Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

Saturday, May 12, 2018

నేటి మతోన్మాదానికి చారిత్రక నేపథ్యం ఉంది




ప్రకృతికి మనిషికి తాత్విక సంబంధంగా 
మొదలయినది మతం. మానవ పరిణామ దశల క్రమంలో ప్రారంభంలో అదో నమ్మకం.. ఆనక అదే ఓ విశ్వాసంగా బలపడింది. సమాజం అభివృద్ది చెందే వివిధ దశల్లో ఆ ‘మత’మే ఉన్నత వర్గాల వారు కింది తరగతుల వారిని తమ చెప్పుచేతుల్లో ఉంచుకొనే సాంస్కృతిక ఆయుధంగా మారిపోయింది. అదో చారిత్రక విషాదం.
మనిషి ఆదిమ దశలో ప్రకృతి నుంచి ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో తెలియని నిస్సహాయతతో ముప్పిరిగొన్న భయం నుంచి బైటపడేందుకు అదృశ్య శక్తులేవో ఉన్నాయని ఊహించుకొని. వాటిని కర్మకాండల ద్వారా సంతృప్తిపరిస్తే కష్టం నుంచి గట్టెక్కవచ్చని భావించాడు. అతగాడి అజ్ఞానం, అమాయకత్వం, అసహాయత, అవగాహనాలేమి ఇత్యాదుల వల్ల మొదలైన ఆ కర్మకాండలకు ఒక సైధ్దాంతిక రూపం కల్పించి పూజాదికాలు అతని జీవితంలో  ఒక ప్రధాన విధానంగా మార్చింది పూజారి వర్గం.   దైవసంబంధమైన ఆ కర్మకాండలు నిర్వహించే హక్కు కేవలం తమ చెప్పుచేతల్లో ఉంచుకుంది. పూజారికి దేవుడి ప్రతిరూపం అనే ఇమేజి స్థిరపడింది. మతం మీది అతని గుత్తాధిపత్యం ఎప్పుడూ ధిక్కరణకు గురి కాలేదు. అప్పుడప్పుడు ఏ చిన్న  చైత్యన్యవంతమైన ఆందోళన చెలరేగినా వాటిని మొగ్గదశలోనే తుంచివేయడం జరిగేది. పాలకుల అండదండలు పుష్కలంగా గల బ్రాహ్మణ వర్గానికి అదంత కష్టసాధ్యం కూడా కాలేదు.
అత్యధిక సామాన్య వర్గ ప్రజల సాంస్కృతిక, జీవన విధానాలు  మతం పునాదుల మీదే నిర్మితం కావడం మతానికి సమాజం మీద అమితమైన పట్టును తెచ్చిపెట్టింది. భూస్వామ్య వర్గమూ  మంది సాంస్కృతిక బలహీనతలను సొమ్ము చేసుకోవడంలో వెనుకబడింది లేదు.  తన వంతు కుట్రగా కులాల ప్రాతిపదికన  సమాజాన్ని మరో మారు చీల్చిందది.. ప్రాబల్యం అధికంగా గల కులాలకు ఉత్పత్తి వృత్తులతో నిమిత్తం లేదు. సమాజ సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల మీద  పెత్తనం మాత్రం  ఆ పూజారి వర్గాలకే అప్పగించబడింది. భూస్వాములకు, పూజారులకు మధ్య అంతర్గతంగా కుదిరిన ఈ అన్యాయపు ఒప్పందం మూలకంగా ఉత్పత్తి వృత్తుల మీద ప్రత్యక్షంగా ఆధారపడిన బడుగు జీవులు మరోమారు ఘోరమైన దోపిడీకి గురయ్యారు.
మధ్యయుగాలలో ఈ దేశం మీదకు దండెత్తుకొచ్చి పెత్తనం చేసిన మొగలాయీల మొదలు ఇటీవల వరకు అధికారం చెలాయించిన వలస పాలకుల వరకు.. అందరిదీ ఒకే దోపిడీ పంథా. ఏ అగ్రవర్ణానికీ, అగ్రవర్గానికీ  బడుగుల జీవన స్థితిగతుల  మెరుగుదల పట్ల  ఆసక్తి లేకపోయింది. పాలకులతో భూస్వామి వర్గాలు రాజీ ధోరణితో సర్దుకుపోతే.. అర్చక వర్గాలు మతం మీద తమకున్న పట్టు చూపించి ఆయా పాలకులను  అధీనంలో ఉంచుకొన్నాయి.
వలస పాలకుల వల్ల జాతీయ సాంస్కృతిక జీవనంలో సగుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని భావించే వాళ్లేమీ తక్కువ లేరు. వలస పాలకులు తెచ్చిన ఏ సాంస్కృతిక సంస్కరణా బడుగుల మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా సాగింది లేదు.  ఏ కొద్ది మార్పో వాళ్ల జీవితాల్లో సంభవమైనప్పటికీ జఅదీ  పాలకులకు మేలు కలిగించే వరకు సాగి అక్కడితో ఆగిపోయేది. పీడిత వర్గాలు చైతన్యవంతమైతే   తమ అధిపత్యానికి ఎదురయ్యే సవాళ్ళు  అగ్రవర్ణాలు, వర్గాలు ముందస్తుగానే ఊహించి తగు జాగ్రత్తలు తీసుకొనేవి.
చార్వాకుడి నుంచి గౌతమ బుధ్దుడి దాకా, భక్తి ఉద్యమం మొదలు గాంధీయిజం వరకు ఈ దేశంలోని అన్ని ఉద్యమాలు మతవాదులతో సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరించాయి. అలా వ్యవహరించాయి కాబట్టే వాటి మనుగడను కొంతవరకైనా సాగనిచ్చింది మతవర్గం. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీజీ భూస్వామ్య వ్యవస్థను ఎక్కడా ధిక్కరించిన దాఖలాల్లేవు. పైపెచ్చు జనసామాన్యం మనసులు సులువుగా గెలుచుకొనేందుకు మతచిహ్నాలను సైతం విశృంఖలంగా  వాడారాయన. గాంధీజీ తెచ్చేందుకు ప్రయత్నించిన సంస్కరణల్లో చాలా భాగం మతవాదాన్ని మరింతగా సమర్థించే దిశగానే సాగాయంటే కొంతమందైనా నొచ్చుకుంటారని తెలుసు. నిష్ఠురమనిపించినా నిజం నిజమే అవుతుంది కానీ.. ఎన్ని ముసుగులు వేసినా అబద్ధం కాబోదు కదా!
స్వాతంత్ర్యం వచ్చినా ఈ దేశ ఆర్థిక విధానాలలో ఇదే తరహా ద్వంద్వ వైఖరి  కొనసాగింది. జాతి సాధించిన అభివృధ్దిలో అధిక శాతం పది శాతంగా ఉన్న అగ్రవర్ణాలు, వర్గాల వద్దే పేరుకు పోవడం మునుపటి కథ. ఇప్పుడు ఆ పది శాతం  రోజు రోజుకీ మరింతగా కుచించుకుపోతోందన్న  అంచనాలు వింటున్నాం.
లాభాల బాటలో ఉన్న సంపన్న వర్గాలు ఏ కారణాల కోసం తమ  సౌకర్యాలను స్వఛ్చందంగా బడుగు వర్గాలకు ధారాదత్తం చేస్తాయి? తమ అభివృధ్ధికి ఆటంకం కలిగించే బీదల పాట్లను కనీసం అర్థం చేసుకొనేందుకైనా ఆసక్తి చూపించవు. సరికదా.. నూతన విజ్ఞానం రగిలిస్తున్న సామాజిక స్పృహ కారణంగా  అభివృధ్దిలో తమకు న్యాయంగా దక్కవలసిన వాటా కోసం బడుగులు ఇప్పుడు చేస్తున్న ఆందోళనలకు  అడ్డుకట్ట వేసేందుకు  కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తాయి కూడా! అందులో భాగమే మతాల క్రియాశీలక రాజకీయ పాత్ర.
గతంలో మాదిరి  మతాన్ని కేవలం సామాజిక ఆధిపత్యం కోసం మాత్రమే వాడుకొనే ఆయుధంగా భావించడం లేదు అగ్రవర్ణాలిప్పుడు. మతం నెత్తికీ ఒక రాజకీయ టోపీ తగిలించి.. చేతికో జెండా అందిస్తే మిగతా అన్ని చిటుకుల కన్నా శక్తివంతంగా సామాన్యుల జీవితాల్లోకి చొరవగా చొచ్చుకు పోవచ్చు. మకిలి అంటకుండా స్వకార్యం సాధించుకొనేందుకు  మతానికి మించిన గమ్మత్తు మత్తు పదార్థం ఈ దేశంలో  ఇప్పటికి వరకైతే మరోటి  లేదు.
మసీదులు పడగొట్టి ఆలయాలు కడతామన్న అజెండా ప్రకటించుకున్న మర్నాటి నుంచే అప్పటి వరకు ఏదో మూల నక్కి ఉన్న  మతవాదం రాజకీయ రూపం ధరించి అప్రతిహతంగా ముందుకు దూసుకొచ్చింది ఈ దేశంలో. 2014లో పాలకులు మార్పిడి జరిగినప్పటి నుంచి కాశ్మీరు టు కన్యాకుమారి.. సర్వత్రా పెచ్చుమీరుతున్న ఉన్మాద ధోరణులకు.. గతంలోనే సామాజిక వ్యవస్థ మూలాలలో విత్తబడిన మతబీజాలే మూలకారణం. ప్రజాఉద్యమాలకు సైతం దేవుళ్లకు  ముడుపులు కట్టే వైరుధ్యం సామాన్య ప్రజలు ప్రశ్నలకు గురికాక పోవడం అందుకే ఈ దేశంలో సంభవమయింది! ప్రజలు తమ రెక్కల కష్టంతో నింపిన బొక్కసాలను యజ్ఞాలు, యాగాలు, పుష్కరాలు, దీక్షల పేరుతో పాలకులు ఖాళీ చేసేందుకు తెగబడుతున్నా ఇదేమని ప్రశ్నించాలన్న స్పృహే కరువైన ప్రస్తుత రాజ్యంలో  మతాతీత కులాతీత లౌకిక ప్రజాస్వామ్య సంక్షేమ వ్యవస్థను కాంక్షించడం ఎంత వరకు సబబు?! వలస పాలకుల నుంచి రాబట్టుకున్న రాజ్యమే లౌకిక సమాజాన్ని నిర్మిస్తుందన్న ఆశ ఇంకా మిగిల్చుకున్నవాళ్లకూ ఓ నమస్కారం.
పీడనకు గురిచేస్తున్న  మతవిశ్వాసాల ముందే భయభక్తులతో లొంగి   బతుకీడ్చేందుకు సిధ్దపడే పీడితుల మానసిక  బలహీనతలను శాస్త్రీయకోణంలో విశ్లేషించుకోవలసిన అవసరం మునపటి కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. పీడిత వర్గాలను సంఘటిత పరిచి సరైన దిశకి మళ్లించే ప్రగతి కాముక  సాహిత్యం  అందుకే ఇప్పుడు మరింత ముమ్మరంగా  విస్తరించాల్సుంది. మతంలోని గమ్మత్తు మత్తునుంచి సామాన్యుణ్ని బైటకుతెచ్చే సామాజిక బాధ్యత మేధావుల మీదే ఎక్కువగా ఉంది. మతోన్మాదం పెచ్చుమీరుతున్న ఈ దుర్మార్గ తరుణంలో మౌనం పాటించడమంటే మేధావులు తెలిసి  జాతికి చేస్తున్న ద్రోహం కిందే లెక్క.
*** 
-కర్లపాలెం హనుమంతరావు
(మతోన్మాదం .. చారిత్రక నేపథ్యఁం -హరిపురుషోత్తమరావు – విభిన్న. పుట. 33- ప్రేరణతో)


