Showing posts with label Society. Show all posts
Showing posts with label Society. Show all posts

Wednesday, December 15, 2021

వ్యాసం మేనరికాలు ( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) సేకరణ- కర్లపాలెం హనుమంతరావు


 


వ్యాసం 

మేనరికాలు 

( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) 

సేకరణ- కర్లపాలెం హనుమంతరావు 


మానవ సమాజంలో మొట్టమొదట వుండిన విచ్చలవిడిగా జతకూడే పద్ధతి, రాను రాను కొన్ని నియమాలకు లోబడవలసివచ్చింది. ఈ వ్యక్తితో జతకట్ట వచ్చును, ఈ వ్యక్తితో జతకట్టరాదు అని నిషేధాలు కలిగాయి. తల్లి పిల్లల జతలు ఈ నిషేధాల కిందికే వచ్చాయి. 


రాజకీయ కుటుంబాలలో మాత్రం ఇతర రక్తాలు కలియకుండా వుంచుకోడానికి అక్కా తమ్ముడు జతలు కట్టే పద్ధQ కొంత సాగింది. మరి కొన్నాళ్ళకు అదే  ఒక్క తల్లికి పుట్టినవారు తప్ప తక్కిన బాపతు అక్కా తమ్ములు జతకట్టే పద్ధతి ఆమోదనీయమైంది. 


మరి కొంత కాలం తరువాత మరికొన్ని నిషేధాలు వచ్చాయి. రక్తసంబంధం వుంటే జతకట్టడం మంచిది కాదన్న అభిప్రాయం కలిగింది. ఆ దృష్టిని చూసేసరికి ఒక గూడెం ఒక జట్టులో  అంతా, బీరకాయ పీచు సంబంధాలే .  . ఒక్క వేలు విడిచిన సంబంధం, రెండు మూడు నాలుగు..వేళ్ళు విడిచిన సంబంధం అందరూ సంబంధం వున్నవాళ్ళే . 


కాబట్టి, ఒక జట్టులో ఉన్నవారు ఆడవారు కానీ, మగవారు కానీ-అదే జట్టులో నుండేవారిని పెళ్ళి చేసుకో కూడదన్నారు. 


జతల కోసం ఇంకొక జట్టుకు పోవాలి. దీనికి "ఎక్సాగమీ" అని పేరు పెట్టారు. 


మరికొన్ని దేశాలలో దీనికి విరుద్ధంగా వుంది నియమం. ఏ జట్టువారు ఆ జట్టులోనే జతకట్టుకోవాలి అని. దీనిని "ఎండాగమీ" అన్నారు. దీనికి కారణం ఎవరి జాతి మహత్తుమీద వారికి ఆధిక్యత ఎక్కువ అనిపించడం. 


పై జట్టు పెళ్ళి..  ఆ జట్టు పెళ్ళి అన్న ఈ రెండూ రెండు రకాలా, ఒకటే రకమా అనిగూడా వివాదం వుంది. పై జట్టుమీదనే ఆధారపడిపోతే, అలా జతలు కట్టడానికి అవకాశాలు ఉండవచ్చును, ఉండకపోవచ్చును. ఈ రెండు జట్టులకు ఉన్న సఖ్యాన్నిబట్టి, వైరాన్నిబట్టి కథ నడపవలసి వస్తుంది. అదే సూత్రంగా పెట్టుకుంటే, ఒక జట్టు ఇంకొక ಜಟ್ಟು వారితో పోట్లాడి, ఆ జట్టువారి ఆడవారిని తెచ్చుకోవలసి వస్తుంది. ఇలాంటి వివాహాలూ ఉన్నాయి. కాని, ఇదంతా చాలా బెడద వ్యవహారం. పెళ్లే కావాలి అంటే పోట్లాడాలన్న మాట వస్తుంది. నిత్యజీవితంలో ఇంత బెడద పెట్టుకుంటే చాలా కష్టం. ఆ రోజులలో వాళ్ళంత బెడద తెచ్చిపెట్టుకొని ఉంటారా?


ఒక్క జాతిలో రెండుమూడు జట్టులుండవచ్చును కదా? కొండ మీద ఒక జట్టు, లోయలో ఒక జట్టు, కొండ అవతల ఒక జట్టు అన్నట్టు ఉండవచ్చును. ఈ మూడు జట్టులూ ఒక్క తెగవే. సఖ్యంతో  ఉండేవి. అలాంటప్పుడు, పై జట్టునుంచే పెళ్ళి చేసుకోవాలి అని ఒక నియమం పెడితే ఏమయింది? కొండమీది వారు లోయలోని వారితోనూ, లోయవారు అవతలివారితోనూ సంబంధాలు చేసుకోవచ్చు నన్నమాట. లోయలోనివారు, లోయలోనివారిని పెళ్ళిచేసుకోరని అర్థం. ఈ పద్ధతిని జట్టునుపట్టి చూస్తే ఇది ఎక్సాగమీ! జాతినిపట్టి చూస్తే ఇది ఎండాగమీ అవుతుంది. నిత్యజీవితానికి అడ్డు, ఆటంకమూ వుండవు.


ఇలాంటిదే మన గోత్రాల పద్ధతి. ఏ గోత్రం వారు ఆ గోత్రంలో పెళ్లి చేసుకోకూడదు. ఇతర గోత్రం వారినే చేసుకోవాలి. ఇది ఎక్సాగమీ; బయటి సంబంధం. కాని, వారందరు ఒక్క కులంవారే అవడంచేత ఇదే ఎండాగమీ; లోపలి లోపలి సంబంధం. ఈ దృష్టిని చూస్తే ఈ రెండూ ఒక్కటే అని తేలుతుంది.


బయటి సంబంధమయినా సరే, లోపలి సంబంధం అయినాసరే, జతకూడే హక్కులూ, పద్ధతులూ అన్నీ ఇంతకుముందు నేను మనవిచేసినట్టే- అందరికీ హక్కు వుంటుంది. ఒక ఇంటిలో ఒకడు పెళ్ళి చేసుకున్నాడు. అంటే, ఆ ఇంటివారు అందరూ ఆ పెళ్ళికూతురితో జతకట్టవచ్చును. ఒకడికి భార్య అయితే ఆ అన్నదమ్ముల కందరికీ

భార్య అవుతుంది. ఒక ఆమె ఒకడ్ని పెళ్ళిచేసుకుంది అంటే, ఆమె అక్కచెల్లెళ్ళందరూ అతనితో జతకట్టవచ్చును. అతనికి పెళ్ళాం ఇతనికి పెళ్ళాం అని విచక్షణ లేదు. ఇంటందరికీ పెళ్ళామే అవుతుంది. ఇంటికోడలు  అవుతుంది.


ఆశ్చర్యపడకండి. భారతంలో పాండవులు చేసుకున్న పెళ్ళి ఇలాంటిదే. ద్రౌపది ఇంటందరికీ ఇల్లాలే. నాయర్లలో గూడా ఈ ఆచారం వుంది. టిబెట్లో ఇలాంటి ఆచారమే వుంది. నీలగిరి తోడాజాతిలో గూడా ఈ ఆచారం వుంది.


అంతేకాదు, రామాయణంలో రాముడు మాయలేడిని పట్టుకోడానికి పోయిన తరువాత "హా లక్ష్మణా" అన్న ధ్వని వినిపించినప్పుడు సీత లక్ష్మణుడ్ని వెళ్ళమంటుంది. అన్న చెప్పినమాట తప్పకూడదని లక్ష్మణుడు కదలడు . అప్పుడు' సీత  నిష్ఠురాలు  పలుకుతూ, 'మీ అన్న పోయినట్టయితే నన్ను పొందాలనా ఇలా కదలకుండా ఉన్నావు ? ' అని అన్నది.


సీతమ్మ అజ్ఞానురాలు కాదు. ఇంత నీచమయిన మాట ఆడదు. అయినా ఆ మాటలు వాల్మీకి అంతటివాడు వ్రాశాడు. ఏమి? అప్పటి ఆచారం; అన్న భార్యను తమ్ముడు చేసుకోవచ్చు. వచ్చుకాదు; చేసుకోవాలి. గూడాను. వాలి సుగ్రీవులు చేసినపని ఇదే. తార ఇద్దరికీ భార్యయే. అన్నభార్యలను చేసుకొన్న బృహస్పతులు అనేకు లున్నారు.


మహారాజులు ఎందరెందరో తమ కూతుళ్ళను ఇద్దరు ముగ్గురివి కాదు యాభై మందిని, నూరుమందిని, ఒక్క ఋషి గారికి ఇచ్చి వివాహాలు చేశారని మన గాథలున్నాయి. అన్ని వివాహాలూ జరపరు. ఏదో పెద్దదానికి మాత్రం పెళ్ళిచేస్తే చాలు; తరువాత పెళ్ళిళ్ళు తమంతట అవే జరిగిపోతాయి. వాటికోసం వేరే బెడద పడనక్కరలేదు.


ఈ ఆచారం ఇప్పుడు కొంచెం వెగటుగా కనిపిస్తుంది; నిజమే. కాని, ఆ రోజులలో వెగటు ఉండేదికాదు. పైగా చాలా రుచిగా ఉండేదనే చెప్పాలి. ఎందుచేతనంటే, చూడండి. అదే అసహ్యం అయినపని అయితే, దానిని వట్టి రోతతో చూచి, ఈపాటికి దాని మచ్చుమాయా కనిపించకుండా  మరిచిపోయి ఉండేవారం; దాని సంపర్కం రవ్వంతయినా కనబడకుండా చేసేవారం.


