Thursday, September 29, 2016

ఉభయ కుశలోపరి- ఈనాడు సంపాదకీయం

'స్నేహం- తేనెమనసుల్లో వెల్లివిరిసే నాకం' అన్నాడో ఆధునిక కవి. జీవితం  కురుక్షేత్ర రణక్షేత్రమయినప్పుడు విజయానికి సారథ్యం వహించేదీ స్నేహమే! కృష్ణుణ్ణి కుచేలుణ్ణి కలిపి ఉంచింది, రాముణ్ణి రావణాసురుడి సోదరుణ్ణి కలిపి నడిపించిందీ ఈ స్నేహసౌహార్ద్రమే! 'సర్వే భవన్తు సుఖినః/ సర్వే సన్తు నిరామయా/ సర్వే  భద్రాణి  పశ్యంతు/ మా కశ్చత్ దుఃఖ  భాగ్భవేత్'- అందరు సుఖంగా, నిశ్చింతగా ఉండాలి. ఆయురారోగ్యాలతో ప్రవర్థిల్లాలి. మంగళవచనాలు వీనులకు, మంగళకార్యాలు కళ్లకు విందులు చేయాలి. ఏ ఒక్కరూ దుఃఖభాజితులు కారాద'ని కోరుకొనే 'మంగళాచరణం' తెలుగునాట ప్రతి  గుడిముంగిట సమయసందర్భం వచ్చినప్పుడల్లా గుడిగంటలతో కలసి ప్రతిద్వనించడం అనూచానంగా వస్తున్న సదాచారం. 'వాక్కును మితంగా, పరహితంగా వాడితే అదే మంత్రమవుతుంది' అంటారు శ్రీశంకరులు. తామెల్లరూ భద్రంగా ఉంటూనే చుట్టుపక్కలవారందరూ క్షేమంగా జీవించాలని మనసా వాచా కాంక్షించే గొప్ప సంకల్పం 'యోగక్షేమం వహా మ్యహమ్'లో కల్పన చేయబడింది. అభయ హస్తం ఆశించి వచ్చినవాడు పరమశత్రువయినా సరే యోగక్షేమలయినా  విచారించకుండా తిప్పిపంపడం భారతీయులకి బొత్తిగా  సరిపడని సంస్కృతి. పరమబొంకుగా కొందరు భావించే భారతంలో సైతం అడుగడుగునా సత్సంప్రదాయాలు  కంటపడుతంటాయి. యుద్ధానికిముందు విధాయకం కనుక శకుని పనుపున  యాదవుల సాయమర్థించేందుకు ద్వారకాపురి చేరుకుంటాడు సుయోధన మహారాజు. కిట్టనివాడని కిట్టయ్యేమన్నా పలుచన చేసాడా! 'బావా! ఎపుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్- చుట్టముల్?'అంటూ యోగక్షేమాలన్నీ చట్టబెట్టి మరీ విచారిస్తాడు. తిరుపతి వేంకట కవుల 'పాండవోద్యోగ విజయాలు' లోని ఈ పద్యాలు నాటికే కాదు.. నేటికీ  ప్రతి తెలుగునోటా ప్రతిద్వనిస్తూనే ఉన్నాయి. కారణం? తెలుగునాట అతిథులను ఆత్మీయులుగా భావించి ఆదరించడమే!

