Thursday, June 25, 2015

భూపాలరాగం- ఒబామా 2010- భారత సందర్సనం సందర్భంళో రాసుకున్న కవిత

పురుగుమందుకు మనుషులంటేనే ఎందుకో అంత ప్రేమ!
విషం మిథైల్ ఐసో సైనేట్ మారు వేషంలో
నగరం మీద విరుచుకుపడిన చీకటి క్షణాల ముందు
హిరోషిమా నాగసాకీ బాంబు దాడులే కాదు
'తొమ్మిదీ పదకొండు' ఉగ్ర దాడులు కూడా దిగదుడుపే !
టోపీల వాడి మాయాజాలమంటే అంతే మరి!
మనకి ఊపిరాడదని మన తలుపుకే కన్నం వేసే కంతిరితనం వాడిది.
అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చి మిరియంమొక్క అడిగినా
కంపెనీవాడొచ్చి మూడడుగుల నేలడిగినా
మన కళ్ళుకప్పి మాడుమీద వాడి జెండా దిగేయ్యటానికే!
మన కండలు పిసికి పండించిన పంటను ఓడల కెత్తుకెళ్ళటానికే.
అదిప్పుడు పాత కథ.
కొత్త కథలో..

వామనుడు అడగక ముందే నెత్తి చూపించే అమాయక బలి చక్రవర్తులం మనం

భూమిని చాపలా చుట్టి వాడి పాదాల ముందు పరచటానికి
పోటీలు పడే కలియుగ దానకర్ణులం.
మన రూపాయి ప్రాణవాయువును
వాడి డాలరు బతుకుతెరువు కోసం
తృణప్రాయంగా సమర్పించుకునే
పిచ్చి బేహారులం
వాడి విమానాలు క్షేమంగా దిగాలని
మన వూళ్ళు కూల్చుకుని
రహదారులు విశాలంగా చేసుకునే
విశాలహృదయులం
వాడి నాలిక మడత పడటం లేదని
మన మాటను సంకరం చేసుకునే టందుకయినా సంకోచపడం.
వాడి అణుదుకాణాల కోసం
మన అన్నపూర్ణ కడుపులో చిచ్చు పెట్టుకోటానికయినా మనం సిద్దం.
సార్వభౌమత్వమంటేనే ఒక చమత్కారం
ఆ డాబు దర్పాలకి మురిసి చప్పట్లు కొట్టటమే మనకు గొప్పతనం.
అణుఒప్పందం వల్ల భవిష్యత్తులో జరిగే భారతీయ చెర్నోబిల్ నాటకానికి
పాతికేళ్ళ క్రిందటే ప్రారంభమయింది
భూపాల రాగం... వింటున్నారా!
-కర్లపాలెం హనుమంతరావు

(ప్రొద్దు-05-10-2010-సంపుటి 5 సంచిక 4-లో ప్రచురితం)


Wednesday, June 24, 2015

ఆరుద్రగారితో పన్నాలవారి ఆకాశవాణి ఇంటర్వ్యూ- వీడియో

మంచి సాహిత్య చర్చ. ప్రముఖ ఆకాశవాణి కళాకారుడు శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు (రమణగారి భట్టు పెసరట్టు ఫేం) ఆరుద్రగారితో మాట్లాడుతున్న ఆడియో. ఈ ఆడియో ఆకాశవాణిలో ప్రసారం అయ్యింది. పూర్తిగా లేదు. ఈ రికార్డింగు నాకు ఇచ్చినది శ్రీ శ్యాంనారాయణ, ఫిరంగిపురం వాస్తవ్యులు. ఆయనకు ఎక్కడనుంచి వచ్చినదో తెలియదు. రికార్డ్ చేసి ఇలా వదిలిన ఆ అజ్ఞాత వ్యక్తికి ధన్యవాదాలు.
(కప్పగంతుల శివరామప్రసాద్ గారి గూగుల్+ కాతాలో చూసి యూ ట్యూబ్ నుంచి షేర్ చేస్తున్నాను. వారికి ధన్యవాదాలు)

