Tuesday, April 20, 2021

ప్రమదల పునరుత్పత్తి హక్కులు- కోవిడ్ మహమ్మారి ప్రవేశంతో మరింత అధ్యాన్నం! --కర్లపాలెం హనుమంతరావు

 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా మహిళల్లో హింస, నిరుద్యోగమే కాదు..  లైంగిక పరమైన ఆరోగ్య సంరక్షణా కొరవడింది. ఫలితం.. పునరుత్పత్తి నాణ్యత దిగజారడం. 

మనదేశం వరకే చూసుకుందాం.  లభిస్తున్న గణాంకాలను బట్టి ప్రభుత్వ సేవల అసమానతలు, సమన్వయలోపాలు సుస్పష్టం. 

 

స్వీయ హక్కుల పట్ల ఆట్టే అవగాహన లేని సమూహాలలో స్త్రీలది ప్రథమ స్థానం. విద్య, రవాణా వంటి  ప్రాథమిక  సౌకర్యాల కల్పనలోనే సమన్వయ లోపాలు ఇంత స్పష్టమవుతున్నప్పుడు ఇక   ఆరోగ్య పరిరక్షణ పరంగా ప్రస్తుతముండే దైన్య పరిస్థితిపై కథనాలు రాసుకోడం  వృథా కాలయాపన. ఎబోలా, జికాల వంటి మహమ్మారులు విజృంభించిన తరుణంలో దెబ్బతిన్న మాతాశిశువుల ఆరోగ్య పరిస్థితులేవీ పాలకులకు కోవిడ్-19  సంక్షోభంలో పాఠాలు నేర్పించినట్లే  లేవు! మహిళల ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఆరోగ్య సంరక్షణ అత్యయిక పరిస్థితినీ ఎప్పటికి  గుర్తిస్తారో  మన  ప్రభువులు! 

 

కోవిడ్ అనంతర ప్రపంచంలో మహిళలను మళ్లా వారి మానానికి వారిని విడిచిపెడితే మానవజాతి మనుగడకే మొత్తంగా ప్రమాదం. స్త్రీల పునరుత్పత్తి సమస్యలు స్త్రీలకు మాత్రమే  పరిమితం కాదు. 

  అంశం చుట్టూతా అనేక సమస్యలు మూగున్నాయి; వాటిలో చట్ట సంబంధమైనవే కాదు, నైతికపరమైనవి కూడా ఉన్నాయి. వాటిని గురించే ఈ క్షోభంతా!

 

జనాభాలో సగంగా ఉన్న స్త్రీ జాతికి నేటికీ తన కుటుంబ పరిణామాన్ని   నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు!   సహజ న్యాయాన్నీ ఒక  హక్కుగా  స్త్రీలు  దేబిరించే దశకు తెచ్చిన ఈ మగ ప్రపంచాన్ని ఏం చేసినా తప్పులేదు!

 

కనే బాధ్యత మాత్రమే అప్పగించేసి .. ఎంత మందిని, ఏ సమయంలో ప్రసవించాలో,  సంతానాన్ని ఏ   తీరున పెంచాలో అన్న  కీలకమైన నిర్ణయాలను ఇంటి పెద్దలు తామే  పుచ్చేసుకున్నారు!   గుడ్లప్పగించి చూసే దైన్యమే  ఆధునిక స్త్రీ దైనా!

 

కరోనా మహమ్మారి కారణంగా ఉనికిలోకి వచ్చిన లాక్ డౌన్ వాతావరణంలో మహిళ పరిస్థితి మరింత దయనీయం.  ముఖ్యంగా పునరుత్పత్తి పరంగా!

 

జాతీయ మహిళా కమీషన్ దగ్గర నమోదయిన గృహహింస ఫిర్యాదుల పెరుగుదల చూస్తే గుండెలు అవిసిపోతాయి. తక్షణ సహాయం అందే పరిస్థితులు కరువైన లాక్-డౌన్ వాతావరణంలో మెజారిటీ స్త్రీల వ్యథలు పడకటింటి నుంచే మొదలు!  జాతీయ మహిళా కమీషన్ లో గృహహింస    బాధితుల సౌకర్యార్థం   వాట్సప్ విభాగం ఓటి  ప్రత్యేకంగా ఏర్పడటమే  దిగజారిన పరిస్థితులకు దర్పణం.  

