అశోకుడు తన సువిశాల సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకుని పరిపాలించిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణ భాగంలోని ఆంధ్రరాష్ట్రానికి సువర్ణగిరి రాజధానిగా ఉండేది. కాలానుగతంగా అది ‘జొన్నగిరి’ అనే చిన్ని గ్రామంగా కుచించుకుపోయింది.
Tuesday, February 23, 2021
చిన్న వ్యాసం : ఆడవాళ్లూ ! ముందు మీరు మారండి! -కర్లపాలెం హనుమంతరావు
అశోకుడు తన సువిశాల సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకుని పరిపాలించిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణ భాగంలోని ఆంధ్రరాష్ట్రానికి సువర్ణగిరి రాజధానిగా ఉండేది. కాలానుగతంగా అది ‘జొన్నగిరి’ అనే చిన్ని గ్రామంగా కుచించుకుపోయింది.
Saturday, February 20, 2021
మగాడిగా పుట్టే కన్నా..! - సరదావ్యాసం -కర్లపాలెం హనుమంతరావు
మగాడిగా పుట్టే కన్నా మైల బట్టలు మోసే గాడిదగా పుట్టడం మేలన్నా మన మేల్సంతా! ఆడదేనా ఆకాశంలో సగం? ఈ రకం నినాదాలే ప్రమాదం. ప్రమదలందరి మైండ్ సెట్లను టి.వీ సెట్ల కన్నా అధ్వానంగా పాడుచేస్తున్నాయ్ అన్నాయ్!
కొద్దిమంది మగ బుద్ధిమంతులున్నారు చూడూ.. వాళ్ళొట్టి డూ డూ బసవన్నలకు సరిజోడు! అమ్మగార్లతో ఎన్నో అవసరాలు! అందుకే ఆ చందమామ కతలతో కితకితలు! కలకండ పలుకులు కలకంఠి అంగిట్లో వేసి మగాళ్ల బతుకుల్లో కలకలం రేపేదీ వీళ్లే. అరే! రేపటి ‘డే’ గురించి ముందు చూపుండే ఏ మగాడైనా ఆడదాన్ని మరీ అంతలా మాడు మీద ఎక్కించుకుని ఊరేగిస్తాడా?
మనదీ మనదీ మీసాల జాతి! మరీ పొద్దు పోకపోతే.. పోనీ నాలుగు నిమ్మబద్దలు మూతి అంచుల మీదలా నిలబెట్టుకుంటూ కాలక్షేపం చేయవచ్చుగదా! వీరలు.. ధీరలు అంటూ నారులకు ఈ వింజామరలు ఎందుకు? మగాడి బతుకు బండి నడిరోడ్డునిలా డీలా పడిందంటే కారణం మన మగతనం మగతతనం కాదూ! ఇన్నిన్ని టీ.వీ సోపులు గుడ్లప్పగించి చూస్తూ కూడా ఆడదానికి అన్నేసి సోపులు రాయడమే మగాడి తలరాతిలా తలకిందులు అవడానికి కారణం.
అన్నం పళ్లెం ముందు అమ్మా, పనిపాటల వెనకతాల పనిమనిషీ, పడక ఎక్కే కాడ ఆ రంభో, ఊర్వశో, మేనకో.. దాని మేనత్త కూతురు ‘షో’ నో! ఓ.కే అన్నా! ఒప్పుకుంటాం.. తమర్రాయించి పెట్టిన కమ్మని పద్యాలు, శాంస్క్రీటు శ్లోకాలే ఒప్పచెప్పుకుంటాం. కానీ.. ఇదేందన్నయ్యా! సలహాలు ఇచ్చే మహా ముఖ్యమైన పోర్టుఫోలియో కూడా పొయ్యి ముందు చేరి పొగ్గొట్టం ఊదుకొనే
ఆడదాని చేతిలో పెట్టేయడమేనా? వట్టి మంత్రి పాత్రకు మాత్రమే
పరిమితమయితే ఇంత ప్రమీలార్జునీయం సినిమా ఎందుకు? తానే మంత్రి.. తానే రాజు..అనే అంటున్నదయ్యా తాన! 'తాన తందనానా' అంటూ వంతలు పాడడం అన్నయ్యా తమకు న్యాయమేనా!
నాతి చరామి' హామీని నాతి మరీ అతిగా తీసుకొంటోంది. ‘తిరిగి ఆడది.. తిరక్క మొగాడు చెడతార’ని సామెత మరచిపోతోంది. ఆ నానుడికి చెడ్డ పేరు తేవడమెందుకనే కదా మగాడు బుద్ధిగా చెడతిరిగేది! విధిలో భాగంగా వీధిలో కృష్యయ్య పాత్రకే న్యాయంగా మగాడు అంకితమవాలి. అరే! ఆలి ఇంట్లో రామయ్య రోలుకైనా మగడిని కుదురుకోనివ్వదే!. ఓన్లీ వంటింటి భీమయ్య రుబ్బురోలుకే మగడు పరిమితమవాలంట! అవ్వ! నలుగురూ నవ్వుతన్నాదురన్నా మొగుడి చేత పెళ్లాం జడ చిక్కుముళ్లు దువ్వించుకొనే ముచ్చట్లు చూసి!
'గాడ్' కూడా మగాడే కదా! మన సైడేలే.. కాపాడుతాడులే!’ అనుకున్నామా! దగా! ఆ దేవుడుగారూ చిన్నదాని సైడయిపోతున్నాడే.. డే బై డే! ఇంకెవర్నన్నయ్యా దేబిరించేది మాజీ మగమహారాజా హోదా తిరిగి కివ్వాలని?
టు- డే’స్ మహిళా నినాదం మహిళా సాధికారతంట! పూటకో కొత్త కూతతో సాధిస్తుంటే ఎంత పూటుగా మందు కొట్టీ ప్రయోజనమేముందంట?
అప్పలమ్మలు కూడా ఇప్పుడు బుక్కులు.. హక్కులు అంటూ ఠప్పు ఠప్పున అప్-టు-డేటు అయిపోతున్నారన్నా! 'మీ.. టూ' అంట! ఆ అమెరికా ట్రంపుకే తప్పడం లేదు తంటా! మామూలు చంటోళ్లం.. మనం మాత్రం‘జోరూ కా గులామ్స్‘ అవకుంటే రోజులెట్లా జరిగాలి హుజూర్?
గడ్డాలూ మీసాలూ చూపించి ఆడబిడ్దల్ని పడేసే రోజులంటన్నా ఇవి? కాణీ పరకక్కూడా భామల గడ్డాలు, బుగ్గలు పుచ్చుకు బతిమాలుకునే సిగ్గుమాలిన రోజులు కానీ!
