Monday, February 24, 2020

చురుక్కులు- కర్లపాలెం హనుమంతరావు


బొగ్గు మంటతో
కాగ్ తోంది
దేశం

***

బొగ్గు ఇనుము బాక్షైట్
రత్న గర్భ నాదేశం
గర్భాదానమే 
అక్రమంగా జరిగిపొయింది
***
2-జీ ఒక ‘వేలం’ వెర్రి
‘బొగ్గు’ 
ఆ వేలం కూడా లేని వెర్రి

***

బొమ్మ న్యాయం
బొరుసు అన్యాయం
రెండూ బొరుసులే ఉన్న నాణెం
-రాజకీయం

***

నల్లధనం-
ఏ కనిపించని నాలుగో సింహం
నోట్లోనో!

***

మంత్రివర్యా… తిన్నంగుండు
తప్పుతుంది
తిరుపతి గుండు!

***

రైతు దేశానికి వెన్నెముక…
సరే!
వెన్నెముక లేని 
పాలనా మనది?

***

నెలలు నిండకమునుపే
బడికడుపు నుండి బయటకొచ్చేస్తున్నాడు
ప్రీమెచ్యూర్ డ్ బుడతడు!

***

ఓబులాపురం గనుల కేసు-
'గాలి'తో చేసే యుద్ధం 

***

జెడి కాల్ లిస్ట్ కేసులో
తత్కాల్ బుక్ చేసుకున్నాడు
వెంకట రెడ్డి!

***

వాన కావాలా!
వరుణయాగం ఎందుకు
ఉప్పల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడించు!

***

విద్యుత్
రిలయన్స్ గాలికి పెట్టిన దీపం!

***

కరువు వల్ల భక్తుల రాక తగ్గింది
వర్షాల కోసం దేవుడూ
ప్రార్థిస్తున్నాడు!

***

తివిరి
ఇసుమునా
'తైలంబు' తీయవచ్చు!

()()()


-కర్లపాలెం హనుమంతరావు
30-08-2012

Saturday, February 22, 2020

సరదాకేః గందరగోళం జమానా -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ప్రచురితం




'మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
 మాతృ భాష యొండు మాన్యము గదా
 మాతృ శబ్దము విన మది పులకింపదా?
 వినుత ధర్మశీల తెనుగు బాల' ఈ పద్యం ప్రత్యేకత రచన చేసిన కవి ఒక ముస్లిమ్ మతానుయాయుడు కావడం. ఇది   'తెనుగుబాల' శతకంలోని ఒక నీతి పద్యం, రాసింది ముహమ్మద్‌ హుస్సేన్‌ .

పేర్లు ప్రత్యేకంగా చెప్పకపోతే  తెలుగు కవుల సృజనే అని మురిపించే సాహిత్యం  తెలుగునాళ్లల్లో ముస్లిం కవులు, రచయితలు  కొంత సృష్టించిన మాట నిజం. 

వినుకొండ వల్లభరాయుడి 'క్రీడాభిరామం' తలలేని రేణుకాదేవి విగ్రహం ముందు నాటి వెలివాడ ఆడపడుచులు నిర్వస్త్రంగా వీరనృత్యాలు చేయడం  అత్యద్భుతంగా వర్ణించింది. అదే పంథాలో అజ్మతుల్లా సయ్యద్ అనే ఓ ముసల్మాన్ కని దేవరకొండలో జరిగే జాతర దృశ్యాలను నాటి సాంఘిక పరిస్థితులు కళ్లకు కట్టేవిధంగా వర్ణించారు. సర్కారు ప్రకటిత జాగాలో జరిగే సంతలో  డబ్బున్న మహిళలు రకరకాల వస్త్రవిశేషాలు సందడిగా కొనుగోలు చేయడం దమ్మిడీ చేత లేని లంబాడీ ఆడంగులకు దుఃఖం కలిగిస్తుంది. ధనికమహిళల నవ్వులకు  ఉడుక్కుంటూ 'మాకీ జూసి నగ్తర్/మీకీ తలిదండ్రి లేవె మీ నే తు/ప్పాకీ తీస్కొని కొడ్తే/మాకీ పాపంబిలేద్రె..'అంటూ  ఆ బీద  లంబాడీ బిడ్డలు పోయే  షష్టాష్టకాలకు నవ్వూ వస్తుంది.   ఆనక  మనసుకు కష్టమూ అనిపిస్తుంది. తమ మతస్తులను అన్యమతానుయాయులు అన్యాయంగా అవహేళన చేసే అవలక్షణానికి అన్యాపదేశంగా కవి ప్రకటించే నిరసన అది. నిజానికి నిత్య వ్యవహారంలో తెలుగు నేలల మీద.. ముఖ్యంగా దక్షిణాదిన ఏ ముస్లిమ్ మతస్తుడూ ఆ తరహా వెకిలి యాసతో మాట్లాడడు. మాటలో కొంత తేడా ఉన్నా అది భాషాభేదం వల్ల కాదు; సంస్కృతుల మధ్య ఉండే సన్నని తారతమ్యపు తెర అడ్డు వల్ల!

తెలుగు మాగాణులల్లో శతాబ్దాల బట్టి తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలలో పాలలో తేనెలా కలగలసిపోయిన ఘనత ముస్లిములది. నల్లగొండ జిల్లా చిత్తలూరు గ్రామానికి చెందిన ఇమామల్లీ సాహెబ్ అని ఒక కవిగారికి కులమతాలనే వివక్ష లేదు. కవి అని తనకు తోచిన ప్రతీ సాహిత్యజీవికి అంతో ఇంతో సాయంచేసే సద్బుద్ధి ఆయనది. సాటి హిందూ కవి ఎవరో  సాహెబుగారి ఔదార్యాన్ని 'అల్లాతుంకు సదా యతుం సె ఖుదచ్ఛచ్ఛాహి ఫాజత్కరే/ఖుల్లాహాతుగరీబు పర్వరినిగా ఖూబస్తునాం మైసునే/అల్లాదేనె మవాఫికస్తుహర్ దూస్రే కోయి నైహై ఇమా/ మల్లీ సాహెబ్ చిత్తలూరి పుర వాహ్వా దోయిలందార్బలా ' అంటూ  ఉర్దూ మిశ్రిత ఆంధ్రంలో ఛందోబద్ధంగా శ్లాఘిస్తాడు.

ఆచార్య తూమాటి దోణప్పగారు ‘జానపదకళాసంపద’ ప్రకారం తెలుగులో తమకు కావలసిన సాహిత్యం తామే సృష్టించుకున్న ఘనత జనపదాల ముస్లిం జాతిది. ఉరుదూమయంగా ఉండే భాషాగీతికలను తెలుగు లిపిలో రాసుకుని కొరాను సమీప భాషలో పాడినట్లు తృప్తిపొందడం ఉండేది ఒకప్పుడు.ఈ ఝంఝాటమంతా ఎందుకని ఏకంగా తెలుగులోనే అల్లాకు ప్రార్థనలు సలిపే సాహిత్యం సృష్టించుకున్నారు ముస్లిం జనపదులు.

బ్రౌను దొర ఎన్నో తెలుగు సాహిత్య గ్రంథాలను మహమ్మదీయల నుంచే సేకరించారు. ‘రసికజనమనోభిరామం’ అనే కావ్యాన్ని శేబు మహమ్మదు సాహెబు ప్రతిని అనుసరించి రాయించుకున్నారు బ్రౌన్ దొర.శృంగార నైషధం ఎనిమిది ఆశ్వాసాలు’ ఆ సాహెబుగారి గ్రంథాలయం నుంచే  దొర సేకరించింది! బనగానపల్లి నవాబులకు హిందూమతమంటే ఆదరం. తెలుగు సాహిత్యాన్ని ఇష్టంగా పోషించారు. 'వాలిన సిద్ధేంద్రస్వామిని కృప/నేలిన వైకుంఠదాముని/ కేలికి రమ్మాని కిటుకపరచి మందు/లాలించి పతికి తాంబూలముతో బెట్టె' అంటూ ఒక భామాకలాపం 'మందులపట్టు' దరువులో సిద్ధేంద్రయోగి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ సిద్ధయోగీంద్రుడి 'సిద్ధయోగీశ్వర విలాసము' ద్విపద కావ్యం రచనకు ప్రోత్సాహం లభించింది ఆ ఇలాకా జాగీర్దారు భ్రాజత్ ఖాన్  నుంచే.

