Friday, February 2, 2018

అన్నీ ఆ తాను ముక్కలేనా?! -కర్లపాలెం హనుమంతరావు






కాలం కలిసి వస్తోంది కమల దళానికి. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 'మోదీ.. షా' ద్వయం తమాషా బాగా నడుస్తోన్నది. ముస్లిం  పునాదుల మీద లేచిన పి.డి.పి(జమ్మూ&కశ్మీర్) నుంచి ద్రవిడ సంస్కృతికి కేంద్రంగా ఉన్న  తమిళనాడు వరకు.. ప్రస్తుతానికి 'నమో' మంత్రానికి  చింతకాయలు రాలుతున్నాయి. ముందు ముందు మరన్ని రాలే సూచనలున్నాయి.  విదేశీ మూలాలున్న  అధినేతలను కూడా ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయించే శక్తి  భాజపాకి ‘ మోదీ- షా’ మంత్రాంగం వల్ల కొత్తగా  సిద్ధించింది.
ఇందిర అత్యవసర పరిస్థితి (1975) కాలం నాటికి భాజపా మూల రూపం జన సంఘ్ ది నామమాత్రపు  ఉనికి. జయప్రకాశ్ నారాయణ అప్పటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కూడగట్టిన జనతా పార్టీలోకి మిగతా అన్ని చిన్న పక్షాల మాదిరే జన్ సంఘ్  అడుగు పెట్టింది. కాకపోతే జన్ సంఘ్ ఆ మిగతా  చిన్న పార్టీలకన్నా  విభిన్నమైన  పోకడలు పోయింది తదనంతరం.  తన  'కాంగ్రెస్ వ్యతిరేక'  ముద్రను  బలంగా కొనసాగించడం వల్ల  ఇవాళ్టి  మోదీ మార్కు 'భాజపా' రూపం సంతరించుకుంది.
భాజపా వాస్తవ అస్తిత్వం ప్రజాస్వామ్య విలువలలో కన్నా  హిందూత్వ సిద్ధాంతాలలోనే  కనిపిస్తుంది. 'మతవాద ఫాసిస్టు పారా మిలటరీ’గా వామపక్ష నేత  కామ్రేడ్ సుందరయ్య  పేర్కొన్న 'రాష్ట్రీయ స్వయం సేవక్' కు ప్రజాస్వామ్య ముసుగు  భారతీయ జనతా పార్టీ! ముస్లిముల ప్రాబల్యం అధికంగా  గల  ప్రాంతాలలో మైనారిటీ హిందువుల హక్కుల పరిరక్షణ కోసం  స్థాపించిన  జన సంఘ్ .. హిందువులే  మెజారిటీగా ఉన్న ప్రాంతాలలో సైతం ఇవాళ తన ప్రభంజనాన్ని కొనసాగించడం ఆశ్చర్యం కలిగించే విషయమే!   ఒకప్పట్టి తన మరగుజ్జు రూపాన్ని విసర్జించి.. ప్రస్తుతం  తన చుట్టూ గల మరగుజ్జు  పార్టీలను క్రమంగా కబళించే ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నది. ప్ర్రధాన ప్రతిపక్షంగా  గతంలో తాను ప్రవచించిన ధర్మపన్నాలన్నింటినీ  తానే కాలరాస్తున్నదన్న విమర్శ   భాజపా మీద చాలా కాలంగా రాజకీయంగా వెల్లువెత్తుతున్నదే! పార్టీ ప్రజాస్వామ్యంలో   రాజకీయ పక్షాల విమర్శలకు ఆట్టే విలువుండదు. ప్రజలు విశ్వసించాలి. అప్పుడే ఏ వాదనకైనా ప్రాణం వచ్చేది.
