Showing posts with label Spiritual. Life. Show all posts
Showing posts with label Spiritual. Life. Show all posts

Saturday, February 13, 2021

చలంగారి వేదాంతం- పిట్ట కథ - కర్లపాలెం హనుమంతరావు

 



గురు శిష్యుల మధ్య అద్వైత సిద్ధాంతాన్ని గురించి గంభీరమయిన చర్చ జరుగుతున్నది. 
ఓ రాజు గారు అ సమయంలోనే ఏనుగు మీద ఊరేగుతూ అటుగా వెళుతున్నారు.
"ఏమిటండీ అది?" అని ఎప్పట్లానే అడిగాడు శిష్యుడు .
"కనబడటంలేదుటరా...రాజు గారు ఏనుగు మీద ఊరేగుతున్నారు ." అన్నారు  గురువు గారు .
రాజు గారంటే ఎవరండీ? ఏనుగు అంటే ఏమిటండీ ?" అని అడిగాడు శిష్యుడు.
"పయిన వున్నది రాజు ...క్రింద వున్నది ఏనుగురా మూర్ఖుడా!" అన్నారు గురువుగారు చిరాకుగా.
"పయిన అంటే ఏమిటండీ ?...క్రింద అంటే ఏమిటండీ?" అని మళ్ళీ శిష్యుడు సందేహం.
గురువు గారికి వళ్ళు మండి అమాంతం ఎగిరి శిష్యుడి భుజాలమీద కెక్కి కూర్చుని"నేను ఉన్నది పైనా, నువ్వు వున్నది క్రిందా ...అర్ధమయిందా?" అనడిగారు.
శిష్యుడు తొణకలేదు. "నేను అంటే ఏమిటండీ?..మీరు అంటే ఏమిటండీ?" అని అడిగాడు .
గురువు గారు గభాలున క్రిందకు దిగి శిష్యుడి కాళ్ళు పట్టుకున్నాడు "పైన వున్నది నువ్వూ..క్రింద వున్నది నేనురా " అన్నాడు.
"అర్ధమయింది "  అన్నాడు శిష్యుడు .
ఇంతకీ పాఠం నేర్చుకున్నది శిష్యుడా? గురువా?
(భగవద్గీత కు ముందు మాటలో చలం గారు రాసుకున్నది) 

-కర్లపాలెం హానుమంతరావు 
బోథెల్, యూఎస్ ఎ
 
*****


Saturday, August 15, 2020

స్వామి వివేకానంద- రాజకీయాలు -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం





స్వామి వివేకానంద డాంబిక ప్రదర్శన లేని విరాగి.  ప్రాపంచిక విషయాల తరహాలోనే రాజకీయ వ్యవహారాలనే తామరాకు పైన   తనను  తాను ఓ నీటి బిందువుగా భావించుకున్న ఆధునిక యోగి.  ఆ పరివ్రాజకుడికి ఆ అంటీ ముట్టనితనం   సాధ్యమయిందా?  పరిశీలిద్దాం.
తన జీవితకాలంలో ఎన్నడూ రాజకీయరంగం దిశగా స్వామి అడుగులు పడిన సూచనలు కనిపించవు.  ఏ రాజకీయ పక్షానికీ ఆయన మద్దతు లభించిన  దాఖలాలూ దొరకవు. తన స్వంత  పరివ్రాజక సంస్థలోనూ రాజకీయరంగ ప్రస్తక్తిని నిషేధించిన స్వామీజీ.. ఆ నిబంధనను అధిగమించినవాళ్లని సభ్యత్వం నుంచి తొలగించేందుకైనా సందేహించినట్లు కనిపించదు. రామకృష్ణ మిషన్ నుంచి నివేదిత రాజకీయ సంబంధిత  కారణాల  వల్ల వైదొలగినప్పటి బట్టి స్వామీజీలో ఈ రాజకీయ విముఖత మరింత కరుడుగట్టినట్లు  భావిస్తారు. వివేకానందుడు నివేదితకు పరివ్రాజక సంఘంలో సభ్యత్వం నిరాకరించడం  ఈ సందర్భంగా గమనించవలసిన ముఖ్యాంశం. 
మనిషి పట్ల స్వామికి ఉండే ప్రేమ, సానుభూతి అపారమైనవి. అయినా సందర్భం వచ్చిన ప్రతీసారీ  వివేకానందుడు రాజకీయాల పట్ల తనకున్న విముఖతను నిర్మొహమాటంగా బైటపెట్టేవారు. స్వామి దృష్టిలో రాజకీయాలు మనిషిని సంకుచిత మార్గంలోకి మళ్లించేవి. రాజకీయం మిషతో ఎదుటి మనిషిని పీడించడమే కాదు, తనను గూర్చి తాను  డాంబికంగా  ఊహించుకునే మానసిక రుగ్మత మొదలవుతుందన్నది  వివేకానందుడి నిరసన వెనక ఉన్న భావన. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ప్రహసనాలు చూస్తున్నప్పుడు వివేకానందుడి నాటి ఊహలో వీసమెత్తైనా అసత్యం లేదనే అనిపిస్తుంది. 
స్వామి దృష్టిలో ఈ దేశం పుణ్యభూమి. ఇక్కడి అణువణువు అత్యంత పవిత్రమైనది.  రుషులు,  జాతి వివక్షతకు తావీయని పద్ధతుల్లో  సర్వ మానవాళికి  ఉచితంగా  ఆధ్యాత్మిక జ్ఞానసంపదను పంచిపెట్టారు. వారి అనుయాయులదీ అదే సన్మార్గం. భారతీయుల  మానవతావాదం యావత్ ప్రపంచం దృష్టిలో గౌరవనీయమైన స్థానం సాధించుకునేందుకు ఇదే ముఖ్య కారణం. సర్వశ్రేష్టమైన మానవత్వం పట్ల   భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతి కనబరచిన శ్రద్ధాసక్తులు  ప్రపంచం దృష్టికి తేవడమే లక్ష్యంగా చికాగో సర్వమత మహాసభ తాలూకు   వివేకానందుడి తొలి  ప్రసంగం సాగింది కూడా.
 ప్రపంచం భారతీయ సంస్కృతి ఔన్నత్యం గూర్చి చర్చించడానికి భారతీయులు కేవలం భారతీయుల మాదిరిగానే ఉండి తీరాలని స్వామి ప్రగాఢంగా విశ్వసించారు. కేవలం ఆ కారణం చేతనే మరే ఇతర దేశమో, సంస్కృతో మన దేశం మీదనో,  సంస్కృతి మీదనో పెత్తనం చెలాయించే అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, చెత్త రాజకీయాల ద్వారా  జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వివేకానందుడు తీవ్రంగా అసహం వ్యక్తపరిచింది. 
ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయుల పుణ్యభూమి పై పరాయివారి పాలన కొనసాగకూడదన్నదే స్వామి ప్రగాఢ కాంక్ష. ఆ చింతనాపరుడి ఆలోచనల నుంచి రగిలిన దేశభక్తి భావనలే అప్పటి ఈ దేశపు యువతను తెల్లవారి పాలనకు ఎదురు నిలిచే దిశగా ప్రోత్సహించింది. స్వీయ వ్యక్తిత్వ వికాస నిర్మాణం దిశగా ధ్యాస పెట్టేందుకూ దోహదించిన భావజాలం వివేకానందునిది. ఆ పరివ్రాజకుడి ప్రబోధాల ప్రభావమే మరణానంతరమూ  బ్రిటిష్ దొరల దృష్టిలో స్వామిని  విప్లవకారుడి కింద ముద్ర వేయించింది.
నైతిక పతనం వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం  సాధ్యం  కాదు. రాజకీయాలదే మనిషి పతనానికి చాలా వరకు ప్రధాన బాధ్యత- అన్నది రాజకీయాలపై వివేకానందుని తిరుగులేని సూత్రీకరణ. 'చట్టం, ప్రభుత్వం, రాజకీయాలు మాత్రమే సర్వస్వం కాదు. అవి కేవలం మనిషి జీవన పరిణామ క్రమంలో కొన్ని దశలు మాత్రమే. మానుషత్వ సాధన ఆయా రంగాల ఊహకైనా అందనంత ఎత్తులో ఉంటాయన్న'ది  వివేకానందుడి ఆలోచన. మనిషి అంతరంగ పరంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన నీతి నిజాయితీల  పట్ల రాజకీయాలకు ఎప్పుడూ బొత్తిగా ఆసక్తి ఉండదు’ అన్నది వివేకానందుడి ఫిర్యాదు. కులం, మతం, వర్గం -ఇత్యాదుల పరంగా ప్రజావళిని  విభజనకు గురి చేసే రాజకీయాలు ఈ దేశాన్ని పట్టి వదలకుండా పీడిస్తున్న ప్రధాన రుగ్మతలుగా స్వామి ఆనాడే గుర్తించి గర్హించారు. రెండో ప్రాధాన్యంగా ఉండవలసిన ‘గుడి- మసీదు- చర్చి’ రాజకీయాలు మొదటి స్థానం ఆక్రమించడం స్వామీజీకి బొత్తిగా  గిట్టేది కాదు. మానుషత్వం సంకుచితమయిపోతూ, దేవుళ్లూ దయ్యాలనే భావనల పట్ల వెర్రితనం ప్రబలిపోవడం మనిషికి, మనిషికి మధ్య పూడ్చలేని అగాథాలను సృష్టికేనన్నది ఆయన భావన. రాజకీయక్షేత్ర అనైతిక క్రీడల పట్ల స్వామీజీ క్రుద్ధుడు కాని క్షణం లేదు. 'ఉన్న పరిమిత అనుభవంతో నేను సేకరించిన జ్ఞానం నాకు బోధిస్తున్నది ఏమిటంటే.. మతం మీద మనం ప్రదర్శించే విముఖత్వానికి  మతం అసలు కారణమే కాదు. మనిషిలోని విద్వేషగుణానికి మతాన్ని తప్పు పట్టి ప్రయోజనంలేదు. ఏ మతమూ మనిషిని నిట్టనిలువుగా తగలవేయమని చెప్పదు; సాటి మనిషిని పీడించమనీ రెచ్చగొట్టదు. ఆ తరహా  దుష్కృత్యాలు చెయ్యమని మనిషి మీద వత్తిడి చేసేందుకుగాను మతం పుట్టలేదు. అంతులేని అమానుష కార్యాలన్నిటికి మనిషిని  ప్రేరేపిస్తున్నవి నిజానికి జుగుప్సాకరమైన రాజకీయాలే. కానీ,  ఆ తరహా  అవాంఛనీయ రాజకీయాలనే నిజమైన మతమని జనం నమ్ముతున్నారిప్పుడు! ఈ విషాదకర పరిణామాలకు బాధ్యులెవరో గ్రహించినప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించేది' అన్నారో సందర్భంలో స్వామి వివేకానంద మతానికి రాజకీయాలకు మధ్య గల అపవిత్ర సంబంధాలను ఎండగడుతూ. 
మతం అసలైన పరిమళం ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసి దుష్కృత్యాల మీద ధ్యాస పెట్టడు. పరులకు దుఃఖం కలిగే చర్యలు చేపట్టడు.  స్వానుభవం నుంచి వెలికి తీసిన వెన్నముద్దల వంటి సూక్తులు పంచిపెట్టే ఒక సందర్భంలో స్వామి వివేకానందుడు 'మనిషి మేధస్సు చేయదగిన అత్యుత్తమైన ఆరోగ్యకరమైన దారుఢ్య సాధన.. స్వచ్ఛమైన అంతరంగంతో మతాన్ని అనుసరించడం మాత్రమే' అని హితవిచ్చారు.  
జంతువు, మనిషి, దేవుడు- ఈ ముగ్గురికి  ముఖ్య ప్రవృత్తుల సంగమమే మనిషి. అతనిలో అంతుబట్టకుండా దాగి  ఉండి అంతర్గతంగా చెలరేగే రాగద్వేషాల వంటి దుర్లక్షణాలను అణచివేయడం ద్వారా పశుప్రవృత్తిని సాధ్యమైన మేరకు కుదించి మనిషిలో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని తట్టిలేపడమే 'మతం' అసలు లక్ష్యం. 'కాబట్టే  దేశానికి ఒక రాజ్యాంగం ఎంత అవసరమో, మనిషికి మతమూ అంతే అవసరం' అని వివేకానందుడు భావించింది. ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు వంటి విద్వేష భావనలకు మాత్రమే ఆలవాలమైన రాజకీయాలు సర్వమానవళి పట్ల సరిసమానమైన ప్రేమాభిమానాలను పంచవలసిన మనిషికి మేలు చేయవని స్వామి గట్టిగా నమ్మారు. ప్రతికూల దృక్పథ రాజకీయాలతో ప్రపంచమంతా పొంగి పొర్లిపోతున్న సన్నివేశాల మధ్య జీవిస్తున్న స్వామి పౌరుల మనసులు దుర్మార్గమైన ఆలోచనలతో కలుషితం కాక  ముందే, వారి మెదళ్లను అందుకే ఉదాత్తమైన ఆధ్యాత్మిక భావనలతో ముంచెత్తెయ్యాలని  అనుక్షణం ఆరాటపడిపోయింది. 
యూరోపియన్ మేధావుల సదస్సులో ఉటంకించిన భావాలను పునరాలోచిస్తే వివేకానందుడికి భారతీయ సోషలిజమ్ పట్ల ఎంత  చక్కని  అవగాహన ఉందో అర్థమవుతుంది. 'భారతదేశంలోనూ సోషలిజమ్ ఉంది. కానీ  అదీ యూరోపియన్ తరహా ద్వంద్వ విధానం కన్నా విభిన్నంగా ఉంటుంది. అద్వైతమనే అఖండ జ్యోతుల వెలుగుల్లో కళాకాంతులీనే సాంఘిక వ్యవస్థ మాది. యూరప్ లో ప్రాచుర్యంలో ఉన్న సోషలిజమ్ భావనలో మాత్రమే ఆర్థిక సోషలిజమ్. అర్థికపరమైన  కోణంలో చూడడమే అందులోని ప్రధాన  లోపం. బైటకు  వ్యక్తివాదానికి చోటిచ్చే వ్యవస్థగానే  కనిపించినప్పటికీ,  వాస్తవానికి అది వ్యక్తిలోనే నిత్యం సంఘర్షించే రెండు పరస్పర విరుద్ధమైన శక్తుల(మనసు, మెదడు)ను పరిగణలోకి తీసుకునేపాటి శ్రద్ధ చూపించలేదు’ అని స్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాట. మార్క్సిజమ్ ఒక  రాజకీయ భావజాలంగా యూరప్ నంతటా ముంచెత్తుతున్న దశలో, దాని తాకిడి హిందూదేశపు ఎల్లలలను కూడా తాకుతున్న నేపథ్యంలొ వివేకానందుడు నిర్భీతిగా వెల్లడించిన మనసులోని మాటలు ఇవి. ఆ నాటి రాజకీయ యుగసంధిలోని పరిణామాలన్నింటిని బాగా ఆకళింపు చేసుకున్న ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టే వివేకానందుడు సోషలిజమ్, మార్క్సిజమ్ వంటి సాంఘిక చైతన్య భావజాలాలలోని  'సామాన్యుణ్ణి ఉద్ధరించే లక్ష్యం'  వైపుకు ఆకర్షితుడై తనను తాను ఒక 'ఆధ్యాత్మిక సోషలిష్టు'గా ప్రకటించుకున్నాడు. ఒక పరివ్రాజకుడు సోషలిజమ్ పట్ల ఆకర్షితుడవడం వరకు నిజంగా ఒక అద్భుత సన్నివేశమే! కాని ఆ పోలిక అక్కడి వరకే సరి.
