Saturday, June 20, 2015

యోగా గొప్పతనం - సీరియస్లీ సిల్లీ స్టోరీ

(జూన్ 21 ప్రపంచ యోగాదినోత్సవమే కానీ.. ఆ ఉత్సాహం అన్నార్తుడి కడుపులో ఏదీ?!)
"ఏటా సంక్రాంతికి మా  వూళ్ళో రివాజుగా జరిగే జాతరలో ముఖ్య ఆకర్షణ తిండిపోతుల పోటీ. చెయ్యి ఆపకుండా.. అరగంటలో ఎవరెక్కువ ఇడ్డెన్లు చట్నీల్లేకుండా లాగిస్తాడో.. వాడే 'భీముడు'. వంద కొబ్బరికాయలను వంటి చేత్తో పగలేసి లోపలి గుజ్జుతో సహా నీళ్ళన్నీ చుక్క కింద పడకుండా అతి తక్కువ సమయంలో స్వాహా చేసినవాడు 'బకాసురుడు'. తొక్క వలవకుండా అరటి పండ్లు తినడం, టెంకె వదలకుండా  మామిడి పండ్లు  మింగడం, పెంకు తియ్యకుండా కోడిగుడ్లు   నమలడం.. లాంటి విన్యాసాలన్నీ చిన్నతనంనుంచే  మా దగ్గర ప్రోత్సహించే విద్యలు. మా ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ   తిండిపొటీలో 'భీముడు' 'బకాసురుడు' బిరుదులు సాధించడమే అంతిమ  లక్ష్యం. ఐఐటీలో దేశం మొత్తం మీదా మొదటి ర్యాంకొచ్చినా మేం పట్టించుకోం. నెలకి రెండు కోట్లొచ్చే ఉద్యోగం సాధించినా.. 'ఆహా!'.. అలాగా.. అని వూర్కే తలెగరేసి వూరుకుంటామే.. గానీ హారతులు గట్రాల్లాంటివేమీ పెట్టుకోం. ఏటా  జరిగే భీమయ్య తిరణాల్లో మహా వైభవంగా నిర్వహించే తిండిపోతుల పొటీల్లో విజేతలైతే మాత్రం బ్రహ్మరథం పట్టామన్నమాటే.
ప్రధాన మంత్రి.. బకాసురుడు ఒకేరోజు ఒకే సమయంలో  మా ఊళ్ళో సభ తీరితే మూడొంతుల జనాభా తిండిపోతును చూట్టానికే ఎగబడేది. ఎన్నికల ప్రచారాలప్పుడు అందుకే ఎంత పెద్ద అభ్యర్థైనా సరే తమ వెంట ఇతర జిల్లాల్లో మాదిరి  ఏ పవన్ కళ్యాణో.. బాలయ్యబాబో.. ఉండాలని కోరుకోరు. భీమయ్యో, బకాసరుడో పక్కనుండి చెయ్యూపుతోంటే  చాలు ఫలితాలు అవే అనుకూలంగా వస్తాయనే గట్టి నమ్మకం"

"మీ బకాసురుణ్ణి, భీముణ్ణి ఒక్క నెలరోజులు మా వైపుకి వచ్చి  పొమ్మనండి. బక్కాసురులుగా మారడం ఖాయం"

"ఇన్ని కరవులొచ్చాయి. కాటకాలొచ్చాయి. హుద్ హుద్ తుఫానులొచ్చి వూళూ.. పూళ్ళూ వారాలకు వారాలు నిరాహారంగా అలమంటించాయి. ఐనా  మా వూరి తిండిపోతుల జిహ్యపుష్టినవేమీ చెయ్యలేక పోయాయి స్వామీ!"

"మెహిదీపట్నం రైతుబజారు పక్కనే  మొన్నీమధ్య నడిరోడ్డు మీద  సగం తెరిచున్నచేతిసంచీ ఒకటి పడివుందన్న వార్తొకటి పెద్ద సంచలనం సృష్టించింది. ఆ కథ ఆసాంతం మీ దాకా వచ్చినట్లు లేదు.. పాపం! అందుకే సోదరా ఈ కోతలు."

"ఆ సంచీలో బాంబులేవో ఉండుంటాయి. దానికీ మా తిండిపోతులకీ సంబంధమేముందబ్బీ?"

"ఉంది కాబట్టే..ఇప్పుడీ  ముచ్చట"

"సరే..ఇంతకీ సంచీలో బాంబులున్నాయా లేవా నిజంగా? ఉత్తుత్తి భయమేనా?"

"అది తెసుసుకోవాలంటే ముందుగా 'తొక్క సందేశం'లో ఏముందో ఓపిగ్గా వినాలి!"

"మధ్యలో ఈ తొక్క సందేశం ఏమిటి మహానుభావా?"

"ఆ సంచీలో ఒక ఉల్లి గడ్డ ఉంది. దాని మీద రాసున్న సందేశంలే అది. మరి ‘తొక్కసందేశం’ కాక తోలుసందేశం అవుతుందా? విను ముందు.. ఆనక సందేహాలు.

"వినిపించు మరి!"

"పెళ్ళిళ్ళ జోరు ప్రారంభమైంది. అసలే మండిపోతున్న కూరగాయలకి  మరిన్ని కొత్త  రెక్కలు పుట్టుకొచ్చాయి. మంచి రోజులూ ఇప్పుడే  వచ్చి పడడంతో మాలాంటి సామాన్యులకి చెడ్డరోజులు మొదలయ్యాయి. పోయిన ఏడాది సరిగ్గా ఇదే తిథికి మా నాయన పోయాడు.. పైకి.. ఆకలి జబ్బుతో. పోయే ముందు మా అయ్య అలమటించింది  తులసి తీర్థం కోసం కాదు. ఇన్ని ఉల్లి చారునీళ్ళ కోసం కన్నీళ్ళు పెటుకున్నాడు. ఆయన కడసారి కోరికను తీర్చడం కన్నబిడ్డగా నా ధర్మం అనుకున్నాను. భార్యలకి గుర్తుగా భర్తలు  తాజ్ మహళ్ళు కట్టించిన పుణ్య భూమి ఈ దేశం. కనీసం ఉల్లి చారు నీళ్ళైనా కన్నతండ్రి ఆకలికి గుర్తుగా అన్నార్తులకు పంచకపోతే నాకీ జన్మెందుకు?  మొదటి వర్థంతి రోజునైనా సరే ఎలాగైనా  నాయన చివరి కోరిక తీర్చి తీరాలనుకున్నాను.ఇల్లు తనఖా పెట్టిన సొమ్ముకు అదనంగా  బ్యాంకు ఖాతాలో ఉన్నమొత్తమంతా ఊడ్చుకుని ఊళ్ళో ఉన్న అన్ని  రైతుబజార్లూ తిరుగుతున్నాను. కూరగాయల ధరలు ఎలా మండుతున్నాయో తెలుసు కుంటే గుండె మండిపోదు.. ఆగిపోతుంది. పచ్చి మిర్చి కిలో ముప్పై ఏడు. చిక్కుడు నలభై ఏడు. కొన్ని చోట్లైతే డెబ్భై ఏడుమీద ఏడు. బెండ మూడు తక్కువ  ఇరవై ఏడు. ఈ 'ఏడు’పులకి ఆంధ్రా.. నైజాం.. సర్కారు.. సీడెడ్.. తేడాలేదు. కడపలో జనాలకి  కడుపులు మంట. గుంటూరులో ప్రజలకి గుండెల్లో కోత. ఏలూరు పౌరులకు కళ్ళు బైర్లు. అటు తెలంగాణా కరీంనగరు వాసులకు  కాకరకాయే కాదు మామిడికాయా కనరు. క్యారెట్.. క్యా ‘రేట్’.. మాలూమ్.. హై? ఒకటెక్కువ నలభై ఏడు. హైదరాబాద్ మే ఇరవై ఏడు. కాలీ ఫ్లవరు ఏడు తక్కువ నలభై ఏడు. రాజధానిలో ఐదు తక్కువ పదిహేడు. బీరకాయో? నలభై ఏడు.”

