Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Monday, February 15, 2021

అజ్ఞాన సమ్ 'ఉపార్జన’- సరదాగా - కర్లపాలెం హనుమంతరావు

 



" 'అజ్ఞానం' అంటే ఏంటి గురువా?"

" 'జ్ఞానం' అంటే ఏంటో తెలుసునా శిష్యా?"

"తెలియదు కనకనే కదా స్వామీ.. తమరి  దగ్గరికీ రాక!"

"ఆ తెలియక పోవడమే 'అజ్ఞానం' అని తెలుసుకో నాయనా"

"ధన్యుణ్ని. ఆ అజ్ఞానం స్వరూపం ఎలా ఉంటుందో కూడా కాస్త సెలవివ్వండి స్వామీ!’

" 'స్వ'  అనవద్దు బాలకా! అజ్ఞానం అవుతుంది.  ఆ విశేషణం నీ సొంతానికి వర్తించేది.   రాజకీయాలల్లో ఉంటే  మినహా డాంబిక పదప్రయోగాలు  హాని చేస్తాయ్. ఆ  తెలివిడి లేకపోవడం కూడా 'అజ్ఞానమే'"

"చిత్తం స్వామీ! ఆ 'అజ్ఞానం' ఎక్కడ ఉంటుందో  కూడా తమరే  వివరించి పుణ్యం కట్టుకోండి స్వామీ!"

గురువుగారు గడ్డం నివురుకున్నారు.

గురువుగారి గుబురు గడ్డంలో అజ్ఞానం  దాగుందని శిష్యుడికి అర్థమైపోయింది. అందుకే కాబోలు..  అంతుబట్టని ప్రశ్న ఎదురు పడ్డప్పుడల్లా గురువుగారిలాంటి బుద్ధిజీవులు గడ్డాలు గోక్కుంటుంటారు! సీదా సాదా జీవులకు మల్లే బుర్రలు గోక్కోరు, 

"గురూజీ! 'అజ్ఞానం' అంటే గాడిద గుడ్డు వంటిదని  ఎవరో  స్వాములవారా మధ్యో టీ.వీలో ప్రవచిస్తుండంగా  విన్నాను. అదెంత వరకు నిజం?"

" 'గాడిద' నిజం. 'గాడిద గుడ్డు' అబద్ధం. నిజం నుంచి పుట్టేన అబద్ధానికి 'గాడిద గుడ్డు' ఒక సంకేతంరా శుంఠా!  ఆ స్వామి వారన్న  మాట నూటికి నూటొక్కపాళ్లు  నిజమే!"

"మరి ఆ 'ఆజ్ఞానం' రుచికూడా ఎలా ఉంటుందో విశదపర్చండి గురూజీ?"

"'ఇంద' 

చిటికెడు పంచదార అప్పటికప్పుడు  గాలిలోనుంచి సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 'రుచి చెప్పు!' అన్నారు స్వామీజీ.

"తియ్యగా ఉంది స్వామీ!"

"ఇప్పుడు ఈ లోటాలోని కాఫీ ఓ గుక్కెడు  తాగి దాని రుచీ ఎలాగుందో చెప్పు!" అన్నారు. 

ఎప్పుడు ఎలా వచ్చాయో కాఫీ..!

కప్పు పెదాలకందించుకుని "కషాయంలాగా ఉంది స్వామీ!" అని  ముఖం చిట్లించాడు శిష్యుడు.

"'ఇంద" 

 ఈ సారి ఇంకో చిటికెడు ఉప్పు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 

“ఈ సారి కాఫీ రుచి చూడు! ఆదేశించారు గురువుగారు.

"భలే ఉంది స్వామీ!  కానీ ఏ రుచో చెప్పలేను"

"ఆ చెప్పలేక పోవడాన్నే అజ్ఞానంగా తెలుసుకోరా సన్నాసీ!"

ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్డం శిష్యుడి వంతయింది. 

''అయితే స్వామీ…"

"..అర్థమయింది. వాసన గురించే కదా నీ నెక్ట్స్ క్వశ్చన్? ఉనికిలో ఉన్నదానికైతే వాసనంటూ ఏదైనా ఉంటుంది కానీ.. అసలు ఉనికేలేని అజ్ఞానానికి  వాసనేముంటుందిరా అజ్ఞానీ!"అన్నారు గురూజీ!

శిష్యుడికి మెల్ల మెల్లగా బోధపడుతోంది  అజ్ఞానసారం. అయినా ఇంకా ఏదో ఇతమిత్థంగా తేలని సందేహం. 

"స్వామీ! ఆఖరి ప్రశ్న. జ్ఞానం సంపాదించేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు ఒంటికాలు మీద  జపం చేస్తుంటారు. నా వంటివాళ్ళు  మీ బోటి జ్ఞానుల పాదాల చెంత  చేరి తత్త్వబోధనలు వింటుంటారు. ఇంకొందరు గ్రంధపఠనం,  మరికొందరు ప్రపంచ పర్యటన.. ఇలా ఎవరికి తోచిన పద్ధతులు   వాళ్లు ఆచరిస్తుంటారు. జ్ఞానం వల్ల ఏదో మేలు లేకపోతే మరి ఇన్నేసి తంటాలు అవసరమా స్వామీ?"

''మంచి చెడ్డా.. లాభం నష్టం.. ఉచితం అనుచితం తెలుస్తాయి  కాబట్టి ఆ యాతనలేవో వాళ్లు అలా నిత్యం తలో రూపంలో పడుతుంటారురా బాలకా!"

"మరి అజ్ఞానం వల్ల ఏం ప్రయోజనం ఉందని  స్వామీ.. ఇంతమంది ఈ లోకంలో జ్ఞానసముపార్జనకు ఏ ప్రయత్నమూ చేయకుండా  మూర్ఖవర్గంలోనే ఉండిపోడానికి కొట్టుకు ఛస్తున్నారూ? ముఖ్యంగా మన రాజకీయ నాయకులు?"

"ఇదేరా భడవా.. అసలు సిసలు  అజ్ఞానభాండరమంటే! పొరుగువాడిని ప్రేమించు! నిత్యం సత్యమును మాత్రమే వచించు! ఆడవారిని తోబుట్టువులవలె గౌరవించు! పెద్దలమాట చద్దిమూటగా మన్నించు. ఆడి తప్పకుము. దొంగతనము చేయకుము. అహింస పరమ ధర్మము. జంతుహింస అమానవీయము. దుర్భాషలాడబోకుము! నీతి మార్గం వదలబోకుము!' వంటి మంచి సూక్తులన్నీ వింటూ కూర్చుంటే లోకంలో మనం ఎవరికీ  ఏ మంచీ చేయలేం. మనక్కూడా మనం ఏ మేలూ చేసుకోలేం. అడ్డదారిలో  గడ్డి కరిస్తేనే కదరా  బిడ్డా.. ఆదాయానికి మించిన ఆస్తులేవైనా  కూడబెట్టే  పట్టు దొరికేది! కొడుకులను.. కూతుళ్లను.. అల్లుళ్ళను.. కోడళ్ళను అందలమెక్కించకుండా అలా గాలికి వదిలేస్తే వాళ్లు అజ్ఞానం వల్ల చేసే అల్లరి చిల్లర్లతో సొంత ఇమేజి డేమేజవుతుంది కదా శిశువా?   పెద్దతనంలో  ఏ రోగమో రొప్పో వచ్చి   మంచాన పడ్డాక నీ ఏ మంచీ.. మన్నుగడ్డా పక్కగుడ్డలు మార్పించే  నాధుణ్ని రాబట్టలేదు. ఎక్కడెక్కడి రాబందులో సహేలీలు.. స్నేహితులంటూ  సంబంధాలు కలుపుకొని పొయస్ గార్డెన్లలోక్కూడా వచ్చి పాగా వేస్తారు.  సంపాదించుకున్న మంచి పేరుకు  తూట్లు పడతాయ్! సొంతానికంటూ ఆస్తులేవో పది రకాలుగా  కూడబెట్టుకుంటేనే కదరా అమాయకుడా ..  కోట్లు లక్షలు ఖర్చయ్యే ఎన్నికల గోదాట్లోకి దూకినప్పుడు గట్టెక్కగలిగేది! ఈదే పాదసేవకులకు సాయపడేదీ?  అక్రమార్కుడి మార్కు ప్రత్యర్థి అజ్ఞానుల్ని  పడగొట్టాలన్నా  చెడ్డదారి  తొక్కడం మినహా  మంచి మార్గం మరోటేమన్నా ఉందా మూర్ఖా?   ఇందాక నువ్వన్నావే.. ఆ  జ్ఞానం  గన్నీ బ్యాగులు ఎన్ని గుట్టలు  గడించినా  జీవితంలో  సాధించింది సున్నా.  ఇలా వివిధ   మంచి చెడ్డలను  తర్కిస్తూ   భావి చరిత్రకారుల దయాదాక్షిణ్యాల కోసం దేబిరించటం కన్నా.. పదవుల్లో    పచ్చగా  ఉన్నప్పుడే చరిత్ర పుటల్లో  పేర్రాయించుకునే దారులు వెదుక్కోవడం మేలు. ధనమూలం ఇదం జగత్! డబ్బుతో దెబ్బేయలేనిదేదీ లేదీ లోకంలో! జ్ఞానసముపార్జన ధనసంపాదన కాళ్లకడ్డంరా శుంఠా! ఏ ఎన్నికల కోడి ఎప్పుడు కూస్తుందో ఎవడికీ తెలియని రోజుల్లో  ఎన్నికల సంఘం కోడులకు జడుస్తూ కూర్చుంటే చివరికి మిగిలేది గోడుగోడుమనే ఏడుపులూ.. మొత్తుకోళ్లే! అజ్ఞానమే ఓటర్ల తత్త్వంగా తయారైనప్పుడు వాళ్ళు బుట్టలో పడటానికి తొక్కలోని   జ్ఞానమార్గం నమ్ముకుంటే  అంతకు మించిన అజ్ఞానం మరోటి ఉండదు. ఇప్పుడు చెప్పు! జ్ఞానానికా? అజ్ఞానానికా నీ ఓటు?" 

