Showing posts with label Science. Show all posts
Showing posts with label Science. Show all posts

Sunday, December 12, 2021

గ్రహం ప్రమాదంలో లేదు; ఉన్నది మనమే ! - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 గ్రహం ప్రమాదంలో లేదు. ప్రమాదంలో ఉన్నవి  మానవ జీవితాలే ! 

సోర్స్ : అన్ నోన్ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


భూమి ప్రమాదంలో ఉందని చాలా మంది పర్యావరణ నిపుణులు ప్రజలకి భోదిస్తూ ఉంటారు. ప్రమాదంలో ఉన్నది ఈ గ్రహం కాదు.. మనమే!  


మననుషుల  మనస్సులు అరలు అరలుగా  కుచించుకుపోయాయి . చెట్లు విషయమే చూడండి. అది మన ఆత్మబంధువు. అవి ప్రసాదించే స్వచ్ఛమైన  ప్రాణవాయువుని మనం లోపలికి తీసుకుంటాం. మనం వదిలే కాలుష్య   బొగ్గుపులుసు వాయువుని అది  తన   లోపలికి తీసుకుంటుంది!మన ఊపిరితిత్తులలోని ఒక భాగమైన చెట్టుని వంటకోసం విరిచి పొయ్యిలో పెట్టేందుకు   సంకోచించం! 


ఇక .. మనది మాత్రమే అనుకునే ఈ శరీరం మనది ఒక్కళ్లదే కాదు. ఇదీ ఈభూగ్రహంలోని ఒక చిన్న ముక్క. ఆధ్యాత్మికత అంటే పైకి చూడ్డమో.. కిందకు చూడ్డమో మనకు అలవాటు. లోపలికి చూసుకోవాలని తెలుసుకోలేము. అంతర్ముఖత్వం సాధన చేసే వారికి అనుకున్నదంతా తన లోపలే లభిస్తుంది. 


ఆధునిక శాస్త్రవిజ్ఞానమూ విశ్వంలోఉన్న అణుబంధమే.  దేహంలోనూ ఓ బ్లూ ప్రింట్ మాదిరిగా ఉంటుందని చెబుతున్నది కదా! ఆ అవగాహనను పెంచుకొని  ప్రపంచాన్ని తనలో చూసుకోవడం  ఆధ్యాత్మికం అయితే .. ప్రపంచంలో తనని చూసుకోవడం విశ్వభావన అవుతుంది. 


ఈ గ్రహం మన మనుషులొక్కళ్లదే కాదు. మనిషికీ స్వార్థ బుద్ధి ఎందుకు పుట్టినట్లోతెలీదు. తననిదేవుడికి ప్రతినిధిగా భావించుకోడం అహంభావం కాక మరేమిటి? సాలెపురుగు కూడా తాను దేవుడికి ప్రతినిధి అనుకుంటుందేమో! ఈ గ్రహం మీది ప్రతి జీవికీ మనకు లాగే తమ జీవితమే ఉత్తమమైనదని ఎందుకు అనిపించకూడదూ! 


శారీరకంగా చిన్నవైనంత   మాత్రాన,  భౌతికంగా  కదలలేని స్థితిలో  ఉన్నంత మాత్రాన వాటి ప్రాధాన్యతను మనకోణంలో నుంచి తక్కువ చేసి చూపించలేం  కదా! అట్లా చూపిస్తే  ముందు మనకే మానవత్వం లేనట్లు లెక్క. వాస్తవానికి ఈ భూగ్రహానికి ఎటువంటి ప్రమాదం లేదు. మానవ జీవితాలకే ఉన్న ప్రమాదం ,అంతా!  


మానవత్వం పెంపొందితే గాని, ఈ పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్టులు జరుగుతాయని నేననుకొను. గవర్నమెంట్ ఎన్నో సిద్ధాంతాలను చేయవచ్చు. కానీ, వారు వీటిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే అమలు పరచాలి. ఏదో ఒక నిరంతర ప్రచార  వ్వూహం ద్వారాగానీ, ప్రజలలో తగిన ఎరుకను తీసుకురావడంద్వారాగానీ చేయాలి. 


ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులు ఈ ఆలోచనలను బయటికి తెచ్చే విధానాలను వెతకాలి. ఒక సమయంలో భారతదేశంలో కుటుంబ నియంత్రణ గురించిన ప్రచారం జరిగింది. ఇప్పుడటువంటి ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. కానీ మనకేమీ పరిష్కారం దొరకలేదు కదా! మానవ జనాభాని అదుపులో పెట్టుకోకుండా, పర్యావరణం, భూమి, నీరు – వీటన్నిటి గురించి మాట్లాడటం అన్నది కేవలం శాస్త్ర పరిజ్ఞానం వల్ల ప్రజలు హైపర్-ఏక్టివ్ అవ్వడం వల్ల జరిగింది మాత్రమే! 


మీరు మానవ కార్యకలాపాలను నియంత్రించలేరు, మీరు మానవ జనాభాను మాత్రమే నియంత్రించగలరు. మానవాళి చేసే కార్యకలాపాలను మనం ఆపలేము. ఎందుకంటే ఇది వారి ఆశయాలను నియంత్రించడం అవుతుంది. ఈ రోజుల్లో మన ఆశయాలు ఏమిటంటే, ప్రతీవారూ కూడా అక్షరాస్యులు అవ్వాలనీ, వారికి ఎంతో పెద్ద కలలూ, లక్ష్యాలూ ఉండాలనీ! 


ఇప్పుడు ఉన్న జనాభా స్థాయితో.. వీటిని సాధించడం అన్నది ఎంతో కష్టం. మనం ఎరుకతో దీనిని నియంత్రించాలి. మనం ఎరుకతో దీనిని ఎక్కడ ఆపాలనుకుంటున్నామో నిర్ధారించుకోవాలి. ఇది చెయ్యడం అసాధ్యం అని నేను అనుకోను.


మనకి ఎటువంటి వనరులైతే ఉన్నాయో వాటికి సరిపోయే విధంగా మనం జనాభాను సమతుల్యం చేసుకోవాలి. మనం చేయగలిగినది ఇదే. అన్నిటికంటే సులువైన పని ఇదే. ఇది ప్రతి మానవుడూ  చేయగలదు. వారికి అవసరమైన విద్య, ఎరుక జీవితంలోకి తీసుకుని వస్తే ఇది జరుగుతుంది. 