సోషలిజమ్ లోని శ్రామిక పక్షపాతం స్వామిని బాగా ఆకర్షించిన సద్గుణాలలో ఒకటే కానీ, అదే సమయంలో పీడితుని బాధా విముక్తికై సోషలిజమ్ సూచించిన మార్గమే సమగ్రమైనదిగా భావించడానికి ఆయన సమ్మతించలేదని కూడా గమనించడం ముఖ్యం. సోషలిజమ్ భావనను ఆయన 'సగం ఉడికిన ఆహారం'గా భావించారు. 
అంతర్గతంగా దాగిన లోపాల వల్ల ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే  శక్తి సోషలిజానికి చాలదన్న భావన వివేకానందుడిలో ఉంది.  సోషలిజమ్ ప్రవచించే మేధావుల మధ్య గల అభిప్రాయ భేదాలనూ ఆయన గుర్తించకపోలేదు.
 సోషలిజమ్ అన్న భావన ఆధునిక ప్రపంచానికి సైంట్ సైమన్ (1760 -1825), ఫ్యూరర్ (1772 -1832), రాబర్డ్ ఓవెన్ (1804 -1892) ద్వారా పరిచయం చేయబడింది.  త్రిమూర్తుల ద్వారా ప్రవచితమైన ఈ సామాజిక సూత్రాలు  ఎవరి వల్లా నమ్మదగిన స్థాయిలో సవ్యంగా నిర్వచించబడలేదన్నది ఒక ఫిర్యాదు. 'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం, ఎవరి అవసరాన్ని బట్టి వారికి దక్కవలసిన భాగం' అన్నది మార్క్స్ భావజాలమయితే,  విభేదించిన లెనిన్ మహాశయుడు దాని స్థానే  'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం.. ఎవరికి శ్రమను బట్టి వారికి దక్కవలసిన భాగం' అని కొత్త నిర్వచనం వెలువరించాడు. బెర్నార్డ్ షా ఆ ఇద్దరినీ ఖండిస్తూ ' సోషలిజమ్ మీద స్వామీజీ  చేసిన అధ్యయనమే సరళంగా, సవ్యంగా, సూటిగా సాగింద'ని  కితాబిచ్చాడు.  పారిశ్రామిక దేశాలు కాకపోయినప్పటికీ రష్యా, చైనాలలో కమ్యూనిస్టు విఫ్లవాలు చెలరేగడమే స్వామి పరిశీలనలోని సంబద్ధతకు నిదర్శనం' అని జి.బి.షా భాష్యం. 1897 సంవత్సరంలోనే  'మరో అర్థ శతాబ్దానికి భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధిస్తుంద'ని స్వామి చెప్పిన జోస్యం సత్యం కావడం బట్టి  ఆయన పరిశీలనలోని బుద్ధినైశిత్యం వెల్లడవుతుంది. ఆ రోజుల్లో అసంభవమనిపించిన భారతదేశ స్వాతంత్ర్య హోదా స్వామి చెప్పిన విధంగానే సరిగ్గా 1947లో సాకారం కావడం మిడతంభొట్టు జోస్యమైతే కాదు గదా! నిశిత పరిశీలనా ప్రజ్ఞ గల ఘటికులే ఈ విధమైన నిర్దుష్ట ప్రతిపాదనలు ధైర్యంగా ముందుకు తెచ్చి ‘ఔరా!’ అనిపించుకోగలిగేది.
స్వామి ప్రస్థానించిన 1902 కి అర్థ శతాబ్ది తరువాత భూగోళ   రాజకీయం పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అధికారం కోసం, అర్హతలతో నిమిత్తంలేని పెత్తనాల కోసం ప్రపంచదేశాలు  ప్రదర్శించే అత్యంత హీనమైన దౌర్జన్య రాజకీయరంగాలు ప్రపంచాన్ని పేలబోయే అగ్నిగుండంగా  మార్చేసాయన్న మాట నిజం.
 సామ్రాజ్యవాదం, జాతీయవాదం, ఉగ్రవాదాలకు తోడు నియంతృత్వ పోకడలు ప్రబలి నేరాలకు, మూకుమ్మడి హత్యలకు అణచివేతలకు అంతమనేది లేకుండా కొనసాగుతున్నది ప్రపంచ రాజకీయమంతా.  రెండు సోషలిష్టు విప్లవాలు బలిగొన్న రక్తపాతం ఎంతో లెక్కలు అందనంత గాఢమైనది.  రెండు ప్రపంచయుద్ధాలు, అణుబాంబు విస్ఫోటాలు, ట్రేడ్ సెంటర్ దాడి వంటి దుర్ఘటనల వల్ల మానవత్వానికి జరిగిన చెరుపుకు  లెక్కలు కట్టడం ఎవరి తరమూ కాదు. అత్యంత సూక్ష్మ దార్శనిక దృష్టి గల స్వామి వివేకానందుడు అందుచేతనే ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి చాలా ముందు నుంచే ' ప్రపంచం అగ్ని పర్వతం అంచున నిలబడి ఉంది. అది ఏ క్షణంలో అయినా భగ్గుమని పేలి సర్వమానవాళికి పూడ్చలేనంత నష్టం  కలిగించే అవకాశం ఉంది' అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ తరహా కష్టనష్టాల భారం తగ్గించే దిశగా అందుకే స్వామి యూఎన్ఓ వంటి  అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఏర్పాటయి చురుకుగా పనిచేయాలని అభిలషించింది.
కొన్ని దశాబ్దాల కిందట వరకు జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సమస్యలను  జాతీయ స్థాయి సంస్థలే సమన్వయించి  సర్దిచెప్పేవి. పరిస్థితి మారింది. రెండు దేశాల పిట్టగోడ సరిహద్దు వివాదాలు కూడా ఊహించడానికైనా  సాధ్యం కానంత ఉత్పాతాలకు దారితీసి ప్రపంచదేశాలన్నింటిని  రచ్చలోకి ఈడ్చుకొస్తున్నాయి. ఇదంతా గామనించిన స్వామి ఆ తరహా సమస్యల పరిష్కారం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ  సంస్థల ద్వారానే సుసాధ్యమౌతుందన్న మాట వాస్తవం. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, అంతర్జాతీయ న్యాయచట్టాల ఆవశ్యకత నానాటికి పెరగక తప్పదు' అని ముందుగా గుర్తించి  ప్రకటింనిన వాస్తవిక రాజకీయ పరిశీలకుడు స్వామి వివేకానంద.  
నేటి మనిషి జీవితంలో రాజకీయాలు అంతర్గత విభాగాలవక తప్పడంలేదు.  రాజకీయాలతో నిమిత్తంలేని బతుకులు సాధ్యం కాదన్న పచ్చి వాస్తవం స్వామి అనుభావానికేమీ అందకుండా పోలేదు ఎప్పుడూ. అందు చేతనే సామాన్య గృహస్తును రాజకీయాల నుంచి దూరంగా ఉండమని ఆయన ఏనాడూ కోరలేకపోయివుండవచ్చు. కానీ రాజకీయాలతో అనుసంధానం ఏర్పరుచుకునే విధానంలోనే కొత్త పుంతలు తొక్కమని మాత్రం  ప్రబోధించేందుకు ప్రయత్నం చేసారాయాన. ‘భారతీయ వేదాంతం రాజకీయాలలో తెచ్చే సగుణాత్మకమైన మార్పులను  ఊతం చేసుకోకుండా ఇంగ్లాండ్ దేశానికి  నేను మతం  అగత్యాన్ని గురించి ప్రబోధించలేకపోయాను. ఇక్కడ ఇండియాలో కూడా సంఘసంస్కరణలు ప్రవేశపెట్టే ముందు  ఆధ్యాత్మిక రంగం  మానవాళికి చేకూర్చే మేళ్ళను గురించి ముందు  చర్చించవలసిన అగత్యం ఉందని మాత్రం హెచ్చరిస్తున్నాను. రాజకీయ భావజాలాన్ని ప్రబోధించే సమయంలోనూ అది భారతదేశానికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదలో ఏ మేరకు అభివృద్ధి  సాధించగలదో ముందు చెప్పాలి.'  అన్నది  రాజకీయాల  వరకు చివరకు స్వామి వివేకానందుడు తీసుకున్న వైఖరి.  
వివేకానందుడి స్వంత వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు రాజకీయ ప్రభావానికి అతీతమైన రాజకీయ పరిశీలకుడు ఆయన. ఏ జాత్తీయ, అంతర్జాతీయ రాజకీయాలకూ ఆయన మనస్తత్వాన్ని మార్చే శక్తి చాలదు. కానీ స్వామి రాజకీయ పరిశీలన అర్థవంతంగా ఉంటుంది.  నిర్దుష్టత శాతం ఎక్కువ. నైపుణ్యంతో కూడిన సునిశితత్వంతో, సూక్ష్మ పరిశీలనతో  నిరపాయకరంగా సాగే వివేకానందుని ప్రసంగాలంటే అందుకే మానవ జీవితంలోని అన్ని పార్శ్వాల మేధావులు అత్యంత శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడేది. ఆఖరుకు అవి రాజకియ సంబధమైన  ప్రసంగాలైనా సరే.. మినహాయించడానికి వీలులేనివి! 
'స్వామి వివేకానందుని సంపూర్ణ మేదోశక్తిని ఒకే చోట పోగేసి పరిశీలించేవారికి నోటమాట  రాకపోవడం సాధారణంగా జరిగే అనుభవమే. జాతీయవాదానికి, అంతర్జాతీయవాదానికి  మధ్య మరేదో నూత్న భావజాలంతో నిండిన మానవతావాదంలా పరమ ఆకర్షణీయంగా ధ్వనింపచేయడమే వివేకానందుని ప్రసంగాలలోని ప్రధాన ఆకర్షణ' అంటారు  'గుడ్ బై టు బెర్లిన్' రచయిత క్రిస్టోఫర్ ఐషర్ వుడ్. భారతీయుల చరిత్ర, భాషా సాహిత్య సంస్కృతులలో లోతైన అధ్యయనం చేసిన ప్రముఖ ఇండాలజిస్ట్ ప్రొఫెసర్ ఎ.ఎల్. భాషమ్  'రాబోయే కొన్ని శతాబ్దాల వరకు స్వామి వివేకానంద  ఆధునికి ప్రపంచ నిర్మాతల వర్గంలోని చింతనాపరులలో ఒక ప్రముఖునిగా గుర్తుండిపోవడం ఖాయం' అని స్వామీజీ రచనలు అన్నీ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన తరువాత వెలిబుచ్చిన ఆఖరు మాట. కాదని మనం మాత్రం ఎట్లా అనగలం!
***
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం)
                                                

