Sunday, December 13, 2020

కథా సంపుటాలను గురించి ఇంకాస్త: -కర్లపాలెం హనుమంతరావు




కథా సంపుటాలు ఎవరైనా ఏవైనా ఎంచుకుని వేసుకోవచ్చు.అది వారి వారి అభిరుచుల మేరకు ఉంటుంది.. సహజంగానే! భావస్వాతంత్ర్యాన్ని ప్రశ్మించే హక్కు ఎవరికీ లేదు.. నాతో సహా! నా ఆవేదన ఏమిటి అంటే - అట్లా తయారు చేసుకున్న సంకలనాలకు  'టైమ్' బౌండడ్ టైటిల్స్ (ఏడాది .. దశాబ్ది .. శతాబ్ది .. ( " ఉత్తమ "అంటూ )పెట్టడం సరికాదు  అనే! అందరికీ అన్ని భావజాలాలతో కూడిన సాహిత్యం అందుబాటులో ఉండే అవకాశం  ఉండదు . స్వాతి కథల పాఠకులకు ' కొలిమి ' వంటి ఉత్తమ సాహిత్య పత్రికలోని కథలు  ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలిసేదెట్లా? అదే తరహాలో మరేదైనా ఆధ్యాత్మిక పత్రికలో కూడా మంచి కథలు రావచ్చు.  కాశీభట్లవారు ' ఆరాత్రి'  పేరుతో అద్భుతమైన కథ రాశారు. ఎంత మందికి తెలుసు ? ఎవరికో తెలియకపోవడం ఒక ఎత్తు . ' ఉత్తమ' కథలు శోధిస్తున్నట్లు చెప్పుకునే పెద్దలది ఒక  ఎత్తు. జొన్నవిత్తుల శ్రీ రామచంద్రమూర్తి ఒక్క  'దేవర వలస'  మాత్రమే కాదు .. ఎన్నో 'ఉత్తమ ' కేటగిరీకి చెందిన కథలు రాశారు . కాకతాళీయంగా వారి ' రండి! మళ్లీ పుడదాం ' కథానిక సాహిత్య స్రవంతిలో చదివి ఫోన్ నెంబర్ ని బట్డి పలకరిస్తే చాలా విశేషాలు చెప్పుకొచ్చారు. . ఐదారేళ్ల  కిందట అనుకుంటా .ఆ కథ కోసం వెదికితే ' కథానిలయం'లో కనిపించలేదు, కానీ  మురళీ మోహన్ గారి ' కథా జగత్ ' లో కనిపించింది మరి! ' ఆరాత్రి ' కథ గురించి అయితే ఇప్పటికీ ఎంత మందికి తెలుసునో అనుమానమే ! తమ విలువైన సమయాన్ని , ధనాన్ని , విజ్ఞానాన్ని ఎంతో ఓపికగా నిస్వార్ధంగా వెచ్చించి సంకలనాలను తెచ్చే పెద్దల విజ్ఞతను ప్రశ్మించే పాటి స్థాయి నాకు లేదు.. తెలుసును ! కానీ అవిరామంగా తాము చేస్తున్న సాహిత్య సేవ కేవలం ఏ కొద్ది మంది లబ్దప్రతిష్టతకు కరపత్రంగా మారే పరిస్థితి మీదే చింత అంతా! అల్లం శేషగిరిరావుగారి కధారచనా ప్రజ్ఞ ప్రశ్నకు అతీతమైనది. తెలుసును .కానీ వారి పాత కథ ఒకటి ఈ మధ్యన   ' శ్రీ కనక మహాలక్ష్మి హెయిర్ కటింగ్ సెలూన్ ' ( అనునుంటా) చదివాను. అది కథల కోవలోకే రాని విధంగా ఎందుకు తయారయిందో అర్ధం  కాదు! ఆ సంగతి నిర్మొహమాటంగా ఎవరూ బైటవిశ్లేషణ చేయరు. మంచిని మాత్రమే హైలైట్ చేస్తూ నాసిని బైపాస్ చేసే పక్షపాత విమర్శనాత్మక  ధోరణి వల్ల రచయితకే కాదు .. సాహిత్యానికి మనం న్యాయం చేస్త్నున్నట్లు కాదన్నది నా ఆలోచన. మంచిది  అయితే ఎందుకు మంచి అయిందో -- చెడ్డది  అయితే ఎందుకు చెడిందో సోదహరణంగా, సున్నితంగా , సమర్థవంతంగా  చెప్పగలిగితే సహృదయుడైన  ఏ రచయితా అపార్థం చేసుకోడనే నా భావన. రత్తాలు - రాంబాబు లాంటి నవలలను ఎత్తుకుని మధ్యలోనే అపేసిన రావిశాస్త్రి గారి పంథాను కాస్త సూటిగానే తూర్పారపట్టేరు ఆ రోజుల్లోనే రామకృష్ణ ( హిందూ  - కార్ట్యూనిస్ట్ సురేన్ద్ర గారి తండ్రి ). కథలను మాత్రమే చూడండి. కథకుల పేర్లను పట్టించుకోకండి! లబ్దప్రతిష్టుల ఒకే కథలను పదే పదే ఏకరువు పెట్టే బదులు కొత్తతరంలో కూడా విశిష్టమైన ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నవో విమర్శకులు ఎక్కువ  దృష్టి పెట్టగలిగితే సాహిత్య విమర్శ క్షేత్రం నిత్య పరిపుష్టితంగా ముందుకు సాగేందుకు దోహదించినట్లవుతుందనేదే నా అభిప్రాయం.  పాత భారతులు ఓపికగా తిరగేయగల జిజ్ఞాసులకు విమర్శ దశ,దిశలను గురించి కొంత అవగాహన కలుగుతుంది. నందిని సిధారెడ్డి vs సర్దేశాయి తిరుమల సంవాదం మచ్చుకకు ఒక మంచి ఉదాహరణ. గొప్ప రచయితలు ఎల్లప్పుడూ గొప్ప రచనలే చేస్తారన్న నమ్మకం తెలుగు సాహిత్యంలో మరీ శృతి మించి పెరుగుతోంది. సొంత రచనలు సంపుటులుగా తెచ్చుకుంటూ తెలిసిన వారి చేత ( సాహిత్యం లోతులు  తెలిసిన వారి కన్న వారికే ప్రాధాన్యత ) రాయించుకునే మొహమాటం మార్క్ ' ముందు మాటలు ' పంథాలో కథల ఎంపిక ఎన్ని కోట్ల సార్లు జరిగినా సాహిత్య లక్ష్మి కి చేయించే కొత్త ఆభరణం కాబోదు. చిరంజీవి , బాలకృష్ణే కాదు .. దేవరకొండ, అవసరాల కూడా మంచి కళాకారులే ! ' సి ' క్లాస్ సెంటర్  సినిమాలను కూడా హెలైట్ చేసే  బాణీ సమీక్షలతో .. కథల ఎంపికల్లో కొత్తగా ఒరగబోయే మేలు  ఏమీ లేదు. ఆర్వీఎస్, అద్దేపల్లి , కోడూరి శ్రీ రామమూర్తి , రామకృష్ణ ,తెలకపల్లి రవి వంటి సాహిత్య సమీక్షకుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగాల్సి వుంది. అన్నింటి కన్న ముందు అందరి కన్న ముందు కథను చదివి నాణ్యత పైన తన మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చేసే పాఠకుడి మనోగతం తెర మందుకు రావాల్సి ఉంది. పాఠకుడి అభిరుచికి  అగ్ర తాంబూలం ఇవ్వడమే సముచితం.ఇంకా ఎన్ని దశాబ్దాలపాటు చదువుకున్న పాత కథలను  చదువుకుంటూనే ఉంటాం! 

- కర్లపాలెం హనుమంతరావు 

12 - 12 - 2019 ; బోథెల్ ; US

Saturday, December 12, 2020

యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్- ఒకటే కాదు- కర్లపాలెం హనుమంతరావు

 



యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్ పేర్లు  వినని విద్యార్థులు ఉండరు. హైస్కూల్ చదువులప్పుడు   ఎయిత్ స్టాండర్లో ఇంగ్లీషు టీచర్ పరిచయం చేశారు మాకు ఈ రెండు ప్రక్రియలను.. ఇంగ్లీషు వ్యాకరణంలో భాగంగా! 

రామా కిల్డ్ రావణా- ఏక్టివ్ వాయిస్ అయితే, రావణా వాజ్ కిల్డ్ బై రామా- పాసివ్ వాయిస్ అవుతుంది. మొదటి వాక్యంలో కర్త ప్రమేయం, రెండవ వాక్యంలో కర్మ ఖర్మ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వ్యాకరణ సూత్రాల ప్రకారం ఈ రెండు జస్ట్ వాయిస్  ఛేంజెస్ మాత్రమే. రెండింటి మధ్యలో తేడా ఏమీ లేదు. తేడా లేనప్పుడు మరి ఒకే అర్థం వచ్చే రెండు వాక్యాలు నేర్చుకోవలని ఖర్మమేమిటి? అన్న ధర్మసందేహం ఆ చిన్నతనంలో రాకపోవచ్చు. కానీ, పెరిగి పెద్దవుతున్న క్రమంలో లోకం తీరును తర్కిస్తూన్న కొద్దీ ఇట్లాంటి చిత్రమైన సందేహాలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి. తెలిసున్నవాళ్లెవరైనా సబబైన సమాధానం చెబితే బాగుణ్ణు- అనిపిస్తుంది. ఆ ప్రయత్నం ఫలితమే నాకు  ఈ మధ్య  చదివిన ఒక చిన్ని పొత్తం 'మెనీ క్వశ్చన్స్ - సమ్ ఆన్సర్స్ హానెస్ట్లీ'  చదివిన ఈ 'యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్' లో దొరికిన వివరణ. దానికి ఇది నా కొచ్చిన తెలుగులో అనుకరణ. 

యాక్టివ్ వాయిస్ -పాసివ్ వాయిస్ తరహా క్రియలలో కర్తలను మార్చవలసిన అగత్యం మన తెలుగు వ్యాకరణానికి వాస్తవానికి లేదు. ఇదంతా ఆంగ్ల పరిజ్ఞానం వల్ల మనకు అబ్బిన అతివిజ్ఞానం. సంస్కృత వ్యాకరణంలో కూడా ఈ క్రియాపదాల ప్రమేయాన్ని మార్చే విధానం కనిపిస్తుంది. ఆ సంగతి ప్రస్తుతాంశానికి వర్తించదు కనుక అప్రస్తుతం. 

 అసలు వాక్యాన్ని తిన్నగా పోనీయకుండా, ఈ కర్తలను, వారి జోక్యాన్ని మార్చవలసిన అగత్యం ఏమొచ్చింది? అన్నది మొదటి ప్రశ్న. ఇంగ్లీషు వాడి (అతి)తెలివితేటలన్నీ వాళ్ల వ్యాకరణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయని ఆ పుస్తకం రాసిన మహాదేశ్ పాండే సెలవిస్తారు. ఎంత దాచిపెట్టాలని చూసినా కొన్ని సంగతులు అసంకల్పితంగా అట్లా బైటపడడం ఏ జాతికైనా  సహజమే కదా ఎక్కడైనా? అన్న సందేహం కలగవచ్చు మనకు. అందరి దాచివేతలు, ఇంగ్లీషువాడి దాచివేతలకు మధ్య చాలా తేడా ఉంటుది. చరిత్రను తనకు అనుకూలంగా నమోదు చేసుకునేందుకు ఆంగ్లేయుడు తొక్కని అడ్డదారి లేదు' అన్నది అందరికీ అనుభవైకవేద్యమే కదా!  

ప్రపంచమంతా తమ చెప్పు చేతలలోనే ఉందన్నట్లు ముందు తరాలని నమ్మించాలని ఆంగ్లేయులకు మొదటి  నుంచి ఒక దుర్బుద్ధి కద్దు. అందుకోసమై కొన్ని  సందర్భాలలో ఆ 'హైడింగ్' -దోబూచులాట క్రీడ అవసరం అవుతుంది.  కొన్ని దాచడం, కొన్ని బైటపెట్టడం అన్న ప్రక్రియతోనే ఇంగ్లీషువాడు ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకొంది కూడా.  అందుచేత 'ఇంగ్లీష్ పీపుల్ డిఫీటెడ్ ది వరల్డ్ విత్ హైడ్ అండ్ సీక్ పాలసీ. (ఇది యాక్టివ్ వాయిస్సే)  అనడమే సబబు.  'ది వరల్డ్ వాజ్   డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్ విత్ హైడ్ అండ్ సీక్ పాలసీ.. అనడం  సబబు కాదు. కానీ, మన దేశం విషయం దగ్గరకు వచ్చేసరికి సమాధానం వేరుగా ఇవ్వవలసి ఉంటుంది అంటారు  ఆ పుస్తక రచయిత జవాబు. ఎందుకు ఇలా అంటున్నాడు అన్న సందేహానికి సమాధానం కూడా ఆయనే ఇచ్చాడా పుస్తకంలో.

