Monday, May 9, 2016

కవిత్వం- విమర్శకత్వం


రచనకు ఒక పార్శ్వం రచయిత ఐతే రెండో పార్శ్వం రసాస్వాదన చేసే భావుకుడు.
అపారే కావ్య సంసారే కవిరేకః ప్రజాపతిః।
యథాస్మై రోచతే విశ్వం తథైవ పరివర్తతే- అని శ్లోకం॥
కవి తన ఇఛ్చానుసారం చిత్రించడమే కాదు.. ప్రజాపతి సృష్టించిన జగత్తు
పోకడలను కూడా మార్చగలడు-అని అర్థం.
కవిలోని ఆ సృజనశక్తి సహజమైనది. కొంత మందికి అది గురుకృప  ద్వారా సంక్రమిస్తుంది. కొంతమంది నిరంతర శాస్త్రాధ్యయనంతో మెరుగులు దిద్దుకుంటారు. ఎవరు  విధంగా సాధించినా పండితరాయలు సిద్ధాంతం  ప్రకారం కవికి ‘అనాయాసంగా, అప్రయత్నంగా శబ్దార్థాలు  స్ఫురించే ప్రతిభ పట్టుబడటం’ ప్రధాన
లక్షణం.
రాజశేఖరుడు అనే మరో  ఆలంకారికుడు ఈ ప్రతిభను  రెండు రకాలుగా విభజించాడు.
కారయిత్రిః కావ్యాన్ని సృజించే ప్రతిభ
భావయిత్రిః కావ్యసౌందర్యాన్ని ఆస్వాదించగలిగే సామర్థ్యం

