Saturday, May 12, 2018

నేటి మతోన్మాదానికి చారిత్రక నేపథ్యం ఉంది




ప్రకృతికి మనిషికి తాత్విక సంబంధంగా 
మొదలయినది మతం. మానవ పరిణామ దశల క్రమంలో ప్రారంభంలో అదో నమ్మకం.. ఆనక అదే ఓ విశ్వాసంగా బలపడింది. సమాజం అభివృద్ది చెందే వివిధ దశల్లో ఆ ‘మత’మే ఉన్నత వర్గాల వారు కింది తరగతుల వారిని తమ చెప్పుచేతుల్లో ఉంచుకొనే సాంస్కృతిక ఆయుధంగా మారిపోయింది. అదో చారిత్రక విషాదం.
మనిషి ఆదిమ దశలో ప్రకృతి నుంచి ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో తెలియని నిస్సహాయతతో ముప్పిరిగొన్న భయం నుంచి బైటపడేందుకు అదృశ్య శక్తులేవో ఉన్నాయని ఊహించుకొని. వాటిని కర్మకాండల ద్వారా సంతృప్తిపరిస్తే కష్టం నుంచి గట్టెక్కవచ్చని భావించాడు. అతగాడి అజ్ఞానం, అమాయకత్వం, అసహాయత, అవగాహనాలేమి ఇత్యాదుల వల్ల మొదలైన ఆ కర్మకాండలకు ఒక సైధ్దాంతిక రూపం కల్పించి పూజాదికాలు అతని జీవితంలో  ఒక ప్రధాన విధానంగా మార్చింది పూజారి వర్గం.   దైవసంబంధమైన ఆ కర్మకాండలు నిర్వహించే హక్కు కేవలం తమ చెప్పుచేతల్లో ఉంచుకుంది. పూజారికి దేవుడి ప్రతిరూపం అనే ఇమేజి స్థిరపడింది. మతం మీది అతని గుత్తాధిపత్యం ఎప్పుడూ ధిక్కరణకు గురి కాలేదు. అప్పుడప్పుడు ఏ చిన్న  చైత్యన్యవంతమైన ఆందోళన చెలరేగినా వాటిని మొగ్గదశలోనే తుంచివేయడం జరిగేది. పాలకుల అండదండలు పుష్కలంగా గల బ్రాహ్మణ వర్గానికి అదంత కష్టసాధ్యం కూడా కాలేదు.
అత్యధిక సామాన్య వర్గ ప్రజల సాంస్కృతిక, జీవన విధానాలు  మతం పునాదుల మీదే నిర్మితం కావడం మతానికి సమాజం మీద అమితమైన పట్టును తెచ్చిపెట్టింది. భూస్వామ్య వర్గమూ  మంది సాంస్కృతిక బలహీనతలను సొమ్ము చేసుకోవడంలో వెనుకబడింది లేదు.  తన వంతు కుట్రగా కులాల ప్రాతిపదికన  సమాజాన్ని మరో మారు చీల్చిందది.. ప్రాబల్యం అధికంగా గల కులాలకు ఉత్పత్తి వృత్తులతో నిమిత్తం లేదు. సమాజ సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల మీద  పెత్తనం మాత్రం  ఆ పూజారి వర్గాలకే అప్పగించబడింది. భూస్వాములకు, పూజారులకు మధ్య అంతర్గతంగా కుదిరిన ఈ అన్యాయపు ఒప్పందం మూలకంగా ఉత్పత్తి వృత్తుల మీద ప్రత్యక్షంగా ఆధారపడిన బడుగు జీవులు మరోమారు ఘోరమైన దోపిడీకి గురయ్యారు.
మధ్యయుగాలలో ఈ దేశం మీదకు దండెత్తుకొచ్చి పెత్తనం చేసిన మొగలాయీల మొదలు ఇటీవల వరకు అధికారం చెలాయించిన వలస పాలకుల వరకు.. అందరిదీ ఒకే దోపిడీ పంథా. ఏ అగ్రవర్ణానికీ, అగ్రవర్గానికీ  బడుగుల జీవన స్థితిగతుల  మెరుగుదల పట్ల  ఆసక్తి లేకపోయింది. పాలకులతో భూస్వామి వర్గాలు రాజీ ధోరణితో సర్దుకుపోతే.. అర్చక వర్గాలు మతం మీద తమకున్న పట్టు చూపించి ఆయా పాలకులను  అధీనంలో ఉంచుకొన్నాయి.
వలస పాలకుల వల్ల జాతీయ సాంస్కృతిక జీవనంలో సగుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని భావించే వాళ్లేమీ తక్కువ లేరు. వలస పాలకులు తెచ్చిన ఏ సాంస్కృతిక సంస్కరణా బడుగుల మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా సాగింది లేదు.  ఏ కొద్ది మార్పో వాళ్ల జీవితాల్లో సంభవమైనప్పటికీ జఅదీ  పాలకులకు మేలు కలిగించే వరకు సాగి అక్కడితో ఆగిపోయేది. పీడిత వర్గాలు చైతన్యవంతమైతే   తమ అధిపత్యానికి ఎదురయ్యే సవాళ్ళు  అగ్రవర్ణాలు, వర్గాలు ముందస్తుగానే ఊహించి తగు జాగ్రత్తలు తీసుకొనేవి.
