Sunday, June 14, 2015

తెలుగోడి తెలుగ్గోడు!- సరదా చర్చ



 తెలుగు కోతులు  
టెలుగు వినను
టెలుగు కనను
టెలుగు అనను


రుగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ ఒకడు. పురాణమో, పుక్కిటపురాణమో.. ఒక లెక్కప్రకారం ఆంధ్రులంతా విశ్వామిత్ర మహర్షి సంతానమే. విశ్వామిత్రుడు విశిష్టిమైన వ్యక్తి. గురువునుమించి ఎదగాలన్న తపన  ఆయనది. ఎన్నో ఉద్యమాలకు ఆయన  స్ఫూర్తిప్రదాత.  సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరవిధాత. త్రిశంకుస్వర్గనిర్మాత. గాయత్రీమంత్ర ఆవిష్కర్త. వంకాయ, టెంకాయ, గోంగూరవంటి విడ్డూరాలన్నీ ఆయన ప్రసాదాలే.  తెలుగువాడికి అందుకే అవంటే అంత ప్రీతి. దీక్ష.. కక్ష తెలుగువాళ్లందరికీ విశ్వామిత్ర మహర్షినుంచే వారసత్వపు లక్షణాలుగా సంక్రమించాయేమోనని అనుమానం.  
రామాయణంలోని కిష్కింధ  ఆంధ్రదేశంలోని ఓ అంతర్భాగమేనని  వాదన ఉంది. ఆ లెక్కన మనమందరం కిష్కింధవాసులమే! అన్నదమ్ముల మత్సరం వాలిసుగ్రీవులనుంచి అబ్బిన జబ్బేమో! వాయుపుత్రుడి లక్షణాలూ తెలుగువాడికి ఎక్కువే మరి!
స్వామిభక్తి తెలుగువాడికి మరీ విపరీతం. స్వామికార్యం తరువాతే వాడికి ఏ స్వకార్యమైనా. ఆరంభశూరత్వం, అత్యుత్సాహం ఆంధ్రుల గుత్తసొత్తు. చూసి రమ్మంటే కాల్చి వస్తేనే వాడికి తృప్తి! కొమ్మ తెమ్మంటే కొండను  పెకలించుకొచ్చాడంటే వాడు కచ్చితంగా తెలుగువాడే. ఆ రావడంలోకూడా ఆలస్యమవడం వాడి ప్రత్యేక లక్షణం. కోటిలింగాలు తెమ్మని రాములువారు  ఆజ్ఞాపిస్తే ఆంజనేయులుగారు ఏమి చేసారు? ఒకటి తక్కువగా తెచ్చుకొచ్చారు! ఆర్భాటంగా మొదలుపెట్టి అసంపూర్తిగా చుట్టబెట్టడం తెలుగన్నకు  మొదట్నుంచీ అలవాటే!  స్వశక్తియుక్తులు మరొకడు పనిగట్టుకొని పొగిడితేగాని గుర్తెరగలేని బోళాతనం తెలుగువాడిది. సముద్రాలు లంఘించే శక్తిగలిగివుండీ ఏ స్వామివారి పాదాల చెంతో విశ్రాంతి కోరుకోవడం తెలుగువాడికి అనాదిగా వస్తున్న బలహీనత.
'తెలుగువాడివి అన్నీ అవలక్షణాలేనా?' అని ఉసూరుమనుకోవాల్సిన అవసరం లేదు.  వనవాసంలో రామసోదరులను ఆదరించిన శబరితల్లి తెలుగుతల్లే! చేసిన ఘనకార్యం  చెప్పుకొనే  సంప్రదాయం  అప్పట్లో లేదు. ఇంకెంతమంది కడుపునింపిందో  ఆ అన్నపూర్ణమ్మ తల్లి అందుకే మనకి తెలీదు. తెలుగుమహిళకు భోజనం వడ్డించడమంటే మహాసరదా కదా! పేరుకే అన్నపూర్ణమ్మ  కాశీనివాసి. అసలు మసలేదంతా మన తెలుగునేల నలుచెరగులే కదా! డొక్కా సీతమ్మలు, మంగళగిరి బాలాంబలు అడుగడుక్కీ తారసిల్లే పూర్ణగర్భలండీ తెలుగురాష్ట్రాలు రెండూ!
ఉద్యమమైనా సరే.. ఉప్పు సత్యాగ్రహమైనా సరే సొంతముద్రంటూ లేకుండా తెలుగువాడు ఒక్కడుగు ముందుకు కదలడు. బౌద్ధాన్ని సంస్కరించి మరీ ప్రచారం చేసిన నాగార్జునుడు మన  తెలుగువాడే! తెలుగువాడికి కొత్తొక వింత. పాతొక రోత. అందాకా నెత్తికెత్తుకొన్న జైనం శైవంరాకతో హీనం అయిపోయింది! ఆనక వాడు  వైదికం మోజులోపడ్డాక శైవం రాష్ట్రాల  శీవార్లలోకి పాతిపోయింది!
అటు ఆర్యులు.. ఇటు ద్రవిడులు! ఇద్దరూ ముద్దే మనకు! రెండు సంస్కృతుల పండుగలు  మనం సంబరంగా చేసుకొంటాం! పోతరాజు కృష్ణుణ్ణి తెలుగుదేవుడు చేసేసాడు. రామదాసు ఇక్ష్వాకులవాసిని సతీసోదరసమేతంగా భద్రగిరికి కట్టేసాడు.  కృష్ణరాయలు పాండిత్యప్రకర్షతో రంగధాముణ్ణి తెలుగుపెళ్ళికొడుకుగా తయారుచేసాడు. పాపయ్యశాస్త్రి భక్తిప్రవత్తులకు బద్ధుడైనట్లు బుద్ధభగవానుడు తెలుగు చిరునామా స్వీకరించాడు. అందరూ కావాలనుకొనే తత్వం తెలుగువాడిది. అయినా అతగాడే ఎవరికీ అక్కర్లేదు! భారతంలో తెలుగువాడి ఊసు ఆట్టే లేకపోయినా 'వింటే భారతమే వినాలి' అంటూ టాంటాం కొట్టుకొనే రకం తెలుగువాడు!
సాహసంలో మాత్రం? మనం వెనుకంజా? తైలంగ సామ్రాజ్యాన్ని స్థాపించాం. సుమిత్రా, జావా ద్వీపాల్లో వలస రాజ్యదీపాలను వెలిగించాం. సయాడోనిసిచయాల్లాంటి సుదూర ప్రాంతాల్లో నిబద్ధతతో బౌద్ధదర్మాన్ని ప్రచారం చేసి వచ్చాం. ఈజిప్టురాణికి చీనాంబరాలు కట్టబెట్టిన ఘనత మన  తెలుగువాడిదే! అజంతా, అమరావతి, సాంచి క్షేత్రాలలో అసమాన శిల్పకళావైభవాన్ని సృజించిన కళాతపస్వి మన తెలుగుయశస్వి. ధాన్యకటక విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన గురువులు మన తెలుగువారు. మానవనాగరికత మణికిరీటంలో నిరంతరం వెలుగులు చిమ్మే కోహినూరు వజ్రాలు కదుటండీ మన తెలుగువారు!
మేధస్సులోమాత్రం మనమేమన్నా అధమస్థులమా? హైదవం క్షీణదశలో  దక్షిణాది గోదావరీతటంనుంచే మహాతత్త్వవేత్త శంకరాచార్యులు ప్రభవించించింది. స్వధర్మ పునరుత్థనార్థం జన్మించిన పుణ్యమూర్తి విద్యారణ్యుడూ తెలుగు పురుషుడే! ఆయన తోడాబుట్టిన సాయనుడు వేదాలకు  భాష్యం చెప్పిన ఉద్దండుడు.  ఉత్తరాది కావ్యాలకు  వ్యాఖ్యానాలు చేసిన మల్లినాథుడుది తెలుగునాడు. జగన్నాథ పండితరాయలు హస్తిన ఎర్రకోట  యవనసుందరి అంకపీఠంపైన తెలుగుప్రతిభను సుప్రతిష్ఠంచిన ఘనుడు.   దేశదేశాల తాత్వికకేతనం విజయవంతంగా ఎగురువేసిన తెలుగు జ్ఞాననికేతనం రాధాకృష్ణపండితుడు. అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలార్జించిన కోడి రామ్మూర్తి, సి.కె. నాయుడు, ఎల్లాప్రగడ సుబ్బారావు మన తెలుగువెలుగులేనంటే  తెల్లబోతాం మనం.
గొప్పవాళ్లెప్పుడూ తెలుగువాళ్లు కారనీ.. తెలుగువాళ్లయుంటే గొప్పవాళ్లే అవలేరనీ మన తెలుగువాళ్లకో గొప్ప నమ్మకం. బొంబాయి చేరితేగాని కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు నాలుగు కాసులు కళ్లచూడలేదు. తమిళదేశం చెప్పిందాకా  బాలమురళి గానగాంధర్వుడని  మనం ఒప్పుకోలేదు! తెలుగువాడు పైకిరావాలంటే పైకన్నా పోవాలి. దేశందాటి పైకన్నా పోయిరావాలి! ఎందుకిలా?
తెలుగువాడి వెటకారంవాడి మరీ అంత అత్యధికమా?! మహామాత  కాళీదేవత ప్రత్యక్షమయితే మరోడయితేసాగిలపడి మొక్కేవాడు. ఆమె అంగసౌష్టవంచూసి ఫక్కున నవ్వాడంటే తెనాలి రామలింగడు తెలుగువాడు కాబట్టేగా! వేలెడంత లేకపోయినా జానెడంతవాణ్ణి చూసి ‘మూరెడంతైనా లేడ’ని మూతి మూడువంకర్లు తిప్పాడంటే నిక్షేపంగా వాడు తెలుగువాడే అయివుండాలి.
.
పాకశాస్త్రంలో తెలుగింటి  ప్రావీణ్యమే వేరు. తెలుగు తాళింపు దినుసులు మరే ఇతర ప్రాంతాలలో కనిపించవు. తెలుగు వర్ణమాలా ఓ వంటింటి పోపుపెట్టె వంటిదే సుమా! సాతాళించగల చేవ ఉండాలేగాని.. తెలుగువంటకంలా తెలుగురచనా ఒక నవరసాల విందు.
గంగాజలం తెచ్చి కృష్ణ, గోదావరి, తుంగభద్రల్లో కలగలపడమే తెలుగుదనం కలివిడిదనం. తాగునీటినిసైతం ‘మంచి’నీరుగా పిలిచే మంచి నైజం తెలుగువాడి సొంతం! తెలుగుభాషకూ మంచినీరులా మేధోదాహార్తిని తీర్చే సత్తా ఉంది. శబ్దానికి  పూర్తిన్యాయంచేసే శక్తి ఇటాలియన్  తరువాత  ఒక్క తెలుగక్షరంలోనే ఉందిట! ఇది ఆధునిక భాషాశాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న మాట. కంప్యూటర్ వేగాన్ని అందిపుచ్చుకోగల 'బైట్ స్(Bytes)' సామర్థ్యం తెలుగులిపికి అలంకారప్రాయం- అని  సాఫ్టువేరు నిపుణులు వెలిబుస్తున్న అభిప్రాయం.  ఏ పలుకునైనా తనలో మంచినీళ్ల ప్రాయంగా కలుపుకోగల కలివిడితనం తెలుగువర్ణమాలకు ప్రత్యేకం.
ద్రవిడ సంస్కారి చిన్నయసూరిచేత చక్కని వచన రచన చేయించిందీ తెలుగు పలుకుబడే! తెలుగుమాట తేటతనానికి దాసోహమయే బ్రౌన్ దొర నిఘంటువు నిర్మాణానికి పూనుకొన్నది!  జిజ్ఞాసకు తగ్గ ఉపజ్ఞ తెలుగుభాషామతల్లి  ప్రజ్ఞ.
'ఆంధ్రదేశపు మట్టి.. అది మాకు కనకంబు' అని ఆ మహామహులు తలవంచినే చోటుకే  ఇప్పుడు మనం తలవంపులు తెస్తున్నాం. అదీ విచారం!
పరాయితనం భుజానమోసే ఔదార్యంలోనే తెలుగువాడెందుకో ముందునుంచీ తరించిపోతున్నాడు?! సగటు తెలుగు నాలికకు తెలుగు పదాల మాధుర్యం వెగటు?! ఆదిలో  సంస్కృతం, మధ్యలో హిందూస్తానీ, ఇప్పుడు ఆంగ్లం! వట్టి తెలుగుమాత్రమే తెలిసుంటే అది  వాజమ్మతనానికి నిదర్శనం! ‘గొప్పోళ్ళు చాలామందికి తెలుగురాదు. కాబట్టి తెలుగురాకపోవడమే గొప్పదన’మనుకొనే తెలివితక్కువతనం రోజురోజుకీ ఎక్కువవ్తుతున్నదీ తెలుగునాట! ‘విజ్ఞానమంటే కేవలం ఇంగ్లీషుమాట. పాండిత్యమంటే కేవలం సంస్కృత పదాల ఊట’. ఇదీ  ప్రతి సగటు తెలుగునోటా నేడు వినిపిస్తున్న పాట! పరాయిభాషల రుచి నోటికి పట్టాలన్నా పసిదశలో బిడ్డకు ల్లిభాష పాలు పట్టాలా వద్దా! చావగొట్టినా సొంతభాషరాని చవటకి చావచితక్కొట్టినా పరాయి భాష వంటపట్టదని భాషాశాస్త్రవేత్తలే మొత్తుకొంటున్నారు!