కారయిత్రి అధికంగా ఉంటే కవి.. భావయిత్రి అధికమైతే సద్విమర్శకుడు.
రచన పూర్తయిన తరువాత  రచయితా విమర్శకుడి అవతారం ఎత్తవచ్చు. కాని అది తన రచనకే పరిమితం. సాధారణంగా ఏ కవీ తనకు పనిపడితే తప్ప పరాయివారి రచనల జోలికి పోయే పని పెట్టుకోడు.
రచనలను చదివి తార్కికంగా ఆలోచించి సహృదయంతో విమర్శ చేయగల సత్తా ఉన్నవాడినే అసలైన విమర్శకుల లెక్కలోకి తీసుకోవాలి.
సరే.. కవి గొప్పా? విమర్సకుడు గొప్పా? ని మీమాంస.
కవి సృజన చేస్తేనే కదా.. విమర్శకు భూమిక సిద్ధమయేది! కనుక కవే గొప్ప అని ఒక వాదం. కానీ చాలా సందర్భాల్లో కవికూడా ఉహించని చమత్కారాలను విమర్సకుడు తన విస్తృత పరిశీలనాపాటవం శక్తితో వెలికి తీస్తుంటాడు!.
ఇయం సంధ్యా, దూరాదహముపగతోహన్త! మలయా
దిహైకాన్తే గేహే తరుణి! తవనేష్యామి రజనీమ్,
సమీరేణోక్తైవం నవకుసుమితా చూతలతికా
ధునానా మూర్థానంనహి నహి నహీత్యేవ వదతి”-అని ఒక కవిగారి శ్లోకం.
ఎక్కడో మలయపర్వతంనుంచీ వస్తున్నాను. కనుచీకటి పడుతున్నది. తరుణీ! నీ గృహంలో ఈరాత్రి ఏకాంతంగా గడుపుతాను” అని సమీరం అడిగితే కొత్తగావికసించిన చూతలత  ‘వద్దు వద్దు వద్దు’(బిడియంతో కాబోలు)  అని ముమ్మారు తల డ్డంగా ఊపిందిట!
శ్లోకం రసవత్తరంగానే సాగింది. కానీ చివర్లో ఆ చూతలత మూడుసార్లు అలా వద్దు వద్దు వద్దు అని సాగదీయడం  దేనికీ?’ అని తర్కానికి   విమర్శక శిఖామణి అయినా తర్కానికి దిగితే.. ముక్కు మొహం తెలీని పరాయి పురుషుడు రాత్రంతా ఇంట్లో ఒంటరిగా గడుపుతాను అంటే.. ముగ్ధ యిన పుష్పానికి  మరి కంగారు పుట్టదా! ఆ తొట్రుపాటులో ‘వద్దు.. వద్దు’ అన్నది. తప్పేమున్నది? అని కవిగారి ఓట్రించినా  అది కవిగారి వట్టి బుకాయింపు మాత్రమే అని ఇట్టే తెలిసి పోతుంది.
బాగుందండీ.. మరి మూడోసారి కూడా వద్దుని అనడం ఎందుకో?” అని విమర్శకుడిగారు ఎదురు  సందేహం లేవదీస్తే కవిగారి దగ్గర సబబయిన సమాధానం ఉండాలి గదా!ఛందస్సుకోసం ఏదో అలా అనవలసి వచ్చింది  లేవయ్యా!” అని లోలోన గొణుక్కున్నా.. బైటికి అనలేడు గదా! ఛందస్సుల్లో ఇమడేందుకుటువంటి వ్యర్థప్రయోగాలకు పాల్పడం సాంప్రదాయిక సాహిత్యంలో సాధారణమే. కావచ్చు  కానీ అటువంటి వ్యర్థప్రయోగాలవల్ల రచన ఔన్నత్యం పల్చబడతుంది. కాలంనాటి కవులందరికీ ఈ విషయమై  మనసులో మథన న్నా  బైటికి ఒప్పుకోవడం  మేథోగౌరవానికి భంగకరమని భావించేవారు.
టువంటి సందర్భంలోనే విమర్శకుడి విశిష్టత బైటపడేది. ఇక్కడి శ్లోకం సంగతే చూసుకోండి! కవిగారిని ఇబ్బందినుంచీ విమర్శకుడు ఎంత తెలివిగా తప్పించాడో గమనించండి! ‘శ్లోకంలో కవిగారు సూచించింది వట్టి కుసుమితను కాదు.. నవ కుసుమితను. అంటే అప్పుడే పుష్పించిన కుసుమాన్ని. ఆ పూలబాలకు  పరపురుషుడితో మూడు రాత్రుల ఏకాంత వాసమంటే.. బెదురు  పుట్టదా! అందుకే అసంకల్పితంగా నవకుసుమిత నోటినుంచీ ‘  వద్దు.. వద్దు.. వద్దు’అన్న మాటలు అలా  మూడుసార్లు తన్నుకు వచ్చేసుంటాయి అంటూ విమర్శకుడు   సందర్భ సమన్వయం చేసాడనుకోండి.. కవిగారికి ఎలా ఉంటుంది? ఆనందం ఆపుకోలేక అమాంతం విమర్శకుడిని గాఢాలింగనం  చేసేసుకుని ఉంటాడేమో కూడా! అదీ సాహిత్య పరిశీలనలో విమర్శకుడి దృష్టి సామర్థ్యం. అలాగని కవిపాత్రను ఎంతమాత్రం తక్కువచేయడంగా భావించరాదు.  ఎవరి మేథోక్షేత్రంలో ప్రత్యేకత వారిదే!
గురూపదేశాదధ్యేతుం శాస్త్రం జడధియో౭ఫ్యలమ్
కావ్యంతు జాయతే జాతు కస్య చిత్ప్రతిభావతః’- మందబుద్ధులు సైతం  గురుశుశ్రూష చలవతో కొంత శాస్త్రపాండిత్యం సాధించవచ్చు. కావ్యసృజన  కదాచిత్  కాలం కనికరించినప్పుడు మాత్రమే చేయగలియేది. అదీ వందలాది ప్రతిభావంతులలో ఏ ఒక్కరి వల్లో సాధ్యమయేది- అని  భామహుడి మతం.
కావ్యం ప్రాథమికంగా మేలిమి బంగారమైనప్పుడే .. ఏ విమర్శకుడైనా సానపెట్టగలిగేది! చేమకూర వెంకటకవి ‘విజయవిలాసమే’ దీనికి చక్కని ఉదాహరణ.
సాధారణంగా కావ్యం మొత్తంలో పది పన్నెండు చమత్కారాలు ద్యోతకమైతేనే మనం ‘ఓహో..ఆహో’ అని కవి ప్రతిభను ఆకాశానికి ఎత్తేస్తుంటాం. రాసిన ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విశేషాన్ని  చొప్పించిన చేమకూర వేంకటకవి ప్రతిభను మరింకేమని పొగడగలం! తాపీ ధర్మారావుగారు ‘హృదయోల్లాసం’ పేరుతో సవివరమైన వ్యాఖ్యానం వెలువరించిందాకా.. విజయ విలాసం కావ్యంలోని అందాలు  కొన్ని వందల ఏళ్ళవరకు   బయటపడనేలేదు. అందుకే అనేది.. కారయిత్రి ప్రతిభ ఒక్కటే చాలదు.. భావయిత్రి సామర్థ్య సహకారమూ కావాలి కావ్యగౌరరవం పండితలోకంలో పడి పండాలంటే!
కన్నె నగుమోము తోడం
బున్నమ చందురుని సాటిఁ బోలుప వచ్చున్
నెన్నెదురు తోడ మార్కొని
మున్నందఱు జూడ రేకమోవక యున్నన్- (1-197) అనే పద్యమే చూడండి!