చార్వాకుడి నుంచి గౌతమ బుధ్దుడి దాకా, భక్తి ఉద్యమం మొదలు గాంధీయిజం వరకు ఈ దేశంలోని అన్ని ఉద్యమాలు మతవాదులతో సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరించాయి. అలా వ్యవహరించాయి కాబట్టే వాటి మనుగడను కొంతవరకైనా సాగనిచ్చింది మతవర్గం. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీజీ భూస్వామ్య వ్యవస్థను ఎక్కడా ధిక్కరించిన దాఖలాల్లేవు. పైపెచ్చు జనసామాన్యం మనసులు సులువుగా గెలుచుకొనేందుకు మతచిహ్నాలను సైతం విశృంఖలంగా  వాడారాయన. గాంధీజీ తెచ్చేందుకు ప్రయత్నించిన సంస్కరణల్లో చాలా భాగం మతవాదాన్ని మరింతగా సమర్థించే దిశగానే సాగాయంటే కొంతమందైనా నొచ్చుకుంటారని తెలుసు. నిష్ఠురమనిపించినా నిజం నిజమే అవుతుంది కానీ.. ఎన్ని ముసుగులు వేసినా అబద్ధం కాబోదు కదా!
స్వాతంత్ర్యం వచ్చినా ఈ దేశ ఆర్థిక విధానాలలో ఇదే తరహా ద్వంద్వ వైఖరి  కొనసాగింది. జాతి సాధించిన అభివృధ్దిలో అధిక శాతం పది శాతంగా ఉన్న అగ్రవర్ణాలు, వర్గాల వద్దే పేరుకు పోవడం మునుపటి కథ. ఇప్పుడు ఆ పది శాతం  రోజు రోజుకీ మరింతగా కుచించుకుపోతోందన్న  అంచనాలు వింటున్నాం.
లాభాల బాటలో ఉన్న సంపన్న వర్గాలు ఏ కారణాల కోసం తమ  సౌకర్యాలను స్వఛ్చందంగా బడుగు వర్గాలకు ధారాదత్తం చేస్తాయి? తమ అభివృధ్ధికి ఆటంకం కలిగించే బీదల పాట్లను కనీసం అర్థం చేసుకొనేందుకైనా ఆసక్తి చూపించవు. సరికదా.. నూతన విజ్ఞానం రగిలిస్తున్న సామాజిక స్పృహ కారణంగా  అభివృధ్దిలో తమకు న్యాయంగా దక్కవలసిన వాటా కోసం బడుగులు ఇప్పుడు చేస్తున్న ఆందోళనలకు  అడ్డుకట్ట వేసేందుకు  కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తాయి కూడా! అందులో భాగమే మతాల క్రియాశీలక రాజకీయ పాత్ర.
గతంలో మాదిరి  మతాన్ని కేవలం సామాజిక ఆధిపత్యం కోసం మాత్రమే వాడుకొనే ఆయుధంగా భావించడం లేదు అగ్రవర్ణాలిప్పుడు. మతం నెత్తికీ ఒక రాజకీయ టోపీ తగిలించి.. చేతికో జెండా అందిస్తే మిగతా అన్ని చిటుకుల కన్నా శక్తివంతంగా సామాన్యుల జీవితాల్లోకి చొరవగా చొచ్చుకు పోవచ్చు. మకిలి అంటకుండా స్వకార్యం సాధించుకొనేందుకు  మతానికి మించిన గమ్మత్తు మత్తు పదార్థం ఈ దేశంలో  ఇప్పటికి వరకైతే మరోటి  లేదు.
మసీదులు పడగొట్టి ఆలయాలు కడతామన్న అజెండా ప్రకటించుకున్న మర్నాటి నుంచే అప్పటి వరకు ఏదో మూల నక్కి ఉన్న  మతవాదం రాజకీయ రూపం ధరించి అప్రతిహతంగా ముందుకు దూసుకొచ్చింది ఈ దేశంలో. 2014లో పాలకులు మార్పిడి జరిగినప్పటి నుంచి కాశ్మీరు టు కన్యాకుమారి.. సర్వత్రా పెచ్చుమీరుతున్న ఉన్మాద ధోరణులకు.. గతంలోనే సామాజిక వ్యవస్థ మూలాలలో విత్తబడిన మతబీజాలే మూలకారణం. ప్రజాఉద్యమాలకు సైతం దేవుళ్లకు  ముడుపులు కట్టే వైరుధ్యం సామాన్య ప్రజలు ప్రశ్నలకు గురికాక పోవడం అందుకే ఈ దేశంలో సంభవమయింది! ప్రజలు తమ రెక్కల కష్టంతో నింపిన బొక్కసాలను యజ్ఞాలు, యాగాలు, పుష్కరాలు, దీక్షల పేరుతో పాలకులు ఖాళీ చేసేందుకు తెగబడుతున్నా ఇదేమని ప్రశ్నించాలన్న స్పృహే కరువైన ప్రస్తుత రాజ్యంలో  మతాతీత కులాతీత లౌకిక ప్రజాస్వామ్య సంక్షేమ వ్యవస్థను కాంక్షించడం ఎంత వరకు సబబు?! వలస పాలకుల నుంచి రాబట్టుకున్న రాజ్యమే లౌకిక సమాజాన్ని నిర్మిస్తుందన్న ఆశ ఇంకా మిగిల్చుకున్నవాళ్లకూ ఓ నమస్కారం.
