Friday, December 8, 2017

'తప్పు’డు మనుషులు- ఆంధ్రప్రభ దినపత్రికలోని సరదా వ్యాసం



అదృష్టం బాగుండి మనం మనుషులుగా పుట్టేసాం. ఏ దున్నపోతుగానో జన్మెత్తుంటే జీవితాంతం గడ్దీ గాదం కోసం మాత్రమే అల్లాడాల్సొచ్చేది. థేంక్ గాడ్! గాడిదగా పుట్టించలేదు మమ్మల్ని. బడిబిడ్డల  స్కూలు బ్యాగుల్ని మించిన మైల బట్టలు మోసీ మోసీ నాలుక్కాళ్ళు చచ్చుబడుండేవి. ఏ కుక్కగానో పుట్టించినా గతంలో  కొంత బెటరేమో గానీ.. ప్రెజెంట్లీ నాట్ ప్లెజెంట్ డేస్! రోజులు బా లేవు. బడా నేతల ట్విట్టరు ఎకౌంట్లు కొత్తగా నెత్తికి చుట్టుకుంటున్నయ్! కాకులుగా పుట్టినా ఓకే నే! సర్కారీ నౌఖరీల్లో దూరి  ఏ  కాకిలెక్కల్తోనో కాలక్షేపం చేసేయచ్చు కానీ  పద్దాకా లెక్కలడిగి పీడిచ్చేస్తున్నాయ్ ఈ మధ్య ప్రభుత్వాలన్నీ. మా చెడ్డ చిక్కులొచ్చి పడుతున్నయ్ వీటి చాదస్తంతో! ఆ గండం నుండి గట్టిక్కించావ్ దేవుడా! గండర గండడు మనిషి. వాడి జాతిలో పుట్టించేసావ్! ఇహ ఇప్పుడెన్ని తప్పులు చేసినా బదులు చెప్పే ఇబ్బందే లేదు. ధన్యవాదాలయ్యా దయమయా.. కోడి మాదిరిగా పుట్టించనందుక్కూడా!  తెల్లారగట్టే పర్ఫెక్టుగా లేచి కూసి కూసి చచ్చే పని తప్పించావు నాయనా! కొంగలా పుట్టిస్తావేమోనని బెంగ పడి చచ్చాను! ఇంత బుల్లి చేప్పిల్ల నోట పడాలన్నా తెల్లార్లూ ఒంటి కాలు మీద  దొంగ జపాలు చెయ్యాలయ్యా చన్నీళ్ళల్లో! ఆ పాట్లన్నీ తప్పించినందుకు వేన  వేన దండాలయ్యా ఆపద్భాంధవా! తోకల్లేక పోతేనేమిలే? తప్పులు చేయడమే ఓ గొప్ప హక్కుగా  భావించే మానవ జాతిలోకి మమ్మల్ని తోసి  తిప్పలు తప్పించావుగా తండ్రీ.. మెనీ మెనీ  థేంక్స్ దయామయా!
ఏ తప్పూ చేయడం రాని చవట జాతులు సృష్టిలో సవాలక్ష ఉన్నాయి. గద్ద గురి తప్పకుండా గంప కిందున్న కోడి పెట్టను  కొట్టుకు పోగలదు. ఎట్లాంటి అంట్లవెధవ అడిగినా పొలమారకుండా చిలక  పర్ఫెక్టుగా జోస్యం కార్డు బైటికి తీసేయగలదు.  ఎంత్తెత్తు నుంచైనా  దూకించు.. పిల్లి ముంగాళ్ల మీదనే మొగ్గ్గేసి నిలబడగలదు. కొమ్మ నుంచి కొమ్మ మీదకు గెంతే కొద్ది టైములో కూడా కోతిది పర్ఫెక్టు టైమింగు! జెమినీ సర్కసు మార్కు పర్ఫెక్టు ఫీట్సన్నీ చేసే జీవులు సృష్టిలో  లక్షా తొంభై ఉన్నాయ్! అయినా మిస్టేకుల మీద మిస్టేకులు మాత్రమే చేసి నవ్వించే   జోకర్  జాతిలోకే మమ్మల్ని  తోసి పుణ్యం కట్టుకున్నావయ్యా పరంధామా!  అడుగడుక్కీ తడబడి పోవడం.. తడవ తడవకీ గొడవలు పడిపోవడం.. భలే థ్రిల్లింగుగా ఉందిలే ఈ మానవ జన్మ. మహా ప్రసాదం స్వామీ నీ  దయా దాక్షిణ్యాలకి!
మనిషి పుట్టుక కాబట్టి మడత పేచీలుండవు. పంచపాండవులు ఎంతమందని ఏ మందమతొచ్చి అడిగినా మంచం కోళ్ల మాదిరి ముగ్గురేనని ముచ్చటగా దబాయించేయచ్చు. రెండు వేళ్లకు బదులు ఒక్క వేలు చూపించినా వేలెత్తి చూపించే హక్కు ఏ భోషడిక్కీకీ లేదు. ఏ తప్పూ చేయకుంటే లైఫు మరీ ఓల్డు లైలా మజ్నూ మూవీలా  బోర్ కొట్టి చావదా? ఆ వినోద రహస్యం తెలుసును కాబట్టే .. గెజిట్ జీ. వో లు అవీ   తప్పులేవీ లేకుండా ఛస్తే రిలీజు చెయ్యరీ సర్కారీ నౌఖర్లు. ఆ జీవులూ నీ సృష్తిలీలలే  కదా .. తప్పులెలా దొర్లకుండా ఉంటాయిలే మహానుభావా?
తప్పులున్నంత కాలమే జైళ్లుండేది. జైళ్లున్నంత కాలమే జైలధికారులుండేది. జైలధికారుల కదికారమున్నంత కాలమే తప్పులు యధేఛ్చగా జరుగుతుండేది. ఏ తప్పులూ ఎవరూ చేసి సహకరించక పోతే అసలు  ముప్పు ముందు మీడియా దొరలకే కదా..  మేత దొరక్క! 
పర్ఫెక్టుగా బతకాలనుకొనే చాదస్తపు జీవికి మానవ  జన్మ శుద్ధ వేస్ట్. నేరాలవీ భారీగా చేసేసి ఆనక కన్నీళ్ళు గట్రా  కుండల కొద్దీ కార్చినప్పుడే పబ్లిక్కులో సింపతీ ప్లస్సయ్యేది. ఏ తప్పూ చేయడం రాక తగుదునమ్మా అంటూ రాజకీయంలకి జొరబడ్డా.. ఎంత దొరసాని బిడ్డ కథయినా డ్యామిట్.. అడ్డం తిరుగడం ఖాయం! 'అయ్యో.. పాపం' అంటూ అమాయకుల చేత  కావిళ్ల కొద్దీ కన్నీళ్లు కార్పించాలి. పాప్యులారిటీ పెరగాలంటే పద్దాకా  పప్పులో తప్పకుండా కాలేస్తుండాలి. తప్పదు. మిస్టేకుల్ని మించిన ట్రిక్ పాలిటిక్సులో మరోటి  లేదు మరి!
యమర్జన్సీ తప్పు తరువాతే ఇందిర 'అమ్మ'గా ఎమర్జయింది. ‘మహానేత’గా మేక్ ఇన్ ప్రాసెస్ లో మొహమాటాల కస్సలు తావుండ కూడదన్నా! పట్టు బట్టి మిస్టేక్స్ చేసినప్పుదే  జనం మీద పట్టు దొరికేదక్కా! 
'తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు' అన్న వేమన వాస్తవానికి ఓ వెర్రినాగన్న. 'ఒపీనియన్స్ డిఫరైతే గాని పొలిటీషియన్ కానేరడ'న్నాడయ్యా గురజాడగారి గిర్రాయి! మిస్టేక్స్ మీద పొలిటీషియనుకే మిస్టర్ పర్మినెంట్ పేటెంట్ రైట్స్! 
తప్పును తప్పు అని కుండ బద్దులు కొట్టే పూర్ శరద్ యాదవ్ సిన్సియార్టీ.. తప్పే ఒప్పని దబాయించి మరీ బుర్ర బద్దలు కొట్టేసే  లల్లూ యాదవ్ పాప్యులార్టీ ముందు బలాదూర్!  జయమ్మ కుర్చీ పక్కనే కూలపడుండేది శశికళమ్మ ఎల్ల వేళలా. ఎన్ని తప్పులు చేయందే చెలికత్తె నుంచి చిన్నమ్మ స్థాయికి ఆ మహాతల్లి ఎగబాకినట్లు? కాణీకి.. ఏగాణీకి మొగంవాచి బోలెడన్ని తప్పులకు బోల్డుగా ఒడిగట్టింది.. కాబట్టే కనిమొళి ప్రభ  తమిళనాట ఇంకా  కొడిగట్టకుండా వెలిగిపోతోంది.
తప్పు చేయడం అంటే ఓ కొత్త వివాదం సృష్టించడం. కొత్త కొత్త నినాదాలకు ఉప్పందించడం. జడ్జీల నుంచి బెంచి క్లర్కుల వరకు అందరూ బాగుండాలి. అందుకే దండిగా తప్పులు జరుగుతుండాలి! పొరపాట్లు చెయ్యమని మొండికేస్తే ఎట్లా?  ఇహ పోలీసులెందుకు? జైళ్లెందుకు? దండక్కదా!. దొంగలకు, దొరలకు మధ్య ఉండే పల్చటి తెర ఈ తప్పుల తడికే నప్పా! 
తప్పుల్ని తప్పు పట్టడం పెద్ద తప్పు. 'పొరపాటయిపోయింది.. సరిదిద్దండి' అన్న రెండు ముక్కలకుండే దమ్ము కొరియా కిమ్ము  అణుబాంబుకైనా  ఉండదండీ బాబూ! మిస్టేక్సుల్లో టెస్టు పెడితే ప్రశ్నపత్రాలు సెట్ చేసే మాష్టర్సుదే ఫస్టు ర్యాంకు. పేజీకి ఈజీగా నాలుగైదైనా తప్పులుండాలి. లేకుంటే లేజీ ఫెలోసని లోకమెక్కడ  లోకువ కడుతుందోనని శంక. వివాదాలేవీ లేకుండా ఆన్సర్ 'కీ', హానర్ పోస్ట్, నంది అవార్డు, బయో పిక్కు, టీ.వి చర్చ ముగిసాయంటే..  ఎక్కడో కచ్చితంగా ఏదో తప్పు జరిగినట్లే! మానవ జన్మమీద మచ్చ పడ్డట్లే!
మనిషిగా పుట్టించి మనకు నిత్యం తప్పులు చేసే మంచి అవకాశం కల్పించాడు దేవుడు. పర్ఫెక్షనో అంటూ చాదస్తానికి పోయి  భగవంతుడి నమ్మకాన్ని వమ్ము చేయద్దు. మన వంతు తప్పులు మనం చేసుకు పోతున్నప్పుడే పై వాడికీ నాలుగు చేతుల నిండా పని. అస్తమానం బొక్కలు వెదికే జాతి కూడా భూమ్మీద ఒకటుంది కదా! సరిదిద్దే అవకాశం దేవుడు వాటికీ ప్రసాదించాడని మరవద్దు.. మరో  పెద్ద తప్పు చేయద్దు!
ఉదాత్తమైనది మానవ జన్మ. వృథా చేయద్దని కాంగీ కొత్త అధినేత ఉద్బోధ. రాహుల్ బాబు జాతికి ఈ మధ్య ట్విట్టరు ద్వారా ఓ చక్కని సందేశం అందించారు. అందరికీ ఆదర్శంగా ముందుండడమే కదా గొప్ప నేత  మంచి లక్షణం! అందుకే.. మోదీ  హయాంలో అందలాలెక్కిన ధరవరలను శాతాల్లో చూపిస్తూ శతాధికమైన దోషాలను యధేఛ్ఛగా  దొర్లించేసారు. సారుని జౌరంగజేబని తిట్టిన నోళ్లే ‘ఔరా’ అంటూ అవాక్కయి పోతున్నాయి నాయనా ఇప్పుడు! 
ఎంత లావు శివ భక్తుడైతే ఏమి? ‘మనిషి’గానే పుట్టాడు  కదా  సోనియమ్మ కడుపున? చూడాలిహ! ముందు ముందు మోదీజీ సైతం తానూ 'ఓ మహా మనీషి'ని అని నిరూపించుకొనేందుకు ఇంకెన్ని ఘోర  తప్పిదాలకు శ్రీకారం చుట్టబోతున్నారో!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఆంధ్రప్రభ  దినపత్రిక, 09-12-2017నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్ లో ప్రచురితం)




