Sunday, February 17, 2019

ఎన్నటికీ ఒంటరులం కాలేం - కవిత



ఒంటరులం కాలేం!

1
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ  ఒంటరులం కాము
             
2
పూల మీద నడుస్తున్నా
పాదం కందకుండా కింద
అమ్మ అరచేయి అడ్డు పెడుతుంది


ఉట్టికెగిరేటప్పుడు
రెక్క తెగి- నువు కింద పడకుండా
నాన్న నీడ పహరాగా నిలబడి ఉంటుంది          
             
4
తోబుట్టువులనే
తోటి చేపలతో
బతుకు తొట్టి
ఈత కొలనుగా
ఎప్పుడూ సందడిగానే ఉంటుంది!

5
నీ రాలి పడే నవ్వులకు
ఒడి పట్టి వెంటబడే లోకం అంటావా
నీతోనే తన లోకం అంటుంది

6
కన్నీరైనా  ఒంటరిగా వదలుతుందా నిన్ను!
చెక్కిలి తడి కానివ్వదు
చెలిమి హస్తం చాచే ఉంటుంది

7          
చింతల గుంతన అయినా
ఏకాంతంగా   వదలదు.
నీ వ్యథలో అర్ధం తనదే
అటుంది నీ ఆత్మ అర్థభాగం
             
 8
ఇక అమావాస్య నాటి
వెన్నెల పక పకలకు మల్లే
పిల్లా జెల్లా ఎల్లకాలమూ
నీ వెనకాలే!

9
చావుతోనే అంతా అయిపోయిందనుకోడం
శుభం కార్డు పడితే
మరో ఆట లేదనుకోడం

10
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ  ఒంటరులం కాము
కాలేం*
హామీ పత్రంః' ఒంటరులం కాలేం' కవిత నా స్వంతం.దేనికీ అనువాదం/అనుకరణ కాదు.అముద్రితం.ఏ ఇతర పత్రికలలోనూ పరిశీలనలో లేదు అని హామీ ఇస్తున్నాను.

