Showing posts with label Personalities. Show all posts
Showing posts with label Personalities. Show all posts

Wednesday, December 4, 2019

‘ధర్మా’గ్రహం -కర్లపాలెం హనుమంతరావు




బాబ్రీ మసీదు కూల్చివేత పట్టపగలు.. కొద్ది మంది  మతవాదుల  దుందుడుకు ఆగడం. రాజ్యాంగ అధికరణం 370 రద్దు ప్రజాస్వామ్య ప్రభుత్వ అర్థరాత్రి అతిరహస్య  ఎత్తుగడ. రెండు ఘటనలకు ఎన్ని సమర్థనలో.. అంతకు మించి ఖండనలు! చారిత్రిక తప్పిదాలను సరిదిద్దిన సాహసోపేత సంస్కరణలుగా సంఘ్ పరివార్, వారి తైనాతీల వాదనగా ఉంటే.. మతాతీత దేశానికి అతకని ముతక పోకడలుగా  ప్రజాస్వామ్యవాదుల నిరసన!   ఒక కూల్చివేత  ఘటన పూర్వాపరాలు పంథొమ్మిది వందల తొంభై నాటి వాతావరణానికి ప్రతీక. మరో కొట్టివేత సన్నివేశం వెనుకా ముందు నాటి పరిస్థితులు రెండువేల పంథొమ్మిది నాటి  స్థితిగతులకు నిదర్శనం. మధ్య ఉన్న దాదాపు మూడు దశాబ్దాల కాలంలో దేశం ‘మూడ్’ ఏ విధంగా మారిందన్నది  చరిత్ర పరిశోధకులలో ఆసక్తి ర్రేకెత్తించే అంశం.  
బాబ్రీ మసీదు కూల్చివేత  నాటికి ధర్మకుమార్ దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో  ఎకనామిక్స్ ప్రొఫెసర్. హిందూ మితవాదం, కమ్యూనిష్టు భావజాలం.. రెండిటి పట్లా ఒకే తరహా వైఖరి ఆ స్త్రీ మేధావిది. ఒక మతానికి చెందిన ప్రార్థనాలయం మరో మతవాదుల మూకచేష్టల కారణంగా కూలడం సహజంగానే మతసామరస్యం కాంక్షించే ఆ విద్యాధికురాలి మదిలో ఆవేదన రగిలించింది.   కూల్చివేత  ఘటనపై అప్పటికప్పుడు ఒకానొక ప్రముఖ దినపత్రిక మొదటి పుటలో  ఓ సుదీర్ఘ ప్రకటన రూపంలో స్పందించారా చైతన్యశీలి. ‘మరో ప్రార్థనాలయం కూల్చివేత హిందూ స్వాభిమానాన్ని  ఏ విధంగా పునరుద్ధరిస్తుందో ముందు తేలాలి. జాతిగౌరవం ఏ మోతాదున పెరుగుతుందో, దేశ సమగ్రత ఏ తీరున పటిష్టమవుతుందో  వివరించాలి!' అంటూ  విధ్వంసకారుడిని నేరుగా నిలదీస్తూ సాగే ఆ నిరసనలో ఆద్యంతం నిండి ఉన్నది ఆనాటి సగటు భారతీయుడి మదిలో ర్రగిలే ఆందోళనే. మత ప్రాధాన్యత అధికంగా ఉండే  సున్నిత అంశాలు కొన్నింటి పట్ల  ప్రదర్శించే దురుసుతనం దేశ అస్థిరతను  మరంతగా విస్తరిస్తుందని,  ప్రపంచం ముందు ప్రజాస్వామ్య దేశానికి తలవంపులు తెస్తుందని, భావితరాల జీవితాలలో వృథా ఉద్రిక్తతలను  పెంచుతుంద’ని ఆ ప్రొఫెసర్ ఆవేదన.    నిరసనతో కలగలసిన ఆ ఆవేదన ధర్మకుమార్ ఎంతో ధైర్యసాహసాలతో బహిర్గతం చేయడం  ఆనాటి ప్రజాస్వామిక స్వేఛ్ఛాయుత వాతావరణానికి సంకేతంగా భావిస్తే తప్పేముంది?  మొదటి పుట నిండా నలుపు రంగు పులుముకొని పైన  తెల్లటి అక్షరాలతో కొట్టవచ్చినట్లుగా ఓ నిరసన ప్రముఖ దినపత్రికలో  దర్శనమివ్వడం ఈ కాలపు రాజకీయ  విలువల దృష్ట్యా నిజంగా ఓ అద్భుతమే.  
ఆ ప్రకటనకు మద్దతుగా  అప్పటి  మేధోవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, బ్యురోక్రాట్లు, పాత్రికేయులు, వివిధ రంగాలలో  పేరొందిన ప్రముఖులు ఎందరో మద్దతుగా నిలవడం,  పంథొమ్మిది మంది ప్రముఖుల సంతకాలతో  ఆ నిరసన  ప్రకటన వెలువడడం పెద్ద చర్చకు దారి తీసిందంటారు అప్పట్లో.  ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ ఐ.జి.పటేల్ నుంచి మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కె.సుందర్ జీ వరకు  సంతకాలు చేసినవారంతా నాటి సమాజం దృష్టిలో  ఎంతో విశ్వసనీయులు! ఖర్చులు భరించి  తానే జారీ చేసిన ప్రకటన కాబట్టి ధర్మకుమార్  విలువలకు కట్టుబడి స్వయంగా సంతకం చేసారుకాదు.  సంతకాలు చేసిన ప్రముఖులలో ఆర్.పి.గోయెంకా, రాజ్ త్యాగరాజన్, దేశ్ బంధు గుప్తా వంటి వ్యాపార దిగ్గజాలూ కనిపించడం ఏ విధంగా  సాధ్యమయింది?! ఈ కాలం తరహాలో ధర్మకుమార్  ధర్మాగ్రహం ఏ హిప్పీ కటింగ్  కమ్యూనిష్ట్ చిల్లర 'కుట్టుపని' కిందనో ఎందుకు వెక్కిరింతలకు గురికాలేదు?! గత మూడు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలను నడిపించిన  పాలక పార్టీల దృక్పథాలలో క్రమంగా వస్తోన్న మార్పుల నుంచే ఈ సందేహాలకు సరైన సమాధానాలు దొరికేది.
మూడు దశాబ్దాలకు మూడేళ్లు ముందు ప్రస్తుతం నడుస్తున్న 2019, అగష్టు, 5 సోమవారం భారత  రాజ్యాంగం కశ్మీరు లోయ వాసులకని  ప్రసాదించిన  స్వయంప్రతిపత్తి సౌకర్యానికి గండి కొడుతూ  ఆర్టికల్ 370 అర్థరాత్రి నిశ్శబ్దంగా నిర్వీర్యమయింది! స్వీయపాలన ‘వద్దు.. మాక’ని స్థానికుల నుంచి కించిత్తైనా వత్తిడులు లేవు. అధికరణ కారణంగా బాధితులం అవుతున్నట్లు ఏ వర్గ సమూహపు మొత్తుకొళ్ళూ వినిపించవు! ప్రజలిచ్చిన అధికారం  ఒక్కటే పాలకపక్ష అప్రజాస్వామ్య చేష్టలకు  ఊతం! నాటి ఎకనామిక్స్ ప్రొఫెసర్ ధర్మకుమార్ దారిలోనే నేడూ ప్రజావ్యవస్థలకు రక్షణగా నిలబడ్డదలచినవారు   మీడియా  ముందుకొచ్చి   ధైర్యంగా  ప్రశ్నిస్తేనో? ప్రశ్నల పర్యవసానాల సంగతి పక్కనుంచి..   ప్రశ్నించే పరిస్థితులు  దేశంలో  అసలు ఎంత వరకు బతికున్నాయన్నదే ప్రస్తుతం ప్రధానంగా   ముందుకొస్తున్న  ప్రశ్న.