గతంలోనూ భాజపా కేంద్రకంగా ఎన్ డి యే కూటమి నిండు ఐదేళ్ల పాటు పాలన చేసిన సందర్బం లేకపోలేదు. కానీ వాజ్ పేయి నేతృత్వంలో సాగిన ఆ ప్రస్థానానికి.. మోదీ నాయకత్వంలో ప్రస్తుతం సాగుతున్న  ప్రస్థానానికి పోలికే లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికారమే పరమావధిగా సాగే రాజకీయ పోరాటాలలో విలువలను గురించి  చర్చించడం.. గొంగటి  బువ్వలో వెంట్రుకలు ఏరడం వంటిది! గతంలో కాంగ్రెస్ పార్టీ చూపించిన దారుల్లోనే ప్రస్తుతం భాజపా మరింత దూకుడుగా  ముందుకు పోతున్నదన్న వాదనా ఉంది. అదీ  పూర్తిగా కాదనలేని వాస్తవమేగా!
హిందూ ఆధిపత్య వాదానికి రాజకీయపక్ష రూపం  వివిధ ప్రాంతాలలో  విస్తరింప చేసే బాధ్యత   నిబద్ధతగల తన పూర్తికాల కార్యకర్తలకు సోపడం ఆరెస్సెస్ మొదటి నుంచి పాటిస్తోన్న నిర్మాణ కార్యక్రమాలలో ఒకటి.  అ క్రమంలోనే నలభై ఏళ్ల కిందట ఉత్తర భారతంలోని  హర్యానా, పంజాబ్, హెచ్.పి రాష్ట్రాల బాధ్యతలు మోదీకి అప్పగించబడ్డాయి.  వాజపేయి మొదటి స్వల్ప కాలిక ప్రభుత్వానికి అకాలీ దళ్ మద్దతు కూడగట్టడం అంత ఆషామాషాగా సాగిన వ్యవహారం కాదు అప్పట్లో. అసలు ఉనికిలోనే లేని భాజపాని విస్తృత ప్రజాసంబంధాల ద్వారా చండీగడ్ ప్రజానీకానికి పరిచయం చేసిన ఘనత మోదీదే. అప్పటి నగర పాలిక ఎన్నికల్లో అకాలీ దళ్ తో పొత్తు సుసాధ్యం చేయడం.. అఖండ విజయం సాధించడం..  తదుపరి లోక్ సభ ఎన్నికల్లోనూ చండీగడ్ ను   కైవశం చేసుకోవడం వంటి విన్యాసాల వెనకున్న మోదీ పట్టుదలను కొట్టిపారేయలేం.  పంజాబ్‌ రాష్ట్రంలో ఏర్పడిన   అకాలీదళ్ బిజెపి సంకీర్ణ ప్రభుత్వం వెనకా మోదీ నిరంతర  కృషి దాగి  ఉంది. హర్యానాలోనూ అదే విజయగాథ.  మోదీ బాధ్యతలు తీసుకొన్న 1995లకి  నాలుగేళ్ల ముందు   లోకసభ ఎన్నికలు జరిగాయి.  భాజపాది నిలబడిన పది సీట్లలో ఒక్కదానిలో మాత్రమే ధరావత్తు దక్కిన దీన స్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లకు గాను అతి కష్టం మీద కేవలం రెండు మాత్రమే సాధించిన దయనీయ పరిస్థితి. వాస్తవ పరిస్థితులను వెంటనే  ఆకళింపు చేసుకొనే ఇంగితం రాజకీయాల్లో నేతలకి ఎంతో అవసరం. ఆ ప్రత్యేక గ్రాహక సామర్థ్యం పుష్కలంగా ఉండబట్టే  పడబోయినప్పుడల్లా మోదీ తట్టుకొని లేచి నిలబెడుతున్నది ఇప్పటి దాకా. అప్పుడూ ఆ ఇంగితం వల్లనే  బన్సీలాల్ 'హర్యానా వికాస్ కాంగ్రెస్' తో పొత్తుకు సిద్ధపడి 1996 లోకసభ  ఎన్నికల్లో భాజపాకి  ఆరింట నాలుగు సీట్లు సాధించి పెట్టింది.  అసెంబ్లీలో సైతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది భాజపా. రాజకీయ పక్షాలకి అధికారమే పరమావధిగా ఉండితీరాలని గట్టిగా నమ్మే వర్గానికి చెందిన నేత మోదీ. ఆ  అధికారం నిలబెట్టుకొనేందుకే  బన్సీలాల్ కు  చెయ్యిచ్చి.. చౌతాలాతో చేయి కలిపేందుకు ఇసుమంతైనా జంకలేదు మోదీ. తాజాగా..  హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రహసనం వెనక  మోదీ నిర్వహించిన ప్రచ్చన్న  కీలక పాత్ర ఆ పాత మోడల్ నుంచి మెరుగు పెట్టినదే!
