Wednesday, February 3, 2016

పోతన హాలివుడ్ టెక్నిక్- ఓ సాహిత్య గల్పిక


కాలం  తెలుగుపిల్లసజ్జుకి ఏ బి సి డి.. అంటూ అమ్మ కడుపునుంచి ఊడిపడ్డ మరుక్షణంనుంచి అర్థమయీ అర్థంకానీ ఆంగ్లాక్షరాలు బట్టీయం వెయ్యడం మినహా.. - అమ్మ.. - ఆవు.. - ఇల్లు.. - ఈశ్వరుడు.. అంటూ తనకు పరిచితమయిన పరిసరాలనుంచి ప్రాపంచిక జ్ఞానాన్ని అలవర్చుకొనే అవకాశం బొత్తిగా సన్నిగిల్లిపోతోంది! ప్రపంచీకరణ ప్రభావంతో పాశ్చాత్యలోకంవైపుకి, డాలర్లమీదకి, పడమటి డాబు-దర్పంమీదకి శృతిమించిన ఆకర్షణ పెంచుకొన్న తల్లిదండుల పెంపకంలో పెరిగే పిల్లలకు ప్రాథమికదశలో అందవలసిన మౌలిక జ్ఞానం అందడం లేదు!
పసితనంలో  పుష్టికరమైన ఆహారం లభించని బాలలకు ఎదిగివచ్చిన తరువాత అణిగివున్న రోగాలు అమాంతం  కమ్ముకొంటాయని ఆరోగ్యనిపుణుల అభిప్రాయం. విజ్ఞానమూ ఆహారం వంటిదే!మెదడుకు మేత! బాల్యదశలో అందవలసిన మాతృసంబంధమైన  పౌష్టికవిజ్ఞానం మేథోవ్యవస్థకు  సరైన పాళ్లలో అందని వారందరూ   ఎదిగి వచ్చిన తరువాత    ఆత్మన్యూనతనే రుగ్మత పాలవుతారు.   పరాయితనంమీద  అపరిమితమైన మోజు.. సొంతతనంమీద విపరీతమైన  చులకన ఈ రుగ్మత లక్షణాలు. వెరసి వెన్నెముక బలంగా లేని పై మెరుగుల డొల్లయువతతో తెలుగునేలలు రెండూ నిండిపోయే  ప్రమాదం ముందు పొంచి ఉంది.
ఇదంతా ఇప్పుడు అనుకోవడానికి ఒక కారణం ఉందిమా టీవీలో
చిత్రనటుడు   నాగార్జున నిర్వహిస్తున్న  'మీలో కోటీశ్వరుడు ఎవరు?' కార్యక్రమంలో తెలుగు సంస్కృతికి సంబంధిచిన చిన్నపాటి ప్రశ్నలు ఎదురైనప్పుడు  బి.టెక్కులవంటి పెద్ద చదువులు పూర్తి చేసిన అభ్యర్థులుకూడా సరైన సమాధానాలు గుర్తించలేకపోతున్నారు! భారతం రచించిన కవిత్రయం వరసను సరిన క్రమంలో గుర్తించింది ఏడుగురిలో కేవలం ఇద్దరుబమ్మెర ఇంటిపేరుగాగల కవి రాసిన కావ్యం  ఏమిటి?' అన్న ప్రశ్నకు 'శ్రీ మదాంధ్ర మహాభాగవతం' అన్న సమాధానం చెప్పగలవారు ఎందరుంటారో ఎవరికి వారే ఊహించుకోవాలి
తేటతెలుగులో బమ్మెర పోతన అత్యంత అద్భుతమైన ప్రతిభా వ్యుత్పత్తులతో సంస్కృత భాగవతాన్ని అనువదించిన సంగతి నేటి తరానికి ఎవరైనా చెబితేనేగదా తెలిసేది! పేరుకే   అనువాదం కానీ..  ఆ రచన  అక్షరమక్షరంలో  ఆంధ్రుల మహాభాగవతమేనని, బమ్మెర గ్రామంలో పుట్టి పెరిగిన పోతన తన సహజ ప్రతిబా సామార్థ్యాలతో దాదాపుగా ఒక  స్వతంత్ర రచనలాగా సాగించిన  ఆ భాగవతంలోని ప్రతి పద్యమూ.. దేనికదే  ఓ రసధుని మాదిరి  చదువరుల చవులూరిస్తుంటుందని పెద్దలకు తెలిస్తేనే గదా పిన్నలకు నూరిపోసేది!
పోతన భాగవతం చదివి సంబరపడేందుకు  దైవభక్తే ఉండనవసరం లేదు. భగవంతునిమీద విశ్వాసంతో నిమిత్తం లేకుండా ఆ పురాణంలోని ప్రతి పద్యాన్ని తుదికంటా ఆస్వాదించే నాస్తికులు ఎందరో ఉన్నారు.   ఉండవలసింది రసహృదయం! ఇప్పుడే ఏదో ఓ వ్యాసానికి సమాచారం సేకరించే పనిలో ఉన్నప్పుడు  అనుకోకుండా పోతన భాగవతంలోని వామనావతార ఘట్టంలోని రెండు పద్యాలు కంటబడ్డాయి! మనసు నిండింది.
'ఇంతింతై వటుడింతయై , మరియు దా నింతై , నభో వీధిపై
నంతై , తోయదమండలాగ్రమున కంతై , ప్రభారాసిపై
నంతై , చంద్రునికంతయై , ధ్రువునిపై నంతై , మహర్వాటిపై
నంతై , సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాడాంత సంవర్ధియై'
ఒక పద్యమైతే
'రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై , శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్'
అనేది రెండో పద్యం.
మొదటి పద్యం ఎక్కడో ఓ చోట ఏడో ఓ సందర్భంలో  అరకొరగానైనా చెవినబడని తెలుగువాడు ఉండడనే అనుకుంటున్నాను. వాటి అర్థ తాత్పర్యాలువివరాల జోలికి  వెళ్లడం ఇప్పుడు నా ఉద్దేశం కాదునా విస్మయమంతా రెండో పద్యం టెక్నిక్కుని గురించే!