పీడనకు గురిచేస్తున్న  మతవిశ్వాసాల ముందే భయభక్తులతో లొంగి   బతుకీడ్చేందుకు సిధ్దపడే పీడితుల మానసిక  బలహీనతలను శాస్త్రీయకోణంలో విశ్లేషించుకోవలసిన అవసరం మునపటి కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. పీడిత వర్గాలను సంఘటిత పరిచి సరైన దిశకి మళ్లించే ప్రగతి కాముక  సాహిత్యం  అందుకే ఇప్పుడు మరింత ముమ్మరంగా  విస్తరించాల్సుంది. మతంలోని గమ్మత్తు మత్తునుంచి సామాన్యుణ్ని బైటకుతెచ్చే సామాజిక బాధ్యత మేధావుల మీదే ఎక్కువగా ఉంది. మతోన్మాదం పెచ్చుమీరుతున్న ఈ దుర్మార్గ తరుణంలో మౌనం పాటించడమంటే మేధావులు తెలిసి  జాతికి చేస్తున్న ద్రోహం కిందే లెక్క.
*** 
-కర్లపాలెం హనుమంతరావు
(మతోన్మాదం .. చారిత్రక నేపథ్యఁం -హరిపురుషోత్తమరావు – విభిన్న. పుట. 33- ప్రేరణతో)


Wednesday, May 9, 2018

మేరా భారత్ మహాన్!-సరదా వ్యాసం





'ఏంవాఁయ్ వెంకటేశం? ఏవిఁటలా టీవీ కతుక్కొని కూర్చున్నావ్? పెరేడ్ చూస్తున్నావా? ప్రెసిడెంటుగారి స్పీచి వింటున్నావా? మేడంగారే రకం చీర కట్టుకున్నారో చూసి మీ అక్కక్కొనిద్దావనే? దిస్.. ఐ థింక్.. ఎండాఫ్ ఆల్ ఇండియన్ వాల్యూస్. అనగా మన భారతీయ విలువల అంతిమ దినమన్న మాట. అంతిమ దినం కాదు.. గణతంత్ర దినమంటావ్! సరే.. అలాగే కానీయ్..!
'గంట నుంచీ ఆ టీవీ చూస్తున్నావు గదా? ఏదీ గణతంత్ర దివస్ అంటే ఏందో వివరంగా చెప్పూ.. చూతాం! సావరిన్ సోషలిష్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్కా? ఆ ముక్క .. తెలుగువాడివి.. తెలుగులో ఏడవ్వచ్చుగా?.. తెలీదా?  నోట్ బుక్ తీసుకో!.. రాసుకో! .. కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రజాతంత్ర స్వతంత్ర రాజ్యం. ఇదీ తెలుక్కాదా? తెలివిమీరిపోయావోయ్.. మై బోయ్!'
'సర్సెరే! వదిలేయ్! మన కంట్రీ స్పెషాలిటీస్.. అనగా. ప్రత్యేకతలు.. అవేంటో.. అవన్నా తెలుసా? జనాభాలో చైనా కాక మన తర్వాతే ఇంకెవరైనా. ఫరెగ్జాంపుల్.. మీ ఇంట్లోనే చూసుకో! మీ నాయనా, అమ్మా, బుచ్చెమ్మా, నువ్వూ, నీ చెల్లెలూ, నీ మామ మైరావణుడు, ఆయన శిష్యుడూ.. ఉపరి ఇప్పుడు నేనూ! ఒక మెట్రో బోగీకి సరిపడా జనం నిండామా! అందుకే థర్డు వరల్డులో మనదే థడాకా అని శ్రీమాన్ డొనాల్డ్ ట్రంప్ గారూ కూడా ఎప్పుడో ఒప్పేసుకున్నారోయ్ బాబ్జీ! మరో తమాషా చూసావూ! ముఫ్ఫై ఒక్క స్టేట్సూ.. ముప్పై ఒకటేనా.. ఏవోఁ.. లెక్క జూసుకో..  ఆరువేల కులాలూ.. మరో నాలుగొందలు పైచిలుకు ఉపకులాలూ.. అందులో సహం మతాలూ.. మూడు కోతులూ.. ముక్కోటి దేవతలూ.. పదహారొందల భాషలూ.. ముఫ్ఫై మూడు పండుగలూ.. మూడో నాలుగో ఫ్రంట్లూ.. తొమ్మిదొందల ఆరు పార్టీలు, .. పార్టీకో రెండో మూడో ఎజెండాలు.. ఇంకో రహస్య అజెండా.. ఆఖరికి ఒక్కో ఓటుక్కూడా మినిమమ్ రెండేసి రాష్ట్రాలూ.. ఒక్కదాంట్లోనైనా ఏకత్వం లేకపోవడమేనోయ్ మన భినత్త్వంలోని విచిత్రం!'
