Sunday, July 26, 2015

కృత(క) యుగం- ఓ సరదా గల్పిక

కార్తీకమాసం. శుక్లపక్షం. శుద్ధ నవమి. కృత యుగారంభ దినం. బ్రహ్మాజీ ఆ యమ బిజీగా ఉన్నాడు. దాదాపు అన్ని ఏర్పాట్లూ పూర్తైపోయినట్లే. ఇహ ఎవరి బాధ్యతలు వాళ్లకి అప్పగించడమే తరువాయ.
ముందుగా ధర్మ దేవతకు ఫోను కొట్టాడు. నాలుగైదు రింగులైతేనే గానీ రంగం మీదకు రాలేదా మహా తల్లి. “సారీ! మీకు తెలీందేముంది! ఒంటి పాదం..” ధర్మ దేవత  సంజాయిషీ.
ఓకే..ఓకే! ఈ ఘడియ వరకే నీకీ కష్టం. ఈ బ్రహ్మీ ముహూర్తం నుంచి ఇహ నీ ఇష్టం.  పరుగే పరుగు! కృత యుగం ఆరంభం. కంగ్రాట్స్ ధర్మ దేవతా!”
కంగారు పడింది ధర్మ దేవతఒక్క పాదంతో తిప్పలు పడుతున్న మాట నిజమే. కానీ ఎన్నేళ్ల బట్టో ఇలా అలవాటై పోయింది.   మళ్లా నాలుగు పాదాలంటే .. బాబోయ్ నా వల్ల కాదుచతుష్పాదుల్ని మరీ పశువుల్లా చూస్తుందీ భూలోకం.  ఐనా ఇప్పుడంత  ఉరుకులు పరుగులు పెడుతూ నేను చేసే రాచకార్యాలు మాత్రం ఏమున్నాయి గనక? పెద్ద  లోగిళ్ళు.. కడుపులో చల్ల కదలకుండా పడి ఉన్నాను .. నన్నొదిలేయండి సార్ ఈ యుగానికి.. ప్లీజ్!”  ఠకాలున ఫోన్ పెట్టేసింది ధర్మ దేవత.
ఆదిలోనే హంస పాదా!కిసుక్కున నవ్వింది వాణి.
తర్కిస్తూ కూర్చోడానికి టైము లేదు. అవతల ఆరంభ డియలు ముంచుకొచ్చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న వాళ్ళందర్ని ముందు సంప్రదించాల్సిందే.
హరిశ్చంద్రుడికి ఫోన్ కొట్టాడీ సారి బ్రహ్మ గారు. విషయం వినంగానే వినయంలో తేడా వచ్చేసిందిసార్! ప్రతి సత్య యుగంలో సత్య హరిశ్చంద్ర నాటకం అంతవసరమా ! నిజం విలువ లోకాలకు తెలియ చేయాలనే కదా ఆది దంపతులు నా నాటకం ఆడించింది! తెలివి మీరిన జీవులు పెడర్థాల్లు తీస్తున్నారు సార్ ఇక్కడ. మహాత్ముడంటే  సత్యకాలం మనిషి. ఆయనొక్కడు మారాడని లోకాలన్నీ మార్తాయా ? బలిజేపల్లి వారి క్కూడా అక్కర్లేదిప్పుడు ఈ నీతులు. ఇంకెవరి కోసం సార్ మళ్లీ నేనూ.. నన్ను కట్టుకున్నందుకు చంద్రమతి.. లోహితాస్యుడు అష్ట కష్టాలు పడాలి?  ఈ సారి గానీ విశ్వామిత్రుల వారు వచ్చి దాన మడిగితే కావాలంటే కమండలం కొత్తది బంగారంతో చేయిస్తా గానీ భూ మండలం గీమండలం జాన్తా నై’  అంటూ ఫోన్ పెట్టేశాడు హరిశ్చంద్రుడు.
