Monday, December 9, 2019

సెటైర్ కు రిటైర్ మెంటా ! వ్యంగ్య వ్యాసం - జి. సరోజినీదేవి ( కర్లపాలెం హనుమంతరావు) సూర్య దిన పత్రిక ప్రచురితం




  పాలకులు కలాలకు కళ్ళేలు వేయచూస్తున్నారంటే.. తమ పాలనలోనే లోపాలు ఉన్నట్లు లెక్క! పెద్దల తప్పులను చమత్కారంగా ఎత్తిచూపే వ్యంగ్య రచనలకు ఈ సూత్రం చక్కగా సరిపోతుంది!ఈ అంశాన్నే విస్తారంగా చర్చించిన ఈ వ్యంగ్యల్పిక ఈ నాటి (ఆదివారం)సూర్య దినపత్రికలోనది ఈ వ్యాసం. భావస్వేచ్ఛ ప్రాధాన్యతని నొక్కి చెప్పిన ఈ వ్యాసాన్ని ఎంతో ధైర్యంగా ప్రచురించిన సూర్య దినపత్రిక సంపాదకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు.. రచయితల అందరి తరుఫునా నమస్సులు!

సెటైర్ కు రిటైర్ మెంటా!
శబ్దరత్నాకరంలాంటి ఏ పద కోశమో తిరగేసి చూడండి.. 'వెక్కిరింత' అంటే  తిట్టిపోయడం అనో బెదిరించడం అనో అర్థం కనిపిస్తుంది! అబ్బెబ్బే..  బెదిరించే పాటి బలమే ఉంటే ఈ తెరచాటు  సూటిపోటీ మాటలెందుకండీ సెటైరిస్టుకు? నేరుగా ఏ స్వతంత్ర అభ్యర్థిగానో పోటీకి దిగిపోయి ప్రచారం వంకతో  చివర్రోజు ఆఖరి క్షణం దాకా హాయిగా కడుపులో ఉన్న ఉబ్బరమంతా సుబ్బరంగా తీర్చేసుకోడా? ఈ.సి కోడా.. పాడా!  ముందు మీడియా ఫోకస్  ప్లస్ పాయింటవుతుంది కదా! 

ఎదుటి పోటీదారుడు ఏ మాజీ సి.యమ్మో.. అతగాడి ముద్దుల తనయుడో అయితేనో! అమ్మో.. కోరి కోరి ఎద్దుకొమ్ముల ముందుకెళ్లి కుమ్మించేసుకున్నట్లే గదా! ఈ పీడాకారమంతా ఎందుకనే.. అధిక శాతం చేతి జిలగాళ్లు కుండ బద్దలుకొట్టె రిస్కులకు దిగకుండా రస్కుల్లాంటి రాతల బాటపట్టేది! ఇప్పుడా సైడూ ‘నో ఎంట్రీ’ బోర్డ్ వేలాడుతోంది. అందుకే వెటకారిస్టుల ఈ గోల! 
నేరుగా పబ్లిక్ మీటింగుల్లో పాతచెప్పులు విసిరేసినా ‘పోనీలే.. పాప’మని  క్షమించేసే మన నేతలు కొందరు అదేందో మరి.. ఆ దయాగుణం మాత్రం దెప్పిపొడిచే రచయితల మీద వీసమైనా చూపించడం లేదు!  
 పిచ్చి చేష్టలను తప్పుపట్టడం వెనకాల.. ఛాన్సు వచ్చింది కదా..  కచ్చ తీర్చుకోవచ్చన్న పిచ్చి దుర్బుద్ధి ఒక్కటే ఉండదు సుమండీ! చపలచిత్తుడి బుద్ధిని శుద్ధి చేద్దామన్న మంచి  ఉద్దేశమూ కొంతమందికి కద్దు. ఒకానొక కాలంలో ఏకోజీ మహారాజు కొలువులో ఒక వెలుగు వెలిగిన   వాంఛానాథుడు రాజుగారి పాలనలోని ప్రజాపీడనకు అలిగి దున్నపోతును అడ్డం పెట్టుకుని మరీ ఓ వంద పద్యాల్లో తిట్టిపోసాడు. అన్నీ చమత్కారాలే అందులో! కుపరిపాలన సాగించే అసమర్థులను వ్యంగ్య విధానంలో దెప్పి దారికి తెచ్చే మంచి పద్ధతి మొరటు కాలమని మనం వెక్కిరించే ఆ 15వ శతాబ్దిలోనే ఉంది కదా! అన్ని విధాలా అభివృద్ధి చెందిన అతి మహా పెద్ద ప్రజాస్వామ్యంలో మనం సుపరిపాలన సాగించేస్తున్నామని ప్రపంచానికి గొప్పలు చెప్పుకుంటున్నాం కదా! అయినా.. నిరసన స్వరాలు వినిపిస్తాయన్న జంకుతో వ్యంగ్యం మీద ఇంకా ఇన్ని రుసరుసలా? పెన్నును గన్నులా వాడేవాడిని కూడా ఓపిగ్గా అర్థంచేసుకోడమే ఓపెన్ డెమోక్రసీ ఉత్తమ లక్షణం పాలకులారా! 
గాడి తప్పినవాడుగా  సెటైరిస్టుగాడిని ఊరికే ఈసడించుకోడం తగదు!  వాచాలత్వాన్నీ ఏ కవిత్వం మల్లేనో అల్లి గిట్టనివాళ్లని గిల్లడానికీ  బోలెడంత గడుసుతనం కావాలి  .   సెటిలర్సునే గుండెల్లో పొదువుకుంటామంటూ వాడవాడలా తిరిగొచ్చే దొరలు..   సెటైరిస్టుల్నీ ఆ కౌగిట్లోనే ప్రేమగా పొదువుకోవచ్చుగదా! రాసే రాసే కలాలని వాలంటరీ రిటైర్మెంటు తీసుకొమ్మనడం ధర్మమా? బాంచెన్.. మీ కల్మొక్తా .. జర చెప్పుండ్రి సార్లూ!  
 పిల్లులు గోడల మీదా, ఎలుకలు గాదెల కిందా చేరి రాజకీయాల పేరున  రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. ఆ విరక్తితోనే కదా  ఆ  పిల్లి మీదా, ఈ  ఎలుక మీదా  పెట్టి అన్యాపదేశంగా పెద్దయ్యల అన్యాయాల మీద దండెత్తేది!డైరెక్టు ఎటాకర్సుతోనేమో ఏదోలా చీకట్లో మాటలు కలిపేసుకోవచ్చు.. వీలును బట్టి తమలో కలిపేసుకోవచ్చునేం! ఇన్ డైరెక్టు భాషలో ఏదో గుసగుసలు పోయే  వెటకారిస్టుల మీదనేనా  ఈ గుడ్లురమడాలూ! 
సెటైరిస్టుల స్క్రిప్టుల  సాయం లేకుండా ఏ పొలిటీషియన్ స్టేజ్ మీద ఎట్రాక్టివ్ ఉపన్యాసాలివ్వగలడో తేల్చండి! కామెడీ రాతగాళ్లు కేవలం మందు పార్టీలల్లో వినోదాల విందుల వరకేనా పరిమితం? 
ఎంత కసి ఉంటే  ఆ జోనాథన్ స్విఫ్టంతటి సెటైరిస్టు గలివర్ని అడ్డుపెట్టుకొని మరీ తన కాలం నాటి   పాలకులకు గడ్డిపెట్టాడు! బతుకు తెరువు కోసమే కదా మహానుభావులారా ఎప్పట్లా పిట్టల్ని కొట్టిందా నిషాదుడు రామాయణ కాలంలో! అయినా ఆనాడు  వాల్మీకంతటి మహర్షికే అంత లావు కోపం తన్నుకొచ్చేసిందే! అంత ఉక్రోషంలో కూడా ఆయన నిషాదుడి  మీద చెయ్యెత్తింది లేదు.  ప్రపంచం పూజించే ఉత్కృష్ట కావ్యం చెప్పవతల గిరాటేశాడు! వాల్మీకిని అసలు కలమే పట్టవద్దని   ఏ శ్రీరామచంద్రుడో వారించుంటే? లోకం గర్వించే రామాయణం అసలు రూపుదిద్దుకొనేదేనా? రాసే కలాలకి  అందుకే  పాలకులు పూర్తి స్వేచ్ఛనివ్వాలి.  సజావుగా జనాలను పాలించడం రాక  నేతలు సెటైరిస్టుల మీద పడితే ఎట్లా? 
చేతి ఉంగరం పోయిందని చెరువు మీద, రాసుకునే వేళకు పత్రాలందించలేదని  తాటిచెట్టు మీద.. అలిగి తిట్లపురాణాలకు దిగిన బండకవులకేమో తమరు గండపెండేరాలూ, పూల దండలతో సత్కారాలూ?! చెరువు పూడికలు తీయించాలని, చెట్లు ఏపుగా పెంచి ట్రీ గార్డులు పెట్టించాలని..  ఏదో వంకన జనం సొమ్మును మూటకట్టి    చంకనేసుకుపోయే వంకరబుద్ధి ఆషాఢభూతులను వెటకరించినందుకేమో వెంటాడి వెంటాడి వేధించడాలా? 
చెడ్డకు ఎదురొడ్డి నేరుగా గోదాలో కలబడే గుండె నిబ్బరం  అందరికీ ఉంటుందా? ఆ  సత్తా లేనప్పుడే కదా  పిల్లి మీదా ఎలుక మీదా పెట్టి జబ్బసత్తువ కొద్దీ దెప్పిపొడవడాలూ!    
ఎదుటి శాల్తీ పిచ్చి చేష్టలను నేరుగా ఎదుర్కొనే సత్తా లేనప్పుడే దెప్పిపొడుపు భాషను పుట్టుకొచ్చేది! బైటికి కనిపించే పదాన్ని పట్టుకొచ్చి.. లోపల గూఢార్థం చొప్పించి దెప్పడంలో ఎంత గడుసుతనం కావాలో! ఆ లోపలి అర్థాలకే లోపాలున్న శ్రీరంగనీతి జాతికి ఉలుకుపాటు. నవ్వించే విధంగా ఉంటుంది కాబట్టి నలుగురి ముందూ తానూ నవ్వక తప్పదు. కానీ ‘బిడ్డా! నా టైము రానీ.. అడ్డంగా నరుకుతా!’ అని పాలకులు హూంకరించడమే ప్రజాస్వామ్యానికి పెద్దహాని. 
పాలకులే కానక్కర్లేదు .. పలు సందర్భాలలో సమాజమే తన మూర్ఖత్వం వల్ల దెప్పులపాలవడం కద్దు.  వీరేశలింగం వంటి పెద్దలు ఇదిగో ఈఎత్తిపొడుపు  దారినే పోయి సమాజానికింత సోయి తెప్పించే ప్రయత్నం చేసింది. సంఘాన్ని గమ్మత్తుగా మరమ్మత్తు చేసేందుకు సెటైర్ ను మించిన  ఆయుధం లేదని గురజాడగారికీ గట్టి నమ్మకం.  కాబట్టే  కన్యాశుల్కం నాటకం వంకన నాటి సొసైటీ తాట తీసారు.  చిలకమర్తి  గణపతి, మొక్కపాటి పార్వతీశం,  పానుగంటి జంఘాలశాస్త్రి..  మనిషిలోని, సంఘంలోని వంకరబుద్ధుల్ని, వెంగళాయితానాన్ని, అమాయకత్వాన్ని, అహంభావాన్నీ ‘ఇహ నా వల్ల కాదురా బాబూ!’ అన్నంత గొప్పగా కడుపుబ్బా నవ్విస్తూనే కడిగవతల పారేసారు సారులూ! చమత్కారం,  వెక్కిరింతల వంటి జోడు గుర్రాలను పూన్చి వ్యంగ్యరథాన్ని పిచ్చి కలుపు మొక్కలు పెరిగిన  వ్యవస్థల మీదుగా  లాగుతుండబట్టే  నలుగురూ నడిచే బాట ఈ మాత్రమైనా చదునుగా ఉండింది!  నేరుగా పడే గంటె వాతల  కంటే కొంటెపూలు కట్టిన కుచ్చుల జడతో కొట్టే దెబ్బల్లోనే  మజా ఉంటుంది!    'జమీందారు రోల్సు కారు, మహారాజు మనీపర్శు..  మాయంటావా? అంతా/ మిథ్యంటావా?' అంటూ ముద్దుల వేదాంతిని సైతం వదలకుండా తలంటుపోసాడా మహానుభావుడు శ్రీ శ్రీ! అంత మాత్రానికే జాతికి ఆసారాం బాపూలు, నీరవ్ మోదీల వంటి పీడలు వదులుతాయనా?  సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి  ఇవ్వరని ఆడంగుల మీదా, రాజకీయ నేతల హంగు ఆర్భాటాల మీదా చలం ఇలాగే చిందులేసాడు ముందు. ఆఖరికి ఆ అరుణాచలం యోగీ  శ్రీ శ్రీ తరహా ఎకసెక్కాలని ఎరక్కపోవడం క్షమించరాని నేరమని బాహాటంగానే ఒప్పుకున్నాడు!  అదీ వ్యంగ్యం తాలూకూ హంగూ ఆర్భాటం.  ఇప్పటి నేతలకే మరి ఎందుకో వ్యంగ్యమంటే అంత ఖంగూ.. కంగారూ!
వేరే చేసేదేం లేకపోయినా దారే పోయే దానయ్యనైనా తన దాకా రప్పించుకుని కాసేపు నవ్వించే గారడీ కాదు స్వాములూ  వ్యంగ్యమంటే! చేత్తో చూపించిన టెంకెను కళ్ల ముందే భూమిలో పాతి.. లోటాడు నీళ్లైనా పోయాకుండానే ఒక్క నిమిషంలో  మొలిచిన చెట్టు నుంచి  దోర మాగిన మామిడి పండంటూ  ముక్కలుగా కోసి ఉప్పూ కారాలద్ది నాలిక్కి రుద్ధి ‘ఆహాఁ.. ఏమి రుచిరా!’ అని మైమరపించే అతితెలివి  నేటి  నేతాగణాలది. మతులు పోగొట్టే ఆ విద్యలన్నింటి వెనకాల ఉన్న  అసలు టక్కు టామారలన్నింటినీ నవ్విస్తున్నట్లే నవ్విస్తూ విప్పిచెప్పే సత్తా ఉండేది ఒక్క సెటైర్ రైటరుకే! లోకం కళ్లు నాజూగ్గా తెరిపించేది ఒక్క   సెటైరిస్టే.  తమ   గుట్టు రట్టవుతుందన్న కంటు పెట్టుకుని నవ్వించే కలాల  మీద నిర్భంధం విధించే కన్నా ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాలేవీ వమ్ముకాకుండా విధులు సక్రమంగా నిర్వర్తిస్తామంటే ప్రజాప్రతినిధులను అడ్డుకునేదెవరు? చెయ్యాల్సిన ప్రజాసేవలు మాని తమను అభాసు పాల్చేస్తున్నారని సెటైరిస్టులను రిటైరైపొమ్మనడమే అన్యాయం! ఎత్తిపొడుపులతో సెటైరిస్టులు ఎత్తిచూపే  లోపాలను కాస్తింత అవగాహన చేసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేసేస్తే సరి.. సర్వే జనా హాపీ! చేతిలో కత్తి ఉంది కదా అని.. పూలగుత్తి కుత్తిక కత్తిరించేస్తామంటేనే ఇబ్బంది? తుగ్లక్ పాలకులున్నంత కాలమూ  గజ్జెల మల్లారెడ్డి  జజ్జనక జనారేలు గజ్జెకట్టి పాడుతూనే ఉంటాయి సుమా! 
కారుణ్యకవి జాషువా ’వర్ణమునకన్న పిశాచము భారతంబునన్/ కనుపడలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆ దెప్పిపొడుపు వెనకాల ఎంత గుండెనొప్పి ఉందో మతికి తెచ్చుకోవాలి  ముందు మంచి మంచిపాలకులనేవాడు! 'దిబ్బావధాన్లు కొడుక్కి ఊష్ణం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేయడానికి ఇంగ్లీషు చదువే కారణం'గా కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు మూఢంగా ఎందుకు  నమ్ముతున్నాడో సంఘం ముందుగా స్వీయవిమర్శ చేసుకోవాలి. ‘మును సుముహూర్తము’ నిశ్చయించినా సతి ముండెట్లు మోసెరా?' అని కుండబద్దలు కొట్టినందుకు వేమన బుర్ర బద్దలు కొట్టకుండా అతి మత విశ్వాసులే  ముందు తన బుర్రబద్దలు కొట్టుకొనయినా మూఢవిశ్వాసాల ఊబి  నుండి బైటపడాలి. 'ఈ పురాతన ధూళిలో బ్రతుకుతున్న వాడికి/ ఒక ఇల్లు కావాలని చెప్పడానికి మార్క్సు కావాలా?నీకిది ఇన్నాళ్లూ తోచకపోతే నీ కంటే నేరస్తుడు  లేడు' పొమ్మన్నాడు గుంటూరు శేషేంద్ర శర్మ. అధర్మం, అన్యాయం, దోపిడీ, మూఢత్వం, అజ్ఞానం, దౌర్జన్యం, అవినీతి, అమానుషాల వంటి దురాచారాలు, బలహీనతలు, నైచ్యాల మీద  ఎక్కుపెట్టిన రాంబాణం దొరా వ్యంగ్య రచయిత చేతిలోని లేఖిని అనే  బ్రహ్మాస్త్రం. అవసరాన్ని బట్టి అది రావణసంహారానికి ఎదురొడ్డి నిలబడ్డట్లే.. సందర్భాన్ని బట్టి చెట్టు చాటు నుంచైనా వాలి వంటి అపరాధిని వధిస్తుంది. మొట్టితే తప్ప ఖలుడే కాదు దేవుడూ దారికి రాడని నమ్మకం నుంచి పుట్టింది బాబులూ ఈ సెటైర్!  సున్నితంగా, సుతారంగా హాస్యంతో కలగలిపి వడ్డించి మరీ మెక్కేవాడికైనా భుక్తాయాసం తెలీనంత గమ్మత్తు వ్యంగ్యంలో ఉంది.  బలవంత పెట్టినా రిటైర్  అయ్యేది కాదు సెటైర్!    పాలకులు దారికి వచ్చే వరకు చాటుమాటుగానైనా సరే సెటైరిస్టుల యుద్ధానికి రెస్టంటూఉండదు!
- కర్లపాలెం హనుమంతరావు '

