Showing posts with label Movies. Show all posts
Showing posts with label Movies. Show all posts

Wednesday, June 13, 2018

కథలు- సినిమా కతలు




ఇప్పుడంటే వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా సినిమాలమీదకు దృష్టి సారించడం లేదు. కానీ.. ఒక దశాబ్దం కిందట సినిమాలే ప్రపంచంగా..  సినిమా ప్రపంచంలో చెడ తిరిగిన వాడిని. 'చెడ' తిరగడం సినిమా జీవులకు ఉండవలసిన ప్రధాన లక్షణం.
బుద్ధిమంతులు ఇంట్లో.. గదిలో ఓ మూల చేరి  ప్రశాంతంగా .. ఏ అర్థరాత్రో.. ఆపరాత్రో.. ఎన్నికాగితాలూ.. కంప్యూటరు బైట్లు ఖరాబు చేసుకున్నా అడిగే నాథుడు ఉండడు. సినిమా రచయితకు అలా కుదరదు.  క్లాప్ బాయ్ నుంచి.. దర్శకుడిదాకా అందరూ 'నాథుళ్లే'. ఎవరికి వాళ్ళు వాళ్లను 'శ్రీనాథుళ్ల'ను కోవడం సినీజీవుల విలక్షణత. రావిశాస్త్రిగారినో సారి  సినీ కథ రాసేందుకని మద్రాసు తోలుకెళ్లారు తెల్సీ తెలియని అమాయకులెవరో తిరిగొచ్చిన తరువాత కొత్త  అనుభవం ఎలా ఉంది శాస్త్రిగారూ?' అనెవరో అడిగితే 'బాఁనే ఉంది. జల్సాగా కూడా ఉంది. మన భోజనానికి మన ఖర్చు లేదు. మన మందుకీ మనం  ఖర్చు అక్కర్లేదు. మన పసందు ఏదైనా సరే  మనం అచ్చుకోనక్కర్లేదు. మన పన్లేవీ  మన చేత చేయనివ్వరు.. చివరికి కథ కూడా..' అనేసారు.
ఈ కాలంలో అచ్చుపత్రికల్లో  కథల పేరుతో వచ్చే రాతలకే  'ఏకతా'సూత్రం (theory of  unification)) అతకడం లేదు. ఏ కతకైనా 'ఏకత'(Unity) అవసరమని SYD FIELD అనే పెద్దాయన 'Screenplay' అనే పుస్తకంలో సిద్ధాంతం చెబుతాడు. The Foundations of ScreenWriting పేరుతో పడీ పడీ 300 పేజీల ఉథ్గ్రంథం ఓటి   రాస్తూ బుర్రను తొలిచే  పురుగును .. చిట్టచివరగా  మిణుగురు పురుగు మాదిరి   ఎలా మెరిపించచ్చో  ‘స్టెప్ బై స్టెప్’ లెక్కలా  సాధికారికంగా వివరిస్తాడు.   హాలీవుడ్లో చిత్రాలు ఈ సిడ్ ఫీల్డ్   సూత్రాలమీద ఎంతవరకు తయారవుతాయో  తేల్చడం అంత తేలిక కాదు. కానీ.. హాలీవుడ్ స్థాయి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలందించాలని కలవరించే వెర్రి సజ్జంతా  కనీసం  ఒక్కసారైనా  ఈ పుస్తకం అట్టను తడిమి లోపలేం రాసుందో తెల్సుకుంటే లాభమే కానీ.. వచ్చే నష్టమేమీ ఉండదు.
కథను  తెరకు అనువదించడం  ఒక శాస్త్రం. శాస్త్ర ప్రకారం చేయడం అపాయకరమని మొదట్నుంచీ మన తెలుగువాళ్లకెందుకో ఒక అపనమ్మకం.  (ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందంటున్నారు). హాలీవుడ్డో. కొరియన్ ఫుడ్డో.. వాళ్లు అష్టకష్టాలూ పడి వండుకున్న వంటకాలని  దొంగతనంగా ఎత్తుకొచ్చి ఎంగిలి పడ్డంలో  మన రచయితలకదో రకమైన  థ్రిల్లు!
'లోకో భిన్న రుచిః ' అన్న సూత్రంలోని మాయమర్మం కాస్తయినా వంట పట్టిన   రచయిత  'నేటివైజేన్'  టెష్టులో 'సి' గ్రేడైనా సాధిస్తాడు. అదీ కుదరని 'మక్కీకి.. మక్కీ' కుక్కింగు రాయుళ్ళు-  నమ్ముకొని రంగంలోకి దూకిన దిగిన నిర్మాతల్ని నట్టేట ముంచేస్తారు.  మరో సినిమా తీయడం ఆనక.. బెజవాడ బస్టాండులో మిరబ్బజ్జీ  బాండీ వేసుకునే  స్థాయికి తీసుకు రాపోతే అక్కడికి అదృష్టవేఁ!  
హాలీవుడ్డు కయినా.. బాలీవుడ్డు కయినా.. టాలీవుడ్డు కయినా.. అతకడాలు.. అతక్క పోవడాలంటూ ఉండవు. సిడ్ ఫీల్డు స్క్రీన్ రైటింగు పాఠాలు ఒక్క  హాలీవుడ్డు మేథావుల చెవుల్లో  ఊదిన గాయత్రీ మంత్రాలేవీఁ కాదు.  ఊహా మాత్రంగా మెదడులో మెదిలిన ఆలోచన తెరమీదో కావ్యంగా కనిపించేందుకు జగమంతా ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.  కథానిర్మాణం  వెన్నెముక కూర్పయితే కథలోకి జీవం తేవడం సృజనాత్మకతకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. సిడ్ ఫీల్డుకైనా.. రాబర్డ్ మెక్ కైనా.. సిద్ధాంతం బుర్రకెక్కించడం వరకే పరిమితం! స్పీల్ బర్గో.. చక్రపాణో కావడం  మేథస్సుకు సంబంధించిన  చమత్కారం.
తెరమీద కదిలే కథకి..  తెర వెనక ఎంత కథ నడవాలో వివరించే సిద్దాంతం స్క్రీన్ ప్లే!  వాస్తవానికి అనుభవ పూర్వకంగా సాధించవలసిన యోగం ఇది. ఈదే నైపుణ్యం నేర్పే పుస్తకాలుండచ్చేమో.. కానీ.. ఈదడానికి మాత్రం ఎవరి రెక్కలు వాళ్లకే సాయం రావాలి' . సినిమా కథ తయారీకి కూడా సరిగ్గా అతికేదీ మార్క్ ట్వైన్ సూక్తి. కాకపోతే పుస్తకాలలో మనం చదివే కథలకి.. తెరమీద  మనం చూసే కథనాలకీ నిర్మాణ సిద్ధాంతంలో ఆట్టే తేడా లేదు. మనసును రంజింపచేసే ఈ రెండు ప్రక్రియల్లో ఉండేది ఒకే సామాస్య నిర్మాణ సూత్రం. చదువరులకి.. వీక్షకులకి ఆ మర్మాలు అనవసరమేమో గానీ.. కథానిర్మాతలకు ఈ లోతు పాతులన్నీ కాకపోయినా .. కొన్నైనా తెలిసుండాలి కదా!  వడ్డించినన భోజనం ఆరగించే మనిషికి అనుపాకాల తయారీతో సంబంధమేముంటుంది? భోక్తకు కావల్సింది రుచి. రుచికరంగా వండటమెలాగో తెలుసుకోవాల్సిన ధర్మం వంట చేసే మనిషిది. వంటమనిషికి కథలు రాసేవాళ్లకి ఒకే సూత్రం. ఆ సూత్రాలు తెల్సుకునేందుకైనా కొన్ని సిద్ధాంత గ్రంధాలమీద మనసుంచి అవపోసన పట్టాలి.
సిడ్ ఫీల్డ్.. రాబర్ట్ మెక్ లాంటి  అనుభవజ్ఞులైన చలనచిత్రకథాశాస్త్రజ్ఞులు  స్క్రీన్ రైటింగుకి సంబంధించిన సిద్ధాంత గ్రంథాల్లో  చెప్పిన పాఠాలన్నీ అందుచేతనే.. ఔత్సాహిక  సినీకథా రచయితలకు.. కథారచయితలకు..  ఒకే విధంగా ఉపకరించే  పాఠ్యగ్రంథాలని నా ఉద్దేశం.
నేను సినిమారంగంలో క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలుః
నేను చదివిన కొన్ని పుస్తకాలు
1.SYD FIELD /SCREENPLAY
2.ROBERT MckEE/ STORY-
substance, structure, style, and the principle of screenwriting
3.తెలుగు సినిమా సాహిత్యం- కథ , కథనం, శిల్పం- డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణఉస్మానియా విశ్వవిధ్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందిన సిద్ధాంత గ్రంథం
4.సినిమా స్క్రిప్టు రచనా శిల్పం- చిమ్మని మనోహర్
వగైరా.. వగైరా
-కర్లపాలెం హనుమంతరావు
14 -06 -2018