గతంలో(చిత్రాంగద నుదురుతో పోటీపడిన సందర్భంలో) అపజయం పాలై ఉండకపోతే పున్నమి చంద్రుణ్ణి ఈ కన్నె నవ్వుమొహంతో పోలిక పెట్టవచ్చు- అని కవి భావన. పున్నమి చంద్రుడిని మించిన అందమైన నవ్వుమొహం ఆ అమ్మాయిదిఅని కవి ధ్వని. నాలుగో పాదంలోని ఆ ‘రేక మోవక’ అనే పదప్రయోగంతో ఎలా సమన్వయించాలో కొమ్ములు తిరిగిన పండితులకూ, పరిష్కర్తలకూ, వ్యాఖ్యాతలకుకూడా అంతు పట్టలేదు. జూలూరు అప్పయ్య గారు ‘చిన్నదాని నొసటితో పడ్డ పోటీలో ఓడిపోయి చంద్రుడు లేఖలు మోసే పని చేయవలసి వచ్చింది’ అని ఏదో పొసగని అర్థం చెప్పే ప్రయత్నం చేసారు. శబ్దరత్నాకరం ‘రేక అనే పదానికి ‘జాబు’ అని ఒక్కర్థం మాత్రమే చెప్పి ఊరుకోవడంతో  వచ్చిన చిక్కు ఇదంతా. దాదాపు 300ఏళ్ళ పాటు  చాలామంది ఇలాంటివే ఏవో అతకని పోలికలతో అన్వయించేందుకు నానా   హైరానా పడ్డారు. నోరివారి దగ్గర్నుంచీ వేదుల, బులుసువారిదాకా ఎంరో తమకు తోచిన ఏదో ఒక అర్థంతో సమన్వయం చేయబోయారు! కానీ.. కవిగారి అంతరంగంలోని అసలు భావం ఏమిటో  తాపీవారు తేల్చిన దాకా ఎవరికీ అంతుచిక్కనేలేదు.
‘రేక’ అంటే గాయంవల్ల శరీరంమీద మిగిలిపోయిన గీత’ అని చేమకూర వెంకటకవిగారి  భావం అని విజయ విలాసంలోని మరో పద్యం ఉదాహరణగా చూపించి మరీ ఒప్పించారు తాపీవారు. మూడో అధ్యాయంలో అర్జునుడు సుభద్రను ఎత్తుకుపోయే సందర్భంలో బలరాముని సేనలతో తలబడవలసి స్తుంది. సుభద్ర యుద్ధంలో  భర్తకు సాయం చేస్తుంది. కృతజ్ఞ్తతతో భార్యను ఆలింగనం చేసుకునే సమయంలో ఆమె నుదుటనున్న కుంకుమరేఖలు చెమటకు తడిసి అర్జునుడి వక్షస్థలంమీద కత్తిగాట్లులాగా పడతాయి. అర్జునుడు చమత్కారంగా
ఒక్కంచుక రేకమోవని నా యురఃస్థలంబున/ నీ కుచకుంకుమ రేఖ లంటించి మీ వారికి సూడు తీర్చితివంటూ  పరిహాసం చేస్తాడు. ఇక్కడ  రేకమోవని’ అనే పదానికి కత్తిగాయం అని మినహా వేరే అర్థం కుదరదు కదా!
శత్రువు ఒంటిమీద ఒక్క దెబ్బైనా వేయకుండా ఓడిపోవడం యోధులకు అవమానం. తన అన్నగారిమీద ఆ అపనింద పడకుండా తన కుంకుమరేఖలతో అర్జునుడి వక్షస్థలంమీద కత్తిగాయంలా చేసి పుట్టింటివారి గౌరవాన్ని సుభద్ర కాపాడిందని కవిగారి చమత్కారం’. తాపీవారి అన్వయం ఇదే. ఇదే అర్థాన్ని మునుపటి  పద్యానిక్కూడా అన్వయించుకుంటే చేమకూరకవిగారి చమత్కారం చక్కలిగింతలు  పుట్టించదూ! ‘చిత్రాంగదతో జరిగిన స్పర్థలో ఓడి వంటికి మచ్చతెచ్చుకోకుండా ఉండి ఉంటే పున్నమిచంద్రుడుకూడా ఈ కన్నెనగుమోముతో పోల్చుకొనేందుకు అక్కరకొచ్చేవాడు కదా!’ అని కవిగారి భావం. తాపీవారి పుణ్యమా అని చేమకూర వెంకటకవిగారి  పద్యంలోని శ్లేష ఉపమాలంకారంతో సహా వెలుగులోకి వచ్చి  ఎలా  మెరుపులీనిందో గమనించారు గదా! విమర్శకుని విశిష్టత ఇలాంటి సందర్భాలలోనే కొట్టొచ్చినట్లు బైటికొచ్చేది.
దేవదాసు సినిమాలో ’కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్’ అని ఒక పాట ఉంది. రాసినవారు మల్లాదివారే అయినా పలుకారణాలవల్ల రికార్డులమీద  సీనియర్ సముద్రాలవారి పేరు కనిపిస్తుంది. చాలా ప్రసిద్ధం అయింది ఆ రోజుల్లో ఆ పాట. చిత్రవిజయోత్సవం జరిగే  ఒక సందర్భంలో వేదికమీదన ఉన్న గీతకర్తని ఎవరో గట్టిగా నిలదీశారుట ’కుడి  ఎడమ వడమేంటండీ అసలు…అర్థమేమన్నా ఉందా ఆ చరణంలో?’ ఆవటా అంటూ. ‘నిజమే కదా’ అనిపిస్తుంది  మనకు కూడా. రాసిన రచయితకి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యతా ఉంటుంది కదా! కవిగారు  లేచి నిలబడి సముద్రమంత గంభీర స్వరంతో   ఇచ్చిన వివరణకు శ్రోతలు ఆగకుండా కరతాళధ్వనులు చేశారని ఆరుద్ర ఏదో ఒక సందర్భంలో
రాశారు. ‘కుడి ఎడమ వడమంటే right.. left గా తిరగబడటం అని కాదు అర్థం. కుడిభుజంలాంటి వ్యక్తి దూరంగా జరిగిపోవడం(ఎడంగా వెళ్ళిపోవడం)అనిట! ఇలాంటి వివరణలు ఇవ్వాలంటే కవిలో కారయిత్రి.. భావయిత్రి పాళ్ళు రెండూ సమపాళ్లలో కలసి ఉండాలి.
ఊహ, భావన, బుద్ధి కవికి సహజంగా సిద్దించే వరాలు. కవి తోచింది రాసేసి.. పదిమందిలోకి వదిలేసిన  తరువాత.. శల్యపరీక్షకు సిద్ధపడక తప్పదు. కొలిమిలో మండితేనే కదా బంగారానికైనా మెరుగు. విమర్శక సహిష్ణుత అలవాటు చేసుకుంటేనే ఏ కవికైనా రాణింపు. 
బహుగ్రంథపఠనం వల్ల నేపథ్య విజ్ఞానం, పాఠకులతో నిరంతర సంపర్కం చేత సామాజిక ధోరణులు, సహవిమర్శకులతో నిత్యసంపర్కం వల్ల తప్పొప్పులు పసిగట్టగలిగే సామర్థ్యం  వమర్శకుడి శక్తులు.  అన్నింటికీ మించి విశ్లేషణాత్మకమైన పరిశీలనా లక్షణం విమర్శకుడి   ముఖ్య లక్షణం. మెరుగు  పసిగడితే మెచ్చుకునే సుగుణం అవసరం . విమర్శకుడి నోటినుంచి వచ్చే ఒక్క ప్రశంసావాక్యం చాలు  సృజించిన కర్తను ఏనుగెక్కించి ఊరేగించేందుకు. తపు కనిపిస్తే సున్నితంగా విప్పి చెప్పి  కవి ముందు ముందు మరింత మెరుగైన సాహిత్యం సృజించేందుకు   తనవంతు సాయం చేయవలసిన బాధ్యతా  విమర్శకుడిమీద ఉంటుంది.
అసూయాలు, అలకలు, అభాండాలు.. అలౌకికులము అనుకునే తత్వం కవులకు, విమర్శకులు ఇద్దరికీ శోభనివ్వవు.
విమర్శకుల పాత్ర ఎంత విశిష్టమైనదో కవులు, కవుల సృషితత్వం ఎంత కష్టతరమైనదో విమర్శకులు..వగాహన చేసుకుంటారనే ఇంతగా చెప్పుకొచ్చింది.
***
-కర్లపాలెం హనుమంతరావు