ఇక్కడ ఉదాహరణకు వరల్డ్ మొత్తాన్ని తీసుకుని గందరగోళం పడే కన్నా మన దేశాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే విషయం మరింత తేటగా అర్థమవుతుంది.

మన మానానికి  మనం మన భారతీయ జీవనసరళిలో సర్దుకుపోయి జీవిస్తున్నకాలంలో ఇంగ్లీషువాడు ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలన్న దుర్భుద్ధితో కొత్తగా కనుకున్న తుపాకీ మందుతో అందరి మీదకు మల్లేనే  మన దేశం మీదా వచ్చిపడ్డాడు. నిజానికి మనం గాని అప్పుడు అప్రమత్తంగా ఉండి స్వాభిమానం కాపాడుకోవాలన్న మంచి బుద్ధితో ఐకమత్యంగా  ఉండుంటే .. కలసి కట్టుగా వాడిని సులభంగా తిప్పికొట్టి వుండేవాళ్లమే. మన భూమి మీద ఎవడో పరాయివాడు ఎంత బలమున్నప్పటికీ ఎక్కడి నుంచో వచ్చి దౌర్జన్యం చేసి లొంగదీసుకోలేడు కదా.. మనలో ఏదో లోపం లేకుంటే! మనలో మనకు ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండుంటే. మన పొరుగువాడు ఎక్కడ పైకొస్తాడోనన్న కుళ్లుతో ఎవడన్నా వచ్చి వాడిని  నాశనం చేసేస్తే కళ్ళు చల్లబడతాయనే మనస్తత్వం లేకుండా ఉండుంటే తెల్లవాడు అయేది .. వాడి జేజమ్మ అయేదీ మనలని మట్టి కరిపించడం కల్ల. కుళ్ళు బుద్ధుల వల్లనే ఇంగ్లీషువాడు ఇక్కడ మనల్ని ఓడించి రాజు మాదిరి పెత్తనం శతాబ్దికి పైడి పెత్తనం చెలాయించగలిగిందనడంలో సందేహం లేదు. దాని ప్రకారం 'ఇంగ్లీష్ పీపుల్ డిఫీటెడ్ అజ్' - అనే కన్నా 'వుయ్ వర్ డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్' అనడమే సబబు అవుతుంది కదా! ఓడడం అనే క్రియకు ప్రధాన ప్రమేయం ఇంగ్లీషువాడి కన్నా మనమే అవడం సూచిస్తుంది 'వుయ్ వర్ డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్' అన్నవాక్యం.  ఇప్పుడైనా స్పష్టంగా అర్థం అయివుండాలి యాక్టివ్ వాయిస్ కు, పాసివ్ వాయిస్ కు మధ్య ఉన్న తేడా.


రామా కిల్డ్ రావణా అనడం సరికాదు. రావణాసురుడే తన పిచ్చి పిచ్చి పనులతో రెచ్చగొట్టి రాముడి చేత చంపబడ్డాడు. కనక, రావణా వాజ్ కిల్డ్ బై రామా - అన్న పాసివ్ వాయిస్సే సబబైన పదం అవుతుందన్నమాట.

 ఇదే సూత్రం రామాయణం దగ్గరే ఆగిపోలేదు.  కలియుగంలో  ఇప్పుడు మనం ఉన్నామనుకుంటున్న  ప్రజాస్వామ్యంలో కూడా వర్తిస్తున్నది అని చెప్పడానికే రచయిత  ఇంత  సుదీర్థ వివరణ ఇచ్చింది. 

చెడ్డ నేతలు వచ్చి మనలను పరిపాలిస్తున్నారు అంటే అందుక్కారణం, ఆ నేతలు కాదు. అట్లాంటి వాళ్లని నేతలుగా తయారుచేసి వాళ్లు మన నెత్తి మీద ఎక్కి పెత్తనం చేయడానికి మనమే కారణం అవుతున్నామన్నది సారాంశం. ప్రజల పాసివ్ వాయిస్సే ప్రజాస్వామ్యం తాలూకు రియల్ స్పిరిట్ యాక్టివ్ వాయిస్ వినపించలేకపోవడానికి ప్రధాన కారణం.

మన దేశ దౌర్భాగ్యం మారాలంటే ముందు ఈ పాసివ్ వాయిస్ తప్పు అని నిరూపించుకోవలసిన అగత్యం అర్జంటుగా గుర్తించవలసి ఉందన్నది  'మెనీ క్వశ్చన్స్ - సమ్ ఆన్సర్స్ హానెస్ట్లీ' రచయిత మహాదేశ్ పాండే జీ    అభిప్రాయం.

-కర్లపాలెం హనుమంతరావు

12, డిసెంబర్, 2020

 

Friday, December 11, 2020

శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - కథానిక ; ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురించిన కథ పై నా పరామర్మ


శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురించిన కథ అప్పటి కాలానికి సంబంధించిన ఆఫీసుల కంప్యూటరైజేషన్ అనే ఇతివృత్తం చుట్టూ తిరుగుతుంది. 

రచయిత కథలో ప్రదర్శించిన ' ప్రీ - కంప్యూటరైజేషన్ ' వాతావరణం మానవ సంబంధాలలోని  తళతళలు కనిపిస్తాయి. ఆఫీసుల యంత్రీకరణ  -  ఆర్థిక పరమైన భారం కుదించుకునే ఉద్దేశంతో యాజమాన్యాల వైపు నుంచి  కొత్త శతాబ్ది ఆరంభంలో మొదలైన ప్రణాళిక. ప్రారంభంలో జాతీయ బ్యాంకులు ఈ విధానం వైపు మొగ్గు చూపాయి. అప్పటికే లెక్కకు మించిన వసూలుగాని మొండి  బకాయిల భారంతో కుంగివున్న బ్యాంకులు రుణగ్రహీతలు ఉన్నత వర్గాలకు చెందిన కారణంగా సక్రమంగా లిటిగేషన్లు నడపించలేక .. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే నిమిత్తం అధిక మొత్తంలో జరిగే సిబ్బంది జీతభత్తేల చెల్లింపులను తగ్గించుకునే నిమిత్తం స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును ప్రవేశపెట్టట౦ జరిగింది. ప్రాథమికంగా సిబ్బంది వర్గాల నుంచి ఎంతో కొంత ప్రతిఘటన  చవిచూసినప్పటికీ యాజమాన్యాలు వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమును దిగ్విజయంగా అమలు చేసాయి. ఈ పరిణామాల అనంతరం సిబ్బందిని తగ్గించుకునే పద్ధతులను దాదాపు అన్ని ప్రభుత్వ ప్రయివేట్ సంస్థలు ముమ్మరం చేసిన నేపథ్యంలో నడిచినదీచంద్రశేఖర్ గారి  ' విశ్వం' కథ. 

రచయిత కథలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది యంత్రీకరణ ముందు కార్యాలయాలలో సిబ్బంది మధ్య నెలకొన్న సానుకూల మానవసంబంధాల పార్శ్వం మాత్రమే. క్రమశిక్షణకు కట్టుబడి సిబ్బంది ఆఫీసుపని ఎట్లా చేసుకుపోవాలని బైటి ప్రపంచం అభిలషిస్తుందో రచయిత విశ్వం అనే ఆదర్శ పాత్ర ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. విశ్వం పనికి కట్టుబడి ఉండడమే  కాకుండా, సాటి ఉద్యోగుల మంచి చెడుల పట్ల చక్కటి 'కన్సర్న్' ఉన్న ఉద్యోగి. పనే అతనికి ప్రాణం . అయినప్పటికీ ఇంటిని నిర్లక్ష్యం చేసే తత్వం కాదు. ఇంటిపట్టునా భార్యా బిడ్డల పట్ల ఎంతో బాధ్యతగా ప్రవర్తించే విశ్వం బంధుమిత్రుల అవసరాలకు ఆదుకునేందుకు అందుబాటులో ఉండే నిమిత్తం ప్రతిభ, అవకాశం దండిగా ఉండీ  పదోన్నతులకు ఎగబడడు. స్వంత పనుల నిమిత్తం ఆఫీసు వనరులు దుర్వినియోగం చేయని ఆ చిరుద్యోగి ఆఫీసు  అవసరాలు తీర్చడం కోసం సొంత డబ్బులు వెచ్చిస్తుంటాడు ! అంతటి మంచి మనసు గల విశ్వం హఠాత్తుగా 'వాలంటరీ రిటైర్ మెంట్' కు దరఖాస్తు చేసుకుని ఆశ్చర్యం కలిగిస్తాడు. అవసర పడినప్పుడు పనిగంటలు మించి ఉచితంగా పనిచేసే విశ్వం మరో ఐదేళ్ల పదవీ కాలం మిగిలున్నా స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకోవాలనికి కారణం అందరూ ఊహించినట్లు పెరిగిన పని వత్తిడి ఒక్కటే కారణం కాదు ;  కార్యాలయంలో కంప్వూటర్ల ముందు కాలం నాటి మంచి వాతావరణం లేకపోవడం .. ఉద్యోగుల మధ్య సున్నితమైన  మానవసంబంధాలు మృగ్యమవడం ! - అంటారు రచయిత! 

ప్రభుత్వ,ప్రయివేట్ కార్యాలయాలలో కంప్యూటర్లు  ప్రవేశించిన అనంతరం కూడా పెరుగుతున్న తాత్సారాలు, పనిచేసే సిల్బుంది దురుసు ప్రవర్తనలు, సరిచేయడానికి వీలులేనంత భారీ మొత్తాలలో దోషాలు వంటివే ఎక్కువగా వినిపించే ఈ కాలంలో రచయిత విశ్వం పాత్ర ద్వారా పాఠకుడికి చెప్పదలుచుకున్న సందేశం ఏమిటి? అన్న సందేహం కథంతా చదివిన పాఠకుడికి కలగడం సహజం. 

ఉద్యోగ విరమణ అనంతరం మానసికంగా కుంగిపోయిన విశ్వం పాత్రలో తిరిగి ఉత్సాహం నెలకొల్పేందుకై  రచయితకు తట్టిన పరిష్కారం మరీ అబ్బురం కలిగిస్తుంది. జీతభత్తేలతో నిమిత్తం  లేకుండా ఆఫీసులో పనిచేసుకునేందుకు విశ్యం పాత్ర అర్జీ పెట్టుకోవడం! యాజమాన్యం అంగీకారం మీద విశ్వం తన పని రాక్షసత్వాన్ని సంతృప్తి పరుచుకోవడం! 


ముక్తాయింపుగా నా ఉద్దేశం ఏవిటంటే కథ మొత్తాన్ని ఒక ఫీల్ గుడ్ వాతావరణంలో నడిపించే ఉద్దేశంతో రచయిత ఎత్తుకున్న కథ ఆ కోణంలో వంద శాతం విజయం సాధించింది. కంప్యూటర్ల ముందు - కంప్యూటర్ల తరువాత అన్నట్లుగా చీలిపోయిన మానవ సంబంధాల వాతావరణంలో ఒక బ్యాంకు ఉద్యోగిగా పని చేసిన నాకు రచయిత అన్నీ పచ్చినిజాలే చెప్పినందుకు అభినందించాలనిపిస్తుంది. 

కానీ, విశ్వం లాంటి ఆదర్శ పాత్రల సృష్టే వాస్తవానికి చాలా దూరంగా ఉందన్నది పాఠకుడిగా నా అభియోగం.

రచయిత బహుశా ' మంచినే బోధించుము ' అన్న సూత్రానికి కట్టుబడి కథ అల్లుదామని ప్రణాళిక వేసుకున్న చందంగా ఉంది. అభినందనీయమే ! కానీ ఆ బోధించే 'మంచి'  అంతిమంగా ఏ  వర్గానికి ఎక్కువ మేలు చేస్తుంది ? అన్న అంశం మీదా రచయిత దృష్టి పెట్టి ఉండవలసింది! 

విశ్వం అనే ఒక మానవీయ  పాత్ర సృష్టి వరకు రచాయిత శ్రీ ' సి. ఎన్. చంద్రశేఖర్ నిశ్చయంగా అభినందనీయులే! 


( శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురితం) 

- కర్లపాలెం హనుమంతరావు 

11, డిసెంబర్, 2020 

బోథెల్ ; వాషింగ్టన్ రాష్ట్రం 

యు ఎస్



ఏ 



Thursday, December 10, 2020

తారుమారయింది ! శ్రీ సి.వి.ఎన్. ప్రసాద్ కథానిక ' అబ్బాయి పెళ్లి ' పై నా పరామర్శ ( ఈనాడు – ఆదివారం సౌజన్యంతో )

 

ఒకానొక కాలంలో ఎదిగిన ఆడపిల్ల నట్టింట తిరుగుతుంటే లక్ష్మీదేవి నర్తిస్తున్నంత ప్రసాదంగా ఉండేది ఇల్లంతా. ఆడపిల్ల అనగానే కన్న వారికి మహా మురిపెంగా ఉండటం సహజమే గదా! ' కంటే కూతుర్నే కనాలి ' పేరుతో ఒక పెద్ద హిట్ మూవీ కూడా తీసారు ప్రముఖ దర్శకుడు దాసరి. గడచిపోయిన తమ బాల్యం నాటి కమనీయమైన పాత ముచ్చట్లన్నీ ఆడబిడ్డ రూపేణా మళ్లీ ఉన్నంతలో తీర్చుకోవచ్చని ఆ ఉల్లాసం. ఎన్ని ఆనందోత్సవాలు సంబరంగా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చివరికి చిదిపి నట్టింట నిత్యం వెలిగించుకోవలసిన ఆ దీపం మరో ఇంటి జీవన జ్యోతిగ తరలిపోవలసిన తరుణం ఒకటి ఎలాగూ తప్పదు ఎప్పటికైనా . బంగారు తల్లులను ఎంత గారాబంతో పెంచుకున్నప్పటికీ మరో ఇంటికి ధారాదత్తం చేయబోమంటే సమాజమే తప్పు పడుతుంది కూడా . ఆడపిల్లను మరో అయ్య చేతిలో పెట్టే ఆ భారతీయ గృహస్థ జీవన విషాద సౌందర్య ఘట్టాన్ని కాళిదాసు నుంచి కాళ్లకూరి వరకు ఎందరో కవి పండితులు తమ తమ పాండితీ ప్రకర్షలతో తీర్చిదిద్ది సదా మననీయం చేసిపోయారు . కళ్యాణ శోభలో ఆఖరి అంశం అప్పగింతలు.. అది సాకారమవడానికి ముందు కొన్ని దశాబ్దాల కిందటి దాకా చాలా పెద్ద క్షోభ కథే నడిచేది; ముఖ్యంగా సగటు మధ్య తరగతి కుటుంబాలలో.
కాళ్లకూరివారు 1923 ప్రాంతాలలో ఈ ఆడపిల్లల పెళ్లిళ్ల ఇబ్బందులనే ఇతివృత్తంగా ఎంచుకొని 'వరవిక్రయం ' అనే నాటకం సృష్టించారు . ఆ రూపకం మొదటి రంగంలోనే కాళింది, కమల అన్న ఇద్దరు చక్కని చుక్కలను కన్న తల్లి భ్రమరాంబ 'కన్య నొక్కరి కొసగి స-ద్గతులు గాంతు/ మనుచు సంతోషపడు కాల - మంతరించి,/ కట్నములు పోయ జాలక - కన్య నేల/ కంటిమా యని వ్యథపడు - కాల మొదవె!'అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఒక పెళ్లి , తత్సంబధమైన కట్న కానుకల చుట్టూతానే ఆ నాటకమంతా నడిచినప్పటికీ నిజానికి ఆడపిల్లకు పిండ దశ నుండే ఎన్నో గండాలు ఎదురుగ నిలబడి ఉండేవి ఇటీవలి కాలం వరకు. ఆయా సామాజిక పరిస్థితులను పొల్లుపోకుండా, ఎక్కడా అతిశయం లేకుండా పూసగుచ్చిన చందంగా వివరించిందా ప్రబోధాత్మక నాటకం. ఆ రూపకంలో చెప్పినట్లు ఆడపిల్లల పెళ్లిళ్ల ఈడు దగ్గర పడ్డప్పటి బట్టి కన్నవాళ్ల గుండెల మీద కుంపట్లు రగలడం మొదలయినట్లే .
ఆ తరువాతా కూతుర్ని కట్టుకున్న అల్లుడు దశమ గ్రహ రూపంలో వాయిదాల పద్ధతిలో అత్తింటి వారిని వేపుకు తినడం ఒక సామాజిక హక్కు రూపంలో స్థిరపడ్డ దుస్థితి కలవరపరుస్తుంది. అందుకే కాళ్లకూరి ఇదే రూపకంలో ఆ ఆడపిల్లల తల్లి నోటితోనే - అప్పిచ్చినవాడితోను, ఇల్లు అద్దెకిచ్చినవాడితోను, జీతమిచ్చి పనిచేయించుకునే యజమానితోను , కులం పేరుతో నిందించేవాడితోను, పన్నులు కట్టించుకునేవాడితోను పిల్లను కట్టుకున్న అల్లుడిని పోల్చి మరీ కచ్చె తీర్చుకున్నారు. ఇన్ని బాధలుంటాయి కాబట్టే ఆ బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా అల్లుళ్లకు హడలి కూతుళ్లను కనడం మానుకొన్నట్లు కవిగారు అంటించినవి చురకలే అయినప్పటికీ, నిత్య జీవితంలో వ్యధకలిగించే పచ్చినిజాల నుంచి పుట్టుకొచ్చినవే ఆ వెటకారాలన్నీ . ఆడదై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టడం మేలు - అన్న నానుడి ఉట్రుడియంగా పుట్టుకురాదు గదా! ' తండ్రులకు గట్న బాధయు- దల్లులకు వియోగ బాధయుదమకు నిం-కొకరి యింటిదాస్యబాధయుగల దరి-ద్రపు టాడు బుట్టువే పుట్టరాదని - బుద్ధి నెంతు' అంటూ పురుషోత్తమరావుగారి చిన్న కూతురు కమల ఆకాలంలో పుట్టింది కాబట్టి అట్లా వేదన పడ్డది. ఇప్పడా ఆవేదన పడే తంతు మగవాడి వైపుకు ఎట్లా మళ్లిందో వాస్తవంగా చిత్రించింది ఈ ' అబ్బాయి పెళ్లి ' కథ యావత్తూ.
అవిద్య, అజ్ఞానం, అబలత్వం, సంప్రదాయం, ఆర్థికపరమైన పరాధీనత, సంఘభయం వంటి ఎన్నో సంకెలలు ఇన్ని శతాబ్దాలుగా స్త్రీ జగత్తు పురోగతికి ప్రతిబంధకాలు అవుతూ వచ్చాయి. ఇప్పుడా పరిస్థితిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మారుతున్న మగవాడి పాత్ర ఆధారంగానే శ్రీ సి.వి.యన్. ప్రసాద్ సృష్టించిన చక్కని చిన్న కథ' అబ్బాయి పెళ్లి ' .
ఆకాశంలో నేనూ సగం - అన్న అంతరంగంలో అణగి పడి ఉన్న స్వాభిమానం బాహ్య ప్రకటన రూపంలో రూపాంతరం చెందే దిశగా స్వతంత్రమైన ఆలోచనలతో నేటి మహిళ అడుగులు ఎంతలా వేగంగా పడుతున్నాయో ప్రపంచం అంతటా ప్రస్తుతం విస్తృతంగా చూస్తున్నాం.
నూతన శతాబ్దిలో అంది వచ్చిన అత్యద్భుతమైన సాంకేతిక జ్ఞానం సాయంతో తన స్థాయి ఏమిటో తెలిసొచ్చి ఇప్పుడిప్పుడే స్పృహలోకొస్తున్న మహిళకు .. అంత: చైతన్య శక్తి కూడా అదే స్థాయిలో వికసిస్తున్న వేళ మునుపెన్నడూ లేనంత పెనువేగంతో మగజాతిని క్రమంగా అధిగమిస్తో ప్రగతి పథం దిశగా స్ఫుత్నిక్కుల వేగంతో దూసుకెళుతున్న వాస్తవం కాదనలేం. ఆ పెనుమార్పుల తాలూకు ప్రభావం సంస్కృతీ సంప్రదాయాలలో సైతం సృష్టంగా కనిపిస్తోంది కూడా . ప్రపంచమంతటా సంభవిస్తోన్న ఈ సాంస్కృతిక పునరుజ్జీవన పరిణామ క్రమానికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకూ మినహాయింపుగా కనిపించక పోవడమే ఈ చిన్నకథ ప్రధాన ఇతివృత్తం.
శీలహననం జరిగితే మానమార్యాదల కోసమై నిశ్శబ్దంగా లోలోపలే శిథిలమయ్యే సర్దుబాటు ధోరణి నుంచి దుర్మార్గం నుంచి రక్షణ కోసం గానూ నిర్భయంగా, బహిరంగంగా, కలసికట్టుగా ఎలుగెత్తి ఉద్యమించే చైతన్యం సంతరించుకునే దశ దాకా ఎదిగింది ఇప్పుడు మగువ. గృహాంతర పాలన నుంచి గ్రహాంతరయానం దాకా ఎదిగిరాగల శక్తి సామర్ధ్యాలలో ఆమె తన అసమాన ప్రతిభా పాటవాలతో ఢీ కొంటున్న వైనం మగజాతిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న మాట కాదనగలమా? ఇన్ని శతాబ్దాలుగా.. పుట్టుక, పెంపకం , బాధ్యతలు , హక్కులు, ఆస్తులు పంపకాల వంటి అనేక ముఖ్య జీవితాంశాలలో సమ భాగస్వామ్య విషయకంగా జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోయేది లేదంటూ అనేక రకాలుగా ఏకకంఠంతో సంకేతాలను అన్ని కార్యక్షేత్రాల నుంచి బలంగా పంపుతున్నది కూడా ఇప్పటి ఇంతి. ఈ యుగసంధిలో జరుగుతున్న లైంగిక పాత్రల నిర్వహణ తారుమారులో భాగంగానే గత రెండు దశాబ్దాల బట్టి మనదేశంలోనూ మహిళల పరంగా పొడసూపుతున్న పెనుమార్పులు మగలోకపు ఊహలకు ఇప్పటి వరకు అందకుండా మును ముందుకు సాగుతునే ఉన్నాయి .
అర్ధిక క్షేత్రంలో స్వాతంత్ర్యం సముపార్జించుకున్న అనంతరం .. మునుపటి మానసిక బలహీనతలనూ తొలగ తోసుకునే తీవ్ర ప్రయాసలో నేటి మహిళ వివాహబంధం వరకు వచ్చేయడం సమాజంలో స్పష్టంగా కనిపించే విస్తుగొలిపే మార్పు .
నిన్నటిదాకా పెళ్లిని ఒక క్రీడగా భావించే లోకంలో మగవాడిదే మొదటి ఎత్తు-గా ఉండటం చూసాం. ఆ తరహా వ్యవస్థకు అలవాటూ పడిపోయాం. ఆ భావనకు ఇప్పుడు కాలం చెల్లిందంటుంది ఈ ' అబ్బాయి పెళ్లి ' కథ . నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కాదనుకుంటే మధ్యలో తుంచుకోవడం, మనసు పుడితే మరో భాగస్వామిని అదనంగా ఉంచుకోవడం, యధేచ్ఛగా కోరిక తీర్చుకునే హక్కును ఇదేమని నిలదీసే స్వాభిమానితో బంధం తెంచుకోవడం వగైరా వికృత పోకడలన్ని గతంలో మాదిరి మగవాడికి పుట్టుకతో అబ్బిన హక్కులు కావిప్పుడు. పెళ్లి బజారులో గతం మాదిరి మగాడిప్పుడు అదనపు కట్న కానుకలు, పెట్టు పోతలు పేరుతో చెట్టుసురులకు దిగడం కుదరదు. సరికదా అసలు డౌరీ పేరెత్తే సాహసమే మగపెళ్లివారి నుంచి కనిపించడం అరుదైన సందర్భాలు అబ్బురం కలిగిస్తున్న మాట వాస్తవం .
పెళ్లిచూపుల వంకతో కాబోయే ఇంటి కోడళ్లకు కాదీ కాలంలో శల్య పరీక్షలు. . మగవాడికి ఆ శిక్షలు! అతగాడి నాలుగంకెల జీతానికి గతంలో మాదిరి క్యూలు కట్టడం లేదీకాలపు ఆడపిల్లలు ఎక్కడా ! ఐదొందల నోటొకటి వదిలితే చాలు .. ఆరేడు రకాల డిష్టులతో అప్పటికప్పుడు ఏ డీలక్సు రెస్టరెంటో లగ్జోరియస్ లంచ్ ప్యాక్ చిటికేసే లోపు డెలివరీ చేసే కాలంలో .. వంటొచ్చా ?అని ప్రశ్నేసే మగాడిని అసలు మగాడుగా ఒప్పుకునే మూడ్ లోనే ఉండటం లేదీ మోడరన్ వుడ్ బి బ్రైడ్ . చాకలి పద్దుల చదువులు, హారుమొనీ మెట్టు రాగాలు, అత్తగారి కాళ్లొత్తే వినయాలు, మామగారికి కళ్లెదుట పడలేని బిడియాలు .. టైపు ఆడపిల్లలను కలలోనైనా ఉహించడం కుదరదు. ఆస్తిపాస్తులుండటమే కాదు.. చేసుకునే పిల్లకు తోబుట్టువు లెవరూ ఉండని సంబంధాలకై ఆనాడు మగపెళ్లివాళ్లు వెంపర్లాడినట్లే .. తల్లిదండ్రులు దగ్గరుండని పెళ్లి కొడుకుల కోసం ఆడపిల్లలు ఇప్పుడు ఆరాట పడుతున్నారు! ఆ కధా కమామిషు అంతా సూచ్యార్థం శైలిలో మినోదం ముదరకుండా సహజభాషలో చెప్పుకుపోతుందీ ప్రసాద్ గారి 'అబ్బాయి పెళ్లి ' కథ.
కాలం తన మాయాజాలంతో సంసారమనే నాటకంలో పాత్రల నైజం ఎంతవింతగా తిరగరాసేస్తుందో ఆకళింపు చేసుకొనేందుకైనా ఈనాడు ఆదివారం ప్రత్యేక అమబంధం 30, ఆగష్టు, 2010లో ప్రచరించిన శ్రీ సి.వి.ఎన్. ప్రసాద్ కథానిక ' అబ్బాయి పెళ్లి ' చదివితీరాలి.
పెళ్లికెదిగిన మగపిల్లలు కళ్ల ముందు తిరిగే కన్నవారు చదివితే ఎంతో సహజంగా ఉంది అని నిట్టూర్పు విడుస్తారు. ఆ తరహా గుండెల మీద కుంపట్లు రగలుతుండని అదృష్టవంతులు చదివితే మాత్రం ' మరీ అతిశయంగా ఉంది ' అని పెదవి విరవడమూ ఖాయమే ..
పదేళ్ల కిందటి నాకులాగే!
ముక్తాయింపు: కాలంలో జరిగే మార్పులను యధోచితంగా కళా నైపుణ్యాలకు కొదువ లేకుండా నమోదు చేసే సాహిత్యంలోని ఏ ప్రక్రియ రచన అయినా ఆ ప్రక్రియ వరకు ఉత్తమ శ్రేణిలో కుదురుకున్నట్లే లెక్క. ఆ కొలమానం ప్రకారం సి.వి. ఎన్. ప్రసాద్ గారి ఈ ' అబ్బాయి పెళ్లి ' కథానికకు గుర్తుంచుకోదగిన కథల జాబితాలో స్థానం దక్కాలి న్యాయంగా ! అవకాశం ఉండీ హాస్యం కోసం ఎక్కడా అతిశయాలంకార ప్రలోభాలకు లొంగని నిగ్రహ శిల్పం కథను పాఠకుడికి మరింత దగ్గరకు చేరుస్తుంది. శ్రీ ప్రసాద్ ఇందుకు ప్రత్యేకంగా అభినందనీయులు.
☘️
రచయితకు మనసారా అభినందనలు
🙏🏻🙏🏻👏👏
- కర్లపాలెం హనుమంతరావు
08 - 12 - 2020
బోథెల్ ; యూయస్ఏ