Tuesday, April 24, 2018

శంకరాభరణం – మాభూమి ఒక పోలిక- ఒక తేడా




శంకరాభరణం, మా భూమి చిత్రాలు
 ఒకే ఏడాది (1980) విడుదలయి రెండూ ఘనవిజయం సాధించాయి. 'శంకరాభరణం' చారిత్రక విజయం సాధించి, ఖండాంతరాలలో కీర్తిని గడించి, తమిళనాడు, కర్ణాటకలలో సైతం జైత్రయాత్ర సాగించి, డైలాగులు మలయాళంలో, పాటలు తెలుగులోనే ఉండి కేరళలోనూ ఘనవిజయం సాధించింది. 50 వారాలు ప్రదర్శితమైంది. సంగీతపరమైన చిత్రాలకు మళ్ళీ ఓ ట్రెండ్‌ను సృష్టించి, విశ్వనాథ్‌ ఈ తరహా చిత్రాలను మరికొన్ని రూపొందించడానికి ఆక్సిజన్‌ను అందించిందీ చిత్రం”(వికీపీడియా).  అవార్డు పొందిన శంకరాభరణాన్ని పోటీలు పడి ఇలా పొగడ్తలతో ముంచెత్తేసారు అప్పట్లో. నిరసన గళాలు వినిపించినవారు చాలా తక్కువ. అందులో భాగ్యనగరానికి చెందిన ఒక వామపక్ష విద్యార్థి సంఘం గొంతూ ఒకటి. వాళ్ల అభ్యంతరమల్లా చిత్రంలో ముఖ్య పాత్రధారులంతా బ్రాహ్మణ వర్గానికి చెందివుండటం. చిత్రాన్ని అర్థం చేసుకోవడంలో నిజానికి గజ దూరం దాకా వచ్చినా ఒక మూరలో దారి తప్పిపోయారా తమ్ముళ్ళు. నటీనటుల కులం సంగతి ‘రిజర్వేషన్' కోసం పోరాడే వర్గాల బాధ. వామపక్షీయులకెందుకు?! ‘శంకరాభరణం బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణుల వలన, బ్రాహ్మణుల కొరకు నిర్మితమైన చిత్రం’ అన్నారు ప్రజాహకుల్ల నేత బాలగోపాల్. ఇక్కడ బాలగోపాల్ వాడిన 'బ్రాహ్మణీయం' కులానికి సంబంధించింది కాదు సుమా! భారతీయుల సంస్కృతికి తమను తాము ప్రతినిధులుగా భావించుకొనే తరహా వర్గానికి సంబంధించింది. ఆ వివరణా ఆయనే ఇచ్చుకొన్నారు. బాలగోపాల్ శంకరాభరణం విజయాన్ని విశ్లేషించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
భారతీయ సామాజిక వ్యవస్థ రంగు, రుచి, వాసన సాధారణంగా బూర్జువా, భూస్వామ్య వ్యవస్థలకు దగ్గరగా ఉంటుంది. అది బాహ్య స్వరూపం. నయావలస విధాన లక్షణాలనూ  జోడించినప్పుడే దాని సంపూర్ణ స్వభావం అర్థమయేది-అంటారు బాలగోపాల్.
భారతీయ బడా బూర్జువా వర్గం ప్రగతిశీల స్వతంత్ర వ్యవస్థ కాదు. ప్రపంచ పెట్టుబడీదారీ వ్యవస్థ కొంగు పట్టుకుని నడిచే పరాన్నజీవి. వర్తమాన భారతీయ సంస్కృతిలో కనిపించే కళారూపాలేవీ వాటికై అవి వికసించలేదు. అవీ ప్రపంచ పెట్టుబడిదారీ కళలకు అనుకరణలే. ఆ అనుకరణైనా ఉదారవాద బూర్జువా సంస్కృతి నుంచి ప్రభావితమై ఉండుంటే  కొంతలో కొంత మేలు జరిగి ఉండేది. కుళ్ళిపోయిన నిరాశావాదపు సంస్కృతిని  వెకిలిగా అనుసరించాయి ఆ కళలన్నీ. భవిష్యత్తు పట్ల విశ్వాసం లేని సంస్కృతి అస్తమానం అమూర్త వ్యక్తీకరణల వెనక నక్కే ప్రయత్నం చేస్తుంది. కానీ దానిలోని అంతర్గత ప్రజాస్వామ్య తర్కం ఆ పలాయనమంత్రానికి అడ్దొస్తుంటుంది. లాభాపేక్ష లాలస అనునిత్యం  వెంటాడే బూర్జువా కళలు ప్రజాస్వామ్యంలో సామాన్యులనుంచి పుర్తిగా మొహం తిప్పుకోలేవు. అట్లాగని నిజాయితీగా నిజాన్ని చెప్పనూ లేవు. ప్రజల విచక్షణని తట్టిలేపే బదులు .. భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే నల్లమందులా జనం ఇంగితాన్ని  మగతలోకి నెట్టే ప్రయాస. కాబట్టే వివేకంతో పనిలేని శృంగారం, భావోద్వేగాలను సులభంగా రెచ్చగొట్టే హింసాత్మక సంఘటనలు చలన చిత్రాల్లో మనకు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి! లేకపోతే ప్రజల  నిజమైన సమస్యలను పట్టించుకుంటూ వాటి పరిష్కార మార్గాల కోసం నిజాయితీగా వెతికుతూ తమ గొయ్యి తామే  తీసుకుంటాయా ఏక్కడైనా బూర్జువా స్వభావముండే చిత్రాలు? ఈ తరహా చిత్రాల పలాయనవాదానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. తమకున్న పరాధీనత అనే బలహీనత కారణంగా ప్రగతిశీల బూర్జువావర్గంతో కన్నా భూస్వామ్యవర్గాలతోనే రాజీపడేందుకు ఇష్ట పడతాయి.
ఆధిపత్య సంస్కృతిలో మరో సగభాగం భూస్వామ్య సంస్కృతి. ఇదీ పతనావస్థలోనే ఉంది. అయినా కాలం చెల్లిపోతున్న బూర్జువా సంస్కృతికీ దీనికీ ఒక విషయంలో తేడా కద్దు.  భూస్వామ్య సంస్కృతికి ప్రజాస్వామ్య సంస్కృతితో సంబంధ బాంధవ్యాలు గిట్టవు. కనక అది పూర్తిగా ముడుచుకుపోయి మృతప్రాయంగా ఉన్నట్లే లెక్క. బెరడుకట్టిన భూస్వామ్య సంస్కృతి అసభ్యకరమైన నయా వలస విధానానికి తోడైతే ఏమవుతుందో అదే ఇప్పడు కళారంగాలలో కనిపిస్తున్న వికార సంస్కృతి.
సినిమా కూడా సంస్కృతిలో ఒక భాగమే. కాబట్టి భారతీయ చలనచిత్రకళలో కూడా ఈ వికార  మిశ్రమత్వం తప్పదు. వ్యాపార దృష్టితో చూస్తే అది సినిమావాళ్లకు  అవసరమే కదా?
దేశ జనాభాలో అధిక శాతం ఫ్యూడల్ వ్యవస్థ దోపిడీకి గురయినవాళ్లుంటున్నారు. వాళ్లకి భూస్వామ్య సంస్కృతిని ఉన్నతంగా చూపించే చిత్రాలు నచ్చవు. అట్లాగని పూర్తిగా  హాలివుడ్ తరహా  కల్చర్ని హైలైట్  చేసి తీసినా జనాన్ని సంతృప్తి పరచడం కష్టం. వాళ్లు తమకు పరిచయమయిన నేటివిటీనే కోరుకుంటారు. ఆ మాస్ కల్చర్ కి తగ్గట్లు తీయడం ఉదారవాదికి గిట్టదు. అశ్లీషతకు పెద్దపీట వేయడం బ్రాహ్మణిజానికి నప్పదు. అయినా అలగా సినీప్రేక్షక జనాలని ఏదో విధంగా  సంతృప్తి పరచాలి కనక  అంతో ఇంతో అశ్లీలం చలన చిత్రాల్లో చొప్పించక తప్పదు. సినిమా కూడా వ్యాపారమే!  మనకూ లాభాలు రావాలి కదా’  అని తమను తాము సమాధాన పరుచుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఆ స్పృహలోనుంచి బయటకు వచ్చే అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి విచిత్రమే ‘శంకరాభరణం’ చిత్రం- ఇలా సాగుతుంది  బాలగోపాల్ విశ్లేషణ.  
అతను శంకరాభరణం కథను క్లుప్తంగా చెప్పిన తీరూ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