అప్పుడు, మనం చెట్లని నాటనక్కర్లేదు. మనం ఈ భూమి నుంచి దూరంగా ఉంటే, చెట్లు వాటికవే పెరుగుతాయి. మీరు వాటిని ఆపలేరు. ఇది ప్రతీ మానవుడూ  అర్థం చేసుకోవాల్సిన విషయం. 


భూమి ప్రమాదంలో ఉందని ప్రజలు అంచనాలు వేస్తున్నారు. ఈ గ్రహం ఎటువంటి ప్రమాదంలోనూ లేదు. మానవ జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని, దీనికి, ఏది అవసరమో అది 

సోర్స్ : అన్ నోన్ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

09 - 10 - 2021 

బోథెల్ : యా . ఎస్.ఎ 

Sunday, April 11, 2021

శతమానం భవతి… ( అభయ్) -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 



నిజానికి వరల్డ్ వార్స్ నుంచి స్టార్ వార్స్ వరకు  కాలంతో కలసి ఉత్సాహంగా కాలు కదిపితే  చాలు..  ఆ కాలాతీత జివిని  చిరంజీవి కింద జమకట్టేయవచ్చు! ఆయాచితంగా దక్కిన వరం మానవ జీవితం. అధిగమించలేని   ప్రకృతి  శక్తుల ప్రభావం గురించి ఎంత చింతించీ ప్రయోజనం శూన్యం. వీలైనంత కాలం ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్తమ సంస్కారంతో సాటి సమాజానికి ఆదర్శప్రాయంగా జీవిస్తే ఛాలు.. అదే   వాస్తవానికి వెయ్యేళ్లు మించి ఘనంగా జీవించినట్లు!  

 కానీ గరిష్ట  జీవితకాలం ఇంత అని ఒక మొద్దు అంకె రూపంలో స్పష్టంగా కనిపించాలి. పరిశోధనలకు, తుల్యమాన పద్ధతుల్లో జరిగే  పరిశీలనలకుఅధ్యయనాలకు అది ఒక ప్రమాణం (యూనిట్)గా స్థిరపడాలి.  ‘శతమానం’ మనిషి నిండు జీవితానికి ఒక ప్రామాణిక  కొలమానంగా భావించడానికి  అదే కారణం. హైందవ సంప్రదాయంలో తరచూ వినిపించే  ‘ ఓం శతమానం భవతి శతాయుః పురుష/ శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ!’ అనే ఆశీర్వాద మంత్రం వెనుక ఉన్న ఉద్దేశం నిర్దేశించిన ఈ జీవితకాల లక్ష్యాన్ని నిరాటంకంగా చేర్రుకోవాలనే అభిలాష.  కానీ మీకు ఎన్నాళ్ళు జీవించాలని ఉంది? అని అడిగితే చాలామంది అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు అంటో అలవోకగా ఏదో  బుద్ధికి తోచిన  సమాధానం ఇచ్చేస్తారు. ఏ ఒక్కరికి నిండు నూరేళ్లూ జీవితం పండువులా  గడపాలని ఉండదా?! 

భూగోళం పైన రష్యా, దాని పరిసర దేశాల కొన్ని మారుమూల ప్రాంతాలలో గుట్టుగా జీవించే మానవ సమూహాలకు - వందేళ్లు మించి  జీవించడం కూడా   చాలా సాధారణమైన విషయం. 'మీకు ఎన్నాళ్ళు బతకాలనిs ఉంది?' లాంటి ప్రశ్నలు వాళ్లకు నవ్వు తెప్పిసుంద'ని  పరిశోధన నిమిత్తమై వెళ్లిన ఓ జర్మన్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం ‘లైవ్ సైన్స్’ -జూన్’2019 నాటి  సంచికలో ఓ వ్యాసం సందర్భంగా పేర్కొంది!  

వంద మీద మరో 13  ఏళ్ళకు  పైగా జీవించిన వంద మంది   జాబితా - గిన్నీస్  వరల్డ్  రికార్డు  వాళ్ళు  తయారు చేస్తే అందులో సింహభాగం సివంగులవంటి  ఆడంగులది.. అందులో అగ్రతాంబూలం అమెరికన్  దొరసానులది! బడాయిలే తప్పింఛి భారతీయుల తాలూకు ఒక్క శాల్తీ పేరూ ఆ జాబితాలో కనిపించదు! బాధాకరం. పక్క చైనా నుంచి నుంచైనా  ఒక్కరూ లేని మాట  నిజమే కావచ్చు కానీ అదీ కొంత ఉపశమనం  కలిగించే అంశంగా భావించడం  తగదు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు   వందేళ్లకు పైగా బతికున్నట్లు  కనిపిస్తున్నా కొన్ని   ప్రాంతాల ప్రభుత్వ పత్రాల సాధికారత పట్ల  గిన్నీస్ బుక్కు సంస్థకు అభ్యంతరాలు ఉన్నట్లు వినికిడి!  నిజానిజాలు నిర్ధారణ తరువాత కానీ తేలవు. 