కాని, అలా జరపలేదు.  ఇప్పటికీ మనలో ఈ వాసన ఉంది. మరదళ్ళూ, వరస మాటలు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ హాప్యాలు బావలూ చాలా దూరం పోతాయని వారి మాటలు విన్న వారందరూ అంగీకరిస్తారు. ఇంటిలో ఉన్నవారు ఎవ్వరూ ఆ హాస్యాలకు ఆక్షేపణ చెప్పరు. అంతా నవ్వేవారే.  ఆనందించేవారే  అంటే, సంఘం ఆ వరసలను అంగీకరించిందన్న మాట. ఆ రూపంగా మన పూర్వాచారల లక్షణం.  మనలో ఇప్పటికీ ఉన్నది. ఇలాంటి వరసలే . . మేనమామ మేనకోడల వరసలు.  జతకూడడానికి అవకాశం వున్న జట్టులు- పైని చెప్పినలాంటివి- 


మేహన అన్నమాటకే జతకట్టడం అని అర్థం చెప్పడం న్యాయం. ఈ మాటను నేను "దేవాలయాల మీద బూతుబొమ్మ లెందుకు? అన్న గ్రంథంలో సూచించాను. ఎందరు విసుగుకున్నా అర్థం తప్పదు. మేహన సంబంధమే మేన సంబంధం.  మేనరికం అయింది. మేనరికం ఉంది అంటే జతకట్టుకోడానికి అవకాశం ఉందనికదా, మనలో అర్థం? అంతేకాదు, కొన్ని సంఘాలలో తప్పకుండా పెళ్ళి చేసుకోవాలి కూడాను. తప్పించకూడదు. పెళ్ళి చేసుకున్నా, చేసుకోకపోయినా, ఈ మేనరికం ఉన్నవారు పైని చెప్పిన బావమరదళ్ళ లాగానే పచ్చి పచ్చిగా హాప్యం ఆడుకుంటారు. వారికా అధికారం ఉంది. ఇంత పచ్చిగా మాటలాడినారే అని ఒక్కరయినా చీకాకుపడరు. . చీవాట్లు పెట్టరు . అదీ మన మేనరికం వరస లక్షణం.

( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) 

సేకరణ- 

కర్లపాలెం హనుమంతరావు 

 16 -12-2021  


Sunday, December 12, 2021

సంపూర్ణ మద్యపాన ఉద్యమం - కర్లపాలెం హనుమంతరావు - వ్యంగ్యం - చుట్టుపక్కల చూడరా కాలమ్ - కౌముది అంతార్జాల పత్రిక


 

ఆ'పరేషాన్ ' - చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 

 

మా కొలీగ్ సుబ్బారావు తనకు వంట్లో బావోలేదని ఆసుపత్రికి వెళుతుంటే నేనూ తోడు వెళ్ళా.

బైట బోలెడంత క్యూ. గంటకయినా లోపలికి పోవడం అనుమానమే. ఆఫీసుకి టైమయిపోతుందని నేను కంగారు పడుతుంటే కారిడార్లలో గుర్నాథం కనిపించాడు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు.

గుర్నాథం హైస్కూల్లో నా క్లాస్ మేట్. చాలా ఏళ్ళతరువాత అనుకోకుండా ఇక్కడ కలిసాడు. నేను వచ్చిన పని కనుక్కొని చనువుగా 'డాక్టరుగారు నాకు బాగా తెలుసులేరా! నువ్వెళ్ళు! మీ ఫ్రెండు పని నేను చూస్తాలే!' అన్నాడు.

 

ఆ సాయంత్రం సుబ్బారావు గుర్నాథాన్ని ఒహటే పొగడటం! 'మీ ఫ్రెండుకి మా చెడ్డ ఇన్ఫ్లుయన్సుందండీ! చకప్పులూ అవీ చకచకా చేయించేసాడు. రిపోర్టులు తీసుకొని తనే వస్తానన్నాడు' అన్నాడు సంబరంగా.

గుర్నాథం స్కూలురోజుల్లో యావరేజి. వెనుక బెంచీలో కూర్చోని ఎప్పుడూ ఏవేవో పెన్నులు రిపేరు చేస్తుండేవాడు. వాడి సంచీలో పుస్తకాలు అన్నీ ఉన్నా లేకపోయినా.. రకరకాల కలం కేపులు, పాళీలు, నిబ్బులు, సిరాబుడ్డి, చెత్తగుడ్డపీలికలు మాత్రం నిండుగా ఉండేవి. మూడుపైసలకు కేపు, రెండు పైసలకు నిబ్బు, పైసాకి పాళీ.. పెన్నుమొత్తమయితే అణా.. అలా అమ్మేవాడు పాత కలాలని. అణాలు, పైసలు చలామణిలో ఉండే జమానాలేండి అది. అప్పట్లో ఇప్పట్లా బాల్ పెన్నులు కాకుండా సిరా నింపుకొని రాసుకొనే రకం కలాలు వాడకంలో ఉండేవి. మా మాస్టార్లుకూడా ఈ గుర్నాథం బుట్టలో పడుతుండేవాళ్ళు! అవసరం వచ్చినప్పుడు వాడు వాళ్ళకీ పేనాలు ఉచితంగా తయారు చేసిస్తుండేవాడు.  అందుకని ఏమనేవాళ్ళు కాదు.

పదో తరగతి పరీక్షలు రాసే రోజుల్లో సమాధాన పత్రాలు తారుమారు చేసాడని డిబారు చేసారు వాణ్ణి. ఆ తరువాత ఇదిగో ఇప్పుడే.. మళ్ళీ దర్శనం!

గుర్నాథం తెచ్చిన రిపోర్టులు చూసి గుండె ఆగిపోయినంత పనయింది  సుబ్బారావుకి. కిడ్నీలో ప్రాబ్లమున్నట్లు తేలింది. 'ఆపరేషన్ అవసరమంటున్నాడు డాక్టర్' అన్నాడు గుర్నాథం తాపీగా.

కిడ్నీ ట్రాన్సప్లాంటేషనంటే మాటలా? దానికి ముందు డయాలసిస్. డయాలసిస్ అంటే లక్షల్లో వ్యవహారం. ముందు డోనర్ దొరకడమే గగనం. కిడ్నీదాత బంధువు కాకపోతే ఆథరైజేషన్ కమిటీ అప్రూవల్ అవసరం. అదంత తేలికగా తెమిలే వ్యవహారం కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్లు రిస్కు తీసుకోవడానికి బాగా జంకుతున్నారు. మరీ ఈ మధ్య ఈ కిడ్నీ కేసుల చుట్టూతా గవర్నమెంటు నిఘా  పెరిగిన తరువాత.

'కేసులవుతాయేమోనని భయం. అవన్నీ నేను చూసుకొంటాగాని.. మనీ సంగతిమాత్రం మీరు చూసుకోండి' అని అభయమిచ్చాడు గుర్నాథం.

'ఎంతవుతుందేమిటీ?'  సుబ్బారావు సందేహం.

'సుమారు నాలుగయిదు లక్షలు'

'అమ్మో! గవర్నమెంటు ఉద్యోగినికూడా కాదు. ఎక్కణ్ణుంచి తవ్వి తేవాలీ అంత డబ్బు?' అంటూ సుబ్బారావు గుండెలు బాదుకొన్నాడు. '

'ఇదింకా చీపండీ! లివరయితే ఏడు లక్షలు. హార్టు, లంగ్సు ఆపరేషనయితే అంతకు రెట్టింపు. కంటిగుడ్డుకు వాడే కార్నియానే ఐదు లక్షలు పోస్తేగాని దొరకడంలేదు మార్కెట్లో'

రైతుబజారులో కూరగాయల దరవరల్లాగా ఏకరువు పెడుతున్నాడు గుర్నాథం.

'చూస్తూ చూస్తూ వంట్లోని పార్టుల్ని ఎవరమ్ముకొంటార్రా? ఏదో సినిమాల్లో అలా చూపిస్తుంటారుగానీ' అన్నాను నేను అక్కడికీ నమ్మకం కుదరక.

'పేదరికం ఎంత పనయినా చేయిస్తుంది బాబూ! మెదడు చచ్చిపోయినా గుండె కొట్టుకొంటుంటే చాలు.. ఇలా చాలా అవయవాలని తీసి హాయిగా వాడుకోవచ్చు. ఇవాళా రేపూ ఆ వ్యాపారం బాగా ఊపందుకొందికూడా మిత్రమా! పేపర్లలో వచ్చేవే వార్తలు కావురా బాబూ! వాటికి వెనకాల సమాంతరంగా అంతకుమించిన ప్రపంచం పరుగెడుతోంది' అన్నాడు గుర్నాథం.

'ఎంత అన్యాయం!' గుండెలమీద చెయ్యివేసుకొన్నాడు సుబ్బారావు తబ్బుబ్బయిపోతూ.

'ఇందులో అన్యాయం ప్రసక్తేముంది?అవసరం అలాంటిది. ఇంద్రుడు వజ్రాయుధంకోసం దధీచి పక్కటెముకలు లాగేసుకోలా? కవచకుండాలలనికూడా దానం చేసిన కర్ణుడికథ మనకు కొత్తా? డబ్బు పడేస్తే లివర్లయినా ఫ్లవర్లలో పెట్టి ఇస్తున్నారు సార్ ఈ కాలంలో! గుండెకాయలు బెండకాయల్లా, కంటిగుడ్లు కోడిగుడ్లలా మారకం జరిగిపోతున్నాయి. యూరప్ లాంటి డెవలప్డ్ కంట్రీసులో అయితే ఏకంగా 'యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గాన్స్ సేల్' అని భారీ నెట్ వర్కే నడుస్తోంది బ్రహ్మాండంగా’.

'చట్టం చూస్తూ వూరుకొంటుందా?!’

'ఎందుకూరుకొంటుంది సార్? తనపని తాను చేసుకు పోతుంటుంది. నెట్ వర్కూ తనపని తాను చేసుకు పోతుంటుంది. ఇక్కడిలాగానేఒకరి పనిలో ఇంకోరు జోక్యం చేసుకోకుండా డబ్బుమూట చూసుకొంటుంది'

గుర్నాథం చెప్పిందాంట్లో అతిశయోక్తేమీ లేదనే అనిపిస్తోంది. డబ్బుకు చట్టం చుట్టం కానిది ఎక్కడలేండి?! ప్రాణంతీపిముందు ఎన్ని ధర్మపన్నాలైనా చేదుగానే ఉంటాయికదా!

'మీరు ఆలోచించుకొని కబురు చేయండి!.. వస్తా!' అని విజిటింగ్ కార్డొకటి ఇచ్చి కాఫీతాగి వెళ్ళిపోయాడు గుర్నాథం.

 

సుబ్బారావుగారింట్లో రెండు రోజులు ఒహటే మల్లగుల్లాలు. పాపం! సుబ్బారావు గవర్నమెంటు ఉద్యోగైనా కాదు.. కనీసం ఖర్చులైన్నా రాబట్టుకోడానికి. ఇంట్లోని బంగారం, ఊరి బైట అప్పుడెప్పుడో కొనుక్కున్నస్థలం అమ్మైనా సరే .. ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనని పట్టుపటుకు కూర్చొంది సుబ్బారావుభార్య. 

గుర్నథాన్ని పిలిపించి పరిస్థితి వివరించాం. ‘ఉన్నంతే ఇవ్వండి. మిగతా సర్దుబాట్లేవన్నా ఉంటే చూసుకోడానికి నేనున్నాగా!’ అంటూ అభయహస్తం ఇచ్చాడు.  