మన తాతగార్లు ఎంతో ధీమాగా తలలెత్తుకు తిరిగారా రోజుల్లో! కాస్తింత నాన్చినా నాన్నార్ల కాలానా మగాడిది మహరాజ యోగమే! మన కాలంలోనే ఈ గాజుల జోరు! కుక్కిన పేనల్లే పడుండే మ్యాడమ్ గారి కింద ‘కుక్కు’ల్లా, కుక్కల్లా పడుండే ఖర్మెందుకు పట్టించావయ్యా.. ద్యావుడా! ఛ! ఏం నామర్దా బతుకురా నారాయణా! పెళ్లినాడు పట్టుకున్న గాజుల చేత్తో పెళ్లాం గూబ గుయ్యిమనిపించినా బైటికక్కలేని నాజూకు పరిస్థితి. పెళ్లిలో ఆకాశ అరుంధతిని చూసే ఆ కాస్సేపే ఎంత లావు మొగాడికైనా తల పైకెత్తుకు చూసే గోల్డెన్ ఛాన్స్! మూడు ముళ్లు పడే వేళైనా కాస్త తలొంచుకోమంటే ఠలాయిస్తుందన్నయ్యా అమ్మడు ఇప్పుడు!
ఉద్యోగం పురుష లక్షణం సూత్రం సలక్షణంగా సాగే రోజులే నయం.
భోజనాలు మినహా మరేమీ చెయ్యడం రాకపోయినా రాకుమారుడికి మల్లే రోజులు చెల్లిపోయాయి!
సుదతులు ఇప్పుడెవరూ కేవలం చాకలి పద్దు రాతలతో సర్దుకు పోవడంలేదు. సామ్రాజ్యాలు ఏలుతామని సవాళ్లు తీస్తున్నారన్నాయ్! రిజర్వేషనుల కోసం రివర్సులో పురుషులే పోరుబాట పట్టే దురవస్థలు కోరి కోరి తెచ్చుకుందెవరు?మనమే! మగాడి నిరుద్యోగ భృతి స్త్రీల ఉద్యోగ భత్యాలకు సరి సమాన స్థాయికి చేరుకొనే వరకు పురుషజాతిని ఆదుకోమని రోదించే రోజులొచ్చి పడ్డాయన్నయ్యా మన మగాళ్ల పూపుర్వ విర్వాకాల వల్లా! మహా కష్టంగా ఉందీ మాష్టారూ ముదనష్టపు మగాడి బతుకు! బితుకు బితుకుమంటూ ఈ బతుకెన్నాళ్లు?
ఆలి కాలిగోరు కూడా తగలకుండా కారు డోరు తెరిచి నిలబడే
కొలువా.. డేమ్ షేమ్! బ్యాక్ డేస్ మాదిరి బ్యాక్ సీట్ డ్రైవింగే మగాడికి మళ్లీ కళ తెచ్చే గొప్ప ఫీట్! ఆ అదృశ్య పాత్ర తిరిగి దక్కే అదృష్టం కోసమైనా మన మగాళ్లమంతా ఏకమవ్వాలి.
మన పురుష సూక్తాలు, స్త్రీ సూక్తాలన్నీ మగాళ్ల మైండ్ గేమ్సం ట!
'వుయ్ డోంట్ కేర్' అని వుమన్ ఫోల్కంతా మరీ మొండికేస్తుందండీ చండికమ్మల్లా! కుమారి శతకం చదువుకోవమ్మా అంటే.. ముందు కుమార శతకం ‘చదువుకొమ్ము.. పొమ్మురా!' అంటూ కొమ్మల కొమ్ములు విసుర్తున్నా గమ్మున ఉండిపోవాల్సిన ఖర్మం పక్క గుమ్మం మొగుడికైనా వద్దు భగవాన్! అహమిహలకు పోతే పరానికే కాదు ఇహ ఇహానికీ చెడేటట్లుంది వ్యవహారం. మేలుకో నీ మేలుకోసమైనా మాజీ మగమహారాజా!
డేమ్సెల్స్ తో గేమ్స్ మహా డేంజరస్ గా ఉందా? మహిళల చేతికి ఈ మాయదారి కమీషనొచ్చి మగాళ్ల చెయ్యి చచ్చుపడిందా? మరే! కుట్టు మిషన్లే గొప్పనుకునే ఆడంగులకు ఏకంగా మహిళా కమీషన్లిచ్చేస్తే వ్యవహారం ఇలాగే ముదురుతుందన్నాయా! ముదితల కమీషన్ల ముందు మన మగ రాకాసుల కథా కమామిషులు చెల్లని కాసులవుతాయని ముందే తెలుసుండాల! ఏ నారి ఊసుబోక ఓ చిన్న కేసు వేసినా మన నరుడు పని మటాష్! ఎన్ని వేల సూట్ కేసులతోనైనా పని సానుకూలపడదు. ఏ క్రిమీ లేయరూ సివిల్, క్రిమినల్ కోడు సెక్షన్లను ఏమీ పీకలేవు స్వామీ! ఎవరో వచ్చి ఎలాగోలా రక్షిస్తారని చేతులూ రెండూ జోడించి గోల పెట్టినా.. చివరికి ఆ రెండు చేతులకు పడేది ఉక్కు కడియాలే భాయ్! లేడీసా.. మజాకా!
పులుసులో ముక్కలు తగ్గినా అదే అలుసుగా పురుషుడి వంట్లో పులుసు తీస్తున్నది ఈ నాటి పుణ్యవతి! 'షి-టీము' పేరు వింటేనే చాలు షివరింగులొచ్చేస్తున్నాయంటే రావా మరి! వనితల టీం వర్కు అటువంటిది. ఆ నెట్-వర్క్ చూసైనా మగ మూర్ఖులిక నేర్చుకోవాలి! 'పురుష కమీషన్' అవసరం తెలుసుకోవాలి!
ఆ ఉత్తర ప్రదేశ్ అమాత్యుడెవరో గానీ.. ఆ హరిభరుడండీ అసలు సిసలు మగపురుషుడు! జాతీయ మహిళా కమీషన్ మోడల్లోనే జాతీయ పురుష కమీషన్ కావాలని మంకు పట్టు పడుతున్నాడు!