Friday, December 1, 2017

గ్రంథచోరులు- ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా కాలమ్






ఆన్ లైనులో కెళ్లి  కెలుక్కుంటే చాలు. కాపీ రైట్ చట్టం పట్టింపు లేకుంటే  కామ్ గా కాపీ, పేస్టు చేసుకొని కర్త పేరు మార్చేసుకోడం మహా సులువు.  ఆకాశమంత జ్ఞానానికి ఆవిష్కర్తలం అనిపించుకోడం.. ఇవాళ్టి డిజిటల్ యుగంలో కోక్ తాగినంత సులువు. కేవలం అచ్చు బుక్కులు  మాత్రమే లభ్యమయే దిక్కుమాలిన కాలంలో గ్రంథ చోరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. పాపం!

వనితా.. విత్తం తస్కరణలక్కూడా సులువు సూత్రాలు చెప్పే శాస్త్రాలున్న  కాలంలో  పుస్తకాలు కొట్టేసే  చిట్కాల గైడ్లు మచ్చుక్కి ఒక్కటైనా దొరక్కపోవడం గ్రంథచోరులకు పెద్ద లోటు!    అరవై నాలుగు కళల్లో చౌర్యమూ ఒక విభాగమే! అయినా.. ఆ శాఖ అభివృధ్ధి ఎందికు పుంజుకోలేదో? చిత్రమే కదా?

పుస్తక చౌర్యం మరీ అంత అకార్యమైన కళేం కాదు. యమధర్మరాజులుగారు గ్రంథచౌర్యం మీదో ఉద్గ్రంథమే రాసారని వినికిడి. ఏ దొంగ వెధవ గుట్టు చప్పుడుగా  నొక్కేసాడో..   ఇప్పుడా తాళపత్రాలు ఏ  గ్రంథాలయంలోనూ కనపడ్డం లేదు!