Monday, December 7, 2020

ఓ డోలోడు - కథానిక – రచయిత పేరు తెలియదు)- సేకరణ ః కర్లపాలెం హనుమంతరావు

 చేస్తున్న పని ఆపి కాలుతున్న చుట్టను ఒక దమ్ము లాగి మళ్లా పక్కనే పెట్టాడు సుబ్బులు. నడుముకు వారుతో తగిలించుకున్న వంకీతో డోలుకున్న వారు పట్టెల్ని మరోమారు లాగాడు. నిలబెట్టుకున డోలు కుడి మూతను నాలుగైదు సార్లు తట్టి  శృతి చూసుకున్నాడు. మళ్లా చుట్ట చేతిలోకి తీసుకుని రెండు మార్లు దమ్ములాగాడు. చుట్ట అయిపోవడంతో దూరంగా విసిరేశాడు. అదెళ్లి టెంకాయ చెట్టు మొదట్లో పడి అక్కడున్న నీళ్ల తడికి సుయ్యిమంది.

డోలును ఎడం మూత పైకి వచ్చేటట్లు తిప్పాడు. డోలు పుల్ల తీసుకుని దాని మీదా కొట్టి చూశాడు. అనుకున్నట్లు మోగలేదేమో 'ఛీ! దీనమ్మ' అనుకుంటూ డోలును మళ్లీ వంకీతో లాగడం మొదలుపెట్టాడు. కుడి మూత రంధ్రం నుంచి డోలు కర్ర మీదుగా ఎడం మూత రంధ్రంలోకి దూర్చుతూ డోలు కర్ర పట్టీ చుట్టూ ఉన్న వారుపట్టీలను లూజు లేకుండా బిర్రుగా లాగాడు.

సుబ్బులకు గొంతు కింద పోస్తున్న చెమట గుండె మీద నుంచి నడుం వరకు కారుతోంది. నల్లటి శరీరానికి నిమ్మచెట్ల మీద నుంచి వచ్చే గాలి తగలడంతో హాయిగా అనిపించింది. పక్కనే ఉన్న పై కండువాతో శరీరాన్ని తుడుచుకున్నాడు.

అలా నాలుగు సార్లు శృతి చూసుకున్నాక మిగిలిన వారును డోలు అడ్డకర్రల పట్టీగా నాలుగైదు వరుసలు చుట్టాడు. సొప్ప తీసుకుని ఎడం మూత కడెంలోకి చొచ్చుకొనొచ్చిన పిచ్చులపై ఆనించి గుండ్రాయితో తడుతూ పిచ్చుల్ని ఇంకా లోపలికి కొట్టాడు. ఎండ తగిలేటట్టు ముందు రోజు తయారు చేసి ఏలాడ గట్టిన బొట్టెల్ని తీసుకొనొచ్చాడు.  మంగలి పొదిలో నుంచి గోరుగాలు తీసుకుని గోగుపుల్లల చుట్టున్న బొట్టెల్ని జాగ్రత్తగా గుండ్రంగా కోసి వాటి నుంచి బైటికి తీశాడు. వాటిని ఎడం చేతి బొటన వేలుకు మినహా అన్ని వేళ్లకు పెట్టుకున్నాడు. గోతం పట్టని సరి చేసి డోలు కొట్టడం మొదలు పెట్టాడు.. పాల వరసల నుంచి .

యుద్ధానికి సిధమయ్యే సైనికుడిలా.. కళను సృష్టించబోయే ముందు కళాకారుడి ఆత్మనివేదనలా.. తదేక దృష్టితో సుబ్బులు దానిలో మునిగిపోయాడు.

ఇంటర్మీడియెట్ చదువుతున్న సుబ్బులు చిన్నకొడుకు కాలేజీ ఫీజుల కోసం కావలి నుంచి వచ్చాడు. సిటికేసర చెట్టు కింద, పొయ్యిలోకి కరతమ్మ పుల్లల్ల్ని చిదుగులుగా కొడుతూ తండ్రి వాయించే డోలుకు తలూపుతున్నాడు.

సుబ్బులు కూతురు అత్తగారింటి నుంచి వచ్చుంది. మళ్లా పంపాలంటే చీరన్నా పెట్టాల్సిందే. దారి ఖర్చులూ ఇవ్వాల్సిందే.

సాయబ్బుల పీర్ల పండక్కి వాయిస్తే ఈ దఫాకి మీ ఇద్దరి గొడవా వదిలినట్లే అన్నాడు వారం రోజుల కిందట సుబ్బులు. కానీ ప్రతి ఏడాదిలా ఈ ఏడు పీర్ల పండగ మేళం సుబ్బులుకు ఊరకే రాలేదు. పెద్ద తిరకాసే జరిగింది.

***

ఆ రోజు సుబ్బులు బస్టాండులో ఉన్నాడు. ఎవరో వస్తే గడ్డం చేస్తున్నాడు. సాయబ్బులపాలెం నుంచి మదర్సా హడావుడిగా వచ్చాడు. 'అరేయ్ సుబ్బులూ! ఈసారి పీర్ల పండక్కి మేళాల కోసం పెద్ద రబస జరిగిందిరా! అన్ని సావిళ్లోళ్ళు ఈసారి పక్కూరి నుంచి పిలిపిద్దాం'అన్నారు. 'కొత్తపట్నం, అలకురపాటి నుంచి తెప్పిద్దాం'అన్నారు.

గడ్డం చేస్తున్నోడల్లా ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు సుబ్బులు. 'అవున్రా! మనూరోళ్ల కంటే కొత్తపట్నమోళ్ళు బాగా వాయిస్తన్నారని అంటున్నారు. ఎంత చెప్పినా వింటన్లే!'

'అదేందిరా మదర్సా! మీకు ఒడుగులైనా.. గిడుగులైనా మేమే కదరా వచ్చేది. చిన్నప్పట్నుంచి కలసి మెలసి తిరిగాం. గడ్డమైనా.. క్రాఫైనా ఎంతిస్తే అంతే తీసుకున్నాం. మన సాయబ్బులే.. మనోళ్లే.. అనుకున్నాం. ఇప్పుడేందిరా.. ఇదీ!' అన్నాడు.

'అవున్రా! నేనూ అదే చెప్పా! కానీ .. కుర్రోళ్లు .. ఎదిగొఛ్చారు కదా! ఇంటంలా! మిగతా మూడు సావిళ్లు మా చేయి దాటిపోయింది. మా సావిడి మేళం మాత్రం సుబ్బులన్నే అని గట్టిగా చెప్పొచ్చారా!' అన్నాడు.

సాయిబులపాలెం పెద్దలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆ ఒక్క సావిడీ ఒప్పుకుని బయానా తీసుకున్నాడు సుబ్బులు.

అన్నిసావిళ్ల పని ఒప్పుకుని పక్కూళ్ల నుంచి మేళగాళ్లను తెచ్చి పని జరిపిస్తే కాస్త డబ్బు మిగులుతుంది. అది అందరికి తెలిసిందే. పక్కూరోళ్లను మేళానికి పిలిచినా అట్లాగే చేస్తారు. కానీ ఈసారి సుబ్బులుకు ఆ అవకాశం లేదు. అదే అలవాటుగా మారితే ఈ ఊరు మంగలోళ్ల పరిస్థితి ఏమిటి? మేళాలన్నీ పక్కూరికి పోతే ఈ ఊరి మీద పట్టు పక్కూరికి పోద్ది. అది జరక్కూడదంటే పక్కూరోళ్లకంటే ఈ ఊరే మేలనిపించాలి. తమ సత్తా ఏంటో పీర్ల పండక్కి చూపించాలి అనుకున్నాడు.

గొల్లోళ్ల వెంకన్న దగ్గరికెళ్లి మంచి మేక తోలు తెచ్చి ఆరకొట్టాడు. డోలు కున్న మూతలు విప్పి నానేసి తోలు విప్పాడు. ఆరగొట్టిన కొత్తతోలు కడాలు సైజుకు తగ్గట్లు గోరుగాలుతో కోశాడు. ఎడం మూత రెప్ప కోసం మంచిగా తోల్ని సిద్ధం చేసుకున్నాడు. రెండు రోజులు బక్కెట్లో నానేశాడు. మూడు పూట్ల తొక్కి తోల్ని పొదగడానికి సిద్ధం చేశాడు. చిన్నకొడుకు ఊర్రాముల చిల్లరకొట్టు ఎదురుగా చింతిత్తులు ఏరుకొచ్చాడు. గుండ్రాయితో చిన్నచిన్న ముక్కలుగా చితక్కొట్టి నానేశాడు. సుబ్బులు పెళ్లాం వాటిని మెత్తగా రుబ్బి, వండి, మైదా కలిపి బందన తయారుచేసింది.

సుబ్బులు కడేలుకు బందన పూసి తోలు అతికించాడు. గట్టిగా అతుక్కునేందుకు బిరుసు గుడ్డతో అదిమాడు. ఎడం మూత పొదగడానికి వల్లూరు జగ్గయ్య దగ్గరికెళ్లి మిషను తెచ్చాడు. కడానికి తోలు అతికించి బాగా అత్తుకునేందుకు మిషను బిగించాడు. ఆరపెట్టాడు. రెండు మూతలు ఆరాక చింతగింజలు పెట్టి మధ్య దూరం సమానంగా ఉండేటట్లు చూసి కళ్లు(రంధ్రాలు) కోశాడు. అక్కడ తోలు నానడానికి గుడ్డపీలికతో వాటిని తడుపుతూ రోజంతా ఉంచాడు. ఎడం మూత ఆరాక దానిపై రెప్పను అతికించి మళ్లా పొదిగాడు. డోలు కర్రకు గుడ్డతో నూనె పూసి బాగా సిద్ధం చేసుకున్నాడు. కుడి మూత మధ్యలో నల్లటి బూడిదరాశాడు.

 

సుబ్బులు చిన్నకొడుకు, కూతురు కలసి ఇంట్లో పాత కద్దరు గుడ్డను అంగుళం వెడల్పు ఉండేటట్లుగా పేలికలు పేలికలుగా చించారు. రెండు గోగుపుల్లల్ని జానెడంతవి నరికి సిద్ధంచేసుకున్నారు. సిమెంటు, అన్నం కలిపి మెత్తగా నూరారు. గుడ్డలేలికలకు దానిని పూసి గోగుపుల్లలకి రెండు కొసల దానిని అంటించారు.  వాట్ని ఎండలో ఆరగట్టారు. అవి ఎండాక గోగుపుల్లల్నుంచి విడదీస్తే బొట్టెలు అవుతాయి.