బ్రహ్మాజీ ఈసారి నేరుగా ఇంద్రుడికే ఫోన్ కొట్టాడు. కృతయుగారంభ వార్త ఆ దేవ రాజుకీ ఏమంత ఉత్సాహంగా అనిపిస్తున్నట్లు లేదు. క్షీరసాగర మధనం మళ్లీ సాగించడంలోని సాధక బాధకాలను ఏకరువు పెట్టడం మొదలు పెట్టాడు ”బహు భారీ పథకం బ్రహ్మగారు పాల సముద్రం చిలకడంకలికాలం సుఖాలు మరిగాక ఎవరూ దేనికీ వూరికే  లొంగడం లేదు. వేష భాషల్ను బట్టి ఇప్పుడు ఎవడు సురుడో.. ఎవడు అసురుడో కని పెట్టడం కష్టం.  వచ్చే ప్రభుత్వాలను బట్టి లెక్కలు మారి పోతున్నాయి. చిలికే అంత పెద్ద వ్వం ఇప్పుడేదీ! వాసుకి జోలి కెళితే వన్యమృగ సంరక్షణ చట్టాలు వూరుకోవు. మంధర పర్వతం ఎప్పుడో జనావాసాల  కింద మారిపోయింది! కూర్మావతారం ఆ విష జలాల అడుగున  ఒక్క గడియైనా నిలబడేలా లేదు. సత్య యుగం కాబట్టి  కామధేనువుని, కల్ప వృక్షాన్ని, ఐరావతాన్ని, పెద్ద దేవుళ్లెలా పంచుకున్నా పెద్ద గొడవలేం కాలేదు. రోజులు మారి పోయాయి బ్రహ్మాజీ! నీలకంఠుడికైనా హాలాహల సేవనం  అంగీకారమో కాదో కనుక్కోండి ముందు. సర్వమంగళ గతంలో మాదిరి భర్త విషయంలో భరోసా ఇస్తుందో లేదో.. అనుమానమే. అన్నింటికీ మించి నారాయణ స్వామి మరో దేవి పాణి గ్రహణం లక్ష్మమ్మకు సమ్మతంగా ఉంటుందనుకోను  ”
“కచ్చితంగా ఉండదు. అసలే ఆడదైనా మొగుడు మరో దానితో కులుకుతుంటే చూస్తూ ఎందుకూరుకోవాలి?  కృత యుగంలో ఎలా జరిగిందో ఏమో తెలీదు  కాని.. ప్రస్తుతం మాత్రం మహిళా సంఘాలు  చాలా బలంగా ఉన్నాయి భూలోకంలో” సరస్వతీ దేవి హూంకరింపు. సందు చూసి దేవేంద్రుడు చల్లగా ఫోన్ పెట్టేశాడు.
కృత యుగారంభానికి ఈ సారి ఇన్ని కృత్యాద్యవస్థలా?! కల్లో కూడా ఊహించినట్లు లేదు పాపం  బ్రహ్మ దేవుడు.
వేద వ్యాసుని మూలకంగా వచ్చి పడ్డాయీ తిప్పలుసత్యసంధతకు కృత యుగం.. సత్య వినాశనానికి కలి యుగమని పేర్లు కల్పించి ఇప్పుడు చంపుతున్నాడు. అవతల ముహూర్త ఘడియలు ముంచుకొచ్చేస్తున్నాయి. సత్య యుగారంభం కోసం యుగాల బట్టి కంట వత్తు లేసుకుని ఎదురు చూసే ఆశాజీవుల కిప్పుడేం సమాధానం చెప్పి తప్పించుకోవాలి.. నారాయణా?”
నారాయణ.. నారాయణనాలుగు తలలూ ఒకేసారి పట్టుకుని నేల చూపులు చూసే తండ్రి గారిని పరామర్శించడాని కన్నట్లు  ప్రత్యక్షమయాడు నారద మహర్షి
నీ నారాయణ నట్టేట్లో కూలా! నా పుట్టి మునిగేట్లుందిరా నాయనా ఇక్కడ!”  బావురు మన్నాడు బ్రహ్మ దేవుడు.
కంటి రెప్ప పడే వ్యవధానంలో పరిష్కారమయ్యే సమస్య కదా తండ్రీ  ఇది ! నడుస్తున్న కృతక యుగానికే కృత యుగమని పేరు పెడితే సరి. ప్రచారం హోరెత్తించడానికి అనుచర గణాలం మేం లేమా?” నారదులవారి ఓదార్పు.