( సూర్య దిన పత్రిక ప్రచురితం ) 

Sunday, December 8, 2019

చెత్త చట్టాలు! -కర్లపాలెం హనుమంతరావు సూర్య దినపత్రిక వ్యంగ్య వ్యాసం




ఇజ్రాయిల్లో పుచ్చకాయలు బహిష్కరించారు ఒకానొకప్పట్లో. అయినా ఏ నిందలపాలూ కాలేదు అక్కడి ప్రభుత్వాలు అప్పట్లో. అదే మన ఇండియాలో అయితేనో? పాలుపోసే సాంబయ్య చెంబులో  నాలుగు చుక్కల నీళ్లెక్కువ కలిపినా  పాలకులదే ఆ పాపభారమంతా! ఇండిగో విమానం ‘ఫర్ సేల్‘కని వచ్చినప్పుడు చూసాం గదా ఇండియాలో హోరెత్తిన  కనీ వినీ ఎరుగని ఆ  గోలంతా!
నార్త్ కొరియాలో ‘నో మెక్డొనాల్డ్’ అన్నారింకోసారి.  నారికేళాలతో సరిపుచ్చుకున్నారే తప్పించి నోరెత్తి.. ‘ఆయ్ఁ! ఇదేం పిచ్చి పని’ అని  ఒక్క బక్కజీవైనా గద్దించిన పాపాన పోలేదు సర్కార్లని. అదే ఇక్కడయితేనా? ఖాళీ మందు గళాసులతో నడిరోడ్ల మీద కొచ్చిపడి చేసే గలాటా అంతా  ఇంతానా! పాక్షిక మద్యపానమైనా సరే.. సంపూర్ణంగా నిషేధించిందాకా  బీహార్ నితీష్ బాబును  నిద్రపోనిచ్చారా దేశీయ దేవదాసు ఔరసులు!  
మరీ అంత చుక్క మీద మనసు చావకపోతే ఇంచక్కా  ఐర్లాండు పోతే సరి అయిన ఓ పెద్దాయన సలహా ఉపరి! అక్కడయితే ఏ పరీక్ష రాసే నెపంతోనో హాల్లో చేరగిలబడి బల్ల మీదో కత్తి గుచ్చేస్తే ఫినిఫ్! ఫ్రీగా పీకల్దాకా ఎన్ని పింటులైనా తాగేసేయచ్చంట! విద్యార్థులు టెస్టులు గట్రా రాసేటప్పుడు నోట్లో గొట్టం పెట్టే టైపు ఆల్కహాల్ టెస్టింగులు చట్టవిరుద్ధంటండీ అక్కడ!
అంత కన్నా పిచ్చి రూలుందంట ఓరేగావ్ అని ఓ మరో చోట కొన్ని ఉద్ధరింపుళ్ళల్లో! ఎంత వరకు నిజమో.. అబద్ధమో నికరంగా తెలీదు కానీ.. అచ్చోట బళ్లల్లో ఆడపిల్లలు అచ్చోసిన లేగదూడలకు మల్లే జుట్టూ జుట్టూ పట్టేసుకొని కొట్టేసుకోడం గొప్ప నేరం. ఆ తరహా జుట్టు చట్టం మన దగ్గర సర్దాకైనా ఊహించుకు చూడండి! టీవీ చర్చల్లో ఒక్క పురుగైనా కనిపిస్తుందా? చట్టసభల   పోటీకి  ఒక్క శాల్తీ  అయినా సిద్ధపడుతుందా?
మిన్నెసోటా అనే మరో చోట మగాళ్లు గడ్డాలు గీక్కుంటే నేరంట.. మరీ విడ్డూరం కదా!  నెబ్రాస్కా అనే ఇంకో వింత ప్రాంతంలో  పబ్లిక్ షేవింగులకు చట్టం ఒప్పుకోదు. మన దగ్గర బాహాటంగా తలలు తెగతరుక్కుంటున్నా రక్షకదళాలు ఆ తరహా సిల్లీ గలాటాల జోలికి పోవు.. నరికే శాల్తీ ఏ పెద్దమనిషి తాలూకూ సరుకు కాదని తేలే వరకు!  
థాయ్ లాండులో అండర్ వేర్ లేకుండా అపార్టుమెంటు గ్రౌండులో కూడా కనిపించకూడదంటండీ!  ఇండియాలో మాదిరి బండచట్టాలేం పచేస్తాయ్? బంజారా, బూబ్లీ, ఫిల్మ్ నగర్ పరిధులయినా సరే.. నో ప్రాబ్లం! ఎంత జాలీగా బజార్లల్లో పడి బడితె మార్క్ ప్రొటెస్టులు చేసుకుంటే అంత పాప్యులారిటీ ప్లస్సవుతుంది! పది హిట్ మూవీలల్లో తన్నుకులాడి చచ్చినా  పట్టించుకోని జనాలు ఒక్క పావుగంట వైరల్ వీడియోతో  నీరాజనాలు పట్టేస్తారు!
ఇండియన్ పీపుల్ ఎంతో  లక్కీ అండీ ఇక్కడ!  ఇంటావిడ కారూ గట్రాలు బైటికి తీసి షికారుకని బైలుదేరితే ఎర్ర పీలికోటి చేతపట్టి మొగుడనేవాడు ముందు నడవాలి ఊటాలో! గాడి ఏ మాత్రం గాడి తప్పినా  ఆమగాడి బతుకు తెల్లార్లూ కటకటాల్లో !
మిన్నెసోటాలో మరీ సోద్దెం బాబూ! వంటి మీదొక్క నూలు పోగైనా లేకుండా కంటి మీదకు కునుకు రాకూడదు. కాదంటే తెల్లారి లేచేసరికల్లా పళ్లు తోముకొనేది సరాసరి జైలు ఊచలకు అవతాలే!  
న్నట్లు రోజులో రెండోసారి పళ్లుతోమేందుకు ట్రై చేస్తే  పొలోమంటూ పోలీసోళ్ళొచ్చి పట్టుకుపోడం  రష్యాలో రూలుట! హాస్యం కాదు సుమా! ఇదాహో అని మరో వింత ప్రాంతం! ఇదీ  ఎంత వరకు నిజమో తెసిసేడవదు కానీ.. ఇక్కడ తలకు తుండు  చుట్టుకుని బాహాటంగా  కనపిస్తే మరుక్షణమే ఆ శాల్తీకి  శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తు! మరదే  మన దేశంలోనో? తుండు తుపాకీ గుండు కన్నా  పవర్ఫుల్! మన నేతాశ్రీలేసే వేషాలేన్నీ చూస్తున్నాంగా! గుండు మీద తుండు, మెళ్లో ఓ  ఎర్రటి  తువ్వాలూ ఉంటే సరి తుక్కుజనాల కష్టసుఖాలల్లో పాలుపంచుకుంటున్నట్లే కదా! తిక్క లెక్క!
ఇటలీది ఇంకా ఇరగబాటుతనమండీ బాబూ! జుట్టుకు రంగేసుకోడం.. విరగబోసుకు తిరిగేయడం  అక్కడ మహా విశృంఖల పాతకం!   ఇక్కడో? నోట్లో పళ్లన్నీ రాలిన పండుకోతి తాతయినా ఓకే! తలకో బెత్తెడు మందాన నల్లరంగు బెత్తి ‘తా తై.. థక్ దిమ్.. తా తై థక్ ధిమ్’ అంటూ రిథమిక్కా  ఓ రెండు వీణ స్టెప్పులేస్తే సరి!   అభిమాన సందోహాల ఆనంద పారవశ్యాలతో వెండితెరలన్నీ చిరిగిపోవాలి! నెత్తి మీద ఏ రంగూ పడనందుకే   కదండీ.. పాపం అంత లావు  సీనియర్సయి ఉండీ ‘అద్వానీజీ  అండ్ కో’ మాజీ మహానేతల గుంపులో కలిసిపోయిందీ!
అంగోలాలో మరో రకం గోల! ఆడజీవిగా పుట్టడం శాపం అక్కడ. అడపా దడపా అయినా సరే జీన్స్ డ్రస్సులేసుకోడం పాపం! మరి మన దగ్గర? నయీం లాంటి బడాచోర్లూ, వంచకులక్కూడా చోళీ.. లంగాలే తప్పించుకొనే షార్ట్ కట్ రూట్లు. ఆడవేషంలో అతగాడేసిన హిజ్రా వేషాలకు పక్క పాకిస్తానులో అయితేనా.. మడిచి పొయ్యిలో పెట్టెయ్యరూ!
ఫ్లోరిడాలో కోడిపిల్లలు రక్షణకేటగిరీకి చెందిన జీవాలుట. తినే బొచ్చెలో వాటి బొచ్చింత కనిపించినా చచ్చినట్లు..  తతిమ్మా భోజనమంతా బొక్కలోకెళ్లిన తరువాతే బొక్కాల్సింది! 
చీకట్లో ‘మ్యావ్’ మన్నా కొలొరాడో పిల్లుల  ఖర్మ కాలిందన్నమాటే! పర్మినెంటుగా వాటి తోకలు కటింగ్ చెయ్యాలన్నది అక్కడి గవర్నమెంట్ ఫిటింగ్! అదే ఇండియన్ పిల్లులయితేనో? గోడల మీద చేరడం తరువాయి.. దిగేటంత వరకూ వాటికి అలకపాన్పు మీది  అల్లుడి వైభోగాలే కదా రాజకీయ పార్టీలల్లో!
ఇండోనీషియాలో, ఐస్ బెర్గ్ లో కుక్కల్ని వేటాడ్డం, పెంచడం శిక్షార్హమైన నేరంరా నాయనా! మన దగ్గర  అందుకు పూర్తిగా విరుద్ధం.  ఆవేశకావేశాల్లో ఏదో  కుక్కల  మీద  కాస్తింత మొరిగినా.. ఎన్నికలొచ్చినప్పుడు  మాత్రం ప్రధానంతటి పై  స్థాయి పెద్దమనిషీ  దేశానిక్కావలి కాసే కాంపిటీషన్లో బుల్ డాగ్స్ తో సైతం ‘సైరా’ అనేందుకు సిద్ధం!
నార్త్ కరోలినాలో రక్తసంబంధీకలు అయినా సరే ‘విత్ ఇన్ లా’ లో ఉంటే  ఏ ‘సన్-ఇన్-లా’ నో,,, ‘డాటర్-ఇన్‌-లా’ నో అయుపోవచ్చు.  సొసైటీకే మాత్రం నో అబ్జెక్షన్! 'ఛీఁ పాడూఁ' అంటూ తమరలా ఫేస్ పెట్టేయకండి సారూ! గెలిపించిన పార్టీకే ‘ఛీఁ’ కొట్టేసి మళ్లీ  మరో పార్టీ జెండా పట్టుకొనొచ్చినా ‘ఛీఁర్స్’ అంటూ మరి ఆ నేతగాడిగేగా తమరూ ఓటేసి మరీ గట్టెక్కించేసేదీ! 
కంప్యూటర్లో  సవాలక్ష ప్రశ్నలడుక్కోండి! ఏ మాత్రం ఉడుక్కోదు ఫ్లోరిడాలో ‘సిరి’! ఏదో ఫ్లోలో ఎవరైనా అన్నారేమో తెలీదు కానీ.. హాస్యానికైనా ’ఫలానా శవం ఏ గదిలో దాగుందమ్మీ?’ లాంటి దగుల్భాజీ సమాచారం దాన్నుంచీ రాబట్టాలని చూసావవనుకో!  ఆనక  తీరిగ్గా  తమరే విచారించాలి తతిమ్మా జీవితమంతా కటకటాల వెనకాతల చేరి!  ఆ ‘సిరి’ సంగతి  ఓకే! మరి మన దగ్గర్నో?  నడి బజార్న ఆడబిడ్డను  ఏ మదమెక్కిన కుంకలో చిత్రహింసలు పెట్టినా ఎన్ కౌంటర్లకు ఎన్నో ఆటంకాలు!
---
 “అబ్బబ్బ! ఆపవయ్యా సామీ!  పది నిమిషాల బట్టి ఒహటే సోది! అసలే అవతల పురపాలక ఎన్నికలతో పుంజెం పుంజెంగా ఉంటేనూ! వేళాకోళాలకు లేదా వేళాపాళా? మరీ అంతలా గిల్లాలని చెయ్యి సలపరంగా ఉంటే  మన  దగ్గరే  చచ్చుబండ చట్టాలు సవాలక్ష ఏడుస్తున్నాయ్ ఏళ్ల తరబడి! కలేజా ఉంటే వాటి మీదయ్యా ముందు నీ కత్తి ఝుళిపించాలి! ఎక్కడివో న్యూ జెర్శీ కహానీలు ఇక్కడ మనకెందుకు చెప్పు? చెప్పులు నేరుగా ముఖం మీద పడుతుంటేనే దులపరించుకునే దున్నపోతులు కదా మన నేతలు! అన్యాపదేశాలు, ధర్మోపదేశాలు చెప్పి నువ్వేదో ఉద్ధరించబోతే.. ముందు అన్యాయమైపోయ్యేది నువ్వే బాబూ! నెట్టింట్లో టైం పాసు వరకే సుమా నువ్వు చెప్పుకొచ్చే ఈ సరదా చట్టాలన్నీ! ఆ పక్కనే ఓ మూల పడున్నదా బుల్లి దేశం జపాన్! అక్కడ ఈడొచ్చిన ఆడబిడ్డలు తొమ్మిది సార్లకు మించి డేటింగులకు ‘నో’  అనరాదు, అంటే డేంజర్! మొగుడుగారు రాలగొట్టిన పళ్లైనా సరే మళ్లీ కట్టించుకోడానికి ఆ  మొగాడి  పర్మిషనే తప్పనిసరి ‘పెర్మెంటో’లో!  ఆర్కాన్సానో మరేదో దిక్కుమాలిన దేశమో.. అక్కడా మొగుళ్లు పెళ్లాలను చిత్తమొచ్చినంత సేపు  చితక్కొట్టుకోవచ్చునంట పేంబెత్తంతో. బట్ ఆ  కోటింగు గాని నెలకోటి దాటిందా.. ముందా   మొగుడుగారి పనే శ్రీమద్రమారమణ గోవిందో హరి! ఒక్క సెకనుకు మించి సొళ్లు కారుస్తూ ముద్దులాడేస్తే పోలీసోళ్ల చట్టం ప్రకారం నేరం మైనే అనే ఓ మినీ దేశంలో.  పెళ్లాం పుట్టిన రోజును మొగుడు మర్చిపోతే  నమోనా దేశంలో అదో క్షమించరాని నేరం.    ఇట్లాంటి చెత్తనా నెట్లోంచి పోగేసుకొచ్చి నువ్వు మన మీద దెబ్బలాటకొచ్చేసేదీ!  మన దగ్గర ఆడజీవులకేమన్నా మా లావు స్వేచ్చా స్వాత్రంత్ర్యాలు కొల్లపోతున్నాయా నాయనా? ఈడూ పాడూ చుసుకోకుండా గుళ్లూ గోపురాల వైపుక్కూడా రావద్దని పెద్దాళ్లయి కూడా  గద్దిస్తున్నారే బుద్ధిమంతులు కొందరు!  ఆడకూతురిని పాడుచేసే త్రాష్టుడు  గానీ ఈడేరకపోయుంటే ఏ శిక్షకు అర్హులు కాదనేస్తున్నారే! రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల మీద ఎవళ్ల నిఘాలు  పెద్దమనుషులు ఎందుకు వద్దంటున్నారో.. ముందు అర్థం చేసుకో మొద్దు రాచిప్ప మొహమా! సాగు  పేరు చెనితే  ఎంత దొంగాదాయాన్నైనా  సర్కార్లకే లెక్కా డొక్కా చెప్పకుండా ఇంచక్కా దాచేసుకొనే  దౌర్భాగ్య దేశమయ్యా బాబూ.. నువ్వూ నేనూ పుట్టి బతుకు జీవుడా అంటూ రోజులు ఈడుస్తున్నది!  ఓనామాలు ఆనమాలు పట్టనోడైనా ఎన్నికలొచ్చినప్పుడు గెలిచిపోగలితే  ఏకంగా చట్టసభలకెళ్ళి పోయి చాపచుట్ట పరిచేసుకోవచ్చు.  సర్కారు కొలువులు దొరకబుచ్చుకునే దొరల పై   ఏ దొంగ తిళ్ల కేసులూ చివరి వరకు నడిచిన దాఖలాలు నువు చూసావా ఈ దేశంలో? బక్కోళ్లక్కూడా అక్షరం ముక్క ఉచితంగా అందాలన్న విద్యాహక్కు చట్టం ఏ చెట్టెక్కిందో ఎవరికీ తెలీదు! సర్కారు దఫ్తర్ల దస్త్రాల వివరాలు అడిగిందే తడవుగా ఎవడికీ దొరికిచావడంలేదు!  జల్లికట్టో, కోడి పందెమో.. మూగజీవాలు మన పైశాచికానందాల పాలబడి  రక్తాలోడడం ఏ చట్టమూ అడ్డడంలేదు. ట్రిపుల్ తలాకులూ, అయోధ్య రామయ్య గుళ్ల చుట్టూతా ప్రదక్షిణాలు చేసేటందుకే మన చట్టాలకు ఎక్కడి టైమూ చాలడంలేదు. తప్ప తాగిస్తే.. దగ్గరుండి పేకాటలాడిస్తే తప్ప ఎన్నికల్లో ఓటు రాలే పరిస్థుతుల్లేవు. పైసా చేత లేకపోయినా  ప్రజానీకం తరుఫున  ప్రాపర్ గా చట్టసభలకెళ్లి  కూర్చుని పనిచేయగలడా నూటపాతిక్కోట్లలోని ఏ ఒక్క పాపర్ గాడైనా ఈ దేశంలో? నోటికి   తిరగని పేర్లుండే చిట్టి పొట్టి దేశాలు. ఏది సత్యం..ఏదసత్యమో.. నిర్ధారణకేదీ నిలబడలేని కాకమ్మ కబుర్లు!  వాటి చెత్తచట్టాల వంకతో ఇట్లా మనలో  కాక పుట్టించడాలెందుకు? అసలు సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించి సొంత పబ్బం గడుపుకొన చూసే  మీ లాంటి కుంకలకు పడాలిరా ఢింబకా ముందు వందేళ్ల  ద్వీపాంతర కఠిన కారాగారవాస శిక్ష! అదే మన దేశ ప్రజాస్వానికి అసలైన శ్రీరామ రక్ష!
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపదాకీయ పుటలో ప్రచురితం)  
***.