భోజనాలయంలోకి వెళ్ళినప్పుడు 'వాటర్' 'చట్నీ' అంటేనేకానీ వడ్డించేవాడి తలకెక్కదా?! కొట్లాట్టానికి అక్కరకొచ్చే సొంతభాష న్యాయస్థానాల్లో ఫిర్యాదులిచ్చేందుకు ఎందుకు చేదో?! రోగాలకే కాదు.. వాటి నిదానానికి  వాడే మందులకూ  నోరుతిరగని లాటిన్ పేర్లు?! రైలు, రోడ్డు, పోస్టు, సైకిలు, ఫోను, సెల్ఫోను.. నిత్యవ్యవహారంలో నలిగే కొన్ని పదాలకు ప్రత్యామ్నాయం  లేక వాడుకలో ఉన్నాయంటే..ఏదో అర్థం చేసుకోవచ్చు. పుస్తకం, కలం, ప్రేక్షకుడు, సంతోషంవంటి పదాలకూ బుక్కు, పెన్ను, ఆడియను(నిజానికి ఆడియను అన్న మాటే తప్పు), హ్యాపీసు వంటి సంకర పదాలను వాడే తిక్కసంకరయ్యలు ఎక్కువయిపోతున్నారు! భేషజంకోసం, అతిశయంకోసం పరాయిభాషాపదాలను వేలంవెర్రిగా వాడే గురజాడ గిరీశాలు తలుగునాట రోజురోజుకూ ముదిరిపోతున్నారు!  ఆత్మగౌరవం ప్రాణప్రదంగా భావించే తెలుగువాడికెవడికైనా   ఇది చివుక్కుమనిపించే  అంశం.
తెలుగుగడ్డమీద తెలుగుబిడ్డ మెడలో తెలుగు పలకను' అంటూ పలకలా?! తెలుగులో ఏడ్చిన నేరానికి పసిదాని అరచేతికి వాతలా?!
పేరుకేనా మనది ప్రజాస్వామ్యం? పాలితుడి పలుకుమీద పాలకులకెందుకో ఇంత కోపం?!  జన్మతః జిహ్వమీద కొలువైన శబ్దదేవత కదా తల్లిభాష!  జంతుతతులకన్నా విలక్షణంగా బతుకును తీర్చిదిద్దే ఆ భాషామతల్లి  అంటే తెలుగువాడికి తగునా అంత చులకన?! తల్లిమీద, తల్లిభాషమీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి?!
***
కర్లపాలెం హనుమంతరావు
(డిసెంబరు 2012 'తెలుగు వెలుగు'లో ప్రచురితం)

(ఈ వ్యాసంలో ఉపయోగించుకొన్నవి సరసి, ఒన్ ఇండియావారి కార్టూనులు. వారికి ధన్యవాదాలు)



Saturday, June 13, 2015

అగరుధూపం -కథ






ఫీసునుంచి రాగానే కాఫీతో పాటు ఉత్తరం అందించింది శ్రీమతి. కార్డు రేటు పదిహేను పైసలున్నప్పటి కాలం నాటి ఉత్తరం అది. రమణమ్మత్తయ్యది. ఒకసారి అర్జంటుగా వచ్చి పొమ్మని ఎవరిచేతో రాయించింది. బేరింగు పడిందని మా ఆవిడ ఏడుపు. "వివరంగా ఓ ఇన్లాండు ఉత్తరం రాయించుకోవచ్చుగా! పిసినారితనం కాకపోతే!... పోయేటప్పుడు అంతా మూట కట్టుకుని పోతుందికామోసు..." అంటూ అక్కసు.
ఆ మధ్య తిరుపతి పోతూ రమణమ్మత్తయ్య ఇక్కడ దిగింది. వెళ్లే ముందు నా చేతిలో ఒక డిపాజిట్ రసీదు పెట్టి దాచమంది. యాభైవేల బాండది. గడువుకింకా మూడు నెలలుంది.

