు పోతున్న రెండు రైలుబళ్ళు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి. ఒక రైలుబండి పశ్చిమ పంజాబునుండి అమృతసరుకు హిందూ కాందిశీకులను మోసుకొస్తోంది. రెండో బండి తూర్పు పంజాబునుండి లాహోరుకు ముస్లిం కాందిశీకులను మోసుకుపోతోంది. 


దాదాపు రాత్రి 11 గం. సమయాన రైలు ఒకవంతెనమీద ఉండగా పట్టాలకింద ఒక బాంబు పేలింది. వెంటనే రైలుబండి అంతా పేలింది. 


చాలమంది అప్పుడే మరణించారు. చాలమందికి గాయాలు తగిలాయి. గాయాలు తగలకుండా తప్పించుకొన్న వారిని చుట్టుపక్క ల పొంచిఉన్న గూండాలు కాల్చి చంపారు. గాయాలు తగిలిన వాళ్ళు గుడ్డితనంగా తలొక దారి వెంటా పరిగెత్తుకు పోయారు. 


ఎదురుగుండా వస్తున్న బండికికూడ గంట తర్వాత యిటువంటి ప్రమాదమే సంభవించింది. ఆ రైలుబండిలో గాయాలు తగిలిన వాళ్ళుకూడ తలదాచుకొంటానికి దొరికిన దారి వెంబడి పారిపోయారు.


'మరురోజు ఉదయం భారతప్రభుత్వ సేనలు, పాకిస్థాన్ ప్రభుత్వ సేనలు సరిహద్దు  గస్తీ తిరగటానికివచ్చి అనేక శవాలను, గాయపడి కదలలేకుండా పడిఉన్న వాళ్ళనూ చూశారు. వాళ్లల్లో ఎవరు హిందువో, ఎవరు ముస్లిమో నిర్ణ యించటం బహుకష్టమైపోయింది. 


నేనుకూడా ఆ విధంగా గాయపడిన వాళ్ళల్లో ఒకణ్ణి. నన్ను స్ట్రెచర్ మీద అంబులెన్సువద్దకు మోసుకొని పోయినవాడు చెప్పాడు .. నే నెక్కడ ఎట్లా పడిఉన్నానో వివరాలన్నీ! 


 గుడ్డలన్నీ నెత్తురుతో తడిసిపోయాయి. నా చుట్టూ ఒక రక్తపు మడుగు తయారైంది. కొత్త సరిహద్దు ప్రకారం 'నా కాళ్ళు పాకి స్టాక్ భాగంలోను, తల  భారత దేశంలోను పడిఉన్నాయి. ఈ కొత్త సరిహద్దు వెంట అనేకమతాల, జాతులవారి రక్తం ప్రవ హించింది.


'చూడు! మౌలానా! దయ్యాన్ని  పట్టించే వాడిమాదిరిగా నా వంక అట్లా చూస్తావేం? నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. నేను యిప్పుడో యింకాసేపటికో చచ్చిపోతాను. చచ్చిపోయేముందు ప్రతిక్యక్తికీ అన్ని విషయాలు - తెలుస్తాయి. నేను ముసల్మాను నని చెప్పినట్లయితే యిస్లాం మతమును అనుసరించి నా అంత్య క్రియలు జరుపుదా మని ఆలోచిస్తున్నావుకదూ! 


ఏమండీ! మహషాయ్ ! నాకు తెలుసు. నేను హిందువునని చెప్పి నట్లయితే మీ ధర్మసేవక్  సంఘాన్నను సరించి నా అంత్యక్రియలు జరుపుదామని ఆలోచిస్తున్నారు కదూ! 


బొంబాయిలో పార్శీవాళ్లు - శవాల్ని బయట పారేస్తారని విన్నాను. వాటిని బ్రతికుండగానే  పీక్కు తింటానికి పక్షులు తయారవుతారన్న విషయం నా కింతవరకు తెలియదు... 