-కర్లపాలెం హనుమంత రావు
17-09-2012


Friday, February 15, 2019

కథలు- సినిమా కథలు - నా సరదా వ్యాసం



కథలు- సినిమా కతలు
-కర్లపాలెం హనుమంతరావు 
ఇప్పుడంటే వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా సినిమాలమీదకు దృష్టి సారించడం లేదు. కానీ.. ఒక దశాబ్దం కిందట సినిమాలే ప్రపంచంగా..  సినిమా ప్రపంచంలో చెడ తిరిగిన వాడిని. 'చెడ' తిరగడం సినిమా జీవులకు ఉండవలసిన ప్రధాన లక్షణం. 
బుద్ధిమంతులు ఇంట్లో.. గదిలో ఓ మూల చేరి  ప్రశాంతంగా .. ఏ అర్థరాత్రో.. ఆపరాత్రో.. ఎన్నికాగితాలూ.. కంప్యూటరు బైట్లు ఖరాబు చేసుకున్నా . అడిగే నాథుడు ఉండడు. సినిమా రచయితకు అలా కుదరదు.  క్లాప్ బాయ్ నుంచి.. దర్శకుడిదాకా అందరూ 'నాథుళ్లే'. ఎవరికి వాళ్ళు వాళ్లను 'శ్రీనాథుళ్ల'ను కోవడం సినీజీవుల విలక్షణత. రావిశాస్త్రిగారినో సారి  సినీ కథ రాసేందుకని మద్రాసు తోలుకెళ్లారు తెల్సీ తెలియని అమాయకులెవరో తిరిగొచ్చిన తరువాత కొత్త  అనుభవం ఎలా ఉంది శాస్త్రిగారూ?' అనెవరో అడిగితే 'బాఁనే ఉంది. జల్సాగా కూడా ఉంది. మన భోజనానికి మన ఖర్చు లేదు. మన మందుకీ మనం  ఖర్చు అక్కర్లేదు. మన పసందు ఏదైనా సరే  మనం అచ్చుకోనక్కర్లేదు. మన పన్లేవీ  మన చేత చేయనివ్వరు.. చివరికి కథ కూడా..' అనేసారు.
ఈ కాలంలో అచ్చుపత్రికల్లో  కథల పేరుతో వచ్చే రాతలకే  ఏ 'ఏకతా'సూత్రం అతకడం లేదు. ఏ కతకైనా 'ఏకత'(Unity) అవసరమని SYD FIELD అనే పెద్దాయన 'Screenplay' అనే పుస్తకంలో సిద్ధాంతం చెబుతాడు. The Foundations of ScreenWriting పేరుతో పడీ పడీ 300 పేజీల ఉథ్గ్రంథమోటి   రాస్తూ బుర్రను తొలిచే  పురుగును .. ఫైనల్ గా  మిణుగురు పురుగు మాదిరి   ఎలా మెరిపించచ్చో  స్టెప్ బై స్టెప్ లెక్కలాగా  సాధికారికంగా వివరిస్తాడు.   హాలీవుడ్లో చిత్రాలు ఈ సిడ్ ఫీల్డ్   సూత్రాలమీద ఎంతవరకు తయారవుతాయో  తేల్చడం అంత తేలిక కాదు. కానీ.. హాలీవుడ్ స్థాయి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలందించాలని కలవరించే వెర్రి సజ్జంతా  కనీసం  ఒక్కసారైనా  ఈ పుస్తకం అట్టను తడిమి లోపలేం రాసుందో తెల్సుకుంటే లాభమే కానీ.. వచ్చే నష్టమేమీ ఉండదు. 
కథను  తెరకు అనువదించడం  ఒక శాస్త్రం. శాస్త్ర ప్రకారం చేయడం అపాయకరమని మొదట్నుంచీ మన తెలుగువాళ్లకెందుకో ఒక అపనమ్మకం.  (ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందంటున్నారు). హాలీవుడ్డో. కొరియన్ ఫుడ్డో..వాళ్లు అష్టకష్టాలూ పడి వండుకున్న వంటకాల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చి ఎంగిలి పడ్డం  మన రచయితలకో థ్రిల్లు! 'లోకో భిన్న రుచిః ' అన్న సూత్రంలోని మాయమర్మం కాస్తయినా వంట పట్టిన   రచయిత  'నేటివైజేన్'  టెష్టులో 'సి'గ్రే డైనా సాధిస్తాడు. అదీ కుదరని 'మక్కీకి.. మక్కీ' కుక్కింగు రాయుళ్ళు-  నమ్ముకొని రంగంలోకి దూకిన దిగిన నిర్మాతల్ని నట్టేట ముంచేస్తారు.  మరో సినిమా తీయడం ఆనక.. బెజవాడ బస్టాండులో మిరబ్బజ్జీ  బాండీ వేసుకునే  స్థాయికి తీసుకు రాఅకపోతే అక్కడికి అదృష్టవేఁ!   
హాలీవుడ్డు కయినా.. బాలీవుడ్డు కయినా.. టాలీవుడ్డు కయినా.. అతకడాలు.. అతక్క పోవడాలంటూ ఉండవు. సిడ్ ఫీల్డు స్క్రీన్ రైటింగు పాఠాలు ఒక్క  హాలీవుడ్డు మేథావుల చెవుల్లో  ఊదిన గాయత్రీ మంత్రాలేవీఁ కాదు.  ఊహా మాత్రంగా మెదడులో మెదిలిన ఆలోచన తెరమీదో కావ్యంగా కనిపించేందుకు జగమంతా ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.  కథానిర్మాణం  వెన్నెముక కూర్పయితే కథలోకి జీవం తేవడం సృజనాత్మకతకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. సిడ్ ఫీల్డుకైనా.. రాబర్డ్ మెక్ కైనా.. సిద్ధాంతం బుర్రకెక్కించడం వరకే పరిమితం! స్పీల్ బర్గో.. చక్రపాణో కావడం  మేథస్సుకు సంబంధించిన  చమత్కారం. 
తెరమీద కదిలే కథకి..  తెర వెనక ఎంత కథ నడవాలో వివరించే సిద్దాంతం స్క్రీన్ ప్లే!  వాస్తవానికి అనుభవ పూర్వకంగా సాధించవలసిన యోగం. ఈదే నైపుణ్యం నేర్పే పుస్తకాలుండచ్చేమో.. కానీ.. ఈదడానికి మాత్రం ఎవరి రెక్కలు వాళ్లకే సాయం రావాలి' . సినిమా కథ తయారీకి కూడా సరిగ్గా అతికేదీ మార్క్ ట్వైన్ సూక్తి. కాకపోతే పుస్తకాలలో మనం చదివే కథలకి.. తెరమీద  మనం చూసే కథనాలకీ నిర్మాణ సిద్ధాంతంలో ఆట్టే తేడా లేదు. మనసును రంజింపచేసే ఈ రెండు ప్రక్రియల్లో ఉండేది ఒకే సామాస్య నిర్మాణ సూత్రం. చదువరులకి.. వీక్షకులకి ఆ మర్మాలు అనవసరమేమో గానీ.. కథానిర్మాతలకు ఈ లోతు పాతులన్నీ కాకపోయినా .. కొన్నైనా తెలిసుండాలి కదా!  వడ్డించినన భోజనం ఆరగించే మనిషికి అనుపాకాల తయారీతో సంబంధమేముంటుంది. భోక్తకు కావల్సింది రుచి. రుచికరంగా వండటమెలాగో తెలుసుకోవాల్సిన ధర్మం వంట చేసే మనిషిది. వంటమనిషికి కథలు రాసేవాళ్లకి ఒకే సూత్రం. ఆ సూత్రాలు తెల్సుకునేందుకైనా కొన్ని సిద్ధాంత గ్రంధాలమీద మనసుంచి అవపోసన పట్టాలి.
సిడ్ ఫీల్డ్.. రాబర్ట్ మెక్ లాంటి  అనుభవజ్ఞులైన చలనచిత్రకథాశాస్త్రజ్ఞులు  స్క్రీన్ రైటింగుకి సంబంధించిన సిద్ధాంత గ్రంథాల్లో  చెప్పిన పాఠాలన్నీ అందుచేతనే.. ఔత్సాహిక  సినీకథా రచయితలకు.. కథారచయితలకు..  ఒకే విధంగా ఉపకరించే  పాఠ్యగ్రంథాలని నా ఉద్దేశం.
నేను సినిమారంగంలో క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలుః
నేను చదివిన కొన్ని పుస్తకాలు
1.SYD FIELD /SCREENPLAY
2.ROBERT MckEE/ STORY- 
substance, structure, style, and the principle of screenwriting
3.తెలుగు సినిమా సాహిత్యం- కథ , కథనం, శిల్పం- డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణఉస్మానియా విశ్వవిధ్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందిన సిద్ధాంత గ్రంథం
4.సినిమా స్క్రిప్టు రచనా శిల్పం- చిమ్మని మనోహర్