Sunday, August 9, 2020

వెళ్ళిరా నేస్తం! -మల్లాప్రగడ రామారావు


Image for post

వెళ్ళిరా నేస్తం
అసలే కాలం పరిమితం
వీడ్కోళ్లకీ, కన్నీళ్ళకీ
వ్యవధేదీ?
మనల్ని కలిపిన కాలం
మళ్లా విడదీస్తే
ఏముందీ ఫిర్యాదుకీ?
మనిషి, మనిషి ఒక ద్వీపం
ద్వీపాలను కలిపే తంత్రి ఈ  స్నేహం
కాలాన్ని అనుభవాల కత్తెరతో విభజిస్తే
ఏ ఏ వేళల
ఏ ఏ ద్వీపాల నడుమ
అనుసంధానాలు వెలుస్తాయో
ఎన్నాళ్లు నిలుస్తాయో
నికరంగా ఎవరం
ఎలా అంచనా వేయగలం?
కాలం పామై
మనిద్దరి మధ్యా ప్రవహిస్తే
నేను నిందించనూ లేను.
ఎందుకంటే
ఒక పడవై కొన్నాళ్లైనా
మనల్ని ఒకచోట చేర్చింది తానే.

చెప్పొచ్చేదేమంటే
నువ్వూ నేనూ కరగిపోతాం
పదిలంగా మిగిలేది
ఒకటో అరో అభుభూతులే.
కాలం మంచుపొరల వెనకాల
పొద్దు పొడవని ముందు ఎరుపు రంగులా
నిన్నలన్నీ కొద్దో గొప్పో
కనపడుతూనే ఉంటాయి.
అంత మాత్రానికే
నీ స్మృతి
శాశ్వతంగా నిలుస్తుందని
అనృతాలాడలేను
బహుశా ఒంటరి నక్షత్రం
ఆకాశపు కాసారాన్ని
కాపలా కాస్తున్నప్పుడు
గుర్తొస్తావు నువ్వూ.
వెళ్లిరా నేస్తం
అసలే సమయం
పరిమితం!
***
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
09= -08 -2020





                                                

Saturday, August 8, 2020

శిశయిష -శ్రీ మేడవరపు సంపత్ కుమార్ -కవిత

 

ప్రాచీన కాలపు ఫాసిల్స్ అడుగు పొరల

అంతః తమస్సుల్లో

గాథలు లేని అగాధాల్లో

మేధ చొరని మరుగుల్లో

శయనించాలని నా కోరిక

అపుడు

 నా దేహంలోని ధమనుల్లో ప్రశాంతతానందాలు

ఉద్భవిస్తాయి.

ఈ సిరులు, మరులు నా మజ్జ కోపరిచూర్ణితాలు

కళలు, కాంతులు నా అస్థిలో భూస్థాపితాలు

నీతులు, చేతలు నా రుధిరంలో ఆవిరవబోయే

అంభః గణాలు

 జగతి జంఝాటంలో

ఎందుకీ జాగారం

కాదు ఇది మృతావస్థ,

అందరికీ అందని

చ్యుతి లేని అమృతావస్థ!

***

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

08 -08 -2020

(శిశయిష= శాశ్వత నిద్రకు ఒరగాలనే కోరిక)

 

 

 

వివిధ కోణాలలో శ్రీకృష్ణతత్వం -కర్లపాలెం హనుమంతరావు -సూర్య దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురణ


కృష్’ అంటే శాశ్వతమైన, ‘ణ’ అంటే ఆనందం. పేరులోనే సూచితమయే  ఆ శాశ్వతానందం  అందించే   అవతారమూర్తి శ్రీకృష్ణుడిని విభిన్న కోణాలలో  సందర్శించే  చిన్ని ప్రయాసే ఈ వ్యాస రూపం.
కృష్ణుడు శ్రీకృష్ణుడుగాః
కృష్ణుడు యమునా తటి మధురానగరిలో కళ్ళు తెరిచిన కాలం మౌర్య పాలనకు(క్రీ.పూ.321)  సమకాలీనం. ఉత్తరభారతమంతా చిన్న చిన్న తెగల స్వీయపాలనలు ఉండిన  సమయమది. కృష్ణుడూ ఒక స్వతంత్ర రాజ్య సంస్థాపకుడే! స్వయంగా వీరుడు. అయినా,  రాజ్యాల మధ్య  సమన్వయం సవ్యంగా లేని నాటి రాజకీయ వాతావరణంలో సందర్భాన్ని బట్టి సాటి పాలకులకు సలహాదారుడిగా, రాజ్యాల మధ్య సయోధ్య కుదిర్చే రాజకీయవేత్తగా, రాజధర్మం బోధించే యోగపురుషుడుగా, సామాజికన్యాయం ప్రవచించే సుంఘసంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞలను విజయవంతంగా ప్రదర్శించిన ప్రతిభ కృష్ణయాదవుడిది. పాండవుల పట్ల  పరమాప్తుడుగా ప్రవర్తించిన ఆ లౌక్యుడు కాలక్రమేణా మోక్షకాముకులంతా కాంక్షించే దైవసమానుడి స్థాయికి ఎదిగేందుకు కాలం కూడా కలసిరావడం ఒక కారణమని చరిత్రకారుల అభిప్రాయం.
దేవతారూపాలుః
ఎనభైనాలుగు లక్షల జీవజాతులతో వర్ధిల్లే సృష్టిలో వివేచనబుద్ధిగా   మేధస్సులో స్థిరపడి మానవజన్మను మహోన్నతంగా తీర్చిదిద్దే చోదకశక్తి పరమాత్ముడన్న పారమార్థిక చింతన మనిషిలో ఎప్పటి బట్టి  ప్రబలమయిందో   రుజువులు దొరకని అంశం. పరమాత్మ, దివ్యత్వం వంటి అలౌకిక  భావజాలం బలం పుంజుకున్న కొద్దీ ఆరాధనార్థం  మనిషికి ఒక  బౌద్ధిక మూర్తి ఆవశ్యకత ఏర్పడింది. మానసిక భావోద్వేగాల అక్కరలు  నిమిత్తం పుట్టుకొచ్చినవే దేవతారూపాలు.
మహిమలుః
వాస్తవజీవితంలో తాను అనుభవించాలని ఆరాటపడే భోగభాగ్యాలన్నిటికీ ‘స్వర్గం’ పేరుతో ఓ ఊర్థ్వలోకం కల్పన చేసుకున్నట్లే, ఓపలేని ఈతి బాధలకూ ‘నరకం’ పేరుతో ఓ అథోలోకం కల్పించుకున్న ఘనుడు మనిషి. సహజంగానే  భగవంతుడు ఆ తరహా అతని స్వర్గానికి అధిపతి. స్వర్గప్రాప్తి, నరకవిముక్తి  మనిషి ఇహలోకంలో ఉన్నప్పుడే సాధించవలసిన పారమార్థిక లక్ష్యాలయాయి.  వాటిని పొందే వైనం లౌకిక భావజాలంతో నిర్వచించుకునే శక్తి చాలక ‘మహిమలు’ వంటి   అలౌకిక శక్తులను భావించుకుని, వాటిని  ప్రదర్శించే బాధ్యత భగవంతుడికే అప్పగించాడు మనిషి.
భగవంతుని అవతారాలుః
బిడ్డల కోసం కన్నవారుగా తాము పడే తపన మనిషికి  స్వానుభవమే! తల్లీ.. తండ్రీ వంటి దేవుడూ తమ భద్రత  కోసమై ఆయా సందర్భాలకు అనుగుణంగా  భూతలానికి  దిగివచ్చి  దుష్టశిక్షణ, శిష్టరక్షణల వంటి ధర్మకార్యాలు నిర్వహిస్తాడన్న విశ్వాసంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన  ‘భగవంతుని అవతారం’. భగవద్గీత 4వ అధ్యాయంలోని 7,8  శ్లోకాలను('యధా యధా హి ధర్మస్య; పరిత్రాణాయ సాధూనాం) బట్టి భారతయుద్ధం నాటికే ఈ అవతార సంపద్రాయం స్థిరపడినట్లు, భగవానుడు  ధర్మోద్ధరణ కోసమే కృష్ణావతారమెత్తినట్లు  జనం భావించినట్లు అర్థమవుతుంది.
సమకాలికుడు కావడంతో కృష్ణుడి దివ్యత్వాన్ని(మానవ మాత్రులకు అసాధ్యాలనుకునే పనులు) వ్యాసుడు కళ్లారా చూసే అవకాశం కద్దు. తన అవగాహన  మేరకు శ్రవణాసక్తుల మేధోసామర్ధ్యమే లక్ష్యంగా వాసుదేవుడిని ఓ అవతారమూర్తిగా చిత్రించడం రచనా ప్రయోజనం సాధించడానికైనా కావచ్చు. ఏదేమైనా  కృష్ణకథను  ‘శ్రీకృష్ణవృత్తాంతం’గా  ఒక క్రమపద్ధతిలోఉదాత్తంగా చిత్రించిన ప్రథమ సాహిత్యరచన చరిత్రకు తెలిసినంత వరకు  మహాభారతమే. కాకపోతే  భారతవాజ్ఞ్మయంలోని శ్రీకృష్ణుని విశేషాలకు, వైదికవాజ్ఞ్మయంలోని శ్రీకృష్ణుని విశేషాలకు మధ్య కొంత సమన్వయ లొపం ఉందని చెప్పుకోవాలి.
వైదికవాజ్ఞ్మయంలో శ్రీకృష్ణుడుః
రుగ్వేదంలో కృష్ణుడు  చాలా చోట్ల కనిపిస్తాడు. ఎనిమిదో మండలంలో  అంగీరసుడు సోమపానీయం చేసే  సోముణ్ణి స్తుతించినప్పుడు, మొదటి మండలంలో విష్ణాపు తండ్రి 'కృష్ణీయ'గా సూచితుడయినప్పుడు, ఎనిమిదో మండలంలొ ఆర్యదేవతలకు వ్యతిరేకంగా వృత్తాసురుడిగా చిత్రితుడయినప్పుడు, కౌషీతకం బ్రాహ్మణంలో  అంగీరస మహర్షిగా అభివర్ణితుడయినప్పుడు, ఐతరేయ అరణ్యకం కృష్ణహరీతుని పేరున మహర్షుల కోవలోచేర్చి ప్రస్తుతించినప్పుడు.   ఛాందోగ్యోపనిషత్ అయితే 'తద్దైవద్యోరంగీరసంః కృష్ణాయదేవ’(3-17-6) అనే శ్లోకం ద్వారా ఘోరఅంగీరసుని శిష్యుడైన దేవకీపుత్రుడిగా కూడా కృష్ణుడిని  పేర్కొన్నది. వైదికవాజ్ఞ్మయం ఇట్లా పరస్పర విరుద్ధ చిత్తప్రవృత్తులున్నఒక మహర్షిని, మరో అనార్యనాయకుడిని కూడా కృష్ణనామధేయంతో పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే అంశం! కానీ,  ఈ రెండు పాత్రలకూ, దేవకీ పుత్రుడైన  కృష్ణుడుకి పేరులో మాత్రమే పోలిక.
ఉపనిషత్తులలో శ్రీకృష్ణుడుః
ఉపనిషత్తుల కాలానికే ‘అవతారమూర్తుల’ భావన ఆరంభమైందని చరిత్ర భావిస్తుంది. 'అగ్నిం వరుణ మిత్రం ఇంద్రం ఆర్యమా ఐమాహః'  అన్న రుగ్వేదంలోని శ్లోకాన్ని బట్టి ఒకే దేవుడికి వివిధ నామాలు గల సంప్ర్రదాయం నుంచి ఉపనిషత్తుల కాలం(క్రీ.పూ 7వ శతాబ్దం)  వచ్చే సరికి ఒక్కో దేవుడికి ఒక్కో పేరు స్థిరపడే  సంప్రదాయం బలపడినట్లు చరిత్రకారుల అభిప్రాయం.  దశావతారాల సంప్రదాయానికీ ఆరంభం కూడా   అదే అయే అవకాశం కద్దు.
పురాణాలలో శ్రీకృష్ణుడుః
మహాభారతం తరువాత వెలసినవే కాబట్టి శ్రీకృష్ణ పాత్రను ఒక 'పూర్ణతమావతారం'గా దాదాపు అన్ని పురాణాలు  గొప్ప హంగులతో తీర్చిదిద్దాయని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 'యస్తు నారాయణో నామదేవ దేవః తస్యాంశో మానుషేష్వా సీద్వాసుదేవః ప్రతాపవాన్' అని భారతం చెబితే, 'మత్సాశ్వకచ్చప నృసింహ వరాహహంస రాజస్య విప్రవిబుధేషు కృతావతారః' అని అన్ని అవతారాలు తాను ధరించినవే అన్నట్లు స్వయంగా శ్రీకృష్ణుడే భాగవతంలో చెప్పుకొచ్చాడు. కృష్ణుని రాసలీలలు నుంచి రాచకార్యాల వరకు అన్నీ దైవలీలలే  అన్నంత భక్తిపారవశ్యంతో పూసగుచ్చినట్లు వర్ణించాయి దాదాపు వైదిక  పురాణాలన్నీ!  రాధాకృష్ణుల ప్రణయ వృత్తాంతాన్ని ఏకరువుపెట్టింది ఏ చరిత్రా కాదు.. సాక్షాత్ పురాణాలే! పురాణాల కాలం వరకు ఉత్తర భారతానికి మాత్రమే పరిమితమైన కృష్ణకథ తదనంతర కాలంలో తెలియని ఏ కారణం చేతనో  దక్షిణావనికీ  పాకి అత్యంత తక్కువ వ్యవధానంలోనే మహా విస్తృతంగా వ్యాపించింది. తెలుగునాళ్ల వరకు ఈ వ్యాప్తిలో   బమ్మెర పోతన భాగవతం పోషించిన పాత్ర అనన్యం. బౌద్ధసాహిత్యమూ కృష్ణకథ (ఘటజాతకం)ను ప్రచారంలో ప్రదర్శించిన ఉత్సాహం ఆశ్చర్యకరం.
పాశ్చాత్యుల  దృష్టిలో శ్రీకృష్ణుడుః
సనాతనకాలంలో రాముడు, కృష్ణుడు వంటి గొప్ప వ్యక్తులు  దివ్యశక్తులుగా వర్ధిల్లారు.  ఒకరి తరువాత ఒకరుగా అవే  దివ్యాకర్షణలతో వరుస చెదరకుండా మానవాతీతులు ఉద్భవించే  క్రమం ఆస్తికులలో  అవతారాలపై   విశ్వాసం మరంతగా  పెంచిందన్నది పాశ్చాత్య పరిశోధకుల భావన. అవతార సంప్రదాయానికి అదనంగా  పడమటి మేధోవర్గం  తమదైన వ్యూహాల (strategies) సిద్ధాంతం  జతచేయడం ప్రత్యేకంగా పరిశీలించదగ్గ విశేషం.
అవతారాలు వేరు.. వ్యూహాలు వేరు. ఒకే అవతారంలో భిన్న కార్యాల నిర్వహణకై  విభిన్న రూపాలు ధరించడం వ్యూహాల ప్రయోజనం. పాశ్చాత్యుల భావధారకు అనుగుణంగానే,  కృష్ణావతారంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.  భీష్మపర్వం ఈ వ్యూహాలనే వైదాంతిక   ధోరణిలో పురుషుడు, జీవుడు, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలుగా భావించింది(42-314). ఈ వ్యూహ సముదాయాన్నే మరో సందర్భంలో నరనారాయణులు, హరికృష్ణులనే  వ్యూహాలుగా కూడా భావించింది. 