'ఇక నా చరిత్ర కొనసాగిస్తా. ఎందుకంటే, నేను మీతో మాట్లాడేకాలం చాలకొద్ది మాత్రమే ! 


నాకు తగిలిన గాయాలు ఏమంత పెద్దవి  కావు. బలమైన గాయాలు రెండువారాలు కట్టు కడితే నయ మౌతాయి. కాని నా బుర్రకు గట్టి దెబ్బ తగిలి, మనస్సు చెడిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాని మూలంగా జ్ఞాపకశక్తి పోయింది. దాంతో నేను ఒక అనామకుడిగా తయా రయాను . 


నా పేరు నేను మర్చిపోయా. నాలాంటి అభాగ్య కాందిశీకులు చాలమంది ఆస్పత్రి కొచ్చారు. ఆస్పత్రి వాళ్లు నన్ను బయటకు వెళ్లమన్నారు. తలదాచు కొనేందుకు చోటైనా దొరక్క పోతుందా అని అన్వేషణ ప్రారంభించా.


'జుమ్మా  మసీదుదగ్గర ఒక శరణాలయం ఉంటే అక్కడకు వెళ్లి కాస్త చోటు యివ్వవలసిందని శరణాలయాధికారిని ఆశ్రయించా. 


' నువ్వు హిందువుడివా, ముసల్మానువా? అని అడిగాడు ఆ అధికారి. '

' నాకు గుర్తులేదు' అని చెప్పా. నాకు గుర్తు లేని మాట వాస్తవమే . నేను అబద్ధం ఎందుకు చెప్పాలి?


'ఈ శరణాలయం ముసల్మానులకోసం' అని ఆ అధికారి నన్ను బయటకు గెంటాడు. అక్కడి ఆశ నిరాశ చేసుకొని ఎట్లాగొకట్లా ఢిల్లీకి చేరుకున్నా. 


ఇక్కడ యిదివరకటి శరణాలయం కంటే పెద్దదాన్ని చూశా. తలదాచు కొనేందుకు కాస్త చోటు యివ్వమని వాలం టీర్లను ప్రార్ధించా.


'హిందువుడివా, ముసల్మానువా' అంటూ అదే ప్రశ్న వేశారు. యిక్కడా  'నాకు గుర్తులేదు' అని నేను మళ్లీ ఆమాటే చెప్పా. '


' నీ పేరు?అని అడిగారు. 


‘అదికూడ నాకు గుర్తులేదు. అసలు నా కేదీ గుర్తులేదు.' 


'ఇం కెక్కడి కన్నా వెళ్లు. ఈ శరణాలయం హిందువుల కోసం . 


ఈ విధంగా ఒక చోటునుంచి యింకో చోటికి తిరిగా, హిందువులకోసం శరణాలయా లున్నాయి. మహమ్మదీయులకోసం శరణాలయాలున్నాయి. కాని  మానవులకోసం మాత్రం లేవు. 


'ఆ రాత్రి శరీరం బాగా  అలిసి ఉండటం చేత  నడవ టానికి ఓపిక లేక ఒక సిక్కు సర్దారు బంగళా ముందు స్పృహతప్పి పడిపోయా. అతడు సెక్ర టేరియట్ లో ఒక చిన్న ఆఫీసరు. అతడు నన్ను లోపలకు తీసుకుపోయి రొట్టె, పాలు యిచ్చాడు. నాకు కొంచెం స్పృహ వచ్చిన తర్వాతగూడ నేను హిందువునో, ముసల్మానునో సిక్కునా  నన్ను అడగలా. 


' కులాసాగా ఉందా బాబూ? ' అని మాత్రం అడిగాడు.


‘అతని బంగళాలో నేను చాల రోజులు గడిపా. 


