Monday, August 31, 2020

ఖర్చు తక్కువ వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు - ప్రకృతి -కర్లపాలెం హనుమంతరావు






ప్రకృతితో ఒక్కోరికి ఒక్కోరకమైన అక్కర. కవి, గాయకుడు ప్రకృతిని చూసి స్పందించే మంచి కవిత్వం, గానం ప్రసాదించేది.  ఆ మధ్య చైనీస్ యువకులు కొంత మంది ప్రకృతిలో దొరికే గుమ్మడి, బీర, దోస వంటి కూరగాయలను సంగీత పరికరాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఒక యూ ట్యూబ్ వీడియోలో చూపించి అందరిని అవాక్కయేటట్లు చేసారు. నిజానికి ప్రకృతిలో దొరికే కాయగూరలు, దుంపలు, పండ్లు ఫలాలు సౌందర్య పోషణకు ఉపయోగించుకునే తెలివితేటలు పెంచుకుంటున్న మహిళామణులు వాటి అవసరం ముందు తిండి తిప్పలకు, మందుమాకులకు ఎంత వరకు ముఖ్యమో తెలుసుకుంటున్నారా?
మందుల దుకాణాలలో  ఔషధాలకు కొదవ ఉండదు, నిజమే కాని, అన్ని రకాల మందులు అందరు వాడటం అంత క్షేమం కాదు. కొన్ని సార్లు వికటించే ప్రమాదం కద్దు. ఏవి హాని చెయ్యనివో తెలుసుకోవడానికి మళ్ళీ  ఏ అలోపతి వైద్యుడి దగ్గరకో పరుగులెత్తాలి. వేళకు అన్ని చోట్లా డాక్టర్లు అందుబాటులో ఉండే దేశమా మనది? భారతదేశం వరకు అందరికీ అందుబాటులో ఉండే వైద్యుడు ప్రకృతి నారాయణుడు. ఆ వైద్యనారాయణుడి థెరపీని నమ్ముకుంటేనే  మన ప్రాణాలకు తెరిపి.
ఉదాహరణకు, గోళ్ల కింద గాయమయిందనుకోండి. ఒక్కో సందర్భంలో కొనుక్కొచ్చుకున్న మందు గోరు చివుళ్ల సందున సరిగ్గా అమరదు. వాడినట్లే ఉంటుంది కాని, ఫలితం కనిపించదు. కనిపించినా దాని ప్రభావం నెమ్మది మీద గాని తెలిసే అవకాశం లేదు. అదే వంటింట్లోనే కూరగాయల బుట్టలో ఏ వేళకైనా దొరికే బంగాళా దుంపను ముక్కలుగా కోసి ఒక ముక్కతో ఆ గాయమయిన భాగం కవర్ అయే విధంగా కట్టుకట్టుకుంటే సరి. మూడు రోజులు వరసగా ఉదయాన్నే పాత ముక్క స్థానంలో కొత్త ముక్కను పెట్టి కట్టుకుంటే నాలుగో రోజున అక్కడ గాయమైన ఛాయలు కూడా కనిపించవు.  చర్మం పైన పొక్కులు, బొబ్బలు కనిపిస్తే బంగాళా దుంపల ముక్కలతో గట్టిగా రుద్దితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది.  అలాగే బంగాళా దుంపను ఉడకబెట్టిన నీరు షాంపూ కండిషనర్ కన్నా మంచి ప్రభావం చూపిస్తుంది. రెగ్యులర్ షాంపూతో తల శుభ్రం చేసుకున్న తరువాత ఆరబోసిన వెంట్రుకలను ఉడికిన బంగాళా దుంపల నీళ్లతో కడిగి ఆరబెట్టుకుంటే ఆ శిరోజాల మెరుపు సహజంగా ఉందటమే కాదు, జుత్తుకు భవిష్యత్తులో హాని కూడా కలగదు. బూడిద రంగుకు తిరుగుతున్న జుత్తును దారిలోకి తేవాలన్నా ఈ బంగాళాదుంపల ద్రవంతో కడిగే అలవాటు క్రమం తప్పకుండా చేస్తే సరిపోతుంది. కాణీ ఖర్చు లేని వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు ప్రకృతి.
బంగాళా దుంపలు కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి. తడిగా ఉన్న భాగం వేపుని కొద్దిసేపు కళ్ల కింద పెట్టుకుని, ఆ తరువాత రుద్దుకుంటే  ముడతలు బిగిసుకుంటాయి. క్రమం తప్పకుండా చేసేవారికి కళ్ల కింద ఉబ్బు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. మో చేతుల కింద అదే పనిగా వత్తిడి  ఉన్నవాళ్లకు ఆ ప్రదేశంలో నల్లటి మరకలు నిలబడిపోతాయి, వాటి మీద  క్రమ తప్పకుండా బంగాళాదుంప ముక్కలను రుద్దుతుంటే మరకలు తొలగిపోతాయి.
బంగాళాదుంపలకు చర్మానికి భలే లింకు. దుంపలు కడిగిన నీళ్లలో నిమ్మ రసం పిండుకుని దానితో మొహం శుభ్రం చేసుకోవడం అలవాటుగా ఉన్నవాళ్ల మొహంలో ఆ కళే వేరు. వదనం  సమ్మోహనంగా మారుతుందిఎండపొడికి చర్మం కమిలిన  చోట బంగాళా దుంపల తడి చెక్కలు ఉంచితే చర్మం అతి తొందరలో తిరిగి సహజ స్థితికి  వచ్చేస్తుంది. ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో వేళ్లతో ఎత్తిపెట్టిన పెరుగు రవ్వంత కలిపి ఆ పేస్టును మొహానికి పట్టించుకోవడం అలవాటు చేసుకుంటే మొగం ఎప్పుడూ మంచి  నిగారింపుతో కళకళలాడుతుంది. బంగాళా దుంపల పేస్టుకు దోసకాయ పేస్టు, సోడావుప్పు కలిపి ఆ పేస్టుతో  మొహం శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవారికి వయసు పైబడిన తరువాత  చర్మం మీద ఏర్పడే ముడతలు వెనకడుగు పడతాయి.