గ్రీక్ తత్వవేత్త హెలియోడోరస్  ప్రతిష్ఠించిన గరుడస్తంభ వృత్తాంతంతో ఈ వ్యూహాలకు పోలిక కద్దు. ఆర్య సంస్కృతి ప్రారంభ దశల్లో పశుపాలన, వ్యవసాయం ప్రధాన వృత్తులు కాగా వాసుదేవ, సంకర్షణ వ్యూహాలు ఈ రెండు వృత్తులకు ప్రతీకలుగా భావించబడి ఆ ధోరణిలోనే  కాల్పనిక సాహిత్యం పుట్టుకొచ్చినట్లు పాశ్చాత్య పండితుల భావిస్తున్నారు.
శ్రీకృష్ణుని జీవితకాలం:
మహాభారతంలో శ్రీకృష్ణుడిది ప్రధాన పాత్ర. కురుక్షేత్రయుద్ధ కాలాన్ని బట్టి  కృష్ణుడి జీవితకాలం మీదా ఒక అంచనాకు రావచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారతంలో  పర్షియన్లు, గ్రీకులు, రోమన్ల తాలూకు ప్రస్తావనలు ఉండటం వల్ల మహాభారత కథాకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీ.పూ 4వ శతాబ్దానికి ముందు నాటిదిగా చెప్పడానికి లేదన్నది  సుప్రసిద్ధ పురాతత్వశాస్త్రవేత్త బి.బి. లాల్ పరిశోధన (మహాభారత్ మిత్ అండ్ రియాలిటీ -1976 -పుట.52) అభిప్రాయం. పాణిని అష్టాధ్యాయీ మహాభారత కథాకాలాన్ని క్రీ.పూ 5 వ శతాబ్దం దాకా  తీసుకువెళ్లడం గమనార్హం. రెండవ పులకేశి  తాలూకు క్రీ.పూ.634 నాటి ఐహొళె శాసనం  ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది సదరు శాసనం నాటించిన 3735 సంవత్సరాలకు ముందు.
అంటే (3735-634=3101) క్రీ.పూ 3101 ప్రాంతంలో!  మహాభారతం మౌసలపర్వం మొదటి శ్లోకం ప్రకారం కృష్ణుడి నిర్యాణం జరిగింది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత. అంటే (కలియుగం ఆరంభమయిన క్రీ. పూ 3101+ మౌసలపర్వం ప్రథమ  శ్లోకం చెప్పిన 36 సంవత్సరాలతో కలుపుకొని) క్రీ.పూ3137 లో!
పురాతత్వచరిత్ర కోణంలో విశేషాలుః
చరిత్ర అంటే  జరిగిన సంఘటనల సాధికారిక ప్రకటన. 'హెలియో డోరస్' అనే గ్రీకు దేశీయుడు  క్రీ.పూ 2వశతాబ్దిలో విదిసా నగరం నడిబొడ్డున  గరుడ ధ్వజాన్ని ప్రతిష్ఠి౦చినట్లు   శాసన మొకటి  కనిపిస్తుంది. ఇదే శతాబ్దిలో సంకర్షణవాసు దేవతత్వాన్ని గౌరవించే  కట్టడం  ఉదయ్ పూర్ లో నిర్మించినట్లు డి.పి.సర్కార్ 'సెలెక్ట్ ఇన్ స్క్రిప్షన్స్' మొదటి సంపుటి తెలుపుతోంది. ఈ కాలానికి  ముందూ వెనుకలుగా వైష్ణవతత్వం తెలియచేసే పాంచరాత్రం ప్రాధాన్యత గల ఛాందగ్యోపనిషత్ రచన జరిగింది. మహాభారతంలోని హస్తినాపురం ఇప్పటి ఢిల్లీ, మీరట్ ప్రాంతాలు. అక్కడ  జరిగిన తవ్వకాల తాలూకు బైటపడ్డ రంగుల కుండ పెంకుల ఆధారంగా భారతయుద్ధ కాలం క్రీ.పూ 1100 ఏళ్ల కిందటిది.  ఐహొళె శాసనం పేర్కొన్న విధంగా క్రీ.పూ 3101 కాకుండా, మహాభారత కాలం మరింత ముందుకు జరికి క్రీ.పూ 1200 నాటిది కూడా అయివుండవచ్చు, ఇన్ని కారణాలుగా శ్రీకృష్ణుడి జీవిత కాలమూ అదేనన్న భావన క్రమేపీ బలపడుతున్నది ఇప్పుడు. ఏదేమైనా, కృష్ణుడు శ్రీకృష్ణుడుగా సుమారు 3200 సంవత్సరాల నుండి ఈ భరతభూమిలో ఆరాధ్యుడన్నది  ఒప్పుకోక  తప్పని నిజం.  చిత్రకళల్లోని శ్రీకృష్ణుడూ  ఈ వాదన వైపుకే మొగ్గు చూపడం విశేషం,
చిత్రకళలో శ్రీకృష్ణుడుః
భారతీయ చిత్రకళలో కృష్ణుని చిత్రం క్రీ.పూ 2వ శతాబ్ది నుంచి దర్శనమిస్తోంది.  నేటి హర్యానా సగ్ ప్రాంతంలో దొరికిన (ఆధారం: పి.బెనర్జీగారి 'కృష్ణా ఇన్ ఇండియన్ ఆర్ట్) సాందీపుని దగ్గర్ర శ్రీ కృష్ణుడు బ్రహ్మీ అక్షరాలను అభ్యసించే చిత్రం మొదటి సారి నాణేల మీద ముద్రించిందీ  ఇదే శతాబ్దానికి చెందిన అగతక్లీన్. కుషాణశైలిలో శిల్పాలపై చెక్కిన కృష్ణ చిత్రాలు విస్తారంగా కనిపిస్తాయి.  శ్రీకృష్ణుడిని క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాలలో మధుర ప్రాంతాలలో దైవంగా భావించి, ఆరాధించడటమే ఇందుకు నిదర్శనం. తిలక్ తన  గీతారహస్యంలో భగవద్గీతను క్రీ.పూ 500 సంవత్సరాల నాటిదిగా తేల్చిచెప్పారు. ఆ భావనకే పాశ్చాత్య పరిశోధకులూ తలలాడించారు. పాశ్చాత్య పండితుడు డి.హిల్ కృష్ణావతారం క్రీ.పూ 2వ శతాబ్దం నాటికే స్థిరపడ్డట్లు భావించడం ఇందుకో ఉదాహరణ.(ఆశా గోస్వామి 'కృష్ణా అండ్ అల్లైడ్ మ్యాటర్స్ -1954,పుట 189).
కృష్ణకథ- భారతకథ- వాస్తవికత
కృష్ణకథ- భారతకథకు అనుసంధానం సరే! అసలు మహాభారతం నిజంగా జరిగిందా?అనే  సందేహం సహజంగానే తలెత్తుతుంది  కదా ఏ పరిశోధనకైనా? యధాతధంగా కాకపోయినా వ్యాస విరచిత భారతంలోని కొన్ని సంఘటనలకు వాస్తవ జగత్తులో రుజువులు లభిస్తున్నాయి. వి.సి. పాండే మహాభారతం మిత్ అండ్ రియాలిటీ (పు.183) ప్రకారం భారతం కథలోని పాత్రలు వైదికవాజ్ఞ్మయంలో కనిపిస్తున్నాయి. భారతం చెప్పిన  యాత్రాస్థలాలు కొన్ని ఈనాటికీ  మన కళ్ల ముందు కనిపిస్తున్నవే! కృష్ణుడు భీమార్జునులతో కలసి జరాసంధుని నగరానికి పయనిస్తూ మార్గ మధ్యంలో చూసిన పద్మ సరస్సు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రానికి 182 కి. మీ దూరంలో నేటికీ దర్శనమిస్తున్నది. అగస్త్యుని పేరు మీద ఏర్పడ్డ ప్రాంతంగా ప్రాంతీయులు విశ్వసించే  ‘అమీన్’  ప్రాంతమూ కురుక్షేత్రానికి 9 కి.మీ దూరంలో ఉంది.  'సపిదన్'  జనమేజయుడు చేసిన సర్పదమన యజ్ఞాన్ని తలపుకు తెచ్చే మరో స్థలం. కురుక్షేత్ర సమరం కేవలం వైదికమతమే కాదు, జైన, బౌద్ధ మతాలూ అంగీకరిస్తున్న సమాచారమే.  పురాతత్వశాఖవారి  తవ్వకాలలో భారతకాలానికి చెందిన   అవశేషాలు విశేషంగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బైటపడుతున్న నేపథ్యంలో   భారతకథ వాస్తవీయతను గూర్చి చర్చ అసందర్భమేమో!
మహాభారతం పునర్నిర్మాణం:
యుద్ధం జరిగే వేళ వ్యాసుడు రాసినట్లు చెప్పిన భారతం ఈనాడు మనకు అందుబాటులో లేదు.  ప్రచారంలో ఉన్న ప్రతి మూలభారతానికి ఎంత సమీపంలో ఉన్నదో   తెలిసే సాధనమూ లేదు. ప్రస్తుతం లభిస్తున్న భారతం కొద్ది మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం  క్రీ.శ ఒకటో శతాబ్దిది. ఇదీ భారతకథను విపులంగా చెపుతున్నదే తప్పించి.. శ్రీకృష్ణుని దివ్యత్వం మీద ప్రజావళికి విశ్వాసం ఎప్పుడు ఏర్పడిందో  నిరూపించే ఆధారాలేమీ అందులో కనిపించలేదు.
భరతభూమిలో ఎప్పుడో జరిగిన శ్రీకృష్ణుని కథ ఆ తరువాత ఎప్పుడో రాసిన భారతానికి ఎక్కిన కారణంగా భారత రచనాకాలం, కృష్ణుని జీవితకాలం ఒకటి కాకపోవచ్చు అనిపిస్తున్నది. కాకపోతే భారతంలో కనిపించే కృష్ణుడి కథ ఒక క్రమాన్ని అనుసరించి సాగడం, ఆ క్రమాన్నే ప్రమాణంగా తీసుకున్నట్లు తరువాతి కృష్ణసాహిత్యం మొత్తం మరింత విస్తరించడం.. దానికే క్రమేపీ దివ్యత్వం ఆపాదించడం మాత్రం కాదనలేని వాస్తవాలు.
అయినా వ్యాసమహాభారతమే శ్రీకృష్ణుడిని విష్ణువు అవతారంగా చూపించి కథమొత్తానికి సూత్రధారిగా మలిచిన సత్యం మనం మరచిపోకూడదు. భారతయుద్ధం క్రీ.పూ 3101 నుండి క్రీ.పూ 1200 మధ్య కాలంలో జరిగినట్లు చారిత్రిక ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో శ్రీ కృష్ణుని జీవితమూ  ఈ మధ్య కాలంలోనే గడిచింది అనుకోవడం సబబేమో!
ప్రాచీన కృష్ణపాత్రకు అర్వాచీనత సొబగులు:
శ్రీకృష్ణుడు జీవించి పోయిన ఎన్నో ఏళ్లు గడిచిన తరువాత కాని కృష్ణకథ గ్రంథస్తం కాలేదు. ఆ గ్రంథస్తం చేసిందీ  మొదటిసారి  మహాభారతమే. అందులోనూ యెకాయెకి శ్రీకృష్ణునికి దివ్యత్వం నిర్మొహమాటంగా అపాదింపబడింది. మౌర్యులకాలం నుంచి విదేశీ దాడుల వల్ల ఎంతో భారతీయ వాజ్ఞ్మయం నాశనమయింది. ఎప్పటికప్పుడు కోల్పోయిన వాజ్ఞ్మయాన్ని లభ్యమయిన మౌఖిక  కథనాల  అరకొత ఆధారాలతో పునర్నిర్మించుకునే క్రమంలో మూలభారత రూపంలో కొన్ని మార్పులు అనివార్యంగా వచ్చి చేరాయి. అయినా కృష్టతత్వం వెలుగుల మీద ఛాయలెప్పుడూ పడకపోవడం విశేషం. మొత్తానికి క్రీ.పూ 3101 నుండి క్రీ.పూ 1200 మధ్య కాలంలో శ్ర్రీ కృష్ణుని జీవితం బాల్యదశ నుంచి దైవీయభావనలతోనే వర్ధిల్లినట్లు భావించడం ఒక్కటే ముక్తాయింపుగా ప్రస్తుతానికి చెప్పుకొనే సబబైన మాట.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక - ఆదివారం  సంచికలో ప్రచురణం)

