Wednesday, May 9, 2018

జీవన వేదం- వై ఎస్ ఆర్ దుర్మరణం సందర్భంలో ఈనాడు ఆదివారం సంపాదకీయం





కుండపోతగా వాన కురిసింది కొండాకోనల నల్లమలపైన. ఊహాతీతంగా పిడుగు పడింది మాత్రం యావత్రాష్ట్ర ప్రజ గుండెల మీద! రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. మరి లేరన్న దావానలంలాంటి దుర్వార్త ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచేసింది. ఏటా సంబరంగా సాగే గణేశ నిమజ్జనం సైతం బాధాతప్త హృదయాల కన్నీటి మడుగులోనే ముగిసిపోయింది. రచ్చబండ కార్యక్రమంకోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వై.ఎస్‌. హెలికాప్టర్ఆచూకీ గల్లంతు అయిందన్న తొలి సమాచారం తెలిసినప్పటినుంచి ఇరవై నాలుగ్గంటలపాటు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడిన జనవాహిని- కనిపించిన దేవుళ్లకల్లా మొక్కుతూ కోరుకొంది ఒక్కటే- ముఖ్యమంత్రి వై.ఎస్‌. క్షేమంగా తిరిగి రావాలనే! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర దేశీయాంగ, రక్షణ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా అత్యాధునిక విమానాలతో నల్లమలను జల్లెడ పడుతున్నంతసేపూ- పూర్వాశ్రమంలో నేషనల్క్యాడెట్కోర్‌(ఎన్‌.సి.సి.) సభ్యుడైన వై.ఎస్‌. అడవిని జయిస్తారనే మీడియా కూడా సాంత్వన వచనాలు పలికింది. కర్నూలుకు తూర్పున నలభై నాటికల్మైళ్ల దూరాన కొండ కొమ్ముపై హెలికాప్టర్జాడ తెలిసిందన్న సమాచారమూ దాన్ని వెన్నంటి వచ్చిన శరాఘాతంలాంటి కబురూ ప్రజానీకాన్ని హతాశుల్ని చేశాయి! ముఖ్యమంత్రి హెలికాప్టర్దారితప్పి 18 కిలోమీటర్లు తూర్పుదిశగా వెళ్లి కొండను ఢీ కొట్టిందని రాష్ట్ర డి.జి.పి. చెబుతున్నారు. 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టింది మొదలు వై.ఎస్‌. కాంగ్రెస్లో కొండల్లాంటి సీనియర్లు ఎందరినో ఢీ కొడుతూనే ముందుకుసాగారు. వరస పరాజయాలతో కుంగిన రాష్ట్ర కాంగ్రెస్కు తన ప్రజాపథ ప్రస్థానంతో కొత్త ఊపిరులూది వరస విజయాలు కట్టబెట్టిన వై.ఎస్‌.- తానే రాజకీయ మేరునగంగా ఎదిగారు. అననుకూల వాతావరణంలో రాజశిఖరం ప్రయాణిస్తున్న హెలికాప్టర్నల్లమల కొండ శిఖరాగ్రాన్ని తాకి ముక్కలై మహా విషాదాన్ని వర్షించింది. విధి మనిషిని విగతం చేస్తుందేమోగాని, చెమ్మగిల్లిన గుండెల సాక్షిగా వై.ఎస్‌. ప్రజల మనిషి!

'
నేను వృత్తిరీత్యా డాక్టరును... అయితే రోజుకు ఎంతమంది రోగులకు వైద్యం చెయ్యగలను? యాభై... వంద- అంతేకదా! అందుకే రాజకీయాల్లోకి రావాలనుకొన్నా'- అని ప్రకటించిన వై.ఎస్‌.కు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేదు. 'గరీబోళ్ల బిడ్డ'గా అధికార పీఠం అందుకొన్న అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి వై.ఎస్‌.కు చోటు దక్కింది. తరవాత ఇరవయ్యేళ్లు అధికార పదవులకు దూరంగా ఉన్నా- 2004లో కాంగ్రెస్విజయం దరిమిలా ముఖ్యమంత్రి పీఠం ఆయన్ను కోరి వరించింది. చదువుకొనే రోజుల్లోనే ఆదాయం పన్ను కట్టానని పలుమార్లు చాటుకొన్న వై.ఎస్‌. మృతికి పేదవాడి గుండె ఎందుకు చెరువవుతోంది? కారణం ముంజేతి కంకణం. 'ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే మార్పు తప్పనిసరి... అయితే అది మానవీయ కోణంలోనుంచి రావాలి' అని ప్రకటించిన వై.ఎస్‌.- సంక్షేమ పథకాల్ని పల్లెబాట పట్టించారు. ఖజానాకు భారమన్నా వినకుండా మొండిగా కిలో రెండు రూకల బియ్యం పథకాన్ని పట్టాలకు ఎక్కించారు. వందల కోట్ల బడ్జెట్టుతో నిరుపేదల్ని ఆరోగ్య 'శ్రీమంతుల్ని' చేశారు. బడుగు రైతాంగానికి ఉచిత విద్యుత్తు సరేసరి! ఇందిరమ్మ ఇళ్లు, బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాల పిల్లలకు వృత్తి విద్యా కోర్సు ఫీజుల పూర్తి చెల్లింపు వంటివి వై.ఎస్‌.ను పేదల పక్షపాతిగా మార్చేశాయి. ముఖ్యమంత్రి సహాయనిధినీ వందల కోట్లకు పెంచి అవసరార్థులకు దాన్ని కామధేనువుగా మార్చింది వైఎస్సే! రాజశేఖరరెడ్డి ఏలుబడి తీరుతెన్నులపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక- నిరుపేదల కళ్లకు ఆయన తమ ఆర్తి తీర్చే ఒయాసిస్సే! విధంగా ఎందరికో ఆత్మబంధువైన వై.ఎస్‌. లేని లోటు వేరెవరూ పూడ్చగలిగేది కాదు!