కృత యుగమంటే సత్య యుగమని కదా  ప్రతీతి! మిథ్యావాదం, సర్వ భక్షణం, అల్పాయుష్షు, అసత్యవాదం, రస రాహిత్యం, రుచి హీనత్వం, నిత్య కామం, పర పీడనానందం, కుపరిపాలన, నాస్తికత్వం, పరాన్న భోక్తం, చౌర్యం, లౌక్యం, దంభం, మోసం ..నా నోటితో ఎందుకులే ఆ గోలంతా..అగ్ని గుండ కాసారంలా మండే ఆ భూగోళాన్నా నువ్వు సత్య యుగమని ప్రకటించ మనేది?! ” నోరు వెళ్ళబెట్టాడు బ్రహ్మ దేవుడు.
యుగాల తరబడి తమరు ఈ తామరాసనాన్ని  వదలక పోవడం  వల్ల లోకం తీరు  క్షణానికో రకంగా ఎలా మారుతున్నదో గ్రహింలేకున్నారు జనకా! ఈ మధ్యనే పుట్టుకొచ్చాయి భూమండలంలో కొన్ని కొత్త ప్రభుత్వాలు. అవి  తాజాగా సేకరించిన సర్వేల వివరాలు చాలు ..మీ సత్యయుగాని కన్నా ఎన్నో ఉత్తమ లోకాల సృష్టి అక్కడ రెప్ప పాటులో జరిగి పోతున్నదని తెలుసుకోడానికినారదుల వారు అందించిన  సర్వే నివేదికల బొత్తి వంక ఓ సారి తేరిపార చూసారు విధాత గారు.
వాస్తవానికి సత్య యుగంలో కన్నా కలి యుగంలోనే సత్యానికి పరీక్షలు ఎక్కువ. పొద్దస్తమానం పిల్లకాయలకి ఆబ్జెక్టివ్ మోడలంటూ 'ట్రూ' ఆర్ 'ఫాల్స్' బిట్ ప్రశ్నలు మప్పుతున్నారు ఇక్కడ. గిట్టని నాయకుణ్ని నడి మీడియాలో నిలబెట్టేందుకు  వెయ్యో.. వందో ప్రశ్నలు వరసగా సంధించి 'నిజమా..  కాదా' అని నిగ్గదీసే రాజకీయాలు రోజూ నడిచేవీ  ఈ కాలంలోనే. ఏ అన్నవరం బస్టాండులోనో నిలబడి 'ఏమోయ్.. సత్యనారాయణా' అనో 'ఏమ్మా.. సత్యభామా' అనో గట్టిగా గొంతెత్తి పిలవండి! 'ఆయ్' అంటో వంద గొంతులు  ఒకే సారి ఖంగు మంటాయి. కలియుగ సత్య ప్రియత్వానికి ఇదో తిరుగులేని తార్కాణం. చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులు పదవీ ప్రమాణాలు స్వీకరించేటప్పుడు, న్యాయస్థానాల్లో నిందితులు బోనుల్లో నిలబడి నమ్మబలికేటప్పుడు ఓం ప్రథమంగా స్మరించుకునేది సత్య దేవతనే. గీత మీదో.. రాజ్యాంగం మీదో ప్రమాణం చేసేస్తే సరి నోట బలికేదంతా సత్యం కిందే నమోదై పోయే కాలం కలికాలం!  ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులందరికీ సత్య ధృవీకరణ పత్రాల సమర్పణ తప్పని సరి చేసింది ఎన్నికల సంఘం. సాక్షాత్ శ్రీరామ చంద్రుల వారైనా సరే..   