***
n








Saturday, August 1, 2020

దేవుడి కథ -కర్లపాలెం హనుమంతరావు- సూర్య ఆదివారం ప్రచురితం





నీతిమార్గాన్ని మాత్రమే నమ్ముకుని జీవించే ధర్మపరుల పోరాటానికి ఆయుధాలు అందించడం, అంతిమంగా దుర్మార్గంపై సత్యవంతులు మాత్రమే  విజేతలుగ నిలిచేలా చూసే బాధ్యత భగవంతుడికి అప్పగించడం  మనిషి చేసిన పనే! తనను తాను ప్రకాశవంతం, ఆనందమయంగా మలుచుకుంటూనే పరిసరాలనూ తదనుగుణంగా ప్రభావితంచేయడం  దేవుడి విశిష్ట లక్షణాలుగా భావన చేసిందీ మానవుడే. ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని, శాశ్వత విశ్రాంతి కోసం  ప్రళయాన్ని సృష్టించడం భగవంతుడి ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యపడే కార్యమని నమ్మాడు మనిషి.   భగవంతుడిని సకల సద్గుణ సంపదల  రాశిగా   భావన చేసి ఆ సమ్మోహన  విశ్వంభర రూపాన్నే ఊహ మేరకు ‘దైవం’గా కల్పన చేసుకుని  భజించి తరించమంటూ  'క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' న్న ధాతువులను కలగలిపి  ‘దైవం’ అనే పదాన్ని రాబట్టడంతో దేవుడి కథ మొదలయినట్లయింది.
ఆయుర్వేదమంత్రం(14 -20) చదవండి. అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ  దేవుళ్లుగానే భావించుకోమని బోధించిందది. సంస్కృత వాజ్ఞ్మయాన్ని పట్టు పట్టిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మాత్రమే భగవంతుణ్ని అత్యంత   సులువైన శైలిలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని రెండు ముక్కల్లో తేల్చేసింది. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా మసిలే   శ్రీసాయణాచార్యుడు ‘స్వర్గం’ అనే ఓ లోకాన్ని ఊహించి దాని సింహద్వారం తాళాల గుత్తి ‘దేవుడి’ చేతికి అప్పగించాడు. దేవుడే యజమాని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడమే మనిషిగా పుట్టినందుకు మనం చేయదగ్గ పని’ అన్న భావన సాయణాచార్యుడి జమానా నుంచే బలపడుతూవస్తున్నదన్నది ప్రాచీన వాజ్ఞ్మయ పరిశోధకుల అభిప్రాయం.
ప్రకృతి శక్తులు, వాటిలోని అంతర్భాగం సూర్య చంద్రులు వంటి గ్రహాల చలవ వల్లనే మనిషి మనుగడ సాధ్యమయింది. ప్రాణి ఉనికి కొనసాగడానికి  తోడ్పడే నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి- వంటి పంచభూతాలనూ స్థూలంగా దేవుళ్లుగా భావించుకోమంటే హేతువాదికైనా ఏ అభ్యంతరం ఉండబోదు. చెట్టూ చేమా, పుట్టా గుట్టా కుడా దైవసమానమేనని డాక్టర్ దాశరథి రంగచార్యులు పలు సందర్భాలలో బల్లగుద్ది మరీ వాదించేవారు.  మానవజన్మకు మేలు చేకూర్చే ఏ పదార్థంలోనయినా నిస్సందేహంగా  దివ్యత్వం ఉన్నట్లే లెక్క! సందిగ్ధమెందుకు?
దేవుని పుట్టుక ఎప్పటిదని ప్రశ్నిస్తే  మనిషి దగ్గర  చెప్పేందుకు సబబైన సమాధానం లేదు.  వేదకాలంలో అతగాడు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం లేక భయం పుట్టించే శక్తులను దేవుళ్లుగా భావించి పూజాదికాలతో ఉపశమించేసే ప్రయత్నాలేవో  తనకు తోచినవి చేసుండవచ్చు. పురాణకాలం నాటికి ఆ అదృశ్య శక్తుల స్థానంలో అటూ ఇటూగా మనవాకారాలను  బోలే దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనలు ప్రారంభమవడం.. అదో విచిత్ర గాధ. దేవుళ్లకూ మన  మానవులకు మల్లేనే భావోద్వేగాలు,  సంసార లంపటాలు తగులుకున్నాయి భక్తజనుల భావనల పుణ్యమా అని! ఎంత నిరాకారుడైనా ఒక చట్రంలో ఇమడాలంటే  సృష్టించే మానవ మేధస్సు పరిమితులకు లోబడే  ఆ రూపం ఏర్పడాలి! దైవలోకాల సృష్టి కథలోనూ అదే తమాషా!  ఊహకు హద్దులు అక్కర్లేదు. కనక మానవమాత్రుడిగా తన చేతలకు సాధ్యంకాని అద్భుతాలేవైనా సరే అవలీలగా  సాధించే దివ్యశక్తులు  తాను సృష్టించిన దేవుడికి ప్రసాదించాడు మానవుడు.  రూపం, గుణం, శక్తి ఏదైతేనేమి.. ప్రేరణనిచ్చి సన్మార్గదర్శనం చేయించి మనిషిని మంచి దారికి మళ్లించే ఒక చమత్కారం.. మేలుచేసేదయితే సదా ఆహ్వానించదగ్గదే కదా! ఆ మేరకు హాని కలుగనంత వరకు దేవుడి ఉనికి పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేనే లేదు!
భూమ్మీద దేవతలు మన కళ్లకు ఎలాగూ కనబడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిలో దైవసమానులు. ఆపదలు దాపురించిన వేళ ఆదుకున్నవాళ్లనూ  దేవుళ్లుగా భావించడం భారతీయుల సత్సంప్రదాయం. కరోనా కాలంలో వలస కూలీల కడగండ్లకు కరగి చేతనయినంతలో  ఆర్తులకు సాయమందిస్తున్న మంచిమనుషులు ఎందరినో చూస్తున్నాం.  ఎక్కడో ముంబయ్ బాలీవుడ్ సినిమా నటుడు ఆంధ్రాకు ఈ మూలనున్న  చిత్తూరు ఇలాకా పేద రైతుకు ఓ చిన్న ట్రాక్టర్ కొని ఇస్తేనే ‘దేవుడు’ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం మనమివాళ అన్ని  సామాజిక మాధ్యమాలల్లో ఎడతెరిపిలేకుండా. మనిషికి, మానవ సంఘానికి మేలు చేకూర్చే శక్తినైనా, వ్యక్తినైనా దేవుడిగా భావించడం మానవ ప్రవృత్తిలోనే అంతర్గతంగా ఇమిడివున్న సానుకూల దృక్పథం. అది ఆపితే ఆగేది కాదు. మొహమాట పెట్టినా  పొంగి పోటెత్తి పారేదీ కాదు.  ఎంత లౌకికలోక వ్యవహారమైనా దైవభావానికీ ఓ లెక్కంటూ ఉన్నట్లు వివరంగా చెప్పడమే భారతీయ తత్త్వశాస్త్రాలలోని  విశిష్ఠత.
స్వాత్రంత్ర్య సమరం ఉధృతమయిన సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నందు వల్లనే గదా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భరతజాతి మొత్తానికి, ముందు బాపూజీ ఆనక మహాత్మా ఇప్పుడు విగ్రహ రూపంలో దైవంగా మారింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేల లాగా  దళిత జాతుల ఉద్ధరణకై  జీవితాంతం పాటుబడ్డ  మహనీయులను దేవతామూర్తులుగా భావించడం సర్వసాధారణం ఈ  కర్మభూమిలో. పూజ్యభావంతో ప్రతిష్ఠించిన సుప్రసిద్ధుల విగ్రహాలను గుళ్లలోని దేవుళ్లకు మల్లే పూజించడాన్ని తార్కిక దృష్టితో చూసి కొందరు  తప్పుపడుతుంటారు. భక్తిభావనకు, తర్కానికి ఎప్పుడూ చుక్కెదురే. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అన్నది పెద్దలు అన్న వట్టిమాట కాదు. అనుభవం మీద రాబట్టిన సూక్తులవన్నీ! భక్తి అనే హార్మ్యానికి విశ్వాసమే పునాది. కాబట్టి  ఎట్టి పరిస్థితులలోనూ ర్కంతో ఆ దివ్య  భవనాల మీదకెక్కి ఆవలి పార్వ్యం చూడడం అసంభవం.
దేవుళ్ల రూపాలు మారడం గమనిస్తున్నాం. దైవారాధనలూ కాలానికి తగ్గట్లు ఆర్భాటంగా మారడం చూస్తున్నాం. మనిషి పిచ్చి గానీ,  ఏ హడావుడీ  దైవిక శక్తుల మౌలిక స్వభావాలలో మార్పు తేలేవు. అగ్నిని దేవతే అనుకో! ఏ రూపంలో అయినా పూజించుకో! అయినా చెయ్యి పెడితే చుర్రుమని కాల్చి తీరుతుంది భావనలో దైవాలకు తరతమ భేదాలు లేకపోవచ్చును గానీ,  బౌతిక రూపంలో  పారే గంగమ్మ తల్లికి ఎన్ని విధాల మొక్కినా  ముక్కుల్దాకా  మునిగితే  ప్రాణాలు గుటుక్కున పోక తప్పదు. దైవభావనలలో పొడగట్టే  ఏ మార్పైనా మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతమనేది మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ  ఇంగితం లేకనే .. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతుల పేరున, దేశాల వంకన, సంస్కృతుల మిష ఎన్నిరాలు గడచినా ఆగకుండా ఆధ్యాత్మిక ఘర్షణలు విశ్వమంతటా ప్రస్తుతం నిష్కారణంగా చెలరేగుతున్నాయి.  
