Showing posts with label Animals. Show all posts
Showing posts with label Animals. Show all posts

Saturday, March 13, 2021

పశురాజ్యం పార్టీ వర్ధిల్లాలి! – సరదాకే -కర్లపాలెం హనుమంతరావు

 


'' ఫర్ 'ఏపిల్' ఏంటి..విడ్డూరంగా! '' ఫర్ 'ఎనిమల్'..'బి' ఫర్ బఫెల్లో.. 'సి' ఫర్ కౌ..'డి' ఫర్ డాంకీ..ఇలా ఏవైనా జంతువుల పేర్లు పెట్టుకోవచ్చుగా ! తమరి ఆత్మ గౌరవానికి భంగమా?

అబ్బో! 'మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఏనిమల్' అని మళ్లీ మీరేగా లెక్చర్లు దంచేదీ! అంటే 'ఏనిమల్ ఈజ్ ఆల్సో  ఏ సోషల్ మ్యాన'నేగా అంతరార్థం?

ఎదుకో ఆ చిరాకూ? తమరు పడీ పడీ  దణ్ణాలూ దస్కాలూ పెట్టుకునే దేవుళ్ళందర్నీ వీపుల మీదెక్కించుకుని ఊరేగించే దెవరూ? మేం కాదూ! ఆదిదేవుడికి వాహనం మా మహానంది. ఆ నందిని బంగారంతో తాపడం చేసందిస్తే సరి.. మా షోగ్గా  షోకేసుల్లో దాచేసుకుని తెగ మురిసానందిస్తారు! నిజం నందిని మాత్రం పంది కన్నా హీనంగా ఇంటెనకాల గొడ్లచావిట్లో మురికి గుంటల మధ్య బందీ చేస్తారు. దాని నోటి కాడ గడ్డిని మీరు మేస్తారు. పేరు వినీ వినగానే తమరికి ముచ్చెమటలు పోస్తాయే..   మృత్యు దేవత యమధర్మరాజా వారి వాహనం ఏదీ? ఎనుబోతు. కాలయముణ్ణి చూస్తే కాళ్ళు వణుకుడూనూ.. మా దున్నపోతును చూస్తే చిన్న చూపూనా! అందుకే  మీ  మనుషులందరిదీ ద్వంద్వ నీతనేది.

మీకన్నా మేమెందులో తీసిపోయామో! కులాలు, మతాలు, రంగులు, హంగులు అంటూ మీలో మీకే ఎన్న్ని అంట్లూ..సొంట్లు! పేరుకే మా నెత్తిమీదవి కొమ్ములు. అసలు కుమ్ముళ్లన్నీ రక రకాల  పార్టీల పేర్లతో  మీవి. పైపెచ్చు మీ రొచ్చు కీచులాటల మధ్యలోకి ఏ సొమ్మూ సంబధం లేకపోయినా 'ఎద్దులూ.. మొద్దులూ..దున్నపోతులూ.. గొడ్దుమోతులూ' అంటో  మా పేర్లు లాక్కొచ్చి  తిట్లూ.. శాపనార్థాలా!

మా సాయం లేకపోతే మీ వ్యవసాయం క్షణం ముందుకు సాగదు. మేం కాడిని వదిలేస్తే  మీ బండి గజం ముందుకు నడవదు. మా దూడల్ని  దూరంగా నెట్టేసి మా పాలు మీరు కాఫీలు టీనీళ్ళకు వాడేసుకుంటున్నా.. పోనీలే పాపం.. మీ పాపానికి మీరే పోతారని చూసీ చూడనట్లు పోతూ ఉంటే..  మా పోతులంటే మీకింత అలుసా?

 మా గొడ్డూ గోదా గాని రోడ్డు కడ్డం పడితే మీ బుల్లెట్ ప్రూఫులూ, బుగ్గ కార్లూ ఒక్కంగుళం ముందుకు జరగ్గలవా? తోక ముండిచిందాకానే మేం గంగి గోవులం.  లిక్కరు పాకెట్లకు .. చిల్లర నోట్లకు.. కుక్కల్లా తోకూపే మీ బక్క ఓటర్లం కాం మేం! చెత్తనేతల మీద విసుగెత్తున్న  జనం విసిరే పాత జోళ్లలోనుంచీ మా నిరసనలు  వినిపిస్తునే ఉంటాం.

అక్కరయిన దాకా మాకు దణ్నాలు దస్కాలు. అక్కర తీరినాక  గొడ్దుమోతులని ఎకసెక్కాలా? పుష్టిగా ఉన్నంత కాలం మా పుష్టభాగాల క్కూడా పూజలూ.. పునస్కారాలు. కాస్త ఈడిగిల పడితే చాలు కబేళాలకు ఈడ్చి పారేయడాలా?! మీ కడుపుకిన్ని తిండి గింజ లందించే అన్నదాతలమే.. మానోటి కాడి ఎండుగడ్డి కాడ క్కూడా పాలుమాలుతారా? నేతంటే మోతగా మేత మేసేవాడనేనా మీ అర్థం? మా కాలి గిట్టల్నుంచీ నెత్తిమీది కొమ్ముల్దాకా దేన్నీ వదిలి పెట్టరా  మీరు! అచ్చమైన  పచ్చి వ్యాపారానికి అచ్చుపోసిన శాల్తీలు మీరు.

సిగ్గు ఎగ్గు లేకుండా నడి బజారులో మీరు నిలబెట్టే  బడిత బొమ్మల మానం పేడముద్దల మాటున దాచి కాచి కాపాడే శ్రీకృష్ణ పరమాత్ములం మేం. మేం నోరు చేసుకోబట్టే  మీ వీధులు చెత్తకుండీల కన్నా మెరుగ్గా ఉంటున్నాయి. బ్రిటన్ మహారాణి విక్టోరియా మ్యాడం కన్నా ఎక్కువ గ్లామరున్న మూగ జీవాలం మేం. మీ అభిమాన నటవిరాట్టులు గ్రాఫిక్సుల్లోఎన్ని  కుప్పిగంతులు వేసినా రావడం లేదు హిట్లు. మేం మాత్రం ఇలా కాస్త తోకలు  కదిలించినా చాలు చప్పట్లే చప్పట్లు. కోట్లే కోట్లు.

మాతోనే మీకు  అక్కర తప్ప మీరు తిని పారేసిన అరటి తొక్కతో కూడా మాకు  అవసరం పడదు. ఎన్నికల్లో మీకు మేమే పార్టీ గుర్తులం. మీ ఎన్నికల  ప్రచారాల హోరుకీ  మళ్ళీ మేమే ఆసరా. మీరు బాదే డోళ్ళు చచ్చినాకా మాట్లాడే మా వంటి తోళ్ళ నోళ్ళే. మీ మీ అధిష్ఠానాల ముందు మీరు ఊదే బూరాలు మా కొమ్ములు విజయ గర్వంతో చేసే హాహాకారాలు. మీకూ  మాకూ తేడా ఏముంది?మీరు చేతుల్తో వీపులు తోముకో గలరు. మేం తోముకోలేం. మేం తోకల్తో ఈగలు తోలుకోగలం. మీరు  తోలుకొంటారా?

ప్రజాసేవలో మేము మీరెన్నుకున్న ప్రతినిథులకన్నా ఎన్నో రెట్లు మెరుగు జీవులం. దున్నేకాలంలో దూరం పోయి.. కాసే కాలంలో కోడవలి తెచ్చే భడవలం కాం మేం. మాతో మీకు వారసత్వం పేచీ రాదు. కుంభకోణాల గోల ఉండదు.