Tuesday, June 23, 2015

రహస్యకవాటం- కవిత


మాటలమీదనుంచి మాటలమీదకు దూకటంకాదు
మంత్రకవాటాలను ఒక్కక్కొక్కటే తెరుచుకుంటూ పోవటం కవిత్వం
లోపలి చీకటికి వెలుగుల రంగులద్దే అద్దకంపని కవిత్వమంటే
నాడులు నీవే కావచ్చు, ధమనుల బాధను అర్థం చేసుకోవడం
పచ్చిదనాన్ని పచ్చదనంగా అనువదించడం.. ఆ కళే కదా కవిత్వమంటే!
ఎడారిలో నడుస్తూ కూడాఒయాసిస్సులను మోసుకుతిరిగే కూలీపనికి సిద్ధమా!
బోరుబావిలో పడ్డ బిడ్డ మాదిర
ఊహలు ఊపిరికొసం విలవిలలాడితేనే  కవిత్వం జ్వరంలా తగులుకున్నట్లు!
ఉపమాలకోసం జపమాల తిప్పుతూ కూర్చోకు
ఊర్వశి మరోపురూరవుడితొ లేచిపోవచ్చు!

కవిత్వం సాక్షాత్కారానికి ఎన్ని మన్వంతరాలు శోధించాలో తెలుసా?
పసిబిడ్డ పకపకల పక్కలకి పోయి నిలబడాలి.. కాస్తంత  కాకెంగిలి కవిత్వం దొరకుతుంది
పడుచుపిల్ల వాల్చూపుల్లో తడిసి ముద్దవాలి.. ప్రబంధాల చలిగాలి వణికిస్తుంది
అమ్మలాలింపు, నాన్నగద్దింపు, అన్న అల్లరివేధింపు, చెల్లి బుంగమూతిసాధింపు
కవివే అయుంటే నీ ఇల్లే ఓ భువనవిజయంకదరా బాబూ!
ఇరుగింటి పంచాంగంవారి బహుళ శుద్ధపూర్ణిమ పర్వంలోనే కాదు
పొరుగింటి కుటుంబయ్యగారి క్యేలండరు ముప్పయ్యో తారీఖు అడుగునా
అణిగి వుటుంది కవిత్వం.. కాస్త తడిమి చూడాలిగాని.

తాగొచ్చిన మొగుడు  తన్నినా తను కంచం ఖాళీచేసిందాక
పచ్చిగంగ ముట్టనని శపథంపట్టిన
తడికవతలి  తల్లి తడికళ్ళలోకి తొంగిచూడు
మానిషాద’కన్న మహావిషాదమైనకవిత్వం
వరదలై పారుతుంటుందక్కడ!

ఎక్కడ లేదు కవిత్వం?
గుడిబైట గుడ్డిబిచ్చగాడు పరుచుకు పడుకున్న చింకిపాతలో లేదా!
బడికెళ్ళే బుడ్డడి  స్కూలుబ్యాగు బుక్కుల బరువుకింద నలగడంలేదా!
పొలంగట్టుమీద మట్టికుప్పలా పడున్న అన్నదాత
గుండెల్లో కదుంకట్టి ఉంది  తట్టలతట్టల కవిత్వం!

అడవిచీకటిదారుల్లో జనంవెలుగులకోసం అహోరాత్రులు
తుపాకీమడమలమీదే కునికిపాట్లుతీసే
అన్నల కంటిరెప్పల మరుగున మరుగుతుంటుంది కవిత్వం!

పట్టించుకోవాలేగాని బడ్జెట్ ప్రసంగాల్లో, సన్మానపత్రాల్లోనూ
అధికప్రసంగంలా  అప్పుడప్పుడూ చప్పుడు చేస్తూనేవుంటుంది కవిత్వం!


తాతలకాలంనాటి తాళపత్రగ్రంథాలనుంచి
పక్కింటి సీతకు ఎదురింటి రాంబాబు రాసిన ప్రేమలేఖల దాకా
ఎదవెలుగులో వెదుకుతూపోతే.. అంతా  కవిత్వమేలే!

మేలైన కవిత్వమే ఏదీ? ఎక్కడా ఆ రహస్య కవాటం?