డోనర్ని చూపించమన్నాడు సుబ్బారావు. అన్నంరాజు అనే అతన్ని కలవమని అదేదో అనాథ శరణాలయం చిరునామా ఇచ్చాడు గుర్నాథం.

గుర్నాథం మనుషులమని నమ్మకం కుదిరాక  సగం రేటుకే బేరం కుదురుస్తానని ఉత్సాహం చూపించాడా అన్నంరాజు.

డోనర్ని మాత్రం ఇప్పుడే చూపించకూడదంట! 'లోపాయికారీ వ్యవహారాలు  కదండీ ఇవన్నీ! పదేళ్ళబట్టీ ఈ వ్యాపారంలో ఉన్నాను. నన్ను మీరు నమ్మాలి' అన్నాడు అన్నంరాజు. నమ్మకమాత్రం చేసేదేముంది గనక?

సగం పైకం ముందే గుంజుకొన్నాడు అన్నంరాజు.

'డాక్టరుగారు ఆపరేషన్ డేట్ ఇచ్చిందాకా కిడ్నీకి రెంట్ కడుతుండాలి. నెలకు నాలుగువేలు. డోనరు కిడ్నీని వేరేవారికి అమ్ముకోకుండా ఆపటానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. ఆ మాత్రం భరించక తప్పదు. ఆఫ్ట్రాల్ ఆపరేషన్ అయిన తరువాత  ఆ కిడ్నీ మనదే అవుతుంది కదండీ చివరికి?' అని ఆ పెద్దమనిషి లా పాయింటూ!

డాక్టరుగారి డేట్ మూడు నెలలకుగాని దొరకలేదు. అంత బిజీట ఆయన! ఈ మూడు నెలలు క్రమం తప్పకుండా డయాలసిస్ తప్పటంలేదు సుబ్బారావుకి.

 

సుబ్బారావీ మధ్య చిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 'ప్రతీ మనిషికి కనీసం నాలుగు కిడ్నీలైనా ఉండాలి. అలాగే ఆరేడు జతల చేతులు, పది జతల కాళ్ళు, నాలుగైదు జోళ్ళ చెవులు, కళ్ళు, రెండు మూడు ముక్కులు, వందనాలికలు, నాలుగయిదు  గుండెలుకూడా ఉంటే బావుంటుంది.' ఇలా సాగుతోంది సుబ్బారావు ధోరణి.

రెండు చేతులుంటేనే మనిషిచేసే ఆగం తట్టుకోలేక పోతోంది లోకం. ఇహ పదులు.. ఇరవైలు మొలుచుకొస్తే జరిగే ఆగడాలని ఊహించగలమా?!

'ఒక్క తలకే  ఇంత లావున తిరుగుతోంది మీకు! పదేసుంటే ఇహ పట్టుకోగలమా తమర్నీ.. తమ తి.క్కనీ! ' అని శాపనార్థాలకు దిగింది సుబ్బారావుగారి శ్రీమతి. భర్త పిచ్చిమాటలు  విని విని పాపం ఎంతగా విసిగిపోయిందో ఆ ఇల్లాలు!

'ఇందులో తిక్కేముందే పిచ్చిదానా! శివుడికి మూడు కళ్ళు లేవూ? విష్ణుమూర్తికి నాలుగు చేతులు, బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు, రావణాసురుడికి పది తలకాయలు, కార్తవీర్యుడికి వెయ్యి చేతులు, దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు!  దేవుళ్లందరికీ అన్నేసి అవయవాలుండగా లేనిది మానవులకు అందులో కనీసం సగమైనా ఉండాలని కోరుకోవడం తిక్కా?!'

ఒక అవయవం పాడైనా మరోటి పనికొస్తుందని కాబోలు సుబ్బారావు ఆశ. 'ఈసారి దేముడు కనబడితేమాత్రం రకానికో జత స్పేరుగా ఇవ్వమని పట్టుబట్టడం ఖాయం' అంటో సుబ్బారావు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మనసంతా దేవినట్లయిపోయింది.

 

ఎలాగైతేనేం.. సుబ్బారావుకి ఆపరేషన్ అయిపోయింది.

మూడో రోజు గుర్నాథం పేరు వార్తాపత్రికల్లో వచ్చింది ప్రముఖంగా ఫొటోలతో సహా. ఏ టీవీ ఛానల్లో చూసినా ఆ రోజంతా ఆ మహానుభావుణ్ణి గురించిన సమాచారమే!

మానవ శరీరావయవావలను అమ్మే వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఓ ప్రముఖ వార్తాపత్రిక వివరాలతోసహా వరుస కథనాలను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ గోల్ మాల్ మొత్తంలో గుర్నాథానిదీ ఓ ప్రధాన పాత్ర!

అరెస్టు చేయడానికని వెళ్ళిన పోలీసులు అతగాడు గుండెనొప్పి వచ్చిందన్నాడని కోర్టు ఆదేశాలమీద నిమ్సు ఆసుపత్రిలో చేర్చి బైట పహరా కాస్తున్నారు.

నేర పరిశోధక బృందం అన్నంరాజు అనాథ శరణాలయంమీద ఆకస్మిక దాడి చేసినప్పుడు బోలెడన్ని అవయవాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి బైటపడ్డాయని వార్త! కిడ్నీలు, లివర్లు, కళ్ళు.. వంట్లో అమ్ముకోవడానికి వీలున్న ఏ అవయవాన్నైనా సరే చెట్టుమీదనుంచి కాయలు కోసిచ్చినట్లు కోసిచ్చే ఏర్పాట్లు ఆ అనాథ శరణాలయంలో  జరుగుతున్నాయిట! అందుకు అనుగుణంగా అక్కడ  పెరుగుతున్న అనాథ బాలబాలికలను చూసి  నోరు వెళ్లబెట్టడం నేర పరిశోధక బృందం వంతయిందట!

కూరగాయలే సరిగ్గా దొరకని ఈ కరువురోజుల్లో అంతంత మందని  సేకరించి పెంచడమంటే మాటలా?!

ఆ ముక్కే ఎవరో పనిలేని చానెల్ వాళ్ళడిగితే ఆసుపత్రి శయ్యమీద విలాసంగా శయనించిన గుర్నాథంగారు చిద్విలాసంగా నవ్వి వినయపూర్వకంగా ఇచ్చిన సమాదానం

'అంతా ఆ పై వాడి దయ. ఆపైన సర్కారు పెద్దల సహకారం'

అన్నంరాజు అనాథశరణాలయంలోని పసిపిల్లలు తరుచుగా చనిపోతున్నారన్న విషయం అప్పుడు బైటపడింది! అనుమాన నివృత్తికోసం ముందురోజు పోయిన పిల్లలిద్దరి బాడీలను రీపోస్టుమార్టమ్ చేయిస్తే.. వచ్చిన రిజల్టు ‘షాకింగ్’!

 

బాడీల్లో చాలా పార్టులు మిస్సింగు!

ఉదయంబట్టీ వరసబెట్టి వస్తున్న ఆ వార్తల్ని చూసి చూసి సుబ్బారావు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయాడు! మళ్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సొచ్చింది మాకు అర్జంటుగా!

ఎందుకైనా మంచిదని సుబ్బారావుబాడీని ఫుల్ స్కానింగు చేయించాం.  మా అనుమానం నిజమే అయింది. సుబ్బారావు వంట్లోని కిడ్నీలు మాయం!

గుర్నాథం రికమెండ్ చేసిన డాక్టరు  ఆపరేషన్ చేసింది- సుబ్బారావు కిడ్నీజబ్బు మాయం చేయడానికి కాదు. మంచి కిడ్నీని మాయం చేయడానికని ఆలస్యంగా తెలిసింది!

కిడ్నీధర కనీసం నాలుగయిదు లక్షలకు తక్కువ  పలికని రోజుల్లో .. నాలుగో వంతుకే ఆపరేషన్ చేయిస్తానని గుర్నాథం ఆఫరిచ్చినప్పుడే  అన్నిరకాలుగా ఆలోచించుకొని ఉండాల్సింది మేం!

'ఎలాగూ పోయే శాల్తీనేగదా అని ఆయన మంచి కిడ్నీని మా ఆపరేషన్ ఖర్చులకింద రాబట్టుకొన్నాం.. వ్యాపార ధర్మంగా! అదీ తప్పే?!' అంటూ బుకాయింపులకి దిగాడు బైలునుంచి  L బైటికొచ్చిన పిదప అతికష్టంమీద సెల్లో దొరికినప్పుడు గుర్నాథం!


( సూర్య  -దిన పత్రిక ప్రచురణ ) 

***

-కర్లపాలెం హనుమంతరావు

14 మార్చి 2021 

బోథెల్ ; యూ ఎస్ ఎ 





సామాజిక మాధ్యమాల దుర్వినియోగం- కర్లపాలెం హనుమంతరావు

 

ప్రపంచం మొత్తంలో  సామాజిక మాధ్యమాల  దుర్వినియోగంలో మనమే నెంబర్ ఒన్.  రోజువారీ సామాజిక మాధ్యమ టపాలలో సింహభాగం.. అబద్ధం.. అసంబద్ధం, పనికిరానివి, ప్రతికూలమైనవి.  అవమానకరమైతే వాటి లెక్కకు ఇహ అంతే లేదు. అసభ్యంగా ఉండి, అక్కరకు రాకుండా పక్కదారి పట్టించేవి కొన్నైతే, ఏకంగా  సామాజిక సామరస్యానికి ముప్పు తెచ్చేవి మరి కొన్ని, ఏ ఒక పక్షం తరుఫునో పద్దాకా బుర్రలు తోమే పనిలో నిరంతరం మునిగుండేవి ఇంకొన్ని.  రత్నాల వంటి టపాలను పట్టుకోవడం ఉప్పు నీటి సామాజిక మాధ్యమ సముద్రంలో నిలువీత ఈదే వస్తాదులకైనా దుస్సాధ్యం అన్నట్లుంది ఇప్పటి దుస్థితి.

 

అవసరముండీ ఓ పొల్లు మాట బైటకు అనేందుకే ఒకటికి రెండు సార్లు సంకోచించే సంస్కృతి మన గతానిది. ప్రస్తుతమో!  ఎంతటి పెద్దరికమున్నప్పటికీ  పది మంది నసాళాలకు అంటే ఏదో  కుంటి కూత డైలీ ఓటి ట్వీట్ గా పడందే పప్పు అనో.. తుప్పు అనో దెప్పిపొడుపులు వినక తప్పని దిక్కుమాలిన  సోషల్ వర్కింగ్ సీజన్లో చిక్కుకుపోయున్నాం అందరం.  