వై.ఎస్‌. అనగానే గుర్తుకొచ్చేవి- తెలుగు ఠీవి ఉట్టిపడే పంచెకట్టు, నగుమోము చేసే కనికట్టు! రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని చెప్పే వై.ఎస్‌. స్వీయ ప్రతిష్ఠను పణం పెట్టి అయినా నమ్ముకొన్నవాళ్లను ఆదుకొన్న మిత్రశ్రేష్ఠుడు! రాష్ట్ర బడ్జెట్ను లక్షకోట్లకు చేర్చడం, తెలుగుభాషకు ప్రాచీన హోదా రాబట్టడం వై.ఎస్‌. ఘనతలే. 'పాదయాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... విద్యుత్‌, బియ్యం, ఆరోగ్యశ్రీ పథకాలను శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తాం- ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు విశ్రమించం' అని నిరుడు జూన్‌ 15 వై.ఎస్‌. ప్రకటించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంద్వారా కోటి ఎకరాలకు సాగునీటి పరికల్పన సాధిస్తామంటూ ఆయన ఉద్ఘోషించని వేదికే లేదు. తొలి అయిదేళ్లలో లక్ష్యసిద్ధికోసం జలయజ్ఞానికి వై.ఎస్‌. వెచ్చించింది రూ.43వేల కోట్లు! ఫలానా పని చెయ్యాలనుకొన్నాక విమర్శల్ని, కష్టనష్టాల్ని బేఖాతరు చేస్తూ ముందుకు సాగడమే ఆయన నైజం. మరికొన్ని రోజుల్లో ప్రధాని చేతుల మీదుగా తలపెట్టిన భెల్‌- ఎన్‌.టి.పి.సి. ప్రాజెక్టు శంకుస్థాపన పాటికే పూర్తయి ఉంటే, మౌలిక రంగంలో భారీ కర్మాగారం రాష్ట్రానికి రావాలన్న తన స్వప్నం ఫలించిందన్న సంతృప్తి వై.ఎస్‌.కు మిగిలుండేదన్నది నిజం! తాను చేపట్టిన పథకాలే కాంగ్రెస్కు గెలుపు గుర్రాలవుతాయని విశ్వసించిన వై.ఎస్‌.- వాటిలో లోటుపాట్ల పరిశీలనకు బయలుదేరడమే, అననుకూల వాతావరణం రూపేణా ప్రాణాంతకమయ్యింది. బియ్యం, రేషన్కార్డులు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల అమలు తీరుపై ప్రజలతో నేరుగా చర్చించదలచిన నాయకుడు మరలిరాని లోకాలకు తరలిపోవడంతో పల్లె కన్నీరొలుకుతోంది. జన ప్రియనేతకు రాష్ట్రం నివాళి ఘటిస్తోంది'వై.ఎస్‌. అమర్రహేఅని!
(
ఈనాడు,. 04 - 09 -2009



ఇదే సందర్భానికి తగిన విధంగా 06, సెప్టెంబర్, 2009.. ఆదివారం ఈనాడు రాసిన సంపాదకీయం 
"జీవన వేదం" 