కొడుకుల చేతిలో పెట్టకుండా ఇక్కడెందుకు దాచమందో అర్థంకాలేదు. అడిగితే బాగుండదని వూరుకున్నా.
"బ్యాంకులో వడ్డీ మరీ తక్కువగా వుందిరా అబ్బాయి! ఎక్కువ వడ్డీ వచ్చేదేమైనా వుంటే చూడు.. అక్కడే వేద్దాం!" అంది.
మా ఆవిడ ఊరుకోకూడదూ..! "ఆ ఎక్కువ వడ్డీ మేమే ఇస్తాం. మాకివ్వండి పిన్నిగారూ!" అనేసింది. అంతే.. రమణమ్మత్తయ్య కోపం చూడాలింక!
"అందరికీ నాడబ్బు మీదే కన్ను. నేనేమన్నా అంత ఎతిమతం దాన్లా కనిపిస్తున్నానా" అన్నట్లు మాట్లాడింది.
ఆవిడ ధోరణి నాకు తెలుసుగనక నేనేమీ మాట్లాడలేదుగానీ మా ఆవిడ మాత్రం చాలా బాధపడింది. అందుకే నేను వూరికి బైలుదేరేటప్పుడు ముభావంగా ఉంది. అయినా తప్పదు. రమణమ్మత్తయ్యకూ నాకూ ఉన్న సంబంధం అటువంటిది.
రమణమ్మత్తయ్య నాకు సొంత మేనత్త కాదు మా నాన్న సవతి తల్లి కూతురు అయినా ఇద్దరూ సొంత అన్నచెల్లెళ్ళ కన్నా అభిమానంగా ఉండేవాళ్లు. నల్లగా పొట్టిగా గుమ్మటం లాగా ఉంటుంది. రమణమ్మత్తయ్య మొగుడు పుష్కరాలకని పోయి కృష్ణలో కొట్టుకుపోయేనాటికి నట్టింట్లో నలుగురు పసికూనలు. వాళ్ళను ఆవిడ సాకిన తీరు వర్ణనాతీతం. తినటానికి ఉండటానికి కరువు లేదు. తల్లివైపునుంచి ఆస్తి వచ్చిందావిడకి. మగదిక్కులేని సంసారం. చేతిలో దమ్మిడీ లేకపోతే సంసారం బజార్నపడదా? అని ఆడభయం.
ఊళ్లో వాళ్ళకి వడ్డీకి అప్పులిచ్చేది. వసూళ్ల విషయంలో పరమ నిక్కచ్చి. 'రమణమ్మ! అమ్మో.. కాబూలీవాలా నయం' అన్న పేరు తెచ్చుకుంది. ఆమె గయ్యాళితనమూ, పిసినారితనమే ఒకరకంగా ఆ సంసారాన్ని ఆదుకుందారోజుల్లో!
ఒంటి మీదెప్పుడూ ఒకటే నీరుకావిరంగు చీరుండేది. ఖర్చని తలకు నూనెకూడా సరిగ్గా రాసుకునేది కాదు. ముప్పయ్యేళ్ళకే యాభైయేళ్ల ముసలమ్మలాగుండేది. పిల్లల్ని మాత్రం పువ్వుల్లాగా తీర్చిదిద్దేది. ఇంటినీ అంతే!
పిల్లలకు రకరకాల డ్రెస్సులు వేసేది. రంగురంగుల ముగ్గులు ముంగిట్లో తీర్చిదిద్దేది. ఆవిడకొచ్చినన్ని పిండివంటలు మా అమ్మక్కూడా రావని మా నాన్న దెప్పుతుండేవాడు. అయితే ఆ చేసినవేమీ బైటవాళ్ళకు పెట్టేది కాదు. తన పిల్లలకు జిలేబీ చేతిలోపెట్టి ఎదురుగావున్న మాకు దొడ్లోని జామకాయలు ముక్కలుగా కోసిపెట్టేది. మాకనేంటిలే.. తనూ తినేదికాదు. జామచెట్టునెక్కడ చూసినా రమణమ్మత్తయ్య గుర్తుకొస్తుంది.
"అందరికిలాగా కోరికలు తీర్చేందుకు పిల్లలకు తండ్రి లేడుగదా.. ఇక నా సంగతంటావా! ఈ పిల్లలు సక్రమంగా పెరిగితే నాకదే కోటివేలు" అంటుండేది మానాన్న లాంటి వాళ్లెవరైనా ఎప్పుడైనా ఆ పిసినారితనానికి మందలించటానికి పూనుకుంటే!
అన్నట్లు రమణమ్మత్తయ్య కథలు బాగా చెపుతుంది. భానుమతిలాగా కమ్మగా పాడుతుంది. మా ఇంటి రేడియోలో నుంచి వచ్చే పాటలకు ఆవిడ గొంతు కలిపి పాడుతుంటే వినటానికి చాలా హాయిగా వుండేది. సంగీతమన్నా, హిందీ అన్నా ప్రాణం. అస్తమానం పిల్లల్ని హిందీ చదవమని సతాయించేది. రెండో కూతురుని హిందీలో విశారద దాకా చేయించింది. ఆ అమ్మాయి ఒక హైస్కూల్లో హిందీ టీచరుగాచేరి ఒక క్రిస్టియనతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అది వేరే కథ.