Monday, May 7, 2018

మన దేశములో ముస్లిముల పరిస్థితి - ఒక పరిశీలన -



మన దేశం ముస్లిములలో మెజార్టీ కడు పేదవారు. అత్యంత అవమానితులు. దళితుల మాదిరే రెండో తరగతి పౌరులు. నిరక్షరాస్యులు. సామాజికంగా వెనకబడినవాళ్లు. జనాభాలో ముస్లిముల వాటా 12 శాతం. ఆ మేరకైనా రిజర్వేషన్లు దక్కడం లేదు. ఎక్కడో ఒకచోట ఏదో ఒక మిష మీద తాము చేయని గతకాలపు దోషాలకు అమానుషంగా శిక్షలకు గురవుతున్న అల్పసంఖ్యాక వర్గం ముస్లింలే! ఒక వ్యూహం ప్రకారం నడిచే ఈ పైశాచిక దాడుల్లో ఒక్కోసారి కుటుంబాలకు కుటుంబాలు, ఊళ్లకు ఊళ్లు కొంపా గోడూ పోగుట్టుకొని నడిరోడ్దు మీదకొచ్చి పడే పరిస్థితులు పెచ్చుమీరుతున్నాయ్! ముస్లిముల మీది దాడుల్లో అరెస్టవుతున్న వాళ్లూ ముస్లిములే అవడం మరో విచిత్రం.
ఎన్నడో జరిగిపోయిన తప్పులకి ఇప్పటి తరాలు  ద్వేష చిహ్నాలుగా మారే విచిత్ర పరిస్థితులు ముస్లిం జాతి విషయంలో విశ్వవ్యాప్తంగా ఉన్నప్పటికీ.. ఈ దేశంలో  ఆ ఆగ్రహ జ్వాలలు ఆగకుండా మండే రాజకీయ గుండంలో భాగంగా ఉంటున్నాయ్! యూరపులో  కైస్తవులకు ముసల్మానులు అనలు మనుషుల్లానే కనిపించరు! క్రీస్తుని శిలువ వేసిన అపరాథానికి  యూదులు  చిత్రహింసల రూపంలో రుసములు చెల్లిస్తూనే ఉన్నారు తరాల తరబడి సాగిన జర్మన్ నాజీల పాలనలోనే ఈ దమన కాండ పరాకాష్టకు చేరిందనుకుంటే ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న ద్వేషచరిత్ర దానికి పోటీగా తయారయింది. ముసల్మానుని సదా అనుమానంగా, ద్వేషంగా చూసే నాజీ మనస్తత్వంతోనే మన దేశ హిందువులకు ఇప్పుడు సరయిన పోలిక!
దేశభక్తిని ప్రదర్శించమని, హిందువులను గౌరవించమని, దేశ ప్రధాన స్రవంతిలో భాగం కావాలని ఒక్క ముస్లిం మతస్తుల మీదే వత్తిడి పెరగడం వారి జాతీయతను అవమానించడమే! పది కోట్ల పైచిలుకు ముస్లిములు మాట్లాడే ఉర్దూభాషకి  ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అధికార హోదా లేదు! తతిమ్మా పేదల్లాగానే పనీ పాటా, ఇల్లూ వాకిలీ, తిండీ తిప్పలూ, రోగం రొప్పులతో  సతమతమయ్యే ముస్లిములను గురించి నాలుగు మంచి ముక్కలు విచారించడం మాని.. దేశ సంస్కృతి, మతం, భాష వంటి అంశాల ఆధారంగా ప్రధాన స్రవంతిలో కలిసిపోతేనే మంచిద'ని పద్దాకా సతాయించడం ఏ మతసామరస్యానికి నిదర్శనం? ముస్లిం కుటుంబంలో పుట్టిన కారణంగా..  ఆ వ్యక్తి పరాయిగడ్డ మతం మీద మాత్రమే ప్రేమ పెంచుకుంటాడని ఏ ఆధారంతో నిర్ధరణ జరుగుతున్నట్లో? సాటి పౌరులకన్నా ఒక మెట్టు తక్కువలో ఉన్నట్లు  నిత్యం తూట్లుపొడిచేటందుకు ఒక మాతాన్ని అడ్దుపెట్టుకోవదం సర్వ సత్తాక ప్రజాస్వామిక వ్యవస్థకు చేటు తెచ్చే పిచ్చిచేష్ట.  ఒక వ్యక్తిని తన సహజ, ప్రజాస్వామిక, ప్రాధమిక హక్కుల నుంచి మతం ప్రాతిపదికగా   దూరం చేయడాన్ని మన రాజ్యాంగం ఏ సెక్షంలో సమర్థించింది?!
ముస్లిముల పట్ల అధిక సంఖ్యాక వర్గాలకు ఉండే సందేహాలు, ద్వేషభావాలు  రోజు రోజుకీ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి! పాక్ లోనో, బంగ్లా లోనో జరిగే ఘోరాలకు ఇక్కడి ముస్లిములు నిలదీతకు గురవుతున్నారు! న్యూయార్క్ ట్రేడ్ సెంటర్ కూలిన రోజుల్లో భారతీయ ముస్లిములకు ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ప్రపంచంలో ఏ మూల ముస్లిం ఉగ్రవాదులు విధ్వంసం  సృష్టించినా దానికి ఇక్కడి ముస్లిములు బాధ్యత వహించాలనడం భావ్యమేనా? స్వేఛ్చగా వదిలేస్తే ఇక్కడి ముసల్మానులూ ముందు ముందు ఆ తరహా విధ్వంసాలకే   పాల్పడతారన్న  భయాందోళనలకు ఏ సహేతుకమైన కారణాలు కనిపించవు.  సాటి పౌరుల అకారణ భయాందోళనల కారణంగా గౌరవప్రదంగా జీవించే హక్కులు ముస్లిం జాతి కోల్పోవడం అన్యాయం! ప్రతి ముస్లిమునూ ఎల్లవేళలా ఓ కంట కనిపెట్టి ఉండటం దేశభద్రత దృష్ట్యా  ఎంతో అవసరం- అనే మిషతో ముస్లిములను నిత్యం వేధించే 'గౌరవప్రదమైన' పెద్దలకు, సంస్థలకు   మన్నింపులు పెరుగుతున్నాయ్! దేశ మతసామరస్య స్ఫూర్తికి ఇది మేలు చేయదు.