“బీరుకాయా .. నలభై ఏడా?!”
“బీరుకాయ కాదయ్యా? బీరకాయ. కనకే ఈ ధర. బంగారం ధర పెరిగితే  కంగారు కొద్దిమందికే.  పెట్రోలు..గ్యాసు ధరలు పెరుగుడు తరుగుడు అంటే.. పోనీలే..  ఏదో అంతర్జాతీయ బజార్లకి అనుసంధానమనో..నా బొందనో..  సరి పుచ్చుకు చావచ్చు. రేపటికి పుచ్చిపోయే వంకాయలకీ..ఎల్లుండికల్లా కుళ్ళిపోయే టమోటాలకీ టాటా.. హొండా కార్లధరలతో పోటీ ఏంటంట? పంటల దిగుబడికీ  ఎవరితో సంబంధముంటుందనీ.. మండీల ధరలు  ఇలా మండిపోతున్నాయో చెప్పండీ! పర్యావరణ నిర్వహణ సూచీట- రెండువేల పన్నెండులోనట మన తెలుగునేలే ప్రథమ స్థానంలో ఉందట! నాణ్యమైన గాలి, నీరు, అత్యుత్తమమైన అనుకూల విధానలను అవలంబిస్తున్న ఘనత దేశంమొత్తంలో మన ఉభయరాష్ట్రాలదేనట! లోకసభలో  కోసుకోవడానికి పనికొస్తాయేమో కానీ ఈ లేత లేత సొరకాయలు.. లోకల్ మార్కెట్లలో ముదురు మునక్కాడలు కూడా ఐదుకి రెండు తూగడం లేదు! ఆ ప్రణాళిక మంత్రి గారెవరో గానీ.. ఒకసారిలా  మన  రెండు రాష్ట్రాల   నాలుగు మూలలా తిప్పాలి. నాలికమీదకి రుచికి రాసుకునే నిమ్మబద్ద ధర విన్నా గుండె బద్దలైపోవాలి. చారెడు రూకలు పోసినా చారులోకిన్ని  ఉలవలు వచ్చి చావడం లేదిప్పుడు! పచ్చకార్డువాడినలా తగలడనీయండి.. తెల్ల కార్డువాడైనా బతికి చచ్చే దారుందా? బియ్యం ఓ పది కిలోలు ఆమ్ ఆద్మీ సంచీలో ఇలా  పోసేసి 'అమ్మయ్య' అనుకుంటే సమస్య పరిష్కారమైపోతుందా? దాని దుంప తెగ.. దుంపలూ ఆకాశానికి వేలాడుతున్నాయయ్యా! ఆకలి వేస్తున్నవాళ్ళందరూ కేకలయాత్రలో.. కూకలజాతర్లో చేయలేక పోవచ్చు కానీ.. నోరు మూసుకునికూడా కూర్చో లేరు కదా! ఆ సంగతి తెలుసుకోవాలనే ఈ పని చేసింది.."

"ఏం పని చేసింది? తొందరగా చెప్పు! సందేశమంతా చదవక్కర్లేదు. ఉద్దేశం అర్థమైందిగా! ఇంతకీ ఆ సంచీలో బాంబులున్నట్లా? లేనట్లా?"

"ఉన్నాయయ్యా మహానుభావా. ఒకటి కాదు. రెండు కాదు. కిలో.. సంచీ నిండుగా"

"బాబోయ్.. నిజంగా ఇది సంచలనమే!"

"నిజం సంచలనం అదికాదు మిత్రమా! ఆ బాంబుల అడుగున ఒక తొక్కల ఉల్లిగడ్డ కూడా ఉంది. మొగ్గుగా వేసినట్లుంది! ఆ తొక్కలోని ఉల్లిగడ్డకే చుట్టున్నది ఇప్పటిదాకా నేను అప్పచెప్పిన సందేశమంతా. 'నా ఆస్తంతా అమ్మేస్తే వచ్చింది ఈ ఉల్లి తొక్కు. ఇంకో తొక్కా వచ్చునేమో కానీ.. దానికి బదులుగా  ఈ చేతిసంచీ నిండా బాంబులు ఖరీదు చేసా. తెల్లారే సరికల్లా   రెండు రాష్ట్రాల్లోని అన్ని  మార్కెట్లలో  కూరగాయలధరలు ఠకీమని పడిపోవాలి. ఒక్కరోజే గడువు. తెల్లకార్డుదారులందరికీ అందివచ్చే సకలచర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద జరిగి పోవాలి. అలా  జరిగిపోలేదని నాకు అనుమానం వచ్చిన  పక్షంలో.. ఈ చేతి సంచీలాంటివే మరిన్ని    మిగతా చాలా చోట్ల పేలడం ఖాయం' అని  రాసుంది".

"ఈ మధ్య అలాగా బాంబులేవీ  ఎక్కడా పేలినట్లు వార్తల్ల్లేవే!"

"అనగా సర్కారువారు   కూరగాయల ధరలు కారు చవుకస్థాయికి దింపే చర్యలు నిజంగానే యుద్ధప్రాతిపదిక మీద చేపట్టారని అర్థమా! అదే నిజమైతే  మా ఊరికొస్తే మీ బకాసురుళ్ళూ, భీముళ్ళూ బక్కాసురుళ్లవుతారని పందెం ఎందుకు కాస్తాను మిత్రమా?"

