Saturday, March 4, 2017

నా నచ్చిన పుస్తకం లోని నాకు నచ్చిన చిన్న కథ- కాదేదీ నా కబుర్ల కనర్హం


ఒక అడవిలో మూడు చెట్లు. మూడింటికి మూడు కోరికలు.
మొదటి దానికి ఒక అందమయిన రాకుమారిపడక గదిలో అద్దం దగ్గర ఆమె తన విలువయిన ఆభరణాలు దాచుకునే అందమయిన నగిషీలు చెక్కబడిన చెక్క పెట్టెలాగా మారి అందరి దృష్టిని ఆకర్షించాలని అభిలాష .
రెండో చెట్టుకి ఒక బ్రహ్మాండమయిన నౌకలాగా మారి రాజులూ రాణులు విహరించే లాహిరి లాహిరి ఊయలగా మారాలని కోరిక.ప్రళయం వచ్చినప్పుడు జనాల ప్రాణాలను కాపాడే అవకాశం రావాలని కూడా దాని ఆశ .
మూడో దానికి మాత్రం ఈ ప్రపంచం లో అందరికన్నా ఏపుగా ఎదిగి తన జాతికి పేరు తీసుకురావాలని ఆశయం .
కొంత కాలానికి చెట్లు కొట్టేవాళ్ళొచ్చి అన్నింటి తో పాటు వాటినీనరికి తీసుకుని పోయారు.
మొదటి చెట్టు కొయ్య జంతువులకు ఆహారం పెట్టే చెక్క పెట్టె గా చెక్కబడింది.రెండోది చేపల తొట్టి. మూడోదాన్ని మరీ అన్యాయంగా చిన్న చిన్న పేళ్ళు గా కొట్టేసారు.
మూడు చెట్లు తమ దురదృష్టానికి దుఃఖపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేక పోయింది. 
కొంత కాలానికి జంతువుల కొష్టం లోకి ఒక ఆడమనిషి ప్రసవించటానికి వచ్చింది.పుట్టిన బిడ్డను ఆ గడ్డి తొట్టెలో పడుకోబెట్టింది.ప్రపంచం లోకెల్లా అత్యంత విలువయిన నిది తనలో వున్నట్లు తెలిసి ఆ చెక్క పెట్టె మురిసిపోయింది.
చాలా ఏళ్ల తరువాత ఆ బిడ్డ పెరిగి పెద్దయి ఒక నది వడ్డుకి వెళ్లి అక్కడి పడవలో పడుకున్నాడు.ఇంతలో పెను తుఫాను ఆరంభమయింది.పడవలోని మనిషి ప్రకృతి వైపు చూసి 'శాంతి శాంతి 'అని ఆదేశించాడు. ప్రకృతి శాంతించింది. ఆ క్షణంలో పడవకు అర్ధమయింది -తనలో పడుకున్నవాడు రాజు కాదు రాజులకు రాజు వంటి వాడని.
మరి కొంత కాలానికి అదే వ్యక్తిని శిలువ వేయటానికి కొయ్య పేళ్ళను ఏరుకుని వెళ్లారు కొంత మంది సైనికులు.
జీసస్ ను శిలువ వేసిన తన చెక్కలతో సహా చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు 
ఆ మూడో చెట్టు అందరికన్నా ఎక్కువగా మురిసిపోయింది.
ఆ రకంగా మూడు వృక్షాల ఆకాంక్షలను దేవుడి బిడ్డే స్వయంగా వచ్చి తీర్చాడు.
-యండమూరి వీరేంద్రనాథ్



దేవుడు వున్నాడా లేడా?... జీసస్ దేవుడి బిడ్డ అవునా కదా ? అని చర్చల లోకి వెళ్ళటానికి కాదు ఈ కథ ఇక్కడ ప్రస్తావించింది..
కల్పించే వూహా శక్తి వుండాలే కానీ...చెయ్యి తిరిగిన రచయిత దేనినయినా ఎంత అందంగా సమన్వయం చేయగలడోనని చెప్పటానికి!

(యండమూరి వీరేంద్రనాథ్ 'విజయానికి ఆరో మెట్టు' లో ఈ కథ కనిపించినప్పుడు ముందుగా నాకూ తట్టిన ఆలోచన ఇదే ! .ఇలాంటి చిత్రమయిన చిన్నచిన్న కథలు..ఆలోచనలను రేకెత్తించేవి ఆ పుస్తకం నిండా కోకొల్లలు. ఆసక్తి వున్న వాళ్ళు తప్పకుండ చదవదగిన వ్యక్తిత్వ వికాస సబంధంయిన మంచి ఉపయుక్తమయిన  పుస్తకం 
ఏది ఎలా వున్నా యండమూరివారి దగ్గరనుంచి మనం చాల చక్కని తెలుగు భాషను నేర్చుకోవచ్చు. ఇది .చదివేవారి సమయం వృధా పోదు  నాదీ గ్యారంటీ
-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...