Wednesday, April 22, 2020

హిమానీ హృది- వేగుంట మోహన ప్రసాద్ - కర్లపాలెం హనుమంతరావు


ఇదీ పద్యం : 
రాఉడూ! వేసెయ్! తలుపులు వెసెయ్!
ఆ కిటికీ రెక్కకు చిడుత లేదల్లే ఉంది!
పోనీ, ఏదైనా రాయైనా అడ్డం పెట్టు.
ఇదేవిట్రా రాఉడూ! ఇవ్వాళిట్లా
వడగాలిలా, సుడిగాలిలా ఈ చలిగాలి!
నా హృదయం అనే ఎయిర్ కండిషన్డ్ రూంలో
వెచ్చగ ముసుగు వేసి మూడంకె వేసి
హృదయాంతరాళపు రుధిర ప్రవాహంలో
నాలో నేనుగ పడుకొన్నాను కద!
ఇంకా ఏమిటిరా ఈ చలి , మరీ ఆగడం.
కాశ్మీర్లో చచ్చే చలి గనుకనే
అన్నన్ని ఉన్ని శాలువాలు.

రాఉడూ నా ఈ కవోష్ణ హృదయంలో
చేతులు కొంగర్లు పోయ,
పై పెదవికి కింది పెదవికి పోట్లాడ రాగ, దవడలు చప్పట్లు కొడుతూంటే
పులకరించిన దేహం చూస్తూ ఊరుకుంటూంటే
మంచుముక్కలా పడుకున్నాను కద!
ప్రపంచం మరీ ఇంత నీళ్లు గారిపోతున్నదేం?
కళ్ల ముందు ఏమిటీ పొగమంచు!
భ్రాంతి అనే ఎండమావిలా ఈ మంచుపొగ!
ప్రపంచమనే యువతి వేసుకున్న మేలిముసుగు!
నాకే ఇంత చలి వేస్తున్నదే,
వీళ్ల కెంత చలో మఱి!
రాఉడూ! నా యీ కళ్లనే కుంపట్లలో  
కాస్తంత నిప్పు రాజేయరా బాబూ!
కనుపాపలనే ఈ రెండు రాక్షసిబొగ్గులు
రాజుకుంటేనన్నా ఈ చ లా గుతుందేమో!
నీ శ్వాస అనే విసనకఱ్ఱతో
యీ పొయ్యూదు!
మన ఇంట్లో కొబ్బరినూనె సీసాలో నూనె 
గడ్డకట్టుకు పోయింది కదూ?
కాస్త నా కళ్ల సెగన పొయ్యి సెగన పెట్టు దాన్ని!

ఈ రాత్రి నెవరురా వారు?
"నీ యింట్లో, నీ హృదయంలో  యీ నైటుకి కాస్త
తలదాచుకోనియ్యి" అంటారు!-వీల్లేదని చెప్పు!
రాఉడూ! తలపు తియ్యకు! తీశావో,
చలిగాలి 'ఉ హు హు' అని వణుకుతూ వచ్చి
తన చలి తీర్చుకోవడానికి నన్ను కౌగలించుకుంటుంది.
హృదయం అంటే సామాన్యమా! కర్మ!
నాలోని నవనాడులూ కలిసే చోటు.
ఆత్మకూ దేహకూ పేచీ వచ్చేదిక్కడనే.
'ప్రేమ' అనే ఆ దరిద్రపు గుడ్డి దీప వెలిగి కొండెక్కేదిక్కడనే!
హత్యకు ఆత్మహత్యకు ఇదే బలిపీఠం.
స్వర్గసీమ వల్లకాడు రెండూ ఇదే.
ఇక్కడే జీవి చనిపోయేదీ, చావు బ్రతికేదీను.
అసలూ నీవూ నేనూ ఉన్నదే ఇక్కడ.
మనకున్న యీ ఒకే ఒక్క దుప్పటిని నీవు కూడా పంచుకో.

రాఉడూ! చూడు చూడు! ఏవిటా గాజుల సవ్వడి!
జలపాతంలో అందెల మువ్వల చిందులు!
అందాలరంగవల్లి రా ఎవరావిడ?
బొమ్మల పెళ్ళిలో లక్క చిట్టిలా ఎవరు?
రాఉడూ! తీసెయ్! తలుపు బార్లా తీసెయ్!
(భారతి- 1960, మే సంచిక ప్రచురితం)

నా పరామర్శ: 

