Wednesday, August 19, 2015

నేరము- శిక్ష- గో తెలుగు కథానిక

                                                            
పగలు రాజ్యపాలన సాగిస్తూ రాత్రిళ్ళు మారువేషంలో సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను స్వయంగా పరిశీలించడం మహారాజు కృష్ణవర్మగారికి  అలవాటు. ఒకసారి ఇలాగే బాటసారి వేషంలో పర్యటిస్తూ రాత్రి చీకటి పడే వేళకు  నగర పొలిమేరల్లోని ఒక ఇంటితలుపు తట్టారు కృష్ణవర్మమహారాజు.

ఆ ఇల్లొక బీద బ్రాహ్మణుడిది. ప్రాచీన సంప్రదాయాలకు ప్రాణమిచ్చే కుంటుంబం అతనిది. ఉన్నంతలోనే చేతనైనంత అతిథి మర్యాదలు చేసాడా రాత్రి.

భోజనం ముగించి.. పడుకునే ముందు బాటసారికి, బ్రాహ్మణుడికి మధ్య చిన్నపాటి లోకాభిరామాయణం సాగింది.
మాటల సందర్భంలో బ్రాహ్మణుడు మారువేషంలోని కృష్ణవర్మమహారాజుతో  దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను ఏకరువు పెట్టి రాజుగారి పాలనను దుయ్యబట్టాడు.
అంతా సావకాశంగా విన్న రాజావారు "అన్ని కార్యాలూ రాజుగారే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమా! న్యాయ పర్యవేక్షణ, చట్టం అమలు వంటి  విభాగాల నిర్వహణకు అందుకే ఆయన ఎక్కడికక్కడ  ఉద్యోగులను నియమించారు కదా! వారి ప్రవర్తనల్లో లోపం కలిగితే ఆ దుష్ఫలితాలను రాజుకు ఆపాదించడం న్యాయం కాదు" అని  వాదనకు దిగారు.

"కావచ్చు కానీ.. ప్రజలకు వాటితో పనిలేదు. అంతంత లోతులు ఆలోచించ లేని అమాయకులకు వారు. సుఖంగా బతుకుతున్నప్పుడు రాజుగారి చలవ వలనే అని ఎలా నమ్ముతారో..  శాంతి భద్రతలు కరువైనప్పుడూ అలాగే  రాజుగారి వైపు  వేలెత్తి చూపిస్తారు. శరీరానికి  దెబ్బ తగిలితే.. గాయపరిచిన ఆయుధాన్ని కాకుండా.. ఆయుధాన్ని ప్రయోగించిన మనిషినే కదా మనం దూషిస్తాం! ఉద్యోగే అన్యాయం చేసినా.. అలాంటి దుర్మార్గుడికి అధికారం అప్పగించిన రాజే నిందను భరించక తప్పదు. సత్పరిపాలన అంటే సచ్చరితులను గుర్తించి సరైన పదవుల్లో నియోగించుకోవడమే" అన్నాడా బ్రాహ్మణుడు.

మహారాజుగారు ఆలోచనలో పడ్డారు.
"చెప్పడం సులభమేపదవి చేతిలోకొచ్చిన తరువాత గాని అసలు నైజం బైటపడదు.   ఎవరిదాకానో ఎందుకు.. మీకే గనక ఓ న్యాయాధికారి పదవి అప్పగిస్తే రాజుగారికే మచ్చా రాకుండా భాధ్యతలు నిర్వహించగలరా?" అని అడిగారు చివరికి.
బ్రాహ్మణుడే మాత్రం తొట్రు పడలేదు. "మహారాజు గారి నమ్మకాన్ని వమ్ము చేయననే అనుకుంటున్నాను" అన్నాడు. సంభాషణ అంతటితో ముగిసి పోయింది.

మర్నాడు ఆ బ్రాహ్మణుణ్ని కృష్ణవర్మమహారాజు కొలువుకి పిలిపించారు.
రాత్రి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది స్వయంగా మహారాజా వారే అని అప్పటికిగాని గ్రహింపుకి రాలేదు బ్రాహ్మణుడికి.

"నేటి నుంచి నగర న్యాయపాలనాధికారాలు తమకే అప్పగిస్తున్నాము. న్యాయం 'తు..' తప్పకుండా పాటించడ మెలాగో మీరు నిర్వహించి చూపించాలి. గడువు నెల రోజులుగాడి తప్పినట్లు ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా శిక్ష ఘోరంగా ఉంటుంది. తల కోటగుమ్మానికి వేలాడటం ఖాయం. బీరాలు పలికి చివరికి కార్యభీరువులయే వారంతా నేర్చుకోవాల్సిన పాఠ్యగ్రంథంగా పనికొస్తుంది. అంగీకారమైతే  వెంటనే అంగుళీయమును అందుకోవచ్చు" అని రాజముద్ర ఉన్న ఉంగరాన్ని  ముందుకు చాచారు కృష్ణవర్మ మహారాజు.

