Thursday, September 29, 2016

ఉభయ కుశలోపరి- ఈనాడు సంపాదకీయం

'స్నేహం- తేనెమనసుల్లో వెల్లివిరిసే నాకం' అన్నాడో ఆధునిక కవి. జీవితం  కురుక్షేత్ర రణక్షేత్రమయినప్పుడు విజయానికి సారథ్యం వహించేదీ స్నేహమే! కృష్ణుణ్ణి కుచేలుణ్ణి కలిపి ఉంచింది, రాముణ్ణి రావణాసురుడి సోదరుణ్ణి కలిపి నడిపించిందీ ఈ స్నేహసౌహార్ద్రమే! 'సర్వే భవన్తు సుఖినః/ సర్వే సన్తు నిరామయా/ సర్వే  భద్రాణి  పశ్యంతు/ మా కశ్చత్ దుఃఖ  భాగ్భవేత్'- అందరు సుఖంగా, నిశ్చింతగా ఉండాలి. ఆయురారోగ్యాలతో ప్రవర్థిల్లాలి. మంగళవచనాలు వీనులకు, మంగళకార్యాలు కళ్లకు విందులు చేయాలి. ఏ ఒక్కరూ దుఃఖభాజితులు కారాద'ని కోరుకొనే 'మంగళాచరణం' తెలుగునాట ప్రతి  గుడిముంగిట సమయసందర్భం వచ్చినప్పుడల్లా గుడిగంటలతో కలసి ప్రతిద్వనించడం అనూచానంగా వస్తున్న సదాచారం. 'వాక్కును మితంగా, పరహితంగా వాడితే అదే మంత్రమవుతుంది' అంటారు శ్రీశంకరులు. తామెల్లరూ భద్రంగా ఉంటూనే చుట్టుపక్కలవారందరూ క్షేమంగా జీవించాలని మనసా వాచా కాంక్షించే గొప్ప సంకల్పం 'యోగక్షేమం వహా మ్యహమ్'లో కల్పన చేయబడింది. అభయ హస్తం ఆశించి వచ్చినవాడు పరమశత్రువయినా సరే యోగక్షేమలయినా  విచారించకుండా తిప్పిపంపడం భారతీయులకి బొత్తిగా  సరిపడని సంస్కృతి. పరమబొంకుగా కొందరు భావించే భారతంలో సైతం అడుగడుగునా సత్సంప్రదాయాలు  కంటపడుతంటాయి. యుద్ధానికిముందు విధాయకం కనుక శకుని పనుపున  యాదవుల సాయమర్థించేందుకు ద్వారకాపురి చేరుకుంటాడు సుయోధన మహారాజు. కిట్టనివాడని కిట్టయ్యేమన్నా పలుచన చేసాడా! 'బావా! ఎపుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్- చుట్టముల్?'అంటూ యోగక్షేమాలన్నీ చట్టబెట్టి మరీ విచారిస్తాడు. తిరుపతి వేంకట కవుల 'పాండవోద్యోగ విజయాలు' లోని ఈ పద్యాలు నాటికే కాదు.. నేటికీ  ప్రతి తెలుగునోటా ప్రతిద్వనిస్తూనే ఉన్నాయి. కారణం? తెలుగునాట అతిథులను ఆత్మీయులుగా భావించి ఆదరించడమే!

'నోరు మంచి- ఊరు మంచి', 'మంచిమాట మనుగడకు ఊరట', 'ధన్యత్వం అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుట' లాంటి సూక్తులెన్నోచిన్నబళ్లల్లో బాలల నోళ్లల్లో సుళ్లు తిరుగుతుంటాయి తెలుగు ఊళ్లల్లో! 'ఐకమత్యమే అసలు బలిమి' అని, కలసి ఉంటేనే కలదు కలిమి' అని, 'విడిపోతే చెడిపోతాం.. చెడిపోతే పడిపోతా' మని పిల్లలనేమిటి.. పెద్దలూ వంటబట్టించుకొనవలసిన నిత్యజీవిత వ్యక్తిత్వ వికాస సూత్రాలు కావా! 'సదాచారం, సత్సంప్రదాయం సంకలించిన జీవనవిధానమే సంస్కృతి' అని వివేకానందుని నిర్వచనం. వ్యక్తిలోని మూర్తివంతమైన సంస్కృతే పరిణత మానవత్వంగా పరిమళించేది' అని భగవాన్ రమణ మహర్షి బోధనకూడా! మంచి నడవడిక, సంఘ న్యాయౌన్నత్యం, సుఖజీవనం, సర్వమానవ సౌభ్రాభృత్వం వంటి సుగుణాలు పెంపొందించే జీవకళలు వంద ఉదహరించాడు నాలుగో శతాబ్దినాటి క్షేమేంద్రుడు తన జౌచిత్య సిద్ధాంత విచారదారలో. తండ్రి లోభం. తల్లి మాయ. కుటిలనీతి సోదరుడు. కృతక వేషభాషాదులు. భార్య స్థానీయులు, హూంకరించే  పుత్రుడుఅమాకమానవుడి జీవితాన్ని నిర్వాకంచేసేందుకు బ్రహ్మదేవుడి పనుపుమీద దంభం ఇంత పెద్ద పరివారంతో భూమ్మీద సంచరిస్తుంటుంది. తస్మాత్ జాగ్రత్త'ని క్షేమేంద్రుడు ఆనాడే వ్యంగ్యంగా హెచ్చరించాడుమనిషిని మంచిబాట పట్టించాలన్న ఆరాటంగానే క్షేమేంద్రుడి వెటకారాన్ని స్వీకరించాలి. వాస్తవానికి తెలుగువారు .. భారతంలో నన్నపార్యుడు అన్నట్లు 'స్వస్థాన వేషభాషాభిమానులు'. స్వసంస్కృతీనిష్టులయీ, స్వదేశానురాగులయీ.. పరసంస్కృతులపట్ల సంసర్గం, పరాయి దేశాలపట్ల గౌరవం పుష్కలంగా ప్రదర్శించే సామరస్య జీవన దోరణే  అనాదినుంచి  హూందాగా పదర్శిస్తూ వస్తున్నది.