'నోరు మంచి- ఊరు మంచి', 'మంచిమాట మనుగడకు ఊరట', 'ధన్యత్వం అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుట' లాంటి సూక్తులెన్నోచిన్నబళ్లల్లో బాలల నోళ్లల్లో సుళ్లు తిరుగుతుంటాయి తెలుగు ఊళ్లల్లో! 'ఐకమత్యమే అసలు బలిమి' అని, కలసి ఉంటేనే కలదు కలిమి' అని, 'విడిపోతే చెడిపోతాం.. చెడిపోతే పడిపోతా' మని పిల్లలనేమిటి.. పెద్దలూ వంటబట్టించుకొనవలసిన నిత్యజీవిత వ్యక్తిత్వ వికాస సూత్రాలు కావా! 'సదాచారం, సత్సంప్రదాయం సంకలించిన జీవనవిధానమే సంస్కృతి' అని వివేకానందుని నిర్వచనం. వ్యక్తిలోని మూర్తివంతమైన సంస్కృతే పరిణత మానవత్వంగా పరిమళించేది' అని భగవాన్ రమణ మహర్షి బోధనకూడా! మంచి నడవడిక, సంఘ న్యాయౌన్నత్యం, సుఖజీవనం, సర్వమానవ సౌభ్రాభృత్వం వంటి సుగుణాలు పెంపొందించే జీవకళలు వంద ఉదహరించాడు నాలుగో శతాబ్దినాటి క్షేమేంద్రుడు తన జౌచిత్య సిద్ధాంత విచారదారలో. తండ్రి లోభం. తల్లి మాయ. కుటిలనీతి సోదరుడు. కృతక వేషభాషాదులు. భార్య స్థానీయులు, హూంకరించే  పుత్రుడుఅమాకమానవుడి జీవితాన్ని నిర్వాకంచేసేందుకు బ్రహ్మదేవుడి పనుపుమీద దంభం ఇంత పెద్ద పరివారంతో భూమ్మీద సంచరిస్తుంటుంది. తస్మాత్ జాగ్రత్త'ని క్షేమేంద్రుడు ఆనాడే వ్యంగ్యంగా హెచ్చరించాడుమనిషిని మంచిబాట పట్టించాలన్న ఆరాటంగానే క్షేమేంద్రుడి వెటకారాన్ని స్వీకరించాలి. వాస్తవానికి తెలుగువారు .. భారతంలో నన్నపార్యుడు అన్నట్లు 'స్వస్థాన వేషభాషాభిమానులు'. స్వసంస్కృతీనిష్టులయీ, స్వదేశానురాగులయీ.. పరసంస్కృతులపట్ల సంసర్గం, పరాయి దేశాలపట్ల గౌరవం పుష్కలంగా ప్రదర్శించే సామరస్య జీవన దోరణే  అనాదినుంచి  హూందాగా పదర్శిస్తూ వస్తున్నది.

'సాహసం మూర్తిగైకొన్న సరణివారు' అని క్రీడాభిరామం వాడిన పదప్రయోగం తెలుగు'వాడి'కి సరిగ్గా అతికినట్లు సరిపోయేది. కోట సచ్చిదానందమూర్తిగారన్నట్లు 'ఆత్మాభిమానం, స్వాతంత్ర్య ప్రియత్వం.. ఒక ఆకు ఎక్కువవడం చేతనేమో.. విశాలదృక్పథం ఉండీ మనసు అడుగుపొరలకింద పడి ఉంది. 'నీ అడుగులకో తుదిగమ్యం అందాలంటే/ ఎడతెగని యెదురు దెబ్బలు - గమనించు మిత్రమా! గుండెను ఒక అద్దంలా తుడిచి చూసుకో నేస్తమా!' అంటారు డాక్టర్ సినారె.   ట్రాన్సాక్షనల్ ఎనాలసిస్ప్రతిపాదకుడు ఎరిన్ బెర్న్ సిద్ధాంతం ప్రకారం ప్రతివ్యక్తిలోనూ పెత్తనం ప్రదర్శించే పెద్దాయనా, కార్యశీలత కనబరిచే పెద్దమనిషి, గారాంబంగా ప్రవర్తించే పసిబిడ్డ ఉంటారు. 'సమయానికి తగు మాటలాడు' చాతుర్యం ప్రదర్శిస్తే చాలు! 'విద్వేషం వింధ్యపర్వతంలా  అడ్డం నిలబడ్డా.. నట్టింట్లో ఆనందం వెల్లువలా పొంగులెత్తుతుంద'న్నది బెర్న్ మార్కు పరిష్కారం. మైత్రి సంపాదనకైనా, కొనసాగింపుకైనా మాటపట్టింపే గదా ప్రధాన అవరోధం! అందుకే 'ఓహో.. నువ్వా!ఎక్కడ ఎప్పుడు ఏలాగ ఏంచేస్తున్నావు/ ఏ నక్షత్రంకింద సంచారం చేస్తున్నావు' అంటూ కవి అజంతా  సరళిలో కుశల ప్రశ్నల శరపరంపర మనోచాపంనుంచి వరసబెట్టి సంధిస్తే.. ఎదుటి వ్యక్తి ఎంతపాటి రావణాసురుడైతేనేమి.. విభీషణుడిమాదిరి మారి శ్రీరామాలింగనంకోసం పరితపించడం ఖాయం. ముదిగొండ శివప్రసాదు అన్నట్లు 'వేదాంతులు ఎన్ని గ్రంథాలు వ్రాసినా.. వాదాలు చేసినా/ ఈ రంగుల తెర ఇంద్రజాలం తెలియకనే!' నిజమేకానీ.. పరిస్థితుల్లో మంచిమార్పు ప్రస్తుతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 'మంత్రకవాటాలు తీయడం..మూయడం' వంటబట్టించుకొన్న ఇద్దరు చంద్రులు తెలుగురాష్ట్రాలు రెండింటికీ అధిపతులుగా ఉండటం కలసివస్తోంది. నవ్యాంధ్రపరదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన శుభసందర్బానే    తెలుగుసీమల సౌభాగ్యహార్మ్యాలకూ  సౌహార్ద్ర పునాది రాయి పడటం శుభసంకేతం. ఏపి ముఖ్యమంత్రి మనసారా  ఆహ్వానించడం.. తెలంగాణా ముఖ్యసచివులు అంతే హుందాగా స్పందించడం.. ఆనందదాయకం. 'ఏనాడో ఎదచేనిలో వెదజల్లిన స్నేహబీజాలు/ మొలకెత్తి పిలకలు వేసి/ మళ్లీ ఇన్నాళ్లకు మమతల ధాన్యపురాసులతో మనసుబండ్లను నింపడం' ఎవరికైనా ఎందుకు ఆనందం కలిగించదుఉభయకుశలోపరుల్లోనే తెలుగువారందరి అభివృద్ధి ఫలాలు దాగున్నాయని గదా ఆశఇద్దరు చంద్రుల పునస్సమాగనం అందుకే  ఆనందం.