వందేళ్ల బతుకు ఒక్కటే కాదు… 'చల్ మోహన రంగా' పంథాలో ఉత్సాహంగా బతకడం కూడా ప్రధానమే! 'పక్క దిగేందుక్కూడా ఎవరెక్కరున్నారా సాయానికని  దిక్కులు చూస్తూ దినాలు గడిపే కన్నా.. కాలు కింది బక్కెటను ఠక్కున తన్నేయడం మెరుగు' అంటాడు ఛార్లీ చాప్లిన్ ‘ది గార్డియన్’ పత్రిక పక్షాన రిచర్డ్ మేరీమ్యాన్ కు ఇచ్చిన ఆఖరు ఇష్టాగోష్టిలో. మైఖేల్ జాక్సన్ లా ఆడుతూ, లతా.. ఉషా మంగేష్కర్ల మాదిరి హుషారుగా పాడుతూ ఖతమయితేనే ఏ బతుకు ఖేల్ అయినా  గెలుపుకు కావాల్సిన గోల్స్ కొట్టి  పతకం సాధించినట్లు! సర్కారు పింఛన్లు పుచ్చుకుంటున్నా  కానీ ..అణా.. కాణీ కైనా కొరగాకుండా పడున్నాడ'ని  అయినోళ్లందరి నోటా 'ఛీఁ .. పోఁఅనిపించుకుంటూ ఎంత ఎక్కువ కాలం  తుక్కు బండి లాగించినా  వృథా.మన్నిక -కట్టే బట్టకే కాదు.. బతికే బతుక్కూ అవసరమే’ అంటారు స్వామి వివేకానంద! చిన్ననాటి పెద్దల గారాబం, పెద్దతనంలో పిల్లల గౌరవంగా తర్జుమా అయినప్పుడే తర్జన భర్జనలేవీ లేకుండా వందేళ్లకు మించైనా  దర్జాగా బతకాలనిపించేది! మధ్య ప్రాచ్య దేశాలలో  పది పదుల దాటినా నిశ్చింతగా బతికేయడం, ప్రాచ్యులంగా  గొప్పలు పోయే మనకు మాత్రం ఆరు పదులైనా నిండక మునుపే బతుకు ‘తెల్లారిపోవడం’! ఎందుకు ఈ తేడా?'

మనసుంటే మార్గం ఉంటుంద'న్నది మనమే మానుషులంగా కనిపెట్టుకున్న జీవనసూత్రం.  వందేళ్ల బతుకు మీద మరి  మన భారతీయ సంతతికి  అణు మాత్రమైనా మోజెందుకు లేనట్లో?! 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీర్వాదం గతం మాదిరి కాకుండా ఇప్పుడు ప్రతీ ఇంటా వృద్ధుల పాలిట శాపంగా మారడమెందుకు?! నేటి భారతీయ సమాజంలోని స్థితి గతులన్నీ నానాటికీ ఏళ్ళు పైబడే వృద్ధుల పాలిటి   వరద పోటుకు ఎదురీతలుగా ఎందుకు మారుతున్నట్లు?! ప్రభుత్వాల ధ్యాస పెద్దలపై ఒక్క ఓట్ల జాతర్లప్పుడు మాత్రమేనా?! నిన్నటి  దాకా దేశాన్ని బాధ్యతగా  నడిపించి భద్రంగా తాజా తరాలకు అప్పగించిన అనుభవజ్ఞులు   పెద్దలు. కృతజ్ఞత కోసమైనా ఆ మాతాపితర సమానుల గౌరవప్రద జీవన పరిస్థితుల   పట్ల ప్రజాప్రభువులు సంతాన భావనతో  ప్ర్రత్యేక శ్రద్ధ వహించవలసిన అగత్యం స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. 

గతంలో ఒక్క నయం కాని రోగాలూ రొప్పులు, వేళకు అందని తగిన వైద్యసాయాలు  పెద్దల పాలిటి ముప్పులుగా ఉండే పరిస్థితి. మారుతున్న సమాజంలో ముసలితనానికి  మానసిక ఒంటరితనం కొత్త యమగండంగా మెడకు చుట్టుకుంటున్నట్లు  వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల  నివేదికల  గణాంకాలు నిలదీస్తున్నాయిప్పుడు! బతకడాన్ని మించి సుఖంగా బతకాలనే వాంచ మనిషిది. అందుకు సరిపడని సామాజిక పరిస్థితులు  కుటుంబ వ్యవస్థలలో కూడా క్రమంగా చొరబడడమూ  ముదుసలుల మరణాలను మరింత ముందుకు తోసే  ముదనష్టపు కారణమని ఓ అంచనా, సుఖమయజీవితం పైన క్రమంగా సడలుతున్న నమ్మకమే ముందుకు తోసుకొచ్చే ముదిమికీ ఓ ముఖ్య కారణమని భారత ఆహార సంస్థ 2017 నాటి తన వార్షిక నివేదికలో హెచ్చరించింది కూడా. 'మనవారు' అనుకునేవారు తరుగుతున్న కొద్ది యములాడితో  మనిషి చేసే సమరంలో దార్డ్యం, దైర్యం రెండూ సన్నగిల్లడం సహజ విపరిణామం. పొద్దు వాటారే మాట  తాత్కాలికంగా పక్కన ఉంచి, పడుచువారిని మించి  కొంత కాలం  మనస్ఫూర్తిగా జల్సాలలో ఉత్సాహంగా మునిగి తేలితేనో

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్ టన్  ఈ దిశగా గతంలో చేసిన ఓ పరిశోధన తాలూకు  ఫలితాలు పోయిన ఏడాది జులై నెల ‘అమెరికన్ సైన్స్’ జర్నల్ లో విడుదలయాయి. మనోవాంఛితం మనిషి శర్రీరం పైన ఎంతటి వింత ప్రభావం చూపిస్తుందో తెలిపే ఆ పరిశోధనల ఆధారంగా మన దేశంలో ముసలివారి శాతం ఎందుకింత శరవేగంగా దూసుకువస్తుందో అర్థమవుతుంది. అనుక్షణం అద్భుతంగా సాగిన ఆ  యౌవ్వనోత్సాహ జీవితోత్సవ అనుభూతుల కారణానే   గ్రీష్మాంతంలో వసంతం ప్రకృతి కై కల్పించే కైపు ముదుసలుల మనసులలోనూ  చొప్పించినట్లు ఆ పరిశోధన తేల్చింది.  మూడు పదుల నాటి మునుపటి శారీరక పటిమ ముసలివారిలో తిరిగి పుంజుకొన్నట్లు ప్రయోగ ఫలితాల సారాంశం! మనసు చేత శరీరాన్ని నొప్పించడం కాక శరీరం చేత మనసును శతాయుష్షువుగా జీవించడానికి  ఒప్పించాలన్నది ప్రయోగం నేర్పించే నీతి పాఠం.. 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీస్సులు నిజం కావాలంటే 'నిండు నూరేళ్లూ ఆరోగ్యం గుండులా ఉండాల’నే సంకల్పం ముందుగా ఎవరికి వారు తమ మనసులకు చెప్పుకోవాలి.     