పశువులనీ.. మనుషులనీ విభజించి చూస్తున్నారు చూడండీ..అదే సబబైన పద్దతి కాదన్నదే మా ఆవేదన. జనాభా లెక్కలు తీసినప్పుడల్లా 'ఓహో వందా పాతిక కోట్లు దాటేసిందండోయి  దేశ జనాభా'అంటో  ఒహటే దండోరా. అందులో అందరూ మనుషులే ఉన్నారా? నిజాయితీగా లెక్కలు తీసి చూడండి! మెజారిటీ మా పశువుల జాతిదే!  మీ మందల్ల్ల్లో మా పశువులెన్ని కలిసున్నాయో లెక్క లు తేలాలి ముందు. మా పోరాటం ఆ దిశగా సాగేందుకే ఈ మా కొత్త పార్టీ. దేశ జనాభాలో మెజార్టీ మా పశువులే అయినప్పుడు మీ  పాడు మనుషులకేల ఊడిగం చేయాలన్నది మా వాదన.

ఒకప్పటి ఉత్తర ప్రదేశ్ అమాత్యవర్యులు అజం ఖాన్ గారి రాంపూర్  బందిల దొడ్దినుంచి ఈ మధ్యనే స్వేచ్చా ప్రపంచంలోకొచ్చి పోయాయి  ఏడు ఎనుబోతులు. ఆ చైతన్యమూర్తులు స్ఫూర్తితోనే  మేమూ అర్జంటుగా ఓ ఫ్రంటును కట్టే ఏర్పాట్లలో ఉన్నాం. దేశ జనాభాలో   దామాషా ప్రకారం చూసుకున్నా అధికార పీఠం మా పశుజాతికే దక్కడం న్యాయం. శతాబ్దాలు గడిచి పోతున్నా మా పశుభాషకు ఇంకా అధికార హోదానే దక్క లేదు. 

ఏ సేవలూ అందించకుండానే ఎన్నికల్లో నిలబడి ఎందరో  ప్రజానాయకులుగా తయార వుతున్నారు. మేం మాత్రం ప్రజాసేవలో  ఎవరికి తీసి పోయాం?  తేనీరు అమ్మే మనిషి ప్రధాని పదవికి పోటీ పడుతుండగా లేనిది.. తేనీటిలోకి పాలందించే పశువులం అధికారంలో మా పాలు కోరుకోవడంలో తప్పేముంది? రాబోయే ఎన్నికల్లో మా  పశుజాతి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇదే తగిన అదనని అభిప్రాయ పడుతున్నాం.

ఇప్పుడున్నవన్నీ నకిలీ పశుప్రభుత్వాలు.అసలైనపశువుల పాలనెలా ఉంటుందో ఒక అవకాశమొస్తే రుచి చూపిస్తాం.

ఇల్లంతా యథేచ్చగా  కలాపులు చల్లుకోవడానికి  గోమయం ఉచితంగా సరఫరా చేస్తాం. ఏడాదికి వంద పిడకలు సబ్సిడీ ధరలో ఆడపడుచులకు అంద చేస్తాం. పిల్లా జెల్లాకు నీళ్లు కలపని పాలు గొడ్లు ఇళ్లముందే  పిదికిచ్చి పోయే ఉచిత  పథకాలు ప్రవేశ పెడతాం. ఇంటింటికీ ఒక 'స్టేటాఫ్ ఆర్ట్' గొడ్ల చావిడి.. పండగ రోజుల్లో పుణ్య సంపాదనకు భక్తుల సన్నిధానికే సుష్టైన పుష్టభాగాలున్న గోదేవతల తరలింపు ఇవీ మాకు మాత్రమే సాధ్యమయిన సేవా పథకాలు. గద్దె నెక్కే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి! మా గొడ్డు గోదా నుంచి వీలైనంత సహకారం రాబట్టి ప్రజాసేవను ఇంకెన్ని విధాల మెరుగు పరచాలో పశుప్రేమికులనుంచి సూచనలు కోరి అమలు చేసే  దిశగా మరింత అంకితభావంతో మా వంతు ప్రయత్నాలు విధిగా చేస్తాం.

చెత్త నేతల పాలనతో విసుగెత్తి ఉన్న ఓటరు మహాశయులారా! 'ఏమో.. దున్న ఎగరా వచ్చు!' అన్న ఒకే  ఒక్క నమ్మకంతో   మాకూ ‘ఒక  అవకాశం’ ఇచ్చి చూడమని ప్రార్తన!

అంబే.. పశు రాజ్యం పార్టీ!  అంబే.. అంబే!

 దున్నపోతుల ప్రభుత్వం! అంబే.. అంబే .

ఎనుబోతుల నాయకత్వం! అంబే..అంబే!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)

Saturday, February 13, 2021

జంతు లోకం! - కర్లపాలెం హనుమంతరావు - సరదా వ్యాసం

 



" మేన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ . మనిషీ మనలాగే జంతువు. కాకపోతే మనం అడవిలో ఉంటాం,  వాడు తనలాంటి మనిషి జంతువుల  మధ్యన నిత్యం రాజకీయాలకు సరదాపడతాడు  దానికి మనమేం చేస్తాం!" అంది కోతి వచ్చీ రాని బట్లర్ ఇంగ్లీషులో గంభీరంగా. 
"అక్కడికి మనమంతా సైన్స్ మ్యూజియంలో మాత్రమే ఉండాల్సిన  జంతువులమైనట్లు!  ఏంటా కిచకిచలూ? ఎట్లాగైనా మనవాడు మన మనవడు  గదా ! అందుక్కాబోలు మన వానరానికి నరుడిగారంటే అంత గారాం ?" అంది నక్క ఎకసెక్కంగా. 
"జోకులొద్దు! మేటర్ సీరియసిక్కడ . మాటిమాటికి మాటమాటకు కంపు మనిషి మనతో తనని కంపేర్ ఎందుకు చేసుకుంటాడో అర్ధం కాకుండా ఉంది. ఎవడైనా కొద్దిగా బుద్ధి తక్కువ పని చేస్తే చాలప్పా .   "గాడిద కొడకా!" అని తిడతాడు! గాడిదలకు మెదడు అంత తక్కువనా ఆ మట్టి బుర్ర ఉద్దేశం?" అని  గార్దభం కోపంగా.
"మరే!  ఎవరైనా సరే సరిపడక పోతే బండ తిట్లకు దిగేస్తాడు. కొండవీటి చాంతాండంత కవిత్వాలు రాస్తున్నారని కవులను ... 'వాడలవాడలందిరిగి వచ్చెడువారలు గోడల గొందులలో వొదిగి కూయుచుండెడి'  వారు అంటూ  వాళ్లందర్మీ గాడిదలతో పోల్చేశాడు ! గాడిదయితే మాత్రం కవిత్వాలు రాయకూడదని రూలుందా!" అనింకా ఎక్కించింది నక్క.
"అందుకేగా.. వీడా నా కొడుకని, కందంలో ఈ గాడిద కూడా అంత అందంగానూ ఏడ్చిందా రోజు ! గాడిద కనుక కాస్తోకూస్తో దీనికి  కవిత్వ మొచ్చు. మొరగటమే తప్ప మరేమీ ఎరగని ఈ పిచ్చికుక్కేం చేసింది పాపం!  ఊర కుక్కలు, బోర కుక్కలని  అంటూ  రాజకీయ పార్టీయి  అట్లా ఒకళ్ళనొకళ్ళు  కుక్కలను అడ్డం పెట్టుకొని ఆడిపోసుకోడానికి! " అంది కోడి ముక్కుతో కాళ్ళు గీరుకుంటూ.
"అట్లాగే మా పేర్లు పెట్టి కూడా  ముట్టె   పొగరని మనిషి ఎప్పుడూ తిడుతూ ఉంటాడు కదా!"అంది పంది కూడా బాధగా. "దున్నపోతులాగా మా చేత పని చేయించుకుంటూ ఒళ్ళొంగని వాళ్ళని మళ్ళా దున్నపోతులని దులిపేస్తాడు ..అదేం మాయరోగమో గానీ మనిషికి! " అందో ఆంబోతు ఆవేదనగా.
"అందరు నందరే మరియు నందరు నందరే అంటూ సభలోని వాళ్ళందరినీ కలగలిపి కుక్కలూ, కోతులూ, పందులూ, దున్నలూ, గాడిదలంటూ  శ్రీనాథుడనే ఓ కవిసార్వభౌముడు     తిట్టిపోయటం గుర్తొచ్చి గట్టిగా నిట్టూర్చు కొన్నాయి అభయారణ్యంలో సభ తీరిన ఆ జంతువులన్నీ.
"మనిషి తీరుతో పడ లేకుండా వున్నానబ్బీ ! నాలుగుగింజలు ఇలా రాల్చి నాచేత నానా ఊడిగం చేయించుకుంటున్నాడు. ముందు వాడి నుంచి నాకు విముక్తి కలిగించండి  మహాప్రభో!" అంటూ  పావురాయి అడివికొచ్చి కన్నీళ్ళు పెట్టుకోవటం చేత ఇలా సభ మొదలయింది.
"మనవాడి  తీరే అంత! మన మనవడని చెప్పుకోవటానికే సిగ్గేస్తోంద"అని పక్క కోతితో చెప్పుకుని బాధపడిందో పాతకాలం నాటి ఓ పండు కోతి . 
"వాడొక్కడికే దేవుడు పెద్ద బుర్ర ఇచ్చాడన్న పొగరు కాబోలు! వెళ్ళి ఆ దేవుణ్ణే అడుగుదాం పదండి!" అంది జంబూకం. జిత్తులన్నీ  తానే ప్రదర్శిస్తూ 'జాకాల్'  అన్న తన పేరుని బద్నామ్ చేస్తున్నాడని మనిషి మీది ఆ నక్కగారికి ఎక్కడలేని అక్కసు.
...