'మన దేవుళ్లకూ మనకులానే మోర్ దేన్ టూ వైవ్స్ ఉండాలాయె! అటు కాశ్మీర్ టు ఇటు కన్యాకుమారి వరకు ఒక్క విషయంలో మాత్రం మనవాళ్లంతా ఒక్క పట్టు మీద ఘట్టిగా నిలబడుతున్నారోయ్! అదేంటంటావూ? ఆఖర్న చెబుతాగానీ ఇప్పటికైతే మీ మామ పంచాగప్పొదిలో దాచిన పొగాకు పాయొకటి పట్రా.. పో! పొయెట్రీ తన్నుకొచ్చేట్లుంది!'
'…'
'నౌ ..బ్యాక్ టు ది పాయింట్!మన ప్రత్యేకతల గురించి మరో ముక్క చెప్పేదా! గుండు సున్నా కనిపెట్టింది మనవేఁనోయ్ సన్నాసీ! ఆ సంగతి సమస్తానికి తెలియాలనే కదా జాతీయ జెండా మధ్య బండి చక్రంలా పెట్టి  రెపరెపలాండించేస్తున్నాం! చక్రం తిప్పడంలోని చాణక్యమంతా శ్రీకృష్ణుణ్నుంచీ వడలాగేసుకుంటున్నారోయ్ మన లీడర్లూ! మన రాజ్యాంగంలోని మరో చిత్రం చెప్పనా? ఇంత పెద్ద ఇండియాలో ఇంకే లేనట్లు కాన్స్టిట్యూషన్ మొత్తం రెండొందలిరవైఅయిదు పేజీలూ చైనా ఇంకుతో రాయించేసారు మన సార్లు! ఏ ఇండియనింకో యూజ్ చేయచ్చుగదా? ఊహూఁ! మనోళ్ళకి మొదట్నుంచీ పరాయి సరుకు మీదే పరమ్మోజు. లేకపోతే నైరుతీ వైపు ఆ సముద్రానికి అరేబియా పేరు పెట్టటమేంటోయ్! ఆగ్నేయంలో ఈ వైపు నీళ్లకు బెంగాలు వాళ్లు 'బే ఆఫ్ బెంగాల్' పేరు పెట్టేసారు కదా! రేప్పొద్దున బెంగాలోళ్లు.. బంగ్లాదేశంగాళ్లూ.. ఆ నీళ్ల కోసం కొట్టుకు చస్తారని బెంగేస్తోందోయ్.. బోయ్! ధరలూ, జలయజ్ఞాలూ, అణుబాంబులూ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలూ, అర్థికమాంద్యం, కల్తీలు, కరువులూ, నీళ్ల కోసం కొట్లాటలూ, అవినీతి, అసహ్యంగా పోట్లాటలూ, ఉద్యోగాలూడ్డాలూ, ఉపాధులు దొరక్క చచ్చిపోడాలూ, చట్టుబండ చదువులూ, కేజీ టూ పీజీ లాన్గ్వేజీ పేచీలు, ప్యాకేజీలూ,  ప్రత్యేక రాష్ట్రాలు, హోదాలు, రిజర్వేషాలూ, ఇప్పుడు  కొత్తగా చట్టం.. న్యాయం మధ్య కొట్లాటలూ, పక్క మతం మీద పక్కా వ్యూహంతో  దాడులూ, అసహనం, ఆక్రోశం.. ఇన్ని బిలియన్సాఫ్ బర్నింగ్ ప్రాబ్లమ్సుంటే.. మళ్లీ కొత్త తల్నెప్పులు నెత్తికి తెచ్చుకోడం తెలివున్నవాళ్లు చేసే పనేనా? అబ్బే! ఈ చుట్ట అంటుకోడంలేదు. ఇదే ఇప్పుడు పెద్ద బర్నింగ్ ప్రాబ్లమయిందోయ్.. బోయ్!'
'అవునూ.. మద్యాహ్న భోజనం సంగతేం చేసావ్.. మై డియర్ వెంకీ? అహఁహఁ! ఆ సర్కారు స్కీము భోజనాలు కాదోయ్.. వెధవాయ్! నేనంటున్నది మన కడుపాత్రం సాపాటు ఏర్పాట్లు సంగతి మేన్! పొలిటికల్ ఫ్లోలో నువ్వలా ఫీలవడం బిట్ నేచురలే గానీ.. ప్రెసిడెంట్ స్పీచుకీ నువిట్లాగే పాలిటిక్స్ పెంటంటిస్తే.. చుట్ట తిరగేసి అంటిచాలని అధర్వణవేదం అయిదో అధ్యాయం పదో శ్లోకం తెగేసి చెపుతోంది.. తస్మాత్ జాగ్రత్త!'