 

సామాజిక మాధ్యమాలు వ్యక్తిగత జీవితం  విలువైన సమయాన్నే కాకుండా, చెమటోడ్చి గడించిన సొమ్ములో అధికభాగాన్నీ దుర్వినియోగ పరుస్తున్నాయ్! స్పాములు.. ఫిల్టర్లు ఎన్ని ఉన్నా బురద నీరులా వచ్చిపడే ఈ-మెయిళ్ల ప్రక్షాళనకే అధిక సమయం కేటాయించే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటిది. దీనికి అడ్డుకట్ట వేయడం కుదరని పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల మూలకంగా ఎంత మందింకా ముందు ముందు క్షోభిస్తున్నారో .. ఆ లెక్కలు తీసే టెక్నాలజీ ఇంకా రాలేదు!

 

మాదక ద్రవ్యాల వినియోగం మాదిరిదే సామాజిక మాధ్యమాల దుర్వినియోగం కూడా. నిండా కూరుకున్న తరువాత గాని చుట్టుముట్టిన సుడిగుండం లోతు తెలిసే యోగం లేదు. చేజేతులా చేతులు కాల్చుకోడం.. ఆనక ఆకుల కోసం అల్లల్లాడడం అవసరమా? ఎంత మంది అమాయక జీవుల బతుకులు అల్లరిపాలవుతున్నాయో కళ్లారా చూస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టని పక్షంలో మన బుద్ధిహీనత భావి తరాల క్షమాభిక్షకైనా అర్హత కోల్పోతుందేమో!   

భావి దివ్య జీవన హార్మ్యానికి సోపానాలు నిర్మించుకునే శక్తివంతమైనది మనిషికి యవ్వనకాలం. నైపుణ్యాల సాధన దీక్షగా కొనసాగవలసిన యవ్వనకాలంలో అధికభాగం నిరర్థక సామాజిక మాధ్యమాల గ్రహణం నోటపడితే ముందొచ్చే కాలమంతా మసకబారడం ఖాయం.  

వ్యక్తిగత విజయాలకు ఊతమిచ్చే వరకు సమస్యలేదు. అందుకు విరుద్ధంగా అభివృద్ధికి ఆటంకంగా మారినప్పుడే సామాజిక మాధ్యమాలతో పేచీ! పరిశోధన తీరులో సాగవలసిన జ్ఞానతృష్ణ  క్రమంగా  సామాజిక మాధ్యమాలకు  కట్టుబానిసలుగా మార్చేస్తోంది. అదే ప్రస్తుతం ఆందోళన కలిగించే పరిణామం.  

వృద్ధులను మరంత ప్రతికూలంగా ప్రభావితం చేయడం  సోషల్ నెట్ వర్కింగ్ ప్రధాన మరిడీతనం. పఠనం, పర్యటన, పరిశీలన, దిశానిర్దేశం, అనుభవాల సారం పదిమందికి వ్యక్తిగతంగా పంచే తీరులో ఇంత వరకు సాగిన వృద్ధులలో నిర్మాణాత్మక పాత్ర స్థానే  అసాంఘిక నైజం చొరబడ్డం సమాజ హితైషులను ఆందోళన కలిగించదా!

యుఎస్ లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, సోషల్ మీడియా, టెలివిజన్, వీడియో గేమ్‌లు వంటి  సామాజిక మాధ్యమాలలో   సగటు అమెరికన్ ఏడాదికి 400 గంటలు వృథా చేస్తున్నట్లు తేలింది. ఇండియాలో ఈ వ్యర్థ సమయం మోతాదు అందుకు రెట్టింపు. సమాజ శ్రేయస్సుకు, కొత్త నైపుణ్యాల సాధనకు గతంలో వినియోగమైన సమయం ప్రస్తుతం నాలుగింట మూడు వంతులు సామాజికంగా వ్యర్థ వినియోగం దిశకు మళ్ళిపోవడం మొత్తంగా దేశానికీ ప్రతికూలమైన అంశంగా పరిగణించక తప్పదు! 

విశ్వవ్యాప్తంగా విద్యావంతులూ సోషల్ నెట్‌వర్క్‌ కు చిక్కి రోజుకు సుమారు  2.5 గంటలు వృథా చేస్తున్నట్లు మరో అధ్యయన నిర్ధారణ.  భారతదేశంలో, సగటున ప్రజలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో 2.4 గంటలు గడుపుతున్నట్లు, ఎక్కువ సమయం నాసిరకం, పాత జోకులను పంచుకునేందుకే దుర్వినియోగమవుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఆ పరిశోధన ప్రకారం ఎవరికీ ఉపయోగపడని వ్యక్తిగత విషయాలు, సొంత విషయాలను గురించి ప్రగల్భాలకై వినియోగించే సమయమూ తక్కువేమీ లేదు. ఒక  జపానీయుడు సగటున 45 నిమిషాలకు మించి గడిపేందుకు మొగ్గు చూపని కాలంలో జీవిస్తున్న మనం ఎందుకు ఆ నిగ్రహం పాటించలేకుండా ఉన్నాం?! 

దేశం కోసం కాకపోయినా వ్యక్తిగత మానసిక ఆరోగ్యం దృష్ట్యా అయినా సామాజిక మాధ్యమాల వినియోగించే సమయం, నాణ్యతల పైన సమాజం మొత్తం పునరాలోచించే తరుణం దాటిపోతోంది. తస్మాత్ జాగ్రత్తని హెచ్చరించేందుకే ఈ చిన్న వ్యాసం.

-కర్లపాలెం హనుమంతరావు

30 -04 -2021


నేరాలు - శిక్షలు- కర్లపాలెం హనుమంతరావు


 

నేరం అంటే తప్పు. అపరాధం. సంఘ ప్రయోజనానికివ్యక్తి భద్రతకు ఉమ్మడిగా కొన్ని నీతి నియమాలు ఏర్పాటు చేసుకునే పద్ధతి  అన్ని కాలాలలోనూ ఉంది. ఆ కట్టుబాట్లను కాదని ప్రవర్తిస్తే సమాజం మొత్తానికే ముందు ముందు ముప్పు ఏర్పడే అవకాశం కద్దు. ఆ ప్రమాదం నివారించడం  కోసం గాను  'శిక్ష'లు ఏర్పడ్డాయి.  తప్పు చేసినవారిని దారిలో పెట్టడమే ప్రధానంగా 'శిక్షలుముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. కొన్ని  సరిదిద్దుకోలేని పెను తప్పిదాలకు పెద్ద పెద్ద శిక్షలూ కద్దు. ఈ శిక్షలు నిర్ణయించే అధికారం గతంలో రుషులకు ఉండడం గమనించవచ్చు. మహితాత్ములు నిర్ణయించిన  శిక్షలు అమలు  చేసే బాధ్యత సాధారణంగా రాజ్యం శాంతిభద్రతలను  సురక్షితంగా పర్వవేక్షించడమే ధర్మంగా గల పాలకులకు ధఖలై ఉండేది.   ఆన్నికాలాలలోనే కాకుండా అన్ని లోకాలలలో కూడా  నేరాలు చేయడంవాటికి తగ్గట్లు  శిక్షలు విధించి అమలు చేయబడడం గమనించవచ్చు. 

 

తెలుగువాళ్ళు పవిత్రంగా భావించే భాగవతంలో ఉపాఖ్యానల ద్వారా ఈ కొన్ని శిక్షలు.. అవి అమలు జరిగిన తీరు  స్థాలీపులాకన్యాయంగా పరిశీలించడమే ఈ చిన్నవ్యాసం ఉద్దేశం.

భాగవతంలో శిక్షలు ప్రధానంగా మూడు రూపాలలో కనిపిస్తాయి. స్వయంగా విధించుకునేవివేరేవారు విధించి అమలుచేసేవిశిక్షలు పడినా ఎన్నటికీ అమలుకాకుండా నిలబడిపోయినవీ.

సతీదేవి ప్రాణత్యాగం స్వయం శిక్షకు ఉదాహరణ. తండ్రి దక్షుడు యాగం చేసే సందర్భంలో అల్లుడైన రుద్రుడికి ఆహ్వానం అందదు. అయినా అతని భార్య దాక్షాయణి, 'పిలవని పేరంటానికి వెళితే అవమానాలు ఎదురయే అవకాశం ఉంద'ని భర్త హెచ్చరించినా 'తండ్రి ఇంటిలోని సంబరాలు తనయలు చూడాలి గదా! 'సర్వదిక్కులవారు కదిలి వెళ్ళే  యాగానికి  తానూ వెళ్లితీరాల'న్న మంకుపట్టుతో సహచరుడి తోడు లేకుండానే తరలివెళ్లింది. ఫలితం తీరని అవమానం. 'జలంబు ఆచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించిజితాసనయై భూమియందాసీనయగుచు యోగమార్గంబులో' చివరికి  ఆమె చేసిన శరీర త్యాగం భర్త ఆనతి మీరిన నేరానికి స్వయంగా విధించుకున్న శిక్ష. దేవుళ్లకు ఈగోలుఅలకలుకలతలు,దుఃఖాంతమైన కథలు ఉండటం అదొక వింత.

ఇకఇతరులు విధించే శిక్షల వ్యవహారానికొస్తే దేవతలురాక్షసులుమనుషులుమునీశ్వరులు  ఎవరు విధించే శిక్షలు వాళ్లవే.  

చిత్రకేతువు అనే విద్యధరాధిపతి ధర్మ సభలో ఈశ్వరుడి కౌగిట్లో ఉన్న గౌరిని చూసి ఆడవాళ్లు సభలలో నడుచుకొనే తీరు మీద చర్చపెట్టేశాడు. శివుడు చిరునవ్వుతో పోనిచ్చినా గౌరీదేవి గొప్ప అవమానం జరిగినట్లు క్రుద్ధురాలైంది. 'ఎగ్గుపల్కిన పాపాత్ముడెల్ల భంగి/దండనార్హుండు గాకెటు తలగగలడు'(6 -496)అని భావించింది. ఫలితం 'పాపపుస్వరూపమైన రాక్షసయోనిలో పుట్ట'మని శపించింది. తన కంటే అధికులను తప్పు పడితే నేరమని గౌరమ్మ  భావం. ఇంకెవరూ ఆ పని చెయ్యకుండా భయపడేందుకు చిత్రకేతువుకు అంతలావు శిక్ష. 