విషయం అంతా ఓపికగా విన్నాడు దేవుడు. జంతులోకం ఆక్రోశం చూసి   గాఢంగా నిట్టూర్చాడుకూడా .  మడిసి మిడిసిపాటు తనకూ కొత్తేం కాదు. ఒళ్ళు మండినప్పుడు వాడు   తననీ  విడిచిపెట్టింది లేదు. "తిరిపమునకిద్దరాండ్రా... పరమేశా! గంగ విడుము... పార్వతి చాలున్!" అని దులిపి పారేయడం  గుర్తుకొచ్చింది. అయినా దేవుడి పాత్ర  లో ఉన్నప్పుడు  సర్ది చెప్పడం తన బాధ్యత. 
 కనక "మనిషి మహాశయుడి తీరంతే! తెగనాడేటప్పుడు గాడి తప్పటంలో వాడు  మహా  మొనగాడు ! అదంతా  మనిషి మార్క్ రాజకీయం.  పాలిటిక్సన్నాక ఇలాంటి హాట్ ఫూట్స్   తప్పవు అప్పుడప్పుడు . వాడికి ఎన్నికలంటే పోలింగు 'బూతులు'. 'నబూతో నభవిష్యత్తు ' అని నమ్మే సజ్జు రాజకీయాలలో  రోజురోజుకు ఎక్కువౌతోంది.  అశ్లీలమే వాళ్ళ అసలైన శీలమైపోయింది. అట్లాంటి వాళ్ళ తిట్లనట్లా పట్టించుకొంటే ఉన్న ఒక్క కంటితో కూడా నిండా   నిద్రపోలేదు మీ భల్లూకం . థూఁ! నా బొడ్డనుకోవాలి" అన్నాడు దేవుడుబొడ్డు నిమురుకుంటూ. 
"వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు మెంటలనో, శుంఠలనో ఎంత  అన్  ప్రిన్ టబుల్ లేంగ్వేజీలో  ఏడ్చినా  పర్వాలేదు కానీ మహాప్రభో!... మధ్యలో మా కుక్కలనీ, పందులనీ... లాక్కు రావటమెందుకంట ?! ఈ వానర వారసుడి వరుస చూస్తే మీరింకో అర్జెంటు  అవతారమెత్తాల్సిన అవసరమున్నట్లుంది" అని జంతువులన్నీ మోరలెత్తి మరీ భోరుమని మొత్తుకున్నాయ్. .
"సరే.. ముందసలు సందర్భమేంటో కనుక్కుందాం. మానవుడి వాదనా విందాం.. 'రమ్మనమ' ని కాకి చేత కబురంపించాడు దేవుడు.