ఒక్కళ్లంగా ఎంత గావు గావు మన్నా లెక్కపెట్టే నాథుడుండడు. ఒక్క పెట్టున ఏడవాలన్నా కలసి కట్టుగా ఉండక తప్పని రోజులు. మీలవేణుల నీలుగుళ్లే మొగాళ్ల నివాళ కేరాఫ్ ఫ్లాట్ ఫారమ్ గాళ్లను చేసేసాయ్! కోలుపోయిన మన మగతనం కోసమైనా ఓ ఫ్లాట్ ఫారం అవసరమన్నాయ్!
కత్తి నుంచి చీపురు కట్ట దాకా ఆడదానికేనా అన్ని ఆయుధాలూ? కనీసం అప్పడాల కర్రనైనా తక్షణమే నిషేధించాలి. ఇంటిపట్టున కూడా మగాడు నెత్తికి ధరించే ఇనప బొచ్చెలు ఉచితంగా ఇప్పించాలి. ఈ మాత్రం ‘కాజ్ ‘కైనా ఓ కామన్ వేదికవసరమే కదా బ్రదర్!
కమాన్.. మ్యాన్! ఈ నెల్లోనే దిల్లీలో పురుష్ ఆయోగ్ సమావేశం. ఈ ‘ఆయోగ్ ' ప్రయోగమైనా మన పురుషుల యోగం మారుస్తుందని ఆశిద్దాం అన్నాయ్?
***
కర్లపాలెం హనుమంతరావు
బోథెల్, వాషింగ్ టన్ రాష్ట్రం, యు.ఎస్.ఎ
.
Monday, February 8, 2021
ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్- కామెడీ కథ - కర్లపాలెం హనుమంతరావు
టీఈ సీరియల్ కమర్శియల్ బ్రేక్ లో రాంబాయమ్మగారికి గుండెపోటొచ్చింది. ఎపిసోడయిందాకా కదలనని మొండికేయడం వల్ల గుండెకొచ్చిన ప్రమాదం మరింత హెచ్చింది.
ఐదు నక్షత్రాల ఆసుపత్రి, అనుభవజ్ఞులైన వైద్యులు.. సంగతెలా ఉన్నా టీవీ uసోపులమీదున్న అకుంఠిత అభిమానం ఆమె ప్రాణాలని నిలబెట్టింది.
ఆపరేషన్ టేబుల్ మీదున్నప్పుడు రాంబాయమ్మగారికి దేవుడితో చిన్న భేటీ అయింది. దైవ దర్శనం కాగానే ఆమె దేవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న' నాకింకా ఎంతకాలం భూమ్మీద నూకులున్నాయ'ని.
'నలభై మూడేళ్ల రెండునెల్ల మూడురోజులమీద నాలుగ్గంటలా ఐదు నిమిషాల ఐదు సెకన్లు' అన్నాదు దేవుడు. దేవుడిమాటమీద గురితోనే రాంబాయమ్మగారు ఆపరేషను సక్సెసయిందనిపించి ప్రాణాలతో లేచికూర్చున్నారు.
'ఎలాగూ మరో అర్థశతాబ్దం బతకబోతున్నాం గదా! ఇంకా ఈ ముడతలుబడ్డ ముఖం, బాన కడుపు, ముగ్గుబుట్ట జుట్టు, బోసి నోరు, వంగిన నడుంతో ముసిల్దానిలాగా ఎందుకు బతుకు నిస్సారంగా గడపాలి? మానవజన్మ మళ్ళీ మళ్లీ రాబోతుందా? అందులోనూ ఆడజన్మే దొరుకుతుందన్న గ్యారంటీ ఉందా? అన్నీ ఉండి అనుభవించేందుకు కట్టుకుపోయినంత ఆస్తి తనకుమాదిరిగా ఎంతమందికి ఉంది? అడ్డుచెప్పే కట్టుకున్నవాడూ భూమ్మీదలేని అదృష్టం తనది.' అన్నివిధాలా అచ్చొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢనిశ్చయానికొచ్చింది రాంబాయమ్మగారు.
గుండాపరేషనైన ఆసుపత్రిలోనే ఫేస్ లిఫ్టింగ్, ఫ్యాట్ సక్కింగ్, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ రికవరింగ్, హెయిర్ ట్రాన్స్ ప్లాంటింగ్.. వగైరా వగైరా ఓ పది లక్షలు పారేసి టోటల్లీ బాడీ రీమోడలింగు చేయించేసుకుంది రాంబాయమ్మగారు. పది లక్షలు పోతే పోయాయిగాని.. రాంబాయమ్మగారిప్పుడు రంభను తలదన్నే మోడల్ గా మెరిసిపోతోంది.
ఆ ఉత్సాహంలో ఆఖరి ఆపరేషన్ కూడా విజయవంతంగా ముగించుకుని ఆసుపత్రి బైటకొచ్చి రొడ్డు దాటుతుండగా లారీ ఒకటి దూసుకొచ్చి రాంబాయమ్మగారిని లేపేసింది.
మళ్ళీ దేవుదిగారితో భేటీ తప్పింది కాదు. భగవంతుణ్ణి చూడంగానే భగభగ మండింది రాంబాయమ్మగారికి. కడుపులోని కోపాన్నంతా వెళ్లగక్కుతూ 'నలభైముడేళ్లకు పైగా ఆయుర్దాయం ఉదంటివే?మీ దేవుళ్ళూ మా లోకంలోని రాజకీయ నాయకులకు మల్లే మాటమీద నిలబడకపోతే ఎలాగయ్యా? ముల్లోకాలకింకేం గతి?' అని ఎడపెడా వాయించడం మొదలుపెట్టింది దేవుడు కంటపడీ పడకముందే రాంబాయమ్మగారు.
'సారీ!రాంబాయమ్మగారూ! లారీ గుద్దింది ఎవరో రంభననుకున్నాను.. రాంబాయమ్మగారిననుకోలేదు' అని నాలిక్కరుచుకున్నారు దేవుడు గారు!
- కర్లపాలెం హనుమంతరావు
( చతుర్ మాసపత్రిక ప్రచురణ )
***
స్త్రీ మనస్తత్వం- కర్లపాలెం హనుమంతరావు సేకరించిన చిన్న కథ
ఇప్పుడే ఒక తమాషా బైబిలు కథ చదివాను. చిన్నదే కానీ చమత్కారం పాలు ఎక్కువ.
ఏదెను ఉద్యానవనంలో నడుస్తుండగా పాము ఒక ఆపిల్ ఇచ్చి 'తిను! నీ ప్రియుడికి నీవు మరంత అందంగా కనిపిస్తావు".అంటుంది.