"కృష్ణాష్టమికి ఎన్ని రోజులుందండీ?" అనడుగుతున్నారు బస్సులో ఎవరో. ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చిపడ్డాను. బస్సు ఒంగోలు పొలిమేరల్లోకొస్తుంది.
కృష్ణాష్టమి పేరు వినంగానే మళ్లీ మా రమణమ్మత్తయ్యే గుర్తుకొచ్చింది. ఆ పండుగ రోజు అత్తయ్య శిబిచక్రవర్తి చెల్లెలు అవతారమెత్తేది. కన్నయ్య పుట్టిన రోజు సందడంతా అత్తయ్య ఇంట్లోనే !ఇంటి నిండా ముగ్గులు వేసేది. కృష్ణపాదాలు పూజగదిలోనుంచీ వీధిమెట్లదాకా గుర్తులుపెట్టేది. చీకటి పడేలోగా చిన్ని కృష్ణయ్య ఆ గుర్తులు మీద తన పాదాలు మోపుతూ ఇంట్లో కొస్తాడని ఆమె నమ్మకం. కృష్ణుడికిష్టమని వెన్నతో చేసిన ఉండలు తయారుగా ఉంచేది. ఆ రోజు ఆవిడ చేసే ప్రసాదం, పాయసం, నేతి గారెలు తిని చూడాల్సిందే! రాత్రిపూజ పూర్తయిన తరువాత "అదిగదిగో కృష్ణయ్య వచ్చివెళ్లాడు. అడుగుల గుర్తులు కనిపించటం లేదూ?!" అని అడిగేది మమ్మల్ని. 'కనిపించటం లేద'న్నాడని ఒకసారి మా సుబ్బరాజుని అప్పటిదాకా తిన్న అప్పచ్చులన్నీ కక్కేదాకా చీవాట్లు పెట్టింది. ఆవిడ నోటికి జడిసి "అవునవును.. కృష్ణుడు వచ్చాడు. అదిగో పాదాలగుర్తులు" అనేవాళ్ళం మేం.
మరి ఆవిడ భక్తి అలాంటిది. పెద్దవాడికి కృష్ణమూర్తనీ రెండోవాడికి వాసుదేవమూర్తనీ, ఆడపిల్లలకు శ్యామల, రుక్మిణి అని పేర్లు పెట్టుకుంది. రుక్మిణి ఆ పేరుని సార్థకం చేసుకోటానికన్నట్లు ప్రేమించినవాడిని పెళ్లి చేసుకునేటందుకు ఇల్లు విడిచి వెళ్లిపోయింది.
బస్సు చీరాల చేరేసరికి దాదాపు తెల్లారిపోయింది. ఏదో ఊళ్లో ఆగి, మళ్లీ బయలుదేరే సమయానికి బస్సెక్కుతూ కనిపించాడు సుబ్బరాజు. ''అనుకుంటూనే ఉన్నా.. నువ్వివాళో రేపో దిగుతావని" అన్నాడు నా వంక అదోలా చూసి నవ్వుతూ. నా పక్క ఖాళీ ఉంటే వచ్చి కూర్చున్నాడు.
సుబ్బరాజు నా క్లాస్‌మెట్. వాళ్ళనాయన రమణమ్మత్తయ్య పొలం కౌలుకు చేసేవాడు. ఆ తరువాత్తరువాత ఊరికి ప్రెసిడెంటయ్యాడు. వీడు వాళ్లనాన్న అడుగుజాడలలోనే నడుస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్లో ఓ గీతా మందిరం కట్టించేపనిలో బిజీగా వున్నాట్ట!
"మీ రమణమ్మత్తయ్యను ఒప్పించి భూరివిరాళం ఇప్పించాలిరా! నీ మాటంటే ఆవిడకు మంచిగురంటగా... పెద్దావిడ పేరు ఫలకం మీద చెక్కిద్దాంలే!" అన్నాడు.
"నువ్వే అడక్కపోయావా? కృష్ణుడి పేరు చెబితే ఆవిడ కాదనదే.." అన్నాను నేను.
"ఆవిడకు అనుమానాలు జాస్తిరా బాబూ! అందరూ ఆవిడ ఆస్తిని కాజేయటానికే కూర్చున్నారనుకుంటుంది. అందుకే బాగా అయింది శాస్తి" అన్నాడు.
"ఏమయిందీ?"
"నీకు తెలీదా? అందుకే వస్తున్నావనుకున్నా ఇంకా. ఆవిడకు క్యాన్సరంటగా.. లంగ్ క్యాన్సర్. బాగా ముదిరిన తరువాత బైటపడ్డట్లుంది. పోయేలోపల తనచేత భారీవిరాళం ఇప్పించే పూచీ నీదే."
"రమణమ్మత్తయ్యకు క్యాన్సరని నాకు తెలీదు. మా ఊరొచ్చినప్పుడు బాగానే ఉందే!"
"మీ ఊరొచ్చిందా?" అని ఆశ్చర్యపోయాడు సుబ్బరాజు. నా దగ్గర బాండు దాచినట్లు కూడా తెలీదు వీళ్లకు. బహుశా దాని కోసమే నాకు కబురు పంపిచినట్లుంది. బాండ్ వెంట తీసుకురావటం మంచిదయింది.
"క్యాన్సరొస్తే పల్లెటూళ్లో ఏం చేస్తుంది? ట్రీట్‌మెంట్ తీసుకోదా?" అనడిగా. డబ్బు ఖర్చని వద్దందిట. "ఊళ్లో ఆచార్లే ఏదో మందిస్తున్నాడు. పెద్దాడు అలిగివేరే కాపురం పెట్టాడు. వాసు స్టేట్సులో ఉంటున్నాడాయ! పెద్దల్లుడు మంచాడు కాదంటారు. రెండో పిల్లని దగ్గరకు రానివ్వదు." అన్నాడు సుబ్బరాజు.
పిల్లల్ని పూలచెట్ల మాదిరి సాకింది. గారాబంతో పెద్దాడు చెడ్డాడు. రెండోవాడు అందకుండా పోయాడు. ఆడపిల్లలెప్పుడూ ఆడపిల్లలేగా!
ఇంటికెళ్లి చూశాక రమణమ్మత్తయ్య పరిస్థితికి జాలేసింది. లంకంత ఇంట్లో పని పిల్లను పెట్టుకుని వంటరిగా నెట్టుకొస్తుంది.
కేన్సరు తెచ్చిన మార్పు కనిపిస్తూనే ఉంది. వేదాంతం బాగా వంటబట్టింది. "ముందునుంచీ నాకు ఈ పిల్లలు తోడు లేరుగా! నా కన్నయ్యే నా వెన్నంటి ఉండి నడిపించాడు. ఆ చల్లనయ్య చల్లంగా చూస్తే చాలు..." అంది మంచంలోనుంచే.
అంత పెద్ద సంసారాన్ని అతిపిన్నవయసులోనే సునాయాసంగా ఈదిన అత్తయ్యకు ఇలా చివరిరోజుల్లో అయిన వాళ్ల అండ లేకపోవటం చూసి నాకు చాలా కష్టం వేసింది.
"మద్రాసు రారాదూ! మంచి డాక్టరుకు చూపించుకుందువుగానీ..." అన్నాను. నవ్వి వూరుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు బైటికి తీశాను. పడుతూలేస్తూ వచ్చి బ్యాంకులో బాండ్ మార్చుకుంది. 'ఇంక నేను వెళతానం'టే "ఈ ఒక్క రాత్రికీ ఉండి పోరా రాముడూ!" అంది.

ఆ రాత్రి ఎగశ్వాస... దిగశ్వాస. ఆచారొచ్చి చూసి "రాత్రి గడవటం కష్టం" అన్నాడు. అందరికీ కబుర్లు వెళ్లాయి. అమెరికాలో ఉన్న వాసు "రావటం లేటవుతుంది. అవసరమైతే అన్నయ్యనే అన్నీ కానిచ్చెయ్యమను బావా!" అన్నాడు ఫోనులో.
పెద్దాడు వచ్చాడు కానీ కదలకుండా ఒకమూల కూర్చున్నాడు. పలకరించబోతే తల తిప్పేసుకున్నాడు. నేనేదో వాళ్లమ్మని కాకాపట్టి ఆస్తి కొట్టేయాలని వచ్చినట్లు ఒకళ్లిద్దరితో అనటం నా చెవిన బడింది. నేనేం మాట్లాడలా. ఆ గొడవలకిది సందర్భమా?!
పెద్ద కూతురు వచ్చీ రాగానే ఇంట్లో సామానుల గురించి ఆరాలు మొదలు పెట్టింది. రెండో అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయిని చేసుకున్న క్రిస్టియన్ కుర్రాడు మాత్రం ఒకసారి వచ్చి వెళ్లాడు. పనిపిల్లను కుదిర్చింది అతనేనట! అతనేదో ఎన్జీవో విద్యాసంస్థలో వార్డెన్‌గా ఉన్నాడన్నారు.
మొత్తానికి రమణమ్మత్తయ్య చివరి శ్వాస తీసుకొనే వేళకి వాసు తప్ప అందరూ పక్కనే ఉన్నారు. రెండో కూతురు చివరి చూపుకొచ్చింది. కొంత నయం. కానీ ఆ తరువాత జరిగిన సంఘటనలే చికాకు పుట్టించేవిగా ఉన్నాయి.
"అమ్మ నాకొక్క దమ్మిడీ ఇవ్వలేదు. కర్మకాండలు జరిపించటమెట్లా?" అన్నాడు పెద్ద కొడుకు. "పెద్దకొడుకుగా అన్నీ చేయడం నీధర్మం" అని పెద్దకూతురూ, పెద్దల్లుడూ!
సుబ్బరాజొచ్చిందాకా చర్చలలా సాగుతూనే వున్నాయి. "బ్యాంక్‌లో నిన్ననే బాండు మార్చుకుందిటగా మరాడబ్బులేమైనాయీ?" అని వాడి ఆరాటం.
ఆఖరికి తను దాచుకున్న సొమ్ముతోనే అత్తయ్యను కాటికి పంపే ఏర్పాట్లు చెయ్యటానికి తీర్మానమయింది. ఆ డబ్బే లేకపోతే రమణమ్మత్తయ్య పని ఏమయివుండేదో?!
జీవితాంతం పిసినిగొట్టుగా బతికింది. కాట్లో కట్టెల ఖర్చు కోసమే అన్నట్లయిందామె పరిస్థితి. కర్మకాండలు ముగిసిన వెంటనే నేనూ బైలు దేరాను.
"ఇంతకాలం ఉన్నావ్. ఇంకొక్క పూట ఓపిక పట్టు. మీ రమణమ్మత్తయ్యేదో వీలునామా రాయించిందంట! బ్యాంకులో ఉంది. పట్టుకొస్తున్నారు. గీతామందిరానికే మాత్రం రాసిందో విందువుగానీ!" అన్నాడు సుబ్బరాజు కులాసాగా. నాకేదో అనుమానం మొదలయింది.