చిన్న పార్టీలని మింగి  బలపడటం జాతీయ పార్టీలకు కొత్తేమీ కాదీ దేశంలో. గతంలో కాంగ్రెసు చూపించిన బాటలోనే  భాజపా చురుకుగా  అడుగులు వేస్తున్నదిప్పుడు.
మతపరంగా హిందూ జనభా అధికం ఈ దేశంలో. మత విశ్వాసులలో  భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా  రాజ్యాదికారం దక్కించుకోవడం అత్యంత సులువైన మార్గం వాస్తవానికి. కానీ  ప్రజాస్వామిక, లౌకిక పునాదుల మీద మాత్రమే ప్రభుత్వాలను నడిపించుకోవాలని  సంకల్పం చెప్పుకున్న లౌకిక దేశం మనది. స్వతంత్ర బారతావని ప్రథమ ప్రధాని  జవహర్ లాల్ నెహ్రూ  పండిట్ వంశానికి చెందినప్పటికీ సోషలిష్టు భావాలు పుణికి పుచ్చుకున్న నేత. అనేక భావజాలాల సంగమ ప్రవాహంగా సాగే కాంగ్రెసును ఒకే తాటి మీద నడిపించే  శక్తి ఒక్క 'సెక్యులరిజం'లోనే ఉంటుంది  సహజంగానే!  హిందువులూ  తమను తాము భారతీయులలో ఒక అంతర్భాగంగా అంగీకరించిన నేపథ్యంలో.. మరో తరహా మతవాదానికి  ఆధిపత్యం కట్టబెట్టడం  అంత సులువు కాదు. 'భారతీయులంటేనే హిందువులు. అందుకు సమ్మతించని వారు ఈ దేశ పౌరులు కాబోరు' అనే మతకోణం నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ పూర్వ జన సంఘ్.  చాప కింద నీరులా ఆ మతవాదం  విస్తరిస్తూ వస్తున్నా   అయోధ్యలో ‘రామమందిర పుననిర్మాణం' ఓ ఉద్యమంలా ఉధృతమయే దాకా  జనసామాన్యానికి మతాన్నీ ఒక రాజకీయ  కోణంలో చూడాలన్న స్పృహ కలగింది లేదు.  వాజపేయి ఆధ్వర్యంలో ఎన్ డి యే  రాజ్యాధికారం అందుకోవడంలో  అంతకు ముందు అద్వానీ సారథ్యంలో సాగిన 'రథయాత్ర' ఒక ప్రధాన  ప్రేరేపణ. నాడు అద్వానీ బృందం  ఆరభించిన ఆ భావోద్వేగ ప్రధాన ఎత్తుగడలనే  నేడు 'మోదీ.. షా' ద్వయం  మరింత ఉధృతంగా ముందుకు  తీసుకొస్తున్నది.