విష్ణుద్వేషులైన రాక్షస జాతిలో పద్దస్తమానం హరినామ జపం పారాయణం చేసే పసికొడుకును ప్రారంభంలొ చదువు సాములకు పెట్టి దారికి తెచ్చుకోవాలని చూశాడు రాక్షసరాజు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ నుంచి బైట పడకపోగా తనకే నీతిపన్నాలు చెప్పడంలో రాటుదేలిన ప్రహ్లాదుణ్ని 'ముంచితి వార్ధులం గదల- మొత్తితి శైల తటంబులందు ద్రొ/బ్బించితి శస్త్రరాణి  పొడి- పించితి మీద విభేంద్రపంక్తిద్రొ/క్కించితి ధిక్కరించితి శ-పించితి ఘోరదవాగ్నులందు ద్రో/యించితి పెక్కు పాట్లనల-యించితి చావడిదేమి చిత్రమో!అన్న పద్యంలో రాక్షసరాజే  చెప్పుకున్నట్లు ఒకటిరెండు కాదు వరస బెట్టి శిక్షల మీద శిక్షలు విధించేశాడు. 

కంసమహారాజు బాలకృష్ణుణ్ణి వెదికి మరీ శిక్షలు విధించడం మానవమాత్రులు విధించే శిక్షలు ఎంత విచిత్రమైన పద్ధతుల్లో ఉంటాయో అర్థమవుంది. వత్సాసురబకాసుర,  అఘాసుర ధేనుకాసురల్లాంటి దుష్టరాక్షసులను  ఒకళ్ల తరువాత ఒకళ్ళను చంపమని పంపటానికి కృష్ణుడు చేసిన తప్పిదాలేమీ లేవు. తనకు ప్రాణాపాయం ఉందని కంసుడు తలపెట్టిన  దుష్కృత్యాలు ఇవన్నీ!

సనకసనందాదులు జయవిజయులకు ఇచ్చిన దండనలు మునులు ఆచరించే శిక్షల జాబితాలోకి వస్తాయి. వైకుంఠ ద్వారాలకు పహరా పనిలో ఉండే జయవిజయులు స్వామి దర్శనార్థ వచ్చేవారి వివరాల  జోలికి  పోకుండా మొండిగా అడ్డుపడుతున్నందుకు పడ్డ ఆ శిక్ష. విఐపి ల ఆఫీసులకు కాపలాలు కాసే డవాలా బంట్రోతులదే సగం పెత్తనంగా సాగుతున్న ఈ కాలంలో జయవిజయుల ఉదంతానికి సమకాలీన ప్రాధాన్యత కద్దు. గేటుకు కాపలా కాసే వాళ్లు అగంతుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంత అవసరమో తెలియజేసే కథ. 

అరాచక పాలన ద్వారా తోటి వాళ్లందరినీ పిల్లలాట కింద హింస పెట్టే వేనుడి కథ అయితే ఇప్పటి కాలానికి ఎంతో మందికి నిజానికి గుణపాఠం కావాల్సుంది. విజ్ఞులు ఎంత చెప్పినాఎన్ని విధాల నచ్చచెప్పినా నీచబుద్ధి వదలని ఆ పాలకుడు చివరకు ఆ మునుల చేతనే శిక్షకు గురవుతాడు. 

శిక్షించే విధనాలు చాలా రకాలు. 'బావా! రమ్మని బరనగవు నగుచువీనిం బట్టి బంధించి గడ్డంబును/మీసంబునుం దలయును   గొరిగి విరూపిం '(10 -146) చేసిన రుక్మిణీవల్లభుడి రుక్మి శిక్షావిధానం కాయక విధానం. ఇప్పుడూ మళ్లా అమల్లోకి వస్తే ఎన్ని పరువు హత్యలు తగ్గి సమాజం ఆరోగ్యవంతంగా తయారవుతుందో .. ఊహించదం కష్టం.

కానీ దురదృష్ణ కొద్ది.. కొన్ని సందర్భాలలో తప్పు ఒకరు చేస్తే.. శిక్ష వేరేవాళ్లకు పడడం ఇప్పట్లా భాగవత కాలంలోనూ కద్దు. చిత్రకేతువు అనే రాజు అంగిరసుడు అనే ఋషి ప్రసాదించిన సంతానఫలం కృతద్యుతి అనే భార్య ఒక్క  దానికే ఇవ్వడం సాటి సవతులలో అసూయను రగలాడినికి కారణం అవుతుంది. కృతద్యుతి  కడుపున కాసిన ఆ కాయ మీదనే మహారాజు ధ్యాసంతా. కడుపు రగిలిన సవతులు పసిబిడ్డకు విషమిచ్చి చంపేస్తారు. మహారాజు పక్షపాత నేరానికి పాపంపుణ్యం ఎరుగని పసిబిడ్డ ప్రాణాంతకైన శిక్షను అనుభవించడం ఘోరాతిఘోరం. పాలకులకు నిష్పక్షపాత బుద్ధి లేని పక్షంలో అమాయకులు అన్యాయంగా ఎట్లా శిక్షలకు గురువుతారో.. ఈ కాలంలోనూ అన్ని ప్రాంతాలలో వీపు చరిచి చెప్పేటంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయ్! 

బలి చక్రవర్తి రాజ్యభ్రష్టత్వం  ప్రహ్లాదుడి వాచా దండన ఫలితం.  రాజ్యపాలన కొచ్చిన తరువాత రాక్షసలోకంలో మంచి మార్పులు సంభవించి లక్షీదేవి తన పరివారంతో సహా బలి చక్రవర్తి రాజ్యంలో మాకాం వేయడం నచ్చని దేవతలు అదితిని ప్రార్థిస్తే ఆమె విష్ణువుని ఈ సంకటం నుంచి కాపాడమని కోరుకున్నది. బలిని పాతాళానికు పంపితే గాని రాక్షసులు తిరిగి రాక్షసులుగా మారి లక్ష్మీ పరివారం వైకుంఠం చేరదని గ్రహించిన విష్ణువు అదితి గర్భలో ప్ర్రవేశిస్తాడు. అనుమానంతో  చేసిన విచారణల  మూలకంగా జరిగింది తెలుసుకుని కర్తవ్యబోధనకు ఆశ్రయించిన మీదట జరిగిందంతా చెప్పి విష్ణువుకు లొంగిపొమని ప్రహ్లాదుడు బలికి హితవు చెపుతాడు. రాక్షసులను తిరిగి దుర్మార్గులుగా మార్చుకుంటానన్న బలి మాటలకు కోపించిన ప్రహ్లాదుడు శపించిన మీదటనే బలి  రాజ్యభ్రష్టత్వం  కథ కొనసాగింది. ప్రహ్లాదుడు బలికి విధించిన శిక్ష 'వాచా దండనఅయితే బలి చేసిన నేరం హిరణ్యకశిపుడి వంటి వారి చరిత్ర వినీ గుణపాఠాలు నేర్చుకోకపోవడం. 

ఎంతటి మహామహుమహులైనా ఎప్పుడో ఓకసారి తప్పుదారిలో నడిచి శిక్షలు అనుభవిస్తారన్న దానికి త్రిలోకాధిపతి కథే ఉదాహరణ.  తన కనుసన్నలలో ఉండే పుష్కలావర్త మేఘాలను ఎడతెరిపి లేకుండా కురిసి రేపల్లె వాడలను ముంచెత్తమని అజ్ఞాపిస్తాడో సందర్భంలొ అహంకరించి. అలకకు కారణం కృష్ణుడి పలుకులు విని తనకు ఏటేటా జరిపే వేడుకలు జరపకపోవడం. మేఘాల వర్షాలకు జడివానలు కురిసినా గోపాలబాలుడు గోవర్థన గిరిని చిటికెన వేలుతో పైకెత్తి పట్టుకొని ఆ ఛత్రఛాయల కింద లోకాలను కాపాడాడు. తన తప్పు తెలిసి వచ్చిన ఇంద్రుడు నా వంటి వెర్రివారిని/ శ్రీ వల్లభ! నీవు శాస్తి చేసితి వేనిం/గావరము మాని పెద్దల/త్రోవల జరుగుదురు బుద్ధి తోడుత నీశా!(10 -937) అని సాగిల పడ్డాడు ,  

- కర్లపాలెం హనుమంతరావు 

 

 

 

 చెత్త చల్లుడు పథకం - సరదాకే

-కర్లపాలెం హనుమంతరావు

 

చెత్తను చెత్తపదార్ధంగా భావించడం తాతల కాలం  తెలివితక్కువతనం. చెత్తనుంచి

విద్యుత్ పుట్టించవచ్చని శాస్త్రవేత్తలూ ఇప్పుడు మొత్తుకుంటున్నారు.

నిజమే కావచ్చు. కానీ నీరు, బొగ్గులా  తేరగా దొరికే వనరుల నుంచి రాబట్టే

చచ్చువిద్యుత్తు కోసం బంగారమంటి చెత్తను వృథా చేయడమా! బార్బేరియస్!

 

ముందిక్కడి పట్టపగలు దోపిడీని అరికట్టండయ్యా బాబూ! తమ బాబుల ముల్లేదో

పోగేసినట్లు దొరబాబుల తలదన్నే  దర్జాతో వీధిబంగారం చెత్తను యావత్తూ

ఎత్తేకుపోతున్నారు! బతికేందుకు బొచ్చెలు  బోలెడు బొచ్చెడు దొరికే దేశంలో

ప్రభుత్వాస్తి ‘చెత్తే’ దొరికిందా  బీదాబిక్కీ జనాలకు?  రక్షణశాఖా ఈ

అరాచకాన్ని  గుడ్లప్పగించి చూడ్డం విడ్డూరంగా ఉంది!

 

రోడ్డో, ఇల్లో ఎక్కడ పడుంటే ఏంటి? ‘చెత్త’  ప్రభుత్వాలకు మాత్రమే చెందిన

చరాస్తి. పాలకులకు మాత్రమే జనం ఉత్పత్తి చేసే చెత్తమీద గుత్తాధిపత్యం.

అన్నీ రాజ్యాంగంలోనే రాసుండాలంటే ఎట్లా?

 

ముష్టి కోటి, అరకోటి  ఖరీదైనా చేయని పాటిభూముల్లో ఎవరెవరో వచ్చిపడి

జెండాలు పాతిపోతే  దురాక్రణమలు అంటూ అంత లావు అల్లరి చేసే

ప్రభుత్వాలు తమకు మాత్రమే చెందాల్సిన బంగారమంటి చెత్త- బండ్ల కొద్దీ

బహిరంగంగా తరలించుకుపోతోన్నా నిమ్మకునీరెత్తినట్లు ఎందుకు ఉండిపోతున్నట్లో? ఇదేమన్నా ఇసుక పాలసీనా? ఎవరితో కుమ్మక్కుల కహానీలు నడుస్తున్నట్లు?