నేను నా కథను ఉన్నది ఉన్నట్లు చెప్పినా నాకు తెలిసినంత వరకు . అప్పటికిగూడ అతని కుటుంబం  నన్ను చాల ఆప్యాయంగా చూసింది. కొన్ని రోజులతర్వాత వారి చుట్టాలు కొంతమంది రావల్పిండినుండిపారిపో యెచ్చారు. ముస్లిం గూండాలచేతిలో వాళ్ళు చాల కష్టా లనుభవించారు. వాళ్ల కళ్ల ఎదటే  వాళ్ళ బంధు వులను నానాహింసలు పెట్టి అవమానాలపాలు చేశారు. వాళ్ల హృదయాలు ముస్లిములంటే అసహ్యంతో నిండిపోయాయి. ఈ కథంతా - విన్న తర్వాత నాకు తెలియకుండా నేనుకూడ ముస్లిములను అసహ్యించుకోవటం మొదలం పెట్టా..


'సర్దార్ గారు నా కథంతా చెప్పి  , నా కే విధంగా మతి పోయిందీ, ఏ విధంగా నేను కష్టాలుపడ్డదీ వివరాలన్నీ వచ్చిన బంధువులకు చెప్పారు. పెద్దవాళ్ళు నన్ను అనునయించి నా పూర్వ స్మృతిని తెప్పించటానికి చాల ప్రయత్నం చేశారు. కాని పిల్లలుమాత్రం నన్ను అనుమానం గానే చూశారు. 


అందులో ఒకడు యింకొక డితో యీ విధంగా చెప్పటం విన్నా: 'వాడు చెప్పిందంతా అబద్ద మనుకో. మతి తప్పిపోయిం దని బొంకుతున్నాడనుకో, వాడు నిజంగా ముస్లిం అయివుంటాడు ' 


నాకు భయం పుట్టింది.


'ఆ ఆలోచనే నన్ను కూడ వేధించుకు తింది. నేను నిజంగా ముస్లిమునేమో. ఏమో ఎవరికి తెలుసు. నేనుకూడ యిప్పుడు ముస్లిములు చేస్తున్న మాదిరిగా ఘోరాలు చేసిన తర్వాత నాకు మతి తప్పిందేమో. నా ఘోర కార్యాలకి భగవంతుడు న న్నీ విధంగా శిక్షించా డేమో.' 

ఆ రోజు రాత్రే సర్దార్ యింటి నుండి పారి పోయా. తిరిగి వీధులవెంట తిరుగుతున్నా. మళ్లా ఉపవాసాలు, 


' ఈ శరణాలయం ముస్లిములకోసం నీ వెవరు ?' 

నీ పే రేమిటి ? నీ మత మేమిటి?నువ్వు ఎక్కడనుండి వస్తున్నావ్?.. ప్రశ్నలు ! ప్రశ్నలు ! ! ప్రశ్నలు!!! -అన్నీ ప్రశ్నలు, .


ఎక్కడచూచినా ప్రశ్నలు. నేను అందులో ఒక్క దానికీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే నే నెవరినో నాకే గుర్తు లేదు. ఇక నడవలేక ఆకలి మండుకుపోతుంటే తిరిగి జుమ్మా మసీదు  దగ్గరకు పోయి అక్కడే కూచున్నా. ఆకలితో చచ్చిపోవటం, నిశ్చయ మనుకొన్నా. స్పృహతప్పి పడిపోయా. 


అట్లా ఎంతసేపు పడిఉన్నానో! ఎప్పుడో ఒక్క సారి మాత్రం కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా ఎనిమిదేళ్ల పిల్లాడు నుంచొని ‘లే! లే!!” అని అంటున్నాడు. 


'ఇదిగో! యివ్వి తిను. మా అమ్మ నీకోసం పంపింది'. తిండి అన్న మాట వినంగానే లేవాలని బుద్ధి పుట్టిం దను కొంటా, కాని లేవటానికి శక్తి ఎక్కడనుండి వస్తుంది .  లేవలేకపొయాన.  ఆ పిల్లాడి సహాయంతోనే అతిప్రయాసతో లేచి కూచొని చపాతీలు తింటం ప్రారంభించా. 


