Friday, February 16, 2018

'కత'లరాయళ్ళు!- ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం






 ‘ 'స్టోరీ టెల్లింగు' స్టోనేజీనుంచి వికసిస్తూ వస్తున్న కళ. మనిషికీ మిగతా జంతుజాతికీ మధ్యగల పెద్ద వ్యత్యాసం ఈ కథలల్లడంలోనే ఉంది. గొడ్డూగోదాకి అడ్డమైన గడ్డీ మేయాలన్న యావ ఉండదు. అడ్డదారిలో వెళ్లైనా గద్దెలెక్కాలన్న కసి ఉండదు. కనక  కతలు చెప్పుకు తిరగాల్సిన ఖర్మలేదు. పురుగూ పుట్రకి నాలుగ్గింజలు నోటికందితే రోజు గడిచిపోతుంది. కాబట్టి పిట్టకథలు చెప్పుకొనే దుర్గతి పట్టదు.'
మనిషి జన్మకలా కుదరదురా అబ్బీ! చేతకన్నా ముందు కతల్చెప్పడం వచ్చుండాలి.  కష్టం తరుముకొచ్చినా.. దుఃఖం తన్నుకొచ్చినా.. ఉద్వేగం ముంచుకొచ్చినా.. ఉత్సాహం ఉరకలెత్తినా.. కోతులైతే గంతులేస్తాయి. పాములైతే కోరలు చాస్తాయి. పిట్టలైతే పిచ్చిపిచ్చిగా కూస్తాయి. పులులుకా గాండ్రింపులు, ఏనుగులుకీ ఘంకరింపులు కథలు చెప్పే కౌశలం పట్టుపడకే! మనిషొక్కడే తనక్కావాల్సినంత  విషయాన్నికావాల్సినంత మోతాదులో కథావిశేషంగా మలిచి మరీ  బురిడి కొట్టించ గలిగేది.  అలా కొట్టించే విద్యలో ఆరితేరితేనే వాళ్లే రాజకీయాల్లో రాణించేది. దాన్నీ నువ్వు ఈసడిస్తే ఎట్లారా?
బాగుంది బాబాయ్! రాజకీయాల్లో కథనకౌశలం కరువైతే కరుణవాదం ఫలించదనా! కహానీలు  కుదరకుంటే సహోదరత్వం రాణించదనా! కథలు వండే కళ ఎంతలా  వంటపడ్డకపోతే    ఎన్నికల జాతర్లప్పుడు  నేతలు పోతురాజులకు మించి హారతలు పట్టించుకోగలరు?! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదని మహాఘనంగా కతలు చెప్పుకొంటున్నాం గదా! అంటే మనమెన్నుకుంటున్న నేతాశ్రీల బుర్రల్లో అంతలా సృజనాత్మకత సుళ్లుతిరుగుతుందనా అర్థం?’
 ఆ ఎద్దేవానేరా వద్దనేది! రాజకీయాల మీదేనా రాళ్లేసేదీ?'
మరేం మనమంటావ్ చెప్పు బాబాయ్! మంట పుడుతుంటేను ఇక్కడా! ఇవాళా రేపూ కథలు 'రాయని భాస్కరుల'ని కనిపెట్టడమే మా కష్టంగా ఉంటేనూ! అంతరించిపోయే జాతుల్లో కాకి.. పిచ్చుకల్లాంటివి ఏవేవో ఉంటున్నాయని ఊరికే ఆందోళన చెందుతున్నాంగానీ..  కట్టుకతలు చెప్పి నెట్టుకొచ్చే సజ్జు  మాత్రం అంతకంతకూ పెరిగిపోతోందని కంగారు మాత్రం ఎవరం పడ్డం లేదు! రకరకాల కాలుష్యాలు పెచ్చుమీరుతున్నయని  ఆ మధ్య వందలొందల  దేశాలా పేరిస్ లోనో ఎక్కడో  అంతలా బుర్రలు బద్దలు కొట్టేసుకున్నాయి కదా! వాటి వేటికీ ఈ కతల బాపతు హానికరజీవులపైన కన్ను పడలేదు.. ఖర్మ!
మన గురుజాడగారి గిరీశం వారసులెవరన్నా అక్కడా చేరి అసలు విషయాన్నేమైనా పక్కదారి పట్టించారంటావా?!
డౌటా! ఈ కతలరాయళ్లతో వచ్చే చిక్కేఅది.  మనకు తెలీకుండానే వాళ్ల  వ్యూహాల్లో చిక్కడిపోతుంటాం!  తనను  సృష్టించిన  గురుజాడనే పెడదారి పట్టించిన ఘనుడు గిరీశం. ఆ గిరీశానిక్కూడా గాడ్ ఫాదర్లాంటి ఘనులు  తయారవుతున్నారు కదా  రాజకీయాల్లో ఘనపుటడుక్కి ఓ పదైదుగురు లెక్కన? కుంటికథలు చెప్పుకుంటూ ఊరేగే వాళ్లకు అస్సలు గుడ్డిగవ్వంతైనా  విలువ ఇవ్వకూడదు బాబాయ్ నన్నడిగితే !
'ఇప్పుడిస్తున్నారనేనా? ఎందుకురా నీకా ఏడుపు?    
ఏడవక ఇంకేం చెయ్యగలం బాబాయ్ మా బోటి బక్కోళ్లం!  టూ మినిట్స్ లో తయారయ్యే నూడీల్లో నిజంగా అన్నేసి హానికారక  పదార్థాలున్నాయా' అనడిగమా ఆ మద్యన!  రెండు రీములకు సరిపడా నవల  వినిపించిందో తయారుచేసే కంపెనీ! 'కట్టుకున్న దౌర్భాగ్యుడు  కదా! అంత కర్కశంగా పొట్టనెట్లా  పెట్టుకొన్నావమ్మా!  అని ఓ మహాతల్లిని  విచారించిందీ మధ్య మీడియా! అలవాటైన అంతర్జాతీయస్థాయి  అత్యాచారం కథ వినిపించేసింది! లక్షలు కోట్లు గడించిన బడాబాబుల బ్యాంకప్పులకు మాఫీ లవసరమా? అనడిగి చూడు!  ఊకదంపుడు కతలు  ఆపకుండా ఊరుతాయి చట్టసభల బావుల్లో! ఐపిఎల్ వంకతో విచిత్రమైన ఆటొకటి కనిపెట్టి  పిల్లకాయల జేబులు కొల్లగొట్టిన లలిత్ మోదీ గుర్తున్నాడా బాబాయ్?  అప్పనంగా బొక్కేసిన  సొమ్ముకు లెక్కలడిగితే ఎక్కడెక్కడికో పోయి దాక్కున్నాడా?'
'దాక్కునుంటే కథేముందిరా బాబీ! ట్విట్టరు ఖాతా సాక్షిగా రోజుకో ట్విస్టిచ్చే కథ ప్రచారంలో పెట్టి మరీ  పార్లమెంటు మొత్తంతో పేకాటాడేసుకొన్నాడు! దటీజ్ రియల్లీ గ్రేట్!'
' అది గ్రేటా?! జనం మర్చి పోయిన నేతాజీలను గూర్చి  తాజాగా తయారయే కతల మాటో మరి?’ 
'కథలు చెప్పడం కవుల పనేరా! ఒప్పుకుంటాను.. నిజమే!  కానీ ఆ కర్తవ్యం ఏ కవులూ సాకారం చేయడం లేదే! నాయకులే పూనుకొని కథాసాహిత్యానికి న్యాయం చేస్తున్నర్రా బాబూ? మెచ్చుకోకపోతే మానె.. ఈ నొచ్చుకోడాలేంటంట.. విచిత్రంగా!'
