Monday, March 16, 2020

నటి శ్రీదేవి దుర్మరణం నేపథ్యం - హద్దులు తెలియని ప్రసార మాధ్యమాల పద్ధతులు - కర్లపాలెం హనుమంతరావు-మనం దినపత్రిక


కాలాలకు, తరాలకు అతీతమైనది ఆ అభినేత్రి ఆకర్షణ. భాషలు, ప్రాంతాలకు అతీతంగా దేశం ఇంటా బైటా ఒకే తీరైన అశేషమైన అభిమాన సంపద ఆ నటీమణి సొంతం. ఐదు దశాబ్దాల పాటు అటు  కుటుంబ జీవితాన్ని, ఇటు అభినయ వృత్తిని సమన్వయించుకొంటూ మూడొందల పై చిలుకు చిత్రాలలో  ప్రధాన పాత్రలు పోషించడం..  ప్రముఖ కథానాయకులకు దీటుగా ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే స్థిరంగా నిలబడి ఉండడం.. ఒక మహిళగా ఈ పురుషాధిక్య ప్రపంచంలో(మరీ ముఖ్యంగా మగవారి కనుసన్నలలో మాత్రమే నడిచే చిత్రపరిశ్రమలో) నిజంగా ఒక అద్భుతమే! అందం.. అభినయం ఉన్నంత మాత్రాన అందరికీ  సువర్ణావకాశాలు కలసి రావు. అడుగుపెట్టిన ప్రతిచోటా అందలం ఎక్కిందంటే  నిర్వచించేందుకు శక్యం కాని అదృష్టమేదో ఆమె  వరంగా పొంది ఉండాలి.  ఊహించని ఎత్తులకు ఎగబాకించిన ఆ అదృష్టం వరంగా పొందిన అత్యంత అరుదైన భారతీయ తారామణులలో శ్రీదేవిది నిస్సందేహంగా ముందు వరస. కాబట్టే అంతుబట్టని శ్రీదేవి హఠాన్మరణం ఖండాతరాలలో సైతం నాలుగు రోజులు  పెను సంచలనం సృష్టించింది.

జీవితమంటే శ్రీదేవికి సినిమానే. జీవితమూ అంతే విచిత్రంగా సినీమాటిక్^గా ముగిసి పోవడం ఎంతటి కఠినాత్ముడి చేతనైనా కంట తడి పెట్టించే దుర్ఘటన. కోట్లాది ఆమె అభిమానుల మనోభావాలకు సంబధించిన సున్నితమైన ఈ  అంశాన్ని స్వదేశంలోని ప్రసార మాధ్యమాలు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాలు నిర్వహించిన తీరుకు ఇప్పుడు సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి.

ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఎదగాలన్న పంతం ఎలా వీడకూడదో శ్రీదేవి జీవితకావ్యం నుంచి కార్యశీలులంతా  నేర్చుకోవచ్చు. సందర్భం వచ్చింది కనుక ప్రసార మాధ్యమాలూ సోదాహరణంగా ఆమె జీవితంలోని వికాసకోణాలను హుందాగా ప్రదర్శించవచ్చు. సమాజం పట్ల ప్రసార మాధ్యమాలకూ ఉండవలసిన బాధ్యతను గుర్తెరిగి ఉండి ఉంటే.. రెండుగా చీలిన టి.వి తెర మీద ఒక వైపు శ్రీదేవి నీటితొట్టి వరకు నిదానంగా నడుచుకుంటూ వెళ్లి హఠాత్తుగా పడిపోయే దిగ్భ్రాంతికర ఊహా దృశ్యం.. మరో వైపు ఆ   అందాల నటి వానలో తడుస్తూ వయసుకు మించిన కథానాయకుడితో చేసే శృంగార నృత్యం  చూసే దురదృష్టం వీక్షకులకు  పట్టి ఉండేదే కాదు.  వివాదాలకు అతీతంగా మెలిగిన ఒక మంచినటి జీవిత చరమాంకం   చివరకు  వివాదాస్పద అంశాల  ముగింపుగా మిగిలిపోవడం వెనుక భారతీయ ప్రసార మాధ్యమాల.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాల బాధ్యతారాహిత్యం ప్రధాన పాత్రే వహించిందన్నది నిష్ఠుర సత్యం.

రాజీపడని పెంకెతనం ఒక్కోసారి  తెచ్చిపెట్టే అభద్రతాభావన , అశాశ్వతమైన బాహ్యాలంకరణల మీద శృతి మించిన   మోజు ఎంతటి ఘనచరిత్ర కలవారి మీదనయినా ఎటువంటి దుష్ప్రభావం చూపిస్తుందో శ్రీదేవి జీవితాన్నుంచే ఓ పాఠంగా గ్రహించవచ్చు. ఆ మేరకైనా సమాచార మాధ్యమాలు తమ వంతు బాధ్యతను కొంతయినా నిర్వర్తించి ఉంటే.. ఇంత చర్చకు ఆస్కారం ఉండేదే కాదు.
వయసును ఎవరం ఎలాగూ  జయించలేం. కనుక కనీసం మనసునైనా కొంత మేరకు  నియంత్రించుకునే ప్రయత్నం చేసుకో గలిగితే అర్థాంతరంగా వచ్చి పడే అవాంతరాలను కట్టడి చేసుకోగల ఆత్మవిశ్వాసం అలవడుతుంది. నిత్యం మిరిమిట్లు గొలిపే వెలుగుల్లోనే తప్ప కనీసం మసక  చీకటి మలుపుల్లోకైనా వెళ్లనిచ్చగించని నేటి తళుకుబెళుకుల తరానికి శ్రీదేవి వంటి 'అతిలోక సుందరి' సినీజీవితమే ఆదర్శంగా ఉంటున్నద ఇప్పుడు. ఆచరణలోని దాని సాధ్యాసాధ్యాలను  గురించి అమాయకమైన యువతరానికి ఉదాహరణగా తెలియ చెప్పే అవకాశం శ్రీదేవి హఠాన్మరణం కలిగించింది. అయినా టి. ఆర్. పి రేటింగుల మీది అధిక ధ్యాస.. ప్రేక్షకులు పక్క ఛానెళ్లకి  మళ్ళకూడదన్న వ్యాపార లాభాపేక్షతో ప్రసార మాధ్యమాలు సామాజిక బాధ్యతను పూర్తిగా  ఉపేక్షించాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.

గెలుపు కోసం తపించిపోవడం ఎప్పుడూ వ్యక్తిత్వ వికాసానికి అవసరమయే ముఖ్య ప్రేరణే. కానీ విజయపుష్పాల పొదల మాటున కాటువేసేందుకు విషసర్పాలు ఎలా పొంచి ఉంటాయో విప్పిచెప్పి యువతను   అప్రమత్తం చేసే మరో మంచి అవకాశం శ్రీదేవి విషాద మరణం ద్వారా  అంది వచ్చినా.. అలవాటుగా ప్రదర్శించే నిర్లక్ష్యపు ధోరణితో ప్రసార మాధ్యమాలు మరోసారి తమ సామాజిక బాధ్యతను విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సర్వే సర్వత్రా.

అందని ఎండమావుల కోసం ఎగబడే ఆరాటం.. అవి అందినప్పటికీ ఎంత కాలం అందుబాటులో ఉంటాయో ఇతమిత్థంగా తేలని అభద్రతాభావన జీవితంలో ఎన్ని ఉపద్రవాలను తెచ్చి పెడుతుందో   'శ్రీదేవి విషాదాంతం '  ఉదాహరణగా చూపించి మరీ నేటి యువతరాన్ని హెచ్చరించవచ్చు . కానీ.. వీక్షకులంటే టి. ఆర్. పి రేటింగు  మినహా  రక్త మాంసాలున్న మామూలు మనుషులన్న స్పృహ   మరిచినట్లే ఉన్నాయి మన ప్రసార మాధ్యమాలు.  బుడ బుడ పొంగే స్నానాల తొట్టి నీటి అడుగులనుంచి  ఊపిరాడక గిలగిలా కొట్టుకొనే ‘రూప్ కీ రాణీ’ రూపాన్ని గ్రాఫిక్సుల ఆర్భాటంతో ప్రదర్శించడం ఎంత వరకు  టి.వి. చానెళ్లకు సమంజసం?

 శ్రీదేవి చాందినీ జీవితాన్ని   అర్థాంతరంగా ఇలా  ఓ గ్రహణం ఎందుకు మింగేసిందో?! వాస్తవాలన్నీ శాస్త్రీయ కోణంలో నిర్థారణ అయితే గానీ  ఇతమిత్థంగా ఎవరం తేల్చిచెప్పలేం. కానీ  వార్తలకు, నీలి వార్తలకు మధ్య ఆట్టే భేదం  పాటించే అలవాటు తప్పిన మన ప్రసార మాధ్యమాలు మాత్రం చెవిన పడ్డ ఏ పుక్కిట పురాణాన్నైనా చటుక్కున  ఓ వ్యాపార సరుకుగా మార్చేసుకొనే కళలో  ఆరితేరాయి. వ్యాపార ప్రాయోజితాల మీదే తప్ప  సామాజిక ప్రయోజనాల మీద దృష్టి దండగన్న దురదృష్ట ధోరణి ఇప్పటి ప్రసార మధ్యమాలలో పెరిగిపోతోందా? అమ్మ కన్నీటినయినా  అమ్మకం సరుకు చేసుకొని బతికేసే లౌల్యం క్రమంగా  పెరిగిపోతోందా? సామాజిక మాధ్యమాలకి ఎప్పుడో అంటుకొన్న   ఈ   మహమ్మారి ఇప్పుడు ప్రసార మాధ్యమాలనూ ఆక్రమించేస్తుందనిపిస్తోంది. శ్రీదేవి హఠాన్మరణం అనే ఓ అత్యంత విషాదకర సామాజిక దుర్ఘటనను  ఓ పెద్ద 'సేలబుల్' న్యూస్’ ఐటంగా మార్చి విచ్చలవిడిగా ప్రసారం చేసేటందుకు పురిగొల్పింది ఈ మహమ్మారే అనిపిస్తోంది.