అరణ్యవాసంలో ఆదాయానికి మించిన ఆస్తులేవీ కూడ బెట్టలేదన్న ప్రమాణ పత్రం  సమర్పిస్తేనే  పట్టాభిషేక మహోత్సవానికి  చట్టబద్ధత ఏర్పడేది ఈ కలి యుగంలో. వధూవరుల చేత అగ్ని సాక్షిగా 'నాతి చరామి' అంటూ సత్య  ప్రమాణాలు చేయిస్తేనే అది సామాజి కామోదం పొందే రిణయం. యూపీయే పాలనలో  నడిచినన్ని  నిజ నిర్దారణ కమిటీలు మిగతా మూడు యుగాల మొత్తంలో సగమైనా లేవు. ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా.. ఉపద్రవాలు ముంచుకొచ్చినా.. బాధితుల ఉపశమనార్థం  ముందుగా ఊరేగేవి నిజ నిర్దారణ బృందాలే. ఆడిన మాట అబద్ధమని రుజువైతే చివరికి రాజకీయ సన్యాసమైనా సరే స్వీకరించేందుకు వీలుగా  రాజీనామా పత్రాలు జేబుల్లోనే పెట్టుకు తిరిగే రాజకీయ సంసారులు దండిగా ఉన్నారీ కలికాలంలో. సత్య యుగమని తెగ గొప్పలే గాని.. మోహినీ అవతారమే ఓ పెద్ద అబద్దం గదా! సత్యప్రియుడని పెద్ద పేరున్నా  శత్రువు   నట్టింటనే నక్కున్న వైనం ప్రహ్లాదుడెక్కడ పొక్కనే లేదు చివరి క్షణం వరకు! కలియుగీయులకు నిజం నిప్పు. ఆ కణికను చూస్తేనే జీవులకు వణుకు. లోకాలు మాడి మసై పోరాదనే  కష్టమైనా పళ్ల బిగువున నిజాన్ని గుప్పెట్లో పెట్టుకుని తిరిగేది ప్రజా నేతలు. సత్య యుగంలో ఒక్కడే నీల కంఠుడు. కృత యుగంలో ప్రతీ ప్రజా ప్రతినిధీ ఓ నీలకంఠుడే.
నిజాలను కక్కించడానికి ఈ యుగంలో ఎన్నో కట్టు దిట్టాలు! చెరసాలలు,  విచారణలురా యంత్రాంగాలు, లై డిటెక్టర్లు, నార్కోటిక్ పరీక్షలు, కాణీ పాకం వినాయకుళ్ళు. సత్య యుగంలో నిజ నిర్థారణని  ఒక్క వ్యవస్థా  ఏర్పడినట్లు లేదు! బాపుజీ మాదిరిగా  సత్యయుగంలో సత్యంతో ఏ మహాత్ముడూ ప్రయోగాలు చేసినట్లూ  కనిపించదు. సత్యమింత  కట్టు దిట్టంగా అమలవుతున్నా కలియుగానికి వికృత యుగమని చెడ్డ పేరు రావడం అన్యాయం
ముహూర్తం ఘడియలు ముంచు కొస్తున్నాయితొందర పెట్టింది మంజువాణి.
బ్రహ్మగారు గంభీరంగా ప్రకటించారు” “ భూలోక వాసుల  కొత్త ప్రభువుల తాజా  సర్వేలు  కలియుగ సత్య సంధతను సమగ్రంగా ఆవిష్కరించాయి. ఆ నివేదికల ఆధారంగా మరో కొత్త కృతయుగ సృజన వృథా ప్రయాసేనని భావిస్తున్నాను.    ఈ కార్తీక శుక్ల పక్ష  శుద్ధ నవమి శుభ మూహూర్తంలో నడుస్తున్న కలియుగాన్నే   కొత్త కృతయుగంగా  ప్రకటిస్తున్నాను
దేవ దుందుభువులు మోగడం మొదలు పెట్టాయి. నూతన కృత యుగారంభ శుభవార్తను  ముల్లోకాలకు చేరవేసేందుకు  నారదుల వారు బైలు దేరారు. స్వస్తి.