ఎంత రుచిగా ఉన్నాయి ఆ చపాతీలు! భగవంతుడే నాకోసం అమృతాన్ని యీ రూపంలో పంపించినట్లుగా ఉంది. కల కాలం జీవించునాయనా! ' అని దీవించా. 


కాస్తముక్క కూడ విదలకుండా అన్నీ తినివేశా. కృతజ్ఞత తెలియజేద్దామని అతని చెయ్యి తాకగానే 'నీకు బాగా జ్వరంగా ఉందే ! మా యింటికి పోదాం. మా నాన్న యునాని వైద్యుడు. మందు వేస్తాడు. తగ్గిపోతుంది.' అని ఆ పిల్లాడు నన్ను వాళ్లయింటికి లాక్కుపోయాడు. 


ఆ యునానీ వైద్యు డొక ముసల్మాన్. రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తాడు. బీద, బిక్కికి ఉచితంగా మందులిస్తాడు. అతనికి హిందువులు, ముస్లింలు, సిక్కులు అన్న వివక్షత లేదు. జబ్బులు తో వస్తే వారందరికీ మందులిస్తాడు. 


హకీంసాహెబు మందుల వల్ల నా జ్వరము తగ్గింది . కాని అంత పెద్ద వైద్యుడివద్దకూడ పూర్వ స్మృతిని తెప్పించే మందు లేకపోయింది. 


నా కథంతా ఆయనతో చెప్పి 'ఒక వేళ నేను హిందువునేమో. నేను మీ యిల్లు వదలి ఇంకో చోటికి పోవాలి' అని అన్నా. కాని హకీం సాహెబు నన్ను అక్కడే ఉండమని బలవంతం చేశాడు. 'నీవు హిందువయితే మాత్రం  ఏ మొచ్చింది? హిందువులు మాత్రం మనుష్యులు కారూ?`


నే నక్కడే కొంత కాలమున్నా. ఒక రోజున హకీం సాహెబు కొడుకు నా మాదిరి దురదృష్ట వంతులకు రొట్టెలు యివ్వ టానికి వెళ్లి తిరిగి యింటికిరాలా. నేను, హకీం సాహెబు అతనికోసం ఆ రోజల్లా వెతికాం. కాని అతని జాడ తెలియలా! 


జుమ్మా  మసీదు దగ్గర హిందువులు చంపారని రాత్రి తెలిసింది. ఈ వార్త వినంగానే హకీం సాహెబు కుటుంబ మంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆ పిల్లాడి భూతం నన్ను రాత్రి, పగలూ వెంటా డుతూ తన మృదుమధుర వచనాలతో 'నువ్వు చచ్చిపోతున్నప్పుడు నీవు తిండి పెట్టా. కాని నువ్వు నన్ను చంపేశావు. గుర్తుంచుకో ! అంటోంది. నేను చంపలేదని నాకు తెలుసు. కాని నేను హిందువునేమో. మతి దప్పక పూర్వం నేను కూడ అనేకమంది ముస్లిం పిల్లలను చంపానేమో, ఈ ఆలోచన నన్ను అక్కడ నిలవనియ్యలా! 


ఆ రోజు తెల్లవారు ఝామున ఇంట్లో ఎవరు  లేవకముందే బయటకుపారిపోయా. 


అవి, ఢిల్లీలో మృత్యుదేవత తన సహస్ర బాహువుల్నీ జాపుతూ కరాళనృత్యం చేస్తున్న రోజులు. పట్టపగలే సామాన్య ప్రజానీకం మృత్యువువాత పడుతోంది. అగ్ని హోత్రుడిపాలవుతున్నది . 


ఏదో ఒక విధంగా గూండాలను తప్పించుకొని రైలుస్టేషనుకి చేరు కొన్నా. ఇక్కడికన్న బొంబాయిలో కొంచెం ప్రశాంతంగా ఉంటుందని బయలుదేరా . నా మాట విని అక్కడ పక్కన పంజాబునుండి వస్తున్న ఒక కాందిశీకుడు చిన్నబోయిన వదనంతో కూచున్నాడు. 