నడవాలో రమణమ్మత్తయ్య పటం ముందు కూర్చున్నారందరూ. పని పిల్ల గుప్పెడు అగరుబత్తులు తెచ్చి వెలిగించి పోయింది.
అగరుధూపం మెల్లిగా హాలంతా వ్యాపిస్తుంటే అదొకరకమైన అనుభూతి. ఈ ఇంట్లో ఈ ప్రశాంతత ఎల్లకాలమూ ఇలాగే కొనసాగితే బాగుణ్ణు! ఈ ఆస్తి పంపకాల తరువాతైనా అత్తయ్య ఆత్మకు శాంతి లభిస్తుందా? మెల్లిగా అక్కడనుంచీ తప్పుకుని దొడ్లో జామచెట్టు కింద కుర్చీ వేసుక్కూర్చున్నాను. చెట్టు నిండా చిలక్కొట్టిన పళ్లు చాలా ఉన్నాయి. వగరు కాయలకోసం పిల్లలు కొట్టుకుంటున్నారు. జామచెట్టును చూస్తే రమణమ్మత్తయ్యే గుర్తుకొస్తుంది. లోపల్నుంచీ ఏవో గోలగా మాటలు వినిపిస్తున్నాయి.
"అమ్మ మీకీ ఉత్తరమియ్యమందయ్యా!" అంటూ ఒక కవరు ఇచ్చిపోయింది పనిపిల్ల.
కవరు తెరిచి కాగితం మడతలు విప్పాను. అత్తయ్య ఎవరిచేతో రాయించిన ఉత్తరం అది... "ఇది నా స్వార్జితమైన ఆస్తి. కొంత మా అమ్మవైపు నుంచి వచ్చినా నా ఇష్టం వచ్చినట్లు పంచుకునే అధికారం ఉందని లాయరుగారు అన్నారు. నా పిల్లలకు చాలా ప్రేమనురాగాలు పంచి ఇచ్చాను. వడ్డీతో సహా అసలు కూడా వసూలయితేగానీ... మళ్లీ అప్పిచ్చే అలవాటు లేనిదాన్ని నేను. నా కన్నవాళ్లింకా నా రుణం తీర్చుకోలేదు. కనక మళ్లీ వాళ్లకేమీ ఇవ్వలేను. ప్రతి కృష్ణాష్టమి రోజూ కన్నయ్య నాకోసం నా ఇంటి కొస్తుంటాడు. ఈ సారి వచ్చినప్పుడు నేను లేకపోతే దిగులు పడతాడేమో! అది నేను భరించలేను రాముడూ! అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నానురా! ఈసారి కృష్ణాష్టమికి కన్నయ్య నా ఇంటికొచ్చే వేళకి నట్టింట్లో నేను లేకపోయినా... నాలాంటి వాళ్లింకెవరైనా ఉండాలి. కన్నబిడ్డల ప్రేమానురాగాలకు దూరమై పరితపించే నాలాంటి తల్లులు... తండ్రులూ దేశంలో కోకొల్లలు. అందులోని కొంత మందికైనా నా ఇల్లు ఆశ్రయమైతే చాలు. నాలాంటి వృద్ధులను సాకాలంటే మాటలా? ఎంతో ఓపిక... సహనం కావాలి. సేవాభావం ఉండాలి. ఈ రెండూ నా చిన్నల్లుడి దగ్గర దండిగా ఉన్నాయి. అతణ్ణి ఒప్పించి ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహించేలా చూసే బాధ్యత నీదేరా రాముడూ! ఆశ్రమనిర్వహణగ్గానూ నా దగ్గరున్న ఆస్తి బొటాబొటిగా సరిపోతుంది. సుబ్బరాజు గీతామందిరానికి ఇచ్చేందుక్కూడా ఇంకా ఏమీ మిగల్లేదు...''
లోపలినుంచి అరుపులు పెద్దవయ్యాయి. సుబ్బరాజు భుజాన కండువా వేసుకుని విసురుగా బైటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకనే మిగిలిన వాళ్లు ధుమధుమలాడుతూ! గంటలో ఇల్లంతా ఖాళీ అయింది. లోపలికి తొంగి చూస్తే..
రమణమ్మత్తయ్య ఫోటో ముందున్న అగరొత్తుల ధూపం పరిమళం గదంతా మెల్లగా అల్లుకుంటోంది. అది గది కాదిప్పుడు. వృద్ధాశ్రమం. అదే గీతా మందిరం.
-కర్లపాలెం హనుమంతరావు
*** 
ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురితం

Friday, June 12, 2015

ఇది ఇండియా.. అది ఇంగ్లాండు!- సీరియస్లీ సిల్లీ స్టోరీ

 

       
 ఇదీ ఇండియా .. ! 

దుబాయ్ కొడుకు ఉద్యోగం ఊడినందుకు దిగాలుపడ్డ అమరయ్య మంచంపట్టి ఇవాళ్టికి మూడు వారాలు.
మందిచ్చే ఆచారిగారు పెదవి విరిచి 'అయినవాళ్ళను పిలిపించుకోవచ్చు' అని హెచ్చరించిపోయారు. 

షేకుల రుణాల 'షేక్' లో షేపులు  పోయిన అమరయ్యకొడుకు కామేశ్వర్రావు తండ్రి చివరిచూపులకని దిగబడ్డాడు.. కొడుకును చూసిన ఉల్లాసంలో తండ్రి తెప్పరిల్లాడు కానీ.. కొడుకే లోడు ఖాళీఅయిన లేలాండుకు మల్లే  కళ తప్పివున్నాడు.

'ఇక్కడే ఏదన్నా పని ఉంటే చూడు బాబాయ్! ఎటొచ్చి ఎటు పోతుందో.. నాయన కర్మకాండలకైనా  చిల్లి నయాపైసా లేదు నా దగ్గర ' అని బైటపడిపోయాడు దుబాయ్ రిటర్న్డ్ కామేశ్వర్రావు.

‘నయాపైసల’దగ్గరే ఆగిపోయిన అన్నకొడుకు అమాయకత్వాన్ని చూసి జాలిపడ్డాడు బాబాయ్. ‘ఇక్కడి పరిస్థితులు అంతకన్నాఅధ్వానంగా  ఉన్నాయిరా బంగారూ! పెద్ద పెద్ద సాఫ్టువేర్లే వేర్లు తెగిన మొక్కల్లా వాలిపోయున్నారు నిన్నటిదాకా. ఇప్పుడేదో పుంజుకుంటుందంటున్నారుగాని.. నాకైతే బొత్తిగా నమ్మకం లే! ఇక గవర్నమెంటు ఉద్యోగాలంటావా? ఇదిగిదిగో.. అదేదో సెక్షన్లు కోర్టుల్లో నలుగుతున్నాయి.. ఆ లిటిగేషన్లన్నీ అటు క్లియరైపోడమే లేటు .. ఇటు  భారీ నియామకాలకు లాకులెత్తేస్తాం!' అని రెండు తెలుగు స్టేట్లూ  ఒహటే రోటి పాటలు! మనమాట వినే మంత్రెవరైనా దొరకుతారు గాని.. మంత్రిమాట వినే అధికార్లు దొరకడమే  కష్టంగా ఉందిరా సీను! సియమ్ములాదేశించినా 'నిమ్మళంగా చేద్దాంలేద్దూ' అని నిమ్మకు నీరెత్తినట్లు చిత్రాలు  పోయే అధికార్లే అధికంగా ఉన్నారిప్పుడు ! నువ్విం కాస్త పెందలాడే  వచ్చుంటే.. ఏ బై ఎలక్షన్ ప్రచారకమిటీలో  జిల్లాబాధ్యుడి కింద మండల బాధ్యుడిగా వేయుంచుండేవాణ్ణి గదరాజడవా!’ అనేసాడు బాబాయ్!
'పోనీ. కంట్రాక్టు పనులేమన్నా ఖాళీగా ఉన్నాయేమో.. అవన్నా చూడు బాబాయ్!' అనడిగాడు కామేశ్వరం.

'చేసిన పల్ల  బిల్లులకే చిల్లులబ్బీ  ఇప్పుడు! ఎర్రచందనం దుంగలు తరలించడం లాంటి దొంగ బిజినెస్లు దర్జాగానే  సాగాయిగాని మొన్నమొన్నటిదాకా. గవర్నమెంటు నిఘా మరీ గట్టి పడ్డాక .. ప్రాణాలమీద ఆశ వదులుకొంటే తప్ప  ఇట్లాంటి  కంట్రాక్టు పన్లకి దిగేందుకు లేదు.  మన కంత రిస్కు అవసరమా? అందునా  మీ నాన్నకి నువ్వొక్కడివే సుపుత్రుడివాయ!'