Saturday, December 7, 2019

ధరల ఉగ్రవాదం -కర్లపాలెం హనుమంతరావు- ఈనాడు వ్యంగ్యం



మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి ఉల్లిపాయలు కొనేందుకని బ్యాంక్ అప్పుకోసం వెళ్లినట్లు వార్త!
మామూలు మధ్యతరగతి మహిళామణి  మరి కప్పు పంచదార  కోసం ప్రపంచ బ్యాంకు అప్పు కోశం వెంటబడి రొప్పుకుంటూ పరిగెట్టాలేమో! కిలో బియ్యం రూపాయికి ఇస్తామన్న ఎన్నికల హామీ సాకారం చెయ్యడానికి మన పాలకులు పావుకిలో ఉల్లి పాతిక రూపాయలు పైగా పెంచేశారు. ఎక్కడెక్కడో ఉగ్రవాదులు బాంబులు పెట్టేస్తున్నారన్న  వార్త విని బెంబేళ్లెత్తడం ఆనక!  ముందు మన రైతు బజారుల్లో పేలుతున్న కూరగాయ ధరలకు అప్రమత్తం అవండి బాబులూ! ఉప్పు బాంబో, మిరప బాంబో పేలిందంటే బాబోయ్.. దేశమంతటా ఒహటే భీభత్సం! శాంతిభద్రతల అంశం ప్రశాంతంగా చూద్దురు గానీ.. ముందు ఆహారభద్రత వశం తప్పుతోంది అంకుశం ఎక్కడుందో వెతుక్కు రండి సాములూ!
అరేఁ! ఉల్లి దోశ తినాలన్నా ఏ బిర్లా కడుపునో పుట్టి తీరాలా?  టాటాగారూ! ఎట్లాగూ ఆ 'కారు లక్ష'  స్కీములో తమరు ఫెయిలయిపొయ్యారు గదా! పోయిన వరువు తిరిగి పుంజుకునే స్కీము.. కరేపాకు రెబ్బ కనీసం రూపాయికి ఒకటైనా దొరికే ఉపాయమో కనిపెట్టడమే! 
అమరావతులు, ఆర్టీసీ ప్రయివేటీకరణలూ ఎట్లాగూ వట్టి గాలి కబుర్లేనని తేలిపోయాయి గదా! ఉపాధులూ, ఉపకార వేతనాలూ, ఉద్యోగాలతో ఎట్లాగూ గట్టెక్కే పరిస్థితులు లేవు గానీ.. ఉప్పుకారాలు, ఉల్లి మసాలాలు వంటి వంటింటి పచారీ  సరుకుల వైపు  నుంచైనా నరుక్కురండి సారులూ.. ఏదో వేళకు ఎప్పుడూ ఏ మూలనో ఓ ఎన్నికల మేళం మోగే మన దేశంలో ముఖ్యంగా కూరగాయ ధరవరలతో వేళాకోళాలు వద్దు  మహాప్రభో! కొత్తిమేర కట్ట కోసం  కొంప కప్పు ఎక్కి  ఇంటిల్లాలు కొప్పు బిగించిందంటే సర్కార్ల ఇమేజికే రిపేరు చేయలేని డేమేజి మరి! అరవై పెడితే తప్ప అరకిలో ఆలుగడ్డలు సంచీలో పడని గడ్డ మీద నేతగా నిలబడ్డందుకు సిగ్గుతో తలొంచుకునే ఖర్మ చేజేతులా తెచ్చుకోవద్దు పెద్దలూ! ఎన్నికలంటూ నిజాయితీగా జరిగితే ల్యాండ్- సైడ్ విజయం కాదు..     ధరల దెబ్బకు నిలబడ్డ నేతలంతా ధడేల్మంటూ నేల కూల ఖాయం! వెయ్యో రెండున్నర వెయ్యో చేతిలో వెయ్యమంటే  ఎప్పట్లా   కోయంబత్తూర్ సరుకుతో తయారైతే చాలదయ్యా సామీ! ఈసారి ఆసామి ఇంటికో తాజా కూరగాయల గంప దింపి పొమ్మంటే .. నా సామి రంగా !
తనరు కొంప గంగలో మునగడం ఖాయం. 
వంకాయ కిలో వంద లెక్కన కొనే స్తోమతు కూడక తేరగా వచ్చిన  మంచి అమెరికా సమ్మంధానికి మంగళం పాడేసుకుంది మా మంగమ్మక్కగారు తన బంగారు కూతురుకు! కాలూ చెయ్యీ చక్కంగా ఆడుతున్నా  ఆ ఆస్ట్రేలియా ఖండం దాకా పాకుతూ దేకుతూ పడిపోవాల్సొచ్చింది మా చెంగయ్యమామ తన పెద్ద మనమడి దగ్గరకు మనసారా  ఉలవచారు నీళ్లు తాగడానికి! చెప్పుకుంటూ పోతుంటే మరీ అతి అనిపించే ఇట్లాంటి కన్నీటి కహానీలు కడవలు.. బుంగలు! 
మా దోస్తు పరమేశం శాస్తురులు గాడింట్లో దొంగలు పడి.. గ్యాస్ బండతో సహా ఫ్రీజర్లో దాచుకున్న పది కిలోల వెజిటబుల్స్ మొత్తం తట్టతో సహా మాయం చేసేసాడు.. దాచుకున్న  బీరువా  బీగాలు ఆ ఫ్రిజ్జు పక్కనే  పడేసున్నా! ఆ దొంగ వెధవ ఎవడో గాని కూరగాయల మీద చూపించిన కక్కుర్తి మరి కంచి పట్టు శారీలు, శాలువల మీద కూడా చూపించించాడు కాదు! 
కాశీ దాకా పోయి తినే కంచం ఏ గంగలోనో కలిపొఛ్చే విరాగులకే తప్పించి.. రోజుకో గజం చొప్పున ఆకాశానికి ఎగబాకే ఈ కూరగాయల ధరలతో సంసారులకైతే చచ్చే చావే! 

నాలుగు చినుకులు రాలితే ధరలన్నీ వాటికవే నీరుకారిపోతాయనే స్వామి ప్రబోధానందుల మార్క్ ధర్మోపన్యాసాలు వినేటందుకేనా  పుంజాలు తెంపుకుని మరీ సామాన్యులమంతా పోలింగు నాడు వేనులూ, రైళ్లూ, బస్సులు పట్టుకొని మరీ సొంతూళ్ల దాకా వెళ్లాడుతూ వచ్చి  నచ్చిన నేతలను ఎన్నుకొనొచ్చింది! జగన్నాథ చక్రాలను ఆనక తీరిగ్గా భూ మార్గం పట్టించే మార్గం ఆలోచిద్దురు గానీ.. బాబ్బాబులూ! ముందర్జంటుగా ధరాచక్రానికి దొరక్కుండా నభోంతారాళకి దూసుకెళ్లే అపరాల ధరల స్పీడునైనా  కాస్తింత ఆపే చాతుర్యం చూపెట్టండయ్యా  సర్కారు సాములార్లూ! మీ దేశభక్తి కూలా! ధరల అదుపును మించిన దేశ భక్తి భావన జనం మనసుల్లో ప్రస్తుతం మరోటి ఎక్కడేడ్చిందీ! ఒక్క పూట వరకైనా చూరు కింది నాలుగు నోళ్లలోకి రెండు వేళ్లూ వెళ్లే సదుపాయం మించిన  ప్రజాసేవ మరోటి లేనేలేదు మహాశయా!
ఆనాడు ఆ వేములవాడ భీమయ్య కవి ఏమని తిట్టిపోసాడో గానీ… ఇప్పుడు నిజంగానే కంచంలోని అన్నమంతా సున్నంలాగానూ, అప్పాలన్నీ కప్పల కుప్పలుగానూ కనిపించి  ఏమీ నంజక ముందే కడుపులు నిండిపోతున్నాయ్! సింగిల్ ప్లేట్ మీల్స్ కోసం డబుల్ బెడ్రూం కొంపలు కూడా కుదవపెట్టుకోవాలసిన రోజులొచ్చేస్తున్నాయ్! బ్యాంక్ లాకర్లలో భద్రం చేసిన సిరి సంపద అంతా  బైటికి లాగేసి వాటి స్థానంలో ఓ నాలుగు కరివేపాకు మండలు, మూడు మునక్కాయ కాడలు దాచుకుంటే తప్ప రాబోయే రోజుల్ని ఈ మాత్రమైనా కాచుకోవడం మహా కష్టమే అని మా బెంగేస్తున్నది మిత్రమా!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- సంపాదకపుట-28, డిసెంబర్, 2010)


Thursday, December 5, 2019

నూతన విశ్వాసాలకు తెలుగు మాగాణం- పురిటిల్లు- కర్లపాలెం హనుమంతరావు ( సూర్య- 29, సెప్టెంబర్ 2019 - ప్రచురణ )