ఈవ్ తల అడ్డంగా ఆడించి"ఆ అవసరం లేదు. నా వాడి జీవితంలో నేను ఒక్కర్తెనే మహిళను" అంది. పాము నవ్వి "ఆదాము జీవితంలో మరో స్త్రీ కూడా ప్రవేశించి ఉంది. గుహలో దాచిపెట్టాడు. చూపిస్తా.. రమ్మం’టూ"ఒక నీటి గుంట దగ్గరకు తీసుకు వెళ్లి తొంగి చూడమంది.
నీళ్లల్లో తొంగి చూసిన తరువాత ఈవ్ ఆపిల్ తినడానికి ఒప్పుకుంది.
- సేకరణ by కర్లపాలెం హనుమంతరావు
Thursday, February 4, 2021
లేచింది మహిళాలోకం -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడులోని ఓనాటి నా సంపాదకీయం)
పరమేశ్వరుడు సమస్త వేదాంతరహస్యాలను పార్వతమ్మకు వివరించినట్లు శివపురాణ
కథనం. నారాయణమూర్తి భూదేవితో వైష్ణవాగమన విశేషాలు పంచుకొన్నట్లు విష్ణుపురాణం
విశ్వాసం. స్త్రీ విద్యాధికారాన్ని దైవలోకమే మన్నించింది. కిందిలోకంలోనే ఎందుకో
మగువకు దిగువస్థానం! ఆదిమయుగం సంగతేమోగానీ.. అంతా
వేదమయంగా సాగిన రుగ్వేదకాలంలోనూ అమ్మదీ, అయ్యతో పాటు సంసార అరద చోదనంలో
సమాన పాత్రే! బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు భార్య మైత్రేయికి సాంఖ్యశాస్త్రం, భాగవతంలో కపిలాచార్యుడు తల్లి దేవహూతికి బ్రహ్మతత్వం బోధపరిచారు. మతంగ
మహర్షి శబరిని జ్ఞానమాతగా ఉద్ధరించిన రామాయణగాథనే నేటికీ మనం నిత్యం పారాయణం
చేస్తున్నాం! వాసంతి నుంచి ఆత్రేయి వరకు ముదితలెందరో మున్యాశ్రమాలలో వేదవేదాంగాది విద్యలలో కాణాచీలుగా వెలిగొందిన కథలు
చదువుతూ కూడా స్త్రీ బుద్ధిని చంచలం,
ప్రళయాత్మకంగా
కించపరచడం మగవాడి దాంబిక ప్రవృత్తికి నిలువెత్తు దర్పణం. ‘నృణాతి నయతి స్వవశం
పురుషమితి నారీ- పురుషుణ్ని స్వాధీనపరుచుకొనే శక్తే నారి’ అని దుష్టాన్వయం చేయడం
నెలత ఆభిజాత్యాన్ని అవమానించడమే! ‘నారి’ అంటే వాస్తవానికి న అరి- శత్రువులు లేనిది.
ఏ భూమి మీద సావిత్రి పతిభక్తి భర్త ప్రాణాలను రక్షించిందో, ఏ భువి లోపల సీతమ్మవారి పాతివ్రత్యం అగ్నిపరీక్షలో సైతం నెగ్గుకొచ్చిందో,
ఏ పృథ్వి
అత్రిసతి అనసూయ సౌశీల్యం త్రిమూర్తుల లౌల్యాన్ని బాల్యచేష్టగా మార్చి లాలించిందో, ఏ వసుంధర అరుంధతి.. లోపాముద్రాది నాతి జాతి సృష్టికర్త ఉనికిని సైతం
ప్రశ్నార్థకం చేసి చూపిందో.. ఆ భూఖండంలోనే ఆడదానికి అడుగడుగునా అఖండంగా అగ్నిగుండాలు!
నవనాగరీకులమని నయగారాలు పోయే మగవారి లోకంలో మహిళ బతుకు ఇంకా ముల్లు పక్కన అల్లాడే
అరిటాకంత సున్నితమే! దేవనాగరీకంలో 'శర్వరి' ద్విశతాధిక పర్యాయపదభూయిష్ట! ‘మానవతీ!.. మానినీ!’గా
సంబోధించినంత మాత్రాన మహిళ సమానవతి.. సన్మానినిగా
మన్నింపబడుతున్నట్లెనా!
ఒక బిడ్డకు తల్లయీ పుట్టినింటికి పోయిరావాలంటే పట్టెమంచం మామగారినుంచి..
వంటగది తోడుకోడలు వరకు ఇంటిసభ్యులందరి అనుమతులు తప్పనిసరి. అందుకోసమై అత్తింట కొత్తగా కాలు పెట్టిన ఇంతి కన్నీటితో దేబిరించే జానపదుల పాట సరిపోదా.. కలికి
కామాక్షి ఎంత కలవారి కోడలైనా ఒలికి వళ్లోకి వచ్చి వాలేది వట్టిసున్నా మాత్రమేనని! ‘బాలప్రాయమునాడు నాతి
పడుచూను/ వేల్పులెత్తగలేని విల్లు తానెత్తే/’ జనకముని పుత్రిక సీత. అది చూసి ‘ఈ సీత నెవ్వరికిత్తునని దలచీ/ ఘనులు ఎవ్వరూ రానీ కరమునా
బట్టీ/ పూని వంచితే ఇత్తు పొలతి వారికినీ’ అని ఆ మారాజు నిశ్చయించుకొన్న ‘సీతమ్మ
స్వయంవరం’ గీతికలో మాత్రం ఏమంత
నీతిసూత్రం దాగుందని? సీత రాత బాగుండి ‘రఘువంశ తిలకుడు రామచంద్రుడు మునుకొని హరివిల్లు
ముమ్మారు వంచి’ విరిచేయబట్టి సరిపోయింది! రుగ్వేదయుగంలో మాదిరి సౌందర్యం, సౌశీల్యం, బుద్ధి,
బలం, యవ్వనం, సమయానుకూల వర్తన.. గమనించుకొని గదా
వరుడి మెడను వధువు స్వయంనిర్ణయానుసారం వరమాలాకృతం చెయవలసిందీ? ‘పెళ్లయిన ఇంట ఆరునెల్ల
కరువంట’ అని సామెత! ‘ఆడపిల్లంటే గుండెలమీది బరువు. అటూ ఇటైతే..