కథానాయకుడు ఒక బ్రాహ్మణుడు. అతగాడికి సంగీతం పిచ్చి. అదీ ప్రాచ్య తరహా సంగీతమంటేనే. పాశ్చాత్య సంగీతం మీద సదభిప్రాయం లేదు. సరి కదా పిచ్చికూతలు అని తగని ఆగ్రహం. కానీ ఉదారభావాలు కలవాడా శాస్త్రిగారు.. సంగీతం మీద తనకు లాగానే పిచ్చి ఉన్న ఒక వేశ్యను చేరదీస్తాడు. ఆ అకార్యానికి శిక్షగా  కులబహిష్కరణ జరిగినా పట్టించుకోడు. వెలేసిన సంఘాన్ని ఏమనడు కానీ ఆ కోపం అంతా పాపం  దేవుడు మీద చూపిస్తాడు. తన సంగీతం రవంధాళితో ఉరుములు మెరుపులు పుట్టిస్తాడు. ఏం ప్రయోజనం ఆశించాడో ఆయనకే తెలియాలి! కూతురికి పెళ్లిచూపులప్పుడు కూడా అదే తంతు. పాడే పాటలో అపశృతి  దొర్లినందుకు పదిమంది ముందు పాపం బిడ్డ మీద  విరుచుకుపడతాడు. కాబోయే అల్లుడికి సంగీత జ్ఞానం లేనందుకు బిక్కచచ్చేట్లు కూకలేస్తాడు కూడా. సినిమా అంతా ఒకటే సంగీత ఘోష.  కళలు ఉన్నది కామోద్రేకం కలిగించడానికి కాదు.. ఆవటా అని. ఆ సందేశం అలగా జనానికి ఉద్దేశించింది. విచిత్రం ఏమిటంటే ఎవరిని ఉద్దేశించి ఆ చిత్రం నిర్మాణమయిందో వాళ్లకా చిత్రం బొత్తిగా అర్థం కాదు. ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది  శంకర శాస్త్రిని తిట్టి పోసి.. వెలేసిన  బ్రాహ్మణ సంస్కతి వర్గమే! అదీ తమాషా!
నాటి నయా వలసవాద సాంస్కృతిక బానిసత్వానికి 'శంకరాభరణం' లాంటి చిత్రాలను ప్రత్యామ్నాయంగా కోరుకోవడం హైదరాబాద్ వామపక్ష విధ్యార్థుల అమాయకత్వం. వాళ్ల వంటి ఆశావాదుల కోరికను తీర్చే  చిత్రం ఆ ఏడే  విడుదలై   ఘనవిజయం కూడా సాధించింది. ఆ ఘనత సాధించిన సినిమా గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో తయారైన 'మా భూమి'. 1930 - 1948 ప్రాంతంలో హైదరాబాదు నిజాముకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది. కిషన్ చందర్ నవల ‘జబ్ ఖేత్ జాగే’  ఈ చిత్రానికి ఆధారం. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-1980లో ప్రదర్శితమైంది. కార్వే వారీ చలనచిత్రోత్సవంలో, కైరో  సిడ్నీ చలనచిత్రోత్సవాల్లో భారతదేశపు అధికారిక ఎంట్రీ హోదా సాధించుకుంది. సిఎన్ఎన్-ఐబీఎన్ వారి 100 గొప్ప భారతీయ చలనచిత్రాల జాబితాలో  చోటుచేసుకుంది.
1940 దశకంలో సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ తిరుగుబాటు ఈ చిత్రం ఇతివృత్తం. సినీ సాంకేతిక నిష్ణాతుల ప్రకారం చిత్రం ఆరంభంలో కొంత తడబాటు కనబడుతుంది. ముఖ్య పాత్రధారుల నోట  గ్రామీణ తెలంగాణా యాస అంత సహజంగా  పలకలేదు. లంబాడా పాత్ర వేసిన అమ్మాయి పలికిన భాష ఏ లంబాడా జాతుల్లోనూ వినిపించేది కాదన్నారు బాలగోపాల్. కానీ ఈ ప్రాథమిక లోపాల పొరలు దాటుకుని మరికొంత   లోతుల్లోకి పోయి చూస్తే మెచ్చుకోదగ్గ అంశాలు ‘మా భూమి’లో చాలానే కనిపిస్తాయి.
కథ క్లుప్తంగాః 50 వేల ఎకరాల  భూ ఆసామీ దగ్గరి జీతగాడి కొడుకు రామయ్య, చిన్నప్పటి బట్టి తిరగబడే తత్వం ఆ బుడతడిది. పల్లెలోని దౌర్జన్యం తట్టుకోలేక పట్నం చేరి ఓ కర్మాగారంలో పనికి కుదురుకుంటాడు. కార్మికసంఘ నేతతో పరిచయం పెరుగుతుంది. రామయ్యతో పాటే సినిమా ప్రేక్షకులకూ అదనపు విలువ, అక్టోబరు విప్లవం లాంటి కొత్త విప్లవ విశేషాలు ఎరికలోకి వస్తాయి. పట్నం వదిలి గ్రామం తిరిగెళ్లిన రామయ్య అక్కడ జరిగే  తిరుగుబాటులో  కీలకపాత్ర వహిస్తాడు. అప్పటికే బలహీన పడ్డ నిజాం సైన్యం మీద విజయం సాధించినా.. భారత సైన్యం చేతిలో సర్కారు 'శాంతి భద్రతల పునరుద్ధరణ' పర్వంలో రామయ్య ప్రాణాలు విడవడం ప్రేక్షకుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయ్!
అన్నదాత కర్మాగారపు పనివాడుగా పరివర్తన చెందడం, శ్రామిక చైతన్యం అందిపుచ్చుకోవడంలో గ్రామీణుడు చూపించిన చొరవ, ప్రజాస్వామ్య పంథాలోనే తిరుగుబాటు బావుటా ఎగరేయాలనే సంకల్పం, ఆ క్రమంలో ఆదివాసులను సైతం కూడగలుపుకొని ఐక్య పోరాటాలు చేయవలసిన అగత్యాన్ని గుర్తించడం, జాతీయ బూర్జువాగా గుర్తింపబడ్డ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థతో రాజీపడే తీరు గ్రామీణ ప్రేక్షకులక్కూడా అర్థమయే తీరులో చిత్రీకరించారు ఈ చిత్రంలో. షేర్వాణీలో పట్నం తారుకున్న దొర పల్లెకు తిరిగొచ్చే వేళకి  నెత్తికి గాంధీ టోపీ తగిలిస్తాడు. ఇలాంటి చక్కటి ప్రతీకలతో నిండి ఉండటంతో చెప్పదలుచుకున్న విషయాలు సులభంగా సామాన్య జనానికి చేరాయి. నిజాముతో అందరితో కలసి పోరాడిన రైతాంగంలోని సంపన్న వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రం  జమీందారీ వర్గం ఆధిపత్యాన్ని అంగీకరిస్తాయి. పోరాటం నాటి, ముందు, వెనుకల పరిస్థితులన్నింటినీ వాస్తవికంగా చిత్రీకరించడంలో 'మా భూమి' సఫలమైంది. చేరవలసిన ప్రేక్షక సమూహాలకు చేర్చవలసిన సందేశం చేర్చడంలో చిత్రం విజయంతమైంది. కనకనే 'మా భూమి' విజయం 'శంకరాభరణం' విజయం కన్నా విశిష్టమైనది. వాస్తవమైనది. ప్రగతిశీలమైనది- అంటారు బాలగోపాల్.
'కళ కర్తవ్యం ఏమిటి' అన్న ప్రశ్నకు  శంకరాభరణం'విజయం కన్నా మిన్నగా 'మా భూమి' విజయం సమాధానం ఇచ్చినట్లయింది. గత విజయాలను, వైఫల్యాలను గుర్తు చేయడం, గడచిన సామాజిక ఉద్యమాలను  విశ్లేషించడం, తద్వారా ప్రజాస్వామిక విప్లవ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లడం కళ కర్తవ్యం. అలా అని నమ్మే వాళ్లంతా  'మా భూమి'  చిత్ర విజయాన్నే మనసారా ఆస్వాదించారు. సాయుధ పోరాటం తాలూకు  చేదు, తీపి ఫలాలు రెండింటినీ చవి చూసిన తెలంగాణా గడ్డ మీదే 'మా భూమి' ఘన విజయం సాధించడం అదో గొప్ప విశేషం. లెనిన్ ని చదువుకున్న  మేధావి వర్గమే కాకుండా సాయుధ పోరాట స్ఫూర్తి ఇంకా తమ  రక్తంలో రగిలే  మధ్యతరగతి, శ్రామిక వర్గాలూ ఎగబడి చూస్తూ 'మా భూమి'ని విజయవంతం చేయడం మహదానందమైన విశేషంగా బాలగోపాల్ చేసిన విశ్లేషణ సమంజసమైనది.
-కర్లపాలెం హనుమంతరావు
సాహిత్యం పై బాలగోపాల్’ పుస్తకంలో సినిమా సమీక్ష విభాగం కింద  ‘శంకరాభరణం, మా భూమి’ వ్యాసం ఆధారంగా చేసిన రచన (పుటలు..237 - 241)

