Monday, May 7, 2018

మన దేశములో ముస్లిముల పరిస్థితి - ఒక పరిశీలన -



మన దేశం ముస్లిములలో మెజార్టీ కడు పేదవారు. అత్యంత అవమానితులు. దళితుల మాదిరే రెండో తరగతి పౌరులు. నిరక్షరాస్యులు. సామాజికంగా వెనకబడినవాళ్లు. జనాభాలో ముస్లిముల వాటా 12 శాతం. ఆ మేరకైనా రిజర్వేషన్లు దక్కడం లేదు. ఎక్కడో ఒకచోట ఏదో ఒక మిష మీద తాము చేయని గతకాలపు దోషాలకు అమానుషంగా శిక్షలకు గురవుతున్న అల్పసంఖ్యాక వర్గం ముస్లింలే! ఒక వ్యూహం ప్రకారం నడిచే ఈ పైశాచిక దాడుల్లో ఒక్కోసారి కుటుంబాలకు కుటుంబాలు, ఊళ్లకు ఊళ్లు కొంపా గోడూ పోగుట్టుకొని నడిరోడ్దు మీదకొచ్చి పడే పరిస్థితులు పెచ్చుమీరుతున్నాయ్! ముస్లిముల మీది దాడుల్లో అరెస్టవుతున్న వాళ్లూ ముస్లిములే అవడం మరో విచిత్రం.
ఎన్నడో జరిగిపోయిన తప్పులకి ఇప్పటి తరాలు  ద్వేష చిహ్నాలుగా మారే విచిత్ర పరిస్థితులు ముస్లిం జాతి విషయంలో విశ్వవ్యాప్తంగా ఉన్నప్పటికీ.. ఈ దేశంలో  ఆ ఆగ్రహ జ్వాలలు ఆగకుండా మండే రాజకీయ గుండంలో భాగంగా ఉంటున్నాయ్! యూరపులో  కైస్తవులకు ముసల్మానులు అనలు మనుషుల్లానే కనిపించరు! క్రీస్తుని శిలువ వేసిన అపరాథానికి  యూదులు  చిత్రహింసల రూపంలో రుసములు చెల్లిస్తూనే ఉన్నారు తరాల తరబడి సాగిన జర్మన్ నాజీల పాలనలోనే ఈ దమన కాండ పరాకాష్టకు చేరిందనుకుంటే ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న ద్వేషచరిత్ర దానికి పోటీగా తయారయింది. ముసల్మానుని సదా అనుమానంగా, ద్వేషంగా చూసే నాజీ మనస్తత్వంతోనే మన దేశ హిందువులకు ఇప్పుడు సరయిన పోలిక!
దేశభక్తిని ప్రదర్శించమని, హిందువులను గౌరవించమని, దేశ ప్రధాన స్రవంతిలో భాగం కావాలని ఒక్క ముస్లిం మతస్తుల మీదే వత్తిడి పెరగడం వారి జాతీయతను అవమానించడమే! పది కోట్ల పైచిలుకు ముస్లిములు మాట్లాడే ఉర్దూభాషకి  ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అధికార హోదా లేదు! తతిమ్మా పేదల్లాగానే పనీ పాటా, ఇల్లూ వాకిలీ, తిండీ తిప్పలూ, రోగం రొప్పులతో  సతమతమయ్యే ముస్లిములను గురించి నాలుగు మంచి ముక్కలు విచారించడం మాని.. దేశ సంస్కృతి, మతం, భాష వంటి అంశాల ఆధారంగా ప్రధాన స్రవంతిలో కలిసిపోతేనే మంచిద'ని పద్దాకా సతాయించడం ఏ మతసామరస్యానికి నిదర్శనం? ముస్లిం కుటుంబంలో పుట్టిన కారణంగా..  ఆ వ్యక్తి పరాయిగడ్డ మతం మీద మాత్రమే ప్రేమ పెంచుకుంటాడని ఏ ఆధారంతో నిర్ధరణ జరుగుతున్నట్లో? సాటి పౌరులకన్నా ఒక మెట్టు తక్కువలో ఉన్నట్లు  నిత్యం తూట్లుపొడిచేటందుకు ఒక మాతాన్ని అడ్దుపెట్టుకోవదం సర్వ సత్తాక ప్రజాస్వామిక వ్యవస్థకు చేటు తెచ్చే పిచ్చిచేష్ట.  ఒక వ్యక్తిని తన సహజ, ప్రజాస్వామిక, ప్రాధమిక హక్కుల నుంచి మతం ప్రాతిపదికగా   దూరం చేయడాన్ని మన రాజ్యాంగం ఏ సెక్షంలో సమర్థించింది?!