'ఎలక్షన్ రోజులు కదా ఏ జండా చూసినా నీ పార్టీ ఫ్లాగే కనిపిస్తుందా? 'వందేమాతరం' అన్నా 'వందోట్లున్నయ్,, ఏ మాత్రం?' అని అడగాలనిపిస్తుందా? సహజం! జెండా పోలుకీ.. పోలింగ్ బూతుకీ సౌండులో తప్ప  మరెందులోనూ పోలిక లేదన్న కామన్ సెన్స్ కోల్పోతే రాజకీయాల్లో ఇంకెలా రాణిస్తావో బోధపడకుండా ఉంది. పాలిటిక్సంటే ఏంటను కున్నావోయ్? ఆర్ట్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీ థింగ్. అసలేవీఁ చేయకుండా అన్నీ చేసేస్తున్నంత బిజీగా ఉన్నట్లు బిల్డప్పిచ్చే కళ! అంటే మీ అగ్గిరాముడు దగ్గర ఇంగ్లీషు దంచడం లాంటిదన్న మాట! మీ అక్కయ్యకిచ్చే హామీలనుకో.. తప్పు లేదు! కోర్టు బోనుల్లో ప్రత్యక్షంగా  నిలబెట్టి తప్పట్టినా సరే.. 'అబ్బే! అదేం లేదు మిలార్డ్! గిట్టనోళ్లేవో కల్పించి చేసే ఆగం అదంతా! మా మెంబర్లంతా పులుకడిగిన ముత్యాల!'ని తేల్చేసేయ్యడవేఁ.. దటీజ్ పాలిటిక్స్ !'
'పండగ పూట ఈ కప్పల తక్కెడ తీయడ మెందుకు అంటావా మై బోయ్! సరే! అలాగే కానీయ్! మేరా భారత్  మహాన్! మన మహాన్ భారత్  కీ బోలో జై!,, జై జై!'
-కర్లపాలెం హనుమంతరావు
***
(26, జనవరి, 2009 నాటి ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం)

జీవన వేదం- వై ఎస్ ఆర్ దుర్మరణం సందర్భంలో ఈనాడు ఆదివారం సంపాదకీయం





కుండపోతగా వాన కురిసింది కొండాకోనల నల్లమలపైన. ఊహాతీతంగా పిడుగు పడింది మాత్రం యావత్రాష్ట్ర ప్రజ గుండెల మీద! రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. మరి లేరన్న దావానలంలాంటి దుర్వార్త ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచేసింది. ఏటా సంబరంగా సాగే గణేశ నిమజ్జనం సైతం బాధాతప్త హృదయాల కన్నీటి మడుగులోనే ముగిసిపోయింది. రచ్చబండ కార్యక్రమంకోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వై.ఎస్‌. హెలికాప్టర్ఆచూకీ గల్లంతు అయిందన్న తొలి సమాచారం తెలిసినప్పటినుంచి ఇరవై నాలుగ్గంటలపాటు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడిన జనవాహిని- కనిపించిన దేవుళ్లకల్లా మొక్కుతూ కోరుకొంది ఒక్కటే- ముఖ్యమంత్రి వై.ఎస్‌. క్షేమంగా తిరిగి రావాలనే! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర దేశీయాంగ, రక్షణ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా అత్యాధునిక విమానాలతో నల్లమలను జల్లెడ పడుతున్నంతసేపూ- పూర్వాశ్రమంలో నేషనల్క్యాడెట్కోర్‌(ఎన్‌.సి.సి.) సభ్యుడైన వై.ఎస్‌. అడవిని జయిస్తారనే మీడియా కూడా సాంత్వన వచనాలు పలికింది. కర్నూలుకు తూర్పున నలభై నాటికల్మైళ్ల దూరాన కొండ కొమ్ముపై హెలికాప్టర్జాడ తెలిసిందన్న సమాచారమూ దాన్ని వెన్నంటి వచ్చిన శరాఘాతంలాంటి కబురూ ప్రజానీకాన్ని హతాశుల్ని చేశాయి! ముఖ్యమంత్రి హెలికాప్టర్దారితప్పి 18 కిలోమీటర్లు తూర్పుదిశగా వెళ్లి కొండను ఢీ కొట్టిందని రాష్ట్ర డి.జి.పి. చెబుతున్నారు. 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టింది మొదలు వై.ఎస్‌. కాంగ్రెస్లో కొండల్లాంటి సీనియర్లు ఎందరినో ఢీ కొడుతూనే ముందుకుసాగారు. వరస పరాజయాలతో కుంగిన రాష్ట్ర కాంగ్రెస్కు తన ప్రజాపథ ప్రస్థానంతో కొత్త ఊపిరులూది వరస విజయాలు కట్టబెట్టిన వై.ఎస్‌.- తానే రాజకీయ మేరునగంగా ఎదిగారు. అననుకూల వాతావరణంలో రాజశిఖరం ప్రయాణిస్తున్న హెలికాప్టర్నల్లమల కొండ శిఖరాగ్రాన్ని తాకి ముక్కలై మహా విషాదాన్ని వర్షించింది. విధి మనిషిని విగతం చేస్తుందేమోగాని, చెమ్మగిల్లిన గుండెల సాక్షిగా వై.ఎస్‌. ప్రజల మనిషి!