ప్రజాస్వామ్య పంథాకి పెడగా ప్రభుత్వాల అడుగులు పడుతున్న ప్రతిసార్రీ గల్లాపట్టుకు  నిలదీసే గుండె నిబ్బరం  కోటికి ఎక్కడో ఒకరికైనా ఉందా? ఉందనే మాట వరుసకు అనుకుందాం. ధర్మకుమార్  దారిలోనే వారి చేతా   నిరసన పత్రమొకటి తయారయితేనో?!  'దేశభక్తులంతా తప్పక ఆలోచించాలి. కేవలం రాజ్యాంగ అధికరణ 370 రద్దు చర్యతోనే  మన జనస్వామ్య వ్యవస్థలన్నీ సుదృఢవుతాయని నమ్ముతున్నారా? సమస్యకు  సంబంధించిన ఎరినీ విశ్వాసంలోకి తీసుకోని రద్ధుసంస్కరణ దేశ ఉద్రిక్తతలకు  తగ్గ మందుగా మీరు  భావిస్తున్నారా? అదే వాస్తవమయితే మతాతీత కులాతీత ప్రజాస్వామ్య భూమిక పై నిర్మితమైనదిగా జాతి గౌరవించే దేశ రాజ్యాంగం  నిజానికి అప్రజాస్వామికమైనదని  మీరు ఒప్పుకున్నట్లే!  దేశం ఓ మూల  భూభాగానికి మాత్రమే  ప్రత్యేక   రక్షణ కవచాలు అందించడం అంటే   అఖండ భారతావని సార్వబౌమికతను కించపరిచిందన్నట్లేగా రాజ్యాంగం మీద మీ ఆరోపణ? కశ్మీరు లోయ  స్వయంప్రతిపత్తి పట్ల  ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించడమంటే అఖిల భారతావని  ఇతర భాగాల   బాగోగులపై  ఇసుమంతైనా శ్రద్ధ  రాజ్యాంగానికి  లేదన్నట్లేగా మీ ఫిర్యాదు?' తరహాలో సాగే ఆ నిలదీత పత్రం   ప్రముఖ దినపత్రిక ప్రథమ పుటలో ప్రచురించడానికి సిద్ధమయితేనో?  ఖర్చులకని  యాచిస్తే గుప్తంగా మద్దతిచ్చే విజ్ఞులకు ఇప్పుడూ పెద్ద కొదవేమీ ఉండబోదు. కానీ సర్కారును ఇరుకున పెట్టే ఏ  ‘డిస్సెంట్ నోట్’ పైనా పెన్ను పెట్టి ‘సైన్’ కొట్టే దమ్ము ధర్మకుమార్ కాలంలో మాదిరి ఇప్పుడు ఎంతమంది బిగ్-బాసులకుంది?’ అదే బిలియన్ డాలర్స్ ప్రశ్న ప్రస్తుతం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా   విశ్వ విపణి వీధులనేలే భారతీయ కుబేరులలో ఎందరో నిజానికి  ఉదారభావాలకు పెట్టింది పేరు. ప్రజాస్వామ్య పంథాట్లా వారికుండే  అచంచల విశ్వాసం సాధారణ పౌరుల అంచనాలకు అందేవికావు.  ఆర్టికల్ 370 వంటి పాక్షిక లాభాలు చేకూరే రాజ్యాంగ అధికరణల పట్ల ప్రముఖులందరికీ   ఒకే తరహా  అభిప్రాయం ఉండకపోవచ్చు. అందుకు తప్పు పట్టలేం.  చట్టాల పట్ల కన్నా.. ఈ తరహా  బిల్లుల ఆమోద తిరస్కారాలకై చట్టసభలు నడుస్తున్న తీరు మీదనే ఎందరో ప్రముఖులకు  బాహాటంగా చెప్పలేని బాధా.. ఆందోళన. పాలకవర్గ రాజకీయ ప్రేరిత  ప్రణాళికల కార్యాచారణ విధానాలను అంతర్గత సంభాషణలలో  ఎంతగా తూర్పారపట్టినా బహిరంగంగా  మాత్రం  తటస్థ వైఖరి తీసుకోక తప్పని దుస్థితి కొందరు పెద్దలది. పరిథి మీరి మరీ వత్తాసుకు పోక తప్పని ఒత్తిళ్లు మరి కొందరు వ్యాపారప్రముఖులవి. సంపూర్ణ మౌనమే సర్వదా శ్రేయస్కరంగా భావించి ఓ నమస్కారబాణంతో సరిపుచ్చుకునే సంపన్నుల సంఖ్యే ప్రస్తుతం దేశంలో ఎక్కువ!  కారణం;   ఆర్టికల్ 370ద్దులోనే లేదు.  గద్దె ఎక్కిన పార్టీల ప్రాయోజిత సర్దుబాట్లు సంస్కరణల ముసుగులో మరెన్నో ముందు ముందుకు తోసుకుని వచ్చే  కొత్త తరహా వాతావరణానికి   2019 నాంది కావడంలో ఉంది.    
సంతకాలకై ధర్మకుమార్  సంప్రతించిన నాడు .. కేవలం ఒక నిరసన పత్రం పైన  పొట్టిసంతకం గిలికిన కారణానే తమ అండన బతికే వేలాదిమంది రోడ్డున పడరన్న ధీమా  భరత్ రామ్, లలిత్ థాపర్ వంటి పరిశ్రమల పోషకుల గుండెల నిండుగా ఉండిన పంథొమ్మిది వందల తొంభై రెండులు…
అదే మాదిరి గుండె నిబ్బరం మాజీ ఆర్థికశాఖామాత్యులైన శ్రీమాన్ చిదంబరానికే ఉండని    రెండువేల పంథొమ్మిదులు…
దాదాపు  మూడు దశాబ్దాల మధ్యన పరుచుకున్న దేశ రాజకీయ, పాలనా వ్యవస్థల పని తీరుల్లో కనిపిస్తున్న మార్పులను గమనిస్తే  దేశం ‘మూడ్’  ‘బ్యాడ్ టు వర్స్ట్’ దిశగా ఎంత  వేగంతో దిగజారుతున్నదో తెలిసి దిగులవుతున్నది ప్రజాస్వామ్య వికాసం పట్ల ఎంతటి ఆశావహ దృక్పథం గల దేశభక్తులకైనా!
 కంటి  ముందు  జరిగే   ర్థిక దాడులు, కుంటి సాకులు ఇరికించే  అక్రమ  నేరాల కేసులు, ఊహించేందుకైనా భీతి గొలిపే ఉపద్రవాలు ఇంకెన్ని ఏ సందు గొందుల నుంచి ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నవో అంతుపట్టని ఉగ్ర వాతావరణం మధ్యన నేటి దేశం  అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నది మరి!  లోయకోని జాతులే కాదు.. దేశంలోని అన్ని తరగతులు ఒక్కో తీరున  ఒకనాటి దేశ అత్యయిక పరిస్థితులను దాటి శిక్షల గదుల్లో మగ్గుతున్నాయి.
‘ప్రజాస్వామ్యం పట్ల ఎంతటి ప్రగాఢ విశ్వాసమున్నప్పటికీ  ఉదారవాదం ఆచరణలో సదా ఓ మిథ్య మాత్రమే’  అని భావి తరాలు సైతం ఒక   శాశ్వత నిరాశ భావన లోనికి జారక ముందే మందలు మందలుగా మరెంతో మంది ప్రొఫెసర్ ధర్మకుమార్ లు అందుకే  పుట్టుకు రావాలసుంది.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక- సంపాదకీయ పుట వ్యాసం)
***




