పిల్లలు తిరుగుతున్న ఇంటిలో గోడలకో, గడపలకో పెయింటింగు వేయించాల్సిన అవసరం వస్తుంటుంది ఒక్కోసారి. పెయింట్లలో వాడే పదార్థాలకు తోడు, వార్నిష్ నుంచి వచ్చె గాలి ఇంటి వాతావరణంలోఒక రకమైన ఘాటుతనం పెంచి, ఒక్కోసారి వాంతులు అయేంత వరకు పరిస్థితి వికటిస్తుంది. పసిపిల్లలను, ముసలివాళ్లను ఎక్కువగా బాధించే ఈ కాలుష్య సమస్యకు ఉపాయం, పెయింట్ చేసే స్థలంలో సగం తరిగిన ఉల్లి ముక్కలు ఉంచితే ఆ ఘాటుకు ఈ ఘాటు సరితూగి కాలుష్య ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఉల్లిపాయలో గంధకం ఉంటుంది. ఆ ధాతువు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. చెవికి సంబంధించిన వ్యాధులకు ఉల్లిపాయ బ్రహ్మౌషధం. చెవిపోటు వచ్చిన సందర్భాలలో చెవి దగ్గర ఉల్లిపాయ ముక్క ఉంచి కట్టు కట్టి రోజంతా వదిలేస్తే కర్ణభేరిలోని కాలుష్యకారకాలు నశించి బాధ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది.  
పాదాలపైన గాయాలు, వ్రణాలు అయినప్పుడు తేనెను మందులా ఉపయోగించాలి. గాయమైన చోట తేనె రాస్తూ ఉంటే కొత్త కణాలు తొందరగా పుట్టుకొచ్చి గాయం పూడే సమయం తగ్గిపోతుంది.  తేనెకు సూక్ష్మక్రిములను నాశనం చేసే గుణం ఉంది.
వంటి దురదలకు యవలు మంచి మందు. యవల జావను ఒక గుడ్డలో కట్టి  నీటిలో ముంచి ఆ తడి మూటను దురద పుట్టిన చోట రుద్దుతూ పోతే బాధ  క్రమంగా తగ్గిపోతుంది. మశూశికం పోసినప్పుడు చర్మం మీద పొక్కులు లేచి దురద పుట్టిస్తాయి. వాటిని గోకినందువల్ల చుట్టు పక్కలకు ఆ దురద క్రిములు మరంతగా విస్తరించే అవకాశమే ఎక్కువ. ఈ తరహా సందర్భాలలో యవల జావ వైద్యం అపకారం చేయనై ఉత్తమ ఉపశమనం.
తాజా నిమ్మరసం వాసనచూడడం వల్ల, మద్యం అతిగా తాగిన హాంగోవర్ బాధ నుంచి ఉపశమనం సాధ్యమే. నిమ్మ, ద్రాక్ష, నారింజ, తొక్కలను మూడు నాలుగు రోజుల పాటు ఎండకు పెట్టి ఆనక నిల్వచేసుకుంటే సబ్బులాగా వాటిని వాడుకోవచ్చు. బొప్పాయి తొక్కల గుజ్జును అరికాళ్ల కింద రాసుకుంటే అందులో ఉండే రసాయనాల ప్రభావం వల్ల అక్కడ ఉండే మృత చర్మకణాలన్నీ తొలగిపోయి పాదాలు పరిశుభంగా కనిపిస్తాయి. అరటి తొక్కల గుజ్జు భాగం వైపు పంధదార జల్లి స్నానం చేసే ముందు వంటికి పట్టిస్తే చర్మం మీద చేరిన మకిలంతా తొలగి స్నానానంతరం శరీరం నిగనిగలాడుతుంది
ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయనుకుంటా మన బేరీ పండ్లను పోలి ఉష్ణమండలాలలో పెరిగే ఒక రకమైన కాయ అవకాడో! దానితో ఎండలో తిరిగి వచ్చిన తరువాత ముఖం రుద్దుకుంటే మొహం చల్లగా హాయిగా ఉండి శరీర ఉష్టోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. పనసపండులోని రసాయనాలు మనిషి శరీరం మీది మృతకణాలను తొలగించడానికి బాగా ఉపయోగిస్తాయి
స్ట్రా బెర్రీ పళ్లు దంతాలను ధవళ కాంతితో  ధగధలాడించే ఇంద్ర్రజాలం ప్రదర్శిస్తాయి. వడదెబ్బకు పుచ్చకాయలు మంచి ఔషధం. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ పుచ్చకాయల పాత్ర అమోఘమైనది.
ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువుల నుంచి లాభం పొందే కళ అభివృద్ధి చేసుకోబట్టే మనిషి మిగతా జీవజాతులతో పరిణామదశ పోటీలో ముందున్నది.  ప్రాణమిచ్చి, ఆ ప్రాణం నిలబెట్టే ప్రకృతిని ప్రాణప్రదంగా చూసుకోవాలే తప్పించి, ప్రకృతి వైద్యుడి ఉనికికే చేటు తెచ్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కష్టనష్టాలు చివరికి మనుషులుగా మనకు మనమే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది!
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020