పుస్తక  చౌర్యానికీ బోలెడంత గ్రంథముంది. ఆశించిన  పుస్తకం అందుబాటుకి రావాలి. కోరుకున్న అందులో తారసబడాలి. ఇప్పుట్లా ఏ సెల్ ఫోనో అరచేతిలో ఉంటే 'ఠప్పు'మని ఓ క్లిక్కుతో  అంశం  మన సొంతమవుతుంది. క్జిరాక్సులకే దిక్కులేని కాలంలో ముత్తెమంత సమాచారం సేకరించాలన్నా పుస్తకం మొత్తం ఎత్తేయడం ఒక్కటే ఉత్తమ మార్గంగా ఉండేది.

అరువులా అడిగి పుచ్చేసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరిగే మరో దారి ఉన్నా..   కొంతమంది పుస్తకదారుల జ్ఞాపకశక్తి మరీ దారుణంగా ఉంటుంది. ఏనుగు మెమరీ కూడా వాళ్ల ధారణా శక్తి ముందు చీమ తలకాయ! ఏళ్లు పూళ్లు గడిచి.. ఎన్ని యోజనాల దూరంలో  స్థిరపడినా ప్రయోజనం శూన్యం. ఆనవాళ్లేవీ  లేకుండా  ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రారబ్దం బాగోలేకుంటే ఫలితం సున్నా. ఏ దుర్ముమూర్తానో నిశ్శబ్దంగా వెనకనుంచి వచ్చి 'ఎంరోయ్! మూర్తీ.. ఎట్లా ఉన్నావ్? అంటూ వీప్మీద ఛర్రుమని విమానం మోత మోగించేయచ్చు. ఆనక  ముసి ముసి నవ్వుల్తో కసిగా నిలదీయడంతో దోష విచారణ కథ మొదలవుతుంది. కోర్టు.. బోను.. సీనొక్కటే తక్కువ.  తలపండిన వకీలుగారు ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లు సాగే విచారణను ఎదుర్కోవడం ఎంత అబద్ధాలకోర్సు డాక్టరేటుకైనా తలకు మించిన పని.

ఫలానా పంథొమ్మిదొందల అరవై తొమ్మిది మార్చి మూడో తారీఖు మిట్టమధ్యాహ్నం పూట ఎండన  పడి తమరు మా ఇంటి కొచ్చారూ! ఏదో మిత్రులు కదా అని ఆతిథ్య ధర్మ నిర్వహణార్థం  కాశీ చెంబెడు మజ్జిగ నీళ్ళు నిమ్మరసం పిండి మరీ తమరికి సమర్పించుకున్నాను. అప్పుడు తమరేం ఉద్ధరించారో  గుర్తుందో లేదో ఇప్పుడు?  ఎండ చల్లబడిందాకా  బైటికి వెళ్లలేనంటే పోనీలే.. టైమ్ కిల్లింగుగా ఉంటుందని నా సొంత గ్రంథాలయం నుంచి ఎప్పట్నుంచో సేకరించి దాచుకున్న చలం 'ఊర్వశి'  అరుణాచలంలో ఆయన స్వహస్తాలతో అట్టమీద పొట్టి సంతకం గిలికిచ్చిన  అపురూపమైన పుస్తకం తమరికి ధారాదత్తం  చేసాను. బుద్ధీ,  జ్ఞానం అప్పటికింకా పూర్తిగా వికసించలేదులే నాకు. ఆపుకోలేని అర్జంటు పని మీద నేనటు లోపలికి వెళ్లి తిరిగొచ్చిన ఐదు నిమిషాలలోపే తమరు  జంపు!  ఖరీదైన  వస్తువులింకేమైనా చంకనేసుకొని ఉడాయించారేమోనని అప్పుడు  మా  ఊర్మిళ  గుండెలు బాదుకొన్న చప్పుళ్లు ఇంకా ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మిత్రమా! మా ఆవిడ శోకన్నాలు నాకు నిత్య కర్ణ శ్రవణానందాలే కనక దానికి ఆట్టే ఫీలవలేదు.  కానీ నా ఊర్వశిని  నువు  చెప్పా పెట్టకుండా చంకనేసుకొనలా  చెక్కేయడమే చచ్చే బాధించిందిరా మూర్తీ! నిజమైన స్నేహం కన్నా పుస్తకమే విలువైందని నువ్వా నాడు ప్రాక్టికల్గా నా కళ్లు తెరిపించావు చూడు.. అందుకు   'థేంక్స్' చెప్పుకుందామనుకొన్నా..  ఏదీ నీ అడ్రసు? రామాయణంలో సీత దర్శనం కోసం ఆ శ్రీ రామచంద్రుడయినా  అంతలా తపించాడో లేదో ? నా ఊర్వశి కోసం, తమరి వేరెబౌట్సు కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పటికైనా కనిపించావు. అదే పది వేలు. ఎన్ని వేలు కావాలో అడుగన్నా.. ఇచ్చేస్తా! కానీ.. మళ్లీ నా ఊర్వశిని మాత్రం నాకు తిరిగి ఇచ్చేయ్ రా.. ఇప్పుడే!' అంటూ జబ్బ పట్టుకొని నడిరోడ్డు మీదే  నిలబెట్టి పరువు తీసే  పుస్తకాల పురుగులు ఇప్పటికీ తారస పదుతూనే ఉంటారు. అందుకే తస్కరించే ముందు పుస్తకం వివరాలతోనే కాదు.. పుస్తకం తాలూకు  ఓనరు వివరాలతోనూ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

డిజిటల్ గా దేశం ఎంతలా అభివృద్ధి పథం వైపు ముందుకు దూసుకు పోతున్నా.. పోయిన పాతపుస్తకాల కోసం.. పాతకాలంనాటి పద్ధతుల్లోనే పడరాని పాట్లు పడే చాదస్తులు ఎప్పుడూ ఎక్కడో ఓ చోట తారసపడి గ్రంథాల విలువను మర్చిపోనివ్వరు.

అవును మరి.. ఒక గ్రంథం తయారీకి అది రాసేవాడి శరీర కష్టం విఘ్నేశ్వరుడి బాధను మించి ఉంటుంది! 'భగ్నపృష్టః కటిగ్రీవ స్తబ్ధ దృష్టిః రథో ముఖః.. కష్టేన లిఖితం గ్రంథం, యత్నేన పరిపాలయేత్' అని ఊరికే అనరు కదా ఎవరైనా? అష్టాదశ పర్వాల మహాభారతాన్ని ఆ వ్యాసులవారు ఓ వ్యాసంలా గడగడా వప్పచెప్పుకు పోవచ్చు. అది వట్టి నోటి పని. కానీ.. చెప్పింది చెప్పినట్లు క్షణమైనా గంటం  ఆపకుండా  చెవులతో వింటూ.. బుద్ధితో ఆలోచిస్తూ.. చేత్తో బరా బరా  రాసుకుపోవడం?! రాత సంగతి ఎట్లా ఉన్నా ముందు వెన్నెముక గతి? ముక్కలు చెక్కలై పోదా? మెడ కండరాలైనా పట్టుకు పోవా?కంటి చూపు? చీకటి పడితే  కటిక చీకటే!  ఆపకుండా అంత లావు భారతం ఎట్లా రాసుకు పోయినట్లు! దేవుళ్లు  కాబట్టి ఏ మాయో మర్మమో  చేసి కార్యం ఇతి సమాప్తం అనిపించి ఉండవచ్చు. మానవ మాత్రుల కెట్లా సాధ్యం?'కష్టేన లిఖితం గ్రంథం' అన్నారు అందుకే! పిట్ట ఈకలతో ఎండు తాటాకుల మీద గుండ్రటి లిపి! అక్షరం ఆకారం చెడకుండా రంధ్రాలు పొడుచుకుంటూ  పోతుండాలి.  అంత  కష్టం కాబట్టే పుస్తకాలను భద్రంగా చూసుకోవాలని పెద్దలు సుద్దులు చెప్పింది.