జమీందారి యుగంలో కొందరు తెలుగు ముస్లిములు శిష్టసాహిత్యం సృష్టి చేసారు. ధారాళమైన ధారలో ‘ఉమర్ ఖయ్యాం -ఈశ్వరుడు’ పేరుతో వ్యాసం రాసిన పిఠాపురం  మతగురువులు ఉమర్ ఆలీషా  విస్తృతమైన తెలుగు సాహిత్యం సృష్టించారు. షేక్ మౌలా మున్షీ 'నీతి వాక్య రత్నాకరం'  చింతామణి పత్రికలో  ప్రచురితమయింది. ‘సత్యాన్వేషి’ పత్రిక పెట్టి జుజులుల్లా సాహెబు కొంతకాలం ప్రచురించిన ఖండన వ్యాసాలు 1892 ప్ర్రాంతాలలో తీవ్ర  వివాదాలకు దారితీసాయి. ‘పారశీక వాజ్ఞ్మయమచరిత్ర’ను మూడు భాగాలలో భారతి - 1932 నాటి సంచికలలో ప్రచురించిన మొహమ్మద్ ఖాసిం ఖాన్ గారికి శ్రీ శ్రీ, పురిపండా, అబ్బూరి వంటి తెలుగు ప్రముఖలతో సన్నిహిత  సాహిత్య బంధం కొనసాగింది. ‘ఓరుగల్లు చరిత్ర’ రచయిత సాహెబ్ అహమదల్లీ,  హైదరాబాద్ తెలుగు సాహిత్య అకాడమీ అధ్యక్షపీఠ మెక్కిన అళ్ హజ్ మహమ్మద్ జైనుల్ అబెదీన్,  అరబ్ నివాసులుహిందువులా?’ అంటూ 1938,జూలై నాడే భారతిలో చర్చ చేసిన మౌల్వీ షాజిక్, ‘తౌహిద్ కా రవుషన్’ పేరుతో సర్వమతసార సంగ్రహంలో విస్తారంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ఆచార వ్యవహారాలను, ప్రార్థనాది కర్మకాండలతో సహా వివరించిన షేక్ మీరా జాన్.. ఇలా ఎందరో తెలుగు సాహిత్యానికి సేవలందించిన ముస్లిం మహానుభావులు!



మెహబూబ్ నగర్ జిల్లా మొదటి పేరు పాలమూరు జిల్లా. కరువుకాటకాలకు ఆ జిల్లా మారుపేరు. పనిపాటలు చేసుకుని పొట్టపోసుకునే శ్రామికజీవులు అధికంగా ఉండేదీ అక్కడే! అనావృష్టి పరిస్థితుల కారణంగా కూలీ నాలీ జనం తరచూ వలసబాట పట్టే దుర్భిక్ష స్థితులకు కదలిపోయి 'తూఫాను వానలే తుదికి గతియాయె/ ఋతుపవనాలెల్ల గతిని దప్పె/ చెఱువులు కుంటలు దొరువులు జాలులు/ఇంకి నెఱ్ఱెలు వారె బంకమట్టి/వర్షాలు కురియక కర్షకులెల్లరు/ బ్రదుకుదెరువు బాసి బాధపడుచు/గొడ్డు గోదముల నెల్ల గడ్డి గాదెము లేక/దుడ్డుదమ్మిడికమ్మి దుఃఖపడుచు/లేబరై గుంపుగుంపుగ లేవసాగె/తాళములు వేసి ఇళ్లకు తల్లెచెంబు/కుదువబెట్టుచు కూటికై వదలి రిపుడు/పల్లెలెల్ల లబోమని తల్లడిల్లె' అంటూ పుట్టెడు ధుఃఖంతో పుట్టిన ఊళ్లను తలుచుకుని  జహంగీర్ మహమ్మద్ అనే ముస్లిం కవి భోరుమన్నారు.  ఏ ముస్లిమేతర కవి ప్రతిభ ముందు తక్కువ తూగదు జహంగీర్ సాహెబ్ తెలుగు పలుకుబడి.

ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య సంపుటాలలో పేర్కొన్నట్లు తెలుగు నాళ్లలో ముస్లిములు సంఖ్యాపరంగా కూడా తక్కువేమీ కాదు. ఇస్లాం, అరబ్బీ, దక్కనీ, పారసీ పదాలతో తెలుగుభాష ఆదానప్రదానాలు సుసంపన్నమయిన తీరు అపూర్వం. కుంపిణీ పాలనకు ముందు తెలుగువారి రాతకోతల్లో  పాలలో నీళ్లలా ఉర్దూ, పారశీక పదాలు ఎన్నో వాడుకభాషలో కలగలసిపోయాయి. ఇంగ్లీషు పాలకులకూ పాలనాపరిభాషగా ఉర్దూ, పారశీ పదాలే అందుబాటులో ఉన్న పరిస్థితి ఒకప్పటిది. దక్కను ప్రాంతంలో తెలుగువారు చాలా దశాబ్దాల దాకా  ఉర్దూ మాద్యమంలోనే విద్యాభ్యాసం చేసిన కాలం కద్దు. విద్యాధికులైన తెలుగువారి కారణంగా కొంత  ఉర్దూ సాహిత్యం వర్ధిల్లింది! కానీ అచ్చంగా ముస్లిముల మూలకంగా తెలుగు సాహిత్యం ఆ  జనాభా దామాషాలో వృద్ధిచెందింది కాదు. పరిశోధకులు మరింత లోతుగా  పరిశీలించవలసిన అంశమిది.

దక్షిణాంధ్రం  చూస్తే  ముస్లిం జనాభాలో అధిక శాతానికి ఉర్దూ పలుకు నోటి వరకే పరిమితం. రాయడం దగ్గరకొచ్చేసరికే ముస్లిముల పాత్ర బహు స్వల్పం! తెలుగు సంస్కృతితో గట్టి అనుబంధం ఉన్నప్పటికీ వాజ్ఞ్మయంలో   ఆ మేరకు బంధం ఎందువల్ల బలపడింది కాదో?

ఈ సాధారణ సూత్రానికి మినహాయింపుగా ముస్లిం కవులు తెలుగులో కొంత సాహిత్య సృజన చేసిన మాట బొత్తిగా కొట్టిపారవేయలేం. రాసిలో కాకపోయినా వాసిలో తెలుగు  సాహిత్యంతో పోటీకి దిగగల సత్తా ఉర్దూ సాహిత్యానికి ఉంది. మరుగున పడ్డ ముస్లిం కవులను గురించి  మరుపూరు కోదండరామరెడ్డిగారు మరువలేని అంశాలు కొన్ని ప్రస్తావించారు.  దావూద్  అనే ఇస్లామిక్ కవి 'దాసీ పన్నా'  ఖండిక దొరకబుచ్చుకుని చదువుకునే దొరబాబులకు ముస్లిం కవులు సాహిత్య సృష్టిలో ఒక్క ఆలోచనాధారలో తప్ప తతిమ్మా అన్నింటా సమవుజ్జీలేనని ఒప్పుకోక తప్పదు.  రాజపుత్రుడి రక్షణ కోసం, పన్నా తన పుత్రుణ్ని బలికానిచ్చింది. ఆమె త్యాగం గొప్పతనాన్ని శ్లాఘిస్తూ దావూద్ హుస్సేస్ సాహెబ్  రాసిన కవిత ఎంతో కరుణరసాత్మకంగా సాగుతుంది. 'సతత వాత్సల్యంబు జాల్వార్చి పోషింప/ తలపు గొన్నట్టి నీ తల్లిలేదు/ అఖిలార్ద్రతను నీకు నర్పించి/ మమతలం/ దలడిల్లునట్టి నీతండ్రిలేడు/ఆత్మరక్తమై తమ్ముడంచు మించిన ప్రేమ/నరసి పాలింప నీ అన్నలేడు/ రాజపుత్రుడితండు రక్షణార్హుడటంచు/ పరికించు పాలిత ప్రజయు లేదు/ దిక్కుదెసగలవాడవై దిక్కుగనక/శోకసంతప్త భావనిస్తులత తోడ/ శత్రువుల మధ్య జిక్కిన సాంగపుత్ర/ నిన్ను పన్నాయె రక్షించు నిక్కమింక!'   అంటారు కవి. బలి అయిపోయిన  ఆ అభాగ్య బాలుడిని అడిగితే ఏమని ఉండేవాడు? అని ఆయనే మానవతా హృదయంతో కంపించిపోతూ ప్రశ్నించుకుంటూ ఆ మృతబాలుడి మనోభావాలనూ కవిగా తానే వెల్లడిస్తాడు'మీ మీ స్వార్థాల కోసరంగా నోరులేని నన్ను బలిచేశార'ని  వాదించడా? అని నిలదీస్తాడేమోనని సందేహిస్తాడు. మానవత్వం సహజ లక్షణంగా లేని వ్యక్తులకు ఈ తరహా విశాల భావనలు మదిలో మెదిలే అవకాశమే ఉండదు.  దావూద్  సాహెబ్ కవి ముస్లిం మతానుయాయుడు అయినంత మాత్రాన మనసులో ఉండవలసిన అనుకంపన లోపించిందా? సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి ఆశ్రయంలో  విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే సమయానికి దావూద్ సాహేబు ఒక  ఆడపిల్ల తండ్రి! ‘సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నందుకు రాళ్ల దెబ్బకు సిద్ధంగా ఉండమ'మని ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనుకంజ వేయని దుర్భావారి నిర్భీతి ఇప్పుడు ఎంత మందికి ఆదర్శం? సంస్కృతాంధ్రాలలో మదరాసు విశ్వవిద్యాలయం  విద్వాన్ పట్టా పుచ్చుకుని  నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరి మొదటి నెల జీతం గురుదక్షిణ కింద మనియార్డరుగా దావూద్ సాహెబు పంపిస్తే 'నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దుర్భావారు మురిసిపోయారు.  మానవతా విలువలకు మతాలను అడ్డుపెట్టుకుని వ్యాఖ్యానించడం ఎంత పెద్ద తప్పో ఈ మాదిరి సంఘటనలు ఇంకెన్ని ఈ దేశానికి  పాఠాలై బోధించాలో?