'చిత్రంగా ఉన్నాయ్ బాబాయ్  నీ మాటలు! అడ్దదారిలో గద్దెలెక్కిన కుర్ర కుంకలు వాళ్ల వాళ్ల వంశ చరిత్రలను గూర్చి  చెప్పుకొంటున్న పురాణాలు వింటూనే..'
' కన్నవారిక్కాక పక్క పార్టీ కాకాకు వన్నె తెచ్చేందుకా  బిడ్డలు  కతలు చెప్పేది? కాక ఎక్కువైనప్పుడు ఏవో రెండు మూడు కబుర్లు  శృతి మించే వీక్ నెస్ శ్రీనాథుడంతటి కవిసార్వభౌముడికే  తప్పింది కాదురా! అంత మాత్రానికే పాపం కాకమ్మ కథలు చెప్పేవాళ్లని  కేకిరించడమేంటంట? 'కదిలేదీ.. కదిలించేదీ.. కావాలోయ్ నవకవనానికి' అని  మీ  మహాకవి కదా కవిత్వాన్ని గురించి   కలవరించిందీ!’
అహాఁ! అందుకేనా.. సమాజాన్ని ఊరికే కదిలిస్తే ఉపయోగమేంటని ఏకంగా కుదుళ్లతో సహా  కుదిపేస్తున్నదో మన రాజకీయ కతలరాయళ్ళు!'
ఆపరా ఆ దెప్పుళ్ళు! కథాప్రక్రియని మరీ అంతలా కించపరచొద్దు! రిమ్మ తెగులు బ్రహ్మయ్య  ఎప్పుడో భార్యామణికి తప్పు చేస్తూ దొరికిపోయుంటాడు.  నారులకు వట్టి 'సారీ'లు సరిపోతాయా!   స్టోరీలేవో అల్లి మరీ ఆ గండం గట్టెక్కి ఉంటాడా తెల్లగడ్డం బ్రహ్మయ్య. దేవతా ముఖంగా పుట్టుకొచ్చిన కథాప్రక్రియను వృథా చెయ్యడం మాత్రం ఏమంత సబబు? అందుకే కృష్ణావతారంలో  వెన్నదొంగ ఆ కథాప్రక్రియను కంటిన్యూ చేసుంటాడు.  కాళయ్యనూ ఏదో బోళా శంకరుడని బోలెడంత  జాలిపడి పోతాం గానీ.. ఒక ఆలిని పక్కనుంచికొని.. మరో ఆలిని నెత్తినుంచుకొన్న మహానుభావుడు! అయినా   ఆదిభిక్షువనంటూ ఎన్ని  కథలల్లి భక్తగణం చేత ప్రచారం చేయించాడు!  దేవుళ్ల కథలే ఇంత లచ్చనంగా ఉంటే  వాళ్ల కనుసన్నల్లో కదిలే మామూలు   మనుషులం మనం. ముఖ్యంగా ఏదో ఓ  దేవుడి పేరు చెప్పుకుంటే తప్ప పబ్బం గడవని రాజకీయజీవుల్ని మూగమొద్దుల్లా    మూల చేరి మూలగమంటావా? అదేం భావ్యంరా! పాలిటిక్సులో పొర్లే సరుకు కథలు అల్లలేకపోతే సంసారాలే కాదు.. సర్కార్లూ  నిలబడవు. అనుభవం తక్కువ సన్నాసివి నీకేం తెలుస్తాయీ మల్లగుల్లాలు? కతలు కతలంటో ఆ ఎగతాళులే వద్దు.  అమెరికా భారత్ స్నేహ సంబంధాలు ఈ మాత్రమైనా పండుతున్నాయంటే ఇరు పక్షాలు ఒకరి కొకరు వినిపించుకొనే కథావిశేషాలే కారణం. ప్రధాని.. ప్రతిపక్ష నేతలు పది మాటలు అటూ ఇటూ విసురుకుంటున్నా.. అవీ జనం వినోదం కోసం చెప్పుకునే కతలేరా.. నీకు బోధ పడ్డంలేదు  కానీ ఈ మతలబులన్నీ! కహానీలే వద్దంటే ఇహ వెంకయ్యగారి మార్కు  పన్లు వినబడే ఛాన్సుండదు. యువనేతలు వివిధ  జనయాత్రల మధ్య వినిపించేందుకు  'థీమ్'లుండవు. ప్రసార మాధ్యమాల జోరుకిహ    జోషెక్కడేడుస్తుంది?  ఒక్క తెలుగు మూవీలు మినహా  ప్రపంచంమొత్తం ఈ కథాప్రక్రియ చుట్టూతానే కదరా గింగిరాలు కొడుతుండేదీ! స్టోరీలు వద్దంటే ఇహ మళ్లీ స్టోనేజీ యుగంలోకి వెళ్లిపోవడమే!'
మరే! కథలనేవే లేకపోతే ఆదికవి వాల్మీకీ సోదిలో కొచ్చేవాడు కాదు కదా?'
ఆ సోది సంగతేమో కానీ.. ఒక్క సూక్ష్మం  మాత్రం నువ్వు సూటిగా అర్థం చేసుకోవాలిరా అబ్బిగా! తన మానానికి తానేవేవో యుద్దాలు.. తీర్థయాత్రలు చేసుకుంటూ తిరిగే  శ్రీకృష్ణదేవరాయలుకే  కల్లోకొచ్చి మరీ తన పెళ్ళిని గూర్చి  కమ్మని కథలు చెప్పమని  శ్రీకాకుళాంధ్ర దేవుడు ఎందుకు పోరు పెట్టాడంటావ్?! కత్తి తిప్పడంలోనే కాదబ్బాయ్.. కథలు చెప్పడంలోనూ గొప్ప మెళుకువలు పట్టుపడ్డప్పుడే రాజ్యాధికారం రాయలువారి పాలనలాగా   పదికాలాలపాటు పకడ్బందీగా సాగిపోయేది ! హిస్టరీ తెలీని పిల్లతనం నీది! స్తోరీలతో నెట్టుకొచ్చే వాళ్లని గద్దె మీద నుంచి నెట్టి పడేయడం ఎన్ని లక్షల నెటిజన్లను కూడగట్టి అల్లరి పెట్టించినా వల్లయ్యే  పని కాదు! ముందది తెలుసుకోరా! అసహనం నటించబాకరా పిల్ల సన్నాసీ?'   
'ఆహాఁ!  హేమాహేమీలు అలవోకగా ఇచ్చేసే హామీలు,  వాటి మీద అస్మదీలుగా ఉన్నప్పుడు  చేసే 'హైఁ.. హైఁ'లు.. తస్మదీయులుగా మారినప్పుడు కూసే  'హ్హీఁ..హ్హీఁ'లు..   అన్నీ ఈ కథాప్రకియ చుట్టూతానే గింగిరాలు కొట్టే ప్రహసనాలు కదా బాబాయ్! ఈ కుర్చీకతల కిక్కుని గూర్చి  ఓట్లేసే జనమైనా అప్రమత్తం కాకపోతే ప్రజాస్వామ్యానికిహ పర్మినెంటుగా  'జనగనమనే..'! జనం మనిషిగా అదే నా దిగులు'
మరే! బాగుందిరా అబ్బాయ్ నీ  దిగులు కత కూడా! హ్హీఁ.. హ్హీఁ..హ్హీఁ!''కత'లరాయళ్ళు!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రప్రభ దినపత్రిక 17-02-2018 సుత్తి.. మెత్తంగా కాలమ్)