ఏ కష్టమూ లేకుండానే సృష్టించుకొనే వీలుంటే.. వేదాలు నీళ్లలోకి  జారినప్పుడు విధాత ఎందుకంతలా బేజారవుటాడు? గ్రంథాల విలువ తెలుసు కాబట్టే సోమకాసురుడా కవిల కట్టలు కంటబడగానే లటుక్కుమని నోట కరుచుకొని  పారిపోయాడు! 'పోతే పోయాయి లేవయ్యా? మళ్లీ  రాయించుకో.. ఫో!' అని కసురుకొని వదిలేయలేదు  పరమాత్ముడు.  పనిమాలా మత్సాహారమెత్తి మరీ మొరటు రాక్షసుడితో  ప్రాణాలకు తెగించి పోరాడాడు. తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చి 'ఇహ ముందైనా జాగ్రత్తగా ఉండ' మని మందలించాడంటానే తెలియడం లేదా పుస్తకాల విలువ ఏ పాటిదో?.

విలువైన వస్తువులు ఎక్కడుంటాయో దొంగతనాలూ అక్కడ తప్పకుండా జరుగుతుంటాయి. గ్రంథాలయాల దగ్గర అందుకే పగటి దొంగలు తారట్లాడేది.  పుస్తకం చూస్తున్నట్లే చూసి.. కటిక్కున  పుటను పరా పరా చించి జేబులో కుక్కేసుకొని బైటపడే గ్రంథచోరులు గతంలో చాలా మందే  తారసపడుతుండే వాళ్లు. వెసులుబాటుంటే అసలు  ప్రతినే లేపేసేందుకు అన్ని విధాలా ప్రయత్మించే గ్రంథచోరులుండ బట్టే   తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలోని మన తెలుగు తాళపత్ర గ్రంథాలు చాలా వాటికి కాళ్లొచ్చినట్లు ఈ మధ్య ఒక తమిళనాడు సాయంకాలం దినపత్రిక వివరాలతో సహా ప్రచురించింది.

ఈ-డిజిటల్ కాలమే కాదు.. ఎన్ని డిజిట్స్  జీతమొచ్చే గొప్ప  ఉద్యోగమైనా  మనిషి గ్రంథచౌర్యబుద్ధిని అడ్డుకోలేక పోతోంది. అందుకే తెలంగాణాలోని ఒక మారుమూల పట్నంలోని గ్రంథాలయంలో పుస్తకాలు దొంగిలిచ్చవద్దని హితవు చెబుతూ
'బుక్కులు తీసుకుపోయిన
మక్కువతో చదివి మీరు మరి ఇవ్వవలెన్
చిక్కెనని యింట దాచిన
మిక్కిలి పాపంబు మీకు మితిమీరియగున్!'
అంటూ పద్యాలు కొన్ని రాయించి మరీ నోటీసు బోర్డులో పెట్టించారు నిర్వాహకులు.
గ్రంథచోరులు దృష్టి ఈ పద్యం రాసున్న బోర్డు మీదా పడబోతుందా? ఏమో.. చూడాలి మరి ముందు ముందు!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా కాలమ్- 02, డిసెంబర్, 2017)