Friday, May 6, 2016

అచ్చ తెలుగు ముచ్చట్లు


కాళిదాసు భోజరాజు కీర్తిని కొనియాడే ఓ సందర్భంలో
నీరక్షేరే గృహీత్వా నిఖిల.  ఖగతితీర్యాతి నాళీకజన్మా
తక్రం ధృత్వాతు సర్వా నటతి జలనిధీం శ్చక్రపాణి ర్ముకుందః  సర్వాంగనుత్తుంగశైలాన్ వహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే!  భోజరాజక్షితీంద్ర!”
అంటూ అతిశయోక్తులు పోతాడు!   ప్రభువుకీర్తి శ్వేతవర్ణంలో దశదిశలా వ్యాపించడంవల్ల పక్షులన్నీ హంసలవలె  భ్రాంతి గొలుపుతున్నాయిట!  బ్రహ్మదేవుడికి తన వాహనం ఏదో ఆనవాలు  పట్టేందుకు నీళ్లు కలిపిన పాలు పక్షులముందు పెట్టవలసి వచ్చిందని కాళిదాసు చమత్కారం! సర్వసముద్రాలూ పాలసముద్రం మాదిరి తెల్లబడటంవల్ల జగజ్జేతకు తన పడకగల పాలసముద్రం ఏదో తెలుసుకోడం వల్లగాక  మజ్జిగ  సాయం కోరవలసి వచ్చిందని మరో ముచ్చట! మజ్జిగచుక్క పడిన తరువాత  గడ్డకట్టిన సముద్రమే  తన పాలసముద్రమవుతుందని పరమాత్ముని  పరీక్ష!  పరమేశ్వరుడిదీ అదే పరిస్థితి.  తన కైలాసగిరి  విలాసమేదో తెలుసుకునేందుకు ఫాలనేత్రం తెరిచి మరీ మండించ వలసిన  పరిస్థితి! మండిన కొండే తన వెండికొండవుతుందని ఈశుని ఈ         విచిత్ర       పరీక్ష!  దీనబాంధవుల  స్థితిగతులనూ ఇంత దయనీయంగా మార్చివేసిందని భోజరాజు కీర్తికాంతులను  వర్ణించడం కొంత అతిగా అనిపించినా.. రాసింది కావ్యం.. రాసిన అక్షరసిరి  కాళిదాసు కనుక ఎంత  కల్పన అయితేనేమి.. అత్యంత రమ్యనీయంగా ఉందని ఒప్పుకోక తప్పదు కదా రసహృదయులందరికీ!

వేల్పుటేనికలయ్యె బోల్ప నేనుగు లెల్ల- గొండలన్నియు వెండి కొండలయ్యె
బలుకు చేడియ లైరి పొలతుక లందరు-జెట్టులన్నియు బెట్టు చెట్టు లయ్యె
బాల సంద్రములయ్యెనోలి నేర్లన్నియు-నలువ బాబాలయ్యె బులుగు లెల్ల
బుడమి దాలపులయ్యె బడగదార్లన్నియుమేటి సింగములయ్యె మెకము లెల్ల
బండు రేయెండ కన్నుల పండువగుచు
బిండి చల్లిన తెరగున మెండు మీరి
యొండు కడనైన నెడలేక యుండి యప్పు
డండ గొనగ జగంబెల్ల నిండుటయును”
అంటూ మన తెలుగు కవిసార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి సైతం   తెలుగులో  ఓ రామాయణం రచించే సందర్భంలో   అయోధ్యకాండ మధ్యలో ఈ హృద్యమైన  పద్యం చెప్పుకొచ్చాడు.. ‘శభాష్!’ అనిపించే మెచ్చుకోళ్ళెన్నో సాధించుకొచ్చాడు.
విస్తారంగా పరుచుకొన్న  పండువెన్నెల్లో నల్లటి ఏనుగులుకూడా దెవేంద్రుని ఐరావతంలాగా భ్రమింపచేస్తున్నాయనడం.. కాలవర్ణం కుప్ప పోసినట్లుండే  కొండలకూడా మహాశివుని రజితాలయాల మాదిరి ధగధగలతో వెలిగి  పోతున్నాయనడం.. శ్యామలవర్ణంతో నిగనిగలాడే స్త్రీల సొగసులన్నీ శారదమ్మ వంటితీరుతో పోటీకి దిగుతున్నాయనడం.. హరితవృక్షాలన్నీ కల్పవృక్షాలకు మల్లే తెలుపురంగుకి తిరిగి  ప్రకాశిస్తున్నాయని కల్పనలు చేయడం.. నదులు సర్వస్వం క్షీరసాగరాలకు మల్లే మల్లెపూల మాలల మాదిరి మతులు పోగొడుతున్నాయని అనడం.. వివిధ జాతుల  పక్షులన్నీ వర్ణాలతో నిమిత్తం లేకుండా శ్వేతహంసల మాదిరి  బారులు తీరి శోభాయమానంగా అలరారుతున్నాయని అనడం..  ఆహాఁ.. తిమ్మకవి కల్పనంతా  ఎంత కమ్మంగా ఉందో కదా!
పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని  ఒక్క వాక్యంలో అని ఊరుకుంటే అది కావ్యం ఎలాగవుతుంది? తిమ్మనకు కవిసార్వభౌమడన్న గుర్తింపు ఎలా వస్తుంది?  కనకనే ఈ కల్పనలన్నీ! నిజమే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఉంది. నిశితంగా గమనించి చూడండి ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో కవి రసవంతంగా  రాయడంలోనే నిఖార్సైన విశేషం దాగి ఉంది!