"ఎక్కడి టైమూ  ఈ దిక్కుమాలిన పాలిటిక్సుకే చాలటం లేదు. నా తరపున చిలకను పంపిస్తున్నా!  చర్చించుకోండి!' అన్నాడు మనిషి.  
చిలక వచ్చి  మనిషి పలుకులు వినిపించింది.
"కుక్కంటే మాకూ మక్కువ ఎక్కువే. డాగ్ అనగా తిరగేసిన గాడ్  కిందే కదా లెక్క!(DOG-GOD). కనకనే  శునకాన్ని భైరవుడిగా కొలుస్తుంటాం. దాన్ని   గ్రామసింహమమని నామధేయవిచ్చి మరీ గౌరవిస్తుంటాం. ధర్మరాజు తమ్ముళ్ళందరినీ వదిలేసి, ఒక్క కుక్కనే సరాసరి స్వర్గానికి తీసుకెళ్ళిన సందర్భం జంతుతంతు  మర్చిపోయింది. కుక్క పిల్లా... అగ్గిపుల్లా... కాదేదీ మా  ఆంధ్రా కవుల కనర్హం. ఆ మాటకొస్తే మేము ఏ జంతువునీ తక్కువ చేసింది  లేదు. చివరికి పావురాయిని కూడా.  మీ దశావతారాల్లో జంతువులన్నింటికీ దేవుడి హోదా కల్పించామా ? కాదా ?! గాడిదైనా  మా దృష్టిలోగాడ్ ది గ్రేటే!. పేపరు వాళ్ళు, టివీల వాళ్ళు మా ప్రసంగాలు  పూర్తిగా వినకుండా వాళ్ళకి నచ్చినట్లు రాసుకుంటే  మాదా బాధ్యత? ! ఇన్ని నిజాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా భుజాలు తడుముకుంటామంటే మీ భుజాలు.. మీ ఇష్టం" అని మనిషి మాటలుగా  వప్పచేప్పింది చిలుకమ్మ      .
చిలుక పలుకులకు పాము ఫ్లాటయి పోయింది. మనిషిని అపార్ధం చేసుకున్నందుకు గార్ధభం కుమిలి పోయింది. మొసలి కూడా     కన్నీరు కార్చింది. కానీ నక్కే... 'ఈ మనిషి జిత్తులు నాకు కొత్తా! మనిషిని పనిష్ చేయాల్సిందే!'' అని వాదనకు దిగింది.
ఉడుంది కూడా అదే పట్టు.
"మనిషితో మాది రక్త సంబంధం. మాట పోతుంద"ని దోమ తెలివిగా సమయానికి  తప్పుకుంది.
"మురుగు లేనిదే మాకు మనుగడలేదు. నరుడే మా గురుడ'ని ఈగలూ, నల్లులూ, పేలు లాంటి కీటకాలు ఉమ్మడిగా ప్రకటన జారీ చేశాయి.
కోడికి మాత్రం కోపం  ఇంకా      తగ్గలేదు."నేను కూయటం మానేస్తాను. ఘడియ ఘడియకు కూయించుకొని ఆకలేసినప్పుడు కూరగా దోరగా వేయించుకొని తింటాడీ తిండిపోతు.  వాడికి పెద్ద పండుగ వస్తే మా కోడి  జాతికి పెనుగండం. పందేలలో  నిష్ట దరిద్రుడికేమో మా వల్ల అష్టభోగాలు. మాకేమో అష్టకష్టాలు" అంది కసిగా.
"బోడి కోడి లేకపోతే  తెల్లవారదా ఏంది? మనిషికి  బోలెడన్ని గడియారాలేడ్చాయి మనిషికి " అంది  మనిషి తరపున చిలుక.
"నేనూ దున్నటం మానేస్తాను. తిండిగింజలు లేక చస్తాడ" ని కసిగా   కాడి కింద పడేసింది దున్నపోతు. "నీ సాయం లేకపోతే వ్యయసాయం సాగదా!. మిషన్లతో పనులు నిమిషాల్లో అయిపోతాయి" అంది  మళ్ళీ చిలుక
మనిషిని శిక్షించే విషయంలో అడవి నడిమికి చీలింది. 
 గోవులూ, గుర్రాలూ, చిలుకలూ, ఎలుకలూ, నెమళ్ళూ, తేళ్ళూ లాంటివి ఒకవైపు. 
కాకీ, నక్క, గద్ద, గబ్బిలం లాంటివి మరో       వైపు.
పులులూ చర్చల్ని బహిష్కరించాయి. మనిషి కనపడితే వేసేయటమే మా పాలసీ అని గొరిల్లాల  ప్రకటించేసాయి. కప్పమాత్రం గంటకో వైపుకి గెంతుతోంది. గోడ మీదున్న పిల్లికి ఎటు దూకాలో పాలుపోవటం లేదు. చివరికి ఎన్నికలు తప్ప లేదు ! 
--- 
 ఒక్క కుక్క  ఓటు మీదే గెలుపోటములు తేలిపోయే పరిస్థితులొచ్చి పడ్డాయిప్పుడు.
"మనిషి నీ మాస్టర్ .  మాకే నీ ఓటం"టూ మనిషి ఏజెంట్ చిలక     ఒకవైపు,  
"మాస్టర్ కాదు! వాడొట్టి మాన్ స్టర్ .. అనగా రాక్షసుడు! మాకే నీ ఓటం"టూ నక్కల ఊళలింకోవైపు.   ప్రతి కుక్కకూ ఓ  రోజొస్తుందని సామెత  నిజమైన .
 పోలింగు రోజు అది.   
ఓటేసే టైము ముగిసింది. ఒక్క ఓటు మెజార్టీతో మనిషి ఘన విజయం సాధించినట్లు ప్రకటించాడు దేవుడు.
అంటే అ ఒక్క ఓటు కుక్కదే నన్నమాటే గదా !
"ఛీ...కుక్క కుక్కబుద్ధి పోనిచ్చుకున్నది కాదు... కనకపు సింహాసనమ్మీద కూర్చోబెడతామన్నా వెనుకటి బుద్ధి ఎలా పోతుంది! " అన్న శతక పద్యం తలుచుకుని  చీదరించుకొంది కాకి & కో . :
 లోకులు పలుకాకులు.
 " ఈ శునకం ఓటెలాగూ మనిషికే వేస్తుంది.  గెలిచే పక్షంలో  వుండటమే  తెలివయిన పని అని నేనూ అటు దూకేసాను !" అని సంబర పడిపోయింది   మార్జాలం.
"నువ్వటు దూకటం చూసి నేనూ అటే గంతేశాలే    ఆఖరి నిమిషం లో!" అంది కప్ప నాలిక అదోలాచప్పరిస్తూ.    
'"ఎదయితేఏం!  మనిషి గెలిచాడు. గెలిచిన వాడితో సంధి చేసుకోవటం ఓడిన పక్షానికి శ్రేయస్కరం. ఎందుకు చెపుతున్నానో అర్ధం చేసుకోండి!" అని ఓ  ఉచిత  సలహా పారేసి ఇంచక్కా అంతర్థానమయి   పోయాడు దేవుడు. 
దేవుడి మాట మేరకు పావురాయిని  రాయబారానికి పంపాయిజంతువులు .
  పోయిన కపోతానిది అదే పోత! ఎంతకూ  తిరిగిరాలేదు! పావురాయికి పాపం ఏమయినట్లు?!
రెండు రోజుల తరువాత మనిషి దగ్గరనుంచి చిలుక ద్వారా వర్తమానం   వచ్చింది.  "డబుల్ థేంక్స్! ఒకటి గెలిపించినదుకు.రెండు పావురాయిని గిఫ్ట్  గా పంపించినందుకు!మీ  రెండో బహుమానం   మహా పసందు " అంటూ. పావురాయిని మనిషి మసాలో కూరి విందు లాగించుకున్నట్లు జంతువులకు అర్థమయింది. తన మీద దేవుడికి ఫిర్యాదు చేసిన ఏ జీవిని మనిషి వదిలిపెట్టడన్న  మనిషి ఆటవిక నైజం అడవి జంతువులకు అప్పుడు గాని  బోధపడింది కాదు. 
 '                             మనిషెంత దుర్మార్గుడు! మన అడవిలో కూడా మరీ ఇంత అన్యాయం లేదు .' అనుకున్నాయి అన్ని జంతువులు ఆ వేదనగా.
 "అందుకే నేను వాడికి ఓటు వెయ్యనిది.  ఒట్టు... నన్ను నమ్మండి"అని గోల పెట్టింది శునకం. 

       మరి మనిషి గెలవటానికి సాయపడిన ఆ ఒక్క ఓటూ ఎవరిది?!ఎవరిది? ఎవరిది?!   
ఆ దేవుడికే తెలియాలి. చివరికి ఆ దేవుడే సస్పెన్స్  తేల్చేయాల్సొచ్చింది  కిందికి దిగి    .
'ఇదంతా ఆ వరహవతరంగారి పుణ్యఫలమే !' అని తేలిపోయింది దేవుడు పెదవి విప్పడంతో.
" మామనిషికి గనుక  ఓటెయ్యకపోతే వచ్చే జన్మలో నువ్వూ మనిషివయి పుట్టటమే కాదు   రాజకీయాల్లోకూడా పడతావని చిలుక      చాటుగా  బెదిరించి పోయింది బాబోయ్! అందుకే . అదిరిపోయి అటే  ఓటు వెయ్యాల్సి వచ్చింది"  అంటూ బురదలో మొహం దాచుకొని కుళ్లి కుళ్లి ఏడవడం    మొదలు పెట్టింది  పాపం ఆ వరాహమిప్పుడు.
 
నీతి :ఇకనయినా  మనం , మనుషులం కనీసం జంతువులయినా అసహ్యించుకునే స్థాయి దాక రాజకీయాలను దిగాజార్చు  కోకుండా  వుండటం మంచిది కదా!
 
-- కర్లపాలెం హనుమంతరావు
ఆగష్టు 19, 2010
(ఈనాడు దినపత్రిక సంపాదకీయ ప్రచురణ)

Thursday, January 26, 2017

ఎద్దై పుట్టేకన్నా.. ఓ వృషభం సరదా విలాపం


ఎద్దై పుట్టే కన్నా ఏ అడవిలోనో  చింత మొద్దై పుట్టడం మేలు.
ఆరుగాలం పరుగులే పరుగులు. కొండ్రలు దున్నే వేళా  చెవుల్లో చెర్నాకోలు ‘ఛెళ్లు’ శబ్దాలు!

ఎంకి పెళ్లి సుబ్బి  చావుకొచ్చిందంటారు.  ఎంకి మా తమిళబ్బయితే. సుబ్బి.. ఇంకెవరు.. ఖర్మ కాలి మా ఎద్దు జాతే!

పొంగళ్ళ పండుగొచ్చిందన్న పొంగు ఒక రోజన్నా  ఉండదు. మూడో రోజునుంచే  ఎద్దుకు  యమలోక దర్శనం.  'దౌడో! దౌడో' అంటో ఒహడే గోడు! గుండాగి పోయేట్లు పరుగెత్తడానికి మేమేమన్నా సర్కారు పోలీసు ఉద్యోగాలు కోరుకొంటున్నామా?