Tuesday, November 14, 2017

తల్లిభాషకే తొలి తాంబూలం- ఆంధ్రప్రభ సంపాదకీయ పుట వ్యాసం




"తెనుగు బాసను జుంటి తేనియని పొగడి
పొరుగింటి పులుసుపై మరులు పెంచిన వాడు
దేశభాషలలోన తెలుగు లెస్సని చాటి
మల్లెలను బదులు లిల్లీలు వలచినవాడు తెలుగువాడు"
-డాక్టర్ సి. నారాయన రెడ్ది
వెయ్యేళ్లు పైబడిన చరిత్ర తెలుగు భాషది-అంటూ న్యాయస్థానాలముందు పోరాడి పాక్షికంగా గెలిచిన వాళ్లం. మంచిదే. కానీ.. పరుగులెత్తే కాలంతో సమానంగా మన తెలుగును పరుగులెత్తించడంలో మాత్రం బొత్తిగా  వెనకబడుతున్నాం!
'ఆంధ్ర కవితకు పితామహుడ'ని మనం భుజాలకెత్తుకుని మోసేన నన్నపార్యుడు తెలుగు భాషకు కావ్యగౌరవం కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన 'మహా భారతం' ప్రారంభ ప్రార్థనా పద్యం పూర్తిగా సంస్కృతంలోనే సాగింది! అచ్చు తెనుగు అక్షరాలని ఆంధ్ర భాగవతమనే వెన్నెల్లో పిండారబోసిన తెలుగు కవి పోతన్నను మాత్రం  ఏ స్థాయిలో ఉంచాలో  తెలియక ఈ నాటికీ కుస్తీలు పడుతున్నాం!  ఆదికవి ఎవరన్నలాంటి సాహిత్య వివాదాలు అలా పక్కన  పెట్టేయండి. ఏ తెలుగు పలుకు ప్రామణికమో.. ఏ తెనుగు  పదం అప్రామాణికమో..  తేల్చుకోలేనంత అయోమయంలో ఉన్న మనం ఏ ప్రాంత జనం నోట పలికే మాటకు సాధికారత కల్పించాలో అంతుపట్టనంత దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ  నేపథ్యంలోనే కొత్త రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించింది. అస్తిత్వం, ఆత్మగౌరవం నినాదాలతో పోరాడి గెల్చుకున్న తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమ నేత శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు  అధికార పగ్గాలు చేత పట్టారు.  తెలంగాణాలో ఈ ఏడాది చివర డిసెంబరులో జరగబోయె తొలి తెలుగు ప్రపంచ మహాసభకు ఇదీ నేపథ్యం. మరి ప్రపంచ తెలుగు మహాసభల పూర్వరంగం  ఎలా ఉంది? ఒకసారి అవలోకించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
మొదటి తెలుగు ప్రపంచ మహాసభలుః
మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు నేటికి 42 ఏళ్ల కిందట 1975, ఏప్రియల్ నెలలో వారం రోజుల పాటు(12నుండి 18వ తారీఖు వరకు) మహావైభవంగా జరిగాయి. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం వేదిక. అప్పటి అంచనాల ప్రకారం రోజుకు సుమారు లక్షమంది హాజరయారు. మహాసభ నగరానికి 'కాకతీయ నగరం', 16దేశాల నుండి 92మంది పరిశీలకులు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి 900 చిల్లర ప్రతినిధులు, తెలుగు రాష్ట్రం నుంచి 4500 వరకు భాషాభిమానులు ఈ పాలుపంచుకొని మహా సభల ప్రపంచ స్థాయిని అక్షరాలా నిలబెట్టారు.  సదస్సుల వేదికకు 'నాగార్జున పీఠం', ప్రాచీన వైభవాన్ని, సంస్కృతులను తెలియ చేసే ప్రదర్శనశాలకు 'శాతవాహన నగరం', తెల్లవార్లూ సాంస్కృతిక ప్రదర్శనలు సాగిన ప్రాంగణానికి 'శ్రీ కృష్ణదేవరాయ నగరం' లాంటి నామకరణాలు జరిగడం బట్టి తెలుగు నేల మీది వివిధ  ప్ర్రాంతాల మధ్య ఎంతో శ్రద్ధగా సమతౌల్యం పాటించినట్లు చెప్పకనే చెప్పినట్లు అవగతమవుతుంది. (ఈ మహా సభలకు ఆరేళ్ల ముందే ఆంధ్ర ప్రాంతంలో 'ప్రత్యెకాంధ్ర' ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడిన నేపథ్యం గమనార్హం) ఉదయం 9గంటల మొదలు సాయంత్రం 6గంటల వరకు.. మధ్యలో ఒక గంటపాటు భోజన విరామం మినహాయించి 5 రోజులూ రోజుకు 8 గంటల చొప్పున 40 గంటల పాటు సుమారు అరవై అంశాలమీద గోష్ఠులు సాగినట్లు రికార్డులు చెపుతున్నాయి. భాష, సాహిత్యం, చరిత్ర, వైజ్ఞానిక, సాంకేతిక అంశాలమీద సుమారు 1500 మంది మేథావులు తమ తమ ఆలోచనలను కలబోసుకున్నారీ సభల సందర్భంగా!
ఏడాది కిందట ఉగాదికి జరిగిన రాష్ట్ర స్థాయి సభల్లోని తీర్మానం ఈ ప్రపంచ స్థాయి సభలకు నాందీ కాగా.. మరో ఆరేళ్ల అనంతరం మలేసియా కౌలాలంపూరులో జరిగిన మరో తెలుగు ప్రపంచ మహా సభలకు ఈ సభలే ప్రేరణగా నిలిచాయి.
రెండవ తెలుగు ప్రపంచ మహా సభలుః
మరో ఆరు సంవత్సరాల అనంతరం 1981, ఏప్రియల్ 14- 18 వరకు.. ఐదు రోజుల పాటు మలేసియా కౌలాలంపూరులో అట్టహాసంగా జరుపుకొన్నారు ప్రపంచ తెలుగు మహా సభలు.  సభాధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు. సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా సభలకు అప్పటి మలేసియా ప్రధాని డాక్టర్ మహీతీర్ బిన్ మహమ్మదీ ముఖ్య అతిధిగా విచ్చేసారు. సభలనుద్దేశించి నాటి భారత దేశాధ్యక్షులు శ్రీ నీలం సంజీవ రెడ్డి సందేశం వినిపించారు.
మూడవ తెలుగు ప్రపంచ మహా సభలుః
మరో నాలుగేళ్ల తదనంతరం 1990, డిసెంబరు 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల పాటు మారిషస్ దేశంలో ప్రపంచ స్థాయి తెలుగు మహా సభలు జరుపుకొన్నారు తెలుగువారు. మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు, ఆ దేశ ప్రధాని సర్ అనిరుధ్ జగన్నాధ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ తెలుగు మహా సభలలో. ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. నారాయణ రెడ్ది ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు విద్యావేత్తలు, కవులు, కళాకారులు, చలన చిత్ర నటులు, అధికారులు బృందాలు బృందాలుగా ఆ మహా సభలకు హాజరయ్యారు.
నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభలుః
నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభలు సుమారు 25 కోట్ల ఖర్చుతోనాటి ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2013 డిసెంబర్ నెలలో మూడు రోజుల (27, 28, 29) పాటు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిధ్యాలయం ప్రాంగణంలో ఆర్భాటంగా జరిగాయి. 37 ఏళ్ల తరువాత మళ్లీ తెలుగు నేల మీద జరిగిన తెలుగు మహాసభలు ఇవి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని లోపాలకు ఆస్కారం రానివ్వకుండా తెలుగు  భాషకు సంబంధించిన ముఖ్యులందరి నుంచి ముందస్తుగా తీసుకున్న సూచనలను స్వీకరించి అందుకు అనుగుణంగా,  సాధ్యమైనంత వివాద రహితంగా నిర్వహించిన చక్కని తెలుగు మహాసభలు ఇవి.
అదే ఏడాది ఐరాస్ సాంస్కృతిక శాఖ 'ప్రపంచ మాతృభాషాదినోత్సవ'  సందర్భంగా ఇచ్చిన థీమ్ 'సమగ్ర ఆధునిక విద్యా సమేతంగా మాతృభాషలో విద్యాబోధన'. మాతృభాష, దాని వినియోగం, విస్తృతి, ప్రయోజనాల పరంగా పూర్వ భావజాలానికి పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయాలు సమాజంలోని అన్ని రంగాలు, వర్గాల్లో ప్రబలమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ మహా సభల ముందు ఉన్న బాధ్యత బృహత్తరమైనది. ఈ నేపథ్యంలో చర్చోప చర్చలు, గోష్టులు తీవ్రంగానే సాగినా.. తెలుగును అధికార భాషగా అమలు చేసే విషయంలో అవకాశాలను సాధ్యమైనంత మేరా ఉపయోగించుకోవాల'న్న సాధారణ తీర్మానం చేసి సరిపెట్టడంతో ఈ సభల లక్ష్యం అరకొరగానే  ముగిసినట్లయింది.