ఈ వ్యాసం ఆరంభించే సమయానికి (27, ఫిబ్రవరి, 2018 ఉదయం 11 గంటలా 11 నిమిషాలు) గూగుల్ అన్వేషణ బాక్సులో 'శ్రీదేవి మరణం' అని తెలుగులో టైప్ చేస్తే కేవలం 0.52 సెకన్లలోనే 83, 200 లంకెలు సూచించబడ్డాయి.   శ్రీదేవి  మరణించడానికి కారణం .. 'గుండె పోటు'(Heart attack) గా నమోదయి కనిపించింది. కానీ ఇదే సమయానికి   తెలుగు టీవీ 24 గంటల ఛానెళ్లన్నింటిలో శ్రీదేవి దుర్మరణానికి కారణం ఆమె కుటుంబంలో ఆస్తిని  గురించి వచ్చిన పేచీలుగా ఓ వార్తా వ్యాఖ్యానం చిలవలు పలవులుగా   విస్తరించి వినిపిస్తోంది! 24వ తేదీ  నాటి మొదటి గుండె పోటు కారణానికి.. 27 వ తేదీ నాటి  కుటుంబ ఆస్తుల ఘర్షణల కారణానికి   మధ్య అంతులేనన్ని సినిమాటిక్  మలుపులతో  వార్తా కథనాలు యధేచ్చగా  ఏ ఛానెలుకు తగ్గట్లు ఆ ఛానెలు తనదైన శైలిలో వండి వారుస్తూ ప్రేక్షకుల మనోభావాలతో చెడుగుడు ఆడేసుకొన్న మాట వాస్తవం. ఒక క్రైమ్ మిస్టరీకి మించిన ఉత్కంఠను రేకెత్తించి సగటు టి.వి ప్రేక్షకుడి దృష్టి పక్క ఛానెలు వైపుకి మళ్లకుండా వార్తాఛానెళ్లు పోయిన పెడసరి పోకడలే ఇప్పుడు భావస్వేచ్చావాదులను  సైతం పునరాలోచనలో పడవేస్తున్నాయి.

వార్తా చానెళ్లు  నిరంతరాయంగా నిమిషానికో సారి  భయంకరమైన నేపథ్య సంగీతంతో,  గ్రాఫిక్స్ ఇంద్రజాలంతో ప్రదర్శించే  'బ్రేకింగ్ న్యూస్' దగ్గర  నుంచి  రెగ్యులర్ న్యూస్ బులెటన్ల చివరి స్లాట్ వరకూ ఊదర గొట్టేస్తున్న  వార్తలు అన్నింటికీ ఈ మూడున్నర రోజులూ ప్రధాన కేంద్ర బిందువు 'శ్రీదేవి' మరణ వార్త  ఒక్కటి మాత్రమే! ఏ విధంగా టి.వి. ల ఈ తెంపరితనాన్ని సమర్థించాలో  అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు  భావస్వేచ్చ కోసం నిత్యం పోరు సలిపే సమరయోధులు ఇప్పుడు.

భారత కాలమానం ప్రకారం శ్రీదేవి మరణించినట్లు వార్త బైటికి పొక్కిన 24, ఫిబ్రవరి,2018 11. 30 కి .. ఈ వ్యాసం ప్రారంభించిన సమయానికి (27, ఫిబ్రవరి,2018, ఉదయం 11 గంటలు)మధ్య దాదాపు మూడు రోజులు మించి వ్యవధానం ఉంది. 24గంటల వార్తా ఛానెళ్లు చేసే నిరంతర వార్తా ప్రసారాల ప్రకారం ఈ సుమారు 72గంటల వ్యవధిలో  స్థానికంగా కానీ, జాతీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ మరే ఇతరేతర  వార్తా ప్రాథాన్యత గల విశేషాలు అసలు సంభవించలేదనే అనుకోవాలి కాబోలు!

అన్ని ప్రధాన సంఘటనలను స్థలాభావం వల్ల ఏకరువు పెట్టడం కుదరక పోవచ్చు.  కానీ.. మచ్చుక్కి  ఓ మూడు నాలుగు రోజులు ప్రపంచాన్ని   ప్రభావితం చేసే ప్రధాన వార్తా విశేషాలు ఉటంకిస్తే వార్తాఛానళ్ల నిర్వాకం తేటతెల్లమవుతుంది. చైనా అధ్యక్ష పదవిని జిన్ పింగ్ కు శాశ్వతంగా కట్టబెట్టేటందుకు రాజ్యాంగ నిబంధనకు సవరణలు చేసేందుకు తీర్మానం జరిగింది ఈ మూడు రోజుల్లోనే. జాతీయ స్థాయిలో.. మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారి  మరాఠీ చట్టసభ సభ్యులకు అనువాద పాఠం అందచేయకుండా  గవర్నర్  మరాఠీ భాషా దినోత్సవానికి ఒక రోజు ముందు బడ్జెట్ ప్రసంగం చదవడం పెద్ద రాధ్ధాంతానికి దారి తీసింది. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయి.. భారీ పోలింగుతో ముగిసాయి. ఈ వ్యాసం రాసే రోజునే రాజకీయాలలో నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నారా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రవేశ దినోత్సవం.  'తగిన మద్దతు ఇవ్వని పక్షంలో రైతాంగం యావత్తునీ కలుపుకొని కేంద్ర రాజధానిలో ఆందోళన చేసేందుకైనా సిద్ధమ'ని తెలంగాణా ముఖ్యమంత్రి  కెసిఆర్ కుండబద్దలు కొట్టిన రాజకీయ పరిణామం జరిగిందీ ఈ వ్యవధానంలోనే. ఇవేవీ మన తెలుగు వార్తా ఛానళ్లలో చాలా వాటికి అంతగా ప్రాథాన్యమివ్వదగ్గ   వార్తాంశాలుగా తోచలేదు!   శ్రీదేవి మరణ కథనాలు వండి వార్చేందుకే 24 గంటలు సమయం చాలక తన్నుకు లాడుతున్న నేపథ్యంలో విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం ఎట్లా సాధ్యమవుతుంది .. అనిపించినట్లుంది తెలుగు వార్తా ఛానెళ్లలోని అధిక శాతానికి.

సమయం కేటాయింపులోనే కాదు  ప్రసారం చేసే విధానాలలోనూ వార్తా ఛానెళ్లు ప్రదర్శిస్తున్న పోకళ్లకు నోళ్లు వెళ్లబెట్టేస్తున్నారు ఆలోచనాపరులందరూ. శ్రీదేవి హఠాన్మరణ వార్త ఎంతటి కసాయి గుండెనైనా  కంట తడి పెట్టించే తీరులో ఉంది. సందేహం లేదు.  కానీ అంతటి దిగ్భ్రాంతికర దురదృష్ట సంఘటన వార్తగా ప్రసారమయే సందర్భంలోనూ ఆ అభినేత్రి వృత్తిపరంగా తాను  ప్రారంభ దశలో  వానలో తడిదుస్తుల్లో  వేసిన చిందులు పదే పదే టి వి తెర నిండుగా  ప్రదర్మించి    అభిమానుల మనోభావాలను కించపరచడం ఎంత అమానవీయమో ఛానెళ్ల నిర్వాహకులు ఆలోచించినట్లు లేదు.

వార్తలను వార్తలుగా చదివే విధానానికి టి వి ఛానెళ్లు స్వస్తి  పలికి చానాళ్లే అయింది . కర్ణాకర్ణిగా వినవచ్చే ఊసుపోని కబుర్లే ఇప్పుడు టి.వి. ప్రేక్షకులను అలరించే మసాలా దినుసులు. ఒకప్పటి    పేరు మోసిన దర్శకుడు  పదుగురి నోళ్లలో నలగడమే పనిగా పెట్టుకొని   పద్దాకా చేసే అసందర్భ ప్రేలాపనలను  ప్రముఖంగా ప్రసారం చేయడం  సున్నిత మనస్కులను ఎంతగా చీదర గొల్పుతున్నాయో టి.వి ఛానెళ్ల బాధ్యులకు  అర్థమవుతుందా?

నగ్న చిత్రాల నిర్మాణాన్ని బహిరంగంగా పట్టపగలే చర్చకు పెట్టి సమర్థించే వారికి టి.వి ప్రసారాలలో చోటివ్వడాన్ని మహిళా మండళ్లు ఇప్పుడు బహిరంగానే తప్పు పడుతున్నాయి.  పోలీసు స్టేషన్ల వరకు కేసులు ఈడ్చుకు వెళుతున్నాయి. తమకూ సమాజం పట్ల ఒక  బాధ్యత  తప్పక ఉంటుదన్న స్పృహ ప్రసార మాధ్యమాలకే ఉండి ఉంటే పరిస్థితులు ఇప్పుడింతగా దిగజారుండేవా?! అన్నింటికీ పరాకాష్ట    ఈ మూడు నాలుగు రోజుల బట్టి  మంచినటి శ్రీదేవి దురదృష్టకరమైన అర్థాంతర అనుమానాస్పదమైన మరణం మీద నిరంతరాయంగా కొనసాగుతున్న టి.వి ప్రసార మాధ్యమాల తీరు!  ఏ ఆధారాలూ దొరక్క పోయినా..  కేవలం ఊహపోహల ఆధారంగా  ఊసుపోని పోచికోలు  కథనాలను ఆపకుండా ప్రసారం చేస్తూ ప్రేక్షకుల విలువైన 'వాచింగ్ టైమ్ 'ను వృథా చేస్తున్నందుకు  టి.వి. వార్తా ఛానెళ్లను గట్టిగా నిలదీయవలసిన అవసరం ఇప్పుడు మునుపటి కన్న   మరింతగా పెరిగింది. అనారోగ్యకరంగా ప్రసార మాధ్యమాల  నడుస్తున్న స్పర్థను తిలకిస్తున్న వారంతా చిత్రాలకు మల్లే టి వి ప్రసారాలకూ ఖచ్చితంగా ఒక నియంత్రణా వ్యవస్థ తక్షణమే అవసరమన్న అభిప్రాయానికి వచ్చేసారు.