పుట్టింది ముస్లిం సంప్రదాయం అనుసరించే కుటుంబాలలోనే  అయినా.. దావూద్ సాహెబులా ఇస్లాం సంప్రదాయంలో నాని, హిందూ వేదాంతంలో ఊరిన ఎందరో ముసల్మాన్ కవులు చరిత్ర విస్మృతి పొరల్లోకి జారిపోయినట్లు మరుపూరివారు వాపోతారు.



జాతుల పరంగానే భారతీయతకు గుర్తింపు అనడం పెడవాదన అవుతుంది.    ఇప్పుడు దేశమంతటా ఆ తరహా భావజాలమే విచ్చలవిడిగా పులుముడుకు గురవుతున్నది.  ఆ దురాలోచనను ప్రశ్నించే సామాజిక హిత చింతనాపరుల పైనా దేశద్రోహం అభియోగం రుద్దే జుగుప్సాకరమైన ప్రయత్నమూ యధేచ్చగా సాగుతున్నది! అదే ఆందోళనకరం!

ఇస్లాం మతాన్ని విశ్వసించే  సాహిత్య స్రష్టలు సృష్టించినవిగా  చెప్పుకునే తెలుగు శతకాలే సుమారు మూడు పదులు  వికీపీడియాలో కనిపిస్తున్నాయి. ఆ జాబితా ఆసాంతం  పరిశీలించినా హిందూ కవుల ధోరణిలోనే ముసల్మాను కవులూ శతక సాహిత్యంలో తమకు సుపరిచితమైన  భక్తి, తాత్విక విశేషాలనే ప్రబోధాత్మక రీతిలో ప్రకటించినట్లు స్పష్టమవుతుంది.

పదహారణాల తెలుగు కవుల ముగ్గురు (బత్తలపల్లి నరసింగరావు, మేడవరము సుబ్రహ్మణ్యశర్మ, ఖాద్రి నరసింహ సోదరులు) చేతుల మీదుగా రూపుదిద్దుకున్న శతకం 'భక్త కల్పద్రుమ శతకము’. అదే పేరుతో హుస్సేన్ కవి రచించిన శతకమూ వాటికి వాసిలో అణుమాత్రం తీసిపోనిది.    దారిలోనే సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌ అనే కవి 'సయ్యదయ్యమాట సత్యమయ్య' మకుటంతో, గంగన్నవల్లి హుస్సేన్‌దాసు 'ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య'  మకుటంతో శతక సాహిత్యం సృష్టించారు. తక్కల్లపల్లి పాపాసాహెబ్‌ కవి మతవిభేదాలను విమర్శిస్తూ 'వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట' అంటూ సుద్ది చెప్పారు. షేక్‌ ఖాసిం 'సాధుశీల శతకము'లో  'కులము మతముగాదు గుణము ప్రధానంబు/ దైవచింత లేమి తపముగాదు/, బాలయోగి కులము పంచమ కులమయా,/ సాధులోకపాల సత్యశీల' అంటూ నేటి కాలానికి అవసరమయే మంచి ముక్కలు చెప్పే ప్రయత్నం చేసారు. షేక్‌ అలీ  గురుని మాట యశము గూర్చుబాట' అనే మకుటంతో రాసుకొచ్చిన తీరులో వెలువడ్డ ముసల్మానుల శతకాలు పరిశోధించాలే గాని.. ఇంకెన్ని శతాధికాలు తేలుతాయో?  మతాలతో నిమిత్తం లేకుండానే సమాజ సంస్కరణల పట్ల సాహిత్య ప్రగతిశీలులందరిదీ ఒకే బాట- ఒకే మాట అన్న మాటను మాత్రం ఈ శతక సాహిత్యం ఖాయం చేసిందన్న  మాట వాస్తవం!

తరువాతి కాలంలో  వీరేశలింగంగారి 'వివేకవర్ధని' లో కలసిపోయినా 1891 లో  నరసాపురం నుంచి  మీర్ షుజాయత్ అలీ ఖాన్  గారి ఆధ్వర్యంలో సాగిన   'విద్వన్మనోహారిణి'  తెలుగుసాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. రాజమండ్రి నుండి వెలువడ్డ 1892 నాటి బజులుల్లా సాహెబ్,  'సత్యాన్వేషిణి, 1909 నాటి షేక్ అహ్మద్ సాహెబ్  'ఆరోగ్య ప్రబోధిని'  ముసల్మానుల తెలుగు పాత్రికేయ రంగానికి చేసిన సేవలకు మరి కొన్ని మచ్చుతునకలు. 1944 లో  హైదరాబాదు నుంచి వెలువడ్డ  'మీజాన్‌' దినపత్రికకు తెలుగు ప్రసిద్ధ రచయిత అడవి బాపిరాజు సంపాదకులుగా సహకారం అందించారు. 

ఆధునిక యుగానికి వస్తే..

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారి  'తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది. సయ్యద్ సలీం నవల "కాలుతున్న పూలతోట"కు 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించింది. వేంపల్లె షరీఫ్ కథల పుస్తకం ‘జుమ్మా’ 2012లో కేంద్రసాహిత్య అకాడెమీ యువ అవార్డు గెల్చుకున్నది. ఇంకా ఎంతో మంది మహమ్మదీయ మత విశ్వాసులు  విశాల భారతీయ లౌకిక తత్వంలో మమేకవుతూ దేశ పురోగతికి తమ వంతు పాత్ర నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు.  సయ్యద్ నశీర్ అహ్మద్ 'అక్షర శిల్పులు' పేరుతో వెలువరించిన 333 మంది తెలుగు ముస్లిం కవులు, రచయితల వివరాలతో 2010 లో సమాచార గ్రంథం పుటలు తిరగవేస్తుంతే పటం కట్టి పూజించుకోదగ్గ ఎందరో సాహిత్య ద్రష్టల కృషి కంటబడుతుంది.