శిష్యుడు అప్పుడే మొలుస్తున్న గడ్డం నిమురుకోవడం మొదలు పెట్టాడు."కళ్లు తెరిపించారు గురూజీ! ధనమూలం ఇదం జగత్. సందేహం లేదు. కాబట్టే సర్వసంగపరిత్యాగులై ఉండీ తమబోంట్లు ఒక్కొక్క   ప్రశ్నకే  లక్ష చొప్పున భక్తుల నుంచి నిర్మొహమాటంగా గుంజుతున్నారు!   తమరి సంపాదనకు దొంగలెక్కలు రాయలేక నా రెక్కలు గుంజున్నాయి. ఏ శిష్యుడికైనా గురువు దారే అనుసరణీయం. అజ్ఞానుల వర్గంలో పోటీ తాకిడి మరీ ఎక్కువగా ఉంది స్వామీ! మరీ ముఖ్యంగా పొలిటికిల్ సర్కిల్లో.  నా బిడ్డలకూ బారెడు  గడ్డాలూ మీసాలు పెరిగి నాలుగైదు ఆశ్రమాలు.. టీ వీ ఛానెళ్లు  దొరికిందాకా.. చారెడు రూకలు సంపాదించుకోవాలి కదా! తమరిలాగా  అజ్ఞాన సమ్ 'ఉపార్జన'కే  నా ఓటు కూడానూ!" సభక్తిపూర్వకంగా చేతులు జోడించి  నిలబడ్డాడు శిష్యపరమాణువు.. 

***

కర్లపాలెం హనుమంతరావు 

16 -02 - 202| 

బోథెల్ ; యూఎస్ఎ


Wednesday, February 10, 2021

 



నమస్తేలోనే ఉంది సమస్తం

 

-కర్లపాలెం హనుమంతరావు

10 -02 -2021

 

నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.

న ‘మస్తే’ అంటే తల లేని వ్యవహారంగా కొద్దిమందికి వెటకారం. జోడించే వడుపు కుదరక  చేతులను  ఆడిపోసుకోవడమే అదంతా! 

తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవ్వంత కార్యలాభం కలిగింది కాదు.   ఆలస్యంగా వచ్చినా  నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన పాండవ మధ్యముడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహ లాభం. నిండు సభామధ్యంలో ఇట్లాంటివే ఏవో  దండకాలు.. స్తోత్రాలు చదివినందు వల్లనే   ఆ గాండీవుడి అర్థాంగికీ  రుక్మిణీవల్లభుడి సహోదరత్వం అండలా లభించింది. అందుకే,  ‘ఆఁ! దండాలూ దస్కాలా!’ అంటూ వెక్కిరింపుకలొద్దు! ఆ మస్కా జాతి  ట్రిక్కే ఎంత కోన్ కిస్కా గొట్టాన్నైనా ఇట్టే గుప్పెట్లో పట్టేసుకునే పట్టు!

రామాయణమే ప్రణయాంజలి ప్రభావాలకు పరమ  ప్రమాణం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అట్లా నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకు మించిన అపూర్వ గౌరవం ఆంజనీ పుత్రుడు కొట్టేసింది. ఉన్న ఒక్క తొండంతోనే  చేతనైనంత వరకూ సాగిలపడబట్టే కదా  ఆపదల మడుగు నుంచి గట్టెక్కగలిగింది    కరిరాజు గజేంద్రమోక్షంలో!

అదే చాయలో పోబట్టే అప్పట్లో మన పక్క రాష్ట్రం పన్నీరు సెల్వంసారూ.. అమ్మవారి అనుగ్రహం అమాంతం కొట్టేసారు. జయామ్మాళ్ ఆ రోజుల్లో  సర్కారువారి సత్కార గృహ(జైలు) యాత్రకెళ్ళినప్పుడల్లా  పన్నీరువారు ముఖ్యమంత్రి పీఠానికి ముఖ్యమైన  కాపలాదారు! ఆ తరహా ఎక్స్ట్రా లాభాలకు ఎల్ల వేళలా నమస్కార బాణాలే బ్యాగ్రౌండు నుంచి బాగా వర్కవుటయ్యేది కూడా.. బయటికి కనిపించవు కానీ!

స్వామివారు కంట బడ్డప్పుడు స్వాభిమానలవీ  పెట్టుకోడం కూడదు. 'నమో నమః' అంటూ సాష్టాంగ ప్రమాణాలు  ఆచరించకుంటే ఆ తరువాత జరిగే చేదు అనుభవాలకు ఎవరికి వారే బాధ్యులు.. యడ్యూరప్పే అందుకు గొప్ప  ఎగ్జాంపుల్!

పది తలలున్నాయి.. ఏం లాభం? ఉన్న రెండు చేతుల్నీ వేళకి సద్వినియోగం చేసుకునే  విద్య అలవడకే  అంత లావు రావణుడూ   రాముడి ముందు పిట్టలా రాలిపోయింది. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళ జాతి పతనానికి  ముఖ్య కారణం  ఈ దాసోహ  దాసోహం రాజకీయాలకు దాసోహం అనకపోవడమే!  రాక్షసులకు  తెలియని చమత్కారం మన రాజకీయ పక్షులకు మా  బాగా తెలుసు.  లేకుంటే మన ప్రజాస్వామ్యం  మరీ ఆర్ట్ మూవీకి మల్లే బోర్ కొట్టదూ!

కడుపులో ఎంత కంటయినా ఉండుగాక.. ఓ యాత్ర కంటూ బైలుదేరాక   దేవుడిచ్చిన రెండు చేతులూ  గోజుతో కరిపించినట్లు గాలిలో అట్లా ఊపుతూనే ఉండాలి.  జైలుకు వెళుతూ వస్తూ కూడా మన నేతాశ్రీలు పళ్ళికిస్తూ గాల్లోకి అలా వణక్కాలు గట్రా  వదలడం చూస్తున్నా .. ఇంకా వందనాల విలువను గూర్చి సందేహాలేనా! మీ కో నమస్కారం!

ప్రణామాలకు, వాగ్దానాల మాదిరి  కాలపరిమితి బెడద లేదు! నగదు బదిలీ.. రుణమాఫీలకు మల్లే   ఈ ప్రజాకర్షక పథకానికి పైసల్తోనూ బొత్తిగా నిమిత్తం లేదు.  ఏ ఎన్నికల సంఘం  అదుపూ.. అజమాయిషీ లేకుండానే రెక్కల్లో ఓపిక ఉన్నంత కాలం వాడుకుని ఆనక వదిలేసే  సౌకర్యం ఒక్క చేతుల జోడింపులోనే కద్దు. చెప్పిందేదీ చెయ్యకుండా  చెయ్యిచ్చే నేతలు సైతం ఈ  చేవిప్పులు(నమస్కారాలు) కెప్పుడూ చెయ్యివ్వని కారణం ‘చేవిప్పు’ మీద ‘విప్’ జారీ చేసే అధికారం ఏ పార్టీ ‘వివ్’  లకూ  లేకపోవడం!

ఎన్నికలు ఎప్పుడొచ్చినా  నరేంద్ర మోదీకి కలిసొచ్చే  అంశాల్లో  ప్రధానమైనది కుదించి పలికే ఆయనగారి పొట్టి పేరు ‘నమో’ ! ఓ వంక దెప్పుతూనే మరోవంక 'నమో.. నమో' అనక తప్పని  తలనొప్పులే  ప్రతిపక్షాల కెప్పుడూ.. పాపం పిటీ! 