నాగరికత కథానాయకుడు -కర్లపాలెం హనుమంతరావు - కవిత







నాగరికత కథానాయకుడు 
-కర్లపాలెం హనుమంతరావు 


వాన వచ్చిందని ఇంట నక్కడు 
ఎండ మండిందని నీడ చేరడు
వణుకించే  చలికైనా ఎన్నడూ ముణగదీయడు  

పొలం పలక..  హలం బలపం 
కాడెద్దులు సహవాసులు
ప్రకృతి బడిలో రుతువుల గురువులు 
దిద్దబెట్టించిందీ  అక్షరమంటి మంటి సేద్యం 

నాటటం, నారు నీరు చూడటం 
కంచెలు కట్టి కాపాడటం 
పురుగు పుట్రా,  తాలూ తప్పా  ఏరడం 
ఏరువాక నుంచి ఎత్తిపోతల వరకు 
ఏదీ ఏమరక జాతికి పెట్టే పట్టెడు బువ్వ కోసమని 
రేయీ పగలూ
బతుకును ఆసాంతం మీదు కట్టే కృషీవలుడు
అక్షర సేద్యం చేసే ప్రతీ 'కృతీ'వలుడికి  గురుతుల్యుడు    
నిస్వార్థ నిబద్ధ  సామాజిక కవులందరకు 
నిత్యం  ప్రాత: కాలాన స్మరించ దగ్గ 
నాగరికతా కథానాయకుడు!

 -కర్లపాలెం హనుమంతరావు 
14-02-2019
బోథెల్ , యూ.ఎస్. ఏ 

Thursday, February 14, 2019

రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభలోని నా కథానిక


రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభ (29-07-1982  నాటి) వారపత్ర్రికలోని నా కథానికః
ఎన్ని కమ్మని ప్రేమ కబుర్లు పోటీ కొచ్చినా జీవతమనే  పరుగుపందెంలో ఆఖర్న బంగారు పతకం సాధించేది,, విచ్చు రూపాయే! ఆర్థిక సంబంధాల ప్రాబల్యం అప్పటికీ ఇప్పటికీ,, ఇంకెప్పటికీ ఎవరూ పడగొట్టలేని వస్తాదే బతుకుగోదాలో అని మరో సారి చెప్పిన చిన్న కథ.. రాధమ్మ పెళ్లి జరిగిపోయింది! 

కథానిక : 
రాధమ్మ పెళ్లి జరిగిపోయింది 
- కర్లపాలెం హనుమంతరావు
( 28 -07 - 1982 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక - ప్రచురితం ) 

రాజు, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే?!
ఏమో నాకూ అట్టే తెలీదు. "

' ప్రేమ .. అమావాస్య చందమామ. . అందుకొనే దెంతమంది? .. వంద తక్కువ నూరు  మంది!' అన్నాడో కవి! 

అయితేనేం  పాపం, రాజూ, రాధా ప్రేమించుకున్నారు. 

ప్రేమం టే వాళ్ళకూ తెలుసన్న మాట అనుమానమే. అయినా ప్రేమించుకున్నారు.  పోనీ, కనీసం అలా అనుకుంటున్నారు. వాళ్ళు మేధావులు కాదు కనక. 