-కర్లపాలెం హనుమంత రావు




అందమైన ఆనందం బాల్యం- వ్యాసం


గడచిన  ఏడాది శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బాలల చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్న వారిలో అధిక శాతం బాలలు కాదు. 35-65 వయసుల మధ్య వాళ్ళు! అదే ప్రాంతంలో అదే సమయంలో పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన చిత్రాలు ఆడి థియేటర్లలోని ప్రేక్షకుల్లో 55 శాతం 15 సంవత్సరాల లోపు బాలలే! బాలల పత్రికలను బాలలు చదవడం ఎప్పుడో మానేసారు! ఏడేళ్ళు దాటిన బాలలకు రెండు చక్రాల సైకిళ్ళు తొక్కటం  చిన్నతనంగా తయారైంది! 196 దేశాలలో అధ్యయనం చేస్తే 152 దేశాల్లో బాల్యం పది పన్నెండేళ్లకే  పరి సమాప్త మవుతున్న వికృత చేష్టలు ఇష్టారాజ్యంగా సాగుతున్నట్లు  నిర్ధారణ అయింది. అనారోగ్యకర  లైంగిక ప్రయోగాలు,   రెచ్చగొట్టే ఉద్రేక పూరితమైన చలన చిత్రాలు, చిత్రాలు, సాహిత్యం.. ఎలాంటి కట్లుబాట్లు లేకుండా యథేచ్చగా పసిపిల్లలకూ అందుబాటులోకి వస్తున్న దుస్థితి మన దేశంలోనూ ఉండటం విచారకరం. ఈ పాపంలో సింహభాగం అంతర్జాలనిదే- అని పలు  అధ్యయనాల సారాంశం.

పిల్లలు పిల్లల్లాగా ఉంటే బాగుంటుందని పెద్దల మొత్తుకోలు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. 'ప్రపంచమే నా ఇల్లు.. ప్రజలంతా నా వాళ్ళు' అన్నంత అమాయకంగా సాగాలి బాల్యం. 'పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం-/కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ ఏవీ ఎరుగని పూవులు' బాలలు అని గదా 'శైశవ గీతి'లో శ్రీశ్రీ  అన్నది! ‘మెరుపు మెరిస్తేవాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే .. అవి తమకే నని మురిసే అమాయకత్వం క్రమేపీ బాలల్లో తరిగి పోతున్నదని ఇటీవలి పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గతంలో మన  తెలుగులో పిల్లల కోసం  ప్రత్యేకంగా 'బాల భారతం' 'బాల రామాయణం' లాంటి చిత్రాలు వచ్చి బహుళాదరణ పొందాయి. సాధారణ చిత్రాల్లో సైతం పిల్లల వినోద విజ్ఞానాల కోసం వీలైనంత మేరా ఒకటో రెండో వినోద సన్నివేశాలు.. గీతాలు నీతి దాయకమైనవి  చొప్పిస్తుండేవాళ్ళు. చలన చిత్రం అంటే ఇంటిల్లి పాదీ కలిసి చేసే వైజ్ఞానిక వినోదని ఆ పెద్దల ఉద్దేశం అయివుండాలి. ఇప్పుడో? పెద్దలే సిగ్గుపడే అసభ్య చిత్రాలను పిల్లలు గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు! సెన్సార్ వారి 'యు' ధృవీకరణ పత్రం గల చిత్రాల్లోనూ పెద్దలకే అభ్యంతరకరమైన సన్నివేశాలుండి   పిల్లల అభిరుచులను భ్రష్టు పట్టిస్తున్నాయన్నది చేదు వాస్తవం.