ఆ రోజు సుబ్బులు పొద్దున్నె అన్నిట్నీ ముందేసుకుని కూర్చున్నాడు. డోలు కర్రని నిలబెట్టి కింద కుడి మూత, పైన ఎడం మూత పెట్టి రంధ్రాల గుండా వారు ఎక్కించాడు. మూతలు బిర్రుగా ఉండి, శృతి రావడం కోసం వారు పట్టీలకు వంకీ తగిలించి లాగుతున్నాడు.

లాగుతున్నాడే కానీ, పక్కురోళ్ల గురించి, వాళ్ల డోళ్ల గురించి, సన్నాయిల గురించి,వాళ్లు వాయించే విధానం గురించి ఆలోచిస్తున్నాడు. అంతే కాదు.. సొంతూర్లో పరువు నిలబడాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు.

వాయించడం అయిపోయాక, అన్నిట్నీ నెమరు వేసుకున్నాక, డోల్ని మరోసారి సరిచూసుకుని పట్టెడ తగిలించాడు. గుడ్డ కప్పాడు. ఇంట్లో దేవుడి మూలనున్న పీటపై పెట్టొచ్చి ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడు. నిప్పెట్టె తీసి చుట్ట అంటించాడు. దమ్ములాగుతూ మార్కెట్లో ఉన్న పంచలోకి వెళ్లి కూర్చున్నాడు.

***

సుబ్బులూ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. పెద్దోడు సన్నాయి, రెండోవాడు .. అదే సుబ్బులు, మూడో వాడు మళ్లీ సన్నాయి, నాలుగోవాడు మళ్లీ డోలు.. వాయిస్తారు. వాళ్లయ్య చస్తూ చస్తూ ఊరిని, వృత్తిని చూపించిపొయ్యాడు. పక్కూరు మంగలోళ్లకు ఈ నలుగురు అన్నదమ్ములంటే హడల్. కాని, డబ్బులు బాగా ఇస్తారని ఈ కొత్తపట్నపోళ్లు, అలకురపోటోళ్లు ఒప్పుకున్నారు. ఈ విషయం నలుగురు అన్నదమ్ములకు తెలుసు. అందుకే వాళ్లు సన్నాయిల్ని కూడా గట్టిగా సిద్ధంచేసుకున్నారు.

పీర్ల పండగ రానే వచ్చింది. మొదట్రోజు సావిట్లోంచి పీర్లను దించడం. మామూలుగానే సాగిపోయింది. సుబ్బులు ఆ ఊరు మంగలోళ్లకున్న పీరు దగ్గరకు వెళ్లి 'మా పరువు నీవే కాపాడాల' అని వేడుకున్నాడు. పెళ్లాంతో కలిసి బొరుగులు, వేగించిన శెనగపప్పు, బెల్లం పీర్లకు ఇచ్చొచ్చాడు. తర్వాతి రోజు గుండం తొక్కడం కూడా అయింది. ఆ తర్వాతి రోజే పీర్ల ఊరేగింపు.

ఆ రాత్రి సాయిబులపాలెంలో ప్రతి సావిడి దగ్గర సినిమాలు, నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులు.. పోటీపడి వేస్తారు. వేకువ జాము మూణ్ణాలుగ్గంటలకు పీర్లు ఊరు చుట్టూ తిరుగుతాయి. ట్రాక్టర్ల మీద డూపు హీరోలు, హీరోయిన్లు ఎగురుతుంటే జనాలకు సందడే సందడి.

పదిగంటలకల్లా పీర్లు ఊరు చుట్టూ తిరుగుతుంటే నీళ్లతో వారు పోసేవాళ్లు పోస్తూనేవున్నారు. అందరు ఇళ్ల నుంచి బయటికొచ్చి చూస్తున్నారు. సాయిబుల పిల్లలు ఎగురుతుంటే దానికి అనుగుణంగా మేళం మోగుతోంది.

పీర్ల ఊరేగింపు తిరుగుతూ తిరుగుతూ ఊరి మధ్యలో ఉన్న రాంసామి మేడ దగ్గరి కొచ్చింది. పీర్లు అన్నీ వరుసగా నిలబడ్డాయి.  ఏ పీరు కాడున్న మేళగాళ్లు ఆ పీరు దగ్గర వాయిస్తున్నారు. సన్నాయిలు శృతిమించి మోగుతున్నాయి. జనాలందరూ విరగబడి చూస్తున్నారు, ఎగిరేవాళ్లు ఎగురుతూనే ఉన్నారు.

అప్పటికే మేళగాళ్లకి మందు సరఫరా అయింది. సుబ్బులుకి, వాళ్లన్నకు మందు అలవాటు లేదు. మిగిలిన పీర్లకాడ వాళ్లు తాగిన మైకంలో వాయిస్తున్నారు. అలకురపాటి ఎంకట్నర్సు రేపు చూసుకుందాం అన్నట్లు సుబ్బుల్ని చూసి తలెగరేశాడు. కొత్తపట్నం సీను సన్నాయిని గుండ్రంగా తిప్పుతూ సై అన్నట్లు చూశాడు. సుబ్బులుకు కోపం నసాళానికి అంటింది.' నా కొడుకులు వాయించేది తక్కువ.. ఊగేది ఎక్కువ' అనుకున్నాడు. నిటారుగా నిలబడి డోలు వాయిస్తున్నాడు. అట్లా పోటీ రంజుగా సాగుతుంటే 'టైం లేదు .. టైం లేదు.. పదండి.. పదండి' అంటూ సాయిబుల్లోని పెద్దలు పీర్లని ముందుకు కదిలించారు.

మరుసటి రోజు గుమ్మటాలు. అదే చివర్రోజు. గుమ్మటాలన్నీ ఊర్లోని పెద్ద బజారుగుండా సముద్రానికి వెళతాయి. అక్కడే వాట్ని కలిపేస్తారు.

ఆరు గంటలకల్లా గుమ్మటాలు సాయిబులపాలెంలో బైలుదేరాయి. ఒక్కో గుమ్మటం దగ్గర జనాలు ఇసకేస్తె రాలనంతగా ఉన్నారు. ఒకచోట ఒకరు చేతిరుమాలును పళ్ల మధ్య బిగించి నాగిని నృత్యం చేస్తుంటే, మరోచోట ఇంకోడు పులి డ్యాన్స్! ఇలా అన్ని గుమ్మటాల దగ్గరా కోలాహలం. ఊరు ఊరంతా కులం, మతం, ఆడ, మగ భేదాల్లేకుండా ల గుమ్మటాల చుట్టూరా ఉంది.

గుమ్మటాలన్నీ జాలమ్మ చెట్టు దగ్గరకు వచ్చాయి. అక్కడ బజారు పెద్దదిగా ఉంటుంది. నాలుగు గుమ్మటాలని వరసగా నిలబెట్టారు. వాటి ముందు మేళగాళ్లు.. వాళ్ల ముందు ఎగిరేవాళ్లు. పోటీ ప్రారంభమయింది అనుకున్నారు చూసేవాళ్లంతా. అప్పటికే వాయించేవాళ్లు తాగున్నారు. ఒక్కొక్కరు మోకాలి దండేసి డోలు కొడుతున్నారు. సన్నాయిని గాల్లోకి తిప్పుతు ఆకాశం కేసి చూస్తూ ఊదుతున్నారు.   రాగాలు, తాళాలు మారుమోగుతున్నాయి. ఎగిరేవాళ్లకు అనుగుణంగా వాయిస్తున్నారు.

సుబ్బులు నిశ్చలంగా నిలబడి ఒక మౌనిలా వాయిస్తున్నాడు. తాళాలన్నీ శృతికి అనుగుణంగా పడుతున్నాయి.

ఎంకట్నర్సు సుబ్బులు వంక చూసి కొత్త తాళం అందుకున్నాడు. అక్కడి సన్నాయిలూ అందుకు అనుగుణంగా మారిపోయాయి. సుబ్బులు కూడా కొత్తతాళం ఎన్నుకున్నాడు. కొత్త కళాసృజన ప్రారంభమయింది.

సుబ్బులు దుమికే జలపాతంలా మారిపోయాడు. జనాలందరూ సుబ్బులు డోలు చూడ్రా! ఎట్టా మోగుతుందో! అంటూ ఆ గుమ్మటం దగ్గరకు వచ్చేస్తున్నారు. వస్తూ వస్తూనే ఊగిపోతూ ఎగురుతున్నారు. డోలు గట్టిగా మోగుతోంది. మోగుతూ మోగుతూ ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. డోలు కుడి మూత టప్పుమని పగిలిపోయింది. సుబ్బులుఉ నిశ్చేష్టుడైపోయాడు. ముఖాన నెత్తుటి చుక్క లేకుండా పోయింది. గుండె ఆగిపోయిందనుకున్నాడు. యుద్ధం మధ్యలో అస్త్రాలు కోల్పోయిన సైనికుడిలా నిలబడిపోయాడు.

అంతలో సుబ్బులు తమ్ముడు వెంకటేశ్వర్లు తన మెడలో ఉన్న డోలు తీసి సుబ్బులు మెడలో వేశాడు.'నువ్వు ఒక్కడివి చాలు. వాయించన్నా!'అన్నాడు. పక్కనే ఉన్న సుబ్బులు అన్న సన్నాయిలో కొత్తరాగాన్ని ఎత్తుకున్నాడు. సుబ్బులు తనను తాను నిలదొక్కుకున్నాడు. ఎడం మూతపై వేళ్లను సప్తస్వరాలుగా కదిలించాడు. కుడి మూత మీద పుల్లను దానికి తగ్గట్లుగా నర్తింపచేశాడు. ఇప్పుడు మంగలి సుబ్బులు సుబ్బుల్లా లేడు. మ్స్రొ సృష్టి చేస్తోన్న బ్రహ్మలా మారిపోయాడు.

ఆ ధ్వని అందరి మనసుల్లోకి చొచ్చుకునిపోతోంది. వాళ్లల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. అందరూ మంత్రముగ్ధుల్లా మారిపోయారు. అన్ని గుమ్మటాల నుంచి జనాలు వచ్చి చూస్తున్నారు. ఎగిరేవాళ్లు కూడా నిశ్చలంగా నిలబడిపోయారు. ఒక తపస్సమాధిలో ఉన్నట్లు సుబ్బులు వాయిస్తూనే ఉన్నాడు.

నిజానికి సుబ్బులు డోలు నేర్చుకోలేదు. తండ్రి వాయిస్తుంటే చూసి నేర్చుకున్నాడు. జవజీవాల్లో నిక్షిప్తమైన కళకు,  నేర్చుకున్న కళకు ఉన్న తేడా సుబ్బుల్ని చూస్తే తెలుస్తుంది.

వెంటనే వెంకట్నర్సు డోలు పక్కన పడేసి సుబ్బులు ముందు కొచ్చి 'అన్నా..' అన్నాడు. మిగతా గుమ్మటాల దగ్గర ఉన్న సాయిబులందరూ కూడా సుబ్బులు దగ్గర కొచ్చారు. మేళం రసపట్టులో ఉన్నప్పుడు ఎదుటివాడు డోలు మీద నుంచి పుల్ల తీయడమే ఒక పెద్ద అవమానం. కానీ, వెంకట్నర్సు 'అన్నా,.. మీ ఊరు మీదే!మా ఊరు మా ఊరే!' అన్నాడు ఉద్వేగంగా.

తర్వాత గుమ్మటాలు నెమ్మదిగా సముద్రం వైపు కదిలాయి. అప్పటికే సమయం రాత్రి తొమ్మిదయింది. సముద్రం నిశ్శబ్దంగా వెన్నెట్లో మెరుస్తోంది.