ఖాళీపదాల అర్థాలను పీకిపాకానపెట్టి.. పద్యాల ప్రతిపదార్థాలను తవ్విపోసి..
వెర్రి గీతాల చరణాలవెంట పిచ్చిగా పరుగెత్తితే వినిపించేది
సిల్కుస్మితల చీరకుచ్చెళ్ళ చప్పుళ్ళు!
సీతాకోకచిలుక రెక్కలసవ్వళ్ళరహస్యం కావాలా!
పగలంతా వళ్ళు పుళ్ళుచేసుకుని
రాత్రి హోటలుబల్లల సందులమధ్య
కలతనిద్రలో ఉలికులికిపడే
బుడ్డోడి గుండెలు తట్టి చూడు!
 అక్కడ తెరుచుకుంటుంది అసలు కవిత్వరహస్యకవాటం!


-కర్లపాలెం హనుమంత రావు
(సాహిత్య ప్రస్థానంలో ప్రచురితం)




Monday, June 22, 2015

ప్రపంచ పక్షి- కవిత

సృష్టి నాటి నుంచి చూస్తున్నా
సూర్యుడెప్పుడూ తూర్పునే ఉదయిస్తున్నాడు
దశాబ్దాలనీ శతాబ్దాలనీ
గుర్తుల కోసం నువ్వే ఋతువుల పేర్లైనా పెట్టుకో
కాలం మాత్రం అనంతం నుంచి అనంతంలోకి
సాగే జీవన ప్రవాహం
మనిషి అందులో ఒక అల

నదులూ , సముద్రాలూ, పర్వతాలూ,
అగాధాలూ, అడవులూ, ఎడారులూ,
మహా సముద్రాలనీ
నేలనీ, నీటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నావ్!

జాతులనీ, రంగులనీ, మతాలనీ , కులాలనీ,
బానిసలనీ,
నిన్ను నీవే నిలువుగా, అడ్డంగా
నరుక్కుంటున్నావ్!

నిజమే....
నడక మాత్రమే తెలిసినవాడివి- నదులు
నీకడ్డమే మరి!

శతాబ్దానికవతల ఏముందో వినలేని
చెవిటి వాడివి
కంటికి కనిపించనిదంతా నీకు దగా!
నీ గుళ్ళూ, గోపురాలూ, పిరమిడ్లూ, ప్యాలెస్ లూ
నగరాలూ, నాగరికతలూ
కాలం తీరాల వెంట శిధిలాల్లా పడి ఉన్నాయ్!

నత్త గుల్లలే నీ చరిత్రకు గుర్తులుగా మిగిలున్నాయ్!
అణువును ఛేదించి అస్త్రాలను చేసేవాడా
జీవాన్ని మమ్మీ గా మార్చి పిరమిడ్ బొడ్డులో దాచేస్తావా?
కరువులూ, కాటకాలూ, వరదలూ, తుఫానులూ,
భూకంపాలూ, సునామీలు చాలకా ...
మధ్యలో పుట్టి మధ్యలో పోయే ఓ మనిషీ!
మళ్ళీ యుద్ధాలను సృష్టిస్తున్నావ్!

నీ అధికారం, ఉగ్రవాదం, యు యెన్ వో వీటో పవరూ,
ప్రభుత్వాలూ, పహరాలూ డాలర్లు పేటెంట్లు
అణువుపగిలితే అంతా మసి!
విశ్వాన్ని జయించాలని విర్రవీగిన నియంతలు
బాత్రూముల్లో జారిపడి చచ్చిన ఉదంతాలు
వినలేదా!

క్యాలెండరుకు ముందేముందో తెలీనివాడివి
నీ కన్న పిట్ట నయం!
చినుకు కోసం నేలపడే తపన దానికి తెలుసు
ఉనికి కోసం జీవిపడే ఆరాటం తను చూడగలదు

తల్లడిల్లే పిల్లవాడు తల్లి నాలుకతో 'అమ్మా!'
అనే ఏడుస్తాడు ఏ ఖండంలోనైనా
తల్లి నాలుకలు వేరైనా తల్లి మాత్రం ఒక్కటే
బాధలకూ, భయాలకూ రంగులు వేరైనా వాసన ఒక్కటే అయినట్లు
జపానుకైనా ఇరానుకైనా
చెక్కిళ్ళ మీద జారే కన్నీళ్లు ఎప్పుడూ ఉప్పగానే ఉంటాయి

ఆఫ్రికా అడవులైనా, అలప్స్ కొండలైనా,
నైలునది నీళ్ళయినా, దార్ ఎడారి ఇసుకైనా
ఎవరెస్టు శిఖరమైనా మృత్యులోయ లోతైనా
పిట్ట కొక్కటే!

