Wednesday, April 13, 2016

పుస్తకం ఓ రెక్కల గుర్రం- ఈనాడు సంపాదకీయం

తెలుగు లోగిళ్లలో తొట్టతొలిగా చిట్టిబాలలచేత పుస్తకం పట్టించినప్పుడు ఒప్పజెప్పించే పద్యం, 'తల్లీ! నిన్ను దలంచి'. బుద్ధి, మనసు కలిసి ఉండే హృదయపీఠంమీద కొలువై ఉన్న చదువులమ్మను- దోషరహితమైన సుస్పష్ట శబ్దసౌందర్యం, సుదూర కాలతీరాల వరకు జగన్మోహనకరంగా వ్యాపింపచేసే శక్తియుక్తులు ప్రసాదించమని చేసే ప్రార్థన అది. వాగీశ్వరి హస్తభూషణం పుస్తకం. 'తలవాకిటను మెలగు ఆ చెలువ'ను విద్యాధిదేవతగా ఆరాధించే సంస్కృతి భారతీయులది. పుస్తకం, విత్తం, కన్య  ధర్మార్థకామాల ప్రతీకలు భారతీయులకు. కన్య..విత్తం  కొంతమందికే సొంతం. గ్రంథజ్ఞానం అందరికీ చెందే ఆస్తి. చర్మచక్షువులతో చూడసాధ్యంకాని మహితాత్ముల మనోభావాలను, జీవితానుభవాలను ముందుతరాలకు అందజేసే ఉత్తమ సాధనం పుస్తకమే. వ్యాసపీఠంమీద రామాయణం ఉన్నదంటే వాల్మీకి మహర్షి ఆత్మ మనముందు కూర్చుని ధర్మప్రబోధం చేస్తున్నట్లే లెక్క. గీతాపఠనం కొనసాగుతున్నప్పుడు సాక్షాత్ ఆ జగద్గురువు ప్రత్యక్షమై జీవితంమీద మన విశ్వాసాలను పెంచుతున్నట్లే గణన. కరుణశ్రీ భావన గుర్తు తెచ్చుకుంటే సరి. 'కలువలు పూచినట్లు/ చిరుగాలులు వీచినట్లు/ తీవలు తలలూచినట్లు/ పసిపాపలు చేతులూచినట్లు/ ఆత్మలు పెనవేసినట్లు' కవిత్వం సృజించే కాళిదాసునుంచి కృష్ణశాస్త్రుల వరకు  ఆ గ్రంధబంధాలవల్లే  ముందు తరాలందరికీ  ఆత్మబంధువులుగా మారింది.  గుంటూరు శేషేంద్రశర్మ అన్నదీ అదే. పుస్తకంలో మునిగిన మనిషి పుట్టలో మునిగిన ముని అని ఆరుద్ర చమత్కారం. మనసును సానబెట్టుకొనే చందనపు చెక్క గ్రంథం. 'గ్రంథ నిలయంబు శారద కనకపీఠి/ గ్రంథ నిలయంబు కవుల శృంగారవీటి/ గ్రంథ నిలయంబు మోక్ష సద్గతికి చీటి' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తి నూటికి నూరుపాళ్లు సూటి అయిన మాట.

విశాల విశ్వాన్ని ఓ పుస్తకాల గదిగా కుదించాలన్నా.. పుస్తకాల గదిలోనే ఓ విశాల విశ్వాన్ని సృష్టించాలన్నా అక్షరానికే సాధ్యం. అక్షరం  త్రేతాయుగంనాటి రాముడిని కలియుగంనాటి దేవుడిగా మారుస్తుంది. తెలుగు త్యాగయ్యను తమిళులకు ఆరాధ్యుడిగా మారుస్తుంది. కంచెర్ల గోపన్న చెర చీకటి శోకాలాపనలను రామదాసు కీర్తనలుగా వెలిగించినా, హాలుని గాథా సప్తశతిని గొప్పకథలుగా మనకు ఇప్పుడు వినిపించినా..  ఆ ఘనతంతా అక్షరానిదే. గ్రంథస్థ వ్యవస్థే లేకపోతే వేమన వేదాంతం బ్రౌనుదొర వరకూ పాకేదా! అన్నమయ్య పదసంపద ఈ మాత్రమైనా జాతికి దక్కేదా! పరదార కామన, అధికార లాలస, సాధుజన పీడన సర్వనాశనానికి మూలకారణాలవుతాయన్న  ధర్మసూక్ష్మం- రామాయణ, భారత, భాగవతాదులుగా రాయబట్టే నీతులుగా నేటికీ  నిలబడి ఉంది.. హరిశ్చంద్రుడి చరిత్ర గాంధీజీని సత్యాగ్రహిగా మార్చింది. మోహన్ దాసు సత్యప్రయోగాలే మార్టిన్ లూథర్  పోరుకు ప్రేరణ. చదువుసాముల ప్రాధాన్యతేమిటో హిరణ్యకశిపుడి నోట చెప్పించాడు భాగవతకవి పోతన. విద్యాగంధం లేక జనుషాంధులవలె కాలాన్ని వృథాచేసే కొడుకులను విష్ణుశర్మ అనే విద్వాంసుడి హస్తగతం చేస్తాడు  'నీతిచంద్రిక' కథలో సుదర్శన మహారాజు. సద్గ్రథం  'పలు సందియముల దొలచును/ వెలయించు నగోచరార్థ విజ్ఞానము, లో/కులకు అక్షి' అన్న పరవస్తు చిన్నయసూరి పలుకుల్లోని వాస్తవాన్ని  ఇసుమంతైనా సందేహించవలసిన అవసరం లేదు. ఒకానొకప్పుడు విద్యావంతుల నట్టింట ఓ పుస్తకాల గదీ తప్పనిసరి అలంకారమే. వివాహాది శుభసందర్భాల్లో పుస్తకాల చదివింపులు  సదాచారంగా వస్తుండేది. గతంలో గ్రంథపఠనం ఒక ఉత్తమ  సంస్కార చిహ్నం.