రైలు కదిలినప్పటికి  'ఎవరు నీవు?' అని అడిగాడు. 'నాకు తెలి యదు. హిందువునైనా కావచ్చు. ముస్లిమునైనా కావచ్చు.'


' ఈ మార్గంగుండా ముస్లింలు ప్రయాణం చేస్తే ఘోర ప్రమాదాలకు గురి అవుతారని విన్నా. నీకు గడ్డం ఉంది. అందుకని అడిగా!' 


నేను నా కథ అంతా అతనికి వినిపించా. అతడు నా గడ్డాన్ని దీక్షగా పరిశీలిస్తూ నావంక అనుమానంగా చూస్తున్నాడు.


'వారం రోజులనుండి గడ్డానికి  కత్తి తగలక పోవటంచేత గడ్డం కొంచెం పెరిగింది. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ భరత పురం వచ్చాం. అక్కడ రైలు ఆపివేయబడింది. 


ముసల్మానులు అని అనుమానం వేసినవారి నందర్నీ రైలులోనుండి బయటకు లాగి కాల్చి చంపే స్తున్నారు.


‘ఆ విషయాన్ని తలుచుకొంటుంటే నాకిప్పు టికీ నవ్వు వస్తోంది. ఎందుకు నవ్వు వస్తోందో మీకు తెలుసుకోవాలని ఉందా ? ఆ విధంగా ముసల్మానులను బయటకు లాగి కాల్చి చంపే వాళ్ళంతా 'మహాత్మా గాంధికి జైయ్' అని అర స్తున్నారు. అది చాలు చచ్చిపోయేముందు ఎవడైనా నవ్వటానికి.


వాళ్లు  మా బోగీదగ్గరకు రాగానే నాకూ  చావు తప్ప దనుకొన్నా. నేను ముస్లిము అవునో కాదో నాకు మాత్రం తెలియదు. కానీ నాకు గడ్డం ఉంది. అది చాలు నన్ను చంపటానికి. 


యిందాకటినుండి కూచున్న పంజాబీ నామీద దుప్పటి వేసి నన్ను పూర్తిగా కప్పేశాడు. వాళ్లు అడగంగానే 'ఆయన మా అన్నండి. లాహో రులో బాగా గాయాలు తగిలాయి. ఇప్పుడు మాటాడే పరిస్థితిలో లేడు' అని స్నేహితుడు చెప్పాడు. నా పంజాబీ 'ఏదో ఒకవిధంగా చివరకు బొంబాయి చేరు కొన్నా. ఇక్కడకూడ అదే ప్రశ్న ఎదుర్కొంది.


నువ్వు హిందువుడివా, ముస్లిమువా ?


'ఎవరు హిందువు ? ఎవరు ముస్లిము? అన్న ఆలోచన నాకు యిప్పుడు తట్టింది. నేను ముస్లిముగా కనుపించినప్పటికీ పంజాబీ నన్ను కాపాడా డు. హకీం సా అతను హిందువా? సాహెబు కొడుకును చంపిన కిరాతకులు హిందువులా? ఎవరు ము స్లిములు? 


హకీం సాహెబు కుటుంబం ముస్లిము కుటుంబమా, లేక రావల్పిండిలో సిక్కులను నానా బాధలు పెట్టిన రాక్షసులు ముస్లిములా ? ఎవరు సిక్కులు? సర్దార్ సాహెబు కుటుంబమా  లేక ఢిల్లీలో వీరవిహారం చేస్తున్న నీచులా ? ఎవరు  ముస్లిం? ఎవరు హిందువు? ఎవరు సిక్కు ? ఈ పవిత్రస్థలములో కూడ నువ్వు హిందువువా, ముస్లిమా, 'సిక్కా అన్న ప్రశ్నే !