క్షణకాలం మాత్రమే ఆలోచన. ఆ రాజముద్రను అందుకుని భక్తిగా కళ్లకద్దుకొన్నాడు పేదబ్రాహ్మణుడు.
నగర కొత్తన్యాయాధికారిగా రామశాస్త్రిపేరు  ప్రకటింపబడింది. రామశాస్త్రి ఆ బ్రాహ్మణుడి పేరే.

సగం గడువు తీరిపోయింది. నగరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఇప్పుడు. మొదటి వారంలో రామశాస్త్రి దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలావరకు అక్కడికక్కడే పరిష్కరింపబడ్డాయి. దోషులను విచారించడంలోను, దండనలు విధించడంలోను, శిక్షల అమలును పర్యవేక్షించడంలోను.. రామశాస్త్రి చూపిస్తున్న నిజాయితీ, నిష్పక్షపాతం, నిబద్ధత రెండోవారంలోనే మంచి ఫలితాలు చూపించడం మొదలు పెట్టాయి. నేరస్తులు జంకుతున్నారు. నిందితులు తప్పించుకునే  కొత్తదారులు వెదుకుతున్నారు. శిక్షల రద్ధుకోసం పూర్వం  అవలంబించిన అడ్దదారులేవీ పనిచేయక ఇబ్బంది పడుతున్నారు బందీలు.
కొత్తన్యాయాధికారికి జనం  'జేజే'లు పలకడం నగరసంచారంలో  కృష్ణవర్మ మహారాజు స్వయంగా గమనించారు. మహారాజావారు రామశాస్త్రిని రాజ్యంమొత్తానికి శాశ్వత న్యాయాధికారిగా నియమించబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలో కొచ్చేసింది ఎలాగో!

అప్పుడు జరిగిందా విచిత్రం.

పనిమీద దేశాంతరం పోయిన ఒక వ్యాపారి అనుకోకుండా అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అమావాస్య కావడం వల్ల అప్పటికి చీకటి బాగా చిక్కపడి ఉంది. భార్య చాలా తాత్సారం చేసి గానీ తలుపు తీయలేదుఅనుమానం వచ్చిన భర్త ఇల్లంతా వెతికితే పడకగదిలో మంచం కింద మరొక మగమనిషి  నక్కి  కనిపించాడుతప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో వాడికీ, ఇంటియజమానికీ మధ్య పెద్ద పెనుగులాట అయింది. ఆ దెబ్బలాటలో కత్తిపోటుకి మగమనిషి ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ఇప్పుడు హతుడిభార్య  న్యాయం కావాలంటూ రామశాస్త్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

"ఆడమనిషి చనువు ఇవ్వకపోతే మొగవాడనే వాడికి అర్థరాత్రి  ఇంట దూరే ధైర్యం ఎక్కడినుంచి వస్తుంది? భర్త వుండీ పరాయి మగవాడితో పోవాలనుకునే ఆడదానికి పడాలి అసలైన శిక్ష.. ముందుగా" అని విగతజీవుడి భార్య వాదన.
కొట్టి పారేయదగింది కాదు.
"నాకే పాపమూ తెలీదు. మనిషి ముఖం కూడా  ఎన్నడూ చూసి ఎరగనువీడు ఎప్పుడు ఇంట్లోకొచ్చాడో..  పడకగదిలో మంచం కింద ఎందుకు దూరాడో అస్సలు   తెలీదునా బిడ్డమీద ఒట్టు. తలుపు ఆలస్యంగా తీయడానికి కారణం నేను మంచినిద్రలో వుండటమే. మా ఇంటాయన  సమయంలో వస్తాడని నేనేమన్నా కలగన్నానా?" అని భోరుమంది. కన్నబిడ్డమీద  ప్రమాణంకూడా చేసి చెప్పిందా ఇల్లాలు.
కల్లిబొల్లి కథలుగా  శంకించడం సబబు కాదు.
"నిజానికి ఆ దుర్మారుడే నన్ను చంపాలని చూసాడు. తప్పించుకునే ప్రయత్నంలో నేను కత్తి విసిరిన మాట నిజమే. కాని.. వాణ్ణి చంపాలన్న ఉద్దేశం ఏ కోశానా లేదు. గాయ పరిచి చట్టానికి పట్టిద్దామన్నదే నా ఆలోచన.   చేతికి గురి చూస్తే కత్తి  గొంతులో దిగబడింది.." అని పశ్చాత్తాపం ప్రకటించాడు ఇంటి యజమాని. ఆయనకు పరమ శాంతపరుడిగా చుట్టుపక్కల మంచి పేరుంది.
విచారణలో మాత్రం పొరపాటు జరిగినా అమాయకులు అన్యాయంగా బలైపోయే ప్రమాదం ఉంది.
రామశాస్త్రికి మొదటిసారి ధర్మసంకటం ఏర్పడింది.' న్యాయానికి భార్య ఉండీ.. పరాయిస్త్రీ కోసం వెంపర్లాడిన ఆ కాముకిడికి తగిన శిక్షే పడింది. కాని దాని పర్యవసానం  అమాయకురాలైన వాడి భార్యమీదా పడింది. వ్యాపారి భార్యమీద ఆరోపించిన కాముకత్వానికి రుజువులు లేవు. చట్టప్రకారం శిక్షించడం కుదరదు. సహజన్యాయం దృష్టితో చూస్తే.. తనకాపురంలో నిప్పులు పోయబోయిన దుర్మార్గుడిని ఆత్మగౌరవంగల మగవాడూ ఉత్తిపుణ్యానికి సహించి వదిలి పెట్టలేడు. నిజంగా వాణ్ని చంపినా వ్యాపారికి పాపం అంటుకోరాదు.