2014 నాటికి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలి పోవడంతో నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభల ఆ  తీర్మానం అమలుకూ కాలం చెల్లిపోయినట్లయింది.
తెలంగాణా తొలి తెలుగు మహా సభలుః  
తెలంగాణా ఏర్పాటయిన మూడేళ్ల తరువాత జరుగుతున్న ప్రపంచ స్థాయి మహా సభలు ఇవి.  తెలంగాణా సంస్కృతి, భాష, అస్తిత్వం, ఆత్మగౌరవం వంటి ఉద్వేగభరిత అంశాలతో ఉద్యమ మార్గంలో పోరాడి రాబట్టుకొన్న  రాష్ట్రం..  మొదటి   తెలుగు మహా సభల్లో  ఆస్థాయిలోనే ప్రపంచానికి తన ప్రాభవాన్ని చాటి చెప్పాలని ఆరాట పడటంలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.
ముఖ్యమంత్రే  స్వయంగా ప్రకటించినట్లు దాదాపు 50 కోట్లు ఈ మహాసభల నిర్వహణకుగాను వెచ్చించబోతున్నారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు జరిగబోయే ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వివిధ దేశాల నుంచి 500 మందిని, వివిధ రాష్ట్రాల నుంచి 1000 మందిని, రాష్ట్రంలో ఉన్న సాహితీ, భాషావేత్తలను మరి కొంతమందిని  మహాసభలకు ఆహ్వానించాలని సంకల్పం. ఈ మహా క్రతువులో భాషాభిమానులందరిని భాగస్వామ్యులను చేయాలని.     ఏడు వేదికల ద్వారా తెలంగాణా బహుముఖ పార్వాలని మహోజ్వలంగా  ప్రపంచానికి  ప్రదర్శించి చూపాలని  తెలంగాణా  ఉవ్విళ్లూరడం ..బాగుంది. కానీ
సభల నిర్వహణ మీద జరుగుతున్నంత హాడావుడి సభలో తీసుకోవాల్సిన తీర్మానాల మీద
జరుగుతున్నదా?
ప్రపంచీకర దురాక్రమణ మూలకంగా స్థానిక భాషల ఉనికికి ముప్పు ముంచు కొచ్చేస్తోంది.  అవిఛ్చన్నంగా సాగుతున్న సామాజిక, సాంకేతిక, ఆర్థిక, సాంస్కృతిక  పరమైన  అభివృద్ధుల్లో  భాషదీ కీలకమైన స్థానం. ప్రజలు తమ  జీవితాలలో కోరుకొనే మెరుగుదలలకి కూడా అదే భాష అనివార్యంగా ఉంటుంది, 
కానీ వాస్తవంలో జరుగున్నదేమిటి? పడమటి గాలి ధాటికి  తతిమ్మా జాతుల మాదిరే తెలుగువారి   జీవిత మౌలిక విలువలూ కొట్టుకు పోతున్నవి. తెలుగుదనం పరిమళాలు   మరింత వాడిపోకుండా  పాలకులుగా ప్రభుత్వం చేపట్టవలసిన సత్వర దిద్దుబాటు చర్యలు చాలా ఉన్నాయి.  అవి ఏమిటో.. ఏ దిశగా ఆ సంక్షేమ చర్యలు సాగవలసి ఉన్నదో క్షేత్ర స్థాయి నుంచే ప్రజావాహిని నుంచి  నేరుగా సేకరించుకొనే చక్కని అవకాశం ఈ మహా సభలు కల్పిస్తున్నాయి.
ప్రపంచీకరణ వల్ల, అంతర్జాతీయ సంబంధాల వల్ల, పరాయి దేశాల కొలువల మీద అవసరానికి మించి పెరిగే  కాంక్షల వల్ల, బతుకు తెరువుకు అతకని  ఆధునికత మీద గుడ్డి అకర్షణ వల్ల మిగతా మానవీయ విలువలతో పాటు మాతృభాషకూ  చాపకింద నీరులా చేటు కలుగుతున్న నేపథ్యంలో మునపటి మహా సభలకన్నా ఇప్పుడు జరుపుకోబోతున్న తెలుగు మహా సభల ప్రాముఖ్యం మరంత పెరిగింది.
పాఠశాల, కార్యాలయం, న్యాయస్థానం, వ్యాపార స్థలం, వినోదాల వేదిక.. అన్నింటా తెలుగు వాడి మౌలిక భాషను తోసిరాజని భ్రష్ట ఆంగ్లం  దురాక్రమిస్తున్నది.
ఆ సంకర ఆంగ్ల భాష స్థానంలో మనదైన సజీవ భాషకు వాస్తవంగా ఎంత వరకు స్థానం కల్పించే అవకాశం ఉంది? భావోద్వేగాలతో భాషా దురభిమానులు చేసే అతి సూచనలను పట్టించుకోవలసిన పని లేదు.. ఆంఫ్ల  భాషను కాదనుకుంటే అభివృద్ధిని చేజేతులా జార విడుచుకొన్నట్లే? అనే ఆధునికుల వాదనలు పూర్తిగా కొట్టి పారేయ దగినవి కాదు. కానీ..  స్వాతంత్ర్యం సాధించుకొని ఏడు దశాబ్దాలు దాటినా సామాన్యుడు తనకు పుట్టుకతో  సహజ సిద్ధంగా అబ్బిన పలుకుబడితో నిత్య జీవితావసరాలను నిశ్చింతగా ఎందుకు  గడుపుకోలేక పోతున్నట్లు? పాలన, బోధన, రంగాలలో భాష భ్రష్టు పట్టడానికి మూల కారణాలు ఏమిటి? కారకులు ఎవరు? ఆ లోపాలను అరికట్టేటందుకు పాలకులుగా ప్రభుత్వం తీసుకొనే సత్వర చర్యలు ఏమిటి?  రాజభాషగా విరాజిల్లినప్పుడే ఏ ప్రజాభాషకైనా సాధికారత సాధ్యమయేది.
ఉద్యోగాలు, ఉపాధి కొరకు మాత్రమే కాదు భావోద్వేగాల ప్రకటనకు, సంబంధ బాంధవ్యాల పటిష్ఠతకు, అస్తిత్వానికి, ఆత్మ సన్మానానికి, ప్రపంచం ముందు తనదైన సొంత ముద్ర ప్రదర్శనకు.. మాతృభాష అవసరమవుతుంది. అమ్మ కన్నా కమ్మనైన పదం లేనట్లే అమ్మభాష కన్నా మధుర పథం ఉండబోదు. తెలుగు వారి బుర్ర కథను అధ్యయనం చేసేందుకు వచ్చిన ఒక ఫ్రెంచి బృందానికి తెలుగు గడ్డమీద  తెలుగు నేర్పే ఉపాధ్యాయులు దొరకడం  కష్టమయిందని వాపోయింది ఈ మధ్య. తెలుగు వారికి విదేశీ భాషలు నేర్పందుకు సీఫెల్ వంటి సంస్థలు ఉన్న నేల మీద విదేశీయులకు తెలుగు భాష నేర్పే సంస్థలు కానరావు?! హైదరాబాద్ లో అమెరికన్ రాయబార కార్యాలయం ఆరంభించేందుకు ముందు  ఇక్కడ పనిచేసే అమెరికన్ అధికారులకి ప్రాంతీయ భాషతో పరిచయం అవసరమయింది. అందుకుగాను రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఎనిమిది నెలలు పటుదలతో  మన తెలుగు మీద ఆ అధికారులు పట్టు సాధించారు. మరి తెలుగు ప్రజలతో మమేకమై పాలనా వ్యవహారాలు చక్కబెట్టే ఐ ఏ ఎస్.. ఐ పి ఎస్ కేడర్ పల్లెపట్టులకు వెళ్లినప్పుడు తెలుగు పలుకు పలికేందుకు చిన్నబుచ్చుకుంటున్నారు! విదేశీ ఉద్యోగాలను ఆశించే 25 శాతం విద్యార్థులకోసం మిగతా 75 శాతం  విద్యార్థులను పుట్టినప్పటి నుంచే కాన్వెంట్ల చదువుల మిషతో  గొడ్లచావిళ్లవంటి గదుల్లో బంధింధి హింసించే అమానుషత్వం ఒక్క తెలుగు గడ్డల మీదే చూస్తున్నాం. అరకొర నైపుణ్యాలతో ఆంగ్లం నేర్చుకుంటూ మాతృభాష అబ్బవలసిన విలువైన బాల్యదశను వృథాగా చెయ్యి జార్చుకుంటున్న తెలుగు పిల్లలను చూస్తే వాస్తవానికి జాలి కలగవలసి ఉంది. మబ్బులని చూసి ముంతలోని నీళ్లను పారబోసుకొనే కన్నవారి అమాయకత్వాన్ని కార్పొరేట్ చదువుల పేర  నిలువునా దోచుకునే కుహనా విద్యాషాఢబూతుల ఆట కట్టించ వలసిన బాధ్యత ప్రబుత్వాల మీదే కదా ఉన్నది? అన్యాయానికి గురై న్యాయస్థానానికి వెళితే అక్కడా సామాన్యుడు బోనులో బొమ్మలా నిలబడి తన తరుఫున సాగే వాద ప్రరివాదాలను  గుడ్లప్పగించి చూస్తూ వినడం కన్నా అన్యాయముంటుందా ఎక్కడైనా?
అందుకే ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావుగారు తెలంగాణాలో జరగబోతున్న తొలి తెలుగు మహా సభల లక్ష్యం పాలనలో, బోధనలో, సామాజిక జీవనంలో తల్లి భాషకే ప్రథమ తాంబూలం అని తడబాటులేమీ చూపించకుండా ప్రకటించడం భాషాభిమానులు.. పురోగమనవాదులంతా రెండు చేతులా మనసారా ఆహ్వానించ దగిన గొప్ప పరిణామం.
-కర్లపాలెం హనుమంతరావు
6142283676
(15-11-2017 నాటి ఆంధ్రప్రభ దినపత్రిక- సంపాదకీయ పుటలో ప్రచురితం) 