'సమస్త ప్రపంచంలో  ఉత్తమైనది  మన హిందూస్థాన్. ఇది మనదే. ఇది మాత్రమే మనది! మనం దీని బుల్ బుల్ పిట్టలం సుమా!ఈ దేశం.. కేవలం  ఈ దేశం మాత్రమే మన ఉద్యానవనం మిత్రమా!’ అని అర్థ వచ్చే 'సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా/హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁ హమారా హమారా’ అంటూ సెప్టెంబర్ 23, 1964 నాడు మహమ్మద్ ఇక్బాల్   కల మెత్తి రాసిన జాతీయ గీతంలోని ప్రతి అక్షర భావమూ నేటికీ కోట్లాది మంది భారతీయ ముస్లిం భయ్యా బహెన్ల  మనసుల్లో నుంచి పెల్లుబుకుతున్నదే!  'పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలూ చెలరేగే నేడు' అంటూ మహాకవి శ్రీశ్రీ  వెలుగు నీడలు’  చిత్రంలో తెగ   వాపోయాడా నాడు. కానీ

దెబ్భై ఏళ్ల పాటు ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించిన తరువాతా ఎందుకింత సంకుచింతంగ దేశం ఆలోచన సాగుతున్నదనేదే చింత!  

'లుచ్ఛా జమానా ఆయా/అచ్ఛోంకో హాథ్ దేనా హర్ ఏక్ సికా/ అచ్ఛా జమానా ఫిర్ కబ్ / వచ్చేనా  చెప్పవయ్య వల్లీసాబు!' (చెడ్డవాళ్ల కాలం వచ్చింది. చెయ్యివ్వడమే ప్రతివాడు నేర్చేసుకుంటున్నది. మంచిరోజులు ఎప్పుడు వస్తాయో చెప్పవయ్యా వల్లీసాహెబూ?) అని ఓ శాస్త్రులుగారు  అడిగిన ప్రశ్నకు 'బందేనవాజ్ బుజురుగ్ /జిందా హై ఆజ్ తో న జీతే హమ్ ఖుదా/ బందాహి జానె వహాసబ్/గందరగోళం జమానా ఖాజాసాబూ! (దేశసేవకులు, పుణ్యపురుషులు (చేసిన మంచి పనుల వల్ల శాశ్వతంగా ఉన్నారు. మనం అట్లా జీవించలేం. దైవభక్తుడు, సేవకుడు ఆ విషయం తెలుసుకోడం మేలు. ఇప్పడు వచ్చిందంతా గందరగోళంగా ఉండే కాలం కదా ఖాజాసాబూ?) అంటూ వల్లిసాబుగారు బదులిచ్చారని ఓ చాటువు.  అల్లికలో సరదా కనపడుతున్నా ప్రస్తావనకొచ్చిన అంశం ఇప్పటి గందరగోళ పరిస్థితులకి అద్దం పడుతున్నదా లేదా?

-సరదాకేః  గందరగోళం జమానా   -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ప్రచురితం
 ***





Wednesday, February 19, 2020

మహాత్ముడు మామూలు మనిషి కాదా.. మొదట్లో? -కర్లపాలెం హనుమంతరావు






గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా  భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.
కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది.
అటెన్ బరో 'గాంధీ' చిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద, వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటే? నిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట గ్యారంటీ !
వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మామూలు గాంధీగా మొదలై .. బాపూజీగా, మహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్' అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని , పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగా అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశం తిరుగుముఖం పట్టింది.
దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటానులే'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక రోజు ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుంది' అంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు.
మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల ఉద్దేశం.
బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలు' ఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?!
ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడు, సీత, ఆంజనేయుడు, అంబేద్కర్, ఫూలే వంటి ఎన్నో వ్యక్తిత్వాలకు తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!
-కర్లపాలెం హనుమంతరావు
19 -02 -2020
(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)
***

Tuesday, February 18, 2020

అభినవ భీమకవిగా మహాకవి శ్రీశ్రీ! -కర్లపాలెం హనుమంతరావు





అభ్యుదయ కవిగా, ఆధునిక యుగ వైతాళికుడుగా శ్రీ శ్రీ ని అభిమానించే అనేక కోట్ల మంది తెలుగువాళ్ళల్లో నేనూ ఒకడినే. కాని మధ్య మధ్యలోఆ మహాకవి పెన్ను విదిల్చిన  వికటకవిత్వం చూసి కొద్దిగా బాధ! శ్రీ శ్రీ తిక్క రేగితే వేములవాడ భీమకవి, అడిదం సూరకవుల కోవలోకి జారిపోతూ తిట్టుకవిత్వం లంకించుకునేవారని అంటూ వుంటారు.
సినిమా పాటలకు వచ్చిన అవకాశాలు ఒకళ్లవి ఒకళ్లు గుంజేసుకున్నారన్న ఆక్రోశంతో మరో ప్రసిధ్ధ కవితో శ్రీ శ్రీ జ్యోతి మాస పత్రిక పుటల్లో కయ్యానికి కాలుదువ్వడం గుర్తుకొస్తుంది. ఆ ఇద్దరు కవులు సంచిక మార్చి సంచిక లో ఒకళ్ల మీద ఒకళ్లు దుమ్మెత్తి పోసుకున్న తీరు అప్పటి కవిత్వపాఠకులకు అదో కొత్త రకం అనుభవం. తనను 'నరసింహావతారం' అన్న అభియోగానికి ప్రతిస్పందనగా శ్రీ శ్ర్రీ 'అన్నట్టు నువ్వే నా అన్నయ్యవేమో/ఒక అవతారం ముందరివాడివి' అని బదులిచ్చారాయన. దశావతారాలలో నరసింహావతారానికి ముందొచ్చే అవతారం తమకు తెలిసిందేగా.. 'వరాహం' ! అదీ
 శ్రీ శ్రీ గారి కలం ధాటి!
1953 లో ఏర్పడ్డ  ఆంధ్రరాష్ట్రం ముఖ్యమంత్రి మంత్రి హోదాలో ప్రకాశంపంతులుగారి పాలబడ్డదన్న ఆక్రోశం ఎంచేతనో శ్రీశ్రీగారికి. ఆ కోపం అణుచుకునే సహనం లేక 'ముక్కుపచ్చలారని న/
వ్యాంధ్ర రాష్ట్ర శిశువు/
మూలుగుతూ మూలనున్న /
ముసిలాడికి వధువు' అంటూ  ఛకాల్మని పెన్ను తీసి చమత్కారమనుకుని గిలికేసేసారు  శ్రీ శ్రీ!
ఇంకో  సందర్భంలో హఠాత్తుగా కొద్ది మంది తెలుగు సుప్రసిద్ధ కవుల మీద అలిగారు శ్రీశ్రీగార్య్! ఆ క్రుద్ధత్వానికి కవితా రూపంః 'ఏరి తల్లీ నిరుడు మురిసిన/
 ఇనప రచయితలు?/
కృష్ణశాస్త్రీ టుష్ట్రపక్షీ/
దారి తప్పిన నారిబాబూ/
ప్రైజు ఫైటరు పాపరాజూ/
పలకరెంచేత?'
కృష్ణశాస్త్రి, శ్రీరంగం నారాయణబాబు, పాలగుమ్మి పద్మరాజులను ఉద్దేశించే ఆ ఆక్రోశం అని వేరే చెప్పాలా?
స్థానం నరసింహారావుగారికి పద్మశ్రీ ఇవ్వడం ఎంచేతనో శ్రీ శ్రీ గారికి అభ్యంతరం అనిపించింది. కడుపులోని కోపాన్ని కాగితం మీద పెట్టనిదే నిద్రపట్టని మనస్తత్వం గదా మహాకవిది! 'ప్రభుత్వం ముద్రించిన పద్మశ్రీలు/
ముట్లుడిగిన ముత్తవ్వలు ఛద్మస్త్రీలు' అంటూ కవిసమయం వేసేశారో కవితలో. ఛద్మం అంటే కపటం.  స్త్రీకి ఇవ్వకుండా  స్త్రీ  వేషాలు ధరించే స్థానం వారికి పద్మశ్రీ వచ్చిందనా.. ఆ దుర్భాష .. తెలియదు!
శ్రీశ్రీగారిని గురించి ఇలా రాసినందుకు అభిమానులు నా మీద ఆగ్రహిస్తారని తెలుసును. మహాకవి శ్రీ శ్రీ కవిత్వం అంటే నాకూ  మహా ఇష్టమే! ఇష్టపడని తెలుగువాడు  ఎవరు? కానీ ఈ తరహా భీమకవి దారిలో సాగడమే నా బోటి అభిమానులకు బాధ కలిగించే విషయం. నన్ను తిట్టదలిచిన వాళ్లు ముందు
శ్ర్రీ శ్రీ గారు తనను గూర్చి తానే ఏమనుకున్నారో  ఈ నాలుగు పంక్తుల కవిత చదివి అప్పుడు నిస్సందేహంగా తిట్టవచ్చు! నో ప్రాబ్లమ్!
'నేలమునగ చెట్టెక్కగ/
నిచ్చెన వేస్తావుటగా/
శ్రీశ్రీనే ఎదిరించే /
ఎత్తుకి పెరిగావటరా/
ఎడా పెడా వాయిస్తా..' అంటూ వీరంగం వేస్తారు మరి మన శ్రీరంగం శ్రినివాసరావుగారు మరో సందర్భంలో.
శ్రీ శ్రీ గారే ఒక సందర్భంలో అన్నారు కదా..'వాదాన్నెదిరించలేని వాడే తిడతాడు' అని. అక్షరాల  తన మాటలతోనే తన మాటలు ఎంత నిజమో నిరూపించిన మహానుభావుడు మహాకవి శ్రీ శ్రీగారు!
బోళాతనం అలాగే బొళబొళ మాట్లాడించేస్తుందనుకుంటా.. మహాకవులనైనా సరే .. యుగవైతాళికులనైనా సరే! అదీ సంగతి!
శ్రీ శ్రీ గారి మీద అమితమైన అభిమానం ఉన్నా  తెలిసిన నిజాలని నిర్మొహమాటంగా నలుగురితో పంచుకొనే అలవాటు వల్ల ఈ రాత. అభిమానులూ.. క్షమిస్తారుగా!
-కర్లపాలెం హనుమంతరావు
19 -02 -2020