కాని ఇది న్యాయస్థానం. న్యాయం ఇక్కడ  కొన్నిచట్రాల పరిధిలో మాత్రమే ఇమిడి నిర్థారింపబడుతుంది.  కావాలని చేసినా.. అనుకోకుండా జరిగినా ఒక నిండుప్రాణం గాలిలో కలసిపోయింది. దానికి కారకుడైన వాడిని ఉపేక్షిస్తే సమాజం మొత్తానికి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఇదే అదనుగా తన మీద గుర్రుగా ఉన్న తతిమ్మా న్యాయాధిపతులు మహారాజుగారికి ఫిర్యాదులూ చేయవచ్చు.
తనతలను గురించి కాదుకానీ .. రాజ్యం మళ్ళీ పూర్వపుసంక్షోభంలో  చిక్కుకుంటుందేమోనన్నదే దిగులుముందు ముందు సమాజానికి  తలతో చేయవల్సిన సేవ ఎంతో వుంది. చిన్న కారణంగా పెద్ద సామాజికభాధ్యతనుంచి ఇలా తప్పుకోవాలనుకోవడం కార్యశీలుడి లక్షణం కాదు.'

ఆ రాత్రంతా ఎన్నో రకాలుగా ఆలోచించిన రామశాస్త్రి తెల్లారి చెప్పవలసిన తీర్పు మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. అప్పుడు గాని నిశ్చింతగా నిద్ర రాలేదు శాస్త్రికి.

మర్నాడు న్యాయస్థానంలో రామశాస్త్రి చెప్పిన తీర్పు ఎందరినో ఆశ్చర్య చకితులను చేసింది
'ఘటన పుర్వాపరాలు అతి సూక్ష్మంగా పరిశీలించిన పిమ్మట నేరం మొత్తానికి పూర్తి భాధ్యులు దేశాన్ని ఏలే కృష్ణవర్మమహారాజు గారే అని నిర్ధారించడమైనది. దేశాంతరం పోయిన చిరువ్యాపారి చేసే పని- తాను పండించిన కూరగాయలను కనీస ధరలకు అమ్ముకోవడం. దేశీయంగా తగిన మద్దతు దొరికితే ఎవరూ కుటుంబాన్ని అలా గాలికి వదిలి దేశాలుపట్టి పోరు.

మహారాజుగారి మరో నేరం మృతుడి దుర్మరణంస్వయంకృషితో నిమిత్తం లేకుండా సంపదలు వచ్చి పోగుపడే మిడిమేళపు వర్గం ఒకటి దేశంలో వర్ధిల్లుతున్నది. వారికి పొద్దు గడవడమే పెద్ద ఇబ్బంది. తిన్నదా అరగదు. కొవ్వా కరగాలి. అందుకే రకరకాల దోవల్లో యావలు తీర్చుకోవడానికి తాపత్రయపడుతుంటారు. సంసార స్త్రీలను ఉచ్చులోకి లాగేది ఇలాంటి నడమంత్రపు సిరిపోగైన వాళ్ళే. చట్టాలు వీరికి చుట్టాలు. న్యాయం ఆంటే మహా అలుసు దుర్మార్గులకి. పాపాత్ములకి శిక్షలూ పడని అస్తవ్యస్త వ్యవస్థకూ సర్వోన్నతాధికారి అయినందు వల్ల మహారాజుగారే భాద్యత వహించాలి'.