Friday, November 10, 2017

భార్యామణికే ప్రశంస- సుత్తి.. మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్



ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ..!
'హల్లో..ఇంటి జ్యోతిగారూ! ఇవాళేంటీ ఈ రాగాల ట్యూనూ..  హుషారుగా ఈ టోనూ?!'
ఇంటాడాళ్లం..  ఇహ ఏ ట్యూనైనా ఫ్రీగా పాడేసుకోవచ్చు! ‘చ్చోయ్! చ్చోయ్!’ అంటూ మీ మగాళ్లింక  ముళ్ల కర్రలతో తోలాలని చూస్తే మాత్రం.. తోల్తీసి డోలు చేసి ఎంత సేపైనా ఇంచక్కా నచ్చిన ట్యూన్లు వాయించు కోవచ్చు! అలాగని మా ఆడోళ్లందరికీ లైసెన్సు లిచ్చేసింది సార్ మహారాజ రాజశ్రీ  మేవాడ్ జిల్లా మెజిస్ట్రేటువారి శ్రీ కోర్టు!'
'అదెప్పుడు? కట్టుకున్నోణ్ని .. నాతోనే పరాచికాలు? ఆయ్ఁ !'
'అక్కడ రాజస్థాన్ రాష్ట్ర అమ్మడెవత్తో..  పన్లోకి పోకుండా పద్దాకా గంజాయ మఠంలో  పొర్లాడే మొగుణ్ని ఇంటి గుంజక్కట్టేసి మరీ కుంటి కట్టెకు పని చెప్పిందంట స్వామీ మూడ్రోజులపాటు ఒక్క మినిటైనా రెస్టివవకుండా! పెళ్లాల పోట్లు పళ్లేని మీ లాంటి మొగుళ్లంతా వెనకుండి వేయించిన దావాలో..  ఇవాళే తీర్పొచ్చింది.   ఇంటావిడైతే చాలు.. ఇంట్లోని ఎవళ్లనైనా సరే ఎప్పుడైనా అంట్లగంటె టు అప్పడాల కర్రతో  సహా ఏ వెపన్తోనైనా సరే వీపు విమానం మోత మోగించేయచ్చంట!  ఐపిసి సెక్షన్లతో సహా  కోట్ చేసి మరీ మా గొప్ప తీర్పిచ్చేసిందంట.. శ్రీ కోర్టు ధర్మాసనం!'  
'అన్యాయం! అప్పీలు కెళతాం మగాళ్లమంతా మళ్లా.. మళ్లా! పెళ్లాల గయ్యాళితనాలకి ఝడిసి  దడ కొద్దీ ఇచ్చేసిన తీర్పులు  ధర్మబద్ధమెట్లా అవుతుందో.. అదీ చూద్దాం!'
'ఓర్పు.. ఓర్పు! ఆ బండ బూతులే వద్దు! భర్తలంటే   'డార్లింగూ!.. ఓ మై డార్లింగూ.. ' అంటూ రొమాంటిక్కు టైపు ట్యూన్లేవఁన్నా పాడుకొంటేనే ముద్దు!’ ‘బంగారి.. మామ’ పాటలెప్పుడూ వినుండ లేదా బంగారం?’
'హలో! ఈ బంగారి?.. మామ?,.  ఎవర్తల్లో మధ్యలో మళ్లీ నా ప్రాణానికీ?’
'బంగాళ వేపుళ్ళు తప్ప  బంగారాలూ.. శృంగారాలూ.. ఎలా  తెలుస్తాయిలే  తిక్క స్వాములకీ! చీఁ! బంగారంలాంటి మూడు  మూడు ముక్కలయింది! మేవాడ్ కోర్టు  తీర్పు అమలు చేయాలిక .. తప్పదు’
‘ఈదీ అమీను.. సద్దాం హుసేనూ.. హిట్లరూ.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఇంట్లో పెళ్లాల కన్నా డిక్టేర్లట్రా?' అనక్కడికీ  చెవినిల్లు కట్టుకొని  పోరాడు మా నక్కా వెంకట్రావు! వింటేనా? పాడు శని!’
‘ఖబడ్దార్ సర్దార్! మా వైఫులంతా శివకాశీ బ్రాండులయితే.. మీ మొగుళ్లకంతా.. ఇహ కాశీ.. రామేశ్వరాలే చివరకు గతి! పెళ్లాలు టీవీ సెట్లు. మొగుళ్ళు ఓన్లీ   రిమోట్లు. అలాగుందాలి ఇళ్ళు. కుదరదంటే ప్రతి ఇల్లూ ఓ రామగుండమే’  
‘ఇదిగో.. ఇందుకే.. మాకు మఠాలు, సత్రాల మెట్లు  తటాలుమని  గుర్తుకొచ్చేది! పక్క దేశం స్వర్గాని కన్నా మిన్నని  ఎటూ ఓ టాకుంది. కోర్టు తీర్పుల మీద మరీ అంత  భరోసా వద్దు. రొహింగ్యాల మాదిరి మా మొగుళ్లూ   సరిహద్దులు దాటే దుస్థితి కద్దు! బహుభార్యాత్వం మగాడి జీవితాన్ని మరింత పొడిగిస్తుందని ఊరిస్తున్నారు బ్రిటన్ షివెల్డ్ యూనివర్శిటీ పరిశోధకులు. తస్మాత్ జాగ్రత్త తరుణీ మణులూ!’
'తమాషానా! మరి 'నాతి చరామి' మాట సంగతేమిటి మామా? మగడు కట్టిన పసుపు తాడు  కళ్లకద్దుకుంటూతిరగితే చాలా? కుష్టు మొగుళ్లను.. భ్రష్టు మొగాళ్లని.. తట్టల్లో.. బుట్టల్లో.. రెడ్లైట్ ఏరియాల చుట్టూ తిప్పుకు రావాలా? ఆ పిచ్చి   రోజులు ముగిసి పోయాయ్!  లొట్టలొద్దు! ఈ కాలం ఇల్లాళ్లు! మరీ.. అంత మంచి గయ్యాళులమేం  కాదు! 'నా కొంప అనే   సామ్రాజ్యానికి నవ్వొక్కదానివే పట్టమహిషవ'ని అగ్నిసాక్షిగా పెళ్ళినాడిచ్చిన మాట సంగతేవిఁటిట! మీరు మెహర్బానీకే అన్నా.. ఆడాళ్లం.. పిచ్చి మొహాలం! అందుకే మీరెంత మొద్దురాచిప్పలైనా .. మాడు మీదెక్కించుకొని ఇష్టంగా  తొక్కించుకొంటున్నాం! రోజులు మారి పోయాయి మారాజా!పూర్వం మాదిరి.. పెళ్లికి ముందూ కళ్లు మూసుకొని.. పెళ్లయిన తరువాతా.. నోర్మూసుకోమంటే..నో.. వేఁ..! గృహహింస చట్టం సెక్షన్లు యాక్షన్లోకొచ్చేస్తాయ్ మిష్టర్ హబ్బీ!'