సాధారణంగా అందరి లాంటి యువతీ యువకులే గనక 'ప్రేమంటే ఏమిటి?' అంటూ ఆరా తీస్తూ కూర్చోలేదు. 

ఏదో హాయిగా అలా కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపమంటే అదే... ఏదో కొద్దిగా సరదాగా గడిపేయడం. 

సరే వాళ్లు మాత్రం  వూరికే అలా ఎంతకాలం చూసుకుంటూ కూర్చుంటారు ? 

బోర్ బోర్! 

కడుపు నిండేనా, కాలు నిండేనా? 

ఒక శుభ ముహూర్తంలో పెళ్ళికూడా అయిపోతే  'శుభమస్తు ' కార్డు పడిపోతుంది కదా వాళ్ల ప్రేమ కథకు కూడా! 

' చేసేసుకుందాం .. పెళ్లి ' అని ప్రమాణాలు ఎక్స్ ఛేంజి చేసుకున్నారు. 

వాళ్ళయితే అనుకున్నారు... కుర్ర కారు.  మరి ఇరుపక్షాల పెద్దలు? 

"పెద్దవాళ్లు ఒప్పుకుంటా రంటావా, రాజూ!" అని అడిగింది రాధ.. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఏకాంతంలో కూర్చున్నప్పుడు పెళ్ళి ప్రస్తావన తవే ముందు తెచ్చి.

" ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు రాజు.. అనుమానాన్ని కూడా ధ్వనింపజేస్తూ

" ఒకవేళ ఒప్పుకోకపోతే?”

“ఒప్పుకోకపోనూవచ్చు. ఇంత దూరం వచ్చిన తరువాత వెనక్కు తగ్గుతాననుకున్నానా, రాధా!".

"అబ్బే... అలా అని కాదు. వూరికే అడిగేనులే. మరి మీదేమో బ్రాహ్మణ కులం. మేమేమో నాయుళ్ళం. కులాంతరమంటే మీ వాళ్లు అంతా తొందరగా ఒప్పుకుంటారా అని "

" మరి మీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవద్దూ కులాంతర వివాహావికి?"

" మా సంగతి వేరు, రాజూ! మా నాన్న గారు కులాంతర వివాహం చేసు కున్నారు. మా అమ్మ ఆ రోజుల్లో కొద్దో గొప్పో పేరున్న నటి. ప్రసక్తి వచ్చింది గనక చెబుతున్నా.  అమ్మది వడ్రంగి కులం. అయితేనేం, మా నాన్న గారు నాయుళ్ళయి ఉండీ ఆదర్శ వివాహం చేసుకోలేదూ! నేను గ్యారంటీ ఇస్తున్నాను, రాజూ. మన పెళ్ళికి మా వాళ్ళు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పరు. మా బ్రదర్ పోయి నేడు ఫారిన్ నుండి తిరిగొస్తూ అమెరికన్ అమ్మాయిని  పెళ్ళాడి మరీ వచ్చాడు తెలుపా?" 

"మీ వాళ్ళది చాలా విశాల దృక్పథం, రాధా! ఐ యామ్ రియల్లీ హ్యపీ!  ... మా వాళ్ళే ఒట్టి చాందసులు. మా చెల్లెలు శాంత.. అదే బ్యాంకులో పనిచేస్తుందే .. తను తన కోలీగ్ ను చేసుకోవాలని చాలా పాకులాడుతోంది . శాఖాంతరమని మా వాళ్లే పడనీయడం లేదు " 

"మరి నువ్విప్పుడు ఏకంగా కులానికే ఎసరు పెట్టేస్తున్నావుగా: అడిగి చూడు! పెద్దల ముందుగా వద్దన్నా సరే, అంగీకారం కోరటం మన డ్యూటీ. నేనూ ఈ రోజే ఇంట్లో విషయం కదుపుతాను."

"ఏ విషయం. రేపు ఆదివారం సాయంత్రంలోగా ఇక్కడే తేలిపోవాలి.. విష్ యూ బెస్సాఫ్ లక్.." అని నవ్వుతూ లేచాడు రాజు. రాధ రాజు చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ , "విష్ యూ  ది సేమ్ ...' అని నవ్వింది. 

రాజు కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు. రాధ ఉమెన్స్ కాలేజీలో  డిగ్రీ మూడో ఏడు చదువుతూంది. కాలేజీకి దగ్గరే ఆఫీసు, ఇద్దరూ తరచూ ఒకే కేంటీన్ లో కలుసుకోవటంతో పరిచయం కలిగి .. అది ప్రణయంగా మారింది. అందుకు ఇద్దరూ అభిమానించే సినిమాలు, ననలలు బోలెడంత దోహదం చేశాయి. 

అనుభవంలేని వయసు పాంగొకటి తోడైంది.  ప్రణయం ముదిరి పాకాన పడింది.