'కట్టుకున్న వాడితో కలసి   బతుకును పండించుకోవాలన్న ఒక్క ఆశతో మాత్రమే లలన మెట్టినింట్లోకి అడుగు పెట్టేది. కలకాలం పక్కనే ఉంటానని  ప్రమాణం చేసి మరీ చెయ్యందుకున్న  మగవాడు  కలలో తప్ప కనపడని  దుస్థితి దాపురిస్తే పడతులందరూ  ఒకే రీతిలో స్పందించరుకడుపు నిండిన వాడు అన్నం దొంగిలిస్తాడా? బిడ్డ ఖాళీ కడుపుకి కన్నవారిది నేరం ఎలాగో..  ఏలిన వారి దోషం ఇక్కడ అలాగా'.
‘మూడు తప్పులకూ మూలకారణం  మహారాజుల వారే కనక మరణ దండనే వారికి సరైన శిక్షనిందితుడే స్వయంగాబహిరంగంగా మహారాజావారి మీదకు  కత్తి విసిరాలి. తరువాత  నేరంమీద వ్యాపారికీ యథేచ్చగా ఉరిశిక్ష అమలు చేయవచ్చుహతుడి భార్య కోరుకుంటున్న న్యాయం కూడా  అప్పుడే సాధ్యమని న్యాయస్థానం భావిస్తున్నది'
రామశాస్త్రి తీర్పు పుట్టించినంచిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రజలు తీర్పుకి అనుకూలంగా.. ప్రతికూలంగా రెండు వర్గాలుగా చీలి వాదులాడుకోవడం మొదలు పెట్టారు. అంశం మహారాజుగారి మరణదండనకు సంబంధించింది కనక చర్చల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద తీవ్రంగా ఉంది. తీర్పులో ప్రస్తావించిన దేశీయ వ్యాపార ధోరణులు.. కలవారి విచ్చలవిడితరహా బతుకులు.. ఆడవారి జీవితాల్లో  జరుగుతున్న అన్యాయాల్లాంటి ఎన్నోసామాజిక సమస్యలు మేదావివర్గాల చర్చల్లో నలిగి నలిగి సామాన్య్లుల అవగాహనా స్థాయి పదును తేలింది. న్యాయస్థానాల్లో, శాంతిభద్రతల రక్షణ  యత్రాంగాల్లో అప్పటి వరకూ లోపాయికారీగా సాగుతోన్న అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం లాంటి ఎన్నో రుగ్మతలు ఇప్పుడు నిర్భయంగా బహిరంగ చర్చకు గురవుతున్నాయి.

రామశాస్త్రి కోరుకున్న చైతన్యం కూడా అదే.

మహారాజుగారూ  'తీర్పుకి కట్టుబడి ఉంటాన'ని ప్రకటించడంతో చట్టం ముందు అందరూ సమానమేనన్న సందేశం అత్యంత బలంగా సమాజానికి అందించినట్లయింది. న్యాయవ్యవస్థ పక్షపాతం మీద అప్పటిదాకా ధనికవర్గాలకున్న ధీమా మొత్తం  ఒక్కసారి కుప్పకూలింది.


రామశాస్త్రి తీర్పు అమలు చేయాల్సిన క్షణాలు రానే వచ్చాయి. బహిరంగ వధ్యశిల ఏర్పాటు చేయబడింది.  రాచపరివారం సమస్తం వెంటరాగా మహారాజుగారు శిక్షాస్థలికి అట్టహాసంగా తరలి వచ్చారు.

శిక్షలు విధించడమే తప్ప శిక్షలు అనుభవించే వ్యవస్థ రాచరికానికి కొత్త. చరిత్రలో సైతం ఎక్కడా జరిగినట్లు విని ఉండని  అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి జనసమూహాలో   వధ్యస్థలి దగ్గర విరగబడ్డాయి.

ఏ నోట విన్నా మహారాజుగారి మంచితనాన్ని గురించిన స్మరణే.  ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించే  కృష్ణవర్మ మహారాజుగారు వదిలేస్తున్న స్థానానికి వారసులు  ఎంతవరకు న్యాయంచేస్తారోనన్న అనుమానం. మహారాజుగారి పాలనలో కొన్ని పొరపాట్లు జరిగితే జరిగ ఉండవచ్చు. రామరాజ్యానికే ఈ మచ్చ తప్పలేదని రామాయణం చెబుతోంది.  రాములవారికేమైనా  ఇలాంటి దారుణమైన శిక్ష పడిందా?
చర్చలు ఇలా పలురకాలుగా సాగుతుండగానే.. చీకటి పడింది. తీర్పులో సూచించబడిన సమయానికి సరిగ్గా వ్యాపారిని మరణ వేదిక మీదకు తీసుకొచ్చారు. అతని చేతికి ఒక కత్తి ఇచ్చారు.
ఎదురుగా మొఖంమీద ముసుగుతో  చక్రవర్తులు..  ప్రాణాలు అర్పించడానికి సిద్ధబడి ధీరోదాత్తంగా  నిలబడి వున్నారు.