***

Friday, January 29, 2016

ఓ చంటోడి కథ- 'ఆక్షర' సరదా కథ- నేటి సినిమా అభిమానసంఘాలమీద సెటైరికల్ స్టోరీ


'చంటోడు కనిపించడం లేదండీ!' బావురుమంది ఆదిలక్ష్మి.
కనిపించకపోవడానికి వాడేమన్నా నలకా? నల్లపూసా? ఏ బాత్ రూంలోనో, డాబాపైనో ..సెల్లో ఛాటింగులో ..ఉంటాడు చూడండహే!' అంటూ  పాంటు వేసుకుంటో విసుక్కున్నాడు పాపారావు. ఉబ్బెత్తుగా ఉండాల్సిన పర్సు  శివరాత్రినాటి ఉపవాసం భక్తుడిలా చప్పగా అయిపోవడం చూసి  ఉలిక్కిపడ్డాడు. 'అన్నట్లు.. ఇవాళ ఇంటరు రిజల్ట్సు వచ్చే రోజు కదూ! ఇంక ఇంట్లో ఎందుకుంటాడూ?!' అంటో బిగ్గరగా అరిచాడు.
'ఎప్పుడు చూసినా వాడినాడిపోసుకుంటావు.. నువ్వసలు వాడి కన్నతండివేనంట్రా?' అని గఁయ్యిమంది పాపారావు తల్లి.
'ఆ ముక్క.. కన్నదాన్ని.. నీ కోడల్నడుగు!  గాడిదకొడుకు నా కంటపడనీ! కాళ్ళు రెండూ విరిచి పొయిలో పెట్టకపోతే నా పేరు.. పిడకల పాపారావే కాదు!' అంటూ సగం వేసుకున్న పాంటుతోనే పేరిణి నృత్యం ప్రారంభించాడు పాపారావు.
'పాపారావు అరుపులకి, ఆడంగుల ఏడుపులకి అప్పుడే సగం కాలనీ పోగయిపోయింది  పాపారావు ఇంటిగుమ్మంలో. ఇరుగుపొరుగు ధర్మంగా తలో రాయీ విసురుతున్నారు. 'పోలీసులేమైనా ఎత్తుకుపోయారేమో! టీవీ పెట్టండి. ఏ ఏరియాలో ఎన్కౌంటరయిందో వివరంగా చూడచ్చు!' అన్నారెవరో. ఘొల్లుమన్నారు ఆడంగులంతా కూడబలుక్కునట్లు ఒక్కసారే గొంతులెత్తి! ఆదిలక్ష్మి 'ఢా'మ్మని పడిపోయిందా సౌండుకి.
'ఎదురింటి కామాక్షికూడా ఇంట్లో ఉందో లేదో .. ముందా సంగతి  కనుక్కోండి!' గుంపులోనుంచి మరో  గొంతు సన్నాయినొక్కులు. మళ్లా ఘొల్లుమని ఆడంగుల బృందగానం. ముసలమ్మ పడిపోయిందీసారి సౌండుకి.
పాపారావు ఆలోచనలు మరోవైపుకి లాగుతున్నాయి. మొన్నదేదో ఎత్తుభారం చానల్లో కొత్తసినిమాకు అంతా కొత్తముఖాలే కావాల'ని వారంరోజులు ఒహటే  వూదరగొట్టేసారు. కొంపదీసి ఈ చంటిగాడేమన్నా అటు చెక్కేసాడేమో?
పోలీసుస్టేషను నెంబరుకోసం ట్రై చేస్తుంటే సుబ్బలక్ష్మి పరుగెత్తుకొచ్చింది 'డాడీ! అన్నయ్య బెడ్డుమీద ఈ లెటరు పడేసుంది' అంటూ ఓ కాగితంముక్క చేత్తో ఊపుకొంటూ!
'పోలీసులకోసం ప్రయత్నిస్తే మీకే లాసు. మీ చంటాడు మా కంట్రోల్లోనే ఉన్నాడు. మా తరువాత మెసేజీకోసం మీ సెల్ ఫోన్ హమేశా చార్జింగులో ఉంచుకోడం మర్చిపోకండి.. మీకే మంచిది' అన్న హెచ్చరికుంది ఆ కాగితంలో.
చంటాడు కిడ్నాపయిన వార్త క్షణాల్లో కాలనీ అంతా పొక్కిపోయింది.
పాపారావు 'కోతి'మార్కు పళ్లపొడి కంపెనీలో  సేల్సు ఏజెంటు. పాలవాడు పేపరువాడుకూడా నెల మొదటిరోజు   తప్ప పట్టించుకోని పాపరు పాపారావు. 'ఈయనగారి  కొడుకును కొడితే కోట్లొస్తాయనుకున్నారేమిటో  పిచ్చి నా కొడుకులు.. కిడ్నాపర్లు!'- అని పేట పేటంతా ఒహటే జోకులు. 'నీ కోతిమార్కు పళ్లపొడి పొట్లాలు ఓ పాతిక వాళ్ల మొహాన కొట్టు పాపారావ్! తోముకోలేక వాళ్లే తోకముడిచేస్తారు!' అని మొహంమీదే జోకులేసాడు పక్కింటి మోహన్రావు.