కన్నకడుపు చెరువు’ వంటి భావనలు నవసమాజం నుంచి ఇంకా తొలగకపోవడం భామినుల ఆభిజాత్యానికి ఏమంత శోభస్కరం? శాస్త్రాలు సైతం సుతోదయ
భాగ్యంకోసం మాత్రమే క్షీర, సోమాది రసాభిషేకాల ప్రస్తావనలు చేయడం
గమనార్హం. గర్హనీయం. ‘ఆడదై పుట్టేకన్నా అడవిలో మానై పుట్టడం మేలు’ అన్న
ఆత్మన్యూనతా భావంలోనే అధికశాతం మగువలు ఈ నాటికీ మగ్గడం విచారకరం! మగవాడు తిరిగితే చెడనిది.. ఆడది తిరిగితే ఎలా చెడుగవుతుందో? ‘చక్రవర్తులైనట్టి చానలుండ/ దరుణు లుద్యోగములు చేయ దగరటంచు/’ బల్కనేమిటి?’ అని వెనకటికి ఓ కవిపురుషోత్తముడు
కడిగిపారేశాడు.
‘విమల సచ్చరిత్ర విమలామహాదేవి- కాంతుని నేపాటి కలత పఱచె?/అపర సరస్వతి యననొప్ప దమయంతి- నాథు నేపాటి నమిలి మ్రింగె?/.. తక్కుగల రామలందరు మిక్కుటముగ- జదువ నేర్చియు బతుల కసౌఖ్యములను/ కలుగ
జేసిరె?’ అన్న ఆ కవిప్రశ్నకు ఈనాటికీ సబబైన సమాధానం కరువు. ఇంట గెలిచిన ఇంతికి రచ్చ గెలవడం ఎంతని.. అవకాశమంటూ ఒకటి దక్కడమే ముఖ్యం గాని!
పురుషునిలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని వెన్నుతట్టి లేపేది అమ్మగా, ఆలిగా, చెల్లిగా.. స్త్రీమూర్తే! బుద్ధిలో
నాలుగింతలు, శక్తిలో అంతకు రెట్టింపు ఆధిక్యంలో ఉండీ..
వెనకుండి గెలిపించేందుకే ఆసక్తి చూపించే మగువను
మగవాడు ఏనాడు అర్థంచేసుకొన్నాడు కనుక! అంగనంటే వాడికి
అంగడిబొమ్మ. ముంగిల్లో తిరిగే మరబొమ్మ. తిమ్మిరి దింపుకొనే పడక గుమ్మ. ‘న స్త్రీ
స్వాతంత్ర్య మర్హతి’ అని మనువేనాడో అప్పటి అవసరాల నిమిత్తం ఎందుకు చేసాడోగాని.. ఆ
పాడుబడ్డ సిద్ధాంతం చూరుకే మగవాడు ఈనాడూ గబ్బిలాయిలా వేలాడ్డం నవ్వు పుట్టిస్తుంది. ఆగ్రహమూ తెప్పిస్తుంది. ‘ఆకొన్న అతిథిని ఆ పూట నిల్పం- నతివను ముందుగా నడుగవలయు/
అతిరిక్తుడౌ రోగి ఔషధం బిప్పింప- బడతి ఆజ్ఞ బొందవలయు ముందు/ బైరాగికిని నొక్క పాత
వస్త్ర మొసంగ- బొలతి శాసనంబు బొందవలయు/.. ఇంక స్వాతంత్ర్య మనునది యెందు గలదొ-
యెరుగగా రాదు మీకును బురుషులార!’ అని బుడమగుంట శివరామయ్యకవిగారు వందేళ్ల కిందటి
ఆంధపత్రిక (అబలావిలాపం) లో హేళనకు దిగిన నాటి పరిస్థితుల్లో ఈవేళ్టికీ
వీసమెత్తు మార్పు లేదు. సరికదా మహిళామణి ఆలోచనల్లో.. ఆచరణలో.. అభివ్యక్తీకరణల్లో..
ఆభిజాత్యం పాళ్ళు పొంగుకొస్తున్నాయి కూడా. సంతోషమే కదా! వలతి మగవాడికన్నా ఎందులో వెలితి?
‘అగ్బరంతటి
వైరి నాజి జయింపదే– రాణి వీరాబాయి రౌద్ర మెసగ?/
నిరుపమ
శౌర్యవార్నిధి గుతుబుద్ధీను- దురమున దోలదే కరుణదేవి?/
తన బాణ
నైపుణ్యమున కెర సేయదే- సంయుక్త రిపులను సమరమందు?’
‘అట్టి యసమాన శూరత్వ మతివలకును/ గలుగ జేయరె తొల్లింటి కాలమునను?’ అని తొయ్యలులంతా
ఏకమై
కొంగులు బిగిస్తే అయ్యలెంత మొనగాళ్లైనా మునుపటంత మొండిగా ముందడుగు వెయ్యలేరీనాడు.
జన్మతః జన్మదాతల వర్గానికి దఖలుపడ్డ హక్కులకు ఇంకే మాత్రం మోకాలడ్డడం సాధ్యం కాదన్న
ఇంగితమే సౌదీ పాలకులకు కలిగుండాలి. పోయిన వారం ఆ సంప్రదాయిక దేశంలో జరిగిన
పురపాలకసంఘం ఎన్నికల్లో సౌదీసోదరి తొలిసారి ఓటుహక్కు
వినియోగించుకుంది. శుభం. వాహన చోదన నుంచి.. సరుకుల బేరం వరకు ఎన్నో ఆంక్షలు మహిళకు ఆ గడ్డమీద!
ఎన్నికల్లో
నిలబడే హక్కూ ఆమెకిప్పుడు దఖలు పడడం సామాన్యమైన గంతు కాదు. ముందు ముందు మరిన్ని
మహిళాసంస్కరణలకు ఇది నాందీ ప్రస్తావన కావాలన్నదే అభిలాష. సౌదీ సోదరీమణులందరికీ
శుభాభినందనలు!