ఒక తరంవరకూ విద్యాలయాల్లో బాల విజేతలకు పుస్తకాలే బహుమతులుగా దక్కేవి. వాటి స్థానాన్ని ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా 'ఎలక్ట్రానిక్ నోట్‌బుక్కు' ల్లాంటి ఆధునిక పరికరాలు ఆక్రమిస్తున్నాయి. సాంకేతికంగా మనిషి ఎంత పురోభివృద్ధి సాధిస్తున్నా..  పుస్తకం స్థానం ఏ ఈ-పరికరం పూడ్చలేదు. టీవీ, చలనచిత్ర మాధ్యమాలు ఎంత శక్తివంతమయినవయినా- పుస్తకంలా ఎన్నటికీ 'వ్యక్తిగతం' కాలేవు. అమ్మలా బిడ్డకు మంచి మాటలు నేర్పించేది, బొమ్మల పుస్తకమే! తండ్రినుంచి దండన భయం ఉండచ్చు. ఏ దండనోపాయం  లేకుండానే బిడ్డని అడ్డదారినుంచి తప్పించగలిగేదీ పుస్తకమే! రోమన్ సేనాపతి మార్కస్  అరీలియసుకి యుద్ధ ఆందోళనల మధ్యసైతం  సాంత్వన కోసం శిబిరంలో పుస్తకం పట్టుకుని కూర్చోడం అలవాటు. ఎన్ని రాచకార్యాల వత్తిడిమీదున్నా రాయలవారు  విద్వద్గోష్ఠులు విధిగా నిర్వహించేవారు. తాళపత్ర గ్రంథాలను తులసిదళాలంత పవిత్రంగా భావించిన తరాలు మన తాతలవి. ఇప్పుడా 'పుస్తకాల పిచ్చి' పిచ్చి పుస్తకాలస్థాయికి దిగజారటమే దిగులు పుట్టించే  అంశం. అమెరికన్ రచయిత ఎమిలీ డికెన్సన్ శ్లాఘించినట్లు, పుస్తకం- 'మానవాత్మను మనోవేగంతో స్వప్నలోకాలన్నీ తిప్పి తీసుకురాగల రెక్కల గుర్రం'. ఆ అపూర్వ అనుభవాన్ని పసిపిల్లలనుంచి దూరం చేస్తున్న కంప్యూటర్ సంస్కృతి మీద గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంవారు పరిశోధనలు సాగిస్తున్నారు. ఆధునిక పరికరాల వినియోగం అతిగా ఉన్న అమెరికా, స్వీడన్ దేశాల బాలలు మేధోపరిజ్ఞాన రంగంలో బాగా వెనకబడిపోతున్నారన్నది వారి తాజా పరిశోధనల ఫలితం. పుస్తక పఠనంమీద అధికంగా ఆధారపడిన ఇటలీ, హంగరీ దేశాల పిల్లల ప్రజ్ఞ- అభివృద్ధి చెందిన దేశాల బాలబాలికల ప్రతిభాపాటవాలకన్నా చాలా ముందంజలో ఉందని పరిశోధక బృంద నాయకురాలు ప్రొఫెసర్ మోనికా రోజెన్ నిర్ధారించారు. మితిమీరిన సాంకేతిక వినియోగ వ్యసన సంస్కృతినుంచి అచ్చు అక్షరాల సంస్కృతిని తిరిగి అందిపుచ్చుకోవాల్సిన అవసరం  ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కన్యాశుల్కం గిరీశంలాగా 'బయింగ్ బుక్స్... బార్బేరియస్!' అని ఈసడించుకుంటే- మనిషి కథ అడ్డం తిరగడం ఖాయం!
-సేకరణః కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు, ఆదివారం సంపాదకీయం, 18-12-2011లో ప్రచురితం)
(ఈనాడు యాజమాన్యానికి కృతజ్ఞతలతో)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...