రుచిగట్టగలిగే ప్రతిభ మన మనసుకు ఉండాలేగానీ.. తెలుగు పలుకుకి మాత్రం కలకండ పలుకుకు మించిన తీపిదనం లేదా! తెలుగు భాష సాధికారతను గురించి.. ప్రాచీనతను గురించి గత కొద్దికాలంగా చర్చోపచర్చలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.  చర్చలు ప్రాచీనతను గురించి.. అధికారిక హోదాను గురించి కాక.. వ్యావహారికతను గురించి.. అధునికతను గురించి సాగితే మరింత ప్రయోజనం సాధించినట్లవుతుందేమో! 
అవసరం లేకున్నా ఆంగ్లపదం లేకుండా  తేటతెలుగులో మాటలాడుకోవడం మొరటుతనమయి మనకు ఎన్ని దశాబ్దాలాయ! ఆధునిక మాద్యమాల పుణ్యమా అని  తెలుగు పదాలు పరాయిభాషకు మల్లే.. పరాయిభాష పలుకులు తెలుగుభాషకు మల్లె  దాదాపుగా స్థిరపడిపోయిన            దుస్థితి  ప్రస్తుతానిది. భాషాదినోత్సవాలు భేషజంగా జరుపుకుని ‘శభాషం’టూ జబ్బలు చరుచుకుంటే సరిపోతుందా?   పాలక మహాశయులే  చట్టసభల సాక్షిగా ప్రజల భాషమీద చూపించే చిన్నచూపు ప్రతి మాతృభాషాభిమానికి చివ్వుమనిపించడం లేదూ! 'మన తెలుగు' అన్న  పట్టింపు మనకే ఏ కోశానా లేనప్పుడు.. తెలుగులో చదువుకున్న వారికి కనీసం ప్రభుత్వాల  తరఫునుంచైనా ఒనగూడే అదనపు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు  రవ్వంత కరవవుతున్నప్పుడు.. అమ్మభాషమీద ఎంత  అబిమానం పొంగిపొర్లుతుంటేనేమి..  ఆసాంతం  తెలుగులోనే విద్యాబోధన కొనసాగించడం  దుస్సాహసం అనిపించుకోదా!
తెలుగువాడికి మొదటినుంచి పరభాషా వ్యామోహం అధికమన్న అపప్రథ ఒకటి ఎలాగూ ఒకటి ఉండనే ఉంది!   ఆ లోపాల లోతులు తడముకొనే సందర్భం ఇది కాదు వదిలేద్దాం..  కానీ.. కనీసం తెలుగుభాష సాంకేతిక             సామర్థ్యంమీద .. వ్యావహారిక పదజాల            సమృద్ధిమీద .. అవగాహనా రాహిత్యం తొలగించుకోవాలా..  వద్దా!  ఇతరేతర అవసరాల ప్రలోభాలవల్ల ఒకవర్గం ప్రబలంగా సాగిస్తున్న తెలుగువ్యతిరేకతను అడ్డుకోవాలా.. వద్దా? కనీసం ఆ దిశగానైనా ప్రతి తెలుగు అభిమానిని  సమాయత్తం చేయవలసిన గత్తర ప్రస్తుతం గతకాలాలకన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంది.  ఉద్యోగ.. ఉపాధులాది నిత్యజీవితావసరాలకి  అవసరమయ్యే భాషమీద ఆధారపడటం ఎలగూ తప్పదు.. సరే! అలా ఆధారపడే ఉన్నతస్థాయికి సొంతభాషను చేదుకోవడం ఎలగూ లేదు! ఉన్నస్థాయినుంచికూడా మరింత పాతాళానికి తల్లిభాష జారుతుంటే తల్లడిల్లడే లక్షణాలు తెలుగువాడిలో   కల్లలవుతున్నాయి! అదీ కలవరం!   పుట్టిన నేల నేర్పించే మట్టిజ్ఞానాన్ని సైతం  కాలదన్నే అజ్ఞానం రోజురోజుకీ అధికమయి పోతున్నది! బుడత వయసునుంచే మెదడు మడతల్లో మనదికాని మరి దేన్నో బలవంతంగానైనా చొప్పించాలని ఆరాటం!  ఇంటభాషమీద సహజంగా ఉండే అభిమానాన్ని ఇంతప్పటినుంచే బిడ్డకు దూరం చేయాలనే దురాలోచన!
ఏ జాతికైనా తనదైన ఉనికి అంటూ ఒకటి ఉంటుందికదా!  ఉండాలి కూడా కదా! నలుగురిలో తను  ఏమిటో నోరు    విప్పకుండానే  చెప్పగలిగేది ఈ సంస్కారమే కదా!  దానికీ ఓ పెద్ద  ‘నమస్కారం’ పెట్టేసెయ్యడమే 'అల్ట్రా మోడరన్' నాగరీకంగా మన్ననలు పొందటమే ఆందోళన కలిగించే అంశం.
తెలుగు భాషాపరంగా తగినంతగా ఎదగలేదని కదూ ఆంగ్లమానస పుత్రుల అస్తమానం అభియోగం!  గతంలోకి ఓ సారి తొంగి చూస్తే తెలుస్తుంది.. సమర్థతగల గురుతుల్యుల మార్గదర్శకత్వంలోనైనా సరే! తెలుగుభాష చూపించే వన్నెచిన్నెలు ఎన్నెన్నో!  విస్తుగొల్పేస్తాయి మన తల్లిభాష విన్నాణస్థాయికి!
ఒకటో శతాబ్దిలోనే హాలుడు అచ్చుతెలుగులో ముచ్చటయిన కావ్యసంపదను పోగుచేసాడు. ప్రాచ్యభాషలెన్నింటిలోలాగానే తెలుగుమీదా సంస్కృతభాష ప్రభావం కాస్త అధికంగా ఉందన్న మాట వాస్తవమే కావచ్చు  కాదనేందుకేమీ  లేదు కానీ.. సంస్కృతమూ భారతీయుల సంస్కారానికి దర్పణీయమైనదే కదా!అయితేనేం.. పాలలో నీళ్లలాగా ఏ పరాయిభాష పదాన్నైనా తనలో పొదువుకొనే సమ్మిళితశక్తి తెలుగుభాషకున్నంతగా మరే ఇతర భారతీయభాషకూ లేదన్న ప్రత్యేకత గుర్తించాలి. గర్వించాలి. అన్నం.. పచ్చడి.. బట్టలు.. గుడిసె.. కుండలు.. పలక.. బలపం.. లాంటి ఎన్నో ముచ్చటైన అచ్చుతెలుగు పదాలతో  తెలుగు సంచీ నిండి ఉంది. ఆ వాడుక పదాలనైనా అవసరానికి వాడుకొంటున్నామాఅనవసరమైన ఆంగ్లపదాలతో  తెలుగుసంభాషణల బండిని తోలుకుపోవడమే దొరలతనమనే  భ్రమలో ఉన్నాం!