'సాహసం మూర్తిగైకొన్న సరణివారు' అని క్రీడాభిరామం వాడిన పదప్రయోగం తెలుగు'వాడి'కి సరిగ్గా అతికినట్లు సరిపోయేది. కోట సచ్చిదానందమూర్తిగారన్నట్లు 'ఆత్మాభిమానం, స్వాతంత్ర్య ప్రియత్వం.. ఒక ఆకు ఎక్కువవడం చేతనేమో.. విశాలదృక్పథం ఉండీ మనసు అడుగుపొరలకింద పడి ఉంది. 'నీ అడుగులకో తుదిగమ్యం అందాలంటే/ ఎడతెగని యెదురు దెబ్బలు - గమనించు మిత్రమా! గుండెను ఒక అద్దంలా తుడిచి చూసుకో నేస్తమా!' అంటారు డాక్టర్ సినారె.   ట్రాన్సాక్షనల్ ఎనాలసిస్ప్రతిపాదకుడు ఎరిన్ బెర్న్ సిద్ధాంతం ప్రకారం ప్రతివ్యక్తిలోనూ పెత్తనం ప్రదర్శించే పెద్దాయనా, కార్యశీలత కనబరిచే పెద్దమనిషి, గారాంబంగా ప్రవర్తించే పసిబిడ్డ ఉంటారు. 'సమయానికి తగు మాటలాడు' చాతుర్యం ప్రదర్శిస్తే చాలు! 'విద్వేషం వింధ్యపర్వతంలా  అడ్డం నిలబడ్డా.. నట్టింట్లో ఆనందం వెల్లువలా పొంగులెత్తుతుంద'న్నది బెర్న్ మార్కు పరిష్కారం. మైత్రి సంపాదనకైనా, కొనసాగింపుకైనా మాటపట్టింపే గదా ప్రధాన అవరోధం! అందుకే 'ఓహో.. నువ్వా!ఎక్కడ ఎప్పుడు ఏలాగ ఏంచేస్తున్నావు/ ఏ నక్షత్రంకింద సంచారం చేస్తున్నావు' అంటూ కవి అజంతా  సరళిలో కుశల ప్రశ్నల శరపరంపర మనోచాపంనుంచి వరసబెట్టి సంధిస్తే.. ఎదుటి వ్యక్తి ఎంతపాటి రావణాసురుడైతేనేమి.. విభీషణుడిమాదిరి మారి శ్రీరామాలింగనంకోసం పరితపించడం ఖాయం. ముదిగొండ శివప్రసాదు అన్నట్లు 'వేదాంతులు ఎన్ని గ్రంథాలు వ్రాసినా.. వాదాలు చేసినా/ ఈ రంగుల తెర ఇంద్రజాలం తెలియకనే!' నిజమేకానీ.. పరిస్థితుల్లో మంచిమార్పు ప్రస్తుతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 'మంత్రకవాటాలు తీయడం..మూయడం' వంటబట్టించుకొన్న ఇద్దరు చంద్రులు తెలుగురాష్ట్రాలు రెండింటికీ అధిపతులుగా ఉండటం కలసివస్తోంది. నవ్యాంధ్రపరదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన శుభసందర్బానే    తెలుగుసీమల సౌభాగ్యహార్మ్యాలకూ  సౌహార్ద్ర పునాది రాయి పడటం శుభసంకేతం. ఏపి ముఖ్యమంత్రి మనసారా  ఆహ్వానించడం.. తెలంగాణా ముఖ్యసచివులు అంతే హుందాగా స్పందించడం.. ఆనందదాయకం. 'ఏనాడో ఎదచేనిలో వెదజల్లిన స్నేహబీజాలు/ మొలకెత్తి పిలకలు వేసి/ మళ్లీ ఇన్నాళ్లకు మమతల ధాన్యపురాసులతో మనసుబండ్లను నింపడం' ఎవరికైనా ఎందుకు ఆనందం కలిగించదుఉభయకుశలోపరుల్లోనే తెలుగువారందరి అభివృద్ధి ఫలాలు దాగున్నాయని గదా ఆశఇద్దరు చంద్రుల పునస్సమాగనం అందుకే  ఆనందం.

***
(ఈనాడు అక్టోబరు 31, 2015 నాటి సంపాదకీయం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...