Tuesday, February 6, 2018

ఔరంగ జేబు ఉత్తరం


                                         



తల్లిభాషలో విద్యాబోధన చేయనందుకు తనకు కలిగిన నష్టాలను గురించి ఏకరువు పెడుతూ జౌరంగజేబు తన గురువు ముల్లా సాలేకు రాసిన సుదీర్ఘమైన ఉత్తరం. ఔరంగజేబు ఆ లేఖలో పేర్కొన్న 16 కారణాలలో ఏ ఒక్కటీ ఈ ఇరవయ్యొకటో శతాబ్దపు మన తెలుగువారికి  చెందనివి కాకపోవడం విచారం కలిగించే విషయం.
మహారాహ రాజశ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక కోసం రాసిన వ్యాసంలోని భాగం ఇదిః




Friday, February 2, 2018

అన్నీ ఆ తాను ముక్కలేనా?! -కర్లపాలెం హనుమంతరావు






కాలం కలిసి వస్తోంది కమల దళానికి. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 'మోదీ.. షా' ద్వయం తమాషా బాగా నడుస్తోన్నది. ముస్లిం  పునాదుల మీద లేచిన పి.డి.పి(జమ్మూ&కశ్మీర్) నుంచి ద్రవిడ సంస్కృతికి కేంద్రంగా ఉన్న  తమిళనాడు వరకు.. ప్రస్తుతానికి 'నమో' మంత్రానికి  చింతకాయలు రాలుతున్నాయి. ముందు ముందు మరన్ని రాలే సూచనలున్నాయి.  విదేశీ మూలాలున్న  అధినేతలను కూడా ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయించే శక్తి  భాజపాకి ‘ మోదీ- షా’ మంత్రాంగం వల్ల కొత్తగా  సిద్ధించింది.
ఇందిర అత్యవసర పరిస్థితి (1975) కాలం నాటికి భాజపా మూల రూపం జన సంఘ్ ది నామమాత్రపు  ఉనికి. జయప్రకాశ్ నారాయణ అప్పటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కూడగట్టిన జనతా పార్టీలోకి మిగతా అన్ని చిన్న పక్షాల మాదిరే జన్ సంఘ్  అడుగు పెట్టింది. కాకపోతే జన్ సంఘ్ ఆ మిగతా  చిన్న పార్టీలకన్నా  విభిన్నమైన  పోకడలు పోయింది తదనంతరం.  తన  'కాంగ్రెస్ వ్యతిరేక'  ముద్రను  బలంగా కొనసాగించడం వల్ల  ఇవాళ్టి  మోదీ మార్కు 'భాజపా' రూపం సంతరించుకుంది.
భాజపా వాస్తవ అస్తిత్వం ప్రజాస్వామ్య విలువలలో కన్నా  హిందూత్వ సిద్ధాంతాలలోనే  కనిపిస్తుంది. 'మతవాద ఫాసిస్టు పారా మిలటరీ’గా వామపక్ష నేత  కామ్రేడ్ సుందరయ్య  పేర్కొన్న 'రాష్ట్రీయ స్వయం సేవక్' కు ప్రజాస్వామ్య ముసుగు  భారతీయ జనతా పార్టీ! ముస్లిముల ప్రాబల్యం అధికంగా  గల  ప్రాంతాలలో మైనారిటీ హిందువుల హక్కుల పరిరక్షణ కోసం  స్థాపించిన  జన సంఘ్ .. హిందువులే  మెజారిటీగా ఉన్న ప్రాంతాలలో సైతం ఇవాళ తన ప్రభంజనాన్ని కొనసాగించడం ఆశ్చర్యం కలిగించే విషయమే!   ఒకప్పట్టి తన మరగుజ్జు రూపాన్ని విసర్జించి.. ప్రస్తుతం  తన చుట్టూ గల మరగుజ్జు  పార్టీలను క్రమంగా కబళించే ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నది. ప్ర్రధాన ప్రతిపక్షంగా  గతంలో తాను ప్రవచించిన ధర్మపన్నాలన్నింటినీ  తానే కాలరాస్తున్నదన్న విమర్శ   భాజపా మీద చాలా కాలంగా రాజకీయంగా వెల్లువెత్తుతున్నదే! పార్టీ ప్రజాస్వామ్యంలో   రాజకీయ పక్షాల విమర్శలకు ఆట్టే విలువుండదు. ప్రజలు విశ్వసించాలి. అప్పుడే ఏ వాదనకైనా ప్రాణం వచ్చేది.
గతంలోనూ భాజపా కేంద్రకంగా ఎన్ డి యే కూటమి నిండు ఐదేళ్ల పాటు పాలన చేసిన సందర్బం లేకపోలేదు. కానీ వాజ్ పేయి నేతృత్వంలో సాగిన ఆ ప్రస్థానానికి.. మోదీ నాయకత్వంలో ప్రస్తుతం సాగుతున్న  ప్రస్థానానికి పోలికే లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికారమే పరమావధిగా సాగే రాజకీయ పోరాటాలలో విలువలను గురించి  చర్చించడం.. గొంగటి  బువ్వలో వెంట్రుకలు ఏరడం వంటిది! గతంలో కాంగ్రెస్ పార్టీ చూపించిన దారుల్లోనే ప్రస్తుతం భాజపా మరింత దూకుడుగా  ముందుకు పోతున్నదన్న వాదనా ఉంది. అదీ  పూర్తిగా కాదనలేని వాస్తవమేగా!
హిందూ ఆధిపత్య వాదానికి రాజకీయపక్ష రూపం  వివిధ ప్రాంతాలలో  విస్తరింప చేసే బాధ్యత   నిబద్ధతగల తన పూర్తికాల కార్యకర్తలకు సోపడం ఆరెస్సెస్ మొదటి నుంచి పాటిస్తోన్న నిర్మాణ కార్యక్రమాలలో ఒకటి.  అ క్రమంలోనే నలభై ఏళ్ల కిందట ఉత్తర భారతంలోని  హర్యానా, పంజాబ్, హెచ్.పి రాష్ట్రాల బాధ్యతలు మోదీకి అప్పగించబడ్డాయి.  వాజపేయి మొదటి స్వల్ప కాలిక ప్రభుత్వానికి అకాలీ దళ్ మద్దతు కూడగట్టడం అంత ఆషామాషాగా సాగిన వ్యవహారం కాదు అప్పట్లో. అసలు ఉనికిలోనే లేని భాజపాని విస్తృత ప్రజాసంబంధాల ద్వారా చండీగడ్ ప్రజానీకానికి పరిచయం చేసిన ఘనత మోదీదే. అప్పటి నగర పాలిక ఎన్నికల్లో అకాలీ దళ్ తో పొత్తు సుసాధ్యం చేయడం.. అఖండ విజయం సాధించడం..  తదుపరి లోక్ సభ ఎన్నికల్లోనూ చండీగడ్ ను   కైవశం చేసుకోవడం వంటి విన్యాసాల వెనకున్న మోదీ పట్టుదలను కొట్టిపారేయలేం.  పంజాబ్‌ రాష్ట్రంలో ఏర్పడిన   అకాలీదళ్ బిజెపి సంకీర్ణ ప్రభుత్వం వెనకా మోదీ నిరంతర  కృషి దాగి  ఉంది. హర్యానాలోనూ అదే విజయగాథ.  మోదీ బాధ్యతలు తీసుకొన్న 1995లకి  నాలుగేళ్ల ముందు   లోకసభ ఎన్నికలు జరిగాయి.  భాజపాది నిలబడిన పది సీట్లలో ఒక్కదానిలో మాత్రమే ధరావత్తు దక్కిన దీన స్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లకు గాను అతి కష్టం మీద కేవలం రెండు మాత్రమే సాధించిన దయనీయ పరిస్థితి. వాస్తవ పరిస్థితులను వెంటనే  ఆకళింపు చేసుకొనే ఇంగితం రాజకీయాల్లో నేతలకి ఎంతో అవసరం. ఆ ప్రత్యేక గ్రాహక సామర్థ్యం పుష్కలంగా ఉండబట్టే  పడబోయినప్పుడల్లా మోదీ తట్టుకొని లేచి నిలబెడుతున్నది ఇప్పటి దాకా. అప్పుడూ ఆ ఇంగితం వల్లనే  బన్సీలాల్ 'హర్యానా వికాస్ కాంగ్రెస్' తో పొత్తుకు సిద్ధపడి 1996 లోకసభ  ఎన్నికల్లో భాజపాకి  ఆరింట నాలుగు సీట్లు సాధించి పెట్టింది.  అసెంబ్లీలో సైతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది భాజపా. రాజకీయ పక్షాలకి అధికారమే పరమావధిగా ఉండితీరాలని గట్టిగా నమ్మే వర్గానికి చెందిన నేత మోదీ. ఆ  అధికారం నిలబెట్టుకొనేందుకే  బన్సీలాల్ కు  చెయ్యిచ్చి.. చౌతాలాతో చేయి కలిపేందుకు ఇసుమంతైనా జంకలేదు మోదీ. తాజాగా..  హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రహసనం వెనక  మోదీ నిర్వహించిన ప్రచ్చన్న  కీలక పాత్ర ఆ పాత మోడల్ నుంచి మెరుగు పెట్టినదే!
చిన్న పార్టీలని మింగి  బలపడటం జాతీయ పార్టీలకు కొత్తేమీ కాదీ దేశంలో. గతంలో కాంగ్రెసు చూపించిన బాటలోనే  భాజపా చురుకుగా  అడుగులు వేస్తున్నదిప్పుడు.