జ్ఞాపకాలూ, సంశయాలు సమస్తం ముస్లిములు అనగానే  ద్వేషం రంగునే పులుముకుంటున్నాయ్ ఈ దేశంలో! ముస్లిం మతంలో పుట్టిన పాపానికి అప్పుడే పుట్టిన పాపాయి కూడా స్థల కాలాదులతో నిమిత్తం లేకుండా దోషిగా అనుమానానికి గురి కావడం ఈ దేశ ప్రవచిత లౌకిక వ్యవస్థకు మచ్చ తెచ్చే చర్య.
నమ్మదగ్గ గణాంకాలు ఏవీ నిర్దరించకపోయినా ప్రతీ ముస్లిం పురుషుడు నాలుగుకు తగ్గకుండా పెళ్లిళ్లు చేసుకొని.. అడ్డూ ఆపూ లేకుండా పిల్లల్ని కంటూ దేశాన్ని ముస్లిం  పుట్టగా మార్చేస్తున్నాడన్న దుష్పచారం ఎప్పటినుంచో  సాగుతోంది. ఇప్పుడా ప్రచారానికి అధికారిక హోదా  తోడయింది! కానీ తాజా  జనాభా గణాంకాలు  ఈ ఊహలను సమర్థించడం లేదు. సుదూర భవిష్యత్తులో తమ మతస్తుల అత్యధిక సంఖ్యలో ఉండాలన్న లక్ష్యంతో పూట కూటికే దేవులాడుకొనే పేద ముస్లిం అడ్దూ ఆపూ లేకుండా బిడ్డల్ని కంటాడా? ఆ ఊహే హాస్యస్పదం.  
స్త్రీలను పరదాల్లో దాచి ఉండటం, వారి విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాయడం, మూఢాచారాలతో పీడించడం, సంతానార్థం వత్తిడికి గురిచేయడం.. వంటి అనాగరిక చర్యలు ఒక్క ముస్లిం మతంలోనే లేవు.  సామాజికంగా,  ఆర్థికంగా, మేధోపరంగా వెనకబడ్డ హిందూ అణగారిన వర్గాలలోనూ కనిపిస్తుంది. స్త్రీలు మగ సాయం ఆశించకుండా ఇంటి పనంతా స్వయంగా చూసుకోవాలి. ఆడదంటే వంటింటి కుందేలు. బైటకు వెళ్లవలసిన అగత్యపు పరిస్థితుల్లో మగ తోడు తప్పని సరి. పరాయి మగవారి కంటబడే సందర్భంలో మొగం కొంగులో దాచుకోవాలి. పెద్దలతో వ్యవహరించే సమయంలో నెత్తి మీది ముసుగు సర్దుకోవాలి. ఇంటి మగవాళ్లంతా భోజనాలు ముగించిన తరువాతే ఆడవాళ్లు తమ తిళ్లను గురించి ఆలోచించాలి. విద్య, వైద్యం, వినోదం వంటి రంగాలలో మగవారికే ముందు అవకాశం.. ప్రాధాన్యత. ఈ తరహా సంస్కృతి నిన్న మొన్నటి వరకూ హిందూ సమాజాలలోనూ ఓ సుసంప్రదాయంగా చలామణీ అయింది! అన్నిటికన్నా విచిత్రమైన విషయం - ఇవాళ విశాల భావాలతో  మెలిగే మధ్యతరగతి హిందూ వర్గాలు ముస్లిములు పాటిస్తున్నారని ఎద్దేవా చేసే  ఆచారాలనే అటూ ఇటూగా గతంలో తమ పెద్దలూ ఆచరించారన్న సత్యం విస్మరించడం! తామే  ప్రదర్శిచని మతసామరస్యాన్ని ముస్లిములు ప్రదర్శించడం లేదని ఆక్షేపించేవారే గొప్ప 'సంస్కర్తలు'గా ప్రస్తుతం కీర్తింపబడుతున్నారు! తమకు లేని విలువలు ముస్లిములకూ లేకపోవడం తమ విషయంలోలాగా వారి విషయంలోనూ వెనుకబాటుతనమే ముఖ్య కారణం కాగా.. తమ సంస్కృతి మీద కలసి కట్టుగా ముస్లింలు  చేస్తున్న విద్రోహ చింతన ఎట్లా అవుతుందో మరి హిందూ పెద్దలే తేల్చి చెప్పాల్సుంది!
నిజం చెప్పాలంటే మతపరంగా  అల్ప  సంఖ్యాకులైన ముస్లిములు ఈ దేశంలో  సామాజికంగా ఒక మానవీయ స్పర్శకు దూరమై,  తాము చేయని నేరాలకు నిష్కారణంగా సాటి పౌరుల వివక్షకు గురవుతున్నారు. ఊహపోహలతో చెప్పుకొస్తున్నది కాదు! స్వాతంత్ర సాధన సమర సందర్భంలో దేశ విభజన నేపథ్యంగా తూర్పు పాకిస్తాన్, పంజాబుల్లో జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనలు స్మృతిపథం నుంచి చెరిగిపోని పెద్దలు ఎవరినైనా అడిగి చూడండి! క్రూరత్వం, దేశద్రోహం అనే రెచ్చగొట్టే భావోద్వేగాలకు ముస్లిములనే ఎవరు.. ఎందుకు సంకేత చిహ్నాలుగా వాడుకొనే వ్యూహానికి తెరలేపారో  వివరంగా చెప్పుకొస్తారు.
ఏడు దశాబ్దాలు దాటినా ఆ  మతసర్పాల బుసలు సద్దుమణగనే లేదు. సరికదా..  విద్వేష పూరిత విషప్రచారాలు వేయిపడగలతో  మరింత జోరుగా విషం చిమ్ముతున్నాయిప్పుడు. పాపం పుణ్యం ఎరుగని ముస్లిం పేద కుటుంబాల బిడ్డలని  పాక్ ఏజెంట్లుగా చిత్రించి చిత్రవధలు  పెడుతున్న కథలు ఎన్నో వింటున్నాం. పేదలు, పీడితులు, అవమానితులుగా దళితులని గుర్తించి సంఘటిత పరిచే ఉదార మేధావులు  ముస్లిములకు జరుగుతున్న అన్యాయాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నట్లు? నిర్లిప్తత, నిరాసక్తతల ద్వారా ఫాసిస్ట్తు శక్తులకు  మరింత ఊతం ఇవ్వదలిచారా?
ఆత్మరక్షణ కోసం గత్యంతరం లేని  పరిస్థితుల్లో  అమాయక ముస్లిములు అవకాశవాద రాజకీయాలకు, తమ మతానికే చెందిన తీవ్రవాదుల ఉచ్చులకు చిక్కుకుంటున్నారు.  మత సామరస్యాన్ని మంట కలిపే శక్తులే   జాతి నిర్మాత పాత్రలు నటిస్తున్నాయిప్పుడు. తస్మాత్ జాగ్రత్త!