రాజుకు శాంత అనే పెళ్ళి కాని చెల్లెలుతో పాటు, రాఘవ అనే ఉద్యోగం లేని  గాడ్యయేట్  తమ్ముడూ, పించను   ఇంకా సెటిల్ కాని రిటైర్డు టీచరు తండ్రి. చాదస్తం వదలలేని  పాతతరం తల్లి .. కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇంటికి దిక్కు రాజు జీతమే . శాంత జీతం మాతం కట్నం కోసమని దాస్తున్నారు. 

ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ అరవ కాకి లాగా బయట పడి తిరిగే   రాఘవకూడా ఒంట్లో నలత కారణంగా ఇంటి పట్టునే ఉన్నాడా పూట. 

భోజనాల దగ్గర పెళ్ళి ప్రస్తావన ఎత్తాడు రాజు. 
నా అంత ఎత్తు ఎదిగిన  వాడివి నీకేమని బుద్ధి చెప్పను! ఇంటి పెద్ద కొడుకుగా నీకూ  కొన్ని బాధ్యత లున్నాయన్న విషయం మరిచి పోయావురా?” అన్నాడు తండ్రి నిష్ణురంగా .

 “నే నంత కాని పనేం చేశామ, వాన్షా! ఆ అమ్మాయి చాలా గుణవంతు రాలు. “

" గుణమొక్కటే చాలుతుందా ? కులం?"

రాజు మాట్లాడలేకపోయాడు. 

తండ్రే అందుకున్నాడు "నువ్వు చెప్పక పోయినా మాకు తెలుసు లేరా ! నాయుళ్ళ సంబంధం చేసుకుంటే శాంతకు మళ్ళీ ఈ జన్మలో పెళ్ళవుతుం దంటావా?"

"ఈశ్వరావు నాకు బాగా తెలుసు. నేను కులాంతరం చేసుకున్నా తను శాంతను వదులుకునే పాటి మూర్ఖుడు కాదు. శాఖాంతరముని మీరే రాద్ధాంతం చేస్తున్నారు గానీ! " 

"ఏమో నాకీ సంకరజాతి వెళ్ళిళ్ళు ఇష్టం లేదురా! మేం మళ్ళీ అందరిలో  తలెత్తుకు తరగాలా. . వద్దా  ?” అని అందుకుంది తల్లి.

" రాధ వాళ్ళ కుటుంబం సంగతి మీకు తెలీక అలా అంటున్నారమ్మా! ఆయనతో వియ్యమందటానికి బిజినెస్ మేగ్నెట్లతో సహా ఎంతమంది క్యూలో  ఉన్నారో తెలుసా ? రాధ తండ్రి డబ్బున్న కాంట్రాక్టర్. ఎన్నికలలో ఈ దఫా కూడా పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే, మంత్రి పదవి  ఖాయమంటున్నారు.  గెలవక పోయినా అధికార పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించే అంతస్తు . అలాంటి వాల్లాయి సంబంధం ఎన్నటికీ తలవంవులు కాబోదు. గొప్ప కింద లెక్క .  అందుకే మీ మహదేవన్నయ్య  ఇన్ని సిద్ధాంతావా వల్లించి చివరకు కొడుక్కోసం  రాధ తండ్రి చుట్టూతా  తిరుగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ నాయకు డికి లేని సంకరతనం ' మనకెందుకమ్మా?" 

" ఏమో! బాబూ! కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి .. ! "  

"అది కాదమ్మా! తమ్ముడు ఎంత కాలంగా  బియ్యస్సీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యీ ఖాళీగా ఉంటున్నాడు? ఇంకింత కాలం ఉన్నా వాడికి ఉద్యోగం రావటం డౌటే. ఏ సిఫార్సో , మూటో లేకపోతే  ఉద్యోగాలు వచ్చే రాజులా ఇవి? వీడి సంగతి ఒక్కసారి ఆయన చెవినబడింబా చిటెకెల మీద  ఉద్యోగం రెక్కలు కట్టుకు వాలిపోతుంది.”

రానీయరా! అప్పుడే చూద్దాం” అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు రాజు తండ్రి. 

ఆయన మెత్తబడినట్లు  తెలుస్తూనే ఉంది. రాఘనకు ఉత్తేజ మొచేసింది. ఉద్యోగ మొస్తుందన్న ఆశ తోటి. "అయినా ఈ రోజుల్లో కులం గిలం అట్టే ఎవరు పట్టించుకుంటున్నారే, అమ్మో! ఇందాక 
నువ్వు పెద్ద ఆచారాలను గురించి  చెబుతున్నావు కదా ! నువ్వు మొన్న , స్కూళ్ళ ఇన్ స్పెక్టరు గారు క్రిస్టియనైనా నట్టింట్లో నాన్నగారి పక్కన అకేసి అన్నం పెట్ట లేదూ? అప్పుడెక్కడికి పోయిందో కులం? ఆయన అధికారి. పింఛను  వ్యవహారం తొందరగా సెటిల్  చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ మీరు తాత్కాలికంగా కులం సంగతి మరిచిపోయారు. అందరూ ఈ రోజుల్లో అలాంటివి ఆవసరమయితే తప్ప ఎవరూ పట్టించు కోవటమే లేదు.”