మానవా! ఉరుగులు పరుగులు తప్ప  తమరికింకేమీ తెలీవా? పొద్దు పొడిచింది మొదలు.. పొద్దు గడిచేదాకా .. పరుగులు నురుగులేనా గురువా? కొవ్వు కరిగించుకోడానికి పరుగులు. బడులకు.. పన్లకు  పరుగులు. బాసుల వెనకాల బడి పరుగులు. ఆడాళ్లవెంట పడీ పడీ   పరుగులు. అప్పులోళ్లు వెంటబడితే పక్క సందుల్లోకి పరుగులు. చిల్లర  మాట చెవినపడ్డా పరుగులు! కొత్త  నోట్లకోసం నురుగులు! ఒక్క ఒలంపిక్కు పరుగుల్లోనే నింపాదిగా పెళ్లివారి నడకలు!

ఎద్దు మొద్దు స్వరూపాలని ఎద్దేవా చేసే పెద్దమనుషుల్లారా.. మా కాడెద్దులకన్నా  తవఁరెందులోనండీ పోటుగాళ్లు? గిట్టని మాట చెవిన బడితే చాలు..  గిట్టలిసిరే అసహనంలోనా? మా గడ్డిక్కూడా పాలుమాలే పోటీల్లోనా? 

ఏడాదికోసారే  వచ్చి పోయేది  పెద్దపండుగ. ఏదోలే.. ఏడ్చిపోతారని కదా  మేం   మీ కుళ్ళు  గుడ్డల్తో  ఊరేగేది?  గడప గడపకీ  వచ్చి దణ్ణాలు.. దస్కాలు పడీ పడీ పెట్టి పొయ్యేది  తవఁరి  గొప్పతనాలు చూసనా అయ్యల్లారా!   నిన్నటి దాకా ఒక పురచ్చి తలైవికి.  ఆ తల్లి తరలెళ్ళి పోయిన తెల్లారినుంచే మరో పుచ్చిన తలైవికి. మా గంగిరెద్దులకన్నా నంగిగా బుర్రలూపే తవఁరు .. ఎందులోనండీ బాబులూ  మా ఎద్దుజాతి కన్న మెరుగులు?

మీ పెట్ర్రోలోళ్ళ మాదిరి పూటకో రేటుతో అదరగొట్టం మేం. ఆయిలు ధరలు  అలా ఓ పది పైసలు పెరిగినప్పుడల్లా మీ నేతలే కదా మా బుల్లక్కార్ట్ల మీద ఊరేగుతూ  మా గొప్ప బిల్డప్పులిచ్చేది!  కార్నుంచి కార్లోకి తప్ప కాల్తీసి పెట్టని  షావుకార్లక్కూడా ఎన్నికలొస్తే చాలు   మా ఎద్దులబళ్లమీదెక్కినప్పుడే గొప్ప  కిక్కొచ్చేది.  

మళ్లీ జన్మంటూ ఉంటే ఆ మడోనా బాబులాగా పుట్టి మీ గోముఖ వ్యాఘ్రం మార్కు తొడుగుల్తో చెడుగుడాడేయాలని ఉంది! ‘గుడ్డే’ తప్ప చెడుతో ఆడ్డం చేతకాని పశువులం. అందుకే ఇప్పుడిన్ని  తిప్పలు !

అలవాటు లేని మందూ మాకు  మాకు పట్టించి బరికెల్తో, బరిసెల్తో  నడివీదుల్లోబడి దౌడు  తీయించే పాడు బుద్ధులెందుకండీ కామందులూ ప్రదర్శిస్తారు మా   ముందు? మీ బడి పిల్లకాయల   పుస్తకాల బస్తాలకన్నా ఎక్కువ బరువులు చడీ చప్పుడు లేకుండా మోస్తున్నందుకా ?

తవఁరికేవఁన్నా వినోదాలు  తక్కువయ్యా దొరబాబులూ మా బతుకులనిలా వీధుల పాలు చేసి అల్లరి చేసేస్తున్నారూ ?  వారానికో అయిదు అన్రియల్  చలన చిత్ర రాజమ్ములు..  అరగంటకో పాలి తింగిరి పింగిరి టీవి సీరియళ్లు! అదనంగా.. ఇప్పుడీ ఐదు రాష్ట్రముల ఎన్నికల  పాంచ్ పటాకా చాలకా..  వినోదానికింకేం కరువొచ్చిందని ధర్మప్రభువులూ.. మా ఎనుబోతుల మీదిలా పడి కరవొస్తున్నది అందరూ.. 'జల్లికట్టు' సంప్రదాయమని వంక బెట్టుకొని!

ఆంబోతేమన్నా  అప్పుడే విడుదలైన కొత్తైదొందల నోటా ?  అందరూ కల్సి అలా కుమ్మేసుకోడానికి కనీసం  ఆ పూటే విడుదలైన సినిమా ఆటైనా కాదే?!

పురచ్చి తలైవమ్మలా మెరీనా బీచ్ రీచవగానే పొయస్ గార్డెన్ మార్క్ దస్కత్  కుర్చీ కోసం.. అది  సంపాదించే డబ్బూ దస్కంకోసం ఎన్ని ముఠాలు?  ఎంతమంది మాయల మరాఠీలు? ఎద్దు కాలి ముల్లంత లేకపోయినా ఏడూళ్ల పెత్తనానికి తయారై పోయారందరూ.  ఎలపటి ఎద్దు ఎండకు లాగా.. మలపటి ఎద్దు నీడకు లాగా సామెతలాగా  సాగే రాజకీయాలని మళ్లీ ఒక్క  కట్టుమీదకు లాక్కొచ్చినందుకన్నా జల్లికట్టును జాలితో  వదిలేసెయ్యచ్చు కదయ్యా?

నవరసు పేటల నగా నట్రా ఏమన్నా అడుగుతున్నామా? ఆ ‘పేటా’ పెద్దలు ఫిర్యాదులకు పీటముళ్లేసి న్యావానికి అడ్డు రావద్దనేది ఒక్కటే దయగల పెద్దలకు మా విన్నపాలు!

తవఁరు పెట్టే గడ్డి విషంకన్నా హీనం.  పట్టించే కుడితికన్నా గరళం మహా సరళం.   అయినా కిమ్మనకుండా కొమ్ములొంచుకొని  బండ బరువులన్నింటినీ మౌనంగానే భరిస్తుంటిమి గదా యుగ యుగాల బట్టీ. జల్లికట్టు మిషతో మా వళ్లనింకా ఇలా  జల్లెళ్ల మాదిరి తూట్లు పొడవడం అన్యాయం.. ఈ అత్యాధునిక యుగంలో కూడా!

'అరవం.. అరవం' అంటూనే ఎంతలా అరిచి అల్లరి చేస్తున్నారర్రా అందరూ! ఎంత లావు ఒంగోలు జాతైనా రాజకీయాలముందు ఒంగోక తప్పదని తేల్చేసారు! న్యాయస్థానాల దగ్గర పప్పులుడకవని.. రాజాస్థానాలను ఆశ్రయించేసారు! ఎద్దు తంతుందని గుర్రం చాటున నక్కే నక్క జిత్తులు ప్రదర్శించారు!

ఎవర్నని ఏం లాభం? ఎన్నుబోతు ఖర్మ రుచి చూడాలంటే  ఎద్దుగా ఏడాది ఎందుకు.. ఆంబోతుబా ఆర్నెల్లు బతికి చూడాలి! అదీ అరవనాడులో.. పొంగలు సంబరాల్లో. పశువు జీవితమంటేనే వికారం  పుడుతుంది.   రాజకీయాలమీదకే  మళ్లీ మమకారం మళ్లుతుంది.
ఏదేమైనా ఎద్దు చచ్చినా వాత బాగా వేశారర్రా అంతా  కల్సి. ఈ సారికేదో జల్లి కట్టు ‘కుమ్ములాట'కు సిద్ధం చేసేసామంటారా అంతా.
గిత్తలుగా పుట్టడం తప్పయి పోయింది.  సారీ! ఏ నత్తలుగానో.. సోనియాజీ అత్తలుగానో పుడతాం అవకాశం వస్తే వచ్చే సారి. పోనీ ఇహ ముందైనా  మా పశుజాతిమీద  పిసరంత జాలి చూపండయ్యా కామందులూ! కావాలంటే చచ్చి మీ రాజకీయ నేతల కడుపుల్లో పుట్టడానికైనా మేం సిద్ధం.