 

గృహహింస అంటే కేవలం దేహం మీద జరిగే బౌతిక దాడి ఒక్కటే కాదుగా! ఆంక్షలు, ఆరోగ్య రక్షణకు ఆటంకాలు, మానసిక పరంగా  వేధింపులు.. ఏ తరహా ఒత్తిళ్లయినా సరే  గృహహింస కిందకే వస్తాయి.  సన్నిహితంగా మసిలే జీవిత భాగస్వామి చేసేదయితే  ఆ హింస ప్రభావం మహిళ పునరుత్పత్తి  నాణ్యతను మరంత  తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణుల హెచ్చరిక కూడా  . 

కరోనా- 19 లాక్ డౌన్ వాతావరణం పునరుత్పత్తి ఆరోగ్య పరిస్థితులపై మహిళల  నియంత్రణ శక్తిని  మరంతగా  బలహీనపర్చినట్లు ఐక్యరాజ్య సమితి స్వయంగా నిర్ధారించడం  ఆందోళన కలిగిస్తుంది . సుమారు 12 మిలియన్ల మంది మహిళల గర్భనిరోధక వినియోగ చర్యలకు అంతరాయం ఏర్పడ్డట్లు  ఓ అంచనా. దీని ఫలితంగా 2020 అనంతరం కాలంలో సుమారు 1.4 మిలియన్ల అనాలోచిత గర్భధారణాలకు అవకాశం కలిగినట్లని ఆ నివేదికే తేటతెల్లం చేస్తోంది!

 

సమయానికి అందని కుటుంబ నియంత్రణ సేవలు, లాక్ డౌన్ కారణంగా విధించిన పరిమిత ప్రయాణాలు.. నిషేధాలు,  అవసరానికి అందుబాటుకు రాని  అనేక ఇతరేతర ఆరోగ్యసౌకర్యాల చలవ .. ఈ గందరగోళమంతా! 

 

 పునరుత్పత్తికి సంబంధించిన  హక్కులు, కుటుంబ నియంత్రణ.. గర్భస్రావం వంటి  సేవలను పొందే విషయమై  చట్టపరంగా ఉండే  హక్కులు  అన్నీ నామ్ కే వాస్తేనే!  వాస్తవ          లభ్యత విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన్నన.

 

 మనదేశం    వంటి  అభివృద్ది చెందుతున్న దేశాలలో సహజంగానే ప్రజలకు అందే ప్రభుత్వ సేవలు అరకొరగా ఉంటాయి  . అందులోనూ  తరాల తరబడి అణచివేతకు  గురవుతోన్న    స్త్రీజాతికి ..  ఆరోగ్య పరమైన లైంగిక  హక్కుల పట్ల               అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఈ క్రమంలోనే పునరుత్పత్తికి సంబంధించిన హక్కుల పరిజ్ఞాన లేమి అతివల అవాంఛిత గర్భధారణలకు  ముఖ్య కారణమవడం!

 

మొత్తం భారతీయ మహిళల్లో దాదాపు సగం మందికి గర్భనిరోధానికి  పాటించే  ఉపాయాలు తెలియవు; తెలిసినవారికేమో  వివిధ కారణాల వల్ల  ఆయా  సౌకర్యాలు బహుదూరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుటుంబాల నియంత్రణ   ప్రణాళికల్లో స్త్రీ భాగస్వామ్యం దాదాపు శూన్యం .. అదీ విడ్డూరం!