ఇస్లాం మతం -కర్లపాలెం హనుమంతరావు


వేరే మతాలలో ఉన్నంత మాత్రాన అన్యమతాలను గురించి ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోరాదని ఏమీ లేదుగా! ఆ తరహా అభిరుచి కలవారి కోసమే ఈ చిన్నవ్యాసం! ఇస్లాం మతాన్ని గురించి టూకీగా  తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళకు!


పుట్టింది కేవలం 1500 ఏళ్ల కిందట. కానీ ప్రపంచ జనాభాలో ఆరో శాతనికన్న కొంచెం ఎక్కువగా ఇప్పుడు విశ్వసిస్తున్నది ఇస్లాం మతం. ప్రపంచ జనాభా 652 కోట్లు అని లెక్కవేసిన 2004లో ముస్లిం మత విశ్వాసుల సంఖ్య 152 కోట్లు. ఇండొనేసియాలో మెజారిటీ మతం ఇస్లాం 21 కోట్ల 60 లక్షలు. సౌదీ అరేబియా, బహ్రేన్, వెస్ట్రన్ సహారాలలో వంద శాతం ముస్లిములే! టర్కీ, ఒమాన్, గాజా, యూ.ఎ.ఇ, సోమాలియా, ఇరాన్, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, గాజాస్ట్రిప్, కతర్, సెనెగల్, సిరియా, గాంబియా, మాలి లాంటి దేశాలు ఇంకా చాలా చిన్నవి పొన్నవీ ఉన్నాయి.. వాటిలో నూటికి తొంభై మంది ముసల్మాన్ మతస్తులే! భారతదేశంలో 109 కోట్లుగా ఉన్నప్పుడు ముస్లిం జనాభా15 కోట్ల 30 లక్షలు. జనాభాలో  ఏడో వంతు. (పాకిస్తాన్ జనాభా మరో 70 లక్షలు మాత్రమే అధికం). ఇవన్నీ కొత్త శతాబ్దం తొలి దశకం అంచనాలు. తతిమ్మా అన్ని మతాల కన్నా ముస్లిం జనాభా అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు లెక్కలు వేసుకుని చెబుతున్నాయి.

ఇస్లాం అనే పదం అరబిక్ భాషలోని 'స్లం' అనే అక్షరం నుంచి పుట్టింది. మనసుని, బుద్ధిని భగవంతుని పరం చేసి సాధించే శాంతిని 'స్లం' అంటారు. ముస్లిం అంటే బుద్ధిని సర్వేశ్వరుని పరం చేసిన వ్యక్తి. 'ఖుర్ ఆన్' వీరి పవిత్ర గ్రంథం. ఇందులోని సూక్తులన్ని స్వయంగా భగవంతుడు ప్రవక్తకు అందించినవిగా విశ్వాసం. 
ఇస్లాం ప్రవక్త పుట్టించిన మతం కాదని.. సృష్టి ఆది నుంచి ఉన్న మతాన్నే ప్రవక్త ద్వారా ప్రపంచానికి తెలియచేసాడని మత పెద్దలు భావిస్తారు. తన ముందు వచ్చిన ప్రవక్తలకు మల్లే ఇస్లాం మత సూత్రాలని ఏ కొద్దిమందికో కాకుండా ప్రపంచమానవాళి మొత్తానికి అందించిన కారణంగానే మహమ్మద్ ప్రవక్తకు ఎక్కువ ప్రాచుర్యం లభించినట్లు ఓ అభిప్రాయం.  
తాము నమ్ముతూ వస్తున్న మత భావాలకు విరుద్ధంగా హేతుబద్ధమైన సూత్రాలతో ప్రపంచాన్ని వేగంగా ఆకర్షించే మహమ్మదు ప్రవక్త మీద ఆ మత పెద్దలకు సహజంగానే కినుక. కినుక ఎక్కువ అయితే హింసకు దారితీస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మహమ్మదు మీదా, అతని అనుచరల మీదా హింసాకాండ పెచ్చుమీరడంతో మక్కాను వదిలి 'రెడ్ సీ' (ఎర్ర సముద్రం) మీదుగా అబిసీనియా(ఇప్పుడది ఇథియోపియా) చేరుకున్నాడు  మహమ్మద్. ప్రవక్తను అనుసరించిన నూటొక్క మంది అనుచరులలో 83 మంది పురుషులు, 18 మంది స్త్రీలు. అయినా మక్కాలో మహమ్మద్ కుటుంబాన్ని సంఘబహిష్కరణ చేసి హింసించింది మక్కా  మతపెద్దల గుంపు. ప్రవక్తకు అండగా ఉంటూ వచ్చిన పినతండ్రి  అబూ తాలిబ్, భార్య ఖదీజా మరణించిన విషాద కాలాన్ని ముసల్మానులు అముల్ హుజ్న్ (విషాద సంవత్సరం)గా పరిగణిస్తారు. ఆ తరువాతా మహమ్మద్ మీద హింస తగ్గింది కాదు. ఆ ప్రతికూల వాతావరణంలోనే మక్కావాసుల  భక్తి విశ్వాసాలను క్రమంగా చూరగొన్నాడు. సమీపంలోని  ఎస్రిబ్ నగరానికి వెళ్ళి భగవంతుని వాణిని వినిపించేందుకు సిద్ధమయాడు మహమ్మద్.  అక్కడి విరోధి వర్గాల మధ్యన సయోధ్య కుదిర్చి శాంతి వాతావరణం కలిపించి  తిరిగి మక్కా వెళ్లే సమయంలో రాత్రి వేళ హంతకుల మూఠా ఆయనను మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. తన స్థానంలో ఆలీ అనే అనుయాయి ఉండిపోవడంతో మహమ్మద్ కు ప్రాణగండం తప్పింది. ప్రాణమిత్రుడు అబూ బకర్  ఒక్కడినే వెంటపెట్టుకుని మదీనా చేరడంతో ఇస్లాం చరిత్రలో కొత్త శకం 'హిజ్రీ శకం'  ఆరంభమయింది. 
ప్రవక్త మక్కా నుంచి మదీనా వలసవెళ్లడం 'హిజ్రల్'గా చరిత్రలో ప్రసిద్ధం.  ప్రవక్త రాకతో ఎస్రిబ్ 'మదీన్నతుబీ' (ప్రవక్త నగరం)గా పేరు మారిపోయింది.  ఎస్రిబ్ నగరవాసులు ఎందరో ఇస్లాం మతంలోకి మారిపోయారు. 
బహుదేవతారాధకులకు/అవిశ్వాసులకు.. ఇస్లాం మతానుయాయులకు క్రీ.శ 624 నుంచి 627 దాకా మూడు యుద్ధాలు జరిగాయి. మక్కా మదీనాలకు మధ్యన నైరుతీ దిశలో సుమారు 136 కి.మీ దూరంలో ఉన్న 'బద్ర్' అనే స్థలంలో క్రీ.శ 624లో జరిగిన యుద్ధం ఇస్లాం చరిత్ర గతిని మార్చేసిన ఘట్టం.  అది హిజ్రీ శకం ఆరంభం అయిన రెండో ఏడాది.   ముస్లిములు ఈ యుద్ధంలో ఓడిపోతే ప్రపంచంలో ఇప్పుడు ఇస్లాం అన్న ఒక మతమే ఉండేది కాదు. ఈ మాట స్వయంగా మహమ్మద్ ప్రవక్త యుద్దసమయంలో అల్లాకు చేసుకున్న విన్నపం ద్వారా తెలుస్తుంది. సంఖ్యాపరంగా తక్కువ పరిణామంలో   ఉన్నా ఇస్లాం పక్షం విజయం సాధించడానికి ఆనాడు అల్లా ఆశీర్వాదమే కారణమని  నేటికీ ముస్లిములు భావిస్తారు. తరువాతి  రెండు ఏడాళ్లూ రెండు యుద్ధాలు వెంట వెంటనే జరిగాయి.. ఉహుద్ కొండప్రాంతంలో ఒకటి, మదీనా పరిసరాల ప్రాంతంలో రెండోది. ఈ రెండు యుద్ధాలలో లభించిన   విజయాల కారణంగా  మక్కా కూడా ఇస్లాం మతం స్వీకరించడంతో విగ్రహాలు అక్కరలేని 'కాబా' పూజా విధానం ప్రపంచమంతటా ఆల్లుకునేందుకు పునాది పడినట్లయింది. ప్రపంచ ముస్లిములకంతా ఇప్పుడు 'హజ్' ను పవిత్ర స్థలంగా భావిస్తున్నారు.  జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరవలసిన పుణ్యస్థలిగా విశ్వాసం బలపడుతూ వస్తోంది. ఈ హజ్ యాతకే మన తెలుగు సర్కారులు ముస్లిములకు ఉచిత పథకాలుఉ ప్రకటించడం! 
క్రీ.శ 632, జూన్ 8 న (హిజ్రీ శకం 11 వ సంవత్సరం, రబీవుల్ అవ్వల్ నెల 11వ తేదీ) మహమ్మద్ తన 23 ఏళ్ల ప్రవక్త జీవితాన్ని చాలించుకుని బౌతికంగా కనుమరుగయినప్పటికీ.. ఆయన  ప్రసాదించిన జ్ఞాన సంపదలు ఖుర్ ఆన్, సున్నత్ ప్రపంచగతిని ప్రతీ దేశంలోనూ అనుకూలంగాగానో, ప్రతికూలంగానో ఏదో విధంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయ్!
ఖుర్ ఆన్ ముస్లిముల పవిత్ర గ్రంథంగా మనందరికీ తెలుసును. 'సున్నత్'- ప్రవక్త నెలకొల్పిన సంప్రదాయాల సంకలనం. ఆఖరి రోజుల వరకు ఆయన  చేసిన బోధనలు 'హదీసు' పేరుతో సుప్రసిద్ధం. సమాధులను, గోరీలను పూజాలయాలు చేయవద్దన్నది మహమ్మది ప్రధాన ఆదేశం.
అల్లా ధర్మమని భావించిన దానినే తాను 'హలాల్' గాను, అధర్మని భావించిన దానిని 'హరామ్' గాను బోధించినట్లు చెబుతూనే దేనినీ తనకు వ్యక్తిగతంగా ఆపాదించే ప్రయత్నం చేయవద్దని మహమ్మద్ ప్రవక్త  సూచిస్తారు. 

కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఇస్లాం మతం పేరున చెలరేగుతున్న  అనుకూల, ప్రతికూల  సంఘటనలన్నీ మహమ్మద్ ప్రవక్త రూపంలో బోధించిన తీరుకు విరుద్ధంగానే సాగుతున్నవి. అదీ విచారకరం!
(అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరు వేంకటేశ్వరరావుగారు ప్రచురించిన 'పారమార్థిక పదకోశం.. ప్రేరణతో)
   రాసిన వ్యాసం. రచయితకు ఏ తరహా ఉద్దేశాలు ఆపాదించవద్దని ప్రార్థన.)
-కర్లపాలెం హనుమంతరావు
18 -02 -2020





Saturday, February 15, 2020

సరtదాకేః స్వర్గం- నరకం రచనః కర్లపాలెం హనుమంతరావు


ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారం రోజుల గడువుంది. ఎక్కడ చూసినా
టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!
ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత
వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాల కోసం నరాలుతెగే
ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.
అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే..
కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే
పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.
ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ!  ఆమ్ ఆద్మీలకంటే ఈ మాదిరి
చేంతాళ్ళు అలవాటే గాని.. జనవరి ఒకటి, శనివారం కలిసొచ్చే రోజైనా  తిరుమల
శ్రీవారి సుప్రభాతసేవ దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యం లేని బడేసాబ్
రాంభద్రయ్యగారిలాంటివారికీ క్యూ వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.
ఇదేమీ భూలోకం కాదు. లాబీయింగుకు ఇక్కడ బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం
ఎదురుచూడడం  రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని యవ్వారం. అక్కడికీ ఎవరూ
చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.
'ఇదేం మీ భూలోకం కాదు. మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు
కుదరవు.  ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ ఫలితాన్నిబట్టే నీకు
స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు. అప్పుడే అంత
అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం పింఛను కోసం, జీతం కోసం, రేషన్
కోసం, గ్యాసుబండల కోసం, అధికారుల  దర్శనం కోసం.. ఎన్నేసి రోజులు
నిలువుకాళ్ళ కొలువు చేస్తారో నీకేమైనా అవగాహన ఉందా?' అని గదమాయించాడు
దే.దదూత (దేవుడు, దయ్యం కలగలసిన అంశ- దే.దదూత)
'ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో
చూసావా?ముందు నా స్వర్గం సంగతి తెముల్చు!' పాయింటు లేనప్పుడు టాపిక్కుని
పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.
చిత్రగుప్తుడి దగ్గరకొచ్చింది కేసు.
సెల్లో ఆయనగారెవర్నో కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి
అన్నాడు 'ఓకే పెద్దాయనా! మీరేమో రాజకీయనేతలు! కనక ప్రత్యేక పరీక్ష
పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే  మీకు పాత జీవితం తాలూకు  పాప
పుణ్యాలతో నిమిత్తం లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో
ఎన్నుకోవచ్చు..'
'నాకు స్వర్గమే కావాలయ్యా!'
'ఆ తొందరే వద్దు. ఆసాంతం వినాలి ముందు. ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు
నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి..'
'ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!'
'సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం'
అని దే.దదూత  వంక సాభిప్రాయంగా చూసాడు చిత్రగుప్తుడు. అర్థమైందన్నట్లు
రామచంద్రయ్యగారి భుజం మీద చెయ్యేసి బలంగా కిందికి నొక్కాడు దేదదూత.
కనురెప్పపడి లేచేంతలో కంటి ముందు.. నరకం!
నరకం నరకంలా లేదు! స్వర్గంలా వెలిగిపోతోంది. మెగాస్టార్ చిత్రం ఫస్ట్ షో
సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును
ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు,
మణిమాణిక్యాలతో  నిర్మితమైన  రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర
ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో వాతావరణమంతా గానాబజానా వాతావరణంతో
మత్తెక్కిపోతోంది. మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తీలోత్తమాదుల
అంగాంగ  శృంగార నాట్యభంగిమలు!
పాతమిత్రులందర్నీ అక్కడే చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన
చేసి కోట్లు వెనకేసిన  స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది
కంటపడితే చాలు వెంటాడైనా సరే  కోరిక తీర్చుకునే కీచకాధములు, అధికారంకోసం
మనిషుల ప్రాణాల్ని  తృణప్రాయంగా తీసే పదవీలాలసులు, ఉద్యోగాలు..
ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి ఆనక  బోర్డ్లు
తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు,  సర్టిఫికేట్లు, కరెన్సీ నోట్లు,
మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు,
నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా  దర్జాగా
కర్రపెత్తనం చేసే దళారులు..  అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ,
తూలుతూ, పేలుతూ  యధేచ్చగా చిందులేయడం చూసి రాంభద్రయ్యగారికి మతిపోయినంత
పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది..
తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా చూపించే యమకింకరులుకూడా చాలా ఫ్రెండ్లీగా
కలగలిసిపోయి వాళ్ల మధ్య కలతిరుగుతుండటం!
అతిథుల భుజాలమీద ఆప్యాయంగా  చేతులేసి,  బలవంతంగా సుర లోటాలు లోటాలు
తాగించడం.. మిడ్ నైట్ మసాలా జోకులేస్తూ జనాలను అదే పనిగా నవ్వించడం..
ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని
రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని అప్పటివరకు రాంభద్రయ్యగారికి
తెలియనే తెలియదు. రోజంతా ఎంతానందంగా గడిచిందో .. రోజుచివర్లో.. చీకట్లో
ఏకాంతంలో అతిలోకసుందరులెందరో   బరితెగించి మరీ  ఇచ్చిన సౌందర్య ఆతిథ్యం
ఎన్ని జన్మలెత్తినా మరువలేనిది.
ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే  ఈ
నరకాన్ని  చచ్చినా వదులుకోరాదని.
కానీ.. షరతు ప్రకారం మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం
రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని
అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం సాంత్వనసంగీతమంటే   ఏదో ఒక ఐదారు
నిమిషాలు  ఓకేగానీ..  మరీ   రోజుల తరబడి ఆకాశవాణి నిలయవిద్వాంసుల కచేరీ
తరహా అంటే.. మాజీ ప్రధాని మన్మోహజ్ జీ సారుకయినా తిరగబడాలనిపించదా? ఒక