రచయిత (పేరు - తెలియదు) ;

(ఆంధ్రజ్యోతి ఆదివారం 16,మే, 2010 సంచికలో ప్రచురితం)

సెల్: 9848425039

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

07, 12 డిసెంబర్, 2020






*** 

 

 

Saturday, December 5, 2020

వేంపల్లి షరీఫ్ కథ ' పర్దా - నా పరామర్శ - కర్లపాలెం హనుమంతరావు





ఇప్పుడే చదివాను . ముగిసిన తరువాత మనసంతా అదోలా చేదయిపోయింది . 
మనిషి జీవితంలోని  కష్టసుఖాలకు  తిండి, బట్ట, తలదాచుకునే  ఇంత నీడ .. ఇవి కరవు అవడమే కారణమనుకుంటాం సాధారణంగా. నిజమే ఇవి ప్రాథమిక అవసరాలే .. తీరనప్పుడు జీవితం దు:ఖ  భాజనం తప్పక అవుతుంది. ఇవన్నీ ఆర్థికంతో ముడిపెట్టుకుని ఉన్న అంశాలు . చాలినంత డబ్బు సమకూరితే ఇక మనిషికి  ఏ తరహా కష్టాలు  ఉండవు. కష్టాలు ఉండనంత మాత్రాన బతుకంతా సుఖమయమయిపోతుందనా అర్ధం? జీవితం ఒక ముడి పదార్థం మాత్రమే అయితే, లాజిక్ ప్రకారం  నిజవే అనిపిస్తుంది. అదే నిజమైతే మరి  బాగా డబ్బుండి ప్రాథమిక అవసరాలు అన్నీ తీరిపోయే వారికి ఇక ఏ కష్టాలు ఉండకూడదు. . కదా మరి ? కానీ వాస్తవ జీవితాలు ఆ విధంగా లేవే!  అన్నీ సదుపాయాలు సమకూరి బైటికి సలక్షణంగా జీవితం గడుపుతున్నట్లు కనిపించేవాళ్లూ లోలోన ఏవో కుంగుబాటుల్లో .. తాము పరిష్కరించుకోలేని తాము ఏర్పరుచుకోని కట్టుబాటుల మధ్య ఇరుక్కుపోయి బైటికి రాలేక... వచ్చే మార్గం తెలేక .. తెలిసిన వాళ్లు అందుబాటులో లేక  అనుక్షణం బైటికి చెప్పుకోలేని సంక్షోభం మధ్య  నలిగిపోతుండటం కనిపిస్తుంది. అట్లాంటి నిష్ప్రయోజనమైన,   నిరాధారమైన  ( మూఢ ) విశ్వాసాల మధ్య  ఇరుక్కుని నలిగిపోయే బడుగు తరగతి సంసారుల సంఘర్షణ ఇతివృత్తంగా అల్లిన వేంపల్లి షరీఫ్ 'పర్దా' కథ కరుణరసార్ద్రంగా ఉంది. 

కథలో రచయిత ప్రధమపురుషలో  వినిపిస్తున్నట్లు అనిపించే దిగువ మధ్య తరగతి పట్టణ  ముస్లిం కుటుంబ నేపథ్యంలోని ఒక ముసలి అవ్వ కథ  ఇది .  కాని, నిజానికి ప్రతి ముస్లిం పేద కుటుంబంలోనూ పొద్దు వాటారే దశలో ఉండే స్త్రీలు ఎదుర్కొనే  విచిత్రమైన సమస్యను ఈ కథకు వస్తువుగా ఎంచుకున్నందుకు రచయిత అభినందనీయుడు  .  
ఇస్లాం కుటుంబాలలో ఇప్పటికీ  ' పర్దా' పద్ధతి  స్త్రీ లోకం పాలిట ఒక పెను శాపంగానే లోలోపల రగులుతూనే  ఉంది. ప్రభుత్వం తాను తెచ్చినట్లు చెప్పుకునే   చట్టాలు నిత్య జీవితాలలో ఆమోదయోగ్యమై ఆచరణ స్థాయి దాకా ఎదిగిరావాలంటే ముందు అందుకు సంబంధించిన  సమాజాలలో మానసికపరమైన పరిణతి స్థాయి పెరగడం అవసరం .  ఆచరణ స్థాయి దాకా తీసుకురాలేని సంస్కరణలు  ఎన్ని  సంక్షేమ పథకాలు, చట్టాల రూపంలో  ప్రదర్శనకు పెట్టినా అవి కేవలం ఏ బుక్కుల్లోనో  నమోదయి .. ఉండేందుకు, మరీ అత్యయిక పరిస్థితుల్లో ' షో ' చేసేందుకు మాత్రామే  పనికివస్తాయి. 
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉండి వెంటనే పెళ్లి చేసి పంపేయగల  తాహతు  లేని ముస్లిం కుటుంబాలలో ' పరువు ' భయం కోసం పరదాల మరుగున ఆడపిల్ల సరదా సంతోషాలకు ఓ రెండు గదుల హద్దులు గీసేయటం ఒక అమానుష దృశ్యమయితే   .. ఏ పరదాల మరుగునా తిరిగే అవసరం లేని గ్రామీణ వాతావరణంలో బిడ్డల ఎదుగుదల కోసం మత విన్వాసాలను కూడా కాదనుకుని  సంసారం నెట్టుకొచ్చిన ఒకానొక తరం నాటి  ముసలవ్వ  ఇప్పుడు ఆ పర్దా .. గోషాల మధ్య  కొత్తగా ఇరుక్కుని మసలవలసిన పరిస్థితులు తోసుకురావడం మరింత అమానుషంగా  ఉంటుంది. తెంచుకోలేని మతమూఢ  విశ్వాసాల మూలకంగా మానవ సంబంధాలు, కుటుంబసంబంధాలు, చివరికి పేగు బంధాలు కూడా ఎంతటి  కఠిన పరీక్షకు నిలబడవలసి  వస్తుందో   అతి సహజంగా చిత్రించాడు రచయిత. కధ ఆసాంతం ఎక్కడా ఏ అతిశయోక్తులు.. అలంకారాల జోలికి  పోకుండా నిరలంకారప్రాయంగా రచయిత చెప్పుకొచ్చిన శైలీ శిల్పాల  కారణంగా కథ చదివినంతా సేపే కాదు , చదిలిన తరువాతా చెదిరిన మనసును కుదుటపడనీయదు . 
కాలం మినహా మరెవ్వరూ  పరిష్కారం చూపించలేని ఈ తరహా సమస్యలను ఎప్పటికప్పుడు సాహిత్యంలో చర్చించకపోతే.. సమాజం సంస్కారయుతంగా మారాలన్న ఆలోచనే ఆరంభమయే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. 
తనకు తెలిసిన తన ప్రపంచపు తమ ఒకానొక  తీవ్రమైన సమస్యను పది మంది ముందు ఏ మెహర్చానీ పెట్టుకోకుండా చక్కని కథ రూపంలో చర్చకు పెట్టి ప్రగతిపథకాముకుల మనసుల్లో అలోచనలను ప్రేరేపించినందుకు  మిత్రుడు వేంపల్లి షరీష్ బహుధా అభినందనీయుడు! సాహిత్య లోకం నుంచి కృతజ్ఞతలకు అర్హుడు. 👏👏❤️✌️😎
- కర్లపాలెం హనుమంతరావు.
5, డిసెంబర్ 2020 
బోథెల్; వాషింగ్టన్ రాష్ట్రం 
యు.ఎస్.ఎ 
వాట్సప్: +918142283676 


Sunday, November 29, 2020

తాడికొండ శివరామశర్మ ' రహస్యం ' మంచి కథానిక - నా పరామర్శ

 తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం '  ప్రెన నా పరామర్శ 

కథను ఉత్కంఠతో చదివించే అనేక సుగుణాలలో ఒకటి -కథకుడి దృష్టి కోణం . అందరికీ తెలిసి అందరం ఒక విధంగా భావించే ఒకానొక ప్రముఖ సంఘటనను వస్తువుగా ఎంచుకొని .. దానిని విస్మయం కలిగించే మరో అనూహ్య కోణంలో ఆవిష్కరించడం ! ' ఆహా( ' అని అబ్బురపరచే ఆ కొత్త కోణం తర్కానికి అనువుగా సాగితే ఆ కథ నిస్సందేహంగా  గుర్తుంచుకోదగ్గ కథలలో చేరుతుంది. రచన  శాయి గారి కథావాహిని - 2005 లో కనిపించే తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం 'ఈ తరహా మరపురాని కథలలో ఒకటి.

భారతంలోని చిన్న కథ - ద్రోణాచార్యులవారు   ఉదరపోషణార్థమై రాచ కొలువులో ఉద్యోగం కోసరం అన్వేషించేనాటి కథ. హస్తిన రాచవీధులలో బాల కురుపాండవులు ఆడుకునే బంతిని బావిలో గిరాటేసుకుని  బైటికి తీసే సాధనాలు , ఉపాయాలు అందుబాటులో లేక బిక్కమొగాలతో  నిలబడి ఉన్నప్పుడు కాకతాళీయంగా అటుగా వచ్చిన ద్రోణాచార్యులు శర సంధానంతో సమస్యను పరిష్కరించడం- దరిమిలా ఆచార్యులవారికి  రాచ కొలువులో గురు పదవి  ఖాయం కావడం అందరికీ తెలిసిన కథ . నీటిలో పడిన బంతి శాస్త్రరీత్యా శరసంధానం ద్వారా బైటికి రావడం  అసాధ్యం. బంతి జడత్వాని కన్నా ఎక్కువ జడత్వం కలిగిన బాణం ఎంత చెక్క పదార్ధంతో చేసినదైనా నిట్టనిలువుగా నిలబడదు. బాణానికి బాణం సంధించి తాడులా పేని బంతిని బైటికి తీసినట్లు మా చిన్న తనంలో బాలల బొమ్మల భారతంలో బొమ్మ వేసి మరీ    చెప్పిన  కథను బాలలం కనక నమ్మాం. కానీ చిన్న పిల్లల మల్లే కాకుండా బుద్ధి వికాసం సాధించిన పెద్దలూ  అంత బలంగా  ఎలా నమ్ముతున్నారో !  

' కథకు కాళ్లుండవు ; ముంతకు  చెవులుండవు' అన్న సూత్రం అండ చూసుకొని మరీ చెవుల్లో    పూలుపెట్టే కాల్పనిక సాహిత్యం విశ్వవ్యాప్తంగా వినవస్తున్నదే !  కానీ ఆ తరహా కాల్పనికత బాలల్లో మాత్రమే మనోవికాస అభివృద్ధిని ఉద్దేశించినది.  పెద్దలకు కాదు . పురాణ,ఇతిహాసాలలో  పుట్టలు  పుట్టలుగా కనిపించే ఈ వింత కట్టు  కథానికల పరమార్ధ౦ మరేమైనప్పటికీ , ఆ తరహా అభూత కల్ప నను కథాంశంగా ఎంచుకొని దానికి ఓ శాస్త్రీయత ఆపాదించే తాడికొండ శివకుమార  శర్మ ప్రయత్నం నిశ్చయంగా తెలుగు కథ వరకు సరికొత్త ప్రయోగం ; సదా అభినందనీయం ! 

నూతిలోని నూలు బంతిని శర సంధానంతో కాకుండా పై మీది  అంగవస్త్రంలోని తేలికపాటి దారపు పోగులతో   తాడుగా పేని బాణానికె  కట్టి  సంధించడం ద్వారా బంతిని గురువులు బైటికి  తీసినట్లు కథకుడు చేసిన ఊహ శాస్త్రీయ పరిధులలో ఉంటూనే సమస్యకు  చక్కటి పరిష్కారంగా అనిపిస్తుంది! అంతకు మించిన లౌక్యం ప్రదర్శిస్తాడు ద్రోణాచార్యులు పాత్ర  ద్వారా .. అతగాని శిష్యుల శస్త్ర ప్రయోగ నైపుణ్యం పరీక్షకు పెట్టే సందర్భంలో !