కన్నడ రచయిత 'బోళువారు మహమ్మద్ కుంజి' కథల సంకలనం 'దేవర గళ రాజ్యదల్లి'(దేవుళ్ల రాజ్యంలో) ముందు మాట- ప్రేరణతో
-కర్లపాలెం హనుమంతరావు

Sunday, September 24, 2017

నీటి తల్లికి నిత్య నీరాజనం- ఆంధ్రప్రభ సంపాదకీయ పుట వ్యాసం




యమునేచైవ గోదావరి సరస్వతి 
 నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఇహ పరాల అభ్యుదయం కోసం ఈ పుణ్యభూమి ఋషులు సామాన్యులకు అనుగ్రహించిన  ఈ శ్లోకం అంతరార్థం గ్రహిస్తే చాలు.. మనిషి  ఈ భువిమీదే దివిలో

మాదిరి దివ్యంగా జీవితం కొనసాగించేయవచ్చు. పాదాల అడుగులు నేలను  తాకిస్తూ ఆకాశాన ప్రభవించే సూర్యభగవానుడికి  దోసిలి నిండిన జలంతో నమస్కారాలు చేయడం  వెనక .. నేల, నింగి, గాలి, నిప్పు.. కు  నీరూ తోడుగా  జత కలిసినప్పుడే జీవితం సుసంపన్నమయేదన్న సూత్రం ఇమిడి ఉంది. మనం మనకు తెలుసు అనుకున్న అంశాలను గురించి పునర్విచారణ చేయవలసిన అవసరం నానాటికీ పెరుగుతున్నది. అందులో నదీ నదాల అంశం ప్రధానమైన వాటిలో ఒకటి. 'కలకల స్వన సలిల ఋక్ఛంద వేద సంలాప'గా కృతయుగాన  మురిపించిన  కైలాస గంగ  'నరక భీకర తమో గర్భఘూర్ణిత భయద వైతరణి వేణి'గా చెడి-  కలియుగాన్ని వణికించేస్తోంది . ఎందుకో ఆ మర్మం కనిపెట్టాలి.
నదులకు అడ్డంగా కట్టిన ఆనకట్టలను వట్టి మట్టి కట్టలుగా భావించలేదు భారతీయులు ఎన్నడూ.  'ఆధునిక దేవాలయాలు'గా  మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించడంలోని ఆంతర్యం ఆ జలాశయాలూ దేవాలయాలకు మల్లే జీవితాన్ని పునీతం చేస్తాయన్న ఆధ్యాత్మిక భావనే.  కోవెలకు కోనేరుల్లాగా.. ఈ కొత్త  దేవాలయాలకు పారే ప్రవాహాలే కోనేరులు. కోనేటి  స్నానం వల్ల ఎంత  పుణ్యమో నిర్థారించేందుకు లేకపోయినా.. ఈ పారే కోనేటి చలవ వల్ల అనేకమైన ప్రజోపయోగాలు చేకూరుతున్నాయి.
గంగ అంటే కేవలం జలధార కాదు. అదో జీవధార. ఈ దేశంలో నీరు ఏ రూపంలో ఉన్నా గంగగానే భావిస్తారు భారతీయులు.   గంగ నీటికి పర్యాయ పదం. నీరు జీవితానికి ఆధారం. జలాధారిత జీవ జాలమే కాదు.. భూమ్యాకాశాల మధ్య జీవించే జీవ  సముదాయాలూ   జలాశయాలకు సమీపంగానే సంచరిస్తాయి. రామాయణ కాలంనాటి గంగావర్ణన ఇందుకు నిదర్శనం.  గంగ రెండు గట్లకు వరుసుకొని  పెరిగిన దట్టమైన అడవుల నుంచి బయటికి వచ్చిన దిట్టమైన ఏనుగుల గుంపు నదిలోకి దిగి నీళ్లు తాగుతున్నప్పుడు.. నీటి అడుగుల నుంచి మొసళ్లు వాటిని   లంకించుకోవడం కోసం వడుపుగా కాచుకొనుండడం.. వాల్మీకి మనోహరంగా వర్ణిస్తాడు. తాబేళ్లు, పాములు,  చేపలు వంటివి మన కంటికి  బైటకు కనిపించే కొన్నిరకాల  జలచరాలు మాత్రమే.   భూచరాలకన్నా 35 శాతం ఎక్కువగా  జీవ జాతులు నీటి అడుగుల్లో  జీవిస్తున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇంత అందమైన గంగ భూమ్మీదకేమీ ఉట్రవుడియంగా వచ్చి పడలేదు. భగీరథ ప్రయత్నం అవసరమైంది. మనిషి నిర్లక్ష్యం వల్ల క్రమంగా ఆ జలవనరులన్నీ  కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి క్రమ క్రమంగా.  
నదులు అనాదివి
 '.. that ancient river, the river Kishon, O my soul, thou hast trodden down strength' అన్న హోలీ బైబిల్  వెర్స్ 21.. ఆంధ్రదేశంనుచి  సముద్రంలో కలుస్తున్న కృష్ణానదిని గురించిన ప్రస్తావనే అన్నది చరిత్రకారుల అభిప్రాయం. తెలింగాణా (తరువాతి  రూపం తెలంగాణా) పదంలోని తొలి  'తెలి' భాగం గోదావరి నదికి   సంబంచించినదనీ మరో అభిప్రాయం. ఉత్తర ప్రాంతాలనుంచి దక్షణాదికి వచ్చే సంచార జీవులు, బౌద్ధ యాత్రికులు, తెలిభాష పలికే గోదావరి ప్రాంతంలో తొలి అడుగు వేసేవారని.. నదులకు.. జనజీవనానికి మధ్య ఉండే లంకెను క్రీ.102నాటి గ్రీకు భౌగోళికుడు టాలెమీనే తేల్చి చెప్పాడు.  ప్రాంతాలు నదుల పేర్లతో ప్రసిద్ధమవడం అనాదిగా మనం చూస్తున్న చారిత్రక సత్యం! మంజీరికా దేశమని బౌద్ధ వాజ్ఞ్మయంలో పేర్కొన్న ప్రాంతం నేటి మంజీర తీరంలో వర్ధిల్లే మెతుకు సీమ. గోదావరి నది వడ్డున సాగే సంతల్లో  ఏనుగులతో ఉల్లిగడ్డలు మోయించి తెచ్చే వారు,  వరద కోతలకు తరచూ గురైనందువల్లే గోదావరి తీరాన ఇనుప ఖనిజంతో తయారైన నాణేలు నేటికీ బైటపడుతుంటాయి. నీటికి సమీపంగా మసలే  జాతుల వికాస ప్రగతి   మిగతా   జాతుల అభివృద్ధి కన్నా  ఎన్నో రెట్లు వేగవంతంగా సాగిన్నట్లు చరిత్ర రుజువులు చూపిస్తున్నది.    నీటి కోసం, నీటిలో వాటాల కోసం రాతియుగం నాటి నుంచే కాదు.. రాకెట్టు యుగం దాటి దూసుకొస్తున్నట్లు చాటుకునే  ఈ   అత్యాధునిక యుగంలో కూడా కొట్లాటలు తప్పడం లేదు.
నీరు నిత్యావసరం