కవులూ తమ కావ్యాలకు అవతారికలు  రాసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థనల వంకన దేవుళ్ల మధ్యన ప్రదర్శించే వలపక్షం విచిత్రం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ  దేవజాతులను సైతం కవులు మనుషులకు  మల్లేనే వివిధ తరగతుల కింద విభజించి చూడడం, ఇష్టులైన దేవుళ్లంటూ  మళ్లా  కొన్ని అవతారాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం! మనిషి మానసికంగా ఎదిగాడని టముకే తప్పించి.. ఎంత ఎదిగినా వేపను వదలని చేదులా ఎంతో కొంత  వెర్రితనం  తప్పదా?! విచారకరం.
'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుడు, ప్రజాపతి – వెరసి ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. జగత్తు నివాసయోగ్యత వీటి చలవే కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి వసుదేవతలయారు. దేహానికి ఆత్మ స్వస్తి చెప్పే వేళ ప్రాణులను పీడిస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జీవాత్మ  రుద్రదేవతలుగా దూషింపబదుతున్నరు. ఏడాది మొత్తం చైత్రాది పన్నెండు మాసాల ద్వారా ఆయుష్షును హరించే సూర్యుడు, వరుణుడు, పూర్ణ, తృష్ణల వంటి పన్నెండు మంది ఆదిత్య దేవతల కోవలో చేరారు. లెక్కకే ముప్పై ముగ్గురు. భూమ్మీది నిప్పు, మబ్బులోని గాలి.. వెరుపు, ఆకాశంలోని సూర్యుడు మనిషికి ముఖ్యమైన దేవతలని మళ్లీ యాస్కుడే లెక్క కుదించాడు!
రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళేఅగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రుడికి ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వర్షాలు కురిపించగల సత్తా  వజ్రాయుధపాణి ఇంద్రుడొక్కడి దగ్గరే ఉందని నమ్మకం. వేదపరంగా ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. పురాణాల దృష్టిలో స్వర్గాధిపతి. వైదికుల భావనలో  దేహంలోని జీవుడు. దేవతల రాజుగా, రాక్షసుల వైరిగా, తాపసుల అడ్డంకిగా ఇంద్రుడివి బహుముఖపాత్రలు. ఆకాశదేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖుడు. సౌర మండలం తాలూకు సమస్త శక్తులకూ ఉత్పత్తి కేంద్రమైన సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులతో దర్శనమిచ్చే దివ్యజన్ముడిగా, సకల లోకాలను క్రమబద్ధంగా ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుషకార్యాలన్నిటిని యాజ్ఞిక రూపంలో స్వీకరించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతించాయి. సూర్యుడొక్కడే నరుడికి నిత్యం ప్రత్యక్షమయే నారాయణుడు. సోముడు నుంచి వరుణుడు వరకు దేవతలు  ఇంకెందరో వేదాలలో తమ తమ యోగ్యతలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.
వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేదకాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాథనలు అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించుకుని ఆరాధించడం సామాన్యుడికి సులువైన ముక్తిమార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తిమార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో ప్రధాన ఆకర్షణీయ భాగాలయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజాపునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దైవరూపాలు ఉనికిలోనికి రావడం కొత్త పరిణామం.
జైనుడైన అమరసింహుడు తన అమరకోశం స్వర్గవర్గంలో దేవుళ్లకు ఉండే 'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః'  వంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరామరణాలు లేనివాళ్లని, ఎప్పుడూ మూడుపదుల వయసులో కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని.. ఇట్లా ప్రతిదం వ్యుత్పత్తి అర్థం ఆ నామలింగానుశాసనమ్  వివరిస్తుంటే  ఎన్నడూ కనిపించని దేవుడి శక్తియుక్తుల మాటకు మించి ముందు కంటి ముందు తిరిగే మనిషి బుద్ధి నైశిత్యాన్ని  వేనోళ్ల పొగడబుద్ధవుతుంది.  హద్దులెరుగని కల్పన చేయగల మేథోసామర్థ్యం సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సాథ్యమన్న వాదన తిరుగులేనిదనడానికి దేవతల పుట్టుకను గురించి అతగాడు చేసిన కల్పనే  ఓ గొప్ప ఉదాహరణ.
వాల్మీకి రామాయణం 14వ సర్గలోనూ దేవతల పుట్టుకను గురించి ప్రస్తావన ఉంది. జటాయువు తన జన్మరహస్యం రామచండ్రుడికి వివరించే సందర్భంలో సృష్టి, దాని క్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావనలు వస్తాయి. ఆఖరి ప్రజాపతి కశ్యపుడికి అదితి వల్ల కలిగిన ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి వివరంగా చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం.
జానపద దేవతలు ఉనికిలోనికి వచ్చినప్పటి బట్టి సమాజంలోని ఒక ప్రధానవర్గం చేసే పూజావిధానాలలో మౌలికమైన మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖిసాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖితసాహిత్యం ద్వారా నీరాజనాలు అందడం సర్వసాధారణమయిపోయింది. అమ్మవారు, పోతురాజుల వంటి గ్రామదేవతల ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లను ఏ దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం. వ్యవసాయసంబంధమైన కేటగిరీలో స్త్రీ దేవతలకే అధిక ప్రాథాన్యం. జానపద దేవతలలో  ప్రధానంగా రెండు విభాగాలు.  పార్వతీదేవి తరహా శక్తిమూర్తులకు ప్రతినిధులుగా  గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి అమ్మవార్లు ఒక తరగతి; ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఊరి ఆడపడుచులు రెండో తరగతి గ్రామదేవతలు.  వీరులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంఛమంతటా ఉన్నట్లే,రతఖండంలోనూ ముందు నుంచి ముమ్మరంగానే ఉంది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శీవాజీ వంటి సాహసవంతులెందరో దేవతల  స్థాయికి ఎదిగి పూజలందుకోవడం ఇందుకు ఉదాహరణ. ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, సంతోషిమాత, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల  దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు.
మతాల గురించి ఈ కలికాలంలో మనలో మనమే ఏవేవో కారణాలు కల్పించుకుని  సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథా ప్రయాసలేవీ లేని చక్కని స్పష్టత ఉండేది. 'ఇన్ద్రం మిత్రం’ అనే  శ్లోకార్ధాన్ని బట్టి బుద్ధిబలం అధికమై ఆకారమే లేని పరమేశ్వరుడిని ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని భిన్నరూపాలలో భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక్కటే రూపం. ‘ఏకం సత్’ అన్న
రుగ్వేద సూత్రం అంతరార్థం అంతుబడితేనే తప్ప ప్రస్తుతం మతం పేరుతో   పెచ్చుమీరే విద్వేషభావనలు శాశ్వతంగా మాసిపోయే  శాంతి మార్గం  మనిషి కంటబడదు.
కంటికి కనిపించని దేవుళ్ల కౌటింగ్ కన్నా.. కంటి ముందు కదిలే  నుషులే మనుషులకు దేవుళ్లనే భావన బలపడితే అసలు గొడవే ఉండదు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక-  ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం)






మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...