***
(ఈనాడు అక్టోబరు 31, 2015 నాటి సంపాదకీయం)

Thursday, September 22, 2016

అవధానిగారి జీన్సు కోరిక- చిన్న కథ- గుడ్లదొన సరోజినీదేవి

అవధానిగారికి ఎప్పట్నుంచో కోరిక.. చిన్నకొడుకులాగా  ఒక జీన్స్ ప్యాంటు వేసుకోవాలని.
ఆయన వయసు అరవై దాటింది రెండేళ్ళ కిందటే. పుట్టినప్పట్నుంచీ పల్లెపట్టుల్లోనే వ్యవసాయంలో ఉండటం చేత పంచెలే తప్ప కనీసం తోటివాళ్ళలాగా మామూలు ప్యాంట్లయినా  కట్టుకుని ఎరగడు. ఇప్పుడు ఏకంగా జీన్సంటే.. నలుగురూ నవ్వి పోరూ!

' కాలంలో ఎవరికి పట్టింది! ఎవరిగోల వారిదిగా ఉంది లోకం. మీకంత మోజుగా ఉంటే వేసుకోరాదూ! భాగ్యమా..బంగారమా! ' అని సమర్థించింది భార్యామణి పున్నమ్మ కూడా. వూరికే సమర్థించడం కాదు.. ఎప్పుడు చెప్పిందో కాని.. చెన్నైలో ఉన్న చిన్నోడి దగర్నుంచి ఎల్లుండి పుట్టిన్రోజనంగా పార్సెల్ కూడా వచ్చేసింది.

బ్లూ కలర్ రగ్డ్ టైపు బ్రాండెడ్ అమెరికన్ కంపెనీ సరుకు. షర్టు.. మ్యాచయ్యేటట్లు ముచ్చటైన జీన్స్.. వుడల్యాండ్స్ వైట్ స్పోర్ట్స్ షూస్.

అంతా ఓకేనే గాని.. ప్యాంటు పొడుగు నాలుగంగుళాలు ఎక్కువైంది. అది మామూలే. రెడీమేడ్ డ్రెసెస్..ముఖ్యంగా ప్యాంట్లు.. షాపునుంచి కొన్నవి ఏవీ పొడుగులు సరిగ్గా ఫిట్టవవు. ఎవరి సైజుకి సరిపడా వాళ్ళే కట్ చేఇయించుకోవాలి.

నిజమే కాని.. అవధాని గారుండేది చిన్న పల్లెటూరు. ఊరు మొత్తానికి ఉన్నది ఒక్క టైలర్.. కాలీషా. వాళ్ళ కుటుంబంలో ఎవరో దగ్గరి వాళ్ళు పోవడం వల్ల కాలీషా మిషన్ పెట్టటం లేదు వారం రోజులుగా.