నీరు జీవితానికి ప్రతీక. నీరు లేనిదే జీవి లేదు. జీవనమూ లేదు. నీటికి అందుకే జీవనం అనే మరో పేరుంది. నీరెక్కడుంటే అక్కడ జీవి ఉండే ఆస్కారం ఉంది కాబట్టే.. గ్రహాంతరాలలో నీటి జాడలకోసం అంతరిక్ష శాస్త్రం అంతలా పరిశోధనలు సాగిస్తోంది. వనరులు  పుష్కలంగా ఉన్నప్పటికీ భూ వాసి నీటి నిజమైన విలువ తెలుసుకోలేక.. నిర్లక్ష్యం చేస్తున్నాడు. తనకు తానుగా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడు.  నీరు శిశువులా అవతరిస్తుంది. మనిషి జీవితంలానే  పయనం కొనసాగిస్తుంది. కొన్ని చోట్ల పొంగులతో.. కొన్ని చోట్ల వంపులతో ముందుకు సాగి వార్థక్యంలోలాగా సంగమ స్థానంలో బలహీనపడి సాగర సంపర్కంతో ఉనికిని  కోల్పోతుంది. బిందువు నుంచి సిందువుదాకా నది సాగించే ప్రయాణ మార్గమే జీవజాతులమీద ప్రభావం చూపించేదిప్రధానంగా అనాదిగా మానవ జాతి నది నడక వల్ల అధికంగా ప్రభావితం అయింది.
ఏ నది కథ అయినా ఒకే మాదిరిది. జన్మస్థలం.. పయన మార్గం.. సంగమ తీర్థాల్లోనే తేడా! ఏ నదీ ప్రవాహలు స్నానయోగ్యాలు, ఏ నదీమ తల్లి గర్భంలో ఏ జాతి జీవ
సంపద వర్ధిల్లుతున్నది.. ఆ వివరాలన్నీపూసగుచ్చినట్లు  ఋషులు గ్రంథస్థం చేసిన జ్ఞానభూమి ఈ గడ్డ.  గోదావరిలా తెల్లంగా.. కృష్ణవేణిలా  నల్లంగా.. రంగుల్లో భేదాలున్నా..   రుచుల్లో రకాలున్నా ..  స్రవంతులన్నీ జీవ శిశువులకు ఆప్యాయంగా చన్నిచ్చి   పోషించే తల్లులే! నదులను నదీమ తల్లులుగా భావించుకోవడంలోని ఆంతర్యం  కేవలం భౌతికమైనది కాదంటారు భారతీయులు అందుకే.  భాగీరథి ఎన్ని  నాగరికతలకు, జ్ఞాన మార్గాలకు మూగ సాక్ష్యమో! మహాభారతంలో గంగ భీష్మపితామహుడికి తల్లి. గంగానది చూపులకు కేవలం ఓ జలధార మాత్రమే కావచ్చు కానీ  ప్రకృతి ప్రేమికులకు ఆ రాయంచ నడకల నంగనాచి  ఒక సౌందర్యలహరి, రామాయణంలో వాల్మీకి చేసిన గంగావర్ణన ఓ   కమనీయమైన అనుష్టుప్ గానం.   దిగితే కానీ  లోతు తెలీని ఈ మాదిరి  నదులు దేశం నిండా 500కు పైగానే ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తల   అంచనా.    
నదులను అనుసరించి ఏర్పడ్డ నగరాలే నదుల ఉనికికి యమగండాలుగా మారడం ఆందోళన కరం. 'నదులే కదా? మనకేమిటికిలే?' అని చిటికెలేసి ఆవలించి నిద్రకి జారుకుంటే  మెలుకొచ్చే వేళకి కళ్లముందు కనిపించేది గుక్కెడు నీటికి కరువ్వాచే ఎడారి మేటలు! ఒడ్డునే నిలబడి ఓ చెంబెడు నీళ్లు ఒంటి మీద వంపుకొని.. మరో చెంబు భద్రంగా  బంధు మిత్రులకని వెంట తెచ్చుకొనే పాటి భక్తి శ్రద్ధలతో సరిపుచ్చుకుంటే చాలదు. నదుల కాలుష్యం నివారణకు ప్రభుత్వాలు, ప్రజలు  చేయవల్సింది సముద్రమంత ముందు ఉంది. మనదేశంలో ప్రవహించే 500 నదుల్లో ప్రధానమైన జీవనదులు కేవలం పదిమీద ఓ నాలుగుఆ కాసిని జీవనదులమీద ఆధార పడే నూటికి 85 మంది బతుకులీడుస్తున్నారు. తెల్లవాడి రాక ముందు  దేశంలోని నదులన్నీ నిండు కుండల్లాగా కళ కళ లాడుతుండేవి. పారిశ్రామీకరణ అంతగా పుంజుకోని కారణాన  సకాలంలో వర్షాలు విస్తృతంగా పడుతుండేవి. ఏటా వచ్చిపడే వరదలతో సర్దుబాటు చేసుకు బతికే సగటు భారతీయుడికి తెల్ల వ్యాపారి అత్యాశల మూలకంగా వర్షాబావం, కరవు కాటకం అంటే ఏమిటో చవిచూడా
ల్సొచ్చింది. తక్షణ లాభాలకు కక్కుర్తి పడి ఘరానా వ్యక్తులు చేసే జలదోపిడీకి అడ్డుపడనందు వల్ల చివరికి ఇప్పుడు మిగిలింది తాగు.. సాగు యోగ్యం కాని  అపార జల కాసారాలు! వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర నదులు కేవలం గత రెండు శతాబ్దాలలో కాలుష్యమయం అయిపోవడం ఆందోళనకరం.  గతంలో తొలి జామున నదీ తీరాన నిలబడి గుప్పెడు జల గుక్కెట పడితే అమృతం సేవించినంత స్త్రాణ ఉద్దీపమయేది. నదుల్లోకి ప్రవహించే మురికిని చూస్తూ ఇప్పుడెవరైనా అంత సాహసానికి ఒడిగట్ట గలరా? దేశరాజధానిని ఆ స్థాయికి తెచ్చిన యమునా నది ప్రస్తుతం ఒక మృత ప్రవాహం.  నదుల విస్తీర్ణం రోజు రోజుకూ కుచించుకు పోతోంది. గత ముప్పై ఏళ్లల్లో కృష్ణవేణి 60 శాతం చిక్కిపొయిందని ఓ అనధికారిక అంచనా.
నదుల జల లభ్యతలోనూ గణనీయమైన తగ్గుదల. క్రమప్రవాహాలలోనూ నిలకడలేమి. భూతాపం, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు  మనిషి నిర్లక్ష్య ధోరణీ తోడయి నదుల రూపు రేఖలకు చెరుపు కలుగుతోందన్న మాట వంద శాతం నిజం.  గట్లను యధేచ్చగా తవ్వుకుంటు పోతుంటే దేశంలోని అన్ని నదులకు సరస్వతీ నది దుర్గతి ఖాయం. ఇసుక దోపిడీ ఇప్పుడు సాగుతున్న విశృంఖలంగా ఇంతకు మునుపెన్నడూ లేదని స్థానికులు వాపోతున్నా.. పట్టించుకొనే పాలకులు కరువవుతున్నారు.
నదుల ఒడ్డున పచ్చదనం జీవనదుల జవసత్వాలను మరింత పెంచుతుంది. వరదల ముప్పును తగ్గిస్తుంది. కరవు కాటకాలను నివారిస్తుంది. భూగర్భ జలాలు పెరుగుతాయిసకాలంలో సాదారణ స్థాయి వర్షాలు కురుస్తాయి. వాతావరణం హఠాత్పరిణామం నివారిస్తుంది. భూమి కోతలను నిరోధించవచ్చు. నీటి నాణ్యత పెరుగుతుంది. భూసారం మెరుగవుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన జీవ వైవిధ్యం కొనసాగుతుంది.

