Tuesday, February 18, 2020

ఇస్లాం మతం -కర్లపాలెం హనుమంతరావు


వేరే మతాలలో ఉన్నంత మాత్రాన అన్యమతాలను గురించి ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోరాదని ఏమీ లేదుగా! ఆ తరహా అభిరుచి కలవారి కోసమే ఈ చిన్నవ్యాసం! ఇస్లాం మతాన్ని గురించి టూకీగా  తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళకు!


పుట్టింది కేవలం 1500 ఏళ్ల కిందట. కానీ ప్రపంచ జనాభాలో ఆరో శాతనికన్న కొంచెం ఎక్కువగా ఇప్పుడు విశ్వసిస్తున్నది ఇస్లాం మతం. ప్రపంచ జనాభా 652 కోట్లు అని లెక్కవేసిన 2004లో ముస్లిం మత విశ్వాసుల సంఖ్య 152 కోట్లు. ఇండొనేసియాలో మెజారిటీ మతం ఇస్లాం 21 కోట్ల 60 లక్షలు. సౌదీ అరేబియా, బహ్రేన్, వెస్ట్రన్ సహారాలలో వంద శాతం ముస్లిములే! టర్కీ, ఒమాన్, గాజా, యూ.ఎ.ఇ, సోమాలియా, ఇరాన్, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, గాజాస్ట్రిప్, కతర్, సెనెగల్, సిరియా, గాంబియా, మాలి లాంటి దేశాలు ఇంకా చాలా చిన్నవి పొన్నవీ ఉన్నాయి.. వాటిలో నూటికి తొంభై మంది ముసల్మాన్ మతస్తులే! భారతదేశంలో 109 కోట్లుగా ఉన్నప్పుడు ముస్లిం జనాభా15 కోట్ల 30 లక్షలు. జనాభాలో  ఏడో వంతు. (పాకిస్తాన్ జనాభా మరో 70 లక్షలు మాత్రమే అధికం). ఇవన్నీ కొత్త శతాబ్దం తొలి దశకం అంచనాలు. తతిమ్మా అన్ని మతాల కన్నా ముస్లిం జనాభా అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు లెక్కలు వేసుకుని చెబుతున్నాయి.