 

బొఫోర్సని, రేఫిల్సని, బొగ్గూ  భోషాణమని, చందనప్పేళ్ల నుంచి,

స్టాంపుబిళ్లల దాకా ఏ సర్కారీ సరుక్కూ దిక్కులేకపోయినా అదో దారి! వీశెల

కొద్దీ బంగారం పోసినా వీశమెత్తు తూగనంత విలువైనది సామీ చెత్తపరక! ఇదీ

లెక్కా పత్రం లేకుండా మాయమయిపోయింది ఇప్పటి దాకా!

 

గొడ్డు తినే గడ్డికే కక్కుర్తి పడ్డ ఓ సారుకు జీవితాంతం ఊచల శిక్ష వేసేసారే! చెత్త మీద

చెయ్యేసిన ఘోరానికి మరి శిక్షా స్మృతిలో ప్రత్యేకించి ఏ ఉరీ గిరీల్లేవా? డ్యామిట్!

ఉన్నా దాచిపెదుతున్నారా.. సమాఖ్య స్ఫూర్తి బండారం బాపతులా!

 

ముత్తెమంత బంగారం నొక్కేసినా  ఏ లెక్కా డొక్కకు దొరకట్లేదని ఈడీ జప్తుకు

దిగిపోతుంది గదా! చెత్త దగ్గరెందుకు మరంత తాత్సారం!

 

ఇంటి ముందున్నా,పెరట్లో గుట్టలుగా పడున్నా పేరుకు పోయిన చెత్తను జనమంతా ఇక ముందు నుంచి స్థానిక పాలకుల పరం చెయ్యాల్సిందే! ఆ రకంగా ఆర్డినెన్సు జారీ చెయ్యండి ముందు! జాప్యం చేసే కొద్దీ చెత్త వనరుల తరుగు పెరిగిపోడం ఖాయం.

 

కరోనా తరహా మాయదారి రోగాలు ఇవాళ  గలభా చేసి రేపు గమ్మున వెళ్లిపోయేవి. ఆ తరహా మహమ్మారులకు జడిసి  చెత్తను దాచేస్తే బీదా బిక్కీ సంక్షేమం మాటో?

 

మనమేమీ జపాను తరహా ధనిక వ్యవస్థలో లేం కదా! ముక్కుకు గుడ్డపీలికలు చుట్టుకోడం ఎట్లాగూ అలవాటయిందాయ! కాబట్టి,  కొంపల్లో పొగయ్యే నానాచెత్తను ఇహ పై పక్కిళ్ల పెరళ్ళ   వైపుకు నెట్టేయకుండా  బాధ్యత తెలిసిన పౌరుల్లా  లోకల్ లీడర్లకు అప్పగించడం ఉత్తమం.

 

రాష్ట్ర సర్కార్లు రెండూ వేళకు చేతిలో చిల్లుగవ్వ ఆడక పడే అపసోపాలు చూస్తున్నాం గదా!  ఎంత ఆర్థిక బాధ్యతలకు ఒప్పుకుంటే మాత్రం పాపం.. మన ఏపీ బుగ్గన సారుగారు  ఎన్ని సార్లని ఆ పథకం బకాయిలని, ఈ ప్రణాళిక వాయిదాలనీ.. ఢిల్లీ నిర్మలమ్మ చుట్టూతా రొక్కం కోసం ప్రదక్షిణాలు చేసొస్తారు!

 

చెత్త ఉత్పత్తిలో ఎట్లాగూ మన తెలుగువాళ్లకుండే ఖ్యాతి జగత్ప్రసిద్ధం!

స్మార్ట్ సిటీ పెరామీటర్ల సమయంలో  చెత్త విలువపైన సరైన  అంచనా వేయకపోవడం

 పొరపాటే. వాస్తవానికి ఏ రాష్ట్రం 'వేస్ట్' ఆ రాష్ట్రం  దగ్గరే

పోగుపడున్నట్లయితే,, ఇప్పుడిలా  కె.సీ.ఆర్ సార్  లా జిఎస్టి గట్రా

ల్లాంటి వాటిల్లో వాటాల కోసమని గలాటాలా

దా కాదు. ఏ ప్రపంచ బ్యాంకు నిధుల కోసమో ధరఖాస్తు చేసుకొనే ఖర్మా పట్టుండేది కాదు. అప్పనంగా ఏ బ్యాంకూ ‘ఆల్ రైట్! కావాల్సినంత కొట్టుకు పో!’ అనేసెయ్యదు కదా!

ఎప్పట్లానే పస్తాయింపులు తప్పవు. ఒప్పించాలంటే శక్తి కొద్దీ  దాని గేట్ల

ముందు .. చెత్తకుప్పలు గుట్టలుగా పొసేయకా తప్పదు! అందుకైనా ప్రభుత్వాల

దగ్గర ప్రజల చెత్త వనరుల రూపంలో భద్రంగా ఉండవలసిన అగత్యం ఉంది. అందుకోసమే ఇంత సోది ఇప్పుడు ఇక్కడ!

 

కొన్నాళ్ల కిందట మన  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్టీ పన్నుశాఖలోళ్లు

ఇంటిపన్ను మొండి బకాయిల వసూళ్ల కోసం ఈ చమత్కారమే దిగ్విజయంగా

ప్రయోగించారు!  ఇప్పుడు ఇదే ‘చెత్త జల్లుడు పథకం’  ఏపీలో కూడా మరింత

విస్తృత స్థాయిలో అమలవుతోంది.  ఒకానొక జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ

బ్యాంకుల  వాకిళ్లన్నిటి  ముందు తెల్లారేసరికల్లా అత్యంత  ఖరీదైన

చెత్తా చెదారాలు సంక్రాంతి పెద్ద పండుగ కలాపీలకు మల్లే  చల్లేసిన

దృశ్యాలే ఇందుకు ఉదాహరణ.

 

అలరి చిల్లరి ఆగంలా గుస్సా తెప్పిస్తాయే గాని, మూలంలో ఈ ‘చెత్త చల్లుడు

పథకం’ జగన్నాటకం వెనక విశాల  ప్రజాప్రయోజనమే ప్రధాన లక్ష్యంగా ఉందని

ప్రభుత్వ వర్గాలలో ఇప్పుడు  గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్నికల ఫ్లోలో ఇచ్చిన హామీలు కొన్నైనా అమలుపరచకపోతే ఎంత నామర్దా? కానీ ప్రభుత్వ ఖజానాలో కాణీ లేదు. నిధుల లోటు నానాటికీ పెరుగుతుండడంతో .. విధి లేక దిక్కూ దివాణం లేని జనాలకు నేరుగా కేంద్ర

బ్యాంకుల ఖజానాల నుంచే ఏ పూచీకత్తూ లేని  రుణాలు నిర్బంధంగా ఇప్పించాలని

‘చెత్త చల్లుడు పథకం’ రూపకల్పన జరగడం!  ప్రపంచ బ్యాంకు సంగతెట్లా ఉన్నా

ముందు ప్రజాసంక్షేమం కోసమైనా   ప్రభుత్వాలకిప్పుడు కట్టుకుపోయేటంత చెత్త

అవసరం.

పథకం చెత్తగా ఉందని పెదవి విరిచే ప్రబుద్ధులు ఎప్పుడూ ఉంటారు.  చెత్తను

అత్యంత ప్రజోపయోకరమైన  వనరుగా మార్చే  లక్ష్యంతో ‘చెత్త చల్లుడు పథకం’

రూపొందించిన  మహానుభావులు ఎవరో బైటపడితే బాగుణ్ణు.  పటం పెట్టుకొని

నిత్యం ఉన్నంత చెత్తతో ఆ వారిని సేవించుకునే వీలు .. బ్యాంకు రుణాలు

సాధించి ఎగేసిన అదృష్టవంతులందరికీ!

-కర్లపాలెం హనుమంతరావు

 


ఎన్నికల వేళా కుంభమేళా - వ్యాసం

 

ఎన్నికల వేళా  కుంభమేళా -  వ్యాసం

-కర్లపాలెం హనుమంతరావు

మహమ్మారి కరోనాతో మొన్నటి దాకా మనం  పట్టుదలతో చేస్తూ వచ్చిన యుద్ధం కాస్తా కుంభమేళా మునకలతో, బెంగాల్ తాలూకు ఎన్నికలతో పుటిక్కుమని గంగలో కొట్టుకుపోయింది.

ఎంతో సంయమనంతో నియమ నిబంధనలన్నీ పాటించి అణిచివుంచాం అనుకున్న కరోనా వైరస్ కాస్తా కుంభమేళా లాంటి   భారీ ధార్మిక కార్మక్రమం సందు చూసుకుని మరింత విజృంభించేసింది. ముహూర్తం కన్నా ముందే వచ్చిపడ్డ కుంభమేళా సందర్భంగా.. ఏ శాస్త్రం లేదు.. చట్టుబండలూ లేదు.. వైద్యుల జాగ్రత్తలతో సహా సర్వానికి ‘పచ్చి’ కొట్టేసి.. రెచ్చిపోతోంది కరోనా వైరస్! 

తొందర పడి కోయిల ముందే కూసిన చందంగా అరకొర దశల్లోనే మనకు మనమే విశ్వవిజేతలమంటూ  బోరవిరుచుకొన్నాంగా! విస్తుపోవడమే చివరికిప్పుడు మిగిలిపోయింది! ఛాతీ వెడల్పు ప్రభుత్వాలిచ్చిన బేఫర్వా ప్రకటనలతో జనం మదిలో  భయమనేదే లేకుండాపోబట్టే.. ప్రస్తుత దారుణ పరిస్థితి

పాత పోరాట అనుభవాలేవీ ఇప్పుడు పైసాకు పనికిరాకుండా పోయాయి. అదనంగా ప్రాణవాయువు కరువొకటి వంటింట్లో పొగలాగా! ఊహించని రేంజిలో కశ్మీరం నుంచి.. కన్యాకుమారం వరకు అంతటా  ఉక్కిరి బిక్కిరి! ఇంత విశాలదేశం ఒక్కసారిగా నేతాలేమి అనుభవంతో అల్లాడడం ఇదే మొదటిసారి. నేతాలేమి దశలో మరి నేతలు ఏమి చేస్తున్నారయ్యా అని పరిశీలిస్తే..   ప్రపంచం విస్తుపోయే కొత్త విషయాలు చాలా బైటపడుతున్నాయ్! ఇట్లాంటి నేతలను ఎన్నుకోదానికి కోట్లు కోట్లు ప్రజాధనం పోసి మనం బోలెడంత సమయం వృథా చేసుకుంటున్నది! అన్న పశ్చాత్తాపం కలక్కపోతే  ఈ ప్రజాస్వామిక దేశాన్ని ఇహ ఏ దేవుడూ కాపాడలేడు!