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడంటారు చుసారూ.. అలాగుంది అవధానిగారి పని.
ఎలాగైనా ఈ సారి పుట్టినరోజు పండక్కి జీన్సు వేసుకోవాలనే ఆయనగారి కోరిక. ఆదివారం పండగనగా.. శుక్రవారం రాత్రి  భార్యనడిగాడు.. ప్యాంటు పొడుగు రెండంగుళాలు తగ్గించి కుట్టివ్వమని. గయ్యిమంది ఇల్లాలు ఏ కళనుందో "ఇంటినిండా నన్ను కట్టుకుపోయేంతమంది పిల్లలుంటే వయస్సులో నేనే దొరికానా.. మీ సేవలకి. నా నడుం నొప్పితే నేను చస్తుంటే.. మీకిప్పుడు షోకులు కావాల్సొచాయా..షోకులూ!" అంటూ.
పాపం మానవుడు బిక్కచచ్చిపోయాడు. మళ్ళా మాట్లాడితే ఒట్టు.
మర్నాడు మళ్ళీ ప్రాణం పీకింది.. ఎట్లాగైనా ప్యాంటు కట్టుకు తీరాల్సిందేనని. పండక్కని పుట్టింటి కొచ్చున్న పెద్దకూతురు ముందు కోరిక వెళ్ళబెట్టాడు. ఆ సమయంలో ఆమె టీవీలో ఏదో సీరియల్ చూస్తోంది యమసీరియస్ గా. డిస్టర్బ్ చేసాడు తండ్రి అన్న కచ్చతో "నాన్నా..నువ్వేమన్నా షారూఖ్ ఖాన్ వా? ఈ వయసులో నీకీ పిచ్చేంటీ?"అంటూ విసుక్కుంది.
కూతురు మాటలకి కుంగిపోయారు పాపం అవధానిగారు.

'చపలత్వం వల్ల చిన్నపిల్లల దగ్గరకూడా చులకనైపొతున్నాడు. వెధవ ప్యాంటు తగలబడి పోనీ.. ఇంక నోరు విడిచి చచ్చినా ఎవరినీ అడగకూడదు. ఎప్పటిలాగానే కొత్త  పంచెల చాపు కట్టుకుంటే పేచీ ఉండదు' అని సర్దిచెప్పుకున్నాడు. ఆ ప్యాటును అట్లాగే నట్టింట్లో వదిలేసి పొలం పనులకి వెళ్ళిపోయాడు ఎప్పట్లాగా.

పుట్తినరోజు. పెందళాడే లేచి.. తలంట్లు వగైరా తతంగాలు ముగించుకుని గుడికి పోయి దైవదర్శనం చేసుకుందామని.. కొత్త పంచెలచాపుకోసం  పెట్టె తెరిస్తే.. పంచెలచాపుఏదీ?!
పెళ్ళాన్ని పిలిచి అడిగితే "అబ్బాయి ఇచ్చిన ప్యాంటు కట్టుకుంటానంటిరిగా.. అందుకే మీ కొత్త పంచెలచాపు గుళ్ళో పూజారిగారికి ఇచ్చేసా.. నిన్న. ప్యాంటు కట్టుకోండి ఈసారికి" అనేసింది.

"అవున్నాన్నా..నిన్న నేనేదో బ్యాడ్ మూడ్ లో వుండి నోరు జారా. సారీ! మీరు జీన్స్ ప్యాంటులో ఎలా వుంటారో.. పిల్లలు కూడా చూడాలనుకుంటున్నారు. కట్టుకు తీరాల్సిందే" అంటూ ప్యాంటు మడతలు విప్పి మరీ తండ్రి భుజం మీద వేసి గదిలోకి తోసేసింది కూతురు చనువుగా.

పెద్ద కొడుకు పిల్లలు కూడా చుట్టూ చేరి గోల చెయ్యడం మొదలు పెట్టారు " తాతయ్యా.. జీన్సువేసుకోవాలి.. తాతయ్యా.. జీన్సు వేసుకోవాలి" అంటో. తప్పదన్నట్లు నవ్వుతూ చూసారు పెద్ద కొడుకు.. పెద్ద అల్లుడు కూడా.

ఫోన్లోనుంచి చిన్నాడి బెదిరింపు "బోలెడంత పోసి కొన్నా నాన్నా! కట్టుకోక పోతే నా మనీ వేస్టు" అంటూ వార్నింగ్. చిన్నకోడలు వత్తాసు ఫోనులోనుంచే.

చివరికెలాగైతేనేం..అవధానిగారు..జీన్స్ ప్యాంటు ధరించారు.
కానీ..

ప్యాంటు మోకాలి కిందదాకానే వచ్చింది!