ముస్లిముల పట్ల అధిక సంఖ్యాక వర్గాలకు ఉండే సందేహాలు, ద్వేషభావాలు  రోజు రోజుకీ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి! పాక్ లోనో, బంగ్లా లోనో జరిగే ఘోరాలకు ఇక్కడి ముస్లిములు నిలదీతకు గురవుతున్నారు! న్యూయార్క్ ట్రేడ్ సెంటర్ కూలిన రోజుల్లో భారతీయ ముస్లిములకు ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ప్రపంచంలో ఏ మూల ముస్లిం ఉగ్రవాదులు విధ్వంసం  సృష్టించినా దానికి ఇక్కడి ముస్లిములు బాధ్యత వహించాలనడం భావ్యమేనా? స్వేఛ్చగా వదిలేస్తే ఇక్కడి ముసల్మానులూ ముందు ముందు ఆ తరహా విధ్వంసాలకే   పాల్పడతారన్న  భయాందోళనలకు ఏ సహేతుకమైన కారణాలు కనిపించవు.  సాటి పౌరుల అకారణ భయాందోళనల కారణంగా గౌరవప్రదంగా జీవించే హక్కులు ముస్లిం జాతి కోల్పోవడం అన్యాయం! ప్రతి ముస్లిమునూ ఎల్లవేళలా ఓ కంట కనిపెట్టి ఉండటం దేశభద్రత దృష్ట్యా  ఎంతో అవసరం- అనే మిషతో ముస్లిములను నిత్యం వేధించే 'గౌరవప్రదమైన' పెద్దలకు, సంస్థలకు   మన్నింపులు పెరుగుతున్నాయ్! దేశ మతసామరస్య స్ఫూర్తికి ఇది మేలు చేయదు.
జ్ఞాపకాలూ, సంశయాలు సమస్తం ముస్లిములు అనగానే  ద్వేషం రంగునే పులుముకుంటున్నాయ్ ఈ దేశంలో! ముస్లిం మతంలో పుట్టిన పాపానికి అప్పుడే పుట్టిన పాపాయి కూడా స్థల కాలాదులతో నిమిత్తం లేకుండా దోషిగా అనుమానానికి గురి కావడం ఈ దేశ ప్రవచిత లౌకిక వ్యవస్థకు మచ్చ తెచ్చే చర్య.
నమ్మదగ్గ గణాంకాలు ఏవీ నిర్దరించకపోయినా ప్రతీ ముస్లిం పురుషుడు నాలుగుకు తగ్గకుండా పెళ్లిళ్లు చేసుకొని.. అడ్డూ ఆపూ లేకుండా పిల్లల్ని కంటూ దేశాన్ని ముస్లిం  పుట్టగా మార్చేస్తున్నాడన్న దుష్పచారం ఎప్పటినుంచో  సాగుతోంది. ఇప్పుడా ప్రచారానికి అధికారిక హోదా  తోడయింది! కానీ తాజా  జనాభా గణాంకాలు  ఈ ఊహలను సమర్థించడం లేదు. సుదూర భవిష్యత్తులో తమ మతస్తుల అత్యధిక సంఖ్యలో ఉండాలన్న లక్ష్యంతో పూట కూటికే దేవులాడుకొనే పేద ముస్లిం అడ్దూ ఆపూ లేకుండా బిడ్డల్ని కంటాడా? ఆ ఊహే హాస్యస్పదం.  