జీవిత లక్ష్యం ఏ   ‘షష్టిపూర్తి’  పూర్తికో  పరిమితమైతే  పొద్దు ఆ వేళకే వాటారే అవకాశం ఎక్కువని  మనస్తత్త్వవేత్తలూ మత్తుకునే మాట.  అస్తమానం చేసే భూతకాల జపం   భవిష్యత్తు పాలిట శాపంగా మారుతుందని మానసిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనుగడ అనే భావన కూడా చేటే. గాలివాటానికి కాస్త చలాకీతనం మందగించినా మరేదో ముందు ముందు ముంచుకురానున్నదనే బెంగ  ఆయుర్దాయం మీద కనిపించని  దెబ్బ వేసే ప్రమాదం కద్దు.  'నూరేళ్లు నేను మాత్రం మా మనవళ్ళు, మనవరాళ్లలా ఎందుకు హుషారుగా ఉండకూడదూ?' అనుకుంటే చాలు. అందుకు తగ్గట్లు తీసుకునే జాగ్రత్తలతో   మునిమనుమలతో కూడా  కలసి హాయిగా ఆడిపాడుకోవచ్చు.

అందుకు అనుగుణమైన  సగుణాత్మక  సంస్కరణల దిశగా దేశంలోని అన్ని ప్రజాప్రభుత్వాలు సత్వరమే స్పందించడమే ముసలివారి పట్ల ప్రజాసేవకులు చూపించే మంచీ.. మర్యాదా!  

'మీకు ఎన్నాళ్లు బతకాలని ఉంది?' అనడిగితే  రష్యా  పరిసర  ప్రాంతాల మనుషులకు మల్లేనే అప్పుడు  మన దేశం నడిబొడ్డులోనూ ముసలితరం  పెదాలపై   ముసి ముసి నవ్వులు వెల్లివిరిసేది!  

*** 

తాతయ్యలు, నానమ్మలు/అమ్మమ్మలు  అయితేనేం?

డేమ్ జూలియా జూలీ ఎలిజెబెత్ ఏండ్రూస్ ఎనభైలు దాటినా గాయనిగా, నటిగా, నర్తకిగా, కవయిత్రిగా, దర్శకరాలుగా అటు హాలివుడ్, ఇటు రంగస్థలం రెండింటి పైనా తన ప్రభ  అప్రతిహతంగా సాగించారు. 

జేమ్స్ ఎర్ల్ జోన్స్ తన తొంభైలకు రెండేళ్లు ముందు వరకు .. మన బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ తరహాలో రకరకాల  పాత్రలతో ఆరు దశాబ్దాల పాటు అలుపూ సొలుపూ లేకుండా అమెరికన్ ఖండాలని అలరించారు. 53 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ కు తన తొంభై రెండో ఏట సారథ్యం వహించడమే కాదు, ఇంగ్లాండ్ చర్చ్ వ్యవస్థకు సుప్రీమ్ గా వ్యవహరించారు ఇంగ్లాండ్ రాణి ఎలిజెబెత్-2. బెట్టీ వైట్  వందేళ్లకు ఇంకా మూడేళ్లు ఉన్న వయసులో సైతం మనుమారాళ్ల వయసు నటీమణులను మించి చాలాకీగా బుల్లితెరపై కనిపిస్తూ గోల్డెన్ గర్ల్ గా జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. తెలుగు చిత్రసీమలో అక్కినేనివారు తన తొంభైల వరకూ చేసిన వయసు ఇంద్రజాలం ప్రపంచ సినీ రికార్డులకు సరితూగేది.  హెన్రీ కిసెంజెర్ (96), జిమ్మీ కార్టర్ (94). బోట్సీ రేవిస్(91), బెండిక్ట్ XVI (92), సిడ్నీ పోయిట్లర్ (92).. అంతా తొంభయ్యో పడి దాటినా ప్రభ ఏమీ మసకబారని టాప్ సిక్స్ ప్రముఖ వ్యక్తులు.  యమధర్మరాజు  నియంతలా వచ్చి  ‘చప్పున రండు' అంటూ  పాశం బైటకు తీసినా.. ' శతాయుష్మాన్ భవ అని కదా మీ  దేవతల దీవెన మానవుల పైన! నిండు నూరేళ్లూ పండనివ్వండి స్వామీ!' అనేపాటి గుండె దిటవు చూపగల గండర గండళ్ళ జాబితాలో  ముందు నుంచి లోకానికి సుపరిచితులైన  గోర్బొచేవ్ (92) నుంచి ఇప్పటి దలైలామా దాకా(84), విల్లీ మేస్(88), క్లింట్ ఈస్ట్ వుడ్ (89), యోకో వోనో (86), హ్యాంక్ అరోన్(85).. వంటి ఎందరో కాలాంతకులు కాలు మీద కాలు వేసి విలాసంగా జీవితం గడిపినవారున్నారు.  ఏ వత్తిళ్లూ లేని సాధారణ ప్రాణులం మనం మాత్రమే మరి ఎందుకు ముందే ఏదో పుట్టి మునుగుతున్నట్లు పెట్టే బేడా సర్దుకుని ప్రస్థానానికి సిద్ధమవడం?!

***

చిరంజీవులు ఉండరు!

  'భారతం రామాయణాలలో కూడా సమానంగా కనిపించే ఆంజనేయుడికి చిరంజీవిగా వరమున్నట్లు మనం పురానాలలో చదువుకునివున్నాం, వానరులకు వారసులమని చెప్పుకునే మనం మరెందుకు కనీసం వందేళ్లైనా జీవించలేక ముందే చాప చుట్టేయడం?' అంటూ ఓ జిజ్ఞాసి శిష్యుడు సంధించిన ప్రశ్నకు వైజ్ఞానికానందులవారు సెలవిచ్చిన  వివరణ వింటే 'మహోన్నతమైన మానవ జన్మ  వరం   శాపంగా మారడంలో  ఎవరి లోపం ఎక్కడ ఎంత పాలో  ఇట్టే అవగాహన అయిపోతుంది.  