ఇల్లే ఒక పార్లమెంట్ - ఈనాడు దినపత్రిక సరదా వ్యాసం





(ఈనాడు శ్రీధర్ గారికి క్షమాపణలతో, ధన్యవాదాలతో)

ఇల్లొక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకుంటే ఇంటాయన ప్రసిడెంటా? ప్రధానమంత్రా?’
పాకిస్తానయితే ప్రధానమంత్రి.. ఇండియా ఐతే ప్రెసిడెంట్ అనుకోరాదూ?శ్రీమతి  లండన్లో మాదిరి  ప్రధాన మంత్ర్ర్రిగా పవర్ ఫుల్ గా ఉంటేనే  ఉంటేనే ఇంటికి, మగాడి వంటికి మంచిదని నా అభిప్రాయం' అంది  చెంచులక్ష్మి.
చెంచులక్ష్మి పత్రికలలో స్త్రీల పక్షం వహించి ఘాటుగా  రాస్తుంటుంది. హైదరాబాద్ లో మా ఆడపడుచుగారింటికి వెళ్లినప్పుడు ఆవిడ వాళ్ల ఫ్లాట్స్ లోనే ఉంటుందని తెలిసి ఒక మధ్యాహ్నం పూట మా ఆడపడుచుతో కలసి చూడ్డానికి వెళ్లాను. చెంచులక్ష్మి బాగా రాయటమే కాదు.. బాగా మాట్లాడుతుంది కూడా. ఇంటిని పార్లమెంటనడంలోనే గొప్ప పాయింట్ లాగిందావిడ.
'… ఎగువ సభ సభాపతిలా మామగారు, దిగువ సభ ప్రతిపక్షంలా అత్తగారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు మామూలే అది . పిల్లలు రకరకాల రాజకీయ పార్టీలు. ఇరుగుపొరుగువారు చైనా పాకిస్తాన్ లాంటి వాళ్లు. మిత్రబృందాలు కల్చరల్ ఎక్ఛేంజికి వస్తుంటారు. వీళ్లందర్నీ పర్యవేక్షించాల్సిన వాళ్లం మాత్రం మనమే కదా చివరికి !'
'లెక్చర్ పిచ్చగా ఉంది. ప్రొసీడ్' అని ఎగదోసింది మా ఆడపడుచు ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొడుతూ.  ట్రెజరీ పక్షాల వాళ్లు ప్రధాని మాట్లాడినప్పుడు మధ్య మధ్యలో బల్లలు బాదేస్తారే .. ఆ  మోడల్లో. డైనింగ్ టేబుల్ మీద మోదేస్తూ ఈవిడ ఇలా ప్రోత్సహించడంలో ఇద్దరి మధ్యా ఏదైనా లోపాయికారి ఒప్పందంలాంటివి ఏమన్నా ఉన్నాయేమో! అని నాకు అనుమానం మొదలయిన మాట నిజం సుమా!
చెంచులక్ష్మి రెచ్చిపోతూ 'ఇంట్లో ఏ ప్రాబ్లమొచ్చినా డైనింగ్ టేబుల్ దగ్గర చర్చకు వచ్చి తీరాల్సిందే ఏ కొంపలో  అయినా. దాన్నే మేం ముద్దుగా రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ అని పిలుచుకుంటుంటాం ఇంట్లో. మేటరెంత కాన్ఫిడెన్సయినా సరే,  ఎట్లా లీకవుతుందో తెలీదు .. మాకన్నా ముందు పక్కింట్లో చర్చ మొదలయిపోతుంది ఈ మధ్య  ఈ అపార్ట్ మెంట్స్ లో.
'స్వగృహ రహస్యాలను పొరుగిళ్లకు చేరవేసే కోవర్టులు ప్రతీ ఇళ్లలోనూ ఏదో రూపంలో ఉంటారులే’ అని గునిసింది మా ఆడపడుచు  నా వంక చూపులు సాధ్యమైనంత వరకు పడకుండా జాగ్రత్త పడుతూ. ఆవిడగారి నిందార్థాలు బహుశా మా అమ్మ మీద అయివుంటాయని అర్థమయింది.
'మేటర్ మరీ సీరియస్సయితే ఉభయసభలనూ సమావేశపరచి లోతుగా చర్చించ వలసిన అవసరం ఉంటుంది. మా అమ్మాయి ఈ మధ్య రాత్రుళ్లలో వీరప్పన్ ను గురించి ఒహటే కలవరిస్తోంది. దీం దుంపతెగ! పోయి పోయి ఆ దుంగల దొంగ వెధవ వలలో  పడిందేమిటి చెప్మా' అని మా వారు ఉప్మా తింటున్న ప్రతి పరగడుపునా కన్నీళ్లు పెట్టుకొనే సీను చూసి చూసి నాకూ  ఝడుపు జొరం పట్టుకుంటుందేమోనని అనుమానం మొదలయింది. ఒక రోజు పిల్లదాన్ని పట్టుకుని గట్టిగా నిలదీస్తే నిలువుగుడ్లు పడిపోయాయి పాపం పసిదానికి. ఆ బూచాడికి బారెడు మీసాలు మొలుస్తుంటాయి కదా! రెండేపులా గుమ్మడికాయలు నిలబెట్టినా  లొంగనంత ధృఢంగా ఉంటాయి. ఏ చందనం తైలం వాడుతున్నాడో చచ్చినోడు .. కనుక్కోడమెట్లా అని అలోచిస్తూ పడుకుంటున్నానే మమ్మీ! నేరుగా నిద్రలోకే వచ్చి ఆ ఒక్కటి తప్ప మిగతా ముచ్చట్లన్నీ చెప్పి చస్తున్నాడు' అని బావురుమనేసింది. నమ్మక చస్తామా?
'దేశమో వంక తగలడి చస్తోంటే మీసాలకు రాసుకునే సంపెంగ నూనె వివరాలంత అవసరమా దీనికి?' అని మా మగాయన గెంతులేస్తుంటే నేనే గుడ్లురుమి ఎట్లాగో అదుపులో పెట్టా!'
'ఈ కాలం పిల్లకాయలను గురించి ఈ మగాళ్లకేం తెలుసు. కెరీర్ ఓరియెంటెడే కాని.. కాలేజీకి తీసుకెళ్లే కేరేజి ఎలా సర్దుకు చావాలో కూడా కోర్సులో చేరితే తప్ప బుర్రకెక్కని మట్టిముద్దలు. పిల్లల్ని అట్లా పెచుతున్న పాపం నిజానికి మన పేరెంట్సుదే! సరే! మీ మైనస్సును గురించి చెప్పావు. మరి ప్లస్సును గురించి కూడా మా ఆడపడుచుచెవిలో వెయ్యి!' అంది మా ఆడపడుచు.
'యూ మీన్ .. మా అబ్బాయా? అబ్బాయిల్ని ప్లస్సులు, అమ్మాయిల్ని మైనసులు అనుకుని పెంచడానికి మనమేమన్నా సంసారాలని వ్యాపారాలకు మల్లే నడుపుతున్నామా?డెబిటైనా, క్రెడిటైనా రెండు సైడ్లు చివర్లో సమంగా ఉంటేనే అది సరైన బ్యాలన్స్ షీట్ అవుతుందని మా వారెప్పుడూ అదేదో వాళ్ల బ్యాంకు గోలలో ఘోషిస్తుంటారు. నిజం చెప్పాలంటే మా వాడో పెద్ద వాజపేయి. మేథావే గానీ, ఏదీ ఇతమిత్థమని ఒక పట్టాన తెమల్చడు. మొన్నటికి మొన్న పరీక్షలని తెల్లార్లూ చదివి చదివి తీరా పరీక్ష హాలు కెళ్లి తెల్లకాగితం ఇచ్చొచ్చాడు. 'రాయడానికి మరీ అంత బద్ధకమేంట్రా వెధవా?' అని గట్టిగా నిలదీస్తే ' ఈ కింది దానిలో ఏదేని రెండిటికి మాత్రమే సమాధానం వ్రాయుడు!' అని రాసుందట. 'టూ ఓ క్లాక్ దాకా కూర్చునే ఓపిక లేక తిరిగొచ్చేసాను మమ్మీ!' అని దిక్కుమాలిన జవాబు. పిల్లల్ని ఇట్లా చెడగొట్టింది వాళ్ల డాడీ గారాబమే!'