మతపరంగా హిందూ జనభా అధికం ఈ దేశంలో. మత విశ్వాసులలో  భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా  రాజ్యాదికారం దక్కించుకోవడం అత్యంత సులువైన మార్గం వాస్తవానికి. కానీ  ప్రజాస్వామిక, లౌకిక పునాదుల మీద మాత్రమే ప్రభుత్వాలను నడిపించుకోవాలని  సంకల్పం చెప్పుకున్న లౌకిక దేశం మనది. స్వతంత్ర బారతావని ప్రథమ ప్రధాని  జవహర్ లాల్ నెహ్రూ  పండిట్ వంశానికి చెందినప్పటికీ సోషలిష్టు భావాలు పుణికి పుచ్చుకున్న నేత. అనేక భావజాలాల సంగమ ప్రవాహంగా సాగే కాంగ్రెసును ఒకే తాటి మీద నడిపించే  శక్తి ఒక్క 'సెక్యులరిజం'లోనే ఉంటుంది  సహజంగానే!  హిందువులూ  తమను తాము భారతీయులలో ఒక అంతర్భాగంగా అంగీకరించిన నేపథ్యంలో.. మరో తరహా మతవాదానికి  ఆధిపత్యం కట్టబెట్టడం  అంత సులువు కాదు. 'భారతీయులంటేనే హిందువులు. అందుకు సమ్మతించని వారు ఈ దేశ పౌరులు కాబోరు' అనే మతకోణం నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ పూర్వ జన సంఘ్.  చాప కింద నీరులా ఆ మతవాదం  విస్తరిస్తూ వస్తున్నా   అయోధ్యలో ‘రామమందిర పుననిర్మాణం' ఓ ఉద్యమంలా ఉధృతమయే దాకా  జనసామాన్యానికి మతాన్నీ ఒక రాజకీయ  కోణంలో చూడాలన్న స్పృహ కలగింది లేదు.  వాజపేయి ఆధ్వర్యంలో ఎన్ డి యే  రాజ్యాధికారం అందుకోవడంలో  అంతకు ముందు అద్వానీ సారథ్యంలో సాగిన 'రథయాత్ర' ఒక ప్రధాన  ప్రేరేపణ. నాడు అద్వానీ బృందం  ఆరభించిన ఆ భావోద్వేగ ప్రధాన ఎత్తుగడలనే  నేడు 'మోదీ.. షా' ద్వయం  మరింత ఉధృతంగా ముందుకు  తీసుకొస్తున్నది.
యూపియే కూటమి పై గల వ్యతిరేకత కారణంగా మాత్రమే మరో  ప్రత్యామ్నాయం లేని  గత్యంతర పరిస్థితుల్లో జనం 2014 సాధారణ ఎన్నికల్లో మోదీ భాజపాకి అధికారం కట్టబెట్టింది.  ఎన్ డి యె కేంద్రంలో అధికారనికి వచ్చి మూడున్నరేండ్లు గడిచిపోయాయి. అయినా  భాజపా ముసుగు   మత ఎజెండా సామాన్యుడి అవగాహనలోకి సంపూర్ణంగా రావడమే  లేదు. తెర ముందు  ఊకదంపుడు ప్రజా ప్రయోజన పథకాల ముమ్మర ప్రచారం.  అవి విఫలమైన   ఆఖరి క్షణాల్లో గెలుపు కోసం కుల, మత, ప్రాంతాల పరమైన భావోద్వేగాలను సైతం రెచ్చగొట్టేందుకు సిద్ధపడడం! తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో చచ్చీ చెడిన మోదీకి చివరికి  అపజయాల గండం నుంచి బైట పడవేసింది ఈ తరహా అప్రజాస్వామిక  సెంటిమెంటల్ ‘పెట్టీ’ రాజకీయ ఎత్తుగడలే!  ఇప్పటి వరకు సాగిన అన్ని ఎన్నికలలో  ‘మోదీ-షా’ల బృందం ఈ తరహా  వ్యూహాలనే చాప కింద నీరులా అమలు చేసింది.  అస్సాం ఎన్నికల్లో విజయానికి   ఉపజాతి భావోద్వేగాలను  వాడుకొంది. మణిపూర్ లో అధికారం ఆ దారిలో పోయే చేజిక్కించుకొంది.  అదే మార్గంలో మరింత దూకుడుగా పోయి   మేఘాలయ, నాగాలాండ్, త్రిపురల్లో కూడా  పాగా వెయ్యాలని వ్యూహాలు పన్నుతున్నది ప్రస్తుతం. అస్సాంలో- అస్సాం  గణ పరిషద్, బోడో పీపుల్స్ ఫ్రంటులతో  కలిపి   'ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి'  మిషతో  కొత్త నాటకానికి తెర లేపింది..  కానీ అంతిమంగా అవసరమైతే ఎంత జాతి, మతపరమైన భావోద్వేగాలనయినా రెచ్చగొట్టేందుకు నిస్సందేహంగా  సిద్ధపడుతుందని గత అనుభవాలే తెలియచేస్తున్నాయి.
చిన్న పార్టీలకు పెద్ద గండమే!
గతంలో జాతీయ పార్టీలతో కలసి నడిచిన  చిల్లర పార్టీలు  అనంతర  కాలంలో  ఉనికిలో కూడా గల్లంతయ్యాయి. హర్యానాలో  వికాస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమై అంతర్దానమైంది.  అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం పార్టీదీ అదే దుస్థితి.  బన్సీలాల్  స్వీయ  ప్రయోజనాలకు విఘాతం ఏర్పడిందన్న కినుకతో  స్వంత కుంపటి మీద కాంగ్రెసుకి వ్యతిరేకంగా భాజపాకి వండి వార్చబోయాడు. చివరికేమయింది? నస్మరంతిగా కనుమరుగు అయిపోయాడు!
ప్రస్తుతానికి వస్తే..  
పంజాబులో అకాలీదళ్ తో బిజెపి చెలిమి సవ్యంగా సాగడం  లేదు. 1984 నాటి  సిక్కుల ఊచకోత  కేసును తిరగ దోడటం వెనక  సిక్కుల మనసు దోచుకోవాలన్న మత ఎజెండానే దాగుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈశాన్యంలో బిజెపితో చేతులు కలిపిన చిన్న పార్టీలకు ముందు ముందు ప్రాణగండం తప్పక పోవచ్చు.  కాశ్మీర్ లో బిజెపితో చేతులు కలిపిన పిడిపి ఇప్పటికే  మెజారిటీ ముస్లింల వ్యతిరేకతను ఎదుర్కోంటోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం భాజపాతో పడుతున్న తిప్పలు బైటికి చెప్పుకోలేనివి.   నాలుగు ఓట్లు రాల్చ గలిగిన సత్తా ఉంటే  చాలు..  ప్రజాస్వామ్యం, విలువలతో ప్రమేయం పెట్టుకోకుండా ఏ పార్టీతో అయినా అంట కాగేందుకు మోదీ-షా ద్వయం నిత్యం ప్రణాళికల సిద్ధం చేస్తోంది. తమిళనాడులో అన్నా డి.ఎం. కె, డి.యం.కెలతో భంగపాటు ఎదురైన తరువాత ప్రస్తుతం రజనీ కొత్త పార్టీ వైపు దృష్టి సారిస్తోంది.  తెలంగాణాలో పాటించే ఎత్తుగడలని గుప్పిట తెరవకుండా మూసి ఉంచింది. దిల్లీ సి.యం కేజ్రీవాల్ ని ఓ రాజకీయ  జోకరుగా అభాసు పాల్చేయడంలో భాజపా దాదాపు సఫలమయింది.  ఒడిషా బిజూ జనతా దళ్  ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ.  అయినా వచ్చే ఎన్నికల్లో దానికి  ప్రధాన ప్రత్యర్థిగా గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం పరిస్థితి కాస్త అటూ ఇటూగా ఉన్నా రాబోయే ఎన్నికల నాటికి మమతా బెనర్జీకి  ముచ్చెమటలు పట్టించనుందని  కొన్ని సర్వేలు హెచ్చరిస్తున్నాయి! మమత కూడా గతంలో ఎన్ డి యే లో భాగస్వామే. తెలివి కలది కనుక తొందరలోనే బైట పడింది.
తాజాగా ..
మహారాష్ట్రలో శివసేన ప్రస్తుతం తృణమూల్ బాటే పట్టి భాజపాతో సంబంధాలు పూర్తిగా తెగతెంపులు చేసుకొంది.   చిరకాలంగా మిత్రభావంతో  నమ్మకంగా మెలిగిన తమని నిర్లక్ష్యం చేస్తోందని శివసేన కినుక.  మైత్రిని నిర్లక్ష్యం చేయడంలోనూ రాబోయే  లోకసభ ఎన్నికలలో స్వంతంగా అత్యధిక స్థానాలలో  ఏమి చేసైనా గెలుపొందాలనే పాత 'మోది' ఎత్తుగడే దాగి ఉందని  ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
బైటికి 'కాంగ్రెస్ ముక్త భారత్' తమ ధ్యేయంగా చెప్పుకుంటున్నా .. వాస్తవంలో జరుగుతున్నది అందుకు విరుద్ధం. శత్రు మిత్ర బేధం లేకుండా ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ హననం చేసి ఆయా స్థానాలలో తమ హిందూ ఆధిపత్య భావజాలాన్ని శాశ్వతంగా సుస్థిర పరచుకోవడమే  అంతిమ లక్ష్యంగా ‘మోదీ- షా’ బృందం వేస్తున్న  అడుగులను బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగ బద్ధమైన అన్ని వ్యవస్థలలోనూ   అధికారపక్ష జోక్యం  ఇప్పుడుంటున్నంతగా మునుపెన్నడూ చూసి ఎరుగం- అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
విలువలకు రాజకీయాలు విడాకులు ఇచ్చి చాలా కాలమే అయిందన్నది ప్రజాస్వామ్యవాదుల వేదన. లాభసాటి పదవులను పాత తేదీ నుంచి కొనసాగించవచ్చన్న చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ హయాం నాటి యూపియే కూటమే కదా! ఆ క్లాజును అడ్దం పెట్టుకుని  కేజ్రీవాల్  సర్కారు తెచ్చిన బిల్లు తిరస్కరణకు గురయింది. తిరస్కరించిన అప్పటి అధ్యక్షులు పదవి నిర్వహణకు  ముందు.. తరువాత కూడా తన కాంగ్రెసు విధేయతను బహిరంగంగానే చాటుకున్నారు! చట్టబద్ధం కాని  పాలన కొనసాగుతున్నప్పుడు.. న్యాయపరంగా నిలవరించే స్వతంత్ర సంస్థ  న్యాయవవస్గ్థ.  హేతు బద్ధతను బోనులో నిలబెట్టి  ప్రశ్నించవలసిన ఆ అత్యున్నత వ్యవస్థే ఇప్పుడు  బోనులో నిలబడే పలు ప్రశ్నలకు స్పందించ వలసిన అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతున్నది!
 అన్నీ ఆ తానులో ముక్కలుగానే బైటపడుతున్నప్పుడు ఎవర్నని ప్రత్యేకంగా వేలెత్తి చూపడం?
 ***
కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకీయ వుట వ్యాసం- 03-02-2018-ప్రచురితం)


