Monday, February 11, 2019

అమ్మోరు .. రావాలి వన్స్ మోర్!-గ్రామసీమల సంస్కృతి



గ్రామాల రూపం మారినా గ్రామాచారాలు కొనసాగుతున్నాయ్ ! ఊరికో గ్రామ దేవత.. ఊరంతా ఆమె ఇల్లు. పాడిపంటలు, నీటి వనరులు, నీతి అవినీతి ఆమె బాధ్యతలు. దారి తప్పితే  శిక్షతప్పదు.పెద్దా చిన్నా లేదు  ప్రేమాభిమానాలకు. పిల్లలు, స్త్రీలు, ముదుసలులు, వైకల్యం ఉన్న వాళ్ల మీద పిసరంత పక్షపాతం ఎక్కువ. కోపం వచ్చినా, ప్రేమ కలిగినా ప్రకృతి ద్వారానే ప్రకటిస్తుంది. ఆ సూచనలు మాతంగి మాటగా  ముందే  హెచ్చరిస్తుంది. భారతీయ .. ద్రవిడ.. గ్రామీణ సంసృతి ఇది. శతాబ్దాలబట్టి కొనసాగే ఈ విశ్వాసాలను ఏకమొత్తంగా నేలమట్టం చేయడం ఎంత బలమైన ఉద్యమం వచ్చినా  సాధ్యం కాని పని. లౌకిక భావజాలం మీద విశ్వాసం కలిగి ఉన్న రాజకీయ పక్షాలు ఈ భారతీయ ద్రవిడ సంస్కృతి విశిష్టతను అవగాహన చేసుకోక తప్పదు.  గ్రామదేవతల అనుగ్రహాలకని జానపదులు ఏటేటా కొలుపులు చెయ్యడం తప్పనిసరిగా భావిస్తారు. రక్తపానం, ఆసన సేవనం ఆమ్మతల్లులకు  ఇష్టం. అమ్మ కొలుపులకు బ్రాహ్మలు పనికిరారు. కుమ్మరి విగ్రహం చేస్తే, చాకలి బలిపీఠం దగ్గరకు చేరుస్తాడు. ఈడిగ మనిషి పసుపు కుంకుమలతో అలంకరిస్తే, మాల మాదిగలు ఊరేగిస్తూ వేటపోతును బలిస్థలికి చేరుస్తారు. బానల నిండుగా కల్లు అందించే పని ఈడిగలదే. బోనాలు వండి పంపే బాధ్యత ఊరిపెద్దలది. ఆసాదులు అమ్మవారి మీద పాటలు పాడటం, మాతంగి నృత్యాలు చేయడం కాలానుగుణమైన మార్పులతో ఆ సందళ్లన్నీ పూర్వం కన్నా ఇప్పుడు పటాటోపంగా జరుగుతున్నాయ్. ఓటు బ్యంకు రాజకీయాల్లో ఊరి దేవతలు సైతం మిగతా అన్నింటి మల్లేనే పావులుగా మారిపోయారు. పోతు వేటతో మొదలయ్యే బలి తతంగం ఊరివాళ్లు తెచ్చిన సన్నజీవాల హతంతో కొనసాగుతుంది చాకళ్ల ఆధ్వర్యంలో. చంపిన పోతు నోట్లోనే దాని కాలు కుక్కి, నెత్తురు బోనాలతో సహా కమ్మరిచేసిన చెక్కబండి మీద ఊరేగింపు జరుగుతుంది. కల్లు తాగి చిందులేస్తూ కొమ్ము బూరాలు, తప్పెట్లు చేసే కోలాహలం  అంతా ఇంతా కాదు. ఎంత సందళ్లు సాగుతున్నా నెత్తురు కలిపిన బోనాన్ని 'పొలి.. పొలి ' అంటూ పొలికేకలు పెడుతూ ఊళ్లో వెదజల్లేటప్పుడు అంతా నిశ్శబ్దం! అమ్మోరి మీద ఉండే భక్తి అలాంటిది మరి! బలి పశువుల పేగులు నోట కరుచుకుని పొలి ఊరంటా జల్లేవారు మాల మాదిగలు. కొన్ని చోట్ల కొన్ని పద్ధతుల్లో కాలాన్ని బట్టి మార్పులు జరుగుతున్నా.. ఈ రకమైన కొలుపులు, జాతర్లలో ఇప్పుడు ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రిపుంగవులు  సైతం నెత్తి మీద  బోనాలు మోస్తూ కనిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం.. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలంటే ఈ రకం టక్కు టమారా విద్యలు తప్పనిసరి అన్నట్లు సాగుతున్నాయ్  సెక్యులర్ స్టేట్ గా మనం గొప్పలు పోతున్న ఈ దేశంలో! గ్రామదేవతల  మీద భయభక్తులతో అన్ని కులాలవారు అంత ఒద్దికగా గ్రామదేవతలకు పూజాపునస్కారాలు చేసుకునే ఈ నిజమైన సెక్యులర్ సమాజంలో పెద్ద  కులాలవారు(కమ్మ, రెడ్డి .. ఇప్పుడు కొత్తగా కాపులాంటి) తమ తమ కులాల పాలన ఆధిపత్యాల  కోసం నీతి. అవినీతి, సామాజిక న్యాయం.. అన్యాయం, వరసావావి వంటి కట్టుబాట్లలో కూడా చిచ్చు పెడుతున్నారు. దైవదూతలమని భేషజాలకు పోయే బ్రాహ్మల వంటి కులాలు మధ్యదళారులుగా మారి మరింత భ్రష్టు పట్టిస్తున్నారు. తమకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించాల్సింది పోయి అసలే అనైక్యంగా ఉన్న ఉత్పాదక వృత్తులవాళ్లు తమలో తాము మరింత పేచీలు పెట్టుకుంటో రొట్టె ముక్కను మళ్ళీ పెద్ద కులాలవాళ్ల నోటికి నేరుగా అందిస్తున్నారు. కులాల కుమ్ములాటలకు తోడు ఇప్పుడు అదనంగా మత దుర్రాజకీయాలూ తోడై సామాజిక ప్రజాస్వామ్య పాంచాలికి   బహిరంగ వస్త్రాపహరణ జరుగుతోంది. ప్రజాస్వామ్య పితామహుల మౌనం మరింత చేటు తెస్తోంది. ప్రకృతి ఉత్పాతాలనుంచి రక్షిస్తుందని విశ్వసించే అమ్మోర్లయినా ఇహ కన్నెర్ర చేయాలి కదా! సునామీలు, క్షామాలు , అంటురోగాలకన్నా ఎక్కువ చేటు ప్రజాస్వామ్యానికి వ్యక్తుల వరకే పరిమితం కావాల్సిన ఈ మతం, కులం విశ్వాసాలు! 
-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...