మనిషి ముక్కలు చేసిన ఆకాశాన్ని
తన రెక్కలతో కుట్టుకుంటూ
రవ్వంత వసంతం కోసం దిగంతాల అంచుల దాకా
ఎగరటమే దానికి తెలుసు

నేను
అలుపెరగని ఆ వలసపక్షిని
ప్రపంచ పక్షిని

ఖండాల జెండాలన్నీ ఒక్కటేనని మనిషి
నమ్మేదాకా దేశదేశాలకు
ఈ సందేశాన్ని పంచటమే నా పని!

-కర్లపాలెం హనుమంతరావు

(పొద్దు అంతర్జాల పత్రికకు డిసెంబరు 2010 సంచికలో ప్రచురితం)

ప్రేమ- మినీకవిత






ఈ తేనెబొట్టొకటి 
మూతికి రాసుకో సుమా!
పాతాళందాకా నువు
తీపెక్కేవు సంద్రమా!
-కర్లపాలెం

Sunday, June 21, 2015

మందార మాధుర్య మకరందమిదిగో. అందుకోండి!- పోతనగారి భాగవతపద్యాల వెబ్-సైట్ పరిచయం




(iBAP పద్యము= (డిజిటలైజు చేసిన భాగవతం పద్యం)
శారద నీరదేందుఘనసార పటీరమరాళమల్లికా
హారతుషార ఫేనరజతాచల కాశఫణీశకుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీశుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడుగల్గు భారతీ!

iBAPP ప్రతిపదార్ధము= (డిజిటలైజు చేసిన భాగవతం ప్రతిపదార్ధం)
శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; = పాల సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర = దేవతల; వాహినీ = నదిలో - ఆకాశగంగలో; శుభ = శుభకరమైన; ఆకారతన్ = ఆకారంతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగు తుంది; భారతీ = సరస్వతీదేవీ.

iBAT తాత్పర్యము= డిజిటలైజు చేసిన భాగవతపద్య తాత్పర్యం
దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడటం గొప్పతపశ్శక్తితో గానీ సాధ్యం కాదు. శ్రీభారతీదేవి దివ్యదర్శనంకోసం ఆర్తితో విన్నవించుకుంటున్నాడు పోతనగారు.
"సర్వశుక్లా సరస్వతీ" సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషులభావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్రవస్తువులు కొన్నింటిని ఉపమానా లుగా సరస్వతీ స్వరూపాన్ని సంభావిస్తున్నాడు పోతన. శరత్కాలమేఘం, చందమామ, కర్పూరం, నీటినురుగు, వెండికొండ, రెల్లుపూలు, మొల్లలు, మందారాలు, అమృతసముద్రం, తెల్లని తామరలు, దేవతలనది మందాకిని - అనేవాని శుభమైన ఆకారంవంటి ఆకారంతో ప్రకాశించే నిన్ను , ఓతల్లీ! భారతీ! హృదయం అనే గుడిలో ప్రతిష్ఠించుకొని చూడగలగటం ఎన్నటి కౌతుందో!
 పద్యం .. ప్రతిపదార్థం.. తాత్పర్యం.. చక్కగా ఇవ్వడమే కాదు.. ఆ పద్యాన్ని సుమధురస్వరంతో ఆలపించడంకూడా ఈ భాగవతం వెబ్ సైట్ లో ప్రత్యేకంగా కనిపించింది.
ఇదొక భారీ ప్రోజెక్టు లాగుంది. నాలుగో స్కంధంలోని కొన్ని పద్యాలవరకే ఆలపించడం అయినట్లుంది. ముందు ముందు ఈ బృహత్ప్రయత్నం దిగ్విజయంగా సాగి మన తెలుగువారందరం గర్వించే తేట తేనియల ఊట పోతన భాగవతం విశ్వవ్యాప్తంగా అందరికీ ఆన్-లైనులో అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
ఈ లోగా తెలుగు సాహిత్యప్రియులెవరైనా  మరోసారి బమ్మెర పోతనామాత్యులవారి భాగవత మందార  మాధుర్యాన్ని గ్రోలాలంటే ఇదిగో కొద్దిగా ఆ మకరంధం ఇక్కడ లింకులో దొరుకుతోందిః