'పవరంతా ఈవిడ చేతిలో పెట్టేసుకుని అప్పోజిషన్ వాళ్లను పి.యం తిట్టినట్లు ఎట్లా తిడుతుందో చూసావా మహాతల్లి! ' అంటూ నా చెవిలో గుసగుసలు పోయింది మా ఆడపడుచు, ఆవిణ్ణి అట్లా పక్కకు పోనిచ్చి.
'అన్నయ్యగారు ఓన్లీ ప్రెసిడెంట్ లాంటి వాళ్లని నువ్వే అన్నట్లు గుర్తు' అ ని మళ్లీ రెచ్చగొట్టే పని మొదలుపెట్టింది మా ఆడపడుచు. '
'ఆడది మొగుడు అడుగుజాడల్లో నడిచి తీరాలని కదండీ మన  శాస్త్రాల నుంచి తెలుగు సినిమాల వరకు అన్నీ ఘోషిస్తున్నది' అని అడిగాను అక్కడికి నేనూ కొద్దిగా లేని ధైర్యం కూడగట్టుకొని.  
'మొగుడు అడుగుజాడల్లో నడిస్తే మన దేశంలో ముప్పావు వంతు మంది ఆడవాళ్లు ఏ బారుల్లోనో, పేకాట క్లబ్బుల్లోనో తేలుండేవాళ్లు.' అని గుర్రుమందావిడ.
'నీ తీరు చూస్తుంటే  నువ్వింట్లో మీ వారి మీద వార్ గ్రూప్ మాదిరి కార్యకలాపాలు సాగిస్తున్నట్లుందే! ఇట్లా అయితే అన్నయ్యగారెప్పుడో 'భాబా’  సంఘంలో చేరిపోతారేమో వదినా! ముందది చూసుకో!' అంది మా ఆడపడుచు.
'భాబా సంఘమా? అంటే?'
'భార్యా బాధితుల సంఘం'
'తలకిందులుగా నడిస్తే నవ్వొస్తుంది కదా అని మగాళ్లే ఇలాంటి తలతిక్క సంఘాలు పెట్టి మన పరువు తీసేది. పత్రికల్లో వచ్చే అప్పడాల కార్ట్యూన్లన్నీ మన ఆడవాళ్ల ఇమేజీని నెగటివ్ గా చూపిస్తున్నాయని నేనంటాను. మనం ఆకాశంలో సగం అంటారు కానీ.. మూడో వంతు వాటా ఇవ్వడానిక్కూడా ఎన్నేసి నాటకాలు ఆడుతున్నారో చూడు! పేరుకెన్ని రిజర్వేషనులుంటే ఏమి? అవన్నీ మొగాడు ఆడదాని ముసుగులో వేసే వేషాలే! హక్కులు దేబిరించి తెచ్చుకుంటే  వచ్చిపడేవా? పోరాడి గెల్చుకునేవి. రాజకీయలనగానే మనకు ఒక్క ఇందిరమ్మ పేరు మాత్రమే ఎందుకు గుర్తుకురావాలి? జయలలితో, మాయావతో, మమతమ్మ  బెనర్జీనో, ఇలా ఏవో ఓ పుంజీడు పేర్లు మాత్రమే పలుకుతున్నామంటే  మనమెంత వెనకబడి ఉన్నామో అర్థంచేసుకోవాలి? 'అర్థరాత్రి పూటయినా ఆడదిస్వతంత్రంగా బైట తిరగ్గలిగే రోజు వచ్చినప్పుడే మనకు నిజమైన్న స్వాతంత్ర్య్యమొచ్చినట్లని బాపూజీ అన్నాడంటే, 'ఆడది అసలు అర్థరాత్రిళ్లు బైటెందుకు తిరగడం' అనేసే మాగాళ్లు. పొట్టపగిలిపోయేటట్లు  అదో జోకన్నట్లు నవ్వి చచ్చే జోకరుగాళ్లు  ఉన్నారంటే  ఆ తప్పెవరిది? 'మగాడు ఎందుకు తిరుగుతున్నాడో అందుకు' అని ఆడది తెగించి జవాబు చెప్పినప్పుడు కదా మనకు నిజంగా స్వతంత్రం వచ్చినట్లు గుర్తు!' అంది చెంచులక్ష్మి ఆవేశంగా.
మేటర్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా ఆవిడగారి ఆందోళన అర్థం చేసుకోదగ్గదే! ఎమోషన్లో పదాలేవో అటూ ఇటూ పడతాయి. అది కాదు; విషయం ప్రధానం. రిజర్వడ్ చైర్లకు ఎన్నికైన ఆడవాళ్లలో ఎక్కువ భాగం ఆయా మొగుళ్ల చేతిలో కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారని ఒకానొక ప్రముఖ దినపత్రికలో ఆవిడ రాసిన వ్యాసం చదివిన రోజు నుంచి మా ఊరి మహిళామండలి సభ్యురాళ్లందరికీ ఆవిడంటే తగని అభిమానం పుట్టుకొచ్చినమాట నిజం. ఒకసారి చెంచులక్ష్మిగారిని మా ఊరు తీసుకెళ్లి సభ పెట్టిస్తే నాకు మంచి క్రెడిట్ దక్కుతుంది.  ఆ విషయమే అడగడానికి  అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా.  నా ఆహ్వానం విన్న మీదట నవ్వుతూ 'దాందేముందండీ! మా వారెప్పుడు ఖాళీగా ఉంటారో కనుక్కొని చెబుతాను. ఇద్దరికీ టిక్కెట్లు బుక్ చెయ్యాల్సుంటుంది మరి! ఒక్కదాన్నే అంత దూరం ప్రయాణమంటే ఏమంటారో మరి.. రోజులు అసలే బాగా లేవు కూడా !' అంటూ లేచి నిలబడింది!
'మమ్మీ! ఇంకెత సేపే! డాడీ నిన్ను టిక్కెట్లు తీసుకోమన్నాడు. లేడీస్ క్యూలో అయితే రష్ తక్కువగా ఉంటుందట!' అంటూ పుత్రరత్నం సెల్ చేతిలో పట్టుకుని పరుగెత్తుకుంటు వచ్చేసాడు.
'సినిమాకా?' అని అడిగింది మా ఆడపడుచు. 'అవును ఏడుపు టీవీలు చూడలేక పిక్చర్కే ప్లాన్ చేసారు మా వారు. సీరియల్ అయితే మళ్లీ రేపు కూడా వస్తుందిగా. అందునా మగాళ్లు అడిగినప్పుడు కాదంటే ఇల్లో పార్లమెంట్ అయిపోతుంది' అని హడావుడిగా లోపలికి పరుగెత్తింది. తయారవడానికి కాబోలు !
'ఏం సినిమారా.. చిన్నా?' అని మా ఆడపడుచు అడిగిన ప్రశ్నకు ' రేణుకాదేవి మాహాత్యం' అనేసాడు అభం శుభం తెలియని ఆ ఇంటి పార్లమెంట్ నామినేటెడ్ మెంబర్ భడవా !
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020
***
(ఇల్లే పార్లమెంట్ - పేరుతో ఈనాడు దినపత్రిక 17 -02 -2003 లో ప్రచురితం)