Monday, January 29, 2018

బాపూజీ.. నీ చల్లని నవ్వే మా కివ్వు! - ఆంధ్రప్రభ వ్యాసం



మహాత్మా గాంధీ నిర్యాణంపై ఒక వ్యాసాన్ని రాయమని నన్నడిగినప్పుడు నాకుగా నేను వేసుకున్న ప్రశ్న ఇది. రాయడానికి కూర్చున్న ప్పుడు దానికి న్యాయం చేయగలనా అనిపించింది. నేనొక రేడియో వ్యాఖ్యాతని. గుండెలు పగిలిపోయిన ఆఖరు క్షణాల్నీ, బాపూజీ అంతిమ యాత్రనీ ఏమని వర్ణించాలి? ఏ విధంగా నా కలం కదులుతుంది? నాకు మాత్రం ఆ రాత్రి సుదీర్ఘంగా అనిపించింది. కాళరాత్రిని తలపించింది. బాధ, విషాదం పొంగిపొర్లుకొచ్చాయి. మాటలలో వర్ణించలేని భావన మెదులాడింది. కాలం అన్నింటికీ మందు. క్రమేపీ బాధ తగ్గుముఖం పడుతుంది. కొన్ని దృశ్యాలు నా మెదడులో నిక్షిప్తమైపోయాయి. ఆ దృశ్యాల గురించే నేనిప్పుడు రాయబోయేది.