మనం పురాణలలోని వృత్రాసురులమా?  దేవేంద్రులమా?
పురాణాలలో వృత్రుడు నదులను నలుదిశలనుంచి కట్టిపెట్టి కట్టడి చేసాడని వినికిడి. ఇంద్రుడు వజ్రాయుధంతో వాడి దౌష్ట్యాన్ని నేల కూల్చి జల విముక్తి కావించాడు. పారే పారే నీటివాలును స్వలాభం కోసం మళ్లించడం.. నదులని పూడ్చి స్వార్థ ప్రయోజనాల కోసం భవంతులు నిర్మించడం, విషపదార్థాలు ఉత్పన్నమయే కర్మాగారాలను అక్రమ మార్గాల్లో  నిర్మాణం చేసి.. బై ప్రొడక్టు  కాలుష్యాలను నిశ్శబ్దంగా నదుల్లోకి వదులడం,  తాగు.. సాగు నీటిని నిరుపయోగం చేసే స్వార్థపర వర్గాలేవైనా.. అవన్నీ  ఆ వృత్రాసురుడి కలియుగ వారసులుగానే భావించాలి. దేశంలోని ఐదొందల నదుల్లో 2012నాటి లెక్కల ప్రకారం  121 నదులు నిరుపయోగంగా మారిపోయాయి. మరో మూడేళ్లల్లో కాలుష్య నివారణ చర్యలు ముమ్మరం చేయకపోతే మరన్ని నదులు మృతప్రాయమవుతాయని కేంద్ర కాలుష్య నివారన మండలి తాజా నివేదికలో హెచ్చరించింది.  జల కాలుష్యాధముల   ఆట కట్టించే పర్యావరణ కార్యశీలులే     ప్రజావళికి ఇవాళ్టి నిజమైన దేవేంద్రులు. భగీరథుడు భువికి దించిన గంగ పవిత్రులైన అరవై వేలమంది సగరులకు  స్వర్గలోకం రుచి చూపించింది. ప్రవహించిన దారి పొడుగునా అడుగు అడుగునా  పేరుకున్న   భస్మరాసులను పరిశుభం చేసింది. అంత మహిమాన్విత  జీవదాత గంగామాత తిరిగి అంతే పునీతంగా భూమి తల్లి   కడుపు తడపాలంటే కంటి తుడుపు చర్యలు   కాదు. కావాల్సింది.. కఠినమైన నిర్ణయాలు. చిత్తశుధ్ధి నిండిన సంకల్పాలు..   మొక్కవోని దీక్షతో ముందుకు పోయే కార్యాచరణలు.

నదుల అనుసంధానం
వ్యవసాయ దేశం మనది.  అధిక భాగం వర్షాధారితం. జల  వనరుల నిలవ విధానాలు మెరుగు పడితే తప్ప  సాగురంగం లాభదాయకం కాబోదు.  ఆ దిశగా చర్చలు దశాబ్దాల బట్టి కొనసాగుతూనే ఉన్నా.. మోదీ ఆధ్వర్యంలోని ఎన్ డి యే అధికారంలోకి వచ్చిన తరువాతే  నదుల అనుసందాన  కార్యాచరణమీద మళ్లీ దృష్టి మళ్లింది. ఈ  బృహత్తర పథకాల  సాకారతకు జాతీయంగా.. అంతర్జాతీయంగా  సవాలక్ష సవాళ్లు.    డాక్టర్‌ కేఎల్‌ రావు కేంద్రమంత్రిగా ఉన్నహయాంలోనే గంగను కావేరీకి మళ్లించే  రెండువేల చిల్లర కిలోమీటర్ల పొడవు అనుసంధాన పథకం  ప్రతిపాదన దశదాకా వచ్చింది. అట్లాంటి భారీ పథకాలు  ఆచరణ యోగ్యం కావంటూ అప్పటి ప్రభుత్వాలు తిప్పిగొట్టిన తరువాత మిగులు జలాలు    నీటి తరుగున్న చోట్లకు తరలించే చిన్న పథకాలకు జాతీయ జలవనరుల  సంఘం ప్రాథాన్యత ఇచ్చింది.   అస్తమానం వరదలు సృష్టించే ఉత్తరాది జీవనదుల నీటిని తరచూ  కరువుల పాలయ్యే దక్షిణానికి తరలించడం ఉభయత్రా మేలే కదా!  సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో, 2002 అక్టోబరు 31నాటి   కేంద్రం తీర్మానంతో   ఎనిమిది మంది సభ్యులుండే  టాస్క్‌ఫోర్సు ఏర్పాటయి  2016 డిసెంబరు 31 నాటికి నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తవాలని ఆదేశించడంతో 14 హిమాలయ నదులు, 16 ద్వీపకల్ప నదుల అనుసంధాన ప్రణాళిక సిద్ధమయింది.  
పర్యావరణ వేత్తల   నిరసనలుసామాజిక  శాస్త్రవేత్తల  భిన్న వాదనలు, గంగానదిలో తగినంత నీరుందో లేదో..  అధిక వ్యయ ప్రయాసలకోర్చి పథకం అమలు చేసినా ఆశించినంత  ఫలం చేకూరుతుందో లేదో అని  ఎన్నో గుంజాటనలు.  అధిక వ్యవసాయోత్పత్తికి, జల విద్యుత్ ఉత్పాదనకు, జలమార్గంలో రవాణాకు దోహదపడుతుంది కాబట్టి  నదుల అనుసంధానం అమలు సాంకేతికంగా లాభదాయకమేనన్న వాదన ఊపందుకున్న తరువాతే పథకాల్లో కదలిక మొదలయింది.
తాగు, సాగు నీటి కొరతకు చక్కటి పరిష్కారం  కాబట్టి పర్యావరణ సమస్యలను కొంత మేర పక్కకు పెట్టినా తప్పేముంది? గంగ- కావేరీ అనుసంధాన ప్రాజెక్టు మొత్తానికి మోదీ హయాంలోనే మొదలవడం ముదావహం. గంగలోతమ వాటా నీటికి  ఇప్పటికే కటకటగా ఉందని..  దేశం ఎడారిగా మారుతుందని బంగ్లాదేశ్ భయం. పథకం పట్టాలెక్కాలంటే  ఆ దేశం అనుమతి తప్పనిసరి.  కోసి, గండకి, కర్నాలి, మహాకాళిల వంటి గంగ ఉపనదుల నీటి తరలింపులకు  నేపాలు కొండ ప్రాంతాల్లో భారీ జలాశయాలు నిర్మాణాలు తప్పని సరి.  నేపాలు అందుకు ఒప్పుకోవాలి. గంగ- బ్రహ్మపుత్ర  అనుసంధానానికి కాలువల త్రవ్వాలి. బంగ్లా అందుకు అనుమతి ఇవ్వాలి.
జాతీయమైన చిక్కులూ తక్కువేమీ లేవు. నీటి హక్కులు కోల్పోయే   ఎగువ రాష్ట్రాలు సహజంగానే  అనుసంధానానికి అడ్డు. లాభ నష్టాలను బట్టి మధ్యనుండే రాష్ట్రాలు తమ వైఖరులను మార్చుకోవడం! ఒక్క దిగువునున్న రాష్ట్రాలకు మాత్రమే  నదుల అనుసంధానంలో ఆసక్తి జాస్తి. 
మహానది మిగులు జలాల నుంచి 230 శతకోటి ఘనపుటడుగుల(శ.కో.ఘ.) నీటిని చేర్చిమరి కొంత గోదావరి జలాలతో కలిపి మొత్తంగా 769 .కో.ఘనపుటడుగుల నీటిని గోదావరినుంచి..   కరవుతో అల్లాడే కృష్ణ, పెన్న, కావేరి, వైగా నదీ బేసిన్లకు మళ్లించాలన్నది జాతీయ జలవనరుల సంస్థ ప్రతిపాదనలలో ఒకటి. మహానదిలో మిగులు జలాలు లేవని ఒడిశా మొండి చెయ్యి చూపుస్తున్నది. ఎగువ  నీరు తరలి వస్తేనే గానీ  గోదావరి జలాలు దిగువకు వదిలేది లేదన్నది  ఆంధ్రప్రదేశ్‌ పట్టుదల..
15 ఏళ్లనాటి అంచనాల ప్రకారం రు. 5.60 లక్షల కోట్లు. ఆలస్యమయే కొద్దీ ఆ  వ్యయం తడిసి మోపెడవుతూనే ఉంటుంది.. జాతి భావి విశాల ప్రయోజనాల దృష్ట్యా పథకాలు  సత్వరం పట్టాలెక్కాలి కనక భా.. పా నే  కేంద్రంలో ఉంది కాబట్టి   రాష్ట్రాల్లోనూ అదే పార్టీ ప్రభుత్వాల్లో  ఉన్న   యు.పి.. ఎం.పి ల కు సంబంధించిన 'కెన్‌-బెత్వా నదుల అనుసంధానం' ముందుకు తెచ్చింది. ఆ పథకం పూర్తి చేసి  మిగతా ప్రాజెక్టులకు స్ఫూర్తి నివ్వాలని  ప్రధాని సంకల్పం. ఎవరితో సంబంధం లేదు కాబట్టి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ దిగ్విజయంగా పూర్తిచేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటకు కృష్ణా డెల్టాకు నీరంది రైతుల పంట తంటాలకు కొంతలో కొంతైనా పరిష్కారం దొరికింది.