"నీ కథ పూర్తిగా చెప్పేసే ఆత్రంలో నా కథ నువ్వింకా పూర్తిగా విననేలేదయ్యా మిత్రమా! ఎన్ని కరవులొచ్చినా.. ఇంకెన్ని కాటకాలు.. వరదలొచ్చి వూళూ పూళ్ళూ వారాలకు వారాలు నిరాహారంగా అలమంటించినా.. మా ఊరి తిండిపోతులకు ఢోకాలేదన్నానే కానీ.. వాళ్ళు తింటున్నది అన్నమనో.. కాయగూరలనో..పళ్లనో..పుష్టికరమైన ఫలహారాలనో అని గాని అన్నానా? కరవులూ.. కాటకాలూ.. వరదలూ.. వర్షాలూ.. మా దగ్గర మాత్రం తక్కువా నాయనా! పూర్వపాలకుల పుణ్యమా అని బతకడానికి మా ప్రాంతంవాళ్ళం  సాంప్రదాయికమైన ఆహార విధానాలకు ఎప్పుడో స్వస్తి చెప్పేసాం.   ప్రత్యామ్నాయ విధానాలను
కనుక్కుని ఆచరణలో పెడుతున్నాం ఇప్పుడు. చెడిపోయిన ట్యూబ్ లైట్లు, ఇనుము, తుక్కు సామాను ఇవే మాకిప్పుడు ముఖ్యాహారం. ఇవేవి  దొరకనప్పుడూ ఇసుక, సున్నం, మట్టీ, మశాన్నమే మాకు అన్నం. ఏలిన వారి పుణ్యమా అని ఇసుకలాంటి వాటికీ కరువు రావచ్చన్న ముందు చూపుతో.. ఇప్పుడిప్పుడే కేవలం వాయుభక్షణం మీదే జీవనం కొనసాగించే యోగావిద్య  అభ్యసిస్తున్నాము. మోదీజీ ఐరాసలో చెప్పిందాకా యోగా గొప్పతనం ప్రపంచానికైతే పట్టకపోవచ్చు గానీ.. మా ప్రాంతంవాళ్ళకి  ఈ విధానాలు ఎప్పట్నుంచో చిరపరిచితం. ఇప్పటి దాకా చెప్పానే.. భీముడూ.. బకాసురుడూ.. అని  ఆ బిరుదులు సాధించిన మొనగాళ్ళే  మాకిప్పుడు వాయుభక్షణ శిక్షణ ఇచ్చే గురువులు కూడా!"
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాల పత్రికలోప్ర చురితం)

***

అదీ కామెడీ- ఓ సినిమా తారుమారు తమాషా


ఇప్పుడంటే మొదలైనప్పట్నుంచీ పూర్తై హాలు బైటికి వచ్చేదాకా హోరెత్తించే ‘సౌండు’ కానీ.. చలనచిత్రాల మొదటి దశ మూగది. 
తెరమీద బొమ్మలాడుతుంటే అనువాదకుడు హాలు మూల నిలబడి పెద్ద గొంతేసుకుని తనకు తోచిన వ్యాఖ్యానం చేస్తుండేవాడు. అప్పట్లో వచ్చినవన్నీ ముంబై.. కలకత్తా మార్కు హిందీ.. బెంగాలీ ‘మేకు’లు. కనక ఈ అనువాదకుడి సాయం మన ప్రేక్షకులకు అవసరమయేది. అప్పట్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది. సంఘటన పాతదే ఐనా.. అందులోని హాస్యం మాత్రం సదా తాజాదే. చిత్తగించండి చిత్తమున్నవారు.
ఒక హిందీ సినిమా మొదటి రోజు మొదటి ఆట మ్యాట్నీ మొదలైంది ఒక తెలుగు వూళ్ళో. బాక్సు చివరి నిముషంలో రావడం వల్ల హాలు వాళ్ళకు వేసుకుని చూసుకునే సావకాశం లేక పోయింది. వచ్చిన రీళ్ళను ఆదరాబాదరాగా ప్రోజెక్టరు ఆపరేటరు రోలర్ల్లకు చుట్టేసి సినిమా మొదలు పెట్టేసాడు. 
కథ నడుస్తోంది. అనువాదకుడు భీభత్సంగా అనువాదం చేసి పారేస్తున్నాడు తనకు తోచిన పదజాలంతో. చివరికి అన్ని చిత్రాలలో లాగేనే కథానాయికను నానాతిప్పలు పెట్టిన ప్రతినాయకుడు ముష్ఠియుద్ధంలో కథానాయకుడి చేత చితకబాదించుకుని.. ఎలాగైతేనేం.. చచ్చాడు చివరికి. అనువాదకుడు తన వ్యాఖ్యానంతో రెచ్చి పోతూ స్వస్తి వాక్యాల్లో ఇలాగా నీతి బోధ మొదలుపెట్టాడు "అంతిమ విజం న్యాయానికి, నీతికే లభిస్తుందని మరో సారి రుజువైంది. ఎంత కాలం దుష్టుల ఆగడాలు చెల్లుతాయి?! చెల్లవు. చెల్లనే చెల్లవు! ఈ చిత్రంచెప్పేది అదే నీతి” అంటూ. జనం లేచారు హుషారుగా ఈలలేసుకుంటో సినిమా ఐపోయిందని. 
కానీ..
చచ్చిన ప్రతినాయకుడు.. ఎలా బ్రతికి వచ్చాడో?! మద్యం తాగుతూ.. వికటాట్టహాసాలతో కథానాయికను తెగ చెర బట్టేస్తున్నాడు! తెల్ల బోవడం ప్రేక్షకుల వంతయింది. 

చితకబాదుదామనుకుంటే అనువాదకుడు ఏడీ? ప్రాజెక్టు రూంలోకెళ్ళి నక్కి కుర్చున్నాడు.

(రీళ్లుచుట్టే హడావుడిలో ఎలా జరిగిందో ఏమో కానీ..చివరి భాగం ముందుకి.. ముందు భాగం చివరికి తారుమారయాయండీ!.. అదీ కామెడీ  )

తెలుగు ఏ విధంగా దరిద్రపు భాషఅయిందో?!






నన్నయగారి పున్నెమాఅని మన తెలుగుభాషలో ఆంగ్లభాషకన్నా

సుసంపన్నమైన పదజాలం చాలానే పోగుపడింది. సంస్కృతం అయితేనేమి?
విభక్తి ప్రత్యయాలుచేర్చి, ఒక వ్యాకరణం సృష్టించి, మెరుగులుదిద్ది, భాషా స్వరూప స్వభావాలను స్థిరపరచి.. తెలుగుపలుకుకి నన్నపార్యుడు ఒంటి చేత్తో చేసిన భాషాసేవ ఇవాళ పది అకాడెమీలు,  డజను విద్యా పీఠాలు మొత్తంకలసి ఒక పంచవర్షప్రణాళిక  సొమ్మంతా మేసినా..  ఎంతవరకు నిర్దుష్టంగా సాధిస్తాయో? సందేహమే!
అయినా తెలుగువాడికి తెలుగుభాషంటే చాలా చులకన! ఆంగ్లంతో నిత్యం పోలికపెట్టి తేలిక చేసుకోవడం.. అదో భేషజం! మనది కాని ఆ దొరలభాషమీద దొరలకు మించిన మోజు! ఎంత పడీ పడీ ఆసాంతం నేర్చేసుకున్నామనుకొన్నా ఆ జ్ఞానం సర్వస్వం మనతెలుగువాజ్ఞ్మయం  ముందు- గుమ్మడిపండు పక్కన ఆవగింజంత.
మాతృభాషమీద వెర్రిప్రేమతో యథాలాపంగా చేసే ప్రేలాపనలు కావు ఇవి. తెలుగుభాష సుసంపన్నతకు  చాలా ఉదాహరణలు తీసి చూపించ వచ్చు. ప్రస్తుతానికి ఈ ఒక్కటి చిత్తగించండి.. సరదాకి!
ఇంగ్లీషుభాషలో కొడుకు అనే పదానికి 'son' అని ఒక్కడే ప్రయోగం. అదే మనతెలుగు భాషకు అయితేనో?
పన్నెండు రకాల పుత్రులున్నారు.