'
నేను వృత్తిరీత్యా డాక్టరును... అయితే రోజుకు ఎంతమంది రోగులకు వైద్యం చెయ్యగలను? యాభై... వంద- అంతేకదా! అందుకే రాజకీయాల్లోకి రావాలనుకొన్నా'- అని ప్రకటించిన వై.ఎస్‌.కు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేదు. 'గరీబోళ్ల బిడ్డ'గా అధికార పీఠం అందుకొన్న అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి వై.ఎస్‌.కు చోటు దక్కింది. తరవాత ఇరవయ్యేళ్లు అధికార పదవులకు దూరంగా ఉన్నా- 2004లో కాంగ్రెస్విజయం దరిమిలా ముఖ్యమంత్రి పీఠం ఆయన్ను కోరి వరించింది. చదువుకొనే రోజుల్లోనే ఆదాయం పన్ను కట్టానని పలుమార్లు చాటుకొన్న వై.ఎస్‌. మృతికి పేదవాడి గుండె ఎందుకు చెరువవుతోంది? కారణం ముంజేతి కంకణం. 'ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే మార్పు తప్పనిసరి... అయితే అది మానవీయ కోణంలోనుంచి రావాలి' అని ప్రకటించిన వై.ఎస్‌.- సంక్షేమ పథకాల్ని పల్లెబాట పట్టించారు. ఖజానాకు భారమన్నా వినకుండా మొండిగా కిలో రెండు రూకల బియ్యం పథకాన్ని పట్టాలకు ఎక్కించారు. వందల కోట్ల బడ్జెట్టుతో నిరుపేదల్ని ఆరోగ్య 'శ్రీమంతుల్ని' చేశారు. బడుగు రైతాంగానికి ఉచిత విద్యుత్తు సరేసరి! ఇందిరమ్మ ఇళ్లు, బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాల పిల్లలకు వృత్తి విద్యా కోర్సు ఫీజుల పూర్తి చెల్లింపు వంటివి వై.ఎస్‌.ను పేదల పక్షపాతిగా మార్చేశాయి. ముఖ్యమంత్రి సహాయనిధినీ వందల కోట్లకు పెంచి అవసరార్థులకు దాన్ని కామధేనువుగా మార్చింది వైఎస్సే! రాజశేఖరరెడ్డి ఏలుబడి తీరుతెన్నులపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక- నిరుపేదల కళ్లకు ఆయన తమ ఆర్తి తీర్చే ఒయాసిస్సే! విధంగా ఎందరికో ఆత్మబంధువైన వై.ఎస్‌. లేని లోటు వేరెవరూ పూడ్చగలిగేది కాదు!

వై.ఎస్‌. అనగానే గుర్తుకొచ్చేవి- తెలుగు ఠీవి ఉట్టిపడే పంచెకట్టు, నగుమోము చేసే కనికట్టు! రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని చెప్పే వై.ఎస్‌. స్వీయ ప్రతిష్ఠను పణం పెట్టి అయినా నమ్ముకొన్నవాళ్లను ఆదుకొన్న మిత్రశ్రేష్ఠుడు! రాష్ట్ర బడ్జెట్ను లక్షకోట్లకు చేర్చడం, తెలుగుభాషకు ప్రాచీన హోదా రాబట్టడం వై.ఎస్‌. ఘనతలే. 'పాదయాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... విద్యుత్‌, బియ్యం, ఆరోగ్యశ్రీ పథకాలను శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తాం- ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు విశ్రమించం' అని నిరుడు జూన్‌ 15 వై.ఎస్‌. ప్రకటించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంద్వారా కోటి ఎకరాలకు సాగునీటి పరికల్పన సాధిస్తామంటూ ఆయన ఉద్ఘోషించని వేదికే లేదు. తొలి అయిదేళ్లలో లక్ష్యసిద్ధికోసం జలయజ్ఞానికి వై.ఎస్‌. వెచ్చించింది రూ.43వేల కోట్లు! ఫలానా పని చెయ్యాలనుకొన్నాక విమర్శల్ని, కష్టనష్టాల్ని బేఖాతరు చేస్తూ ముందుకు సాగడమే ఆయన నైజం. మరికొన్ని రోజుల్లో ప్రధాని చేతుల మీదుగా తలపెట్టిన భెల్‌- ఎన్‌.టి.పి.సి. ప్రాజెక్టు శంకుస్థాపన పాటికే పూర్తయి ఉంటే, మౌలిక రంగంలో భారీ కర్మాగారం రాష్ట్రానికి రావాలన్న తన స్వప్నం ఫలించిందన్న సంతృప్తి వై.ఎస్‌.కు మిగిలుండేదన్నది నిజం! తాను చేపట్టిన పథకాలే కాంగ్రెస్కు గెలుపు గుర్రాలవుతాయని విశ్వసించిన వై.ఎస్‌.- వాటిలో లోటుపాట్ల పరిశీలనకు బయలుదేరడమే, అననుకూల వాతావరణం రూపేణా ప్రాణాంతకమయ్యింది. బియ్యం, రేషన్కార్డులు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల అమలు తీరుపై ప్రజలతో నేరుగా చర్చించదలచిన నాయకుడు మరలిరాని లోకాలకు తరలిపోవడంతో పల్లె కన్నీరొలుకుతోంది. జన ప్రియనేతకు రాష్ట్రం నివాళి ఘటిస్తోంది'వై.ఎస్‌. అమర్రహేఅని!