బుద్ధుడి బోధనలు సాగింది  పాలీ భాషలోనో, అర్థ మాగధి భాషలోనో.. మొత్తానికి ఆ భాషలో తెలుగు పదాలు కొన్ని(సుమారు 60) కనపడుతుంటాయంటారు. మనం ఇప్పటికీ వాడుతున్న అనేక తెలుగు పదాలు బుద్ధుని కాలంలో దైనందిక జీవితంలో వ్యవహారంలో ఉండేవని శ్రీ చీమకుర్తి శేషగిరిరావు తన 'తెలుగులో పాలీ పదాలు' పుస్తకంలో పేర్కొన్నారు.
పైశానీ భాషలో కూడా తెలుగు పదాలు ఉన్నాయని తిరుమల రామచంద్రగారి అభిప్రాయం. బౌద్ధ కొరియా యాత్రికుడు ఒకాయాన ఆరో శతాబ్దంలో చైనా, ఆఫ్ఘనిస్తానుల మీదుగా వచ్చి ఈ దేశంలో  కైబర్ కనుమల నుంచి మన నాగార్జునకొండ వరకు పర్యటించి వెళ్లాడు. ఆయన తనకు తెలిసిన ప్రాకృతం మాట్లాడినా ఆంధ్రదేశంలో ఎక్కడా ఇబ్బంది కలుగలేదని రాసుకున్నాడు! ప్రాకృత శబ్దం మన తెలుగు భాష పూర్వ రూపానికి దగ్గరగా ఉంటుందని  తిరుమలవారి థియరీ.
సుమేరియన్ భాషలోనూ తెలుగు పదాలు ఉన్నాయన్నట్లు శ్రీ రాంభొట్ల కృష్ణమూర్తి ఏదో సందర్భంలో రాసినట్లు గుర్తు. ఆయన దగ్గర సుమేరియన్ భాషాకోశం మొదటి భాగం ఉందిట. (మొత్తం నలభై భాగాలు). తుర్కీ నుంచి గంగామైదానం వరకు ఏదో ఒక ఉమ్మడి నాగరికత ఒకానొక కాలంలో విలసిల్లినట్లు రాంభొట్ల అభిప్రాయం! భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజం. సుమేరియన్ల .. మన భాషల మధ్యా ఆ తరహా  ఇచ్చిపుచ్చుకోవడాలు  జరిగివుండవచ్చని కృష్ణమూర్తిగారి  ఆలోచన.
ఇప్పటి బోధన్.. ఒకప్పటి సోదనం. ఏదో పెద్ద విశ్వవిద్యాలయ ప్రాంతం కూడా అప్పట్లో. 'బావరీ' గోత్రానికి చెందిన పెద్దాయనెవరో దానికి అధిపతి. అది బుద్ధుడు జీవించి ఉన్న కాలం. తధాగతుణ్ణి కలుసుకొనేందుకు సుమారు ఓ వెయ్యి మంది బావరీ పెద్దాయన శిష్యులు రాజగృహం (పాటలీపుత్రం) పర్యటించారు. ఆ బృందంలో అదృష్టవశాత్తూ ఒక చిత్రకారుడూ ఉన్నాడు. బుద్ధుని బోధనలు సాగుతున్న సమయంలో తెర వెనక నుంచి అతగాడు ఆ శాంతమూర్తి బాహ్యరూపం (ఔట్ లైన్)  గీసుకున్నాడు. తరువాతి సిటింగులో కన్నూ, ముక్కూ, చెవులూ.. వంటివి గుర్తుంచుకొని తీరిగ్గా చిత్రం పూర్తిచేయాలని ఆలోచన. ఆ చిత్రకారుడు అనుకొన్నట్లే జరిగింది.. కానీ కొద్ది తేడాతో! తధాగతుడి బాహ్యాకారాన్ని యథాతధంగా ఉంచి ఏ ప్రాంతానికి చెందిన శిల్పులు ఆ ప్రాంతానికి చెందిన మనిషి ముఖకవళికలతో బుద్ధమూర్తిని చిత్రించుకొన్నారు! చైనా, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, బర్మా, ఇండోనీషియా, భారతదేశాలలోని బుధ్ధవిగ్రహాలు ఆయా దేశవాసులను పోలివున్నా.. బాహ్యరూపం మాత్రం మన  చిత్రకారుడు సమకూర్చిన విధంగా  ఉండటం తెలుగుజాతికి గర్వకారణం.
బుద్ధుని విహార(బిహార) భూమిని తెలుగునేలకు తరలించిన ఘనత తెలుగువాడిది. బుద్ధుని విచారధారను బావరీ విశ్వవిద్యాలయ విచారధారగా మార్చుకున్న మేధస్సూ మన తెలుగువాడిదే.
శ్రీ పర్వతం తూర్పునున్న ఓ కుగ్రామం నాగార్జునుడి జన్మస్థానం అని ఓ నమ్మకం. అద్వైతం, మాయావాదం, నేతివాదం, అవతారాలుగా నేడు ప్రచారంలో ఉన్న హైందవ భావజాలానికి ఆ ఆచార్యుడి  అద్వం, శూన్యం, విజ్ఞానం, బోధిసత్వం ప్రభృత భావాలే మూలాలు. బౌద్ధం మహాప్రచారంలోకి వచ్చి మహాయానంగా వృద్ధిపొందిందీ మన  ఆచార్యుడి ఆధ్వర్యంలోనే! నాగార్జునుడి కొత్త ఆలోచనలకు పురిటిగడ్డ   తెలుగుభూమి! నాగార్జునుడి 'సృహుల్లేఖ' (స్రిహిల్లేఖ అని కూడా అంటారు) శాతవాహనులతో ఆచార్యునికున్న సాన్నిహిత్యం తెలియచేసే పత్రం. బౌద్ధులు కాకున్నా శాతవాహనుల నీతిపాలనకు, నేర నిరోధక చర్యలకు  బౌద్ధధర్మమే కేంద్రబిందువయిందని పరిశోధకుల మాట. దేశంలోని అధిక భాగాన్ని ఏలిన ఈ తెలుగు ప్రభువుల పాలనలో తెలుగువారి ప్రభ సహజంగానే దేశమంతటా వెలుగులు విరజిమ్మింది. పాటలీపుత్రంలో 'ఆంధ్రభృత్యులు'గా పేరొందిన శాతవాహనులలో సిముక సాతవాహనుడు దక్షిణాపథాన స్వతంత్రంగా రాజ్యమేలిన తెలుగు చక్రవర్తి. పాటలీపుత్రపు  పండితులు రాసిన పురాణాలలో 'అంధ్రుల' వంశావళి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
తదనంతరం వచ్చిన ఇక్ష్వాకులూ తెలుగు రాజులే. ఆ ప్రభువులు పాలించిన భూమి విస్తృతమైనది కాకపోవచ్చు.  కానీ సృష్టించిన శిల్పసంపద  అపారమైనది. ఇప్పటికీ తెలుగువాడలలో కనిపించే ఆ శిధిల శిల్పకళల ఆధారంగానే మాన్యులు కె.కృష్ణమూర్తి ఆనాటి ఆటపాటలు, వేషభూషణాలు, సాంఘిక పరిస్థితులను గూర్చి ఆసక్తికరమైన గ్రంథాలెన్నో ప్రచురించారు. శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలం నాటి సాహిత్యం, శాసనాలు తెలుగు ప్రాకృతంలో కనిపించడం తెలుగువారికి గర్వకారణం.
తెలుగు నడిగడ్డ మీద వెలసిన శ్రీ పర్వతానికి దేశ విదేశాల నుంచి బౌద్ధులు, పండితులు విచ్చేసేవాళ్లు. అక్కడ ఒక మహావిశ్వవిద్యాలయం విలసిల్లింది కూడా. మహాయానమే కాదు.. వజ్రయానమూ ఇక్కడి నుంచే ప్రపంచం నలుదిక్కులకూ వ్యాపించిందంటారు. ఇప్పటి  టిబెట్టులో వర్ధిల్లుతున్నది ఈ వజ్రయానమే.  టిబెట్టుకీ తెలుగు గడ్డకి బౌద్ధం ఒక ఆధ్యాత్మిక బంధం.  
ఒకానొక కాలంలో ఆంధ్రదేశానికి నౌకావ్యాపారం ప్రధాన ఆదాయ వనరు. దేశదేశాల నుంచి వ్యాపారులు వచ్చి సాగించే బేరసారాలకు  వ్యావహారిక భాష  తెలుగు ప్రాకృతమే.
ఇక్ష్వాకుల కాలంలో 'శైలీయులు' బౌద్ధంలో ఒక ప్రత్యేకశాఖ. ఇండొనేషియాలో రాజులుగా వర్ధిల్లిన శైలేంద్రులు ఈ  శైలీయశాఖా సంబంధితులే కావచ్చని ఒక విశ్వాసం.
తెలుగు  ప్రాకృత సాహిత్యాన్ని విదేశీయులు .. ముఖ్యంగా జర్మనులు  సొమ్ము చెల్లించి మరీ కొనుక్కుపోయేవారు. ఇప్పటికీ జర్మనీలో పది పన్నెండు విశ్వవిద్యాలయాలు ఈ ప్రాకృతభా ప్రాకృతభాష మీద పరిశోధనలు కొనసాగిస్తున్నాయ్.

ధర్మం, తెలుగు భాష మధ్య గల బంధం దృఢమైనది. జైనులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాంతీయ భాషలను క్రమబద్ధీకరించేందుకు తగుసూత్రాలను రూపొందించారు. సామాన్యులకు చదువు సాములు నేర్పించారు. గణితవిజ్ఞానం  బడుగులకు చేరువయింది జైనుల పుణ్యం వల్లే! జైనంతో సాహచర్యం వల్ల సమాజానికి ఆ ధర్మం పట్ల విశ్వాసం వృద్ధి అయింది. ఆలయాల్లో  గీతాలు పాడేవాళ్ళు జైనులు. ఆ గీతాలే ఇప్పుడు నాటి మన  తెలుగు భాషాచరిత్ర ఆనవాళ్ల పరిశీలనకు ఉపకరిస్తున్నాయి. బౌద్ధులూ ప్రజల చదువు సంధ్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన బుద్ధిజీవులే. జైనులు, బౌద్ధులు ఆంధ్రదేశంలోని శిల్పకళకు కొత్త హంగులు తీర్చిదిద్దిన  కళాకారులు, కళాపోషకులు. బౌద్ధులు బోధిసత్వుని కథలను  నిరంతరాయంగా పారాయణం చేయడం ద్వారా  ప్రజలలో  పఠనాసక్తి  పెంపొందించినట్లు పరిశోధకుల మాట.
బౌద్ధం కారణంగా ప్రపంచానికి ధర్మకేంద్రంగా వర్ధిల్లిన ఘనత మన తెలుగు గడ్డది.  సన్యాసులకు, బ్రహ్మచారులకే పరిమితం అనుకున్న బౌద్ధాన్ని  సంసారులూ ఆచరించదగ్గ ధర్మంగా ఆచార్య నాగార్జునుడు తీర్చిదిద్దాడు.  ఆంధ్రదేశంలోని జైనులూ ఆ మార్గంలోనే సాగి తమ వంతు బాధ్యతగా సామాజిక సంస్కరణలకు పూనుకున్నారు. శ్వేతాంబరులకు, దిగంబరులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన యూపనీయులు తెలుగుజాతికి చెందిన వారేనని ఒక విశ్వాసం.