ఇన్ని చెప్పుకున్నా ఎనుబోతుమీద వాన కురిసినట్లే అంటారా?.. ఇహ మేం మాత్రం చేసేదేమంది.. కొమ్ములకు పదును పెట్టుకోడం మినహా!
-కర్లపాలెం హనుమంతరావు




  

Thursday, December 1, 2016

పెళ్ళి చేసి చూడు!- పెద్దనోట్ల రద్దులో- సరదా గల్పిక


పెళ్లిళ్లు స్వర్గంలోనే జరిగినా వాటికి గుర్తింపు  కిందిలోకాల్లో ఫెళ్లున జరిగినప్పుడే. అందరు డబ్బున్న మారాజుల్లాగా మా గవర్రాజూ ఆకాశమంత పందిరి.. భూలోకమంత అరుగూ వేసి ఘనంగా చెయ్యాలనుకొన్నాడు తన కూతురు పెళ్లి. ఆఖరి నిమిషంలో ఆ మోదీగారి పుణ్యమా అని డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది! నవంబరు, ఎనిమిది- అష్టమి తిధి మధ్య రాత్రి ఆ పెద్దాయన  హఠాత్తుగా పెద్ద నోట్లు రెండూ రద్దనేసెయ్యడంతో అందరు నల్లమహారాజుల మాదిరి మా గవర్రాజూ కొయ్యబారిపొయ్యాడు. అరక్షణంలో పాపం.. పాపరై పొయ్యాడు!
'పెళ్ళి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు' అన్నారు పెద్దలు. ఇల్లంటే ఇవాళ వల్లకాకపోతే మళ్లా ప్రభువులు మారినప్పుడైనా మెల్లంగా కట్టుకోవచ్చు. కళ్యాణమలా కాదే కక్కులా ఆగదు కదా! అందుకే కక్కా లేక.. మింగా లేక పాపం గుడ్లనీరు కక్కుకున్నాడు మా గవర్రాజు. ఆడబిడ్డను కన్న తండ్రులందరికీ ఆ గాలివారంత గుండె నిబ్బరం  ఉండడు! మేట్రిమోనియల్ మొదలు.. పిల్లని మెట్టినింట్లో దిగబెట్టిందాకా  దుడ్డు సంచుల్తోనే కదా ఏ శుభ కార్యమైనా? దుడ్లు దండిగా ఉన్నా సంచులు విప్పే ధైర్యం చాలకే గవర్రాజుకా గుడ్లు.. నీళ్లు! 
పెళ్లి కాబట్టి పిల్ల, పిల్లాడి జాతకాలు జత కలిసాయో.. లేదో చూసుకొన్నారు గానీ.. ప్రధాని మోదీజీ జాతకచక్రం కూడా ఈ మ్యాచికి మ్యాచవ్వాలన్న ఆలోచన రాలేదు.. అందుకే ఇప్పుడిన్ని తిప్పలు! మోదీజీ మూడ్ ను గురించి ఏమాత్రం ఉప్పందినా  ఈ మూడు ముళ్ల ముచ్చటకిన్ని ముళ్ళు పడకుండా ముందస్తు చర్యలు తప్పక తీసుకొనిండేవాడే.  ఎప్పట్నుంచో రాజకీయాల్లో నలుగుతున్న ఘటం మా  గవర్రాజన్న! ఏదేవైఁనా ఒక్కసారి గుండెలమీది కుంపట్ని దించేసాయలనుకున్నాక.. దింపకపోతే ఆ కాకకి  గుండెలు మొత్తం మండే  ముప్పుంది.  ఆ ముప్పునుంచి తప్పించుకొనాలనే కాక  ఉన్న నలుపులో ఒక శాతమన్నా తెలుపవుతుందన్న యావా తోడయింది. శుభలేఖ వీడియోలు  బాలివుడ్ మెగామోవీ స్థాయిలో వైరలవడానికి అదే కారణం. 'మన్ కీ బాత్' అంటే ఎప్పట్లా ఏవో మనసులోని ముచ్చట్లు  బైట పెట్టుకుంటాడనుకొంటే.. పిల్ల మనువుకే మొప్పొచ్చే మెగాబాంబ్ బ్లాస్ట్ చేసేసాడు మోదీ సాబ్!
పెళ్ళంటే పప్పు కూడని పెద్దల శాస్త్రం. ఆ పప్పులో వేసే ఉప్పుకే చచ్చే కరువొచ్చి చచ్చిందిప్పుడు. పాతరేసిన పాత పెద్ద నోట్లమీదున్న భరోసాతో బంధుమిత్రలందరినీ 'సపరివార సమేతంగా' విచ్చేసి  చందన తాంబూల సత్కారాలందుకొని వధూవరులనాశీర్వదించమని ప్రార్థించాడు. 'మాయా బజారు' మార్కు 'వివాహ భోజనాలు' మహా ఆర్భాటంగా ఏర్పాటయ్యాయని టాకొస్తే చాలు.. మరో రెండు శాతం బ్లాక్ వైటవుతుందని   మా  గవర్రాజు తాలూకు ఆడిటర్ల బడాయి. పెద్ద నోట్ల రద్దుతో మనీ బజారు మొత్తం కుదేలవడంతో  మా వాడికిప్పుడు  బేజారు!
పంచ భక్ష్య పరమాన్నాల మాట ఆనక.. పాయసంలో వేసే పంచదారక్కూడా చిన్న నోట్లే కావాలని చిల్లర వ్యాపారులు అల్లరి మొదలు పెట్టేరు. పది రూపాయలైనా సరే బిళ్లగా కనబడితే .. బిచ్చగాడి బొచ్చెలోకి విసిరేసే దర్జా మా గవర్రాజు బాబుది. యాబై నోటే రంగులో ఉంటుందో కూడా మర్చి పోయిన మా దసరా బుల్లోడికి  ప్రధాని రద్దు  ప్రకటన మర్నాటినుంచి పిల్ల పెళ్ళంటే  పెద్ద 'చిల్లర' వ్యవహారంగా మారి కూర్చుంది. 
అన్ని రోజులూ ఎప్పట్లానే డబ్బున్నరాజాలవనుకున్నాడు మా రాజు. ఆ ధీమాతోనే  పిల్ల మామగారిముందు  పెళ్ళేర్పాట్లను గూర్చి తుపాకి రాముణ్ని మించి గొప్పలు పోయాడు. పెళ్ళారు అడక్కముందే మూడ్రోజుల పెళ్ళి.. ముఫ్ఫై రకాల వంటకాలు.. మహారాజా ప్యాలెస్ పందిళ్లు.. కళ్లు మిరిమిట్లు గొలిపేట్లు లైట్లు! ఇహ పట్టు బట్టలు.. నగా నట్రలు.. విందు వినోదాల జాబితా చెప్పనే అక్కర్లేదు.  మారిన పరిస్థితుల వల్ల కిలో బెల్లానిక్కూడా  కొత్త రెండు వేల నోటు బైటికి తీయాల్సొస్తుందిప్పుడు. బ్యాంకోళ్లు విదిల్చే ముష్టి రెండున్నర లక్షల్తో ఇహ లక్షణంగా పెళ్ళి చేసే మాట కేవలం కల్లోనే!
పెళ్లంటే తాళాలు.. మేళాలంటారు. బీరువా తాళాలేవీ బైటికి తీయకుండా ఎంత ఘనంగానైనా చేసుకోండంటున్నారు ఆర్బీఐ గవర్నరు గారు! ఇదేం మేళం?బాజా భజంత్రీలు మోగించే వాడికైనా బయానాకింద తాంబూలంలో విధాయకంగా పెట్టివ్వడానికి కనీసం ఓ వందో.. అదొందలో ఉండాలి గదా? వంద నోటు కనిపించదు. కొత్తైదొందల నోటు కరుణించదు! పెళ్ళనుకుంటున్నప్పట్నుంచీ పిల్లదాని అత్తారిల్లు ఎలాగుండబోతుందోనని అల్లాడిపోతున్న గవర్ర్రాజుకిప్పుడు  గవర్నరాఫ్ ఆర్బిఐ గ వైఖరి ఎలాగుంటుందోనన్న బెంగ మొదలయింది. మామూలు పెళ్లయితే మగ పెళ్లివాళ్లని చూసుకుంటే సరిపోయేది. ఈ పెద్ద నోట్ల రద్దు తరువాత సర్కారు పన్నుల శాఖవాళ్లను కూడా చూసుకోవాల్సొస్తోంది. పాయసంలో రెండు జీడి బద్దలెక్కువ పడ్డా ఈడీ శాఖ వివరాలడిగేస్తుంది. పిల్ల, పిల్లాడికి పళ్లెంలో  పట్టు వస్త్రాలు పెట్టిద్దామన్నా అమ్మకాల పన్ను శాఖెక్కడ పట్టుకుంటుందోనని పీకులాటయిపోయింది! పెళ్లి పీటలమీద  కట్నకానుకలు చదివింపులప్పుడు కూడా లెక్కగా రాసుకునే బంధువుల పక్కనే ముక్కాల పీటేసుకొని బైఠాయిస్తుంటిరి ఆదాయప్పన్ను డేగ గాళ్లు! అడకత్తెర్లో పోక చెక్క బతుకై పోయింది పాపం మా గవర్రాజు బతుకు. పెద్ద నోట్ల పాతర దొడ్డెనకుందన్న నిబ్బరం.  అత్తారేవీఁ అడగనే లేదు.  పిలదాని మెళ్లో నిఖార్సైన  నవరసుల నాన్తాడు నాలుగైదు కిలోలది   ప్రొద్దుటూరు సరుకు దిగేస్తానన్నాడు. దాంతాడు తెగ.. ధడాల్మనీ రద్దు పిడుగొచ్చి పడుతుంద నెవడు కలగన్నాడు? వట్టి దారప్పోగుకింత పసుపు ముద్ద రాసి సొంఠికొమ్ము తాళి  వేలాడేస్తానంటూ  నానుస్తున్నాడిప్పుడు పాపం!   తక్కువ చేస్తే వియ్యాలవారితో తంటా! ఎక్కువ చేస్తే ఎన్ఫోర్సుమెంటు పెద్దల్తో పెంట!
సంభావన పంతుల్నుంచి.. సన్నాయి  భజంత్రీల దాకా అందరి చేతుల్లో తలా ఓ కొత్త రెండు వేల నోటు పెట్టుకుంటే పోతే .. ఇహ అల్లుడి పెట్టుపోతలప్పుడు పెట్టుకోడానికి మిగిలుండేది నోట్లకట్టకు మిగిలుండే ప్లాస్టిక్ బాండే! భూనభోంతరాళు దద్దరిల్లేట్లు పిల్ల పెళ్లి చెయ్యాలని పాపం ఇంతప్పట్నుంచి అడ్డమైన గడ్డి కరిచీ ఈ పెద్ద నోట్లు పోగేసాడు మా గవర్రాజు. ఇప్పుడు అలక పాన్పుమీద అందరల్లుళ్లల్లా ఏ బైకో.. టీవీనో.. టాబ్లెట్టో.. అడిగుంటే..  అదో రకం! చెక్కో.. డ్రాఫ్టో.. నెఫ్టో.. నెట్టో.. డెబిటో.. క్రెడిటో.. ఆ కార్డులు గీకో.. కంప్యూటర్ మీటలు కొట్టో అల్లుడి ముచ్చట తీర్చుండే వాడు! ముందనుకున్న కట్నంలో మిగిలున్న బకాయి మూడుకోట్లు మొత్తం చిల్లర పైసల రూపంలో ఒకే మూటగా చెల్లించాలని మంకు పట్టు పట్టుక్కూర్చున్నాడు! చెల్లని వెయ్యి నోటులా వెల వెలా పోతున్న మా గవర్రాజన్న ముఖం చూస్తుంటే.. చెప్పద్దూ.. పాపం.. ఆ మాజీ
టాటా చైర్మన్ మిస్త్రీ మొహమే మళ్లీ గుర్తుకొచ్చేస్తుంది!తల తాకట్టైనా పెట్టి పెళ్లి గండం గట్టెక్కే తల్లిదండ్రులకీ దేశంలో కొదవేం లేదు కానీ.. తాకట్టుకొట్టు వాడి గల్లా పెట్లోనైనా లెక్కకు పనికొచ్చే చిల్లర ఉండాలి కదా!
చిల్లరమీదే కదా ఇవాళ దేశంలో ఈ అల్లరి ఆర్భాటమంతా?