ఆడపిల్లలు మగపిల్లలతో, మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం సాధించడంలో విఫలమైతే అసమర్థులుగా తిరస్కరణకు గురయ్యే హీన సంస్కృతి బాలల ప్రపంచంలో నేడు విపరీతంగా ప్రబలుతున్నది.  పాయసంవంటి బాల్యం  విషతుల్యంగా మారేందుకు ఇలాంటి వైపరీత్యాలు చాలానే ముఖ్య కారణం’ అంటున్నారు బాలల మనో విశ్లేషకులు . ఫేసు బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో అర్థరాత్రిళ్ళు దాటినా యథేఛ్చగా ఆపోజిట్ సెక్సుతో అశ్లీల విషయాల మీద చేసే చర్చలు, పిల్లలు మధ్య  బదిలీ అవుతున్న నీలి చిత్రాలు, వీడియోలు  బాలల సహజ  సున్నిత జీవన సౌందర్యానికి చెరుపు
చేన్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ. కుతూహలం కొరబడ్డ లైంగిక చర్యల్లో యాంత్రికంగా పాల్గొంటూ  ప్రమాదకరమైన అలవాట్లకు బానిసలై  బాలలు వివేక రహితంగా మొగ్గ దశలోనే జీవితాన్ని గందరగోళంలో పడేసుకుంటున్నట్లు   బాలల మానసిక శాస్త్ర వేత్త నీరజా సక్సేనా   ఇటీవల ముంబయి విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధనా పత్రంలో ఆందోళన వెలిబుచ్చడం గమనించదగ్గ అంశం.
'ఎదగటానికెందుకురా తొందరా.. ఎదర బతుకంతా చిందర వందర ' అని   పాత  చలన చిత్రంలో పాట. ఆ రోజుల్లోనే  భవితను గూర్చి అంతలా చింతన చేసేవారే! మరి ఇప్పటి పరిస్థితులకి ఇంకెంతగా ఆందోళన చెందాలి?
ఎనిమిదేళ్ళ ప్రాయానికే ఆడపిల్లల్లో అందాన్ని  పెంచుకోవాలన్న స్పృహ! మగ పిల్లలకు  ఆడపిల్లల  దృష్టిలో పడి తీరాలన్న యావ!  భావి జీవితానికి మేలు కలిగించే   అంశాల అధ్యయనం మీద ఏకాగ్రత  చెదరగొట్టే ఆలోచనలు కావూ ఇవన్నీ?! శరీరాకృతి, వేషభాషలను గురించి పట్టింపు పసితనం నుంచే ప్రాధాన్యతాంశాలైతే అందమైన బాల్యాన్ని ఇక అనుభవించే సమయం దొరకబుచ్చుకునేది ప్పుడు?! 'పీర్ల పండుగకు పీర్లు ఎత్తుకోని 'మాన్ కోట్.. బిస్కోట్' అని అరుసుకుంట గల్లీల పొంటి తిరుక్కుంట అలాయ్ గుండం సుట్టు ఎగిరి దుంకాలనుంది. దీపాళి పండక్కి రోలురోకలి దీసుకోని అండ్ల పొటాష్ బోసి రాతిగోడకేసి లగాంచి కొట్టాలనుంది. ఎండాకాలం దోవోజి బాయిల షెడ్డుమీది కెల్లి  డైగొట్టి దుంకాలనుంది.. కంపినోల్ల సేన్ల దొంగతనంగ అనపాయకాయలు.. కందికాయలు తెచ్చుకోని ఉడక బెట్టుకోని తినాలనుంది. మునగాలోల్ల సినీరయ్య తాత బోతాంటె ఎనకనించి గోసి ఊడ బీకాలనుంది. మా రామక్క తోని మాట్లాడాలనుంది' అంటూ  'పాతవాచకం' పేరున  ఓ కవి 'నా బాల్యాన్ని నాకు తెచ్చివ్వవూ' అంటో గోస పెట్టడం చూస్తుంటే  అందమైన బాల్యం మీద ఎంత ముచ్చటేస్తుంది! 'జబ్ బచ్ పన్ థా, తో జవానీ ఏక్ డ్రీమ్ థా/ జబ్ జవాన్  హుయె, తో బచ్ పన్ ఏక్ జమానా థా!' అని హిందీలో ఓ కహావత్. బాల్యానికి  యవ్వనం రంగుల కలవరింత. యవ్వనానికి  బాల్యం గడిచిపోయిన వింత! ఇందుకు విరుద్ధంగా  ఇప్పటి బాలలు చేసే ఆలోచనల వల్లే ఈ  చింత!