పబ్లిగ్గా ఎంత పడతిట్టిపోసుకున్నా శాల్తీ కంటబడ్డప్పుడు ఏ సంకోచం లేకుండా కల్తీ లేని ‘నమస్తే’ ముద్రొకటి అభినయిస్తే చాలు.. సగం అభిప్రాయభేదాలు సాల్వ్ డ్! ప్రధాని మోదీ ఓం ప్రథమంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిప్పుడు సార్క్ దేశాధిపతులంతా మూకుమ్మడిగా  కలసి సాధించిందీ అదే!  ఎవరి బాణీలో వాళ్ళు  నమస్కార బాణాలు సంధించుకుంటూ సరికొత్త విదేశీ సంబంధాలకు బోణీ కొట్టడం!

జపాను పోనీ.. చైనా పోనీ.. అమెరికాతో సహా ఏ గడ్డ మీద  కాలు పడ్డా.. మన ప్రధాని మోదీని ఆదుకున్నవీ మొదట్నుంచీ చేతులే! తంపులమారి ట్రంపయినా   తప్పించుకోలేని అట్రాక్షన్ ప్రణామంలో ఉంది. 

'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అంటూ ఆ త్యాగరాజయ్యరువారంతటి వైతాళికులు ఊగిపోయారు. ఆరోగ్యాన్నిచ్చి, బంధుకృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడు అనే గదా ఆ పై నెక్కడో ఉండే  సూర్యుణ్ణి కూడా భగవానుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో రెండు పూటలా అలా పడీ పడీ సూర్యనమస్కారాలు చేసుకోడం!  

అర్హతలతో నిమిత్తం లేకుండా అందలం ఎక్కించి పదిమందిలో గుర్తింపు తెచ్చిపెట్టే  లోకబాంధవి నమస్కారం.  నిజానికి పడమటి ‘హాయ్.. హలో’ లకు మించి  ఇవ్వాలి ఈ నమస్కారానికి మనం గౌరవం. అందుకు విరుద్ధంగా లోకువ కట్టేస్తున్నాం.. అదీ విడ్డూరం! 

ఏ అరబ్బుల దేశంలోనో  పుట్టుంటే తెలిసుండేది మన  వందనాల విలువ.  ఖర్మ కాలి ఏ ఒసామానో  కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకు చావాల్సొచ్చేదక్కడ.  రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా.. ఎన్నేసి రకాల నామధేయాలండీ నమస్కారాలకు  మన పుణ్యభూమిలో!  'నమస్తే' అంటే 'వంగటం' అన్న ఒక్క  పిచ్చర్థం  మాత్రమే తీసుకుని పెడమొహం పెట్టేస్తే ఎట్లా?  పూరా నష్టపోతాం కదరా ఉన్న ఒక్క  ప్రపంచ స్థాయి గుర్తింపు  పిచ్చిగా వద్దనుకుంటే  సోదరా!

 అమెరికా అధ్యక్షులు ఎవరు ఇండియా వచ్చినా,  వెళ్ళిన  ప్రతి చోటా అదే పనిగా 'నమస్తే'లు కుమ్మేస్తారు. బిలియన్ డాలర్లు విలువ చేసే  బిజినెస్సులతో దేశీయ మార్కెట్లను  కమ్మేస్తారు.  

మనలను ఏలి పోయిన తెల్లవాడిదే తెలివంటే. మన నమస్కారమే మన పైన గడుసుగా సంధించేసి మన రాజుల్ని, నవాబుల్ని బుట్టలో వేసేశాడు! ఇంగ్లీషు వాడి  నమస్తేకి  పదిహేను వందలేళ్ల  గ్రంథం ఉంది. అదంతా మొదలు పెడితే ముందు మీరు నాకు నమస్కారం పెట్టేస్తారు!

తూర్పు పడమర్లు, ఉత్తర దక్షిణాలనే తేడా ఏముందిలే కాని

నమస్కారాన్ని కనిపెట్టిన మహానుభావుడికో నమస్కారమైతే.. దాన్నో ఆయుధంలా వడుపుగా వాడేసుకునే తాజా రాజకీయాలకు  వందలొందల నమస్కారాలు!


నమస్కారాన్ని నమ్ముకున్న వాడెన్నటికీ చెడే ఆస్కారం లేదు. 'దండమయా విశ్వంభర.. దండమయా పుండరీక దళనేత్ర హరీ..  దండమయా ఎపుడు నీకు.. దండము కృష్ణా!' అంటో దండక శతం ఆపకుండా గడగడ చదవ గలిగే గడుసు పిండానికి ఏ గండాలు రావు.  వచ్చినా రామచంద్రుడి ముందు   సముద్రుడంతటి వాడొచ్చి సంధించిన  బాణంలా అవి తీరం దాటి ప్రళయం సృష్టించబోవు.

గూగుల్ నుంచి ట్వట్టర్ దాకా  ‘నమస్కారం'   సృష్టిస్తోన్న  ప్రభంజనం  ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా ప్రణామ మాహాత్మ్యాల మీద సవాలక్ష సందేహాలంటే.. బాబూ .. తమకో నమస్కారం!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ


Saturday, February 6, 2021

తిట్టు!.. తిట్టించు! -సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 


వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే  ప్రజస్వాముల వాదం.  లక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.  

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!

తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చస్తార’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద ఆట్టే నమ్మకంలేదు.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకులెమ్మనే నాయకులంతా ఎన్నికల తుమ్ములు వదిలే వరకూ ‘ఓటర్లే దేవుళ్లు’ అంటూ అష్టోత్తరాలు, సహస్రనామాలు  అందుకునేది! నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయిని ఓ మెట్టు కిందికి దిగలాగడవేఁ!

కాసుల పురుషోత్తమం అని ఓ కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులిపేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులా! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మో అయితే, నువ్వే ఏదో  కామితార్థుడివన్నట్లు వీర పోజులా! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకుతో ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుకుంటివి కదా! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీకు ఎందుకయ్యా  పతితపావనుడుల్లాంటి   బిరుదులసలు? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ  దామోదరుడివవే(పనికిమాలినవాడివి) సుమా!’ అంటూంటే.. అది తిట్టో.. మెప్పో తెలీక  ఆ దేవుడు గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు!

దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు నుంచి భక్తుడికి ఠక్కున ఆఫరొచ్చే  జంపింగ్ జమానా ఇది మరి!

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో  మటుమాయం చేసుకోవచ్చు.  ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయలిప్పుడు మరీ పాతకాలం నాటి నాటురథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సాహపడే ఉత్సవ విగ్రహాలు కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా.. ఓటు మిషను మీట నొక్కే మనిషి కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పది, పదిహేనువేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే  పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ ‘స్టేటు’ దాకా ఎగదోసింది. మసిపూసి మారేడుకాయ చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమో గాని, కడుపు మండితే  ఓటరే ఉల్ఫాగా ఊరేగే నేతల ముఖాన కసి కొద్దీ బుడ్ల బుడ్ల సిరా పూసి సీన్లు ఖరాబు చేసే  రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడ పుట్ట బట్టే!  

పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్ బాగ్ చూసాం కదా! అన్నదాతల ఆగ్రహమూ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్టు?  తిట్టి పోసిన వర్గాల మీదనే ఏ అయోథ్య రామయ్యను మించిన వరాల జల్లులు! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు అధికార దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుంది కదా!  అయినా, తిట్లక్కూడాట్లు తెగే సత్యకాలమా.. మన  పిచ్చిగానీ?

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!’ అంటూ చెడ  తిట్టిపోసినా  దేవుళ్ళకూ చీమ కుట్టినట్లైనా నొప్పుండటంలేదిప్పుడు !  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరుతో నోరుజారారనో,  లైంగిక దృష్టితో చూసి వేధించారనో మనిషెంత మధనపడ్డాఅ.. యుద్ధకాండ సిద్ధపడ్డా .. నో బడీ కేర్స్!  కోర్టు బోనుల్లో నిలబడాల్సినవాళ్ళే కోర్టు జోన్ల తరలింపు మీద ప్రకటనలిచ్చేస్తున్నారు! ఎక్కడైనా శాపనార్థాలు వినపడుతున్నాయా? ‘దండుకునే సమయం’ దండగ కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా కూడా  ఉంటున్నదిప్పుడు!

దూర దూరంగా తగలడితే తూలనాడుకొనేటంత పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి మనం. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రావద్దంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్యనే గలాటా జరిగి మాటలు రువ్వుకుంటే.. వింటూ ఎంజాయ్ చేసిన మనం  ఈ నేలబారు నేతల కారుకూతలు  ఏమంత ఎబ్బెట్టనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!   

ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు మందలిస్తే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునూరుకున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట ఎదురు పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు గట్రా విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా మాత్ర్రం తిట్టు వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు మరికాస్త పదును నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనం సైతం తొక్కేసే మూడులో లేరిప్పుడు.  ఈ దుస్థితికి ఎవర్నని తిట్టుకోడం?!