అదే స్ఫూర్తి మిగతా అన్ని రాష్ట్రాలు మనస్ఫూర్తిగా ప్రదర్శిస్తే నదుల అనుసంధానం మరీ అంత అసాధ్యమయిన పథకం కాబోదు. . పర్యావరణం, విద్య, వైద్యం, తాగునీరు వంటివి  మౌలిక అవసరాలు, జలాశయాల నిర్మాణాల్లో నిర్వాసితుల తరలింపులు తప్పనప్పుడు.. ముందస్తుగానే వాటికి సంతృప్తికరమైన ప్రత్యామ్నాయాలు చూపించగలిగితే లేనిపోని న్యాయపరమైన చిక్కులతో వృథా కాలయాపన తప్పినట్లవుతుంది.
రాబోయే మూడు దశాబ్దాలలో ఇప్పటి జనాభా 167 కోట్లకు మించుతుందని ఓ అంచనా. అప్పటి నీటి సమస్యలకు ఇప్పటినుంచే పరిష్కారం వెదక్కబోతే తిప్పలు  తప్పవు. నదుల అనుసంధానం తప్పించి మరో సులభ పరిష్కారం కనిపించదు. అదీ అంత సులభంగా వగదిగే మార్గం కనిపించడం లేదు. ప్రపంచ జల వనరుల్లో నాలుగు శాతం గల భారత దేశానిది తన నదీ జల్లాలో కనీసం  రెండు శాతమైనా సద్వినియోగం చేసుకోలేని నిశ్చేష్టత్వం. నదుల అనుసంధాన  మహాక్రతువు నిష్టతో పూర్తి చేస్తే వరదల ముప్పునుంచి తప్పించడమే కాదు.. కరవు పీడిత ప్రాంతాలకు జల సిరులు వరంగా దక్కించినట్లవుతుంది. దశాబ్దం కిందటి నాటి ప్రధాని మానస పుత్రిక ఈ నదుల అనుసంధానం మహాయాగం. దస్త్రాలలో దుమ్ముకొట్టుకొనే ఈ భూరి భగీరథ పథకాలకు కనీసం మోదీ హయాంలోనైనా వెలుగు సోకితే సర్వ భారతావని సుజలాం సుఫలాంగా మారి తీరుతుంది.ఆహారం, విద్యుత్తు, తాగునీటి సమస్యలకు నదుల అనుసంధానమే ఏకైక పరిష్కారమని దాదాపు దేశంలొని నలభై చిల్లర మేధావులు నొక్కి చెబుతున్నప్పుడు.. మీన మేషాలు లెక్కించడం పొరపాటు. ఏ సందేహాలకైనా సమాధానాలు చెప్పేందుకు జలరంగ నిపుణులు  ముందుకొస్తున్నప్పుడు ఇంకా ఆలస్యం చేస్తే ఆ కాస్త అమృతం కూడా విషమయమయిపోదా?