చిడతలు ఊడిన రెక్కల కిటికీ తెరిచిపెట్టవద్దని కవిగారు ఒహటే మొత్తుకోలు! వడగాలిలా, సుడిగాలిలా ఆ వేళ  చలిగాలి రివ్వున వీయడంతో ఆయనగారి  కవోష్ణ హృదయంలో చేతులు కొంగర్లు పోవడం,  పై పెదవికి కింది పెదవికి పోట్లాట మొదలయినా అదేదో వినోద ప్రదర్శనలా ఆయనగారి స్వదేహమే పులకరించిపోతూ తిలకించడం! కవిగారికి ఇప్పటి వరకు తన హృదయమనే  ఎయిర్ కండిషన్డ్ గదిలో వెచ్చగ మునగ దీసుకుని మూడంకె వేసి పడుకునే విద్య ఒక్కటే తెలుసును.   రాయైనా కిటికీకి అడ్డపెట్టలేనంత వేగంగా వీచే వడగాలి చలిగాలికి  ఇప్పుడేం చేయాలో ఊహామాత్రంగానైనా తోచని అయోమయం. బైట ఎట్లాంటి కష్టాలు, కడగండ్లు చెలరేగినా  ఈ తరహా హృదయవాద కమలకు తమ సోదేదో తమదే! వేగుంటగారికి  తన  హృదయాంతరాళపు  రుధిర ప్రవాహంలో  తనలో తానుగా ముడుచుకుని పడుకోవడమొక్కడే తెలుసును లాగుంది. అందుకె అక్కడెక్కడో వీచే కాశ్మీర్ చచ్చేచలి గాలులకు పనికొచ్చే ఉన్ని శాలువాలను గూర్చి అసందర్భపు ఊహలు..  ఊహల  వెచ్చదనం కోసం కవిగారు పడే తాపత్రయాలు!   తాను తట్టుకోలేని పొగమంచు మంచుపొగను ఎండమావి అనుకున్నంత మాత్రాన వళ్లేమైనా వెచ్చబడేనా?  భ్రాంతి కాకపోతే! అంత కష్టంలోనూ ఆ పొగమంచును ప్రపంచమనే పడుచు కప్పుకున్న  మేలిముసుగుగా  వర్ణించి మురుసుకోవడం కవిగారిలోని పురుషపుంగవుడికే చెల్లబ్బా!  చలిగాలికి గాని మతి చలించేదేమోకవిగారికి ! మనసులోని భావాలు ఒకచోట నిలకడగా నిలబడని చంచల స్థితి గమనిస్తే ఆలాగునే అనిపిస్తుంది మరి! ' రాఉడూ! నా యీ కళ్లనే కుంపట్లలో ..కాస్తంత నిప్పు రాజేయరా బాబూ! కనుపాపలనే ఈ రెండు రాక్షసిబొగ్గులు రాజుకుంటేనన్నా ఈ చ లా గుతుందేమో! నీ శ్వాస అనే విసనకఱ్ఱతో యీ పొయ్యూదు!' అంటూ గోల పెట్టే శాల్తీ.. మళ్లీ  'ఇంట్లోని కొబ్బరినూనె సీసాలో గడ్డకట్టుకు పోయిన నూనె  తెచ్చి కాస్త తన  కళ్ల  పొయ్యి సెగన పెట్టమనడం ఏంటి? ఏంటో.. ఈ కవులు ఎవరికీ అర్థం కారు. ఈ మాదిరి మార్మిక కవులలో 'మడత పేచీ ' అదే! ఈ పేచీ కోరు వ్యవహాదాలకు ఆశపడే నా బోటి అర్భక పాఠకుడు కవిగారి మీద ఆరాధనలో పడిపోయేది. అక్కడి కది వదిలేద్దాం లే సార్!కనీసం స్వంత వంట్లోని రాఉళ్లకైనా అంతుబట్టే రీతిలో కలవరించని  కవులను ఎవరం మాత్రం ఏం రిపేర్ చేస్తాం! 
ఇంత గందరగోళంలోనూ ఎవరో తలుపు తట్టి 'ఇంట్లో, వంట్లో  ఆ  నైటుకి కాస్త చోటడిగినట్లు'  కవిగారి  ఊహ చూసారూ; అదీ మహావిచిత్రం. ఊహ మీద ఊహ మరో ఊహ ! 'కుదర్దని' కుండలు బద్దలుకొట్టి' తన సచ్చీలతను ప్రకటించుకున్నట్లు బడాయిలు కూడాను! రాఉడు తొందరపడి తలుపు తీస్తే చలిగాలి వణుక్కుంటూ వచ్చి తన చలితీర్చుకోడం కోసం కవిగారిని కావలించుకుంటుందని బెంగట! ఏం ఓవర్రా బాబూ!  ఆ ఓవర్లోనే ' అధివాస్తవికత'  అనే పోయిటిక్ ఎలిమెంట్ సూదంటురాయి మాదిరి నా బోటి దుర్బలులకు అంటుకునేది. we love Surrealism and Surrealistic thoughts. 
కవిగారితో కాస్త డైరక్ట్ స్పేచ్ లో మాట్లాడాలి! దయచేసి తమరంతా  కాస్త అసుంటా నిలబడండి!
 " అయ్య! వేగుంట కవిగారూ1, మీ రాఉడి కెలాగూ నోరూ వాయా పెగలదు కానీ! మార్మిక కవులు కదా మీరు! మీరే పెదవి విప్పి చెప్పండి ! మీకో హృదయం ఉంది. దానితో వేగడం మీ వల్ల కాని పని. ఆ మర్మం మీకూ బాగా తెలుసు.  అవును సార్!  మీరన్నట్లు హృదయం నవనాడులూ కలిసే జంక్షనే! ఆత్మకూ దేహానికీ అస్తమానం దెబ్బలాటయ్యే  టెంక్షన్ పాయింటూ ఇదే ! ఏమాట కామాటే చెప్పుకోవాలి మాష్టారూ! ప్రేమని ఓ గుడ్డి దీపంతో పోల్చడమే కాకుండా,  ఆ దరిద్రం వెలిగి కొండెక్కేది చోటు కూడా ఇదేనని పసిగట్టడంలోనే ఉంది సుమా మీ  రసరహస్య గ్రహణ ప్రజ్ఞ సర్వస్వం ! హత్యకు, ఆత్మహత్యకు గుండె మాత్రమే ఎందుకు మీకు బలిపీఠం అనిపించిందో.. స్వర్గానికి వల్లకాడు రెండింటికి కూడా  ఇదే కేరాఫ్ అడ్రసని ఎందుకు తోచిందో మీరు వేరే వివరించకుండానే  మీ లాస్ట్ లైన్ పంచ్ లో తేల్చేసారుగా!  హాట్సాఫ్ టూ యూ! 
'ప్రేమ' అనే ఆ దరిద్రపు గుడ్డి దీపం వెలిగి కొండెక్కేదిక్కడన్న మాట ఎంతో అనుభవం మీద చెప్పిన మాటయుంటుందిగా మాష్టారూ ! స్వర్గసీమ వల్లకాడు రెండింటికీ ఇదే కేరాఫ్ అడ్రస్ అని.. ఆహాఁ! ఎంత గొప్పగా చెప్పారు సార్! ఇట్లాంటి  వేదాంతం పలుకులు జీడిపప్పు ముక్కల్లా మీ మర్మ కవిత్వ పాయసం మధ్య మధ్యలో పంటికి తగుల్తాయనే మీ కవిత్వం  వెంటబడేది! 
జీవి చావుకూ, చావు బతుకు కూడా ఈ హృదయమే కరెక్ట్ స్పాట్ అన్న ఒక్క భారీ వాక్యం చాలు  సారూ  ఈ  'హిమనీ హృది'ని జన్మంతా గుండెల మీద పెట్టుకుని ఇష్టంగా ఈజీగా మొసెయ్యడానికి! హ్యాట్సాఫ్ అనడానికి అసలు పాయింట్ ఇప్పుడు చెప్పాల్నా  గురూజీ!

ఒకే దుప్పటి మీ బైరాగి రాఉడితో పంచుకోవడానికి సిద్ధపడిన వైరాగ్యంలో కూడా.. బైట గాజుల సవ్వడి వినబడగానే ఎట్లా ప్లేట్ ఫిరాయించేసార్సార్! హ్హా.. హ్హా.. హ్హా! మనిషి మనసులోని చపలత్వం సర్వం రూపుకట్టించేసారుగా ఆ ఒక్క ట్విస్టులో ! ఏ బొమ్మల పెళ్లి లక్క చిట్టో జలపాతంలా అందెల మువ్వలతో చిందులేసుకొంటూ అందాల రంగవల్లిలా మీ గుమ్మం ముందు చేరి తలుపు తట్టినట్లుగా  మీకై మీరే  మహా సందడిగా ఆనందపడి పోయారు ! మంచులా కరిగిపోయింది గదా  ఒక్క మువ్వల సవ్వడికే మీ దీనత్వం, వేదాంతం .. ధీరత్వం సర్వం! 
మనిషి చపలత్వాన్ని  మొహమాటం లేకుండా చివరి రెండు వరసల్లో వివస్త్రను చేసి  ప్రదర్శించేసినందుగ్గాను. . మీ లెస్ హీరోక్రసీకి ఫ్లాట్! 
కర్లపాలెం హనుమంతరావు
21 -04 -2020

Saturday, April 18, 2020

కోవిడ్‍ -19 రామాయణంలో బవిరి గడ్డం పిడకల వేట -సరదాకే- కర్లపాలెం హనుమంతరావు



గడ్డం ఇంటి పేరున్న వాళ్లందరికీ గడ్డాలుండాలని రూలు లేదు. దేవుడి


మొక్కులకు, పెళ్లాం ప్రసవానికి, తగ్గని జబ్బులకు, క్షౌర బద్ధకానికి,

పంతానికి, దేశాంతరంనుంచి అప్పుడే దిగబడ్డానికి, దిగులుకి, దీక్షకు, దీర్ఘ
చింతనకు, యోగులకు, బైరాగులకు, క్షురశాల దాకా తీసుకెళ్లే ఆధారం లేని ముసలి
వాళ్ళకు, ముసల్మాన్ సోదరులు కొంత మందికి- గడ్డం ఒక సంకేతం.