 తిట్టే వాడి మీద వెగటు పుట్టటం మాట అటుంచి..తిట్టించుకొనేవాడి మానసిక పరిస్థితి మీద  వెకిలిగా తయారైన నకిలీ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయిప్పుడు!  వినే ఓటారే తిట్లు  వీనులకు విందనుకునే దశకు వచ్చేశాడు జుట్టూ జుట్టూ పట్టుకునే సీన్లుంటేనే చట్టసభలు సజావుగా సాగినట్లు లెక్క! సమయానికి   సభా ప్రసారాలు సడెన్ గా కట్ అయిపోతే సరదా కోసమా   జనం చిందులేసేదీ?! కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్ పబ్లిక్ బాధ!

కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ మాత్రమే చేసుకుని పరమపదిస్తే నరకంలో కూడా ఎవరూ కనీసం మడతమంచాలవీ వేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వాతలు అదనంగా  వడ్డిస్తారేమో కూడా.

అయినా బూతుపురాణాలన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగమహారాజులు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది! తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని కోట్లమందుంటారో  లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు మాత్రమే ప్రసాదంగా పెట్టించే  పై దేవుళ్ల మీద పెదవి విప్పకుండా    సాటి వాళ్లమనేగా మా మీదిన్ని సూటిపోటీ మాటలు?’ అని వాపోయే నేతలూ తక్కువేం లేరు మరి!

భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించే వేళ పశ్చిమం నుంచి బ్రహ్మముఖతః రౌద్రరసం ఉత్పన్నమయిందని శారదాతనయుడి 'భావప్రకాశం' వాదం. పోతనగారి ఆ ఆరభటీవృత్తి దక్షాధ్వర ఘట్ట ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే   కొత్త నేతల  హింస నచణ?  ఉత్తి పుణ్యానికే వేలెత్తి చూపటానికేనా పాపం ఓటుకు అన్నేసి వేలు దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిని మనసులో అడ్డగాడిదనుకుంటున్నా  ‘గాడ్..గాడ్” అంటూ కాళ్లట్టుకు వసుదేవుళ్లకు మించి  నేతలు వేళ్లాడేదీ?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?  

 

'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' న్నాడు .. 'కొత్త సిలబస్' అనే కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్ కవిత్వాలెప్పుడూ! కానీ  'కొత్త సిలబస్' ఈ కొత్త సెంచరీలో పాతబడిపోయింది.. ఇంకా పాతరేయద్దంటే ప్రగతి ఎట్లా?
బూతు ఉందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలమా? అని మనగలవమా? ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా బొంగరంలా గింగుర్లు కొట్టేదిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటేనే శనిగ్రహం  నిగ్రహం కోల్పోయేది!  స్వగృహం పడగ్గదిలోనయినా సరే చాటుగా ఓ నాలుగు మోటు మాటలు బై హార్ట్ చేసుకునే  బైటికి రావటం బుద్ధిమంతులకు  చాలా బెటర్  ఇప్పుడు! చక్రం తిప్పడమనే చాతుర్యం ఒక్క దాని  మీదే కసి పెంచుకుంటే చాలదీ అధికార కుతి కాలంలో! వక్రమార్గంలో అయినా సరే దానిని సంధించేందుకు ఒక్క క్షణం వెనుకంజ పడకూడదు. పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక పోతే పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితి లేదు ఏ స్థాయి నేతకైనా!.

 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో ''కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే అర్థాంతరంగా గండిపడిందంటారు.  నన్నెచోడుడూ కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపించ బట్టే  యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్నాడని మరో టాక్! తిట్టు వల్ల త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన తెగినట్లు లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా లేకుంటే మాత్రంకుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత పడేదీ కాలంలో. నీతుల నెలాగైనా వెనక్కు తీసుకోవచ్చు గానీ, బూతు కూతలకా వెసులుబాటు లేదీ కాలంలో. పెదవి దాటితే పృథివి దాటినట్లే! ఆ హెచ్చరిక గుర్తున్న ఉత్తర కుమారుడెప్పుడూ  ఉత్తుత్తి బీరాల జోలికి పోడు!  ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతల్లో ‘మాస్టర్స్’ చేస్తే తప్ప సింగిల్ సీటున్న ప్రజాసేనలో అయినా టిక్కెట్ దక్కే అవకాశం నిల్!  

అన్నది అన్నట్లు అరక్షణంలో ప్రపంచం చుట్టొచ్చేసే జెట్ యుగం రోజుల్లో జాతి పిత  బాపూజీ మూడు కోతుల నీతిబోధనలు నమ్ముక్కూర్చుంటే  మాజీ ప్రధాని మన్మోహన్ జీ కెరీరుకు మల్లే చాప్టర్ పూర్తిగా పర్మినెంటుగా క్లోజ్! బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనుకోడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనుకోడమంత అసంబద్ధం.

అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు.

ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని  సందిగ్ధమా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!

-కర్లపాలెం హనుమంతరావు

06 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

(సూర్యదినపత్రిక - ఆదివారం - వ్యంగం)

 

 

                           

Tuesday, February 2, 2021

                                                              


కలసి ఉంటే కలదా సుఖం?

జి. ఎస్ . దేవి

( కర్లపాలెం హనుమంతరావు )



అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కాకి. అదో రోజు ఆహారంకోసం వేటకుబైలుదేరింది. దారిలో దానికి ఒక గద్ద ఎదురయింది. "తమ్ముడూ! ఎక్కడికీప్రయాణం?" అని యోగక్షేమాలు ఆరాతీయడం మొదలుపెట్టింది. మాటల సందర్భంలో

కాకి వేటకు బైలుదేరినట్లు తెలుసుకుంది. "నాకూ ఇంటినిండా గంపెడు సంతానం.నేనూ నీకు తోడుగా వస్తాను. ఇద్దరం కలసి వేటాడుకుందాం. వేటలో సంపాదించినదేదో ఇద్దరం చెరి కాస్తా పంచుకుందాం. నీకు సమ్మతమైతే ఈ క్షణంనుంచే మనం స్నేహితులం" అని పొత్తు ప్రతిపాదించింది గద్ద.

కాకిదీ అదే ఆలోచన. పెద్దజాతి జీవాల మద్దతు ఉంటే తప్ప మనుగడకు ఆస్కారం లేకుండా ఉన్నాయి పరిస్థితులు. 'గద్ద పెద్దజాతి పక్షి. బలమైనది. వడి ఎక్కువ. ఎంత ఎత్తైనా ఎగరగలదు. ఎంత దూరంలో వున్నా ఆహారం స్పష్టంగా పసిగట్ట గలదు. దీనితో పొత్తు అంటే లాభమే, అదృష్టం కలిసొచ్చినట్లు ముందు గద్దే

పొత్తు ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఆలస్యం చేస్తే అవకాశం జారిపోవచ్చు'అనుకుంది. కాకి గద్ద స్నేహానికి వప్పుకుంది.

ఆ రోజు నుంచి కాకి, గద్ద మంచి స్నేహం చిగురించింది. రెండూ కలిసి వేటకు వెళ్ళేవి. వేటలో సంపాదించిందేదో ముందు అనుకున్న విధంగానే చెరిసగం పంచుకునేవి. 'కలసి వుంటే కలదు సుఖం' అనే సూత్రంలోని సుఖాన్నిస్వయంగా అనుభవిస్తూ సఖ్యంగా కాలక్షేపం చేస్తుండేవి.

పెద్ద పక్షితో కాకి సఖ్యత ఆ అడవిలోనే ఉన్న నక్కకు ఏమాత్రం నచ్చలేదు. ఎవరన్నా ఆనందంగా బతుకుతుంటే నక్కకు అసలు గిట్టదు. నక్క నైజం అది. దాన్నే కుళ్ళుమోతుతనం అంటుంటాం మనం. కాకి గద్దల మధ్య తంపులు పెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తోంది నక్క.

ఆ అవకాశం రానే వచ్చింది. నక్కకు ఒకసారి కాలికి గాయమై కదలలేని పరిస్థితి వచ్చిపడింది. ఆహారం దొరకడం దుర్లభంగా ఉంది. ఇదే అదనుగా అది తన ఉపాయాన్నిఆచరణలో పెట్టేందుకు పూనుకుంది.

కాకి, గద్ద వేటకు పోయే దారిలో మూలుగుతూ పడుకుంది. అటుగా వచ్చిన కాకి. గద్ద చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నత్లు కనిపించే నక్కను చూసి ఆగాయి.

"కాకి తమ్ముడూ! ఇక ఈ పూటకు వేట అక్కరలేదు. ఈ నక్క మనకు వారానికి సరిపడా ఆహారంగా సరిపోతుంది" అంది గద్ద.