వినోద విజ్ఞానాలు జన సామాన్యానికి అందించే పుస్తకాల స్థానే ప్రస్తుతం  అంతర్జాలం.. దానికన్నా ముందు టి వి మాధ్యమం  ఆక్రమించాయి. సమాజాన్ని చైతన్య పరచే బాధ్యత గతానికి మించి  ఇప్పుడు మరింత అధికంగా ఉన్న నేపథ్యంలో టి వి  నిర్వాహకుల హద్దులు దాటుతున్న ప్రసార పద్ధతులు ప్రజాహిత వాదులందరినీ కలవరానికి గురి చేయడంలో అసహజమేమున్నది!

నిర్ధారణ కాని అంశాల చుట్టూ ఆసక్తికరమైన కథనాలు అల్లే ఆత్రుతలో టి వి ఛానెళ్లు చేస్తున్న  పొరపాట్లు చాలా సందర్భాలలో ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మరెన్నో సమయాల్లో మనస్తాపానికీ దారి తీయిస్తున్నాయి. శ్రీదేవి హఠాన్మరణ విషాద వార్త ప్రసారం చేస్తూనే ఆ సంఘటనకు రెండు రోజుల ముందు నాటి పెళ్లి వేడుకల్లోని ఆమె ఆటపాటలను కలిపి చూపించడం ఆ మహానటి అభిమానుల మనోభావాలను ఎంతలా కుంగదీస్తుందో ఏ ఒక్క ఛానెలూ పట్టించుకున్నట్లు లేదు!

వీక్షకుల  మనోభావాలతో యధేచ్చగా ఆడుకోవడమే తమ భావ ప్రకటనా స్వేచ్చగా టి.వి ప్రసార మాధ్యమాలు భావిస్తున్నాయా?  సమాజాన్ని, వ్యవస్థలని అత్యంత బలంగా ప్రభావితం చేసే ప్రధాన శక్తులలో చిత్రాలకు మించి  ముందుండేది ఇడియట్ బాక్స్.. టి.వి!

భావస్వేచ్చంటే  యధేచ్చగా  వ్యవహరించడమని టి.వి ప్రసారాల నిర్వాకులు అపోహపడుతున్నారు. దానినీ సరిదిద్ద వలసిన బాధ్యత   బావ ప్రకటనా స్వేచ్చ  ప్రగాఢంగా కాంక్షించే  ప్రజాస్వేచ్చావాదులే  తమ భుజస్కంధాల మీదకు  తిరిగి   తీసుకోవలసిన తరుణం ఆసన్నమయింది.
- కర్లపాలెం హనుమంతరావు
బోథెల్ ; యూఎస్
karlapalwm2010@gmail.com
WhatsApp +918142283676
***(మనం - దినపత్రిక ప్రచురితం )

Saturday, March 14, 2020

సరదాకేఃr ఇదో.. ఓ.. ఆదాయ మార్గం! -కర్లపాలెం హనుమంత రావు -సూర్య దిన పత్రిక



రకరకాల  ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా! ఓ మూలట్లా  మన్మోహన్ సింగులా
మూలుగుతూ కూర్చుంటే ఎట్లా? ఎంచక్కా  పోయి ఓ సారరి ఆ ముసలయ్యగారిని కలిసి

రారాదా!’ అని మా ఆవిడ  నస. వెళ్ళి కలిసాను ముసలయ్యగారిని. మనసులోని మాట
పెదాల మీదకు రానే లేదు,  పెద్దాయన చప్పట్లు కొట్టి పి.య్యేని పిలిచి
నన్నప్పగించేశాడు. ‘అయ్యగారికి ఇవాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ
ముఖ్యమైతే తప్ప  రిసీవరూ బైటికి తియ్యరు. ఏమిటీ విషయం?’ అనడిగాడా
పి.య్యే.
‘మా వార్దు నెంబరు పదమూడుకి నిలబడదామనీ! ముసలయ్యగారి పార్టీ సహకారం

కావాలి’ అన్నా టూకీగా. ‘మరైతే వట్టి చేతులతో వచ్చారేంటండీ బాబూ! మీ జాతక
చక్రం.. సూర్యమానం ప్రకారం వేసిందొకటి, చంద్రమానంతో కలిపిందొకటి తీసుకు
రావాలి. గ్రహాలు, రాశులు.. వాటిని బట్టే అయ్యగారి అనుగ్రహం!’ అన్నాడా
పి.య్యే.
‘తమిళనాడు దివంగత జయలలితమ్మాళ్ గారికీ ఇట్లాగే జ్యోతిష్కం,
సంఖ్యాశాస్త్రాలంటే తగని పిచ్చ. జాతక యోగం ఉచ్ఛస్థితిలో
ఉందనుకున్నవాళ్ళకు మాత్రమే టిక్కెట్లిచ్చారు ఒకసారి ఎన్నికల్లో.
ముఫ్ఫైతొమ్మిది స్థానాలగ్గాను ముష్టి తొమ్మిదంటే తొమ్మిది మంది మాత్రమే
గెలిచారంతా కలిపి. గెలుపుకీ గ్రహాల వలపుకీ లింకేంటండీ బాబూ?

ప్రజాస్వామ్యంలో ఘనవిజయానికి కావాల్సింది ప్రజల అభిమానం కాదుటండీ!’
అన్నాను కసిబట్టలేక.
‘టయానికి గుర్తు చేసారు!  ఆ జయమ్మగారి కన్నా మా ముసలయ్యగారు మరో
రెండాకులు ఎక్కువ.  ఇట్లాంటి పరాశాస్త్రాల పైన విపరీతమైన నమ్మకం. మీ

ఇంటికో సారి మా వాస్తుశాస్త్రులు వస్తారు. అన్నీ సవ్యంగా ఉంటేనే మీ మొర
మా పెద్దాయన ఆలకించడం! మొన్నీ మధ్యన ఇట్లాగే ఒక బొజ్జాయన ఇంటికి
ఈశాన్యంలో పూజామందిరం పెట్టుకుని  అవకాశం చేజేతులా జారవిడుచుకున్నాడు.’
 ‘ఇంటికి ఈశాన్యంలో మందిరముంటే దోషమా!’’

‘మందిరముంటే కాదు మహాప్రభో! అందులో వినాయకుడు, ఆంజనేయుడు లాంటి
బాహుబలులుంటేనే మోసం. ఈశాన్యంలో బరువులుంటేనే కదటండీ ఊహించని

ఉత్పాతాలొచ్చిపడేదీ! ఆ మాత్రం వాస్తుజ్ఞానం కూడా లేకుండానే వార్డు
మెంబర్లై పోదామనే!’ పి.య్యే మాటల్లో వెటకారం.
ఇండియాని ఈ కరోనా తరహా మాయదారి రోగాలు  ఎందుకిలా నలిపేస్తున్నాయో ఇప్పుడు
బుర్రకెక్కింది స్వామీ! ఈశాన్యం దాకా పాకిన అంత  లావు హిమాలయాలు.. వాటి
వెనకమాల్న చైనా కొరియా గట్రా దేశాలాయ! వాటి మాయ! అవి పట్టించుకోకుండా

కుంభకోణాలనీ, ద్రవ్యోల్బణాలనీ, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందికర
సంబంధాలనీ.. పాపం మనం మోదీ, షా మామయ్యలను హమేషా ఆడిపోసుకుంటున్నాం

నిష్కారణంగా'

నా ఆలోచనల్లో నేనుండగానే భుజం గోకి మరీ అడిగాడా  పి.య్యే ‘కొంపదీసి మీ
ఇంటిగ్గానీ సింహద్వారం దక్షిణం వారగా  ఉందా ఏంటీ? ముందే చెప్పండి బాబూ..
ఆనక నన్నెన్ని దెప్పీ నో యూజ్’

‘అమెరికా శ్వేత సౌధం తలవాకిలే దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది తమ్ముడూ!
మరా దేశం ఇన్నేళ్ళబట్టి అగ్రరాజ్యంగా  ఎట్లా నిప్పులు చెరుగుతుందో?’

‘వాదనలొద్దిక్కడ. ఆ ముచ్చట్లన్నీ టీవీ పెట్టెల్లో! ముసలయ్యగారు
పరాశాస్త్రాలన్నీ నమ్ముతారు. ఆయన ముక్కు చూసారా? దూలం భారీ. తిన్నగా కూడా
ఉండదు. అయ్యగారి ముక్కువాస్తు ముందే తెలుసుకుని వచ్చుండాల్సుందయ్యా
తమరు!’

బిక్క మొహమేయడం నా వంతయింది. పోయిన ఏడాదే మా అడ్డగాడిదకు ఎక్కడా ముడిపడే
యోగం కుదర్డంలేదని ఇట్లాగే ఏదో దిక్కుమాలిన శాస్త్రం  ఘోషిస్తోందంటూ నా

ఘోష లెక్కచెయ్యకుండా వీధి ముఖ ద్వారాలు రెండూ సగం మూయించేసింది మా
మహాతల్లి. ఇప్పుడీ ముసలయ్యగారి వాస్తు ఇంకేం మూయిస్తుందో.. ద్యావుడా!’