 స్వాభావికంగా శారీరక సౌందర్యానికి ఆట్టే విలువ ఇవ్వని విరాగులూ బారెడు

గడ్డం పెంచుకోవడం రివాజే. సాధారణంగా దేవుడు ప్రత్యక్షమయేంత వరకు రుషులు
గడ్డాలు, మీసాలు పుట్టల్లా పెంచే వాళ్లని పురాణాలు ప్రమాణాలు
చూపిస్తున్నాయి. బైబిలులో చాలా పాత్రలకు గడ్డాలు తప్పని సరి. నిప్పు
రాజేయడానికి రాయిని రాయితో రుద్దడం తెలుసుకున్న మానవుడు గడ్డం గీయడానికి
రాయిమీద కత్తిని సాన బెట్టడం ఎప్పటినుంచి మొదలు పెట్టాడో బైటపెట్టే
ఆధారాలు ఇంతవరకు బైటపడినట్లు లేవు. గుహలమీది పాత చిత్రాల్లో సైతం
ఆదిమానవులకు మరీ ఆట్టే పెరిగిన గడ్డాలు, మీసాలు ఉన్న దాఖలాలు కనిపించవు.




 మన కృష్ణుడి మీసాలు వివాదాంశమైనంతగా గడ్డాలు కాలేదు. ఎందు చేతనో?!

అవునూ.. రవివర్మ గీసిన చిత్రాలన్నింటిలో మగ దేవుళ్ళు (ఒక్క శివుడు మినహా)
అందరూ అప్పుడే నున్నగా గీసిన చెక్కిళ్లతో కనిపిస్తారు కదా.. ఆ కాలంలోనే
క్షురకర్మ విధానం స్వర్గంలో అమల్లో ఉందనా అర్థం?గడ్డాలమీద ఎవరైనా గడ్డాలూ
మీసాలు పెరిగిందాకా పరిశోధనలు చేస్తే గానీ తెమిలే అంశాలు కావివన్నీ!




 తెల్లవాళ్ళకు ఈ గడ్డాలంటే ఆట్టే గిట్టవు లాగుంది. పాచిమొహంతోనే ఏ

ఎలక్ట్రిక్ షేవరుతోనో గడ్డం పని పట్టిస్తే గాని బాహాటంగా దర్శనమీయరు.
ఒక్క ఫాదర్లు మాత్రం .. పాపం..  పెరిగిన గడ్డాలతో కనిపిస్తారు. అక్కడి
మేధావులకూ ఇక్కడ మన మునులకు మల్లేనే బారెడు గడ్డాలు, మీసాలు. గడ్డాలు
మేధస్సుకు బాహ్య  సూచన లాగుంది. గడ్డం లేకుండా కార్ల్ మార్క్సుని
గుర్తించ గలమా? అబ్రహాం లింకను అనగానే నల్లవారి  హక్కుల పోరాటంకన్నాముందు
గుర్తుకొచ్చేది ఆయనగారి బారెడు నెరసిన గడ్డం.




 మహా మేధావులకే కాదు మాంత్రికులకూ గడ్డాలు సంకేతమే. మన పాతాళ భైరవి

మార్కు ఎస్వీరంగారావు గడ్డం ఎంత సుప్రసిద్ధమో అందరికీ తెలుసు. ఏదన్నా
దుష్ట ఆలోచన చేయాలంటే   శకుని మామలు దుర్మార్గులు ధూళిపాళలాగా మెడ ఓ
వారకు  వాల్చేసి గడ్డం దువ్వుకునే వాళ్ళేమో!  అవునూ.. ఇన్నేసి లక్షల
లక్షలు  కోట్లు రకరకాలుగా కుమ్మేస్తునారు కదా ఇవాళ రాజకీయ నాయకులు! ఒక్క
శిబూ సెరన్ కి తప్పఈ బవిరి గడ్డాలు గట్రా మరి ఎవ్వరికీ బైటికి కనిపించడం
లేదు! ఎందుకో?




యోగా గురువు రాందేవ్ బాబా  భృంగామల తైలంతో పెంచే గడ్డంతో కనిపిస్తారు.

రవి శంకర్, జగ్గీ వాసుదేవ్, చిన జీ అయ్యరు, సుఖబోధానంద స్వామిలాంటి
ఆధునిక అధ్యాత్మిక గురువులకూ ఎవరి తరహాలో వాళ్ళకు చిన్నవో పొన్నవో
గడ్డాలు కద్దు. మొన్నజరిగిన ఎన్నికల్లో మోదీగారిని మళ్ళా విజయలక్ష్మి
వరించడానికి ప్రధాన కారణం ఆయన తెల్ల గడ్డంలో దాక్కొని ఉందేమోనని అనుమానం!
రాహుల్ బాబాను చూడండి! ఎప్పుడు చూసినా తాజ్ మహల్ పాలరాయి గచ్చు మాదిరిగా
నున్నగా  చెక్కేసిన చెక్కిళ్ళతో తాజాగా కనిపిస్తారు. మరి ఎంత పోరితే
మాత్రం విజయం ఎట్లా సిద్ధిస్తుందని?




 దీర్ఘ కేశపాశాలతో ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా ఆట పట్టిస్తారో ఏ శృంగారకావ్యం

చదివినా అర్థమవుతుంది.   మగవాడు దానికి  బదులు తీర్చుకునే  ఆయుధాలే ఈ
గడ్డాలు, మీసాలు. మీసాల మీద మోజు పడ్డంతగా గడ్డాలమీద ఆడవారు మోజు పడతారా?
మాసిన గడ్డంతో దగ్గరి కొస్తే ఈసడించుకుంటారు గదా అని సందేహమా? మొన్నటి
వరకు గడ్డాలు మీసాలు ఓ నాగరిక అలంకారం అన్న సంగతి మీరు మర్చి పోయారు.
నిన్నటికి  అవి వికారం అయితే కావచ్చు. మళ్ళీ ఇవాళ వాటికే మంచి రోజులు
వచ్చేసాయ్! సినిమా హీరోలనుంచి చిల్లర తిరుబోతుల దాకా ఎవరి ముఖారవిందాఉ
తిలకించినా   చిరుగడ్డాలే! గడ్డం  మగతనానికి తిరుగులేని చిరునామాగా
మారిపోయింది.




మగ వాళ్లకి వద్దన్నా వచ్చేవి.. ఆడవాళ్లకి కావాలన్నా రానే రానివి ఈ

గడ్డాలు, మీసాలే!  ఆధిక్యానికి తిరుగులేని ఆయుధాలవి. వాటిని కావాలని
కాలదన్నుకోవడం  మగవాళ్ల తెలివితక్కువతనానికి నిదర్శనం.




'నువ్వసలు మొగాడివేనా?'  అని ఎదుటి పక్షం వాళ్ళు ఎన్నడూ సవాలు విసరకుండా

ఉండాలంటే రాజకీయనేతనే వాడు  పిసరంతైనా  గడ్డమో, మీసమో పెంచుకోవడం ఒక్కటే
శరణ్యం. ఆడువారి బారు జడలకు సమాధానం మగవారికి  గడ్డాలు, మీసాలే. తరుణంలో
గడ్డం పెరగని మొగవాడిని ఏ ఆడపిల్లా పెళ్లాడటానికి చచ్చినా ఇష్ట పడదు.