మోదీజీ ఆర్థిక  సంస్కరణల పుణ్యం! రాబోయే రోజుల్లో పెళ్లి చూపుల్నుంచే పెను మార్పులు తథ్యం! పిల్లాడిది 'ఆధారపడే ఉద్యోగమా?.. ఉపాధా?' అన్న ఆరా ఆనక తీరిగ్గా.  ముందసలు 'ఆధార్ కార్డు ఉందా.. లేదా' అని  తరిచి చూడడం ముఖ్యం పెళ్లికూతురు తరుఫు వాళ్లకిక.  ఆరోగ్య పరీక్షల ధృవీకరణ పత్రాలు  వెంట లేకుండా వధూవరులెవరూ పెళ్లి చూపులకు సిద్ధమవలేరు. రోజులకొద్దీ బ్యాంకులముందు.. ఏటియంల ముందు ఎండ.. వాన.. చలి.. కాలుష్యాలకు తట్టుకొని  తిండి తిప్పలు లేకుండా క్యూలో నిలబడేపాటి  శరీర దార్ధ్యం కాబోయే భర్తగారికి తప్పని సరి. ఒక్కో బ్యాంకుకొక్కో శాల్తీ.. ఏటియంతో కలిపి కుటుంబానికో   డజను జతల కాళ్లు   తప్పని సరి. ఆపాటి బిడ్డల్ని కనేపాటి ఆరోగ్యం కాబోయే భార్యకూ కంపల్సరి!
ఏమో.. ముందు ముందు మరిన్ని తీవ్రమైన చర్యలుంటాయని సంకేతాలిస్తున్నారు కదా మోదీజీ ఇప్పట్నుంచే!
-కర్లపాలెం హనుమంతరావు



 (వాకిలి- అంతర్జాల పత్రిక- డిసెంబరు- 2016-లాఫింగ్ గ్యాస్ గా ప్రచురితం)