 ‘ముందొక  సారిట్లా వచ్చి ఈ నీళ్ళ తొట్లో మీ కిష్టమైన రంగు ముక్క ఏదన్నా
తగలేయండి బాబూ! మీ అసలు రంగేంటో బైట పడేందుగ్గాను ఇదో చిన్న స్లిప్
టెస్ట్ అన్నమాట!’ అంటో గారపళ్ళు చూపించాడా  పియ్యేగారు.
రంగులు మారుతున్న  నామొహం వంక చూసి ‘మీ సందేహం అర్థమైందిలేండి! ఈ తొట్లో
ఉన్నది  సీదా సాదా జలగ కాదండీ బాబూ! ఆఫ్రికా ఖండం యవుండే దేశం నుండి

తెప్పించిందండీ! ప్రపంచ ఫుట్ బాల్ పోటీలల్లో ఫలితాలు ముందే చెప్పిన
ఆక్టోపస్ 'పాల్' లేదూ.. దానితో క్రాస్ చేయించి పుట్టించిందండీ ఈ
బుజ్జిముండను! తండ్రి తాలూకు జోస్యం చెప్పే లక్షణాలు ఎక్కడకండీ పొయ్యేదీ?
ఒక్క పాలిటిక్సులోనే కాదు వంశపారంపర్యాలూ గట్రా! మోదీ వద్దని దులపరిస్తే
మాత్రం  మాయమై పోడానికి ఇదేమన్నా గుడిసెకు పట్టిన ఆర్డినరీ బూజా? వాస్తు
బూజు బాబూ.. వాస్తు మోజు’
 ‘ఆటల  మీద రంధి పెంచి బెట్టింగ్ సొమ్ము  రెట్టింపు గుంజేందుకు మాస్
మీడియాతో మాఫియా ఆడించిన నాటకాల్రా బాబూ ఆ ఆక్టోపస్సుల యాక్టింగులు!
యుద్ధ రంగంలోకి దిగే ముందే శత్రువర్గం మానసికంగా కుంగేటందుకు వాడుకునే
గూఢచర్యానికి నకలు.'
నా ఊహల్లో నేనుండగానే పెడబొబ్బలు పెట్టేసాడా పి.య్యేసామి. నా చేతులు
పట్టుకు తెగ ఊపేస్తూ ‘కంగ్రాట్సండీ కామాయ్ సారో! మీరీ పరీక్షలో కూడా
నెగ్గేశారోచ్! ఇహా కోయంబట్టూరు నాడీ జోస్యం కూడా తెప్పించేసుకుని రడీగా
ఉంచుకుంటే సరి.. మీ పని ఫినిషయిపోయినట్లే! ఆఁ.. అన్నట్లు.. ఈ లోపల్నే
నామనక్షత్రం ప్రకారం తమ పేరును ఎట్లా మారిస్తే దిగ్విజయం సిద్ధిస్తుందో
డాక్టర్ దైవజ్ఞానం  కూడా ఓ  నివేదిక తయారుచేసిస్తారు. ఓ.కే నా?’
‘పేరు మార్చుకుంటే అపజయలక్ష్మి ఆనవాలు పట్టకుండా వదిలేస్తుందనా?
దేవుళ్లను కూడా తప్పుదారి పట్టించే కొత్త  రకం గుంటనక్క ట్రిక్కా!’
‘మీరున్నారు చూసారూ.. భలే చిలిపి సార్! మనసులో ఏదున్నా అస్సలు దాచుకోరు!
ఐ ఎప్రిషియేట్! ఇది వరకో చిన్నారావును.. ఇట్లాగే 'చీ..అన్నా..రావు'గా
సాగదీసిం తరువాతనేనండీ అతగాడి జాతకం మొత్తం తిరగడ్డం మొదలెట్టిందీ!

దివ్యజ్ఞానం గారి విజ్ఞానాన్ని సందేహించకండి! అరవై ఏళ్ళ అనుభవసారం.
వాజిపేయి, సోనియాజీ, కరుణానిధీ, నెల్సన్ మండేలా, జార్జ్ బుష్, ఒబామా,

సద్దాం హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద జాతీయ, అంతర్జాతీయ శాల్తీల నాడులే
పట్టి మరీ జోస్యం రాబట్టిన ఘనాపాటి ఇతగాడు! మీ డౌట్లన్నీ తీరిపోతాయ్..
ముందీ బౌండు బుక్కు  చదవండి’ కవిలకట్టొకటి నా మొహాన ఠకీమని  కొట్టి
లోపలికి తారుకున్నాడా పియ్యే.

బౌండా అది? వందలాది ఏళ్ళ కిందటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెప్పే నాడీ
జోస్యంట ఆ దిండు! నోస్ట్రస్ డేమ్ జోస్యం కన్నా డేమ్ ష్యూర్ గా డాక్టర్
దివ్యజ్ఞానం జోస్యముంటుందని డబ్బాలు! ఇరాక్ యుద్ధం, ఇందిరమ్మ మరణం, రజనీ
బాషా హిట్టూ..బాబా ఫట్టూ, బందిపోటు వీరప్పన్ చావు, వెస్ట్ బెంగాల్
లెఫ్టిస్టుల ఫేటు, దక్షిణాది సునామీలు, ఆమ్ ఆద్మీ కేజ్రీవాలు  రైజు,
పెద్దనోట్ల రద్దు, ముంబై దాడులు.. ఆఖరికి  ఆర్జీవీ మూడ్స్ తో సహా హిస్టరీ

దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అనింపార్టెంట్ స్టోరీస్ ఆల్మోస్ట్
అన్నీ నేటివ్ టు ఇంటర్నేషనల్ లెవెల్లోవి సర్వం .. అవి   జరక్కముందే..
విఘడియల వివరాల్తో సహా పర్ఫెక్టుగా లెక్కగట్టి మరీ తేల్చినట్టి

రిజల్ట్సని కోతలు! ఆ దస్త్రాలన్నీ చదవడం సంగతట్లా పక్కనుంచి..
మొయ్యడానికే ముందు కోడి రామ్మూర్తిగారి  కండబలం కావాలి!
కరుణానిధిగారు శుద్ధ చార్వాకవాది. హస్తసాముద్రికాలు.. నాడీ జోస్యాల వంటి
అపరశాస్త్రాలు ఆయన వంటికి పడవు. అంత పెద్దల వ్యక్తిగత జీవితాల లోతుల్లో
కెట్లా చొచ్చుకెళ్ళగలిగాడబ్బా ఈ డాక్టర్ దైవజ్ఞానం! ఈ లెక్కన చూసుకుంటే..
కొరియా- ట్రంపుల ఒప్పందం, ఇరాన్ సులేమానీ మరణం లాంటి వాటిని గురించి
చెప్పుకునేవీ  డబ్బాలేగా!


ఇంకాస్సేపు గానీ ఇక్కడే పడుంటే.. ఈ ముసలయ్యగారి నస పి.య్యే బల్లిశాస్త్ర
పరీక్ష కూడా బలవంతంగా  చేయిస్తాడు. గ్రహణం బాలేదు. వచ్చింది గ్రహణం పూట
కాబట్టి  నైటు దాకా వెయిటింగులో పెట్టి తలవాకిట్లో పళ్ళె పెట్టి రోకలిబండ

నిలబెట్టమనే టెస్టూ తలపెట్టచ్చు.

ఎన్నికలల్లో ఎదుటి పక్షం అభ్యర్థి  నామినేషనెయ్యడానికే కురుక్షేత్ర
యుద్ధంలో తలబడ్డంత  ఘోరంగా ఉందే ఇప్పటి పరిస్థితి! గెలుపు మాట ఆనక, ముందు

మన వేలైనా ఓటు మిషను  మీట మీద పడనిస్తుందో లేదో.. పాడు రాజకీయం!
ప్రచారాలు మాత్రం?  ఓటెయ్యమని అడిగేందుకు పంచ ముందు కెళ్లడం ఆలస్యం.

పింఛన్లు పెంచు, కోకలు పంచు, పంచెలు ఇప్పించంటూ ఒహటే దంచుళ్లు! ఓటర్లతో
ఓ మంచీ చెడూ చెప్పుకోడాలిప్పుడు మరీ ఓల్డ్ ఫ్యాషన్సయిపొయ్యాయ్! ఓట్ మేటర్

అంటే ఓన్లీ మనీ మేటర్!

అసలే కరోనా రోజులు కూడా! కనబడ్డ కుంకెవరైనా కరచాలనం వంకన కక్ష కొద్దీ ఏ
మాయదారి రోగమో  వంటికి అంటించిపోతే! నిలబడ్డం మాట అటుంచి ఓటేయడానికైనా
వచ్చే ఎన్నికల దాకా శాల్తీ మిగిలే ఛాన్సుంటుందో ఉండదో.. డౌటే! ఎన్నికల్లో

నిలబట్టానికి ఎన్ని తిప్పలురా ద్యావుడా?

ముందు ముందు జరగబోయేది ముందుగానే తెలిస్తే ‘యెస్’ బ్యాంకు తుస్సు
మంటుందని ముందే ఎందుకయ్యా ఏ జ్యోతిష్కుడూ  నోరు పెగిలింది కాదూ? సి.యం
పదవి హుళక్కేనని ముందే ఏ న్యూమరాలజిస్టయినా సింధియా చెవిన చేరేసుంటే
అంత లావున ఎం.పీ లో కాంగీల గుంపు  గెలుపుకని కిందా మీదా పడుండునా? నిజంగా
జరిగేది నిఖార్సుగా చెప్పేదుంటే నిర్భయ నిందితులందరికి ఉరిశిక్షలు

ఎప్పుడో  నిర్భయంగా ఇప్పుడైనా చెప్పమనండి.. చూతాం! గీత దాటిన శాసనసభ్యుల
పైన వేటు పడే సుముహూర్తం ఎప్పుడో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఆ గుట్టేదో
విప్పమనండి.. విందాం!