ప్రకటన వెలువడింది "వ్యాపారీ! అత్యున్నత న్యాయస్థానం ఆదేశం ప్రకారం నువ్వు మహారాజుగారి  మెడమీదకు కత్తి విసరాలి. ఒకే ఒక్క వేటుతో  మహారాజుగారి ప్రాణాలు  పోవాలి. విసురూ!"
అంతటా హాహాకారాలు.
 వజవజా వణుకుతూ చేతిలోని కత్తిని బలంగా విసిరాడు వ్యాపారి .  గురి తప్పనే తప్పింది.  మెడకు తగలాల్సిన కత్తి భుజానికి రాసుకుని కింద పడింది. తీర్పు ప్రకారం వ్యాపారికి ఇవ్వబడేది ఒకే ఒక్క అవకాశం కనక మహారాజుగారు సురక్షితం.
 అంతటా ఆనందంతో కేరింతలు.
 ప్రజాభిమానానికి  కదలి పోయారు కృష్ణవర్మ మహారాజు. ఇంతగా ప్రేమించే ప్రజలకు ఏమిస్తే రుణం తీరేను? జన సంక్షేమానికి మరింత  ప్రాథాన్యమివ్వాలని క్షణంలోనే  కృతనిశ్చయానికొచ్చారు  మహారాజు.
ఇదంతా రామశాస్త్రి చిత్రమైనతీర్పు  కలిగించిన బుద్ధివికాసం. "నిజమే కానీ.." అంటూ అప్పటి వరకూ తనను తొలుస్తున్న సందేహాన్ని రామశాస్త్రి ముందు బైట పెట్టారు మహారాజావారు "అర్థరాత్రి పరాయి యింట్లోకి ఆ దుర్మార్గుడు దూరింది ఎందుకో నిర్ధారణ కానేలేదు. ఇంటి ఇల్లాలు చరిత్ర ఎంత స్వచ్చమైందో  రుజువూ  కాలేదు.  వ్యాపారి 'దుర్మార్గుడిని కావాలని చంపలేదు.. నిర్దోషిన'ని బుకాయిస్తున్నాడు. మాటల్లోని  నిజాయితీ పాలైనా నిగ్గు తేల్చలేదు. తప్పుచేసిన వాళ్ళందరిని గాలికి వదిలేసి సంఘటనతో మాత్రం సంబంధం లేని… నాకా శిక్ష? ఆ  వ్యాపారి సుశిక్షితుడైన యోధుడు కాకపోబట్టి తడబడ్డాడులేకపోతే.."

మధ్యలోనే అందుకొని ముగించాడు రామశాస్త్రి "అతను తడబడ లేదు మహారాజా! గురి చూసే విసిరాడు. అది తప్పింది. అతని గురే అంత. కుడికన్నులో దృష్టిలోపం ఉంది. లోపం కారణంగానే రోజు రాత్రి  వ్యాపారి చేతిలో దుర్మార్గుడి ప్రాణాలు పోయాయి.  దుర్మార్గుణ్ని గాయపరిచి వదిలేద్దామన్న ఉద్దేశంతోనే వ్యాపారి  కత్తివిసిరిని మాట వాస్తవం. దృష్టిలోపం  కామాంధుడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. నిజానికి అలాంటి నీచులు బతికి ఉండటం వల్ల అమాయకులకు ఏ మాత్రం మనశ్సాంతి ఉండదు. వ్యాపారి భార్య  ఒంటరిగా ఉండటం చూసి,   నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే వాడు చీకటిమాటున చాటుగా వచ్చి ఆమె పడకగదిలో నక్కాడు. పాపంలో ఆమెకే భాగం లేదు. కాముకుడి చరిత్ర.. ఇల్లాలి చరిత్ర వాకబు చేయించిన తరువాతనే నేనీ రకమైన శిక్ష ఖరారు చేసింది.'
'సంఘటన విచారణకు వచ్చినప్పుడు  వ్యాపారికి శిక్ష పడుతుందనే అందరూ భావించారు. సాక్ష్యాలనీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి. నా మనస్సాక్షి ఒక్కటే అతడికి అనుకూలం. వాకబు చేసిన మీదట నా నమ్మకం నిజమని తేలింది. కానీ సాక్ష్యాలుగా అవి చాలవువ్యాపారిని శిక్షించకుండా వదిలేయాలని, నా తల కోటగుమ్మానికి వేలాడితే చూడాలని ఉవ్విళ్ళూరే మత్సరరాయుళ్ళకు అవకాశం ఇచ్చినట్లవుతుందిఇప్పటి వరకూ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడిప్పుడే   పరిస్థితులు చక్కబడుతున్నాయి. నా తలను గూర్చి నాకు బెంగ లేదు కానీ.. తమ మంచితనంవల్ల నాకు దక్కిన అవకాశాన్ని సమాజ హితం కోసం మరింత పదునుగా వాడాలని ఆత్రం మాత్రం ఉంది. ముందు ముందు నా విరోధులు మీ మనసు విరిచే ప్రమాదం ఉంది. అందుకే .. సంబంధం లేకపోయినా వ్యవహారంలో  మిమ్మల్ని కూడా ఇరికించవలసి వచ్చింది. మీరు అందుకు అనుమతించడం మీ వ్యక్తిత్వవిశేషం. వ్యాపారి దృష్టిలోపం మీద ఒకసారి మీకు నమ్మకం కుదిరితే .. ఇక ఎవరు ఎన్ని చెప్పినా మీరు నా తీర్పుని  శంకించరన్న నమ్మకమే నా చేత సాహసం చేయించింది. మీ సహృదయత వల్లే ఇది సాధ్యమైందిఇదీ నా సంజాయిషీ. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా శిరసావహించడానికి  సిద్ధం మహారాజా!"