"ఏమోరా, బాబూ! అవ్యక్తపు మనిషిని. నన్నెందుకు చంపుతారు ! అయినా చూస్తూ చూస్తూ ఆ అంట రాని పిల్లని వంటింట్లోకి ఎట్లారా  రానీయడం? " 

శాంత అందుకుంది: “అంటరానితనం ఏ కులంలో లేదే ఈ రోజుల్లో! మొన్న నువ్వూ, నేనూ రామలక్ష్మి కూతురు పుట్టిన రోజు పండుగకు పిలిస్తే ..  మనవాళ్ళే గదా.. అని వెళ్ళామా! ఏమయిందీ? నిన్ను ఆ పసిపిల్లను ముట్టు కోనిచ్చారా ? మర్యాదగా పలకరించారా? ఎందు కొచ్చావిక్కడికి  అన్నట్లు మాట్లాడలేదూ! వాళ్ళు మరి మన కులం వాళ్ళేగా! ఎందుకు మరి నిన్ను అంటదానివాళ్ళుగా చూశారు? నాళ్ళకు లాగా సినిమా హాల్సు, రైసు మిల్లులు లేవనేగా ? బీద బడిపంతులు భార్యవనేగా!" 

"మీ అందరూ చదవేసిన వాళ్ళు, తల్లీ! తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని అయినా చెయ్యగలరు.  తల్లితండ్రులం, మేం కోరుకునేదేమిటి?  మీరు చల్లగా ఉండటం కావాలి మాకు.  మీ కిదే ఇష్టమనుకుంటే అట్లాగే కానీయండి. లోకం మారిందంటున్నారుగా!  రాఘవగాడికన్నా ఉద్యోగమొస్తే అదే పది వేలు - ఆదే
మాకు పెద్ద బెంగయిం దిప్పుడు” అనేసి కంచాలు తీసుకుని వెళ్ళి పోయింది రాజు తల్లి. 

" హిప్ హిప్ హుర్రే ” అని అరిచాడు రాఘవ సంతోషం పట్టలేక.
" పెద్ద వాళ్ళను  ఇబ్బంది పెట్టకుండా పెళ్లి జరిగి పోతుంది" అని తృప్తిగా నిట్టూర్చాడు రాజు.

ఈశ్వరావుతో జరగదనుకున్న  పెళ్ళి మళ్ళీ ఖాయమయ్యే పరిస్థితి వచ్చేసరికి  శాంత కళ్ళ లోకి మెరుపులు  వచ్చేశాయి. 

రాజు ఆ సాయంత్రమే రాధ కోసం పార్కు కెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో. 

కానీ, రాధ పార్కుకు రానేలేదు. ఎంత నిరుత్సాహం కలిగిందో! 

మరునాడు కేంటీన్ లోను కనిపించ లేదు. కాలేజీలో వాకబు చేస్తే క్లాసుకే రాలేదన్నారు. 

అయోమయం అనిపిం చింది రాజుకు . . రాధ ఇంటికి వెళ్ళాడు.  తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప వెక్కిరించింది. 

వారం రోజులయింది.  కానీ , రాధ జాడ  అంతు పట్ట లేదు. పిచ్చెపోయినట్లయింది రాజుకు. 

ఆ రోజు పోస్టులో రాజాకు  కవరొచ్చింది. ముత్యాలు పేర్చినట్లుండే దస్తూరిని చూడగానే ఆనందంగా అనిపించింది. రాధ దగ్గర నుంచే సందేశం, 

ఆత్రుతగా   కవరు ఓపెన్ చేశాడు.  రాజు. 

శుభలేఖ బయట పడింది. జలాగా చిన్న ఉత్తరమూ
ఉంది! 

రాజ గారికి! 
 అర్థమయిందనుకుంటాను. 
నా పెళ్ళి నిశ్చయమై పోయింది. 
పరుడు మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిన  రాజకీయ నాయకుడి ఏకైక పుత్రరత్నం. 
మన విషయం ఆ రోజు ఇంట్లో కదిలించిన రోజు మా వాళ్ళ నిజస్వరూ పాలు బయట పడ్డాయి. 
'నీ పెళ్ళి మీద నేను బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాను, తల్లీ! అవి కల్లలయిపోవటానికి లేదు. వియ్యానికైనా, కయ్యానికైనా  సమ ఉజ్జీ ఉండాలి' అని నాన్న గారు కొట్టి పారేశారు. 