 

గర్భనిరోధ వినియోగం చుట్టూతా ఉన్న డేటానే  ఈ స్త్రీ స్వయంప్రతిపత్తి లోపానికి ఓ కీలక ఉదాహరణ. 'ఏ అపాయమూ లేకపోయినా వాసెక్టమీలకు కేవలం 0.3% మంది పురుషులు మాత్రమే సంసిద్ధమవుతున్న నేపథ్యంలో    వివాహిత మహిళల్లో హానికరమైనప్పటికీ నూటికి 36  మంది  స్టెరిలైజేషన్ ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారు!  

 

సంస్కృతీ సంప్రదాయాల పరంగా ఈ తరహా అంశాల మీద  బాహాటమైన చర్చలకు ఆస్కారం ఉండటంలేదు. అవివాహితులైన స్త్రీలకు ఏ విధమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించే అవసరం లేదనే ఒక నైతిక  భావన కద్దు,

 

కానీ  మారుతున్న కాలం ప్రభావం!   ఈ దేశంలో లైంగికపరంగా ప్రస్తుతం  చైతన్యం కలిగివున్న గ్రామీణ అవివాహితులే  27% ఉన్నట్లు అనధికార గణాంకాలు నిగ్గు తేలుస్తోన్న  నేపథ్యం! ఎంత సమర్థవంతమైన ఆరోగ్య సేవా కార్యకర్తలు ఉన్నప్పటికీ,  ఈ తరహా వర్గాలను  ఏ గణనలోకీ తీసుకోలేని   పక్షంలో, చర్చల ద్వారా  సాధించే సానుకూల ఫలితాంశాలు ప్రశ్నార్థకమే అవుతాయి కదా?

 

2020 లో దేశవ్యాప్తంగా కొనసాగిన లాక్ డౌన్ సమయంలో కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి ఆరోగ్య సేవా క్షేత్రాలు  తీవ్రంగా దెబ్బతిన్న మాటయితే  వాస్తవం. గృహ నిర్బంధ పరిస్థితుల  కారణంగా,  దేశంలో 25 మిలియన్ల జంటలకు గర్భనిరోధక సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. నిజం చెప్పాలంటే రాబోయే ఏడాదిన్నర కాలంలో భారతదేశం    జననాల విషయంలో రికార్డు నమోదుచేసుకునే అవకాశం దండిగా ఉందంటున్నారు ఆరోగ్య శాస్త్ర నిపుణులు!  

 

'అన్ని వర్గాలకు సమాన హక్కులు'  అని సర్వత్రా వినవస్తున్న   సామాజిక వ్యవస్థ నినాదమే మూహిళల    పునరుత్పత్తి హక్కుల అంశంలోనూఉంది. పునరుత్పత్తి  అతివ  జీవితాన్ని అత్యంత అధికంగా ప్రభావితం చేసే ప్రధాన అంశం. అందులో స్త్రీ   పురుషునితో సమానంగా స్వతంత్ర ప్రతిపత్తికై డిమాండ్ చేయడంలో  అసమంజసమేమీ లేదు.

పునరుత్పత్తికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం యావత్తూ ఆమెకు సకాలంలో అందుబాటులో ఉంచడం.. ఆ చైతన్యం ద్వారా ఆమె తీసుకునే పునరుత్పత్తి సంబంధమైన నిర్ణయాలను మన్నించగలగడం పురుష ప్రపంచం..  ముందు అహం చంపుకొనైనా అభ్యసించడం అవసరం. ఇది నేరుగా ఆర్థిక, సామాజిక పరంగా స్త్రీని  పురుషునితో సమానంగా ఎదిగే అవకాశం

కల్పించడమే!  స్త్రీల జీవితాల మీద స్తీలకు, స్త్రీ దేహం మీద స్త్రీకి మాత్రమే సర్వహక్కులు కల్పించినప్పుడే ఇది సాధ్యమయే సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం సాకారం అయ్యే ఆశ కనుచూపు మేరలో ఉండగానే కోవిడ్ - మహమ్మారి స్త్రీ జీవితాన్ని మరింత ఛిద్రం చేయడమే విషాదకరం!

-కర్లపాలెం హనుమంతరావు

18 04 -2020

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...