చెట్టు మీద ముందే పెట్టించిన మట్టిపిట్ట కంటిని గురి చూసి కొట్టమన్నప్పుడు 105 మంది కురుపాండవులలో ఒక్క అర్జునుడు మినహాయించి  అందరూ వైఫల్యం చెందిన కథ మనకు సుపరిచితం.   శిక్షణ బాధ్యత నెత్తికెత్తుకున్న గురువుల సామర్ధ్యం  శిష్యుల పనితనాన్ని (performance) ను బట్టి బేరీజువేసే నేటి రివాజు భారత కథ నడిచిన రోజులకూ అన్వయించి రచయిత చేసిన కల్పన   తెలుగు కథకు   కొత్త ప్రయోగం! చెట్టుమీది పిట్ట కంటిని సూటిగా కొట్టడంలో విజయం సాధించింది 105 మంది శిష్యులలో ఒక్క అర్జునుడే! ఆ నిజం భీష్మాచార్యులవారి   దాకా చేరితే పరువుతో సహా ద్రోణాచార్యులవారి  కొలువుకూ ముప్పు ఖాయం. ఉదరపోషణ కోసం    మరో దారి వెతికే శ్రమ  తప్పించుకునే నిమిత్తం ఆచార్యులవారు ఆ పద్ధర్మంగా  ప్రదర్శించిన లౌక్యం నేటి కాలపు విద్యా రంగంలోని మాయా మర్మాలకు ఏ మాత్రం తీసిపోనిది! విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు  నలుగురికీ తెలిసే బహిరంగ విధానం కాకుండా in- door మెథడాలజీని ఆశ్రయిస్తాడు ద్రోణాచార్యులు. భోజనానంతరం శస్త్ర పరీక్షలకు ముందు   మరికొన్ని పరీక్షలు నిర్వహించిన మీదట రచయిత గురువుగారి  పాత్ర ద్వారా చమత్కారంగా చెప్పిన అసలు రహస్యం  ఏమిటంటే ఒక్క అర్జునుడికి మినహా మిగతా శిష్యులందరికీ దూరాన ఉండే వస్తువులు సృష్టంగా  కనిపించని కంటి దోషం! భారత కాలం నాటికి చికిత్స ప్రక్రియ ద్వారా కంటి దోషాలు సరిదిద్ద గలిగే వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందలేదు.. ఉన్న విషయం బైటపెట్టి కొలువు ఇచ్చిన పెద్దల ఆగ్రహానికి గురికాకుండా నేడు  ప్రభుత్వాంగాలలోని అధికారులు , ఉద్యోగులు ఏ విధంగా తిమ్మిని బెమ్మిని చేస్తారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ! అదే రహస్య పంథాని     అనుసరించిన ద్రోణాచార్యులు  కురుపాండవుల  కంటి సమస్యలను ధృతరాష్ట్ర , భీష్మాచార్యుల నుంచి  దాచిపెట్టి.  వేరే రాచ విద్యలు నేర్పించేందుకు  అనుమతి తీసుకుంటాడు. విలువిద్య అంటే గురి చూసి ప్రయోగించే యుద్ధ కళ. దుర్యోధన, భీమసేనుల వంటి వాళ్లకు వంటబట్టించిన గదాప్రహారం తరహా విద్యలకు గురితో పనిలేదు కదా ! విల్లు కాకుండా మరే ఇతర ఆయుధాలు ప్రయోగించినా కనీసం  కుడి వైపు వారి మీదో , ఎడమ వైపు వారి మీదో దెబ్బ పడటం ఖాయం' అంటూ గడుసుగా ముక్తాయించడం  కథాంతంలో రచయిత ప్రదర్శించిన  చక్కని చమత్కారం.    ' రహస్యం' కథానిక కలకాలం గుర్తుండి పోయేందుకు కారణం కథనం, శిల్పం కన్నా  రచయిత ఎంచుకున్న కథాంశం . . దానికి ఆపాదించిన శాస్త్రీయ దృక్పథం, కొత్త తరహా ప్రయోగశీలత; చమత్కారం అదనం. కథలన్నింటినీ బలాత్కారంగా ' సామాజిక స్పృహ ' బరిలోకి దించనవసరం లేదు. నవీన ప్రయోగం, సృజనాత్మక కాల్పనిక దృష్టి వంటివీ  కథానికకు పుష్టి చేకూర్చే దిట్టమైన సరుకులే! '

తాడికొండ శివకుమార శర్మగారికి మనసారా అభినందనలు! 

 - కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్.ఎ 

29 - 11 - 2019











Thursday, November 26, 2020

కాఫీ అయ్యర్ -హాస్య కవిత - గుండిమెడ వేంకట సుబ్బారావుగారు

 



 

సర్వసర్వంసహావ్యాపి  సర్వజీవ- జీవనాధారుడగు నొక్క దేవుడెవడో

కల డనగ  విందు గాని నిక్కం బెరుంగ!- వాడదృశ్యుండు మాకేల వాని గోల?

చండార్క కిరణప్రకాండముల్ చొరలేని దండకారణ్య మధ్యమున నీవు!

పేరు చెప్పినమాత్ర నీరు గడ్డలు గట్టు తుహినాచలాగ్రమందునను నీవు!

కడలేని జలరాశి గర్భమందు నడంగి కనరాని దీవులందునను నీవు!

దిగ్దిదిగంతశ్రాంత దేశదేశములందు గల యూళ్ల వాడవాడలను నీవు!

అయ్యరూ! యింక నీవు లేనట్టి తావు- కలదె పరికింప నెందు భూవలయమందు!

అహహ! యింక సర్వవ్యాప్తి యనగ నెవడు-దేవు డన నింక నెవడోయి నీవుగాక!

సకలవిశ్వస్థకీటకకోటి నీ ఫలహారసామాగ్రియం దైక్యమయ్యె!

ఇడెను ముక్కల కాసబడి కుక్క లిప్పుడు మలభక్షణాసక్తి మానుకొనియె!

వాయసంబులు నేడు వాయుసమ్మార్జన ప్రక్రియల్ మాని నీ పంచ చేరె!

గర్భస్థపిండముఖ్యసమస్తమనుజసంఘమ్ము నీ, కాత్మార్పణ మ్మొనర్పె!

భళిరా! జీవకో ట్లిటుల  జీవనవిరక్తి- మాని, యనురక్తి నీపాద మానియుండె!

సరికదా! యింక జగతిలో సర్వజీవ -జీవనాధారుడెవడోయి నీవుగాక!

అయ్యరూ! పృథ్విలోన మాయామనుష్య-మూర్తియైన యా రఘురామమూర్తివోలె

ఈవు నినుగూర్చి సుంతేని యెరుగనేమొ?- సత్యముగ నీవు దేవాంశసంభవుడవు!

పూర్వ మెపుడొ విష్ణువు జగన్మోహినియయి-అమృతమును పంచెనంట సురాసురులకు!

ఇట జగన్మోహనుండవై యీవు నిడవె= అమృత రూపాంతరం బైనయట్టి కాఫి!!

టీ యని, కో కో యని, కా-ఫీ యని, యెద్దాని వింత పేర్లిడి యమృత

ప్రాయంబుగ గొందురొ, యది- యే  యమృతంబని తలంప రేలనొ జనముల్!

నీవె ప్రత్యక్షదైవంబు!  నిన్ను మించు- దేవు డన్యుండు లేడు పృథ్వీస్థలమున!

కలియుగంబున లోకరక్షణము కొరకు - అయ్యరను  పేర దేవుడే యవతరించె!!

***

(భారతి మాసపత్రిక, 1929, జూన్ సంచికలో ప్రచురితం)

 

Saturday, September 26, 2020

చేతిరాత జాతకం మారేదెప్పుడు? -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ప్రచురణ

 


 

గౌరవనీయులైన ఓ మేజిస్ట్రేట్ గారిని  చదివే తీరులొ చేతితో తీర్పులు రాయాలని కేరళ హైకోర్టు మొన్నీ మధ్యన మందలించిన ఘటన  చదివినప్పుడు చేతిరాతను గురించిన కొన్ని  చిత్రమయిన సంగతులు గుర్తుకొచ్చాయి. బ్రహ్మరాత పద్ధతిలో మందుల చీటీ రాసిచ్చినందుకు ముగ్గురు వైద్యశిఖామణుల శిఖలు పట్టుకు ఝాడించిన అలహాబాద్ కోర్టు ఉదంతం అందులో ఒకటి.

 

చిన్నతనంలో కాపీ బుక్కులు ఎన్ని నింపినా, ఎదిగొచ్చి సెల్ఫోన్ చిక్కిన తరువాత చేతితో రాసేందుకు చిన్నబుచ్చుకునే నడమంత్రపు నాగరీకం ప్రస్తుతం నడుస్తున్నది! కంప్యూటర్లు,  సెల్ఫోనులు వంటి ఐ-సరంజామా చేతి కొచ్చి  అక్షరమాల, అనూ-లంటూ ఫాంటుల  మోహజాలంలో పడ్డప్పుడు, మనిషికి  చేతిరాత మీద కొంత రోత మొదలవుతుంది! కొత్త శతాబ్దిలోకి కాలం అడుగు పెట్టినప్పటి బట్టి పుట్టుకొచ్చిన సజ్జుకంతా కీ-బోర్డుల మీద వేళ్లు టకటకలాడించటం ఒక్కటే  తెలుస్తున్న రాతవిద్య! నేటి ఉపాధులకు  కీ-బోర్డు విద్యలు కీలకమే. అలాగని, ఓపిగ్గా ఓ సారి పెన్ను కేప్ ఓపెన్ చేసి నింపాదిగ కలానికి పని చెప్పనంత నిరాసక్తతే వింత!

 

కార్డు ముక్క గిలికే రోజుల్లో   చేతిరాతే  మహారాజు!  ఫాస్ట్ కాలానికి అనుగుణంగా ఈ-మెయిళ్లు దూసుకురావడం,  పోస్ట్‍ కార్డు కనుమరగువడం.. చేతిరాతకు ఎదురయిన పెనుగండం!  ఇసుక-అక్షరం నుంచి ఈ-అక్షరం దాకా చేతిరాత కథ మహాభారతమంత. ఇవాళ ఇంగ్లీషు బడి పిల్లగాడికి  వందేళ్ల కిందటి బుడతడికి మల్లే నేల అంటకుండా వేలుతో అక్షరాలు దిద్దవలసిన అగత్యం లేదు. ఐదేళ్ల కిందట ఫిన్లాండ్ దేశం చిన్నబడి పిల్లలక్కూడా కీ-బోర్డు వాడకం తప్పనిసరి చేసింది. ఆ తరహా అదుపాజ్ఞలేవీ మనకు లేకపోవచ్చు. కానీ చేతిరాత తలరాతకు మన సమాజంలో మాత్రం ఏమంత సానుకూలత ఉండడం లేదిప్పుడు. సంతకం ఒక్కటే  చేతిరాత వంతులా ఉంది  తంతంతా.

 

రాయించెడివాడు ఏ రామభద్రుడయినా రాసెడివాడి రాతలో తేడా ఉండటం లేదిప్పుడు. అంతా కంప్యూటరమ్మ రాత మహిమ! అక్షరాలను బట్టి రాసే మనిషి అంతరంగాన్ని విశ్లేషించే శాస్త్రానికి నిన్న మొన్నటి దాకా యమ డిమాండ్! అదీ అప్రస్తుతం అయిపోతోంది ప్రస్తుతం. కనీసం నేరాంగీకార పత్రం మీద అయినా నేరుగా దోషి  స్వహస్తాలతో తప్పు ఒప్పుకునే పద్ధతి తగ్గుతున్నదిప్పుడు. చదువుకొన్నవాడికీ చదువురాని వాడికీ కీబోర్డు మీటలే సర్వం సిద్ధం చేసిపెడుతున్నప్పుడు  చేతిరాతకు ఇక సాయం పట్టే సిద్ధివినాయకుడెవడు?!

 

చిన్నతనంలో  కాపీ బుక్కుల మీదాట్టే ధ్యాస పెట్టనందుకు బాపూజీ అయిన పిదప గాంధీజీ గిల్టీ ఫీలయ్యారు. కంప్యూటర్ల కాలంలో పుట్టలేదు కాబట్టే నోబెల్ గ్రహీత  ఠాగోర్ రంగు కాగితాల మీద   అక్షరాలు పూల తీగెల్లాగా ఎలా అల్లేవారో  తెలుసుకునే వీలుకలిగింది. జాతుల తలరాతలు మార్చిన నేతల  చేరాతలు ఎక్కువగా  గజిబిజిగానే ఉంటాయి. ఎందుకో? అదో  చిత్రం!  వనితల చేరాతలు వారి అంతరంగ అద్దాలకు మల్లే కళకళలాడతాయి. అదీ విచిత్రమే! తాతల కాలంలో పెద్దల రాతలు గొలుసుకట్టు తీరులో కలం దింపకుండా ఒకే ఊపులో సాగేవి.  పద్దుపుస్తకాలలో వ్యాపారస్తులు    మెలిక రాతల్లో వివరాలు తమాషాగా దాస్తుండేవాళ్ళు. బాపు  వంటి గీతకారులయితే ఏకంగా చేతిరాతల జాతకాలే మార్చేశారు.

 

అచ్చు యంత్రం ముందు నాటి మహద్గ్రంథాలన్నీ గతకాలపు మహాకవుల చేరాతలే కదా! చేతితో చెక్కే అద్భుత విద్య మనిషికి అబ్బకపోయి ఉండుంటే? ఉండవల్లి,  అజంతా, ఎల్లోరా వంటి గుహా కుద్యాల మీదిప్పుడు కనిపించే శాసనసంపద మన దాకా వచ్చేదే కాదు. రోజుకోటి చొప్పున తాళపత్రాల పైన తాళ్లపాక అన్నమయ్య  దేవుడికర్పించిన కీర్తనలన్నింటికీ చేతిరాతే కదా ఆలంబన! త్యాగరాజయ్యరు గాలికి పాడి వదిలేసిన రాగాలను శిష్యులు చేఅక్షరాలుగ మార్చి తాటాకు దొన్నెలకు పట్ట బట్టే దక్షిణాదికి ఒక కొత్త సంగీత సంప్రదాయం పట్టుబడింది! ఆ చేతిరాత వైభవమంతా చెల్లిపోయేలా చేతులెత్తేయడం తాతలిచ్చిన సంప్రదాయానికి జెల్లకొట్టడమే! భారత రాజ్యాంగ చట్టం ముచ్చటైన చేతిరాతల్లోనే    శాశ్వతత్వం సాధించుకొందన్న సత్యం.. భారతీయులమై ఉండీ మనం మర్చిపోతున్నాం! మహా దురదృష్టం.