పాపారావు కొడుక్కు అప్పుడే సంతాపం ప్రకటించే మూడ్ లోకి వెళ్ళిపోయింది కాలనీ అంతా
'గోల్డులాంటి కుర్రాడు కదండీ! ఊళ్ళో కే సినిమావచ్చినా మనవాడిదే సందడంతా! రిలీజుకి వారంరోజులముందునుంచే ఊరంతా తిరిగి వూదరగొట్టేవాడు, పాపం. సందుచివరి న్యూస్ పేపర్ల దుకాణంముందు ఎప్పుడు చూసినా పిచ్చి పిచ్చి సినిమాపత్రికలేవో ముందేసుక్కూర్చుని అదేదో హీరోకి అభిమానసంఘమంటూ ఆగమాగం చేయడం వాడి హాబీ! అదేదో హీరో పరమ వీర బోరు చిత్రరాజం ‘తీసావే.. చచ్చావే!’ వారంరోజులవకముందే తీసేస్తున్నారని థియేటరుముందు ఆత్మాహుతికి ఒడిగట్టిన  సన్నివేశం నిన్నగాక మొన్ననే జరిగినట్లుంది కాలనీజనాలకి. అగ్గిపెట్టెలో పుల్లలు లేకపోబట్టిగానీ.. లేకపోతే పాపం  పాపారావుకీపాటికే తలక్కొరివిపెట్టే కొడుకు కరువై  పోయుండేవాడు!’
'ఆ పాడుసినిమా ’నా ఆట- నా ఇష్టం’ ఆడియో కేసెట్లేవో బలవంతంగా అంటగడుతున్నాడీ మధ్య. కాలనీ గేటుబైటే కాబూలీవాలాటైపు  కాపువేసి మరీ వేపుకుతింటుంటే.. కడుపు మండిన కోపిష్టెవడో వీడినిలా   మాయంచేసుండొచ్చు' అంటూ ఎదురింటి అప్పారావు ఊహానందం.
'శుభం' అన్నట్లు పాపారావు సెల్  మోగింది అదే సమయంలో మూడు సార్లు. 'మీ చంటిని  మళ్ళీ ప్రాణాలతో చూడాలనుకుంటే మీరీ రోజు 'సాయి' టాకీసులో 'కసాయి' మొదటాట చూసితీరాలి! ఆరుకల్లా కాలనీ జనమంతా హాలులో హాజరవకపోతే మీ వాడి ఆట   రెండో ఆటలోపు మటాష్!'
ఫోన్ కట్టయింది. పాపారావుకు మతిపోయినంత పనయింది.
'వీళ్ళ డిమాండు మండా! ఇంట్లో వాళ్లమంటే ఎలాగో తట్టుకోవచ్చు. కాలనీ కిష్కింధగుంపునంతా పోగేసుకొని పోవాలంటే.. మాటలా? మూటలతో పని. మూడు బస్సులమీద ఆరు ఆటోలవుతాయి. తలకో వందేసుకున్నా.. టీ కాఫీ టిఫిన్లతో కలుపుకొని పదివేలకుపైగానే  పోకెట్ కట్! మనీ సంగతలా ఉంచి.. ముందీ ముసలీ ముతకా.. పిల్లా జెల్లా.. ఆడా మగాని కూడేసుకొని రావాలంటే ఏ పవర్ స్టారో.. ఏక్టింగు లయనో ఎట్రాక్షనుగా ఉండాలి. పోనీ మానవతాకోణాన్ని వాళ్ళలో మేలుకొలిపైనా తోలుకెళదామంటే.. మేలు, ఫిమేలు కలసి కూర్చుని చూసే సినిమాలేనా  ఇప్పుడొస్తున్నవి!’
‘ఈ గొడవలన్నీ ఎందుగ్గానీ.. ఓ పదివేలిచ్చుకుంటా.. మా చచ్చుసన్నాసిని వదిలేయండి! కాదు కూడదంటారా? పొడిచేసేయండి.. ఫర్వా నై! వాడిక్కడుండి పొడిచేసేదికూడా ఏం లేదు' అనేసాడు మళ్లీ ఫోన్ చేసా ఆగంతకులు బెదిరించినప్పుడు పాపారావు.
'ష్! డోంటాక్ రబ్బిష్! నీ ముష్ఠి పదివేలెవడిక్కావాలి బే! మాక్కావాల్సింది మా అభిమాన హీరో  మూవీకి సూపర్ పాజిటివ్ టాక్!' అంటూ లైన్ కట్ చేసారవతలనుంచి.
'పిల్లాడికన్నా సినిమా ఎక్కువటండీ?కాలనీవాళ్ల కాళ్ళు నే పటుకుంటా.. మిగతా సంగతులన్నీ మీరు చూసుకోండి!' అంటూ కన్నీళ్ళు పెట్టుకొంటో బైటికి పరిగెత్తింది ఆదిలక్ష్మి.
*                                     *                                  *
ఆరుకింకా ఐదునిమిషాలుందనంగానే ఆరు ట్రావెల్సు బస్సులు.. మూడు ఆటోలతో సహా సాయి టాకీసు గేటుముందుకొచ్చి ఆగాయి. అప్పటికే హౌస్ ఫుల్ బోర్డు! హాలుముందుమాత్రం పురుగు లేదు!! 'ట్వంటీ.. ట్వంటీ! ట్వంటీ.. ట్వంటీ!' అనంటూ చెవిగోసిన మేకల్లాగా  ఒహటే అరుపులు!
'థియేటరుకా.. స్టేడియానికా మనమొచ్చింది?! క్రికెట్టాటక్కూడా  మనుషుల్లేరేంటి చెప్మా!'
ఓ చష్మావాలా సందేహం.
'పబ్లిక్కే లేదు. బ్లాకెందుకయ్యా?' అనడిగాడు పాపారావు ఓ బక్కకుర్రాడి రెక్క పట్టుకొని బిక్కుబిక్కుమంటూ.