చలనమున్న ప్రతిదీ క్రమేణా నిశ్చలంగా మారడమన్నది   ప్రకృతి నిక్కచ్చిగా పాటించే జీవనసూత్రం. పుట్టుట గిట్టుటకే అనేది పుట్టలోని చెదల నుంచి చెట్టు మీది పిట్ట వరకు అన్ని జీవులకూ  సమానంగా వర్తించే కాలనియమం.  విశాల విశ్వంలో నిజానికి ఎక్కడా చిరంజీవుల  ఉండేందుకు బొత్తిగా ఆస్కారం లేదు.  ఒక వంక 'జాతస్య మరణం ధృవం' అంటూ మరో వంక ‘చిరంతన’ భావనపై విశ్వాసం ఉంచడం  తర్క బుద్ధిని వెక్కిరించడమే! మరణం అంటే ఏమిటో అవగాహన లేకనే మనుషులలో ఈ తడబాటు.

 

 

జీవజాతుల మరణానికి విశ్వంలోని అంతరంగిక నియమాలూ ప్రధాన ప్రేరణలే. సృష్టిలో మారనిదంటూ ఏదీ లేదంటున్నప్పుడు జీవానికి మాత్రం ఆ సూత్రం నుంచి మినహాయింపు ఎట్లా  సాధ్యం?  

జీవులని, నిర్జీవులని పదార్దానికి రెండు రూపాలు.  నిర్జీవ పదార్థాలతో తయారయే జీవపదార్థం ప్రాణం. ఊపిరితో ప్రాణం ప్రయాణం కొనసాగుతుంది. ఉసురు అండ ఉన్నంత  వరకు నిర్జీవ పదార్థాలు తమ ధర్మాలకు భిన్నంగా ప్రకృతి నియమాలను అనుసరిస్తూనే ప్రకృతి నియమాలను ధిక్కరించి నిలిచే సామర్థ్యం ప్రదర్శిస్తాయి. ఆ సామర్థ్యం శాశ్వతంగా కోల్పోయే స్థితి పేరే ‘మృతి’. చావు అంటే జీవం చేసిన దోషంలాగా భావించడమే దురవగాహన. 

ప్రతీ ప్రాణికీ  నిశ్చేష్టత ఎప్పటికైనా తప్పని అంతిమ స్థితి.  భూమికి ఆకర్షంచే శక్తి ఉంది. ఆ బలంతో అందుబాటులో ఉండే ప్రతీ పదార్థాన్నీ తన కేంద్రకం దిక్కుగా లాక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటుంది. ప్రకృతి నియమాలలో అదీ ఒకటి, ఆ నియమాన్ని ధిక్కరించే శక్తి అదే ప్రకృతి జీవపదార్థానికి ఇవ్వడమే సృష్టి కొనసాగింపులోని అసలు రహస్యం.  జీవులు కిందికి లాగే  భూమి  ఆకర్షణ దిశగా వ్యరిరేకంగా పైకి పైకి   ఎదగడం ప్రకృతి ఇచ్చిన అండ చూసుకునే!  జీవం అట్లా పైకి ఎదగడానికి బలం కావాలి కదా! ఆ శక్తిని జీవం ప్రకృతి తన సూత్రాలకు లోబడే వాడుకోనిస్తుంది. శరీరంలోని అవయవాలు వేటికవే ప్రకృతి ఇచ్చే శక్తి(చెట్లు, ఇతర జీవులు నుంచి వచ్చే ఆహారం)ని అందుకునే ఒక రూపం దాలుస్తాయి. ఎదుగుతాయి. ఇది జీవం ప్రకృతి సూత్రాలకు లోబడి ప్రవర్తించడంగా భావించుకోవచ్చు.  కానీ విచిత్రంగా అట్లా రూపుదిద్దుకున్న అవయవాలు(కొమ్ములురెక్కలు, తోకలు వంటివి) అన్నీ ఒక చట్రం(శరీరం)లోకి కుదురుకున్న తరువాత ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. అదే శరీరం మొత్తంగా ఊర్థ్వ దిశగా ఎదగడం.  అట్లా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పైకి ఎదగడానికి శరీరాన్ని ఎక్కబెట్టేది శరీరంలోని జెన్యు సంకేత స్మృతి. జెనెటికి కోడ్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది.  ఈ జెన్యు సంకేతాలు శరీరంలోని డి.ఎన్.ఏ రచించి పెట్టుంచే పటం నుంచి వచ్చే ఆదేశాలే. ఈ డి.ఎన్.ఏ నిజానికి ప్రకృతికి వ్యతిరేకంగా ఏర్పడ్డ  ఒక  క్రమబద్ధమైన తిరుగుబాటు వ్యవస్థ. 

డి.ఎన్.ఏ వ్యవస్థ అటు ప్రకృతిపై తిరగబడుతూనే  ఇటు తను ఏర్పాటు చేసిన జీవ వ్యవస్థ తనపై తిరుగుబాటు చేయకుండా తన అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం తంటాలు పడుతుంటుంది.  (తమ వృత్తి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వంతో పోరాడే ఉపాధ్యాయుడు తన అధీనంలో ఉన్న తరగతి పిల్లలను క్రమశిక్షణ తప్పకుండా అదుపులో పెట్టుకోవడానికి సరితూగే చర్యగా భావించాలి డి ఎన్ ఏ తంటాలు సులభంగా అర్థమవాలంటే). పరస్పరం వ్యతిరేకంగా సాగే ఈ సంఘర్షణలు తనలో కొనసాగుతున్నంత కాలం బౌతికంగా కనిపించే శరీరంలో డి.ఎన్.ఏ తాలూకు జీవ వ్యవస్థ చురుకుగా ఉన్నట్లు లెక్క. గతితార్కిక భౌతికవాదన ప్రకారం ఇదే 'వ్యతిరేక శక్తుల మధ్య జర్రిగే సంఘర్షణ(కాంట్రాడిక్షన్ ఆఫ్ అపోజిట్స్). ప్రత్యేకంగా  కనిపించే జీవచైతన్యం(స్పెషాలిటీ), ప్రకృతి సాధారణత (జెనరాలిటీ) నడుమ జరిగే  తగాదాలో సాధారణతది ఎప్పుడు పైచెయ్యి అయితే ఆ క్షణం నుంచే శరీరంలోని జీవం స్థిభించిపోయినట్లు. ఆ బొంది తాలూకు వ్యక్తి కీర్తి శేషుడు అయినట్లు! 