 

మానవ సమాజం మీద పడ్డ అక్షరం ముద్ర మామూలుది కాదు, ఈనాటిదీ కాదు. ఇండియన్ యాంటిక్వరీ (Indian  Antiquery) రాసిన డాక్టర్ బూలర్  భారతీయులకు ఈ అక్షరాలు చేతితో రాసే అపూర్వ విద్య  క్రీస్తు పుట్టుకకు ఎనిమిదొందల ఏళ్లకు పూర్వమే తెలుసన్నాడు. పండిత్ గౌరీశంకర్ హీరాచంద్ర ఓఝా క్రీస్తుకు పూర్వం పదహారు, పన్నెండు శతాబ్దాల మధ్యకే ఉత్తరాలు రాసే కళ ఉత్కృష్ట దశకు భరతజాతి చేరుకుందని నిరూపించాడు. 'షణ్మాసికే తు సంప్రాప్రే భ్రాంతిస్సంజాయతే యతః, ధాత్రాక్షరాణి సృష్టాని పత్రారూఢాన్యతః పురా'- ఏ విషయం తెలిసినా ఎంత ఏనుగు జ్ఞాపకశక్తి కలిగి ఉన్నా ఆరు నెలలు గడిస్తే మనిషికి కొంత మతిమరుపు సహజమని జీవశాస్త్రవేత్తల భావిస్తారు. మనిషి మతిమరుపు కతలు ముందుగా తెలిసే అతగాడి ఆ ముదురుజబ్బుకు మందుగా  బ్రహ్మదేవుడు వర్ణమాల వరంగా ప్రసాదించాడని బృహస్పతి స్మృతి! రజస్వల అయి రాసినమ్మకు బట్టతలతో బిడ్డ పుడుతుంద'ని కృష్ణయజుర్వేద సంహిత ద్వితీయ కాండ చెబుతుంది. 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అన్న ఆ సూక్తిని బట్టి చూస్తే అక్షరాలను గురించి, వాటిని చేతితో రాయడాలను గురించి యుగాల కిందటే భరత ఖండంలో బ్రహ్మాండమైన చర్చ జరిగిందని బోధపడటంలేదా! 

 

వ్యాసుడు చెప్పుకుపోతుంటే విఘ్ననాయకుడు రాసుకుపోయాడంటారు పంచమవేదం. వ్యాస మహర్షి కాలం సుమారు 5 వేల సంవత్సరాల కిందటిదని ఒక వాదం. చేతిరాత సహస్రాబ్దాల  బట్టి ఆర్షభూమిలో పరంపరగా  కొనసాగుతోన్న హస్తకళ అనేందుకు  వందల కొద్దీ ఉదాహరణలు చరిత్రగని తవ్వే  కొద్దీ బైటపడతాయి. చక్రవర్తి కుమారుడైనా సరే, చౌలమైన(పుట్టెంట్రుకలు తీసే సంస్కారం) తరువాత అక్షరాలు నేర్చుకు తీరాల్సిందే అన్న 'వృత్త చౌల కర్మా లిపిం సంఖ్యానం చోపయుంజీత' అనే కౌటిల్యుడి అర్థశాస్త్ర విధి అందులో ఒకటి.   వాల్మీకి మహర్షి ఆ విధంగానే చౌలసంస్కారం చేయించి మరీ లవకుశులకు అక్షరాలు దిద్దించినట్లు భవభూతి కథనం. కాళిదాసు కూడా రఘువంశంలో అజుడు లిపి పరిజ్ఞాత అయిన తరువాతనే సంస్కృత సాహిత్య సముద్ర ప్రవేశం చేసినట్లు రాసుకొచ్చాడు. బాణుడు చంద్రాపీడ మహారాజు విద్యామందిరంలో అరో ఏట అడుగుపెట్టింది మొదలు ఏ విధంగా విద్యను అభ్యసించాడో వివరించాడు. విశ్వామిత్రుడి మతం ప్రకారం పిల్లలు అయిదో ఏట పడగానే  అక్షరాల గుంట ముందు కూలబడాలి.  పండిత భీమసేన్ వర్మ కృత 'షోడశ సంస్కార విధి' గ్రంథానుసారం అజ్ఞాతుడైన రచయిత రాసిన స్మృతిని బట్టి 5, 7 వయసుల్లో అక్షరాలు నేర్చుకోవడం వటువులకు తప్పనిసరి సంస్కారవిధి. వడుగుకు ముందే మనిషి  గంటం చేతబట్టాలని  బృహస్పతి స్మృతి విధి. మార్గశిరం నుంచి జ్యేష్ఠం వరకు అక్షరజ్ఞానానికి అనుకూలమైన కాలం. ఆషాఢం నుంచి కార్తీకం వరకు అక్షరాభ్యాసం నిషిద్ధమని విశ్వామిత్ర నీతి.  సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నప్పుడే అక్షరాల అవపోసన ఆరంభించడం వశిష్ఠ వాక్కు ప్రకారం శ్రేయస్కరం.  స్మృతి చంద్రిక కర్త మార్కెండేయ పురాణోక్తులను పేర్కొంటో అపరార్కుడు ఐదవ ఏట  కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపల అమావాస్య, పౌర్ణమి లాంటి తిధులు; చవితి, నవమి, చతుర్దశులు; శని, మంగళ వారాలు- చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించకూడని కాలాలని హెచ్చరించాడు. కుంభరాశిలో రవి ఉన్నా, లగ్నాతు అష్టమంలో గ్రహాలు తిష్ఠ వేసినా అక్షరాల జోలికి పోరాదన్న విధీ  ఒకప్పుడు భరతభూమిలో కథ. ఓనమాలు రానివాడు ఆనవాలు లేకుండా పోతాడన్న భయం అనాదికాలం నుండి మనిషి గుండెల్లో మారుమోగుతుండబట్టే ఇన్నేసి పురాణేతిహాసాలలో, స్మృతి స్ముతుల విధివిధానాలలో అక్షరాల గురించి వాటి అభ్యాసాదుల గురించి రుషుల మధ్య అంతంతలేసి చర్చోపచర్చలు సాగింది. కంప్యూటర్ మాయలో పడి ఆ సంప్రదాయం ఛాయామత్రంగానైనా  మిగిల్చుకునేందుకు ప్రస్తుతం మనం పస్తాయిస్తున్నాం. అది కదా విచారం!

 

చాలా మంది ఇళ్ళల్లో పాతలేఖలు నాటి తీపి గుర్తుల కింద దాచుకుంటారు. ఆ  ఉత్తరాల కోసం రోజులు, వారాల తరబడి ఎదురుచూసిన  పాతకాలం మధురానుభూతులను ఒక్కసారి నెమరువేసుకోవాలి.  కంప్యూటర్  కొత్తవింతలో పడి..  చేతిరాత రోతగా మారకుండా అప్రమత్తమవాల్సిన అగత్యం అప్పుడు తప్పకుండా స్పృహకొస్తుంది. ఇదే అంశం మీద పీడియాట్రిక్ థెరపిస్ట్ సాలీ పెయిన్  గార్డియన్ వార్తాపత్రికకు ఇంటార్వ్యూ ఇస్తూ 'బళ్లకు వెళ్లే పిల్లలకు పెన్సిళ్లు ఇస్తే  సరయిన పద్ధతిలో పట్టుకోలేకపోతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రోజులో అధిక భాగం చేసే స్నేహం పిల్లల  ప్రాథమిక చలన నైపుణ్యాలను బాగా దెబ్బతీస్తుంది' అని అన్నారు. అధ్యయన, అభ్యాస రంగాలలో చేతిరాత పాత్ర రాను రాను ఎంతలా దిగనాసిల్లుతున్నదో   ప్రచారం చేసే బాధ్యత స్వచ్ఛందంగా  పుచ్చుకున్న డాక్టర్ జేన్ మెడ్వెల్, ఇళ్లలో పెరుగుతోన్న గ్యాడ్జెట్ల వల్లనే  పిల్లల్లో చాలా మందికి పెన్సిల్ మీద పట్టు కుదరడంలేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. నేషనల్ హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తోన్న డాక్టర్ మెలీసా ప్రూంటీ, ప్రాథమిక స్థాయి నుంచే పాఠశాలల్లో బాలలకు ఐ-పరికరాల స్థానే అచ్చు పుస్తకాలు, పలకా బలపాలు, పెన్నూ పెన్సిళ్లను పోలే ఆటవస్తువులు అలవాటు చేయడం-  బుద్ధివికాసం జీవనసమరానికి దగ్గరయే మేలైన అనుసంధాన చమత్కారం అని చెప్పుకొచ్చారు. 2014 నాటి  ఒహాయో యూనివర్శిటీ పరిశోధనల్లో అమెరికాలో ప్రతి ముగ్గురు పెద్దవాళ్లలో ఒకరు ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు చేతితో ఏమీ రాయడం లేదని తేలింది. ఇక్కడ ఇండియాలో కూడా దరిదాపులుగా అదే దుస్థితి. కానీ, అదృష్టం కొద్దీ చేతిరాత  పట్టు ఎంతో కొంత మేర చదువు సంధ్యల్లో, బతుకు తెరువులో ఇంకా మిగిలే ఉందని నమ్ముతున్నాం మనం.  కాబట్టే పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో చేతిరాత వైభవం పునరుద్ధరణార్థం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. 2005లో ఎయిక్స్-మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరోసైన్స్ లేబరేటరీ మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయసు పిల్లలను రెండు బృందాలుగా విడగొట్టి ఒక బృందానికి చేతిరాత, మరో బృందానికి కంప్యూటర్ రాత పని అప్పగించింది. చేతిరాత పిల్లలు, కంప్యూటరు సాయంతో రాసే పిల్లల కన్నా  అక్షర జ్ఞానంలో చురుకుగా ఉన్నట్లు  తేలింది.  అక్షరాలు దిద్దే క్రమంలో  క్లిష్టమైన కండరాల కదలికలను మాలిమి చేసుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అన్న ఆత్మవిశ్వాసం సాధకు బలపడుతుంది. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోనే సందర్భంలో ఈ ఆత్మవిశ్వాసమే విజయసాధనకు తోడ్పడేది అంటారు  డాక్టర్ మెడ్వెల్. మూడేళ్ల కిందట అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఇల్లినాయిస్  రాష్ట్రంలో చిన్నబళ్ళల్లో చేతిరాత తరగతులు  తిరిగి తప్పనిసరి పాఠ్యాంశాలలో ఒక్కటిగా మార్చడానికి ఈ తరహా కొన్ని అధిక ప్రయోజనాలే ప్రముఖ కారణం.

మన దేశంలో మొన్న మొన్నటి దాకా న్యాయస్థానాల దస్తావేజుల్లో చేతిరాతే ముఖ్యమైన స్థానంలో ఉండేది.  భాష సరే, కరక్కాయ సిరాతో రాసే ఆ  అక్షరమూ  ఎంత చూడ ముచ్చటగా ఉండేదో ఈ తరానికి తెలిసే దారేదీ? చిన్న దావాలలో న్యాయాధీశులు కంప్యూటరు గట్రాలు గట్టున పెట్టేసి స్వంత దస్తూరితో స్పష్టంగా  రాసిన  తీర్పులు వెల్లడించాలని ఈ మధ్య కేరళరాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఓ  సలహా ఇచ్చింది. కంప్యూటర్ రొట్టకొట్టుడు భాష తెచ్చే అనర్థాలను  వివరిస్తూ సాక్షుల వాజ్ఞ్మూలాలు సైతం వీలయినంత మేరకు ఆ అధికారం కలవారు స్వదస్తూరితో నమోదు చేస్తే, చేతిరాత   సాధికారత పునరుద్ధరించనట్లు అవుతుందన్నది ఉన్నత న్యాయస్థానం అభిప్రాయం. చేతిరాత ఘనతను ఇకనైనా చరిత్రలో కలవకుండా విజ్ఞతతో  వ్యవహరిద్దామా?

 

పొందికైన జీవితానికి అందమైన చేతిరాత ముంజేతిన మెరిసే బంగారు కంకణం. ఆ అందమైన చేతిరాతకు అదనంగా మార్కులేసి ప్రోత్సహించే   సంప్రదాయం గతంలో బడి పిల్లల పరీక్షల్లో కనిపించేది. మార్కుల కోసమేనా? జీవితంలో మంచి రిమార్కులు సాధించడానికీ చేతిరాత మీద పాతకాలంలో మాదిరి  శ్రద్ధ మరంత పెంచడం అవసరం. జాతీయ చేతిరాత దినం' అని ప్రతి ఏటా జనవరి 23 ను  ఓ ప్రత్యేక దినోత్సవంగా గుర్తిస్తున్నాం మనం. దస్తూరీ ఆవశ్యకత అవిస్మరణీయమని చెప్పడానికి ప్రత్యేకమైన ఉత్సవాలు జరపనవసరం లేని ప్రోత్సాహ వాతావరణం  తిరిగి చేతిరాతకు రావాలని కోరుకుందాం!

-కర్లపాలెం హనుమంతరావు

***

(సూర్య దినపత్రికలో ప్రచురితం) 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

చేతిరాత

-కర్లపాలెం హనుమంతరావు

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...