ఔరసుడు             భార్యయందు తనకు పుట్టినవాడు.
క్షేత్రజ్ఞుడు             పెద్దలఅనుమతితో బావగారితోగాని,                          మరదితోగాని పొందిన సంతానం
                                          
దత్తుడు                దత్తతతీసుకున్న బిడ్డ
కృత్రిముడు            అభిమానంతో పెంచుకున్న బిడ్డడు
గూఢోత్పన్నుడు      రంకుమొగుడికి పుట్టినవాడు
అపవిద్ధుడు           తండ్రిగాని తల్లిగాని విడిచేస్తే తెచ్చిపెంచుకున్నవాడు
కానీనుడు             కన్యగా ఉన్నప్పుడు రహస్యంగా ఇతరునికి పుట్టినవాడు
సహొఢజుడు           గర్భిణీగా ఉన్నప్పుడు చేసుకున్నభార్యకు పుట్టినవాడు
క్రీతుడు                తల్లిదండ్రులకు డబ్బిచ్చి తెచ్చుకున్నబిడ్డడు
పునర్బవుడు         మారుమనువుబోయిన స్త్రీకి పుట్టినవాడు
జ్ఞాతిరేతుడు          దాయాది కొడుకు
స్వయందత్తుడు      తనంతటతానుగా పుత్రుడిగా ఉంటానని వచ్చినవాడు

ఇప్పుడుచెప్పండి! 'తెలుగు ఏవిధంగా దరిద్రపుభాష అయిందో?!'


తెలుసుకోకుండా తెలివితక్కువగా ఆత్మగౌరవం సంగతి కూడా మరచి  తల్లిభాషను గురించి తక్కువచేసి మాట్లాడటం మనకు తగునా?!

Thursday, June 18, 2015

ఆపరేష(షా)న్ ! - సీరియస్లీ సిల్లీ స్టోరీ




మా కొలీగ్ సుబ్బారావు తనకు వంట్లో బావోలేదని ఆసుపత్రికి వెళుతుంటే నేనూ తోడు వెళ్ళా.
బైట బోలెడంత క్యూ. గంటకయినా లోపలికి పోవడం అనుమానమే. ఆఫీసుకి టైమయిపోతుందని నేను కంగారు పడుతుంటే కారిడార్లలో గుర్నాథం కనిపించాడు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు.
గుర్నాథం హైస్కూల్లో నా క్లాస్ మేట్. చాలా ఏళ్ళతరువాత అనుకోకుండా ఇక్కడ కలిసాడు. నేను వచ్చిన పని కనుక్కొని చనువుగా 'డాక్టరుగారు నాకు బాగా తెలుసులేరా! నువ్వెళ్ళు! మీ ఫ్రెండు పని నేను చూస్తాలే!' అన్నాడు.