నా మొండితనం తెలిసి మా వాళ్ళు నిర్బంధంగా నన్ను  విశాఖపట్నం తీసుకొచ్చారు. వారుడుది ఈ  ఊరే. 
ఈ పెళ్ళితో మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు దొరుకుతుంది. అన్నయ్యకు పెద్ద కంపెనీలో జనరల్ మానేజరు పోస్టు దక్కుతుంది. అమ్మకు డాన్స్ స్కూలు పెట్టుకోవటానికి పర్మిషన్, ఫండ్సూ దొరుకుతాయి. 

మరి నాకో...? ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అభిమానించే సినిమాలల్లో, నవలల్లో ఉండే ఊక దంపుడు  ఉపన్యాసాల తాలూకు కులాలు, మతాలు వాటి మధ్య అసమానతలు, దోపిడి, ఘర్షణ అంతా ఆచరణలో పట్టవలసిన సందర్భం వస్తే  ఫార్స్  అనీ, మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అసమానతలు  అన్నిటికి కారణం ఏకైక పదార్థం ఒక్కటే. . అదే 'ఆర్థికం' అనే జ్ఞానం మాత్రం మిగులుతుంది రాజూ! వీలైతే నిన్ను క్షమించు; 

ఇట్లు, 

... 

రాజుకు సవ్వొచ్చింది. 'క్షమించటానికి తనెవరు? రాధ తల్లి తండ్రులను తప్పు పట్టటానికి తన కెక్కడ నైతికంగా హక్కుంది? తమ్ముడికి ఉద్యోగం వస్తుం దనీ, తండ్రి సమస్య తీరుతుందనీ, సంఘంలో మరో మెట్టు పైకి ఎక్క గలమనీ నచ్చచెపితే గదా . . తన తలి దండ్రులు కులం అడ్డును కూడా  కాదని ఒప్పుకుంది! 

అదే మార్గంలో  రాధ తల్లిదండ్రులూ వెళ్లారు. 

రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ.  అన్నీ  ఒకే  ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా! 

శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా  పైకి ఎగబాకాలని చూస్తున్నాడు! 

మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే! 

ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.

***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)  






రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది - కథానిక


ఆకాశరామన్న- కథానిక - ఆంధ్రభూమి- వార పత్రిక

ఆకాశరామన్న ఆంధ్రభూమి (19, ఫివ్రవరి, 2019)  నాటి వారపత్రికలోని నా కథానిక


















ఈ లింక్ నొక్కి  పిడిఎఫ్ చదువుకోవచ్చు!







Tuesday, February 12, 2019

అనిల్ కుమార్ 'ఆంకురం' కథానికపై. అభిప్రాయం


http://www.prasthanam.com/node/10
అనిల్‌ప్రసాద్ ' అంకురం ' అధునాతనమైన అంశం చుట్టూతా పాఠకుడిని తిప్పుకొచ్చిన చక్కని కధానిక 


ఎంత ముచ్చటగా ఉందో అచ్చంగా చందమామ కథలాగా! చదువుకున్న  ఆడపిల్ల నిష్కళ. పెళ్లి చేసి అత్తారింటికి పంపాలనే తల్లిదండ్రులు దిగులు పడుతుంటారు. ఊర్లోని రామారావుకి మల్లె కూతురుతో పాటు కొడుకూ ఉండి ఉంటే ఆడపిల్లని అత్తారింటికి పంపించినా ఊళ్లో పేరు నిలిపేటందుకు కొడుకు పనికొచ్చే వాడు - అని వెత చెందుతుంటారు కన్నవారందరిలాగే! నిష్కళ తనకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చదివి ఉద్యోగాలు దొరక్క  ఆటోలు బాడుగకు తిప్పుకునే ఇంజనీరు పట్టభద్రులందరికీ అందివచ్చే యాప్ ను అభివృద్ధి చేయిస్తుంది. స్థానిక యువకుడి చేత . నగరాలలో మాదీరి జిపిఆర్ సిస్టమ్ మండలం మొత్తానికి ఉపయోగపడే వ్యవస్థకు జీవం పోయిస్తుంది. ఊరిలోని పంచాయితీ ప్రాంగణంలోని గ్రంథాలయం స్థలాన్ని కంప్యూటర్ల సాయంతో డిజిటలైజ్ చేయిస్తుంది. బోలేడంత డబ్బు పోసే రిస్కుతో నగరాలకు పోయి చదువుకొనే బాదరబందీ నుంచీ విద్యార్థులకు తిప్పలు తష్పించే ప్రణాళిక ఆచరణలోకి తీసుకువస్తుంది . ఆడపిల్లలు ఎందరికో అందుబాటులోకి వచ్చే ఈ సుఖమైన , సులువైన పథకాన్ని సుసాధ్యం చేసేటందుకు  ప్రేరణ తన కన్నవారికి మగబిడ్డ లేని లోటు మనసును తొలిచేయకుండానట! గ్రామ సీమాలను తన సాంకేతిక పరిజ్ఞానంతో సాయం అందించే యువకుడు తటస్థపడితే అతని చెయ్యి అందుకుని . . అమెరికా , ఆస్ట్రేలియాలంటూ విదేశాల బాట పట్టనన్న  తన సంకల్పం కూడా ప్రకటిస్తుంది. సహజ శైలిలో , అతి శయోక్తులకు పోకుండా, ఆదర్శాల వల్లెవేత లేకుండా నేడు సమాజంలో కనుపడుతున్న ఆకలి ఆరాటాన్ని, అభివృద్ధి పురోగతిని చక్కగా సమన్వ యిస్తూ నాటకీయతకు దూరంగా చక్కని కథను అల్లిన రచయిత అనిల్‌ ప్రసాద్  కచ్చితంగా అభినందనీయుడు! మంచి వికాస లక్షణ సమన్వితమైన కథను అందించినందుక్కూడా ధన్యవాదాలు!