ఆరోజు ఉదయం 6గంటలు. మహాత్ముని పార్థివ దేహాన్ని ఉంచిన బిర్లా హౌస్‌కు వెళ్ళాను. బాపూజీ అంతిమ సంస్కారం నిర్వహించే రోజది. నేను వెళ్ళేసరికే పెద్ద సంఖ్యలో ప్రజలు బరువెక్కిన గుండెలతో వరుసలో నిలబడి ఉన్నారు. గత స్మృతులను నెమరువేసుకుంటూ కనిపిం చారు. నన్ను
ఒక ప్రత్యేక ద్వారం ద్వారా గాంధీ మృతదేహమున్న చోటకు తీసుకెళ్ళారు. విశాలమైన ఆయన ఛాతిని నిర్దయగా గాయపరిచిన తూటాల గుర్తులు కనిపించాయి. అవి ద్వేషానికీ, పిచ్చి పనికీ పరాకాష్టగా కనిపించాయి. బాపూజీ ముఖంలోకి చూశా. ఎంత అద్భుతమైన ముఖమది. మృత్యు పరిష్వంగంలో చేరిపోయింది. ఆయన అభిమానుల వదనాలు దీనంగా మారిపోయాయి. ఎగురుతున్న గులాబీ రేకుల మధ్యలో నుంచి కనిపిస్తున్న మహాత్ముని వదనం నా నోటి నుంచి ధారాళంగా పదాల వెల్లువను సృష్టించింది. బాల్యంలో నేను చదువుకున్న ఏసు క్రీస్తు బోధనలలో ఒక వాక్యం గుర్తుకొచ్చింది. ఓ తండ్రీ వారిని మన్నించు. వారేం చేస్తున్నారో వారికే తెలియదు శాశ్వత నిద్రలో ఉన్న మహాత్ముని పెదవులు కూడా అలాగే అన్నట్లు నాకనిపించింది. బాపూజీ మన్నించడానికి పెట్టింది పేరు. ఇంతవరకూ నేనలాంటి మనీషిని చూడలేదు. అదే సమయంలో నా భుజంపై ఓ చేయి పడింది. వెనక్కి చూస్తే ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ. ఆయన కళ్ళలోనూ అదే రకమైన అనుభూతి కనిపించింది. అది కూడా నేను మరిచిపోలేను.

గులాబి రేకులతో అంతిమ వీడ్కోలు
మహాత్ముని అంత్యక్రియల ఊరేగింపులో రేడియో వాహనం మెల్లిగా నడుస్తోంది. క్వీన్స్‌వే, కింగ్స్‌వే, హర్డింగే అవెన్యూ, బీటా రోడ్‌..మీదుగా రాజ్‌ఘాట్‌కు వాహనం చేరాలి. మా వెనుకే మహాత్ముని పార్థివదేహాన్ని ఉంచిన ట్రాలీ కదులుతోంది. ప్రజలంతా చూసేలా దేహాన్ని ఉంచారు. పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, దేవదాస్‌ గాంధీ, సర్దార్‌ బల్‌దేవ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ నిలబడి ఉన్నారు. లక్షలాదిమంది గాంధీ మహాత్మునికి ఇష్టమైన శ్లోకాలను చదువుతున్నారు. ఆ సమయంలో చెమర్చని కన్ను నాకు కనిపించలేదు. మరణానికి రెండు నెలల ముందు బహిరంగ సభలో ప్రసంగించిన జిల్లా జైలు వద్దకు యాత్ర చేరింది. జైలు శిక్ష అనుభవిస్తున్న వారినుద్దేశించి బాపూజీ అప్పుడు ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని నేనూ విన్నాను. ప్రేమాభిమానాలను వర్ణిస్తూ ఆయన ప్రసంగం సాగింది. సరిగ్గా అదే రోడ్డు మీదుగా యాత్ర సాగడం యాదృచ్ఛికం. గాంధీ భౌతిక కాయంపై స్వర్గం నుంచి పూల రేకులను వర్షించినట్లుగా ఉంది. యాత్రలో పాల్గొన్న ప్రజలు గుప్పెట్లో గులాబీలను తీసుకుని ఆకాశంలోకి విసురుతున్నారు. గాంధీజీ అమర్‌ రహే అంటూ నినదిం చారు. రోడ్డుకిరు వైపులా ఉన్న భవనా లపై నుంచి పూలను జల్లుతూ గాంధీకి జై అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. యాత్ర అక్కడ కొద్ది నిముషాలపాటు నిలిచింది. గాంధీజీని కడసారి చూసుకునేందుకు ప్రజలు ముందుకు తోసుకొచ్చారు. మా రేడియో వ్యాన్‌ను కూడా లాగేశారు. దుఖం తాండవిస్తున్న వదనాలు గాంధీజి మరణాన్ని జీర్ణించుకోలే మంటున్నాయి. ఓ మహిళ.. ఇది నిజం కాదు.. రేపు ప్రార్థనల సమయానికి బాపూజీ తిరిగొస్తారంటకూ భోరుమంది. ఎక్కడో తప్పు జరిగిందని అంటోంది. ఆమెలో ఆమె మాట్లాడుకుంటోందని నాకర్థమైంది. తనను తాను ఆమె అలా సంబాళించుకుంటోంది. ఆమె పక్కనే ఓ భిక్షువున్నాడు. అతడి కళ్ళు ఏడ్చిఏడ్చి ఉబ్బిపోయాయి. ఆ పక్కనే చక్కని దుస్తులు ధరించి ఉన్న మహిళ పరిస్థితి సైతం అదే. ధనిక, పేద లేకుండా దేశం యావత్తూ కుమిలిపోయిన క్షణాలవి. ఒక మరణం పేద, ధనికులను ఒకచోట చేర్చింది.. ఎంత ఆశ్చర్యం. గాంధీజీ భారత దేశమంతటా నిండిపోయారు. ఆయన సాధారణ తత్వం ప్రపంచంలోని అన్ని హృదయాలనూ గెలుచు కుంది. మా వ్యాను ముందుకు కదులుతుంటే ఓ చిన్నారి తన తల్లిని అడిగిన ప్రశ్న నా చెవిన పడింది. అమ్మా! గాంధీజి నిజంగా, శాశ్వతంగా వెళ్ళిపోయారా! అని. అసలు తిరిగి రారా అని కూడా ప్రశ్నించింది. తల్లి చెప్పిన సమాధానం గుర్రపు డెక్కల చప్పుడులో కలిసిపోయింది. బాపూజీ అంత్యక్రియలకు హాజరైన గుర్రాలు సైతం విచారంగా నడుస్తున్నట్లే అనిపించింది.
నిమజ్జన యాత్రలోనూ కన్నీటి ధారలు