' నే నెవర్ని? హిందువునా? ముస్లిమునా? రాత్రింబగళ్లు ప్రశ్న నన్ను బాధిం చింది. నిద్రపోతున్నప్పుడుకూడ యీ ప్రశ్నలు భూతాల రూపందాల్చి బల్లాలు పుచ్చుకొని జవాబు పొందటానికి ప్రయత్నించాయి. నేను కలవరింతగా యీ మాట అన్నానేమో. 'నన్ను వదలి వెయ్యండి. నేను ముసల్మానును కాదు. హిందువునూ కాదు. సిక్కు నూకాదు. ఒక మాన వుణ్ణి మాత్రమే!' 


బొంబాయిలో కాందిశీకులకు శిబిరాలున్నాయి . సి క్కులకు ఖాత్యా కళాశాల దగ్గర ఒక శిబిరం ఉంది. హిందువులు రామకృష్ణ ఆశ్రమంలో తలదాచుకోవచ్చును. ముస్లింలు అంజుమన్ ఇస్లాం హైస్కూలుకు పోవచ్చును. కాని నేను ఎక్కడకు వెళ్లను? నాకు తలదాచుకొనేందుకు ఎక్కడా చోటులేదు. 


ముష్టి  నా కెవళ్లూ వేసేవాళ్లు కాదు. ముష్టి వేసేందుకు గూడ ఏ మతంవాడినో అడిగేవాళ్లు. నేనేం చెప్పేది? నేను ఏ మతానికీ సంబంధించిన వాడిని కాదు. అయితే నేను చచ్చిపోవాలన్న మాట. 


ఉహుఁ. ఆవిధంగా చావ లేను. నేనెవరినో తెలుసుకోవాలి. లేకపోతే నేను బతకటానికి అవకాశం లేదు.


డాక్టరు 'సమాని' నా స్మృతిని తెప్పిస్తాడని విని అక్కడకు వెళ్లా. అతడు మందులు, మాకులు వేసి రోగం తగ్గించడు. ఊరికే మాట్లాడి కుదు రుస్తాడు. నీ మనస్సును కష్ట బెట్టుకోకు. నీబుర్ర లో ఏమనిపిస్తే అది అంతా చెప్పు. సంబంధమున్నా సరే లేకపోయినా సరే అని చెప్పి తను ఒక కలంపుచ్చుకొని నా ముందు కూచున్నాడు. 


నేను కళ్ళు మూసుకొని నానోటి కొచ్చిందల్లా మాట్లాడా. 'నీలపు ఆకాశం, పచ్చని చేలు'


‘బాగుంది, ఆపబోకు' '


' నీలపు ఆకాశం, పచ్చని చేలు, ఒక నదీ ప్రవాహం. నదిలో పడవలున్నాయి. ఒక కాలవ, కాలవలో పిల్లలు యీదుతున్నారు. ఒకళ్ల మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారు.' 


' ఎవరీ పిల్లలు ? హిందువులా, ముస్లిములా, - సిక్కులా'


'ఏమో, ఎవరో, కానివాళ్ళుమాత్రం పిల్లలు' '


' సరే, కానీ .. పంటపొలం, పండగ. ! డోలక్ వాయిద్యం విను.. ఆహాఁ. ఎంత బావుందో ! ఆహాఁ! ఏంపాట !!! ఎవరు పాడుతున్నారా పాట??


' స్త్రీలు ' 


'సరే. ఎవరా స్త్రీలు. హిందువులా, ముస్లిములా, సిక్కులా.' '


' పంజాబు స్త్రీలు. హిందువులు, ముస్లిములు - సిక్కులు' 


' ఇక ఏమీ చెప్పలేను. ఏమీ కనిపించడం లేదు. ' 


'ఊ' అని నిట్టూరాడు డాక్టరు . . యికలాభం లేదన్నట్లు.


' ఏం? ఎందుకని? ఏ మొచ్చింది ?'