వంక కడుపులో పేగులు కరకరమంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ  ప్యారడైజ్
బిర్యానీనో పడుతుంటే మజాగానీ .. అజీర్తి రోగి మాదిరి అసలాకలే లేని
హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే గదా! దప్పికతో నిమిత్తం
లేకుండా ఏ   బాగ్ పైపరో.. ఆఫీసర్సు ఛాయస్సో.. స్థాయినిబట్టి ఆరగా ఆరగా
ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా  బెత్తెడు దూరంలోనే
ఉన్నట్లండేది!  ఎంత అతి మధురామృతమైనా ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం’
చీర్స్’ కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి
గుటకేయాల్సిందేనంటే.. ‘ఛీ!’ అంతకన్నా నరకం మరోటుంటుందా? ఆకలిదప్పులు,
నిద్రానిప్పులు, మంచిచెడ్డలు, ఆరాటాలు.. పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం
తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే రాంభద్రయ్యలాంటి ఆసులో
కండెలకు అసలు అయే పనేనా?
'ఎవర్నుద్దరించేందుకు, ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో..
జన్మరాహిత్యం.. కోరుకోవాలి బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు,
రత్నఖచితాడంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,.
స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని ఒక్క రోజులోనే  తేలిపోయింది.
వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే అయినప్పుడు ఆ నరకంలోనే
స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని.
మర్నాడు   చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో ఆలోచన  లేకుండా
నరకానికే ఓటేసేసారు రాంభద్రయ్యగారు.
ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు
పెట్టిన రాంభద్రయ్యగారికి కళ్ళు బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.
నరకం మునుపటి స్వర్గంలాగా లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న
మురికివాడకు నకలుగా ఉంది.  మొన్నటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి
బొత్తిగా సాపత్యమే లేదు.
మొదటి దృశ్యం- డొనాల్డ్ ట్రంప్ భారతావనికి వచ్చేముందు తీర్చిదిద్దిన
అహమ్మదాబాదునగరం.
రెండో దృశ్యం- కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన మర్నాటి  అమరావతినగరం.
పైనుంచీ ఆగకుండా అదే పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ
చెత్తను  ఎతిపోస్తున్నది  వేలాదిమంది కూలీజనం. నిజానికి  వాళ్లంతా
మొన్నరాంభద్రయ్యగారు  సందర్శనార్థం విచ్చేసినప్పుడు-  పిలిచి
ఆతిథ్యమిచ్చిన నరక గేస్తులు! భూలోక నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు
వేళ్లాడుతున్నవి  అప్పటికి మల్లే  చీని చీనాంబరాలు కాదు. చివికి, చిరిగి,
చీలకలైన మసి పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ
పెద్దమనుషులంతా  భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన
వి.వి.వి.వి.ఐ.పి లు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు వాళ్ల
వీపులమీద కొరడా దెబ్బలు ఛళ్ళుమని  పడుతున్నాయి. ఆ కొరడాధరులంతా మొన్న ఇదే
చోట శిబిని, అంబరీషుణ్ణి మరిపించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని
మురిపించిన  యమకింకరులే!
నోటమాట రాకా మాన్పడిపోయిన రాంభద్రయ్యగారి చేతిలో ఓ పెద్ద చెత్తబుట్ట
పెట్టి ముందుకు తోసాడో కింకరాధముడు. ఆగ్రహం పట్టలేక నరాలు చిట్లేటంత
బిగ్గరగా గావుకేక వేసారు రాంభధ్రయ్యగారు 'మోసం!.. దగా! మొన్న నరకానికి
స్వర్గధామంగా విపరీతమైన కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక
ద్రోహం.. కుట్ర!'
తాపీగా సమాధానమిచ్చాడా యమకింకరుడు 'ద్రోహానికి.. కుట్రకి.. ఇదేం మీ
భూలోకం కాదు మానవా!  నువ్వు నరకాన్ని చూసిన రోజు  మా స్వర్గ నరకాల
ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఎలక్షన్లు  అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న
నరకానికే కదా నిన్ను తరలించిందిప్పుడు? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ
భూమ్మీద జనానికి మీరు చూపించే హామీలల్లోనూ మోసం.. దగా ఉన్నట్లే లెక్క!
ముందే చెప్పాం గదా!  భూమ్మీద మీలాంటి నాయకులు నడిపిస్తున్న ప్రజాస్వామ్య
విధానాలనే మేమూ ఇక్కడ మా లోకాల్లో అనుసరిస్తున్నామీ మధ్య' అన్నాడు
కింకరుడు కొరడా రాంభద్రయ్యగారి వీపుమీద ఝళిపిస్తూ!
'అబ్బా!' అని రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కొరడా దెబ్బో.. ప్రజాస్వామ్యం
దెబ్బో ఎవరికి వారుగా  జనాలకు హామీలు గుప్పించి గద్దెనెక్కేవాళ్ళే
అర్థంచేసుకోవాలబ్బా!
స్వస్తి!
***
- కర్లపాలెం హనుమంతరావు
(సూర్య - సరదాకే  - 15 ఫిబ్రవరి 2020 ప్రచురితం)

Friday, February 14, 2020

భోజన యోగం-ఈనాడు ఆదివారం సంపాదకీయం- కర్లపాలెం హనుమంతరావు






ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. ఉదర నిమిత్తం బహుకృత వేషం. పశుపక్ష్యాదులది దొరికింది తిని కడుపు నింపుకొనే నైజం. మనిషికే బహురుచుల మోజు. 'అన్నము తిను వేళ నాత్మ రుచులు గోరు/ మదియు నాల్క జెప్ప నడగుచుండు' అన్నాడు యోగి వేమన.  వేదాల్లోను పురాణాల్లోను భోజనం భోగట్టానే ఉందని గురుజాడవారి శ్రీమాన్ గిరీశంగారు సెలవిచ్చారు కదా! 'అన్నం వ్యజానాత్.. అన్నవే బ్రహ్మ అని తెలుసుకోవోయి వెధవాయా అంది' అని దబాయింపు కూడాను! 'చమకంలో శ్యామాకాశ్చమే- చామల అన్నం మా మజాగా ఉంటుంది.. మాక్కావాలి దేవుడా!' అని ఉందని ఆ గురువు ప్రబోధించడం.. 'గేదె పెరుగు చమే.. చేగోడీ చమే!' అంటూ అతగాడి శిష్యపరమాణువు వెంకటేశం  చమకపారాయణం అందుకోవడం! 'తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్!' అంటూ  ఆ మహాకవే మరో చోట  నొక్కి చెప్పిన వాక్కుకి  ఈ  పచన పురాణం యావత్తూ  ఓ చక్కెర పూత. ఉదరానందమే హృదయానందానికి నాందీ. ఈ కిటుకు పసిగట్టింది కాబట్టే బసవరాజుగారి వెర్రిపిల్ల సైతం మనసైన బావగారిని గుత్తొంకాయ కూరతో పడగొట్టింది. కొనకళ్లవారి కోడలు పిల్ల 'అందముగా తీపందుకునేలా' అరిసెలు  వరసైన మావనోటికి అందించింది. చారడేసిన కళ్లను చక్కిలాలతో పోల్చడం మన  తెలుగువారికి ఆనవాయితీ. 'వంకాయవంటి కూరయు/పంకజముఖి సీత వంటి బామామణియున్/శంకరుని వంటి దైవము' లేరు' అని తెలుగువారికి గట్టినమ్మకం.   ఎంత కళాభివేశంలో సైతం కవుల కుక్షింభరత్వాన్ని నిర్లక్ష్యం చేయలేదు! 'వైశ్వానర జఠరాగ్ని రూపంలో దైవమే  జీవి శరీరంనుంచి  ఆహారం నాలుగువిధాల   జీర్ణించుకుంటుంద'ని గీతే(15-14) ప్రవచిస్తోంది.  తెలుగువారి బువ్వంపు బంతులమధ్య ప్రతిద్వనించే గోవిందనామాల అంతరార్థం తవ్వినవారికి తవ్వుకున్నంత!