‘ఏదడిగినా మన సర్కోరోడికి  మల్లే ఏదేదో కథలు చెబుతున్నావేంది బాబాయ్? ఇహ నేను మాత్రం ఇక్కడ ఉండి ఊడబొడిచేదేముంది! నాన్నెట్లాగూ పిడిరాయిలా  దిట్టంగానే అరుగుతున్నాడాయ!' అంటూ వచ్చిన దారినే ఫ్లైటెక్కి   చక్కా చెక్కేసాడు కామేశ్వర్రావు.
(ఆశ -సచిత్రమాస పత్రిక ఆగష్టు 2011 సంచికలో ప్రచురితం

***

Thursday, June 11, 2015

Mahalia Jackson--How I got over LIVE


Mahalia Jackson live in Chicago a favorite of Dr. Martin Luther King Jr. Mahalia sang this at the march on washington just before King gave the I have a dream speech

Wednesday, June 10, 2015

పులుపు చావని చింత- కవితాగల్పిక








ఉదయం
మృత్యువుః
కవీ! నీ అంత్యకాలం సమీపించింది. పద. పోదాం!
కవిః
మృత్యువా?
అప్పుడే వచ్చావా!
ఇప్పుడే కదయ్యా 
ఉదయసుందరి సౌందర్య సందర్శన సౌభాగ్యం నాకు దక్కింది!
కొద్దిగానైనా వ్యవధానం ఇవ్వవా నువ్వు! మధ్యాహ్నం వస్తావా నువ్వు?








మధ్యాహ్నం
మృత్యువుః
నీ అభీష్టం మేరకే  వచ్చానయ్యా!
మరి పోదాం.. లే.. కవీ! సాకులు చెప్పకు!
కవిః
అప్పుడే వచ్చావా మిత్రమా!
ఇప్పుడేగదయ్యా  హిమావృత ఉదయరాగాలు చెదిరిపోయి
సృష్టి వైచిత్ర్యాలు ఒక్కొక్కటిగా తేటపడుతున్నవి.
ఈ విశాల వసుంధరా వలయంలోని వైపరీత్యాలన్నీ తృప్తిగా చూడనీ!
నీ ఆత్రం కూలా! చీకటి పడ్డాక కనబడవయ్యా మగడా!







సాయంకాలం
మృత్యువుః
సంధ్యాసమయం మీరిపోతుంది కవీ!
ఇకనైనా కాలు కదుపుతావా స్వామీ!
కవిః
అటు చూడు.. ఆ దిక్కున  ఎంత వెలుగున్నదో !
లోకమింకా మాటు మణగనేలేదు. తొందరేమి సామీ!
ప్రకృతి అంతా ఎంత వినూత్న శోభతో ప్రకాశిస్తున్నదీ!
ఇంత ప్రశాంతసమయాన్ని  వదిలి రమ్మనడం ధర్మమా!
పశ్చిమాద్రిపైన అరుణ దీధితులెలా లీలావిహారాలు సలుపుతున్నాయో!
ఆ ముచ్చటా తనివితీరా చూడనీయవయ్యా  చివరి సారి!
రాత్రికి రారాదా! తప్పక వస్తాను.








రాత్రి
మృత్యువుః
చీకటి పడింది.
కవితలు కట్టిపెట్టి  ఇకనన్నా కదిలి వస్తావా కవీ?
కవిః
ఇదిగో.. బైలుదేరుతున్నా!.
అవును. రాత్రి వచ్చి అంతా అంతమైపోయింది.
పాటలు పాడే పరభృతాలే మూగనోము పట్టాక,
వాస్తవ జగత్తు, ఆనందలోకం మొత్తం అంధకారబంధురమైపోయాక
నేను మాత్రం ఇక్కడ ఉండి చేసేదేముంది?
ఒక్క మనవి!
దూరాన్నుంచీ ఏవో  విలాసగీతాలు వినిపిస్తున్నాయి
ఆ దారిన  పొదామా నీ లోకానికి!
అయిన ఆలస్యం ఎటూ అయింది.. నీ పుణ్యముంటుంది!

***

కవికి ఏం కావాలి? కర్లపాలెం హనుమంత రావు





కవిత్వానికి నిర్వచనం ఏమిటి?

కవులెంతమందో కవిత్వానికి నిర్వచనాలన్ని. అదనంగా సాహిత్య విమర్శకుల శాస్త్రీయ నిర్వచానాలు.
The best in the best order is “Emotions recollected in Tranquility” అంటారు  శ్రీశ్రీ.
అల్లసాని పెద్దన గారి లెక్క ప్రకారం కవిత్వం”రాతిరియుం బవల్ మరపురాని హోరు”
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఒకసారి కవిత్వాన్ని గురించి అరగంట మాట్లాడతానని చెప్పి మధ్యాహ్నం 3గంటల్నుంచీ రాత్రి 8గంటలదాకా ఏకబిగిన ఉపన్యాసం చేశారుట. కవిత్వ పరిధి అంత విస్తృతమైనది మరి.
ప్రపంచమంతా కవితావస్తువే కదా!’ మరిచి పోయేది చెత్త.. జ్ఞాపకంలో మిగిలుండేది కవిత్వం’ అన్నది కూడా ఆయనే. లోకుల రసనలే తాటాకులుగా వేమన పద్యాలు తెలుగులోకంలో నేటికీ  నిలిచి వుండటమే దీనికి మంచి ఉదాహరణ.
శ్రీపాదకృష్ణమూర్తి గారు భారతం మొత్తాన్ని ఒంటిచేత్తో పద్యాలుగా రాశారు. చదివినంతసేపూ బాగానే ఉన్నా తిరిగి చెప్పమంటే ఒక్కటీ చప్పున గుర్తుకు రాలేదంటారు  శ్రీశ్రీ!
విలియమ్ సారోయిన్ ప్రఖ్యాత short story రచయిత. The Latest Position In Modern American Poetry అని శీర్షిక పెట్టి తనకు తోచినదంతా ఒక క్రమంలో కథగా రాసేవాడుట.కథ పూర్తయిన తరువాత ఆ శీర్షికను తీసేసి కథకు తగిన Title పెట్టుకోవడం ఆయన అలవాటు. కథకు కూడా పొయిట్రీనే ప్రేరణ అని చెప్పటానికి ఈ పిట్ట కథ చెప్పింది.

ఇక తెలుగు కవిత్వానికి వస్తే…
నన్నయగారు ఆదికవి అని మనందరి అభిప్రాయం. అంటే ఆయనకు ముందు కవిత్వం అసలే లేదా! ఉంది. జానపదుల ప్రపంచం నిండా ఉండేది కవిత్వమే. కాకపోతే అది గ్రంధస్థం అవడానికి నోచుకోలేదు. ఆ గాసటబీసటలు చదివి ప్రేరణ పొంది సంస్కరించి వాగనుశాసనుడయ్యాడు నన్నయభట్టారకుడు.
ప్రపంచం అంతటా ఈ ధోరణే ఉంది. కవిత్వం అంటే అక్షరబద్ధమైనదేనా! Haves poetry(కలవారి కవ్విత్వం) ఉన్నట్లే లేని వారికీ కవిత్వం ఉంటుంది. అది శిష్టసాహిత్యం కన్నా పాతది కూడా. నన్నయ గారికన్నా ముందు నదుల్లో నావలు నడుపుకునే వాళ్ళూ, పొలంపనులు చేసుకునే కూలీనాలీ పాటకజనం  నోట నలిగిందీ కవిత్వమే. మల్లంపల్లి సోమశేఖరశర్మగారి మాటల్లోఅది 'అనాఘ్రాత వాజ్ఞ్మయం’.

ఇంక ఆధునికతకు వస్తే…


గురుజాడగారు ముత్యాలసరాలు రాసిందాకా తెలుగుకవిత్వం ధర్మంలాగా పద్యాల్లో నాలుగు పాదాల మీదే కచ్చితంగా నడిచింది. చంపకమాలైనా.. శార్దూలమైనా రథవేగం సాధించాలంటే  నాలుగు చక్రాలే ఆధారం. అప్పటికి రథవేగం గొప్పది. రైలింజను వచ్చిన తరువాత Horse Power  గొప్పయింది. విమానాలు ఎగరడం మొదలయిన తరువాత వాయువేగం మీదే అందరి దృష్టి. ఇప్పుడయితే రాకెట్ వేగాన్ని కూడా అధిగమించే ఉపగ్రహాల వేగం తెలిసిందే. పెరిగే వేగాన్ని అందుకోవడానికి కవులకూ కొత్తకొత్త ప్రక్రియల్లో ప్రయోగాలు చేయడం అవసరం అయింది. నత్తనడకను చీదరించుకునే కొత్త తరాన్ని అందుకోవడానికి కవులు కనిపెట్టిన అతినవీన అద్భుతం అత్యంత వేగంగా పరుగులెత్తే వచన పద్యం.