ఇస్లాం అనే పదం అరబిక్ భాషలోని 'స్లం' అనే అక్షరం నుంచి పుట్టింది. మనసుని, బుద్ధిని భగవంతుని పరం చేసి సాధించే శాంతిని 'స్లం' అంటారు. ముస్లిం అంటే బుద్ధిని సర్వేశ్వరుని పరం చేసిన వ్యక్తి. 'ఖుర్ ఆన్' వీరి పవిత్ర గ్రంథం. ఇందులోని సూక్తులన్ని స్వయంగా భగవంతుడు ప్రవక్తకు అందించినవిగా విశ్వాసం. 
ఇస్లాం ప్రవక్త పుట్టించిన మతం కాదని.. సృష్టి ఆది నుంచి ఉన్న మతాన్నే ప్రవక్త ద్వారా ప్రపంచానికి తెలియచేసాడని మత పెద్దలు భావిస్తారు. తన ముందు వచ్చిన ప్రవక్తలకు మల్లే ఇస్లాం మత సూత్రాలని ఏ కొద్దిమందికో కాకుండా ప్రపంచమానవాళి మొత్తానికి అందించిన కారణంగానే మహమ్మద్ ప్రవక్తకు ఎక్కువ ప్రాచుర్యం లభించినట్లు ఓ అభిప్రాయం.  
తాము నమ్ముతూ వస్తున్న మత భావాలకు విరుద్ధంగా హేతుబద్ధమైన సూత్రాలతో ప్రపంచాన్ని వేగంగా ఆకర్షించే మహమ్మదు ప్రవక్త మీద ఆ మత పెద్దలకు సహజంగానే కినుక. కినుక ఎక్కువ అయితే హింసకు దారితీస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మహమ్మదు మీదా, అతని అనుచరల మీదా హింసాకాండ పెచ్చుమీరడంతో మక్కాను వదిలి 'రెడ్ సీ' (ఎర్ర సముద్రం) మీదుగా అబిసీనియా(ఇప్పుడది ఇథియోపియా) చేరుకున్నాడు  మహమ్మద్. ప్రవక్తను అనుసరించిన నూటొక్క మంది అనుచరులలో 83 మంది పురుషులు, 18 మంది స్త్రీలు. అయినా మక్కాలో మహమ్మద్ కుటుంబాన్ని సంఘబహిష్కరణ చేసి హింసించింది మక్కా  మతపెద్దల గుంపు. ప్రవక్తకు అండగా ఉంటూ వచ్చిన పినతండ్రి  అబూ తాలిబ్, భార్య ఖదీజా మరణించిన విషాద కాలాన్ని ముసల్మానులు అముల్ హుజ్న్ (విషాద సంవత్సరం)గా పరిగణిస్తారు. ఆ తరువాతా మహమ్మద్ మీద హింస తగ్గింది కాదు. ఆ ప్రతికూల వాతావరణంలోనే మక్కావాసుల  భక్తి విశ్వాసాలను క్రమంగా చూరగొన్నాడు. సమీపంలోని  ఎస్రిబ్ నగరానికి వెళ్ళి భగవంతుని వాణిని వినిపించేందుకు సిద్ధమయాడు మహమ్మద్.  అక్కడి విరోధి వర్గాల మధ్యన సయోధ్య కుదిర్చి శాంతి వాతావరణం కలిపించి  తిరిగి మక్కా వెళ్లే సమయంలో రాత్రి వేళ హంతకుల మూఠా ఆయనను మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. తన స్థానంలో ఆలీ అనే అనుయాయి ఉండిపోవడంతో మహమ్మద్ కు ప్రాణగండం తప్పింది. ప్రాణమిత్రుడు అబూ బకర్  ఒక్కడినే వెంటపెట్టుకుని మదీనా చేరడంతో ఇస్లాం చరిత్రలో కొత్త శకం 'హిజ్రీ శకం'  ఆరంభమయింది. 
ప్రవక్త మక్కా నుంచి మదీనా వలసవెళ్లడం 'హిజ్రల్'గా చరిత్రలో ప్రసిద్ధం.  ప్రవక్త రాకతో ఎస్రిబ్ 'మదీన్నతుబీ' (ప్రవక్త నగరం)గా పేరు మారిపోయింది.  ఎస్రిబ్ నగరవాసులు ఎందరో ఇస్లాం మతంలోకి మారిపోయారు. 
బహుదేవతారాధకులకు/అవిశ్వాసులకు.. ఇస్లాం మతానుయాయులకు క్రీ.శ 624 నుంచి 627 దాకా మూడు యుద్ధాలు జరిగాయి. మక్కా మదీనాలకు మధ్యన నైరుతీ దిశలో సుమారు 136 కి.మీ దూరంలో ఉన్న 'బద్ర్' అనే స్థలంలో క్రీ.శ 624లో జరిగిన యుద్ధం ఇస్లాం చరిత్ర గతిని మార్చేసిన ఘట్టం.  అది హిజ్రీ శకం ఆరంభం అయిన రెండో ఏడాది.   ముస్లిములు ఈ యుద్ధంలో ఓడిపోతే ప్రపంచంలో ఇప్పుడు ఇస్లాం అన్న ఒక మతమే ఉండేది కాదు. ఈ మాట స్వయంగా మహమ్మద్ ప్రవక్త యుద్దసమయంలో అల్లాకు చేసుకున్న విన్నపం ద్వారా తెలుస్తుంది. సంఖ్యాపరంగా తక్కువ పరిణామంలో   ఉన్నా ఇస్లాం పక్షం విజయం సాధించడానికి ఆనాడు అల్లా ఆశీర్వాదమే కారణమని  నేటికీ ముస్లిములు భావిస్తారు. తరువాతి  రెండు ఏడాళ్లూ రెండు యుద్ధాలు వెంట వెంటనే జరిగాయి.. ఉహుద్ కొండప్రాంతంలో ఒకటి, మదీనా పరిసరాల ప్రాంతంలో రెండోది. ఈ రెండు యుద్ధాలలో లభించిన   విజయాల కారణంగా  మక్కా కూడా ఇస్లాం మతం స్వీకరించడంతో విగ్రహాలు అక్కరలేని 'కాబా' పూజా విధానం ప్రపంచమంతటా ఆల్లుకునేందుకు పునాది పడినట్లయింది. ప్రపంచ ముస్లిములకంతా ఇప్పుడు 'హజ్' ను పవిత్ర స్థలంగా భావిస్తున్నారు.  జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరవలసిన పుణ్యస్థలిగా విశ్వాసం బలపడుతూ వస్తోంది. ఈ హజ్ యాతకే మన తెలుగు సర్కారులు ముస్లిములకు ఉచిత పథకాలుఉ ప్రకటించడం! 
క్రీ.శ 632, జూన్ 8 న (హిజ్రీ శకం 11 వ సంవత్సరం, రబీవుల్ అవ్వల్ నెల 11వ తేదీ) మహమ్మద్ తన 23 ఏళ్ల ప్రవక్త జీవితాన్ని చాలించుకుని బౌతికంగా కనుమరుగయినప్పటికీ.. ఆయన  ప్రసాదించిన జ్ఞాన సంపదలు ఖుర్ ఆన్, సున్నత్ ప్రపంచగతిని ప్రతీ దేశంలోనూ అనుకూలంగాగానో, ప్రతికూలంగానో ఏదో విధంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయ్!
ఖుర్ ఆన్ ముస్లిముల పవిత్ర గ్రంథంగా మనందరికీ తెలుసును. 'సున్నత్'- ప్రవక్త నెలకొల్పిన సంప్రదాయాల సంకలనం. ఆఖరి రోజుల వరకు ఆయన  చేసిన బోధనలు 'హదీసు' పేరుతో సుప్రసిద్ధం. సమాధులను, గోరీలను పూజాలయాలు చేయవద్దన్నది మహమ్మది ప్రధాన ఆదేశం.
అల్లా ధర్మమని భావించిన దానినే తాను 'హలాల్' గాను, అధర్మని భావించిన దానిని 'హరామ్' గాను బోధించినట్లు చెబుతూనే దేనినీ తనకు వ్యక్తిగతంగా ఆపాదించే ప్రయత్నం చేయవద్దని మహమ్మద్ ప్రవక్త  సూచిస్తారు. 

కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఇస్లాం మతం పేరున చెలరేగుతున్న  అనుకూల, ప్రతికూల  సంఘటనలన్నీ మహమ్మద్ ప్రవక్త రూపంలో బోధించిన తీరుకు విరుద్ధంగానే సాగుతున్నవి. అదీ విచారకరం!
(అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరు వేంకటేశ్వరరావుగారు ప్రచురించిన 'పారమార్థిక పదకోశం.. ప్రేరణతో)
   రాసిన వ్యాసం. రచయితకు ఏ తరహా ఉద్దేశాలు ఆపాదించవద్దని ప్రార్థన.)
-కర్లపాలెం హనుమంతరావు
18 -02 -2020





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...