పండించిన పంటకు మంచి రేటు పలికేది ఎన్నడో ముందే తెలిస్తే కష్టపడైనా
సరుకును దాచుకుని నష్టపోడుగా పాపం రైతన్న! నైరుతీ రుతు పవనాల రాక ఇదీ అని

నిక్కచ్చిగా తేలితే ముందుగానే దుక్కి దున్ని విత్తులు జల్లి నెత్తికి
చేతులు తెచ్చుకునే దుస్థితి తప్పునుగా అన్నదాతకు! వాయుగుండాలు తీరం దాటే

తీరు అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాతావరణ
శాస్త్రవేత్తలు. సదరు నిపుణులందరికీ జ్యోతిషంలో గానీ  గట్టిగా
తర్ఫీదిప్పిస్తే  దేశాన్నీ, జనాన్నీ వరదల బెడద నుంచీ
తప్పించిన్నట్లవుతుంది కదా!  ఏ సర్కారీ చాకిరీ ముఖాన ఎప్పుడు రాసుందో
ముందే ముఖం మీది రాతలు చదివే పండిత ప్రకాండులెవరైనా  చదివి చెప్పగలిగితే

ఇన్నేసి సెట్లతో విద్యార్థులకు కుస్తీపట్లు తప్పును కదా! సూపర్ సక్సెస్
ఫార్ములా ముందే ఫిక్సైపోయుంటే చిన్న నిర్మాతలిలా తలలు తాకట్టు పెట్టుకుని
మరీ చెత్త చిత్రాలు పోగేసే రొష్టు తప్పును కదా? పసిడి ధర ఇదిగిదిగో

పడిపోయింది, గ్యాసు ధర అదిగదిగో అంతర్జాతీయంగా ఎక్కడికో ఎగిరిపోతోందంటో
పచ్చడి మెతుకుల కూటిక్కూడా తడుముకునే బడుగుజీవిని కంగారు
పెట్టేస్తున్నాయ్ బంగారం కొట్లు, బండి చవురు బంకులు! బంగారంలాంటి

జీవితాలు వాటి చుట్టూతా గిరిటీలు కొట్టకుండా కాపాడవచ్చు కదా కాలజ్ఞానం
పైన అంత అపారమైన అవగాహనవుండే నవీన బ్రహ్మంగారులు నోరు తెరిచి బోధించి! ఏ

అపరాల ధర ఎప్పుడు ఎంత వరకు పెరుగుతుందో.. స్టాకు బజార్లలో ఏ షేరు ధర ఏ
క్షణంలో ఎంత లోతుల్లోకెళ్లి పడిపోతుందో .. ముందే కనిపెట్టేసి ఓ ఉగాది

పంచాంగం లాంటిది రిలీజు చేసేస్తే.. కన్రెప్ప కొట్టే లోపలిట్లా లక్షలూ
కోట్లూ ఆవిరయిపోడాలు.. ఏడుపులు ఉండవు కదా! దాంతాడు తెగా.. ఒక్క నోస్టర్

డ్యామూ నోరూ అడ్వాన్సుగా పెగలదు! సరి కదా.. తీరా తాడు తెగి బక్కెట బావిలో
పడిం తరువాతనా.. ఇదిగిదిగో.. ఇలా జరుగుతుందనేగా మేం ముందే కనిపెట్టి

ఘోషెట్టింది!’ అంటూ టీవీల ముందు చిందులు!
లావు లావు ‘లా’ పుస్తకాలు.. అవీ ఇవీ.. చదివి ఐయ్యేయస్సులు ఐపీయెస్సులూ
ఐపొయ్యే సార్లు, దొరసాన్లు ఇంకాస్త మనసు పెట్టి ఆ కూస్త బల్లిశాస్త్రమో,

పాదసాముద్రికమో కూడా ఔపోసన పట్టేయరా నిఖార్సైన  ప్రభావమంటూ నిజంగా
పరాశాస్త్రలకే   ఉండుంటే!

వాస్తవేమిటంటే..
వాస్తు వసతి కోసమని ఎన్నడో ఏర్పాటైన ఓ  చిన్న నిర్మాణశాస్త్రం. గుహల
నుంచి కాంక్రీటు గృహాల దాకా ఎదిగిన మనం  ఇంకా ఆ ఆకు కుటీరం నాటి అవసరాలను
తీర్చిన పాత నియమ నిబంధల చూరులు పట్టుకు వేళ్లాడుతు ఉంటే మానవ వికాస
నిర్మాణం ముందు ముందు మరంత విస్తరించడం ఎప్పుడు?

వరాహ మిహిరుడి వాస్తు ప్రకారం  మహానగరాలల్లో కాని  నిర్మాణాలు సాగిస్తే
ఇరుగింటి మురుగు పారేది పొరుగు పడక గది కిందనే!  మయామాతా, మానసారా.. ఎవరి
వాస్తు ఘోష వాళ్లది. వాటిలో వాటికే ఏకీభావం లేని పరాశాస్త్రాలతో  నేటి
నాగరిక మానవుడు ఏకీభవించడం పరాచికం కాదా?

వీరేశలింగంపంతులుగారు అమావాస్యనాడు ఉద్యోగంలో చేరి మహోపాధ్యాయుడిగా
కీర్తి గడించారు. సురవరం సుధాకరరెడ్డిసారు  రెండువేల నాలుగు  నాటి
ఎన్నికల్లో రాహుకాలంలో నామినేషన్ వేసి  మరీ ఎం.పీగా గెలుపు సాధించారు!


నాడీ జ్యోతిషం వేదవిజ్ఞానం కాదు. నాలుగో శతాబ్దం దాకా వేదాలలో వాస్తు
ప్రస్తావనే లేదు. ఎన్ని వేద సంహితలలో భూతద్దం పెట్టి వెతికినా
సంఖ్యాశాస్త్రం కనిపించదు. మనిషి వస్త్రలాభం, వాహన యోగం గోడ మీద పాకే

బల్లా నిగ్గుతేల్చేది? సిల్లీ! కుళ్లు బుద్ధులతో మనం అనుక్షణం కొట్టుకు
చస్తూ ఆ కలహాలకి కారణాన్ని పురుగులేరుకు తినే  బల్లి మీదకా తోసెయ్యడమా..

దారుణం!

ఈ సారి ఇంకేదో మూడు కాళ్ళ కప్ప బొమ్మ పట్టుకుని నవ్వుతో బైటికొచ్చాడు
పి.య్యేసారు. చైనా వాస్తు ఫెంగ్-షూయి ప్రకారం మూడు కాళ్ల కప్ప గుమ్మం
ముందు కూర్చున్నట్లుంటేనే ఇంటి యజమానికి మనోసిద్ధి ప్రాప్తిరస్తట!
ఇట్లాగే ఇంకా ఏవేవో చాలా శాస్త్ర మర్మాలు విప్పచెప్పే ఉత్సాహంలో ఉన్నాడు
ముసలయ్యగారి పర్శనల్ సహాయకుడు! కానీ నా మానసికస్థితి అప్పటికే ఒక గట్టి

స్థితప్రజ్ఞతను సాధించింది.  మూడు కాళ్ల కప్పతో సహా గిరుక్కున వెనక్కి
తిరిగి వచ్చేసా.

‘అష్టమి, మంగళవారం, ఆ పైన గ్రహణం. బయల్దేరిందేమో రాహుకాలం. అదీ వర్జ్యం
వదలక ముందు! ఎదురుగా వచ్చిందేమో నల్ల పిల్లి! కాస్తంత సేపు ‘కూర్చుని
నెత్తి మీదిన్ని నీళ్ళు జల్లుకుని పోవయ్యా మగడా!’ అన్నా! వింటేనా?

పరగడుపున బల్లి భుజం  మీద పడ్డప్పుడే అనుకున్నాలే, ఇవాళేదో ముదనష్టం
ముహాన రాసిపెట్టుందని..’ ఇట్లా  సాగుతుంది ఇంట్లో మా ఆవిడ పురాణం. రక
రకాల శాస్త్రపరీక్షలకూ,  ఎన్నో రకాల నివేదికలకూ, ఇదిగో ఈ మూడుకాళ్ళ కప్ప

బాపతు  దిష్టిబొమ్మలు గట్రాలు మరికొన్నింటికి.. అంతా కలసి ముసలయ్యగారి
పి.య్యేమనిషి  నా మూతి పళ్లు రాలగొట్టి   రాల్చుకున్నవి   అక్షరాలా అర్థ

పదివేల నూటపదహార్లు! వాటి  గురించే ఆవిడ షష్ఠాష్టకాలు!
 ‘సొమ్ము పోతే పోయిందిలేవయ్యా! ఆ వార్డు మెంబరూ వద్దు.. పాడూ వద్దు! ఎవరం
ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇంచక్కా నువ్వూ ఆ చైనావాళ్ల వాస్తు
బొమ్మలు అమ్మే కొట్టు వెంటనే మొదలెట్టు’ అనేసింది ఆవిడే మర్నాడు

వాతావరణం చల్లబడి మెదడు మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాత!
నిజమేగా! ఎవరం ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇదీ ఓ ఆదాయ మార్గమేగా!
***

Saturday, March 7, 2020

సరదాకేః మగువంటే మగవాడి మర-యంత్రమా? -కర్లపాలెం హనుమంతరావు





చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూbత్రం వర్తిస్తుంది. 'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణా' అని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి sఅదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధ. మగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 
పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదు, విను, కాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారు, నీ/ యరుదగు కంబు గంఠమున కంజలి, నీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్, బెళుకు క్రౌనుకు మ్రొక్కెద, బంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 
నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదు. అర్జనుడి రాక ముందు నుంచే రాజ్యం దర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూ. నేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్న భార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ.. కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 
వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్కుడు మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాతే మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం. 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా? అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగాడు లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలు! ఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతో నిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహా రథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీ, న దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో ‘అమ్మ’ ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం ‘నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం’.  ‘ఆమె’ ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాతనే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు ‘కౌసల్య’ మాతను తలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్యల కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పడుతున్నందు వల్లనే  స్త్రీలోకమంతా ఇంతలా అల్లకల్లోలంగా తయారవుతున్నది.