తెలుగులొ 30వ దశకంలొ ఊపందుకున్న ఈ ప్రక్రియకు పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో అంతకుముందే వచ్చిన ప్రయోగాలు ప్రేరణ. 30వ దశకాన్ని Hungry Thirties అంటారు.ఇప్పటికన్నా ఎక్కువ ఆర్థికమాద్యం ముమ్మరించిన కాలం అది. స్పానిష్ సివిల్ వార్ జరిగింది  ఆ దశాబ్దంలోనే. ప్రపంచమేధావులు మొత్తం రెండువర్గాలుగా చీలిన  పరిస్థితి. స్పానిష్ యుద్ధాన్ని ఖండిచిన వాళ్ళు కాగితాలతో కలాలతో పోరాటం మొదలుపెట్టారు. రాల్స్ ఫాక్స్ , క్రిస్ట్ ఫర్, కాండ్ వెల్, స్టీఫెన్ స్పెండర్ లాంటి కవులైతే ఏకంగా ఇంటర్నేషనల్ ఆర్మీలోనే చేరిపోయారు. 'కవి అన్నవాడు కల్లోలప్రపంచానికి దూరంగా కళ్ళుమూసుకుని కూర్చోనుండరాదు’ అన్న భావానికి ఊతం పెరుగుతున్న రోజులు అవి. ఆ ప్రభావంతోనే శ్రీశ్రీ లాంటి ఉష్ణరక్తపు యువకులు అంతకు ముందుదాకా రాస్తున్న సాంప్రదాయక కవిత్వాన్ని కాదని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని చాలా గీతాలు 30వ దశకంలో రాసినవే. గమనించండి. భావకవిత్వ ప్రచారకుడు కృష్ణశాస్త్రి కూడా అభ్యుదయ రచయితల సంఘ వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహించారు ఆ రోజుల్లో ఒకసారి.

1970దాకా ఒక వెలుగు వెలిగింది అభ్యుదయ కవిత్వం. నూనె ఐపోయిందో.. వత్తి సారం  తగ్గిందో.. మెల్లిగా కొడిగట్టడం మొదలుపెట్టింది.
శ్రీకాకుళోద్యమం ప్రేరణతో విప్లవ కవిత్వం ప్రభ మొదలయింది.
1910 లో తోకచుక్క రాలినప్పుడు గురుజాడవారు మొదలు పెట్టిన ముత్యాలసరాలు లగాయితు కవిత్వం ఇప్పటిదాకా పోయిన.. పోతున్న వన్నె చిన్నెలన్నీ చర్చించడం ఇక్కడ అప్రస్తుతం. ఇప్పుడు నడుస్తున్న కవిత్వానికి  మాత్రం  అస్తిత్వవాద, వైయక్తివాదాదులే ప్రధాన భూమికలుగా ఉన్నాయన్న ఒక్క మాటతో స్వస్తి చెప్పుకుంటే సరిపోతుంది.
వరదపోటులాగా వచ్చిపడుతోంది కవిత్వం ఇప్పుడన్ని దిక్కుల్నించీ. చందోబంధనాలు, వ్యాకరణాల సంకెళ్ళు వంటి ప్రతిబంధకాలు లేకపోవడం.. భాషాసారళ్యం వల్ల ఎంత సున్నితమైన భావాన్నయినా కవిత్వరీకరించవచ్చన్న స్పృహ పెరగడం, ప్రపంచీకరణ, అధునాతన సాంకేతిక విజ్ఞానప్రగతి,  సంక్షుభిత సామాజిక పరిస్థితులు, గణనీయంగా పెరుగుతున్న చదువరుల సంఖ్యాపరిమాణాలు, ఆత్మగౌరవ ఆకాంక్షలు, అపరిమితమైన భావవ్యక్తీకరణ స్వేచ్చ నేటి కవిత్వవికాసానికి కొన్ని ప్రధాన ప్రేరణలు, కారణాలు.
కవిత్వం పెరగడం సంతోషించదగ్గ పరిణామమే. మరి ప్రమాణాల సంగతి? వరదంటూ వచ్చిన తరువాత మంచినీటితో పాటు మురుగునీరూ కలిసి ప్రవహించడం సహజమేగా! కొంతకాలానికి తేటనీరు పైకి తేరుకొని.. రొచ్చు అడుగున మిగిలిపోతుందనుకోండి. కాకపోతే మడ్డినీరే ఎక్కువగా కలిస్తే మంచినీరూ ఉపయోగించకుండా వృథా ఐపోతుంది. అదీ బాధ.
ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే..  అక్షరం అందుబాటులో ఉన్న ఉచిత వనరు కనక కనిపించిన ప్రతిసన్నివేశమూ, అనిపించిన ప్రతి భావావేశమూ ఔత్సాహిక కవులు కవితాలంకరణకు అర్హమైనదే అనుకునే ప్రమాదమూ పెరిగిపోయింది. విస్తృతమైన అధ్యయనం, సమాజాన్ని సరైన కోణంలో పరిశీలిస్తున్నామా లేదా అన్న విచక్షణ, వ్యక్తిగతమైన భావోద్వేగాల పరిమితుల స్పృహ కొరబడుతుండటం వల్ల అకవిత్వమూ కవిత్వం పంక్తిలోకి జొరబడుతున్నది. వచనకవిత అంటే వచనాన్నే కవితగా అనుకుని రాయడం కాదు. అలంకారరహితం అంటే.. నిరలంకారంగా రాసుకుపోవడం కాదు. వట్టి స్లోగన్సు కవిత్వం ఎన్నటికీ కాదు.. వాటి వెనుక ఒక తాత్వికనేపథ్యం లేకపోతే. ‘Workers Of The World..Unite!' శ్రామిక వర్గం మొత్తాన్ని ఏకం చేసిన విప్లవ నాదం. కవిత్వానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపించింది. స్పెయినీష్ బార్శిలూనా సమరంలో’లాషాపనారా' (ముందుకడుగు వేయనీయం)అన్న స్పెయినీష్ సోల్జర్ల నినాదం ఆనాటి సమాజంమీద  చూపించిన  ప్రభావం అంతా ఇంతా కాదు.  పదమా?..నినాదమా? అన్నది ప్రధానం కాదు. అది కవిహృదయంలోని రసానుభూతిలో  మగ్గి బాహ్యప్రపంచాన్ని కదిలించేదై  ఉండాలి. ‘కదిలేదీ కదిలించేదీ/ పెనునిద్దుర వదిలించేదీ’ అని అతిసరళంగా శ్రీశ్రీ నిర్వచించింది  ఈ భావాన్నే!
కవికి తన మాట మీద అధికారం ఉండాలి. చిత్రకారుడికి గీతలాగా, సంగీతవేత్తకు స్వరంలాగా,శిల్పికి శిలలాగా కవికి పలుకు పరికరం. పికాసో అంతటి చిత్రకారుడు ’Probably I am not an Artist.. I am not a Painter.. I am a Draftsman’ అని చెప్పుకున్నాడు. కళాకారుడికి ముందు తనను గూర్చి తనకు ఒక కచ్చితమైన అంచనా అవసరం. కవీ కళాకారుడే కదా!
పోతన.. శ్రీనాథులే ఇందుకు మనముందున్న  మంచి ఉదాహరణలు. ’మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు వోవునే మదనములకు?’ అన్న పోతన మంచిపద్యం వినడానికీ వీనులవిందుగానే ఉంటుంది. కానీ.. కవిత్వకోణం దృష్ట్యా చూస్తే మాత్రం ముందు వచ్చే సందేహం.. ’కవి మాటలను నడిపిస్తున్నాడా?.. మాటలు కవిని నడిపిస్తున్నాయా?’ అని. శ్రీనాథుడి శివరాత్రిమాహాత్మ్యం పద్యం చూడండిః ‘నిష్ఠాసంపదనర్ఘ్యపాణులగుచున్ విపుల్ బ్రశంసింప, మంజిష్ఠారాగము మండలంబున నధిష్ఠింపన్ నిలింపాది భూకాష్ఠా మధ్యంబున తోచెన్/శతాంగాభ్రష్ఠ సర్పద్విష జ్యేష్టుండప్పుడు నిష్టుర ప్రసర బంహిష్ఠద్యుతిశ్రేష్ఠతన్' (తూర్పుదిక్కున అనూరుడు వెలిగాడు-అని అర్థం) అర్థం గురించి కాదు ఇక్కడ చెబుతున్నది. ఛందోనియమం ప్రకారం ప్రాసస్థానంలో నాలుగు చోట్ల 'ష్ఠ' వస్తే చాలు. కానీ శ్రీనాథుడు ష కింద ‘ఠ’ వత్తు పెట్టి ఎన్నెన్ని మెలికలు తిప్పాడో చూడండి! భాషమీద అధికారం గలవాడు మాత్రమే చేయగల గడసాము అది. అంతటి అధికారం ఉన్నప్పుడు అక్షరం చేత ఎంతటి ఊడిగం ఐనా చేయించుకోవచ్చు. విస్తృతమైన పఠనం, గాఢమైన అనురక్తి, సునిశితమైన పరిశీలనాశక్తి.. ఎంచుకున్న ప్రక్రియమీద సరైన అవగాహన అభివృద్ధి పరుచుకున్న వారెవరైనా పదికాలాల పాటు జనం గుండెల్లొ పదిలంగా నిలిచిపోయే విలక్షణమైన కవిత్వం సలక్షణంగా రాయవచ్చు.
శ్రీశ్రీ గారు చెప్పిన ఒక జోకే చెప్పి ముగిస్తాను. మద్రాసు మీనంబాకం ఏరోడ్రోములో ఇద్దరు పల్లెటూరి బైతులు మొదటిసారి బోయింగ్ విమానాన్ని చూసి గుండెలు బాదేసుకున్నారుట. అందులో పెద్దవాడికి ముందుగా వచ్చిన సందేహం ‘ఇంత భారీ బండికి పెయింట్ వేయాలంటే ఎంత తెల్లరంగు కావాలీ! రంగున్నా వెయ్యడం ఎట్లాఎంత శ్రమా? ఎంత టైము వృథా?’ అని. రెండోవాడు దానికిచ్చిన సమాధానం మరీ విడ్డూరంగా ఉంది. ’అందుకేనేమో మామా! విమానం ఆకాశంలో ఉన్నప్పుడు అక్కడికెళ్ళి వేస్తారనుకుంటా! అప్పుడయితే బుల్లిపిట్టంతే కదా ఉండేదీ!’
ఈ జోకు వినంగానే ముందు మనకు నవ్వొస్తుంది. నిజమే కానీ.. నిజానికి.. కవిత్వతత్త్వసారం మొత్తం ఆ బైతు ఒక్క ముక్కలో తేల్చేశాడు. విశాలవిశ్వాన్ని కళ  (మన దృష్టిలో ఇక్కడ కవిత్వం)  తన పనితనంతో కళకళ లాడించాలంటే కళాకారుడు బాహ్యప్రపంచాన్ని   తన అంతరంగాకాశంలో  ఎగరేయాలి.
అంతరంగాకాశంలో విహారవిన్యాసం మరో పేరే కవిత్వం. ఎంత ఎత్తు ఎగరగలిగితే అంత గొప్ప కవిత్వం దర్సనమిస్తుంది. రెక్కలు విప్పుకోవడమే కాదు.. వడుపుగా వాటిని కదపడమూ పట్టు బడాలి. పట్టు చిక్కే దాకా సాధన చేయాలి. అలాంటి సాధన విజయవంతంగా చేసినందుకే ఇవాళ మనం ఒకశ్రీశ్రీని, ఒకవిశ్వనాథని ఉదాహరణగా  చెప్పుకుంటున్నాం.
***