ఆ సాయంత్రం సుబ్బారావు గుర్నాథాన్ని ఒహటే పొగడటం! 'మీ ఫ్రెండుకి మా చెడ్డ ఇన్ఫ్లుయన్సుందండీ! చకప్పులూ అవీ చకచకా చేయించేసాడు. రిపోర్టులు తీసుకొని తనే వస్తానన్నాడు' అన్నాడు సంబరంగా.
గుర్నాథం స్కూలురోజుల్లో యావరేజి. వెనుక బెంచీలో కూర్చోని ఎప్పుడూ ఏవేవో పెన్నులు రిపేరు చేస్తుండేవాడు. వాడి సంచీలో పుస్తకాలు అన్నీ ఉన్నా లేకపోయినా.. రకరకాల కలం కేపులు, పాళీలు, నిబ్బులు, సిరాబుడ్డి, చెత్తగుడ్డపీలికలు మాత్రం నిండుగా ఉండేవి. మూడుపైసలకు కేపు, రెండు పైసలకు నిబ్బు, పైసాకి పాళీ.. పెన్నుమొత్తమయితే అణా.. అలా అమ్మేవాడు పాత కలాలని. అణాలు, పైసలు చలామణిలో ఉండే జమానాలేండి అది. అప్పట్లో ఇప్పట్లా బాల్ పెన్నులు కాకుండా సిరా నింపుకొని రాసుకొనే రకం కలాలు వాడకంలో ఉండేవి. మా మాస్టార్లుకూడా ఈ గుర్నాథం బుట్టలో పడుతుండేవాళ్ళు! అవసరం వచ్చినప్పుడు వాడు వాళ్ళకీ పేనాలు ఉచితంగా తయారు చేసిస్తుండేవాడు.  అందుకని ఏమనేవాళ్ళు కాదు.
పదో తరగతి పరీక్షలు రాసే రోజుల్లో సమాధాన పత్రాలు తారుమారు చేసాడని డిబారు చేసారు వాణ్ణి. ఆ తరువాత ఇదిగో ఇప్పుడే.. మళ్ళీ దర్శనం!
గుర్నాథం తెచ్చిన రిపోర్టులు చూసి గుండె ఆగిపోయినంత పనయింది  సుబ్బారావుకి. కిడ్నీలో ప్రాబ్లమున్నట్లు తేలింది. 'ఆపరేషన్ అవసరమంటున్నాడు డాక్టర్' అన్నాడు గుర్నాథం తాపీగా.
కిడ్నీ ట్రాన్సప్లాంటేషనంటే మాటలా? దానికి ముందు డయాలసిస్. డయాలసిస్ అంటే లక్షల్లో వ్యవహారం. ముందు డోనర్ దొరకడమే గగనం. కిడ్నీదాత బంధువు కాకపోతే ఆథరైజేషన్ కమిటీ అప్రూవల్ అవసరం. అదంత తేలికగా తెమిలే వ్యవహారం కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్లు రిస్కు తీసుకోవడానికి బాగా జంకుతున్నారు. మరీ ఈ మధ్య ఈ కిడ్నీ కేసుల చుట్టూతా గవర్నమెంటు నిఘా  పెరిగిన తరువాత.
'కేసులవుతాయేమోనని భయం. అవన్నీ నేను చూసుకొంటాగాని.. మనీ సంగతిమాత్రం మీరు చూసుకోండి' అని అభయమిచ్చాడు గుర్నాథం.
'ఎంతవుతుందేమిటీ?'  సుబ్బారావు సందేహం.
'సుమారు నాలుగయిదు లక్షలు'
'అమ్మో! గవర్నమెంటు ఉద్యోగినికూడా కాదు. ఎక్కణ్ణుంచి తవ్వి తేవాలీ అంత డబ్బు?' అంటూ సుబ్బారావు గుండెలు బాదుకొన్నాడు. '
'ఇదింకా చీపండీ! లివరయితే ఏడు లక్షలు. హార్టు, లంగ్సు ఆపరేషనయితే అంతకు రెట్టింపు. కంటిగుడ్డుకు వాడే కార్నియానే ఐదు లక్షలు పోస్తేగాని దొరకడంలేదు మార్కెట్లో'
రైతుబజారులో కూరగాయల దరవరల్లాగా ఏకరువు పెడుతున్నాడు గుర్నాథం.
'చూస్తూ చూస్తూ వంట్లోని పార్టుల్ని ఎవరమ్ముకొంటార్రా? ఏదో సినిమాల్లో అలా చూపిస్తుంటారుగానీ' అన్నాను నేను అక్కడికీ నమ్మకం కుదరక.
'పేదరికం ఎంత పనయినా చేయిస్తుంది బాబూ! మెదడు చచ్చిపోయినా గుండె కొట్టుకొంటుంటే చాలు.. ఇలా చాలా అవయవాలని తీసి హాయిగా వాడుకోవచ్చు. ఇవాళా రేపూ ఆ వ్యాపారం బాగా ఊపందుకొందికూడా మిత్రమా! పేపర్లలో వచ్చేవే వార్తలు కావురా బాబూ! వాటికి వెనకాల సమాంతరంగా అంతకుమించిన ప్రపంచం పరుగెడుతోంది' అన్నాడు గుర్నాథం.
'ఎంత అన్యాయం!' గుండెలమీద చెయ్యివేసుకొన్నాడు సుబ్బారావు తబ్బుబ్బయిపోతూ.
'ఇందులో అన్యాయం ప్రసక్తేముంది?అవసరం అలాంటిది. ఇంద్రుడు వజ్రాయుధంకోసం దధీచి పక్కటెముకలు లాగేసుకోలా? కవచకుండాలలనికూడా దానం చేసిన కర్ణుడికథ మనకు కొత్తా? డబ్బు పడేస్తే లివర్లయినా ఫ్లవర్లలో పెట్టి ఇస్తున్నారు సార్ ఈ కాలంలో! గుండెకాయలు బెండకాయల్లా, కంటిగుడ్లు కోడిగుడ్లలా మారకం జరిగిపోతున్నాయి. యూరప్ లాంటి డెవలప్డ్ కంట్రీసులో అయితే ఏకంగా 'యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గాన్స్ సేల్' అని భారీ నెట్ వర్కే నడుస్తోంది బ్రహ్మాండంగా’.
'చట్టం చూస్తూ వూరుకొంటుందా?!’
'ఎందుకూరుకొంటుంది సార్? తనపని తాను చేసుకు పోతుంటుంది. నెట్ వర్కూ తనపని తాను చేసుకు పోతుంటుంది. ఇక్కడిలాగానేఒకరి పనిలో ఇంకోరు జోక్యం చేసుకోకుండా డబ్బుమూట చూసుకొంటుంది'
గుర్నాథం చెప్పిందాంట్లో అతిశయోక్తేమీ లేదనే అనిపిస్తోంది. డబ్బుకు చట్టం చుట్టం కానిది ఎక్కడలేండి?! ప్రాణంతీపిముందు ఎన్ని ధర్మపన్నాలైనా చేదుగానే ఉంటాయికదా!
'మీరు ఆలోచించుకొని కబురు చేయండి!.. వస్తా!' అని విజిటింగ్ కార్డొకటి ఇచ్చి కాఫీతాగి వెళ్ళిపోయాడు గుర్నాథం.

సుబ్బారావుగారింట్లో రెండు రోజులు ఒహటే మల్లగుల్లాలు. పాపం! సుబ్బారావు గవర్నమెంటు ఉద్యోగైనా కాదు.. కనీసం ఖర్చులైన్నా రాబట్టుకోడానికి. ఇంట్లోని బంగారం, ఊరి బైట అప్పుడెప్పుడో కొనుక్కున్నస్థలం అమ్మైనా సరే .. ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనని పట్టుపటుకు కూర్చొంది సుబ్బారావుభార్య. 
గుర్నథాన్ని పిలిపించి పరిస్థితి వివరించాం. ‘ఉన్నంతే ఇవ్వండి. మిగతా సర్దుబాట్లేవన్నా ఉంటే చూసుకోడానికి నేనున్నాగా!’ అంటూ అభయహస్తం ఇచ్చాడు.  
డోనర్ని చూపించమన్నాడు సుబ్బారావు. అన్నంరాజు అనే అతన్ని కలవమని అదేదో అనాథ శరణాలయం చిరునామా ఇచ్చాడు గుర్నాథం.
గుర్నాథం మనుషులమని నమ్మకం కుదిరాక  సగం రేటుకే బేరం కుదురుస్తానని ఉత్సాహం చూపించాడా అన్నంరాజు.
డోనర్ని మాత్రం ఇప్పుడే చూపించకూడదంట! 'లోపాయికారీ వ్యవహారాలు  కదండీ ఇవన్నీ! పదేళ్ళబట్టీ ఈ వ్యాపారంలో ఉన్నాను. నన్ను మీరు నమ్మాలి' అన్నాడు అన్నంరాజు. నమ్మకమాత్రం చేసేదేముంది గనక?
సగం పైకం ముందే గుంజుకొన్నాడు అన్నంరాజు.
'డాక్టరుగారు ఆపరేషన్ డేట్ ఇచ్చిందాకా కిడ్నీకి రెంట్ కడుతుండాలి. నెలకు నాలుగువేలు. డోనరు కిడ్నీని వేరేవారికి అమ్ముకోకుండా ఆపటానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. ఆ మాత్రం భరించక తప్పదు. ఆఫ్ట్రాల్ ఆపరేషన్ అయిన తరువాత  ఆ కిడ్నీ మనదే అవుతుంది కదండీ చివరికి?' అని ఆ పెద్దమనిషి లా పాయింటూ!
డాక్టరుగారి డేట్ మూడు నెలలకుగాని దొరకలేదు. అంత బిజీట ఆయన! ఈ మూడు నెలలు క్రమం తప్పకుండా డయాలసిస్ తప్పటంలేదు సుబ్బారావుకి.