ఇంత కథా కమామిషు  ఉన్న ‘మరణం’ వివిధ జీవ జాతులలో వివిధ పరిమితులలో ఉంటే, మనిషి జీవితకాలం విశేషాలేమిటి? అనే ఆసక్తికరమైన అంశం భారతదేశ వృద్ధుల జీవనపరిస్థితుల నేపథ్యంగా పరిశీలించడమే ఈ చిన్న వ్యాసం ఉద్దేశం!***

(కర్లపాలెం హనుమంతరావు)

(సూర్య దినపత్రిక  4, నవంబర్, 2019 ప్రచురితం)


Sunday, February 14, 2021

సేవ -కర్లపాలెం హనుమంతరావు -కథానిక

 




సెల్  మోగుతోంది అదే పనిగా! 

నెంబరు చూసి 'సారీ ఫ్రెండ్స్! మీరు కంటిన్యూ చేయండి! ఫైవ్ మినిట్సులో నేను మళ్ళీ జాయినవుతా!' అంటూ కాన్ఫెరెన్సు ఛాంబర్నుంచి బైటకొచ్చాడు సుబ్బారావుగారు.

'మీరు  ఇక్కడకు రావాల్సుంటుంది. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అన్ని విషయాలు ఫోన్లో డిస్కస్ చెయ్యలేం గదా!' అంది అవతలి కంఠం.

సుబ్బారావుగారికి పరిస్థితి అర్థమైంది. ఫ్లైటుకి టైము కాకపోవడంతో కారులో బైలుదేరారు. 'వీలైనంత వేగంగా పోనీయ్! బట్ బీ కేర్ ఫుల్!' అని డ్రైవర్ని హచ్చరించి సీటు వెనక్కి  వాలిపోయాడాయన.

సుబ్బారావుగారు విజయవాడ దగ్గర్లోని ఓ గాజు ఫ్యాక్టరీ యజమాని.  సంగం మిల్కు ఫ్యాక్టరీలో,  మార్కాపూరు పలకల ఫ్యాక్టరీలో ముఖ్యమైన వాటాదారుడు కూడా. తరాలనుంచి వస్తున్న చీరాల చేసేత  అమెరికన్ షర్టింగ్ ఎక్స్పోర్టింగు వ్యాపారం ఒకటి  నడుస్తోంది. ఆ పనిమీద ఒకసారి చెన్నై వెళ్ళివస్తూ తిరుపతి వెళ్లారు సకుటుంబంగా. పనిపూర్తి చేసుకుని ఘాట్ రోడ్ నుంచి దిగివస్తుంటే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లోయలోకి జారిపోయింది వాళ్లు ప్రయాణించే కారు. పెద్దవాళ్లకేమీ పెద్ద దెబ్బలు తగల్లేదుకానీ.. పిల్లాడికే బాగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో పెద్ద గాలివాన! కరెంటు తీగలు తెగి అంతటా కటిక చీకటి. దూసుకు పోయిన బస్సుకూడా కనుచూపుమేరలో లేదు. బిడ్డ ఏడుపు వినబడుతుందేగానీ.. ఆ చీకట్లో ఏ పొదలో చిక్కుకున్నాడో అర్థమవడం లేదు. భార్య ఏడుపుతో బుర్ర్ర అస్సలు పనిచేయడం మానేసింది. సెల్ ఫోనుకి సిగ్నల్ అందడం లేదు. 'బిడ్డను దక్కించు తండ్రీ! నీ కొండకు  వచ్చి నిలువుదోపిడీ ఇచ్చుకుంటా!' అని మొక్కుకున్నాడు సుబ్బారావుగారు.

ఆ దేవుడే పంపిచినట్లు కనిపించాడు సాంబయ్య అక్కడ ఆ క్షణంలో!  ఆ సమయంలో అతను అక్కడెందుకున్నాడో? కారు లోయలోకి జారే సమయంలో చెలరేగిన ఏడుపులు, పెడబొబ్బలు విని వచ్చినట్లున్నాడు. అలవాటైన చోటులాగుంది!  ఏడుపు వినిపించే లోతట్టులోకి అత్యంత లాఘవంగా  దిగి..  పొదల్లోనుంచి బైటకు తెచ్చాడు బిడ్డడిని.  రెస్క్యూ టీం ఆ తరువాత అరగంటకు వచ్చి అందర్నీ ఆసుపత్రికి చేర్చిందిలే కానీ.. ఆ సమయంలోగానీ సాంబయ్య చొరవ లేకపోతే పిల్లాడు తమకు దక్కే మాట వట్టిదే!


ఒక్కడే వంశోధ్ధారకుడు. అదీ పెళ్లయిన పదేళ్లకు ఎన్ని తంటాలు పడితేనోగానీ పుట్టలేదు. ఎన్ని  వేల కోట్లు, ఫ్యాక్టరీలుంటే మాత్రం ఏం లాభం? వంశాన్ని ఉద్ధరించేందుకు ఒక్క అంకురం అవసరమే గదా! సాంబయ్య ఆ పూట కాపాడింది ఒక్క పసిప్రాణాన్నే కాదు..  ఆగర్భ శ్రీమంతుడైన సుబ్బారావుగారి వంశం మొత్తాన్ని!


సాంబయ్యకు ఒక పదివేలు ఇచ్చాడు అప్పట్లో! తిరుపతి ఫారెస్టు ఏరియాలో దొంగతనంగా కంప కొట్టి అమ్ముకుని జీవనం సాగించే అశేషమైన బడుగుజీవుల్లో సాంబయ్యా ఒకడని తరువాత తెలిసింది. సాంబయ్యచేత ఆ పని మానిపించి బస్టాండు దగ్గర ఒక బంకు  పెట్టించాడు సుబ్బారావుగారు.