బాహ్యుబలి లాంటి భారీ విగ్రహాలు బోధన్ కేంద్రంలోనూ తెలుగువాళ్లు ప్రతిష్టించుకొన్నట్లు వినికిడి. జైన, బౌద్ధ మతాలలో భారీ విగ్రహాల ప్రతిష్టాపన ఒక ఆచారం. కక్షల కారణంగా అన్యమతస్తులు ఆ అఖండ శిల్పకళా వైభవాన్ని ఖండ ఖండలు చేయడం అన్యాయం. తెలుగునేల మీద ఊళ్ల పేర్ల పరిశోధనలకు పూనుకుంటే ఆ స్థలపురాణాల చాటున బోలెడంత తెలుగువాళ్ల చరిత్ర బైటపడుతుంది.
శాతవాహనుల తరువాత కొంత భూమిని  ఏలిన విష్ణుకుండినులకు నేటి నల్లగొండ జిల్లా ఇంద్రపాలనగరం రాజధానిగా ఉండేది. విష్ణుకుండినులు తమ పేరుకి 'ఇంద్రపాల్' అనే బిరుదును చేర్చుకొనే ఆచారం పాటించేవాళ్ళు. ఆ ఇంద్రపాలనగరం ఇప్పుడు  తెలంగాణాలోని ఏ ప్రాంతంలోదో? విష్ణుకుండినుల రాజవంశానికి చెందిన శాసనం ఒకటి బి.ఎన్.శాస్త్రిగారి పరిశోధనల్లో బైటపడింది కానీ నాటి ప్రాంతాల వివరాలు, ఆ రాజుల పాలనా ప్రాముఖ్యాలు వెలుగులోకి వచ్చే తీగెలేవీ ఆ పరిశోధన డొంకలో తగిలినట్లులేవు. డాక్టర్ అజయ్ మిత్రా చేసిన కొంత కృషి మినహా.. ఆ దిశగా  మరి దృష్టి మళ్లించిన పరిశోధకులు కరువయ్యారు! ఏదేమైనా నూతన విశ్వాసాలకు తెలుగు మాగాణం పురిటిల్లుగా మారడం ప్రతీ తెలుగుబిడ్డా ఎలుగెత్తి చాటవలసిన అంశం.
ఎవరు ఈ దేశంలో ఎక్కడ  పరిశోధనలకు పూనుకున్నా తెలుగువారికి సంబంధించిన చారిత్రకాంశాల  లింకులు కొన్నైనా తప్పక   బైటపడతాయి! దేశరాజధాని దిల్లీ తుగ్లకాబాదు ప్రాంతంలో ఒక ఆంధ్ర  ప్రముఖుని గోరీ కనిపిస్తుంది.  తుగ్లకుల ప్రధాని మాలిక్ మక్బూల్ సమాధి అది. ఆ ప్రముఖుని అసలు పేరు 'గన్నయ్య'! కాకతీయుల ప్రధానిగా ఆయన చాలా ప్రయోజకుడంటారు చరిత్రకారులు.
చరిత్ర పట్టం కట్టిన కుతుబ్ షాహీలు నిజానికి సొంతంగా ఏమంత ఘనకార్యాలు చేసిందిలేదు. పదవులను వేలం వేసి అమ్ముకునే పూర్వపు వ్యాపార ధోరణిని మానిపించి, సమర్థతను బట్టి నియమించడం, వారికీ వర్తించే విధంగా నియమ నిబంధనల రూపొందించడం ఆ వంశం చివరి పాలకుడి పాలనా సంస్కరణగా చరిత్ర శ్లాఘిస్తుంది.వాస్తవానికి ఆ సలహా పాదుషాకు ఇచ్చింది అతని ప్రధాని మాదన్న. మాదన్న తెలుగువాడు కావడం తెలుగువారికి గర్వకారణం.
సంస్కృతంలో పంచకావ్యాలకు  సుబోధకమైన  వ్యాఖ్యలు రాసిన  వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథసూరి మన మెదక్ జిల్లా కొల్చారంలో పుట్టిన  తెలుగు బిడ్డ. ‘న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే’(మూలంలో లేనిది చెప్పను, అనవసరమైనదీ చెప్పను) అంటూ తన  రచనా సరళి గురించి  సగర్వంగా ప్రకటించుకున్న ఆ తెలుగు పండితుడి వ్యాఖ్యల సాయం  లేకుండా  సంస్కృత కావ్యాల పఠనం అంగుళమైనా ముందుకు సాగదు. దేశదేశాల సంగీత విద్వాంసులు తన్మయత్వంతో ఊగిపోతూ స్వరార్చనచేసే త్యాగరాజస్వామి అరవదేశానికి తరలి వెళ్ళిన  మన తెలుగు తల్లి ఈత!
తెలుగు పండితులకు పొత్తాలకు పొత్తాలు వివరాలు నమోదు చేసే ఓపిక బొత్తిగా లేదన్న అపవాదు కద్దు. అందుకు విరుద్ధంగా మానపల్లి రామకృష్ణకవి పరిశోధనారంగంలో తన అసమాన ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించిన విద్యావేత్త. భాండార్కర్, ఆప్టే, రనడే, సంపుర్ణానంద్, మజుందార్ వంటి ఉత్తమశ్రేణి పరిశోధకులతో పోల్చదగిన ఆ పరిశోధక విద్వాంసుడు ప్రతీ తెలుగువాడికీ గర్వకారణం.
సంస్కృతాన్ని జాతీయయభాషగా ప్రకటించాలని బెల్గాం జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పట్టుబట్టిన కావ్యకంఠ శ్రీ గణపతి ముని తన పదో ఏట నుంచే బహుళ కావ్య రచనావతంస, నిరంతర పరిశోధక జిజ్ఞాసి. భారతీయ సంకీర్తనం అయనంతగా చేసిన వేదపండితుడు దేశం మొత్తంలోనే దొరకడు. ఆ సంస్కృతాంధ్ర మహాపండితుడూ  తెలుగుతల్లి నోముల పంటే!
వేదకాలపు సంస్కృతం పరాయి భాషలకు పదాలు పంచిపెట్టింది.  లౌకికభాష పేరున ఇతర భాషల  నుంచి తానూ పదాలు స్వీకరించింది. సంస్కృతంలో చాలా తెలుగు శబ్దాలు ఈ విధంగా చేరేందుకు ఆస్కారం ఉంది. 'తెలుగులో సంస్కృత పదాలు ఎందుకు వాడాలి?' అని మొండిగా వాదించే ప్రబుద్ధులు కొందరు అచ్చు తెలుగు పేరుతో  వికార శబ్దఘోషకు తెగబడడం విచారకరం. సంస్కృతం పేరుతో చలామణీ అయ్యే పదాలు ఎన్నో  తెలుగు ప్రాకృతాల నుంచి ఎగుమతి అయిన శబ్దభవాలేనని ఎంత తొందరగా  పెద్దలు  గ్రహిస్తే తెలుగు భాషకు అంత మేలు! సంస్కృతం ఏ రాష్ట్రానికీ చెందిన  ప్రాంతీయభాష కాదు. అది అఖండ భారతావనికి  చెందిన వాఙ్మయ సంపద. అందులో తెలుగుకూ సింహభాగం అధికారముంది.
దాదాపు రెండువేల ఏళ్ల కిందటే బౌద్ధ సాహిత్యం  తెలుగు, తమిళ భాషల్లోకి అనువాదమయింది. నాటకాలూ వేసేవాళ్లు ఆయా భాషల్లో. అప్పట్లో ఎవ్వరూ 'జననీ తమిళ భాషా' అని నినాదాలు చెయ్యలేదు. 'అవునవును' అంటూ ఏ తెలుగువాడు చప్పట్లు కొట్టిందీ లేదు.
కాలప్రవాహంలో కనుమరుగయిపోవడం  ఇతిహాసం సహజ లక్షణం.  వీలున్నంత  వరకు అందుకే దార్శనికులు చరిత్రగా దొరికిన విశేషాలను నమోదు చేస్తుంటారు.  తెలుగునాట ఈ తరహా చారిత్రిక జిజ్ఞాస  మొదటి నుంచీ కాస్త తక్కువే. కాబట్టే  తమవారు నడిచిన వచ్చిన దారుల్లో వారి అడుగుజాడల ఆనవాళ్ళు పట్టేందుకు తెలుగువాడు ఈనాడు ఇంతలా ప్రయాస పడుతున్నాడు.
ఈ దేశాన్ని తెల్లవాళ్లు పాలించే రోజుల్లో బ్రిటన్ నుంచి దిగివచ్చిన దొరలకు ఇక్కడి భాష, సంస్కృతల గురించి  ప్రముఖులు అవగాహన కల్పించే పాలనావిధానం అమలులో ఉండేది.  ఆ విధంగా ఉపన్యసించేందుకని వచ్చిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్  ఒక సందర్భంలో ఆర్య.. ద్రావిడ 'జాతుల'ను గూర్చి ప్రసంగించి వెళ్లిపోయాడు. కొంత కాలం తరువాత మరోసారి ఉపన్యసించడానికని వచ్చినప్పుడు గతంలో తాను చేసిన  పొరపాటున సరిదిద్దుకొనే ప్రయత్నం చేయబోయాడు. ఆర్య.. ద్రావిడ వైరుధ్యాలని   'జాతుల' మధ్య వైరుధ్యాలుగా తాను పొరపడ్డానని.. నిజానికి అవి 'సంస్కృతుల' మధ్య సంభవించిన వైరుధ్యాలని సరిదిద్దుకొనే ప్రయత్నం అది. 'ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవడం కుదరదు' అన్నది ఇక్కడి దొరతనం. కారణం..  అప్పటికే ఇక్కడి అమాయక  భారతీయులని ఆర్య.. ద్రావిడ 'జాతులు'గా పాలకులు తమ పాలనా సౌలభ్యం కోసం  పూర్తిగా విడగొట్టేసేయడం!  విజ్ఞానశాస్త్రం కానీయండి, సంస్కృతులు కానీయండి, భాషలు కానీయండి.. రాజకీయాలకు విడగొట్టరానిదంటూ ఏదీ ఉండదు. తమకు గిట్టుబాటు వ్యవహారంగా ఉండాలి.. అదే ప్రధానం.
ఈ దేశంలోని చాలా ప్రాంతీయభాషలు ఆనాటి  విభజన రాజకీయాల మూలకంగా  ఇవాళ ఎన్నో విధాలా నష్టపోయాయి!  ఎక్కువ నష్టం దక్షిణాది భాషలదయితే.. వాటిలో  అత్యధిక నష్టం తెలుగు భాషది. ఎవరినో నిందించడం ఎందుకు? తెలుగు భాష నేటి దైన్యస్థితి తెలుగువాడి స్వయంకృతం.
తెలుగువాడు ఈ దేశం  గడ్డ మీద ఎన్నో  శతాబ్దాల బట్టి వివిధ రాజ్యాలు చలాయించిన మొనగాడు. ఘనమైన మన గతం అవగతం కాకే  భాష వాడకం మీదింతలా  సతమతం ప్రస్తుతం. తెలుగు చరిత్ర మీద చిన్నచూపు. ఇకనైనా సరిదిద్దుకుందామా.. కనీసం పదిమంది మధ్య పరువుగా నిలబెట్టే ఆత్మసమ్మానానికైనా!
***
-కర్లపాలెం హనుమంతరావు
( సూర్య - 29, సెప్టెంబర్ 2019 సంచికలో ప్రచురణ ) 