Monday, February 11, 2019

కొమఱ్రాజుగారి ‘వియోగ గీతి’ కత!- సాహిత్య ముర్మురాలు-



వడ్డాది సుబ్బారాయుడిగారు సతీ స్నృతి తెలుగులో వచ్చిన ఒక ప్రముఖ సంతాప కావ్యం (ఎలజీ). సుబ్బారాయుడిగారి వై వాహిక జీవితం చాలా పరితాపకరమైనది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. నలుగురు కాదు.. ఏకంగా ఐదుగురు సాథ్వీమణులు ఆయన చేత మెడలో తాళి కట్టించుకున్నా ఒక్కరికైనా కలకాలం కలసి జీవనయానం సాగించే యోగం లేకపోయింది. మొదటి కళత్రం పోయిన 1881 ప్రాంతంలో సుబ్బారాయుదుగారు ఇందాక చెప్పుకున్న కళత్ర వియోగానికి సంబంధిచిన కవితా సంపుటి రాసారు. కవిగారు రాసారు కానీ.. ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు రాని దుర్గతి. కొక్కొండ వెంకత రత్నం పంతులుగారే తన ఆంధ్రభాషా సంజీవని పత్రికలో మొదటి సారి దాన్ని అచ్చువేసారు. దరిమిలా అది ఒక సంపుటిగా వెలువరించడం.. అశేషమైన ప్రచారం సంపాదించుకోవడం.. అదో విశేషం. అక్కడితో అయిపోతే ఇక్కడ ఈ కథ చెప్పుకునే అవసరమే ఉండేది కాదు.
సుబ్బారాయుడిగారి సతీ స్మృతి చదివి విశేషంగా ఉత్తేజం పొందిన వారు అసంఖ్యాకులు, అందులో కొమఱ్రాజు లక్ష్మణరావుగారూ ఒకరు. ఆ కావ్యం చదివిన ప్రభావంతో ఆయనా వియోగ గీతి ఒకటి మరాఠీలో వెలువరింప చేసారు. యథాప్రకారం దానికీ అశేషమైన పాఠకులు స్పందించారు. కవిగారికి ఇంత చిన్నవయసులోనే కలిగిన కళత్రవియోగానికి చింతించని సహృదయుడు లేడు. ఉత్తరాల ద్వారా ఊరడించే వాళ్ళు కొందరైతే.. వీలు కల్పించుకొని మరీ కొంతమంది శోకతప్తులు ఏకంగా పూలదండలు పుచ్చుకొని మరీ పరామర్శలకొచ్చేవారు కొందరు! కొసమెరుపేమిటంటే.. కొమఱ్రాజు వారికి అప్పుడు నూనూగు మీసాల వయసే. భార్య సంగతి పక్కనుంచి.. అప్పటి మన సంప్రదాయాల ప్రకారం ఇంకా మగపిల్లవాడి ముందు పెళ్లి ప్రస్తావనలు సైతం తీసుకురాకూడని తరుణం!
ఈ అనుభవంతో జడిసిన కొమఱ్రాజువారు కవిత్వం రాయడం బంద్. ఆ తరువాత ఆయన రాసినవన్నీ  కవిత్వానికి ఆమడ దూరంలో ఉండటం గమనార్హం!
(సోర్స్ః ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం 4వ సంపుటి- పుట 235)

(అంతర్జాతీయ వితంతు దినోత్సవం  23, జూన్  సందర్భంగా రాసింది)
-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...