సుబ్బారావుగారు తిరుపతి ఎప్పుడు వచ్చినా సాంబయ్యను పిలిపించుకుని మంచి- చెడు విచారించడం అలవాటు. తన ఫ్యాక్టరీల్లో ఏదైనా పనిచేసుకోమని సలహా ఇచ్చినా ససేమిరా అన్నాడు సాంబయ్య 'ముసిలోళ్ళు తిర్పతి దాటి బైట బతకలేరయ్యా సామీ! ఈ వయసులో ఆళ్లనొదిలేసి నా దారి నే చూసుకోడం నాయవా?' అంటాడు. పని వత్తిళ్లమధ్య ఈ మధ్య తిరుపతి వెళ్లడం కుదరడం లేదు. సాంబయ్య కలిసి చాలా కాలమే అయింది.  ఇప్పుడిలా కలుస్తాడని కలలోకూడా అనుకోలేదు.


నెలరోజుల కిందట ఒకసారి తిరుపతినుంచి ఈ డాక్టరే కాల్ చేసి చెప్పాడు 'పేషెంటు ఫలానా సాంబయ్య.. అతని తాలూకు మనుషులు మీ పేరే చెబుతున్నారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సొచ్చిం'దంటూ.

కొత్త అసైన్ మెంటుని గురించి చర్చలు జరుగుతున్నాయప్పట్లో. ఇన్ కమ్ టాక్సు తలనొప్పుల్నుంచి తప్పించుకునే దారులు వెతుకుతున్నారప్పుడు ఆడిటర్సు. వాళ్ళు ఇచ్చిన సలహా  ప్రకారం ఆదాయం నుంచి కనీసం ఒక్క శాతంతోనైనా ఏదైనా ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటుచేస్తే రెండిందాలా లాభం. గుడ్- విల్ వాల్యూ పెంచి చూపించుకోవచ్చు. త్రూ ట్రస్ట్.. గవర్నమెంటు ఏజన్సీలతో  వ్యవహారాలు స్మూత్ అవుతాయి.  మెయిన్ బిజినెస్  ఇస్యూసుని తేలిగ్గా  సాల్వ్ చేసుకోవచ్చన్నది ఆ సలహా. ఎలాంటి ట్రస్టు పెట్టాలన్న దానిమీద చర్చ సాగుతున్నప్పుడే తిరుపతి నుంచి కాల్ వచ్చింది.

సుబ్బారావు తిరుపతి చేరేసరికి బాగా చీకటి పడింది. నేరుగా ఆసుపత్రికి వెళ్లాడు. బెడ్ మీద పడున్న సాంబయ్య అస్తిపంజరాన్ని తలపిస్తున్నాడు. తనకు పరిచయమయిన కొత్తల్లో పిప్పిళ్ల బస్తాలాగుండేవాడు. డాక్టర్ని కలిసాడు సుబ్బారావుగారు.

'సాంబయ్యకు డయాబెటెస్ టైప్ ఒన్. వంశపారంపర్యంగా ఉంది. ఇప్పుడు జాండిసూ  ఎటాకయింది. కిడ్నీలు రెండూ పనిచేయడం మానేశాయి. ఆల్మోస్టు లాస్ట్ స్టేజ్..'

'హెరిడటరీ అంటున్నారు. మరి వాళ్ళ పిల్లాడికీ…?'

'వచ్చే చాన్సు చాలా ఉంది. జువెనైల్ డయాబెటెస్ అంటాం దీన్ని. అబ్బాయికిప్పుడు ఆరేళ్ళే కనక బైటకు కనిపించక పోవచ్చు. ముందు ముందయితే ఇబ్బందే!'

ఎమోషనలయాడు సుబ్బారావుగారు 'ఏదన్నా చేయాలి డాక్టర్ సాంబయ్యకు! అతని భార్యను చూడ్డం కష్టంగా ఉంది. ఆ రోజు పొదల్లో మా బాబు పడిపోయినప్పుడు మా ఆవిడా ఇలాగే ఏడ్చింది'

'విధికి కొంత వరకే మనం ఎదురు ఈద గలిగేది. సాంబయ్యది హెరిడటరీ ప్రాబ్లం. ఆశ పెట్టుకొనే దశ దాటిపోయింది సార్! ఏం చేసినా ఆ పసిబిడ్డకే చేయాలింక!' అన్నాడు డాక్టరుగారు.

పలకరించడానికని వెళ్ళిన సుబ్బారావుగారిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు సాంబయ్య. ఏదో చెప్పాలని ఉందిగానీ అప్పటికే మాట పడిపోయిందతనికి. కొడుకు చేతిని పట్టుకుని పిచ్చి చూపులు చూసాడు పాపం!

'సాంబయ్యకు ఆట్టే బంధుబలగం కూడా ఉన్నట్లు లేదు. 'పిల్లాడి మంచి చెడ్డలు మనం చూసుకుందాం లేండి! వాళ్లకిష్టమైన చోట మంచి హాస్టల్లో పెట్టించి ఓపికున్నంతవరకు చదివిద్దాం.  ఆ కుటుంబానికి ఏ లోటూ రాకుండా ఏర్పాటు చేద్దాం. ఆ పూచీ నాదీ!' అన్నాడు సుబ్బారావుగారు తిరుగుప్రయాణమయేటప్పుడు  సాంబయ్య భార్య వినేటట్లు.


ఆ మర్నాడే సాంబయ్య పోయినట్లు కబురొచ్చింది విజయవాడకి.  ఆ విషయం చెబుతూ  ' మీరు వెళ్ళిపోయిన తరువాత నేనూ చాలా ఆలోచించాను సుబ్బారావుగారూ! పిల్లాణ్ణి హాస్టల్లో పెట్టి చదివించడం, జీవితాంతం వాళ్ళు నిశ్చింతగా బతకడానికి ఏర్పాట్లు చేయడం.. చిన్న సాయమేమీ కాదు. కానీ.. మీ లాంటి వాళ్ళు చేయదగ్గది.. మీలాంటి వాళ్ళు మాత్రమే  చేయగలిగే కార్యం ఒకటుంది సార్!' అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

'ఏమిటో చెప్పండి.. తప్పకుండా చేద్దాం.. వీలైనదైతే!' అన్నాడు సుబ్బారావుగారు.