యూపియే కూటమి పై గల వ్యతిరేకత కారణంగా మాత్రమే మరో  ప్రత్యామ్నాయం లేని  గత్యంతర పరిస్థితుల్లో జనం 2014 సాధారణ ఎన్నికల్లో మోదీ భాజపాకి అధికారం కట్టబెట్టింది.  ఎన్ డి యె కేంద్రంలో అధికారనికి వచ్చి మూడున్నరేండ్లు గడిచిపోయాయి. అయినా  భాజపా ముసుగు   మత ఎజెండా సామాన్యుడి అవగాహనలోకి సంపూర్ణంగా రావడమే  లేదు. తెర ముందు  ఊకదంపుడు ప్రజా ప్రయోజన పథకాల ముమ్మర ప్రచారం.  అవి విఫలమైన   ఆఖరి క్షణాల్లో గెలుపు కోసం కుల, మత, ప్రాంతాల పరమైన భావోద్వేగాలను సైతం రెచ్చగొట్టేందుకు సిద్ధపడడం! తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో చచ్చీ చెడిన మోదీకి చివరికి  అపజయాల గండం నుంచి బైట పడవేసింది ఈ తరహా అప్రజాస్వామిక  సెంటిమెంటల్ ‘పెట్టీ’ రాజకీయ ఎత్తుగడలే!  ఇప్పటి వరకు సాగిన అన్ని ఎన్నికలలో  ‘మోదీ-షా’ల బృందం ఈ తరహా  వ్యూహాలనే చాప కింద నీరులా అమలు చేసింది.  అస్సాం ఎన్నికల్లో విజయానికి   ఉపజాతి భావోద్వేగాలను  వాడుకొంది. మణిపూర్ లో అధికారం ఆ దారిలో పోయే చేజిక్కించుకొంది.  అదే మార్గంలో మరింత దూకుడుగా పోయి   మేఘాలయ, నాగాలాండ్, త్రిపురల్లో కూడా  పాగా వెయ్యాలని వ్యూహాలు పన్నుతున్నది ప్రస్తుతం. అస్సాంలో- అస్సాం  గణ పరిషద్, బోడో పీపుల్స్ ఫ్రంటులతో  కలిపి   'ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి'  మిషతో  కొత్త నాటకానికి తెర లేపింది..  కానీ అంతిమంగా అవసరమైతే ఎంత జాతి, మతపరమైన భావోద్వేగాలనయినా రెచ్చగొట్టేందుకు నిస్సందేహంగా  సిద్ధపడుతుందని గత అనుభవాలే తెలియచేస్తున్నాయి.
చిన్న పార్టీలకు పెద్ద గండమే!
గతంలో జాతీయ పార్టీలతో కలసి నడిచిన  చిల్లర పార్టీలు  అనంతర  కాలంలో  ఉనికిలో కూడా గల్లంతయ్యాయి. హర్యానాలో  వికాస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమై అంతర్దానమైంది.  అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం పార్టీదీ అదే దుస్థితి.  బన్సీలాల్  స్వీయ  ప్రయోజనాలకు విఘాతం ఏర్పడిందన్న కినుకతో  స్వంత కుంపటి మీద కాంగ్రెసుకి వ్యతిరేకంగా భాజపాకి వండి వార్చబోయాడు. చివరికేమయింది? నస్మరంతిగా కనుమరుగు అయిపోయాడు!
ప్రస్తుతానికి వస్తే..  
పంజాబులో అకాలీదళ్ తో బిజెపి చెలిమి సవ్యంగా సాగడం  లేదు. 1984 నాటి  సిక్కుల ఊచకోత  కేసును తిరగ దోడటం వెనక  సిక్కుల మనసు దోచుకోవాలన్న మత ఎజెండానే దాగుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈశాన్యంలో బిజెపితో చేతులు కలిపిన చిన్న పార్టీలకు ముందు ముందు ప్రాణగండం తప్పక పోవచ్చు.  కాశ్మీర్ లో బిజెపితో చేతులు కలిపిన పిడిపి ఇప్పటికే  మెజారిటీ ముస్లింల వ్యతిరేకతను ఎదుర్కోంటోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం భాజపాతో పడుతున్న తిప్పలు బైటికి చెప్పుకోలేనివి.   నాలుగు ఓట్లు రాల్చ గలిగిన సత్తా ఉంటే  చాలు..  ప్రజాస్వామ్యం, విలువలతో ప్రమేయం పెట్టుకోకుండా ఏ పార్టీతో అయినా అంట కాగేందుకు మోదీ-షా ద్వయం నిత్యం ప్రణాళికల సిద్ధం చేస్తోంది. తమిళనాడులో అన్నా డి.ఎం. కె, డి.యం.కెలతో భంగపాటు ఎదురైన తరువాత ప్రస్తుతం రజనీ కొత్త పార్టీ వైపు దృష్టి సారిస్తోంది.  తెలంగాణాలో పాటించే ఎత్తుగడలని గుప్పిట తెరవకుండా మూసి ఉంచింది. దిల్లీ సి.యం కేజ్రీవాల్ ని ఓ రాజకీయ  జోకరుగా అభాసు పాల్చేయడంలో భాజపా దాదాపు సఫలమయింది.  ఒడిషా బిజూ జనతా దళ్  ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ.  అయినా వచ్చే ఎన్నికల్లో దానికి  ప్రధాన ప్రత్యర్థిగా గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం పరిస్థితి కాస్త అటూ ఇటూగా ఉన్నా రాబోయే ఎన్నికల నాటికి మమతా బెనర్జీకి  ముచ్చెమటలు పట్టించనుందని  కొన్ని సర్వేలు హెచ్చరిస్తున్నాయి! మమత కూడా గతంలో ఎన్ డి యే లో భాగస్వామే. తెలివి కలది కనుక తొందరలోనే బైట పడింది.