యాత్ర రాజ్‌ ఘాట్‌కు చేరడానికి 5 నిముషాల ముందే నేను అక్కడికి చేరుకున్నాను. మా రెండో వాహనం
అంత్యక్రియల వేదికకు 30 అడుగుల దూరంలో నిలిచి ఉంది. అక్కడికి చేరిన ప్రజలంతా నాకు కనిపించేందుకు నేను వాహనంపైకి ఎక్కి నిలబడ్డాను. ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ జరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాట్లు నా దృష్టిని ఆకర్షించాయి. రక్షణ సిబ్బంది సాసర్‌ ఆకారంలో భుజంభుజం కలిసి రక్షణగా నిలుచున్న తరుణంలో చందనపు చెక్కలతో రూపొందించిన చితినుంచి తొలి జ్వాల నింగికెగిసిన తరుణంలోనే సూర్యభగవానుడు అస్తమించడం ఆరంభమైంది. అదే సమయంలో ప్రజల నుంచి పెద్ద నిట్టూర్పు కూడా ఆకాశానికెగిసింది. రాజ్‌ఘాట్‌పై ఒక తుపాను విరుచుకుపడిన తీరును తలపించింది. అడ్డుగా కట్టిన బ్యారికేడ్లను, తాళ్ళనూ, తీగలను తెంచుకుంటూ ఆడా, మగ తేడా లేకుండా చితిమంటలను చూసేందుకు బాధాతప్త హృదయాలతో ముందుకు తోసుకొచ్చారు. చందనపు చితి చుట్టూ చేరారు. వారి శోకంతో పాటూ చితిమంటలు ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి. చందనపు పరిమళం ఆ ప్రాంతాన్ని ఆవరించింది. గవర్నర్లు, రాయబారులు, క్యాబినెట్‌ మంత్రులు.. యమునా నదీ జలాలతో పవిత్రమైన, హరితహారంలా ఉన్న ప్రాంతంలో ఈ దృశ్యాలకు సాక్ష్యాలుగా నిలిచారు. ఈ సన్నివేశాలను చూసిన నా పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్న ఆకులా మారిపోయింది. మహాత్ముని పార్థివ దేహాన్ని ఆబగా కబళిస్తున్న చితిమంటల ఎత్తు మరింత పెరుగుతుండగా.. ఒక పక్క నుంచి చీకటి చుట్టుముట్టేసింది. లక్షలాదిమంది ఇళ్ళకు తిరుగు ముఖం పట్టినప్పుడు వారి కాలి నుంచి లేచిన ధూళి ఆ ప్రాంతాన్ని ఆవరించింది. జాతి పిత లేకుండానే ఇక తమ ప్రయాణం కొనసాగించవలసి ఉంటుందని వారికి అప్పటికి అర్థమైంది. ఆయన ప్రేమ లేదనీ అవగతమైంది. చితిమంటల్లో వారు కడసారి బాపూజీ చిరునవ్వుల్ని చూసుకున్నారు. సోదరీ, సోదరుల్లారా అంటూ ఆయన చేసే సంబోధనలను ఆ చిటపటల్లో విన్నారు. తుచ్ఛమైన ఈ ప్రపంచాన్ని వీడిన బాపూజీకి గుడ్‌బై చెప్పారు. అసత్యం, హింసలతో కూడిన ప్రపంచంలో జన్మించిన గాంధీ సత్యం, అహింసలతో కూడిన తనదైన ప్రపంచాన్ని నిర్మించారు. రాజ్‌ఘాట్‌నుంచి హృదయభారంతో వెనుదిరుగుతున్న ప్రజల శిరస్సులపైనుంచి చితిమంటలను గమనించిన నాకు గొంతులో ఏదో అడ్డం పడినట్టనిపించింది. మింగడానికి కష్టమైంది. ఆ రోజంతా అలాగే ఉంది. అలా అడ్డం పడిందేమిటో? లక్షలాదిమంది బరువెక్కిన గుండెలతో తిరుగుముఖం పడుతుండగా, వెండిరంగులో నక్షత్రాలు మెరుస్తూ, ప్రేమ, సత్యం, అహింసలకు ప్రతిరూపమైన బాపూజీకి స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపించింది.
వ్యాఖ్యానం పూర్తయిన తరవాత నేను కొద్దిగంటల పాటు వ్యాన్‌పైనే కూర్చుండిపోయాను. ప్రజలంతా వెళ్ళేవరకూ అలాగే ఉండిపోయాను. మూర్ఛిల్లిన ఓ మహిళను వ్యానుపైకి చేర్చారు. ఒక బాలుడు, బాలికను కూడా అక్కడికి చేర్చారు.
ఆ జనప్రవాహంలో ఒక చేయి వ్యాను పైభాగాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపించింది. చూస్తే.. అది ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ. వెంటనే చేయి అందించి, ఆయనను పైకి లాగాను. గవర్నర్‌ జనరల్‌ని చూశారా అని ఆయన నన్ను ప్రశ్నించారు. ఆయన అరగంట ముందే ఇక్కడినుంచి వెళ్ళిపోయారని బదులిచ్చాను. సర్దార్‌ పటేల్‌??? ఆయన కూడా కొద్ది నిముషాల ముందు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆ ప్రజా సమూహంలో కలిసి వచ్చిన స్నేహితులై వేరైపోయారు. ప్రధానిని చూసిన ప్రజలు వ్యాను చుట్టూ చేరారు. ఆయనేమైనా మాట్లాడతారేమోనని చూశారు. ఆ సమయంలో నా మదిలో ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. ఒక అత్యద్భుతమైన వ్యక్తి దగ్గరగా ఉన్నానన్నదే ఆ యోచన. ఒక పక్కన జాతిపిత దేహం అగ్నికి ఆహుతవుతుంటే.. భారత మాత పుత్రుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, స్వాతంత్య్రమనే దీపశిఖను సజీవంగా ఉంచడానికి జాతికి తనను తాను అంకితం చేసుకున్నారు. మరుసటి రోజు 2 గంటలకు నేను ఇల్లు చేరాను. తిరిగి రాజ్‌ఘాట్‌కు వెళ్ళేసరికి అక్కడ చితినుంచి పొగలొస్తున్నాయి. ప్రజలు అదృశ్యమయ్యారు. దుమ్మూ, ధూళీ సర్దుకున్నాయి. ఒక గార్డును అక్కడుంచారు. ఒక్కసారి రాజ్‌ఘాట్‌వైపు చూశాను. మొత్తం దృశ్యాలను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ చీకటిలో తెల్లటి ఖాదీ వస్త్రాన్ని ధరించిన మచ్చలేని మహనీయుడు నా మస్తిష్కంలో ఆవిష్కృతమయ్యాడు. దృఢనిశ్చయంతో కూడిన దృక్కులతో ఆయన కనిపించారు. ప్రజల శిరసుల పైనుంచి ఆయన చూస్తున్నారు.
ఫిబ్రవరి 11వ తేదీసమయం తెల్లవారు జామున నాలుగున్నర గంటలు..నేను గ్రీన్‌ అస్తి స్పెషల్‌ కంపార్ట్‌ మెంట్‌ ఎదురుగా నిలుచున్నాను.ఆ బోగీలో గాంధీజీ అస్తికలు ఉంచారు. అందులో అన్నీ మూడవ తరగతి బోగీలే. గాంధీజీ ఎప్పుడూ మూడవ తరగతిలోనే ప్రయాణం చేసేవారు. మూడవ బోగీ లో ఏం మంట అది ఎర్రగా వెలిగిపోతోంది. బోగీలో దీర్ఘచతురాస్రాకారంలో ఒక టేబిల్‌ ఉంది. దానిపై శవపేటిక లో అస్తికల కలశం ఉంది.ఆ పేటికపై చేతితో నేసిన త్రివర్ణ పతాకం పరిచారు.ఆకుపచ్చ ఆకులతో నేసిన ఒక చాప ఉంది. దానిపై తెల్లని పూలు,కాషాయి రంగు ఆకులుఉన్నాయి. పూర్తిగా త్రివర్ణ పతాకంతో కప్పివేసారు.మధ్య భాగంపై ఫ్లడ్‌ లైట్ల కాంతి విరజిమ్మేట్టు ఏర్పాటు చేశారు.