    

Tuesday, January 22, 2019

కొడవటిగంటి కుటుంబరావు -21 వ శతాబ్ది సంపూర్ణ మానవుడు

 ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకీయ పుటలో  ప్రచురితం 
-కర్లపాలెం హనుమంఅరావు 
కొడవటిగంటి కుటుంబరావు 

ఇరవయ్యో శతాబ్దపు సంపూర్ణ మానవుడు
-కర్లపాలెం హనుమంతరావు
అక్టోబర్ 28, 1909 జన్మించిన తేదీ. గుంటూరు జిల్లా, తెనాలి జన్మస్థలం. 'సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శ ద్వారా సుసంపన్నం చేయడమే సరైన సాహిత్యం' అన్న కొడవటిగంటిది  మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లో నల్లుల బెడద తగ్గడానికని ఆయన  చిన్నతనంలో తల్లి ‘రు’ అనే అక్షరంతో అంతమయే అరవై ఊళ్ళ పేర్లు రాయించిందిట. అంత చాదస్తపు కుటుంబంలో పుట్టి 'బుద్ధికొలత వాదం' అనే ఓ కొత్త  సిద్ధాంతాన్ని ప్రతిపాదించే స్థాయికి ఎదిగిన మనోవికాసజీవి కొ.కు.
సమాజంలో చుట్టూ ఉన్న వ్యక్తుల నడవడికల్లోని  అసమంజసమైన తడబాటుకు విరుగుడు మంత్రం చదువేనని కుటుంబరావు బాల్యం నుంచే గాఢంగా భావించారు. కొ.కు ప్రసిద్ధ నవల 'చదువు'లోని చాలా అంశాలు  కొ.కుగారి వ్యక్తిగత అభిప్రాయాలేనని చాలా మంది సాహిత్య విశ్లేషకులు భావన.   విద్య ద్వారా లభించిన వివేకమే  ఆయన జీవితాన్ని ఎప్పటికప్పుడు చీలిన దారుల్లో నిలబడి ఉన్నప్పుడు మేలైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగే విధంగా ప్రేరేపించింది. తన పదకొండో ఏటే  పెద్దమ్మ పెంపకంలోకి వెళ్లిన  వాడు కుటుంబరావు. ఆమెకి అవసరానికి మించి ఎక్కువ మోతాదులో అన్నం వండే అలవాటు. మిగిలింది మర్నాడు పిల్లలంతా చద్దన్నంగా తినాలి. రోజూ చద్దన్నం తినేందుకు విసుగనిపించి దెబ్బలాటకు దిగేవాడుట కుటుంబరావు. ఒక రోజు కాస్త తక్కువగా వండేస్తే మర్నాటి నుంచి ఎప్పటి కప్పుడు వేడి వేడి అన్నరుచిగా తినవచ్చుగదా!' అని కుటుంబరావు ఆలోచన. ఇంత చిన్న తరుణోపాయం పెద్దమ్మకి ఎందుకు తట్టింది కాదో ఆ బాలుడికి అర్థం కాలేదు. తనే ఆమెకు చెప్పాడు చివరకి.  అయినా పెద్దావిడ 'పిల్లకాకి సలహా' కింద పెడ చెపిన పెట్టి తన పాత చాదస్తాన్నే కొనసాగించేదిట. ఇలాంటి అసంబద్ధమైన పోకడలంటే జీవితంలో చివరి వరకూ కొడవటిగంటి అసహనంగా ఉండేవార'ని వాళ్లబ్బాయి రోహిణీ ప్రసాద్ ఓ వ్యాసంలో చెప్పుకొచ్చారు.
కొ.కు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. 5వ ఏట తండ్రీ, 11వ ఏట తల్లీ మరణించడంతో మేనమామ వద్దే  పల్లె వాతావరణంలో పెంపకం.  అన్నయ్య వెంకటసుబ్బయ్య కవి, రచయిత.  కొ.కు సాహితీ రంగప్రవేశానికి ఆయనే ప్రేరణ. గిండీ ఈంజనీరింగ్ కాలేజిలో చదువుకుని ఓవర్సీరుగా పనిచేసిన సుబ్బయ్యగారికీ ఆధునిక భావాలు పుష్కలంగా ఉండేవి. ఆయన ప్రభావానికి తోడు పాశ్చాత్య సాహిత్యంతో  పరిచయం కొ.కు అదనపు ఆస్తి. తల్లావఝ్జల, గోవిందరాజులు వంటి ప్రసిద్ధులని కళ్లారా చూసిన అనుభవాలు జీవితంలో కలిసొచ్చాయి. 13వ ఏటే పద్యాలు.. పూర్తికాని ఓ థ్రిల్లరు రాసిన బాలమేథావి కొ.కు. 16వ ఏట హైస్కూలు చదువులోనే  తనకన్నా 5 ఏళ్ళ బాలికతో(పద్మావతి) వివాహం జరిగింది. (1939లో ఆమె  మరణించింది) 1825-27.. గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేటు..  ఆ తరువాత మరో రెండేళ్లు మహారాజా కళాశాల. విజయనగరంలో బియ్యే ఫిజిక్సులో చదివాడు.  రచనా వ్యాసంగం సీరియస్ గా పట్టుబడిందీ కాలంలోనే. డిగ్రీ చదువు చివరికి వచ్చేసరికి కుంటుంబరావులో నాస్తిక భావజాలం స్థిరపడింది. 1929లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు.  
సైన్సు పాఠలు బోధించే ఉపాధ్యాయుడి మెడలో తాయెత్తులు కనిపిస్తుంటే.. వినే విధ్యార్థికి గురువు విషయంలో గురి ఎలా ఏర్పడుతుంది? కొడవటిగంటిది సైన్సు సబ్జెక్టులను అధ్యయనం చెయ్యడమే కాదు.. నిత్య జీవితంలో తారసపడే ప్రతి అంశాన్ని ఆ శాస్త్రజ్ఞానం ప్రసాదించిన ఇంగితంతో తార్కికంగా ఆలోచించే తత్వం. అందు చేతనే ఆయన తన రచనల్లో చెప్పే విషయాల్లో ఏది అహేతుకం అనిపించదు. అయోమయంగా కలిగించదు. సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా కనిపించే ఆయన రచనా శైలికి ఆయన జీవితానికి కడదాకా ఎక్కడా వైరుద్యం కనిపించదు. కొ.కులో కనిపించే నిజాయితి చాలా మంది రచయితలలో అరుదుగా మాత్రమే అగుపిస్తుంటుంది.
అప్పటి అంతర్జాతీయ  ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్..సి రెండో సంవత్సరంలో ఆగిపోయింది. కొంతకాలం  వరంగల్లులో పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. 1942లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. కార్మికుల వాస్తవ జీవితాన్ని కళ్లారా పరిశీలించే అవకాశం కొ.కు కి ఆ కాలంలోనే దక్కింది. 1942లో ఓ ఆరునెలలు సిమ్లా జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీ రైటరుగా పనిచేయడం అతనిలోని రచయితకు కలిసొచ్చిన మరో అబుభవం. 1944లో ఒడిషా జయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగాకూడా పనిచేసాడు కుటుంబరావు.
రచనలుః
1930లో కొ.కు తొలి రచన సినిమా ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. మొదటికథ 'ప్రాణాధికం' గృహలక్ష్మి మాస పత్రికలో. చక్రపాణి, మరికొంతమంది మిత్రులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి యువ పత్రికను ప్రారంభించాడు.
 1940 - 42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేసాడు. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి అప్పటి సహోద్యోగే. 1
రెండో పెళ్ళి జరిగిన రెండు నెల్లకే ఆ భార్యా అనారోగ్యంతో మరణించడంతో 36వ ఏట ముచ్చటగా మూడో వివాహం చేసుకున్న విచిత్రమైన అనుభవం కుటుంబరావుది. చివరి వరకూ అతనితో జీవితం పంచుకొన్న ఆ సౌభాగ్యవతే వరూధిని. బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా 1948లో మూడు నెల్లలు పనిచేసిన తరువాత ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో ఆ సంస్థ వారపత్రికకు సంపాదకత్వం కూడా  నిర్వహించాదు కొ.కు.  ఆ క్రమంలోనే కొన్నాళ్ళు కినిమా వారపత్రిక సంపాదకత్వం.1952, జనవరి 1 నుండి..  1980 ఆగష్టు 17న తుది శ్వాస విడిచే  వరకూ 'చందమామ'కే అంకితమయిపోయారు. ఆ పత్రిక అత్యున్నత స్థితిలో కొడవటిగంటివారి  కృషి మాటల్లో వర్ణించలేనంత మహత్తరమైనది. ఆయన చనిపోయే ముందు పత్రికాఫీసుకని సిద్ధం చేసుకొని వెళ్లే బ్రీఫ్ కేసులో రాబోయే మూడు నెలలకు సరిపడినన్న కథలు రడీగా  ఉన్నాయని కొకుగారి కూతురు శాంతా సుందరి  ఓ సందర్భంలో అన్నారు.
సాహిత్య జీవితం:
శాస్త్రజ్ఞులు చెప్పే స్థలం (space), కాలం (time) అనే రెండు కొలతలకు అదనంగా జగత్తుకు బుద్ధి అనే మూడో కొలత 'బుద్ధి' కూడా ఉంటుందనే 'బుద్ధికొలత వాదం' సిద్ధాంతాన్ని మొదటి సారిగా ప్రతిపాదించి అనేక రకాల చర్చలకు పునాది రాయి వేసిన కొ.కు శాస్త్రవేత్తా? సాహిత్యవేత్తా? అంటే.. ఆ రెండూనూ అని సమాధానం చెబితే సరిపోదు. వాటికి తోడు సామాజికవేత్తా, సంస్కరణవాదీ, బౌద్ధిక జీవీ,, మార్క్సిష్టూ, మనస్తత్వవేత్తా.. అని కూడా చెప్పుకొంటేనే కొ.కు వ్యక్తిత్వాన్ని సంపూర్ణం  సందర్శించైనట్లవుతుంది.. ఒక్క కవిత్వం  మినహా కుటుంబరావు గారు కలగ జేసుకొని సాహిత్య ప్రక్రియ తెలుగులో దాదాపు  లేదనే అపిస్తోంది! 50 ఏళ్లల్లో ఆయన చేతిమీదుగా జాలువారిన పది నుంచి పన్నెండు వేళ పుటల రికార్డు ఇప్పటికీ ఏ తెలుగు రచయితా సమీపంలోకి కూడా రాలేనంత ఘనమైన  రికార్డు.
కొడవటిగంటివారి కొన్ని అభిప్రాయాలుః
"సాహిత్యం నుండి ప్రజల్నీ, రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది.
నియంతల మీదా, నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు. అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం. అణగదొక్కాలనుకునేవారే ఇలాంటి తలతిక్కవాదం చేస్తారు".
"ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు"
"మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే"
"కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం" (పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది. ఈ వ్యవస్థని ఉద్దేశించి అన్న వాక్యం)