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాదే తన పాలిట సైతానుగా మారుతున్నందుకు ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!' అంటూ అంతలా తల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్య, ధన, ధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగా ఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడాళ్లే.. కైకేయి, మంధర, శూర్పణఖ.. అంటూ తన బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెచ్చర్లు దంచికొడతాడు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి ఎంతలా వేపుకుతినలా? అంటూ అంటూ- సొంటూ లేని శుంథ ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదో, జరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో.. ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు! 
కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్నామే వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందికాదు. ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులను, మిత్రులను, ముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శపాలకు గురయిన కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్. వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే ఆ సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేస్తే పుణ్యస్త్రీ బిరుదులు వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగాళ్ల  నుంచే!
ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువు. కేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం. స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది. 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసేసింది ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. కాబట్టి వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనా, కాలం ఎప్పటిదైనా, ప్రాంతం ఎక్కడిదైనా, వైవిధ్యాలు, వైరుధ్యాలు, అంతర్వైరుధ్యాలు ఎన్నున్నా స్త్రీలకు అన్నాయం చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయ్.. సహకరించుకుంటున్నాయి కూడా!

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించిందేనట ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అంటూ  సిద్ధాంతాలు చేయబట్టే కదా  మగాడికి ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైన, ముది వెంగలి యైన, గురూపి యైననున్, త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించి, యొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతి, కి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకొనున్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛ అనేదే బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 
మరను, యంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టేయంగానే తలొంచుకొని వెళ్లి అతగాడి వంశం మొత్తానికి  జీతం బత్తెం లేకుండా శాశ్వతంగా ఊడిగం చేసుకోడం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలు ఇప్పటికీ గుడ్డిగా నమ్మి కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మగజాతిని మాత్రమే!

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు.. అన్ని అనుభవాలూ అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకు కాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. ‘గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ , మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకు నమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లిందెవరూ? 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండం' నుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితి.

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చు  మగవాడి హక్కులతో సమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యం 
- కర్లపాలెం హనుమంతరావు 
(సూర్య  దినపత్రికలో ప్రచురితం ..మార్చి 8, మహిళా దినోత్సవ సందర్భంగా )  

***


Saturday, February 29, 2020

సరదాకేః చిల్లర మల్లర మంచితనం -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక – ఆదివారం,


ఒక్కోసారి ఊహించని వైపునుంచి ఉత్పాతాలు వచ్చి పడుతుంటాయి. దిల్లీ  గొడవలను గురించి కాదీ ప్రస్తావన. చిల్లర మల్లర మంచితనాన్ని  గురించే  చింతంతా.
నగర పాలికల ఎన్నికలకు నగారా మోగేందుకు సిద్ధంగా ఉందా! పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో పై స్థాయి పెద్దలు పనుపున  వచ్చిన  కింద స్థాయి పెద్దలు  మా బుల్లిస్థాయి పెద్దలను  అందరినీ సమావేశపరచి మరీ హెచ్చరించడాలు కూడా అయిపోయాయి. ఈ సారి- 'ఏం చేసైనా సరే'.. పార్టీ అభ్యర్థుల్ని ఆయా ప్రాంతీయ బాధ్యులే  గెలిపించుకు తీరాలి’ అని  తాఖీదు!

ఏం చేయించడానికైనా' మేం సిద్ధంగా ఉంటే సరా? ఏమైనా చేసేందుకు కార్యకర్తలూ  సిద్ధంగా ఉండాలిగదా! అసలు కార్యకర్తలంటూ పార్టీలో మిగిలుంటేనే కదా ఏ కథయినా? ఖర్మ!

పార్టీ అధికారంలో లేనప్పుడు జెండాలు భుజం దించకుండా.. సొంత సొమ్ము తగలేసుకొని మరీ ఊరేగిన తింగరోళ్లను.. అధికారంలోకి వచ్చినాక.. పులుసు ముక్కల తొక్కలకు మల్లే  పార్టీ పక్కన పెట్టేసింది. అలిగి పక్క పార్టీల్లోకి గెంతేసారెప్పుడో దాదాపు అంతా.

చుక్క.. ముక్క’ ఏర్పాట్లా పక్క పార్టీల కన్నా ఇంకాస్త ఎక్కువ మెరుగ్గానే చూద్దాంలే. మాతృపక్షంలోకి మళ్లా  లేచిపోయిరమ్మ’ని   పిలుపిచ్చాం.  పార్టీ తరుఫున గడ్డం పుచ్చుకు బతిమాలాం.

'హామీలు  నమ్ముకొని గోదాట్లోకి దూకే రోజులంటన్నా ఇవి? అవతల పార్టీలు.. పాపం..  పదవుల్లో లేకపోయినా ఆప్పో సప్పో చేసి మరీ మమ్మల్నిప్పటిదాకా మేపుకొచ్చింది ఇదిగో.. ఇట్లాంటి ఎన్నిలక్కర్ల కోసమే కదా!  మళ్లా వాళ్లకీ వెన్నుపోటంటే బావుండదు' అని సుద్దులు చెప్పుకొచ్చారు పిల్లకార్యకర్తలు. ఇహ వాళ్ల వైపునుంచి సభల్లో చెప్పులు, ప్రచారంలో సిరాలు, కేన్వాయీల కడ్డంగా పడుకోడాల్లాంటి అల్లర్లు   కల్లో మాటే మా పార్టీ వరకు.
ఈ మధ్య యోగాగురువులు, స్వాములార్లు, వ్యక్తిత్వ వికాస పాఠాలు గుప్పించే పెద్దోళ్ల సేవలు కూడా మా బాగా ముమ్మరించేయాయి కదా అన్ని పార్టీల్లో! అల్లరి కార్యకర్తలకు ఎక్కళ్లేని కరువొచ్చి పడిందందుకే. చిల్లర పన్లేవీ పెట్టుకోకుండా ఎన్నికల గండాలు గట్టెక్కేందుకు  మనకింకా సంపూర్ణ రామరాజ్యంల్లాంటివి సగమైనా వచ్చిచావలేదే!

మేం దిగువసభలకు నిలబడ్డప్పుడు ఎగువనున్న  ఏ పెద్దమనిషీ దిగొచ్చి మాటవరసకైనా    ఒక్క  మంచిమాట మాటసాయంగా అయినా చేసిందిలేదు. పైవాళ్ల పోస్టర్ల నుంచి.. పక్క పార్టీ అభ్యర్థుల పోస్టర్ల మీద పేడముద్దలు, ఊరేగింపుల మీద వేయించే రాళ్ళు రప్పలు.. సోషల్ నెట్ వర్కుల్లో అక్కసులు వెళ్లబోసుకునే దాకా అన్ని తిప్పలూ మేమే పడింది. ఎన్నికలసంఘం లెక్కలడిగినప్పుడు ఎన్ని యాతనలు పడ్డామో  అధిష్ఠానాలకేం తెలుసును? అప్పుడూ మాకే బిల్లు. ఇప్పుడూ మా మనీర్శులకే చిల్లు. దేశమే అట్లా ఏడ్చింది! దరిద్రం!

గతం గుర్తుచేసుకుని కుళ్ళుతూ కూర్చుంటే  భవిష్యత్తుండని పాపిష్టి ఫీల్డ్ ఈ   రాజకీయం. గోల్డనుకుంటారు కానీ.. బైటికే ఆ మెరుపులు!
  
రిటన్ ఆఫ్  రాహుల్ బాబు’ ఎపిసోడ్ చూసి విరమించుకోడమే తప్పించి నిజానికి ఇంటాళ్లక్కూడా కూడా ఆనవాలు చిక్కకుండా ఆ బాబుకు మల్లేనే సెలవు చీటీ ఓటి పారేసి ఇంచక్కా ఎక్కడికైనా చెక్కేసెయ్యాలనిపిస్తుంది ఒక్కోసారి!

వాళ్లెన్నిక చేసినవి గాడిదలైనా.. సరే గెలిచే తీరాలని రెట్టిస్తే ఎట్లా? డ్యూటీలు బలవంతంగా మెడకు చుట్టేసే ఈ అధిష్ఠానాలు.. టిక్కెట్ల పంపకాలప్పుడు మాత్రం ఎన్ని సార్లు దిల్లీ చుట్టూ  చక్కర్లు కొట్టి.. సిగ్గిడిచి కాళ్ళ మీద పడ్డా  కోరుకున్నవాడి వేపు కన్నెత్తైనా చూడవు!  కోటరీలు కట్టే   సూటూకోటుగాళ్ల  మాటలే ఫైనల్గా వాళ్ల చెవులకు  స్వీటు! 

ఎక్కడెక్కణ్నుంచో గాలించి మరీ  తెచ్చి ఇక్కడ నిలబెట్టేస్తున్నారే కాండిడేట్లను! ఇలాకాలో ముక్కూ మూతీ అయినా సక్రమంగా ఎరగని కుంకలను  చంకనేసుకు ఊరేగడం.. కుక్కల్లా విశ్వాసంగా  పార్టీలో పడున్నందుకు చివరికి దక్కే ఖర్మఫలం! ఎన్ననుకున్నా అన్నం పెట్టిన పార్టీ.. ఆనతి పాటించడం ఆనవాయితీ కనక.. తప్పదు.
కానీ.. 
అతి నిజాయితీ,  నీతికి ప్రాణమిచ్చే త్యాగబుద్ధి.. వంకాయ.. ఏం చేసుకోనూ ఈనాటి రాజకీయాల్లో? ఓటరు పన్లకు ఏ మాత్రం  లింకుల్లేని  కార్యక్షేత్రాల నుంచి వచ్చిపడే  మహామేధావుల్ని  గెలిపించే ‘భారం’ మా నెత్తికి  రుద్దితే.. గట్టెక్కించడం అంత తేలికా?