కారణం? ఒకరి తెలియకుండా ఒకళ్ళు.. భార్యా..కూతురు.. తలా ఓ రెండంగుళాలు తగ్గించి కుట్టేసారు. అత్తగారి మాటలు, ఆడపడుచు మాటలు చెవినబడ్డ పెద్దకోడలు మామగారి చిన్న బోయిన మొహం చూసి జాలిపడి చాటుగా తనూ ఒక రెండంగుళాలు..తగ్గించి కుట్టేసింది.

" ప్యాంటులో నువ్వు అచ్చంగా జోకర్ సినిమాలో రాజ్ కపూర్ లా వున్నావు తాతయ్యా!" అని మనమరాలు అల్లరి చేస్తుంటే చిన్నబోలేదు సరికదా అవధానిగారు.. చిరునవ్వులు చిందిస్తూ చిన్నపిల్లాడిలా భళ్ళున నవ్వేశారు.

ఇంట్లో వాళ్ళందరికి తనమీద ఉన్న ప్రేమ తల్చుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు.
ఆ ప్యాంటులోనే ఒక ఫొటో తీయించుకుని చెన్నైలో ఉన్న చిన్నకొడుకు, కోడలకి పంపించారు.

అవధానిగారి  చిన్ననాటి జీన్సు కోరిక అలా సుఖాంతమయింది.
మళ్ళా ఆయన జీన్సు ఊహను మనసులోకి రానీయలేదు.
ఆ ప్యాంటును  ఇంటిముందుకొచ్చిన బుడబుక్కలవాడికి ఉదారంగా ఇచ్చేయడంతో వాడి కళ్ళల్లోనే పెద్ద పండుగ ఉత్సాహం కనిపించి తృప్తి అనిపించింది అవధానిగారికి *
-గుడ్లదొన సరోజినీదేవి
(విపుల మాసపత్రిక ప్రచురణ- ఈనాడు యాజమాన్యానికి కృతజ్ఞతలతో)