ఆధునికులు అని చెప్పుకొనే వారిలో చాలా మంది చాదస్తులేనని ఆయన రూఢిగా నమ్మేవారు. చేజేతులాచిన్నపిల్లలకు పెళ్లిళ్లు జరిపించి, ఆనక భర్తహీనులైన ఆడబిడ్డలతో  ఇబ్బందులు పడే సంప్రదాయవాదులంటే మొదటినుంచి కొ.కు కు వళ్లు మంటే!  సమాజంలో పెడమార్గాలకు మూలకారణాలు వ్యక్తుల్లో కాక.. వాళ్లను సాకే వ్యవస్థలోనే ఉన్నాయని  కుటుంబరావుగారికి మార్క్సిజం సిద్ధాంతం అధ్యయనం తరువాత మర్మం అంతు పట్టింది.
 చిన్నతనంలో నేర్చుకున్న పెళ్ళి మంత్రాలూ, తద్దినం మంత్రాలూ వగైరాలన్నీ ఆయనకు చివరిదాకా గుర్తున్నాయి. సంప్రదాయకవిత్వాన్ని నేర్చుకుని రాయగలిగిన తరవాత ఆ పద్ధతిని నిరసించి, చెండాడినవాడు  శ్రీ శ్రీ. ఆయన పంథాలాగే కొ.కు కుడా తాను తరవాతి కాలంలో సహేతుకంగా, తార్కికంగా విమర్శించిన సంప్రదాయాలన్నీ మొదటినుంచీ సుపరిచితమే.  సంప్రదాయవాదులకు అదే పెద్ద  కంటగింపుగా ఉండేది. ఆయన రచయితగా మారిన తరువాత  సమీపబంధువులే అతనిని ఎలా తూలనాడేవారో  మా. గోఖలే  వివరించారు.  ఆరంభంలో  యువ వితంతువును  గురించే ఎక్కువ రాయడం జరిగింది. అప్పట్లోని  బ్రాహ్మణ కుటుంబీకులు ఆచారం  ముసుగులో సొంత లాభం చూసుకొనే గడసరితనాన్ని   గురజాడలా, చలంలా ప్రతిభావంతంగా ఎండగట్టిన కోవకు చెందిన వాడు కొ.కు. కాకుంతే పెద్దమనుషులుగా చలామణీ అయే వారి ప్రవర్తనను శాసించే సామాజిక, ఆర్థిక, రాజకీయశక్తులను  విశ్లేషించడం కొ.కు చేసిన అదనపు కృషి.
షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ కథలు నవులుతూనే చవులూరించే తెలుగు ఆధునిక సాహిత్యంలోని తొలితరం రచయితల కథలన్నీ దాదాపుగా చదివేసి ఆకళింపు చేసుకొన్న  ఇంగితం కొడవటిగంటిది. సెకండు ఫారం నుంచే  వార్తాపత్రికల కథనాల ఆధారంగా తనూ ఓ కథ అల్లేసి, చదివి, చించేయడం  ఓ నిరంతర అభ్యాసంగా లాభించింది తదనంతర కాలంలో కుటుంబరావుగారికి. రాత వల్లే విషయం సమగ్రంగా అవగాహనకు వస్తుందని కొ,కు చివరి వరకు ప్రగాఢంగా నమ్మేవారు.
తన తరం ఆలోచనలకు బింబసామానలైన తన రచనలు ముందు తరాలకి కేవలం చరిత్ర పరిశీలనకు మాత్రమే అవసరంగా ఉండాలి కాని.. ఆ పంథాలో తరువాతి రచయితల రాతలు సాగితే తను ఆశించిన అభ్యుదయం ప్రగతిమార్గాన నదవడం లేదన్న భావం వస్తుందని కొ.కు చాలా సందర్భాలల్లో చెబుతుండే వారు. జాతిని మరింత ముందుకు తీసుకు వెళ్లేదే సరైన సాహిత్య ప్రయోజనమని ఆయన విశ్వాసం.బుద్ధికి పదునుపెట్టి, పని కల్పించేలా రచన ఉండాలని ఆయన తపన..
సాహిత్యానికి అదనంగా శాస్త్రీయసంగీతం, తోట పని, వంట చేయడం.. లాంటి కార్యక్రమాలలో కొ.కు చివరి వరకు ఆసక్తి అలాగే కొనసాగిందంటారు. అన్నట్లు ఆయన సినిమాను కాక.. సినిమానే ఆయన్ను ప్రేమించింది. నాటకరంగమూ మరో ప్లటోనిక్ ప్రేమికురాలు.  వివిధరంగాల్లో పేరున్న ఎందరో  ఆయనకు ఆయాచితంగా దక్కిన  సన్నిహితులు. స్థానం నరసింహారావు, రఘురామయ్య.. వగైరా ఆ కోవకి చెందిన వారు. 
మద్రాసులో శ్రీశ్రీ లాగారాత్రి భోజనానికి బదులు ఇడ్లీ స్వల్పాహారం, బీచ్ ఒడ్డున నిద్రానుభవాలు తనకూ ఉన్నట్లు ఆయనే చెప్పుకున్నారు.  వరూధినితో వివాహం తరువాత  వ్యక్తిగతజీవితం కుదుట పడింది.  చందమామలో చేరాక  పూర్తి  మానసిక ప్రశాంతి లభించింది.
అచ్చు టెక్నాలజీ నుంచి పత్రికల సామాజిక ప్రభావం దాకా అన్నిటినీ ఆయన సమగ్రంగానే అవగాహన చేసున్నారు. సైన్స్, టెక్నాలజీ రంగాల ప్రగతి ఆయన దృష్టి కోణం నుంచి దాటి పోలేక పోయింది.  
ఇరవయ్యో శతాబ్దపు మానవుడుగా, రచయితగా, చింతకుడుగా ఆయన చివరిదాకా క్రియాశీలంగానే జీవించినట్లు లెక్క.