'వేవురు వచ్చినా వండ నలయని'  గృహిణిని అద్భుతంగా వర్ణించాడు పెద్దన కవీంద్రుడు 'మనుచరిత్ర'లో. వండేందుకు సమయానికి సంబరాలేమీ అందుబాటులో లేనిపక్షంలో సైతం నాటి గేస్తులు ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారో  అయ్యలరాజు నారాయణామాత్యుడు 'హంస వింశతి'లో విశదీకరిస్తాడు. మామిడికాయనుంచి మారేడుకాయ వరకు, కొండముక్కిడికాయ మొదలు కొమ్ముకాయ, కరగు కాయ, వెల్గకాయ దాకా గృహస్థుల ఇంట సదా సిద్ధంగా ఉండే ఊరుగాయల జాబితా (4-135) ఏకరవు పెడతాడు ఒక పద్యంలో. తిండి తిప్పలంటే వండుకొని ఇంత కడుపుకు వేసుకోవడంగా మన పెద్దలెప్పుడూ భావించలేదు. 'తలం జీర సుట్టియును జె/ ప్పులు దొడిగియు చేసినట్టి భోజనము ఫలం/ బలఘ చరిత బద్మజు/ డసురుల బోగంబని విధించె బ్రకట ఫణితులన్' (3-17) అంటోంది మహా భారతం. 'తడబడి తద్ప్రసాదంబు  గుడుచుచో../ రయమున గూలు నరక వార్ధి ననుచు' (41)అంటూ  పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్రం’ అంటుతిండి చేటును గూర్చి 15వ శతాబ్దిలోనే హెచ్చరించింది! 'ఉదరం సగభాగం అన్నంతోను,  ఒక భాగం మంచితీర్థంతోను నింపినప్పుడే మిగతా భాగంలో గాలి ఆడి జీర్ణక్రియ సులభతరం అవుతుంద'ని(41) మంత్రి అప్పన్న ‘చారుచర్య’ హితవు చెబుతోంది. వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణం 'మునుపు మధురాన్నములు చవిగొనియనేని/ నడుమ లవణామ్ల తిక్తముల్ నంజెనేని/ పిదప కటుకార్ద్ర భోజనం బొదవెనేని/ బలము నారోగ్యము జాల గలిగియుండు' అంటూ పచన క్రమాన్ని నిర్దేశిస్తోంది. లోకహితంకోసం తపించి  అభిభాషించిన  ఆరోగ్యసూత్రాలనైనా ఆలకించికపోతే  చివరికి నష్టపోయేది ఎవరు? మనమే!

'వండడం కాదమ్మా ప్రధానం. తినాలి. తినడమూ కాదు. ఏది ఏమిటో తెలియాలి' అంటుంది శ్రీపాదవారు సృష్టించిన  'పాకశాస్త్రం'లోని ఓ పాత్ర. ‘ఓ రామ! నీ నామ మెంతో రుచిరా!' అని పరవశంతో పాడుతున్న ఓ భక్తుణ్ని 'నామం రుచి చూసానయ్యా! చప్పగా ఉంది' అని దెప్పిపోఛాడో  తిండిపోతు.  తినేవి ఏవో.. తినకూడనివి ఏవో విచక్షణ మరిస్తే కుడిచిన విస్తరే పంచకూళ్ల విషమౌతుంది- అంటున్నారు ఆహార శాస్త్రవేత్తలు. మిరియం పొడి చల్లిన తినుబండారాలనుండి, ఆవపిండిలో ఊరేసిన వడలు, ఇంగువ తాళింపులతో ఘుమాయించే  కరకర సరుకులు, చింతపండు, నిమ్మ రసాలు  పిసికి పోసిన పులుసులు, తొలిచూలు గోవుల పొదుగులనుంచి సేకరించి మధించిన వెన్నలను కాచి తీసిన నేతులలో ముంచి తేల్చిన  మధుర పాకాలు, భక్ష్య భోజ్య, లేహ్య, పానకాలలో ఏ ఒక్కటీ బీరుపోకుండా  తెలుగువాడి నిండువిస్తరి వైభోగాన్ని శ్రీనాధ కవిసార్వభౌముడు పలు సందర్బాలలో పూసగుచ్చినట్లు వర్ణించాడు. పాకశాస్త్రం భారతీయుల చతుష్షష్ఠి కళల్లో ఒకటి. సీతమ్మ సీమంతంనుంచి శ్రీకృష్ణుని చల్దులదాకా ఆడంగులు పాడుకొనే అన్ని పాటలనిండా ఎన్ని తినుబండార వైభోగాలో! సంతోషానికి సంతృప్తి దగ్గరి దారంటారు పెద్దలు. సంతృప్త అంతరంగానికి  ఆత్మారాముడి ఆశీర్వచనం తప్పని సరి. ఆరోగ్యకరమైన ఆహారం సంతృప్త భావతరంగ వ్యవస్థను తట్టి లేపుతుందని.. ఇష్టమైన పదార్థం రుచికరంగా జిహ్వకు తగలగానే కోరికను రేకెత్తించే 'డొపమైన్' ఉత్పత్తి అధికమవుతుందని, ఆ స్థితిలో జీర్ణమయే ఆహారం ఆనందకారక రసాయనాలు ఒపియేట్స్ (opiates) కెన్నబినాయిడ్స్ (cannaabinoids)  మెదడు విడుదల చేసేందుకు దోహదపడతాయని  తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కార్డిఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన యాండ్రూ స్మిత్   అనే మానసిక శాస్త్రవేత్త నిర్వహించిన పరిశోధనల్లో అనారోగ్యకరమైన ఆహారాన్ని అపరిమితంగా స్వీకరించడం వల్ల  ‘ప్రతిఫల వ్యవస్థ’ ((reward system) అస్తవ్యస్తమై  భోక్త  విపరీత భాగోద్వేగాలకు బానిసవుతాడని తేలింది.   ఉదయ అల్పాహారంగా  నిలవ ఆహారం సేవిస్తున్న వారిలో అలసట.. అహననం, ఆందోళన , కుంగుబాటు తాజా ఫలాలు సేకరించే వారిలోకన్నా మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు  తాజా పరిశోధనలు నిగ్గు తేలుస్తున్నాయి. తిండి తిప్పలు ఎన్ని రకాలో! తిండికోసం పడే తిప్పలు సరే!  తిన్న తరువాత వచ్చిపడే తిప్పల్ని  తప్పించుకోవాలంటే తినేటప్పుడే  అప్రమత్తంగా ఉండటం తప్పని సరి- అంటున్నారు ఆహారశాస్త్ర నిపుణులు. ‘భోజనం యోగంగా భావించినంత కాలమే మనిషికి భోజనం ఓ భోగం’ అన్న ‘లోలంబ రాజీయం’ సూక్తే చివరికి  శిరోధార్యమయింది. శుభం.
***
- కర్లపాలెం హనుమంతరావు 
( ఈనాడు ఆదివారం సంపాదకీయం ) 




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...