Saturday, December 12, 2020

యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్- ఒకటే కాదు- కర్లపాలెం హనుమంతరావు

 



యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్ పేర్లు  వినని విద్యార్థులు ఉండరు. హైస్కూల్ చదువులప్పుడు   ఎయిత్ స్టాండర్లో ఇంగ్లీషు టీచర్ పరిచయం చేశారు మాకు ఈ రెండు ప్రక్రియలను.. ఇంగ్లీషు వ్యాకరణంలో భాగంగా! 

రామా కిల్డ్ రావణా- ఏక్టివ్ వాయిస్ అయితే, రావణా వాజ్ కిల్డ్ బై రామా- పాసివ్ వాయిస్ అవుతుంది. మొదటి వాక్యంలో కర్త ప్రమేయం, రెండవ వాక్యంలో కర్మ ఖర్మ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వ్యాకరణ సూత్రాల ప్రకారం ఈ రెండు జస్ట్ వాయిస్  ఛేంజెస్ మాత్రమే. రెండింటి మధ్యలో తేడా ఏమీ లేదు. తేడా లేనప్పుడు మరి ఒకే అర్థం వచ్చే రెండు వాక్యాలు నేర్చుకోవలని ఖర్మమేమిటి? అన్న ధర్మసందేహం ఆ చిన్నతనంలో రాకపోవచ్చు. కానీ, పెరిగి పెద్దవుతున్న క్రమంలో లోకం తీరును తర్కిస్తూన్న కొద్దీ ఇట్లాంటి చిత్రమైన సందేహాలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి. తెలిసున్నవాళ్లెవరైనా సబబైన సమాధానం చెబితే బాగుణ్ణు- అనిపిస్తుంది. ఆ ప్రయత్నం ఫలితమే నాకు  ఈ మధ్య  చదివిన ఒక చిన్ని పొత్తం 'మెనీ క్వశ్చన్స్ - సమ్ ఆన్సర్స్ హానెస్ట్లీ'  చదివిన ఈ 'యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్' లో దొరికిన వివరణ. దానికి ఇది నా కొచ్చిన తెలుగులో అనుకరణ. 

యాక్టివ్ వాయిస్ -పాసివ్ వాయిస్ తరహా క్రియలలో కర్తలను మార్చవలసిన అగత్యం మన తెలుగు వ్యాకరణానికి వాస్తవానికి లేదు. ఇదంతా ఆంగ్ల పరిజ్ఞానం వల్ల మనకు అబ్బిన అతివిజ్ఞానం. సంస్కృత వ్యాకరణంలో కూడా ఈ క్రియాపదాల ప్రమేయాన్ని మార్చే విధానం కనిపిస్తుంది. ఆ సంగతి ప్రస్తుతాంశానికి వర్తించదు కనుక అప్రస్తుతం. 

 అసలు వాక్యాన్ని తిన్నగా పోనీయకుండా, ఈ కర్తలను, వారి జోక్యాన్ని మార్చవలసిన అగత్యం ఏమొచ్చింది? అన్నది మొదటి ప్రశ్న. ఇంగ్లీషు వాడి (అతి)తెలివితేటలన్నీ వాళ్ల వ్యాకరణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయని ఆ పుస్తకం రాసిన మహాదేశ్ పాండే సెలవిస్తారు. ఎంత దాచిపెట్టాలని చూసినా కొన్ని సంగతులు అసంకల్పితంగా అట్లా బైటపడడం ఏ జాతికైనా  సహజమే కదా ఎక్కడైనా? అన్న సందేహం కలగవచ్చు మనకు. అందరి దాచివేతలు, ఇంగ్లీషువాడి దాచివేతలకు మధ్య చాలా తేడా ఉంటుది. చరిత్రను తనకు అనుకూలంగా నమోదు చేసుకునేందుకు ఆంగ్లేయుడు తొక్కని అడ్డదారి లేదు' అన్నది అందరికీ అనుభవైకవేద్యమే కదా!  

ప్రపంచమంతా తమ చెప్పు చేతలలోనే ఉందన్నట్లు ముందు తరాలని నమ్మించాలని ఆంగ్లేయులకు మొదటి  నుంచి ఒక దుర్బుద్ధి కద్దు. అందుకోసమై కొన్ని  సందర్భాలలో ఆ 'హైడింగ్' -దోబూచులాట క్రీడ అవసరం అవుతుంది.  కొన్ని దాచడం, కొన్ని బైటపెట్టడం అన్న ప్రక్రియతోనే ఇంగ్లీషువాడు ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకొంది కూడా.  అందుచేత 'ఇంగ్లీష్ పీపుల్ డిఫీటెడ్ ది వరల్డ్ విత్ హైడ్ అండ్ సీక్ పాలసీ. (ఇది యాక్టివ్ వాయిస్సే)  అనడమే సబబు.  'ది వరల్డ్ వాజ్   డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్ విత్ హైడ్ అండ్ సీక్ పాలసీ.. అనడం  సబబు కాదు. కానీ, మన దేశం విషయం దగ్గరకు వచ్చేసరికి సమాధానం వేరుగా ఇవ్వవలసి ఉంటుంది అంటారు  ఆ పుస్తక రచయిత జవాబు. ఎందుకు ఇలా అంటున్నాడు అన్న సందేహానికి సమాధానం కూడా ఆయనే ఇచ్చాడా పుస్తకంలో.