ఫ్రెంచి వాళ్ళను ప్రపంచ ప్రసిద్ధం చేసింది ఈ గడ్డమేనని మర్చి పోవద్దు.

యోగికైనా యోదుడికైనా ప్రపంచంలో ఎక్కడైనా గడ్డమే  ఘనమైన మార్కు. గడ్డం
గొప్పదనాన్ని పసిగట్టలేక దాన్నొక చాదస్తంగా కొట్టి పారేస్తున్నాం.
తాతయ్యలకే గడ్డాలనే పాత రోజులు పోయాయి.




ఆది దేవుడినుంచి ఆరుద్ర దాకా రకరకాల గడ్డాలు. గడ్డం లేని శివాజీని

ఊహించుకోవడం కుదరదు. వీర బ్రహ్మేంద్రస్వామివారి కాల జ్ఞాన మహిమలన్నీ
ఆయనగారి గడ్డంలో నుంచే పుట్టుకొచ్చాయని నమ్మే భక్తులూ కద్దు. గడ్డం ఆట్టే
పెరగని లోటును దుబ్బు జుట్టుతో పూడ్చుకొన్నారు చూసారా  పుట్టపర్తి సాయి
బాబా. ఒక్క బుద్ద భగవానుడికి మినహా మరే ప్రబోధకుడికి గడ్డాలు లేవు
చెప్పండి?! మత స్థాపకులకనేనా.. మత ప్రచారులకు సైతం మంగలి కత్తంటే
గిట్టదు. గమనించండి




గాంభీర్యానికి, యోగ్యతకు, అనుభవానికి, ఆలోచనకి గడ్డం తిరుగులేని  బాహ్య

చిహ్నం. గ్రీసు దేశంలో  వీరులనుంచి వేదాంతుల వరకు అందరికీ గడ్డాలే.
ప్లేటో, సోఫాక్లీసు, హోమరులకు గడ్డాలు మీసాలే గ్లామరు. టాల్ స్టాయి గడ్డం
రష్యాలో నవ శకానికి నాంది పలికింది. మన గురుదేవుని జ్ఞానసంపదంతా  అతగాని
గుబురు గడ్డంలోనే దాగి ఉంది. నిరాండంబరం ఒక విధానంగా పెట్టుకోబట్టి గాని
లేకుంటే మన మహాత్ముడూ గడ్డాలు మీసాలతో ప్రపంచాన్ని మరింతగా ఊపేసుండేవారే.




ఒక్క అలెగ్జాండరుకే గడ్డం అంటే ఎందుకో చెడ్డ కోపం.  సైన్యం గడ్డాలు

పెంచుకోరాదని ఆదేశించాడు. యుద్ధాలల్లో శత్రువు చేతికి జుత్తు
అందించాల్సొస్తుందన్న భయం కాబోలు! ప్రపంచాన్ని గడగడలాడించిన యోధుణ్ణి
గడగడలాడించింది మరి గడ్డమే! పీటరూ తన రాజ్యంలో గడ్డాలమీద పన్నులు
విధించాడు.  నెపోలియను, సీజరు  గడ్డాలకు వ్యతిరేకులు అయితేనేమి.
ఔరంగజేబు గడ్డాలు లేని వాళ్ళ నుంచి  పన్నులు పీకాడు.




ఎంత మందికి  కూడు పెడుతున్నాయో   గడ్డాలు, మీసాలు! తిరుమల రాయునికి హుండీ

ఆదాయమెంతో మగ భక్తుల గడ్డం, మీసాల మీద రాబడి అంతకు పదింతలు.  క్షురకర్మ
చేసే వాళ్ల నుంచి, కత్తెర సామాను తయారుచేసే పరిశ్రమల వారి దాకా ఎందరో ఈ
మగవాళ్ల గడ్డాలు, మీసాల మీదనే ఆధారపడి దర్జాగా బతికేస్తున్నారు.




 అన్నింటా సమానత్వం కావాలని నినదించే ఆడవాళ్ళు మగవాళ్ళ ఈ గడ్డాల జోలికి

మాత్రం రావటం లేదు.  స్త్రీల సవరాలకు మగవారి స్వచ్చంద కేశపాశాలే ముఖ్యమైన
దినుసులు కదా మరి!




 గడ్డాలున్నంత వాళ్లంతా యోగులు, యోగ్యులవాలని అర్థం కాదు. సీతమ్మవారిని

ఎత్తుకెళ్ళిన రావణాసురుడు బవిరి గడ్డాన్ని అడ్డం పెట్టుకున్నాడు.
ఆషాఢభూతులకు బారెడు గడ్డాలు. ఆశారాం బాపూలు, నిత్యానంద స్వాములూ
ఆకర్షణీయమైన గడ్డాలతోనే అమాయకులను మోసం చేసారు. తస్మాత జాగ్రత్త మరి.




క్లియోపాత్రావంటి  సొగసుగత్తెలకంటే  కనుముక్కు తీరులో కాస్తంత వంపు

ఉంటుంది. ఆ సొంపే  ప్రపంచ చరిత్రను ఎంతో  విచిత్రంగానైనా మలుపు
తిప్పింది. మగవాడికి మరి ప్రత్యేక ఆకర్షణ ఏముంది? గడ్డాలూ మీసాలే గతి. ఏ
గడ్డంలోని ఏ  నలుసు మెరుపు  చరిత్రనింకో  మలుపు తిప్పుతుందో.. ఎవరికి
తెలుసు?




చాందసమనే కాదు రాజసం తొణికిసలాడే ఈ గడ్డానికి ఇవాళ అగ్రరాజ్యంలో ఓ

ప్రత్యేక దినం కద్దు(అక్టోబరు 18).  'ఈరోజు ఉండి.. రేపు రాలిపోయే జుత్తు
మీద వృథాగా ప్రేమ ఎందుకు? గీకి పారేయండి సంపూర్ణంగా ' అని తెల్ల బాబులంతా
వేదాంతం వెళ్ళబెట్టి రేజర్లు బిగించే రోజు అది. గడ్డం విలువ గ్రహించ లేక
గదా ఆ ఉద్యమాలన్నీ! మన దగ్గర ఎన్ని ఉపయోగాలో గదా ఈ గడ్డాలు.. గుబురు
మీసాల వెనక?




ఇక్కడా మగవారు బవిరి గడ్డాలన్నీ చెక్కించి పారేస్తేనో? ఇంతకాలం

కనిపించకుండా పోయిన   ఎంత మంది దొంగ వెధవులు, దొంగనోట్ల వెధవలు,  దొంగ
ఓట్లు వేయించుకుని గెలిచిన  వెధవలు, దొంగతనంగా ఎర్ర చందనం దుంగల్ని దేశం
దాటించిన వెదవలు, దొంగ పాసుపోర్ట్లతో దర్జా  వెలగబెట్టే వెధవులు,  దొంగ
ధ్రువపత్రాలతో సర్కారు ఉద్యోగాలు వెలగబెడుతున్న వెధవలు, దొంగ మాటలు
చెప్పి కోట్లు వసూలు చేసి బోర్డ్లు తిప్పేసిన  వెధవులు, దొంగ హామీలు
గుప్పించి ఆడవాళ్లని మోసం చేసిన వెధవలు, దొంగతనంగా ఫోటోలు తీసి
ఆడపిల్లల్ని వేధిస్తున వెధవలు..  అబ్బో ఇంకెంత మంది దొంగ వెధవులు అంతా
ఒక్కసారే మూకుమ్మడిగా బైటపడి అల్లకల్లోలమయి పోతుందేమో కదా?