మందహాసం చేసి అన్నారు  మహారాజు "నాకు ఇంత పెద్ద శిక్ష విధించిన పెద్దమనిషిని వూరికే వదిలి పెట్టడం కల్ల. శిక్ష ఖాయం. అమలుకు గడువుదాకా వేచిచూడటం దేనికి! రేపే ముహూర్తం. సామాన్యులకు మా ద్వారా  మరింత న్యాయం జరిగే అవకాశం ఇవ్వండి!   మా ముఖ్య సలహాదారులుగా  చేరడమే  మీకు తగిన శిక్ష " అంటూ ఆప్యాయంగా రామశాస్త్రిని ఆలింగనం చేసుకున్నారు కృష్ణవర్మ మాహారాజు .*
-కర్లపాలెం హనుమంతరావు
(గో తెలుగు సచిత్ర వారపత్రిక 122వ సంచికలో( 07-08-2015)లో ప్రచురితం)


http://www.gotelugu.com/issue122/3203/telugu-stories/neramu-shiksha/







Saturday, August 15, 2015

పెరుగుట (నడ్డి) విరుగుట కొరకే!- ఓ సరదా గల్పిక

తెలుగువాడు పాలిటిక్సులో ఎంత చురుకో.. పాకశాస్త్రంలో అంతకన్నా చురుకు. తింటే గారలే తినాలనుకొనే రకం. నలుడికి, భీముడుకి నవగాయ పిండివంటలు నేర్పిన ఘటం తెలుగువాడే! పంచదారకన్న పాలమీగడకన్న జుంటితేనియకన్న జున్నుముక్కకన్న వెన్నకన్న దోరమాగిన మామిడికన్న తెలుగు తియ్యగా ఉంటుదంటూ భాషాభిమానాన్ని సైతం పాకపరిభాషలో వెలిబుచ్చడం ఒక్క తెలుగువాడికే చెల్లింది. గొల్లపిల్లల వేళ్ళ సందుల్లోని మాగాయపచ్చడి పసందును రుచిచూపించిన పోతన మన తెలుగువాడే! కప్పురపు విడియాన్ని గురించి ఏ మాత్రం బిడియపడకుండా కవిసార్వభౌముడు అంత గొప్పగా చెప్పగలిగాడంటే కారణం శ్రీనాథుడి డి. ఏన్. ఏ లో అచ్చమైన ఆంధ్రత్వం ఇమిడి ఉండబట్టే!
'భరతఖండంబు చక్కటి పాడియావు' అన్న ఐడియా చిలకమర్తివారి బుర్రకి తట్టేందుకు దోహదబడిందీ ఆ యుగవైతాళికుడి కుదురులో పాదుకొన్న  తెలుగుదనమేనని వేరేగా చెప్పాలా! 'చిక్కటి పాలమీది మిసమిసలాడే మీగడ  పంచదారలో అద్దుకు తిన్నట్లు రామామృతరసాన్ని దాస్యమనే దోసిలిపట్టి జుర్రుకొంటా'నంటాడు భక్తరామదాసు. కంచర్ల గోపన్నకు అంత భక్తిపారవశ్యంలో సైతం  కంచంలోపడే పదార్థాలనుంచి దృష్టిమళ్లకపోయ! తెలుగువాడి తిండియావకు ఇంతకుమించిన మంచి దృష్టాంతమేముంటుంది?
అలంకారాల్లో 'ఉప్మా'లంకారం.. పండగల్లో 'అట్ల'తదియ తెలుగువాడి ప్రత్యేకతలు. బిడ్డ దుర్ముహూర్తంలో పుడితే మేనమామ  గారెలదండ మెళ్లోవేస్తేగాని బైటిప్రపంచాన్ని చూడనీయని సంప్రదాయం తెలుగువాడిది. బందరు లడ్డు, కానాడ కాజా, హైదరాబాదు బిర్యానీ అంటూ ఊరుకో తినుపాకం పేరు పెట్టేసుకొని మురిసిపోయే తిండితత్వం తెలుగువాడిది.  కాకి-రొట్టె, పిల్లులు పంచుకొన్న రొట్టెల్లాంటి తినుబండారాలున్న కథలనేకదా చిన్నతనంబట్టి మనం  పిల్లలకు పట్టుబట్టి మరీ నేర్పేది! 'తిండిగలిగితె కండ కలదోయ్!/ కండకలవాడేను మనిషోయ్' అంటూ మన గురజాడ అప్పారావుగారుకూడా తిండిగోలతోనే తెలుగుజాతిని తట్టిలేపే ప్రయాస పడ్డారు. 'రొట్టెముక్కా.. అరటితొక్కా' దేన్నీ పక్కన పెద్దని సుద్దులు చెప్పలేదూ మన మహాకవి శ్రీ శ్రీ రుక్కుల్లో! పరమానందంనుంచి.. పరమాన్నంవరకు దేన్నీ వదలకుండా పద్యాల్లో ఇరికించారు తెలుగు కవులు. 'పీత్వా పీత్వా పునఃపీత్వా స్వర్గలోకమ్ అవాప్నుయేత్' అంటూ కాఫీదండకాలు చేసిన కవులకు తెలుగునేలమీద కొదవ లేదు.