అవతల పార్టీల నుంచి కాలు దువ్వేది గాలి బ్రదర్సుకే పాఠం నేర్పే ఘనాపాటీలు.. గుత్తేదార్లు, రామలింగరాజునయినా నంజుకు తినివూసేసే ఇండస్ట్రియల్ ఎలైట్సూ! అన్నీ లైటుగా తీసుకోబట్టే మాడిపోయిన బల్బులాగా కళతప్పుందిప్పుడు మా పార్టీ భవిష్యత్తు!

అధికారులు అందుబాటులో ఉన్నప్పుడు  చేయరానివి, చెప్పకూడనివి ఏవేవో చేసేసి  మీడియా  పుణ్యమా అని ప్రజాసేవకుల జాబితాలోకొచ్చి పడ్డ స్వాములార్లు, అవతారమూర్తులు,   విశ్రాంత  న్యాయమూర్తులు,  చలనచిత్రాలలో అవకాశాలు సన్నగిల్లిన మహానటులూ, మొహం మొత్తిందాకా   టీవీ సోపుల్లో మొహాలు చూపించి వళ్లు పెంచిన   గ్లామరు గాళ్సూ.. పోటీ! నీతివంతుడన్న ముద్ర పడ్డ పెద్దమనిషి ఎవడన్నా ఈ తరహా సెలబ్రటీల పోటీని తట్టుకుని నెట్టుకురావడమే! మహాత్మా ఫూలే కన్నా ఫూలన్ దేవికే ముందు మెడలో  పూలమాలలు పడే ఫూలిష్ సీజన్ స్వామీ ప్రస్తుతం నడిచేదీ! బఫూన్స్ ను పెట్టి గెలిపించుకు రమ్మంటూ మా ప్రజాప్రతినిధులకిప్పుడు ఈ కొత్త రకం ప్యూను జాబులేంటో?  ఖర్మ౦!

ఈ సారి మా ఇలాకా  నగరపాలిక ఎన్నికల్లో ప్రస్తుతానికి మేమున్న  పార్టీ పక్షాన నిలబెట్టబడ్డ పెద్దమనిషి అదేదో విదేశీ నిధుల సాయంతో స్వచ్ఛందంగా సేవా సంస్థలు

రెండు భారీగా నడుపుకొనే బడా హస్తి.  మూడొంతులు  వేలిముద్రగాళ్లతోనే ఓటర్ లిస్టులన్నీ కిక్కిరిసున్న   ఇలాకాలో విదేశీ చదువులు ‘కొన్న  విద్యావేత్తను గట్టెక్కించడమా?   వరద పొంగుకొట్టుకెళ్లే గార్దభాన్ని  నిండుగోదారి కెదురెళ్లి  గట్టుకీడ్చుకు రావడం ఇంత కన్నా ఈజీ.




ఏట్లో దూకినోడు గట్టెక్కాలంటే సొంతంగానే ఈదనక్కర్లేదంట! మోతగాళ్ల రెక్కల కష్టం పుష్కలంగా ఉంటే చాలన్నది  మా పాత పార్టీ బొజ్జపెద్దల నయా సిద్ధాంతం. నిజమే కావచ్చేమో కానీ మోసే చిల్లర గాళ్లకే ఎక్కళ్ళేని కరువొచ్చి పడిందయ్యా స్వాములూ ఇప్పుడు! ఆ ఉత్పాతం పార్టీ పసిగట్టకపోడమే  మా ఉపద్రవాలకు మూలకారణం.

స్వచ్ఛంద సంస్థల పెద్దాయన వ్యక్తిగత జీవితం మరీ శుద్ధమబ్బా!  సర్కారు కొలువులు వెలగబెట్టే రోజుల్లో ఒక్క పైసా కూడా ముట్టని అర్భకుడన్న చెడ్డపేరొకటి పెద్ద మైనస్ గా మారిందిప్పుడు సామాజిక మాధ్యమాలలో  కార్చిచ్చులా అంటుకుని.

రేప్పొద్దున నిజంగానే ఎన్నికయి ఊరి మొత్తానికి ఫస్ట్ పెద్దమనిషి అయిపోతే ఇలాకా అభివృధ్ధి  గతి ఏంటీ? అంటూ రచ్చ. ఎక్స్పార్టీవోడికి ఇదే పెద్ద బ్రహ్మాస్త్రంగా మారిందిప్పుడు!

ఏ ప్రభుత్వ భూమీ  కబ్జాకాస్కారం ఉండదు! ముందే ఆక్రమించిన భూముల్నయినా తిరిగి లాక్కునే ప్రమాదం కద్దు! అసైన్ మెంటనో.. అసెస్ మెంటుల్లో లోపమనో.. ఏదో ఓ సిల్లీపాయింటు పట్టుకుని సెటిల్ మెంట్లన్నీ అంట్లగిన్నెల డబ్బీలో వేసేస్తానని మొండికేస్తేనో? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చి పడే పిసరంత నిధులను కూడా అచ్చంగా ఆయా పథకాలకు మాత్రమే వెచ్చించి తీరాలని ఖచ్చితంగా నిబంధనలు పెట్టేస్తేనో? ‘పట్టించుకోం..  పో.. దిక్కున్న చోట చెప్పుకో!’ అంటూ మునపట్లా చిందులేస్తామే అనుకోండి! అయినా అందర్లా  ‘ఊఁ’ కొట్టి ఊరుకొనే ఘటమైతే తంటానే లేదు. మొండిఘటమని ట్రాక్ రికార్డులు అఘోరిస్తున్నాయే! కోర్టు బోనులకెక్కిస్తేనో మళ్లీ! మన తంటాలేవో మనం పడి గుట్టుగా బెయిళ్లు కొనుక్కు తెచ్చుకున్నా వెంటనే రద్దు  చెయ్యాలని  కోర్ట్ల మీదకు తిరగబడితేనో? గడ్డివాములోని కుక్క సామెతబ్బా  .. వీడిని ఎన్నుకుంటే!  అడ్డమైన గడ్డికీ అలవాటు పడ్డ పశువులం మన నోట్లో మన్నే కదా పడేది చివరికి? అని గోడు.

లోపాయికారీగా మా ఏడుపూ అదే .. నిజం చెప్పద్దూ! ఎన్ని తరాల బట్టో  అనుభవిస్తున్నవీ భోగాలన్నీ! అడిగేనాథుడు రాలేదిప్పటి దాకా. ఇప్పుడీ చాదస్తపు ప్రజాసర్వెంటొకడొచ్చి  విద్యుత్ బిల్లులు.. వాటర్ బిల్లులు, ఆస్తి పన్నులు.. వృత్తి పన్నుల.. ఆ పన్నులు ఈ పన్నులంటూ పాత దస్త్రాలన్నీ కెలికించేసి బకాయిలతో సహా అపరాథ రుసుం, దాని మీది చక్రవడ్డీతో   లెక్కగట్టి అసల్తో కలిపి మొత్తం ఏ వారం రోజుల్లోనో కట్టేసెయ్యాలని గట్టిగా లాయర్ నోటీసుల్తో దాడికొచ్చేస్తేనో!

దాచిపెట్టిన పన్ను ఎగవేత కేసులన్నీ వెతికించి తిరగతోడితే? కూడేసి కూతుళ్ల పెళ్లిళ్లకు, కొడుకుల వ్యాపారాలకు తరలించేసిన సొమ్ములన్నీ తిరిగి తెచ్చిమ్మంటే? ఎక్కణ్నుంచని పీక్కుని తెచ్చిపొయ్యడం! ఏడుకొండలవాడి హుండీలో వేసిన సొమ్మునైతే వెనక్కు లాక్కోలేం కదా!

గమ్మున  కూర్చొనే తిమ్మయ్యయ్యా మన పట్టనానికి ఇప్పుడు అధినేతగా రావాల్సిందీ?  చదూకొన్న వెధవామాయ ఈయన! కోర్టు రూల్సు అన్నీ కొట్టిన పిండంటున్నారు! రాజ్యాంగంలోని రహస్యాలన్నీకంఠతా పట్టేసి సివిల్సులో నెంబర్ ఒన్ గా వచ్చినోడితో పోరే మార్గం ఏది?        కోర్టుల్లో పడి వీడితో పోరుతూ కూర్చుంటే వచ్చే ఎన్నికలకు అయ్యే    ఖర్చులు మళ్లీ  దక్కించుకునే దారులు వెదికే తీరిక ఎదీ?


పార్కులు, పార్కింగు స్థలాలు,  పాదచారులు నడిచే   దారులు పాదచారులకే అంటూ కొత్తరకం చాదస్తాలు దస్తాలకు దస్తాలు సిద్ధం చేసుంచాడని టాకు! ఆ సరికొత్త సకల సౌకర్యాలకూ జనాలు  అలవాటు పడిపోతే మింగటానికింక నేతాగణాలకి  మిగిలే జాగా ఒక్కరంగుళమైనా మిగిలుంటుందా? భూముల  ఆక్రమణల కోసం అడ్డొచ్చిన ప్రతీ చెట్టూ చేమా, పుట్టా గుట్టా కొట్టేసుకుపోతున్నామిప్పుడి దాకా! అడిగే దమ్మెవడికీ లేదు. నేరస్తుల శిక్షాస్మృతిలో వాటికీ శిక్షలు ఇన్నున్నాయని తెలిసిపోతే మన ఇళ్లల్లో  పనిచేసే పనివాళ్లల్లో కనీసం ఒక్కళ్లకైనా బెయిలుకు వీలయ్యే శిక్షలు పడకుండా తప్పే దారుంటుందా?  