కాకికీ అలాగే అనిపించింది. "అవునన్నా! మనం వేటాడేదే కడుపు నింపుకోవడానికే కదా! సరిపడినంత ఆహారం దొరికాక మరే ఇతర జంతువునైనా చంపడం అడవి న్యాయానికి కూడా విరుద్ధం. మా ఇంటికి ఇవాళ బంధువులు వచ్చి ఉన్నారు. 'అతిథి దేవో భవ'

అని కదా పెద్దల సూక్తి ! ఈ సారికి వేట జంతువు గుండెభాగం నన్ను తీసుకోనిస్తావా! బంధువుల్లో నా పరువు నిలబడుతుంది" అని కాకి అడిగింది . గద్దకూ అభ్యంతరం చెప్పాలనిపించ లేదు. 'సమయానికి ఆదుకోని స్నేహానికి అర్థం ఏముంటుంది!' అని పెద్ద మనసుతో ఆలోచించింది. 'సరే' అని సంతోషంగా ఒప్పుకుంది.

కాకి, గద్ద ఇంత సఖ్యంగా ఆహారం పంచుకోవాలనుకోవడం నక్క కేమాత్రం నచ్చింది కాదు. 'ఇద్దరి మధ్యా కుంపటి రాజేయడానికి ఇదే తగిన అదను' అని లోలోన ఒక కుతంత్రం ఆలోచించుకుంది.

బైటికి మాత్రం ప్రాణంపోయే బాధ నటిస్టూ "మీ ఇద్దరి మధ్య ఈ స్నేహం చూస్తుంటే నాకు దుఃఖం పొంగుకొస్తోంది. ఈ చివరి రోజుల్లో నేను చేసిన పాపాలు గురుకొచ్చి నా మీద నాకే రోత పుడుతోంది. వచ్చే జన్నలోనైనా మీ వంటిమంచి వారిలో ఒకటిగా పుట్టాలని మహా కోరికగా ఉంది. సాధ్యమైనంత తొందరగా నా ప్రాణాలు తీసేసుకోండి. నా శరీరం మీలాంటి ఉత్తములకు ఆహారంగా మారటం నించి గొప్ప అవకాశం ఇంకేముంది! నా పాపాలకు ఇట్లాగైనా పరిహారం దొరుకుతుందేమో! కాకపోతే నాదొకటే చిన్న విన్నపం. ఈ చివరి కోరికను మీరు ఇద్దరూ తప్పకుండా

మన్నిస్తారనే ఆశిస్తాను" అని బుడిబుడి రాగాలు తీయడం మొదలుపెట్టింది.

"ఎమిటా కోరిక?" అని అడిగింది గద్ద.

"నా దేహంలోని గుండె భాగాన్ని నువ్వే తీసుకోవాలి గద్ద బావా! అతిముఖ్యమైన గుండె భాగం కాకిలాంటి నీచ జంతువు పాలపడితే నాకు వచ్చే జన్మలో ఉత్తమ జన్మ ఎలా దొరుకుతుంది?" అంది నక్క.

నక్క మాటలకు కాకి మనసు చివుక్కుమంది. తనను నీచమైన జంతువు అనడం-ఎక్కడాలేని కోపం తెప్పించింది. "సృష్టి లోని జీవులన్నీ సమానమైనవే. వాటిని సృష్టించే సమయంలో ఒకటి ఎక్కువ.. మరొకటి తక్కువ.. అని దేవుడైనా అనుకుని ఉండడు. ఈ భేదభావాలన్నీ మనకుగా మనం కల్పించుకునేవే. అయినా మా కాకులకు మాత్రం ఏం తక్కువ? అని తగవుకి దిగింది కాకి

."అలా కాదులే కాకిబావా! 'పక్షీనాం కాకి ఛండాలి-పక్షులన్నింటిలోనూ కాకి అతి నీచమైన జీవి' అని కదా

శాస్త్రాలు చెబుతున్నాయి!"అని నయగారాలు పోవడం మొదలుపెట్టింది నక్క.

"మనుషులది ఉత్తమ జన్మ అని కదా మీరనే ఆ శాస్త్రాలు చెబుతున్నది కూడా! అలాంటి మానవులు కూడా మరి చనిపోయిన తరువాత తమ పిండాలని ముందుగా మా కాకులే

తినాలని కోరుకుంటారు. మా గొప్పతనానికి ఇంతకు మించి వేరే నిదర్శనం ఏముంటుంది? ఇంకా ఈ గద్దంటేనే లోకులకు లోకువ. ప్రాణాలు పూర్తిగా పోకముందే కళేబరాలకోసం పైన ఆకాశంలో గిరిటీలు కొడుతుంటాయని అసహ్యం. ఈ గద్దలంటే మనుషులకు యమదూతలకన్నా రోత." అంది కాకి ఆ కోపంలో.

ఎవరికైనా కోపం వస్తే అంతే. మెదడు నిగ్రహం కోల్పోతుంది. మంచి సంబంధాలను చేజేతులా చెడగొడుతుంది క్రోధం. ఇప్పుడు జరిగిందీ అదే. కాకి మాటలకి గద్దా కృద్ధురాలైంది "ఎంత సాహసం! పెద్ద జాతి పక్షిని. నన్ను పట్టుకుని ఇంతలేసి మాటలు అంటావా? జనం నిన్ను మాత్రం మన్నిస్తున్నారనిఅనుకుంటున్నావా? నీ నలుపు చూస్తే వాళ్ళకి ఎక్కడలేని జుగుప్స. నీ అరుపు వింటే అంతకు మించి అసహ్యం! నలుగురూ చేరి చేసే అల్లరిని మీ ' కాకి

గోల' తోనే పోలికపెట్టి చీదరించుకునేది! నీ బతుక్కు నువ్వా మా జాతిని వేలెత్తి చూపించేది! మేం విష్ణుమూర్తి వాహనానికి వారసులం. నక్క బావ చెప్పింది నిజమే. దైవాంశ మాది. బుద్ధితక్కువై నీతో జతకట్టాను. ఈక్షణంనుంచీ నీతో కచ్చి. నక్కబావ చివరి కోరిక మన్నించి తీరాల్సిందే. దానికి పుణ్యగతులు రావాలంటే గుండెభాగం నేనే తిని తీరాలి" అని అడ్దం తిరిగింది గృద్ధ౦..

కాకికి బక్కకోపం ఇంకా ఎక్కువైంది. నెత్తురు పీల్చి బతికే నీచజాతి

దోమకైనా.. 'చీ..పో' అని చీదరించుకుంటే కోపం రాకుండా ఉండదు కదా! ' ఆత్మగౌరవం’ అంటామే మనం.. అది అన్ని జీవులలోనూ ఉండే ఉంటుంది. అహానికి దెబ్బ తగిలితే అందుకే ఎవరికైనా రోషం తన్నుకొస్తుంది. అది సహజమే. ఆ రోషం

పెరిగితే ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ క్షణంలో హద్దులు తెలియవు. బుద్ధి సుద్దులు విననీయదు. జగడానికి దిగి ఆగడం ఆగడం జరిగి అన్నివిధాలా సర్వనాశనం అయిన తరువాతనే ఏ వీరంగాలేవైనా ఆగటం.

కాకి ఆత్మాభిమానమూ దెబ్బతిన్నది మరి. గద్ద ఆత్మగౌరవమూ గాయపడింది. ఇంత కాలం కలిసుంటూ ప్రదర్శించుకున్న పరస్పర సౌహార్దత అంతా కేవలం శుష్క ఆదర్శంగానే మిగిలిపోయింది రెండు పక్షుల మధ్య.

కాకి 'కావు.. కావు' మంటూ తన మూకను కేకలేసి మరీ పిలిచింది.

గద్ద మాత్రం గోళ్ళు ముడుచుకుని కూర్చుంటుందా? ఆ జాతి పక్షులన్నిటికీ పిలుపులు వెళ్ళాయి.

చూస్తున్నంతలోనే కాకులకూ.. గద్దలకూ మధ్య భీకర సంగ్రామం!

అంతా నక్కబావ సమ్ముఖంలోనే. నక్క జిత్తులమారితనం ఫలమే.

ఏ యుద్దంలోనైనా చివర్న తప్పనిసరిగా కనిపించే దృశ్యమే అక్కడా కనిపించింది.

క్షణాల్లో చచ్చిపడిన కాకులు.. గద్దలు! వాటి పీనుగ కుప్పలు! చావు తప్పి కన్నులొట్టపోయిన పక్షులు ఎటెటో ఎగిరివెళ్లిపోయాయి. 'కలసి ఉంటే కలదు సుఖం’ అన్న సూత్రం అంతరార్థం అర్థంచేసుకొనేందుకు ఇప్పుడు అక్కడ ఏ గద్దఅన్నగారూ లేరు. కాకి తమ్ములుంగారూ మిగిలిలేరు. ఉన్నదంతా ఒక్కజిత్తులమారి నక్క మాత్రమే. దానికి ఐదు సంవత్సరాలకు సరిపడినంత ఆహారం..”