ఈ కరోనా వైరస్ కాలుష్యం కారణంగా జనాల ఎవ్వరినీ బైటకు  అనుమంతించడంలేదు.

సెలూన్లకూ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో   మరి నిజమైన మగ జనాభా దేశంలో
ఎంత ఉందో నిగ్గు తేలేదీ ఇప్పుడే.




ఆడ పేర్లతో ‘కతలు’ నడిపే మగరాయుళ్ల బండారాలన్నీ  ఈ విధంగా అయినా

బైటపెడతాయి కదా! మరకా మంచిదే ఒక రకంగా అన్నట్లు కోవిడ్ -19 కోరకుండానే
స్త్రీ జాతి సముద్ధరణ విషయంలో  పాంచాలిని కాచిన  గోవిందుడి పాత్ర
నిర్వహిస్తుందన్నమాట!




శుభం!

కర్లపాలెం హనుమంత రావు
***
(19 -04-2020 నాటి సూర్య - సంపాదకీయ పుట కాలమ్ - సరదాకే! ) 

Thursday, April 16, 2020

ఆంగ్ల మాధ్యమం ఉత్తర్వుల పట్ల ఉన్నత న్యాయ స్థానం తీర్పు ప్రశంసనీయం !



ఇప్పటి మన సర్కారు బళ్లల్లో తెలుగు సతుకులే చట్టుబండల్లా సాగుతున్నాయి. ఇంకా ఇంగ్లీషు చదువులా? ! అవెంత లచ్చనంగా ఉంటాయో అందరికీ తెలుసు | అసలు 5 తరగతుల వరకు పసిబిడ్డ కంటి ముందు తల్లి పలికే భాష తాలూకు అక్షరం తప్ప మరోటి కంటబడదాదు . ఎంత డబ్బు ఉబ్బు ఉన్నవాడి బిడ్డలకైనా  అదే నియమం నిర్బంధంగా అమలు చెయ్యాలి ! 
కాన్వెంటు బోర్డు కనబడినప్పుడే   పెట్టిన వాళ్ళకు జనం  బడితెపూజ గాని చేసుంటే   సమాజానికి ఇప్పుడు  ఈ భ్రష్టత్వం తప్పుండేది. చక్కగా చదువుకోవలసిన పసిబిడ్డ అక్షరాభ్యాసంలో కూడా పుస్తకాల పేరుతో బండెడు బండెడు చెత్తా చదారమా? యూనీఫారాల వంకతో బట్ట ముక్కల  వ్యాపారమా  ? ఇంగ్లీషు బళ్ల వెనకా ఎంత పెద్ద పెద్దల లాలూచీ  తంత్రం దాగుందో! అర్ధముయితే మామూలు జనం ' ఛీ ' కొడతారు .
చదువు సంధ్యలు సరిగ్గా వంటపట్టనోళ్లు, పుట్టీ పుట్టగానే కంటి ముందు డబ్బు కట్టలు , కాసులు పోసేస్తే చాలు  ఏదైనా పట్టుకు పిసికేసే  నౌకర్లూ,  చాకర్లూ ఇంటి  నిండా  మట్టంగా కనిపించే  నడమంత్రపు సిరిగాళ్ల వల్లనే ఈ గల్లాపెట్టె చిల్లర వ్యాపారాలు! కనీసం కులపరంగా సంక్రమించే వృత్తి మీద అయినా ధ్యాసపెట్టరు. నామర్దాగా భావిస్తారు. బడితెల్లా  ఎదిగిన తరువాత ఆ గాడిదలు  వుత్తిగా  తిని తొంగున్నా లోకానికి  అదో కొంత మేలు. ఊహు(! మళ్లా తండ్రుల్లాగా, తాతల్లాగా గల్లాపెట్టెలు గలగల్లాడాలి. ఏ గడ్డైనా సరే గతికి గడించాలని కుతి. నిజంగా జీవితంలో ఎన్నో  కష్ట నష్టాలకు  ఓర్చి  ఒక్కొక్కటిగా నిచ్చెన మెట్లు ఎక్కుతూ పైకొచ్చిన  బుద్ధిమంతులను చూపించి .. వాళ్లంతా  మిమ్మల్ని  తొక్కేసే పైకొచ్చారన్నట్లు నమ్మించెయ్యడం! వాళ్లంత వాళ్లని  చేస్తామని కన్యాశుల్కంమార్కు గిరీశాలను మించి గప్పాలకు దిగంగానే ..వెంకటేశంలా  అమాయకులు, ఏ విషయమూ లోతుగా అర్థం చేసుకోవడం అంతగా పట్టుబడే వాతావరణంలో పెరగని   బడుగు జాతి తమ్ముళ్లు   పైపై ప్రలోభాలకు  గురికారా? ఇంగ్లీషు ముక్క పుట్టినప్పటి బట్టి నాలుక్కింద నలక్కపోతే   వాళ్లను సర్కారు కొలువులు దగ్గరిక్కూడా  రానివ్వవు; అమెరికాలాంటి అగ్రరాజ్య లక్ష్మమ్మలు తమ డాలర్ దుర్గాల  వైపుకి తొంగైనా చూడనివ్వవు - అని బుర్ర శుద్ధిచేస్తారు.ఈ బ్రెయిన్ డ్రెయిన్ వల్లనే తల్లిదండ్రులు ఇట్లా చిన్నబడి దశ నుంచే తల్లిభాష నుంచి తమ పసిబిడ్డలను  దూరంగా లాగేయడం! దురదృష్టం ! 
అటు కొలువులకు చాలని విద్యాప్రమాణాలు, ఇటు కులవృత్తులకు కొరగాని అరకొర పరాయి భాష దర్పాలు! బాగుచేసే నెపంతో  పాడుచేసేందుకే  ఈ ఉబ్బు ఉబ్బిన  బడుద్ధాయిలు ప్రయివేటు విద్యా సంస్థలు పెట్టుకునేది. ఎటూ సర్కారుల్లో ఉండేది తమ బోటి దర్జావర్గాల వారే ! కాబట్టి ఖజానా సొమ్మును ఫీజు రియంబర్స్ అనే  నాజూకు  పేరుతో ( అర్హతలు ఉన్న ఏ కొద్ది మందికో ఇట్లాంటి వెసులుబాట్లు తప్పక   కల్పించాల్చిందే..  అభ్యంతరంఉండనక్కర్లేదు) ఐక్యూలతో నిమిత్తం లేకుండా  అందరినీ  ఒకే క్యూలో నిలబెట్టి చేర్చుకుంటే జనం సొత్తు తేరగా ఒల్లుకోవచ్చు . పొల్లు అయితేనేమి .. దొరల చదువులు చెప్పిస్తున్నారన్న కృతజ్ఞతా భావన అమాయక పేదవర్గాలలోముప్పరిగొనే   విధంగా చేసి బలమైన ఓటు బ్యాంకు స్థిరపరుచుకునే దొంగెత్తు ప్రాథమిక స్థాయిలో  పరిసరాలతో సంబంధం లేని పరాయి భాషను పసి మెదడుల అలసేలా పడేసి రుద్దడం . 
అందరికి అన్నీ తెలుసు. వృత్తికి, కొలువుకు రెండిందాలా చెడే వంచిత వర్గాలకు తప్ప ఇంగ్లీషు చదువు వెనకున్న కుతంత్రం. ఇప్పడు జగన్ బాబు వంతు! రేపు వస్తే గిస్తే  చంద్రబాబుదైనా  .. ఇంకో చపలచిత్తం  బాబుదైనా ఇదే తంతు ! నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిజాయితీ ఉన్న నాయకులకు మంచి చెడులు పారదర్శకంగా ప్రజలకు  వివరించే సదవకాశం. ఆ సాహసం చెయ్యలేని మేడిపండు రాజకీయం జీవం పోసుకున్న క్షణం నుంచే ప్రజాహితం మరణకాలం మరింత ముందుకు జరిగినట్లయింది. జనం మేలు నిజంగా కోరుకునే ప్రజాహితవాదులే తల్లిభాష జవజీవాలకు ఇక  దిక్కు. 
తల్లిభాష ప్రయోజనాలు ఒకళ్లొచ్చి ప్రత్యేకంగా  చెప్పడమేంటి.. సిల్లీ గాక పోతే! తమది కానిది తతిమ్మా భాషలలో మరేదైనా సరే పసిమెదడుల వికాసానికి ఏ విధంగా అడ్డొస్తుందో  వివరించే  దుర్గతి తెలుగువాడికే పట్టడం  నిజంగా ఒక దురదృష్టo. నిజానికి ప్రజలు వరసబెట్టి ఎన్నుకునే ప్రభువుల   నిర్వాకం ! 