Tuesday, June 9, 2015

కత్తెర- సరదా కథ



కామేశ్వర్రావు గొప్ప రచయిత. అది కామేశ్వర్రావు అభిప్రాయం.
నవల, నాటకం, కథ, గల్పిక, కవిత, వ్యాసం.. ఒక అంశమనేమిటి?  ప్రాచీన సాహిత్యంనుండి.. ఆధునికాంతర అస్తిత్వవాదం వరకు.. అతగాడు చేయని  నాదం లేదు. అదృష్టమేమంటే అతడు రాసిన ఒక్క ముక్కా ఇంతవరకు వెలుతురు ముఖం  చూడకపోవడం. దురదృష్టం ఏమంటే అతగాడు గొడ్డు  కార్యశూరుడు కావడం. 
ఎలాగైనా సరే అచ్చులో తన పేరు చూసుకొనే తీరాలని  శపథం పట్టి ఉన్నాడు మహానుభావుడు!
అప్పటికీ అతగాడి అచ్చుముచ్చట ముచ్చటగా మూడుసార్లు తీర్చనే తీర్చాడు పైనున్న భగవంతుడు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించడం మొదటిసారి తీర్చిన ముచ్చట. పెళ్లి శుభలేఖలో వరుడిగా పేరచ్చేయించడం రెండోసారి తీర్చిన ముచ్చట.  ఆ మధ్య ఆంధ్రాబ్యాంకు వాళ్ళు బంగారంమీద లోనుతీసి పంగనామం పెట్టిన మొండిబకాయిదారుల జాబితా ఓటి నోటీసులాగా పత్రికల్లో ప్రకటించారు. అందులో  కామేశ్వర్రావుపేరూ అచ్చయేటట్లు చూసి ముచ్చటగా మూడోసారి అతగాడి అచ్చుముచ్చట తీర్చాడు భగవంతుడు. అయినా కామేశ్వర్రావు  అచ్చుదాహార్తి అంతటితో తీరింది కాదు. అతగాడికి  కావాల్సింది రచయితగా.. ప్రముఖ పత్రికలో..  ధారావాహికంగా పేరు అచ్చులో కావడం! 
ఆ ధ్యేయంకోసం కామేశ్వర్రావు దాడిచేయని పత్రిక  లేదు ఆంధ్రదేశంలో. చందమామనుంచి చతురవరకు ఓ పట్టు పట్టాడు. పడుతూనే ఉన్నాడు. అతగాడి పోటుకు తట్టుకోలేక కొన్ని పత్రికలు కొట్టు కట్టేసాయి కూడా.అయినా  దిన, వార, పక్ష, మాస, ద్వైమాసిక, త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక సంచికలు వేటినీ అతను వదిలి పెట్టింది లేదు. అదేం చిత్రమో! అన్ని పత్రికలదీ అతని రచనలమీద  ఒకటే అభిప్రాయం. కూడబలుక్కొన్నట్లు అందరూ తిరుగుటపాలో అతని రచనలు తిప్పి పంపేస్తుంటారు! ఆ వీధి పోస్టుమేన్ అతని తిరిగి వచ్చే రచనలు మోయలేకే టపా కట్టేసాడని వినికిడి.
కొత్త పత్రిక ఒకటి వస్తున్నదన్న ప్రకటన ఒకటి వెలువడిందీ సారి. వెంటనే కామేశ్వర్రావు ఒక టన్ను బరువున్న నవల గీకిపారేసి ఆ పత్రిక్కి పంపించేసాడు. దానితో పాటు ఒక ఉత్తరంకూడ జత చేసాడు. 'ఆంధ్రసాహిత్యాన్ని కాచివడబోసి చేసిన బృహత్ప్రయత్నం ఈ నవలారాజం. దీన్ని  ప్రచురించుకొనే మొదటి అవకాశం మీ పత్రికకే ప్రసాదిస్తున్నాను. స్థలాభావమే కారణమైతే సంకోచించనవసరం లేదు.  కత్తిరించుకొనే స్వేచ్చ  మీకు ధరాదత్తం చేస్తున్నాను..' ఆవటా అని.
వారం రోజులతరువాత పోస్టుమాన్ ఓ బండిల్తో వచ్చి   కామేశ్వర్రావు ఇంటరుగుమీద కూలిపోయాడు. బండిలు విప్పి చూసాడు కామేశ్వర్రావు. అందులో ఒక ఉత్తరం! పత్రిక సంపాదకులనుంచే!
'అయ్యా! మీ నవలను పరిశీలించడం జరిగింది.. కత్తిరించే స్వేచ్చను ధారాదత్తం చేసినందుకు బహుథా  కృతజ్ఞతలు. సమయాభావంచేత మేమా సత్కార్యం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. మీరే స్వయంగా  ఆ ఘనకార్యం చేసుకోగలరని విన్నపం. వీలుగా మా పత్రిక తరుఫునుంచి మీకు  ఒక కత్తెర బహుమానంగా పంపుతున్నాం!
ఇట్లు 
సంపాదకుడు.
***
-కర్లపాలెం హనుమంతరావు

చతుర కథలు- చతుర- సెప్టేంబరు 2000

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...