***
-కర్లపాలెం హనుమంతరావు
04 -0౨2021
బోథెల్; యూఎస్ఎ
( సౌదీ మహిళకు పురపాలక సంఘ ఎన్నికలలో
మొదటిసారి ఓటు వేసే హక్కు దఖలు పడిన సంబరంలో రాసినది)
Friday, September 11, 2020
బాలికల కనీస వివాహ వయస్సు ఏ మేరకు ఉండాలి? -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం
74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ తన 86 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో భద్రత, సార్వభౌమత్వాల పైన మాత్రమే కాకుండా దేశానికి తక్షణమే అవసరమని ప్రభుత్వం భావించే ప్రధాన ఆర్థిక, సామాజిక సంస్కరణలను కూడా ప్రస్తావించారు. సామాజిక రంగ సంస్కరణలలో భాగంగా బాలికల వివాహ కనీస వయస్సుపై ప్రభుత్వానికి గల పునరాలోచననూ ఆ సందర్భంలో దేశం ముందుంచారు. ఇదే ఏడాది ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పిణ సమయంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ బాలికల వివాహ కనీస వయస్సు విషయమై ఒక ప్రతిపాదన చేశారు. నాటి సభలో ఆమె చేసిన ప్రసంగం ప్రకారం తల్లీబిడ్డల ఆరోగ్యం, వారి పోషణల వంటి ప్రధానాంశాల పైన వివాహ వయస్సు చూపించే ప్రభావాల అధ్యయనం, ఆరు నెలల్లోగా సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి పత్ర సమర్పణ సమర్పించవలసి బాధ్యత అప్పగిస్తూ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటును గురించినదా ప్రతిపాదన. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ వంటి మేధావులతో సహా పలు శాఖల ఉన్నతాధికారులు కార్యాచరణ సభ్యులుగా సమతాపార్టీ మాజీ చైర్మన్ జయా జైట్లీ నేతృత్వంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 2న టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో కేంద్ర మంత్రి చేసింది ఉత్తుత్తి రాజకీయ ప్రకటన కాదని అర్థమయింది.
దేశం ప్రగతిపథంలోనే సాగుతోందని, ఉన్నత విద్యతో సహా మహిళలకు ఉద్యోగ, ఉపాధి రంగాలలో
మెరుగైన అవకాశాలు నిలకడగా పెరుగుతున్నాయన్న మంత్రిగారి ప్రసంగంలోని పరిశీలన
అవాస్తమనేందుకు లేదు. మాతాశిశు మరణాలను మరింత తగ్గించడంతో సహా వారి పోషకాహార స్థాయిలలో గణనీయమైన మెరుగుదల సాధించడం స్త్రీ శిశు సంరక్షణ సంస్కరణలకు
సంబంధించి ప్రధానమైన అంశం. ఏ వయసులో ఆడపిల్ల
ప్రసూతి దశలోకి ప్రవేశిస్తే తల్లీ బిడ్డలిద్దరికీ క్షేమమో ముందు లోతుగా అధ్యయనం చేయాలి. టాస్క్ ఫోర్స్
ఏర్పాటు ప్రతిపాదనలోని అంతరార్థం కూడా అదే!
ఆడపిల్లల వివాహానికి సంబంధించిన కనీస వయస్సు ఎంతో కాలంగా ప్రభుత్వాల ఆలోచనల్లో నలుగుతున్న
మాట నిజమే! మాతా శిశువుల ఆరోగ్యానికి సంబంధించి పెళ్లి వయస్సు ఒక ప్రధానమైన అంశం అన్నది న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయం. కౌమార
దశ పరిపక్వ స్థితికి చేరక ముందే వివాహబంధంలో ఇరుక్కున్న ఆడపిల్లలకు అవాంఛిత గర్భధారణ బాధ ఒక్కటే కాదు, లైంగిక వ్యాధుల పీడ అంతకు మించి ప్రాణాంతకంగా మారుతున్నదని వైద్యనిపుణుల ఆందోళన చెందుతున్నారు. వివాహ వయస్సుకు మాతృత్వానికి మధ్యన ఉండే సంబంధం పరిశీలించడం, తల్లీ బిడ్డల మరణాల రేటు గణనీయంగా తగ్గించడం, మహిళలలోని పోషకాహారస్థాయిని గురించి కచ్చితమైన అంచనాకు రావడం.. టాస్క్ ఫోర్స్ కు విధించిన లక్ష్యాలలో కొన్ని! గర్భధారణ వయస్సు, ప్రసవించే సమయం, తదనంతరం తల్లి, నవజాత శిశువుల పోషణ స్థాయి.. తదితర ముఖ్యమైన అంశాలలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికై మార్గాలను సుగమంచేసే తీరుతెన్నులు సూచించడమూ టాస్క్ ఫోర్స్ కు నిర్దేశించిన లక్ష్యాలే. మాతాశిశువుల మరణాల తగ్గుదల, మొత్తంగా దేశాభివృద్ధిని ప్రభావితం చేసే సంతానోత్పత్తి రేటు, లింగ నిష్పత్తి వంటి పరామితులను పరిగణనలోకి తీసుకొని ఏ వయస్సులో పెళ్ళి జరిపిస్తే అటు బాలికలకు, ఇటు సమాజానికి కూడా క్షేమకరమో ఒక విస్పష్టమైన నిర్ధారణకు రావడం టాస్క్ ఫోర్స్ అంతిమ లక్ష్యంగా నిర్దేశించబడింది. మగపిల్లల ప్రస్తుత వివాహ కనీస వయస్సు 21 ఏళ్లు. దానికి సరిసమానంగా ఆడపిల్లల పెళ్లి వయస్సూ పెంచడం ద్వారా భావితరాలకు బలమైన పునాదులు వేయడం సాధ్యమవుతుందని టాస్క్ ఫోర్స్ చివరకు నివేదిక ఖరారు చేసింది. ఆ నివేదికే ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. కేంద్రం
టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు మగపిల్లలతో
సరిసమానంగా ఆడపిల్లల వివాహ కనీస వయస్సును 21 ఏళ్ళకు పెంచడమే సబబన్న నిర్ధారణకు వచ్చినట్లు
సమాచారం అందుతున్నది.
భారతదేశంలో, వివాహానికి కనీస వయస్సును
చట్టబద్ధం చెయ్యాలన్న
ఆలోచన మొట్టమొదట 1880 లో ప్రారంభమయింది. శారదాచట్టం ద్వారా బాల్య వివాహాల నిషేధం 1929 నాటికి న్యాయవ్యవస్థ
చట్రానికి చిక్కింది. ఆనాటి శాసనం ప్రకారం బాలికల కనీస వివాహ
వయస్సు 16 సంవత్సరాలు; బాలులకయితే 18. 1978లో బాలికలకు మరో రెండు, బాలులకు మూడేళ్లు పెంచుతూ చట్టం సవరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న
చట్టం అదే. కనీస వివాహ వయస్సును పెంచేందుకు
వీలుగా అప్పట్లో శారదాచట్టాన్ని సవరించిన తీరులోనే ఇప్పుడూ మరో సవరణ రూపంలో స్త్రీ శిశు సంక్షేమ రంగాలలో కొత్త మార్పుకు చట్టబద్ధత తెచ్చి నూతన సంస్కరణలకు
శ్రీకారం చుట్టాలన్నది ప్రభుత్వ సంకల్పం.