(
ఈనాడు,. 04 - 09 -2009



ఇదే సందర్భానికి తగిన విధంగా 06, సెప్టెంబర్, 2009.. ఆదివారం ఈనాడు రాసిన సంపాదకీయం 
"జీవన వేదం" 


మనం ఎంతగానో ప్రేమించేవారు మనకు దూరమైతే ఆ ఎడబాటుకు మందేమిటో తెలుసా? మనం ప్రేమించేవారు ప్రేమించిన వాటిని అన్నింటినీ మనమూ ప్రేమించడం.  ఆస్కార్ వైల్డ్ చెప్పిన చిటుకు అది, మహాభారతంలో యక్షుడు 'ప్రపంచంలో కెల్లా అత్యంత అబ్బురం కలిగించే విశేషం ఏమిటి?' అని అడిగినప్పుడు 'రేపు కనుమరుగయే వ్యక్తి ఈ రోజు కాలం చెల్లిన ఆప్తుడిని గురించి కన్నీళ్లు పెట్టుకోవడం' అని జవాబు ఇస్తాడు ధర్మరాజు. ఆ మాటే నిజం. 'అసలు జీవితమంటేనే ఒక నాటక రంగం. మనమందరం ఆ వేదిక మీద ఆడే జగన్నాటకంలో  వచ్చే పోయే పాత్రధారులం' అంటాడు ఆంగ్ల నాటక కర్త విలియం షేక్స్పియర్. ఆ సత్యం మనమూ వంటబట్టించుకుంటే 'పుట్టడం.. గిట్టడం ప్రకృతి చేసే ప్రకటనలు' అని ఇట్టే ఆర్థమవుతుంది. 'జీవనం ఒక వేదం. ఆ వేదసారం గ్రహింపుకొస్తే ఆవేదనకు ఆస్కారముండదు' అంటాడు హిరణ్యాక్షుడు సోదరుడి మరణానికి దురపిల్లే బంధుగణాన్ని ఓదార్చే సందర్భంలో మహాభాగవతంలో. విశ్వవిజేతగా చక్రం తిప్పాలని దురాశ పడ్డ అలెగ్జాండర్ చలిజ్వరంతో చనిపోయే ఆఖరి క్షణంలో 'హతీతో క్రతిస్తో' అంటో ఖాళీ చేతులు చూపించి వెళ్ళిపోయాడు! ఎలా పోయారన్నది కాదు లెక్క.. ఎలా బతికి పోయారన్నది ముఖ్యం. లోకం కోసం విషం తాగిన శివుడికి ఉన్న విలువ తన కోసం అమృతం తాగిన దేవేంద్రుడుకుందా? మిన్నాగులాగా కలకాలం బతికే కన్నా మిణుగురులా వెలుగులు విరజిమ్ముతూ క్షణకాలం జీవించినా మిన్నే! అసలు మృత్యు పిశాచి ఒక్క దుఃఖాన్ని తప్ప మరేదీ ఆత్మబందువులకు దక్కనివ్వదా? రెండో ప్రపంచయుద్ధ సందర్భం. ఓ జర్మను చెరసాలలో ఖైదీలు వందల కొందలు  ఒకే అరలో బందీలుగా పడివున్నారు. తొక్కిసలాటలు తగ్గించేందుకు కారాగారాధికారుల కో పథకం తట్టిందిప్రతీ బందీ చేతికి ఒక అంకె ఇవ్వడం..  రోజూ కొన్ని అంకెలను చీటీలు తీసి  ఎన్నిక చేయడం.. ఆయా అంకెగల చీటీ  చేతనున్న అభాగ్యుడిని  పైకి పంపించెయ్యడం.. అదీ 'ఆపరేషన్ క్లీన్'. ఎన్నికైన అంకెచీటి చేత పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడో ఖైదీ.  తోటి ఖైదీ 'ఇంకా ఇక్కడ నీకు బందీగానే బతకాలనుందా? మిత్రమా! నీ చీటీ నా చేతికివ్వు!' అంటూ తానే  ఆ చీటీతో సంబరంగా ముందుకెళ్లి తుపాకీ గుండుకు బలి అయ్యాడు. ఆ ప్రాణత్యాగి ఆనందం అరువు ఊపిరితో బతికే ఖైదీ కేదీ?!