స్త్రీలను పరదాల్లో దాచి ఉండటం, వారి విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాయడం, మూఢాచారాలతో పీడించడం, సంతానార్థం వత్తిడికి గురిచేయడం.. వంటి అనాగరిక చర్యలు ఒక్క ముస్లిం మతంలోనే లేవు.  సామాజికంగా,  ఆర్థికంగా, మేధోపరంగా వెనకబడ్డ హిందూ అణగారిన వర్గాలలోనూ కనిపిస్తుంది. స్త్రీలు మగ సాయం ఆశించకుండా ఇంటి పనంతా స్వయంగా చూసుకోవాలి. ఆడదంటే వంటింటి కుందేలు. బైటకు వెళ్లవలసిన అగత్యపు పరిస్థితుల్లో మగ తోడు తప్పని సరి. పరాయి మగవారి కంటబడే సందర్భంలో మొగం కొంగులో దాచుకోవాలి. పెద్దలతో వ్యవహరించే సమయంలో నెత్తి మీది ముసుగు సర్దుకోవాలి. ఇంటి మగవాళ్లంతా భోజనాలు ముగించిన తరువాతే ఆడవాళ్లు తమ తిళ్లను గురించి ఆలోచించాలి. విద్య, వైద్యం, వినోదం వంటి రంగాలలో మగవారికే ముందు అవకాశం.. ప్రాధాన్యత. ఈ తరహా సంస్కృతి నిన్న మొన్నటి వరకూ హిందూ సమాజాలలోనూ ఓ సుసంప్రదాయంగా చలామణీ అయింది! అన్నిటికన్నా విచిత్రమైన విషయం - ఇవాళ విశాల భావాలతో  మెలిగే మధ్యతరగతి హిందూ వర్గాలు ముస్లిములు పాటిస్తున్నారని ఎద్దేవా చేసే  ఆచారాలనే అటూ ఇటూగా గతంలో తమ పెద్దలూ ఆచరించారన్న సత్యం విస్మరించడం! తామే  ప్రదర్శిచని మతసామరస్యాన్ని ముస్లిములు ప్రదర్శించడం లేదని ఆక్షేపించేవారే గొప్ప 'సంస్కర్తలు'గా ప్రస్తుతం కీర్తింపబడుతున్నారు! తమకు లేని విలువలు ముస్లిములకూ లేకపోవడం తమ విషయంలోలాగా వారి విషయంలోనూ వెనుకబాటుతనమే ముఖ్య కారణం కాగా.. తమ సంస్కృతి మీద కలసి కట్టుగా ముస్లింలు  చేస్తున్న విద్రోహ చింతన ఎట్లా అవుతుందో మరి హిందూ పెద్దలే తేల్చి చెప్పాల్సుంది!
నిజం చెప్పాలంటే మతపరంగా  అల్ప  సంఖ్యాకులైన ముస్లిములు ఈ దేశంలో  సామాజికంగా ఒక మానవీయ స్పర్శకు దూరమై,  తాము చేయని నేరాలకు నిష్కారణంగా సాటి పౌరుల వివక్షకు గురవుతున్నారు. ఊహపోహలతో చెప్పుకొస్తున్నది కాదు! స్వాతంత్ర సాధన సమర సందర్భంలో దేశ విభజన నేపథ్యంగా తూర్పు పాకిస్తాన్, పంజాబుల్లో జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనలు స్మృతిపథం నుంచి చెరిగిపోని పెద్దలు ఎవరినైనా అడిగి చూడండి! క్రూరత్వం, దేశద్రోహం అనే రెచ్చగొట్టే భావోద్వేగాలకు ముస్లిములనే ఎవరు.. ఎందుకు సంకేత చిహ్నాలుగా వాడుకొనే వ్యూహానికి తెరలేపారో  వివరంగా చెప్పుకొస్తారు.
ఏడు దశాబ్దాలు దాటినా ఆ  మతసర్పాల బుసలు సద్దుమణగనే లేదు. సరికదా..  విద్వేష పూరిత విషప్రచారాలు వేయిపడగలతో  మరింత జోరుగా విషం చిమ్ముతున్నాయిప్పుడు. పాపం పుణ్యం ఎరుగని ముస్లిం పేద కుటుంబాల బిడ్డలని  పాక్ ఏజెంట్లుగా చిత్రించి చిత్రవధలు  పెడుతున్న కథలు ఎన్నో వింటున్నాం. పేదలు, పీడితులు, అవమానితులుగా దళితులని గుర్తించి సంఘటిత పరిచే ఉదార మేధావులు  ముస్లిములకు జరుగుతున్న అన్యాయాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నట్లు? నిర్లిప్తత, నిరాసక్తతల ద్వారా ఫాసిస్ట్తు శక్తులకు  మరింత ఊతం ఇవ్వదలిచారా?
ఆత్మరక్షణ కోసం గత్యంతరం లేని  పరిస్థితుల్లో  అమాయక ముస్లిములు అవకాశవాద రాజకీయాలకు, తమ మతానికే చెందిన తీవ్రవాదుల ఉచ్చులకు చిక్కుకుంటున్నారు.  మత సామరస్యాన్ని మంట కలిపే శక్తులే   జాతి నిర్మాత పాత్రలు నటిస్తున్నాయిప్పుడు. తస్మాత్ జాగ్రత్త!


కన్నడ రచయిత 'బోళువారు మహమ్మద్ కుంజి' కథల సంకలనం 'దేవర గళ రాజ్యదల్లి'(దేవుళ్ల రాజ్యంలో) ముందు మాట- ప్రేరణతో
-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...