http://www.koumudi.net/

Wednesday, December 4, 2019

అంతరాత్మల కథ- వ్యంగ్యం- సూర్య దినపత్రిక ప్రచురితం






'నేతలు మనకు అండగా నిలిచిన గుట్టు నేరుగా జనంలోకి  వెళ్ళిపోతోంది' అంది మద్యం బ్రాండు అంతరాత్మ.
'మరే! ఆపదల్లో ఉన్నప్పుడు ఆ సాముల్ని ఆదుకోవడం మన  ధర్మం!' అంది గోల్డు బ్రాండు అంతరాత్మ .
'పెదాల సానుభూతితో పనేమవుతుంది? పెడసరంగాళ్ల నోళ్ళు కుట్టించాలి ముందు. అందుకే  న్యాయదేవత అంతరాత్మకే టెండరు పెట్టానీసారి! అంది యుద్ధ విమానం మార్కు మరో అంతరాత్మ ధీమాగా.
ఆ అంతరాత్మ  మనంత గట్టిగా నిలబడదమ్మా! ఏ  తీర్పు ఏ భావోద్వేగంలో వచ్చిపడుతుందో ఊహాతీతం. గిట్టని అంతరాత్మల మధ్య పొత్తు కుదర్చడమే మెరుగు. పీ.కే అంతరాత్మను ప్రయోగిస్తేనో?
ఎంత ఖరీదయినా కొనడానికి ఓ.కే! కానీ అదీ వెళ్ళి ఆ బురద    రాజకీయాల్లో దిగబడిందే! 
రాజకీయ అంతరాత్మ బాధగా మూలిగింది. 'మా బురదలో అందరికీ భాగముందమ్మా! ఎలాగైనా సరే లాభాల్లాగాలనే లోభం తమ వ్యాపారులది! సర్కారులు ఎవరివైనా సరే మీకు సలాం కొట్టాలి.  జనంతో తంటాలు మావి! మిమ్మల్నీ వదులుకోలేం. ఓటర్లనీ వద్దనుకోలేం.’
'మా మీదేమన్నా వూరికే  కారుతోందా ప్రేమ? ఓటర్ల అంతరాత్మలను కొనిపెట్టే  సొమ్మంతా  మా  ఇనప్పెట్టెల్లోదేగదా!’  బొగ్గు మార్కు అంతరాత్మ భగ్గుమంది.
 ‘ఎంతో రిస్కుతో కుతంత్రాలు పన్ని, పన్నులు.. బ్యాంకు రుణాలు గట్రా  ఎగ్గొట్టి మా యజమానులు జమేసుకున్న సొమ్ము! మీ నేతలు కమ్మంగా అనుభవించే పదవులకిప్పుడు అదే కదమ్మా ఆధారం!’ వంత పాడింది వజ్రం మార్కు అంతరాత్మ.
'నేతలం కాదు మనం.. వాళ్ళ అంతరాత్మలం. మనలో మనకు కుమ్ములాటలొద్దు! మన ఆసాములు కష్టాల వూబిలో ఉన్నారిప్పుడు. వాళ్లని  గట్టెక్కించడం ఒక్కటే మన కర్తవ్యం కావాలి’  సర్ది చెప్పింది ఓ ముసలి అంతరాత్మ.
ఆ స్కాములప్పుడేమన్నా ఆ ఆసాములు మన మాటలు విన్నారా.. ఇప్పుడు గట్టెక్కించడానికి! గొణికింది ఓ యువ అంతరాత్మ.
అవును. అదనంగా నసగాళ్ళని  చీదర్లు కూడా ! నొసలు చిట్లించింది మరో కుర్రది.
అంతరాత్మలకి అంత ఆత్మాభిమానం చేటు! మన అసహనం, తిరుగుబాటు ఏ పంథాలో ప్రయోగిస్తే సత్ఫలితాలొస్తాయో.. ముందది ఆలోచించద్దాం! ఈ   పెద్ద అంతరాత్మలతో శిక్షణా తరగతులు  నిర్వహిస్తోంది కూడా అందుకే. బుద్ధిగా వినండి! గద్దించింది అధ్యక్ష స్థానంలో ఉన్న అంతరాత్మ.
వ్యాపార అంతరాత్మ ప్రసంగం ప్రారంభయింది మనం ఉన్నామన్న భరోసాతోనే పెద్దమనుషులు  స్కాములకు సిద్ధపడతారు. ఎంత  మొండిగా వాదించినా మన మాట వినరు. అందుకే మనమూ వాళ్ల బాట పట్టక తప్పదు. మన కుబేరులు  బేరుమంటే  మన అంతరాత్మలకే కదా నామర్దా’
'అయితే  ఏం చెయ్యాలంటా? తిట్టిపోసిన వాళ్లతోనే కూటమి కట్టాల్నా?' పెడసరంగా అడిగింది  ఇందాకటి  పిల్ల అంతరాత్మ.
సర్కారు ఎవరిదన్నది మనకు ముఖ్యం కాదు. ఎవరు గద్దె మీదుంటే వాళ్లకే మన మద్దెల దరువు. అధికారంలో ఉన్న వాళ్లే ముందు ముందు మరెన్నో  మంచి పనులు చేస్తారని టముకేస్తే సరి. వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్తలపెట్టవోయ్' అన్నాడా లేదా గిడుగు పిడుగు?’
కిసుక్కని నవ్వింది కుర్ర  అంతరాత్మ 'ఆ కొటేషన్ గురజాడది
తెలిసే అన్నాన్లే! గిడుగు నుంచి గురజాడ కాపీ కొట్టాడని మన  అంతరాత్మలన్నీ కలసి  ఘోషించాలి. అదే నిజమని జాతి అంతరాత్మకూ  నమ్మకం కలిగించాలి. అందాకా బ్రెయిన్ వాష్ చెయ్యడమే  మన పని.’
బొగ్గు అంతరాత్మ అందుకుంది ‘ఆ గోల కవుల అంతరాత్మలేవో చూసుకుంటాయిలేద్దూ! మద్యం నుంచి భూములు, మార్కెట్ బూములు, బంగారం, విమానాలు, బ్యాంకు రుణాల వరకు ఎన్నో బడావ్యాపారాలు మన అంతరాత్మలను నమ్ముకునే పెద్దెత్తున అక్రమంగా నడుస్తున్నాయిక్కడ. ముందున్నది ముసళ్ల పండుగని మనమెంతైనా ఎంతైనా మూలుగు.. ఎవరి చెవినా పడ్దంలేదు’
‘అలాంటి ఇబ్బందుల్లోనే ఈ కార్యకర్తల అంతరాత్మలేం చెయ్యాలనేది మీ సీనియర్లు నేర్పించాలిప్పుడు’ గుర్తుచేసింది అధ్యక్ష అంతరాత్మ.
'ఈ సారి ఈ అంతరాత్మల అంశాన్నే ముందుకు  తోద్దాం! సెంటిమెంటుతో చేసే ఏ  ప్రయోగం ఇంత వరకూ విఫలం కాలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో. అధికార పక్షం తరుఫు నుంచే ఈ తుర్ఫు ముక్క  తీయిస్తే సరి! తిరుగుబాటు వర్గాల్లోకి మన కోవర్టులను చొప్పించి అందరి  నొప్పులను  టోకున కొనిపిచేద్దాం!’
‘కొనడం అంటే మూటలతో పని. అనైతికం. ఆసాముల్నందర్నీ  సతాయించాలి?’ ముఖం చిట్లించింది మళ్ళీ మొండి అంతరాత్మ.    
‘సతాయించడానికే మనుషుల్లో మనమున్నది! వ్యాపార అంతరాత్మలుగా అది మన విధి కూడా’
మళ్లీ అడ్డుపడింది జిడ్డు అంతరాత్మ ‘అమ్ముడయేందుకు మీ రాజకీయ  అంతరాత్మలు  సిద్ధంగానే ఉంటాయమ్మా! కానీ కొనే సొమ్ము తమ  ఆసాములనుంచి  రాబట్టాలంటేనే గడసాములు చెయ్యాలిక్కడ. పాపం వ్యాపార అంతరాత్మలు!
‘ఏంటీ నస?’ అన్నట్లు మొండి అంతరాత్మకేసి గుడ్లురిమి చూసాయి మిగతా అన్ని అంతరాత్మలూ.
చూడూ! మన అంతరాత్మల  ముందు ఎంత లావు బిరుసున్నా తలవంచాల్సిందే! అనుభవంతో చెబుతున్నా.. అంతరాత్మ ప్రబోధం కన్నా ఉత్తమ చమత్కారం మరోటి లేదు. ముఖ్యంగా  రాజకీయాల్లో. మనం గానీ ఎంటరయితే ఏ నేత వంటికీ మకిలి అంటదు’ కలగచేసుకుంటూ అంది అధ్యక్ష అంతరాత్మ ‘దేవుడు, రాజ్యాంగం కన్నా మన అంతరాత్మల మీదే అమాయక జనాలకు గట్టి  నమ్మకం. ఆ నమ్మకం వమ్ము కానివ్వద్దు’
‘మరి ప్రజాహితం?’ మొండి అంతరాత్మ లొంగదలుచుకోలేదు.
 ‘మేధావులకే పట్టని ప్రజాహితం మనకెందుకెందుకంట? ఎన్నికలు  తరుముకొస్తున్నాయ్  అవతల! ఎన్నికల కోడు పీడ  ఏ క్షణానైనా విరుచుకుపడచ్చు. ఎంత సొమ్ముకైనా సరే.. అమ్ముడవడానికి మీరంతా సై య్యేనా?’
‘సై’ అరిచాయి అన్ని కుర్ర అంతరాత్మలు.
‘ ఏం చేసైనా సరే మీ ఆసాముల్ని గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నారా?’
‘ఉన్నాం.. ఉన్నాం.. ఉన్నాం!’ పిల్ల అంతరాత్మల కేకలు మిన్ను ముట్టాయ్!