తెలుగువాడు వట్టి అల్ప సంతోషి. గట్టిచట్నీ గంటెడు ఎక్కువేసి రెండిడ్లీ వేడిగా ప్లేట్లో పెట్టిస్తే.. గుండెకాయనైనా కోసేసి దోసిట్లో పెట్టేసే  తిండియావ మనవాడిది. పుల్లగోంగూర పేరు వింటేనే చాలు..  వళ్ళు పులకరించే బోళాతనం తెలుగువాడిది కాక మరెవరిది! తెలుగువాడిది ఫికిల్ మైండు అన్నమాటలో నిజం ఎంతుందో తెలీదుగానీ..  'పికిల్' మైండు అన్నమాటలో మాత్రం నూరుపాళ్ళు నిజం ఉంది. పిల్లలు అమెరికా వెళుతుంటే ఏ పచ్చళ్ళు ప్యాక్ చేయించి ఇవ్వాలా అని తెలుగుతల్లి తల్లడిల్లిపోతుంది. సాఫ్టువేరు అంటే ఇప్పుడు వచ్చిందికానీ.. తెలుగువాడికి అంతర్జాతీయంగా మొదట్లో పేరు తెచ్చిందిమాత్రం ఊరగాయ పచ్చళ్లే సుమండీ! మన గుత్తొంకాయకూరమీద ఇంతవరకు ఎవరూ పరిశోధనలు చేసి డాక్టరేటు కొట్టకపోవడం  ఎంతో వింతగొలిపే విచిత్రం! ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని తెలుగువాడు నమ్మినంతగా మరెవ్వడూ నమ్మడు.    కరివేపాకును కూడా వదిలిపెట్టని రకం మనం. 'తినగ తినగ వేము తీయగనుండు' అనుకొంటూ వేపాకునూ  నములుతుంటాం.  'మాయాబజారు' చిత్రంమీద మనకీనాటికీ తగని మోజెందుకో తెలుసాండీ! పెళ్ళివారికని వండివార్చిన వంటకాలన్నింటినీ ఘటోత్కచుడు వంటింట్లో చేరి ఓ వరసలో గుటకాయస్వాహా చేస్తాడు చూడండి! ఆ సీను చూసి కడుపునిండినంత సంబరపడిపోతాం కనకే! ఆ  'వివాహ భోజనంబు'లోని అనుపాకాల జాబితా విని 'ఆహాహా.. ఏమి రుచి!' అంటూ లొట్టలేయకపోతే అది తెలుగు అభిరుచే కాదు!  పెళ్ళిని పప్పన్నంగా చెప్పుకొని మురిసేది ప్రపంచంమొత్తంమిద ఒక్క తెలుగు జాతే!  అప్పు చేసైనా సరే.. పప్పుకూడు తినడం తెలుగువాడికి తప్పు కానే కాదు. తిండి ఊసు లేకుండా మనకే పండగా పబ్బమూ ఉండదుగాక ఉండదు. ఒకప్పటి పెళ్ళిచూపుల్లో మగపెళ్ళివాళ్ళు పెళ్ళికూతుర్ని అడిగే మొదటి ముఖమైన ప్రశ్న తిండి తిప్పల్ని గురించే! 'వంట' రాని ఆడపిల్ల  సావిత్రంత అందగత్తయిన్నా.. భానుమతంత చలాకీతనమున్నా   సంసారానికి పనికిరాదని అప్పటి పెద్దల ప్రగాఢ విశ్వాసం మరి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని నిద్రపాటులో కూడా నమ్మేవాడు మన తెలుగువాడు!
క్షీరసాగర మధనమప్పుడు తెలుగువాడే కనక కవ్వంచిలికే  జనంలో ఉండుంటే 'ముందొక్క కప్పు కాఫీ గొంతులో పడితేగాని పని ముందుకు కదలదని మొండికేసేవాడే నిర్మొహమాటంగా. రటమతమో.. రెటమతమో..  ఆహారం దగ్గర వ్యవహారం దగరా మొహమాటలుండరాదన్నదే మరి తెలుగువాడి మతం!
తిండిపోతు పోటీలు గనక ఒలంపిక్సులో ఉండుంటే స్వర్ణాలన్నీ తెలుగువాడి ముంగిట్లోనే వేలాడుతుండేవి.
తెలుగురాష్ట్రాలు రెండూ 'అన్నపూర్ణమ్మతల్లి' అడ్డాలని మా చెడ్డ పేరు అనాదినుంచి. సాగుచేసే రైతన్నకు 'అన్నదాత'న్న గొప్పగౌరవమిచ్చేది  ప్రపంచంమోత్తంమీదా ఒక్క తెలుగువాడేనండీ! గర్వపడాల్సిన విషయం కదూ! ఇప్పుడంటే ఎక్కడబడితే అక్కడ మందుపాతర్లు బైటపడుతున్నాయ్ గానీ.. తెలుగుదేశం అంటే నిన్నమొన్నటిదాకా  యావద్దేశానికీ ధాన్యం పాతరేగదా! కిలో బియ్యం రెండు రూపాయలకిచ్చిన చరిత్ర తెలుగువాడిది!