Saturday, June 16, 2018

మంచిపని ఎవరు చేసినా అదేపనిగా ప్రశంసించు!- ఒక తండ్రి కొడుకుకి చేసిన ఉద్బోధ



తండ్రుల పండుగ సందర్భంగా!

చిత్తూరు జిల్లా కలకడ మండలం రాతిగుంటపల్లె గ్రామం. ధర్మం.. పుణ్యం తెలిసిన పెద్దమనిషి. రైతు.  ఆయన పేరు శ్రీ కోట వెంకటయ్య నాయుడు. ఆయన కుమారుడు కోట పురుషోత్తముడు. తండ్రి తనకు నేర్పించిన జీవితపాఠాలని  గుర్తు చేసుకునే స్మృతి దీపిక పుస్తకం. 

బడికి వెళ్ళేందుకు వీలు లేక మూడవ తరగతి తర్వాత బడిచదువు మానుకోవలసి వచ్చింది వెంకటయ్యగారికి. అయినా వెనుకంజ వేయలేదు. పంతంతో తనకు తానుగా చదువుకుని, పలు విషయాలు నేర్చుకొన్నారు. పండితుల్లాగా మాట్లాడేవారు.  ఊరి ప్రజకు ఉపయోగమైన కార్యాలు చాలా చేశారు. విద్యకు పెద్దపీట వేయడం గొప్ప పనులలలో అన్నిటికన్నా గొప్పది. పిల్లలకు సత్ప్రవర్తన.. మంచికి చెడ్డకి తేడాను విపులంగా వివరించడమే కాకుండా ఆచరించి చూపించేవారు.

మాదిగపల్లె దగ్గర విరిగిపోయిన పరేందిమాను చుట్టూ ఉన్న పిలకల్ని పెళ్ళగించుదామని పిల్లతనంగా ఉత్సాహపడిన కొడుకుకి  చెప్పిన మాటలే   తండ్రి వ్యక్తిత్వాన్ని పట్టి చూపిస్తాయి. 'ఇతరులు నాటిన చెట్ల కాయల్ని నువ్వు అనుభవించావు కదా! నువ్వు నువ్వుగా ఒక్క చెట్టును కూడా నాటలేదు. పాపం.. గాలి వచ్చి విరిగిపోయిన మాదిగపల్లోళ్ళ పరేంది చెట్టు పిలకల్ని వేస్తే వాటిని పెరికి వినోదిద్దామని చూస్తున్నావు ఇది దుర్మార్గం కాదా? వాళ్ళు పెంచిన చెట్టు పిలకల్ని ఇరిచేసి.. పెరికేసి మాదిగపల్లి పిలకాయలకు పరేందికాయలు లేకుండా చేయటం చెడ్డపని కాదా?' తప్పు తెలుసుకున్న కుమారుడు మర్నాడు ఒక నేరేడుచెట్టు, కొబ్బరి చెట్టు నాటాడు

సత్కార్యాలతో, అమృతం కురిపించే వాక్కులతో ప్రతిరోజునీ ఒక మధురస్మృతిగా  మార్చే మంచి తండ్రి ఆయన. రోజూ చేయగల, మధురస్మృతులు మిగిల్చే వందలాది సత్కార్యాలకి, కానీ ఖర్చు లేని గొప్ప పనులకి ఆయన చెప్పిన ఉదాహరణలు కోకొల్లలు.

ఆవు గంగడొలును అరచేత్తో దువ్వు!
ఎదురింటి పిల్లాణ్ణి ఎత్తుకుని ఎగరేసి ముద్దాడు!
గాటికాడ ఉన్న ఎద్దు నోటికి పచ్చిగడ్డిని అందించు!
మంచిపద్యం నేర్చుకుని అప్పచెప్పు!
పిచ్చిక్కి బియ్యపునూక వెయ్యి!
పక్కింటి ముసలవ్వ చేతినుంచి చేంతాడందుకుని నీళ్ళు తోడిపెట్టు!
పిల్లికి పాలూ కూడూ పెట్టు!
నాయనమ్మ చేతుల్ని చెంపకు ఆనించుకుని తృప్తిపొందు!
మొక్క నాటి పెంచు!
పుస్తకానికి అట్ట వేసుకో!
వానొచ్చినప్పుడు మట్టి వాసనను రుచి చూడు!
అరచేతిలో సంగటిముద్దేసుకుని గుంతలో ఊరుబిండి పెట్టుకుని కూలీల మధ్య కూర్చుని తిను!
కానగాకుతో పీక చేసి ఊదు!
సంక్రాంతికి ఎద్దుకొమ్ములు జివిరి రంగులేసి కొమ్ములకు ఊపిరిబుడ్డలు కట్టు!
చెరువు కొళ్ళబోయే రోజు పిలకాయల్తో కలిసి చేపలు పట్టు!
కపిల తోలేటప్పుడు జిళ్ళ వెయ్యి!
చెట్టెక్కి చింతచిగురు కొయ్యి!
ఇసక నారవలో చెలమ తీసి వొంగి నోరు పెట్టి ఆ నీళ్ళు తాగు!
మంచిపని ఎవరు చేసినా అదేపనిగా ప్రశంసించు!
పెద్దలను గౌరవించు!'

మంచిగా జీవించటానికి, మంచితనం పెంచటానికి కృషిచేసిన ఎవరికయినా చేయెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అందుకే ఈసారి 'తండ్రుల పండుగ' కోసంగాను సేకరించింది  ఈ వ్యాసం.

'తెలుగు పద్యం నిన్ను సమూహం నుంచి వేరుచేసి సింహాసనం మీద కూర్చోబెడుతుంది' అని చెప్పి  పద్యం మీద అభిమానాన్ని, ఆసక్తిని, అనురక్తిని కలిగించి, రగిలించి  పద్యాలు కంఠస్థం చేయించిన 'నాన్న' జ్ఙాపకంగా, ఇప్పటి బడిపిల్లలకీ, యువతకీ కానుకగా ఇవ్వాలని ఒక కొడుకు తెచ్చిన పుస్తకాన్ని గురించి  సారి నాన్న పండుగ సందర్భంగా ఒక చిన్న వ్యాసంఅప్పుడెప్పుడో జంపాల చౌదరిగారు పుస్తకం.నెట్ లో చేసిన పరామర్శ  వ్యాసానికి ఆధారం.

పుస్తక రచయిత శ్రీ కోట పురుషోత్తముడికి, జంపాల చౌదరిగారికి ధన్యవాదాలతో!
(పుస్తకం.నెట్ సౌజన్యంతో)
-కర్లపాలెం హనుమంతరావు
16 -06 -2018.


ఫుట్ నోట్ః
పురుషోత్తంగారు విద్యార్థి దశలో ఏఐఎస్సెఫ్‌లో కార్యకర్త. ఉండి, పదేళ్ళు ఆర్థికశాస్త్రం ఉపన్యాసకునిగా పనిచేసారు. తెలుగుభాషోద్యమంపట్ల ఆకర్షితులయి. తిరుపతి తెలుగు భాషోద్యమ సమితిలో కార్యవర్గ సభ్యులయారు. వారి నాన్న స్ఫూర్తిగా ఆయన సేకరించిన పిడికెడు మంచి పద్యాలతో ఈ పుస్తకాన్ని ప్రచురించి వీలైనంతమంది పిల్లల చేతుల్లోకి చేర్చేమ్దుకు ప్రయత్నించారు.