మహిళలకు మగవారితో సరిసమానంగా
హక్కులు కల్పించడాన్ని రాజ్యాంగం కూడా గట్టిగా సమర్థిస్తున్నది. అబ్బాయిలకు
మల్లేనే అమ్మాయిలూ 18వ ఏట నుంచి ఓటు హక్కు, డ్రైవింగ్ లైసెన్స్, స్వంతంగా కంపెనీ
ప్రారంభించుకునే అధికారాలు కలిగివున్నప్పుడు ఒక్క వివాహ విషయంలోనే వివక్ష ఎందుకు? అన్న తర్కం వైజ్ఞానిక స్పృహ
పెరుగుతోన్న ఈ కాలంలో సమాజాన్ని తరచూ నిలదీస్తున్న మాట నిజం. ఆడవారి పట్ల అట్లా చిన్నచూపు
చూడాలని రాజ్యాంగంలో కూడా ఎక్కడా ప్రత్యేకంగా రాసిపెట్టి లేదనేదే న్యాయనిపుణులు చెబుతున్నారు.
చట్టం ఆచారాలు, మత సంప్రదాయాల క్రోడీకరణగా
చూడాలని వాదించే ఛాందసులు నుంచి మాత్రమే
స్త్రీల వివాహ వయస్సు పెంపుపై కొంత నసనసలు వినవస్తున్నాయి. భార్య
భర్త కంటే వయసులో పిన్నదై ఉండాలని ప్రాచీన సంప్రదాయం స్మృతులు ప్రమాణాలుగా చూపిస్తున్నాయన్నది వారి వాదన. ఇటీవల ఒక లా కమిషన్ పత్రిక కూడా అదే అంశం స్పష్టంగా పేర్కొనడం విశేషమే,
కానీ అది ఒకానొక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని యధాలాపంగా చేసిన
వ్యాఖ్య మాత్రమే!
పురాతన కాలం నుంచి
ప్రపంచమంతటా వధూవరుల యుక్తవయస్సుల్లో అంతరం కొట్టొచ్చినట్లు కనిపించడం గమనించదగ్గ
విశేషం. కానీ నాటి సామాజిక పరిస్థితులకు
నేటి సామాజిక పరిస్థితులకు మధ్య హస్తిమశకాంతరం భేదం కద్దు. లాలా లజ్ పతిరాయ్ రచించిన 'ఏ హిస్టరీ ఆఫ్ ది ఆర్య
సమాజ్ ' గ్రంథంలోనూ వధూవరుల వివాహ కనీస
వయస్సు 16.. 25 సంవత్సరాలుగా నిర్దేశించబడింది. ఈ తేడా లైంగిక కోణంలో వారి వారి శారీరక
నిర్మాణాల ఆధారంగా సాగిన హిందువుల ఆలోచనగా మాత్రమే భావించాలి. పురుషులతో సమానంగా
ఆయుష్షు ఉన్నప్పటికీ వారి కంటే స్త్రీల శరీర నిర్మాణం మరింత పరిణతి చెందివుంటుందని
మహిళా హక్కు సంఘాల ప్రగాఢ విశ్వాసం. స్త్రీలు సాధ్యమైనంత తొందరగా పవిత్రమైన వివాహబంధంలోకి
ప్రవేశించడాన్ని అందుకే ఆ హక్కుల సంఘాలు ఆట్టే తప్పుపట్టే ఆలోచన
చేయనిది. కానీ, మాతా శిశువుల సంక్షేమం, సంరక్షణల విషయమై
వారి ఆందోళనలో ఏ మాత్రం రాజీ లేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్త్రీ, పురుషుల వివాహ కనీస వయస్సు సరిసమానంగా ఉండవలసిన అవసరాన్ని
ప్రశిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే జాతులు, మతాలన్నింటిలోనూ మహిళలకు, పురుషులకు మధ్య కనీసంగా చెల్లుబాటు అయ్యే వివాహ వయస్సు 18
సంవత్సరాలు నుంచి ప్రారంభమవుతున్న పరిస్థితి.
2018 నాటి మన ఫ్యామిలీ యాక్ట్
(కుటుంబ చట్టం)పై సాగిన సంప్రదింపుల పత్రంలోనూ ‘లా కమిషన్’.. భార్యాభర్తల మధ్య
వయసు తేడాకు సంబంధించి ఎట్లాంటి చట్టపరమైన
ప్రాతిపదికా లేద’ని విస్పష్టంగా చెప్పింది.
ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములుగా మారటం అంటేనే, ఆ భాగస్వామ్యాలు సమాన హోదా కలిగివుండటం! రెండు
భాగాలకు సమాన స్థాయిలో గుర్తింపు
లభించినప్పుడే ఆ వివాహం అర్థవంతమైన సంసారానికి
దారితీసేది! స్త్రీల పట్ల అన్ని రకాల
వివక్షలను నిర్మూలించాలనే హక్కు సదస్సులు కూడా బాలికల వివాహ కనీస వయస్సు పెంపు పట్ల
ఎక్కడా పెద్దగా పట్టింపు పెట్టుకున్నట్లుగా కనిపించదు. అంతమాత్రం చేత మహిళల శారీరక, మేధో వృద్ధి రేటు
పురుషులను బట్టి మారుతుందని భావించే చట్టాల రద్దు పట్ల వాటికి పట్టుదల లేదని కాదు అర్థం.
ప్రపంచంలో 140 దేశాలలో
మహిళలతో సహా పురుషులకూ వివాహ కనీస వయస్సు 18 సంవత్సరాలు. మన దేశంలోనూ లా కమిషన్
మహిళకు వివాహం చేసుకునే కనీస వయస్సు 18 సంవత్సరాలుగానే
సిఫార్సు చేసివుంది గతంలో. ప్రభుత్వమూ ఆ తరహా ఆలోచనే చేస్తున్నప్పటికీ, ఆచరణ దగ్గరే తటపటాయింపు
ధోరణి తప్పడంలేదు. ప్రస్తుతమున్న వాస్తవ
గడ్డు పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. అత్యంత వేగంగా పెరిగే ‘దేశజనాభా’ చింత
ప్రధాని మునుపటి
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రతిఫలించడం గమనించాలి. వివాహ వయస్సును గురించి ప్రభుత్వ పునరాలోచన కూడా..
వాస్తవంగా చెప్పాలంటే.. అంతూపొంతూ లేకుండా పెరుగుతోన్న దేశ జనాభాను కట్టడి
చెయ్యాలన్న బాధ్యతాయుత భావన నుంచి పుట్టుకొచ్చినదే!