తెలుగువాడికిమల్లే తెలుగు దేవుళ్ళూ అన్నప్రసాద ప్రియులు.  తిరుపతి లడ్డు తిరుపతి వెంకన్నకన్నా ప్రసిద్ది. రుద్రాక్షమాల తిప్పే ముముక్షువు  మన తెలుగువాడయి ఉంటే 'ద్రాక్ష' పేరు వినబడంగానే  నాలిక చప్పరించకుండా ఉండలేడు. మన తెలుగు బాలకృష్ణుడు
చేతవెన్నముద్దకోసం చేసిన అల్లరి  పోతనగారి రాతలో ఎన్ని వన్నెచిన్నెలు పోయిందీ!
'ఇంతకీ ఈ తిండిగోలంతా  ఇప్పుడు దేనికండీ?' అని కదా  మీ చిరాకు?  భోజనాల వేళలో ఈ తిండివేళాకోళాలేమిటోనని విసుక్కుంటున్నారనీ తెలుసు! అయ్యా!  ఓ మోస్తరు రకం బియ్యం కిలో యాభై.. నూక పలుకు  పాతిక పలుకుతోందని తమరికి తెలుసా? అమ్మా!  టీ, రోటీ సంగతి ఆనక! పేదోడి ఆహారం..  రోటిమీద నూరుకునే  మిరప్పచ్చడి.. సరుక్కికూడా రెక్కలొచ్చేసి గాల్లో ఎగురుతున్నదని తమకు తెలీకుండా ఉంటుందా! పిల్లకాయలు  చప్పరించే పప్పు బెల్లాలుకూడా నిప్పుల్లా కాలిపోతున్నాయి. కూరగాయల దరవరల సంగతి ఇహ సరేసరి!  విడివిడిగా వివరాలు ఎందుగ్గానీ.. ఒక్క ముక్కలో చెప్పాలంటే .. నసాళానికి అంటుతున్నాయి!  చికెన్నుంచి.. చిక్కుడు వరకు.. ధరల గేలానికి చిక్కి విలవిలాడని కాయగూర కనిపించడం లేదు. పొయ్యి వెలిగించాలంటే ముందు జేబుకాలే తీరులో ఉంది బజారు తీరు! ఆ   శ్రీకృష్ణ పరమాత్ముడుగాని ఈ కాలంలో  భూమ్మీదవతరించి ఉంటే పదహారువేల గోపికలనెలా పోషించకోవాలో తెలీక ఆపద్భాంధవుడి అవతారం అర్థాంతరంగా చాలిందుకొనుండేవాడు! 'అన్నబలమే అన్ని బలాలకు మూలమ'ని అన్నదెవరో  తెలీదుగాని ..  రావణాసురుడైనా  పదినోళ్ల పోషణకు లంకను ఏ ప్రపంచబ్యాంకుకో తాకట్టు పెట్టక తప్పని పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి తెలుగు ప్రజలారా! 
తలకొక్క ఊరైనా ఇస్తే చాలని పాండవులు పదే పదే కౌరవులకు  కబురు పంపించారు ద్వాపరంలో గనక! అదే ఈ నకనకలకాలంలో అయితే?   ఒక్క మండలం తగ్గకుండా  ధారపోసినా వెనక్కి తగ్గేది లే'దని  మొండికేయక తప్పని పరిస్థితి.   రోజుకో బండెడు అన్నం.. కూరలు..  బండిమనిషితో పాటు పంపించమని కండిషన్ పెట్టాడుగదా బకాసురుడు భారతంలో! బండి మనుషులని ఎంతమందినైనా తేలిగ్గా తోలుకు పోవచ్చుగాని.. బండెడు భోజనం.. అంటే బాబోయ్! విరాటరాజైనా చచ్చూరుకొంటాడు.. ఈ కరువు కాలంలో అయితే! వేలుపోసినా నోట్లోకి నాలుగు వేళ్లు పోవడంలేదు మహాశయుల్లారా! పెరిగే ధరలను గురించి నిలదీస్తారన్న భయంకొద్దీనే కాబోలు తిరుపతిగుళ్ళో సైతం  దేవుడు భక్తులకి ఒక్క క్షణానికి మించి అప్పాయింటుమెంటు ఈయడం లేదు. ఈ కరువు ఇలాగే కొనసాగితే వెంకన్నకైనా 'శబరి' ఫలహారం తప్పకపోవచ్చు.
సౌదీలో వేళకి చాయి అందించని బాయికి భర్త తలాక్ చెప్పినా తప్పుకాదంట. ఇక్కడ అలాంటి వెసులుబాటు లేకపోబట్టిగానీ.. లేకపోతే  సంసారాలొక్క రోజైనా సవ్యంగా సాగుతాయా?
'పెరుగుట.. విరుగుట కొరకే! ఆ  అచ్చే దినాలు వచ్చే వరకు  చకోర పక్షుల్లాగా ఎదురు చూడ్డమే బాధ్యతగల తెలుగువాడిగా మన కర్తవ్యం' అన్న మాట తెలివిగానే ఉందిగానీ .. అప్పటివరకు  తెలుగు నడుములు విరగకుండా ఉండాలిగదా!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకీయ పుట 07-06-2009 నాటి ఈనాడు సంపాదకీయ పుటలో 'అధికస్య అధికం ఫలం' పేరుతో గల్పికగా ప్రచురితం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...