Tuesday, September 20, 2016

ముళ్లపూడి 'పూల'రెబ్బలు!- చిరు వ్యాసం

ముళ్ళపూడి వెంకట రమణగారు మనకున్న హాస్య రచయితల్లో 'సీరియస్' హాస్యరచయిత. ఏ  రచయితకయినా ఓ బాణీ ఉంటుంది. ఉండాలి. అలా ఉండకుండా 'అల్లాటప్పా' గా రాసే  రచయితను.. సొంతంగా ఎంత ప్రొమోట్ చేసుకున్నా .. మొహమాటానికైనా  సమాజం గుర్తించినట్లు మొహమైనా పెట్టదు. ఆ బాపతు జాబితాలో లేనందువల్లే ము.వెం.రమణను గురించి మన ముచ్చట్లిక్కడ. 
ముళ్లపూడివారు విలక్షణమైన శైలిలో సునిశితమైన హాస్యరసౌషధాన్ని వడగట్టి మరీ రోగిష్టిమారి సమాజానికి అక్షర చికిత్స చేసిన హాస్య నారాయణుడు. మణిప్రవాళ భాష ఆయన ప్రత్యేకత. 'పురాణం' సీత వచ్చే వరకు.. (వచ్చిన తరువాత కూడా).. ఆ మిక్సరు  శైలిలో అంతగా గిలిగింతలు పెట్టిన వినోద రచయితలు ఆ స్థాయిలో మనకు  దొరకరు. అతిశయోక్తికో.. అలంకారానికో అంటున్న మాట కాదిది.
ఒక భాషలోని పదాలను మరో భాషలోకి పట్టుకొచ్చినా.. 'పరాయి పదాలు' అవన్నీఅంటూ  మరెవరో  పనిగట్టుకొని వచ్చి దెప్పిపొడిచేదాకా చదువరి బుద్ధికి తోచనంత గడుసుగా రాసుకు పోవడం ముళ్లపూడివారి కలం బలం. ఒకసందర్భంలో ఆయనే  'ప్రారంభంలో   'మణి ప్రవాళ భాష'ను ప్రయోగిస్తున్నప్పుడు.. ప్రచురించేందుకు పంపించిన పత్రికాఫీసుల్లోని దిద్దుబాటు పెద్దలు (ఎడిటర్లు) ఆంగ్లపదాలను పనిగట్టుకొని మరీ దిద్దిపెడుతుండేవారు. ప్రతీ రచనకు ఒక తనదైన పరిమళం (ఎస్సెన్సు) ఉంటుది కదా! ఆ సౌరభాన్ని సమాజం గుర్తించే వరకు పాలుమాలకుండా నేను అలా రాసుకుంటూ పోవడమే  రచయితల శ్రేణిలో నా పాలుగా  నేను సాధించుకున్న విజయం.. ఏదైనా ఉంటే!'.. అంటారు. సరిగ్గా ఇలాగే అనక పోయినా ఈ అర్థం వచ్చేవిధంగా చాలా సందర్భాల్లో చెప్పుకొస్తుండేవారు.
ముళ్లపూడి వారిది మరీ విదూషక సాహిత్యం అనుకుంటే ఆయన అక్షరాన్ని  సరిగ్గా అర్థం చేసుకోనట్లే. విషయం ఎంత గంభీరమైనదయినా సరే .. చదువరుల బుద్ధికి సరళంగా.. సర్దాగా..  ఎక్కించేటందుకు ఆయన స్వయంగా కనిపెట్టుకున్న కనికట్టు విద్య ఆయన శైలి. 'సీరియస్' అంశాన్ని సీరియన్ గానే రాయలేక ఈ అగచాట్లన్నీఅని విమర్శలకు దిగేవారికి ఆయన 'కానుక' కథ   ఒక చక్కని సమాధానం.
ముళ్లపూడి వెంకట రమణ లేకపోయుంటే 'హలో! ఓ ఫైవుందా?' అంటూ వెంటబడే అప్పుల అప్పారావు పుట్టుండేవాడు కాదు. బుడుగు.. సీగాన పెసూనాంబల అల్లరితో తెలుగిళ్ళు తుళ్ళి పడుండే ఆస్కారం ఉండేది కాదు. రాధా గోపాళాల సరిగమల సరాగాలతో తెలుగు సాహిత్యపు పడకటిళ్ళు  శృంగారభరితమై ఉండేవి కావు. బాబాయి.. పొడుగు జడల సీత.. పక్కింటి లావుపాటి పిన్నిగారి మొగుడుగారు.. జట్కావాడు..ఓత్లవాడు.. పెట్టే ప్రయివేట్లు తెలుగు ప్రజలకు దక్కే లక్కుండేది కాదు. తెలుగు సాహిత్యానికి   బాపు 'బొమ్మ'ను అందిస్తే ఆ బాపూబొమ్మకు చిలక పలుకులు  నేర్పించింది ముళ్లపూడి వెంకట రమణే.