'ముందొచ్చినవాళ్ళంతా బ్లాకే కోయించుకోవాలి సార్!  చివర్లో వచ్చేవాళ్ళ సౌకర్యంకోసం హాలువాళ్ళే చేసారీ ఏర్పాట్లు!’  ఉరుమురిమి చూసాడా పిల్ల బ్లాకటీరు.
వాడు చెప్పిన రేటుకు నోర్మూసుకొని టిక్కెట్లుకోయించుకొని ఎట్లాగో హాల్లోకొచ్చిపడ్డారు కాలనీ జనమంతా పాపారావు సౌజన్యంతో.

చిత్రం మొదలవకముందే ఫోనుల్లో మెసేజీలు మొదలయ్యాయి.
‘ఇప్పుడే హీరో ఎంట్రీ! నాలికబలం కొద్దీ ఈల వేయండి!'
'ఈలెయ్యడం  మొగాళ్ళందరకీ రాదుకదయ్యా మగడా?' ఆదిలక్ష్మి సందేహం.
''ఫర్వానై! చప్పట్లైనా కొట్టొచ్చు! ముందు ముందు చప్పట్లు కొట్టాల్సిన బిల్డప్పు సీన్లు బోలెడొస్తాయి. అప్పుడు నొప్పులంటే కుదరదు మరి. చంటాడి లైఫుకే రిస్కు! ఆలోచించుకోండి!' అవతల ఆగంతకుడి గొంతు.
ఒక్క చప్పట్లతో సరిపుచ్చితే లేనిదేముంది? మధ్యలో ఒకసారి.. టిక్కెట్లు చింపి  పోగుల్ని గాల్లోకి వెదజల్లాలని హుకూములు! మరోసారి హీరో హీరోయిన్ని పాటవంకతో పచ్చడి పచ్చడి చేసేటప్పుడు తెరమీదకు పూలు జల్లమని ఆదేశాలు! 'హఠాత్తుగా పూలంటే..  ఎక్కణ్ణుంచొస్తాయయ్యా!' అనడిగితే 'వట్టి ఫూల్సులాగున్నారే మీ కాలనీ జనమంతా! మా హీరో సినిమాకు వట్టి చేతుల్తోనా  వస్త! మీ ఆడాళ్లకు తలలు లేవా? ఆ తలలకు పూల్లేవా?  విసరండయ్యా వాటిని పీకీ!' అంటో గద్దింపులు!
పడకసీన్లొచ్చినప్పుడు పసిపిల్లలచేత కుర్చీలెక్కించి డ్యాన్సులు చేయించారు. మందుకొట్టి విలన్లను హీరో చితక్కొడుతున్నప్పుడు ఆడంగులచేత కొంగులు బిగించి మరీ చిందులేయించారు! గ్రాఫిక్సులో ముసలి హీరో చేసే మెలికలపాము డ్యాన్సులకు ముసలిప్రేక్షకులచేత  నడుములూపే స్టెప్పులేయించారు  మరీ అన్యాయంగా!
'మేమంతా ఓ మూల నక్కి మీ రియాక్షన్లన్నీ గమనిస్తూనే ఉన్నాం. మొహాలు అలా వికారంగా పెటుక్కూర్చుంటే కుదరదిక్కడ. మీ వంశోద్ధారకుడు క్షేమంగా విడుదలవ్వాలంటే  మూతులు వెడల్పుగా పెట్టుకు తీరాలి.  నీళ్ళురాకున్నా కళ్ళు మధ్య మధ్యలో తుడుచుకుంటుండాల్సిందే. అడపా దడపా వేడి వేడి నిట్టూర్పులు, ఉండుండి పొట్ట చేత్తో గట్టిగా పట్టుకుని పొర్లుగింతలు గట్రా పెడుతూ  బిగ్గరగా నవ్వడాలెలాగూ తవ్వపు. అమీర్ఖాన్   ‘పీకే’ మూవీ చూస్తూ ప్రేక్షకులేవిధంగా స్పందిస్తారో.. దానికిమించి మీరంతా అబినయించకపోతే మీ చంటాడి ప్రాణాలకింక   నీళ్ళు వదులుకోవాల్సిందే' అని వార్నింగు ఇచ్చేశారా దుర్మార్గులు!
నవ్వాల్సిన  చోట నవ్వురాకపోగా కడుపులో తిప్పినట్లై రెండుమూడుసార్లు వాంతులు చేసుకున్నాడు పాపం అప్పారావు.  ఇంటర్వెల్ గంటకొట్టలేదని చంటిపిల్లలంతా ఒహటే గగ్గోళ్ళు. విరామసమయంలో క్యాంటీనుమీద దాడిచేసి వీలైనంత ఇంధనం వేసుకుంటేగాని కాలనీజనాల కండుపుమంటలు  కాస్తంతైనా చల్లారలేదు. కాకపోతే ఆ ఇంధనం పాపం పాపారావుకి పెట్రోలుకన్నా ఎక్కువ మంటపుట్టించింది..నెలంతా గడప గడపా తిరిగి అమ్మిన కచ్చిక పొళ్ళ తాలుకు సొమ్మది మరి!
పాపారావు  వంశోద్ధారకుడి పాడుప్రాణాలకోసం ‘చిత్ర’హింసకుమించిన  చిత్రహింసలను సైతం సహించడానికి సిద్దపడ్డారు పాపం కాలనీవాసులంతా! 'శుభం'కార్డు పడంగానే గభాలున లేచి తొడతొక్కిడిగా తోసుకంటూ బైటకొచ్చిపడ్డా ఆ  వైనమే చెబుతోంది  కాలనీవాసులు పడ్డ 'చిత్ర' హింసల క్షోభ!
'ఇహనైనా మనవాడిని విడిచిపెడతారేమో కనుక్కోండి' అంది ఆదిలక్ష్మి గుడ్లనీరు కుక్కుకుంటో.
పాపారావు సెల్లోకి చివరి సందేశం వచ్చింది 'గేటుబైట టీవీలవారి కెమేరాలన్నీ మీ స్పందనకోసమే ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. మా హీరోగురించి  ఎంత సూపర్ గా చెబితే మీ వంశోద్ధారకుడికంత మేలు!’