తాజాగా ..
మహారాష్ట్రలో శివసేన ప్రస్తుతం తృణమూల్ బాటే పట్టి భాజపాతో సంబంధాలు పూర్తిగా తెగతెంపులు చేసుకొంది.   చిరకాలంగా మిత్రభావంతో  నమ్మకంగా మెలిగిన తమని నిర్లక్ష్యం చేస్తోందని శివసేన కినుక.  మైత్రిని నిర్లక్ష్యం చేయడంలోనూ రాబోయే  లోకసభ ఎన్నికలలో స్వంతంగా అత్యధిక స్థానాలలో  ఏమి చేసైనా గెలుపొందాలనే పాత 'మోది' ఎత్తుగడే దాగి ఉందని  ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
బైటికి 'కాంగ్రెస్ ముక్త భారత్' తమ ధ్యేయంగా చెప్పుకుంటున్నా .. వాస్తవంలో జరుగుతున్నది అందుకు విరుద్ధం. శత్రు మిత్ర బేధం లేకుండా ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ హననం చేసి ఆయా స్థానాలలో తమ హిందూ ఆధిపత్య భావజాలాన్ని శాశ్వతంగా సుస్థిర పరచుకోవడమే  అంతిమ లక్ష్యంగా ‘మోదీ- షా’ బృందం వేస్తున్న  అడుగులను బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగ బద్ధమైన అన్ని వ్యవస్థలలోనూ   అధికారపక్ష జోక్యం  ఇప్పుడుంటున్నంతగా మునుపెన్నడూ చూసి ఎరుగం- అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
విలువలకు రాజకీయాలు విడాకులు ఇచ్చి చాలా కాలమే అయిందన్నది ప్రజాస్వామ్యవాదుల వేదన. లాభసాటి పదవులను పాత తేదీ నుంచి కొనసాగించవచ్చన్న చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ హయాం నాటి యూపియే కూటమే కదా! ఆ క్లాజును అడ్దం పెట్టుకుని  కేజ్రీవాల్  సర్కారు తెచ్చిన బిల్లు తిరస్కరణకు గురయింది. తిరస్కరించిన అప్పటి అధ్యక్షులు పదవి నిర్వహణకు  ముందు.. తరువాత కూడా తన కాంగ్రెసు విధేయతను బహిరంగంగానే చాటుకున్నారు! చట్టబద్ధం కాని  పాలన కొనసాగుతున్నప్పుడు.. న్యాయపరంగా నిలవరించే స్వతంత్ర సంస్థ  న్యాయవవస్గ్థ.  హేతు బద్ధతను బోనులో నిలబెట్టి  ప్రశ్నించవలసిన ఆ అత్యున్నత వ్యవస్థే ఇప్పుడు  బోనులో నిలబడే పలు ప్రశ్నలకు స్పందించ వలసిన అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతున్నది!
 అన్నీ ఆ తానులో ముక్కలుగానే బైటపడుతున్నప్పుడు ఎవర్నని ప్రత్యేకంగా వేలెత్తి చూపడం?
 ***
కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకీయ వుట వ్యాసం- 03-02-2018-ప్రచురితం)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...