Friday, August 19, 2016

ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే- ఈనాడు సంపాదకీయం

జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం- ఇన్ని దశలు దాటి రాకముందు జంతువే మనిషి మూలరూపం. విశ్వ సంస్కృతులు జంతు తతులను విభిన్న కాలాల్లో వేర్వేరు దృక్పథాలతో చూసినా, భారతీయతది మాత్రం సృష్టి ప్రారంభంనుంచి ఒకే విధానం... దైవభావం. ఆదిదేవుడు పశుపతి. స్థితిమూర్తి శేషశయనుడు. సృష్టికర్త హంసవాహనుడు. సోమకాసురుని వాడి రెక్కలచే చీల్చి చెండాడి వేదరాశిని కాచింది మత్స్యరూపమైతే, క్షీరసాగర మథనంలో మందరగిరి కిందకు జారిపోయిన వేళ మూపు
నడ్డుపెట్టి సురాసుర కార్యానికి సాయంపట్టింది కూర్మమూర్తి. ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో వర్ణించినట్లు 'అజాండ కర్పరము బీటలు వారగ మేను పెంచి మహీ మహిళా లలామను గొమ్ము కొన దగిల్చి' నీటినుంచి యెత్తినది వరాహ మూర్తి. హరి వైరంతో అరాచకం చేసే హిరణ్యకశిపుని వధాయజ్ఞం నిర్విఘ్న నిర్వహణకు హరి ఎత్తింది అర నరావతారం. 'కుటిల నఖాగ్ర కుంచికల'తో ధర్మకార్యం పూర్తిచేసింది మిగతా సగం మృగావతారం! భగవంతుడెత్తిన ఆ నృసింహావతారమే
నరుడికీ మృగానికీ మధ్యగల బలమైన బంధానికి తిరుగులేని ఉదాహరణ. సీతాన్వేషణలో ఉన్న రాముడికి ప్రథమంగా సమాచారం అందించింది జటాయువు. స్నేహహస్తం చాచిన సుగ్రీవుడు
, బంటుభావంతో సేవించిన ఆంజనేయుడు, సేతునిర్మాణం చేయించిన నీలుడు- చివరికి అల్పజీవి అయినా అనల్ప భక్తితో సాయానికొచ్చిన ఉడుత... అంతా జంతుసంతతే. విజ్ఞత, గ్రహణ శీలత, సున్నితత్వం, దయ, ఓర్పు, ధైర్యం, దూరదృష్టి, సహానుభూతి వంటి సద్గుణ సంపదలే దైవీయ భావనలనుకుంటే- పశుపక్షి కీటక సముదాయాలను మించిన దేవతామూర్తులు నేలా నింగీ నీటా మనిషికి మరేవీ తారసపడవు.


జంతుజాలాల్లోని ఈ విశిష్టతలవల్లే భారతీయులు చెట్టుమీది పిట్టనీ, పుట్టలోని పామునీ దేవతా స్వరూపాలుగా సంభావించి కొలిచేది. ఆవును సాక్షాత్ గోమాత స్వరూపంగా కరుణశ్రీ వంటి కవులు భావించి కీర్తించింది ఈ దైవీయ భావనతోనే. జాంబ పురాణం ప్రకారం అనంత కాలాల కిందటే జన్మించిన మూలపురుషుడు జాంబవంతుడు. కన్నబిడ్డ డొక్కలను కొలిమిగా, చర్మాన్ని తిత్తిగా, హస్తాలను పట్టుతెరలుగా, బొటనవేళ్లను ఉలులుగా మలచి విశ్వకర్మకే పరికరాలను సమకూర్చిన నిపుణుడు ఆయన. భూదేవికి వరాహపురాణం వినిపించిన మేధావి ఆదివరాహమూర్తి. సామవేదాన్ని గానంగా వినిపించిన మహాముని శుకుడు. భోజరాజీయంలోని గోవు అభిజ్ఞాన శాకుంతలంలోని కణ్వమహర్షితో సమానమైన ప్రతిభా విశేషాలతో తన చిన్నిదూడకు సుద్దులు చెబుతుంది. రఘునాథ నాయకుడి 'నలచరిత్ర' హంస కథానాయకుడి చేతజిక్కినప్పుడు చెప్పే 'సంసార ధర్మాలు' పండితుల పలుకులకు తీసిపోనివి. నలదమయంతుల మధ్య రాయబారం నడిపి వారి ప్రేమను పండించిన పెళ్ళిపెద్ద అది. శృంగారం మదన శివాలు తొక్కి నాయిక పరకీయగ మారే ప్రమాదాన్ని గ్రహించి రాత్రికో మడతపేచీ కథ చొప్పున చెప్పుకొస్తూ మగడు ఇల్లు చేరినదాకా ఇంటి పరువును, ఇంతి పరువును గుట్టుగా
కాపాడిన చతుర, కదిరీపతి 'శుకసప్తతి' చిలుక. రాబర్ట్ బ్రూస్ వంటి మహారాజుకే పాఠాలు చెప్పిన సాలెపురుగులోని యంత్రరహిత నూలు నిర్మాణ కౌశలం అద్భుతం. 'ఈశ్వరశక్తి నీ కడుపులోనే లీలమై యుండునో' అంటూ జాషువా వంటి మహాకవుల మన్ననలందుకున్న జంతుజాలాల విశేషాలు ఎంత చెప్పుకొన్నా సశేషాలే!

మనిషి తన తోటి మనిషిని చిన్నబుచ్చడానికి జంతువులతో పోల్చడం ఎంతవరకు సమంజసం? 'బూడిద బుంగవై యొడలు పొడిమి దప్పి మొగంబు వెల్లనై/ వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొచోయనన్/ గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు' వారిని శ్రీనాథుడంతటి మహా పండితుడు గాడిదలని తూలనాడటం తగునా? పిల్లిమీద, ఎలుకమీద పెట్టి తిట్టే అన్యాపదేశాలు సాహిత్యంలో అలంకారాలు- అన్నంత వరకైతే సరిపుచ్చుకోవచ్చు. కానీ, చిన్నజీవులపట్ల పెద్దమనసు కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం. తీయని పదాల రామా రామా యటంచు/ తీయ తీయగా రాగాలు తీయుచున్న/ కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది' ఆదికవి వాల్మీకిని మనం 'కోకిలస్వామి'గా కొలుచుకుంటున్నాం. కర్ణాటక రాజ్యాధిపతులు ఒకప్పుడు 'ధరణీ వరాహ'మనే బిరుదును గొప్ప గౌరవంగా ధరించేవారు. నృత్య విశేషాలను మయూర భంగిమలతోను, చురుకు వేగాన్ని అశ్వతేజంతోను, సునిశితమైన వినికిడిని పాము చెవులతోను, సూక్ష్మదృష్టిని విహంగవీక్షణంతోను సరిపోల్చుకొని సంబరపడే మనిషి సాటి జీవాన్ని అల్పదృష్టితో చూడటం సృష్టిదోషం. విష్ణుశర్మ పంచతంత్రంలో జంతుపాత్రలు అందించే నీతిచంద్రికలు మనిషి మనసులో ముసిరి ఉన్న చీకట్లను పారదోలేవి. విశ్వాసానికి
శ్వపతి(కుక్క), శుచి-శుభ్రతలకు మార్జాలం, బృందస్ఫూర్తికి పిపీలక సందోహం, ఐక్యతకు కాకిమూక, సమానత్వ భావనకు వానరజాతి... మనసు తెరచుకుని ఉండాలేగానీ క్రిమికీటకాలనుంచి పశుపక్ష్యాదులదాకా సర్వజీవావళి మనిషి పాలిట పరమ గురువులే. సాధు హృదయంతో చేరదీయడమొక్కటే మనం చేయవలసిన సత్కార్యం. మైమీ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయీ విశ్వవిద్యాలయం జంతువులను పెంచి పోషించేవారిమీద చేసిన ప్రయోగాల ఫలితం ప్రకారం- అది మానవ జాతికే ప్రయోజనకరం. పెంపుడు జంతువుల యజమానుల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన శరీరం, కలుపుగోలుతనం, సామాజిక స్పృహ, నిర్భయత్వం- జంతుజాలాలకు దూరంగా ఉండేవారిలోకన్నా ఇరవైశాతం అధికంగా ఉంటాయని పరిశోధన బృంద నాయకుడు అలెన్ ఆర్ మెక్కానిల్ చెబుతున్నారు. ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే సాటి జీవాలకు చేరువ కావడమే దగ్గరి దారి!

(ఈనాడు యాజమాన్యంవారి సౌజన్యంతో.. సంపాదక బృందానికి ధన్యవాదాలతో.. 24, ఆగష్టు. 2011 నాటి ఈనాడు సంపాదకీయం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...