పొన్నగంటి తెలుగన్న  అచ్చమైన తెలుగు పదాలతో ముచ్చటైన కావ్యరచనకు శ్రీకారం చుట్టేస్తే.. ఆ స్ఫూర్తిని అందుకొని మరింత వడుపుగా ముందడుగులు వేసిన తెలుగు కవిమూర్తులెందరో!  ఆ విశేషాలు అన్నీ కాకపోయినా కొద్దిగానే అయినా తెలుగుబుద్ధికి తోచాలన్న సద్బుద్ధితో మచ్చుక్కి కూచిమంచి  తిమ్మకవి రాసిన అచ్చుతెలుగు రామాయణంలోని  ఈ ముచ్చటైన పద్యం మచ్చుక్కి ముచ్చటించింది!
                                         ***
 -కర్లపాలెం హనుమంతరావు

Wednesday, May 4, 2016

దేవుడే రక్షించాలి!- ఎన్నికలతీరుమీద సరదా వ్యాఖ్యానం

కోటీ బస్టాండులో బస్సు దిగిపోయారు విష్ణుమూర్తి దంపతులు.
గజేంద్రమోక్షంలో ఆ ఏనుగు పాపం వెయ్యేసి ఏళ్లు ఎట్లా పడిందోగానీ పాట్లు ఆ  మడుగులో మొసలితో.. ఒక్క అరగంట మనమీ  బస్సులో ప్రయాణం చేసేసరికి గురుడు గుర్తుకొచ్చాడు దేవీ!’
శంఖుచక్రాలు, గదా కిరీటాలు వెంట తెచ్చుకొమ్మంటే వింటిరి కాదు! కమ్మంగా గరుడు వాహనం చేతికింద పెట్టుకుని.. ఈ డొక్కు గరుడాలో యాత్రలేంటంట! రామావతారంనాటి  కష్టాలు గుర్తుకొచ్చాయి స్వామీ! ఆ రావణాసురుడి పుష్పకవిమానమే  నయం
భక్తులు ఈ మధ్య ప్రద్దానికీ పెద్దగగ్గోలు పెట్టేస్తున్నారు! నిజంగానే ఇబ్బందులు అంత భయంకరంగా ఉంటున్నాయా? అసహనం అతిగా పెరిగి మన సహనాన్ని పరీక్షిస్తున్నారా?’ ఆవటా అని పరీక్షించుకోడానిక్కదా  మనమీ భూలోక పర్యటన పెట్టుకుంది! శంఖుచక్రాలుకిరీటాలు గట్రా పటాటోపాలుంటే జనం పట్టించుకుంటారా! పెద్ద పండుగ అయిపోయినా  పగటివేషగాళ్ళింకా ఊళ్ళోనే తిరుగుతున్నారని ఎగతాళి చేయరూ! జనం మధ్యలో జనం మనుషులు మాదిరి తిరిగితేనే కదా  మనకూ నిజమైన జనం కష్టనష్టాలేవిటో తెలిసొచ్చేదిరామావతారంనాటి ట్రిక్కు. పద.. పోదాం! పెళ్ళినడకలొద్దు!’  
బాగుంది సంబడంసమయమంతా  బస్సు వెయిటింగులోనే గడిచిపోయింది. నన్నంటారేం మధ్యలో! చీకటి పడేలోగా  మనలోకానికి వెళ్ళిపోవాలి బాబూ! పొద్దుగూకితే ఇక్కడ ఆడవాళ్లకి బొత్తిగా రక్షణ లేదని బెదరగొట్టాడు నారదుడు!’ 
ఆదిలక్ష్మి మొత్తుకోళ్ళు పూర్తవనే లేదుపట్టుకోండి! పట్టుకోండి! దొంగవెధవెవడో నా బంగారు గొలుసు ఎత్తుకెళుతున్నాడు! దేవుడా! దేవుడా! ఎక్కడున్నావయ్యా! కాపాడటానికింకా  రావేమయ్యాఅంటూ ఆర్తనాదాలు!
తమరిహ   కార్యరంగంలోగ్గానీ దూక్కపోతే  నా చెవులు ఇక్కడే బద్దలయేట్లున్నాయి!  ముందా భక్తురాలి మొరేంటో ఆలకించండి  మహాప్రభో!’ ‘చెవులు రెండూ  గట్టిగా మూసేసుకుంది మహాలక్ష్మి.
దొంగవెంటబడక తప్పలేదు పరంధాముడుకి!
అలనాడు మాయలేడి వెంటబడ్డం కన్నా మహా కష్టంగా ఉందీ తుంటరి వెంట తరుములాట. త్రేతాయుగంనాటి ఆ సంఘటన జరిగింది కాకులు దూరని కారడవుల్లో! చీమలు దూరని ఆ చిట్టడవులెక్కడ! చీటికి మాటికి  వాహనాలు, గోతులు, గుంతలు, మురిక్కాలవలు, హోర్డింగులు, చిన్నదుకాణాలు,  పోస్టర్లు మేసే దున్నపోతులు..  అడుగడుక్కీ అడ్డొఛ్చే ఈ  సిటీ రోడ్లెక్కడ!
ఎవరో గల్లోలీడరు తాలూకు ఎన్నికల ర్యాలీ అడ్డుతగలటంతో  దొంగ దేవుడికి దొరికిపోయాడు. ‘అన్నా.. అన్నా! నన్నొదిలేయన్నా! కావాలంటే నీ వాటా నీకు తెంపిచ్చేస్తానన్నా!‘ హఠాత్తుగా కాళ్ళు రెండూ పట్టేసుకొన్నాడు దొంగ.  బిత్తరపోయాడు భగవంతుడు!
అన్నా ఎవడ్రా నీకు! నన్నెవరనుకున్నావురా చోరాధమా!’
మన  హెడ్డు పోలీసెంకటసామివే కదన్నా!’
పోలీసును కదురా పోకిరి మానవాధమా! భగవంతుణ్ణి!’
అంటే దేవుడివా! మరీ మంచిదన్నా! ఎప్పట్లా నీ ముడుపు నీవు పుచ్చేసుకొని నన్ను విడిచి పుచ్చేయరాదే! నాకేం! జైలుకెళ్లైనా జబర్దస్తుగా బతికేయగలను! కరువు రోజులు! నా పెళ్లాం పిల్లలే నీ ఎదాన పడి ఆకలి చావులు చస్తారు! ఆలోచించుకో సామీ!’
కష్టాలు ఎవరికైనా ఒక్కటేగా! సంసార పోషణకని ఈ జీవి
 దొంగతనానికి పూనుకుంటే అది  శిక్షించదగ్గ పాపమవుతుందా!’
దేవుడు ధర్మసంకటంలో పడిపోయాడు.
సందుచూసుకొని దొంగ సగంబంగారంతో సహా సందులోకి  ఉడాయించేసాడు!
సగంబంగారమే చూసి ఆడమనిషి వీరంగాలు మొదలపెట్టింది దొంగలు.. దొరలు కుమ్మక్కవడమంటే ఇదే! సగంబంగారం నొక్కేసి పెద్ద ఆపద్భాంధవుడిలా ఆ పోజేమిటయ్యా పెద్దమనిషీ!’ అంటూ పెడబొబ్బలు! అంతకంతకూ  జనం మూగిపోతున్నారు!
 మొగుణ్ణి రక్షించుకోవాల్సిన పతివ్రతా ధర్మం  హఠాత్తుగా గుర్తుకొచ్చింది  లక్ష్మీదేవికి. వంటిమీది బంగారు గొలుసొకటి ఆడమనిషి మీదకు విసిరి  దేవుడి రెక్క పుచ్చుకొని  చక్కా ఉడాయించింది.. పక్కనే ఉన్న బస్తీలోకి.