Saturday, June 20, 2015

యోగా గొప్పతనం - సీరియస్లీ సిల్లీ స్టోరీ

(జూన్ 21 ప్రపంచ యోగాదినోత్సవమే కానీ.. ఆ ఉత్సాహం అన్నార్తుడి కడుపులో ఏదీ?!)
"ఏటా సంక్రాంతికి మా  వూళ్ళో రివాజుగా జరిగే జాతరలో ముఖ్య ఆకర్షణ తిండిపోతుల పోటీ. చెయ్యి ఆపకుండా.. అరగంటలో ఎవరెక్కువ ఇడ్డెన్లు చట్నీల్లేకుండా లాగిస్తాడో.. వాడే 'భీముడు'. వంద కొబ్బరికాయలను వంటి చేత్తో పగలేసి లోపలి గుజ్జుతో సహా నీళ్ళన్నీ చుక్క కింద పడకుండా అతి తక్కువ సమయంలో స్వాహా చేసినవాడు 'బకాసురుడు'. తొక్క వలవకుండా అరటి పండ్లు తినడం, టెంకె వదలకుండా  మామిడి పండ్లు  మింగడం, పెంకు తియ్యకుండా కోడిగుడ్లు   నమలడం.. లాంటి విన్యాసాలన్నీ చిన్నతనంనుంచే  మా దగ్గర ప్రోత్సహించే విద్యలు. మా ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ   తిండిపొటీలో 'భీముడు' 'బకాసురుడు' బిరుదులు సాధించడమే అంతిమ  లక్ష్యం. ఐఐటీలో దేశం మొత్తం మీదా మొదటి ర్యాంకొచ్చినా మేం పట్టించుకోం. నెలకి రెండు కోట్లొచ్చే ఉద్యోగం సాధించినా.. 'ఆహా!'.. అలాగా.. అని వూర్కే తలెగరేసి వూరుకుంటామే.. గానీ హారతులు గట్రాల్లాంటివేమీ పెట్టుకోం. ఏటా  జరిగే భీమయ్య తిరణాల్లో మహా వైభవంగా నిర్వహించే తిండిపోతుల పొటీల్లో విజేతలైతే మాత్రం బ్రహ్మరథం పట్టామన్నమాటే.
ప్రధాన మంత్రి.. బకాసురుడు ఒకేరోజు ఒకే సమయంలో  మా ఊళ్ళో సభ తీరితే మూడొంతుల జనాభా తిండిపోతును చూట్టానికే ఎగబడేది. ఎన్నికల ప్రచారాలప్పుడు అందుకే ఎంత పెద్ద అభ్యర్థైనా సరే తమ వెంట ఇతర జిల్లాల్లో మాదిరి  ఏ పవన్ కళ్యాణో.. బాలయ్యబాబో.. ఉండాలని కోరుకోరు. భీమయ్యో, బకాసరుడో పక్కనుండి చెయ్యూపుతోంటే  చాలు ఫలితాలు అవే అనుకూలంగా వస్తాయనే గట్టి నమ్మకం"

"మీ బకాసురుణ్ణి, భీముణ్ణి ఒక్క నెలరోజులు మా వైపుకి వచ్చి  పొమ్మనండి. బక్కాసురులుగా మారడం ఖాయం"

"ఇన్ని కరవులొచ్చాయి. కాటకాలొచ్చాయి. హుద్ హుద్ తుఫానులొచ్చి వూళూ.. పూళ్ళూ వారాలకు వారాలు నిరాహారంగా అలమంటించాయి. ఐనా  మా వూరి తిండిపోతుల జిహ్యపుష్టినవేమీ చెయ్యలేక పోయాయి స్వామీ!"