ఇక్కడ ఉదాహరణకు వరల్డ్ మొత్తాన్ని తీసుకుని గందరగోళం పడే కన్నా మన దేశాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే విషయం మరింత తేటగా అర్థమవుతుంది.

మన మానానికి  మనం మన భారతీయ జీవనసరళిలో సర్దుకుపోయి జీవిస్తున్నకాలంలో ఇంగ్లీషువాడు ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలన్న దుర్భుద్ధితో కొత్తగా కనుకున్న తుపాకీ మందుతో అందరి మీదకు మల్లేనే  మన దేశం మీదా వచ్చిపడ్డాడు. నిజానికి మనం గాని అప్పుడు అప్రమత్తంగా ఉండి స్వాభిమానం కాపాడుకోవాలన్న మంచి బుద్ధితో ఐకమత్యంగా  ఉండుంటే .. కలసి కట్టుగా వాడిని సులభంగా తిప్పికొట్టి వుండేవాళ్లమే. మన భూమి మీద ఎవడో పరాయివాడు ఎంత బలమున్నప్పటికీ ఎక్కడి నుంచో వచ్చి దౌర్జన్యం చేసి లొంగదీసుకోలేడు కదా.. మనలో ఏదో లోపం లేకుంటే! మనలో మనకు ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండుంటే. మన పొరుగువాడు ఎక్కడ పైకొస్తాడోనన్న కుళ్లుతో ఎవడన్నా వచ్చి వాడిని  నాశనం చేసేస్తే కళ్ళు చల్లబడతాయనే మనస్తత్వం లేకుండా ఉండుంటే తెల్లవాడు అయేది .. వాడి జేజమ్మ అయేదీ మనలని మట్టి కరిపించడం కల్ల. కుళ్ళు బుద్ధుల వల్లనే ఇంగ్లీషువాడు ఇక్కడ మనల్ని ఓడించి రాజు మాదిరి పెత్తనం శతాబ్దికి పైడి పెత్తనం చెలాయించగలిగిందనడంలో సందేహం లేదు. దాని ప్రకారం 'ఇంగ్లీష్ పీపుల్ డిఫీటెడ్ అజ్' - అనే కన్నా 'వుయ్ వర్ డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్' అనడమే సబబు అవుతుంది కదా! ఓడడం అనే క్రియకు ప్రధాన ప్రమేయం ఇంగ్లీషువాడి కన్నా మనమే అవడం సూచిస్తుంది 'వుయ్ వర్ డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్' అన్నవాక్యం.  ఇప్పుడైనా స్పష్టంగా అర్థం అయివుండాలి యాక్టివ్ వాయిస్ కు, పాసివ్ వాయిస్ కు మధ్య ఉన్న తేడా.


రామా కిల్డ్ రావణా అనడం సరికాదు. రావణాసురుడే తన పిచ్చి పిచ్చి పనులతో రెచ్చగొట్టి రాముడి చేత చంపబడ్డాడు. కనక, రావణా వాజ్ కిల్డ్ బై రామా - అన్న పాసివ్ వాయిస్సే సబబైన పదం అవుతుందన్నమాట.

 ఇదే సూత్రం రామాయణం దగ్గరే ఆగిపోలేదు.  కలియుగంలో  ఇప్పుడు మనం ఉన్నామనుకుంటున్న  ప్రజాస్వామ్యంలో కూడా వర్తిస్తున్నది అని చెప్పడానికే రచయిత  ఇంత  సుదీర్థ వివరణ ఇచ్చింది. 

చెడ్డ నేతలు వచ్చి మనలను పరిపాలిస్తున్నారు అంటే అందుక్కారణం, ఆ నేతలు కాదు. అట్లాంటి వాళ్లని నేతలుగా తయారుచేసి వాళ్లు మన నెత్తి మీద ఎక్కి పెత్తనం చేయడానికి మనమే కారణం అవుతున్నామన్నది సారాంశం. ప్రజల పాసివ్ వాయిస్సే ప్రజాస్వామ్యం తాలూకు రియల్ స్పిరిట్ యాక్టివ్ వాయిస్ వినపించలేకపోవడానికి ప్రధాన కారణం.

మన దేశ దౌర్భాగ్యం మారాలంటే ముందు ఈ పాసివ్ వాయిస్ తప్పు అని నిరూపించుకోవలసిన అగత్యం అర్జంటుగా గుర్తించవలసి ఉందన్నది  'మెనీ క్వశ్చన్స్ - సమ్ ఆన్సర్స్ హానెస్ట్లీ' రచయిత మహాదేశ్ పాండే జీ    అభిప్రాయం.

-కర్లపాలెం హనుమంతరావు

12, డిసెంబర్, 2020

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...