సుబ్బారావీ మధ్య చిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 'ప్రతీ మనిషికి కనీసం నాలుగు కిడ్నీలైనా ఉండాలి. అలాగే ఆరేడు జతల చేతులు, పది జతల కాళ్ళు, నాలుగైదు జోళ్ళ చెవులు, కళ్ళు, రెండు మూడు ముక్కులు, వందనాలికలు, నాలుగయిదు  గుండెలుకూడా ఉంటే బావుంటుంది.' ఇలా సాగుతోంది సుబ్బారావు ధోరణి.
రెండు చేతులుంటేనే మనిషిచేసే ఆగం తట్టుకోలేక పోతోంది లోకం. ఇహ పదులు.. ఇరవైలు మొలుచుకొస్తే జరిగే ఆగడాలని ఊహించగలమా?!
'ఒక్క తలకే  ఇంత లావున తిరుగుతోంది మీకు! పదేసుంటే ఇహ పట్టుకోగలమా తమర్నీ.. తమ తి.క్కనీ! ' అని శాపనార్థాలకు దిగింది సుబ్బారావుగారి శ్రీమతి. భర్త పిచ్చిమాటలు  విని విని పాపం ఎంతగా విసిగిపోయిందో ఆ ఇల్లాలు!
'ఇందులో తిక్కేముందే పిచ్చిదానా! శివుడికి మూడు కళ్ళు లేవూ? విష్ణుమూర్తికి నాలుగు చేతులు, బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు, రావణాసురుడికి పది తలకాయలు, కార్తవీర్యుడికి వెయ్యి చేతులు, దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు!  దేవుళ్లందరికీ అన్నేసి అవయవాలుండగా లేనిది మానవులకు అందులో కనీసం సగమైనా ఉండాలని కోరుకోవడం తిక్కా?!'
ఒక అవయవం పాడైనా మరోటి పనికొస్తుందని కాబోలు సుబ్బారావు ఆశ. 'ఈసారి దేముడు కనబడితేమాత్రం రకానికో జత స్పేరుగా ఇవ్వమని పట్టుబట్టడం ఖాయం' అంటో సుబ్బారావు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మనసంతా దేవినట్లయిపోయింది.

ఎలాగైతేనేం.. సుబ్బారావుకి ఆపరేషన్ అయిపోయింది.
మూడో రోజు గుర్నాథం పేరు వార్తాపత్రికల్లో వచ్చింది ప్రముఖంగా ఫొటోలతో సహా. ఏ టీవీ ఛానల్లో చూసినా ఆ రోజంతా ఆ మహానుభావుణ్ణి గురించిన సమాచారమే!
మానవ శరీరావయవావలను అమ్మే వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఓ ప్రముఖ వార్తాపత్రిక వివరాలతోసహా వరుస కథనాలను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ గోల్ మాల్ మొత్తంలో గుర్నాథానిదీ ఓ ప్రధాన పాత్ర!
అరెస్టు చేయడానికని వెళ్ళిన పోలీసులు అతగాడు గుండెనొప్పి వచ్చిందన్నాడని కోర్టు ఆదేశాలమీద నిమ్సు ఆసుపత్రిలో చేర్చి బైట పహరా కాస్తున్నారు.
నేర పరిశోధక బృందం అన్నంరాజు అనాథ శరణాలయంమీద ఆకస్మిక దాడి చేసినప్పుడు బోలెడన్ని అవయవాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి బైటపడ్డాయని వార్త! కిడ్నీలు, లివర్లు, కళ్ళు.. వంట్లో అమ్ముకోవడానికి వీలున్న ఏ అవయవాన్నైనా సరే చెట్టుమీదనుంచి కాయలు కోసిచ్చినట్లు కోసిచ్చే ఏర్పాట్లు ఆ అనాథ శరణాలయంలో  జరుగుతున్నాయిట! అందుకు అనుగుణంగా అక్కడ  పెరుగుతున్న అనాథ బాలబాలికలను చూసి  నోరు వెళ్లబెట్టడం నేర పరిశోధక బృందం వంతయిందట!
కూరగాయలే సరిగ్గా దొరకని ఈ కరువురోజుల్లో అంతంత మందని  సేకరించి పెంచడమంటే మాటలా?!
ఆ ముక్కే ఎవరో పనిలేని చానెల్ వాళ్ళడిగితే ఆసుపత్రి శయ్యమీద విలాసంగా శయనించిన గుర్నాథంగారు చిద్విలాసంగా నవ్వి వినయపూర్వకంగా ఇచ్చిన సమాదానం
'అంతా ఆ పై వాడి దయ. ఆపైన సర్కారు పెద్దల సహకారం'
అన్నంరాజు అనాథశరణాలయంలోని పసిపిల్లలు తరుచుగా చనిపోతున్నారన్న విషయం అప్పుడు బైటపడింది! అనుమాన నివృత్తికోసం ముందురోజు పోయిన పిల్లలిద్దరి బాడీలను రీపోస్టుమార్టమ్ చేయిస్తే.. వచ్చిన రిజల్టు ‘షాకింగ్’!

బాడీల్లో చాలా పార్టులు మిస్సింగు!
ఉదయంబట్టీ వరసబెట్టి వస్తున్న ఆ వార్తల్ని చూసి చూసి సుబ్బారావు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయాడు! మళ్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సొచ్చింది మాకు అర్జంటుగా!
ఎందుకైనా మంచిదని సుబ్బారావుబాడీని ఫుల్ స్కానింగు చేయించాం.  మా అనుమానం నిజమే అయింది. సుబ్బారావు వంట్లోని కిడ్నీలు మాయం!
గుర్నాథం రికమెండ్ చేసిన డాక్టరు  ఆపరేషన్ చేసింది- సుబ్బారావు కిడ్నీజబ్బు మాయం చేయడానికి కాదు. మంచి కిడ్నీని మాయం చేయడానికని ఆలస్యంగా తెలిసింది!
కిడ్నీధర కనీసం నాలుగయిదు లక్షలకు తక్కువ  పలికని రోజుల్లో .. నాలుగో వంతుకే ఆపరేషన్ చేయిస్తానని గుర్నాథం ఆఫరిచ్చినప్పుడే  అన్నిరకాలుగా ఆలోచించుకొని ఉండాల్సింది మేం!
'ఎలాగూ పోయే శాల్తీనేగదా అని ఆయన మంచి కిడ్నీని మా ఆపరేషన్ ఖర్చులకింద రాబట్టుకొన్నాం.. వ్యాపార ధర్మంగా! అదీ తప్పే?!' అంటూ బుకాయింపులకి దిగాడు బైలునుంచి  బైటికొచ్చిన పిదప అతికష్టంమీద సెల్లో దొరికినప్పుడు గుర్నాథం!
***
-కర్లపాలెం హనుమంతరావు
(శ్రీలక్ష్మి- మాసపత్రిక- మే/జూన్- 2012 సంచికలో ప్రచురితం)



ఇదేనా కవిత్వమంటే?!- సాహిత్య గల్పికః



కరవీర కుసుమము, గులాబీ పువ్వు కళ్ళు తెరిచేదాకా దాదాపు ఒకే రూపు. మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రం ఒకటి గుడి, ఒకటి గోపురం. వీటి మూల రహస్యం ఏమిటో తేల్చుకుందామని కాచుక్కూచుంటే.. ఎపుడో ఒక నిశ్శబ్ద గడియలో రససెల్లానుంచి తొంగిచూసే  ముగ్ధవధువులా మిసమిసలాడుతూ ప్రఫుల్లనేత్రాంచలాలను  రెపరెపలాడిస్తాయి. సృజన జన్మరహస్యం మాత్రం అంతుచిక్కదు!