మహాభారతం నుంచి, నవీన నానీల వరకు,  ప్రసిద్ధమైన తెలుగు పద్యాలు, గీతాలు పుస్తకంలో కనిపిస్తాయి. తెలుగు భాష, తెలుగు నేలను ప్రస్తుతించేవి,  ప్రబోధాత్మకంగా ఉండే సుభాషితాలు, ఇతరత్రా ప్రసిద్ధి చెందిన తెలుగు పద్యాలతో పుస్తకం నిండి ఉంటుంది. ఒక్క నన్నయే కాదు.. నవీన ఉద్యమ కవి కత్తి పద్మారావుగారి రచనలూ కంటబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. కనిపిస్తారు. పుస్తకం చిన్నదే.. అయినా భద్రంగా దాచుకోదగ్గ పెన్నిధి.

2006లో ప్రచురింపబడి, రెండు ముద్రణలు పొంది. రెండవ వెయ్యికి పైగా ప్రతులు చెల్లిపోయాయంటేనే.. అయ్య బాబోయ్! అనిపిస్తుంది చదువరులు క్రమంగా తగ్గిపోతున్నారన్న భ్రమలో ఉన్న మనకు!.

ఏమైనా ఉత్తముడైన ఒక తండ్రికి కుమారుడు ప్రేమగా సమర్పించిన ఈ గొప్ప  నివాళిని  'తండ్రుల పండుగ' రోజున స్మరించుకోవడం ఉత్తమ సాహిత్యసేవ అనిపింది.








కొమఱ్రాజుగారి ‘వియోగ గీతి’ కత!




వడ్డాది  సుబ్బారాయుడిగారు ‘సతీ స్నృతి’ తెలుగులో వచ్చిన ఒక ప్రముఖ సంతాప కావ్యం (ఎలజీ). సుబ్బారాయుడిగారి వైవాహిక జీవితం చాలా పరితాపకరమైనది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. నలుగురు కాదు.. ఏకంగా ఐదుగురు సాథ్వీమణులు ఆయన చేత మెడలో తాళి కట్టించుకున్నా ఒక్కరికైనా కలకాలం కలసి జీవనయానం సాగించే యోగం లేకపోయింది. మొదటి కళత్రం పోయిన 1881 ప్రాంతంలో సుబ్బారాయుదుగారు ఇందాక చెప్పుకున్న కళత్ర వియోగానికి సంబంధిచిన కవితా సంపుటి రాసారు. కవిగారు రాసారు కానీ.. ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు రాని దుర్గతి. కొక్కొండ వెంకటరత్నం పంతులుగారే తన ఆంధ్రభాషా సంజీవని పత్రికలో మొదటి సారి దాన్ని అచ్చువేసారు. దరిమిలా అది ఒక సంపుటిగా వెలువరించడం.. అశేషమైన  ప్రచారం సంపాదించుకోవడం.. అదో విశేషం. అక్కడితో అయిపోతే ఇక్కడ ఈ కథ చెప్పుకునే అవసరమే ఉండేది కాదు.
సుబ్బారాయుడిగారి ‘సతీ స్మృతి’ చదివి విశేషంగా ఉత్తేజం పొందిన వారు అసంఖ్యాకులు, అందులో కొమఱ్రాజు లక్ష్మణరావుగారూ ఒకరు. ఆ కావ్యం చదివిన ప్రభావంతో ఆయనా ‘వియోగ గీతి’ ఒకటి మరాఠీలో వెలువరించారు. యథాప్రకారం దానికీ అశేషంగా పాఠకులు స్పందించారు. కవిగారికి ఇంత చిన్నవయసులోనే కలిగిన కళత్ర వియోగానికి చింతించని వాడు లేడు. ఉత్తరాల ద్వారా ఊరడించే వాళ్ళు కొందరైతే.. వీలు కల్పించుకొని మరీ  కొంతమంది శోకతప్తులు ఏకంగా పూలదండలు పుచ్చుకొని మరి పరామర్శల కొచ్చేసారుట!
కొసమెరుపేమిటంటే.. కొమఱ్రాజు వారికి అప్పుడు నూనూగు మీసాల వయసే. భార్య సంగతి పక్కనుంచి.. అప్పటి మన సంప్రదాయాల ప్రకారం ఇంకా మగపిల్లవాడి ముందు  పెళ్లి ప్రస్తావనలు సైతం తీసుకురాకూడని తరుణం!
ఈ అనుభవంతో జడిసిన కొమఱ్రాజువారు కవిత్వం రాయడం బంద్! ఆ తరువాత ఆయన రాసినవనీ కవిత్వానికి ఆమడ దూరం ఉండటం గమనార్హం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం 4వ సంపుటి- పుట 235)

కొమఱ్రాజు లక్ష్మణరావుగారి వివరాలు కొన్ని
(సోర్స్ః వికీపీడియా) 
జననం మే 18, 1877
పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా
మరణం జూలై 12, 1923
మద్రాసు
మరణ కారణము    అనారోగ్యం
వృత్తి    దివాన్, రచయిత
ప్రసిద్ధి   చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్త
భార్యః   కోటమాంబ
పిల్లల:  వినాయకరావు
తండ్రిః   వెంకటప్పయ్య
తల్లిః     గంగమ్మ


Wednesday, May 9, 2018

జీవన వేదం- వై ఎస్ ఆర్ దుర్మరణం సందర్భంలో ఈనాడు ఆదివారం సంపాదకీయం





కుండపోతగా వాన కురిసింది కొండాకోనల నల్లమలపైన. ఊహాతీతంగా పిడుగు పడింది మాత్రం యావత్రాష్ట్ర ప్రజ గుండెల మీద! రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. మరి లేరన్న దావానలంలాంటి దుర్వార్త ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచేసింది. ఏటా సంబరంగా సాగే గణేశ నిమజ్జనం సైతం బాధాతప్త హృదయాల కన్నీటి మడుగులోనే ముగిసిపోయింది. రచ్చబండ కార్యక్రమంకోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వై.ఎస్‌. హెలికాప్టర్ఆచూకీ గల్లంతు అయిందన్న తొలి సమాచారం తెలిసినప్పటినుంచి ఇరవై నాలుగ్గంటలపాటు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడిన జనవాహిని- కనిపించిన దేవుళ్లకల్లా మొక్కుతూ కోరుకొంది ఒక్కటే- ముఖ్యమంత్రి వై.ఎస్‌. క్షేమంగా తిరిగి రావాలనే! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర దేశీయాంగ, రక్షణ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా అత్యాధునిక విమానాలతో నల్లమలను జల్లెడ పడుతున్నంతసేపూ- పూర్వాశ్రమంలో నేషనల్క్యాడెట్కోర్‌(ఎన్‌.సి.సి.) సభ్యుడైన వై.ఎస్‌. అడవిని జయిస్తారనే మీడియా కూడా సాంత్వన వచనాలు పలికింది. కర్నూలుకు తూర్పున నలభై నాటికల్మైళ్ల దూరాన కొండ కొమ్ముపై హెలికాప్టర్జాడ తెలిసిందన్న సమాచారమూ దాన్ని వెన్నంటి వచ్చిన శరాఘాతంలాంటి కబురూ ప్రజానీకాన్ని హతాశుల్ని చేశాయి! ముఖ్యమంత్రి హెలికాప్టర్దారితప్పి 18 కిలోమీటర్లు తూర్పుదిశగా వెళ్లి కొండను ఢీ కొట్టిందని రాష్ట్ర డి.జి.పి. చెబుతున్నారు. 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టింది మొదలు వై.ఎస్‌. కాంగ్రెస్లో కొండల్లాంటి సీనియర్లు ఎందరినో ఢీ కొడుతూనే ముందుకుసాగారు. వరస పరాజయాలతో కుంగిన రాష్ట్ర కాంగ్రెస్కు తన ప్రజాపథ ప్రస్థానంతో కొత్త ఊపిరులూది వరస విజయాలు కట్టబెట్టిన వై.ఎస్‌.- తానే రాజకీయ మేరునగంగా ఎదిగారు. అననుకూల వాతావరణంలో రాజశిఖరం ప్రయాణిస్తున్న హెలికాప్టర్నల్లమల కొండ శిఖరాగ్రాన్ని తాకి ముక్కలై మహా విషాదాన్ని వర్షించింది. విధి మనిషిని విగతం చేస్తుందేమోగాని, చెమ్మగిల్లిన గుండెల సాక్షిగా వై.ఎస్‌. ప్రజల మనిషి!