"ఐదుసంవత్సరాలకు కాదు ! రెండున్నర సంవత్సరాలకు..”ఠక్కున ఎవరో పార్టీ కార్యకర్త సరిచేసాడు. ‘అవునవును’ అన్నట్లు తతిమ్మా కార్యకర్తలంతా వంతపాడారు.

ఉపాధ్యాయుడు తృప్తిగా తల ఊపాడు “కావాలనే ఐదు సంవత్సరాలని తప్పుగా చెప్పాను తమ్ముళ్లూ! తప్పును చక్కగా గుర్తించారందరూ! ఇదే పాఠం మీద మరో మూడు ప్రశ్నలు. వాటి మీదొచ్చే స్పందనలను బట్టే రేపొచ్చే ఎన్నికలలో మన పార్టీ తరుఫున మీకు దక్కే టిక్కెట్లు. ఈ కథకు తగ్గ పేరేమిటి?”

‘ప్రజాస్వామ్య అవస్థలో ఎన్నికల నాటకం.. ‘

“పొత్తుల ప్రహసనం జిత్తుల అసహనం”’

"గుడ్. బాగా లాగారు సెంట్రల్ పాయింట్! మరో ప్రశ్నః ఈ ఎన్నికల నాటకంలో మన పార్టీ ఏ పాత్రను పోషిస్తే ప్రహసనంలో అసహనం బాగా రక్తి కట్టేది?”

కాకి పేరు ఎంత చెత్త కార్యకర్తయినా చస్తే చెప్పడు. గద్ద పేరైనా వెరైటీ కోసం కొందరు కోరుకుంటారని గురువుగారు భావించారు, అన్నిరోజుల కంఠ శోష ప్రభావం.. వృథా పోలేదు! అందరూ ఏకగ్రీవంగా 'నక్క' పాత్రకే టిక్కెట్టేశారు.

సార్ తృప్తిగా తలాడిస్తూ “వారం రోజులగా సాగిన ఈ రాజకీయ శిక్షణా తరగతుల ఇంతటితో సమాప్తం.” అంటూ లేచి నిలబడ్డారు.

గుండెధైర్యం కాస్తంత ఎక్కువుండే ఓ  కార్యకర్త కలగజేసుకొని అందరి మెదళ్లను తొలిచే సందేహాన్ని బైటపెట్టాడు “మూడు ప్రశ్నలన్నారు, రెండే అడిగారేంటి గురూజీ..?! ఆ మొదటిది కూడా తెలిస్తే మా పీకులాట అణుగుతుంది కదా!”

ఆ పీకులాటకి జవాబు నాకే తేలలేదు ఇంత వరకు. అందుకే అడగలేదు బాబూ! ఆదిగారు కాబట్టి చెప్పక తప్పదు ప్రశ్న “గద్దలకూ కాకులకూ మధ్య పొత్తు ఈ కథలోనే కాదు.. అసలే కథలోనైనా కడ దాకా నిలుస్తుందా.. లేదా?” అన్నది  కథ ముందు నుంచి ఉన్న సందేహం”

హై కమాండుకే అంతుబట్టక తన్నుకులాడే ప్రశ్న! మీలో ఎవరికైనా ఏమైనా సవ్యవ్మైన సమాదానం తెలిస్తే చెప్పేయచ్చు! ఎవరి జావాబు సబబుగా అనిపిస్తే వాళ్లకే .. ఎన్నికలొస్తే గిస్తే.. ఎదుటి పక్షం నలబడనిస్తే.. గిసే.. జనం బడబడా ఓట్లన్నీ మనకే వేస్తే గీస్తే.. కోర్టుల్లో గిట్టనోళ్ళు కేసులెట్లాగూ వేస్తరు.. అవన్నీ గెలిస్తే గెలిస్తే .. అప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వంలో కొత్తగా ఎర్పాటు చెసైనా ఇచ్చే  ఆ మంత్రిత్వ శాఖకు పర్మినెంటుగా టెంపరరీ బాధ్యతలు వాళ్లకే!?  ఏం చెప్పండి తమ్ముళ్ళూ కావాలా ఆ పోర్టుఫోలియో?’

అంతటా పిన్ డ్రాప్ సైలెన్స్!

***

(సూర్య దినపత్రిక వ్యంగల్పిక)

 

Tuesday, January 19, 2021

నాస్తికుడికే రాజకీయం కావాలి -కర్లపాలెం హనుమంతరావు

 



ఆస్తికుడికి ఏ రాముడో, దైవదూతో, అల్లా పురుషుడు ఉంటాడు.. విన్నా వినకున్నా మొరపెట్టుకోవడానికి! దేవుడి ఉనికిని కొట్టిపారేసే నాస్తికుడి నసకు చెవి ఇచ్చే నాథుడు ఎక్కడుంటాడు? ఎవడి గోల వాడిదే.. ఎవడి బతుకు బండికి వాడే సారథి.. అని విశ్వసించే నాస్తికుడి ఈతి బాధల పరిష్కారానికి రాజకీయాలే గతి. ఒక చెంప రాముడో, రహీమో, క్రైస్తవమో  మన దుఃఖ జీవన సాగరం ఆవలి తీరానికి దారి చూపించే మార్గదర్శకులు అంటూ అనునిత్యం ఘోషిస్తూనే, మళ్లా ఆ రాముళ్లను, రహీములను, క్రీస్తూదేవుళ్లను దిక్కులేని వాళ్లుగా చేసేస్తున్నారని ఒకళ్ల మీద ఒకళ్లు నిప్పులు చల్లుకుంటున్నారు ఆస్తికులు. దేవుడు మనిషిని కాపాడుతున్నట్లా, మనిషే దేవుడి రక్షణకు కంచెగా నిలబడ్డట్లా అని అడిగే నిజాయితీ ప్రశ్నకు సజావుగా బదులు ఇవ్వకుండా ముక్కు చుట్టుడు మొక్కుబడి స్పందనేదో వెలిబుచ్చేసి ఆనక దేవుణ్ణి చిన్నబుచ్చేశాడని ఆగడాలకు దిగవచ్చు, అల్లర్లు ఎన్ని ఏళ్లయినా ఎడతెరిపిలేకుండా సందు దొరికినప్పుడల్లా చేసుకొనే సౌకర్యం ఆస్తికులకు కద్దు. నిజాన్ని నిజంగా తప్ప అబద్ధంగా అంగీకరించలేని అర్భకుడు నాస్తికుడికి.. ఏ దేవుడైనా ఎందుకు సాయపదతాడు? ఆ కారణం చేత కూడా నాస్తికుడు స్వంత బాధల పరిష్కారానికి స్వంతంగానే పూనుకోవాలి. పూనుకోవడం అంటే రాజకియం చేయడం అన్న మాటకు ప్రత్యామ్నాయ పదం. ఏతావాతా   నాస్తికులు ఈ భూప్రపంచం మీద రాజకీయాలు ఒక్కటే  నమ్ముకునేందుకు వీలైన దిక్కు. కాకపోతే అతగాడి పొలిటికల్ 'ఔట్ లుక్'.. ఆస్తికుడి 'ఇన్ సైడర్ వేదాంతం' కన్నా విభిన్నంగా , రుజుప్రవర్తనతో కూడుకుని ఉంటుంది. నాస్తికుడుకి  రాజకీయాలెందుకు? అని పెడసరంగా ఆడిగే ప్రబుద్ధులకు 'ఆస్తికుడికి మించి నాస్తికుడికే రాజకీయాలతో  ఎక్కువ సంపర్కం ఉండితీరాలి. ర్రాజకీయం అన్నమాటకు అర్థం రాజ్యానికి సంబంధించి నడిచే వ్యవహారం యావత్తూ.. అయినప్పుడు ఇహలోకం జీవనం మీద చులకన భావం ఉండే ఆస్తికుడికే అవసరమైన రాజకీయం ఈ లోకమే తన అసలు లోకం అని మనసా వాచా కర్మణా నమ్మే నాస్తికుడికి అక్కర్లేదా? ఏం వింత వాదన?