“ నాతల తిరిగిపోతోంది. చీకటిగా ఉంది. ప్రపంచమంతా భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయి. ' 

 

'గట్టిగా ప్రయత్నించు  . ఇప్పుడేం కనిపిస్తున్నాయి? ' 


' ఆకాశాన్నం టే మంటలు. ఇళ్లన్నీ తగలబడి పోతున్నాయి. ఏడుపు స్వరాలు వినిపిస్తున్నాయి.' 


 'సరే, గూండాలు వచ్చారన్న మాట. వీళ్ళే బంధువుల్ని చంపేశారు. వీళ్ళే నీ ఆస్తి అంతా దోచేశారు. వీళ్ళే నీ పెళ్లాం పిల్లల్ని చంపేశారు. నీ మతి పోగొట్టారు...వా ళ్ళేం చెబుతున్నారు? 


; నా కేమీ వినిపించటంలా, అంతా గోలగా ఉంది. ఒక్క మాటమాత్రం చెవులో గుద్దినట్లు వినిపిస్తోంది. ' చంపుచంపు చంపు. ' 


'వీళ్ళే నిన్ను సర్వనాశనం  చేశారు. వీళ్ల మీద నువ్వు పగతీర్చుకోవాలి. ' 


' నేను హిందువునో, ముసల్మానునో డాక్టరు తెలుసుకో బోతున్నాడు! నేను ముస్లిముని! సర్దార్ సాహెబు బంధువుల్ని చంపా. అనేకమంది హిందువుల సిక్కుల ప్రాణాలు తీసి వేశా. నేను హిందువుని!  హకీం సాహెబు కొడ కుని చంపా. ఇంకా అనేకమంది ముస్లిములను చంపా. ' 


' వద్దు. అక్కర్లేదు. నేనెవరినో నేను తెలు సుకోనక్కర్లా. నేను హిందువుగాని, ముస్లిం గాని, సిక్కు గాని అవదల్చుకోలా• మానవుడిగా మాత్రమే ఉంటా. అంతే! అంతే!!' అని అరుస్తూ డాక్టరు దగ్గరనుండి పారిపోయా! 


నేను హిందువుని. నేను ముస్లిముని

నేను ముస్లిముని'  హిందువుని' ‘


' నే నెవర్నయితే మాత్రం నాకేం పనీ? ' 


' నే నెవర్ని కాదు. నాకేం పని లేదు' “

' నేను హిందువుని . నేను ముస్లిముని'


ప్లేగు నుండి  పారిపోయినట్టు డాక్టరు దగ్గర నుండి పారిపోయా. 


కాని యీ మాటలు మాత్రం నన్ను వదలి పెట్టలా ! 

నేను ఏ వీధికుండా పరు గెత్తుతున్నా నో నాకు తెలియదు. భయంకరమైన  వ్యక్తి ఒకడు నన్ను పట్టుకు ఆపాడు. ' ఆరే సాలా ! ఎవర్రా నువ్వు? ఎక్కడికి పోతున్నావ్ ?' 


అతడొక ముస్లిం అవాలి . అతని చేతిలో కత్తి ఉంది. 

 ' నేను హిందువుని. నేను ముస్లి ..' '


' ముస్లిము' అన్నమాట పూర్తి చేయక ముందే నా వీపులో బాకు దిగిపోయింది. అదే ఈ వీపులో ఉన్న బాకు పోటు!


'కాఫిర్ కా బచ్చా' అని అంటున్నాడు. నేను పూర్తిగా పడిపోకుండా పారిపోతున్న ప్పుడు. నా వెనుక రక్తం కారుతోంది. మీరు నమ్మరు. అయితే నమ్మబోకండి. 


చచ్చిపోయే ముందు నేను నిజం మాట్లాడుతున్నా నని నాకు మీరేమీ సర్టిఫికేట్ యివ్వనక్కర్ల.......


 “నేను ముస్లిముని. నేను హిందువుని' అని అనుకుంటూ నేను పోతున్నా. 


ఈసారి 'హిందువు' అంటానికి పూర్వం నా డొక్కలో ఒక బాకు

దిగింది.