'
నేను వృత్తిరీత్యా డాక్టరును... అయితే రోజుకు ఎంతమంది రోగులకు వైద్యం చెయ్యగలను? యాభై... వంద- అంతేకదా! అందుకే రాజకీయాల్లోకి రావాలనుకొన్నా'- అని ప్రకటించిన వై.ఎస్‌.కు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేదు. 'గరీబోళ్ల బిడ్డ'గా అధికార పీఠం అందుకొన్న అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి వై.ఎస్‌.కు చోటు దక్కింది. తరవాత ఇరవయ్యేళ్లు అధికార పదవులకు దూరంగా ఉన్నా- 2004లో కాంగ్రెస్విజయం దరిమిలా ముఖ్యమంత్రి పీఠం ఆయన్ను కోరి వరించింది. చదువుకొనే రోజుల్లోనే ఆదాయం పన్ను కట్టానని పలుమార్లు చాటుకొన్న వై.ఎస్‌. మృతికి పేదవాడి గుండె ఎందుకు చెరువవుతోంది? కారణం ముంజేతి కంకణం. 'ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే మార్పు తప్పనిసరి... అయితే అది మానవీయ కోణంలోనుంచి రావాలి' అని ప్రకటించిన వై.ఎస్‌.- సంక్షేమ పథకాల్ని పల్లెబాట పట్టించారు. ఖజానాకు భారమన్నా వినకుండా మొండిగా కిలో రెండు రూకల బియ్యం పథకాన్ని పట్టాలకు ఎక్కించారు. వందల కోట్ల బడ్జెట్టుతో నిరుపేదల్ని ఆరోగ్య 'శ్రీమంతుల్ని' చేశారు. బడుగు రైతాంగానికి ఉచిత విద్యుత్తు సరేసరి! ఇందిరమ్మ ఇళ్లు, బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాల పిల్లలకు వృత్తి విద్యా కోర్సు ఫీజుల పూర్తి చెల్లింపు వంటివి వై.ఎస్‌.ను పేదల పక్షపాతిగా మార్చేశాయి. ముఖ్యమంత్రి సహాయనిధినీ వందల కోట్లకు పెంచి అవసరార్థులకు దాన్ని కామధేనువుగా మార్చింది వైఎస్సే! రాజశేఖరరెడ్డి ఏలుబడి తీరుతెన్నులపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక- నిరుపేదల కళ్లకు ఆయన తమ ఆర్తి తీర్చే ఒయాసిస్సే! విధంగా ఎందరికో ఆత్మబంధువైన వై.ఎస్‌. లేని లోటు వేరెవరూ పూడ్చగలిగేది కాదు!

వై.ఎస్‌. అనగానే గుర్తుకొచ్చేవి- తెలుగు ఠీవి ఉట్టిపడే పంచెకట్టు, నగుమోము చేసే కనికట్టు! రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని చెప్పే వై.ఎస్‌. స్వీయ ప్రతిష్ఠను పణం పెట్టి అయినా నమ్ముకొన్నవాళ్లను ఆదుకొన్న మిత్రశ్రేష్ఠుడు! రాష్ట్ర బడ్జెట్ను లక్షకోట్లకు చేర్చడం, తెలుగుభాషకు ప్రాచీన హోదా రాబట్టడం వై.ఎస్‌. ఘనతలే. 'పాదయాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... విద్యుత్‌, బియ్యం, ఆరోగ్యశ్రీ పథకాలను శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తాం- ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు విశ్రమించం' అని నిరుడు జూన్‌ 15 వై.ఎస్‌. ప్రకటించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంద్వారా కోటి ఎకరాలకు సాగునీటి పరికల్పన సాధిస్తామంటూ ఆయన ఉద్ఘోషించని వేదికే లేదు. తొలి అయిదేళ్లలో లక్ష్యసిద్ధికోసం జలయజ్ఞానికి వై.ఎస్‌. వెచ్చించింది రూ.43వేల కోట్లు! ఫలానా పని చెయ్యాలనుకొన్నాక విమర్శల్ని, కష్టనష్టాల్ని బేఖాతరు చేస్తూ ముందుకు సాగడమే ఆయన నైజం. మరికొన్ని రోజుల్లో ప్రధాని చేతుల మీదుగా తలపెట్టిన భెల్‌- ఎన్‌.టి.పి.సి. ప్రాజెక్టు శంకుస్థాపన పాటికే పూర్తయి ఉంటే, మౌలిక రంగంలో భారీ కర్మాగారం రాష్ట్రానికి రావాలన్న తన స్వప్నం ఫలించిందన్న సంతృప్తి వై.ఎస్‌.కు మిగిలుండేదన్నది నిజం! తాను చేపట్టిన పథకాలే కాంగ్రెస్కు గెలుపు గుర్రాలవుతాయని విశ్వసించిన వై.ఎస్‌.- వాటిలో లోటుపాట్ల పరిశీలనకు బయలుదేరడమే, అననుకూల వాతావరణం రూపేణా ప్రాణాంతకమయ్యింది. బియ్యం, రేషన్కార్డులు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల అమలు తీరుపై ప్రజలతో నేరుగా చర్చించదలచిన నాయకుడు మరలిరాని లోకాలకు తరలిపోవడంతో పల్లె కన్నీరొలుకుతోంది. జన ప్రియనేతకు రాష్ట్రం నివాళి ఘటిస్తోంది'వై.ఎస్‌. అమర్రహేఅని!
(
ఈనాడు,. 04 - 09 -2009



ఇదే సందర్భానికి తగిన విధంగా 06, సెప్టెంబర్, 2009.. ఆదివారం ఈనాడు రాసిన సంపాదకీయం 
"జీవన వేదం" 