బయట ఫ్లాట్‌ ఫారంపై వేలాది మంది ప్రజలు గాంధీజీ అస్తికల కలశాన్ని దర్శించి నివాళులర్పించేందుకు వేచి ఉన్నారు.ఉదయం ఆరున్నర గంటలకు గార్డు ఈలవేశాడు. గ్రీన్‌ బోగీలు కొత్తఢిల్లిd స్టేషన్‌ బయటకు వచ్చాయి. ఆ రైలు కదలుతుండగా, ప్రజలు కట్టలు తెగే కన్నీరు ధారగా ప్రవహిస్తుండగా, విలపిస్తూ జాతిపితకు కడసారి వీడ్కోలు చెప్పారు. గాంధీజీ అస్తికల కలశంపై గులాబీ రేకులనూ,పూలదండలను మంత్రాలు చదువుతూ విసిరారు. శిరసావహించి భక్తిప్రపత్తులతో ప్రణామం చేశారు. తమ తలలు ఎంత గర్వంగా పైకి ఎత్తాలో నేర్పిన జాతిపితకు శిరసు వంచి ప్రమాణం చేశారు.
మా బోగీ మధ్య బోగీ పక్కన ఉంది.ఆ బోగీలోనే గాంధీజీ అస్తికల కలశం ఉంది. కిటికీల్లోంచి బయటకు చూస్తే, పొలాలన్నీ బంగారు తివాచీల్లా కనిపించాయి. నేలపై పరిచిన బంగారు దుప్పట్ల మాదిరిగా కనిపించింది. మామూలుగా అయితే, ఆ దృశ్యం హృదయాలను పులకింపజేసేదే. పొలాల్లో రైతులకూ,వ్యవసాయ కూలీలకు బోధిస్తూ ఒక వ్యక్తి పెద్ద అడుగులేస్తూ వెళ్తున్న భావన కలిగింది.గ్రామీణులంతా రైలు కట్టకుఇరువైపులా నిలబడి ఉబికివస్తున్న కన్నీరును తుడుచుకుంటూ గాంధీజీకి నివాళులర్పించారు. స్పెషల్‌ రైలు అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఘజియాబాద్‌,ఖుర్జా,ఆలీగఢ్‌, హథ్రాస్‌,తుండ్లా, ఫిరోజాబాద్‌, ఎటావా, ఫాఫుండ్‌,కాన్పూర్‌, ఫతేపూర్‌, రసూల్‌ బాద్‌ స్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు.తుండ్లాలో మా బోగీ వైద్యశాలగామారిపోయింది.అనేక మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. విషాదం నిండి ఉంది. సంపూర్ణమైన ఆశ ఉంది.గీతా శ్లోకాల పఠనం నిరంతరం సాగుతూనే ఉంది.అది చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే, ఆయనకు మరణం లేదనిపించింది.ఎవరో ఇలా అంటున్నట్టు అనిపించింది.
ఎవరనగలరు ఒక వ్యక్తిని హత్య చేశారని
ఎవరు భావించగలరు నేను వధించబడ్డానని
జీవితాన్ని ఎవరూ అంతం చేయలేరు. జీవితం అంతంకాదు.
ఆత్మకు పుట్టుక లేదు. ఆత్మకు చావు లేదు.
ి్లటౌు ్హ్‌ిలిబిె ప్ఘ ్హఁి్లడ;
మీకు నారింజ ఇష్టమేనా? ఇలా ఎవరో అడిగేసరికి నాకు గుర్తొచ్చింది నేనేమీ తినలేదు కదా అని.నా బోగీ కిటికీకి దగ్గరగా వచ్చిన వ్యక్తివైపు చూశాను.మళ్ళీ బోగీలో చూశాను.అక్కడ అంత గాంధీజీని గౌరవించేవారు,భక్తితో ఆరాధించేవారూ ఉన్నారు.
విఎ సుదర్శన్‌ అనే మా మిత్రుడు ముప్పయిరెండేళ్ళ వయస్కుడు. గాంధీజీకి ప్రియ శిష్యుడు. మెెం ఇప్పుడే ఫతేపూర్‌ దాటామని నాకు గుర్తుకు వచ్చింది. పురుషులు, బాలురు రైలుతో పోటీ పడి ఒక కిలోమీటరు దూరం పరిగెత్తారు. గాంధీజీ అస్తికల కలశంపై ఉంచేందుకు తెచ్చిన పువ్వులు వారిచేతుల్లో కనిపించాయి.రైలు వేగాన్ని అందుకోవడంతో వారంతా వెనక్కి వెళ్ళిపోయారు. మహాత్మాగాంధీ వర్ధిల్లాలి అనే వారి నినాదాలు మాత్రం చెవుల్లో చాలా సేపు గింగురు మన్నాయి. మా మిత్రుడు ఎర్రని గులాబీని చూస్తూ ఆలోచనలోపడ్డాడు.ఆతడి కళ్ళంట నీళ్ళు బొటబొటా రాలాయి.ఇలాంటి గులాబీనే బుల్లెట్‌ గాయాలపై ఉంచాను. అని గొణుక్కున్నా డు.మా మధ్య సంభాషణ ఏమీ జరగలేదు. బయట ఆకాశం ఎర్రగా కనిపించింది. స్వర్ణకాంతులీనుతూ సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ గులాబీని చేతిలోకి తీసుకున్నాను.అది గతంలో ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది. సువాసనలను వెదజల్లింది. అక్కడ ఒక సైనికుడు సైనిక దుస్తుల్లో ఉన్నాడు .రైలు ఆ స్టేషన్‌ దాటుతుంటే వంగి నమస్కరించాడు.
దారి పొడవునా లక్ష లాది మంది గాంధీజీకి కన్నీటి ధారలతో నివాళులర్పించారు. మహాత్మా గాంధీకీ జై అనే నినాదాలు మార్మోగాయి.లక్షలాది మంది ప్రార్థనలు చేశారు. అన్ని రంగాలకు చెందిన వారూ వచ్చారు.వారందరిలో గాంధీజీపై పరిపూర్ణమైన భక్తి ఉంది. వారి నోటంట మహాత్మాగాంధీ అమర్‌ రహే అనే నినాదాలు వినిపించాయి. త్రివేణి సంగమం వద్ద అంతిమ యాత్ర ముగిసింది. మహాత్మాగాంధీ పవిత్ర అవశేషాలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు.పవిత్రమైన,యోగి పుంగవుడి అస్తికలను అంతే పవిత్రమైన త్రివేణి సంగమంలో రామదాస్‌ గాంధీ నిమజ్జనం చేశారు. నేను ఒక పడవపై నిలబడి ఉన్నాను. అస్తికల నిమజ్జనం జరిగిన ప్రదేశానికి కొద్దిగజాల దూరంలో ఉన్నాను.వేలాది మంది ప్రజలు ఆ దృశ్యాన్ని అతి దగ్గర నుంచి చూసేందుకు ఎంతో ఆత్రుతను ప్రదర్శించారు. పీపాల కొద్దీ పాలు పోశారు. ఆ పాలతో ఆ నదీ జలాలు శ్వేత జలాలుగా కనిపించాయి.అది ఒక ప్రస్థానపు ముగింపు.ఆయన అనంతలోకాల్లోకి చేరిపోయాడు.ఆ దృశ్యాన్ని వీక్షించిన వారంతా నాలాగే అనుకుని ఉంటారు.మనంకూడా అలా గాలిలో కలపాల్సిందేనని. ఓ భగవంతుడా! ఆలయాల్లో అర్చనలు చేయలేదు. నాది గంభీరమైన జీవితం కాదు, అలా అని క్లిష్టమైనదీ కాదు.కాని నేను కృతజ్ఞతలు తెలిపానునదీ దేవత నిరంతరం ప్రవహిస్తూ, దప్పికగొన్నవారికి దాహంతీరుస్తోంది. ప్రయాగ అంతటా చీకటి అలుముకుంది. అప్పుడప్పుడే దీపాలు వెలిగిస్తున్నారు. మేం వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం.త్రివేణి సంగమం వైపు ఒక్కసారి పరికించి చూశాను.ఇప్పుడు దీపాలు మరిన్ని కాంతివంతంగా వెలుగుతున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ నక్షత్రాల్లో బాపూజీ ఉన్నారు.ఆయన జ్ఞాపకాలు ఆ దీపాల మాదిరిగానే మెరుస్తున్నాయి. నిజమే దీపం ప్రకాశమానం అవుతుంది.దాని కాంతి నిశీధిలోకి చొచ్చుకునిపోతుంది.ఈ నాగరికత ఉన్నంతకాలం ప్ర కాశిస్తూనే ఉంటుంది.
అనువాదంః శ్రీ కె వి సుబ్రహ్మణ్యం
(ఆంధ్రప్రభ 30-01-2016 సంపాదకీయ వ్యాసం)

                      

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...