 ‘గుడ్! అయితే.. ఏదీ.. నీ నోట్లో ఏముందో చెప్పు.. చూద్దాం?’ ఓ పెంకి ఘటం దగ్గరికొచ్చి అడిగింది అధ్యక్ష అంతరాత్మ.
‘ప్రద్దానికీ అడ్డొచ్చి ప్రశ్నిస్తోందే.. ఈ మంకు అంతరాత్మ.. దీని చూపుడు వేలు’ అంది పెంకిది.
‘వెరీ గుడ్! ఓ సారి  ఆ వేలు కొరుకమ్మా!’
లటుక్కున కొరికి కరకరా నమిలి మింగేసింది క్షణంలో పెంకిది కసిదీరా. వేలు తెగిన మొండిది  లబోదిబమంటూ బైటికి పరుగెడుతుంటే అంతటా నవ్వులే నవ్వులు.
‘అరెఁరెఁరెఁ! కొరకమంటే నిజంగా కొరికేయడమే!’ మందలించింది అధ్యక్ష అంతరాత్మ నవ్వులు కాస్త సద్దుమణిగాక. ‘నోట్లో వేలెట్టినా కొరకలేనంత జాణతనం చూపించాలమ్మా! ఆ మాత్రం అమాయకత్వం నటిస్తేనే అంతరాత్మల సాక్షికంగా నడిచే నాటకాలన్నీ నిజాలేనని పిచ్చి జనాలకు నమ్మకం కుదిరేది. మరీ మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరుగారంత  పారదర్శకత  పనికిరాదు అంతరాత్మలకు. నవ్వింది చాలు. ఇహ ముఖ్యమైన మూడు ముక్కలతో ఈ సమావేశం ముగిద్దాం. స్వచ్ఛమైన, అవినీతికి తావులేని పారదర్శక పాలనంటూ నేతలు బల్లగుద్ది లక్ష హామీలిస్తుంటారు.  బెదిరిపోవద్దు. మీరు లేకుండానే  మ్యానిఫెస్టోలా అంటూ అలకలసలే వద్దు.! అంతరాత్మల ప్రమేయం కుంభకోణాలతోనే మొదలవుతుంది రాజకీయాలల్లో.   బొగ్గా.. బంగారమా, పెద్దనోటా, పెట్ఱోలు రేటా.. అన్నది మనకు  పెద్ద ముఖ్యం కాదు.  ఎగ్గొట్టేందుకు వీలుగా రుణవిధానాలున్నప్పుడు ఎవరికయినా ఎందుకు తప్పు చెయ్యబుద్ధేయదు?  మనం క్లవర్లం. కాబట్టే తెలివిగా మన సాముల్ని కవర్ చేసుకుంటున్నాం. ఎవరేడ్చిపోతేనేం.. వియ్ డోన్ట్ కేర్. పిల్ల అంతరాత్మలు మీరు. ఆదర్శాల ఉచ్చులో ఇరుక్కోకండి! బడుగు ఓటరొచ్చి తడితే నిద్ర లేవద్దు. మరీ అంత కునుకు పట్టకుంటే అసమ్మతి రాగాల కోర్సుంది.. సాధన చేసుకోండి.. పెద్దమనుషులతో మన బేరసారాలో కొలిక్కొచ్చిందాకా! తతిమ్మా థియరీ రేపు! ఈ పూటకీ ప్రాక్టికల్స్  చాలు‘ ప్రకటించి లేచింది అధ్యక్ష అంతరాత్మ,
‘ప్రాక్టికల్సా?!’ నోరెళ్లబెట్టాయ్  అంతరాత్మలన్నీ.
‘మరే! ఎంత చెప్పినా మొండికేసే అంతరాత్మలు  కొన్నుంటాయెప్పుడూ. నిజాయితీ, నిమ్మబద్దలంటూ  మేధావుల మెదళ్ళు తొలవడమే వాటి పని! ఎన్నికల్రోజు బక్క ఓటరు అంతరాత్మలను అవి తట్టి లేపేస్తే.. అమ్మో.. మన ఆసాముల పని గోవిందా!  అందుకే పద్దాకా ఎత్తి చూపించే  చూపుడు వేళ్లను  ఎలా కత్తిరించేయచ్చో ప్రాక్టికల్ గా చేయించి చూపించా!’ అంది అధ్యక్ష స్థానంలో ఉన్న ఆ  ముసలి అంతరాత్మ! ఇందిరమ్మ హయాంలో వి.వి.గిరి గారికి అధ్యక్షగిరి ఇప్పించిన గడుసరి ఈ అంతరాత్మే మరి!
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)
***


 







రాధమ్మ పెళ్లి జరిగిపోయింది- ఆంధ్ర ప్రభ కథానిక





కథానిక : 
రాధమ్మ పెళ్లి జరిగిపోయింది 
- కర్లపాలెం హనుమంతరావు
( 28 -07 - 1982 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక - ప్రచురితం ) 

రాజు, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే?!
ఏమో నాకూ అట్టే తెలీదు. "

' ప్రేమ .. అమావాస్య చందమామ. . అందుకొనే దెంతమంది? .. వంద తక్కువ నూరు  మంది!' అన్నాడో కవి! 

అయితేనేం  పాపం, రాజూ, రాధా ప్రేమించుకున్నారు. 

ప్రేమం టే వాళ్ళకూ తెలుసన్న మాట అనుమానమే. అయినా ప్రేమించుకున్నారు.  పోనీ, కనీసం అలా అనుకుంటున్నారు. వాళ్ళు మేధావులు కాదు కనక. 

సాధారణంగా అందరి లాంటి యువతీ యువకులే గనక 'ప్రేమంటే ఏమిటి?' అంటూ ఆరా తీస్తూ కూర్చోలేదు. 

ఏదో హాయిగా అలా కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపమంటే అదే... ఏదో కొద్దిగా సరదాగా గడిపేయడం. 

సరే వాళ్లు మాత్రం  వూరికే అలా ఎంతకాలం చూసుకుంటూ కూర్చుంటారు ? 

బోర్ బోర్! 

కడుపు నిండేనా, కాలు నిండేనా? 

ఒక శుభ ముహూర్తంలో పెళ్ళికూడా అయిపోతే  'శుభమస్తు ' కార్డు పడిపోతుంది కదా వాళ్ల ప్రేమ కథకు కూడా! 

' చేసేసుకుందాం .. పెళ్లి ' అని ప్రమాణాలు ఎక్స్ ఛేంజి చేసుకున్నారు. 

వాళ్ళయితే అనుకున్నారు... కుర్ర కారు.  మరి ఇరుపక్షాల పెద్దలు? 

"పెద్దవాళ్లు ఒప్పుకుంటా రంటావా, రాజూ!" అని అడిగింది రాధ.. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఏకాంతంలో కూర్చున్నప్పుడు పెళ్ళి ప్రస్తావన తవే ముందు తెచ్చి.

" ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు రాజు.. అనుమానాన్ని కూడా ధ్వనింపజేస్తూ

" ఒకవేళ ఒప్పుకోకపోతే?”

“ఒప్పుకోకపోనూవచ్చు. ఇంత దూరం వచ్చిన తరువాత వెనక్కు తగ్గుతాననుకున్నానా, రాధా!".

"అబ్బే... అలా అని కాదు. వూరికే అడిగేనులే. మరి మీదేమో బ్రాహ్మణ కులం. మేమేమో నాయుళ్ళం. కులాంతరమంటే మీ వాళ్లు అంతా తొందరగా ఒప్పుకుంటారా అని "

" మరి మీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవద్దూ కులాంతర వివాహావికి?"

" మా సంగతి వేరు, రాజూ! మా నాన్న గారు కులాంతర వివాహం చేసు కున్నారు. మా అమ్మ ఆ రోజుల్లో కొద్దో గొప్పో పేరున్న నటి. ప్రసక్తి వచ్చింది గనక చెబుతున్నా.  అమ్మది వడ్రంగి కులం. అయితేనేం, మా నాన్న గారు నాయుళ్ళయి ఉండీ ఆదర్శ వివాహం చేసుకోలేదూ! నేను గ్యారంటీ ఇస్తున్నాను, రాజూ. మన పెళ్ళికి మా వాళ్ళు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పరు. మా బ్రదర్ పోయి నేడు ఫారిన్ నుండి తిరిగొస్తూ అమెరికన్ అమ్మాయిని  పెళ్ళాడి మరీ వచ్చాడు తెలుపా?" 

"మీ వాళ్ళది చాలా విశాల దృక్పథం, రాధా! ఐ యామ్ రియల్లీ హ్యపీ!  ... మా వాళ్ళే ఒట్టి చాందసులు. మా చెల్లెలు శాంత.. అదే బ్యాంకులో పనిచేస్తుందే .. తను తన కోలీగ్ ను చేసుకోవాలని చాలా పాకులాడుతోంది . శాఖాంతరమని మా వాళ్లే పడనీయడం లేదు " 

"మరి నువ్విప్పుడు ఏకంగా కులానికే ఎసరు పెట్టేస్తున్నావుగా: అడిగి చూడు! పెద్దల ముందుగా వద్దన్నా సరే, అంగీకారం కోరటం మన డ్యూటీ. నేనూ ఈ రోజే ఇంట్లో విషయం కదుపుతాను."