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 'ముళ్లపూడి వెంకట రమణ సాహితీ సర్వస్యం' పేరిట  కథలు రెండు సంపుటాల్లో, బాల సాహిత్యం ఒక సంపుటం, సినిమా విశేషాలు రెండు సంపుటాల్లో, అనువాదాలతో ఒక సంపుటం.. అఖరున కదంబ సాహిత్యం గుదిగుచ్చిన రెండు సంపుటాల్లో.. (నాకు తెలిసినంత వరకు) శ్రీ ఎమ్బీఎస్ ప్రసాద్ గారి సంపాదకత్వంలో ప్రచురించారు. దాదాపుగా ఇవన్నీ నేను వివిద పత్రికల్లో చదివినవయిప్పటికీ అన్నింటినీ ఒకే చోట గుదిగుచ్చిన పూమాలలు కాబట్టి   నా చిన్ని గ్రంధాలయంలో  ఇష్టంగా అమర్చుకొని .. 'మూడ్' బావో లేనప్పుడల్లా .. ఆఘ్రాణిస్తుంటాను. హాస్యం.. వ్యంగ్యం నా విశ్రాంత సమయానికి ఇంత విలువను.. కొంత 'విలువలను' అందించే  దినుసులు.
ముళ్లపూడివారిని గురించి సమగ్రంగా.. సాధికారికంగా చర్చించే పాటి విద్వత్తు నాకు సరిపడినంతగా లేకపోవచ్చు. కానీ అభిమానం ఊరికే కూర్చోనీయదు కదా! అందుకే అప్పుడప్పుడూ నన్నిలా కాగితంబజారుకీడ్చుకొచ్చి  అల్లరి పెడుతుంటంది. అధికప్రసంగంగా అనిపించినా  సహృదయంతో అర్థం చేసుకుంటారని నమ్మకం. ఆ ధీమాతోనే  అప్పుడప్పుడు.. ఇలా.. తోచింది  తోచినట్లు పదుగురితో పంచుకునే సాహసం చేస్తున్నది.
'ఈ భూ ప్రపంచంలో ఎదుటి వాడినుంచి కృతజ్ఞత ఆశిస్తే.. నుదుటి తలబొప్పులు తప్పవ'న్నది ముళ్లపూడి వారి ఒక పాత్ర ఫిలాసఫీ. అంధ్రారాజకీయాల్లోని అనైకమత్యాన్ని ఆనాడే పసిగట్టిన మహానుభావుడు.  కాబట్టే.. ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని అందరికి మల్లేనే ఆంధ్రుడై ఉండీ తూర్పార పట్టి మరీ పరువు తీసేసాడు. 'యథార్థవాదీ.. లోక విరోధీ' కనక .. నిజాలేమన్నా చెప్పాలనుకున్నప్పుడు తను సృష్టించిన పాత్రల ద్వారా వెంట్రిలాక్విజం చేయించే కళను నమ్ముకున్నాడు ముళ్లపూడి. తెలుగు వాడిని  నవ్వించడం కష్టం. కవ్వించడం సులభం. కవ్వించి రాళ్ళు రువ్వించే బాపతు కుళ్లుబోతురాయుళ్ళ ఆటల్నుంచి అప్పుడప్పుడైనా అమాయకమైన తెలుగు జాతికి రవ్వంత విశ్రాంతి కల్పించాలన్న  పేరాశ ఏదో ముళ్లపూడివారిని ఈ నవ్వుల ముళ్లబాట పట్టించినట్లుంది. దారి మరీ కంటక ప్రాయంగానే ఉన్నా .. నిప్పులు కురిసే  కళ్లనుంచే ఉప్పటివైనా.. తీయటి కన్నీటి బొట్లు రెండు రాల్పించాలన్న వాత్సల్యమే  ఆయన చేత  'కోతి కొమ్మచ్చులు' ఆడించింది. ఆయన విషాద విదూషక    వైదుష్యం సాహిత్య చరిత్ర పుటల్లో పదిలంగా నిలిచిపోయింది. 'రాయడం' అక్షరం వచ్చిన ప్రతీవాదూ  చేసే చేతిపనే. అదేం బ్రహ్మవిద్య కాదు.  చేతిలో ఉన్న ఆ దివ్యవిద్యకు తోడుగా మానవత్వం జోడించడమే ముళ్లపూడివారి లోకంమీది ప్రేమకు నిదర్శనం. ఆయనే ఒక సినిమాకి రాసిన సంభాషణల్లో అన్నట్లు ' నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు. ఏడుపొచ్చినప్పుడూ  నవ్వే  వాడే హీరో. ఆలాంటి హీరోలను తయారుచేసే ముళ్లపూడిని మరేమని పిలుచుకోవాలి?!
బాపుతో జత కలసిన  వేళా విశెషం. కొన్ని తరాలు తెలుగువారిని  ఆయనతో కలసి   ఊపేసారు. ఊపేస్తున్నారు.  ప్రస్తుతం మన మధ్య  లెకపోతేనేం..  తెలుగు నవ్వుల నదుల్లో..  లాహిరి ప్రయాణం చేయాలని సరదా పడే   హస్యరస ప్రియులకు ఆయన.. భావపుష్పాల.. భాషాపుష్పాల  జల్లులతో ముంచెత్తెయ్యడానికి సదా సిద్ధం!
ముళ్లపూడి వారలా  వెదజల్లిన పూలవానలనుంచి ఏరి పోగేసిన  కొన్ని మణులు.. మాణిక్యాలుః