'జువెనైల్ డయాబెటెస్ కి ఒక విరుగుడు ఉంది సార్! స్టెమ్ సెల్సుతో చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. పిల్లల వూడిపోయే పాలదంతాలను వూడిపోవడానికి ఒక పదిరోజులముందే తీసి భద్రపరిస్తే.. భవిష్యత్తులో  వచ్చే పెద్ద రోగాలకి చికిత్స చేయడం తేలికవుతుంది. పాలదంతాల్లోని మూలకణాల ద్వారా ఈ వైద్యం సాధ్యమేనని రుజువయింది. దంతాల పల్సులో ఉండే మూలకణాలని ముఫ్ఫై నలభై ఏళ్లవరకు భద్రపరిచే ల్యాబులు ఇప్పుడు ఇండియాలో ఢిల్లీ, ముంబై, పూనేవంటి నగరాల్లో పనిచేస్తున్నాయి. మా కొలీగ్ ఒకతను వాళ్ల పాప పాలపళ్ళు అలాగే ముంబై బ్యాంకులో డిపాజిట్ చేయించానని చెప్పాడండీ!'

సుబ్బారావుగారికీ ఆలోచన బాగా నచ్చింది. కంపెనీ తరుఫు నుంచి పంపించిన వైద్యులు  ఢిల్లీ  బ్యాంక్ పని విధానాన్ని పరిశీలించి సమర్పించిన పత్రంలో మరిన్ని అనుకూలమైన వివరాలు ఉన్నాయి. 'మూలకణాలు శరీరంలో కొన్ని భాగాల్లో ఎక్కువగా.. కొన్ని భాగాల్లో తక్కువగా ఉంటాయి. దంతాల వంటి వాటినుంచి ఒక రెండు మూడు మూలకణాలని రాబట్టినా చాలు.. వాటిద్వారా కొన్ని లక్షల కణాలని సృష్టించుకోవచ్చు. శరీరంలో పాడైన భాగాలను  ఈ కణాలు వాటికవే బాగుచేసుకుంటాయి. బొడ్డుతాడునుంచి మూలకణాలను సేకరించే విధానం చాలా కాలంనుంచి ప్రాచుర్యంలో ఉన్నదే. ఆ అవకాశం లేకపోయినవాళ్ళు నిరాశ పడనవసరం లేదంటున్నారు ఇప్పుడు. పాలదంతాల విషయంలో తగిన జాగ్రత్త పడితే ఫ్యూచర్లో బోన్ మ్యారో, కిడ్నీలవంటి వాటికి సమస్యలొస్తే పరిష్కరించుకోవడం తేలికవుతుంది'.

దంతాలనుంచి మూలకణాలను సేకరించి భద్రపరిచే స్టెమేడ్ బయోటిక్ సంస్థలు ఢిల్లీలోలాగా ముంబై, పూనా, బెంగుళూరు, చెన్నైలలో ఉన్నా..  విభజనానంతరం ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇంకా  ఏర్పడలేదన్న విషయం  సుబ్బారావుగార్లో  మరింత ఉత్సాహం పెంచింది.

సాంబయ్య కొడుక్కి ఆరేళ్లే. అతగాడి పాలపళ్లను గనక భద్రపరిస్తే భవిష్యత్తులో వాడికొచ్చే జువెనైల్ డయాబెటెస్ కి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఆ రకంగా సాంబయ్య రుణం మనం తీర్చుకున్నట్లూ అవుతుంది' అంది సుబ్బారావుగారి సతీమణి ఈ విషయాలన్నీ భర్తనోట విన్నతరువాత.

'నిజమే కానీ.. ఇది కాస్త  ఖరీదైన వ్యవహారంలాగుందే?  ప్రారంభంలోనే అరవై వేల వరకు వసూలు చేస్తున్నాయి ల్యాబులు! ఆ పైన మళ్ళీ ఏడాదికో ఆరేడువేలదాకా రెన్యువల్ ఫీజులు!'

సుబ్బారావుగారిలోని వ్యాపారస్తుడి మథనను పసిగట్టింది ఆయన సతీమణి. 

'సాంబయ్య మనింటి దీపాన్ని నిలబెట్టాడండీ! అతనింటి దీపం కొడిగట్టకుండా చూసే పూచీ మనకు లేదా?  మనకింత ఉంది.. ఏం చేయలేమా?' అనడిగింది భర్తను. 

భార్యదే కాదు.. భర్తదీ చివరికి అదే ఆలోచనయింది.

సుబ్బారావుగారికి ఛారిటబుల్ ట్రస్టు తరుఫున ఏంచేయాలో సమాధానం దొరికింది.  బోర్డు మీటింగులో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ప్రపోజల్ టేబుల్ చేసాడు 'సాధారణంగా కన్నవారు బిడ్డ పుట్టగానే  వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఆలోచిస్తారు. కలిగినవాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు.. సేవింగ్సు కాతాలు ప్రారంబిస్తారు. చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే స్పృహ మాత్రం ఇంకా మన సమాజానికి అలవడలేదు. పుష్టికరమైన ఆరోగ్యాన్ని అందించినంత మాత్రానే ఆరోగ్యభద్రత కల్పించినట్లు కాదు. ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే ఎంత సంపద ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతే! స్టెమ్ సెల్సుని సేకరించి భద్రపరిచే ల్యాబులను మన ట్రస్టు తరుఫున ప్రారంభిద్దాం. పేద పిల్లల పాలపళ్లను సేకరించి వాటినుంచి మూలకణాలని రాబట్టి భద్రపరిచే ఏర్పాట్లూ చేయిద్దాం. ఇదంతా ట్రస్టు తరుఫున మనం సమాజానికి అదించే ఉచిత సేవా సౌకర్యం'

సభ్యులంతా ఆమోదపూర్వకంగా బల్లలమీద చిన్నగా చరిచారు.

సుబ్బారావుగారి సంస్థల తరుఫున ప్రారంభమయిన మూలకణాల సేకరణ, భద్రత ల్యాబు ప్రారంభోత్సవంలో లాంఛనంగా డిపాజిట్ చేయబడిన మొదటి స్పెసిమన్ సాంబయ్యకొడుకు పాలపళ్లనుంచి సేకరించిన మూలకణాలే!

సాంబయ్యకొడుకు మంచి హాస్టల్లో చేరి చక్కగా చదువుకొంటుంటే.. సాంబయ్యభార్య ట్రస్టువారి  బ్యాంక్ ల్యాబులోనే పనికి చేరింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితం)

బోథెల్, యూఎస్ఎ

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...