పడమటి బంగాళం మీదకు పదే పదే ఎన్నికల దాడులకు ఇదా వేళ? సామాజిక దూరం అక్కర మరింత ఎక్కువైన తరుణంలో సామూహిక జన సందోహంతో ఎన్నికల జాతర్లా? నిజానికి ఇప్పుడు బంగాళంలో  జరిపించింది అర్థ కుంభమేళా! మత పార్టీ రాష్ట్ర ఎన్నికల కక్కుర్తికి అదే మహా కుంభమేళలా మారికూర్చుంది!

 

మతం పట్ల ఏ దేశంలో అయినా మామూలు మనిషికుండే మంకుపట్టు మామూలుగా ఉండదు.  ధార్మిక భావోద్వేగాలు రెచ్చగొడితే దాని ధాటికి ఏ శాస్త్రీయ సత్యమూ దీటుగా నిలబడ్డం ఉండదు. మూక మనస్తత్వం మీద మాస్టర్స్ డిగ్రీ చేసిన ఒకానొక మితవాద రాజకీయ పక్షానిదే ప్రస్తుతం జరుగుతున్న హతకాండ పాపమంతా!

చలనచిత్ర సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ నర్మగర్భ వ్యాఖ్య ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. 17 లక్షల మంది కోవిడ్ బాధితులకు టీకా ఇప్పించేందుకు ముంబయ్ కి పట్టిన సమయం ఆరు వారాలయితే.. 35 లక్షల మంది  ధార్మిక భక్తులను గంగలో ముంచడాంకి బెంగాలుకు పట్టిన సమయం కేవలం 24 గంటలు.  మరో జన్మ ముందు ప్రస్తుతమున్న జన్మ అప్రస్తుమనుకునే  భక్తులు దండిగా ఉండే దేశం కాబట్టే ఎన్నికల వేళ ఎప్పుడొచ్చినా ఏ  కుంభమేళాలో భారీగా జరిగే దృశ్యాలు కనిపించడం!  దేశం దిశ ఏటు తిరిగిందో గమనిస్తే నిజంగా వణుకుపుడుతుంది.

పబ్లిక్ కన్నా వైరస్సే వైజర్! వ్యవస్థ లోపాలేమిటో దానికి బాగా తెలుసు! అందుకే ఐదేళ్ల కోసారి వచ్చేవే అయినా ఎన్నికల తంతుకు తన వంతు టచప్ లా ఇచ్చింది.. ప్రపంచం విస్తుపోయేలా చేసింది!

ఎన్నికలు మంకు  కుస్తీలు పట్టే గోదాలాయ! ఆ కుస్తీలలో  మోదీని మించిన వస్తాదు లేనుకునే మూఢులకు  కరోనా భూతం ఇప్పటికైనా కళ్లు తెరిపించినట్లేనా?

కరోనా మహమ్మారేమీ బెంగాల్ సి.యం మమతా బెనర్జీ కాదు. అవినీతి కేసులకు అదిరిపోడానికి కోవిడేమీ ప్రతిపక్షంలో లేదు.  లాలూచీ రాజకీయాలకు లొంగిపోడానికి వైరస్సులకేమీ అధికార కాంక్షలేదు. చీల్చి బలహీనపరచాలన్నా కరోనా కంటికెన్నడూ కనిపించేది కాదు.  అబద్ధాలను మాత్రమే  నిజమని నమ్మే  ఓటరు అమాయకత్వానికి వైరస్సులో చోటు  లేదు. జనం సొమ్ముతో ఎంత స్థాయి పెంచుకున్నా ఏ కరోనా కణమూ పట్టించుకోదు. గాలి మాటలు తరహా ఎన్ని  ఆరితేరిన వ్యూహాలతో కాలు దువ్వినా వెనక్కు తగ్గక పోగా.. అందుకే రెండో దశంటూ రెట్టించిన కొత్త ఎత్తుగడలతో చివరకు మహా వస్తాదు మోదీని ఎత్తికుదేసింది కరోనా వైరస్!  

ప్రజాస్వామిక దేశం మనది. అధికారం అప్పగించే బాధ్యత  జన సమూహానిది. అందుకు కావలసింది మంచీ చెడూ తర్కించుకునే బుద్ధి.  ఆకర్షణ తంత్ర్రాలకు లోబడితే సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు హుళక్కి అయినట్లే!  భవిష్యత్తు మీద ప్రధానంగా దృష్టి పెట్టి  తాత్కాలిక స్వార్థప్రయోజనాలను పక్కన పెట్టి సమర్థుడైన నేతకు   దక్షిణ తాంబూలాలివ్వాల్సిన అరుదైన అవకాశం ఎన్నికలొచ్చినప్పుడే సామాన్యుడికైనా దక్కేది. బంగారంలాంటి ఆ అవకాశాన్నొదిలేసుకుని ఏవేవో ప్రలోభాలకు లోనయిపోయి పొరపాటు చేసినప్పుడే  ‘తాంబూలాలిచ్చేసాం.. తన్నుకు చావండ’నే సీను  నేతల చేతుల్లోకెళ్ళేది.  ఇన్ని దశాబ్దాల అనుభవం ఉన్నా తొలిగిపోని ఓటరు తెలివితక్కువతనమే ఆశ్చర్యం కలిగించేది.

1947 నాటి దేశ స్వాతంత్ర్య సముపార్జన కాలంలో పశ్చిమ బెంగాల్లో భీకరమైన మతకల్లోలాలు చెలరేగిన సంగతి ఇప్పటి తరానికి అంతగా తెలీని విషయం. అంత విపత్కర పరిస్థితుల నుంచీ గట్టెక్కి దేశ ప్రధాన జీవన స్రవంతిలో మమేకమైన చరిత్ర  బెంగాలీయులది. 71 నాటి బంగ్లాదేశ యుద్ధంలో కూడా  పొరుగు పాకిస్తాన్ లో జరిగిన మతకల్లోలాలకు బెదిరి పారిపోయి వచ్చిన  కోటి మందిని అక్కున చేర్చుకున్న గొప్ప మత సామరస్యం బెంగాలుది! మత ప్రాతిపదికన ఇప్పుడిట్లా  నిట్టనిలువునా చీలడం చూస్తుంటే నిజమైన ప్రజాస్వామికి బెంగేయకుండా ఉంటుందా!

ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకా.. మెజారిటీ మిషన అట్టడుగు వ్యక్తిని మరంత అణగదొక్కేటందుకా  ఎన్నికలు? కల్లో అయినా ఊహించి ఉండరేమో అనిపిస్తోందిప్పుడు మన  రాజ్యాంగ నిర్మాతలు కులాతీత మతాతీత వ్యవస్థపై జరుగుతున్న   ఈ స్థాయి దాడులు!

ఎన్నికలమేళా కోసమే కుంభమేళాలు జరిగిపోతున్నా కిమ్మన్నాస్తిగా ఉండిపోవడం కామనై పోయింది ఎన్నికల కమీషనుకు!  కరోనా వైరస్సేమీ  ఎన్నికల కమీషన్లా పరాధీనంలో లేదు. ఆ సంగతి అందరం మర్చిపోబట్టే ఇవాళ ఇట్లా .. ఎవరికి ఎట్లా అదుపు చెయ్యాలో తెలీనంత ఉధృతంగా రెండో దశలో మహమ్మారి ఆగడాలు!

ఎవరో అన్నట్లు.. వేలాది ముఖాలు గంగానది మురికి నీళ్లల్లో, ముఖం తొడుగూ గట్రాలేవీ లేని లక్షలాది ముఖాలు రద్దీ రాస్తాల మీద.. ఇప్పుడు ఇండియాలో కనిపించే దృశ్యాలు!  ప్రపంచాన్ని వణికించేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కరాళ నృత్యం కాలంలో లోకం లోకువ కట్టిందంటే కట్టదా మరి! ఇంత ఆపత్కాల సమయంలో కూడా నమ్మి ఓటిచ్చిన ఓటరు సంక్షేమం పట్టకుండా ఒక దేశ ప్రధాని ఏకంగా రాష్ట్రంలో ఎన్నికలు పెట్టించుకుని ‘మీకు మాత్రమే టీకాలు ఫ్రీ’ అంటూ ప్రచారం చేసుకుంటూ తిరగడాన్ని ఎవరైనా ఎందుకు హేళన చేయరు?

ఎందుకు హేళన చేయకూడదు? లోకం నవ్వుతున్నదని కాదు కానీ, నడుస్తున్న పాలనలోనే  లోపమేదో జొరబడిందని ఇప్పటికైనా సాధారణ పౌరుడిగా మన గ్రహింపుకు రావాలి కదా!  జరిగిన పొరపాటు ఎక్కడో తెలిస్తే సరిదిద్దుకునే సంగతి ఆనక!

-కర్లపాలెం హనుమంతరావు

26 -04 -2021

 

 

Thursday, December 9, 2021

అనగనగా ఒక ఊరు .. - కర్లపాలెం హనుమంతరావు

 అనగనగా ఒక ఊరు .. 

- కర్లపాలెం హనుమంతరావు 


మనిషికి మల్లేనే ప్రతి ఊరుకూ ఒక పేరు ఉంటుంది. ఊరూ పేరూ వ్యక్తికి తప్పనిసరి. ఎందుకూ కొరగాని  వ్యక్తిని ఊరూ పేరూ లేనివాడని సంబోధించడం మనం చూస్తుంటాం. మనిషి పేరు కన్నా ముందు ఊరు పేరు ఉండటం విశేషం. 


మనిషికి పేరు కన్నవారు పెడితేనో, ఉన్నఊరు పెడితేనో, చేసిన ఘనకార్యానికి గుర్తింపు కిందనో.. లభించేది. కాని మనుషులు నివాసముండే ఊరుకు ఆ పేరు ఊరికే రాదు. చారిత్రక నేపథ్యమో  , అపభ్రంశమయిన పూర్వనామమో, విశిష్ట వ్యక్తుల   పేరున గుర్తింపు పొందిన ప్రాంతమో .. కారణాలుగా ఉంటాయి. 