ఎంత పోరితేనో గానీ  విద్యాహక్కు చట్టం మనం సాధించుకోలేకపోయాం.  ఇంకా సాధించవలసిన హక్కులు ఎన్నో ఉన్న మాటా నిజం. దక్కుదల అయిన  హక్కుల పైనే ఆయా బాధ్యులు   చిత్తశుద్ధితో చేపట్టవలసిన  చర్యలు ఇంకా బోలెడు ఉండి పోయాయి ' పెండింగ్ ' లో ! 
సర్కారు బడులు నడుస్తున్న తీరు లోపాల పుట్ట.  ఆడపిల్లల అవసరాలు చాలా చోట్ల ఇంకా తీరవలసి ఉంది. బడి పుస్తకాల బరువు మీద చట్టాలైతే వచ్చాయిగానీ ఆచరణ విషయంలో అంతా తూతూ మంత్రo సామెతే . చట్టం అంగీకరించిన  విద్యార్థుల, గురు శిష్యుల దామాషాలను  తమాషాగా తీసుకొనే దృశ్యమే అసేతు హిమాచల పర్యంతం కనిపించేది. రవాణాసౌకర్యాల మాట దైవమెరుగు, నిర్దేశిత పాఠ్య ప్రణాళికలలోనే మెరుగుదలకై తీసుకొనే చర్యలు  శూన్యం. రాజకీయ అవసరాలను తీర్చే  బోధనేతర కార్యక్రమాలలో గురువులే కాదు , శిష్యుల పాత్రా  తాతలకాలాన్ని కూడా ఇప్పుడు తలదన్నుతోంది. అడపా దడపా శ్రీ కోర్టులు 'ఛీ(' కొట్టినా దులపరించేసుకుని నాలుగ్గోడల మధ్యన రేపటి తరాలకు విద్యాబుద్ధులు మప్పే పని నుంచి గురువులను తప్పించడం, ఆ లెక్కలు ఈ లెక్కలంటూ ఉళ్లు పట్టుకు తిరిగి రమ్మనడం తిక్కప్రభువులకు రానురాను మరీ ఎక్కవవుతున్నది. ఒప్పందాల ప్రకారం చెల్లించే నెలసరి జీత భత్యాలకే దిక్కులేని పరిస్థితుల్లో అదనపు పని భారానికి అదనంగా  చెల్లించమని గురువు కోరడం  సర్కారు పెద్దలకు దురాశ అనిపిస్తున్నదిప్పుడు. హమీలిచ్చిన  ఉద్యోగాలు లేవు. కంటి తుడుపు కింద  పెట్టిన అర్హతా  పరీక్షల ఫలితాలు వేళలకు ఎందుకు వెలువడవో విధాతకైనా తెలియం 'దేవ'రహస్యాలయిపోయాయి . ఇచ్చా పూర్వకంగా ప్రాణవాయువు గొట్టం ప్రభుత్వ విద్యాశాఖఅనే  రోగి ముక్కు నుంచి ఏ క్షణాన   ప్రభుత్వాలే ఉడలాగేస్తాయో! ఇన్ని అయోమయ  అస్తవ్యస్త పరిస్థితుల మధ్య..  అవతల కార్పొరేటు. ప్రయివేటు విద్య నిర్వాహకులకు  ఇంటట్లుళ్లకు మించి తామే పరోక్షంగా మనుగుడుపులు  చెల్లిస్తూ కూనారిల్లే సర్కారు బళ్లచదువులకు  ఒక్క పంతుళ్లను మాత్రమే బకరాలను చేస్తున్నారు. చూచిరాత తప్ప..  ఆలోచించి మాత్రమే సమాధానాల పత్రాలు నింపాలన్న ప్రాథమిక ఇంగితం ఎన్నడో మసకేసిన పరీక్షల విధానం నుంచి మంచి ఫలితాలు రాబడితేనేమి ? రాబట్టకపోతేనేమి? ఎండవానలకు, చలిగాడ్పులకు  గట్టిగా తట్టుకొని వరసగా వారం పాటయినా  నిలకడగా ప్రభుత్వ పాఠశాలలు నడవలేని నిర్వాకం కళ్లారా చూస్తూ .. ఎంత గతిలేని బడుగుజాతి సంసారయినా బాగుపడాలని కోరుకునే తన బిడ్డ భవిష్యత్తును   బందీలదొడ్డి బడులకు వదిలేయగలడా? 
తెలుగో .. ఇంగ్లీషో .. తన సంతానం గట్టిగా నాలుగు ముక్కలు పొట్టకు పట్టించుకుని తన కాళ్ల పైన తాను సొతంత్రంగా జీవిక గడుపుకుంటే.. అదే పది వేలనుకునే  కన్నవాళ్లే నిజానికి కోట్లలో  కనిపిస్తారు ఈ దేశంలో. ఆ తరహా వాతావరణం  నుంచి సర్కారు బడులను  దూరం చేసిన నిర్వాకం ప్రభుత్వాలదే. మొన్నటి దిల్లీ ఎన్నికలలో చీపురుకట్ట పార్టీకి అంత పెద్దెత్తున మద్దతు కూడిరావడంలోని ప్రధాన కారణాలలో కేజ్రీవాలు సర్కారు విద్యపట్ల కనబరిచిన అపరిమిత శ్రద్ధ. కోర్పొరేషన్ పాఠశాలలనూ కార్పొరేట్ చదువుల కొట్లకు మించి విద్యా ప్రమాణాలలో  , రవాణా, సౌకర్యరంగాలలో అభివృద్ధి చెయ్యడం. 
విద్యాహక్కు  కల్పించిన సౌకర్యాల  మీద మరింత శ్రద్ధ పెంచి ప్రభుత్వవిద్య పరంగా కనీసం ప్రాథమిక స్థాయి  వరకైనా మాతృభాష మాధ్యమ విషయంలో  పట్టు పెంచాలి నిజానికి. అందుకు విరుద్ధంగా సామాజిక శాస్త్రవేత్తల శాస్త్రబద్ధ వాదనలను వినేపాటి చొరవైనా చూపకుండా  రాత్రికి రాత్రే రాష్ట్రమంతటా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అంటూ  జగన్ బాబు ప్రభుత్వం వేసిన వీరంగాలు వీగిపోవడం ప్రస్తుతానికే   ఉరట కలిగించే అంశం . ప్రజాహితం కోరుతూ  తమ ముందుకు వచ్చిన  వ్యాజ్యాలను క్షుణ్ణంగా  విచారించి ప్రభుత్వం తెచ్చిన అదేశాలు విద్యాహక్కు  చట్ట స్థూర్తికి పూర్తిగా విరుద్ధంగా  ఉన్నాయంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం  కొట్టివేసింది. తర్పుపాఠం పూర్తిగా బైటకు రాక మునుపే ప్రభుత్వంలోని  ప్రముఖులు కొందరు విరుద్ధ తీర్పును ఎప్పటిలాగానే ' చంద్రబాబు వత్తాసు ' వర్గానికి అంటగట్టే ప్రయాస ప్రారంభించేసారు. రాష్ట్రం జగన్ బాబు జాగీరూ కాదు. చంద్రబాబు ఇంద్రభవనమూ కాదు . రాష్ట్రానికి సంబంధించిన ప్రతి వ్యవహారమూ  రాష్ట్రంలో పుట్టి పెరిగి ఎదో విధంగా ఈ  రాష్ట్రంతో సంబంధ బాంధవ్యాలు కలిగివున్న   ప్రతి తెలుగువాడిదీ - అన్న ఇంగితం ప్రభుత్వాయి 
 నడిపే వారికి ఉండాలి  ముందు . అప్పుడే ప్రాథమిక విద్య పరంగా తాము తమ కుండే లాభాల దృష్టితో  తీసుకున్న ఈ  ఇంగ్లీషు మాధ్యమం తొందరపాటు ఆదేశాలను కొట్టి పారేసిన కోర్టు ఉత్తర్వుల్లోని ఉచితానుచితాలు బుర్రకెక్కేది. 
***