దారిన పోతోంటే కాలికి ముల్లు గుచ్చుకోవచ్చు. అపురూప సౌందర్యరాసి సందర్సనసౌభాగ్యమూ లభ్యమవచ్చు. విడివిడిగా రెండు విరుద్ధ సంఘటనలే! కాని సమన్వయించుకునే సామర్థ్యముంటే అవే ఓ అభిజ్ఞాన శాకుంతలాంకురాలు. సమన్వయశక్తికి పాదు ఎక్కడో తెలియదు!

పట్టుబట్టి ఎప్పుడో  కలం, కాగితాలు పట్టుక్కూర్చుంటే బుర్ర బద్దలవడం మినహా ఫలితం సున్న. పదాలనాశ్రయించీ, పాదాలను దిద్దీ, పర్వతం ప్రసవించినట్లు  పోగేసినా ఆ మాటలకుప్ప కవిత్వమనిపించుకోదు.  శ్రీరస్తు నుంచి శుభమస్తు దాకా సమస్త  శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని మహానుభావుడు  బమ్మెర పోతనామాత్య్డుడు  ఒక్క ఉదుటనే పద్యాలబండిలా  తోలుకెళ్ళాడన్నా నమ్మలేం. 
కావ్యాలేమన్నా శాసనాలాకాళిదాసు కుమారసంభవమేంటి.. ఆఖరుకి  సాక్షాత్తు ఆ శ్రీశంకరభగవత్పాదుల సౌందర్యలహరైనా సరే .. ఒక్కబిగినే 'ఇతిసమాప్తః' దాకా సంపూర్ణమవడం అసంభవం. ఒకవాక్యం ఒక్కసారే అతకదు. అర్థం ఒకసారే పొదగదు. భావం ఒకేసారి పొసగదు. సృజన- భావుకత స్థాయిభేదమా? దానికదే ఓ అంతిమ ఆత్మస్వరూపమా? ఉఛ్చరణమొదలు అంతిమభావపర్యంతం సర్వజీవశక్తులూ విభావాదుల్లా వివిదౌపచారికలు నిర్వహిస్తేనే కదా ఏ రసభావానికైనా ఓ అంతిమస్థాయి! అంతిమం సరే.. రసం  అసలు
ఆదికొస ఏదో  అంతుబట్టదు!  అది కదా అబ్బురం!


ఓ  కొబ్బరి చెట్టు. దాని వంపుకి సొంపు అమరేటట్లు వాలిన శాఖకు వరసగా తోరణాలు కట్టినట్లు ఆకులు.
వాటిమీద ఉదయభానుడి నునులేతకిరణాలు పడి కోమలమలయసమీర స్పర్శలకి ఒకటొకటే మృదువుగా  కదలాడుతోంటే  'తరుణాంగుళీచ్చాయ దంతపుసరికట్టు లింగిలీకపు వింత రంగులీనింది' అన్న భావాక్షర వీణాతంత్రి సాక్షాత్కరమవడం లేదూ!
శరద్రాతుల్లోఐతే గోపాలకృష్ణయ్య ఎక్కడో నక్కి వేణుదండంమీద గర్భకేతకీ దళంవంటి వెన్నెల వేళ్ళతో చాలనం చేస్తున్నట్లు ఓ సమ్మోహనోహ మనసును ఊయలలూగిస్తుంది . అక్కడితో  ఆగితే మంచిదే!  అవ్యక్తంగా ఆ
వేణుస్వరాలు మన కర్ణద్వయంలో నర్తించుతో గుండెలకు రెక్కలు తొడిగి ఏ గాంధర్వలోకాలకో ఎగరేసుకు పోవచ్చు. ఏ వరూధినో రత్నసానువుకోన భోగమంటపాన కనిపించి వాస్తవలోకాలకు దారే తోచనీయకుండా మీదమీద కమ్ముకొచ్చేయవచ్చు. మళ్ళీ కాళ్లు నేలకాని నిట్టూర్పుసెగలు చురుక్కుమనిపించేవరకూ సాగే ఆ భావాంబర విలాసవిహారం పేరేమిటో? నింగిని వదిలి నేలకు దిగిందాకా మనసున సాగే ఆ ఊహావిహంగ యానమంతా కవిత్వమేనా పాకం పడితే? మరైతే ఆ  పాకం పండేది ఎలా? ఆ అనుపాకం సమపాళ్ళు ఆరంభంలో  తెలిసింది ఏ పుంభావ సరస్వతికో?
 
చెరువు గట్టు కెళ్ళి కూర్చున్నామనుకోండి సరదాగా ఓ అందమైన సాయంకాలంపూట మిత్రబృందమంతా కలసి.  ప్రోషించబడ్డ  నాగసంతానమంతా సర్పయాగంలో ఆహుతి నిమిత్తం తరలిపోతున్నభ్రాంతి కలిగిస్తుంది మన వైపుకే వురికురికి వచ్చే అలలసందోహం! అవేతరంగాలు మరోమిత్రుడి కంటికి పరుగుపందెంలో గెలుపు కోసం ఉరకలెత్తే  చురుకు కురంగాలు అనిపించవచ్చు. ఇంకో నేస్తానికి దోస్తులంతా కలసిచేసే జలవినోదంలా తోచవచ్చు.
నాచన సోమన- 'హరివంశం' సత్యభామ హరికంటికొక రకంగా.. అరి కంటికింకో తీరుగా తోపించినట్లు..  ఒక్కవస్తువు సందర్శనంలోనే ఎన్ని భావభేదాలో!  కవి అయిన వాడికైతే గుండెల్లో బొండుమల్లెలచెండు వాసనలు గుబాళించిపోవూ!  చేతిలో రాతసాధనం లేనంత మాత్రాన ఊహలో పొంగులెత్తే రసగంగప్రవాహం భంగపడుతుందా?

మదిలో 'మా నిషాద' శ్లోకభావం కదలాడినప్పుడు  వాల్మీకికవి హస్తాన ఏ గంటముందంట?  'మాణిక్య వీణా ముపులాలయంతీ' అంటో  కాళిదాసు గళాన అలా  ఆశుకవితాజల సెలయేరులా   గలగలా పారినవేళా లేఖినేదీ   దాపునున్న దాఖలాల్లేవే!  పైసాపైసా కూడబెట్టే లుభ్ధుడికిమల్లే రసలుబ్ధుడైన కవీ రసాదికాలకు
ఆదిమూలమైన భావదినుసులను ఏ హృదయపేటికలో  పదిలపరుస్తాడోప్రయోగించే సందర్బరహస్యాన్ని ఎలా పసిగట్టగలడో?!