"మెహిదీపట్నం రైతుబజారు పక్కనే  మొన్నీమధ్య నడిరోడ్డు మీద  సగం తెరిచున్నచేతిసంచీ ఒకటి పడివుందన్న వార్తొకటి పెద్ద సంచలనం సృష్టించింది. ఆ కథ ఆసాంతం మీ దాకా వచ్చినట్లు లేదు.. పాపం! అందుకే సోదరా ఈ కోతలు."

"ఆ సంచీలో బాంబులేవో ఉండుంటాయి. దానికీ మా తిండిపోతులకీ సంబంధమేముందబ్బీ?"

"ఉంది కాబట్టే..ఇప్పుడీ  ముచ్చట"

"సరే..ఇంతకీ సంచీలో బాంబులున్నాయా లేవా నిజంగా? ఉత్తుత్తి భయమేనా?"

"అది తెసుసుకోవాలంటే ముందుగా 'తొక్క సందేశం'లో ఏముందో ఓపిగ్గా వినాలి!"

"మధ్యలో ఈ తొక్క సందేశం ఏమిటి మహానుభావా?"

"ఆ సంచీలో ఒక ఉల్లి గడ్డ ఉంది. దాని మీద రాసున్న సందేశంలే అది. మరి ‘తొక్కసందేశం’ కాక తోలుసందేశం అవుతుందా? విను ముందు.. ఆనక సందేహాలు.

"వినిపించు మరి!"

"పెళ్ళిళ్ళ జోరు ప్రారంభమైంది. అసలే మండిపోతున్న కూరగాయలకి  మరిన్ని కొత్త  రెక్కలు పుట్టుకొచ్చాయి. మంచి రోజులూ ఇప్పుడే  వచ్చి పడడంతో మాలాంటి సామాన్యులకి చెడ్డరోజులు మొదలయ్యాయి. పోయిన ఏడాది సరిగ్గా ఇదే తిథికి మా నాయన పోయాడు.. పైకి.. ఆకలి జబ్బుతో. పోయే ముందు మా అయ్య అలమటించింది  తులసి తీర్థం కోసం కాదు. ఇన్ని ఉల్లి చారునీళ్ళ కోసం కన్నీళ్ళు పెటుకున్నాడు. ఆయన కడసారి కోరికను తీర్చడం కన్నబిడ్డగా నా ధర్మం అనుకున్నాను. భార్యలకి గుర్తుగా భర్తలు  తాజ్ మహళ్ళు కట్టించిన పుణ్య భూమి ఈ దేశం. కనీసం ఉల్లి చారు నీళ్ళైనా కన్నతండ్రి ఆకలికి గుర్తుగా అన్నార్తులకు పంచకపోతే నాకీ జన్మెందుకు?  మొదటి వర్థంతి రోజునైనా సరే ఎలాగైనా  నాయన చివరి కోరిక తీర్చి తీరాలనుకున్నాను.ఇల్లు తనఖా పెట్టిన సొమ్ముకు అదనంగా  బ్యాంకు ఖాతాలో ఉన్నమొత్తమంతా ఊడ్చుకుని ఊళ్ళో ఉన్న అన్ని  రైతుబజార్లూ తిరుగుతున్నాను. కూరగాయల ధరలు ఎలా మండుతున్నాయో తెలుసు కుంటే గుండె మండిపోదు.. ఆగిపోతుంది. పచ్చి మిర్చి కిలో ముప్పై ఏడు. చిక్కుడు నలభై ఏడు. కొన్ని చోట్లైతే డెబ్భై ఏడుమీద ఏడు. బెండ మూడు తక్కువ  ఇరవై ఏడు. ఈ 'ఏడు’పులకి ఆంధ్రా.. నైజాం.. సర్కారు.. సీడెడ్.. తేడాలేదు. కడపలో జనాలకి  కడుపులు మంట. గుంటూరులో ప్రజలకి గుండెల్లో కోత. ఏలూరు పౌరులకు కళ్ళు బైర్లు. అటు తెలంగాణా కరీంనగరు వాసులకు  కాకరకాయే కాదు మామిడికాయా కనరు. క్యారెట్.. క్యా ‘రేట్’.. మాలూమ్.. హై? ఒకటెక్కువ నలభై ఏడు. హైదరాబాద్ మే ఇరవై ఏడు. కాలీ ఫ్లవరు ఏడు తక్కువ నలభై ఏడు. రాజధానిలో ఐదు తక్కువ పదిహేడు. బీరకాయో? నలభై ఏడు.”