'కరవుప్రాంతంనుంచి వచ్చిన అర్జీమీద తపాళాబిళ్ల అతికించడానిక్కూడా నాలికలు తడారిపోయున్నందువల్లా, నీటి చుక్క పుట్టనందువల్లా స్టాంపును గుండుసూదికేసి గుచ్చి పోస్టులో వేశారుట'
-రాజకీయ బేతాళ పంచ విశంతిక

'సినిమా కథలు వారఫలాల వంటివి. తారాబలాలను బట్టి మారుతుంటాయి'!
-విక్రమార్కుడి మార్కు సింహాసనం కథలు

'బుడుగుః నాకు కోపం వస్తే 'జాటర్ డమాల్' అంటాను. ఆ మాటకు అస్సలు అర్థం లేదంటాడు నాన్న. ఎందుకు లేదు? ఉంటుంది. తెలియాలి అంతే! జాటర్ డమాల్ అంటే అర్థం లేదూ అని అర్థం అన్నమాట.'
-బుడుగు నవలలో

'కోటీశ్వరి ఒకానొక్క కొడుకుని పకడ్ బందిఖానాలో పెంచింది'
-పెళ్ళికొడుకు సినిమా

'ఇంట్లో కుక్కల్నుంచుకుంటారుట్రా ఎవరైనా? మధురవాణ్ణుంచుకుంటారు. ఆవకాయనుంచుకుంటారు. ఆస్తులు పంచుకుంటారు. కానీ కుక్కపిల్లను పంచుకోడమేవిట్రా?'
-రావికొండల్రావుమీద వ్యాసం రాస్తూ

'రాక్ ఫెల్లర్ కి ఎంత డబ్బున్నా జేబులో  వేసుకు తిరగడు కదా! ఓ అర్థణా బఠాణీలు కొనబోయినప్పుడు చెక్కులిస్తే వాడు పుచ్చుకోడు కదా! అప్పు చెయ్యకేం చేస్తాడు పక్కవాడి దగ్గర?
-ఱుణానందలహరి
ఇలా చెప్పుకొంటూ పోతే.. కడుపు చెక్కలయ్యే ప్రమాదం కద్దు. అంచేత ప్రస్తుతానికి 'ది ఎండ్'.. పైనున్న పెద్దాయనికి మనసారా స్మృత్యంజలి సమర్పించుకుంటో!

-కర్లపాలెం హనుమంతరావు

Sunday, September 18, 2016

కొన్ని ఆలోచనా శకలాలు


కర్లపాలెం హనుమంత రావు॥కొన్ని ఆలోచనా శకలాలు॥
1
ఈ చినుకు
ఏ సముద్ర
ఆనందబాష్పమో!
2
ఎవరన్నారు
కాలం గుప్పిట్లో చిక్కదని?
నాన్న ఫొటో!
3
కుట్టకుండా వదిలేసింది
గండు చీమ
ఎంత విశాల హృదయమో!
4
కంటికీ చేతులుంటే
ఎంత బాగుణ్ణో
కదా ఊహాప్రేయసీ!
5
ఎక్కినా
దిగినా
అవే మెట్లు
6
నలుపు తెలుపుల్లో
ఎన్ని రంగులో
పాత మిత్రుల గ్రూప్ ఫోటో!
7
మాయాలోక విహారం
పుస్తకం
కీలుగుర్రం
8
కోయిల కూస్తోంది
మావి చిగురు
మిగిలుందని!
9
మింటి మీదా
వంటి మీదా అర్థచంద్రులు
రాత్రి సార్థకం
10
తట్టి
తడిపింది
హైకూ
11
ఫొటోలోని బాబుకి తెలుసా
తనలాంటితనే తనను చూస్తాడని
నా పాతఫోటొ మాబాబు చేతుల్లో!

చురకలు- చిరు కవితలు

1

వాడు మొదలుపెడతాడు
అది పూర్తి చేస్తుంది
మందు
2
ఎఫ్ డి ఐ
ఏ ‘చిల్లర’గాళ్ళ కోసమో!
3
గిరి గీసుకుని బతికే వాళ్ళే
నిఖార్సైన
‘గిరి’జనులు
4
 కాయ
వేరు 'కాయకష్టం'
చేరు
పెద్దింటి పండ్లకొష్టం 
సమాజ సంపదకూ
అదే సూత్రం
5
ప్రతి కుక్కకూ ఒకరోజొస్తుంది
స్లం డాగ్స్ కి
ఆస్కార్ రాలా!
6
దేవుడి గుడికి
బంగరు తొడుగు
దీనుడి గుడిసెకు
అంబరం గొడుగు!
7
సిగ్గు లేదూ!
పట్టపగలే
పసిపిల్లలా ముందూ…!
ఛీ..ఛా…నల్సు
కంట్లో నలుసు
8
అమ్మేసినా
బెయిలొస్తుంది
బొమ్మేస్తే మాత్రం
జెయిలొస్తుంది!
9
ఇసుకకీ కరువే
ఎక్కడి దుమ్మూ
ఎత్తిఓసుకోడానికే చాలడం లేదు!
10
కంచే చేనుని మేస్తుందా!
మేసేసింది
కంచే కాని
చేను ఎక్కడా కనిపించడం లేదు అ
11
రాత్రి పగలూ
తేడా లేదు
మున్సిపాల్టి వీధి దీపాలకి
12
ముని వేషంలో రావణుడు
వటువు వేషంలో వామనుడు
రైతు వేషంలో ఇప్పుడు
నాయకుడు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...