కర్లపాలెం హనుమంతరావు 
16 - 04 - 2020 

Tuesday, April 14, 2020

సున్నాలం కరోనా .. మాఫ్ కరోనా! - కర్లపాలెం హనుమంతరావు



ఒక్క పెట్టున వచ్చి పడితివే .. దిక్కు తోచడం లేదిక్కడ మాకు !
రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా మా తిక్కమానవజాతిని
మూడో కన్ను తెరిచి మాడ్చి మసి చేస్తున్నావిదేమి   న్యాయం కరోనా!
నాలుగు రాళ్లు గడించినంతనే  కరోనా
పంచభూతాల కధినాథుల  మనుకుంటామనా శిక్ష ?

ఆరు ఖండాల నిండా ఆరున్నొక్క  రాగాలే యీ రోజున
సప్తసముద్రాలూ నీకేమాత్రం అడ్డంకులు     కాకపోయె  
అష్టదిగ్బంధనా లెందుకిలా  ? తగునా కసి కరోనా మా అర్భకజాతి పైన ?

నవరసాల మహాకావ్యం  మాది, మే మరులయని   వీర్రవీగుతాం; అందుకనా
పది పదులైనా నిండక ముందే  కోవిడ్ -పంథొమ్మిదిలా  దుర్బలుల మీదిలా దుందుడుకుతనం?

సున్నాలం కరోనా ! ఒప్పుకుంటున్నాం,  మా సన్నాసి తప్పులు మాఫ్ కరోనా!
కరుణించు! కలియుగాంతం దాకా   నీ వైరస్ ఘరానాలనే కథలు కథలుగా తలుచుకుంటాం.. హఠోనా !