ఈ ఆపద్భాంచవుల వేషాలు ఇప్పుడంత అవసరమా అనాథరక్షకా! దొరలెవరో.. దొంగలెవరో పోల్చుకోడమే కష్టంగా ఉంది. దొంగలూ లాపాయింట్లు లాగేస్తుంటే ఏ నేరానికని తమరు దుశ్టశిక్షణకు పూనుకోగలరు?  వచ్చిన దారినే  పోదాం పదండి! మన పాలసముద్రంమీద నేను మీ కాళ్లు వత్తుతూ కూర్చుంటాను. మీరు కమ్మంగా కళ్లు మూతలేసుకొని పడుకుందురుగాని స్వామీ!’
మనమేమీ రాజకీయ నాయకులం కాదు.. అవసరాన్ని బట్టి జెండా, ఎజెండా మార్చుకోడం కుదరదు! భూలోకస్వర్గం సృష్టిస్తామని అభయహస్తమిచ్చి   తీరా ఇప్పుడేవో చిన్న అడ్డంకులొచ్చిపడ్డాయని.. చేతులెత్తేయడం ధర్మం కాదు !  సర్వాంతర్యాములం! దుష్టశిక్షణ.. శిష్టరక్షణ మన పర్మినెంటు  మ్యానిఫెస్టో! ఇంకో రెండు మూడు కేసులన్నా చూడకుండా వెనక్కి వెళ్ళిపోతే అమరలోకంలో మన పరువేం కాను!’ మొండిగా ముందుకే కదిలాడు ముకుందుడు!
నీళ్లకుళాయిల దగ్గర ఆడంగులు జుట్టు జుట్టు పట్టుకుని సినీపరిభాషలో ముచ్చట్లాడుకోవడం దేవుడు కంటబడింది. విడదీసేందుకు అడ్డు వెళ్ళిన ఆదిలక్ష్మికీ నడ్డిమీదా వడ్డింపులు తప్పలేదు.  ‘నీళ్లింకారాకముందే  ఈ జగడాలెందుకు తల్లుల్లారా!’  జగన్నాథుడి ఆందోళన.
అవెప్పుడొచ్చి చచ్చేనయ్యా! పోయినసారిట్లాగే ఎన్నికలప్పడు ఒక్క చెంబెడు పడ్డట్లు గుర్తు. మళ్లీ ఎన్నికలొచ్చాయి కాబట్టి ఇంకో చెంబో అరచెంబో వస్తాయని ఆశ! వాటి కోసమే మా మంతనాలుఅందో మహాతల్లి చర్చల సందర్భంగా ఊడిన జుట్టుముడి సవరించుకొంటూ!
భగవానుడు చిరునవ్వుతో కుళాయి ట్యాపుమీద ఇలా తట్టాడో లేదో..  బొళ బొళా  ఇనుపగొట్టంగుండా గంగ ప్రవాహంగా కిందకురికింది. ఆడంగులెవరి మొహాల్లోనూ ఇసుమంతైనా ఆశ్చర్యం లేదు! ఒక నడివయసు సుందరి మాత్రం  అతితెలివి ప్రదర్శించింది, ‘బాగుంది బాబూ మేజిక్కు! ఏ పార్టీ తరుఫున తమ్ముడూ తమరీ గమ్మత్తు ప్రచారం?’
ఏ పార్టీ అయితేనేంలేవే అక్కా! వీళ్ల ఎత్తుభారం ట్రిక్కులు ఎవతెకు తెలీవనీ! పోయినసారిట్లాగే ఎన్నికలప్పుడే   రోజుకో పగటేషం ఏసుకొచ్చి  మాయచేసి చచ్చారు! ఏవయంది చివరికిగెలిచి గద్దెనెక్కేక దేవుళ్లల్లే  నీలుక్కుపోయారు! ప్రతీసారీ మోసపోయేందుకు మేమేమంత ఎతిమతంగా  కనపడుతున్నామా ఏందయ్యా! అందుకోయే అప్పా.. ఆ బిందెతో ఒక్కటిచ్చుకుంటే ముఖం లొత్తపడిపోవాల!’ కొంగుబిగించిన కోమలాంగికి కోరస్ అందిస్తూ మిగతా ఆడంగులూ  పూర్తిగా కార్యాచరణకు పూనుకోకముందే భర్త పరువు  కాపాడుకోవాల్సిన బాధ్యత మరోసారి మహాలక్ష్మి నెత్తిన పడింది.
స్వామిచెయ్యి పుచ్చుకొని  రైతుబజారులోకి పరుగెత్తింది.
రైతుబజారులో కూరగాయలేమీ రాశులు రాశులుగా పోసి లేవు. రకానికి ఒక్కటి.. సంక్రాంతి  బొమ్మలకొలువులో మాదిరి.. ఏ  దుకాణంలో   చూసినా ఒహటే దృశ్యం! నోరెళ్లబెట్టి చూస్తున్నారు  విష్ణుదంపతులిద్దరూ! ఓ బక్కపల్చటి జీవి భుజంమీది బస్తాలోనుంచి  కరెన్సీ కట్టొకటి తీసి దుకాణం మనిషిమీదకు విసిరేసాడు. కొత్తిమేర కట్టొకటి అందుకొని ముక్కుదగ్గర పెట్టుకొని.. ఓహో.. ఒహటే మురిసిపోవడం!
మూడు నిమిషాలైనా కాలేదు.. కట్ట  క్రూరంగా వెనక్కు లాగేసుకునిబోడి వెయ్యి రూపాయలకెంత సేపయ్యా  వాసన్లు చూసేది! ఇట్లాగయితే ఇహ మేం వ్యాపారం చేసి తట్టుకొన్నట్లే! నడు.. నడు..పక్కకు!’ అంటూ  డబ్బుకట్ట పట్టుకు నిలబడ్డ మరో ఆడమనిషితో బేరంలో పడిపోయాడు దుకాణంమనిషి.
భగవంతుడి బుర్ర గిర్రున తిరిగింది. బక్కభక్తుణ్ణి పట్టుకుని విషయం కక్కిస్తేగాని కష్టం గట్టెక్కించే తోవ తోచే అవకాశం లేదు.
కాయగూరలు పండించే భూములన్నీ కాంక్రీటు అడవుల్లా మారి యుగాలయ్యాయయ్యా అమాయక దేవుడా! కొత్తగా కూరలు పండించే అవకాశం బొత్తిగా లేదెక్కడా ఇప్పుడు!  సింథటిక్ టైప్ కాయగూరలు స్వామీ ఇవన్నీ! మీ సృష్టి కర్తలకేమీ అర్థంకావులే ఇవి!  రకానికొకటి చొప్పున చైనానుంచి బోలెడంత పోసి తెప్పస్తారీ దుకాణదారులు. నెల మొదటితారీఖుకదా ఇవాళ!  జీతాలు వచ్చే నా బోటి అదృష్టవంతులం కొందరం ఉన్నంతలో ఇట్లా డబ్బుపోసి కాస్సేపు వాసన్లు  చూసి తరించి పోతుంటాం! సుష్టుగా భోజనం చేసినట్లు అదో తుత్తి!’ బక్కజీవి వివరణ. లక్ష్మమ్మకు తిక్కరేగింది. ’నువ్వొక్కడివే వచ్చి ఇట్లా వాసన్లు చూసుకొని మురిసిపోతే సరిపోతుందా పెద్దమనిషీ! ఇంట్లో పెళ్లాం బిడ్డల సంగతేమీ ఆలోచించద్దా!’
హుఁ! పెళ్లామూ.. పిల్లలూ కూడానా తల్లీ ఈ కరువు రోజుల్లో!’నుదురు బాదుకుంటున్న బక్కజీవిని చూసి భగవంతుడి కడుపు నిజంగానే తరుక్కుపోయింది.
 నిజమైన కష్టనష్టాలు ఎలా ఉంటాయో కళ్లక్కట్టినట్లు కనపడుతున్నాయిప్పుడు.
ఇన్నేసి సొంట్లు పడుతూ ఈ భూలోకాన్నె అంటిపెట్టుకుని ఉండకపోతే..  కమ్మంగా మోక్షం ప్రసాదిస్తాను. స్వర్గం వచ్చెయ్యరాదా బక్కభక్తా!’
అదీ సంగతి! ఇప్పుడర్థమయిందయ్యా మీ ఇద్దరి కత! ఏ పార్టీ తరుఫునంకుల్ ఈ నయా ప్రచారం? ఎన్నికలదాకానేగా  ఈ అమిత ఔదార్యం?  ఎన్ని ఎన్నికల సిరాచుక్కలు చూసింది  స్వామీ ఈ చూపుడువేలు!  పదివేలు పోస్తేనన్నా  ముక్కు దగ్గరకు కొత్తిమేరకట్టొస్తోందిప్పుడు.  మీ హామీలన్నీనిజమేనని నమ్మి మా ఓట్లన్నీ  మీకేసేస్తే! ఏ  మాయదారి పార్టీనో మీది నాకు తెలియదుగానీ.. మోక్షంవంకతో మీ కాపుసారా అమృతమని చెప్పి  అమ్ముకుందామనేగా మెగా ప్రణాళిక! మీ పుణ్యముంటుంది..  బాబ్బాబూ! నన్నిలా వదిలేయండి!’ అంటూ మరో కూరగాయల దుకాణంలోకి దూరిపోయాడా బక్కమనిషి.. ఏ ఉల్లిపొరో వాసన చూసేందుకు!