మనం ఎంతగానో ప్రేమించేవారు మనకు దూరమైతే ఆ ఎడబాటుకు మందేమిటో తెలుసా? మనం ప్రేమించేవారు ప్రేమించిన వాటిని అన్నింటినీ మనమూ ప్రేమించడం.  ఆస్కార్ వైల్డ్ చెప్పిన చిటుకు అది, మహాభారతంలో యక్షుడు 'ప్రపంచంలో కెల్లా అత్యంత అబ్బురం కలిగించే విశేషం ఏమిటి?' అని అడిగినప్పుడు 'రేపు కనుమరుగయే వ్యక్తి ఈ రోజు కాలం చెల్లిన ఆప్తుడిని గురించి కన్నీళ్లు పెట్టుకోవడం' అని జవాబు ఇస్తాడు ధర్మరాజు. ఆ మాటే నిజం. 'అసలు జీవితమంటేనే ఒక నాటక రంగం. మనమందరం ఆ వేదిక మీద ఆడే జగన్నాటకంలో  వచ్చే పోయే పాత్రధారులం' అంటాడు ఆంగ్ల నాటక కర్త విలియం షేక్స్పియర్. ఆ సత్యం మనమూ వంటబట్టించుకుంటే 'పుట్టడం.. గిట్టడం ప్రకృతి చేసే ప్రకటనలు' అని ఇట్టే ఆర్థమవుతుంది. 'జీవనం ఒక వేదం. ఆ వేదసారం గ్రహింపుకొస్తే ఆవేదనకు ఆస్కారముండదు' అంటాడు హిరణ్యాక్షుడు సోదరుడి మరణానికి దురపిల్లే బంధుగణాన్ని ఓదార్చే సందర్భంలో మహాభాగవతంలో. విశ్వవిజేతగా చక్రం తిప్పాలని దురాశ పడ్డ అలెగ్జాండర్ చలిజ్వరంతో చనిపోయే ఆఖరి క్షణంలో 'హతీతో క్రతిస్తో' అంటో ఖాళీ చేతులు చూపించి వెళ్ళిపోయాడు! ఎలా పోయారన్నది కాదు లెక్క.. ఎలా బతికి పోయారన్నది ముఖ్యం. లోకం కోసం విషం తాగిన శివుడికి ఉన్న విలువ తన కోసం అమృతం తాగిన దేవేంద్రుడుకుందా? మిన్నాగులాగా కలకాలం బతికే కన్నా మిణుగురులా వెలుగులు విరజిమ్ముతూ క్షణకాలం జీవించినా మిన్నే! అసలు మృత్యు పిశాచి ఒక్క దుఃఖాన్ని తప్ప మరేదీ ఆత్మబందువులకు దక్కనివ్వదా? రెండో ప్రపంచయుద్ధ సందర్భం. ఓ జర్మను చెరసాలలో ఖైదీలు వందల కొందలు  ఒకే అరలో బందీలుగా పడివున్నారు. తొక్కిసలాటలు తగ్గించేందుకు కారాగారాధికారుల కో పథకం తట్టిందిప్రతీ బందీ చేతికి ఒక అంకె ఇవ్వడం..  రోజూ కొన్ని అంకెలను చీటీలు తీసి  ఎన్నిక చేయడం.. ఆయా అంకెగల చీటీ  చేతనున్న అభాగ్యుడిని  పైకి పంపించెయ్యడం.. అదీ 'ఆపరేషన్ క్లీన్'. ఎన్నికైన అంకెచీటి చేత పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడో ఖైదీ.  తోటి ఖైదీ 'ఇంకా ఇక్కడ నీకు బందీగానే బతకాలనుందా? మిత్రమా! నీ చీటీ నా చేతికివ్వు!' అంటూ తానే  ఆ చీటీతో సంబరంగా ముందుకెళ్లి తుపాకీ గుండుకు బలి అయ్యాడు. ఆ ప్రాణత్యాగి ఆనందం అరువు ఊపిరితో బతికే ఖైదీ కేదీ?!
'మృత్యువు నా వాకిట్లో నిలబడితే వట్టి చేతులతో పంపను' అంటాడు రవీంద్ర కవీంద్రుడు 'గీతాంజలి'లో. 'జాతస్య మరణం ధృవమ్' అంటుంది గీత. కాలప్రవాహానికి ఎదురీదడం ఎవరి తరమూ కాదు'. పురాణేతిహాసాలు మృత్యువుని 'కాలధర్మం'గా వర్ణించడంలోని మర్మం మనిషి గ్రహించాలి. భూమ్మీద కలకాలం నిలిచిపోవాలన్న కాంక్ష ఎవరికుండదు! నిజంగా చిరంజీవిగా జీవించాలంటే 'తానే తుమ్మి తానే చిరంజీవ' అనుకుంటే చాలదు. చిరకాలం జనహృదయంలో సజీవంగా నిలిచిపోయే సత్కారాలేవైనా చేస్తుండాలి. మొక్కుబడిగా 'కీర్తిశేషులు' అనిపించుకోవడం కాదు.. మొక్కి.. మరీ 'కీర్తి'ని గుర్తు చేసుకొనే మంచి కర్మలు  సంకల్పించాలి. మనసుకు దగ్గరైన మనిషి దూరమైనప్పుడు ఒక పట్టాన ఒప్పుకోని పిచ్చిభ్రమలు మానవజాతి పుట్టుక నుంచే మొదలయినాయి.  వేళ్లు కోసినప్పుడు రుధిరం గడ్డకట్టినట్లు గట్టిగా రువువైతే తప్ప  రోమన్లు  ఆత్మబందువులు  మృతులైనట్లు ఒప్పుకొనేవారు కాదు. చనిపోయిన తమవారు తిరిగి వాస్తారన్న ఆశతో మూడు రోజుల వరకు పార్థివ దేహాన్ని పాడె మీదకు చేర్చనివ్వరు గ్రీకులు. 'ఎడ్గార్ ఎలెన్ పో' తన 'మెక్బరి' నవల్లో శవపేటిక లోపల మీటలుండే విధానాన్ని సూచించారు. ఖననమైన తరువాత ఒకవేళ తిరిగి ప్రాణమొస్తే మీట నొక్కి తమవాళ్ళకు  శుభవార్త చెప్పేందుకన్న మాట ఆ ఏర్పాటు! హిందూధర్మంలోని 'దింపుడు కళ్లెం' ఆచారం వెనకున్న మర్మం ఈ పునర్జీవితం మీద ఉన్నప్రగాఢ విశ్వాసమే!
శాస్త్రవిజ్ఞానం ఇంతగా అభివృధ్ధి చెందిన కాలంలో కూడా  ఇలాంటి నమ్మకాలను గూర్చి వింటుంటే నవ్వురావచ్చేమో గానీ.. నిజానికి గుండెచప్పుడు ఆగిపోయిన కొన్ని క్షణాల వరకు యంత్రంలో ఇసిజి నమోదు చెయ్యవచ్చని ఇప్పుడు వైద్యశాస్త్రం సైతం ఒప్పుకుంటున్న సత్యం. 'పైలోకార్పైన్' అన్న మందు కంటిలో వేస్తే వ్యక్తి చనిపోయిన మూడు గంటల వరకు కంటిపాపకు సంకోచిస్తుంది. అసలు మరణమనేది హఠాత్తుగా జరిగే విషాదం కాదు.  అదో క్రమంలో శరీరంలో జరిగే జీవపరిణామం అంటుంది మరణశాస్త్రం(థాంటాలజీ).కంటికి కనిపించని ఆత్మ శరీరాన్ని విసర్జించడంగా మతాలన్నీ మరణాన్ని నిర్వచించుకుంటున్నాయి. విజ్ఞానశాస్త్రం మాత్రం విశ్లేషించేందుకు వీలైన ప్రయోగాలు విజయవంతమయే వరకు మరణం మనిషికి మనసుకు సంబంధించిన ఒక అత్యంత భావోద్వేగ పరిణామంగానే మరణాన్ని చూస్తోంది. తార్కిక శాస్త్రాలు  ఏ సూత్రాలైనా చేయనీయండి.. మనసుకు దగ్గరైన వ్యక్తి హఠాత్తుగా దూరమయ్యాడన్న విషయం ఆప్తులలో  అంతులేని విషాదాన్ని నింపితీరుతుందిఅందులోనూ పెద్దమనిషి.. పెద్ద మనసున్న మనిషి! మరణమంటే మాములు జనాలకు పత్రికల్లో నల్లరంగు అద్దుకుని వచ్చే పతాక శీర్షికో.. టీవీ ప్రసారాలలో ఆపకుండా చూపించుకుంటూ పోయే 'రియాల్టీ' ప్రదర్శనో కాదు. ఆట ముగిస్తే రాజైనా బంటైనా ఒకే పాచికల పెట్టెలోకి సర్ధుకుంటారన్న మాట నిజమే కావచ్చేమో! కానీ జనం తరుఫున ఆడే ఆట రాజకీయం. అది ముగించకుండానే  మధ్యలో హఠాత్తుగా వదిలేసి చిరునవ్వులు చిందించుకుంటూ ఎవరు వెళ్లిపోయినా ప్రజావళి దృష్టిలో అది 'తొండే'!  ఆగిపోయిన  ఆటను  గుండె దిటవుతో   ముందుకు కొనసాగించి విజయం సాధించడమే  ఆ 'రాజు' కు ఆయన నమ్మిన 'బంట్లు'  సమర్పించుకొనే నిజమైన నివాళి.
***

(ఈనాడు- ఆదివారం సంపాదకీయం – 6, సెప్టెంబర్, 2009)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...