'మృత్యువు నా వాకిట్లో నిలబడితే వట్టి చేతులతో పంపను' అంటాడు రవీంద్ర కవీంద్రుడు 'గీతాంజలి'లో. 'జాతస్య మరణం ధృవమ్' అంటుంది గీత. కాలప్రవాహానికి ఎదురీదడం ఎవరి తరమూ కాదు'. పురాణేతిహాసాలు మృత్యువుని 'కాలధర్మం'గా వర్ణించడంలోని మర్మం మనిషి గ్రహించాలి. భూమ్మీద కలకాలం నిలిచిపోవాలన్న కాంక్ష ఎవరికుండదు! నిజంగా చిరంజీవిగా జీవించాలంటే 'తానే తుమ్మి తానే చిరంజీవ' అనుకుంటే చాలదు. చిరకాలం జనహృదయంలో సజీవంగా నిలిచిపోయే సత్కారాలేవైనా చేస్తుండాలి. మొక్కుబడిగా 'కీర్తిశేషులు' అనిపించుకోవడం కాదు.. మొక్కి.. మరీ 'కీర్తి'ని గుర్తు చేసుకొనే మంచి కర్మలు  సంకల్పించాలి. మనసుకు దగ్గరైన మనిషి దూరమైనప్పుడు ఒక పట్టాన ఒప్పుకోని పిచ్చిభ్రమలు మానవజాతి పుట్టుక నుంచే మొదలయినాయి.  వేళ్లు కోసినప్పుడు రుధిరం గడ్డకట్టినట్లు గట్టిగా రువువైతే తప్ప  రోమన్లు  ఆత్మబందువులు  మృతులైనట్లు ఒప్పుకొనేవారు కాదు. చనిపోయిన తమవారు తిరిగి వాస్తారన్న ఆశతో మూడు రోజుల వరకు పార్థివ దేహాన్ని పాడె మీదకు చేర్చనివ్వరు గ్రీకులు. 'ఎడ్గార్ ఎలెన్ పో' తన 'మెక్బరి' నవల్లో శవపేటిక లోపల మీటలుండే విధానాన్ని సూచించారు. ఖననమైన తరువాత ఒకవేళ తిరిగి ప్రాణమొస్తే మీట నొక్కి తమవాళ్ళకు  శుభవార్త చెప్పేందుకన్న మాట ఆ ఏర్పాటు! హిందూధర్మంలోని 'దింపుడు కళ్లెం' ఆచారం వెనకున్న మర్మం ఈ పునర్జీవితం మీద ఉన్నప్రగాఢ విశ్వాసమే!
శాస్త్రవిజ్ఞానం ఇంతగా అభివృధ్ధి చెందిన కాలంలో కూడా  ఇలాంటి నమ్మకాలను గూర్చి వింటుంటే నవ్వురావచ్చేమో గానీ.. నిజానికి గుండెచప్పుడు ఆగిపోయిన కొన్ని క్షణాల వరకు యంత్రంలో ఇసిజి నమోదు చెయ్యవచ్చని ఇప్పుడు వైద్యశాస్త్రం సైతం ఒప్పుకుంటున్న సత్యం. 'పైలోకార్పైన్' అన్న మందు కంటిలో వేస్తే వ్యక్తి చనిపోయిన మూడు గంటల వరకు కంటిపాపకు సంకోచిస్తుంది. అసలు మరణమనేది హఠాత్తుగా జరిగే విషాదం కాదు.  అదో క్రమంలో శరీరంలో జరిగే జీవపరిణామం అంటుంది మరణశాస్త్రం(థాంటాలజీ).కంటికి కనిపించని ఆత్మ శరీరాన్ని విసర్జించడంగా మతాలన్నీ మరణాన్ని నిర్వచించుకుంటున్నాయి. విజ్ఞానశాస్త్రం మాత్రం విశ్లేషించేందుకు వీలైన ప్రయోగాలు విజయవంతమయే వరకు మరణం మనిషికి మనసుకు సంబంధించిన ఒక అత్యంత భావోద్వేగ పరిణామంగానే మరణాన్ని చూస్తోంది. తార్కిక శాస్త్రాలు  ఏ సూత్రాలైనా చేయనీయండి.. మనసుకు దగ్గరైన వ్యక్తి హఠాత్తుగా దూరమయ్యాడన్న విషయం ఆప్తులలో  అంతులేని విషాదాన్ని నింపితీరుతుందిఅందులోనూ పెద్దమనిషి.. పెద్ద మనసున్న మనిషి! మరణమంటే మాములు జనాలకు పత్రికల్లో నల్లరంగు అద్దుకుని వచ్చే పతాక శీర్షికో.. టీవీ ప్రసారాలలో ఆపకుండా చూపించుకుంటూ పోయే 'రియాల్టీ' ప్రదర్శనో కాదు. ఆట ముగిస్తే రాజైనా బంటైనా ఒకే పాచికల పెట్టెలోకి సర్ధుకుంటారన్న మాట నిజమే కావచ్చేమో! కానీ జనం తరుఫున ఆడే ఆట రాజకీయం. అది ముగించకుండానే  మధ్యలో హఠాత్తుగా వదిలేసి చిరునవ్వులు చిందించుకుంటూ ఎవరు వెళ్లిపోయినా ప్రజావళి దృష్టిలో అది 'తొండే'!  ఆగిపోయిన  ఆటను  గుండె దిటవుతో   ముందుకు కొనసాగించి విజయం సాధించడమే  ఆ 'రాజు' కు ఆయన నమ్మిన 'బంట్లు'  సమర్పించుకొనే నిజమైన నివాళి.
***

(ఈనాడు- ఆదివారం సంపాదకీయం – 6, సెప్టెంబర్, 2009)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...