'ఇప్పుడు మీరు గ్రహించా రనుకొంటా, నాకీ రెండు గాయాలు ఎట్లా తగిలాయో! 


నన్ను హిందువులు, ముస్లిములు యిద్దరూ బాకుతో  పొడిచారు. అందుకనే మీరు నన్ను బతికించ లేదని చెప్పింది డాక్టరుగారు! 


ఇక్కడ యింత ఆదుర్దాగా చూస్తున్న మీలో ఒక్కడు కూడ  నన్ను బతికించలేడు . పగతీర్చుకొంటానికి మాత్రం నా చావును ఆధారంగా తీసుకొంటారు. ఇప్పుడు గనక నేను హిందువునని చెప్పినట్లయితే వెంటనే హిందువులు నాలుగు అమాయకముస్లిం పిల్లల ప్రాణాల్ని ఆహుతి గొంటారు. ముస్లిము నని చెబితే ముస్లిములంతా హిందూ మతాన్ని రూపుమాపేస్తారు. 


' నేను నవ్వుతున్న దెందుకంటే, యిప్పుడే తెలిసింది నే నెవరినో ? ఇంత కాలాని యిప్పుడు తెలిసింది పూర్వచరిత్రంతా! 


నా బిడ్డల  చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి . ఇద్దరు కూడ నా కళ్ల ఎదటే చంపబడ్డారు. ఆ విధంగా నా మతి చెప్పింది. ఆఁ! అవును! అంతా నా కిప్పుడు గుర్తు కొస్తోంది. మా పొలాలు, మా గ్రామం, నా స్నేహితులు, నా యిరుగు పొరుగువాళ్ళు - అంతా యిప్పుడు జ్ఞాపక మొస్తున్నారు. చచ్చి పోయేముందు..  నిజం .. అన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి .


'మీరు నేనేమి చెబుతానో అనియింకా నిరీ క్షిస్తున్నారు. కాని లాభం లేదు. నేను చెప్పను.  నేను హిందువునో, ముసల్మానునో చెప్పను.  చెప్ప దలచుకోలేదు. 


నాకు యీ రెండు -గాయాలు తగిలించిన హిందువుగాని, ముస్లింగాని నేను తన జాతివాడినని తెలుసుకోకూడదు. ఆరే పొరబాటున పొడిచానే అని పశ్చాత్తాపం పొందకూడదు. ఇదే నా పగ. వీ ళ్లిద్దరిమీదే కాదు. నాలాంటి అమాయక ప్రాణాలను బలి గొంటున్న వేలకొలది హిందువులమీద, ముస్లి ములమీద, సిక్కులమీద . 


మతోన్మాదులు పుట్టటం మూలంగా, బతకటం మూలంగా ఆత్మీయమైన నా పంజాబుకు తీరని కళంకం వచ్చింది.


' నేను హిందువునా, ముస్లిమునా ?' 


' నేను ముస్లిమునా హిందువునా?' 


ఈ ప్రశ్నే వాళ్లకు కావాల్సింది. ఈ ప్రశ్న వాళ్లను రాత్రింబగళ్లు వేధించుకు తినేది. పట్టణంలోను, పల్లెలోను, రైళ్లలోను , బస్సులోను, ట్రాములోను -ఫ్యాక్టరీలోను, ఎక్కడబడితే అక్కడ యిదే ప్రశ్న. 'వాడు హిందువా, ముస్లినూ?' 


వాళ్లకుగాని వాళ్ల పిల్లలు ఉంటే ఆ  పిల్లలకుగాని, వాళ్ల పిల్లల పిల్లలకు గాని శాంతి ఏమిటో తెలియదు. 


అంత భయంకరం, ఘోర భయంకరం నా పగ. 


ఇంకా మీకు తెలుసుకోవా లని ఉందా, నే నెందుకు నవ్వుతున్నానో?'

- రచన - వెంకటేశ్ 


(మూలం - అబ్బాస్ కథ) 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


- సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...