“బీరుకాయా .. నలభై ఏడా?!”
“బీరుకాయ కాదయ్యా? బీరకాయ. కనకే ఈ ధర. బంగారం ధర పెరిగితే  కంగారు కొద్దిమందికే.  పెట్రోలు..గ్యాసు ధరలు పెరుగుడు తరుగుడు అంటే.. పోనీలే..  ఏదో అంతర్జాతీయ బజార్లకి అనుసంధానమనో..నా బొందనో..  సరి పుచ్చుకు చావచ్చు. రేపటికి పుచ్చిపోయే వంకాయలకీ..ఎల్లుండికల్లా కుళ్ళిపోయే టమోటాలకీ టాటా.. హొండా కార్లధరలతో పోటీ ఏంటంట? పంటల దిగుబడికీ  ఎవరితో సంబంధముంటుందనీ.. మండీల ధరలు  ఇలా మండిపోతున్నాయో చెప్పండీ! పర్యావరణ నిర్వహణ సూచీట- రెండువేల పన్నెండులోనట మన తెలుగునేలే ప్రథమ స్థానంలో ఉందట! నాణ్యమైన గాలి, నీరు, అత్యుత్తమమైన అనుకూల విధానలను అవలంబిస్తున్న ఘనత దేశంమొత్తంలో మన ఉభయరాష్ట్రాలదేనట! లోకసభలో  కోసుకోవడానికి పనికొస్తాయేమో కానీ ఈ లేత లేత సొరకాయలు.. లోకల్ మార్కెట్లలో ముదురు మునక్కాడలు కూడా ఐదుకి రెండు తూగడం లేదు! ఆ ప్రణాళిక మంత్రి గారెవరో గానీ.. ఒకసారిలా  మన  రెండు రాష్ట్రాల   నాలుగు మూలలా తిప్పాలి. నాలికమీదకి రుచికి రాసుకునే నిమ్మబద్ద ధర విన్నా గుండె బద్దలైపోవాలి. చారెడు రూకలు పోసినా చారులోకిన్ని  ఉలవలు వచ్చి చావడం లేదిప్పుడు! పచ్చకార్డువాడినలా తగలడనీయండి.. తెల్ల కార్డువాడైనా బతికి చచ్చే దారుందా? బియ్యం ఓ పది కిలోలు ఆమ్ ఆద్మీ సంచీలో ఇలా  పోసేసి 'అమ్మయ్య' అనుకుంటే సమస్య పరిష్కారమైపోతుందా? దాని దుంప తెగ.. దుంపలూ ఆకాశానికి వేలాడుతున్నాయయ్యా! ఆకలి వేస్తున్నవాళ్ళందరూ కేకలయాత్రలో.. కూకలజాతర్లో చేయలేక పోవచ్చు కానీ.. నోరు మూసుకునికూడా కూర్చో లేరు కదా! ఆ సంగతి తెలుసుకోవాలనే ఈ పని చేసింది.."

"ఏం పని చేసింది? తొందరగా చెప్పు! సందేశమంతా చదవక్కర్లేదు. ఉద్దేశం అర్థమైందిగా! ఇంతకీ ఆ సంచీలో బాంబులున్నట్లా? లేనట్లా?"

"ఉన్నాయయ్యా మహానుభావా. ఒకటి కాదు. రెండు కాదు. కిలో.. సంచీ నిండుగా"

"బాబోయ్.. నిజంగా ఇది సంచలనమే!"