- కర్లపాలెం హనుమంతరావు
14 - 04 - 2020




Monday, April 13, 2020

అలెగ్జాండరు జగజ్జేతా?!- -కర్లపాలెం హనుమంతరావు






'అలెగ్జాండర్ , ది గ్రేట్' అని మాకు ఎనిమిదో తరగతిలోనో, తొమ్మిదో తరగతిలోనో   ఇంగ్లీషు పాఠం ఉండేది. ఆ పాఠం పంతులుగారి నోట వింటున్నప్పుడు, అచ్చులో రోజూ చూస్తున్నప్పుడు 'ఆహా! అలెగ్జాండర్.. నిజంగా ఎంత గ్రేటో!' అనుకుంటుండేవాళ్లం ఆ చిన్నతనంలో.
పెరిగి పెద్దవుతున్నా చాలాకాలం వరకు ఆ అభిప్రాయంలో మార్పు రాలేదు. కానీ ఆ మధ్య సుధాకర్ ఛటోపాథ్యాయ అనే చరిత్ర పుస్తక రచయిత రాసారని చెబుతున్న ' ద అకమీనీడ్స్ అండ్ ఇండియా' పుస్తకంలోని కొద్ది భాగం ఆంధ్రజ్యోతి సంపాదక పుటలో శ్రీమతి ముదిగొండ సుజాతారెడ్దిగారు రాసింది అనుకోకుండా చదవడం జరిగింది. 'ఆహా! అయ్య.. అలెగ్జాండరుగారిలోని గొప్పతనం ఇదా!' అని ఆశ్చర్యపోవడం నా వంతయింది.
ప్రపంచం మొత్తాన్ని జయించాలన్న పిచ్చి కోరికతో చేసిన యుద్ధాల్లో  ఆయనగారు అవసరమైన చోట యుద్ధనీతులక్కూడా తిలోదకాలిచ్చేసినట్లు చదివితే అవాక్కవక తప్పదు ఎవరికైనా. పెషావరు యుద్ధంలో అలెగ్జాండరుకి ఎదురైన ప్రతిఘటన చాల బలమైనది. తానే స్వయంగా యుద్ధరంగంలోకి ఆయుధం పట్టుకుని దిగినా గెలుపు అంత సునాయాసంగా దక్కే అవకాశం కనిపించలేదు.  అశ్వకులఅనే బలమైన శత్రుజాతిని  వీరోచితమైన పద్ధతిలో ఎదుర్కోలేక రాత్రి పూట చాటుగా చీకటి మాటున కోటలోకి జొరబడి  మూకుమ్మడిగా ఉచకోత కోయించాడని రాసుందా గ్రంథంలో!
అలెగ్జాండరు రక్తంలో ఉన్నది యోధత్వమా? ప్రపంచదేశాల సంపదనంతా కొల్లగొట్టి స్వదేశానికి తరలించుకుపోవాలన్న డబ్బువుబ్బరమా? ఆ వ్యాసంలో రాసింది చదివేవారికి ఎవైరికయినా ఆ అనుమానం రాక తప్పదు.
మేసిడోనియా దేశం(ఇప్పటి స్లోవాకియా) రాజు ఫిలిప్స్ ముద్దుల బిడ్ద అలెగ్జాండరు. అతనికి చిన్నప్పట్నుంచే యుద్ధాల పిచ్చి. అరిస్టాటిల్ శిష్యరికంలో మెరికలాగా తయారయాక ప్రపంచ దేశాలన్నింటి మీదా పెత్తనం చెలాయించాలన్న కొత్త తుత్తర మొదలయిందంటారు.
సైన్యాన్ని, వనరులని దండిగా సమకూర్చుకుని ముందుగా దగ్గర్లోనే ఉన్న అకీమీనియన్ దేశం మీదకు దండయాత్రకెళ్లాడు. అప్పటికే మూడో తరం ఏలుబడిలో పడి   బలహీనంగా ఉందా దేశ రక్షాణ వ్యవస్థ.  డేరియన్ని ఓడించడం మంచినీళ్ల ప్రాయమయింది. ఆ విజయం ఇచ్చిన అత్మవిశ్వాసంతో ధనాగారంగా వర్ధిల్లే మన భరతఖండం మీద కన్నుపడింది అలెగ్జాండరుకి.
దారిలోని ఈజిప్టు, అసీరియాలాంటి దేశాలను ఒక్కొక్కటిగా వశపరుచుకుంటూ పర్షియా రాజధాని పెర్సిపోరస్ చేరుకొన్నాడు అలెగ్జాండర్. కొన్నాళ్లపాతు తనకూ. తన సైన్యానికి విరామం అవసరమనిపించిందేమో..  ఆ దేశం రాజు మీద పై చేయి సాధించినా అతని కూతుర్ని వివాహమాడి మనుగుడుపు అల్లుడు మాదిరి సుఖాలు అనుభవించాడు. సామదానభేదదండోపాయాలలో ఏది ఎప్పుడు ప్రయోగించాలో అరిస్టాటిల్ శిష్యరికంలో బాగా ఆకళింపు చేసుకున్న జిత్తులమారి! లేకపోతే దక్షిణ గాంధారం రాజు అంబి తక్షశిలలో అలెగ్జాండర్  ముందు అంత సులభంగా ఎందుకు    స్వీయాత్మార్పణ చేసుకొంటాడు? అక్కడి గెలుపు ఇచ్చిన కిక్కులో అలెగ్జాండర్ జీలం.. చీనాబ్ నదుల మధ్య ప్రాంతాల్లో ఉన్న పౌరస్ మీదకొచ్చి పడ్డాడు.
పౌరస్ పౌరుషం అలెగ్జాండర్ మునుపెన్నడూ రుచి చూడనిది. పౌరస్ గజబలం ముందు  అలెగ్జాండర్ ఆశ్వికదళం డీలాపడిందంటారు.
నిజానికి అక్కడ అలెగ్జాండరుకి ఏ మేరకు విజయం లభించిందో ఇతమిత్థంగా చెప్పలేం. యూరోపియన్ హిస్టోరియన్స్ రాసిన చరిత్రే మనకు ఆధారం అప్పట్లో. తమ యూరోపు యుద్ధవీరుడికి ఆసియావాసుల ముందు  పరాజయం కట్టబెట్టడం తలవంపులుగా భావించినట్లుంది.. మధ్యగోళ చరిత్రకారులు ఆ అపజయాన్ని కనీసం రాజీగా కూడా చిత్రించేందుకు ఇష్టపడలేదంటారు సుధాకర్ ఛటోపాధ్యాయ. పౌరస్ మీద పై చేయి సాధించినా అలెగ్జాండర్  శత్రువుకు రాజ్యాన్ని ఉదారంగా  వదిలేసి వెనక్కి మళ్లినట్లు తమ చరిత్రలో రాసుకున్నారని ఆ చరిత్రకారుడి  ఫిర్యాదు.
‘The classical authors have evidently twisted the facts to glorify their one hero'(p.21) అని ఆ పుస్తకంలో రాసి ఉన్న దాన్ని బట్టి అలెగ్జాండర్ విజయం అనుమానస్పదమే అనిపిస్తుందిప్పుడు.
ముందున్న ప్రాంతమంతా ఎగుళ్లు దిగుళ్లు. సముద్రాలు, నదులు, దట్టమైన అడవులు. పాములు, తేళ్లులాంటి ప్రాణాంతకమైన జీవులు సంచరించే ప్రాంతాలే అన్నీ. దట్టంగా వర్షాలు దంచికొడుతున్నాయ్ ఆ సమయంలో. వరస యుద్ధాలతో బాగా అలసిపోయుంది సైనికదళం. అన్నిటికీ మించి అప్పటి వరకు వివిధ దేశాలలో దోచుకున్న సంపదతో తృప్తి చెంది తిరిగి స్వదేశంలో తమవారితో సుఖపడాలన్న కోరిక.. ఆ సైనికులలో మొండితనాన్ని కూడా పెంచిందంటారు.  అతికష్టం మీద అలెగ్జాండర్  వాళ్లకు నచ్చచెప్పుకుని ముందుకు నడిపించినా.. సింధునది దక్షిణ ప్రాంతంలో మల్లులు, క్షుద్రకులు అనే రెండు జాతులు ఉమ్మడిగా చేసిన దాడిలో అలెగ్జాండరే స్వయంగా విషపూరితమైన  అమ్ము శరీరానికి తాకి గాయపడ్డట్లు కథనం.
ఏదేమైనా ప్రపంచ విజేత కావాలన్న తన కల నేరవేరక ముందే అలెగ్జాండర్ తిరిగి స్వదేశానికి పయనమయిన మాట మాత్రం పచ్చి వాస్తవం.
అంభంలో కుంభం అన్నట్లు.. ఆ తిరుగు ప్రయాణం మధ్య దారిలో మలేరియా జ్వరం తగులుకొని బాబిలోనియాలో(సూసానగరం అని కొందరంటారు) క్రీ.పూ 324లో ఆఖరి
శ్వాస విడిచాడు అలెగ్జాండర్. ప్రపంచాన్ని లొంగదీసుకోవడం మాట అటుంచి మృత్యువుకు తాను అంత నిస్సహాయంగా లొంగిపోయాడు.
అయినా 'అలెగ్జాండర్ .. జగజ్జేత' అంటూ యూరోపియన్లు  తమకు అనుకూలంగా రాసుకున్న తప్పుల తడక చరిత్రను తెల్లవాడి పుణ్యమా అని మనం వల్లెవేసాం!  మన పిల్లల చేతా ఇప్పుడు వల్లెవేయిస్తున్నాం!
చరిత్రలూ చాలా రకాలుగా ఉంటాయి. ఎవరి విశ్వాసానికి తగ్గవి వాళ్లు  చదువుకుంటున్నారిప్పుడు! అలాంటప్పుడు ఏ సమాచారాన్నని తప్పు పట్టగలం? ఏ సమాచారం కరెక్టని నెత్తి మీద పెట్టుకోగలం?
-కర్లపాలెం హనుమంతరావు
13 -04 -2020
బోథెల్, యూ.ఎస్.ఎ


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...