అలాగని ప్రతీమనిషీ ఇలాకనిపించిన ప్రతీదానిలోనల్లా  కవితామతల్లినేదో  భావించుకొని ఆమె రూపురేఖాదులను అల్లిబిల్లిగా అల్లుకుని పోతానంటే  'అనంతా వై వేదాః' అన్నట్లు ఈ పాటికీ ఈ భూమండలమంతా కవిలకట్టల్తో నిండి ఏడుసముద్రాలూ పూడిపోయుండేవి కావూ! ఆ దస్తరాల్లో చిక్కడిపోయే దుస్తరం తప్పింది. ఆనందమేనంటారా
మరి మిణుగురులా తటాల్మని తట్టి, సీతాకోకచిలుకమల్లే  మనోభావం చటుక్కుమని ఎటో ఎగిరిపోతేనో?   గుప్పెటపట్టి గూట్లోపెట్టే సాధనమంటూ ఏదో ఒకటుండటమూ అవసరమే కదాగాలిబ్ మహాశయుడికి ఏదైనా ఓ అందమైనభావం మదిలో కదలాడటం మొదలవంగానే  పాటగానో పద్యంగానో గుణించుకుంటో అందుబాటులో ఉన్న దస్తీతోనో.. అంగీఅంచుల పోగుతోనైనాసరే ముచ్చ్టటైన ముడులుగా మలుచుకునే అలవాటు. తీరిక దొరకబుచ్చుకొని మళ్ళా ఆ ముళ్ళను అలాగే విప్పుకుంటో చూచిరాతంత చక్కగా పద్యాలు చెక్కి వుండక పోతే మనకీ రోజుకి ఇన్నేసి చక్కని కైతలపాతర్లు   దక్కివుండేవా?

చింతచెట్టుచిగురు కంటబడంగానే 'చిన్నదాని పొగరు' పాట చటుక్కుమని గుర్తుకొస్తుంది. రెండింటికి సామ్యమేమిటోనల్లటి  బుర్రమీసాల ఆసామి ఎవరన్నా ముదురుపెదాల మరుగునుంచీ బలిష్ఠమైన లంకపొగాకు చుట్టపీకొకటి  లంకించుకుని గుప్పుగుప్పుమని పొగవదుల్తూ కనిపిస్తే రైలుబండే రోడ్డు మీదకొచ్చినట్లు అనిపిస్తుంది ఎంత జడ్డికైనా. అక్షరానికి అందకుండా అగరుధూపంలా అనుభవించి వదిలేసే ఊహావల్లరులను అలా వదిలేసినా.. ఎన్నటికీ అణగిపోని కొన్నిభావమణుల వెలుగుజిలుగులు అంతరంగం అడుగుల్లో మిగిలే ఉంటాయి. తెరవెనక్కి వెళ్లినట్లే వెళ్ళి ఆ దృశ్యమో.. సాదృశ్యమో తటస్థించినప్పుడు సరికొత్త సామ్యాలతో మళ్ళీ మనోయవనిక ముందు మెరుస్తుంటాయి! ఎందుకని అలా?!


కుసుమశరుడిలాగా భావసుందరీ మనసిజే. ఒక్కరుద్రుడికే మన్మథుడు దద్దరిల్లాడు. కాని ఏకాదశ రుద్రులెదురైనా భావసుందరి సిగకొసనయినా  కదలించలేరు. ఏ బంగారిమామ బెంగపడ్డాఏ బిచ్చగత్తె వొరుగులాంటి వడలిపోయిన కాయంతో చింపిరి తలా, చిరుగువలువల్తో నడవలేక నడుస్తూ వీధివాకిట్లో నిలబడ్డా,    మరకతాలు పరచినట్లున్న పచ్చని ఆకుమళ్ళ  గట్లమీద చేరి అన్నంమూటలు విప్పుకుంటో వర్షాభావంవల్ల వాలుమొహాలు వేసుకొన్న వరినారునుచూసి అన్నదాత కళ్ళు చెమ్మగిల్లినా,   నురుగులుకక్కే దేహంతో కష్టాలకావిళ్ళు మోసే కూలన్న మెలిబడ్డ నొసటిరేఖ కంటబడ్డా, ఎక్కడో దూరంగా ఉన్నప్రేయసి చూపులో  చూపుంచి ఆలపించే  అతిసుందర నిశ్శబ్ద మంద్ర కాకలీ స్వరం చెవిన బడ్డా, తళుక్కుమని మెరుస్తుందే మానసాంబరవీధిన భావతారాతోరణం!. ఏ సూత్రం ఆధారమో ఈ వింత పులకింతధారలకు?

కవిత్వమంటే ఇన్నిసాధక బాధకాలా
మబ్బుకు దివిటీపట్టే మెరుపువిద్యంటారే మరి దీన్ని  విజ్ఞులు?!  చూసిన చిత్రం.. చేసిన భావం మాటల్లోనో మనసుల్లోనో భద్రంచేసి,  సమయంచూసి సూటిగా  లక్ష్యాన్ని చేదించటమంటే మరి మాటలాకలానికి కాలానికి కట్టుబడి ఎలా ఉంటుందీ తత్వం? అలుగులు పారే సజీవకళతో ఉరకలెత్తే నిత్యచైతన్య  ప్రవాహోత్శి కదా కవిత్వం!  'నదీనాం సాగరో గతిః' చందంగా పొర్లుకునివచ్చే  భావవాహినికి ఆనకట్టలు కట్టి పంటకాలువలు తీసి పూలు, పండ్లు పెంచి లోకానికి  ఆ జీవప్రసాదాన్ని పంచే వనమాలి కదూ కవి!  ఉఛ్చృంబలంగా సాగే  జీవప్రవాహం  ఏ కొండో, బండో అడ్డగిస్తే.. వెనక్కి మళ్లటమూ,  ఉబికుబికి ముందుకు ఉరకటమూ,  ఏ లోయో పల్లమో సంప్రాప్తిస్తే.. హడిలి అంతెత్తు పై నుంచీ మోతలుపెట్టుకుంటో పాటుగా దూకిపడి  ముందుకు సాగటమో.. ఏ వంపో, ముంపో తగిలినప్పుడు  తలప్రాణం తోకకొచ్చినట్లు  సుళ్ళుతిరిగి ఊగటమో!
కవిత్వతత్వమూ అదేనేమో! అదే!


కవి జీవనయానంలో  అందమైన విఘాతాలు అప్పటికైతే విస్మృతిలోకి వెళ్ళిపోయినా.. మనసు అడుగు పొరల్లోనే ఎక్కడో పడుకుని ఉంటాయి. వాస్తవజీవితం ఏ కష్టంతోనో, ఇష్టంతోనో ముష్టియుద్దానికో, ముద్దులాటకో సిద్దమైన క్షణంలో.. పునరుత్తేజితమై జీవం పోసుకొని తెరముందుకు ఉరికి వచ్చేస్తుంటాయి.
అలా రావడమే అసలు సిసలు  కవిత్వతత్వ రహస్యమేమో!
మరి రససిద్ధులైన పెద్దలేమంటారో.. ఏమో!
-కర్లపాలెం హనుమంత రావు
 వాకిలి- అంతర్జాల పత్రిక- మే 2013లో ప్రచురితం




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...