"నిజం సంచలనం అదికాదు మిత్రమా! ఆ బాంబుల అడుగున ఒక తొక్కల ఉల్లిగడ్డ కూడా ఉంది. మొగ్గుగా వేసినట్లుంది! ఆ తొక్కలోని ఉల్లిగడ్డకే చుట్టున్నది ఇప్పటిదాకా నేను అప్పచెప్పిన సందేశమంతా. 'నా ఆస్తంతా అమ్మేస్తే వచ్చింది ఈ ఉల్లి తొక్కు. ఇంకో తొక్కా వచ్చునేమో కానీ.. దానికి బదులుగా  ఈ చేతిసంచీ నిండా బాంబులు ఖరీదు చేసా. తెల్లారే సరికల్లా   రెండు రాష్ట్రాల్లోని అన్ని  మార్కెట్లలో  కూరగాయలధరలు ఠకీమని పడిపోవాలి. ఒక్కరోజే గడువు. తెల్లకార్డుదారులందరికీ అందివచ్చే సకలచర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద జరిగి పోవాలి. అలా  జరిగిపోలేదని నాకు అనుమానం వచ్చిన  పక్షంలో.. ఈ చేతి సంచీలాంటివే మరిన్ని    మిగతా చాలా చోట్ల పేలడం ఖాయం' అని  రాసుంది".

"ఈ మధ్య అలాగా బాంబులేవీ  ఎక్కడా పేలినట్లు వార్తల్ల్లేవే!"

"అనగా సర్కారువారు   కూరగాయల ధరలు కారు చవుకస్థాయికి దింపే చర్యలు నిజంగానే యుద్ధప్రాతిపదిక మీద చేపట్టారని అర్థమా! అదే నిజమైతే  మా ఊరికొస్తే మీ బకాసురుళ్ళూ, భీముళ్ళూ బక్కాసురుళ్లవుతారని పందెం ఎందుకు కాస్తాను మిత్రమా?"

"నీ కథ పూర్తిగా చెప్పేసే ఆత్రంలో నా కథ నువ్వింకా పూర్తిగా విననేలేదయ్యా మిత్రమా! ఎన్ని కరవులొచ్చినా.. ఇంకెన్ని కాటకాలు.. వరదలొచ్చి వూళూ పూళ్ళూ వారాలకు వారాలు నిరాహారంగా అలమంటించినా.. మా ఊరి తిండిపోతులకు ఢోకాలేదన్నానే కానీ.. వాళ్ళు తింటున్నది అన్నమనో.. కాయగూరలనో..పళ్లనో..పుష్టికరమైన ఫలహారాలనో అని గాని అన్నానా? కరవులూ.. కాటకాలూ.. వరదలూ.. వర్షాలూ.. మా దగ్గర మాత్రం తక్కువా నాయనా! పూర్వపాలకుల పుణ్యమా అని బతకడానికి మా ప్రాంతంవాళ్ళం  సాంప్రదాయికమైన ఆహార విధానాలకు ఎప్పుడో స్వస్తి చెప్పేసాం.   ప్రత్యామ్నాయ విధానాలను
కనుక్కుని ఆచరణలో పెడుతున్నాం ఇప్పుడు. చెడిపోయిన ట్యూబ్ లైట్లు, ఇనుము, తుక్కు సామాను ఇవే మాకిప్పుడు ముఖ్యాహారం. ఇవేవి  దొరకనప్పుడూ ఇసుక, సున్నం, మట్టీ, మశాన్నమే మాకు అన్నం. ఏలిన వారి పుణ్యమా అని ఇసుకలాంటి వాటికీ కరువు రావచ్చన్న ముందు చూపుతో.. ఇప్పుడిప్పుడే కేవలం వాయుభక్షణం మీదే జీవనం కొనసాగించే యోగావిద్య  అభ్యసిస్తున్నాము. మోదీజీ ఐరాసలో చెప్పిందాకా యోగా గొప్పతనం ప్రపంచానికైతే పట్టకపోవచ్చు గానీ.. మా ప్రాంతంవాళ్ళకి  ఈ విధానాలు ఎప్పట్నుంచో చిరపరిచితం. ఇప్పటి దాకా చెప్పానే.. భీముడూ.. బకాసురుడూ.. అని  ఆ బిరుదులు సాధించిన మొనగాళ్ళే  మాకిప్పుడు వాయుభక్షణ శిక్షణ ఇచ్చే గురువులు కూడా!"
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాల పత్రికలోప్ర చురితం)

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...