'సినిమా ఎలా ఉంది?'  ఒక మైకేశ్వరి ప్రశ్న ' పరమఛండాలంగా ఉంది. హీరోది  నీచ నికృష్ట నటన. కథ జీరో సైజు. కథనం అయోమయం. దశాదిశాలేని  దర్శకత్వం. నీరసమైన సంగీతం. అలుక్కుపోయిన గ్రాఫిక్సు. పాటలు పచ్చి బూతు. మాటలు పరమ మొరటు. ఫస్టుహాఫు పెద్దరంపం. సెకండు హాఫు పెనుగునపం. కామెడీ  ఏడిపించింది. కరుణరసం నవ్వించింది..' అంటో రెచ్చిపోతోన్న అప్పారావు నోరు నొక్కేసి పక్కకీడ్చేసి ' హీరో సూపర్.. హీరో యాక్టింగ్ అదుర్స్!.. హీరో డ్యాన్సింగ్  చిరుగ్స్. హీరో  ఫైటింగు  ఇరుగ్స్. హీరో వంచిలు కేక!  హండ్రెడ్ డేస్ గ్యారంటీ! రికార్దు బ్రేకులు పక్కా' అంటో పాపారావు రెండేళ్లూ గాల్లో ఊపుకుంటూ బస్సులోకొచ్చి కూలపడ్డాడు.
'నిజంగా సినిమా నీకంత బావుందా.. డాడీ?' కళ్ళు పెద్దవిచేసి అడిగింది డాటరు సుబ్బలక్ష్మి.
'బాగా.. నా బొందా! కడుపులో తిప్పుతోందిక్కడ. ఎప్పుడింటికెళ్ళి పడదామా అని తొందర!' అని పొట్టనొక్కుకున్నాడు పాపం పాపారావు.

బస్సులు బైలుదేరే వేళకి చంటోడు ఊడిపడ్డాడు రొప్పుకొంటో. కళ్లంతా వాచి ఉన్నాయి. 'బాగా కొట్టారేందిరా పిచ్చి సన్నాసిని చేసి' అంటూ బావురమంది బామ్మగారు మనవణ్ణి గాట్టిగా కావిలించేసుకొంటో.
'అదేం కాదులేవే! రికార్డు బ్రేక్కింకో రెండు బస్సులజనం తక్కువయ్యారని ఏడుపు. రెండో ఆటకైనా ఇంకో రెండు కాలనీలు కవరు కాకపోతే  మా హీరో పరువు గంగలో కలవడం ఖాయం. డాడీదగ్గర్నుంచీ  ఇంకో ఏడువేలైనా వల్చుకు పోకబోతే   మా అభిమాన సంఘంవాళ్ళు నన్ను చంపిపాతరేస్తారే మమ్మీ!' అంటూ తల్లి చీరకొంగు పట్టుకొని లాగడం మొదలుపెట్టాడు చంటిగాడు గారాబంగా. ఆదిలక్ష్మి కంగారు పడింది.
కదిలే బస్సునుంచి  పర్సును కసిగా బైటికి విసిరేస్తూ అన్నాడు పాపారావు. 'ఏడువేలు కాదుగదా.. ఏడు పైసలుకూడా నా దగ్గర్నుంచీ ఇంక వసూలు కావురా   గాడిదకొడకా! నిన్ను కిడ్నాపుచేసిన వెధవలు   మీ ఎద్దుహీరో అభిమానసంఘం మొద్దులా?! నెలంతా అమ్మి దాచిన  కోతిమార్కు కచ్చికపొడి  సొమ్మురా అదీ! కంపెనీకి కట్టాల్సింది. అయ్యో!  మీ ఎదాన పోసానే! ఎవడిది నాయనా ఈ దిక్కుమాలిన బేవార్సు  ఆలోచన?'
'మనదే డాడీ! ఐడియా మనది. యాక్టింగ్ బ్రదర్ది'అంటో  పడీపడీ నవ్వడం మొదలుపెటింది  కూతురు సుబ్బలక్ష్మి. పిచ్చిచూపులు పడ్డాయి పాపం పాపారావుకి. పిచ్చిమాటలు మొదలయ్యాయి ఆదిలక్ష్మికి.
'మన పిల్లలు నిజంగా మహాగ్రేటండీ! ఓ సినీహీరో పరువు నిలబట్టంకోసం సొంత కొంపకైనా  నిప్పెట్టటానికి రడీ అయిపోయారు! ఆహా! ఎంతమంది కనగలరండీ ఇంత రౌడీసంతానాన్ని?! మీరూ ఉన్నారెందుకు? పాతికేళ్లబట్టీ ఆ కోతిమార్కు పళ్ళపొడి పొట్లాలమ్ముకొంటున్నారు. టార్గెట్టు రీచవలేదని  పైవాళ్లచేత ఎప్పుడూ దెప్పుళ్ళే! ఏ కిడ్నాపో.. బ్లాకుమెయిలో.. కనీసం  బాంబుబ్లాస్టింగుకైనా చేసి   సేల్సుపెంచుకోవాలనిగాని,  శభాషనిపించుకోవాలనిగాని,  ప్రమోషన్లు సాధించుకోవాలనిగాని ఐడియాలు రాకపాయా! ఛీ!.. ఛీ!.. ఛీ!‘   
పాపారావిప్పుడు పెళ్ళాం  ఛీదరింపులు వినే మూడ్ లో లేడు. చంటాడి కిడ్నాపు డ్రామాకి తనర్పించిన కోతిమార్కు సొమ్మును రికవర్  చేసుకోడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు.  తాజాగా చూసొచ్చిన సినిమాలోని ట్రిక్కులతో ఏ ఏ  కాలనీలను కవరు చెయ్యాలా?’ అన్న ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఎవరన్నారండీ..  సమాజంమీద సినిమాల ప్రభావం ఉండదనీ?!
-రచనః కర్లపాలెం హనుమంతరావు