మనం ఎంతగానో ప్రేమించేవారు మనకు దూరమైతే ఆ ఎడబాటుకు మందేమిటో తెలుసా? మనం ప్రేమించేవారు ప్రేమించిన వాటిని అన్నింటినీ మనమూ ప్రేమించడం.  ఆస్కార్ వైల్డ్ చెప్పిన చిటుకు అది, మహాభారతంలో యక్షుడు 'ప్రపంచంలో కెల్లా అత్యంత అబ్బురం కలిగించే విశేషం ఏమిటి?' అని అడిగినప్పుడు 'రేపు కనుమరుగయే వ్యక్తి ఈ రోజు కాలం చెల్లిన ఆప్తుడిని గురించి కన్నీళ్లు పెట్టుకోవడం' అని జవాబు ఇస్తాడు ధర్మరాజు. ఆ మాటే నిజం. 'అసలు జీవితమంటేనే ఒక నాటక రంగం. మనమందరం ఆ వేదిక మీద ఆడే జగన్నాటకంలో  వచ్చే పోయే పాత్రధారులం' అంటాడు ఆంగ్ల నాటక కర్త విలియం షేక్స్పియర్. ఆ సత్యం మనమూ వంటబట్టించుకుంటే 'పుట్టడం.. గిట్టడం ప్రకృతి చేసే ప్రకటనలు' అని ఇట్టే ఆర్థమవుతుంది. 'జీవనం ఒక వేదం. ఆ వేదసారం గ్రహింపుకొస్తే ఆవేదనకు ఆస్కారముండదు' అంటాడు హిరణ్యాక్షుడు సోదరుడి మరణానికి దురపిల్లే బంధుగణాన్ని ఓదార్చే సందర్భంలో మహాభాగవతంలో. విశ్వవిజేతగా చక్రం తిప్పాలని దురాశ పడ్డ అలెగ్జాండర్ చలిజ్వరంతో చనిపోయే ఆఖరి క్షణంలో 'హతీతో క్రతిస్తో' అంటో ఖాళీ చేతులు చూపించి వెళ్ళిపోయాడు! ఎలా పోయారన్నది కాదు లెక్క.. ఎలా బతికి పోయారన్నది ముఖ్యం. లోకం కోసం విషం తాగిన శివుడికి ఉన్న విలువ తన కోసం అమృతం తాగిన దేవేంద్రుడుకుందా? మిన్నాగులాగా కలకాలం బతికే కన్నా మిణుగురులా వెలుగులు విరజిమ్ముతూ క్షణకాలం జీవించినా మిన్నే! అసలు మృత్యు పిశాచి ఒక్క దుఃఖాన్ని తప్ప మరేదీ ఆత్మబందువులకు దక్కనివ్వదా? రెండో ప్రపంచయుద్ధ సందర్భం. ఓ జర్మను చెరసాలలో ఖైదీలు వందల కొందలు  ఒకే అరలో బందీలుగా పడివున్నారు. తొక్కిసలాటలు తగ్గించేందుకు కారాగారాధికారుల కో పథకం తట్టిందిప్రతీ బందీ చేతికి ఒక అంకె ఇవ్వడం..  రోజూ కొన్ని అంకెలను చీటీలు తీసి  ఎన్నిక చేయడం.. ఆయా అంకెగల చీటీ  చేతనున్న అభాగ్యుడిని  పైకి పంపించెయ్యడం.. అదీ 'ఆపరేషన్ క్లీన్'. ఎన్నికైన అంకెచీటి చేత పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడో ఖైదీ.  తోటి ఖైదీ 'ఇంకా ఇక్కడ నీకు బందీగానే బతకాలనుందా? మిత్రమా! నీ చీటీ నా చేతికివ్వు!' అంటూ తానే  ఆ చీటీతో సంబరంగా ముందుకెళ్లి తుపాకీ గుండుకు బలి అయ్యాడు. ఆ ప్రాణత్యాగి ఆనందం అరువు ఊపిరితో బతికే ఖైదీ కేదీ?!
'మృత్యువు నా వాకిట్లో నిలబడితే వట్టి చేతులతో పంపను' అంటాడు రవీంద్ర కవీంద్రుడు 'గీతాంజలి'లో. 'జాతస్య మరణం ధృవమ్' అంటుంది గీత. కాలప్రవాహానికి ఎదురీదడం ఎవరి తరమూ కాదు'. పురాణేతిహాసాలు మృత్యువుని 'కాలధర్మం'గా వర్ణించడంలోని మర్మం మనిషి గ్రహించాలి. భూమ్మీద కలకాలం నిలిచిపోవాలన్న కాంక్ష ఎవరికుండదు! నిజంగా చిరంజీవిగా జీవించాలంటే 'తానే తుమ్మి తానే చిరంజీవ' అనుకుంటే చాలదు. చిరకాలం జనహృదయంలో సజీవంగా నిలిచిపోయే సత్కారాలేవైనా చేస్తుండాలి. మొక్కుబడిగా 'కీర్తిశేషులు' అనిపించుకోవడం కాదు.. మొక్కి.. మరీ 'కీర్తి'ని గుర్తు చేసుకొనే మంచి కర్మలు  సంకల్పించాలి. మనసుకు దగ్గరైన మనిషి దూరమైనప్పుడు ఒక పట్టాన ఒప్పుకోని పిచ్చిభ్రమలు మానవజాతి పుట్టుక నుంచే మొదలయినాయి.  