Tuesday, December 12, 2017

తెలుగులో తమాషా పద్యాలు- (ఆంధ్రప్రభ దినపత్రిక- 13, డిసెంబర్, 2017 న ప్రచురితం)




పంచదార పద్యం
వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలంలోని పెంచికల పేట నివాసులైన శ్రీమాన్ సుందర రాఘవాచార్యులవారు సహజ చమత్కార కవితాసమర్థులు. 1965 ప్రాంతంలో వారి కుమారుడి వివాహ సందర్భంగా పంచదార ఎక్కువ మోతాదులో అవసర పడింది. అప్పుడు కరువు మూలకంగా పంచదారకు కోఠా విధానం అమలులో ఉండేది. ఏదేని సందర్భాలలో అధిక మోతాదులో కావలసి వస్తే అర్జీ చేసుకున్న మీదట తహశీల్దారుగారు మంజూరు చేసుకొనే వెసులుబాటూ ఉండేది. ఆచార్యులవారు ఆ కారణంగా దొరగారికి రాసుకున్న విజ్ఞాపన పద్య రూపంలో సాగింది. పంచదార కోసం చేసుకొన్న ఆ దరఖాస్తులోని ఒక పద్యం:
శ్రీయుత తహశీల్దారూ
చేయు మనవి సుతుని పెండ్లి చేయుట కొరకై
సాయము కావలె నాకును
ఈయవలె పంచదార ఇరువది సేరుల్
అధికారి ఆచార్యులవారి పద్యానికి ముగ్ధులై  మరో ఐదు సేరులు అధికంగా మంజూరు చేసినట్లు ఓ కథనం.
***


భాస్కర శతకానికి నకలు శతకంః

ప్రతి పద్యంలోనూ ఉదాహరణల సహితంగా ప్రతిపాదనలు ఉండటం భాస్కర శతకం ప్రత్యేకత. దీనినే 'ఉదాహరణ' ప్రక్రియగా గుర్తించారు సాహిత్యంలో.
ఉదాహరణకు,
ఊరక వచ్చు బాటు పడకుండిన నైన ఫలం బదృష్ట మే
పారగ గల్గువానికిఁ ; బ్రయాసము నొందిన దేవదానవుల్
వార లటుండగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెగాదె శృం
గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభ రత్నము రెండు
భాస్కరా!
ఏ పాటూ పడకుండానే  అన్నీ కలిసొస్తుంటాయి కొంతమందికి. అందుకు కారణం అదృష్టం. అది లేనప్పుడు ఎన్ని తిప్పలు పడినప్పటికీ ఫలితం సున్నా, నానాబాధలు పడి దేవతలు, రాక్షసులు  పాల సముద్రాన్ని మధిస్తే, మధ్యలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకు ఏ శ్రమ లేకుండానే అందాలరాశి మహాలక్ష్మి, అదనంగా కౌస్తుభమణి లభించాయి కదా!'- అని ఈ పద్యానికి అర్థం.
కవి ఆనుపానులు ఇతమిత్థంగా తేలక పోయినా దృష్టాంత ప్రక్రియ పరంగా సుమారు 500 ఏళ్ల పై బట్టి తెలుగువారి నోట పలుకుతున్న భాస్కర శతకంలోనిది ఈ పద్యం, పద్యాలలో కవి చూపించే ఉదాహరణలు రామాయణ, భారత, భాగవతాల వంటి  పసిద్ధ కావ్యాల నుంచి ఉదహరించినవి కాబట్టి చదువరుల మనసుల్లో అవి సూటిగా నాటుకొనేవి. అయినా  కంసాలిపల్లి ప్రౌఢకవి కంసాల సుబ్బకవిగారికి ఎందుకో భాస్కర శతకంలోని దృష్టాంతాల అన్వయం అంత  సవ్యంగా లేదనిపించింది! అంతకన్నా దివ్యమైన ఉదాహరణలతో అదే శతకాన్ని ఆసాంతం తిరగ రాసేసాడా చిఱుమఱ్ఱి నరసింహకవిగారి  శిష్యపరమాణువు. గురువుగారి చేత 'సుత్తెపోటు' కవిగా ప్రశంసలు అందుకున్న సుబ్బకవిగారు  భాసర శతకంలోని పై పద్యానికి సృష్టించిన నకలు  పద్యం: చిత్తగింజండి!
'ఊరక వచ్చు బాటు పడకుండిన నైన ఫలం బదృష్ట మే
పారగ గల్గువానికిఁ ; బ్రయాసమునంద బనెమి కానలో
గోరని ఋష్యశృంగుని దగుల్కొని కాంత లయోధ్య జేర్ప నీ
రేరుహగంధి శాంత నియరే! యెసలారగ నాడు భాస్కరా!
ఆడగాలంటేనే ఎరగని ఋష్యశృంగుణ్ని ఎంతో శ్రమించి  అయోధ్యకు చేర్చిన భామినులెవరికీ అతగాడి సంపర్క సుఖం అదృష్టం లేక దక్కలేదు. ఆ అదృష్టం పుష్కలంగా ఉంది కాబట్టే శాంతకు అతగాడితో దాంపత్య  సౌభాగ్యం దక్కింద'ని కవిగారి తీర్మానం. సుబ్బకవిగారు 'సుత్తెపోటు' కవిగారు అవునో.. కాదో ఎవరికి వారుగా తేల్చుకొవాలి మరి!
***



చేతికర్ర మీద విరహం
ఒకానొకప్పుడు పెద్దమనిషి వేషధారణ సాధారణ జనుల కన్నా విభిన్నంగా ఉండేది. చేతిలో కర్ర, కిర్రు చెప్పులు, భుజం మీద పట్టు అంచు కండువా.. చూడగానే పదిమందిలోనైనా ప్రత్యేకంగా కనిపించాలని ఈ ఆహార్యం. దురదృష్టం కొద్దీ.. శ్రీ పెరంబుదురు రాఘవాచార్యులు అనే పండితులవారు  చేతికర్రను ఎక్కడో పోగొట్టుకొన్నారు. ఆ బెత్తం విరహం భరించలేక  కవులు కాబట్టి ఓ పెద్ద ఖండకావ్యమే గిలికేసారా కవి పండితుడు. ఆ ఖండకావ్యంలోని ఆరంభం ఇలా సాగుతుందిః

'సమర గర్వోద్దిష్ట శాత్రవదోర్దండ-కండూతి బోవ జక్కాడినావు

గహన సంబంధ భీకర జంతు సంహార-కారణంబయి కీర్తి గాంచినావు

కౌలేయవర్గ దుష్కరవృత్తి దూలించి-జీవముల్ నిలిపి రక్షించినావు

మార్గమధ్వాన్వీత మహిత కంటకజాల-మును జిమ్మి పాదముల్ బ్రోచినావు

నిరత మద్దేహ రక్షణోన్నిద్ర భద్ర-మూర్తివని నమ్మి, పరులచే ముట్టనీయ
నైతి నను వీడి బోవ నీకతి ముదంబె బెత్తమా! కాదు పోవ నీకుత్తమంబు
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- 13, డిసెంబర్, 2017 న ప్రచురితం)


***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...