Sunday, August 30, 2020

రక్తదానం- కర్లపాలెం హనుమంతరావు-




తారతమ్యాలు లేకుండా దానం ఇవ్వగలిగింది రక్తం. ఆ దానానికి మనుషులందరిని మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్. 14 వ తేదీని రక్తదాన దినోత్సవంగా నిర్దేశిస్తే, ఆ విధంగా రక్తం ఉదారంగా దానం చేసే కర్ణులను గుర్తించి గౌరవించేందుకు 'ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్' అనే అంతర్జాతీయ రక్తదాతల సమాఖ్య స్థాపించబడింది. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసే దాతలను గుర్తించి వారిని గౌరవించడం ద్వారా సమాజంలో రక్తదాన స్ఫూర్తిని మరింత పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది.
రక్తానికి గడ్డకట్టే స్వభావం ఉంది. అయినప్పటికీ ఒక పరిమిత కాలం వరకు దానిని నిలువచేసే సాంకేతిక పరిజ్ఞానం అభివృధ్ధి చెందింది. ఆ తరువాతనే 'బ్లడ్ బ్యాంకులు' స్థాపన అభివృద్ధి చెందింది. బ్యాకులు దేశ దేశ ఆర్థికరంగ పరిపుష్టికి ఎంత అవసరమో, బ్లడ్ బ్యాంకులు దేశ ఆరోగ్య రంగ పరిపుష్టికి అంతే అవసరం. కొన్ని కొన్ని ప్రదేశాలలో, రహదారుల వెంట ప్రమాదాలు తరచూ జరిగే అవకాశాలు కద్దు. ఆ తరహా ప్రాంతాలను గుర్తించి ఆ దారి పొడుగూతా రక్త బ్యాంకులు ఏర్పాటు చేయడం ఉచితం. అందుకోసమైన ప్రజలలో రక్తాన్ని ఉచితంగా దానం చేసే అలవాటు అభివృద్ధి చెందవవలసిన అవసరం ఉంది.
శరీరం ఉత్పత్తి చేసే రక్తాన్ని గురించి చాలా మందికి సరి అయిన అవగాహన ఉండదు. రక్తాన్ని దానం చేయడం అంటే ఒంట్లోని రక్తాన్ని తోడేయడంగా భావించరాదు. ఎంత రక్తం బైటికి పోతుందో అంతే మోతాదులో రక్తం కొత్తగా శరీరం ఉత్పత్తి  చేస్తుంది. కొత్త రక్తం వంటికి పట్టిన తరువాత మనిషిలోని పూర్వపు మందగొడితనం కొంత తగ్గి,  నూతనోత్సాహం అనుభవంలోకి వస్తుంది కూడా.  వంటి రక్తంలోని చిన్నిపాటి కొవ్వు, మాంస కృత్తుల అసమతౌల్యత  దానికదే సర్దుకుని రక్తదాత ఆరోగ్యంలో మెరుగుదల శాతం పెరుగుతుంది కూడా
అట్లాగని అందరి శరీరాలు రక్తదానానికి అనువుకావు. 17 - 18 సంవత్సరాల వయసు దాటిన వారి దగ్గర నుంచి మాత్రమే రక్తం సేకరిస్తారు. దీర్ఘరోగ పీడితులు, పసిపిల్లలు, పెద్ద వయస్సువారు, మెన్సుయేషన దశ దాటిన స్త్రీల వంటి వారి రక్తం దానానికి స్వీకరించడం శ్రేయస్కరం కాదని ఆరోగ్యశాస్త్రం హితవుచెబుతోంది.
రక్తదానం చేయాలనుకునేవారు తమ పేరును ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. దాత ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అర్హుడు అని నిర్ధారణ అయితే స్వచ్ఛంద దాతగా పేరు నమోదు చేసుకుంటారు. అవసరమైన సందర్భంలో రక్తదానం చెయ్యడానికి పిలుపు వస్తుంది. రాకపోయినా ఏ పుట్టినరోజు వంటి సందర్భాన్ని మనమే  కల్పించుకుని రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయనూవచ్చు. తమ అభిమాన సినీకథానాయకుడు జన్మదినోత్సవమనో, తమ రాజకీయ అధినేత పిలువు ఇచ్చాడనో సామూహికంగా రక్తదానం చేసే సందర్భాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. స్వఛ్ఛదంగా రక్తం దానం చెయ్యడం కూడా ఒక రకమైన సామాజిక సేవా కార్యక్రమం కిందే లెక్క
రక్తదాతల కరవు వల్ల రక్తాన్ని అమ్ముకునే దురాచారం ఒక వృత్తిగా అభివృద్ధి చెందే అవకాశం తగ్గుతుంది
 'రక్తం ప్రాణులను కాపాడుతుంది. ఆ రక్తదానం నాతో మొదలవుతుంది. స్వచ్ఛమైన రక్తం అందిస్తాను' అన్న నినాదంతో తొలి రక్తదాన దినోత్సవం ప్రారంభమయింది. ఆ నినాదాలు మానవజాతిని శాశ్వతంగా నిలబెట్టే విలువైన నినాదాలు. 'మోర్ బ్లడ్.. మోర్ లైఫ్' లాంటి నినాదాలు ఒక్కో ఏడు ఒక్కొక్కటి తీసుకుని  రక్తదాన దినోత్సవాలు సంరంభంగా జరపడం రివాజుగా వస్తోంది 2004 నుండిమొదటి రక్తదాన దినోత్సవం దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ నగరం నుంచి నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ప్రపంచమంతటా ఈ రక్తదాన దినోత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.
రక్తానికి ఉన్న విలువను గుర్తించడం ముఖ్యం. అయినవారు ఆపదలో ఉన్నప్పుడు, బంధువులు రోగికి సరిపడా రక్తం కోసం వెదుకులాడుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు రక్తం విలువ మనకు అర్థమవుతుంది. రైలు, రోడ్డు ప్రమాదాలు వంటివి పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో రకరకాల రక్తం అవసరమవుతుంది. రక్తం ముందే సేకరించి భద్రపరిచి ఉంచిన సందర్భాలలో అధిక మోతాదులో జరగబోయే ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. స్త్రీల ప్రసవాల సందర్భంలోనూ, కేన్సర్ వంటి రోగులకు.. దీర్ఘకాలిక రోగాల నుంచి కోలుకునేవారికి చికిత్సలు అందించే సందర్భంలోనూ రక్తం ప్రాధాన్యత బాగా పెరుగుతుంది.
మనిషి ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు బాధితుడిని కాపాడే దేవుడు వైద్యుడు అయితే, ఆ దేవుడికైనా సమయానికి అందుబాటులో ఉండవలసిన ముఖ్యమైన సాధనాలలో రోగికి సరిపడే  రక్తం చాలినంత ఒకటి. సరయిన గ్రూపు రక్తం, సరిపడా సమయానికి  దొరికినప్పుడే ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం.  అంత గొప్ప విలువైన సాధనం ప్రతి మనిషి వంట్లోనూ నిరంతరం రక్తం రూపంలో ప్రవహిస్తూనే ఉంటుంది. దానిని పరిమితులకు లోబడి దానం చేసినందువల్ల నష్టం ఏమీ ఉండకపోగా లాభాలే అదనం. ఆ విశేషం ప్రతీ వ్యక్తీ గుర్తించాలి. ఆ విధంగా గుర్తించే దిశగా ప్రభుత్వాలుగాని, ఆరోగ్య సంఘాలు గాని స్వచ్ఛంద అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేయాలి.  
రక్తదానంతో మరో ప్రాణి జీవితాన్ని కాపాడవచ్చన్న సత్యం ఆరోగ్యశాస్త్రం పసిగట్టినప్పటి నుంచి రక్తదానానికి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. రక్తంలోని కణాల నిర్మాణం గ్రూపుల ద్వారా నిర్దారించబడుతుంది. ఓ పాజిటివ్ గ్రూప్ గల మనుషులు సాధారణంగా ఎక్కువ సంఖ్యలో లభ్యమవుతుంటారు. రక్తానికి సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య శాస్త్రం 'హెమటాలజీ' రక్తానికి ఉన్న భిన్నమైన గ్రూపులు, ఆర్ హెచ్ లక్షణం గుర్తించి, వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోనికి రక్తాన్ని ఎక్కించే సాంకేతిక ప్ర్రరిజ్ఞానాన్ని మరింత  అభివృధ్ధి పరిచింది, అప్పటి నుంచే 'రక్తదానం' ఆలోచన ఒక ముఖ్యమైన ఆదర్శ సామాజిక అంశంగా రూపుదిద్దుకొన్నది. దానిని మరింత ప్రచారంలో పెట్టడం అంటే పరోక్షంగా అయినా మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా సాయం అందిస్తున్నట్లే లెక్క. మన శరీరంలో పారే ఒక్కక్క రక్తపు చుక్క మన ఒక్కళ్లకే కాదు.. అవసరమైనప్పుడు లక్షలాది మంది ఇతరుల ప్రాణాలను రక్షించే క్రతువులో సమిధ కింద కూడా సమర్పించవచ్చు. ఈ దిశగా ఒక సదాలోచన ప్రతీ వ్యక్తిలో కలిగించడం, స్వయంగా స్వచ్ఛందంగా ఆ తరహా రక్త దానం చెయ్యడం= రెండూ మనిషిగా పుట్టినందుకు మానవజాతికి ఇతోధికంగా మనం చేసుకునే ఉత్తమ సేవాకార్యక్రమాలే!
-కర్లపాలెం హనుమంతరావు
(జూన్. 14 వ తేదీ రక్తదాన దినోత్సవం)
***

Saturday, August 29, 2020

బాపూజీ పట్ల ఇంత అపచారమా? -కర్లపాలెం హనుమంతరావు-సూర్య దినపత్రిక ఆదివారం ప్రచురణ




'అసంఖ్యాకమైన భారతీయులకు నేనివాళ ప్రతినిధిగా నిలిచానంటే .. అదిఆయాచితంగా నాకు దక్కిన స్థానం కాదు. కష్టించి నేను సాధించుకున్న గౌరవం'అన్నాడు గాంధీజీ. వినేందుకు డంబంగా అనిపించినా తనను గురించి  తానా హాఫ్నేకెడ్ ఫకీర్ బాహాటంగా చెప్పుకున్న మాటల్లో వీసమెత్తైనా అసత్యం లేదు.