కొత్తమనిషి పరిచయంలో ఉళ్ల పేర్ల ప్రస్తావన రాకుండా ఉండదు  . మీ పేరేమిటి? అని అడగక పోయినా ఆ  అపరిచితుడు ' మీ దే ఊరు? ' అని విచారించక మానడు. ఉద్యోగానికో, గుర్తింపు పత్రానికో ..రాతపూర్వక పత్రం దేనికైనా సరే ఊరు పేరనేది  లేకుండా అసంపూర్ణం కింది లెక్క  . 


రుణ అభ్యర్థన  మొదలు చావుపుట్టుకల ధ్రువీకరణ వరకు  ఊరు పేరు వినా  ఏ పత్రము చిల్లు కాణీ విలువ చెయ్యదు  . ఎన్నికలలో నిలబడే అభ్యర్థి అర్హత ఉన్న  ఊరు ప్రాంతం బట్టే. జీవితంలో అన్నింటా అవసరమయే 'స్థానికత' ఊరు పేరును అసరించే నిర్ధారింపబడేది. 

ఊర్ల  కోసమే కాకుండా, ఊళ్ల పేర్ల కోసం కూడా యుద్ధాలు జరిగిన సందర్భాలు  చరిత్రలో కోకొల్లలు. కానీ, ఈ ఊళ్ల పేర్లు నిర్ధారణ కోసం పరిశోధకులు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. దీని కోసం ప్రత్యేకంగా ఒక శాస్త్రమే కద్దు . 


అంతర్జాతీయ స్థాయిలో ఊళ్ల పేర్లకు సంబంధించిన శాస్త్రం పేరు ' International Committee for Onomastic Sciences) . బెల్జియం కేంద్రస్థానం.  మూడేళ్లకోసారి సమావేశాలు, ఓనామ పేరుతో  ఓ ప్రతిక కూడాను. 


Onama ( ఓనామ ) అంటే లాటిన్ భాషలో ' నామము '  అని అర్థం.  ఈ ఓనామస్టిక్స్ కమిటీకి  దేశదేశాలలో   శాఖలు ఉన్నాయి. జనావాలను గురించి విషయ సేకరణ వీటి ముఖ్య విధులలో ఒకటి. అమెరికాలో  ' నేమ్స్ సొసైటీ ' పేరుతో నడిచేది  ఈ తరహా సంస్థే . ఇది   త్రైమాసిక పత్రిక నొకదానిని నడుపుతోంది కూడా . 


ఇక భారతదేశానికి వస్తే ' భారతీయ స్థలనామ సంస్థ' ఒకటి మైసూరు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తోంది.  మన నాగార్జున విన్యవిద్యాలయంలోనూ నామ  విజ్ఞాన శాస్త్రాథ్యయనం నిమిత్తం  ఒక ఐచ్ఛిక పాఠ్యాంశం తెలుగు ఎమ్.  ఎ . కోర్సులో నడుస్తున్నది. 


సాధారణ అర్థంలో నామము  అంటే పేరు. గ్రామ నామము అంటే ఊరు పేరు. నామ శాస్త్రపరిశోధకులకు మాత్రం ( నామవాచకమా, సర్వనామమా, విశేషణమా ,  క్రియా అనే విచక్షణ ఏమీ  లేకుండా ) భాషలోని ప్రతి పదమూ ఒక ' పేరు ' కిందే లెక్క . ఈ సూతం ఆధారంగానే గ్రామ నామాల స్థిరీకరణపై అధ్యయనం సాగుతున్నది. 


ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ నామవిజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా గ్రామ నామాల మీదనే ప్రధాన దృష్టి . మామూలుగా ఊళ్ల పేర్లలో  కొన్నిటికి  ఒక పదం మాత్రమే ఉంటుంది. దర్శి, కంభం, చీరాల, పామర్రు, బొల్లారం.. వగైరా వగైరా ఉదాహరణలు. 


ఊరి పేరులో రెండు పదాలుంటే మాత్రం  రెండో పదం జానావాసానికి  (Generics) సంబంధించి ఉంటుంది. కొండపల్లి లోని పల్లి, మొగల్తూరు లోని ఊరు, వేటపాలెం లోని పాలెం, పమిడిపాడు లోని పాడు .. ఇట్లా .  కొత్తగా లేచిన ఊళ్లయితే ' నగర్ ' ( గాంధీనగర్, భావనగర్) ఉండటం చూస్తుంటాం. 


అయితే పాత ఊర్ల పేర్లలో చివర కనిపించే పదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. తుర్రు అంటే .. నైసర్గిక లక్షణాలకు ప్రాధాన్యత ఇచ్చే పదం. పేట అంటే అది తప్పకుండా  ప్రధానంగా వ్యాపారస్థలమై ఉంటుంది. పూడి అంటే దాని పక్కన కచ్చితంగా నీటి ప్రవాహం ఉంటుంది. మిర్రు అంటే మెరక మీద ఉండే స్థలం. ఊర్ల  పేర్లు ఊరికే అట్లా వచ్చేసినవి  కాదు. పెద్దల అవగాహన వల్ల స్థిరపడ్డ పేర్లవి . అథ్యయనం చేసే కొద్దీ చిత్రమైన చరిత్ర బయటపడే అంశం గ్రామనామ విజ్ఞాన శాస్త్రం.  


ఇంగ్లీషులో ఈ నామ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి స్పెసిఫిక్స్ (Specifics)' అనే ఒక సాంకేతిక పదం ఉంది. కొండపల్లినే ఉదాహరణగా తీసుకుందాం. పల్లి అనేది నైసర్గిక  ప్రాథాన్యతను సూచించే పదం  అనుకున్నాం కదా! చివరన  పల్లి అనే పదం పేరుతో ఒకే ఊరు ఉండక పోవచ్చు. ఎవరైనా ఫలానా  పల్లి  కి ఎట్లా పోవాలి అని అడిగితే .. ఆ ఫలానా ఏదో   సమాధానం చెప్పేమనిషికి  ఏదో ఒక కొండగుర్తు అవసరం. దాని కోసం ఆ పల్లికి సంబంధించి, నలుగురూ ఠక్కున గుర్తుపట్టే  పేరు ఉండటం తాప్పనిసరి . కొండపల్లి అంటే కొండకు దగ్గరగానో, కొండ మీదనో ఉన్న పల్లి అన్నమాట. అట్లాగే బ్రాహ్మణపల్లి . ఆ ఊళ్లో బ్రాహ్మణకులస్తులు  ఎక్కువగా ఉండటం వల్ల బ్రాహ్మణపల్లి అయింది. ప్రత్యేకంగా ( స్పెసిఫిక్ ) గా ఒక పేరును బట్టి జనావాసాన్ని గుర్తించే ఈ పద్ధతి స్పెసిఫిక్ పద్ధతి గా ప్రసిద్ధం అయింది. మనమేమో ప్రాచీనుల తెలివిని అతితెలివితో మహా చులకన చేస్తుంటాం. అదీ చిత్రం. 


 విడివిడిగా వివరించుకు పోతే విస్తరణ భీతి తప్పని అంశం ఇది . అవగాహన కోసం కొన్ని ఊళ్ల పేర్లు మాత్రం  ఉదాహరణలుగా చూపించి వ్యాసానికి స్వస్తి పలికేద్దాం . 


సంఘసంస్కృతిని తెలిపే ఉళ్ల పేర్లు కొన్ని ( జనావాసాలు, మొక్కలు వంటివి  నైసర్గిక ప్రాధాన్యత కలవి )  .... పూడి ( తుమ్మపూడి )  , బండమీదిపల్లె.. 


 కులాలు గట్రా  సూచించేవి .... బ్రాహ్మణపల్లి , గొల్లపాలెం, తురకపేట వగైరాలు  ... 


స్థలం ఉన్న స్థితిని బట్టి ఎత్తుపల్లాలను , దిశలను.. సూచించేవి .... దిగువ తడకర, తూర్పు పల్లి, ఏటికవతల తాండ్రపాడు.. 


తమాషా ఏంటంటే, కొన్ని ఊళ్ల పేర్లు మనల్ని కంగారు పెట్టేస్తాయి. ఉదాహరణకు : గొడుగుచింత .  ఇక్కడ గొడుగును చింత పదం  నుంచి విడగొట్టడం  వల్లనే ఇంత గొడవ.  గొడుగుచింత అనేది  ఒక మొక్క పేరు. ఆ విషయం తెలిస్తే మరి అయోమయానికి ఆస్కారం ఉండదు. 

అట్లాగే దీపాల పిచ్చయ్యశాస్త్రి లోని ఇంటిపేరు.. దీపాల మనం అనుకుంటున్నట్లు వెలుగు నిచ్చే దీపానికి సంబంధించింది కాదు.  ఒక గడ్డి మొక్క పేరు. 

అట్లాగే కోమలి దీపావళి అనే ఊరు పేరు మనం సాధారణ అర్థంలో తీసుకుంటాం, కాబట్టే తికమక . 


చివరగా: లంజ అన్న పేరున్న ఊరు ఒకటి కద్దు . ఒక బూతు పదం  మీదుగా ఊరికి పేరు పెట్టడం ఆశ్చర్యమే కాదు  . . వినడానికి  .. ఆ ఊళ్లో ఉండేవాళ్లకూ  ఇబ్బంది కలిగించే  పరిస్థితి. ఈ అపార్థానికి  కారణం లంజ అనే పదం మనం కేవలం నీతి తప్పి .. వంకర మార్గంలో నడిచే  స్త్రీకి మాత్రమే వర్తించుకుంటున్నందు వల్ల . ఆ వంకర దారి ( వక్రమార్గం) లో నడిచేది ఒక్క మనిషే కావాలని  రూలేముంది? నీటి ప్రవాహం కూడా కావచ్చు కదా! తిన్నగా పారక వంకరటింకరగా పారే నీటి ప్రవాహం దగ్గర ఉండే జనావాసం కాబట్టి  అందరం చెడుగా భావించే ఆ ఊరు పేరు ఆ పదంతో ప్రసిద్ధమయింది. 


తరాలబట్టి జనం నోళ్లలో నానే పదాలను ఏ మనిషికీ  , ప్రభుత్వానికైనా  బలవంతంగా   మార్చే  శక్తి సున్నా . 


ఊళ్ల పేర్లంటే కదలి వెళ్లి పోయినా కాలపు కాలి ముద్రలు. వాటిని చెరిపివేసే శక్తి ఎంత లావు బాహుబలికైనా నాస్తి !


- కర్లపాలెం హనుమంతరావు 

28 -10-2021 

బోధెల్ ; యూ. ఎస్.ఎ


( ఒక ఊరి కథ - యార్లగడ్డ బాలగంగాధరరావుగారి  గ్రంథం ఆధారంగా ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...