సూర్యబింబం ఆకాశంలో అక్కడే ధగధగా వెలుగుతోంది. దానికి అడ్డుగా  భూమ్మీద నిలబడి  ఉన్న వటుడు బలిముందు  క్రమంగా పెరిగే విధానం పద్యాంశం. From Bali  point  of view..  అవతారమూర్తి ఎదుగుదలను వివరించాలన్న ఆలోచన పోతనామాత్యుడికి రావడం ఆశ్చర్యం
సూర్యుడు ఓంప్రథమంగా వటుడి  నెత్తిమీది గొడుగులాగా, తరువాత నెత్తిన మెరిసే మణిలాగా.. ఆ తరువాత తళుకులీనే చెవిపోగులాగా, ఆ తరువాత మెడలో ధగధగలాడే ఆభరణంలాగా.. అదే క్రమంలో వరుసగా  చమక్కుమనే భుజకీర్తిలాగా, ముంజేతి కంకణంలాగా, నడుముకు చుట్టుకునే వస్త్రం  మెరుపంచులాగా.. అలా కాలిఅందెలా   మెరుపులీనుతూ  చివరికి  పాదపీఠం స్థాయికి సూర్యభగవానుడు దిగివచ్చే 'సాపేక్ష సిద్ధాంతంఊహించాడు  మహానుభావుడు బమ్మెర పోతనామాత్యుడు!
ఒక  కదలనివస్తువు పరంగా   దానిముందు కదిలే   మరోవస్తువు కదలికలను వర్ణించవచ్చన్న ఆలోచన ఆ పల్లెటూరి కవిరైతు బుర్రలోకి  15వ శతాబ్దంలోనే రావడం ఒక అద్భుతమైతే.. దానిని  హాలివుడ్ చిత్రాల  సాంకేతిక స్థాయితో పోల్చదగ్గ చమత్కార పంథాలో  తెలుగుదనం పరిమళం చెదిరిపోకుండా   రసజ్ఞులైన చదువరులకు  కిక్కొచ్చే విధంగా అందమైన ఛందో పదబంధాలలో బందించి మరీ అద్భుత పదచిత్ర విన్యాసం చేయడం మరో అద్భుతం!
ఇవాళ స్పీల్ బర్గ్ హాలివుడ్ చిత్రాల్లో చూపింఛే పనితనం ఆరు శతాబ్దాల కిందటే  ఆంధ్రదేశంలోని ఓ మారుమూల పల్లెలో  హాలికవృత్తి చేసుకొనే కవిపోతనకు ఎలా అబ్బిందో?!  అద్భుతం అనిపించదా ఆలోచిస్తున్న కొద్దీ!
 పోతన తెలుగువాడు అవడం.. తెలుగులో భాగవతం రాయాలన్న సంకల్పం ఆ మహానుభావుడికి  కలగడం.. తెలుగుభాష చేసుకొన్న అదృష్టంఆ అదృష్టం అందుకోలేని వాతావరణంలో నేటి బాలబాలికలు పెరగడం వారి దురదృష్టం!
-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...