***




Wednesday, July 22, 2015

సినిమాప్రచారానికి కవిత్వం పాట



కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా కాదేదీ కవితకనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ అన్నాడని కాబోలు గతంలో శోభనాచల పిక్చర్సు వారు 'దక్షయజ్ఞము' చిత్రం విడుదలకుముందు ఏకంగా చిత్రసాంకేతికగణం వివరాలతో కూడిన చక్కని చతురస్ర గతి మాత్రాచందస్సులో ఒక పాట రాయించి మరీ ప్రచారం చేయించారు.
సరదాగా ఉంటుంది.. కొన్ని చరణాలు మీరూ వినండి!

దక్షయజ్ఞమండీ- అందరు తప్పక చూడండీ
దర్మయుద్ధమండీ- భక్తులు ధన్యులగుదురండీ

ఆంధ్రకళలతో- ఆంధ్ర దీప్తితో
ఆంధ్ర శోభనాచల స్టూడియోలో
ప్రభువు మీర్జపూర్- పరిరక్షణలో  దక్ష॥

అర్జాకృష్ణుని-ఆధ్వర్యములో
శిష్టదర్శకుల- శిష్యప్రాయుడు
సిద్ధహస్తుడు- చిత్రపువీరుడు
తయారుచేసిన- దక్షయజ్ఞము    దక్ష॥

నగ్నతత్వ- నారాయణాస్త్రము
వస్తున్నది మీ- పట్టణాలకే
తేదీ వివరం- తెలుసుకొనండీ     దక్ష॥

పురాణగాథల- తరాలు దాటిన
పరాకుకూతల- ప్రతికాదండి      దక్ష॥
కృష్ణవేణి నవ- కోకిల స్వరము
గగ్గయ్య భయం- కరధిక్కారము
రామకృష్ణుని- రమ్యగానము
కుంపట్ల మనోహర- పరిహాసము దక్ష॥

బి.టి.చార్యుల- భీకర పలుకులు
మోతీబాబు- పాటల కులుకులు
శాంతారాముని- చక్కని కుంచియ
చతురుడు వాల్కే- శబ్దగ్రహణము
విబుధుడు కిన్నీ- వేషధారణము
సొలుపగు చవాను- ఫోటోగ్రాఫీ
కుండలేశుని య- ఖండస్ఫురణము
బడసిన బంగరు- ప్రతిమారాజము
వస్తున్నది మీ- పట్టణములకే
తేదీ వివరము- తెలిసికొనండీ దక్ష॥

ఇలా సాగుతుంది పాటంతా. ఎక్కడా పొల్లుమాట లేకపోవడమూ,
చక్కనైన పదజాలం వాడటమూ.. సాంకేతిక వివరాలు సమగ్రంగా
ఉండటమూ.. మనమీ పాటలో ప్రశంసించదగ్గవిశేషాలు.
సినిమా మాధ్యమంమీదే కాకుండా కవితాప్రక్రియలమీదా లోతైన అవగాహన ఉంటేనే గాని ఇంతటి చక్కని వరసలతో పాట కుదరదు.
కనిపించిన ప్రతీ దానిమీదా కవితలల్లాలని ఉవ్విళ్ళూరే ఈనాటి యువరక్తపు కవికుమారులూ/కవితాకుమారీలంతా  సునిశితంగా అధ్యయనం చేయాల్సిన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.  కాబట్టే.. డెబ్బై ఏళ్ళకిందట రాసినా.. ఇప్పటికీ  తాజాగా అలరిస్తుంది. పాటకు ఇంకా 42చరణాలున్నా స్థలాభావంచేత పూర్తిపాఠం ఇవ్వడం లేదు.

శోభనాచల పిక్చర్స్ విశేషాలుః
శోభనాచల పిక్చర్స్ తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. ఇంతకముందు జయ ఫిలింస్ పతాకాన కొన్ని చిత్రాలు నిర్మించిన రాజా వారు 1941లో శోభనాచల సంస్థను స్థాపించారు. శోభనాచల సంస్థ నిర్మించిన తొలి చిత్రం దక్షయజ్ఞం (1941)గొల్లభామ (1947) చిత్రం శోభనాచల సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1947లో విడుదలైన చిత్రాలలో గొల్లభామనే ఆర్థికంగా పై చేయి సాధించింది. 1949లో వచ్చిన కీలుగుర్రంచిత్రానికి రాజా వారు దర్శకుడి మరియు నిర్మాత. కీలుగుర్రం రాజా వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. 1950లో విడుదలైన లక్ష్మమ్మ చిత్రాన్ని ప్రతిభా వారి శ్రీ లక్ష్మమ్మ కథతో పోటీ పడి నిర్మించారు. ఈ పోటీలో లక్ష్మమ్మదే పై చేయి అయ్యింది. 1940లలో గొప్ప పేరు తెచ్చుకున్న శోభనాచల సంస్థ కొన్ని కారణాల వలన 1950ల ప్రథమార్థంలో మూతపడింది. శోభనాచల సంస్థ యాజమాన్యంలో మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలోని శోభనాచల స్టూడియోలలో అనేక చిత్రాలు నిర్మితమయ్యాయి. 1949లో వాహినీ స్టూడియోస్ ప్రారంభంతో శోభనాచల స్టూడియోలలో చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది. 1955లో శోభనాచల స్టూడియోల యాజమాన్యం మారింది, స్టూడియో పేరు వీనస్ స్టూడియో గా మార్చబడింది. దశాబ్ద కాలం పైగా పని చేసిన వీనస్ స్టూడియో తర్వాత మూతపడింది.(సోర్సు- https://te.wikipedia.org/wiki/)
- కర్లపాలెం హనుమంత రావు


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...