వేళ్లు కోసినప్పుడు రుధిరం గడ్డకట్టినట్లు గట్టిగా రువువైతే తప్ప  రోమన్లు  ఆత్మబందువులు  మృతులైనట్లు ఒప్పుకొనేవారు కాదు. చనిపోయిన తమవారు తిరిగి వాస్తారన్న ఆశతో మూడు రోజుల వరకు పార్థివ దేహాన్ని పాడె మీదకు చేర్చనివ్వరు గ్రీకులు. 'ఎడ్గార్ ఎలెన్ పో' తన 'మెక్బరి' నవల్లో శవపేటిక లోపల మీటలుండే విధానాన్ని సూచించారు. ఖననమైన తరువాత ఒకవేళ తిరిగి ప్రాణమొస్తే మీట నొక్కి తమవాళ్ళకు  శుభవార్త చెప్పేందుకన్న మాట ఆ ఏర్పాటు! హిందూధర్మంలోని 'దింపుడు కళ్లెం' ఆచారం వెనకున్న మర్మం ఈ పునర్జీవితం మీద ఉన్నప్రగాఢ విశ్వాసమే!
శాస్త్రవిజ్ఞానం ఇంతగా అభివృధ్ధి చెందిన కాలంలో కూడా  ఇలాంటి నమ్మకాలను గూర్చి వింటుంటే నవ్వురావచ్చేమో గానీ.. నిజానికి గుండెచప్పుడు ఆగిపోయిన కొన్ని క్షణాల వరకు యంత్రంలో ఇసిజి నమోదు చెయ్యవచ్చని ఇప్పుడు వైద్యశాస్త్రం సైతం ఒప్పుకుంటున్న సత్యం. 'పైలోకార్పైన్' అన్న మందు కంటిలో వేస్తే వ్యక్తి చనిపోయిన మూడు గంటల వరకు కంటిపాపకు సంకోచిస్తుంది. అసలు మరణమనేది హఠాత్తుగా జరిగే విషాదం కాదు.  అదో క్రమంలో శరీరంలో జరిగే జీవపరిణామం అంటుంది మరణశాస్త్రం(థాంటాలజీ).కంటికి కనిపించని ఆత్మ శరీరాన్ని విసర్జించడంగా మతాలన్నీ మరణాన్ని నిర్వచించుకుంటున్నాయి. విజ్ఞానశాస్త్రం మాత్రం విశ్లేషించేందుకు వీలైన ప్రయోగాలు విజయవంతమయే వరకు మరణం మనిషికి మనసుకు సంబంధించిన ఒక అత్యంత భావోద్వేగ పరిణామంగానే మరణాన్ని చూస్తోంది. తార్కిక శాస్త్రాలు  ఏ సూత్రాలైనా చేయనీయండి.. మనసుకు దగ్గరైన వ్యక్తి హఠాత్తుగా దూరమయ్యాడన్న విషయం ఆప్తులలో  అంతులేని విషాదాన్ని నింపితీరుతుందిఅందులోనూ పెద్దమనిషి.. పెద్ద మనసున్న మనిషి! మరణమంటే మాములు జనాలకు పత్రికల్లో నల్లరంగు అద్దుకుని వచ్చే పతాక శీర్షికో.. టీవీ ప్రసారాలలో ఆపకుండా చూపించుకుంటూ పోయే 'రియాల్టీ' ప్రదర్శనో కాదు. ఆట ముగిస్తే రాజైనా బంటైనా ఒకే పాచికల పెట్టెలోకి సర్ధుకుంటారన్న మాట నిజమే కావచ్చేమో! కానీ జనం తరుఫున ఆడే ఆట రాజకీయం. అది ముగించకుండానే  మధ్యలో హఠాత్తుగా వదిలేసి చిరునవ్వులు చిందించుకుంటూ ఎవరు వెళ్లిపోయినా ప్రజావళి దృష్టిలో అది 'తొండే'!  ఆగిపోయిన  ఆటను  గుండె దిటవుతో   ముందుకు కొనసాగించి విజయం సాధించడమే  ఆ 'రాజు' కు ఆయన నమ్మిన 'బంట్లు'  సమర్పించుకొనే నిజమైన నివాళి.
***

(ఈనాడు- ఆదివారం సంపాదకీయం – 6, సెప్టెంబర్, 2009)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...