భారత దేశంలో నదుల పట్ల ఉన్నంత  భక్తి గౌరవాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఋషులు, ఆధ్యాత్మిక చింతనాపరుల బోధనల ఫలితం ఇదంతా. ఏటా నదుల్లో మునిగే పుష్కర సంస్కృతి  వెనక ఉన్నది ఒక్క ఆధ్యాత్మిక  భావనే కాదు. కోట్లాదిమంది కుంభమేళావంటి  పుష్కర  ఘట్టాలలో కలబడి  పునీత స్నానాలు చేయడం వేరే సంస్కృతలవారికి ఎప్పటికీ అంతుబట్టని ఎనిమిదో వింత! తరాల  అభిరుచుల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నా నదీ నదాల పట్ల చూపించే భక్తి ప్రవత్తుల్లో మాత్రం  కించిత్తయినా గౌరవ మర్యాదలు తగ్గకపోవడాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలీక తలలు బాదుకునే  పాశ్చాత్యులు బోలెడంత మందున్నారు. వరదలొస్తే శాంతించమని పూజలు చేస్తాడు. కరువులొస్తే కరుణించమని ప్రార్థిస్తాడు భారతీయుడు. నదులను తల్లులుగా భావించి తమ ఉనికికి ఫలానా నదీ తీరాలు మూలాలని సమంత్ర పూర్వకంగా చెప్పుకొనే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా కనిపిస్తుంది.
హరప్పా నాగరికత సింధునదీ ప్రభావంతో ఏర్పడ్డది. గంగానదీ తటాకం పొడుగూతా వేద సంస్కృతి ఈ నాటికీ నిరాటంకంగా వర్ధిల్లుతోంది. ఆచార్య నాగార్జునుడు కృష్టానదీ తీరంలొ కొలువు తీరి ఉన్నప్పుడే బౌద్ధారాధనను ఓ సువ్యవస్థగా మార్చి విశ్వం నలుదిక్కులా ప్రచారం చేయించింది. పవిత్ర పుణ్యక్షేత్రాలు, పాలనాకేంద్రాలన్నీ దాదాపుగా నదీ తీరాల్లో వెలసిల్లినవే! యమునా నది వడ్దున హస్తిన, అడయార్, కూపమ్ నదుల తీరంలో చెన్నయి, మూసీ నది తటాకాన భాగ్యనగరి. అమరావతి వంటి  ఆధునిక రాజధాని నిర్మాణానికీ కృష్ణానదీ తటాకమే ప్రాతిపదిక అయింది. పౌరుల నిత్య జీవితావసరాల  నదులే ప్రధాన ఉపాధులయినప్పుడు ప్రజాస్వామ్య  ప్రభుత్వాల దృష్టీ  సహజంగానే వాటిమీద నుంచి పక్కకు మళ్లదు. అందుకే కేంద్రం గంగానది పారిశుద్యం..  రాష్ట్రాల హరిత దినోత్సవాలు! రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి నీటి వనరులమీద నుంచి ఏ నాడూ పక్కకు మళ్ళడం లేదు.  తెలంగాణా ప్రభుత్వం చెరువుల ప్రక్షాళన, ఆంధ్ర ప్రదేశ్ అందుకొన్న జలరాశికి హారతి ఇందుకు ఉదాహరణ. పక్కా అధ్యాత్మిక కార్యక్రమంగా  జలరాశికి హారతి బైటికి కనపడుతున్నా..  ఆ పథకం వెనకున్నది వాస్తవానికి ప్రజా సంక్షేమ కాంక్షే!
నీరుంటే  చెట్లు కాదు. చెట్లుంటేనే నీరు. ఇప్పుడున్న అటవీ సంపదను రక్షించుకోవడంతో పాటు.. కొత్త అటవీ వాతావరణాన్ని సృష్టించుకొంటేనే పర్యావరణానికి నూతనోత్తేజం సిద్ధించేది. ఒక్క రోజులో కోట్లాది మొక్కలు నాటి కొత్త గిన్నీస్ రికార్డులు సృష్టించడం కన్నా.. నాటిన మొక్క ఏ మేకా మెక్కేయకుండా వృక్షంగా అభివృద్ధి అయే దాకా పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడే పర్యావరణానికి మళ్ళీ ప్రాణం పొసినట్లయేది. అడవులు పెరిగితే వర్షాలు పెరుగుతాయి. బక్క చిక్కిన జలాశయాలకు కొత్త కళలు వచ్చేస్తాయి.
ఉన్న   జల వనరులు వృథాగా ఉప్పు సముద్రాల పాలవకుండా పౌరులలోనే జల సంరక్షణ స్పృహను మరింత రగిలించవలసిన తరుణం ఆసన్నమయింది. నదులు కలుషితం కాకుండా కఠిన చర్యలు కావాలి. పరిశ్రామిక వ్యర్థాలు నదుల్లోకి వదలకుండా తగిన నిఘా అవసరం. ఇప్పటికే కలుషితమైన జలాలను ప్రక్షాళించే కార్యక్రమాలు మరింత చిత్తశుద్ధితో ముందుకు సాగాలి. నదీ తటాకాలు అక్రమాక్రమణలకు  గురి కాకుండా రక్షించాలి.  విచక్షణారహిత జలవినియోగానికి అడ్డుకట్ట పడాల్సుంది. నదీ ప్రవాహాల సహజ మార్గాలు మళ్లింపుకు గురికాకుండా చూడడం చాలా ముఖ్యం.
భవిష్యత్  అవసరాల దృష్ట్యా నీటి పరిరక్షణ ప్రధాన  బాధ్యతగా  పాలకులంతా గుర్తిస్తున్న వేళ నదుల అనుసంధానం  క్రమంగా ఊపందుకోవడం ముదావహం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు  జలవనరుల  పరిరక్షణ  విషయంలో నిరంతరం జాగరూకతతో పలుసంక్షేమ పథకాలకు శ్రికారం చుట్టడం పర్యావరణవేత్తల ప్రశంసలూ అందుకొంటున్నది. ఇటీవలే రెండు రాష్ట్రాలలో మొక్కలు నాటే వివిధ పథకాలు ముమ్మరమవడం గమనార్హం. నదుల అనుసంధానంలో భాగంగా అతి తక్కువ కాలంలో  గోదావరి నదీజలాలను పట్టిసీమకు మళ్లించి కొత్త రికార్డు సృష్టించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది.  తెలంగాణా అంతటా చెరువుల మరమ్మత్తులు మునుపెన్నడూ లేనంత ఉద్యమ దీక్షతో కొనసాగడమూ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు ముందుచూపు పర్యావరణ పరిరక్షణ చర్య.
జలసిరికి హారతి
నదుల అనుసంధానం, చెరువులు బావుల తవ్వకాలతో సరిపెట్టకుండా.. నీటికీ ప్రజలకూ మధ్య గల ఆధ్యాత్మిక అనుబంధాన్నీ పునరిద్ధరించే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మొదలయ్యాయి. గంగానదికి వారణాశి, హరిద్వార్లలో పట్టే రీతిలో.. గోదావరికి రాజమండ్రిలో, కృష్ణమ్మ తల్లికి విజయవాడ ఇబ్రహీంపట్నంలో నిత్య హారతులు పట్టే ఆధ్యాత్మక పథకమొకటి ఈ మధ్యనే మొదలయింది. కేవలం జీవనదులుగా భావించే కృష్ణా గోదావరులకే కాకుండా.. జనజీవనానికి అమృత పానీయం అందించే జల వనరులు చెరువులు, బావులు, వాగులు, వంకలు.. చిన్నవా.. పెద్దవా అన్న బేధం లేకుండా అన్నింటికీ నిత్య హారతులు అందించాలన్న చంద్రబాబు వినూత్న ప్రయోగం స్వఛ్చమైన మనసున్న వారంతా తప్పక స్వాగతించాలి. నదంటే ఓ నీటి ప్రవాహం. నీరు  దేవత ఎలా అవుతుంది? అని వాదించే వ్యక్తిని మూడు  రోజుల పాటు ఓ నిర్జల స్థలంలో ఉంచి  నాలుగో పూట  గుక్కెడు నీరు అందించండి!  నదికి కాదు .. ముందా లోటా నీటికి నమస్కరిస్తాడు. తాగే నీరే కాదు, పీల్చే గాలితినే తిండి వాదనకు కేవలం బౌతిక రూపాలే కావచ్చు కాని .. వాస్తవంలో అవి జీవి ప్రాణదీపం ఆరిపోకుండా అడ్డుపడే దైవిక హస్తాలు! బతుకు ఇచ్చినందుకు, బతకనిస్తున్నందుకు, బతికున్నంత కాలం బాగోగులు చూసుకొంటున్నందుకు కన్నవారంటే గౌరవాభిమానాలు కనబరుస్తున్నప్పుడు.. ఆ వాత్సల్యమే చవి చూపించే ప్రకృతి శక్తుల పట్లా  కృతజ్ఞత చూపించడం మూర్ఖత్వం ఎట్లా అవుతుంది? నదులకు హారతులు ఇవ్వడం ఇవాళే కొత్తగా పుట్టుకొచ్చిన సంప్రదాయం కాదు. పాప ప్రక్షాళన జరుగుతుందన్న ఆశతోనే కదా భగవంతుడి ముందు భక్తితో మోకరిల్లేది. నదిదీ దైవ స్వభావమే. ఎంత మురికి వదిలినా  కిమ్మనదు. ఎవరు తన ఒడికి చేరబోయినా 'వద్దు.. పొమ్మన'దు. దైవత్వానికి ఇంతకన్నా మెరుగైన ఔదార్యమేముంది? దేవతా మూర్తులకు హారతులు పట్టటంలో లేని అభ్యంతరం జలరాశికి హారతులు పట్టడంలో ఎందుకు చూపెట్టడం?
పైకి పూజా విధానంగా  అనిపించే ఈ నిత్యారాధన వెనక లోతైన సంక్షేమ ఆలోచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జలవనరుల కలుషితానికి జనంలో భయం కలగజేయడం ఈ పూజా పునస్కారాల వెనకున్న అసలైన ఆంతర్యం. కాలుష్యాలు, మానవ విసర్జితాలు, చెత్తా చెదారం నిర్లక్ష్యంగా  వదిలే జనం దుర్లక్షణానికి దైవంగా భావించే జలవనరులను దూరంగా ఉంచాలన్నదే ఈ ప్రయత్నం వెనకున్న సంక్షేమ భావం. ఎంత వరకు సఫలీకృతమవుతుందో ముందు ముందు చూడాల్సుంది. ఆసాంతం విజయవంత అవకపోయినా.. కొంతలో కొంత  సత్ఫలితాలను ఇచ్చినా 'జలసిరికి హారతి' లక్ష్యం సక్రమంగా నెరవేరినట్లే!.  ప్రభుత్వాలు  ఆచరించే జలకాలుష్య నివారణ చర్యలకు ఒక మంచి వాతావారణం జనంనుంచి రాబట్టడానికి  మించి  జలహారతి ప్రసాదించే  మంచి ఫలితం ఏముంటుంది?
--కర్లపాలెం హనుమంతరావు
(చిత్రాలు-motivateme.in- సౌజన్యంతో- దన్యవాదాలతో)
(ఆంధ్రప్రభ, దిన పత్రిక 23-09-2017 నాటి సంపాదకీయ పుట వ్యాసం)




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...