రాజకీయం అంటే మనుషుల సంక్షేమం కన్నా ముందు దేవుడి బాగోగులు చూడాలన్న వాదన కాదు. దేవుడు మనుషుల్ని సృష్టించాదన్నది కేవలం ఏ ఆధారం లేని పరంపరగా వస్తోన్న ఓ విశ్వాసం మాత్రమే. తాము చేసే ఏ ప్రకటనకు నమ్మదగ్గ రుజువులు చూపించలేని ఆస్తికుడి మల్లే కాదు నాస్తికుడు. దేవుణ్ని మనిషే సృష్టించాడన్న వాదానికి సవాలక్ష ఉదాహరణలు చూపించగలడు. అన్నీసజీవమైనవి, మన కళ్ల ముందు కళకళలాడుతో కనిపించవి. నిజ జీవితంలో నిజంగా ఏదన్నా  కష్టమొచ్చి నమ్ముకున్న దేవుడు ఎలా కాపాడతాడో తరుణోపాయం చెప్పమంటే అమాయకమైన భక్తుడిని అదే  పనిగా అన్నహారాలు గట్రా మానేసి (ఉపవాసాలు) భజనలు, సంకీర్తంలు, ప్రార్థనలు, నమాజులు చేసుకోమని చెప్పుకొస్తారు ఆయా మతపెద్దలు. ఈ తరహా పలాయనవాదాన్ని ప్రోత్సహించే జిత్తులు కాకుండా నాస్తికుడు 'నీ కష్టాలకు మూలం కూడా నువ్వే. నీ పిరికితనమో, లొంగుబాటో, అత్యాశో, తాహతకు మించిన కోరికో, సమాజం ఒప్పని నీతో, నిష్కారణమైన కడుపుమంటో, ఏ ప్రయోజనమూ సాధించలేని నిరాశో, పని చేసేందుకు బుద్ధిపుట్టని బద్ధకమో, తేరగా లబకం ఊడిపడలేదన్న దుఃఖమో, అర్హత లేని గౌరవం దక్కడం లేదన్న ఉక్రోషమో, చులకనగా చూసే వస్తువు శక్తివంతంగా మారి నిలదీస్తుందన్న కసో, పక్క శాల్టీ పైకి ఎదుగుతుందన్న కుళ్లుబుద్ధో.. ఏదో అయివుంటుంది. తీరికగా కూర్చుని, ఓపికగా తరచి చూసుకుని ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఏ కష్టమూ నిన్ను బాధించదు. నీవు కొని తెచ్చుకున్న రొచ్చులోకి లేని దేవుడిని  లాక్కువస్తే నీ సమస్య ఎన్నడికీ తీరదు. అంతా ఆ పైనున్న వాడే చూసుకుంటాడని  నీకు మెట్టవేదాంతం బోధించే స్వాములవారు కడుపునొప్పి వస్తే ఆ భారం భగవంతుడి ఒక్క డి మీదనే ఒదిలేయటం లేదు కదా! భక్తుల ఖర్చు మీదనో, ప్రభుత్వ పెద్దల సహకారంతోనో ఏ అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళ్లి భారీ బిల్లులు చెల్లించి నయంచేయించుకుంటున్నారు కదా! ఈ లోకం కష్టాలకు ఇక్కడే పరిష్కారం అని చేతలతో చూపించే స్వాములార్ల డొల్ల వేదాంతపు మాటలు నమ్మి కాళ్లుజాపుకు కూర్చోబట్టే కష్టాలు ఎన్నటికీ తీరడం లేదు.

రాజకీయాలంటే నిజానికి ఏమిటీ? రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అంటే మనమే రాజులం. మనకు చెందిన సంగతులన్నీ రాజకీయాలకు అవసరమే. ఆలాంటి నేపథ్యంలో 'దేవుడు లేడు. అదంతా నీ ఊహ' అన్నవాస్తవం చెప్పిన పాపానికి రాజకీయాలకు దూరంగా ఉండాలా నాస్తికుడు?  ఎంత 'నాస్ సెన్స్' గా ఉంది వాదన! వాస్తవానికి అన్నీ దేవుడు చూసుకుంటాడన్న బీరాలు పలికే ఆస్తికులే రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఏ దండకారణ్యాలకో వెళ్లి ముక్కు మూసుకుని తాము పరితపిస్తున్నట్లు నటించే మోక్షం కోసం నిక్షేపంగా అన్నహారాలు మానేసి జపతపాలు చేసుకోవాలి. నగరం నడిబొడ్డున ప్రభుత్వాలు దయచేసే అత్యంత ఖరీదైన భూముల్లో భక్తుల సొమ్ముతో విలాసవంతమైన వైభోగం తాము ఆనుభవిస్తూ అడుగడుగునా రాజకియాలలో జోక్యం జనాలకు అన్యాయం చేస్తున్నది ఎవరు?

నాస్తికులందరిదీ ఒకే అభిప్రాయం .. ఎప్పుడైనా.. ఎక్కడైనా!

'నీ జీవితానికి నీవే కర్తవు.. కర్మవు. కనక క్రియా పరంగా కూడా నీ చర్యలే సమస్యలకు పరిష్కారాలు అవుతాయన్నది ఆ  అభిప్రాయం. ఆస్తికుల మధ్యనే సవాలక్ష అభిప్రాయ భేదాలు. 'నా దేవుడు గొప్ప' అని ఒకడంటే.. 'నా దైవం అధీనమే ఈ జగత్ సర్వం' ఇంకొకడి వాదన. మా భగవంతుడికి అపచారం కలిగితే లోకాలన్నీ భగభగమని మండిపోవాల్సిందే!'అని ఒక ఆస్తికుడు బెదిరిస్తే.. మా మూలపురుషుడు లేచి వచ్చేస్తే సర్వం అనంతంలో బుడుంగుమని మునిగిపోవాల్సిందే!' అని సవాళ్లు! నిరాకారుడని చెప్పుకునే దేవుడికి కోపతాపాలు ఎందుకు వస్తాయో,  శాంతి కాముకుడని కోసే భగవంతుడు ఊచకోతలు ఎందుకు ప్రోత్సహిస్తాడో? నిరంజనుడైన ఆదిదేవుడికి అన్నేసి వేల మంది స్త్రీలతో సరసాలా? తృణప్రాయమైన జీవితాలకు బంగారు గొడుగులు, హంగు ఆర్భాటాలతో ఊరేగింపులా? నిజం చెబితే నిష్ఠురం గానీ.. దైవం పేరుతో దుష్ప్రచారమయ్యే  మత విబేధాలు, కులవివక్షల వల్ల కాదూ  మనిషి బతుకు  అవుతున్నది ఇవాళ వల్లకాడు?

రాజకీయాలంటే ఉన్న దూరూహవల్లనే ఇవాళ నాస్తికుడికి రాజకీయాలతో ఉండే సంబంధం ప్రశ్నకు గురవుతున్నది. వాస్తవానికి రాజకీయం అంటే రాజ్య పాలనా నిర్వహణ. ఈ ప్రభుత్వ నిర్వహణ మూడు దశలుగా సాగడం చరిత్రలో మనం చూస్తున్నాం. రాజపాలన,  నియంతృత్వం, ప్రజలు నిజమైన పెత్తందారులుగా నడిచే ప్రజాస్వామ్యం.

రాజరికంలో ప్ర్రజలు ఎలా నడుచుకోవాలో శాసించేది శాసనాల ద్వారా రాజు. నియంతల పాలనలో ఆ పని నియంతది. ఇక్కడ ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకపోయినా పాలకులు పెద్ద నష్టమేమీ లేదు. ఎదురుతిరిగిన బలహీనుణ్ణి, బలమైన వాడైతే బలహీనుణ్ణి చేసి ఆనక ఆడ్డు తొలగించుకొనేందుకు బోలెడంత సాధన సంపత్తి, మందీ మార్బలంతో సిద్ధంగా ఉంటాడు. ఈ రెండు వ్యవస్థలల్లో సామాన్యుడి గతి బ్రహ్మాస్త్రాన్ని చూసి అణిగుండే పిచ్చుక తీరే. రాజకు రాజ వంశంలో వాడే ప్రత్యామ్నాయం. నియంతకు తాను అనుకున్న మరో నియంత ఆ లోటు భర్తీ చేస్తాడు. ప్రజాస్వామ్యంలో నిజానికి నిర్వచనం ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన సాధ్యమయ్యే పాలన- అనే కాని.. నిజానికి ఆ ప్రజలు ఎవరు అన్నదే కీలకమైన ప్రశ్న. డబ్బు ఉన్నవాడు, మతం మీద పెత్తనం కలవాడు, జబ్బసత్తువ ఉన్నవాడు .. ఇలా ఎవరికి వాళ్లు తామే అసలైన ప్రజలం అని ప్రచారం చేసుకుంటూ తమకు సానుకూల పడే పనులు మాత్రమే ముందుకు సాగేందుకు దోహదపడుతుంటారు. విచిత్రమేమంటే.. ఏ సమాజంలో అయినా అత్యధిక శాతంగా ఉండేది ఆర్థికంగా అంత వెసులుబాటు లేనివాళ్లే! అయినా వాళ్ల ప్రయోజనాలు, జీవితాల అభివృద్ధి ఎవరికీపట్టవు. అందుకు వేరెవరినో నిందించాలని పనిలేదు. తమ లోపల ఉండే ఎన్నో బలహీనతలు, చాపల్యాలు, కల్పనలు, మూఢవిశ్వాసాలు, అనైతిక బంధాల పట్ల మోజు వంటి దుర్గుణాల సంకెళ్లయి ముందుకు కదలనీయవు. ఇట్లాంటి బంధనాలను అన్నింటినీ ఛేదించుకుని స్వంత జీవితాలలో ఎవరికీ అభ్యంతరకరం కాని పద్ధతిలో సుఖంగా జీవించే శక్తి నాస్తికుడికి ఉంటుంది. రాజకీయాలతో సంబంధమే కాదు.. రాజకీయాలను శాసించగల శక్తీ నిజానికి నాస్తికుడికే.