బాలల ప్రపంచంలో వస్తున్న ఈ మార్పులు దేనికి సంకేతం? గతంలో బడికి సెలవులు వస్తే చాలు.. బంధు మిత్రుల ఇళ్లకు  వెళ్లి ఉల్లాసంగా గడపడం ఉండేది. ఇప్పుడు పెద్దలతో కలవడానికి పిల్లలు బొత్తిగా ఇష్ట పడటం లేదు. సందు  దొరికితే స్నేహితులు. లేదంటే ఒంటిగా ఇంట్లో గదిలో ఇంటర్ నెట్ ముందు ఫీట్లు. బాలల్లో పఠనాసక్తి పూర్తిగా తరిగి పోతున్నదనే అద్యయనాలు తెలుపుతున్నాయి. సంగీతమైనా  చిత్రమైనా అయినా ఇంటిల్లిపాదీ కలసి  సరదాగా వినోదించే రోజులు  చెల్లిపోయా యనిపిస్తుంది. చెవిలో మెషిన్.. తనలో తాను. లేకుంటె తన లాంటి మరో అర్భక  జీవితో చాటుమాటు మాటా మంతీ! తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇంటి పెద్దలు, చదువులు చెప్పే గురువులు, సంఘంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విజేతలు.. వాళ్ళ అనుభవాలు, ఆలోచనలంటే ఆసక్తి లేదు. తనకు మించిన పరిపక్వత ప్రదర్శించలేని మిత్రబృందం సలహాలకే పిల్లలు పెద్దపీట వేస్తున్నారు. వ్యాపార దృష్టితో నడిచే పత్రికల్లో సైతం అవసరానికి మించి దొరికే అభ్యంతరకరమైన  సమాచారం బాలల అమాయకత్వానికి చేసే మేలుకన్నా కీడే ఎక్కువని   బాలల మనో శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్న ఆందోళన అర్థం చేసుకోదగిందే.  చిన్నపిల్లల ఆటబొమ్మల్లో సైతం ప్రాధాన్యత సంతరించుకుంటున్న లైంగిక కోణం గురించి  కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ మిన్హాస్ ఈ మధ్య ముంబయిలో  బైట పెట్టారు. ప్రతి పదిమంది బాలల్లో ఒకరు అసహజ  రీతి లైంగిక చేష్టల వలల్లో చిక్కుబడి పోతున్న మాట నిజమే.
భావోద్వేగాలనేవి శరీర  పరిపక్వతను అనుసరించి సహజ పద్ధతిలో వికాసం చెందవలసిన ప్రకృతి ధర్మాలు. అసహజమైన రీతిలో  అభివృద్ధిని సాధించే క్రమంలో జీవితంలో ఆయాచితంగా లభించే అందాలని, ఆనందాలని, అనుభవాలని శాశ్వతంగా కోల్పేయే ప్రమాదం పొంచి ఉందని  రాబర్ట్ మిన్హాస్ అభిప్రాయం. బాల్యం అనేది తాపీగా,  ప్రశాంతంగా, సహజంగా ముందుకు సాగసిన వికసన దశ. తద్విరుద్ధంగా జరిగితే అందమైన బాల్యం అందకపోవడమే కాదు.. ముందు ముందు అనుభవించాల్సిన ఆనందకర  జీవితాన్నీ చే జేతులా దుంప నాశనం చేసుకున్నట్లే లెక్క. బాలల మనస్తత్వ శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడ చెవిన బెడితే జగత్ జీత్ సింహ్ షాయిరీ  ' యే దౌలత్ భి లే లో/ యే షొహరత్ భి లే లో/ భలే ఛీన్ లో ముఝ్ సే మేరీ జవానీ/మగర ముఝ్ కో లౌటా దో బచ్ పన్ కా సావన’  అని పాడుకునేందుకైనా అందమైన బాల్యం అందుబాటులో లేకుండా పోవచ్చు.
బాలలే కాదు ..తల్లిదండ్రులూ అప్రమత్తమవాల్సిన తరుణం ముంచుకస్తోంది మరి.. తస్మాత్ జాగ్రత్త!
--కర్లపాలెం హనుమంతరావు
***
(బాలల దినోత్సవం సందర్భంగా నవంబరు 14, 2014 నాటి ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుటలో ప్రచురితం)













మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...