"ఏ విషయం. రేపు ఆదివారం సాయంత్రంలోగా ఇక్కడే తేలిపోవాలి.. విష్ యూ బెస్సాఫ్ లక్.." అని నవ్వుతూ లేచాడు రాజు. రాధ రాజు చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ , "విష్ యూ  ది సేమ్ ...' అని నవ్వింది. 

రాజు కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు. రాధ ఉమెన్స్ కాలేజీలో  డిగ్రీ మూడో ఏడు చదువుతూంది. కాలేజీకి దగ్గరే ఆఫీసు, ఇద్దరూ తరచూ ఒకే కేంటీన్ లో కలుసుకోవటంతో పరిచయం కలిగి .. అది ప్రణయంగా మారింది. అందుకు ఇద్దరూ అభిమానించే సినిమాలు, ననలలు బోలెడంత దోహదం చేశాయి. 

అనుభవంలేని వయసు పాంగొకటి తోడైంది.  ప్రణయం ముదిరి పాకాన పడింది.

రాజుకు శాంత అనే పెళ్ళి కాని చెల్లెలుతో పాటు, రాఘవ అనే ఉద్యోగం లేని  గాడ్యయేట్  తమ్ముడూ, పించను   ఇంకా సెటిల్ కాని రిటైర్డు టీచరు తండ్రి. చాదస్తం వదలలేని  పాతతరం తల్లి .. కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇంటికి దిక్కు రాజు జీతమే . శాంత జీతం మాతం కట్నం కోసమని దాస్తున్నారు. 

ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ అరవ కాకి లాగా బయట పడి తిరిగే   రాఘవకూడా ఒంట్లో నలత కారణంగా ఇంటి పట్టునే ఉన్నాడా పూట. 

భోజనాల దగ్గర పెళ్ళి ప్రస్తావన ఎత్తాడు రాజు. 
నా అంత ఎత్తు ఎదిగిన  వాడివి నీకేమని బుద్ధి చెప్పను! ఇంటి పెద్ద కొడుకుగా నీకూ  కొన్ని బాధ్యత లున్నాయన్న విషయం మరిచి పోయావురా?” అన్నాడు తండ్రి నిష్ణురంగా .

 “నే నంత కాని పనేం చేశామ, వాన్షా! ఆ అమ్మాయి చాలా గుణవంతు రాలు. “

" గుణమొక్కటే చాలుతుందా ? కులం?"

రాజు మాట్లాడలేకపోయాడు. 

తండ్రే అందుకున్నాడు "నువ్వు చెప్పక పోయినా మాకు తెలుసు లేరా ! నాయుళ్ళ సంబంధం చేసుకుంటే శాంతకు మళ్ళీ ఈ జన్మలో పెళ్ళవుతుం దంటావా?"

"ఈశ్వరావు నాకు బాగా తెలుసు. నేను కులాంతరం చేసుకున్నా తను శాంతను వదులుకునే పాటి మూర్ఖుడు కాదు. శాఖాంతరముని మీరే రాద్ధాంతం చేస్తున్నారు గానీ! " 

"ఏమో నాకీ సంకరజాతి వెళ్ళిళ్ళు ఇష్టం లేదురా! మేం మళ్ళీ అందరిలో  తలెత్తుకు తరగాలా. . వద్దా  ?” అని అందుకుంది తల్లి.

" రాధ వాళ్ళ కుటుంబం సంగతి మీకు తెలీక అలా అంటున్నారమ్మా! ఆయనతో వియ్యమందటానికి బిజినెస్ మేగ్నెట్లతో సహా ఎంతమంది క్యూలో  ఉన్నారో తెలుసా ? రాధ తండ్రి డబ్బున్న కాంట్రాక్టర్. ఎన్నికలలో ఈ దఫా కూడా పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే, మంత్రి పదవి  ఖాయమంటున్నారు.  గెలవక పోయినా అధికార పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించే అంతస్తు . అలాంటి వాల్లాయి సంబంధం ఎన్నటికీ తలవంవులు కాబోదు. గొప్ప కింద లెక్క .  అందుకే మీ మహదేవన్నయ్య  ఇన్ని సిద్ధాంతావా వల్లించి చివరకు కొడుక్కోసం  రాధ తండ్రి చుట్టూతా  తిరుగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ నాయకు డికి లేని సంకరతనం ' మనకెందుకమ్మా?" 

" ఏమో! బాబూ! కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి .. ! "  

"అది కాదమ్మా! తమ్ముడు ఎంత కాలంగా  బియ్యస్సీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యీ ఖాళీగా ఉంటున్నాడు? ఇంకింత కాలం ఉన్నా వాడికి ఉద్యోగం రావటం డౌటే. ఏ సిఫార్సో , మూటో లేకపోతే  ఉద్యోగాలు వచ్చే రాజులా ఇవి? వీడి సంగతి ఒక్కసారి ఆయన చెవినబడింబా చిటెకెల మీద  ఉద్యోగం రెక్కలు కట్టుకు వాలిపోతుంది.”

రానీయరా! అప్పుడే చూద్దాం” అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు రాజు తండ్రి. 

ఆయన మెత్తబడినట్లు  తెలుస్తూనే ఉంది. రాఘనకు ఉత్తేజ మొచేసింది. ఉద్యోగ మొస్తుందన్న ఆశ తోటి. "అయినా ఈ రోజుల్లో కులం గిలం అట్టే ఎవరు పట్టించుకుంటున్నారే, అమ్మో! ఇందాక 
నువ్వు పెద్ద ఆచారాలను గురించి  చెబుతున్నావు కదా ! నువ్వు మొన్న , స్కూళ్ళ ఇన్ స్పెక్టరు గారు క్రిస్టియనైనా నట్టింట్లో నాన్నగారి పక్కన అకేసి అన్నం పెట్ట లేదూ? అప్పుడెక్కడికి పోయిందో కులం? ఆయన అధికారి. పింఛను  వ్యవహారం తొందరగా సెటిల్  చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ మీరు తాత్కాలికంగా కులం సంగతి మరిచిపోయారు. అందరూ ఈ రోజుల్లో అలాంటివి ఆవసరమయితే తప్ప ఎవరూ పట్టించు కోవటమే లేదు.”

"ఏమోరా, బాబూ! అవ్యక్తపు మనిషిని. నన్నెందుకు చంపుతారు ! అయినా చూస్తూ చూస్తూ ఆ అంట రాని పిల్లని వంటింట్లోకి ఎట్లారా  రానీయడం? " 

శాంత అందుకుంది: “అంటరానితనం ఏ కులంలో లేదే ఈ రోజుల్లో! మొన్న నువ్వూ, నేనూ రామలక్ష్మి కూతురు పుట్టిన రోజు పండుగకు పిలిస్తే ..  మనవాళ్ళే గదా.. అని వెళ్ళామా! ఏమయిందీ? నిన్ను ఆ పసిపిల్లను ముట్టు కోనిచ్చారా ? మర్యాదగా పలకరించారా? ఎందు కొచ్చావిక్కడికి  అన్నట్లు మాట్లాడలేదూ! వాళ్ళు మరి మన కులం వాళ్ళేగా! ఎందుకు మరి నిన్ను అంటదానివాళ్ళుగా చూశారు? నాళ్ళకు లాగా సినిమా హాల్సు, రైసు మిల్లులు లేవనేగా ? బీద బడిపంతులు భార్యవనేగా!" 

"మీ అందరూ చదవేసిన వాళ్ళు, తల్లీ! తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని అయినా చెయ్యగలరు.  తల్లితండ్రులం, మేం కోరుకునేదేమిటి?  మీరు చల్లగా ఉండటం కావాలి మాకు.  మీ కిదే ఇష్టమనుకుంటే అట్లాగే కానీయండి. లోకం మారిందంటున్నారుగా!  రాఘవగాడికన్నా ఉద్యోగమొస్తే అదే పది వేలు - ఆదే
మాకు పెద్ద బెంగయిం దిప్పుడు” అనేసి కంచాలు తీసుకుని వెళ్ళి పోయింది రాజు తల్లి. 

" హిప్ హిప్ హుర్రే ” అని అరిచాడు రాఘవ సంతోషం పట్టలేక.
" పెద్ద వాళ్ళను  ఇబ్బంది పెట్టకుండా పెళ్లి జరిగి పోతుంది" అని తృప్తిగా నిట్టూర్చాడు రాజు.

ఈశ్వరావుతో జరగదనుకున్న  పెళ్ళి మళ్ళీ ఖాయమయ్యే పరిస్థితి వచ్చేసరికి  శాంత కళ్ళ లోకి మెరుపులు  వచ్చేశాయి. 

రాజు ఆ సాయంత్రమే రాధ కోసం పార్కు కెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో. 

కానీ, రాధ పార్కుకు రానేలేదు. ఎంత నిరుత్సాహం కలిగిందో! 

మరునాడు కేంటీన్ లోను కనిపించ లేదు. కాలేజీలో వాకబు చేస్తే క్లాసుకే రాలేదన్నారు. 

అయోమయం అనిపిం చింది రాజుకు . . రాధ ఇంటికి వెళ్ళాడు.  తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప వెక్కిరించింది. 

వారం రోజులయింది.  కానీ , రాధ జాడ  అంతు పట్ట లేదు. పిచ్చెపోయినట్లయింది రాజుకు. 

ఆ రోజు పోస్టులో రాజాకు  కవరొచ్చింది. ముత్యాలు పేర్చినట్లుండే దస్తూరిని చూడగానే ఆనందంగా అనిపించింది. రాధ దగ్గర నుంచే సందేశం, 

ఆత్రుతగా   కవరు ఓపెన్ చేశాడు.  రాజు. 

శుభలేఖ బయట పడింది. జలాగా చిన్న ఉత్తరమూ
ఉంది! 

రాజ గారికి! 
 అర్థమయిందనుకుంటాను. 
నా పెళ్ళి నిశ్చయమై పోయింది. 
పరుడు మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిన  రాజకీయ నాయకుడి ఏకైక పుత్రరత్నం. 
మన విషయం ఆ రోజు ఇంట్లో కదిలించిన రోజు మా వాళ్ళ నిజస్వరూ పాలు బయట పడ్డాయి. 
'నీ పెళ్ళి మీద నేను బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాను, తల్లీ! అవి కల్లలయిపోవటానికి లేదు. వియ్యానికైనా, కయ్యానికైనా  సమ ఉజ్జీ ఉండాలి' అని నాన్న గారు కొట్టి పారేశారు. 

నా మొండితనం తెలిసి మా వాళ్ళు నిర్బంధంగా నన్ను  విశాఖపట్నం తీసుకొచ్చారు. వారుడుది ఈ  ఊరే. 
ఈ పెళ్ళితో మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు దొరుకుతుంది. అన్నయ్యకు పెద్ద కంపెనీలో జనరల్ మానేజరు పోస్టు దక్కుతుంది. అమ్మకు డాన్స్ స్కూలు పెట్టుకోవటానికి పర్మిషన్, ఫండ్సూ దొరుకుతాయి. 

మరి నాకో...? ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అభిమానించే సినిమాలల్లో, నవలల్లో ఉండే ఊక దంపుడు  ఉపన్యాసాల తాలూకు కులాలు, మతాలు వాటి మధ్య అసమానతలు, దోపిడి, ఘర్షణ అంతా ఆచరణలో పట్టవలసిన సందర్భం వస్తే  ఫార్స్  అనీ, మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అసమానతలు  అన్నిటికి కారణం ఏకైక పదార్థం ఒక్కటే. . అదే 'ఆర్థికం' అనే జ్ఞానం మాత్రం మిగులుతుంది రాజూ! వీలైతే నిన్ను క్షమించు; 

ఇట్లు, 

... 

రాజుకు సవ్వొచ్చింది. 'క్షమించటానికి తనెవరు? రాధ తల్లి తండ్రులను తప్పు పట్టటానికి తన కెక్కడ నైతికంగా హక్కుంది? తమ్ముడికి ఉద్యోగం వస్తుం దనీ, తండ్రి సమస్య తీరుతుందనీ, సంఘంలో మరో మెట్టు పైకి ఎక్క గలమనీ నచ్చచెపితే గదా . . తన తలి దండ్రులు కులం అడ్డును కూడా  కాదని ఒప్పుకుంది! 

అదే మార్గంలో  రాధ తల్లిదండ్రులూ వెళ్లారు. 

రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని 


ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ.  అన్నీ  ఒకే  ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా! 

శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా  పైకి ఎగబాకాలని చూస్తున్నాడు! 

మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే! 

ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.

***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)  



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...