'వామ్మో! మరి.. తాను అమ్ముడు పోయి అయినా సరే దీనుడైన నాధుడి యావ తీర్చాలన్నది    సుమతీ శతకం. దాని గతి?'
'మతిలేని శతకాలు.. శృతిలేని సూక్తులు!  తలలాడించే పిచ్చితల్లులెవరూ లేరిప్పుడిక్కడ మిష్టర్ మేల్ చవనిస్ట్! ఈ కాలం ఈ- కాలం. మొగుళ్ల మెళ్లకు డోళ్లం. నో ప్రోబ్లం! మోతైనా సరే .. తిరగమోతైనా సరే.. మా  శ్రీమతుల చేతుల మీదుగానే కాపురం సాగి తీరాలి. శ్రీవార్ల ఆస్తిపస్తులు..  జీతభత్యాలు.. పింఛన్లు..  భరణాలు.. ఆభరణాలు.. అన్నింటి మీదా చట్టబద్ద్జంగా మా శ్రీమతులకే సర్వహక్కులు
'మరేఁ! 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ! .. షాదీ మాటే వద్దు గురూ!' అంటూ కోట శ్రీనివాసర్రావు చెవిలో కోట కట్టుకుని  మరీ పాటేసాడు మనీ సినిమాలో. శని   విననిస్తేనా! అనుభవిస్తున్నాం అమ్మళ్లూ  అందుకే ఈ బాండెడ్ లేబర్లూ! హ్హుఁ'
'ఒయాసిస్సును చూసా.. ఎడారని బెదిరేది వయస్యా? మొగుడు పుల్లిస్తారాకైతే పెళ్లాం అది ఎగరకుండా  మీదుండే బండరాయన్నాడు వెనకటికో కవి.   సావిత్రి పక్కనుండబట్టే సత్యవంతుడికా బోడి ప్రాణాలు తిరిగి  దక్కింది. సీతమ్మతల్లి తోడుండబట్టే రామయ్యతండ్రి వనవాసం హనీమూనును  మించి రక్తి కట్టింది!  పెళ్లాలంతా కళ్లాలే అయితే   వేలాది మందిని వెంటేసుకొని తిరిగిన వేణు గోపాలుడు సంగతేవిఁటి   వెర్రిబాలకా? ముక్కు మూసుక్కూర్చున్న  మునిముచ్చుకే   మేనకమ్మ మేని గాలి తగలంగానే  కళ్లు చెదిరాయి! ఆడపొడంటే గిట్టని   రుష్యశృంగుడు శాంతమ్మ సిస్టర్తో  సంసారమెంత ప్రశాంతంగా గడిపాడో  తెలిసీ..
'షటప్పూ..  నీ అష్టాదశ పురాణాలిక స్టాపూ! షట్కర్మచారిణి.. సహధర్మచారిణి..  అంటారు కదా తాళికట్టిన ఆడదాన్ని! ఖర్మకాకపోతే అందులో  ఏ ఒక్క గుణమైనా..'
'.. నేటి మా మహిళకు లేదంటావు! మనువాడిన ఆడది మగాడికి దాసి.. మంత్రి.. లక్ష్మి.. భూమి.. తల్లి.. రంభా!  ఓ కే.. మ్యాన్! ఒప్పుకున్నాం! ఊడిగాలు చేయడానికి మేం రడీనే! కాకుంటే ఒకటే డీల్!  ముందు మీ మగాళ్ళూ  మినిమమ్  ఓ  రాముడి పాత్రల్లో అయినా బుద్ధిగా జీవించండి బాబులూ! 'వై ఫై' ఓ సెకను లేకపోతేనే కలియుగాంతం వచ్చేసినట్లు  కంగారు పడతారే మగాళ్లు!. ఇంటి కనెక్షన్ కదా 'వైఫ్' అంటే! రోజులో ఒక్క నిమిషమైనా నవ్వుతూ కనిపించే ఛాన్సు ఎందుకివ్వరు మగాళ్లు?’
'వివాహ సంబంధాల్నుంచీ.. విడాకులు.. పిల్లల పెంపకాల వరకు.. చట్టాలన్నీ మీ ఆడాళ్లకే కదా చుట్టాలు తల్లీ! భార్యా బాధితుల గుండెలు బాదుకొంటున్నారు.  ఐ.పి.సి.సెక్షను 498(ఎ) భర్తల స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు పూర్తిగా విరుద్ధమని మొత్తుకొంటున్నారు. వినపట్టం లేదా ‘భా.బా’ల పళ్ల పట పటలు'?
‘ఇల్లొక రొమాంటిక్ జిమ్. శృంగార వ్యాయామశాల. మొగుడూ పెళ్లాలు అందులో ఒహళ్ల కొహళ్లు  'కోచ్' లు. ఒకరి పట్టులు మరొకరికి నేర్పాలి. పట్టువిడుపులుంటేనే సంసారమనే  కుస్తీ  చక్కగా సాగేది. కన్నవాళ్లందర్నీ కాదనుకొని.. కట్టుకొన్నవాడే సర్వస్వమనుకొని.. గడప దాటి   కొత్త లోకంలోకి అడుగు పెడుతుంది ఆడది. తాళి  కట్టించుకున్న ఒప్పందానికి కట్టుబడి భర్తకు వారసలని కని మరో వంశాన్ని రక్త మాంసాలొడ్చి నిలబెడుతుంది. రోజులో సగం సమయం నిద్రకనే  ఉన్నా.. ఆ నిద్ర మగతలో సైతం  మొగుడో..  పిల్లలో అంటూ  కలవరించే   పిచ్చిది ఆడది. గీజరు ఓ రెండు నిమిషాలపాటు ఎక్కువగా వాడుకుందని గొడ్డులా బాది చంపేసిన మొగుళ్లు  మొనగాళ్లుగా బోర విరుచుకొని మరీ ఆంబోతుల్లా బైట తిరుగుతున్న కాలమండీ ఇది ! మేవాడ్ మెజిస్ట్రేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీదా మళ్లీ మళ్లీ అప్పీలుకు వెళదామనే..’
'హలో! సత్యభామాజీ! ఇహ దించేస్తే మంచిది తవఁరు కత్తి! ఈ ప్రేమ భక్తుడు లొంగిపోతున్నాడు!  అందుకుంటారా  ఇహనైనా ఈ పూల గుత్తి!
***
-కర్లపాలెం హనుమంతరావు
8142283676
(సుత్తి.. మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్- 11, నవంబర్, 2017)
 ***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...