ఆటస్థలాల్లేని పాఠశాలలు, రక్షణవ్యవస్థ పటిష్టంగా లేని పర్యాటక ప్రాంతాలు,   నిబంధనల ప్రకారం  వైద్యసేవలందించని వట్టొట్టి వైద్యశాలలు, పరిశుద్ధమైన పదార్థాలు తాజాగా వడ్డించని పాచి భోజనశాలలు, వాహదారుల వాడకానికి తగినంతగా జాగాలు చూపించని టిక్కీ వినోద, వ్యాపార కేంద్రాలు.. గుర్తింపులు రద్ధయేదాకా నిద్ర పోనంత చండశాసనుడని ముందు నుంచే చెప్పుకుంటున్నారు ఈయన గురించి! మన భద్రత కోసం అంకితమై  అహర్నిశలు జనాలను అదుపుచేసే కార్యకర్తలకు రిటర్న్ గిఫ్ట్స్ గా మనమింకేం  కంట్రాక్టులు జనం సొత్తు దోచి  ఇప్పించగలం?

శిరస్త్రాణాలు, సీటు బెల్టులు, పరిమితికి లోబడి మాత్రమే నియమిత వేగంతో అనుమతించిన దారుల్లో వాహనాలు నడపడాలు! ఇదేమైనా అమెరికా దేశం న్యూయార్కు నగరమా! ముచ్చటపడితే నడుపుకోడానికి హోండాలు, బెంజీలు  మునిమనమళ్లకు ఏ బర్త్ డే కానుకులుగా ఇచ్చుకోడమూ నేరమేనా? కాలుష్యం పెరుగుతుందని చెప్పి కాళ్లరిగిపోయేటట్లు ఇంటాడాళ్లు కాళ్లాడించుకుంటా షాపులెంట చీపుజనాలతో వీపులు రుద్దుకుంటా  తిరుగులాడాల్నా? లాకౌట్లు  చేయిస్తా, కటౌట్లు పీకేయిస్తా అంటుండె! పేకాట క్లబ్బులకు  లాకులు వేయిస్తే ఇంటళ్లుళ్లు ఇంకేదో దేశం పోయి  టైం పాస్ చేస్తేనో.. కూతుళ్ల మాటేమిటి?    

చ్చమొచ్చిన చోట మలమూత్ర విసర్జనలు చేస్తే పబ్లిక్కున పెట్టించి పరువు తీస్తా! ధూమపానం చేస్తున్నట్లు పదిమందిలో కనిపించినా, బస్టాండుల్లాంటి చోట్ల ఆడబిడ్డల్ని పట్టుకుని వేధించినా అక్కడికి అక్కడే అరెస్టులు చేయించేస్తా! గుళ్లు, మసీదులు, చర్చీల ముందు చేరి చెవులు దిబ్బెళ్లడేలా డోళ్లూ బూరాలతో హార్మోనీ పెట్టెలతో  శబ్దాలు గాని  చేస్తే న్యూసెన్స్ కేసులు బనాయించేస్తా! ఇంటాడాళ్లను వేధించడం, పసిపిల్లకాయల చేత పనిపాటలు చేయించడం సహించరాని నేరం.. తక్షణమే యాక్షన్ తప్పదనడం.. ఓవరాక్షన్ కాదూ! శాంతి భద్రలు మరీ ఇంత ఘోరంగా అదుపులో ఉంటే ఒక్క పార్టీ కార్యకర్తనయినా ఊచల కివతల ఉంచేసుకోగలమా? కితకితలు కాకపోతే ..  కట్టుకున్న దానిని, కన్న తల్లిదండ్రులను ఇంటైనా బయటైనా అమానుషంగా హింసించినట్లు సమాచారముంటే సహించడమనే మాటే ఉండదంటూ ఇప్పట్నుంచే ఎన్నికల్లో ఉపన్యాసాలు దంచటాలేవిటంట! కూరగాయల బజార్లలో నిలువు దోపిడీలు జరుగుతున్నాయ్! పళ్ళను మగ్గబెట్టేందుకు కృత్రిమ  రసాయనాలు వాడేస్తున్నారు. చట్టం అనుమతించని ఏ ఒక్క అసాంఘిక చర్యకు ఎవరు పాల్పడ్డా, అంతస్తులతో నిమిత్తం లేకుండా చట్టబద్ధంగా ఉంటూనే కఠినంగా వ్యవహరిస్తా!’  అంటూ ఏమేమో    పట్టణ ప్రజాజీవనం  ప్రశాంతంగా సాగిపోవాలని పెద్ద తానొక్కడే  తహతహలాడుతున్నట్లు డే అండ్ నైట్,  పోయిన ప్రతీ చోటా బారెడేసి ప్రసంగాలు.. మా చదువుకొన్న అభ్యర్థిగాడిదవి!  అక్కడికీ ఎన్నోసార్లు చిలక్కి చెప్పినట్లు విపులంగా చెప్పి చూసాం. వింటేనా!  పై వాళ్లకి ఫిర్యాదులు చేసే విఫల ప్రయత్నమూ  చేసాం.  మా వంతు బాధ్యతగా అలవాటైన అల్లర్లతో ప్రచారం ఎప్పట్లానే.. మాకున్న వనరులకు లోబడి నిజాయితీగానే  నిర్వర్తించాం. అదొక్కటే చివరికి నిబద్ధత కలిగిన  పార్టీ ప్రజాప్రతినిధిగా నాకు   మిగిలిన సంతృప్తి.

కల్కి వచ్చి ధర్మరక్షణ చేసే ముందే దుష్ట  భక్షణకు మానవమాత్రుడు గత్తరపడితే ఫలితం ఎలా ఉంటుందో.. అంతకన్నా దారుణంగా వచ్చింది ఎన్నికల రణంలో మా పరాజయం.  

కలియుగంలో కలియుగంలా మాత్రమే పాలన సాగాలన్న ప్రగాడమైన అభిప్రాయమే ఓటర్లకు ఒన్ సైడెడ్ గా ఉన్నట్లు రూఢీ అయింది. మేము ఊహించినదానికన్నా దారుణంగా ఓడిపోయాడు మా పార్టీ నిజాయితీ పెద్దమనిషి!

అందునా ఎదుటి పక్షం నుంచి తొడ చరిచిన ఉస్తాదు..  ఎన్నో తరాల బట్టి ఇక్కడి ఎన్నికల గోదాలో నిలబడి ఎదురు లేకుండా గెలుచుకొస్తున్న వంశం నుంచి వచ్చిన అంకురం.  నియోజకవర్గం ఓటర్లలో అధిక శాతంగా   ఉన్న కులం నుంచే వచ్చిన అభ్యర్థిని ఏ కారణంతో కులం.. మతం.. దేవుడు.. దయ్యం.. లాంటి సెంటిమెంట్లేవీ లేవని పబ్లిగ్గా నిక్కే  అభ్యర్థి కోసం వద్దని నిరాకరిస్తుందీ పబ్లిక్కు ?

ఎన్నికలంటే ఒక నెలరోజులు మించి సాగని సంబరాలు. ఆ తరువాత? మంచికైనా.. చెడ్డకైనా  ఆదుకొనేదైనా.. అడ్డుకొనేదైనా ఎవరని కదా కామన్ మ్యాన్ కామన్ గా చూసుకొనేది! అసాంఘిక శక్తుల ఆరాధ్య దైవాన్ని కాదని ఓ నిజాయితీ పరుడైన విదేశీ మేథస్సుగల స్వచ్ఛంద  సేవా తత్పరుణ్ణి  ఏం భరోసా కల్పించి  గెలిపించడం మా బోటి ఔట్ డేటెడ్ పార్టీలోని అట్టడుగు స్థాయి నాయకత్వం? మా పార్టీ తరుఫున నిలబడ్డ మహా మేధావి ధరావతుకూడా గల్లంతయిందని వేరే చెప్పనవసరం లేదనుకుంటా.

ఓటమికి బాధ్యత వహిస్తూ నన్ను రాజీనామా చెయ్యమని  అధిష్ఠానం ఆదేశం.  ఎన్నో లక్షలు పోసి, ఎంతో  శ్రమదమాదులకోర్చి గెల్చుకున్న ఎమ్మెల్యే సీటిది. వద్దని దులపరించుకు పోవడం అంత సులభమా?  ఎదుటి పార్టీలోకి దూకేస్తే పస్తుతానికి  నా ప్రజా ప్రతినిధి పదవిని  కాపాడుకోవచ్చని అందరిలానే నాకూ ఆలోచన వచ్చింది.
తప్పేముంది?  బిజెపిని గెలిపించినంత మాత్రాన ప్రశాంత్ కిశోర్ అచ్చంగా భాజపాకే ఎన్నికల సలహాదారుడిగా  అంకితమయిపోయాడా? మొన్నటి దిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఛీఫ్ అడ్వయిజర్ గా పనిచేసాడా లేదా? రాజకీయాల్లో ఏదైనా సంభవమే! 

ఎదుటి పార్టీతో రాజీ బేరాలు మొదలయ్యాయి.  చర్చలు చివరి అంచె దగ్గర కొచ్చి స్థభించాయి. నా బేరానికి మరో అభ్యర్థి డ్డురావడమే ఆందుక్కారణం.

ఆ అభ్యర్థి వేరెవరో అయితే ఈ కథే చెప్పక పోదును. ఎవరి మూలకంగా అయితే నేను రాజీనామా చేయవలసి వచ్చిందో.. ఆ స్వచ్ఛంద సేవా సంస్థల అధిపతి! 'మీ  ముసలి పార్టీ నన్ను ఎలాగూ గెలిపించలేక పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  గూండా  పార్టీ ద్వారా నిలబడతాను. నా సంస్థల్ని కాపాడుకోడానికి ఈ 'వాల్ జంప్' తప్పడం లేదు. సారీ' అనేశాడా స్వం. సం. సేవాభావ ప్రజల పెద్దమనిషి! ముందే చెప్పాగా ..  రాజకీయాల్లో ఏదైనా సంభవమే!

కర్లపాలెం హనుమంతరావు
    
(సూర్య దినపత్రిక – ఆదివారం, 29 -02 -2020 నాటి సంపాదకీయ పుట,  ‘సరదాకే’ శీర్షికలో ప్రచురితం)




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...