పొద్దున కోఠీలో దిగింది మీరిద్దరేనా మహాశయా! దేవుళ్లకైతే మాత్రం ఎన్నికల కోడ్లు ఉండవా!  పరమ అమాయకులయ్యా మా ఓటరు ప్రజానీకం! మోక్షం సాకుతో ఎవరివైపు తిప్పాలని మీ పథకాలు?కోడ్ ఉల్లంఘన  కేసు బుక్కయితే బెయిలుకూడా దొరకదు కలియుగం గడిచినా.. తెలుసా!’ చిందులు తొక్కుతున్నాడు ఎదురుగా నిలబడ్డ పెద్దమనిషి.
 ‘ రాంగ్ టైంలో వచ్చినట్లున్నాం బాబూ మేమీ భూలోకానికి! ఎంత దుష్టశిక్షణ.. శిష్టరక్షణకయినా.. ఓ  సమయం సందర్భం ఉంటుందన్న ఇంగితం ఇప్పుడే మాకు వంటబట్టింది! ఏ కోడూ.. ఓడూ అడ్డులేనప్పుడే వచ్చి కాపాడుకొంటాంలే మా భక్తజనావళిని! మమ్మొదిలేయండి మొదటిసారి తప్పుకి!’  శ్రీవారి చెయ్యిపట్టుకొని ముందుకు కదలబోయింది శ్రీలక్ష్మీదేవి.

వచ్చినవాళ్లు ఎలాగూ వచ్చారు. మా పార్టీ అభ్యర్థికో పది ఓట్లు తరుగుపడేట్లున్నాయి. ఇద్దరూ కలిసి ఎనిమిది చేతుల్తో  ముద్దర్లు గుద్దేసి పోండి స్వాములూ! మీ కష్టం ఊరికే ఉంచుకోంలే! మీ కొండ చిరునామా ఏదో  చెబితే గెలిచినాక వచ్చే నిధుల్లో సగం మీ హుండీలోనే సమర్పించుకుంటా!’ అన్నాడు ఎన్నికల్లో నిలబడ్డ ఆ అభ్యర్థి!

దేవుళ్ళిద్దరూ శిలాప్రతిమల్లా చూస్తుండిపోయారు!
హా! ప్రజాస్వామ్యమా! దేవుడే ఇహ నిన్నురక్షించాలి సుమా!


-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాతీయ పత్రిక- మే 2016  సంచిక- లాఫింగ్ గ్యాస్-లో ప్రచురితం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...