బాపూజీ తనకు తానుగా సంకల్పించుకుని ఉత్తమ మానవుడుగా ఎదిగేందుకు సర్వశక్తులూ ఒడ్డి చిత్తశుద్ధితో కృషిచేసిన రుషితుల్యుడు! ఆయన సత్యంతో చేసిన ప్రయోగాలు పుస్తకం నిజానికి ఒక విశిష్టమైన వ్యక్తిత్వ వికాస పాఠ్యగ్రంథం. జీవితంలో మనిషి మనీషిగా ఉన్నత దశ వైపుకు ఎదగాలంటే, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో ఆయన ఎక్కడా పాఠంలాగా చెప్పకపోయివుండవచ్చు. కానీ ఆ మహాత్ముడు తనలో తానుగా ఎచెప్పుకున్న నా జీవితమే నా సందేశం అన్న ఆ



ఒక్క ముక్కలోనే అన్ని అర్థాలు దాగి ఉన్నాయి.   ఎవరికి కావాల్సిన అర్థాలు వాళ్లు సులభంగా వెదుక్కోనేందుకు వీలైన నిండు ప్రయోగశాల  బాపూజీ జీవితం.



గాంధీజీ ద్వారా సాధించబడిన స్వాత్రంత్ర్యం ఒక్కటే కాదు, కొల్లాయిగుడ్డ, మేకపాలు, బాదంపప్పు, ప్రకృతివైద్యం, అల్పాహారం, నిరాడంబరత, అహింసావాదం, పేదరికం ఇత్యాదులన్నింటికి భారతీయుల వరకు బాపూజీనే తిరుగులేని అంబాసిడర్.. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ. ఆయన జనంమనిషి అన్న మాట అసత్యం  కాదు.  కానీ, సాధారణ జనం అయన దాకా చేరుకునేందుకు ఎన్నో అసాధారణ

శక్తులు అడ్డుండేవి ఆ రోజుల్లో. బడా బడా వ్యాపారవేత్తలను, బడాయిలు పోయేరాజకీయనేతలను, అసంఖ్యామైన కుబేరులను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి

మామూలు మనిషికి ఇబ్బందిగా ఉండేది. గాంధీజీ కోరుకుంటే తప్ప ఆయన దర్శనం సామాన్యులకు అంత సులభంగా సాధ్యమయ్యే వ్యవహారంగా ఉండేది కాదన్న మాట నిజం. అయినా  భరతజాతికి ఆయన మీద ఉన్న అభిమానం కాలం గడిచే కొద్దీ పెరిగిందే తప్పించి తగ్గుముఖం పట్టిన దశ ఎన్నడూ లేదు. గుళ్లో దేవుడి దర్శనం కాలేదని దేవుడి నెవరూ తప్పుపట్టరు కదా! గాంధీజీ విషయంలోనూ అదే ప్రభ సాగింది

చివరి రోజు వరకు.


గాంధీజీ సిద్ధాంతాలు గాజు అద్దాలు బిగించిన షో కేసుల్లో అందంగా అమర్చిన కళాఖండాల స్థాయికి ఎదిగి చాలా కాలమయింది. కేవలం వాటిని కళ్లతో చూసి ఆనందించడమే తప్పించి, చేతిలోకి పుచ్చుకుని వాడుకునే సౌకర్యం లేకుండా పోయిందన్న నిష్ఠురం ఉండనే ఉంది. నాడు గాంధీజీ చుట్టూ చేరినవారు గాని,

నేడు గాంధీజీ  జపం చేస్తున్నవారిలో గాని, ఆయన భావజాలం పట్ల ఏ మేరకు అవగాహన ఉందో .. అనుమానమే! బాపూజీ బతికున్న రోజుల్లోనే ఆయన ఆదర్శభావాల పట్ల అంతులేని అయోమయం ప్రదర్శించిన నేతాగణం, ఇన్ని తరాలు గడచిన తరువాతనా ఇహ ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకొనే ప్రయత్నం చేసేది? బాపూజీ చేసిన ఆఖరు పోరాటం ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యం  ఇన్ని తరాలుగా మనం అనుభవిస్తున్నాం.  అయినా ఇంకా 'గాంధీయిజం   రెలెవెన్స్' ను గురించి దేశం ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేకపోవడం ప్రపంచంలో మరెక్కడా జరగని వింతగానే చెప్పుకోవాలి గదా!  బాపూజీ నిరాడంబరతను గురించి కథలు కథలుగా చెప్పుకునే మనమే, ఆయన  జీవన శైలి ఎందువల్ల ఎందుకంత ఖరీదైన సింప్లిసిటీ చట్రంలో బంధించివుంచామో చెప్పగలమా?  పుట్టపర్తి సాయిబాబా చుట్టూ చేరిన భక్తబృందానికి, బాపూజీ చుట్టూ ఆనాడు చేరిన భజనబృందానికి వేష భాషలలోనే తప్ప ఆచరణ వ్యవహారాలలో ఆట్టే తేడా లేదంటే నొచ్చుకునేవారే ఎక్కువగా ఉండవచ్చు. బాబా చెప్పిన ఆచరణీయ సాధ్యంకాని ఆధ్యాత్మిక సిద్ధాంతాల వల్లెవేతకు బాపూజీ నోట పలికిన అభ్యుదయ భావజాలానికి ట్యాగులోనే తప్ప

స్వభావంలో ఆట్టే తేడాలేదంటే కొట్టొస్తారేమో కూడా మూఢభక్తులు. నిజానికి ఖరీదైన జీవితం గడిపేవారూ, జనాలను రకరకాల మార్గాల ద్వారా          దోపిడీచేసేవారు,

అధికారదాహార్తులు బాపూజీ భజన బృందంలో ఆనాడు ఎక్కువగా కనిపించేవాళ్లు. అట్లాంటి వాళ్లని దూరంగా పెట్టాలని బాపూజీ అంతరంగం ఎంతలా కొట్టుమిట్టులాడినా అది బాపూజీకే స్వయంగా సాధ్యంకాని పరిస్థితి.