తొలి చూలు సందర్భం
మాతాశిశువుల ఆరోగ్య పోషణల పైన
అత్యధిక ప్రభావం చూపిస్తుందని వైద్యశాస్త్రం నిర్ధారిస్తోంది. మాతా శిశు ప్రసూతి మరణాల రేటులో పెరుగుదలకు
కారణం బాలికలు కౌమార దశలోనే తల్లులుగా మారడమని నివేదికలు మొత్తుకుంటున్నాయి. ఒక తాజా ‘నమూనా రిజిస్ట్రేషన్ విధానం’ ప్రకారం నేడు
దేశంలో ప్రసూతి మరణాల రేటు లక్షకు 122. బాగా తగ్గాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16)
గణాంకాలు కితాబిచ్చుకున్నప్పటికీ.. ‘బాల్యవివాహాల
సమస్య’ దేశాన్నిప్పటికీ తీవ్రంగా సలుపుతోనే
ఉంది. భారతదేశంలో 18 ఏళ్ల లోపు సుమారు ఒకటిన్నర లక్షల మంది ఆడపిల్లలకు
పెళ్లిళ్ళు జరిగిపోతు న్నట్లు యునిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలో మూడోవంతు
బాలికలతో కొలకొలలాడే మన దేశం బాల్యవివాహాలలో మాత్రం మొదటి స్థానంలో ఉండడం ఆందోళనకరమే కదా! అదీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య
వయస్సులోనే వందలో 16 మంది బాలికలు వివాహితలుగా
మారుతున్న నేపథ్యంలో! జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత
అమర్త్య సేన్ ఆవేదన చెందినట్లు- పేదరికం, విద్యా స్థాయిలతో
ముడిపడి ఉండటమే బాల్యవివాహాల చిక్కుముడికి ముఖ్య కారణం. కోవిడ్-19 మహమ్మారి పురులు విప్పిన తాజా నేపథ్యంలో పెరుగుతున్న బాల్యవివాహాలే
అందుకు తిరుగులేని ఉదాహరణ.
బడులు మూతబడి ఆన్ లైన్
చదువుల సదుపాయం లేని మైనర్ బాలికల మీద పెళ్లిళ్ల కోసమై తల్లిదండ్రులు
వత్తిడి పెంచుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందుకున్న
బాలల హక్కు సంఘాలు జోక్యం చేసుకున్న బాల్యవివాహ సంఘటనలు ఈ ఆగష్టు చివరి నాటికి సుమారు 5,584. దేశవ్యాప్తంగా పాఠశాలలు
మూతబడి, పేదరికం జడలు విదిల్చిన తరుణంలో మహమ్మారి పుణ్యమా అని పెళ్లిళ్లు సాధారణ దినాలలో
కన్నా చవకలో అవగొట్టేయచ్చన్న కన్నవారి కాపీనమే బాల్య వివాహాల పెరుగుదలకు ప్రధాన
కారణం.
విద్యకు వివాహానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. 18 ఏళ్ల లోపు
వివాహితలలో దాదాపు సగం శాతం (44.7) బొత్తిగా పలక పట్టడమే రాని నిరక్షర కుక్షులని గణాంకాలు లెక్కలు తేల్చాయి. ‘బేటీ బచావో బేటీ పఢావో’
లక్ష్యం ఎంత ముఖ్యమో ‘బేటీ పఢావో.. బేటీ
బచావో’ కూడా అంతే ప్రధానమైన స్త్రీ
సంస్కరణ. బాలికల వివాహ కనీస వయస్సు
మరంత పెంచడం ద్వారా మాతా శిశు సంక్షేమం ఎంత వరకు సాధ్యమో నిర్ధరించలేని అంశం. బాలికల 'చదువు సంధ్యల’ పై మరింత ధ్యాస పెట్టవలసిన అగత్యానికి ప్రభుత్వాలు
ముందు గుర్తించాల్సుంది. బాలికా విద్య,
మహిళా సాధికారతల ద్వారా సానుకూలపడే వాతావరణంలో పేదరికపు వత్తిళ్లు తగ్గితే,
బాల్యవివాహాల బాదరబందీ దానంతటదే క్రమేపీ తగ్గుముఖం పడుతుందన్న సామాజిక
శాస్త్రవేత్తల వాదనలో వాస్తవముంది.
ఒకే తరగతి చదివే ‘అమ్మాయి-అబ్బాయి’ల మధ్య ఆమోదయోగ్యంగా
మారిన సమానత్వ సూత్రం వివాహ వయస్సుకూ వర్తింపచేయాలన్న
ఆలోచనకే ఆఖరుకు ప్రభుత్వం
మొగ్గుచూపిస్తున్నట్లనిపిస్తుంది. బాల్య వివాహాలు, మైనర్ బాలికల పైన పెరుగుతున్న లైంగిక వేధింపుల వంటి అంశాలలో ఇప్పుడున్న చట్టాలను గట్టిగా అమలు చేసినా చాలు.. గణనీయమైన
సానుకూల దృక్పథం సమాజంలో ప్రోదిగొల్పవచ్చన్నది సామాజిక శాస్త్రవేత్తల ఆలోచన.
బాలికల వివాహ కనీస వయస్సు అంతకంతకూ పెంచుతో
చట్టసవరణలు చేసినా.. చట్టాన్ని పట్టించుకోని మొరటు సమాజం ముందు అవన్నీ కోరల్లేని పాము
బుసలే! ప్రభుత్వాలు ముందు దృష్టి మళ్లింఛవలసింది.. పరిధిని దాటే ముందు సమాజం ఒకటికి రెండు సార్లు జంకేలా ఏ విధమైన కఠినాతి కఠిన చర్యలు సత్వరమే తీసుకోవాలా అని. పర్యవేక్షణ యంత్రాంగాలు పరాకులు కట్టిబెట్టి కరాఖండీ
కార్యాచరణకు మనస్ఫూర్తిగా పూనుకుంటే తప్ప,
ప్రభుత్వాలు ఎంతో మధన పడి మరీ చట్ట
పరధిలోకి తెచ్చే బాలికల వివాహ కనీస వయస్సు వంటి
సంక్షేమ సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చేది.
-కర్లపాలెం హనుమంతరావు
***
(సూర్య దినపత్రిక ఆదివారం దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం)
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్ , 08-09-2010 మతభావనలు , మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే ...
-
ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని న...
-
పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే .. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు ' యస్య జ్ఞాన దయాసింధో ' అని గురువుగారు ప్ర...