లొంగుబాటు ఆస్తికుడి తత్వం. బానిస ప్రవృత్తికి ఎక్కువ ఆస్కారం కల్పించే ఆస్తికులకు అందుకే రాజరికపాలన మీద, నియంతల కర్రపెత్తనం మీద మనసులో ఉండే  మోజు అప్పుడప్పుడు మాటల్లో వెల్లడవుతుంటుంది. 'ఎవరన్నా నియంత వస్తే గాని మన బతుకులు బాగుపడవు' అని ప్రకటించే ఆస్తికవాదిని చూడవచ్చును గాని ఆ పంథాలో ఆలోచించే నాస్తికుడిని ఎక్కడా చూడబోం. నాస్తికుడు అంటేనే స్వీయ శక్తి మీదనే అపారమైన విశ్వాసం కలవాడు. వాడి వల్ల కాకపోతే మరి ఆస్తికుల వల్ల మేలైన  ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందా? ఆస్తికుడి రాజకీయాలు స్వార్థప్రయోజనాలు సిద్ధింపచేసుకోవడం కోసం. నాస్తికుడి రాజకీయాలు ఖాయంగా జనహితంగా ఉండేటందుకు మాత్రమే సాగే వ్యూహాలు. నాస్తికత్వం అంటేనే స్వతంత్ర బుద్ధి.  లొంగుబాటుకు ఛస్తే లొంగని మనస్తత్వం. రాజరికం, నియంతృత్వం అంటే అసహనం ఉంటుంది కనక.. అతగాడి రాజకియాలు ఎప్పుడూ ప్రజాస్వామ్య వికాసానికి మాత్రమే తోడుపదేవి.

పుర్వకాలపు రాజరికాలు, నియంతల రాజాలు ఇప్పుడు ఎక్కువగా కనిపించవు. ఆ కారణం చేత సమాజంలో నాస్తికుల సంఖ్య గణనీయంగా పెరిగిందనడానికి నిదర్శనం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఆస్తిక లక్షణం లొంగుబాటు తత్వమే అయినా ప్రజలలో క్రమేపీ పెరుగుతున్న నాస్తిక భావనలు మెల్లగా రాజరికపాలనలు అంతమవడానికి దోహదపడుతున్నాయి. అయినా ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజలలో అధికశాతం నాస్తికులన్న నిర్ణయానికి రాకూడదు. ప్రభుత్వ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించే సామాన్యుడు ఈ ఆస్తిక, నాస్తిక ద్వైధీభావజాలం మధ్య  ఊగిసలాదుతున్నాడని మాత్రమే మనం చెప్పగలం. మనసులో నాస్తిక భావనలు ముప్పిరిగొంటున్నా బహిరంగా అంగీకరించేందుకు సిద్ధపడని హిపోక్రసీనే ప్రస్తుతమున్న ప్రపంచవ్యాప్త రాజకీయ వాతావరణం.

మన దేశంలోని పరిస్థితి ఈ  మూడ్(mood)కి ముమ్మూర్తులా అద్దం పడుతుంది. పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పటికి, వాస్తవంగా సామాన్యుడు తన జీవితాన్ని తానే సరిదిద్దుకునే స్థితిలో లేడు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఏదో ప్రజాస్వామ్య వాతావరణంలో ఉన్నట్లు ఊరట కలిగినా, ఒకసారి ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఓటరు మహాశయుడు నేరుగా రాజకీయ జోక్యం చేసుకొనే పరిస్థితి బొత్తిగా లేదు. కోరుకున్న పార్టీలకు తట్టుకుని నిలబడే శక్తి ఉండదు. బరిలో నిలబడిన పార్టీలలో అయినా జనం కోరుకోని వ్యక్తులే అధికంగా కనిపించే దుస్థితి. ఎవరో ఒకరు గెలవాలి కనుక గెలుస్తారు. ఒకసారి గెలుపొందిన తరువాత  విజేతకు ఇక మళ్లీ ఎన్నికలొచ్చిపడే వరకు జనంతో సంపర్కం ఉండనక్కర్లేని వ్యవస్థలు ఇప్పటివి.

నిజమైన నాస్తికవాది నిజమైన ప్రజాస్వామ్యప్ర్రేమిగా ఉండటం తప్పనిసరి. దిగాలుబడి కార్యంలేదు. నిందిస్తూ కూర్చున్నా  శౌర్యం అనిపించుకోదు. ఎవరూ కలసిరావడం లేదన్న నిరాశ నాస్తికుని మనస్తత్వానికి సరిపడదు. సమస్య ఏదైనా వర్ణిస్తూ కూర్చున్నందువల్ల తెమిలే వ్యవహారం కాదు. పరిష్కరించే దిశగా చర్యకు పూనుకోవాలి. అదీ తక్షణమే. ఆ భారం మరెవరి మీదనో వేసి నిబ్బరంగా ఉండకుండా మొదటి అడుగు తనదిగా ఉండేలా చూసుకోవడమే ఆసలైన నాస్తికుడి ప్రజాస్వామిక రాజకీయం.

నిజానికి నాడు స్వాతంత్ర్య సాధన దీక్ష దైవసంకల్పంతో సాగింది కాదు. మనం ఒప్పుకోం కానీ.. ఆసేతు హిమాచలం  కులమతాల తారతమ్యాలన్నింటిని తోసిరాజని మానవ సంకల్పంతో సాధించింది మాత్రమే దేశస్వాతంత్రం. స్వాతంత్ర్యం సిద్దించగానే అలవాటు బడ్ద ఆస్తికత్వంలోకి మళ్లీ తిరిగొచ్చేశాడు భారతీయుడు. బానిసత్వ లక్షణాలు తిరిగి పొడగట్టేసరికి  సరికొత్త నియంతలు ప్రజాప్రతినిధులపేరున  నెత్తికెక్కారు.  నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వాలనే మనం కోరుకుంటే ఆస్తికత్వ భావనలను పూజగది గడప దాటి రానీయవద్దు.

ప్రతి వయోజనుడి దగ్గర ఓటు అనే ఆయుధం ఒకటి ఉన్నా.. పేదరికం, బానిసత్వం వారసత్వపు ఆస్తులుగా వస్తూ ఉన్నాయి. చేతిలోఉన్న ఓటుతో కోరుకున్న జీవితం సాధించుకునే వీలున్నా దృష్టిని మళ్లించే ఆస్తికభావాలు నిత్యావసరాల జాబితోలో లేని కులాల, మతాల  మీదకు మళ్లిపోతున్నాయి.. మళ్లీ మళ్లీ! పేద జీవి ఓటు నిరుపయోగం చేసే బానిస భావాలను తొలగదోసుకుంటే తప్ప  సుఖమయ జీవితానికి అతి ప్రధానమైన విద్య, ఉపాధులు, సంక్షేమం, సౌభాగ్యం స్థానే కులం, మతం, వర్గం, వర్ణం, జాతి, నీతి వంటి అడ్డుగోడలు కూలిపోవు. చేతిలో అధిక ఓట్లు కలిగివుండీ పేరుకు పరిపాలకులే అయినా పేదలు తరాల తరబడి బానిసలుగా సమసిపోవడం, ఆస్తికవాదం బోధించినట్లు  తలరాతల వల్ల కాదు, పూర్వజన్మల ప్రారబ్దం వల్ల అంతకన్నా కాదు. గోరంతైనా ఆధారం చూపించ సాధ్యం కాని మాయామిథ్యావాదాలు కూరుతూ   చలనశీల మేధస్సును చక్కభజనల పాల్చేసుకోవడం వల్ల. పరలోక పథం పట్టిపోయిన ప్ర్రజాస్వామిక రథాన్నిప్పుడు ప్రజాకోటి భుజం మీదుగా  భూమార్గం పట్టించడమే అసలు సిసలు నాస్తిక రాజకీయ దృక్పథం. నాస్తికుల  ప్రజాస్వామికమే నిజమైన ప్రజాస్వామికం. సర్వ  మానవ సమానత్వం స్వేచ్ఛగామి ప్రజాప్రభుతకు మచ్చఅంటని  అద్దం. బానిసలు కనబడని ప్రజారాజ్యం నాస్తికుల భావజాలంతో మాత్రమే అందుకు సాధ్యం. సమానత, ప్రజాస్వామికత కలసి రావాలంతే నాస్తికుల భావ దృష్టి  పౌరలందరికీ ముందు అలవడాలి.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

19 -01 -2020

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...