గాంధీజీలోని ప్రధాన లోపం.. ఆయన తన జీవించివుండగానే బహుశా మానవమాత్రుడెవరూ ఊహించనైనా లేనంత అపారమైన అద్భుత జనాకర్షణ  కూడగట్టుకోవడం. దేవుడిని నిందించినా ఏ కొద్ది మందో కొంతయిన సద్దుకుపోయేవారేమో గానీ, బాపూజీ మీద ఈగ

వాలినా సరే భరించలేనంత ఉద్వేగం  ప్రదర్శించిన  జనాభిమానం ఉన్న ఒకానొక కాలం కద్దు. అతనిపై ఉన్నతవర్గాల ఆకర్షణకు స్వార్థం కారణమైతే, కింది వర్గాల వారి ఆకర్షణకు కేవలం అమాకమైన అభిమానమే కారణం. వీధిలో నిప్పంటుకుంటే ఎంత అసూర్యంపశ్యజాతి వారైనా ఒకసారి అటుకేసి తొంగిచూడకుండా ఉండలేరు. నిప్పుకున్న ఆకర్షణ శక్తి బాపూజీ వ్యక్తిత్వానికి సమకూరడం కాకతాళీయమేమీ కాదు. అసలే మేలిమి బంగారం. ఆ పైన అద్భుత ప్రచారం. మహాత్ముడు సమకూర్చుకున్న అశేష అమితాకర్షణ శక్తికి జంకే తెల్లవాడు ఠారుకుని  భరతగడ్డ మీద నుంచి తారుకున్నది కూడా.



బాపూజీ పై 1948, జనవరి, ముఫ్ఫై నాడు జరిగిన అఘాయిత్యం కాకతాళీయమేమీ కాదు. అంత ఊహించకుండా వచ్చిపడిన ఉపద్రవమూ కాదు. చరిత్రలో ఆ తరహా పాఠాలు ఏ వైరుధ్య వర్గాల మధ్య సామరస్యం కోసం చేర్చడం తప్పించారో అప్పడున్న పరిస్థితుల్లో నిగ్గుతేల్చడం కష్టతరమయివుండవచ్చు గాని.. ఇప్పుడంతా నీళ్లకు నీళ్లు. పాలకు పాలుగా తేటతెల్లమవుతూనే ఉన్నమాట నిజం.  బాపూజీ

దరిద్రకోటి ఉద్ధరణకై తన జీవితాన్ని మీదు కట్టినమాట ఎంత వాస్తవమో, ఆయన ముద్ర చూపించి ధనవంతులు, బలవంతులు మరింత ధనం, బలం సాధించుకున్న మాటా అంతే వాస్తవం. ఇందులో బాపూజీ ప్రమేయం ఏమీ ఉండకపోవచ్చును గానీ, తన పరంగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాల పట్ల ఆయన కేవలం ప్రేక్షకపాత్ర వహించడం మాత్రం విమర్శనార్హమే అవుతుంది కదా సమానమానవత్వకాంక్షాపరుల దృష్టికి!గాంధీమతం అభివృధ్ధి చెందుతున్న దశకు ముందు నుంచే దేశంలో ఎక్కువ మంది విశ్వసించే మతం అంతకు మించిన స్థాయిలో   చెలరేగిపోతోంది. స్వాతంత్ర్యపోరాటంలోకి ఆ విశ్వాసులు కేవలం దినదినప్రవర్థమానమయే 'గాంధీ'తేజం నిలవరించే ముఖ్యోద్దేశంతోనే లాగబడ్డారనే వాదానికి ఆధారాలులేకపోలేదు. అప్పటికే గాంధీ ప్రవచిత హరిజనోద్ధరణ,  మతసామరస్యం  వంటి సగుణాత్మక భావజాలం ప్రజాకోటి గుండెలను పట్టేసున్న పరిణామం. సంకుచిత మతతత్వ శక్తులకు  మింగుడుపడని విపరిణామం. బాపూజీ సైతం హిందూ ధర్మోద్ధరణకై పంతగించినవాడే అయినప్పటికి, ఆయనది ఉదారవాదం, సంస్కరణకోణం. నేరుగా బాపూని ఎదుర్కొనే పరిస్థితులు రాను రాను మరింత దుర్భరమయ్యే పరిణామాలను ముందే ఊహించి, ఆ మతవాదులు సహజంగానే అందుకు అడ్డుకట్టవేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బాపూజీకి దేశం మూలమూలలా పూజలు అందే కాలంలోనే, అదే దేశంలో ఆయనను అంతమొందించే పథకాలకు దేశమంతటా ఆలోచనలు చేయబడ్డాయి. 'ఒక మహాపురుషుడి కోసం దేశమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది' అన్న బాపూజీ హత్యనాటి నెహ్రూజీ విషాదప్రకటనలో ఉన్నదంతా 'శుద్ధసత్యం' అంటే ఒప్పుకోలేం. శాంతిదూత చావు ఆవశ్యకతపై ముందు నుంచే  రహస్య కరపత్రాలు పంచబడ్డాయని వినికిడి. ఆ 'శుభ' వార్త వినేందుకు కొంతమంది 'విశ్వాసులు' టెలిఫోన్ల వద్ద కాచుకుని కూర్చున్నట్లు రికార్డులు తరువాత బైటపడ్డాయి. బాపూజీ 'హే..రామ్' అంటూ  నేలకొరిగిన రోజున వేలాదిమంది సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారంటే.. 'బాపూజ్యోతి' మలిగిపోవడం భారతీయం వంకన జరిగే ఒక మతప్రాభవానికి ఎంత

అగత్యమయిందో అర్థంచేసుకోవచ్చు.



భజనల ద్వారా, కల్లిబొల్లి కన్నీళ్ల ద్వారా ఒక సత్యాన్ని మరుగుపరిచే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగడమే జుగుప్సాకరం. నీచశక్తుల పెత్తనానికి ఒక వైయక్తిక శక్తి  అడ్డంకి అయిన  ప్రతీ సందర్భంలోనూ చరిత్రలో ఏం జరిగిందో, మహాత్ముని జీవితంలోనూ అదే జరిగింది. మనిషిని మట్టిలో కలిపేసి, మట్టి విగ్రహాలను నెలకొల్పడం జాతి పట్ల చేసే ద్రోహానికి కొనసాగింపే తప్ప మరోటి కాదు. విశ్వాస పునరుద్ధరణ మిషన స్వార్థశక్తుల పెత్తనం అప్రతిహతంగా కొనసాగేందుకే బాపూజీ బలికావలసొచ్చిందన్న మాట పచ్చి నిజం.  బాపూజీని గొప్పచేసి ఇప్పటి వరకూ బతికేసిన వారి పాత్రా ఈ వంచనాత్మక రూపకంలో తక్కువేమీ లేదు.



ఏటేటా మహాత్ముడి జయంతులు, వర్థంతులు దశాబ్దాల తరబడి మహా ఆర్భాటంగా  జరుగుతున్నా .. ఆయన అహర్నిశలు కలవరించిన బడుగుజీవుల ఉద్ధరణల వంటి

సంస్కరణలు ఒక్కరడుగైనా ముందుకు పడ్డాయా? స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దరిద్రుల బతుకు మరీ దుర్భరమయిందని నిస్పృహచెందేవారు ఇన్ని దశాబ్దాలు

గడిచినా తగ్గుముఖం పట్టడంలేదంటే ఏమిటర్థం?



తుపాకీల నీడన పాలన ఇప్పుడు సర్వసామాన్యమైపోయింది. అహింసాసూత్రమయితే ఏనాడో చేవచచ్చిపోయింది. సత్యంతో సమాజం, రాజకీయం ఇప్పుడు చేసే తమాషా ప్రయోగాలు బహుశా బాపూజీ బతికున్నా ఊహించగలిగివుండునా? తెల్లవాళ్లను మించినన్ప్రన్జాకంటకులు ఇప్పుడు ఎన్నికల నెచ్చెనలేసి జాతి నెత్తినెక్కి మొత్తేస్తున్నారు. గ్రామస్వరాజ్యం గుత్తకు ఇచ్చే పెత్తందారీల వ్యవహారమయిపోయింది. వంటికి నిండుగా బట్ట, కడుపుకు నిండుగా తిండి కోరడమే ఇప్పుడే పెద్ద దేశద్రోహం. సాంఘిక దోపిడీ అనేది ఒకటి ధాటిగానడుస్తున్నదన్న స్పృహే సమాజానికి ఇవాళ బొత్తిగా లేకుండా పోయింది. హరిజనుడు, బడుగుజీవుడు, బలహీనుడు, గ్రామీణుడు, శీలవతి, పసిబాలుడు, వికలాంగుడు, ముసలిమనిషి, సాగు పనులు, చేతివృత్తులు, కుటీర పరిశ్రమ, స్వపరిపాలన, పారదర్శకత, నీతి మార్గం.. ఇలా బాపూజీ భారతీయుల అభ్యున్నతి కోసమై కలవరించని అంశం కనిపించనే కనిపించదు. ఏ ఒక్క రంగమైన బాపూజీ కలలు కన్న రామరాజ్యం తీరులోన సాకారమయే లక్షణాలు కనిపిస్తున్నాయా?

'నేను గాంధీజీ వారసుణ్ణి' అని ప్రకటించుకున్నా ఒక్క ఓటు అదనంగా సాధించే పరిస్థితులు లేనప్పుడు గాంధీగిరీ రెలెవెన్సు గురించి ఇహ చర్చలెందుకు? తాగడం మానెయ్యమని ఆయన నెత్తీ నోరు కొట్టుకుని బోధించినమద్యం మీది ఆదాయమేఇప్పుడు ప్రభుత్వాలు పేదల కోసమై నడిపించే  సంక్షేమ పథకాలకు    ప్రధాన వనరు. ఒక్క కరెన్సీ నోటు పైన మినహా  దశాబ్దాల కిందట జాతి మొత్తాన్నీ సమ్మోహపరచిన ఆ బోసినవ్వుల బాపూజీ మందహాసం మరెక్కడా కనిపించనప్పుడు .. ఇంకా 'రామ్.. రహీమ్ భాయీ.. భాయీ' అంటూ నాటకాలు ఆడడం  రాజకీయం కాక మరేమిటి?

అధర్మం ప్రబలి ధర్మచ్యుతి జరిగినప్పుడు అవతారపురుషుడు జన్మించి దుష్ట శిక్షణ, ధర్మరక్షణ కార్యాలు నిర్వహిస్తాడన్న విశ్వాసం వినడానికి చెవులకు కమ్మగానే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఏది దర్మమో, ఏది అధర్మమో రాజ్యాంగమే తేల్చలేని సందర్భాలు ఇప్పుడు తరచూ ఎదురవుతున్నాయి! పూటకో సరికొత్తనేత తానొక్కడే గాంధీ మహాత్ముణ్ణి మించి ప్రజాసేవకు అంకితమయేందుకే ముందుకు వచ్చినట్లు సరసాలాడుతుంటే జనం మరింత అయోమయంలో పడి ధర్మాధర్మ విచక్షణశక్తి సర్వం కోల్పోతున్నారు. ధర్మరక్షణకు తొమ్మిది అవతారలు వచ్చిపోయినట్లు  మనం గాఢంగా విశ్వస్తున్నామంటే, ఏ ఒక్క అవతారం సంపూర్ణంగా పాపప్రక్షాళన చేయనట్లే  కదా? రాముడంతవాడు ఏ ధర్మ రక్షణకని భూమ్మీదకుదిగివచ్చాడో.. పాపం,  ఆ ధర్మరక్షణ కడదాకా నిర్వహించలేకనే  సరయూనదిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది. అనుభవం మీద కృష్ణావతారంలో అందుకే భగవంతుడు  మరీ అంత ముక్కు సూటిమార్గం ఎంచుకోనిది. చక్రవ్యూహం దారిలో వెళ్లినప్పటికీ చివరికి స్వజాతిలో పుట్టిన  ముసలమే  ఆయనను ముప్పతిప్పలు పెట్టింది! కృష్ణనిర్యాణం చివరికి జరిగింది తన మానాన తాను వృత్తి చేసుకునే ఓ కిరాతకుడి ద్వారానే అయినా, కిరాతకుడు కిరాతకుడే! ధర్మావతారాలన్నీ ఇలాగే కిరాతకుల చేతనో, నీచుల చేతనో చివరికి అంతమయిపోవడం కాకతాళీయం అనుకోవడానికి లేదు, గాంధీజీని మోహన్ దాస్ గాందీలాగా  ఉండనిస్తే ఆయన కోరుకున్నట్లు నిండు నూరేళ్లు పండులాగా బతికి జాతి నుంచి అసలైన మానుషనీతిని రాబట్టి వుండేవాడేమో! భక్తి మూఢభక్తికి దిగి ఆయనను అవతారపురుషుడు స్థాయికి ఎత్తే సరికి, ఆ అవతార అంతానికి చరిత్రకు మరో కిరాతకుడి చర్య అవసరమయింది. జాగ్రత్తగా గమనించి చూడండి, అవతార పురుషులందరూ ధర్మోద్ధరణకు కాకుండా, మనుషుల్లో ఎంత నీచత్వం దాగుంటుందో చూపించడానికే అవతరించినట్లు అనిపిస్తుంది.  కొడవటిగంటి కుటుంబరావుగారు అన్నట్లు,  బాపూజీ తన మరణం ద్వారా మన మనుషుల మధ్యలోని నీచత్వాన్ని నగ్నంగా నిలబెట్టడానికే పుట్టినట్లు అనిపిస్తుంది నిజానికి.

ఆ నీచత్వం పోగొట్టుకోవడమే బాపూజీకి మనం ఇవాళ నిజంగా ఇచ్చే నివాళి.  ఆ పని మీద దృష్టి పెట్టకుండా పై పైన కొంగభక్తి నటిస్తూ, లోలోపల ఆ మొండి మనిషి ఇప్పుడు బతికిలేనందుకు సంబరపడ్డమే నీచాతినీచం. అట్లా ఆనందపడడం మన స్వార్థం కోసం ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఆ అహింసామూర్తిని చంపుతున్నట్లే! ఆనాడు తెల్లపాలకుడు కూడా చేయడానికి  వణికిపోయిన కిరాతకం ఈనాడు మనం చల్లంగా చేయడానికైనా వెనుకాడడంలేదు. ఎంత సిగ్గుపడాల్సిన దుర్గుణం!
 -కర్లపాలెం హనుమంతరావు
 ***
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...